• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Monthly Archives: September 2019

నరేంద్రమోడీని దేశపితగా అంగీకరించకపోతే భారతీయులు కాదా ?

29 Sunday Sep 2019

Posted by raomk in BJP, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, USA

≈ Leave a comment

Tags

BJP motor mouths, Donald trump, father of the country, Father of the Nation, Mahatama Gandhi, Narendra Modi, Nathuram Godse

Image result for PM As “Father Of India”

(నరేంద్రమోడీ సమాజ ఐక్యతకు ప్రతీకా లేక విభజన దళపతా ! అన్న విశ్లేషణ ముగింపు రెండవ భాగం)

ఎం కోటేశ్వరరావు

ప్రముఖ నేతలు మనసా, వాచా, కర్మణా జీవితాలను జాతికి అంకితం చేసిన వారిని కొన్ని దేశాలలో జాతిపితలుగా వర్ణించి గౌరవించటం మనం చూస్తున్నాం. రాజకీయంగా విబేధించే వారు కూడా వారి వ్యక్తిత్వాలను గౌరవిస్తారు. స్పెయిన్‌ వంటి చోట్ల రాజకుటుంబానికి పాలనా పరంగా ఎలాంటి బాధ్యతలు, హక్కులు లేనప్పటికీ రాజును దేశ ఐక్యతా చిహ్నంగా పరిగణిస్తారు. థాయ్‌లాండ్‌లో కూడా రాజుకు అటువంటి గౌరవమే వుంది.

కొన్ని దేశాలలో దేశ స్ధాపకులుగా కొందరిని గౌరవిస్తారు. అయితే కొంత మంది తమకు తామే జాతిపితలుగా ప్రకటించుకున్నవారు కూడా లేకపోలేదు. వారంతా నియంతలు, ఇతర అవాంఛనీయ శక్తులకు ప్రాతినిధ్యం వహించిన వారిగానే వున్నారు. ప్రపంచ సమాజం వారిని గుర్తించ లేదు. టోగో అనే దేశంలో గనాసింగ్‌బె యడేమా తను జాతిపిత, పెద్ద అన్న, ప్రజల మార్గదర్శకుడు అనే బిరుదులతో పిలిపించుకున్నాడు. జైరే నియంత మొబుటు సెసె సెకో జాతి పిత, దేవదూత, వుదయించే సూర్యుడు వంటి పేర్లను తగిలించుకున్నాడు.

కొన్ని సందర్భాలలో ముఖ్యంగా నియంతల కాలంలో జాతి పిత వివాదాలకు కారణమైంది. బంగ్లాదేశ్‌ విముక్తి పోరాట నేత ముజబుర్‌ రహ్మాన్‌ అని అందరికీ తెలిసిందే. పాకిస్దాన్‌ నుంచి విముక్తి పొందిన అనంతరం 1972లో రాజ్యాంగంలో ఆయనను జాతిపిత అని చేర్చారు.2004 అధికారానికి వచ్చిన బిఎన్‌పి దాన్ని రాజ్యాంగం నుంచి తొలగించింది. దాని మీద నిరసనలు వ్యక్తమయ్యాయి.

నరేంద్రమోడీని భారత దేశ పిత అని పిలిచారు తప్ప జాతిపిత అనలేదు కదా అని కొందరు వాదిస్తున్నారు. చరిత్రలో బ్రిటీష్‌ వారు ఆక్రమించుకోక ముందు ఇప్పుడు మనం అమెరికాగా పిలుస్తున్న అమెరికా సంయుక్త రాష్ట్రాలు అనే ఒక దేశం లేదు. కొలంబస్‌ అమెరికాను కనుగొన్న తరువాత వివిధ ఐరోపా దేశాల నుంచి వలస వచ్చిన వారు 13వలస ప్రాంతాలను ఏర్పాటు చేశారు. 1760దశకంలో అక్కడి జనాభా కేవలం 25లక్షల మాత్రమే. బ్రిటీష్‌-ఫ్రెంచి వారి యుద్ధాలను చూసి, వాటి పర్యవసానాలతో ప్రభావితమైన ఆ కాలనీలకు చెందిన ప్రముఖుల ఆధ్వర్యంలో బ్రిటీష్‌ వారి వలసపాలనను వ్యతిరేకించి అమెరికా అనే దేశాన్ని ఏర్పాటు చేశారు. వారిని అమెరికా దేశ స్ధాపక పితలుగా పరిగణిస్తున్నారు. వారిలో ఎనిమిది మంది పేర్లు కనిపిస్తాయి. జార్జి వాషింగ్టన్‌, అలెగ్జాండర్‌ హామిల్టన్‌, బెంజమిన్‌ ఫ్రాంక్లిన్‌, జాన్‌ ఆడమ్స్‌, శామ్యూల్‌ ఆడమ్స్‌, థామస్‌ జఫర్సన్‌, జేమ్స్‌ మాడిసన్‌, జాన్‌లే అనే నేతలను అమెరికా స్ధాపక పితలుగా పరిగణిస్తారు. వారిలో అగ్రగణ్యుడు జార్జి వాషింగ్టన్‌ దేశ తొలి అధ్యక్షుడయ్యాడు. అమెరికా దేశ పిత ఎవరు అన్నా జాతిపిత ఎవరు అన్నా ఆయన పేరే వస్తుంది.

ఈ పూర్వరంగంలో డోనాల్డ్‌ ట్రంప్‌ జాతిపిత-దేశ పిత ఒకటే అనే అర్ధంలో నరేంద్రమోడీని అలా పిలిచారా అన్నది ఒక అంశం. ఒక వేళ దేశపిత అనాలంటే బ్రిటీష్‌ వారు రాక ముందే భారతదేశం వుంది. పోలీసు చర్య ద్వారా హైదరాబాద్‌ సంస్ధానాన్ని విలీనం చేసిన ఖ్యాతిని కేవలం సర్దార్‌ పటేల్‌కే ఆపాదిస్తున్న బిజెపి వాదన మేరకు, లేదా కాశ్మీర్‌ను మన దేశంలో విలీనం చేసేందుకు సైన్యాన్ని నడిపించిన జవహర్‌లాల్‌ నెహ్రూను, భారత రక్షిత స్వతంత్ర దేశంగా వున్న సిక్కింను మన దేశంలో విలీనం చేసేందుకు చర్యలు తీసుకున్న ఇందిరా గాంధీని దేశపితలు, దేశమాత అంటే ఒక మేరకు అర్ధం చేసుకోవచ్చు నరేంద్రమోడీ ఎలా అవుతారు ? ‘ చీలికలు పేలికలు అయింది. ఎంతో గొడవ జరిగేది, ఆయన దాన్నంతా ఒక దగ్గరకు చేర్చారు. ఒక తండ్రి మాదిరిగా ఆయన ఒకటిగా చేశారు.’ అని ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలకు అర్ధం ఏముంది. కాశ్మీర్‌కు వున్న ప్రత్యేక రక్షణలు తొలగించటాన్ని , దానికి కూడా దేశంలో మాదిరి చట్టాలు వర్తింపచేశామని మోడీ చెప్పుకోవటాన్ని బట్టి అలా అన్నారా ? ఒక వేళ అదే ప్రాతిపదిక అయితే అనేక రాష్ట్రాలకు వున్న ప్రత్యేక రక్షణలు, చట్టాల మాటేమిటి?

మన దేశానికి వస్తే ఎవరినీ జాతిపితగా గుర్తించేందుకు రాజ్యాంగంలో అవకాశం లేదు. రాజకీయంగా గాంధీతో విబేధించినప్పటికీ సుభాస్‌ చంద్రబోస్‌ తొలిసారిగా 1944లో సింగపూర్‌ రేడియోలో ప్రసంగిస్తూ జాతిపిత అని సంబోధించాడు. అయితే మరుసటి ఏడాదే గాంధీని హతమార్చేందుకు గాడ్సే తొలి విఫల హత్యాయత్నం చేసినట్లు తరువాత వెల్లడి అయింది. స్వాతంత్య్రం వచ్చిన తరువాత జాతిపితగా పరిగణించి మన కరెన్సీ నోట్లపై ఆయన చిత్రాలను ముద్రించి గౌరవిస్తున్న విషయం తెలిసిందే. మహాత్మా గాంధీని జాతిపితగా బిజెపి గుర్తించదు. ఆయన మీద విమర్శ చేస్తే జనం అంగీకరించరన్న భయం కారణంగా పైకి మాట్లాడటం లేదు గానీ ఏదో ఒక రూపంలో ఆ పార్టీ వారు దాచుకోలేకపోతున్నారు.

గాంధీ పాకిస్తాన్‌కు జాతి పిత అని బిజెపి మధ్యప్రదేశ్‌ నేత అనిల్‌ సౌమిత్ర నోరు పారవేసుకున్నాడు.మహాత్మా గాంధీ జాతిపితే అయితే అది పాకిస్ధాన్‌కు. ఆయన వంటి వారు భారత్‌లో కోట్లాది మంది పుత్రులున్నారు. కొందరు పనికి వచ్చే వారైతే మరికొందరు పనికిమాలిన వారు’ అని ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టాడు. ఇదేమిటయ్యా నేతా అని విలేకర్లు ప్రశ్నిస్తే భారత జాతిపితగా గౌరవం ఎవరికి వుందో ఎవరికీ తెలియదు లేదా వూరూపేరూ లేనివారు. కాబట్టి మహాత్మాగాంధీ జాతిపిత కావచ్చు కానీ అది పాకిస్ధాన్‌కు, ఇక్కడ పుట్టిన ప్రతివారూ భారత మాత పుత్రులమని గర్విస్తారు’ అన్నాడు. అంతే కాదు, ఆ పోస్టును తొలగించటానికి కూడా అంగీకరించలేదు. ఎవరూ 24గంటలూ పార్టీ ప్రతినిధులుగానే వుండలేరు. అలాంటి వారి అభిప్రాయాలన్నీ ఎల్లవేళలా పార్టీ వైఖరిగా వుండాల్సిన అవసరం లేదు అని కూడా అన్నాడు. అంటే అది తన వ్యక్తిగత అభిప్రాయమని చిత్రించే యత్నం అని వేరే చెప్పనవసరం లేదు.

