మారుతున్న ప్రపంచం-2
ఎం కోటేశ్వరరావు
అట్లాంటిక్ అనే ఒక పత్రికలో పీటర్ బెయినార్ట్ అనే రచయిత అమెరికా ఎందుకు వామపక్షం దిశగా ప్రయణిస్తోంది అనే పేరుతో ఒక విశ్లేషణ చేశారు. 1960,70 దశకాలలో వామపక్ష భావజాలపై జనంలో ఆగ్రహం కనిపించేది, ఇప్పుడు నూతన అభ్యుదయ వుద్యమాన్ని దేశం అక్కున చేర్చుకుంటోందని బెయినార్ట్ పేర్కొన్న అంశాన్ని ప్రస్తావించాను. ఆ వి శ్లేషణలో 1960,70 దశకాలలో మిలిటెంట్ పోరాటాలతో పోల్చితే నల్లజాతీయుల వుద్యమాల వెల్లడైన ప్రతిస్పందన ప్రభావం, ఆర్ధికాంశాల చర్చలో అసమానతల పరిస్ధితి ప్రధానంగా ముందుకు రావటం, ఎల్బిజిటిల హక్కుల గురించి ప్రధాన అంశంగా వుండటాన్ని ఆయన పేర్కొన్నారు. పార్లమెంట్లోని సెనేట్లో 2001లో నాటి అధ్యక్షుడు ప్రతిపాదించిన పన్నుల కోతకు 12 మంది, ఇరాక్పై యుద్ధానికి అనుమతించే నిర్ణయంపై 29 మంది డెమోక్రటిక్ పార్టీ సభ్యులు మద్దతు ఇచ్చారని ఈ దౌర్బాగ్యకరమైన ఓటింగ్కు పార్టీలో వెల్లడైన వ్యతిరేకత డెమోక్రటిక్ పార్టీలోని మధ్యేవాద విభాగాన్ని నాశనం చేసిన పర్యవసానం స్పష్టంగా వుంది. డెమోక్రటిక్ పార్టీలోని ప్రజాస్వామిక విభాగ తిరుగుబాటును హోవార్డ్ డీన్ ప్రారంభించారని, బ్లాగర్ (ఇంటర్నెట్లో అభిప్రాయాలను వెల్లడించటం) వుద్యమం పెరగటం, డెయిలీ కోస్ డెమోక్రటిక్ పార్టీ వాణిగా ఎదగటం, అఫింగ్టన్ పోస్ట్ కూడా అదే బాటలో నడవటం, ఎంఎస్ఎన్బిసి కొద్ది మంది వుదారవాదులను నియమించటం, జార్జి డబ్ల్యు బుష్ కన్సర్టేవ్లను బుద్దిలేని వారిగా కనిపించేట్లు చేశారని, తరువాత ఒబామా వాల్స్ట్రీట్వైపు మొగ్గటం అది చివరకు వాల్స్ట్రీట్ ఆక్రమణ వుద్యమానికి దారితీసి అమెరికా రాజకీయ చర్చలోకి ఆర్ధిక అసమానతను చొప్పించిందని బెయినార్ట్ పేర్కొన్నారు.
‘అమెరికన్ ప్రజాప్రతినిధుల సభలో ఒబామా రిపబ్లికన్ల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొన్నారు, ఆర్ధిక సంక్షోభాన్ని వుపయోగించుకొని వాల్స్ట్రీట్ శక్తిని నాటకీయంగా తగ్గించి వుండగలిగేవారా లేదా అన్నది అస్పష్టం, ఆయన ఆ పని చేయలేదు అన్నది సుస్ఫష్టం…….వాల్స్ట్రీట్ ఆక్రమణ వుద్యమంలో పాల్గొనవారిలో 40శాతం మంది 2008 ఆధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ఒబామా కోసం పనిచేసిన వారే. వారిలో అనేక మంది అలాచేస్తారని ఆశించారు. ఒక అధ్యక్షుడిగా మౌలిక మార్పులను ఆయన చేయవచ్చు.ఇప్పుడు వారిలో ఆ ఆశ కుప్పకూలిపోవటంతో వాల్స్ట్రీట్ను నేరుగా సవాలు చేసే విధంగా వారిని పురికొల్పింది.’ అని పేర్కొన్నారు.
