అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సిరిల్ రాంఫొసా
‘దక్షిణాఫ్రికాలో భూ స్వాధీనాలు, పెద్ద ఎత్తున రైతాంగ హత్యలూ జరుగుతున్నాయి, వాటి గురించి సునిశితంగా అధ్యయనం చేయండి’ అంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన విదేశాంగ మంత్రి మైక్ పోంపియోను ఆగస్టు 22న ఆదేశించటంతో ఒక్కసారిగా దక్షిణాఫ్రికా భూసమస్య ప్రపంచ మీడియా దృష్టిని ఆకర్షించింది. ఒక సర్వసత్తాక దేశ అంతర్గత వ్యవహారాలలో, భూ సంస్కరణలకు వ్యతిరేకంగా ఇంత బహిరంగంగా జోక్యం చేసుకొనేందుకు పూనుకోవటం అమెరికా తెంపరి తనానికి నిదర్శనం. కొద్ది రోజుల క్రితం మితవాద మేథావి మరియన్ టపీ భూ స్వాధీనాలపై దక్షిణాఫ్రికాను హెచ్చరించండి అంటూ ట్రంప్ను కోరుతూ ఒక వ్యాసం రాశాడు. శ్వేతజాతి రైతులను చంపుతున్నారు, వారి భూములను లాక్కుంటున్నారు అంటూ అమెరికా మీడియాలో రెచ్చగొడుతున్నారు. భూ సంస్కరణలను వ్యతిరేకించే శ్వేతజాతీయులతో కూడిన ఆఫ్రీఫోరమ్ ప్రతినిధులు జూన్లో అమెరికా వచ్చి అనేక మందిని కలిశారు, మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ట్రంప్ చర్యను దక్షిణాఫ్రికాలో అనేక మంది తీవ్రంగా ఖండించారు. దేశ ఉపాధ్యక్షుడు మబుజా ఒక ప్రకటన చేస్తూ భూ సంస్కరణలు సామాజిక, జాతి విభజన ఫలితాలు కాదని స్పష్టం చేశారు.
భూ సమస్య ముందుకు రావటం గురించి పలు వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. కొందరు దీనిని రాబోయే ఎన్నికల గారడీగా భావిస్తున్నారు. భూ సంస్కరణలు జరగాలన్నది సాధారణ ఏకాభిప్రాయం. ఎలా అన్నదానిపై తేడాలున్నాయి. పాతికేండ్లుగా తేల్చుకోలేని స్ధితి. జాత్యహంకార, వలసపాలనలో భూముల నుంచి స్థానికులను వెళ్లగొట్టి వలస వచ్చిన శ్వేతజాతీయులు ఆక్రమించుకున్నారు. 1994లో శ్వేతజాతి దురహంకార పాలన అంతమై ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ నాయకత్వంలో త్రిపక్ష కూటమి అధికారానికి వచ్చేనాటికి తొమ్మిదిశాతం శ్వేత జాతీయుల చేతిలో 90శాతం భూమి కేంద్రీకృతమై ఉంది. భూ పంపిణీ అన్నది ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీ ప్రకటించిన ప్రధాన కార్యక్రమాలలో ఒకటి. స్ధానిక ఆఫ్రికన్లను కొన్ని ప్రాంతాలకు పరిమితం చేసిన శ్వేతజాతి ప్రభుత్వం 1913లో చేసిన ఒక చట్టం ప్రకారం నల్లజాతీయులైన ఆఫ్రికన్లు ‘శ్వేత దక్షిణాఫ్రికా’లో భూములు కొనుగోలు చేసేందుకు లేదా కౌలుకు తీసుకొనే అవకాశాన్ని కోల్పోయారు, భూముల నుంచి గెంటివేతకు గురయ్యారు.