ఈ సౌమిత్రకు వుత్తేజం సాధ్వి ప్రజ్ఞాసింగ్‌ ఠాకూర్‌. ఆమె భోపాల్‌ బిజెపి అభ్యర్ధినిగా రంగంలో వుండి ప్రచారం చేస్తున్నారు. దానిలో భాగంగా అగర్‌-మాళ్వా ప్రాంతంలో ప్రచార సభల్లో విలేకర్లతో మాట్లాడుతూ ‘ నాధూరామ్‌ గాడ్సే ఒక దేశభక్తుడు. ఆయన ఎన్నటికీ దేశభక్తుడిగానే వుంటారు. కొందరు ఆయన్ను వుగ్రవాది అని పిలుస్తారు. ఈ ఎన్నికల్లో అలాంటి వారికి తగిన విధంగా బుద్ది చెబుతారు’ అని వ్యాఖ్యానించిన మరుసటి రోజు సౌమిత్ర రెచ్చిపోయాడు. తరువాత బిజెపి నుంచి వత్తిడితో ప్రజ్ఞ క్షమాపణ చెప్పారు. యథా ప్రకారమే తన వ్యాఖ్యలను వక్రీకరించారని కూడా సెలవిచ్చారు. ఆరోగ్యం బాగోలేదని తరువాత కొద్ది రోజులు ఎన్నికల ప్రచారానికి దూరంగా వున్నారని చెప్పారు గానీ వచ్చే ఓట్లకు ఏమైనా గండిపడుతుందేమో అని పార్టీయే ఆమెను దూరం పెట్టింది. నరేంద్రమోడీ ఆమె వ్యాఖ్యలపై ఆమెను క్షమించటానికి నేను అశక్తుడను అని చెప్పి నష్టాన్ని తగ్గించే యత్నం చేశారు.గాడ్సే స్వతంత్ర భారత తొలి వుగ్రవాది అని సినీ హీరో కమల్‌ హసన్‌ చేసిన వ్యాఖ్యకు సమాధానంగానే ప్రజ్ఞ తన మన్‌కీ బాత్‌ను వెల్లడించారు.

ఆమె, మరో ఇద్దరు ఎంపీలు కూడా వారి వ్యక్తిగత స్ధాయిలో చేసిన వ్యాఖ్యలకు పార్టీకి సంబంధం లేదని అమిత్‌ షా చెప్పటం విశేషం. గాడ్సే ఒకరిని చంపాడు, కసబ్‌ 72 మందిని, రాజీవ్‌ గాంధీ 17వేల మందిని చంపాడు. వీటిలో ఎవరిది పెద్ద క్రూరత్వమో మీరే నిర్ణయించండి అని కర్ణాటక బిజెపి ఎంపీ నళిన్‌ కుమార్‌ కటీల్‌ కూడా ఇదేసమయంలో ట్వీట్‌ చేశాడు. అతని మీదా ఎలాంటి చర్య లేదు. ఇతగాడు రెండు సార్లు బిజెపి ఎంపీగా పనిచేసి మూడవ సారి గత ఎన్నికల్లో గెలిచాడు.కేంద్రమంత్రిగా వున్న అనంత కుమార్‌ తక్కువ తినలేదు.’ ఏడు దశాబ్దాల తరువాత దృష్టి మారిన వాతావరణంలో నేటి తరం శిక్షకు గురైన ఒక వ్యక్తిని గురించి చర్చిస్తున్నారంటే గాడ్సే గనుక బతికి వుంటే ఇప్పుడు జరుగుతున్న చర్చను చూసి సంతోషపడి వుండేవాడు.’ అని ట్వీట్‌ చేశారు.

ముంబయ్‌ కార్పొరేషన్‌ డిప్యూటీ కమిషనర్‌గా వున్న ఐఏఎస్‌ అధికారిణి నిధి చౌధరి చేసిన ఒక ట్వీట్‌లో దేశంలో వున్న జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాలన్నింటినీ కూల్చివేయండి,కరెన్సీ నోట్లపై వున్న ఆయన చిత్రాలను చెరిపివేయండి, నాధూరామ్‌ గాడ్సేకు కృతజ్ఞలు అని పేర్కొన్నారు. తరువాత దాన్ని వుపసంహరించుకున్నారు. ఆమెపై చర్య తీసుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేశాయి. ఆ వ్యాఖ్యలను తాను వ్యంగ్యంగా చేశాను తప్ప మరొకటి కాదని సంజాయిషీ ఇచ్చుకున్నారు. ఇటీవలి కాలంలో ముఖ్యంగా జనవరి నుంచి సామాజిక మాధ్యమంలో మహాత్మాగాంధీ మీద ప్రతికూల వ్యాఖ్యలు బాగా కనిపిస్తున్నాయని, గాంధీ వాటిని చూడకుండా చేసినందుకు గాడ్సేకు కృతజ్ఞలు అనే అర్ధంలో తాను ట్వీట్‌ చేసినట్లు మీడియాకు వివరించారు.

నరేంద్రమోడీని జాతి పిత లేదా ప్రపంచ పిత అని పిలవటానికి సంఘపరివార్‌ నీడలో వున్నవారిలో వున్న ఆతృత ఎలా వుందో అంగీకరించని వారు భారతీయులు ఎలా అవుతారు అని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ అని ప్రశ్నించటం ఒక సూచిక. అనేక మంది అలా పిలిచేందుకు వుబలాటపడుతున్నారు. నరేంద్రమోడీ 69వ పుట్టిన రోజు సందర్భంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌ సతీమణి అమృత శుభా కాంక్షలు చెబుతూ నరేంద్రమోడీని జాతి పిత అని సంబోధించారు. ఈ సందర్భంగా ఆమె విడుదల చేసిన వీడియోను కొన్ని వేల మంత్రి ఆమోదించారు. దాని మీద సామాజిక మాధ్యమంలో తీవ్ర విమర్శలు కూడా వెల్లడయ్యాయి. నరేంద్రమోడీ సన్నిహితుడు గుజరాత్‌ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత అయిన విష్ణు పాండ్య గుజరాత్‌ సమాచార్‌ టీవీ చర్చలో పాల్గొంటూ గాంధీ మాదిరే గాడ్సే కూడా దేశభక్తుడే అని సెలవిచ్చారు. మహాత్మాగాంధీని జాతిపితగా గుర్తించే వారు ఆర్‌ఎస్‌ఎస్‌లో ఎక్కడైనా ఒకరో అరో వుంటారేమోగానీ గాడ్సేను దేశభక్తుడు కాదని చెప్పేవారెవరూ మనకు కనిపించరు. నేను గాంధీని ఎందుకు చంపాను అంటూ కోర్టులో గాడ్సే చేసిన వాదనను పెద్ద ఎత్తున ప్రచురించి పంపిణీ చేసేది, చదివించేది కూడా వారే అంటే అతిశయోక్తి కాదు.

Image result for narendra modi and gandhi

చరఖా తిప్పినంత మాత్రాన గాంధీలు, శాంతి మంత్రం జపించినంత మాత్రాన బుద్దులు అయిపోరు. కానీ అలాంటి ప్రయత్నాలను దేశం చూసింది. ఖాదీ వుద్యోగ సంస్ధ కాలెండర్‌ కోసం నరేంద్రమోడీ చరఖా ముందు కూర్చొని ఫొటోకు పోజిచ్చారు. మహాత్మా గాంధీ సామాన్యులను ప్రతిబింబిస్తూ కొల్లాయి కట్టి తిరిగారు. నరేంద్రమోడీ ధరించే దుస్తులు ఎంత ఖరీదైనవో, ఎంత దర్జాగా వుంటాయో రోజుకు రెండు మూడు మార్లు మారుస్తారని చదివాము. గాంధీ ఆశ్రమంలో తన మరుగుదొడ్డి తానే శుభ్రం చేసుకున్నారు. పారిశుధ్యకార్మికులను విముక్తి చేయాలని కోరుకున్నారు. కానీ కుంభమేళా సందర్భంగా ఐదుగురు పారిశుధ్యకార్మికుల కాళ్లు కడిగి నరేంద్రమోడీ మీడియా ఫొటోలకు ఫోజిచ్చారు. అంతమాత్రాన గాంధీ అయిపోతారా ? గాంధీ ఒక వ్యవస్ధకు ప్రతిరూపం అయితే నరేంద్రమోడీ కంపెనీల ప్రచారకర్తగా తయారయ్యారు. గాంధీ కంటే ప్రధాని మంచి బ్రాండ్‌ అని హర్యానా బిజెపి మంత్రి వ్యాఖ్యానించిన విషయం మరచిపోరాదు. జియో, పేటియంల ప్రచారకర్తగా జాతికి కనిపించిన విషయం మరచిపోగలమా ? గాంధీ సామాన్యులకు ప్రతిబింబంగా అంగవస్త్రంతో బతికారు, మరి మోడీ ఖరీదైన దుస్తులను రోజుకు రెండు మూడుసార్లు మారుస్తారని చదివాము. గాంధీ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా దేశాన్ని నడిపారు. నరేంద్రమోడీ సామ్రాజ్యవాదుల పాదాల దగ్గరకు దేశాన్ని నడిపిస్తున్నారు.

ఇరాన్‌-అమెరికా మధ్య పంచాయితీ వుంది. అందుకని దాని దగ్గర చమురు కొనవద్దని మన దేశాన్ని ట్రంప్‌ ఆదేశిస్తే తలొగ్గటాన్ని సామ్రాజ్యవాదుల పాదాల చెంతకు మనం చేరటం కాదా ? గాంధీ 150వ జయంతి సందర్భంగా బిజెపి వారు గాంధీ ఆర్ధిక సిద్దాంతాల గురించి కూడా ప్రచారం చేస్తారట. దానికి పూర్తి విరుద్దమైన పాలన ఐదేండ్లు సాగించారు. బిజెపి ఏలుబడిలోకి రాక ముందు ఆర్‌ఎస్‌ఎస్‌ స్వదేశీ జాగరణ మంచ్‌ పేరుతో ఒక సంస్ధను ఏర్పాటు చేసింది. మొత్తం మార్కెట్‌ను విదేశాలకు అప్పగిస్తుంటే మరి ఆ సంస్ధ ఏమైందో, దాని దేశభక్తి ఎటుపోయిందో తెలియదు. ఇలా చెప్పుకుంటే ఎన్నో !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

నరేంద్రమోడీ సమాజ ఐక్యతకు ప్రతీకా లేక విభజన దళపతా !

29 Sunday Sep 2019

Posted by raomk in BJP, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, USA

≈ Leave a comment

Tags

Donald trump, father of the country, Howdy Modi, is narendra modi india's divider in chief or unifier, Narendra Modi, narendra modi father of the country, narendra modi india's divider in chief, narendra modi india's unifier in chief

Image result for modi unifier

నరేంద్రమోడీ సమాజ ఐక్యతకు ప్రతీకా లేక విభజన దళపతా !

