Compulsory License for Medicines: Government Protecting the Interest of India or the US? | NewsClick
31 Thursday Mar 2016
Posted Uncategorized
in31 Thursday Mar 2016
Posted Uncategorized
in30 Wednesday Mar 2016
Posted BJP, Current Affairs, Economics, Farmers, INDIA, NATIONAL NEWS, Prices
inTags
BJP, Farm prices, Farmers, MSP, Narendra Modi, Narendra Modi Failures, narendra modi namo mantra, Narendra Modi sarkar
యాభై శాతం లాభం చేకూర్చటం సాధ్యం కాదని సరసమైన ధరలు వచ్చేట్లు చూడటం తప్ప రైతుల ఆదాయాల పెంపుదలకు కనీస మద్దతు ధరల విధానం వుద్ధేశించలేదని, అలా చేస్తే మార్కెట్ను వక్రమార్గం పట్టించినట్లు అవుతుందని, యాంత్రికంగా యాభై శాతం పెంపుదల చేస్తే కొన్ని సందర్భాలలో తిరోగామి పర్యవసానాలు వుంటాయంటూ అమలు జరిపేది లేదని నరేంద్రమోడీ సర్కార్ చెప్పేసింది
ఎం కోటేశ్వరరావు
2022 నాటికి రైతుల ఆదాయాలను రెట్టింపు చేయటానికి ఏడు సూత్రాల పధకాన్ని రూపకల్పన చేసినట్లు ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించారు.గతంలో రైతుల ఆదాయాల గురించి కాకుండా వ్యవసాయ వుత్పత్తులు పెరగటానికి ప్రాధాన్యత ఇచ్చారు. నేను దీన్ని ఒక సవాలుగా తీసుకున్నాను, కేవలం సవాలే కాదు మంచి వ్యూహాన్ని కూడా రచించాను, పకడ్బందీగా రూపొందించిన కార్యక్రమాలు, తగినన్ని వనరులు, అమలులో సుపరిపాలన కారణంగా ఈ లక్ష్యాన్ని సాధించగలం అన్నారు. బ్లూమ్బెర్గ్ ఇండియా ఆర్ధిక
వేదిక కార్యక్రమంలో ప్రధాని ఈ విషయాలను చెప్పారు.ఆ ఏడు సూత్రాలు ఏవంటే
1. ఒక చుక్కనీటికి ఎంతో పంట లక్ష్యంగా సాగునీటి పధకాలకు భారీ బడ్జెట్
2. ఆహార ప్రక్రియ ద్వారా అదనపు విలువ చేకూర్చటం
3. 585 కేంద్రాలలో ఎలక్ట్రానిక్ ఫ్లాట్ ఫారాల ద్వారా ఒకే విధంగా వుండేట్లు చూడటం, జాతీయ వ్యవసాయ మార్కెట్ ఏర్పాటు
4. ప్రతి పొలం భూసారాన్ని బట్టి నాణ్యమైన విత్తనాలు, ఎరువులు
5. భారీ పెట్టుబడులతో గోదాములు, శీతల గిడ్డంగుల ఏర్పాటు ద్వారా పంట చేతికి వచ్చిన తరువాత నష్టాల తగ్గింపు
6.చెల్లించగలిగిన ధరలలో కొత్త పంటల బీమా పధకం
7. వ్యవసాయానికి అనుబంధంగా కోళ్లు, తేనెటీగలు, చేపల పెంపకాలకు ప్రోత్సాహం
ఈ చర్యల ద్వారా రైతుల ఆదాయాలు రెట్టింపు అవుతాయని ఎంతో విశ్వాసంతో వున్నట్లు ప్రధాని చెప్పారు. తన ప్రభుత్వ విధానాలు రైతుల కేంద్రంగా, నూతన ఆదాయ మార్గాలుగా వున్నాయని సుప్రసిద్ధ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాధన్ స్వయంగా తనకు లేఖ రాసినట్లు ప్రధాని చెప్పారు.
ప్రధాని త్వరలో అధికారానికి వచ్చిన రెండో వార్షికోత్సవం జరుపుకోబోతున్నారు. రెండు బడ్జెట్లు ప్రవేశపెట్టారు. నిజానికి ఒక చొక్కా విప్పి రెండో చొక్కా తగిలించుకున్నట్లుగా గుజరాత్ ముఖ్యమంత్రిగా వున్న మోడీ ఏకంగా ప్రధాని అయ్యారు. ఆందువలన ఆయనకు అనుభవం ప్రత్యేకంగా అవసరం వుందని ఆయనా అనుకోలేదు,జనం కూడా భావించలేదు. ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానాలలో రైతులకు వుత్పత్తి ఖర్చులపై కనీసం 50శాతం లాభం వుండేట్లు చూస్తామని బిజెపి తన ఎన్నికల వాగ్దానంలో పేర్కొన్నది. అది అమలులోకి రావాలంటే కనీస మద్దతు ధరల పెంపుదల, ఆ మేరకు అవసరమైతే ప్రభుత్వ సంస్థలను రంగంలోకి దింపటం. రైతాంగానికి ఆ మేరకు ధరలు పెంచటానికి పార్లమెంటుతో పని లేదు, ప్రతిపక్షాల మద్దతు అంతకంటే అవసరం లేదు. అయినా నరేంద్రమోడీ సర్కార్ ఆ దిశగా యాభైశాతం ఒక్కసారిగా పెంచకపోయినా ఐదు సంవత్సరాలలో యాభై శాతం పెరిగేట్లుగా ఏటా పదిశాతం చొప్పున ఎందుకు పెంచలేదు. అంటే ప్రధాని మన్కి బాత్ వుపన్యాసం వినమని చెప్పటం తప్ప ఎదురు చూస్తున్న కిసానోంకి బాత్ గురించి చివరికి దేశానికి దిగివచ్చిన దేవదూత నరేంద్రమోడీ అని స్త్రోత్ర పారాయణం చేసిన మన వెంకయ్యనాయుడు కూడా ఎక్కడా సమాధానం చెప్పినట్లు మనకు తెలియదు.
ప్రణాళికా సంఘం స్ధానంలో ఏర్పాటు చేసిన నీతి ఆయోగ్కు వ్యవసాయంపై సలహాదారుగా వున్న అశోక్ గులాటీ ‘దేశంలో వున్న పరిస్థితి తీవ్రతను ఎన్డిఏ ప్రభుత్వం పూర్తిగా గ్రహించినట్లు లేదు, కొన్ని రాష్ట్రాలలో 20శాతం వరకు ఆహార ధాన్యాల వుత్పత్తి పడిపోయింది. ప్రభుత్వం నిరంతరం రైతాంగాన్ని ఆదుకొనే వ్యవస్ధను ఏర్పాటు చేయనట్లయితే 1960 దశకంలో మాదిరి ఆహార కొరత ఏర్పడే అవకాశం వుంది’ అని కొద్ది నెలల క్రితం వ్యాఖ్యానించారు.ప్రభుత్వం సేకరించిన సమాచారం ప్రకారమే అనేక వ్యవసాయ వుత్పత్తులకు రైతులు తక్కువ ధరలను పొందారు. గతేడాది ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధరలు వ్యవసాయ ఖర్చుల మరియు ధరల కమిషన్(సిఏసిపి) ప్రకారం ఏ ఒక్క వుత్పత్తి ధర యాభైశాతం కాదు కదా ఆ సమీపంలో కూడా లేదు. అనేక రాష్ట్రాలలో ఆ ధరలు అమలు కాని స్ధితి కూడా వుంది. అసలు ఖర్చుల లెక్కింపు విధానమే లోపభూయిష్టం. జిడిపి లెక్కింపు విధానం, దారిద్య్రరేఖ ఎంత వుండాలి వుండకూడదు అని తర్జభర్జనలతో మార్పు గురించి ఆసక్తి చూపిన కేంద్ర ప్రభుత్వం రైతులకు మేలు చేకూర్చే వ్యవసాయ ఖర్చుల లెక్కింపు విధానంలో ఎందుకు మీనమేషాలు లెక్కిస్తోంది? ప్రధాని తన మనసులోని మాటలో గానీ ఇతర చోట్లగానీ ఈ విషయంపై ఎందుకు నోరు మెదపరు ? తాజాగా ఆయన చెప్పిన ఏడు సూత్రాలలో కూడా ముఖ్యమైన ఈ అంశం చోటు చేసుకోలేదు. గతేడాది మన ప్రభుత్వం గోధుమలకు ఇచ్చిన ధర టన్నుకు 226 డాలర్లయితే ఇదే సమయంలో పాకిస్థాన్ చెల్లించిన ధర 320 డాలర్లు.
రైతాంగానికి కనీస మద్దతు ధరలను పెంచకపోవటానికి కారణాలు ఏమిటి ? రైతులకు మద్దతు ధరలు పెంచితే వినియోగదారులకు ధరలు పెరిగి ద్రవ్యోల్బణం పెరుగుతుంది కనుక పెంచవద్దని ప్రభుత్వ ఆర్ధికవేత్తలైన అరవింద్ సుబ్రమణ్యం, పంగారియా వంటి వారు జారీచేసిన హెచ్చరికలకు లొంగిపోయింది మోడీ సర్కార్.పోనీ ద్రవ్యోల్బణం పెరగ కుండా స్ధిరంగా వుందా అంటే ఆరునెలలకు ఒకసారి వుద్యోగులకు పెంచుతున్న కరువు భత్యమే లేదనేందుకు పక్కా నిదర్శనం. పన్నెండవ పంచవర్ష ప్రణాళికలో 2012-13నుంచి 2017-18 మధ్య కాలంలో సగటున ఏడాదికి నాలుగు శాతం వ్యవసాయ రంగం అభివృద్ధి లక్ష్యంగా నిర్ణయించారు. కానీ ఇంతవరకు వాస్తవంలో రెండుశాతానికి మించలేదు. కొత్త బడ్జెట్లోగానీ, నరేంద్రమోడీ ఎన్నికల సభలు, రైతుల సభలలో గానీ ఎక్కడా తమ ఎన్నికల వాగ్దానం గురించి కనీస ప్రస్తావన కూడా చేయకుండా ఆరు సంవత్సరాలలో ఆదాయం రెట్టింపు గురించి చెబుతున్నారు. అసలు విషయం ఏమిటి ?
గతేడాది ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధరలు ప్రభుత్వం వాగ్దానం చేసిన వ్యవసాయ ఖర్చులపై 50శాతం లాభం చేకూర్చేవిగా లేవంటూ రైతు సంఘాల కూటమి గతేడాది సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. దానికి వివరణ ఇస్తూ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్లో యాభై శాతం లాభం చేకూర్చటం సాధ్యం కాదని సరసమైన ధరలు వచ్చేట్లు చూడటం తప్ప రైతుల ఆదాయాల పెంపుదలకు కనీస మద్దతు ధరల విధానం వుద్ధేశించలేదని, అలా చేస్తే మార్కెట్ను వక్రమార్గం పట్టించినట్లు అవుతుందని, యాంత్రికంగా యాభై శాతం పెంపుదల చేస్తే కొన్ని సందర్భాలలో తిరోగామి పర్యవసానాలు వుంటాయంటూ అమలు జరిపేది లేదని నరేంద్రమోడీ సర్కార్ చెప్పేసింది. అందుకే వ్యవసాయంతో పాటు కోళ్లు,చేపలు, తేనెటీగలు పెంచుకోండని నరేంద్రమోడీ వుచిత సలహాలు ఇస్తున్నారు. ఆయన పుట్టక ముందునుంచే రైతాంగం ఆ పని చేస్తున్నది.
