Tags

, , , , ,

Image result for are the people's verdict always perfect

ఎం కోటేశ్వరరావు

తాంబూలాలిచ్చేశాం తన్నుకు చావండి అన్న లుబ్దావధాన్ల మాదిరి ఓటర్లు తీర్పు చెప్పారు. కేంద్రంలో పాత పాలకులే కొత్త ప్రభుత్వాన్ని ఏర్పరచనున్నారు. కొన్ని కొత్త ముఖాలు, పాత ముఖాలు కొత్త వేషాలతో జనం ముందుకు వస్తారు. ఎన్నికల ప్రచారంలో వారూ, వీరూ అందరూ కలసి గత ఐదేండ్లలో తాము చేసింది సరైనదే అని సమర్ధించుకున్నారు కనుక విధానాలు, వైఖరిలో పెద్ద మార్పు వుండదు. సంస్కరణలను ఎంత వేగంగా అమలు జరిపితే అంతగా తలెత్తే పర్యవసానాల గురించి జనానికి పెద్దగా పట్టలేదన్నది స్పష్టం. కష్టాలు, నష్టాలను భరించటమే దేశభక్తి అనుకుంటున్నారు. ప్యూడల్‌ సమాజపు అవశేషాలు ఇంకా మనలను వెన్నాడుతున్నాయి గనుక గత జన్మల్లో చేసిన పాపాలు ఇంకా మనల్ని వెంటాడుతున్నాయి అనే వేదాంతంలో వున్నారు.

ఎందుకు అంటే, మన దేశంలో యోగులు, యోగినులు, బాబాలు, గురువులు ఇలా ఏ పేరైనా పెట్టండి. అంతా భక్తులు, అభిమానులుగా వచ్చే జనాన్ని మాయలో పడవేసినపుడు వారు మిగతా వాటి గురించి దేనినీ ఆలోచించరు, పట్టించుకోరు, ఎవరైనా హేతువాదులు ఇదేమిటి అని ప్రశ్నించినా సహనం కోల్పోయి అవాంఛనీయ చర్యలకు సైతం దిగటాన్ని మనం చూశాం. మన కళ్ల ముందే ఆశారాంబాపు, డేరాబాబా,కల్కి భగవాన్‌ ఇలా ఎందరో జనాన్ని ఎలా భక్తులుగా, వున్మాదులుగా మార్చుకున్నారో, ఎలా రెచ్చగొట్టారో చూశాము. వారంతా కొన్ని ప్రాంతాలకే పరిమితమైతే ఇప్పుడు బిజెపి అనే ఆశ్రమం, మోడీ అనే గురువు దేశమంతటా గణనీయమైన సంఖ్యలో జనాన్ని అటువంటి మాయలోకి నెట్టారు. గతంలో అనేక ఆశలతో మోడీకి ఓటు వేస్తే అవి అడిఆశలయ్యాయని అనుభవం చెబుతున్నా తిరిగి ఓటు వేశారు. అంటే దీన్ని మరో విధంగా చెప్పాలంటే గత ఐదు సంవత్సరాలలో పలు ఎత్తుగడలతో జనాన్ని తన భక్తులుగా, ప్రశ్నించని మత్తులోకి దించటంలో సఫలమయ్యారు. సమస్యల సంగతి తరువాత చూసుకుందాం ముందు మన మతానికి ముప్పు ఏర్పడిందట దాన్ని రక్షించుకుందాం అనే కుహనా ప్రచారం మాయలో పడిన జనం తమకు తెలియకుండానే పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లారు, ఓట్లు వేశారు. నరేంద్రమోడీ నాయకత్వంలోని పార్టీ, కూటమికి అనుకూలంగా తీర్పు ఇచ్చారు.