మొదటి భాగం

ఎం కోటేశ్వరరావు

ప్రపంచ చరిత్రలో రాజులు, రంగప్పలే కాదు, ప్రజాస్వామిక వ్యవస్ధలని చెప్పుకొనే చోట కూడా అధికారంలో వున్న వారికి లేని ప్రతిష్టను చేకూర్చే ప్రయత్నాల గురించి చెప్పనవసరం లేదు. వాటి వెనుక వ్యక్తిగత ప్రయోజనాలే కాదు తమను ఆశ్రయించుకున్న వారికి అవకాశాల కోసం కూడా పాత పద్దతులైన సామ, దాన, బేధ, దండోపాయాలే కాదు అన్ని రకాల అవాంఛనీయ చర్యలకు పాల్పడటం చూస్తున్నాము.

అమెరికాలోని హూస్టన్‌ నగరంలో సెప్టెంబరు 22న జరిగిన ప్రవాస భారతీయుల హౌడీ మోడీ (మోడీ గారూ ఎలా వున్నారు) సభలో మన ప్రధాని నరేంద్రమోడీ, అమెరికా అధ్యక్షుడు నరేంద్రమోడీ ఒకరిని ఒకరు పొగుడుకున్న తీరు చూసిన తరువాత నరేంద్రమోడీ ప్రతిష్ట పెంచేందుకు ప్రయత్నం జరుగుతోందా అని ఎవరైనా అనుకుంటే వారు సరిగానే ఆలోచిస్తున్నట్లు లెక్క. కొందరికి ఆ ధోరణులు కనిపిస్తున్నాయి, మరి కొందరు నరేంద్రమోడీ అందుకు అర్హులే అని కీర్తిస్తున్నారు. అన్నింటినీ బేరీజు వేసుకొని ఎవరి అంచనా సరైనదో ఎవరికి వారే నిర్ణయించుకోవాలి.

హిందూ హృదయ సామ్రాట్‌ అని కొందరు నరేంద్రమోడీని కీర్తిస్తే, ఆయన హిందూ ఏమి ఖర్మ ఏకంగా భారత హృదయ సామ్రాట్‌ అని మరికొందరు ప్రస్తుతించారు. భారత విభజన దళపతి అని లోక్‌సభ ఎన్నికల ఫలితాలు రాక ముందు ఒక అంతర్జాతీయ పత్రిక ముఖచిత్ర కధనాన్ని ప్రచురించిది. అదే పత్రిక ఎన్నికల తరువాత దశాబ్దాల కాలంలో ఏ ప్రధానీ నరేంద్రమోడీ మాదిరి దేశాన్ని ఐక్యం చేయలేదు అని మరొక వ్యాసాన్ని ప్రచురించింది. కాలం నరేంద్రమోడీని ఐక్యతా దళపతిగా నిరూపించింది అని ఫలితాలు వెలువడిన తరువాత బిజెపి నేత సంబిత్‌ పాత్ర వంటి వారు వర్ణించారు. ఇప్పుడు అది మరింత వేగం పుంజుకొని ముందుకు పోతున్నట్లు కనిపిస్తోంది. ఏదీ వూరికే రాదు అన్న విషయం తెలిసిందే. ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటినమ్మ వాయనం అన్నట్లుగా మోడీ- ట్రంప్‌ వ్యవహరించారా ?

ఎవరైనా ఒకరిని అసాధారణ వ్యక్తులతోనో, అసాధారణ రీతినో ఏ కారణంతో అయినా పొగిడితే వారేదో అలా అన్నారు గానీ నాకంత లేదు అని వినమ్రంగా చెప్పుకుంటారు. మన ప్రధాని నరేంద్రమోడీ నుంచి అలాంటి వినమ్రత ఆశించే వారిని ఆయన హతాశులను గావించారు. ఒక్క విషయం స్పష్టమైంది.దేశద్రోహం, నువ్వు భారతీయుడివా కాదా అని నిర్ధారించేందుకు ప్రమాణాలుగా సంఘపరివార్‌, దాని రాజకీయ సంస్ధ బిజెపి తయారుచేసిన నిఘంటువులోకి మరొక అంశం తోడైంది. అదే ‘భారత దేశ పిత’ నరేంద్ర దామోదరదాస్‌ మోడీ.

మన రాజ్యాంగంలో ఎవరినీ అధికారికంగా జాతిపితగా లేదా భారత దేశ పితగా పరిగణించేందుకు అవకాశం లేదు. అయినా యావత్‌ సమాజం జాతిపితగా పరిగణిస్తున్న మహాత్మా గాంధీని గుర్తించేందుకు, నరేంద్రమోడీని భారత దేశ పితగా పరిగణించకపోవటాన్ని అంగీకరించేందుకు బిజెపి, సంఘపరివార్‌కు చెందిన వారు సిద్దంగా లేరు.

ఇప్పటికే జాతిపిత గాంధీని చంపిన విడి సావర్కర్‌ అసలైన దేశభక్తుడు అని చెబుతున్న వారు రేపు గాంధీ జాతి పిత ఏమిటి అసలైన జాతిపిత సావర్కర్‌, ఆయన వారసుడు నరేంద్రమోడీ భారత దేశ పితి అని చెప్పేందుకు ఎంతో సమయం పట్టదా అనిపిస్తోంది. కేంద్ర మంత్రి జితేంద్రసింగ్‌ తన మనసులో వున్న విషయాన్ని దాచుకోకుండా చెప్పినందుకు ఒక విధంగా ఆయనకు ‘అభినందనలు’ చెప్పకతప్పదు. భారత దేశ పితగా నరేంద్రమోడీని అంగీకరించని వారు భారతీయులు ఎలా అవుతారన్నదే ఆయన ప్రశ్న.

‘ ప్రధాని వ్యక్తిత్వం,చొరవ కారణంగా ఈ రోజు విదేశాల్లో వున్న వారు గర్వపడుతున్నారు. ఎవరైనా ఒకరి గురించి అమెరికా దాని అధ్యక్షుడి నుంచి ఒక నిష్పాక్షిక మరియు ధైర్యవంతమైన ప్రకటన వచ్చిందంటే ఏదైనా పార్టీతో అతని రాజకీయ అనుబంధాలు లేదా భావజాలంతో నిమిత్తం లేకుండా ప్రతి భారతీయుడు గర్వపడాలని నేను భావిస్తున్నాను.ఒక అమెరికా అధ్యక్షుడు అలాంటి పదాలతో ప్రశంసలు కురిపించటం ఒక భారత ప్రధాని గురించే కాదు ఇతర ఏ ఒక్క ప్రపంచ నేత గురించి చేయలేదు. దీనికి ఎవరైనా గర్వపడకపోతే, తరువాత వారు తమను తాము భారతీయులుగా పరిగణించుకోకపోవచ్చు’ అని జితేంద్ర సింగ్‌ వ్యాఖ్యానించారు. జాతిపిత ఒకరే వుంటారు అన్న కాంగ్రెస్‌ వ్యాఖ్య గురించి అడగ్గా దాని గురించి ట్రంప్‌తో కాంగ్రెస్‌ను వాదించమనండి అన్నారు. దీన్ని చూసిన తరువాత జర్మన్‌ భావజాలానికి వ్యతిరేకం అనేపేరుతో ప్రఖ్యాత రచయితల పుస్తకాలను దగ్దం చేసిన నాజీల చర్య గుర్తుకు వస్తోంది.

హిట్లర్‌ పుట్టటానికి వంద సంవత్సరాల ముందే హెన్రిచ్‌ హైనే అనే రచయిత ” ఎక్కడైతే పుస్తకాలను తగులబెడతారో (భావజాలం లేదా విజ్ఞానం) అక్కడ మానవులను కూడా సజీవదహనం చేస్తారు ” అని ప్రకటించాడు. 1933 మే 10ప తేదీ రాత్రి బెర్లిన్‌ నగరంలో నాజీలు, విశ్వవిద్యాలయాల విద్యార్ధులు పెద్ద సంఖ్యలో కూడి 20వేల పుస్తకాలను దగ్దం చేశారు. వాటిలో కమ్యూనిస్టు రచయితలు కారల్‌ మార్క్స్‌, ఫెడరిక్‌ ఎంగెల్స్‌, ఆల్బర్‌ ఐనిస్టీన్‌, ఎర్నెస్ట్‌ హెమింగ్వే, జాక్‌లండన్‌, హెచ్‌జి వెల్స్‌ వంటి ఎందరో కమ్యూనిస్టేతర, పురోగామి రచయితల పుస్తకాలు వాటిలో వున్నాయి. నరేంద్రమోడీని భారత దేశ పితగా అంగీకరించని వారు భారతీయులు ఎలా అవుతారు అని ప్రశ్నించినట్లుగానే హిట్లర్‌, నాజీ భావజాలానికి వ్యతిరేకమైన రచనలన్నీ జర్మన్‌ వ్యతిరేకమైనవే అన్న వున్మాదానికి లోనైన వారు దీనికి పాల్పడ్డారు. ఇప్పటికే మన దేశంలో జెఎన్‌యు, హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ వంటివి భారతీయతకు వ్యతిరేకులు, దేశద్రోహులతో చేతులు కలిపే వారితో నిండి వున్నాయనే ప్రచారాన్ని చేస్తున్న విషయం తెలిసిందే.

ఈ రోజు దేశంలో జాతిపిత మహాత్మా గాంధీ కోరుకున్న, ఆశించిన రీతిగా పరిస్ధితులు లేవు. తమ విధానాలను వ్యతిరేకించిన వారిని దేశద్రోహులుగా, విదేశీతొత్తులుగా చిత్రిస్తున్నారు. పరమత, పురోగామి భావజాలాలు, వాటిని కలిగి వున్నవారి మీద ద్వేషం, ఆవుల రక్షణ పేరుతో హత్యాకాండ, అసహనం,రాజ్యాంగ వ్యవస్ధలను దిగజార్చటం వంటి పరిణామాలను సమర్ధించేవారు, ముందుకు తీసుకుపోయే వారు తమకు ఒక ప్రతీక కావాలనుకుంటున్న వారు నరేంద్రమోడీని ఎంచుకున్నట్లుగా కనిపిస్తోంది.