రోడ్లు వేసేందుకు విదేశాల నుంచి తెచ్చుకున్న అప్పులు చెల్లించేందుకు లేదా ఆ కంపెనీలు నిర్వహిస్తున్న టోల్ టాక్సును ద్రవ్యోల్బణం ప్రాతిపదికన నిర్ణయిస్తున్నారు. విదేశీ అప్పులను మన రూపాయల్లో కాకుండా డాలర్లలో చెల్లిస్తున్నారు. వుద్యోగులకు ఆరునెలలకు ఒకసారి ద్రవ్యోల్బణం ప్రాతిపదికన కరువు భత్యం చెల్లిస్తున్నారు. అదే విధంగా అమలు జరిపినా లేకపోయినా పారిశ్రామిక కార్మికులు, ఇతరులకు కూడా ద్రవ్యోల్బణ ప్రాతిపదికన కరువు భత్యం నిర్ణయిస్తున్నారు. రూపాయి విలువ పతనమైతే రైతాంగం కొనే డీజిల్, పెట్రోలు, ఎరువులు, పురుగుమందులు ధరలు ఎప్పటికపుడు పెరుగుతాయి. విద్యుత్, బొగ్గు, వుక్కు వంటి సంస్ధల వుత్పత్తులకు కనీస లాభాలను నిర్ణయించే విధానం వుంది. కానీ రైతాంగం విషయానికి వచ్చే సరికి అడ్డగోలు వ్యవహారం తప్ప ఒక నిర్ణీత విధానం, ప్రాతిపదిక లేదు. ప్రతి పదిహేనురోజులకు ఒకసారి పెట్రోలు,డీజిల్ ధరలను సవరిస్తున్న కేంద్రం రైతాంగ వుత్పత్తులకు కొన్నింటికి అసలు మద్దతు ధరల నిర్ణయ విధానమే లేదు. వున్నవాటికి కూడా ఏడాదికి ఒకసారి నిర్ణయిస్తారు. అవి అమలు జరగనపుడు అమలు జరిపే యంత్రాంగం లేదు.ఎందుకీ పరిస్థితి?
2015లో వార్షిక ఇంక్రిమెంట్లు గాక వుద్యోగులకు 13శాతం కరువు భత్యం పెరిగింది.అదే ధాన్యం కనీస మద్దతు ధర 3.25శాతం, గోధుమలకు 5.2శాతం పెరిగింది. విజయ మాల్య, కేంద్ర మంత్రి సుజనా చౌదరి వంటి వారి కంపెనీలు బకాయిలు చెల్లించకుండా వున్నపుడు ఒన్టైమ్ సెటిల్మెంట్ అనో పరిశ్రమలను ఆదుకొనే పాకేజి పేరుతోనో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, బ్యాంకులు ఆదుకుంటున్నాయి. మరి వరుసగా కరువుల పాలవుతున్న రైతులకు ఇలాంటి పాకేజీలు ఎందుకు వుండవు?
పప్పు ధాన్యాల ధరలు పెరిగాయని జనం గగ్గోలు పెడుతుంటే కేంద్ర ప్రభుత్వం వాటిని దిగుమతి చేసుకొనేందుకు 16వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. దీన్నే అప్పు చేసి పప్పుకూడు అంటారు. అదే మన రైతాంగానికి చెల్లిస్తే కావలసినన్ని పప్పులు పండించరా ? విలువైన మన విదేశీమారక ద్రవ్యం మిగులు తుంది, మనరైతుల జేబుల్లో నాలుగు డబ్బులు వుంటాయి. వాటిని ఇతర వస్తువుల కొనుగోలుకు వుపయోగిస్తారు కనుక, పరిశ్రమలు, వాణిజ్యాలు కూడా పచ్చగా వుంటాయా లేదా ? ఆ పని ఎందుకు చేయరు?
పన్నెండవ ప్రణాళికలో వ్యవసాయ రంగానికి లక్షా యాభైవేల కోట్ల రూపాయలు కేటాయించినట్లు గొప్పగా చెప్పుకుంటారు. న్యూఢిల్లీ విమానాశ్రయ లావాదేవీలలో లక్షా 62వేల కోట్ల కుంభకోణం జరిగిందని కాగ్ పేర్కొన్నది . అరవై కోట్ల మంది రైతుల కుటుంబాల కంటే కొన్ని లక్షల మంది ప్రయాణించే విమానాశ్రయానికి ప్రాధాన్యత ఎక్కువ వున్నట్లు స్పష్టం కావటం లేదూ ? గత ప్రభుత్వ విధానాలతో పోల్చితే నరేంద్రమోడీ సర్కార్ వాటిని మార్చిందేమీ లేదు. గత ఐదు సంవత్సరాలలో సగటున రోజుకు 42 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని గణాంకాలు తెలుపుతుండగా గతేడాది ఆ సగటు 52కు పెరిగింది. మరి తాజాగా నరేంద్రమోడీ ప్రకటించిన ఏడు సూత్రాలు ఈ సంఖ్యను తగ్గిస్తాయా?పెంచుతాయా? తగ్గించాలనే కోరుకుందాం .
30 Wednesday Mar 2016
Posted Current Affairs, INTERNATIONAL NEWS, Left politics, Opinion, RELIGION
inTags
Cold War, communism, Indonesia, Indonesian Communist Party (PKI)., PKI, Soeharto, Sukarno, Western Bloc
అదిస్టి సుకుమా సావిత్రి, జకర్తా పోస్టు కాలమిస్టు
కమ్యూనిస్టు ఇతివృత్తం వున్న సాంస్కృతిక కార్యక్రమాలపై దేశంలో(ఇండోనేషియా) వరుసగా అనేక నిషేధాలు విధించటాన్ని చూస్తుంటే కొంత మందికి ప్రచ్చన్న యుద్ధం అంతమైనట్లుగా కనిపించటం లేదని మనకు గుర్తు చేస్తున్నవి. పశ్చిమ దేశాల కూటమికి చెందిన పాత వ్యక్తులు వుత్సాహవంతులైన తమ మద్దతుదార్లను చూస్తే ఆశ్చర్య పడవచ్చు. వారు ఇస్లాం డిఫెండర్స్ ఫ్రంట్(ఎఫ్పిఐ) తప్ప మరొకరు కాదు, అదే బృందం జకర్తాలోని ఇండోనేషియా హోటల్ ట్రాఫిక్ సర్కిల్లో ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) బ్యానర్తో ఒకసారి ప్రదర్శన చేసింది. బహుత్వ వాదం పట్ల ఏమాత్రం గౌరవం లేకపోవటంలో పేరు మోసిన ఈ బృందపు నిరసనలను ‘కమ్యూనిజం, లెనినిజం, మరియు మార్క్సిజం’ లను నిషేధిస్తూ తమ చర్యలను సమర్ధించుకొనేందుకు ప్రజా సంప్రదింపుల కమిటీ జారీ చేసిన 1966 నాటి ఆదేశాలను ఇప్పటికీ వుపయోగిస్తున్న పోలీసులు సహించారు.
ఒకవైపు ఐఎస్ ప్రపంచానికి ఒక ముప్పుగా పరిణమించటం కనిపిస్తుంటే వామపక్షంగా ఏది కనిపించినా దాని పట్ల శత్రువైఖరిని ప్రదర్శించే ప్రచ్చన్న యుద్ధ బెంగతోనే పోలీసులు వున్నట్లు కనిపిస్తోంది. 1965విషాద వుదంతం తరువాత కమ్యూనిస్టు వ్యతిరేకత ఒకసాకుగా వుండేది. రెండవ ప్రపంచ యుద్ధానంతర యుగపు వారసత్వంగా వచ్చిన కమ్యూనిస్టు వ్యతిరేక భావనలను తొలగించుకొనేందుకు ప్రభుత్వం గతకొద్ది సంవత్సరాలుగా అనేక పురోగామి చర్యలు తీసుకున్న పూర్వరంగంలో పోలీసుల వైఖరి అసంగతంగా కనిపిస్తోంది.సుశిలో బాంబాంగ్ యుధ్యోనో ప్రభుత్వం కమ్యూనిజం పుస్తకాలపై నిషేధం తొలగించింది.1965నాటి మిలిటరీ కుట్ర మరియు ఇండోనేషియా కమ్యూనిస్టు పార్టీని అందుకు బాధ్యురాలని నెపం మోపేందుకు చేసిన ప్రయత్నాలకు సంబంధించి ఆధారాలను అందచేసిన జూలీ సౌత్ వుడ్ మరియు పాట్రిక్ ఫ్లాంగన్ పుస్తకాలైన ‘చట్టం,ప్రచారం, భయం ‘ వంటి వాటి ఇండోనేషియా అనువాదాలపై నిషేధం ఎత్తివేశారు. వామపక్ష భావజాల ఆలోచన మరియు దేశంలో కమ్యూనిస్టు గతం గురించి తెలియచేసే పుస్తక ప్రచురణలపై ఆసక్తి చూపే వారికి ఆన్లైన్లో (ఇంటర్నెట్లో) నేడు అందుబాటులో వున్నాయి. 1965లో సైనిక జనరల్స్ హత్యలతో నిషేధిత పార్టీ, కమ్యూనిజాలకు వ్యతిరేకంగా దేశ వ్యాపితంగా తలెత్తిన భయం మరియు ఆగ్రహం, వాటిపై ప్రభుత్వం ఏమి చెబుతోందో తెలిపే ప్రచార సినిమాలైన పెంగ్ఖైనాతన్, ట్రెచరీ వంటి వాటిని సుహార్తో పతనమైన నాటి నుంచి విధిగా చూడనవసరం లేదు. కమ్యూనిజం ఓడించబడింది, మరియు దాని వునికి ఒకవైపున పెట్టుబడిదారీ చక్రాలపై ఆర్ధిక వ్యవస్థను నడుపుతున్న చైనా రాజకీయ వ్యవస్ధకు మాత్రమే సంగతం కావచ్చు.
