ఎంకెఆర్
ఎత్తిన జెండా దించమోయ్ అరుణ పతాకకు జై ! అంటున్నారు, గత నాలుగు దశాబ్దాలుగా పోర్చుగల్లోని అవిస్ మున్సిపాలిటీ ఓటర్లు. పోర్చుగీసు నియంతకు వ్యతిరేకంగా సాగించిన పోరాటం విజయవంతమైన తరువాత 1974 నుంచి కమ్యూనిస్టు పార్టీపై నిషేధం ఎత్తివేశారు.అప్పటి నుంచి అవిస్ మున్సిపాలిటీ అధికారాన్ని అక్కడి ఓటర్లు కమ్యూనిస్టులకు, వారితో కలసి వున్న వామపక్ష శక్తులకు అప్పగిస్తున్నారు. మూడు దశాబ్దాలపాటు కమ్యూనిస్టుపార్టీలో పనిచేసిన స్ధానిక కార్యకర్త గ్జేవియర్ లియోనర్లో వుత్సాహం చెక్కు చెదరలేదు. ప్రపంచ కమ్యూనిస్టు వుద్యమానికి ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా జనంతో వుండి మార్క్సిజం-లెనినిజానికి కట్టుబడి వున్న అతి కొద్ది పార్టీలలో పోర్చుగీసు కమ్యూనిస్టుపార్టీ ఒకటి.తన ఇంటి అరుణ పతాకాలు, లెనిన్ చిత్రాలతో అలంకరించిన ఆమె ‘పార్టీ భవిష్యత్ గురించి నేనెంతో ఆశాభావంతో వున్నా, కార్మికులు ఐక్యమైతే ఈ దేశంతో సహా ఇతర దేశాలలో ధనికవర్గాన్ని నిలువరించగలం, మాలాంటి వారందరూ అరవైకి పైబడ్డాం, ఈ కర్తవ్యాన్ని యువతరానికి అందించాలి అందించాలి’ అన్నారు.ప్రస్తుతం కమ్యూనిస్టు పార్టీ, వామపక్ష శక్తులతో కూడిన మరొక సంఘటన సోషలిస్టుపార్టీతో కలసి సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగా వున్నాయి. పాత పద్దతులను కమ్యూనిస్టు పార్టీలు మార్చుకోవటం లేదంటూ కొంత మంది కమ్యూనిస్టు పార్టీ నుంచి చీలి వామపక్ష సంఘటన పేరుతో ఎన్నికలలో పోటీ చేస్తున్నారు. పోర్చుగీసు కమ్యూనిస్టు పార్టీ మాత్రం ఎర్రజెండాను వదిలి పెట్టలేదు. ఎలియనార్ వంటి వారెందరో ఆ జెండాను మోస్తూనే ఎంతో విశ్వాసంతో కొనసాగుతున్నారు. తమ పార్టీ అన్ని వేళలా జనంతో నిలబడి వుందని ఆమె అన్నారు. గ్రీసులో సిరిజా, స్పెయిన్లో పోడెమాస్ మాదిరి పోర్చుగీసు వామపక్ష శక్తులు కొన్ని మ్యూనిస్టులతో విబేధించి వామపక్ష సంఘటనగా ఏర్పడ్డారు. వారికి కమ్యూనిస్టుల కంటే ఎక్కువ ఓట్లు వచ్చినప్పటికీ అధికారంలోకి రాలేదు.