జనం తీర్పును తప్పు పట్టకూడదు అనే ఒక వైఖరి ఫలితాలపై చర్చల సందర్భంగా వెల్లడైంది. ఇది దొంగను కూడా గారు అని మర్యాదగా పిలవాలి కదా అనే అతి మంచితనం కలిగిన వారు, తీర్పు మీద చర్చలోతుల్లోకి పోకూడదని భావించే వారు గెలిచిన వారిని, గెలిపించిన వారిని అభినందించాలి అనే వైఖరితో వచ్చిన సమస్య ఇది. న్యాయమూర్తులకు వుద్ధేశ్యాలను ఆపాదించకూడదు గానీ వారి తీర్పుల మంచి చెడ్డల మీద వ్యాఖ్యానించేందుకు ప్రజాస్వామ్యం హక్కునిచ్చింది. జన తీర్పుకు సైతం అదే వర్తిస్తుంది. జనానికి దురుద్ధేశ్యాలను ఆపాదించనవసరం లేదు. పని గట్టుకొని తప్పు పడితే ప్రయోజనం లేదు, అలాగని సమర్ధించనవసరమూ లేదు. వారి తీర్పు పర్యవసానం గురించి విమర్శనాత్మకంగా వైఖరిని చెప్పే హక్కును కలిగి వుండాలి.

అత్యాచారాలు,హత్యలకు కారకులైన ఆశారాంబాపు, డేరాబాబాల నిజస్వరూపం బయట పడేంతవరకు వారి మీద మాట పడనివ్వని రాజకీయ పార్టీలను చూశాము. వారి మీద నేర ఆరోపణలే తప్ప అవి రుజువు కాలేదుగా అని సమర్ధించి వారికి సాష్టాంగ పడిన వారిని, వారి మద్దతుతో ఓట్లు పొందిన వారినీ చూశాము. సామాన్యుల విషయానికి వస్తే గుడ్డిగా నమ్మి వారి మీద చిన్న విమర్శ చేసినా సహించక ఎంతకైనా తెగించిన వారిని చూశాము.

హిట్లర్‌ వంటి నరహంతకులను కూడా అధికార అందలం ఎక్కించింది జనమే.చరిత్రలో నియంతలు, నరహంతకులను జనం ముందుగా గుర్తించిన దాఖలాలు లేవు. చరిత్ర పాఠాలను సక్రమంగా తీసుకొని జాగ్రత్తలు పడుతున్నదీ లేదు. ఐరోపాలో హిట్లరూ, ముస్సోలినీ, ఫ్రాంకో, లాటిన్‌ అమెరికా, కొన్ని ఆఫ్రికన్‌, ఆసియా దేశాలలో ఇలా ఎందరినో జనం చూశారు. అలాంటి శక్తులకు అధికారం వస్తే ఏమి జరుగుతుందో మిగతా ప్రపంచం కంటే అలాంటి పాలనల్లో మగ్గిన వారికి తెలిసినంతగా మరొకరికి తెలియదు. అలాంటి అనేక దేశాలలో, ఆ నియంతలకు బలైన దేశాలలో ఫాసిస్టు శక్తులు పెరుగుతున్న తరుణమిది. ఆర్ధిక వ్యవస్ధ తీవ్ర వడిదుడుకులు, వదలని మాంద్య పరిస్ధితులు వున్నపుడు వాటిని మార్చి అచ్చే దిన్‌( మంచి రోజులు) తెచ్చే దేవదూతలుగా నిరంకుశ శక్తులు ముందుకు రావటం గత చరిత్ర. ఇప్పుడు కూడా ప్రపంచంలో అదే పరిస్ధితిని ఆసరా చేసుకొని ఆశక్తులు తలెత్తుతున్నాయి. చరిత్ర పునరావృతం అవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. అయితే అది పాత రూపం, పాత పద్దతుల్లోనే వుండనవసరం లేదు, వుండదు కూడా. మితవాద భావజాలానికి వూతమిస్తున్నదీ, దాని వెంట నడుస్తున్నదీ కూడా జనమే. అంటే జనం కూడా తప్పులు చేస్తారు అని చరిత్రే చెప్పింది. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. ముందే చెప్పుకున్నట్లు అలాంటి తప్పు మెజారిటీ చేస్తే మెజారిటీ, తక్కువ మంది చేస్తే మైనారిటీ చేశారనే చెప్పాలి.