సమాచార యుగానికి ప్రతి ఘటన వృధా ప్రయాస అని వేరేచెప్పనవసరం లేదు. అటువంటి కార్యకలాపాలను విఫలం చేయాల్సిన అవసరం పోలీసులకు వుందా, ఇంటర్నెట్ మరియు ప్రయివేటు చర్చలద్వారా జనం తమంతట తామే విద్యావంతులు కాగలరు. దేశ చరిత్రలో చీకటి మయమైన భాగాలలో ఒకటైన 1965నాటి సమస్యతో వ్యవహరించటం అంత సులభం కాకపోవచ్చు. తన రాజకీయ పలుకుబడి పడిపోతున్న సమయంలో ఇండోనేషియా కమ్యూనిస్టుపార్టీపై ఆధారపడిన జాతీయ వాది అయిన సుకర్నోను తొలగించాలని కోరుకున్న సుహార్తో ఆ సమయంలో పార్టీ నిషేధానికి ఒక సాకుకోసం సైనిక అధికారులను హత్య చేయించాడు. అధ్యక్షుడు జోకో ‘జోకోవి’ యంత్రాంగం నాటి సామూహిక హత్యాకాండ గురించి సరిదిద్దుకొనే చర్యలు తీసుకుంది, కానీ ఇంతవరకు క్షమాపణకు ముందుకు రాలేదు. జాతీయ మానవ హక్కుల సంస్ధకు ప్రభుత్వం అధికారిక పత్రాలను అందచేసినప్పటికీ సరిగా నమోదు చేయని కారణంగా 1965లో, ఆ తరువాత ఏం జరిగిందనేది సంక్లిష్టమైందని అధికారులు చెప్పారు.ఆ సమయంలో తరుణ ప్రాయంలో వున్న దేశానికి రాజధానిలో తలెత్తిన అల్లకల్లోలం భరింపరానిదిగా వుంది, విబేధాలు దిగువకు విస్తరించిన సమయంలో కమ్యూనిస్టులు అనుకున్నవారిని అంతం చేయటానికి సుహార్తో నాయకత్వంలోని మిలిటరీ మాత్రమే కాదు, పౌర బృందాలు కూడా భాగస్వాములయ్యాయి.
ప్రముఖ మత పెద్ద, దేశంలో అతి పెద్ద ఇస్లామిక్ సంస్ధ అయిన నహదల్తుల్ వుల్మా సంస్ధ(ఎన్యు) మాజీ అధ్యక్షుడు, మాజీ దేశాధ్యక్షుడైన అబ్దుర్ రహమాన్ ‘గుస్ దుర్’ వాహెద్ కమ్యూనిస్టుల వూచకోతలో తమ సంస్ధ యువకులు పాల్గొన్నందుకు క్షమాపణలు చెప్పాడు. ఆ సమయంలో కొత్తగా వుద్బవించిన పాలకులైన న్యూ ఆర్డర్కు చెందిన ప్రభుత్వం ఐరోపాలో నాజీ జర్మనీ మాదిరి మారణకాండ జరిపేంత సామర్ధ్యం వున్న బలమైనది కాదు.లేదా రాజకీయ, ఆర్ధిక, సామాజిక రంగాలపై పూర్తి అదుపు కలిగి రెండవ ప్రపంచ యుద్ధ ఛాంపియన్ల వంటి అగ్రగామిశక్తీ కాదు. ప్రపంచ రాజకీయ పరిణామాల ప్రవాహంతో పాటు ప్రయాణించేందుకు ప్రయత్నించిన ఒక చిన్న పడవ కెప్టెన్ వంటిది.
అయినప్పటికీ అటు పశ్చిమ మరియు తూర్పు దేశాలకు ఒక ప్రధాన వర్ధమాన ఆర్ధిక వ్యవస్థ కేంద్రంగా వున్నందున పూర్తిగా అలసిపోయిన ఒక భావజాలానికి భయపడి లొంగిపోయే విధంగా చేయటం గాక తమ పరిజ్ఞానాన్ని పెంచుకొనేందుకు మరియు వివిధ సంస్కృతులను ఆకళింపు చేసుకొనేందుకు జనాన్ని ప్రోత్సహించటం ప్రభుత్వానికి మంచిది. 1965 నాటి పరిణామాలపై జనంలో వున్న కుతూహలాన్ని అడ్డుకోకుండా గత న్యూ ఆర్డర్ ప్రభుత్వ ఏకపక్ష వైఖరితో సమంగా వూచకోతకు సంబంధించి సమగ్రమైన చారిత్రక పరిశోధనకు ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. దేశ గతం గురించి యువతరం తెలుసుకొనే అవకాశం కలిగించేందుకు యుక్తా యుక్త విచక్షణతో కూడిన చరిత్ర తోడ్పడుతుంది. నేరం చేసిన వారిపై తీసుకొనే చట్టబద్దమైన చర్య కంటే ఇది తక్కువ హాని కలిగిస్తుంది. చర్య వివాదాలను దీర్ఘకాలం కొనసాగించటమే గాక జాతి గాయపడటానికి, చిందరవందర కావటానికి కూడా దారితీయ వచ్చు. కమ్యూనిజంతో సహా ఏ భావజాలాన్ని అధ్యయన కేంద్రాలలో నిషేధించకూడదు, ఎందుకంటే నిషేధించటం ద్వారా భయ వారసత్వాన్ని కొనసాగించటమే గాక ప్రభుత్వం సమాజం ప్రగతిని, నిష్కాపట్యాన్ని అడ్డుకుంటున్నది అవుతుంది.పూర్తి గ్రహణశక్తి లేనట్లయితే ఏం జరుగుతుందో తెలియని సమాజం అంతగా తెలియని దానికి కూడా వూరికే భయపడుతుంది, నవప్రవర్తక ఆలోచనలతో ముందుకు పోకుండా ఎల్లవేళలా అనుచరిగా వుండిపోతుంది. అటువంటి సమాజం అది పశ్చిమ దేశాల లేదా అరబ్బుల లేదా చివరికి ఐఎస్ పాటలకు సైతం దేనికైనా నాట్యం చేస్తుంది.
28 Monday Mar 2016
Posted BJP, Communalism, Current Affairs, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion, RELIGION
inTags
ANTI NATIONAL, BJP, Intolerance, NATIONAL, RSS, Tolerance, what is tolerable
ముందు మీరు దేశభక్తులో కాదో తేల్చుకోండి, వీలైతే ఒక సర్టిఫికెట్ కూడా సంపాదించండి. ఆధార్ కార్డు, రేషన్ కార్డున్నా లేకపోయినా దేశభక్తి కార్డు లేకపోతే రోజులు గడిచేట్లు లేవు. ఎందుకొచ్చిన తిప్పలు, రేపు పొద్దున్నే ఎవరైనా వచ్చి ఏ ఇంట్లో ఎంత మంది దేశభక్తులున్నారో వ్యతిరేకులున్నారో లెక్కలు తీసే రోజులు
ఎంకెఆర్
తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా ! మళ్లీ అదే, మళ్లీ మళ్లీ అదే !! నిర్మొహమాటంగా చెప్పాలంటే ప్రస్తుతం ప్రపంచాన్ని వూపివేస్తున్న వినిమయదారీ తత్వం నేటి తరాలకు నేర్పుతున్నది అదే. మనకు తెలియకుండానే దీనిలో పడిపోతున్నాం. దీని ఒక లక్షణం ఏమంటే ప్రశ్నించేతత్వాన్ని మొదట అది నాశనం చేస్తుంది. ఇప్పుడు ప్రతి వారి చేతిలో కనిపించే సెల్ ఫోన్నే తీసుకుందాం. మనకు అంత వెల వున్న సెల్ఫోన్లు అవసరమా అని ఆలోచించేవారెందరు? ఫీచర్లు తక్కువ వున్న సెల్ ఫోన్ ఎవరి చేతుల్లో అన్నా చూస్తే వారిని పాతకాలం వారనుకుంటున్నామా లేదా ?
ఇలాంటి స్థితిలో ఏ దేవుడు లేక దయ్యం వలన బుద్ధి పుట్టిందో గానీ కొంత మంది సైద్ధాంతిక యుద్ధానికి తెరలేపారు. యుద్ధం అంటే ముందు బలయ్యేది నిజం. వాస్తవాలు అడుగు దూరం ప్రయాణించేలోపు అవాస్తవాలు వంద అడుగులు వెళ్లి కొత్త రూపంలో మనదగ్గరకే తిరిగి వచ్చి మనలను కూడా అనుమానంలో పడేస్తాయి. మహాభారత, రామాయణాలు మనకు చెప్పినది అదే. అందువలన సైద్ధాంతిక యుద్ధంలోని ఒక పోరులో తాము విజయం సాధించామని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించేశారు. అలా వాదించకపోతే ఆయన ప్రముఖ లాయర్ ఎలా అవుతారు. హత్య చేసిన వ్యక్తి తరఫున వాదించటానికే పేరు మోసిన లాయర్లు అవసరం. మా కక్షిదారు ఎలాంటి వాడు అంటే అసలు కత్తి అనేదే తెలియని అమాయకుడు, అలాంటి వ్యక్తి ఆ రోజు అసలు అక్కడ లేడు, ఈ హత్య చేయలేదు అని బల్లచరిచి మరీ వాదిస్తాడు. సైద్దాంతిక పోరులో విజయం సాధించామని ఏకపక్షంగా ప్రకటించుకోవటంలో మతలబు అదే.
చిత్రం ఏమంటే రెండు సంవత్సరాల క్రితం బిజెపి ప్రకటించిన ఎన్నికల ప్రణాళిక, చేసిన వాగ్దానాలు, ప్రసంగాలలో ఎక్కడా దేశంలో తాము సైద్దాంతిక యుద్ధాన్ని ప్రారంభిస్తామని చెప్పలేదు. నల్లధనాన్ని వెనక్కు తెచ్చి ప్రతి ఒక్కరికీ పదిహేనులక్షల వరకు పంచుతామని, రైతాంగానికి రెట్టింపు ఆదాయాలు సమకూర్చుతామని, ధరలు తగ్గిస్తామని, అన్నింటికీ మించి మేకిండియా పేరుతో ప్రపంచం మొత్తానికి వస్తువులను ఇక్కడే తయారు చేసి ఇక్కడి నుంచే సరఫరా చేస్తామని, ఆ విధంగా వుద్యోగ కల్పన చేస్తామంటూ ఎన్నోఎన్నో వాగ్దానాలు చేశారు.జౌరంగజేబును ఆదర్శంగా తీసుకొని జనం మీద చెత్తపన్ను వేశారు. అదేం చిత్రమో గాని పన్ను వసూలు చేస్తున్నారు గానీ చెత్తను తీయటం లేదు. వాటి అమలుకు అసలు ప్రయత్నమే లేదు గానీ చెప్పని అంశంలో మాత్రం విజయం సాధించారట !
మీ పిచ్చిగానీ ఇవన్నీ ఎవరికి పట్టాయి. ముందు మీరు దేశభక్తులో కాదో తేల్చుకోండి, వీలైతే ఒక సర్టిఫికెట్ కూడా సంపాదించండి. ఆధార్ కార్డు, రేషన్ కార్డున్నా లేకపోయినా దేశభక్తి కార్డు లేకపోతే రోజులు గడిచేట్లు లేవు. ఎందుకొచ్చిన తిప్పలు, రేపు పొద్దున్నే ఎవరైనా వచ్చి ఏ ఇంట్లో ఎంత మంది దేశభక్తులున్నారో వ్యతిరేకులున్నారో లెక్కలు తీసే రోజులు వచ్చాయని ఒక మిత్రుడు చలోక్తి విసిరాడు.