ఇదంతా అమెరికా అధ్యక్షుడు మాననీయ మహోదయ ఎప్పుడేం మాట్లాడతాదో తెలియని తలతిక్క మనిషిగా పేరు మోసిన (నిజానికి అది వాస్తవం కాదు, తమకు హాని కలిగించే వారిని అమెరికా కార్పొరేట్‌ రంగం తమ ప్రతినిధిగా కొనసాగనివ్వదు.) డోనాల్డ్‌ ట్రంప్‌ చేసిన ప్రశంసాపూర్వకమైన వ్యాఖ్యలే కారణం. మన ప్రధానిని ‘భారత దేశ పిత’ గా వర్ణించటంతో వచ్చింది అనుకొనే వారికి కాదు మహానుభావులారా మన దేశంలో అనేక మంది మనసులో వున్న మాటనే వెల్లడించాడు అని చెప్పాల్సి వస్తోంది. హూస్టన్‌ సభ తరువాత న్యూయార్క్‌ నగరంలో ఐక్యరాజ్య సమితి సమావేశాల సందర్భంగా డోనాల్డ్‌ ట్రంప్‌, నరేంద్రమోడీ మరోసారి భేటీ అయ్యారు. పరస్పర పొగడ్తలు కిక్కు ఇవ్వలేదని అనుకున్నారేమో తెలియదు. ఇద్దరూ విలేకర్లతో మాట్లాడారు.’ హూస్టన్‌ సభకు డోనాల్డ్‌ ట్రంప్‌ హాజరైనందుకు ధన్యవాదాలు. అమెరికా అధ్యక్షుడు మంచి స్నేహితుడు’ అని మోడీ చెప్పారు. అంతగొప్ప స్నేహితుడు కాశ్మీర్‌ గురించి మధ్యవర్తిత్వం వహించమని మోడీ తనను అంతర్గత సమావేశంలో అడిగారు అని పచ్చి అబద్దం చెప్పి ఎంతో కాలం గడవ లేదు. స్నేహితుల మధ్య బయటి ప్రపంచానికి వెల్లడి కాని అనేక అంశాలు దొర్లుతాయి. బహుశా వారి స్నేహం చెడకుండా వుండేందుకే మోడీ దాని మీద నోరు విప్పలేదు అనుకోవాలి. అలాంటి అబద్దాల కోరు ట్రంప్‌ మోడీని భారత దేశ పిత అనటం కూడా మరొక అబద్దం లేదా అతిశయోక్తి కావచ్చు కదా ! అంతగా మంచి స్నేహితుడు అని మోడీ స్పందించిన తరువాత ట్రంప్‌ బదులు తీర్చుకోకపోతే భారత జాతికే అవమానం కదా !

బొల్లు బొల్లరా వెంకన్నా అంటే మా గురించి గొప్ప చెప్పుకోవటం కాదు గానీ బాబయ్యా మా అయ్యగారి తోటలో మిరియాలు తాటికాయలంత వుంటాయండయ్యా అన్నట్లుగా ట్రంప్‌ స్పందించారు. ‘ అంతకు ముందు భారత్‌ నాకు గుర్తుంది. అంతబాగా తెలియదు గానీ నాకు గుర్తుంది, అది చీలికలు పేలికలు అయింది. ఎంతో గొడవ జరిగేది, ఆయన దాన్నంతా ఒక దగ్గరకు చేర్చారు. ఒక తండ్రి మాదిరిగా ఆయన ఒకటిగా చేశారు. మనం ఆయన్ను భారత దేశ పితగా పిలవవచ్చు, ఆయనొక అసాధారణ మంచిపని చేశారు అనుకుంటున్నా’ అని డోనాల్డ్‌ ట్రంప్‌ వ్యాఖ్యానించారు.

Image result for narendra modi india's divider in chief

వివిధ రాజ్యాలుగా వున్న భారతావనిని పూర్తిగా తమ స్వాధీనంలోకి తెచ్చుకొని దోపిడీని యధేశ్చగా కొనసాగించేందుకు దేశమంతటా కొన్ని సంస్ధానాలను కొనసాగించేందుకు అనుమతించినా వాటిని కూడా తమకు లోబడి వుండేట్లు చేసుకొని దేశాన్ని ఒక్కటిగా చేసింది బ్రిటీష్‌ వారే.అయినంత మాత్రాన వారిని దేశాన్ని ఆక్రమించుకున్నవారిగా తప్ప ఆధునిక భారత నిర్మాతలుగా చరిత్ర పరిగణించలేదు.

స్వాతంత్య్రం వచ్చిన తరువాత వందల సంఖ్యలో వున్న చిన్నా, పెద్ద సంస్దానాలను విలీనానికి భారత ప్రధానిగా నెహ్రూ కృషి చేశారు. కాశ్మీర్‌ సంస్ధానాన్ని భారత్‌లో విలీనం చేసేందుకు ఏకంగా సైన్యాన్నే నడిపించారు. పోర్చుగీసు పాలనలో వున్న గోవాను భారత్‌లో విలీనం చేసేందుకు అదే నెహ్రూ సైన్యాన్ని నడిపించిన చరిత్ర తెలిసిందే. ఫ్రాన్స్‌ ఆధీనంలో వున్న నేటి పుదుచ్చేరి ప్రాంతాలను భారత్‌లో విలీనం చేసింది కూడా ఆయన హయాంలోనే. సంఘపరివార్‌ గొప్పగా చిత్రించే సర్దార్‌ పటేల్‌ కారణంగానే హైదరాబాదు సంస్దానం దేశంలో విలీనం అయింది అని చేసే వాదనను కాసేపు అంగీకరిద్దాం. భారత రక్షణలో స్వతంత్ర రాజ్యంగా వున్న సిక్కిం మన దేశంలో విలీనం అయింది ఇందిరా గాంధీ ఏలుబడిలో, అలాంటి ఏ చరిత్రా లేని నరేంద్రమోడీ భారత్‌ను ఐక్యం చేశారనే పేరుతో భారత దేశ పిత అని పిలిస్తే పై ముగ్గురిని కూడా భారత దేశ పితలు, మాత అని పిలవాల్సి వుంటుంది. ఒక వేళ జమ్మూ కాశ్మీర్‌కు రాజ్యాంగమే కల్పించిన ప్రత్యేక ప్రతిపత్తి, హక్కులను రద్దు చేయటమే దేశాన్ని ఐక్యం చేయటమే అయితే, గిరిజన ప్రాంతాలకు, అనేక రాష్ట్రాలకు కల్పించిన ప్రత్యేక హక్కులు, రక్షణల కొనసాగింపు మాటేమిటి అన్న ప్రశ్న తలెత్తుతుంది. అందువలన భారత చరిత్ర తెలియని ట్రంప్‌ చేసే ప్రకటనలు, వర్ణణలకు విలువేమిటి అన్నది సమస్య.

Image result for narendra modi india's divider in chief

ట్రంప్‌కు గత చరిత్ర తెలియదు లేదా తెలిసినా కావాలని తన ప్రయోజనం కోసం నరేంద్రమోడీని ఆకాశానికి ఎత్తారనుకోవాల్సి వుంటుంది. నరేంద్రమోడీ ‘భారత విభజన దళపతి’ అని అమెరికాకు చెందిన టైమ్స్‌ పత్రిక ఈ ఏడాది మేనెలలో తన ముఖచిత్ర కధనానికి శీర్షిక పెట్టింది. అదే పత్రిక లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత మరొక అడుగు ముందుకు వేసి గత దశాబ్దాలలో ఏ ప్రధానీ చేయని విధంగా నరేంద్రమోడీ ఐక్యతా దళపతిగా వ్యవహరించారు అని మరొక కధనాన్ని ప్రచురించింది. వాటి లోని అంశాలను మరోసారి వివరించుకోవచ్చు. బ్రిటన్‌, ఇతర అనేక దేశాల నుంచి వెలువడే గార్డియన్‌ పత్రిక ఇటీవలి లోక్‌సభ ఎన్నికల ఫలితాల గురించి ఏమి వ్యాఖ్యానించిందో దిగువ కొన్ని వ్యాక్యాలను చూడండి.

”భారతీయ ఆత్మకు చెడు !

ఒక వైపు కుహనా వార్తలతో కాలక్షేపం చేస్తూ వాణిజ్య వేత్తల అనుకూల అజెండా అమలు జరుపుతూ మైనారిటీలను ద్వితీయ శ్రేణి పౌరులుగా పరిగణించే మరో ప్రజాకర్షక నినాదాల నేత ప్రపంచానికి అవసరం లేదు.2017లో జరిపిన ఒక సర్వేలో రష్యాలో వ్లదిమిర్‌ పుతిన్‌తో సహా ఏ దేశంలోనూ లేని విధంగా నిరంకుశమైన పాలన చేసేందుకు ఒక బలమైన నేత కావాలని భారత్‌లో 55శాతం మంది కోరుకోవటాన్ని చూసిన తరువాత ఈ విజయం చూసి మాకేమీ ఆశ్చర్యం కలగలేదు. స్వాతంత్య్ర భారత అత్యంత విలువైన లక్షణమైన బహుళపార్టీ ప్రజాస్వామ్యానికి నరేంద్రమోడీ ముప్పుగా పరిణమించారు.” అని పేర్కొన్నది.

బ్రిటీష్‌ వారి పాలనకు చరమ గీతం పాడేందుకు సాగిన మహోద్యమానికి నాయకత్వం వహించింది గాంధీ. ఆయన అనుసరించిన కొన్ని వుద్యమ పద్దతులు, కొన్ని అంశాల మీద ఆయన వైఖరులను మ్యూనిస్టులు, ఇతరులు కూడా విబేధించారు గానీ గాంధీ దేశభక్తి, చిత్తశుద్ధిని ఎవరూ శంకించలేదు. కానీ నరేంద్రమోడీ, ఆయన మాతృ సంస్ధ సంఘపరివార్‌ ఆరాధించే, ఆయన వారసులం అని చెప్పుకొనే సదరు వినాయక దామోదర్‌ సావర్కర్‌ బ్రిటీష్‌ వారికి లొంగిపోయి సేవ చేస్తానని చెప్పిన వ్యక్తి. సంఘపరివార్‌కు చెందిన వారి చరిత్ర భారత సమాజాన్ని మతప్రాతికన విడదీసే, పరమత ద్వేషులుగా వుంది తప్ప ట్రంప్‌ చెప్పినట్లు ఐక్యపరిచేదిగా లేదు. అదియును సూనృతమే ఇదియును సూనృతమే అన్నట్లుగా టైమ్‌ పత్రిక మాదిరి ఇదే ట్రంప్‌ లేదా మరొక అమెరికా అధ్యక్షుడు తన అభిప్రాయాలను భిన్నంగా వెల్లడించవచ్చు. అందువలన ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడి తప్పించుకొనే లేదా మెప్పించుకొనే వారు కాదు, వ్యక్తుల ఆచరణే గీటురాయిగా వుండాలి.

 

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

కాకమ్మ కథలు కాదు – సుదర్శన చక్రాలు, సమ్మోహనాస్త్రాలకు సమయమిదే !