మధ్యయుగాల నాడు దాదాపు రెండు వందల సంవత్సరాల పాటు మత యుద్ధాలు జరిగాయని చరిత్ర చదువుకున్నాము. క్రైస్తవులకు చెందిన పవిత్ర భూమిని ముస్లింలు ఆక్రమించారని దాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవాలని 1095లో పోప్‌ రెండవ అర్బన్‌ పిలుపు మేరకు కానిస్టాంటినోపుల్‌ రాజధానిగా వున్న బైజాంటైన్‌ రాజ్య రాజు తొలి మత యుద్ధాన్ని ప్రారంభించాడు.అవి 1291వరకు సాగాయి. పవిత్ర ప్రాంతాల స్వాధీనంలో విఫలమయ్యాయి. తరువాత ముస్లిం రాజులు విజృంభించి 150 సంవత్సరాల తరువాత బైజాంటైన్‌ రాజ్యాన్నే స్వాధీనం చేసుకొని ఒట్టోమన్‌ సామ్రాజ్యాన్ని విస్తరించి 20వ శతాబ్దం వరకు తిరుగులేకుండా ఏలారు. మత యుద్ధాలను సమర్ధించాలా లేదా అనేదాన్ని పక్కన పెడితే దానికి పవిత్ర ప్రాంతాలను మరొక మతం వారు స్వాధీనం చేసుకున్నారనే ఒక సాకు వుంది. నిజానికి ఆ ప్రాంతాలను ఎవరూ స్వాధీనం చేసుకోలేదు. పవిత్ర ప్రాంతాలుగా వర్ణితమైన చోట ఒక నాడు యూదు మతాన్ని జనం అవలంభించారు, అదే చోట యూదుమతం మీద తిరుగుబాటు లేదా విబేధించిగానీ క్రైస్తవం, తిరిగి అదే కారణాలతో క్రైస్తవం పరిఢవిల్లిన చోటనే ఇస్లాం మతం వునికిలోకి వచ్చింది తప్ప ఎవరో వచ్చి ఆ ప్రాంతాలను ఆక్రమించలేదు. మతం ఒక మత్తు, అది ఎక్కిన వారికి వేరే ఏమీ పట్టదు కనుక అబ్రహామిక్‌ మతాలుగా వున్న యూదు, క్రైస్తవ, ఇస్లాం మతాల పెద్దలు చరిత్రలో మారణకాండకు కారకులయ్యారన్నది చరిత్ర చెప్పిన సత్యం. మన దేశంలో మతాల చరిత్ర చూసినా ఆ ఛాయలు కనిపిస్తాయి.