మా పక్కింటి పెద్దాయన కూడా రోజులు బాగాలేవు సార్, సర్దుకు పోవాలి అన్నాడు. అదేంటి సార్ మరి ఆటు, పోట్లను ఎదుర్కొని నిలవటమే జీవితం అని కదా పెద్దలు చెప్పారు? ఆటు పోట్లను ఎదుర్కోవటం అంటే సాధారణ అర్ధంలో కష్ట సుఖాలు అని, అలాగాక నిజమైన అర్ధం ప్రకారం వాటికి ఎదురు నిలవమని కాదు. ఎవరైనా అలా నిలబడితే సముద్రం మింగేస్తుంది. ఆటు, పోట్లు వచ్చినపుడు వెనక్కి వంగి తప్పించుకోవాలి తప్ప ఎదురు నిలబడి నిష్కారణంగా ప్రాణాలు పోగొట్టుకోమని కాదు అన్నారు.(పోటు అంటే సముద్రం మీద నుంచి లేచే అలలు తీరానికి రావటం, ఆటు అంటే తీరానికి వచ్చిన అలలు తిరిగి సముద్రంలోకి పోవటం, కొన్ని సందర్భాలలో అవి చాలా తీవ్రంగా వుంటాయి. వాటికి ఎదురు నిలబడితే ప్రాణాలకే ముప్పు)
ఇటీవలి కాలంలో దాదాపు అన్ని రంగాలలో ఎలాంటి సైద్ధాంతిక, మేథో,విద్యాపరమైన చర్చలు మృగ్యమైన కారణంగా ప్రతి ఒక్కరూ బి పాజిటివ్ అన్నట్లుగా వుంటున్నారు. ఏదైనా ఒక విషయంపై ఒక అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా, విమర్శనాత్మకంగా చెప్పినా, చెప్పేందుకు ప్రయత్నించినా మీ రెందుకు ప్రతిదానికీ బస్తీమే సవాల్ అంటారు, కావాలంటే మీ అభిప్రాయాలు మీరు వుంచుకోండి, మాకు చెప్పండి, భరించక తప్పదు కదా, ఇతరులు ఏది నమ్మితే మీకెందుకు, వారిష్టం వచ్చినట్లు వారుంటే మనకు నష్టమేమిటి ? అని కుటుంబ సభ్యులే వెనక్కు లాగుతారు. ఇంకా కొందరు మనకెందుకులే దుష్టుడికి దూరంగా వుండాలన్నట్లు వినీ వినట్లు తప్పించుకుంటారు.
అంటే దీని అర్ధం ఏమిటీ ఎక్కడ ఏం జరిగినా, ఎవరేం చెప్పినా మనం ఆలోచించకూడదు, బుర్రకు పని పెట్ట కూడదు, దేనినీ పట్టించుకోకూడదు, మన అభిప్రాయాలు వెల్లడించకూడదు, మనం అసలు మాట్లాడ కూడదు, ఏదైనా వుంటే మనలోనే అణచివేసుకోవాలి. అప్పుడే అంతా మనతో బాగుంటారు, మనమూ బాగుంటాము. ప్రతిదానికీ ఇతరులతో దెబ్బలాటలకు దిగటం ఎందుకు ? కానీ గత చరిత్ర అంతా అలా లేదే. పోరాటాల మయం ! ముందుకే మున్ముందుకే !! కౌరవులు దుష్టులు మన కెందుకులే వారి పాపాన వారు పోతారులే అని కృష్ణుడు వూరుకుంటే బకుడు, కీచకుడు, జరాసంధుడు, దుర్యోధనుడు, కంసుడు మొదలైన వారందరిదీ పై చేయి వుండేది. ప్రపంచంలో తనకు ఎదురు లేదు అని విర్రవీగిన అలెగ్జాండర్ను పురుషోత్తముడు అడ్డగించకపోతే, ఫాసిస్టు హిట్లర్ను కమ్యూనిస్టు స్టాలిన్ అడ్డుకొని వుండకపోతే ప్రపంచ పరిణామాలు ఎలా వుండేవి? చచ్చిన చేప వరదలో కొట్టుకుపోతుంది. బతికి వున్న చేప ఎదురు ఈదుతుంది. మనం ఎవరిగా వుండాలి?
మహాభారతంలో సహనం, సంయమనం గురించి ఎన్నో పాఠాలు వున్నాయి.కంసుడి వంద తప్పుల వరకు కృష్డుడు సహించి సంయమనం పాటించాడు. అందువలన దేన్ని సహించాలి,దేన్ని సహించకూడదు అని ఈ రోజు మనం కొత్తగా ఆలోచించనవసరం లేదు. చరిత్రే మనకు నేర్పింది. పులి మనుషులకు హాని చేయనంతవరకు దాని మానాన దాన్ని అరణ్యంలో తిరగనివ్వాలి. అది జనారణ్యంలోకి వస్తే బోనులో బంధించి తిరిగి అడవిలో వదలి వేయాలి. అదే అదుపు తప్పితే ఏం చేయాలో చెప్పనవసరం లేదు.
మీరు ప్రజల నమ్మకాలను గౌరవించాలి అంటారు. నిజమే ! భక్తితో అగ్ని గుండం మీద నుంచి నడిస్తే ఏమి కాదు అన్నది ఒక నమ్మకం. అది హిందువులు, ముస్లింలలోనూ వున్న ఒక మూఢనమ్మకం అని చెప్పేందుకు హేతువాదులకు హక్కు వుందా లేదా? అలాగాక మా విశ్వాసాన్ని, మనో భావాలను దెబ్బతీస్తున్నారని ఎవరైనా దెబ్బలాటలకు వస్తే సహించాలా ? ఎదుటివారి అభిప్రాయాలను విను, సబబనిపిస్తే అంగీకరించు లేకుంటే అనుభవించు అని ముగించటం తప్ప చేసేదేముంది? హేతువాదుల మాటలను ఖాతరు చేయకుండా గతేడాది కర్ణాటకలోని మాండ్య జిల్లాలో ఒక కాళికాంబ ఆలయం దగ్గర బసవన నడక పేరుతో అగ్ని గుండంలో నడిచిన ఒక పూజారి గుండంలో పడిపోయి ఆరు రోజుల తరువాత దుర్మరణం చెందాడు. అందువలన మరొకరు అలాంటి పని చేస్తే వద్దని వారించకుండా వుండాలా, పోతే పోతాడు లెమ్మని చూస్తూ వూరుకోవాలా, పశువులకూ మనకూ తేడా ఏముంటుంది? అయితే వారికి ఎలా చెప్పాలి. చాలా మంది అలా నడుస్తున్నారు కదా వారికెందుకు ప్రాణాల మీదకు రాలేదు అనే వారిని ఒకరికైనా ఎందుకు వచ్చిందో, విశ్వాసం ఎందుకు కాపాడలేకపోయిందో చెప్పమనాలి.
ఎవరైనా అలాంటి మూఢనమ్మకాలు కలిగి వుంటే బాబూ మంచిది కాదు అని చెప్పాలి. కాదు నా యిష్టం అంటే , నీ మనోభావాలను ఎందుకు దెబ్బ తీయాలి, ఎలాంటి అభిప్రాయాలు కలిగి వుండాలన్నది నీ హక్కు అంటూ దానిని గౌరవించటం తప్ప మరొక పద్దతి లేదు.వాటిని ఇతరులకు శాంతియుత పద్దతుల్లో వెల్లడించటాన్ని కూడా మనం గౌరవించాలి, సహించాలి.
కానీ నీకు దేవుడి మీద నమ్మకం లేదు, మన కాలనీలో నువ్వుండటం వల్లనే ఈ ఏడాది వర్షాలు పడలేదు, నువ్వు మంచోడివి కాదు అనే ఎదుటి వారి నమ్మకాన్ని గౌరవించాలా ? వారి అభిప్రాయాన్ని వారిని వ్యక్తం చేయనివ్వండి, నష్టం లేదు, దానితో అంగీకరించాల్సిన అవసరం లేదు. సమాజంలో కొంత మంది చేత బడి చేస్తున్నారనే ఒక మూఢనమ్మకం వుంది. దానికి విరుగుడు పేరుతో లెక్కలేనన్ని పూజలు కూడా వున్నాయిగా నమ్మకం వున్న వారిని చేయించుకోనివ్వండి, డబ్బులు వదిలించుకోనివ్వండి. కానీ చేతబడి చేస్తున్నారనే పేరుతో ఎవరిమీదైనా దాడులు చేస్తే, చంపటానికి ప్రయత్నిస్తే సహించకూడదు. ఇలాంటి దాడులకు గురవుతున్నవారెరు. ఎక్కువ మంది దళితులు, ఇతర బలహీన వర్గాల వారే. నిజానికి వారికి అలాంటి శక్తులే గనుక వుంటే వారిపై దాడులు, అత్యాచారాలకు పాల్పతున్నవారిని ఎప్పుడో రిమోట్ కంట్రోలు మాదిరి తమ గుడిసెల్లో వుండే మట్టుబెట్టి వుండేవారు.
కానీ వాస్తవానికి డబ్బున్నవారు, ధనికులు, డబ్బు లేక పోతే లక్షలకు లక్షలు అప్పులు చేసి మరీ బాబాలు, చేతులు, కాళ్లు చూసే జ్యోతిష్కుల వంటి రకరకాల వ్యక్తుల చేత క్షుద్రపూజలు, హోమాలు చేయిస్తున్నారా లేదా ? చేతబడికి, వాటికీ తేడా ఏమిటి? చేతబడి అంటే భయపడతారు, హోమం, పూజలు అంటే చేతులు కట్టుకు ప్రణమిల్లుతారు. మరి అలాంటి వాటిని గౌరవించాలా? అవసరం లేదు. అయితే అవి చేసే వారితో తగాదా తెచ్చుకోనవసరం లేదు.