21 Saturday Sep 2019

Posted by raomk in BJP, Congress, Current Affairs, History, INDIA, Literature., NATIONAL NEWS, Opinion, Others, STATES NEWS, Telangana, Uncategorized

≈ Leave a comment

Tags

BJP on Uranium, cock and bull stories, puranic weapons, saffron talibans, TRS government, Uranium

Image result for puranic weapons

ఎం కోటేశ్వరరావు

కుక్క పిల్లా, అగ్గిపుల్లా, సబ్బు బిళ్లా కాదేదీ కవితకనర్హం అన్నాడు మహా కవి శ్రీశ్రీ. రెండు తెలుగు రాష్ట్రాల్లో , దేశంలో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే ప్రతిదానినీ రాజకీయం చేస్తున్నారు, రాజకీయ కోణంలోనే చూస్తున్నారు. అసలు సిసలు దేశభక్తులం మేమే అని చెప్పుకొనే వారి గురించి ఇక చెప్పనవసరం లేదు. మహాభారతంలో ఒక కధ వుంది. ద్రోణాచార్యుడు తన శిష్యుల కేంద్రీకరణ సరిగా వుందో లేదో పరీక్షించేందుకు ఒక రోజు పరీక్ష పెట్టాడు. ముందు కుమారుడు అశ్వధ్దామను పిలిచి చెట్టుమీద ఒక పక్షి వుంది,నీకేమి కనిపిస్తోంది అని అడగాడు. నాకు చెట్టు, దాని మీద పిట్ట, మీ పాదాలు కనిపిస్తున్నాయి అన్నాడు అశ్వధ్దామ. ఓకే, నీ బాణం కింద పెట్టు అని దుర్యోధనుడిని పిలిచి అదే ప్రశ్న అడిగాడు. గురువు గారూ నాకు చెట్టుమీద కొమ్మలు, వాటి మీద కూర్చున్న పిట్ట కనిపిస్తోంది, కొట్టమంటరా అన్నాడు, వద్దు వద్దు నీ ఆయుధాన్ని కింద పెట్టు అన్నారు. తరువాత వంతు అర్జునుడిది. నాకు పిట్ట తప్ప మరేమీ కనిపించటం లేదు అన్నాడు, అంతేనా అన్నాడు ద్రోణాచార్య. అంతే సర్‌ అన్నాడు అర్జునుడు. బిజెపి ఒక కంటికి అధికారమనే పిట్టమాత్రమే కనిపిస్తోంది. రెండో కంటికి యురేనియం వంటి సమస్యల మీద గుడ్డి సమర్దనకు అనేకం కనిపిస్తున్నాయి.

యురేనియం తవ్వకాలు, సర్వే గురించి సంప్రదాయ, సామాజిక మాధ్యమం రెండింటిలోనూ ఇప్పుడు చర్చ జరుగుతోంది. అనేక మంది సినీ ప్రముఖులు ముందుకు వచ్చి వాటికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అవసరమైతే ఆందోళనలో పాల్గొంటామని ప్రకటిస్తున్నారు. కొన్ని రాజకీయ పార్టీలు పిల్లి మొగ్గలు వేస్తున్నాయి.. ముందేమి మాట్లాడుతున్నాయో వెనకేమి అంటున్నాయో చూడటం లేదు. తవ్వకాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేస్తామని తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్‌ ప్రకటించారు మరోవైపున శాసన మండలిలో మాట్లాడిన కెటిఆర్‌ యురేనియం అవసరాన్ని గురించి నొక్కి చెప్పారు. బిజెపి నేతలు తమ వైఖరి ఏమిటో చెప్పకుండా గతంలో సర్వే, తవ్వకాలకు అనుమతులు ఇచ్చింది కాంగ్రెస్‌, టిఆర్‌ఎస్‌, మేము (కేంద్రం) తవ్వకాలకు అనుమతి ఇవ్వలేదు, కనుగొనేందుకు మాత్రమే, అయినా అది పనికి వస్తుందో లేదో తెలియదు అంటూ ఏవేవో చెబుతూ తాము తవ్వకాలకు అనుకూలమో కాదో చెప్పటం లేదు. యురేనియం అవసరం అంటూ పరోక్షంగా సర్వే, తవ్వకాలను సమర్ధిస్తున్నది.ఈ చర్చలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి కూడా భాగస్వామి అయ్యారు. అతని కంటే ఘనుడు ఆచంట మల్లన అన్నట్లు ఆయన యురేనియం కంటే బొగ్గుతవ్వకమే ఎక్కువ ప్రమాదకరం అని చెప్పారు. ప్రమాదకరమైన వాటిన్నింటినీ ఆపివేయాలి, ఎవరు తవ్వమన్నారు. మరోవైపున సంఘపరివార్‌ శ్రేణులు సామాజిక మాధ్యమంలో యురేనియం తవ్వకం ఒక దేశభక్తి, దేశరక్షణ చర్యగా, పనిలో పనిగా కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారం చేస్తున్నాయి. సామాజిక మాధ్యమంలో వారు వ్యాపింప చేస్తున్న ఒక సమాచారం దిగువ విధంగా వుంది. వూరూ పేరు లేకుండా ప్రచారం చేయటం అలాంటి వారి పద్దతి గనుక దానిలో వున్న భాష, భావాన్ని బట్టి అది వారి ప్రచారమే అని చెప్పాల్సి వస్తోంది.

Image result for sammohana astra

” యూరేనియం..ఇప్పుడు ఇదొక తర్కం..పర్యావరణం ఎంత ముఖ్యమో..దేశానికీ అణువిద్యుత్తు, అణ్వాయుధాల సమృద్ధి, అణ్వస్త్ర ప్రయోగశాల కార్యాచరణ కూడ అంతే ముఖ్యమన్న విషయ విజ్ఞానం మనం అర్ధంచేసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది..ప్రస్తుతం కేవలం రీసెర్చ్‌ స్థాయిలో ఉన్న ఈ అంశం పై ఇంతగా ఆందోళన అనవసరం.జంతు జీవాలు మృగ్యం అయిపోతై, పురాతన కట్టడాలు ధ్వంసం అయిపోతై, అక్కడ నివాసితుల జీవితాలు నాశనం అయిపోతై, వింతరోగాలు ప్రబలిపోతాయి అంటూ కమ్మీస్‌ చేస్తున్న ప్రచారం కేవలం చైనా ఎజండా మాత్రమే.నిజానికి అది కమ్మీల విషప్రచారం మాత్రమే. 30000 ఎకరాల విస్తీర్ణంలో వున్న నల్లమల అడవుల్లో కేవలం 1000 ఎకరాల భూభాగంలో మాత్రమే ఈ రీసెర్చ్‌ జరగబోతోంది.రీసెర్చ్‌ ముగిసిన తర్వాత యురేనియం అందుబాటు స్థాయిని అధ్యయనం చేశాక యురేనియం ప్రాసెసింగ్‌ జరగాలి.అప్పుడు రేడియేషన్‌ విడుదల అవుతుంది.విడుదలయ్యే రేడియేషన్‌ వలన పై చెప్పబడిన ఏ ఒక్క విభాగము భారీ విపత్తుకు లోను కాకుండా తగు చర్యలు పటిష్టంగా తీసుకుంటుంది. కేంద్రంలో ఉన్నది ఆషామాషీ ప్రభుత్వమో.అభాధ్యతతో కూడిన ఆలోచనలతో సాగే యంత్రాంగమో, కాసుల కోసం క్షుద్ర ప్రయోగాలు ఆవిష్కరించే నీచ సంస్కృతికి నిలయమో కాదు.అనునిత్యం దేశహితమే తన మతంగా,130 కోట్ల భారతీయులే తన కుటుంబం అంటూ సాగుతున్న రాజర్షి నమో సారథ్యంలో దూసుకెళ్తున్న భారత్‌.. మేము విశ్వగురు భారత్‌ సంతతి అని భావితరాలు సగర్వంగా చాటుకునే స్థాయిని ఆవిష్కరిస్తున్న ప్రయాణం..అది

యురేనియం ఐనా,త్రిపుల్‌ తలాక్‌ ఐనా, ఆర్టికల్‌ 370, జి ఎస్‌ టి,నోట్ల రద్దైనా, జమిలి ఎన్నికలయినా, మరో అంశమైనా దేశంకోసం,దేశప్రతిష్ఠ కోసం, భావి భారతీయుల ఉజ్వల భవిష్యత్తుకోసం,ప్రపంచపటంలో భారతావనిని అగ్రగామిగా నిలపడంకోసం చేసే ప్రయత్నాలే.చైనాలో దోమ కుడితే ఇక్కడ గోక్కునే కమ్మీలు.అణ్వస్త్ర విభాగంలో భారత్‌ ఎక్కడ తమను మించిపోతుందో అనే చైనా భయాందోళనల మధ్య పుట్టుకొచ్చిన కుట్రలో భాగమే ఈ యాంటి యూరేనియం స్లొగన్స్‌, మావోయిస్టుల గంజాయి సాగుకు ఆటంకం, వాళ్ళ ఆయుధసేకరణకు అవసరమయ్యే ఆదాయవనరులకు గండి పడతాయి.ఇలాంటి అనేక అంశాలు ఈ కమ్మీలను పట్టిపీడిస్తున్నాయి.ఈ కమ్మీల ట్రాప్లో పడకుండా ప్రజలు అప్రమత్తంగా వుండాలి.నాణానికి రెండువైపులా అధ్యయనం చేయాలి.పర్యావరణాన్ని కాపాడుకుంటూ,అవసరమైన యురేనియం సమృద్ధిని పెంచుకుంటూ చైనా, పాకిస్తాన్‌ వంటి శత్రుదేశాల ఆగడాలను తరిమికొట్టే అణ్వస్త్ర ఆయుధ సంపత్తిని గణనీయంగా పెంచుకుని దేేశరక్షణ ప్రాముఖ్యతను గుర్తించి గౌరవించవలసిన బాధ్యత మనదే అనే ఆలోచన ప్రతి భారతీయ గుండెల్లో మారుమ్రోగాలి.జై భారత్‌. ”

ఇది కాషాయ తాలిబాన్ల వాదన తప్ప మరొకటి కాదు. మాకు సంబంధం లేదు అని వారు స్పష్టం చేస్తే అప్పుడు ఆలోచిద్దాం. అణు యుద్దం జరిగితే విజయం సంగతి తరువాత అసలు మానవాళిలో మిగిలేది ఎంత మంది, ఒకరూ అరా మిగిలినా వారు చేసేది ఏమిటి అన్నది సమస్య. అణుబాంబులు హిందువులను, ఆవులను వదలి, ముస్లింలు, క్రైస్తవులు, ఇతర జంతుజాలాల మీదనే ప్రభావం చూపుతాయి అనుకుంటున్నట్లు కనిపిస్తోంది ! హిరోషిమా, నాగసాకి నగరాల్లో జరిగిన విధ్వంసాన్ని చూస్తే కాషాయ దళానికి తప్ప ప్రపంచానికి అంతటికీ వాటి ముప్పు ఏమిటో అర్ధం అయింది. అందుకే ఇప్పటికే ఒకసారి ప్రయోగించిన అమెరికా తప్ప తమంతట తాముగా ముందుగా అణ్వాయుధాలను ప్రయోగించబోమని మనతో సహా ప్రతి దేశం ప్రతిన పూనింది. ఈ విషయంలో బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌కు ప్రేరణ పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ . అతగాడి ప్రేలాపనలను అవకాశంగా మార్చుకొని తమలోని యుద్దోన్మాదాన్ని బయట పెట్టుకొంటున్నారు. ముందుగా అణ్వాయుధాలను ప్రయోగించబోమనే దేశవైఖరిని తాము పునరాలోచించుకోవాల్సి వుంటుందని మన రక్షణ మంత్రి రాజ్‌నాధ్‌ సింగ్‌ చెప్పటాన్ని ఏమనాలి? ఆయనకు ఇమ్రాన్‌ఖాన్‌కు తేడా ఏముంది?