దేశాధ్యక్షుడు సిరిల్ రాంఫొసా తాజాగా ఒక పత్రికకు భూసమస్యపై రాసిన వ్యాసం సారాంశం ఇలా వుంది. గ్రామీణాభివృద్ధి, భూ సంస్కరణల శాఖ జరిపిన భూ తనిఖీ లెక్కల ప్రకారం 90శాతం భూమి వ్యక్తులు, ట్రస్టులు, కంపెనీల చేతిలో ఉంది. పదిశాతం ప్రభుత్వానికి చెందినది. తొంభైశాతం భూమిలో వ్యక్తుల వద్ద 39, ట్రస్టులకు 31, కంపెనీలకు 25శాతం వుంది. వ్యవసాయ క్షేత్రాలు, భూములు కేవలం ఏడుశాతం యజమానుల చేతుల్లో ఉన్నాయి. ఈ ఏడుశాతంలో 72శాతం శ్వేతజాతీయులు, 15శాతం రంగు జాతీయులు (మన దేశంలో ఆంగ్లో ఇండియన్ల మాదిరి స్ధానిక ఆఫ్రికన్లు, శ్వేతజాతీయులు, భారత జాతీయుల సంకరంతో కలిగిన జనాభా), ఐదుశాతం భారతీయ సంతతి, నాలుగుశాతం ఆఫ్రికన్లు ఉన్నారు. ట్రంప్ ప్రకటన విషయానికి వస్తే ఉత్తర రాష్ట్రంలో ప్రయివేటు భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నదన్న వార్తల పూర్వరంగంలో వెలువడింది. ప్రభుత్వ రేటు ప్రకారం రెండు కోట్ల రాండ్లు తీసుకొని భూమిని స్వాధీనం చేయాలని స్థానిక అధికారులు ఒక యజమానిని కోరారు. అయితే తనకు 20కోట్ల రాండ్లు ఇవ్వాలని అతను తిరస్కరించటంతో చట్టనిబంధనల ప్రకారం స్వాధీనం చేసుకొనేందుకు పూనుకున్నారు.
ముఫ్పైశాతం భూమిని ఐదేండ్లలో పంపిణీ చేయాలన్నది 1994లో తొలి ప్రజాస్వామిక ప్రభుత్వం ఏర్పడిన తరుణంలో చేసిన వాగ్దానం. దానిలో ఇప్పటి వరకు పదిశాతం కూడా జరగలేదని 2014వరకు విధించిన గడువును 2024 వరకు పొడిగించనున్నట్టు వార్తలు వచ్చాయి. అంటే పాతికేండ్లలో చేసిందేమీ లేదన్నది చేదు నిజం. ఆఫ్రికన్లలో విపరీతంగా ఉన్న నిరుద్యోగం, పాతికేండ్లుగా అనుసరిస్తున్న నయావుదారవాద విధానాల వలన ఉపాధి అవకాశాలు పెరగకపోవటం వంటి అనేక కారణాలతో జనంలో అసంతృప్తి నానాటికీ పెరుగుతున్నది. అవినీతి, అక్రమాల కారణంగా ఏకంగా ఒక దేశాధ్యక్షుడు జాకబ్ జుమా కొద్ది నెలల క్రితం పదవి నుంచి తప్పుకోవాల్సి రావటం అక్కడి పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. జుమాను తొలగించకపోతే తాము సంకీర్ణ కూటమి నుంచి వైదొలుగుతామని కమ్యూనిస్టు పార్టీ హెచ్చరించాల్సి వచ్చింది. అవినీతి విషయంలో పట్టుబట్టిన మాదిరి ఇతర ప్రజావ్యతిరేక విధానాలు లేదా భూ సంస్కరణల వంటి వాటి విషయంలో కమ్యూనిస్టు పార్టీ అలాంటి వత్తిడి పాలక కూటమి మీద తీసుకురాలేదన్న విమర్శలు ఉన్నాయి. అయితే అంగీకృత విధానాల నుంచి కూటమి నాయకురాలైన ఏఎన్సీ దూరంగా వ్యవహరిస్తున్నందున వచ్చే ఎన్నికలలో తాము అవసరమైతే వంటరిగా బరిలోకి దిగుతామని కమ్యూనిస్టు నేతలు హెచ్చరించారు. ఒక వేళ అదే జరిగితే భూ సంస్కరణలు ఎన్నికల సమస్యగా మారే అవకాశం లేకపోలేదు. కూటమి ఐక్యంగానే ఉన్నప్పటికీ జనం నుంచి వస్తున్న వత్తిళ్లు, నిరుద్యోగం, సాధికారత వంటి అంశాల కారణంగా భూ సంస్కరణలను వ్యతిరేకించే వారు, అనుకూలించే వారుగా ఎన్నికలలో చీలిపోయే అవకాశాలు కూడా లేకపోలేదు.