మన దేశంలో కూడా మత యుద్ధాలకు గతశతాబ్దిలో నాంది పలికారు. అయితే క్రైస్తవ మతయుద్ధాలు కొన్ని ప్రాంతాలను ఆక్రమించుకొనేందుకు జరిగితే ఇక్కడ హిందూ మత పునరుద్దరణ పేరుతో ప్రారంభమైంది. దానికి గాను హిందూ మత ప్రార్ధనా మందిరాలను ముస్లింలు ఆక్రమించి వాటిని మసీదులుగా మార్చారనే ఆధారాలు లేని వివాదాలను ముందుకు తెచ్చారు. బాబరీ మసీదు ప్రాంతంలోనే రాముడు జన్మించాడని, అక్కడే రామాలయం వుండేదని తమ నమ్మకం అని చెబుతారు. నిజానికి మొఘల్‌ , ఇతర ముస్లిం పాలకులు దేవాలయాలను నాశనం చేసి మసీదులుగా మార్చి లేదా నిర్మించి వుంటే ఆలయాలేవీ మిగిలేవి కాదు. ఇతర మతాల వారు హిందూ మతాన్ని నాశనం చేస్తున్నారు, మతమార్పిడులకు పాల్పడుతున్నారు అనే పేరుతో వారి మీద బస్తీమే సవాల్‌ అంటూ అన్ని రకాల దాడులు చేస్తున్నారు. మెజారిటీ మతానికి ముప్పు ఏర్పడింది అనే ఒక అభిప్రాయాన్ని గణనీయమైన సంఖ్యలో కలిగించటంలో జయప్రదమయ్యారు. అలాంటి వారికి మరొక అంశం పట్టదు. బెంగాల్‌ రాష్ట్ర విభజనకు బ్రిటీష్‌ వారు చెప్పిన కారణాలు ఏవైనప్పటికీ దాన్ని కొందరు హిందూ-ముస్లిం విభజనగా చూశారు. హిందువుల హక్కల పరిరక్షణ పేరుతో 1910దశకంలో ప్రారంభమైన హిందూమహాసభ, తరువాత 1925లో వునికిలోకి వచ్చిన ఆర్‌ఎస్‌ఎస్‌ హక్కుల స్ధానంలో హిందుత్వ పరిరక్షణగా మార్చివేశారు. ఒక అబద్దాన్ని వందసార్లు చెబితే అది చివరికి నిజమై కూర్చుంటుందన్న గోబెల్స్‌ సూత్రీకరణను అమలు జరిపి హిందూ మతానికి ముప్పు ఏర్పడిందని నిజంగానే నమ్మేట్లు చేశారు. వందల సంవత్సరాల మొగలాయీల, బ్రిటీష్‌ వారి పాలనలో దేశంలో ఎన్ని మతమార్పిడులు జరిగినప్పటికీ 80శాతం మంది హిందువులుగానే వున్నారు.ఎన్నడో వందల సంవత్సరాల నాడు మతం మార్చుకున్నవారు కూడా హిందువులే అన్నది హిందూత్వ వాదుల అభిప్రాయం. దానిలో పాక్షిక సత్యం వుండవచ్చు, పంచముల పేరుతో గణనీయమైన జనాన్ని సామాజిక, ఆర్ధిక అణచివేతకు గురించి చేసిన హిందూ మనువాదమే దానికి కారణం. ఒక వేళ హిందూత్వ వాదులు కోరుకుంటున్నట్లు ఎవరైనా ముస్లింలు, క్రైస్తవులు తిరిగి హిందూమతంలోకి వారిని ఏ కులంలో చేర్చుకుంటారు. ఇప్పటికే వున్న వందలు, వేల కులాలకు తోడుగా ముస్లిం, క్రైస్తవ కులాలను ఏర్పాటు చేయటం తప్ప మరొక మార్గం ఏముంది. అలా మారి వారు బావుకునేదేముంది?