అణువిద్యుత్‌ కేంద్రం కలిగిన ప్రతి దేశమూ అణ్వాయుధాలను తయారు చేసి పరిక్షించకపోయినా ఏ క్షణంలో అయినా వాటిని తయారు చేయగలిగిన పరిజ్ఞానాన్ని సమకూర్చుకున్నాయనేది బహిరంగ రహస్యం. ఇక కాషాయ దళాల వున్మాదం గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన పని లేదు. మొదటి ప్రపంచ యుద్దం తరువాత జర్మనీకి ఏ కమ్యూనిస్టు లేదా పెట్టుబడిదారీ దేశం నుంచీ ముప్పు లేకపోయినా దేశాన్ని సమున్నతంగా నిలుపుతానంటూ జాతీయోన్మాదాన్ని, కమ్యూనిస్టు వ్యతిరేకతను రెచ్చగొట్టిన హిట్లర్‌ గురించి అంతకంటే చెప్పాల్సిన పనిలేదు. వాడి వారసులే కాషాయ తాలిబాన్లు. ప్రతి దేశమూ తన రక్షణకు చర్యలు తీసుకోవటాన్ని ఎవరూ తప్పు పట్టరు, అందుకు అవసరమైన ఆయుధాలను కలిగి వుండటమూ అభ్యంతరం కాదు. అయితే అణ్వాయుధాలు ఏ దేశాన్నీ రక్షించలేవు. అందుకోసం జనాన్ని, పర్యావరణాన్ని ఫణంగా పెట్టాల్సిన అవసరం అంతకంటే లేదు. విద్యుత్‌ కోసం అనే వాదనలో కూడా అర్ధం లేదు. అనేక ప్రత్యామ్నాయ మార్గాలున్నాయి. చెర్నోబిల్‌, పుకుషిమా ప్రమాదాలు జరిగిన తరువాత ఇంకా అణువిద్యుత్‌ గురించి మాట్లాడేవారిని ఏమనాలో అర్దం కాదు.

ఇక్కడ కాషాయ దళాలను జనం ఒక ప్రశ్న అడగాలి. మీరు చెబుతున్నట్లు కాసేపు యురేనియం తవ్వకాల వ్యతిరేక నినాదం చైనా కోసమే కమ్యూనిస్టులు చేస్తున్నారనే అనుకుందాం. మీరెందుకు విదేశాలను అనుకరించి యురేనియంతో ఆయుధాలు తయారు చేయాలని ఆరాటపడుతున్నారు. అసలు సిసలు అభినవ స్వదేశీ దేశభక్తులు కదా ! వేదాల్లోనే అన్నీ వున్నాయి, భారతీయ పురాతన విజ్ఞానం అంతా సంస్కృత గ్రంధాల్లో వుంది అని ప్రచారం చేస్తున్నది మీరు. ఈ గోబెల్స్‌ ప్రచారం ఎంతగా పెరిగిపోయిందంటే దీన్ని ప్రశ్నించేవారి పరిస్ధితి ఇప్పుడు నూరు కాకుల్లో ఒక్క కోకిల మాదిరి తయారైంది. అమెరికా,ఆస్ట్రేలియా, అనేక ఐరోపా దేశాలకు వెళ్లి వుద్యోగాలు, విదేశీ సంస్ధల్లో పరిశోధనలు చేస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నవారు కూడా ఎవరేమనుకుంటే నాకేటి సిగ్గు అన్నట్లుగా వేదాల్లో అన్నీ వున్నాయష అనే అగ్రహారీకుల కబుర్ల్లే వల్లిస్తున్నారు.

విష్ణుమూర్తి సుదర్శన చక్రం అనే అస్త్రం నియంత్రిత క్షిపణి మాదిరి వ్యవహరించి లక్ష్యంగా చేసుకున్న శత్రువులను మాత్రమే హతమార్చి తిరిగి వస్తుందని కదా చెబుతారు. అంటే అది అణ్వాయుధాల కంటే అధునాతనం, సురక్షితమైనది. అమాయకుల జోలికిపోదు, సంస్కృత పండితులు, ఆర్‌ఎస్‌ఎస్‌ స్వదేశీ జాగరణ మంచ్‌ వారు, ఇతరులు కలసి మేకిన్‌ ఇండియా కింద స్వదేశీ సుదర్శన చక్రాలను తయారు చేయవచ్చు కదా ! విదేశీ అణ్వాయుధాలెందుకు, వాటికోసం యురేనియమో మరొకటో తవ్వినపుడు ప్రమాదకరమైన కిరణాలను విడుదల చేయటం ఎందుకు ? వాటితో క్యాన్సర్‌, ఇతర భయంకర జబ్బులు రావటం ఎందుకు? అన్నీ కాలుష్యం కావాల్సిన పనేముంది? సుదర్శన అస్త్రం, ఇతర మరికొన్ని పురాణ అస్త్రాలు హింసాత్మకమైనవి మనది శాంతిభూమి కదా ఎవరైనా అనవచ్చు. పురాణాలలో సమ్మోహనాస్త్రాలు కూడా వున్నాయి. వాటిని తయారు చేసి మనకు నిత్యం తలనొప్పిగా వున్న పాక్‌ పాలకుల మీద, వారు పంపే తీవ్రవాదుల మీద దేశంలో వున్న వుగ్రవాద మావోయిస్టులు, ఇతర తీవ్రవాదుల మీద ప్రయోగిస్తే మంచివారిగా మారిపోతారు కదా ! అప్పుడు వారికి డబ్బు అందకుండా చూసేందుకు మరోసారి నోట్ల రద్దు అనే పిచ్చిపని, సర్జికల్‌ స్ట్రైక్స్‌ అవసరం వుండదు, వాటితో శతృవులను హతమార్చామని చెప్పుకోపని లేదు, ప్రతిపక్షాలకు రుజువులు చూపమని అడిగే అవకాశం వుండదు. అన్నింటికీ మించి మన శాస్త్ర పరిశోధనా కేంద్రాలన్నింటినీ మూసివేసి లేదా వాటిలో పని చేస్తున్న శాస్త్రవేత్తలను కట్టగట్టి ఇంటికి పంపి వేదాలు, సంస్కృత పండితులు, బవిరి గడ్డాల యోగులు, యోగినులతో నింపి వేస్తే ఎంతో ఖర్చు కలసి వస్తుంది. కారుచౌకగా కావాల్సిన అస్త్రాలను తయారు చేయించవచ్చు. వందల కోట్లు పెట్టి కిరస్తానీ దేశాల నుంచి రాఫెల్‌ విమానాలు, ఇతర ఆయుధాలను కొనుగోలు చేయాల్సిన అవసరం వుండదు. అందుకు అవసరమైన విదేశీ డాలర్లతో అసలే పని వుండదు. ఇది కలి యుగం గనుక అస్త్రాల తయారీ కాస్త ఆలశ్యం అవుతుంది అనుకుంటే ప్రజ్ఞా సింగ్‌ వంటి సాధ్వులను రంగంలోకి దించి శత్రువుల మీద శాపాలు పెట్టించండి. వారి నోటి దూల తీరి శత్రువుల పీడ విరగడ అవుతుంది. వందల కోట్లు ఖర్చు చేసి ఇస్రో ప్రయోగాలు చేయటం ఎందుకు, వేదగణితంతో లెక్కలు, డిజైన్లు వేసి వుంటే ఈ పాటికి చంద్రుడి మీన వారు రియెలెస్టేట్‌ ప్రారంభించి ఎంతో లబ్ది చేకూర్చి పెట్టి వుండేవారు. చంద్రయాన్‌ రెండవ ప్రయోగం విఫలమైందని మన ప్రధాని శాస్త్రవేత్తల మీద విసుక్కున్నారని వార్తలు వచ్చి వుండేవి కాదు, దాన్ని దాచుకునేందుకు తరువాత వారిని అక్కున జేర్చుకొని ఓదార్పుల దృశ్యాలు చూసే ఖర్మ మనకు తప్పేది.