సహనం, అసహనం, దేశభక్తి, దేశ ద్రోహి, మాత, పిత వంటి అంశాలు సమాజంలో ఎప్పటి నుంచో వున్నాయి. అవి ఎప్పుడు వెలుగులోకి వస్తాయంటే ఏదైనా ఒక పరిణామం సంభవించినపుడు దాని స్వభావాన్ని బట్టి ఒక్కొక్కటి ముందుకు వస్తుంది. వుదాహరణకు ఆర్ఎస్ఎస్ , అది 1925లోనే ఒక స్వచ్చంద సంస్ధగా ఏర్పడింది. అయితే దానిలో ఒకప్పుడు సభ్యుడిగా వున్న గాడ్సే 1948 జనవరి 30న మహాత్మా గాంధీని హత్య చేసినపుడే దాని భావజాలమేమిటో దేశానికి తెలిసింది. తరువాత సుప్రీం కోర్టు జోక్యంతో కేంద్ర ప్రభుత్వం దానిపై విధించిన నిషేధాన్ని తొలగించారు. అప్పుడు సుప్రీంకోర్టు విధించిన షరతు ప్రకారం దేశ రాజ్యాంగానికి బద్దులమై వుంటామని, త్రివర్ణ పతాకాన్ని జాతీయ పతాకంగా గౌరవిస్తామని రాతపూర్వంగా ఆర్ఎస్ఎస్ విధేయత పత్రాన్ని అందచేయాలి.ఈ విషయాలను బహిరంగంగా ప్రకటించాలి.ఆ మేరకు 1949 ఏప్రిల్ 11న నాటి అధిపతిగా వున్న ఎంఎస్ గోల్వాల్కర్ ఒక ముసాయిదా ఆర్ఎస్ఎస్ నిబంధనావళిని కేంద్ర ప్రభుత్వానికి అందచేశారు. దానిని పరిశీలించి అంగీకరిస్తూ అదే ఏడాది జూలై 11న నిషేధాన్ని ఎత్తివేశారు.అంటే స్వాతంత్య్రం వచ్చిన రెండు సంవత్సరాల వరకూ ఆర్ఎస్ఎస్కు స్వాతంత్య్రం లేదు, రాజ్యాంగం, త్రివర్ణ పతాకం పట్ల గౌరవం లేదు, ఇవేవీ లేకపోయిన తరువాత వారి దేశభక్తి గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది. దేశంలో అనేక సాంస్కృతిక సంస్ధలున్నాయి. ఏది కూడా ఇలా రాజకీయాలు చేయలేదు. పోనీ స్వాతంత్య్రానికి ముందు తమది స్వచ్చంద సంస్ధ అని చెప్పుకున్న ఆర్ఎస్ఎస్ త్రివర్ణ పతాకం బదులు కాషాయ పతాకాన్ని జాతీయ జండాగా ఆమోదించాలని తన పత్రిక ఆర్గనైజర్లో 1947 జూలై 17న రాసింది. అదే నెల 22న రాజ్యాంగ పరిషత్ జాతీయ పతాకాన్ని ఆమోదించింది. తరువాత స్వాతంత్య్రానికి ఒక రోజు ముందు ఆగస్టు 14 ఆగస్టు సంచికలో ఆర్గనైజర్ జాతీయ జెండా గురించి విషం కక్కింది. కాషాయ పతాకం వెనుక రహస్యం అనేపేరుతో రాసిన వ్యాసంలో ‘ ప్రారబ్దం కొద్దీ అధికారానికి వచ్చిన వారు మన చేతుల్లో త్రివర్ణ పతాకాన్ని పెట్టి వుండవచ్చు, కానీ దానిని హిందువులెవ్వరూ గౌరవించరు, స్వంతం చేసుకోరు. మూడు అంటేనే కీడు, మూడు రంగులు కలిగిన ఒక జెండా అనివార్యంగా దేశంపై మానసికంగా తీవ్రమైన చెడు ప్రభావాన్ని , వుపద్రవాన్ని కలిగిస్తుంది.’ అని పేర్కొన్నది. పాకిస్తాన్ స్వాతంత్య్ర దినోత్సవ రోజైన 1947 ఆగస్టు 14న, 1950 జనవరి 26న ఆర్ఎస్ఎస్ నాగపూర్లోని తన ప్రధాన కార్యాలయం వద్ద జాతీయ పతాకాన్ని ఎగురవేసింది. తరువాత నిలిపివేసింది. 2001లో రాష్ట్రప్రేమీ యువదళ్ పేరుతో వున్న ఒక సంస్ధకు చెందిన బాబా మెంధే, రమేష్ కుమార్ కాలంబే, దిలీప్ చట్టానీ అనే వారు రిపబ్లిక్ దినోత్సవం రోజున నాగపూర్లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం వద్ద బలవంతంగా జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు, పదకొండు సంవత్సరాల పాటు జైలు శిక్ష అనుభవించిన తరువాత 2013లో విడుదలయ్యారు.ఆ వుదంతం తరువాత 2002 నుంచి అంటే స్వాతంత్య్రం వచ్చిన 50 సంవత్సరాల తరువాత ఆర్ఎస్ఎస్ తొలిసారి తన కార్యాలయం వద్ద జాతీయ పతాకాన్ని ఎగురవేసింది.రాజ్యాంగం, జాతీయ పతాకాన్ని గౌరవిస్తామని రాతపూర్వంగా రాసి ఇచ్చిన సంస్ధ దేశభక్తి ఇది.
ఇలాంటి వారు ఇప్పుడు రాజ్యాంగంలో లేని భారత మాతాకు జై అంటేనే దేశ భక్తి అని అనని వారు వారు దేశద్రోహులు అని చిత్రిస్తున్నారు. దాన్నొక సైద్ధాంతిక యుద్ధంగా వర్ణించి దానిలో తాము తొలి విజయం సాధించామని చెప్పుకుంటున్నారు. చరిత్ర పట్ల, జనం జ్ఞాపక శక్తి పట్ల ఎంత చిన్న చూపు.వుల్లికి మల్లికి తేడా తెలియనంత అమాయకంగా జనం వున్నారనుకుంటున్నారా ? మల్లె తోటలో నాటి నంత మాత్రాన వుల్లి మల్లి అవుతుందా ?
27 Sunday Mar 2016
Posted AP, Communalism, Current Affairs, INDIA, NATIONAL NEWS, RELIGION, Telangana
inఎం కోటేశ్వరరావు
‘రోహిత్ చనిపోతే నేను వెళ్లలేదు… రకరకాల నేతలు పరామర్శకు వచ్చారు, నేను వెళ్లటం మంచిదా అన్న మీమాంసలో మౌనంగా వుండాల్సి వచ్చింది. ఏ సిఎం కూడా ఇలా జరగాలని కోరుకోడు’ :ముఖ్యమంత్రి కెసిఆర్
అబ్బ ! భలే చెప్పిండు కదా !!
ఇంతకీ ఇన్ని రోజుల తరువాతైనా మీ మాంస తీరిందా? కొనసాగుతోందా? కొత్తది తలెత్తిందా ? అన్నమైతేనేమిరా సున్నమైతేనేమిరా పాడు పొట్టకు అన్నమే వేతామురా , పోయినోడు ఎలాగూ పోయాడు, కేంద్రంలో బతికి వున్నవారితో తగాదా ఎందుకు ? పోనందుకు విమర్శలు ఎలాగూ రానే వచ్చాయి. నిండా మునిగిన వాడికి చలేమిటి ?
‘రోహిత్ వేముల మరణం దురదృష్టకరం ‘:ముఖ్యమంత్రి కెసిఆర్
అబ్బ ! భలే చెప్పిండు కదా !!
రోహిత్ మరణానికి కారకడని విద్యార్ధులు వేలెత్తి చూపుతున్న వైస్ ఛాన్సలర్, అతగాడిపై ఎస్సిఎస్టి అత్యాచారాల చట్టం కింద పెట్టిన కేసుపై ఇంతవరకు ఏ చర్యా తీసుకోకపోవటానికి…. తస్సాదియ్యా ఇంకా పెద్దమ్మలా పట్టుకున్న మీ మాంస కొనసాగటమే కారణం, దొడ్డిదారిన వచ్చి విద్యార్ధులను రెచ్చగొట్టిన వ్యక్తికి ప్రాణహాని తలెత్తిందనే సాకుతో విద్యార్ధులను చావబాదటం, బెయిలు రాని కేసులు పెట్టటం పూర్వ జన్మలో చేసుకున్న అదృష్టం ! ఎలాంటి శషభిషలు లేకుండా పోలీసు చర్యలను సమర్ధించటం ఏ ముఖ్యమంత్రికైనా పూర్వజన్మ సుకృతం !
‘ విసి ఛాంబర్ వద్దకు విద్యార్ధులు పోయినపుడు వారిని ఆపితే ఒక పంచాయతీ, ఆపకుంటే ఒక పంచాయతీ. విద్యార్ధుల దాడిలో విసి చనిపోతే పరిస్థితి ఏంటంటూ పోలీసులు పరిస్థితిని వివరించారు’:ముఖ్యమంత్రి కెసిఆర్
అబ్బ ! భలే చెప్పిండు కదా !!
నిజమే వైస్ ఛాన్సలర్ అప్పారావు మీద విద్యార్ధులు ఎస్ఎసిఎస్టి చట్టం కింద పెట్టిన కేసులో ముందుకు పోతే నరేంద్రమోడీతో ఒక పంచాయతీ, పోకపోతే విద్యార్ధులతో మరొక పంచాయతీ. కేంద్రంతో సఖ్యత కోరుకుంటున్నపుడు అందరూ అనుకుంటున్నట్లుగా విసిపై చర్య తీసుకుంటే పరిస్థితి ఎలా అని సలహాదారులు పరిస్థితిని వివరించి వుంటారు. లాఠీలు తీయటం వుత్తమం అని చెప్పి వుంటారు.
అసలు అప్పారావు ఆకస్మికంగా విశ్వవిద్యాలయానికి రాత్రిపూట రానేల? వచ్చెను పో పోలీసులకు ముందుగా ఎందుకు తెలియచేయలేదు, తెలియచేయలేదు పో అప్పారావు వస్తే మూగి వాడి ముందు ముక్కు గీరినట్లుగా వుంటుందని పోలీసులకు తెలియదా ? తెలిసెను పో ముందస్తు చర్యలు తీసుకోకుండా ఏ గుడ్డి గుర్రానికి పళ్లు తోముతున్నట్లు ? తోమెను పో విద్యార్ధులపై అంతగా విరుచుకుపడాలా? అంతగా నోరు పారవేసుకోవాలా ? పారవేసుకుంటిరి పో తరువాత అయినా పరిస్థితి తీవ్రతను తగ్గించేందుకు తరువాత విద్యార్ధులు, ప్రొఫెసర్లపై బెయిలు రాని కేసులు పెట్టనేల, పెట్టెను పో నిండుపేరోలగములో కేంద్రప్రభుత్వ పాలకులకు నొప్పి తగల కుండా ఎలాంటి వెరపు లేకుండా సమర్ధించనేల…….అకటా ????
‘భారత మాతాకీ జై అనని వ్యక్తి విద్యార్ధుల గురించి మాట్లాడటమా ?’: ఎన్విఎస్ ప్రభాకర్(బిజెపి ఎంఎల్ఏ)
అబ్బ ! భలే చెప్పిండు కదా !!
అవధానంలో అప్రస్తుత ప్రసంగం అంటే ఇదే. చర్చ భారత మాత మీద కాదు. ప్రతిదానిని భారత మాత మీదకు మళ్లించే అజెండాలో భాగమైతే చెప్పండి నో ప్రాబ్లమ్. అసలింతకూ మీరు మహాత్మాగాంధీని జాతిపితగా గుర్తిస్తున్నారా లేక గాడ్సేను దేశభక్తుడిగా గుర్తిస్తున్నారా ? జాతిపితగురించి రాజ్యాంగంలో పేర్కొనలేదు అంటారా? భారత మాత కూడా అంతే కదా .మేకిండియా మీద కేంద్రీకరించకుండా బ్రేకిండియాపై కేంద్రీకరించారు. ఇదే అసలైన దేశ భక్తా? మర్చిపోయాను హైదరాబాదు విశ్వవిద్యాలయంలో జరిగిన దానికి అసలు కారకులు మీరే అని కదా విద్యార్ధి లోకం కోడై కూస్తున్నది.
‘భారత మాతాకి జై అనకపోయినా కొంత మందితో జై హింద్ అనిపిస్తున్నామంటే సైద్ధాంతిక పోరు మొదటి రౌండులో బిజెపి విజయం సాధించినట్లే ‘: అరుణ్ జైట్లీ
అబ్బ ! భలే చెప్పిండు కదా !!