అఫింగ్టన్ పోస్ట్ పత్రికలో బ్లేక్ ఫ్లీట్వుడ్ అనే వ్యాఖ్యాత ‘డెమోక్రటిక్ పార్టీ చర్చలో ముందుకు వచ్చిన వాల్స్ట్రీట్ ఆక్రమణ మీమాంస’ అనే వ్యాసంలో ‘వాల్స్ట్రీట్ ఆక్రమణ వుద్యమం ఎలిజబెత్ వారెన్ ఎన్నికకు దారితీసింది, ఆమె వాణి శాండర్స్ అభ్యర్ధిత్వాన్ని ముందుకు తెచ్చింది, హిల్లరీ క్లింటన్ను శాండర్స్ పక్కకు నెట్టారు. వీటన్నిటి కారణంగా డెమోక్రటిక్ పార్టీ తొలి చర్చలో శాండర్స్ మాదిరిగా పెట్టుబడిదారీ విధానాన్ని పూర్తిగా వదలించుకోవాలని గాకుండా తాను పెట్టుబడిదారీ విధానపు అతికి కళ్లెం వేసేందుకు మొగ్గుచూపుతానని హిల్లరీ చెప్పాల్సివచ్చింది’ అని పేర్కొన్నారు. ‘ ఈనాడు రంగంలో వున్న ముగ్గురు డెమోక్రటిక్ పార్టీ అభ్యర్ధులు కూడా ఒకే పాట పాడుతున్నారు. అదేమంటే వాల్స్ట్రీట్ ఆక్రమణ వుద్యమంలో ముందుకు వచ్చిన ప్రధాన అంశాలైన ఆర్ధిక అసమానత, గత మూడు దశాబ్దాలుగా మధ్యతరగతి దిగజారిపోవటం, ఎన్నికల ప్రచార నిధుల చట్టాల అవినీతి అనే అమెరికా తరహా జీవన విధానానికి ముప్పుగా పరిణమించి మూడు అంశాలు. రిగ్గింగ్కు గురైన రాజకీయ వ్యవస్ధ, మరింత బలిసిన ధనికులు, వాల్స్ట్రీట్పై పన్ను విధింపు అనే కీలకమైన వాల్స్ట్రీట్ ఆక్రమణ వుద్యమ ముఖ్యమైన నినాదాలనే హిల్లరీ క్లింటన్, బెర్నీ శాండర్స్, మార్టిన్ ఓ మల్లీ పదే పదే తాజా చర్చలో పునరుద్ఘాటించారు. నిజానికి ధనికులపై పన్ను వేయాలనే ఆలోచనలు, తరగిపోతున్న మధ్యతరగతి సంపదలు అన్నవి చివరకు రిపబ్లికన్ పార్టీలో కూడా అధ్యక్ష రాజకీయ చర్చను ప్రభావితం చేస్తున్నాయి.అయితే కార్పొరేట్, బిలియనీర్ల డబ్బు రాష్ట్రాలలో రిపబ్లికన్లను అధికారంలోకి తెస్తున్నది. ఒక పురోగామి దేశంలో సామాన్య ప్రజల అభిప్రాయాలను చేరనివ్వకుండా నల్లధనం, ఓట్ల రిగ్గింగ్ ద్వారా గెలిచిన పార్లమెంట్ వుంది,జనం వామపక్షం వైపు మొగ్గుచూపుతుండవచ్చు గానీ డబ్బు కాదు, కాబట్టి కేంద్ర విధానాలు ఎటూ కదలటం లేదు, 2016 ఎన్నికలలో తగినంత మంది జనం ఓట్లేయటానికి వస్తే మనం వాటిని కూడా మార్చవచ్చు అని బెయినార్ట్ పేర్కొన్నారు.