మత యుద్ధాలు రెండు వందల సంవత్సరాలు సాగాయంటే సామాన్యులు పాల్గొన కుండా సాధ్యమేనా ? మరి ఆ సామాన్యులు చేసింది మంచా, చెడా ? చెడే అని చరిత్ర తీర్పు చెప్పింది. వారెందుకు ఆ చెడ్డపని చేశారు అన్నది వెంటనే వచ్చే ప్రశ్న. చరిత్ర కారుడు గిల్స్‌ కానిస్టేబుల్‌ అభిప్రాయం ప్రకారం మత యుద్ధాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఎవరి కారణాలు వారికున్నాయి. క్లారివాక్స్‌కు చెందిన సెయింట్‌ బెర్నాడ్‌ 1140వ సంవత్సరంలో శక్తిశాలి సైనికుడు లేదా యుద్ద వీరుడు అనే పేరుతో రాసిన దానిలో నీవు ఇప్పుడు యుద్దం చేయాల్సిన తరుణం వచ్చింది. నీవు గనుక విజయం సాధిస్తే అది కీర్త నీయం అవుతుంది. ఒక వేళ జెరూసలేము కొరకు పోరాటంలో మరణించావనుకో నీవీ స్వర్గంలో ఒక చోటును గెలుచుకుంటావు, పవిత్ర నగరాన్ని మత ద్రోహుల నుంచి విముక్తి చేసి యాత్రీకులకు దారి ఏర్పాటు చేయాలంటే దాన్ని విముక్తి చేయాలన్న పోప్‌ పిలుపులను నీవు పాటించాలి అని పేర్కొన్నారు. గతంలో చేసిన తప్పిదాల నుంచి క్షమాపణ పొందటానికి పాల్గొనాలి. మత యుద్ధాల్లో పాల్గొన్న ఎవరినైనా క్షమిస్తానని పోప్‌ ఒక అవకాశం ఇచ్చారు. అనేక యుద్ధాల్లో ఎందరి ప్రాణాలనో తీసిన రాజులకు ఇది అవసరంగా కనిపించింది. యుద్ధంలో పాల్గొనటం ద్వారా కొత్త ప్రపంచాన్ని చూడవచ్చు, ఒక సాహసం చేసినట్లు వీరత్వాన్ని ప్రదర్శించటానికి అవకాశం దొరుకుతుంది అని కొందరు భావించారు. తలిదండ్రుల నుంచి వారసత్వంగా భూములు, సంపదలు పొందే అవకాశం లేని కుమారులు విదేశాల్లో భూములు, సంపదలు పొందవచ్చని పాల్గొన్నారు. ఈ యుద్దంలో పాల్గొంటే స్వేచ్చ నిస్తామని పోప్‌ వాగ్దానం చేశారు కనుక బానిసలు, ఫ్యూడల్‌ శక్తుల వద్ద బందీలుగా వున్న రైతులు అందుకోసం దాడుల్లో భాగస్వాములయ్యారు. తమకు తలనొప్పిగా వున్న సామంత రాజులు, లేదా రాజకుటుంబీకులను వదలించుకొనేందుకు వారిని మతయుద్ధాలకు పోవాల్సిందిగా రాజులు ఆదేశాలు జారీ చేశారు. మరి కొందరు చరిత్ర కారుల అభిప్రాయం ప్రకారం మత యుద్దాల వెనుక ప్రధాన లక్ష్యం మతపరమైనదే అయినప్పటికీ పాల్గొన్న అనేక మందికి పైన పేర్కొన్న సంపదలు, భూమి, అధికారం వంటి ఆకాంక్షలు కూడా వున్నాయి. జెరూసలెమ్‌కు వెళ్లే దారిలో కానిస్టాంటినోపుల్‌ సమీపంలోని ఎడేసా అనే ప్రాంతం లేనప్పటికీ దాన్ని తమ స్వాధీనంలోకి తెచ్చుకొనేందుకు అక్కడి క్రైస్తవులను కూడా హతమార్చటాన్ని అందుకు తార్కాణంగా చూపారు.