అవునులే భారత మాత దాస్యశృంఖలాలతో వుంటే ఆంగ్ల మాతను ఆరాధించిన మీరు రెండు సంవత్సరాలు కూడా గడవక ముందే వైఫల్యాల బాట పట్టి దాన్ని దృష్టి మళ్లించేందుకు సైద్ధాంతిక పోరు ప్రారంభించారన్నమాట. భక్తి శివుడి మీద చిత్త చెప్పుల మీద అంటే ఇదేనా ! అవున్లే బ్రిటీష్ వారికి సావర్కర్ రాసిన లొంగుబాటు లేఖ కారణంగా స్వాతంత్య్ర వుద్యమ కాలంలో మీనోట స్వాతంత్య్రం మాట రాలేదు, భారత మాత దాస్యశృంఖలాలు మీకు కనపడలేదు. ఆ మాతను విముక్తి రాలిని చేసేందుకు ప్రాణత్యాగం చేసిన వారిలో మీ పూర్వీకులెవరూ లేరు. భరత మాత ముద్దు బిడ్డ సుందరయ్య అని కమ్యూనిస్టులు నిత్యం పాట పాడటం ఎప్పుడూ జెట్లీ విని వుండలేదేమో. భరత మాత అనే పదాన్ని తామే సృష్టించినట్లు దాని పేటెంట్ హక్కు కోసం పోరు జరిపినట్లు భలే బిల్డప్ ఇస్తున్నారులే. జైట్లీ మాదిరే పాతికేళ్ల క్రితం సోషలిజంపౖౖె పోరులో విజయం సాధించాం అని అమెరికా గర్వంగా చెప్పుకుంది. ఇప్పుడా అమెరికాలోనే ఎక్కడబడితే అక్కడ అవును మేం సోషలిస్టులం అని ప్రతి మూల నుంచీ యువకులు వస్తుండటంతో విజయం సాధించిన వారందరూ కమ్యూనిస్టులతో పెట్టుకొని తప్పు చేశామా అని తలలు పట్టుకుంటున్నారు. జైట్లీగారూ మీరు ప్రారంభించిన ఈ పోరులో తొలి విజయం సాధించినట్లు మీరు చెప్పుకుంటే దాన్ని స్వంత డబ్బా అంటారు. ఏమైనా దేశం ముందు సైద్దాంతిక యుద్ధాన్ని తెచ్చి ఎవరు ఎటో తేల్చుకోవాల్సిన పరిస్థితిని కల్పించారు. అందుకు మీకు అభినందనలు చెప్పక తప్పదు.
26 Saturday Mar 2016
Posted BJP, CPI(M), Current Affairs, INDIA, NATIONAL NEWS, Others
inTags
HCU, HCU Vice Chancellor, HRD ministry, Hyderabad Central University, Rohith Vemula, SITARAM YECHURY, students, University of Hyderabad (UoH), UoH
Following is the text of the memorandum that the CPI(M) General Secretary, Sitaram Yechury, is submitting to the President of India, when he meets Shri Pranab Mukherjee on 25th evening at 7.30.
Hon’ble President of India
Rashtrapati Bhawan
New Delhi
Dear Rashtrapathiji,
I am writing this letter to you with a deep sense of anguish regarding the ongoing developments in the Hyderabad Central University.
The honourable President of India is the Visitor of this central university. There is an ongoing dispute with the newly appointed Vice Chancellor. The students, faculty and the entire university community has been agitating for redressing the circumstances which led to the tragic suicide of a bright research scholar, Rohith Vemula. After this suicide, the Vice Chancellor proceeded on long leave and he suddenly surfaced and took charge on March 22. His resumption of charge was accompanied by a brutal police action against the students and the university community about which I am sure you are aware.
The demand for the removal of this particular Vice Chancellor by the university community is being met with such a police action which has continued on March 23 as well. The water connection to the hostels, access to wifi, food supplies to the hostel mess – all have been discontinued. When the students themselves organised the cooking of food for the inmates they were once again attacked by the police and all those facilities destroyed.
The reason I am writing to you is because on the issue of removal of the Vice Chancellor, the HRD ministry has officially stated to the media the following:
“Regarding the demand for the removal of the VC the ministry has conveyed the same to the Visitor who is the appointing authority.”
Regarding the police action the ministry says that this is an
“issue of law and order (that) comes under the jurisdiction of the state government”.
This was conveyed to the entire media in the country by the HRD spokesperson Ghanshyam Goel (as reported in the Hindu web edition of March 24, 2016). Further, the news agency ANI has also put out on social media and the electronic media the same explanation.
The honourable President of India, who is the visitor of the University has now been dragged into the controversy by the HRD ministry. Given this, I am approaching you to intervene in this situation to restore normalcy in this premier central university in our country. As of now some students are still in hospital with serious injuries. Twenty six students have been detained and are in judicial custody along with two members of the faculty. Thus a total of twenty eight persons are in jail.
Further, we are informed that the first decision taken by the Vice Chancellor upon his return was to defer the meeting of the Academic Council on Thursday (March 24), which was convened by the in-charge Vice Chancellor to discuss the setting up of an anti-discrimination committee on the campus, to ensure adequate representation of SCs and STs on various committees of the university and to consider the proposal to increase the non-NET fellowship from Rs. 8,000 to Rs. 25,000 per month on parity with the Junior Research Fellowship in the country. The in-charge Vice Chancellor has reportedly pleaded that he had no knowledge of the Vice Chancellor returning to assume charge of the university.
Following the tragic suicide of Rohith Vemula there was a case registered against the Vice Chancellor for aiding and abetting this suicide. Instead of proceeding on this case this gruesome attack on the university community was mounted by the police.
Since the honourable President of India as the Visitor of the Hyderabad Central University has been dragged into this controversy by the HRD ministry, I am approaching you to please intervene and ensure that the HCU Vice Chancellor who took a blatantly anti-dalit stand violating all established norms of social inclusion in the university must be removed forthwith. The case registered against him with the police must be proceeded with and justice must be delivered to the university community and the country.
I would also urge upon you to please intervene to ensure that the Human Resources Development ministry is not allowed to be converted into the Hindu Rashtra Development ministry.
Sd/-
(Sitaram Yechury)
General Secretary, CPI(M)
26 Saturday Mar 2016
Posted BJP, Current Affairs, INDIA, NATIONAL NEWS, RELIGION
inఎం కోటేశ్వరరావు
పండుగల సందర్భంగా శుభాకాంక్షలు తెలపటాన్ని కూడా మైనారిటీలను బుజ్జగించటంగా చిత్రించిన బిజెపి ఇప్పుడు అదే పని చేసి నవ్వుల పాలైంది. కడుపులో వుండాలి గాని కావిలించుకుంటే వస్తుందా అని పెద్దలు వూరికే చెప్పలేదు. గుడ్ ఫ్రైడే సందర్భంగా ఏకంగా ఐదుగురు కేంద్ర మంత్రులు, బిజెపి అధికార ప్రతినిధి క్రైస్తవులకు ‘శుభాకాంక్షలు’ తెలిపారు. వీటిని చూసి బిజెపిలోని క్రైస్తవులకు నవ్వాలో ఏడవాలో తెలియక తలలు పట్టుకున్నారు. గుడ్ ఫ్రైడే అంటే ఏసుక్రీస్తుకు శిలువవేసిన రోజు కనుక వుత్సవం జరుపుకోరు. ఆ రోజు సంతాపంగా క్రైస్తవులు ప్రార్ధనలు జరుపుతారు. అలాంటి రోజున శుభాకాంక్షలు తెలిపిన వారిలో మన కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి మహేష్ శర్మ , మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి నజ్మా హెప్తుల్లా కూడా వుండటం సిగ్గు చేటు. శర్మతో పాటు రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్రభు, పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, మరో మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్, బిజెపి అధికార ప్రతినిధి షా నవాజ్ హుస్సేన్ శుభాకాంక్షలు తెలిపిన వారిలో వున్నారు. అయితే వెంటనే తీవ్రమైన విమర్శలు, స్పందనలు రావటంతో వాటిని వుపసంహరించుకొని సందేశాలను సవరించి పంపారు.తమది సాంస్కృతిక సంస్ధ అని చెప్పుకొనే సంఘపరివార్ తన నేతలకు ఇతర మతాల గురించి ఎలాంటి సంస్కృతి పాఠాలను బోధిస్తున్నదో ఈ వుదంతం వెల్లడించింది.
ఇలాంటి సందేశాలను పంపటంలో బిజెపి నేతలే కాదు, ప్రతి సందర్భాన్ని సొమ్ము చేసుకోవాలని చూసే వ్యాపార సంస్ధలు కూడా కక్కుర్తి పడ్డాయి. ఫర్నిచర్ కంపెనీ అర్బన్ లాడర్, స్నాప్డీల్,మైంత్రా సంస్థలు ఆఫర్లు ప్రకటించాయి. తరువాత ఇవి క్షమాపణలు చెబుతూ తమ ఆఫర్లను వారాంతపు బహుమతులుగా మార్చాయి.
కేంద్రమంత్రులు,బిజెపి నేతల ఈ చర్యపై క్రైస్తవ సంఘాలు, సంస్ధలు సంయమనం పాటించాయి.గుడ్ ఫ్రైడే రోజును క్షమా దినంగా కూడా పరిగణిస్తార కనుక అలాంటి శుభ సందేశాలు పంపిన వారి పట్ల తమకెలాంటి కోపం లేదని, అయితే బిజెపికి మైనారిటీ మతాల వారి గురించి కనీస పరిజ్ఞానం కూడా లేదనటానికి ఇది ఒక నిదర్శనమని కొందరు వ్యాఖ్యానించారు. షా నవాజ్ హుస్సేన్కు క్రైస్తవం గురించి తెలియకపోతే కనీసం ఖురాన్ చదివి వున్నా తేడా తెలిసి వుండేదని ముస్లిం మత పెద్దలు వ్యాఖ్యానించారు.
మంత్రుల నిర్వాకంపై నెటిజన్లు తీవ్రంగా స్పందించారు.మంత్రులందరూ మోడీ విశ్వవిద్యాలయంలో పట్టాలు పుచ్చుకున్నారని వ్యంగ్య వ్యాఖ్యానాలు వెలువడ్డాయి. వెనుకటికి ఒక మోతుబరి బండిలో ప్రయాణిస్తూ వెనుక నడిచే సేవకులకు జాగ్రత్తలు చెబుతూ ఏవైనా పడితే తీసి బండిలో వేయమని చెప్పాడట. ఏం పడినా వేయమన్నారు కనుక విశ్వాససాత్రులైన సేవకులు యజమానితో పేచీ ఎందుకని ఎద్దులు వేసిన పేడను కూడా తీసి బండిలోకి విసిరారట. అలాగే షానవాజ్ హుస్సేన్ శుభాకాంక్షల ట్వీట్ చేయగానే సిద్ధంగా వున్న ఆయన అభిమానులు అదే శుభాకాంక్షలను పెద్ద సంఖ్యలో తమ అనుచరులకు పంపారు. అంటే వారికి కూడా కనీస ఆలోచన లేకపోయింది.