ఎలాంటి పరిహారం లేకుండా పరిమితులు దాటిన భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని తిరిగి పంపిణీ చేసే విధంగా చట్ట సవరణ చేయనున్నట్టు అధ్యక్షుడు రాంఫొసానే ప్రకటించారు. 25వేల ఎకరాలకు పైబడి ఉన్న వారి నుంచి మాత్రమే పరిహారం చెల్లించకుండా భూములు తీసుకుంటామని ఏఎన్సీ అధ్యక్షుడు మంతాషే చేసిన ప్రకటన అనేక మందిలో చలనం కలిగించింది. పరిమితికి మించి వున్న భూములను అమ్ముకొనేందుకు ప్రయత్నించగా కొనే వారు కరువయ్యారు. దాంతో ప్రభుత్వ రేటుకు పదిహేను నుంచి ఇరవై రెట్లు అదనంగా ఇస్తేనే తాము భూములు వదులుకుంటామని కొందరు పట్టుబడుతున్నారు. భూములన్నీ శ్వేతజాతీయుల చేతిలో ఉండటంతో ప్రభుత్వ చర్యలు కూడా సహజంగానే వారికి వ్యతిరేకంగానే ఉంటాయి. దీంతో ఆ సమస్యకు రంగు పూసి జాతి వివక్షగా చిత్రించేందుకు పూనుకున్నారు. ట్రంప్ ట్వీట్ కూడా దానినే ప్రతిబింబించింది. స్వాభావికంగానే పెట్టుబడిదారీ వర్గం భూసంస్కరణలను సమర్ధిస్తుంది. దాని వస్తువులకు మార్కెట్ పెరగాలంటే జనం కొనుగోలు శక్తి పెరగాలి, అందుకుగాను భూ కేంద్రీకరణ ఒక ఆటంకం. ఒక వైపు కంపెనీ వ్యవసాయం లాభసాటి అంటూ ఆ వైపు ప్రోత్సహిస్తూనే మరోవైపు భూ పంపిణీని కూడా ప్రపంచబ్యాంకు సమర్ధించుతుండటం మిత్రవైరుధ్యానికి నిదర్శనం. విప్లవాత్మకంగా భూసంస్కరణలను అమలు జరిపే ఉద్దేశ్యం ఏఎన్సీ ప్రభుత్వానికి ఉంటే నిజానికి ఎప్పుడో పరిహారంతో నిమిత్తం లేకుండా సీలింగ్ దాటిన భూములను స్వాధీనం చేసుకొని రైతాంగానికి పంచి ఉండేది. కారణాలు ఏమైనా కొన్ని చర్యలు తీసుకోక తప్పక పోవటంతో భూస్వాముల ప్రతినిధులు పాతపడిన, పాచి పాటలు పాడటం ప్రారంభించారు. అనిశ్చిత పరిస్థితులు ఏర్పడటంతో అవి స్పష్టమయ్యే వరకు యజమానులు వ్యవసాయ పెట్టుబడులు పెట్టటం ఆలస్యం లేదా నిలిపివేస్తారు. దాని వలన ఈలోగా కార్మికుల వేతనాలు తగ్గిపోతాయి. పెట్టుబడి తగ్గితే ఆ మేరకు నిజ ఆదాయాలు, ఉత్పత్తి, దిగుబడులు పడిపోతాయి. మాంద్యం తలెత్తుతుంది. పెట్టుబడులు కలిగిన నిపుణులు, తెలివి తేటలు కలిగిన శ్వేతజాతీయులందరూ, తమ పరిజ్ఞానంతో సహా దేశం వదలి పోతారు. భూముల స్వాధీనం కారణంగా విదేశీ పెట్టుబడిదారులు తమ మదుపు మొత్తాలను వెనక్కు తీసుకుంటారు. అదింకెన్నటికీ తిరిగి రాదు. రాజకీయంగా చూస్తే భూ స్వాధీనం పాలక పార్టీకి మంచిదేమో గానీ ఆర్థిక విధానాల రీత్యా చాల చెడుచేస్తుంది. ఇలాంటి కబుర్లతో భయపెట్టాలన్నది వృధా ప్రయత్నమే. నష్ట పరిహారం లేకుండా భూ స్వాధీనం గురించి ఇంతవరకు చట్ట సవరణే చేయలేదు. చేస్తామని ప్రకటించగానే అప్పుడే భూములు లాగేసుకున్నట్టు, శ్వేతజాతి రైతులపై దాడులు, హత్యలు చేస్తున్నట్టు అంతర్జాతీయంగా నానా యాగీ చేస్తున్నారు.