Image result for puranic weapons

కొన్ని పురాణ అస్త్రాలు రక్షణ, శత్రు సంహారానికి సంబంధించినవి. వాటిలో సమ్మోహనాస్త్రం అయితే బహుళ ప్రయోజనకారి. నరేంద్రమోడీ గత ఐదు సంవత్సరాలలో ఎన్ని విదేశాలు తిరిగినా, ఎంత మంది విదేశీ నేతలను కౌగిలించుకున్నా మన దేశానికి పెద్దగా పెట్టుబడులు వచ్చింది లేదు. పరిశ్రమలు, వాణిజ్యాలు పెరిగి వుంటే నిరుద్యోగం నాలుగున్నర దశాబ్దాల నాటి రికార్డులను బద్దలు కొట్టి కొత్త రికార్డులను స్దాపించేది కాదు. మన గడ్డమీద నుంచే సమ్మోహనాస్త్రాలను ప్రయోగించినా, విదేశాలకు వెళ్లినపుడు కొన్నింటిని వెంటబెట్టుకు వెళ్లి ప్రయోగించినా సినిమాల్లో మాదిరి గింగిరాలు తిరుక్కుంటూ అన్ని దేశాల వారూ ఈ పాటికి ఇక్కడ పడి వుండేవారు. ఇంకచాలు బాబోయ్‌ అనేవరకు మనకు కావాల్సినవన్నీ తెచ్చి పడవేశేవారు. అందువలన ఇప్పటికీ మించిపోయింది లేదు. పెద్ద నోట్లను, ఆర్టికల్‌ 370 రద్దు చేసినా వుగ్రవాద సమస్య పోలేదు, మొత్తం కాశ్మీర్‌లో ఆగస్టు ఐదు నుంచి విధించిన కర్ఫ్యూను ఇంతవరకు తొలగించలేదు. దేశం ఆర్దిక మాంద్యం నుంచి గట్టెక్కాలంటే నిర్మలమ్మ గారు ఎన్ని వుద్దీపన పధకాలు ప్రకటించినా ప్రయోజనం వుందనే ఆశ లేదు. కనుక రక్షణ కోసం, సుదర్శన చక్రాలు, పెట్టుబడులు, ఎగుమతుల కోసం సమ్మోహన అస్త్రాలు తయారు చేసేందుకు పూనుకొని కాషాయ దళాలు తమ దేశభక్తిని నిరూపించుకోవాలి. ప్రపంచానికి భారత సత్తా చాటాలి. కాకమ్మ కబుర్లు కాదు కార్యాచరణ ముఖ్యం !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

ఆవు కథలు కాదు మోడీ గారూ ఆర్ధిక అంశాల మీద నోరు విప్పండి !

13 Friday Sep 2019

Posted by raomk in BJP, Current Affairs, Economics, INDIA, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

Cow excreta, Cow excreta start-ups, India cow commoission, Panchgavya, Rashtriya Kamdhenu Aayog

Image result for not cow stories Mr narendra modi speak on country economy

ఎం కోటేశ్వరరావు

చరిత్రకు పక్షపాతం లేదు. దాన్నుంచి తీసుకొనే పాఠాలకే ఏదో ఒక పక్షపాతం. అది దోపిడీదారులకు అనుకూలమైనది కావచ్చు, దోపిడీకి గురయ్యేవారిని మేల్కొలిపేదిగానూ వుండవచ్చు. గాంధీ గురించి ఎంత రాసినా స్వీకరించింది, ఆయన హంతకుడు గాడ్సేను ఎంత పొగిడినా అదే రీతిలో చరిత్ర తనలో నిక్షిప్తం చేసుకుంటున్నది. అదే చరిత్ర మనకు కావలసినంత వినోదం, విషాదాలతో పాటు చతురతను కూడా అందిస్తుంది.

మనకు జ్ఞాపకశక్తి తక్కువని గుర్తు చేయటం కాదుగానీ మన ప్రధాని నరేంద్రమోడీ 2018వ సంవత్సరానికి ఒక అంతర్జాతీయ అవార్డును స్వీకరించారు. మోడీకి ఈ అవార్డు ఎందుకు వచ్చింది అంటే ‘మోడినోమిక్స్‌’ (మోడీ అర్ధశాస్త్రం- ఎవరైనా ఒక ప్రత్యేక సిద్దాంతం లేదా మరొకదాన్ని కనిపెట్టినా, అభివృద్ధి చేసినా వారి కృషికి గుర్తింపుగా ఆ పేరుతో వ్యవహరిస్తారు) ద్వారా భారత్‌, ప్రపంచ ఆర్ధిక పురోభివృద్ధికి చేసిన కృషికి గుర్తింపుగా ఇచ్చారని మన విదేశాంగశాఖ వెల్లడించింది. అంతర్జాతీయ సహకారానికి ఆయన పునరంకితమైన తీరు, ప్రపంచ ఆర్ధిక అభివృద్ధిని పెంచేందుకు, ప్రపంచంలోనే అత్యంత వేగంగా పెద్ద ఆర్ధిక వ్యవస్ధగా రూపుదిద్ది భారతీయుల అభివృద్ధికి చేసిన కృషికి, అవినీతి వ్యతిరేక చర్యలు, సమాజాన్ని ఒకటిగా చేసిన కృషికి గుర్తింపు అని వ్యాఖ్యానించింది. నరేంద్రమోడీగారికి ఏ డిగ్రీలు వున్నాయో తెలియదు, తెలిసినా దేశభద్రత దృష్ట్యా వెల్లడించకూడదనుకోండి. మరోవైపు అందరికీ తెలిసిన డిగ్రీలు కలిగి ఆర్ధిక నిపుణుడిగా పేరుగాంచిన మన్మోహన్‌ సింగ్‌ పదేండ్లు ప్రధానిగా వున్నా అదేమిటో ఒక్క అంతర్జాతీయ అవార్డూ రాలేదు. (ఆయన ఆర్ధిక విధానాలు, వైఖరితో ఏకీభవించినా లేకున్నా, అవి ఎవరికి వుపయోగపడతాయన్నది వేరే అంశం కావచ్చుగానీ ఆయన పట్టాలు వున్న ఒక ఆర్ధికవేత్త )

చరిత్రలో వినోదం, విషాదం అని ఎందుకన్నానంటే మన్మోహన్‌ సింగ్‌ దేశంలో తలెత్తిన ఆర్దిక మందగమనం గురించి మాట్లాడుతున్నారు. ప్రపంచ అవార్డు గ్రహీత నరేంద్రమోడీ మాత్రం ఆర్ధిక వ్యవస్ధకు బదులు ఆవు వ్యాసం, కథల గురించి దేశ ప్రజలకు చెబుతున్నారు. ఓం, ఆవు అనే మాటలు వినపడితే కొంత మందికి వెంట్రుకలు నిక్కబొడుచుకుంటాయని, దేశం 16,17 శతాబ్దాల వెనక్కు పోయిందని మాట్లాడతారని 2019 సెప్టెంబరు పదకొండున చెప్పారు. ఓం, ఆవులకు ఆ రెండు శతాబ్దాలకు సంబంధం ఏమిటో ఎంత వెతికినా కనపడలేదు. ఎందుకంటే అవి రెండూ అంతకంటే చాలా పురాతనమైనవి. దేశాన్ని ఆ కాలానికి తీసుకుపోవాలన్నది మోడీ అండ్‌కో ప్రయత్నం అన్నది తెలిసిందే. మేకిన్‌ ఇండియా పిలుపు ఏమైందో, అచ్చేదిన్‌ ఎప్పుడొస్తాయో, ఒక వేళ ఆర్ధిక మాంద్యం లేకపోతే లేదనైనా చెప్పకుండా ఈ అవుగోలేందో, ఎవరో దేశాన్ని వెనక్కు తీసుకుపోతున్నారని అంటూ ఎదురుదాడి చేయటం ఏమిటో ఎవరికైనా అంతుపడుతోందా ?

అంటే అన్నారని ఏడుస్తారు. మోడీ సర్కార్‌ రాష్ట్రీయ కామధేను ఆయోగ్‌ అనే సంస్ధను తాత్కాలిక బడ్జెట్‌లో ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేయాల్సి వుంది. జాతీయ మహిళ, జాతీయ ఎస్‌సి,ఎస్‌టి కమిషన్ల మాదిరి ఇది జాతీయ ఆవు కమిషన్‌. ఆవు పేడ, గోమూత్రం, వాటితో వుత్పత్తుల తయారీ, మార్కెటింగ్‌కు యువతీ, యువకులు ఏర్పాటు చేసే అంకుర సంస్ధలకు 60శాతం వరకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వనున్నదని జాతీయ ఆవు కమిషన్‌ అధ్యక్షుడు వల్లభ్‌ కథిరియా నాలుగు రోజుల క్రితం వెల్లడించారు. పేడ, మూత్రాలతో ఔషధాలను తయారు చేస్తున్నామని, వాటిని మనుషులతో పాటు వ్యవసాయానికి వినియోగించవచ్చని చెప్పారు. ఇందుకోసం ఐదు వందల కోట్ల రూపాయలను కేటాయించినట్లు బడ్జెట్‌లో పేర్కొన్నారు. పాడి ఎండిపోయిన తరువాత ఆవులు దేనికీ పనికిరావనుకోవటం సరైంది కాదని పేడ, మూత్రం వస్తాయని, వాటిలో వున్న ఔషధ గుణాల గురించి పరిశోధనలు చేయాలని శాస్త్రవేత్తలను కోరినట్లు కథిరియా చెప్పారు. గోశాల నిర్వాహకుల నైపుణ్య అభివృద్దికి శిక్షణ ఇస్తామని కూడా అన్నారు. ఆవు పేడ, మూత్రాలతో తయారు చేసే ప్రత్యేక ఔషధం పంచగవ్యను గర్భిణీ స్త్రీలు తీసుకుంటే వున్నతమైన తెలివిగల పిల్లలు పుడతారని ఆయుష్‌, జాతీయ ఆవు కమిషన్‌ అధికారులు చెబుతున్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.

Image result for cow stories,narendra modi cartoon

గ్రామాల నుంచి వుద్యోగాల కోసం యువత పట్టణాలకు రాకుండా చూసేందుకు మోడీనోమిక్స్‌లో ఇదొకటి. పంచగవ్యతో పాటు ఆవు, పేడ మూత్రాలతో సబ్బులు, దోమల నివారణ పిడకలు, కాగితం తయారీ వంటి వాటిని యువకులకు వుపాధిగా చూపాలని తలపెట్టారు. వీటిని వ్యాపారపరంగా తయారు చేసే వారికి పన్నెండు సంవత్సరాల్లో తీర్చే విధంగా తక్కువ వడ్డీకి రుణాలు కూడా ఇస్తారు. ప్రతి ఇంటికి ఒక ఆవు వుండే విధంగా చేయాలన్నది మోడీగారి లక్ష్యం. తాము అధికారానికి వస్తే ఒక లక్ష ఆవులను పంపిణీ చేస్తామన్నది తెలంగాణా బిజెపి ఎన్నికల వాగ్దానాల్లో ఒకటి.

కార్పొరేట్ల సామాజిక బాధ్యత(సిఎస్‌ఆర్‌) పధకాల్లో గోశాలల నిర్మాణం కూడా ఒకటిగా చేరుస్తూ యుపి యోగి ఆదిత్యనాధ్‌ సర్కార్‌ ఆదేశాలు జారీ చేసింది, రెండు శాతం ఆవు పన్ను విధించింది. అన్ని దేవాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ ఆయుర్వేద, ఖాదీ కేంద్రాలలో ఆవు సంబందిత వుత్పత్తులను విక్రయిస్తారు.