26 Saturday Mar 2016
Posted BJP, Congress, Current Affairs, INDIA, NATIONAL NEWS
inTags
Central government, Central government schemes, Central government schemes names, Narendra Modi sarkar, schemes
ఎంకెఆర్
ఎక్కిరించబోయి వెల్లకిలా పడినట్లు బిజెపి దాని మిత్రపక్షాల వ్యవహారం వుంది. ప్రస్తుతం భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసిఎఆర్) వ్యవసాయంలో మంచి ప్రతిభ కనపరిచిన రైతులకు అవార్డులు ఇస్తున్నది. వాటికి ఆర్ఎస్ఎస్, భారతీయ జససంఘ మాజీ నేత అయిన పండిట్ దీన దయాళ్ వుపాధ్యాయ పేరు పెట్టే విషయాన్ని పరిశీలించమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధా మోహన్ ఆ సంస్ధ అధికారులను కోరినట్లు పిటిఐ వార్తా సంస్ధ తెలిపింది. ఇప్పటికే కొన్ని పధకాలు, సంస్ధలకు ఆ పేరు పెట్టారు. పేర్లు పెట్టటమా లేదా , వున్న పేర్లు మార్చటమా, వాటికి తమకు అనుకూలమైన పేర్లు తగిలించటమా అన్నది ఆయా ప్రభుత్వాల విచక్షణకు సంబంధించిన ఒక వివాదాస్పద అంశం. ఏకంగా రంగులే మార్పించవచ్చు, ఏ అడ్డగోలు పని అయినా చేయవచ్చని ఇంతకాల అనుభవం తెలియ చేస్తున్నది. ఇక్కడ సమస్య ఏమంటే ప్రతి పధకానికి తమ నేతల పేర్లు పెట్టి లబ్ది పొందుతున్నాయని కాంగ్రెస్ ప్రభుత్వాలపై బిజెపి, దాని మిత్రపక్షాలు ఇంతకాలం నానా యాగీ చేశాయి. అల్లుడికి బుద్ది చెప్పి మామ అదే తప్పుడు పని చేశాడన్నట్లుగా అదే పని అవి చేస్తున్నాయి. ఎవరైనా ఒక మంచి సంప్రదాయాన్ని ప్రవేశపెడితే దాన్ని ఎవరైనా హర్షిస్తారు.తాము విమర్శించిన దానినే తాము చేసేవారిని ఏమనాలి ? ఆత్మ హత్యలు చేసుకున్న రైతుల దుస్దితిని నివారించేందుకు ఇంతవరకు ఎలాంటి నిర్ధిష్ట చర్యలూ లేవు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న ఎన్నికల వాగ్దానాన్ని అమలు జరిపేందుకు అసలు ప్రయత్నమే లేదు. కానీ రైతులకు ఇచ్చే అవార్డులకు మాత్రం తమ నాయకుల పేర్లు పెట్టేందుకు మాత్రం ఎక్కడ లేని తహ తహ !
మహారాష్ట్రలో బిజెపి-శివసేన సంకీర్ణ ప్రభుత్వం వున్నది. జనవరి నెలలో ఒక ఐదు పధకాలకు పెట్టిన పేర్లు ఎలా వున్నాయో చూడండి.1.హిందూహృదయ సామ్రాట్ శివసేన ప్రముఖ్ బాలా సాహెబ్ థాకరే కన్యాదాన యోజన. ఈ పధకం కింద రాష్ట్ర రవాణాసంస్ధ వుద్యోగుల ఆడపిల్లలకు 21 సంవత్సరాలు నిండిన తరువాత లక్ష రూపాయలు ఇస్తారు.2.హిందూహృదయ సామ్రాట్ శివసేన ప్రముఖ్ బాలా సాహెబ్ థాకరే అప్గత్ సహాయ నిధి యోజన. ఆర్టిసి బస్సు ప్రమాదాలలో గాయపడిన, వికలాంగులైన, మరణించిన ప్రయాణీకులకు పరిహారం అందచేసే పధకమిది.3.హిందూహృదయ సామ్రాట్ శివసేన ప్రముఖ్ బాలా సాహెబ్ థాకరే ఆటోమొబైల్ ఇంజనీరింగ్ కాలేజి.4.హిందూహృదయ సామ్రాట్ శివసేన ప్రముఖ్ బాలా సాహెబ్ థాకరే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి.5.హిందూహృదయ సామ్రాట్ శివసేన ప్రముఖ్ బాలా సాహెబ్ థాకరే నిరాధార్ స్వావలంబన్ యోజన.దీని కింద ఆత్మహత్యలు చేసుకున్న రైతుల భార్యలకు ఆర్ధిక సాయం, ఆటో రిక్షాలు నడుపుకొనేందుకు పర్మిట్లు ఇస్తారు.
ఒక మతం, పార్టీ పేరును ఏకంగా ప్రభుత్వ పధకానికి పెట్టిన బిజెపికి ఇతర పార్టీలను విమర్శించేందుకు ఎలాంటి నైతిక హక్కు వుంటుంది. ఇది లౌకిక రాజ్యమా, మత రాజ్యమా ? గతంలో వున్న కొన్ని సంక్షేమ పధకాల పేర్లను మార్చిన నరేంద్రమోడీ సర్కార్ వాటికి ప్రధాన మంత్రి అనే పేరును తగిలించింది. అది కూడా ప్రధానిగా నరేంద్రమోడీ ఖాతాలోకి ఆ ఖ్యాతిని బదలాయించే దూరాలోచన వున్నప్పటికీ ఆమోదనీయమే. నరేంద్రమోడీ అధికారానికి రాక ముందు బిజెపి మిత్రపక్షమైన పంజాబ్ అకాలీదళ్ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్ నాటి కేంద్ర ప్రభుత్వమైన యుపిఏపై ధ్వజమెత్తారు. కేంద్రం అమలు జరుపుతున్న పధకాలకు పేర్లు, ఫొటోలు పెట్టటంపై రాష్ట్రాలకు షరతులు విధించటంపై ఆయన ధ్వజమెత్తారు. రాష్ట్రాల నుంచి వసూలు చేసిన నిధులు తప్ప కేంద్రానికి ప్రత్యేకంగా ఆ పధకాలకు నిధులు ఎక్కడివని ఆయన ప్రశ్నించారు.
కొద్ది వారాల క్రితం ఒడిషాలోని పారాదీప్ ఐఓసి చమురుశుద్ధి కర్మాగారాన్ని ప్రారంభించేందుకు ప్రధాని వచ్చిన సందర్బంగా దాన్ని బిజెపి కార్యక్రమం మాదిరిగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించటం వివాదాస్పదమైంది. కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకుపోయే పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్రమోడీ పెద్ద బొమ్మ, దాని పక్కనే పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బొమ్మలతో కూడిన వ్యాన్లను ఒడిషా అంతటా తిప్పారు. ప్రధాని వస్తున్న సందర్భంగా బిజెపి తన స్వంత నిధులతో ఎలాంటి ప్రచారం చేసుకున్నా ఎవరికీ ఇబ్బంది లేదు. ఒక ప్రతిపక్ష పార్టీ అధికారంలో వున్న రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ ఖర్చుతో పార్టీ ప్రచారాన్ని తలపించే విధంగా ప్రచారం చేయటం కక్కుర్తి తప్ప వేరే కాదు.ఈ చర్యను స్ధానిక బిజెపి నాయకత్వం సమర్ధించుకుంది. ‘ వారు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ పధకాలన్నింటినీ హైజాక్ చేశారు. వారి చర్యలను మేము ప్రజల దృష్టికి తీసుకు వస్తుండటంతో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాన్నే హైజాక్ చేసేందుకు పూనుకున్నారని’ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు వసంత పాండా ఆరోపించారు. తప్పులెన్నువారు తమ తప్పు లెరుగరు అంటే ఇదేనా ?
25 Friday Mar 2016
Posted BJP, Communalism, Congress, Current Affairs, INDIA, NATIONAL NEWS, RELIGION
inఎం కోటేశ్వరరావు
నువ్వొకందుకు పోస్తే నే ఒకందుకు తాగా అన్నట్లుగా సంఘపరివార్ ఎందుకు ప్రారంభించినప్పటికీ దేశానికి ఒక విధంగా మంచే జరుగుతోంది. దాని నాయకుల నిజరూపాలు దేశం ముందుంచటానికి మరొక అవకాశం ఇచ్చారు. కొలిమిలో ఇనుము బాగా కాగినపుడే దెబ్బ వేయాలన్నట్లుగా దేశంలో దేశ భక్తి, దేశద్రోహుల గురించి జరుగుతున్న చర్చ అనేక మందికి కొత్త విషయాలు తెలియచేస్తోంది. వీడియోలను ఎలా మార్చివేస్తారో అవగతం అయింది. గత లోక్సభ ఎన్నికల సందర్భంగా నరేంద్రమోడీ ఎంతటి సాదాసీదా మనిషో అని జనంలో సానుభూతి పెంచటానికి మరుగుదొడ్లు శుభ్రం చేస్తున్న నరేంద్రమోడీ అంటూ ఒక ఫొటోను సామాజిక మీడియాలో పెట్టారు. 1988లో ఆయనొక సాధారణ వ్యక్తిగా వున్నపుడు రైల్వే స్టేషన్లో చాయ్ అమ్ముకున్నంత సేపు అమ్మి, మిగిలిన సమయాలలో చీవుర్లు పట్టి ఇళ్లను కూడా శుభ్రం చేసిన కష్టజీవి అని బిజెపి మద్దతుదార్లు ఆ చిత్రాన్ని దేశం మీదకు వదిలారు. అసలు వాస్తవం ఏమంటే అదే ఏడాది ఆయన గుజరాత్ రాష్ట్ర బిజెపి కార్యనిర్వాహక కార్యదర్శిగా ఎన్నికయ్యారు. నరేంద్రమోడీ మీద వున్న మోజులో ఆభిమానులు వుబ్బితబ్బుయ్యారు. భక్తులు పులకరించి పోయారు. అప్పుడే అనేక మంది ఆ చిత్రం గురించి ప్రశ్నించినా మోడీ గాలిలో ఎవరూ ఖాతరు చేయలేదు. అహమ్మదాబాదుకు చెందిన ఒక సమాచార హక్కు కార్యకర్త అడిగిన ప్రశ్నతో ఆ ఫొటో నకిలీ అని దానిలో వున్న వ్యక్తి నరేంద్రమోడీ కాదని, ఫొటోను మార్చి అలా తయారు చేశారని తేలింది.