దక్షిణాఫ్రికాలో వ్యవసాయ సమస్య కీలకమైనదే. అక్కడి జనాన్ని భూముల నుంచి వెళ్లగొట్టి వాటిని స్వాధీనం చేసుకున్నవారు పెట్టుబడిదారీ పద్ధతుల్లో వ్యవసాయం, గనుల తవ్వకం వంటి వాటిని అభివృద్ధి చేశారు. జనాన్ని దోపిడీ, అణచివేతలకు గురిచేశారు. వ్యవసాయ పంటల ఉత్పత్తి, సంపదసృష్టి, వన్యప్రాణి రక్షణ, కనీస సదుపాయాలతో జన నివాసాల ఏర్పాటు అన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. జాత్యహంకార పాలన పోయింది తప్ప ఆ పాలనలో గట్టిపడిన ఆస్తి, యాజమాన్య సంబంధాలలో పెద్ద మార్పు రాలేదు. వాటి స్థానంలో నల్లజాతీయుల పెత్తనం అంటే తెల్లజాతి పెట్టుబడిదారుల స్థానంలో నల్లజాతి పెట్టుబడిదారులను పెంపొందించాలనే వైఖరులు కూడా అక్కడ కొన్ని తరగతుల్లో బలంగా ఉన్నాయి. 1994తరువాత వచ్చిన అవకాశాలను అందుకు వినియోగించుకోవాలని చూసే వారు ఉన్నారు. అనేక మంది ఇప్పటికే ఆ క్రమంలో బలంగా తయారయ్యారు. వారు శ్వేతజాతి పెత్తనాన్ని వ్యతిరేకిస్తారు తప్ప పెట్టుబడిదారీ విధానాన్ని, నయా వుదారవాద విధానాలను కాపాడేందుకు పూనుకుంటారు. గత 25ఏండ్లలో కార్మికవర్గంపై జరిగిన దాడులే అందుకు నిదర్శనం. పెట్టుబడిదారీ ఉత్పత్తి సంబంధాలతో జాత్యహంకారాన్ని, సామాజిక అసమానతలను దూరం చేయటం, దోపిడీ, స్త్రీ పురుష వివక్షను రూపు మాపటం జరిగేది కాదు. తెల్లవారి స్ధానంలో నల్లవారు రావటం తప్ప జరిగేదేమీ ఉండదు.
దక్షిణాఫ్రికాలో భూసమస్యపై గత పాతికేండ్లలో స్ధూలంగా వెల్లడైన ధోరణుల గురించి చూద్దాం. మితవాదులైన శ్వేత జాతీయులు, ఇతరంగా స్వల్పంగా వున్న భూ కామందులు మొత్తంగా ఎలాంటి సంస్కరణలు జరగరాదని పట్టుబడుతున్నారు. లేదా భూములను వదులుకోవాల్సి వస్తే పెట్టుబడిదారీ మార్కెట్ రేటు ప్రకారం పరిహారం ఇచ్చి తీసుకోమంటున్నారు. నయా వుదారవాదులు అమ్మకందార్లు, కొనుగోలు దార్ల సూత్రాన్ని అమలు జరపమంటున్నారు. అంటే అది కూడా డబ్బున్నవారి యాజమాన్యంలోకే భూ బదిలీ తప్ప మరొక పురోగామి ఆలోచన కాదు. మరోవైపున భూ సంస్కరణలు ఎలా అమలు జరపాలన్న విషయంలో ఏకాభిప్రాయం లేదు. ఎలాంటి పరిహారం లేకుండా స్వాధీనం చేసుకోవాలి అన్నది ఒక వైఖరి. ఏ భూమిని స్వాధీనం చేసుకోవాలి దేనిని కూడదు అన్నది ఇంతవరకు తేల్చుకోలేదు. పట్టణ ప్రాంతాలలోని వ్యాపారులు తమ వ్యాపారాలకు గ్రామాలలో అనుబంధంగా కొన్ని వ్యవసాయ క్షేత్రాలను కలిగి ఉండటానికి అనుమతించాలని కోరుతున్నారు. భూస్వాములు కోరుతున్నట్టు మార్కెట్ రేట్లకు ప్రభుత్వం కొనుగోలు చేయటం అర్థం లేని విషయం. అవన్నీ కొన్ని తరాల కింద పేదల నుంచి ఎలాంటి పరిహారం లేకుండా స్వాధీనం చేసుకున్నవి, కూలీలుగా వారి శ్రమను దోచుకున్న వారి ఆధీనంలో ఉన్నవి. అన్నింటినీ మించి నయా వుదారవాద విధానాలలో భాగంగా ప్రభుత్వాలు ఉత్పాదక రంగాలలో పెట్టుబడులను పెట్టటం లేదు. దక్షిణాఫ్రికాలో భూ సంస్కరణలు అమలు జరిపి పేదలకు భూమిని ఇచ్చి సాగు చేయమంటే జరిగేది కాదు. ఇప్పటి వరకు వేలాది ఎకరాల క్షేత్రాలలో పెట్టుబడిదారీ పద్ధతులలో సాగును చూసిన అక్కడి పేదలు తమకు కేవలం భూమిని ఇస్తే ఏం చేసుకోవాలనే అనాసక్తత కూడా ఉందని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. అందువలన ప్రభుత్వం ఏ రూపంలో పెట్టుబడులు పెట్టాలి, ఆహార భద్రత ఎలా చేకూర్చాలి, రైతాంగానికి గిట్టుబాటు అయ్యేందుకు తీసుకోవాల్సిన చర్యలేమిటి మొదలైన అనేక అంశాల మీద విధానపరమైన స్పష్టత వచ్చినపుడే సంస్కరణలు జయప్రదమౌతాయి.