మన దేశంలో మత యుద్దాన్ని ప్రోత్సహిస్తున్న వారి వెనుక బయటికి కనిపించని అంశాలెన్నో వున్నా పైకి చెబుతున్నది మాత్రం హిందూ మత రక్షణ. ఇది పవిత్ర యుద్దం అని భావిస్తున్నవారికి తెలియని ఆవేశం, మతానికి ఏదో ముప్పు వచ్చి పడుతోందన్న మానసిక భయం తప్ప పైన పేర్కొన్న మతయుద్ధాలలో మాదిరి సంపదలు, భూములు, రాజ్యాల వంటి లక్ష్యాలు వున్నాయని చెప్పలేము, వారికి హిందూత్వ శక్తుల ముసుగు అజెండా ఏమిటో తెలుసా అంటే తెలియదనే చెప్పాలి. ఎవరైనా మాకు తెలుసు అంటే విద్వేషం తలకు ఎక్కించుకున్న వారు తప్ప వేరు కాదు. వివేచనలేని ఆవేశం, గుడ్డి నమ్మకాలు, గుడ్డి ద్వేషంతో బాబరీ మసీదును కూల్చివేసింది, లేదా గోరక్షణ పేరుతో దాడుల్లో, మత ఘర్షణల్లో పాల్గొంటున్నదీ సామాన్యులే. వీరిలో కేంద్ర ప్రభుత్వ విధానాల వలన నష్టపోతున్న రైతు బిడ్డలు, వ్యవసాయ కార్మికులు, వృత్తులు అంతరించి నిరుద్యోగ సైన్యంలో చేరుతున్న చేతివృత్తుల వారూ, నిరుద్యోగులూ, ధరల పెరుగుదల వలన బతుకు అతలాకుతలం అవుతున్నవారూ అందరూ వున్నారు. వారెవరూ ఓటు వేయకుండా బిజెపి, దాని మిత్రపక్షాలకు అన్ని ఓట్లు ఎలా వస్తాయి. ఇలా ఎందుకు జరుగుతోందో అంతు తెలియని అంశమేమీ కాదు. దాన్నుంచి జనాన్ని ఎలా మళ్లించాలనేదే అసలైన సమస్య.

జనం ఆమోదం పొందటం వేరు, జనం చేత ఆమోదింప చేయటం, మాయలో పడవేయటం వేరు. రెండోదాన్ని ఆంగ్లంలో మాన్యుఫాక్చరింగ్‌ కన్సెంట్‌ అంటున్నారు. దీన్ని ఒక విధంగా చెప్పాలంటే మాయలో పడవేసి జనం చేత తలూపించటం. సంఘటితమైనదిగా పైకి కనిపించకుండా అది సామాజిక లేదా సాంప్రదాయ మాధ్యమాల ద్వారా, మౌఖిక ప్రచారం, ప్రతిదానినీ వాణిజ్యీకరణ ద్వారా కొన్ని సిద్ధాంతాలు, పదసమూహాలు, రూపాలు లేదా నమ్మకాలు వేటినైనా సరే ఎలాంటి వివరణ అడగకుండా, హేతుబద్దమైన ప్రశ్నలు లేకుండా ఆమోదం తెలిపేట్లు, విధేయత చూపేట్లు, మొగమాటం పెట్టి తలూపేట్లు చేసే విధానం ఇప్పుడు ప్రపంచ సమాజాన్ని వూపివేస్తున్నది. అందుకు మనది మినహాయింపు కాదు. మచ్చుకు ఏమిటీ మీకు ఎయిడ్సా అన్నట్లుగా మీ పిల్లలను ప్రభుత్వ స్కూలుకు పంపుతున్నారా, మీరు ప్రభుత్వ ఆసుపత్రులకు వెళుతున్నారా , మీకు కారు కూడా లేదా అని ఎవరైనా అడిగితే ఎదుటి వారు ఎంత ఇబ్బందులు పడుతున్నారో చూస్తున్నాం. ఈ ఎన్నికల సందర్భంగా టీవీ ఛానల్స్‌ చర్చల్లో ప్రజల సమస్యల మీద జరిగిన చర్చ లెన్ని, రాజకీయ వివాదాలు, ఆరోపణలు,ప్రత్యారోపణలపై చర్చలెన్నో పరిశీలించండి. అంటే యాజమాన్యాల ప్రయోజనాలకు నష్టం లేని లేదా పాలకులకు ఆగ్రహం కలిగించని అంశాల చుట్టూ చర్చలను పరిమితం చేయటం, బలవంతంగా చూపటం వాటికి అలవాటు చేయటం దీనిలో భాగమే. టీవీ ఛానల్స్‌, పత్రికలను మనం డబ్బు చెల్లించే పొందుతున్నాం. మనం డబ్బు చెల్లించేటపుడు మనకు కావాల్సింది పొందుతున్నామా లేదు, డబ్బిచ్చి మరీ వారు చూపింది చూస్తున్నాం, ఇచ్చిన వార్తలను చదువుతున్నాం. వాట్సాప్‌ గ్రూపుల్లో వచ్చే సమాచారం వాస్తవమైనదా కాదా అనే విచక్షణతో ఎందరు పరిశీలిస్తున్నారు. ఎవరు, ఏమిటి,ఎక్కడ,ఎప్పుడు, ఎందుకు, ఎలా అనే ఆరు ప్రశ్నలను అడగలేని బలహీనతకు లోనైన స్ధితిలోకి మనల్ని నెట్టారంటే అతిశయోక్తి కాదు. మన పిల్లలకు వాటిని నేర్పుతున్నామా అంటే లేదు. మా పెద్దలు చేశారు, మేము చేస్తున్నాము, మీరు కూడా చేయండి. మేము కూడా ప్రశ్నించలేదు అంటూ ప్రశ్నించే తత్వాన్ని మొగ్గలోనే తుంచి వేస్తున్నాం. అలాంటి తరం మా పెద్దలు పాలకులను నిలదీయలేదు మేము మాత్రం ఎందుకు చేయాలి అంటే దేశం ఎటుపోతుంది.ప్రతి కొన్ని సంవత్సరాలకు తమను అణచివేసే అసామాన్య ప్రతినిధులెవరో నిర్ణయించుకొనేందుకు అణచివేతకు గురయ్యే వారు అనుమతిస్తారు అని కారల్‌ మార్క్స్‌ చెప్పారు. ఇప్పుడు మన దేశంలో అదే జరుగుతోందా? గతంలో కాంగ్రెస్‌ను అనుమతిస్తే ఇప్పుడు మతవాదుల వంతు వచ్చిందా ?