పోర్చుగల్లో గతేడాది నవంబరులో జరిగిన ఎన్నికలలో మితవాద శక్తులు అతి పెద్ద పక్షంగా అవతరించారు. సోషలిస్టు పార్టీతో కొన్ని విబేధాలు వున్నప్పటికీ కమ్యూనిస్టులు, వామపక్ష పకక్షూటమి సోషలిస్టు పార్టీతో ఒక వుమ్మడి కార్యక్రమం ప్రాతిపదికగా సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి జనాభిప్రాయానికి అనుగుణంగా మితవాద శక్తులను దూరంగా వుంచారు. ఆ మేరకు కొత్త ప్రభుత్వం సామాన్యజానికి వుపశమనం కలిగించే పెన్షన్ కోతలు, ప్రయివేటీకరణల నిలిపివేత, ఇతర ప్రజావ్యతిరేక ఆర్ధిక చర్యలను అడ్డుకోవటం వంటి చర్యలు తీసుకున్నది. సామాజిక రంగంలో అబార్షన్ చట్టాలను సరళీకరించటం, బిడ్డల దత్తత హక్కుల సరళీకరణ వంటి చర్యలు తీసుకుంది. దీంతో ఐరోపా యూనియన్ కన్నెర్ర చేస్తూ యూనియన్ నిబంధనలకు వ్యతిరేకంగా ప్రభుత్వ చర్యలు వున్నాయని, ఇలాగే కొనసాగితే 2016 బడ్జెట్ను ఆమోదించేది లేదని బెదిరింపులకు దిగింది. ఆర్ధిక రేటింగ్ను తగ్గిస్తామని రేటింగ్ సంస్ధల ద్వారా వత్తిడి తెస్తున్నది. వాటికి లొంగరాదని కమ్యూనిస్టు పార్టీ స్పష్టం చేసింది. ప్రభుత్వ చర్యలకు మద్దతుగా ఒక ప్రదర్శన నిర్వహించి పొదుపు పేరుతో ప్రజావ్యతిరేకచర్యలకు ఐరోపా యూనియన్ పాల్పడుతోందని ద్రవ్య,బడా పెట్టుబడిదారుల ప్రయోజనాలకు పెద్ద పీట వేస్తోందని ప్రభుత్వం వెనక్కు తగ్గరాదని హెచ్చరించింది.
జనానికి మేము అవసరమైన మాటలు చెబుతాం తప్ప ఆకర్షణీయ నినాదాలు ఇవ్వం, గత ప్రభుత్వం ప్రజల ఆరోగ్య, విద్యా హక్కులను హరించివేసింది, కమ్యూనిస్టు పార్టీ మంచి రోజుల్లోనూ చెడురోజుల్లోనే ఎల్ల వేళలా జనంతో నిలబడింది అని ఎలియనోరా వ్యాఖ్యానించారు.ఆమె నియంతల పాలనా కాలంలో వ్యవసాయ కార్మికురాలిగా పనిచేస్తూ కమ్యూనిస్టులు సాగించిన కృషిని, పోలీసుల దురాగతాలకు గురై జైలు జీవితాలను అనుభవించటాన్ని ఆమె ప్రత్యక్షంగా చూశారు. ఆ తరువాత కమ్యూనిస్టు పార్టీ నిర్వహించిన సహకార వ్యవసాయ క్షేత్ర నిర్వహణలో భాగస్వామి అయ్యారు. 1980 దశకంలో కమ్యూనిస్టుపార్టీకి 20శాతం వరకు వున్న ఓటింగ్ తరువాత అనేక కారణాలతో తగ్గిపోయింది. సోవియట్ యూనియన్ పతనం కావటం, దాంతో పార్టీ భవిష్యత్ను ప్రశ్నిస్తూ అనేక మంది పార్టీకి దూరం కావటం, పార్టీలో సంస్కరణల పేరుతో మితవాదానికి గురికావటం వంటి పరిణామాలు జరిగాయి.
గతేడాది అక్టోబరులో జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో కమ్యూనిస్టు పార్టీకి 8.3శాతం ఓట్లు వచ్చాయి. అయితే కమ్యూనిస్టు పార్టీ వెలుపల వున్న వామపక్ష శక్తులతో 1999లో ప్రారంభమైన వామపక్ష కూటమి 10.2శాతం ఓట్లు తెచ్చుకుంది. ఈ రెండింటి మధ్యకొన్ని అభిప్రాయ విబేధాలు వున్నాయి. వుదాహరణకు వుత్తర కొరియా సోషలిస్టు ప్రభుత్వాన్ని నియంతగా వర్ణించేందుకు కమ్యూనిస్టుపార్టీ తిరస్కరించగా వామపక్ష కూటమి నియంత అని పేర్కొన్నది. పోర్చుగీసు మీడియా కమ్యూనిస్టు పార్టీ పట్ల పక్షపాతంతో వ్యవహరించి మార్పులేని పాత పార్టీగా యువతరాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం కూడా చేస్తోంది.అయితే కమ్యూనిస్టు పార్టీ శతృవులు కూడా దాని నిజాయితీని తప్పు పట్టలేరు. అవిస్ వంటి స్ధానిక సంస్ధలలో అధికారం వున్న చోట ఎలాంటి అక్రమాలకు తావివ్వని కారణంగానే అనేక చోట్ల కమ్యూనిస్టులను జనం ఆదరిస్తున్నారు.