ఇప్పుడు మరొక అంశం బయటకు వచ్చింది. కాంగ్రెస్ పార్టీ భగత్ సింగ్-ఆర్ఎస్ఎస్ నేత సావర్కర్ చిత్రాలను పక్కపక్కనే పెట్టి అమరజీవులు- విద్రోహులు అనే శీర్షికతో సామాజిక మాధ్యమంలో విడుదల చేసింది. బ్రిటన్-భారత్ మధ్య యుద్ధం జరుగుతోంది. రెండవది మేం దానిలో పాల్గొన్నాం అందువలన మేము యుద్ధ ఖైదీలం అని బ్రిటీష్ ప్రభుత్వానికి భగత్ సింగ్ రాసిన చివరిలో పేర్కొన్న అంశాన్ని భగత్ సింగ్ పొటో కింద పెట్టారు. బ్రిటీష్ ప్రభుత్వం తనకు క్షమాభిక్ష పెట్టాలని, దాను ఆంగ్లేయులకు విధేయతతో వుంటానని సావర్కర్ రాసిన లేఖాంశాలను ఆయన ఫొటో కింద పెట్టారు. దాని మీద నిక్కర్ల బదులు పాంట్లు తొడుక్కోవాలని కొత్తగా నిర్ణయించుకున్న ‘స్వదేశీ’ (పాంట్లు భారతీయ దుస్తులా,ఏ చక్రవర్తీ వేసుకున్నట్లు మనకు కనిపించదు) సంఘపరివార్ యంత్రాంగం మా నేతను ఇంత మాట అంటారా అంటూ అగ్గిమీద గుగ్గిలం అవుతోంది. ‘ అతను తెలివి గలవ్యక్తి, అతను ధైర్యశాలి, అతను ఒక దేశ భక్తుడు, వర్తమాన ప్రభుత్వ వ్యవస్థ రూపంలో దాగి వున్న దుష్టశక్తిని నేను గుర్తించటానికి చాలా ముందే ఆయన గుర్తించారు.ఆయన ప్రేమించిన దేశం బాగుండాలని కోరుకున్నందుకు అండమాన్ వెళ్లాల్సి వచ్చింది. న్యాయమైన ప్రభుత్వంలో అయితే ఆయనొక వున్నతమైన పదవిలో వుండే వారు’ అని మహాత్మాగాందీ పేర్కొన్నట్లు చాలా కాలంగా సంఘపరివార్ ప్రచారంలో పెట్టింది. ఈ మాటలు 1921జూన్ 18వ తేదీ యంగ్ ఇండియా పత్రికలో రాసినట్లు బిజెపి తన చిత్రాలలో పెట్టింది. అయితే దీని మీద అనుమానం వచ్చిన ప్రతీక్ సిన్హా అనే గుజరాత్ జర్నలిస్టు పరిశీలించి అసలు ఆ తేదీతో యంగ్ ఇండియా సంచికే లేదని 1921 జూన్ ఒకటి, ఎనిమిది, పదిహేను, ఇరవై రెండు, ఇరవై తొమ్మిదవ తేదీలతో ఐదు సంచికలు వున్నట్లు పేర్కొన్నారు. తాను 15, 22వ తేదీ సంచికలను చూశానని తనకెక్కడా సావర్కర్ గురించి ప్రస్తావన గానీ, ))ఆ మాటలు కనపడలేదని తెలిపారు. మహాత్మాగాంధీకి ఆపాదించిన ఈ మాటల గురించి ఇంటర్నెట్లో గూగులమ్మను అడగ్గా రెండు ఫలితాలు కనిపించాయని అవి రెండూ కూడా ఆర్ఎస్ఎస్ లేదా హిందూత్వ ప్రచార సైట్లని సిన్హా పేర్కొన్నారు.
24 Thursday Mar 2016
Posted BJP, Current Affairs, Education, INDIA, NATIONAL NEWS, Others
inఎంకెఆర్
హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయంలో కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే కేంద్ర ప్రభుత్వం విద్యార్ధులతో అమీ తుమీ తేల్చుకొనేందుకే సిద్ధం అయినట్లు కనిపిస్తోంది.అందుకు కెసిఆర్ కూడా సై అన్నట్లు పరిణామాలు కనిపిస్తున్నాయి. ఇంఛార్జి వైస్ ఛాన్సలర్కు సైతం తెలియకుండా సెలవుపై వెళ్లిన వైస్ ఛాన్సలర్ పొదిలె అప్పారావు ఆకస్మికంగా విశ్వవిద్యాలయంలో ప్రత్యక్షం కావటం యాదృచ్చికంగా జరిగిందని ఎవరూ అనుకోవటం లేదు.జెఎన్యు విద్యార్ధి సంఘ నాయకుడు కన్నయ్య కుమార్ హైదరాబాద్ పర్యటనకు వస్తున్న విషయమేమీ రహస్యం కాదు. దానికి ముందుగానే వైస్ ఛాన్సలర్ అకస్మికంగా ప్రత్యక్షం కావటం కన్నయ్యను విశ్వవిద్యాలయంలో అడుగు పెట్టకుండా చేయటానికే అన్నది సుస్పష్టం. తన ఆందోళన ప్రస్తానంలో విద్యార్ధులను ఎంతగానో వుపయోగించుకున్న తెలంగాణా ముఖ్య మంత్రి కె చంద్రశేఖరరావు కనుసన్నలలో పనిచేసే పోలీసు యంత్రాంగం వివాదాస్పద వైస్ ఛాన్సలర్కు మద్దతుగా విద్యార్దుల పట్ల వ్యవహరించిన తీరు చూస్తే ఓడమల్లయ్య బోడి మల్లయ్యను గుర్తుకు తెస్తున్నారు. తెలంగాణా ప్రభుత్వ మద్దతు లేకుండా వైస్ ఛాన్సలర్ తిరిగి విశ్వవిద్యాలయంలో అడుగు పెట్టే సాహసం చేసి వుండరని లోకం కోడై కూస్తున్నది.
ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో విద్యార్ధులపై దేశ ద్రోహ నేరం మోపేందుకు బహుశా బ్రిటీష్ పాలకులు కూడా సిగ్గుపడే విధంగా వీడియోలను తిమ్మిని బమ్మిని చేసి చేతులు కాల్చుకున్న కేంద్ర ప్రభుత్వం అది కాస్త చల్లబడగానే హైదరాబాదులో మరో అధ్యాయానికి తెరతీసింది. వైస్ ఛాన్సలర్ పొదిలె అప్పారావుకు తిరిగి బాధ్యతలు అప్పగించటం ద్వారా విద్యార్ధులను రెచ్చగొట్టింది. వైస్ ఛాన్సలర్పై కేసులు నమోదు చేయాలన్న విద్యార్ధుల డిమాండ్లను పట్టించుకోని తెలంగాణా ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం సదరు అప్పారావు కబురు చేయగానే తగుదునమ్మా అంటూ విద్యార్ధులపై తన ప్రతాపం చూపింది. చివరకు అమ్మాయిలను కూడా మగ పోలీసులు వదలి పెట్టలేదు. బూతులు తిట్టకపోతే పోలీసులే కారు అని మరోసారి నిరూపించుకున్నారు. అతని కంటే ఘనుడు ఆచంట మల్లన అన్నట్లు తెలంగాణా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు రుజువు చేసుకున్నారు. ఆయన ప్రధాని నరేంద్రమోడీతో సఖ్యతగా వుండాలనుకుంటే అది వేరే విషయం, కానీ అందుకు చూశారా విద్యార్ధులపై ఎలా లాఠీని ఝళిపించానో అంటూ మోడీని సంతృప్తి పరచేందుకు ప్రయత్నించటం అన్యాయం. ఇప్పటి వరకు దేశమంతా కేంద్ర ప్రభుత్వ వైఖరిపైనే తన నిరసనను కేంద్రీకరించింది, ఇప్పుడు దానిలో కూడా వాటా కావాలని చంద్రశేఖరరావు కోరుకుంటునట్లున్నారు. వైస్ ఛాన్సలర్ తిరిగి వస్తే శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందనే అంశం పోలీసులకు తెలియదా ? వైస్ ఛాన్సలర్ రాక సందర్భంగా జరిగాయని చెబుతున్న వుదంతాలే అందుకు నిదర్శనం.అటువంటపుడు ఆయన వస్తే జరిగే పరిణామాలకు తమది బాధ్యత కాదని కేంద్రానికి తెలంగాణా సర్కార్ ఎందుకు చెప్పలేకపోయింది? ఆ వుదంతాలను ఎందుకు నిరోధించలేకపోయింది? పోనీ తగిన భద్రతా సిబ్బందిని నియమించి ముందస్తు జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదు? న్యూఢిల్లీ పోలీసు అంటే కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో వుంది కాబట్టి జెఎన్యు విద్యార్ధుల పట్ల అనుచితంగా ప్రవర్తించటానికి కేంద్ర ప్రభుత్వ వత్తిడి కారణం కావచ్చు. కానీ హైదరాబాదు పోలీసులు కూడా అదే పని చేస్తారని బహుశా విద్యార్ధులు వూహించి వుండరు.
విద్యార్ధులకు తగిన ‘పాఠం’ చెప్పేందుకు ఎంతో అనుభవం వున్న వైస్ ఛాన్సలర్ హాస్టళ్లు,మెస్లను మూసి వేసి, ఇంటర్నెట్ను కట్ చేసి తానంటే ఏమిటో రుజువు చేసుకున్నారు. బహుశా దేశభక్త ఎబివిపి విద్యార్ధులకు ప్రత్యేక ఏర్పాట్లు చేసి వుంటారు, లేదా బయటి నుంచి సాయం తీసుకొని వుండాలి. తిరిగి వస్తూనే ఈనెల 24న జరగాల్సిన అకడమిక్ కౌన్సిల్ సమావేశాన్ని వాయిదా వేయటం ఆయన చేసిన తొలి ఘనకార్యంగా చెబుతున్నారు. ఆ సమావేశంలో వివక్ష వ ్యతిరేక కమిటీ ఏర్పాటు, వివిధ కమిటీలలో ఎస్సి,ఎస్టిల ప్రాతినిధ్యాన్ని పెంచటం, నాన్ నెట్ ఫెలోషిప్ ఎనిమిది నుంచి 25వేలకు పెంచే ప్రతిపాదనను పరిశీలించటం వంటి అంశాలు అజెండాగా వున్నాయి. అలాంటి ముఖ్యమైన సమావేశాన్ని వాయిదా వేయటం వుద్రిక్తతలను వుపశమించటానికి గాక మరింత ఎగదోయటానికే తోడ్పడతాయి.
హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో జరిగిన తాజా వుదంతాలలో బోధనేతర సిబ్బందిని విద్యార్ధులకు వ్యతిరేకంగా నిలబెట్టేందుకు ప్రయత్నించటం కొత్త , ప్రమాదకర పరిణామం.వైస్ ఛాన్సలర్ నివాసంపై విద్యార్ధులు దాడి చేశారనే ఆరోపణతో బోధనేతర సిబ్బంది ఆందోళనకు దిగటం, మెస్లను మూసివేయటం సరైన చర్య అవుతుందా? అది సమర్ధనీయమే అనుకుంటే విద్యార్ధుల పట్ల వైస్ ఛాన్సలర్ అనుసరించిన వైఖరి,వాటి పర్యవసానాలకు కూడా వారు బాధ్యత వహిస్తారా ? ఇది విశ్వవిద్యాలయంలో పరిస్థితులు మరింత దిగజారటానికి దారితీయ వచ్చు. బోధనేతర సిబ్బంది-విద్యార్ధులు ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. పంచాయతీ వారి మధ్య కాదు, వున్నతాధికారులు-విద్యార్ధుల మధ్య కనుక విచక్షణతో వ్యవహరించటం అవసరం.