Image result for people's verdict, hitler

బ్రిటీష్‌ వారు, అంతకు ముందు మొగల్స్‌, ఇతరులు మన దేశాన్ని ఆక్రమించటం గురించి, దీర్గకాలం పాటు మన సమాజం విదేశీ ఆక్రమణను వ్యతిరేకించకపోవటం, ప్రతిఘటన, స్వాతంత్య్ర పోరాటం, దీర్ఘకాలం కాంగ్రెస్‌ పాలన కొనసాగటం, అసలు స్వాతంత్య్రవుద్యమంతో ప్రమేయం లేకపోవటమే కాదు, వ్యతిరేకించిన శక్తుల వారసులు ఇప్పుడు తామే అసలైన జాతీయవాదులమని చెప్పటం, ప్రత్యామ్నాయ విధానాల వంటి ప్రతి అంశాన్ని పైన చెప్పిన ఆరు ప్రశ్నలతో మన సమాజంలో కొందరైనా విశ్లేషించి వైఖరులను నిర్దేశించుకొన్న రోజునే సమాజ మార్పుకు నాంది అవుతుంది. ఇది ఎలా అన్నది ఒక సమస్య. జనానికి ఇలాగే కావాలి అని జనాన్ని తిడితే ప్రయోజనం లేదు. పాలకుల విధానాలతో పాటు సమాజంలో జనాన్ని ప్రభావితం చేస్తున్న అన్ని రంగాల మంచి చెడ్డలతో పాటు జనంలో వుండే అవకాశవాదాన్ని కూడా మిత్ర వైరుధ్యంలో భాగంగా చర్చించాలి. మేథావులు ప్రజారంగంలోకి రావాలి, ఈ రంగంలోని కార్యకర్తలు మేథోపరమైన అధ్యయనాలను చేసి వాస్తవిక పరిస్ధితులకు అనుగుణంగా మేళవించి విశ్వసనీయతను పొందటం ద్వారానే జరుగుతుంది. దీని అర్ధం పరస్పరం పాత్రలను మార్చుకోవాలని కాదు. ఒకరి అనుభవాన్ని మరొకరు వుపయోగించుకొని ఆచరణాత్మక వైఖరిని, ఎత్తుగడలను అనుసరించాలి.