మోడీ గారు దేశం గురించి ఎప్పుడు నోరు తెరుస్తారో, శాశ్వతంగా మూసుకుంటారో తెలియదు. ఆది గోద్రెజ్‌, ఆయనేమీ కేంద్ర ప్రభుత్వ వ్యతిరేకి కాదు, పాకిస్ధానీ మద్దతుదారు లేదా తుక్‌డే తుక్‌డే గ్యాంగ్‌ అసలే కాదు. ప్రముఖ పారిశ్రామిక సంస్ధ గోద్రెజ్‌ గ్రూప్‌ చైర్మన్‌. ‘ త్వరగా నిర్ణయాలు తీసుకోవటం మంచిది, వుదాహరణకు కాశ్మీర్‌, కానీ వాణిజ్య విషయాల్లో వేగంగా నిర్ణయాలు చేయకపోవటం మంచిది కాదు ‘ అన్నారాయన. దేశంలో వాణిజ్య, పారిశ్రామికవేత్తల్లో నెలకొన్న అసహనం లేదా అసంతృప్తికి నిదర్శనం. ఈ వ్యాఖ్య ఈ ఏడాది తొలి త్రైమాసిక ఆర్ధిక వ్యవస్ధ అభివృద్ధి రేటు ఐదుశాతానికి పడిపోయిందని, ఎనిమిది ప్రధాన రంగాలలో గతేడాది జాలైలో 7.3శాతంగా వున్న వృద్ధి రేటు ఈ ఏడాది జూలైలో 2.1శాతానికి పడిపోయిందని సాక్షాత్తూ కేంద్ర వాణిజ్య, పారిశ్రామిక మంత్రిత్వ శాఖే ప్రకటించటానికి ముందే గోద్రెజ్‌ మాట్లాడారు. తన ప్రభుత్వంలో ఎవరైనా పాక్‌ ఏజంట్లు చొరబడ్డారేమో, వారి మీద మెరుపు దాడులు చేయాలేమో మోడీ గారు ఆలోచించాలి. రాయిటర్స్‌ వార్తా సంస్ధ చేసిన ఇంటర్వ్యూలలో డజనుకు పైగా ప్రముఖులు గోద్రెజ్‌ మాదిరే ఆందోళన, అసంతృప్తి వ్యక్తం చేశారు, కొంత మంది పేరు రాయటానికి ఇష్టపడలేదు. వారంతా మోడీ విజయానికి హారతులు పట్టిన వారే సుమా ! వీరి అభిప్రాయాలపై వ్యాఖ్యానించాలని అడగ్గా ప్రధాని కార్యాలయం తిరస్కరించిందట. మోడీ గారే మాట్లాడనపుడు కందకు లేని దురద కత్తి పీటకెందుకు అన్నట్లుగా ఆయన ఆఫీసు ఎలా స్పందిస్తుంది. జూలై నెలలో ఈ విదేశీ మదుపుదార్లు మన స్టాక్‌ మార్కెట్‌ నుంచి 1.8 బిలియన్‌ డాలర్ల మేరకు పెట్టుబడులు వుపసంహరించుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వుద్దీపన చర్యలు, బ్యాంకుల విలీనాలు ఎలాంటి ప్రభావం చూపలేదని విశ్లేషకులు పేర్కొన్నారు.

తాము అప్పుల పాలయ్యామని, దివాలా తీశామని, వ్యవసాయం గిట్టుబాటు కావటం లేదు కనుక రుణాల రద్దు, సబ్సిడీలను కొనసాగించాలన్న కోట్లాది రైతాంగ వినతుల సందర్భంగా మీడియా, పారిశ్రామికవేత్తలు కూడా వాటికి వ్యతిరేకమైన వాదనలు చేస్తున్న విషయం తెలిసింది. ఎవరైనా స్వంత కాళ్ల మీద నిలబడాలి తప్ప ప్రభుత్వాలు ఆదుకుంటే సోమరితనాన్ని పెంచినట్లే అని సుభాషితాలు పలికారు. అవే నోళ్లు ఇప్పుడు ఆర్ధిక ఇబ్బందుల నుంచి పారిశ్రామిక, వాణిజ్య రంగాన్ని బయటపడవేసేందుకు వుద్దీపన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాయి. రాయిటర్స్‌ కధనం ప్రకారం కొంత మంది బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ రంగానికి చెందిన ప్రముఖులు ఆర్ధిక మంత్రి నిర్మలాసీతారామన్‌ గ.ారిని కలిశారు. వారు చెప్పిన అంశాల మీద ఎలాంటి చర్చ లేకుండా కృతజ్ఞతలు, మేం పరిశీలిస్తామని చెప్పి పంపారు. ఎక్కువ సమావేశాల తంతు ఇలాగే వుంటోంది.

ఆర్ధిక వ్యవస్ధ దిగజారుతుండటంతో దిక్కుతోచని ప్రభుత్వం జనం దృష్టిని మళ్లించేందుకు పెద్ద ఎత్తున సిబిఐ, ఇడి, ఇతర ఆర్ధిక దర్యాప్తు సంస్ధల దాడులను ప్రారంభించింది. అక్రమాల మీద చర్య తీసుకోవటాన్ని తప్పు పట్టనవసరం లేదు. ఇదే సమయంలో ఆర్ధిక వ్యవస్ధ రక్షణకు తీసుకున్న చర్యలేమిటన్నది అసలు ప్రశ్న. ఐదేండ్ల క్రితం ఒక నవయువకుడు ప్రేమలో పడినట్లుగా మేము వున్నాం, ఇప్పుడు కలలు కల్లలైనట్లుగా తయారైంది అని ఒక వాణిజ్య వేత్త వ్యాఖ్యానించారు. అది నరేంద్రమోడీ గురించి అని వేరే చెప్పనవసరం లేదు.

Image result for cow stories,narendra modi cartoon

దేశం ఆర్ధికంగా దిగజారుతోంది అని గుర్తించటానికి కూడా నరేంద్రమోడీ సర్కార్‌ సిద్దపడటం లేదు. ఆర్ధిక వ్యవస్ధను చక్కదిద్దేందుకు స్ధిరచిత్తం గలవారు చెప్పే మాటలను ఆలకించండి అని మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ వ్యాఖ్యల గురించి ఏం చెబుతారని విలేకర్లు అడిగితే ఆయనేం చెప్పారో నాకు తెలియదు, చెప్పినదాని మీద నాకెలాంటి ఆలోచన లేదు, ఆయన చెప్పింది నేను విన్నాను అంతే అని ముక్తసరిగా ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సమాధానం చెప్పారు. కార్ల అమ్మకాలు పడిపోవటానికి యువతీ యువకులు కార్లు కొనటం మాని ఓలాలు, వూబర్‌లు ఎక్కుతున్నారని ఆమె సెలవిచ్చిన విషయం తెలిసిందే.

దేశంలో నిరుద్యోగుల శాతం 8.2కు పెరిగిందని, పట్టణాల్లో అది 9.4శాతంగా వుందని సిఎంఐఇ చెప్పింది. పెంచిన సర్‌ఛార్జిని వుపసంహరిస్తున్నట్లు ప్రకటించిన తరువాత కూడా విదేశీ (ఎప్‌పిఐ) మదుపుదార్లు పెట్టుబడులను వుపంసంహరించటం ఆగలేదు. రూపాయి విలువ 72 దాటి పతనమైంది. ఒక వైపు పరిస్ధితి ఇలా వుంటే ఇప్పటికీ భారత్‌ వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగానే వుంది అంటూ గతనెల 26న బిజెపి ట్వీట్‌ ద్వారా ప్రకటించింది. పని గట్టుకొని ఎగవేస్తున్న వారి నుంచి బ్యాంకు రుణాలు వసూలు చేయటం మీద అంతగా శ్రద్ద పెట్టని కేంద్ర ప్రభుత్వం బ్యాంకుల విలీనాన్ని ముందుకు తెచ్చింది. పెద్ద నోట్ల రద్దు, జిఎస్‌టి సర్వరోగ నివారిణి జిందా తిలిస్మాత్‌ అన్నట్లుగా ప్రభుత్వం ప్రచారం చేసింది. ప్రస్తుతం అభివృద్ధి మందగించటానికి అవే ప్రధాన కారణం అని అనేక సర్వేలు చెబుతున్నా అంగీకరించటానికి ప్రభుత్వం సిద్దంగా లేదు. వీటి గురించి రోజూ మీడియాలో వార్తలు వస్తుంటే ప్రస్తావించని మోడీ గారు దేశానికి ఆవు పాఠాలు చెబుతున్నారు. దేశాన్ని ఎవరు వెనక్కు తీసుకుపోతున్నారు ? ఇది వినోదమా దేశానికి పట్టిన విషాదమా ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

తొలిసారి ముఖ్యమంత్రిగా జగన్‌, మూడోసారి ప్రతిపక్ష నేతగా చంద్రబాబుకు వంద రోజులు !

12 Thursday Sep 2019

Posted by raomk in AP NEWS, Current Affairs, History, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

100 days : ys jagan as cm- chandrababu as opposition leader, CHANDRABABU, CM YS Jagan, tdp, Ycp

Image result for ys jagan vs chandrababu naidu

ఎం కోటేశ్వరరావు

ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారి ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన రెడ్డి పాలనకు, మూడోసారి ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడికి వంద రోజులు పూర్తయింది. ఈ సందర్భంగా టీవీల్లో జరిగిన చర్చల్లో యాంకర్లు మీరు జగన్‌ తొలి వంద రోజుల పాలనకు ఎన్ని మార్కులు వేస్తారు అన్నది ఒకటి. ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు తొలి ఆందోళనగా చేపట్టిన చలో ఆత్మకూరు యాత్ర గురించి కూడా మీడియాలో చర్చ జరిగింది.

జగన్‌ పాలన విషయానికి వస్తే నవరత్నాల సంక్షేమ చర్యల అమలుకు తొలి ప్రాధాన్యత ఇచ్చారు. గత పాలనలో జరిగిన అవినీతి అక్రమాలను వెలికి తీసేందుకు కొన్ని చర్యలను ప్రకటించారు. కొండంత రాగం తీసిన విద్యుత్‌ ఒప్పందాల విషయంలో ఎదురుదెబ్బలు తగిలాయి. సంప్రదాయేతర విద్యుత్‌ వుత్పత్తి సంస్ధలు విద్యుత్‌ పంపిణీ సంస్ధలతో కాకుండా రాష్ట్ర ప్రభుత్వంతో గతంలో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. వాటన్నింటిలో కేంద్రంలో బిజెపి సర్కార్‌లో భాగస్వామి అయిన తెలుగుదేశం, రాష్ట్రంలోని తెలుగుదేశం సర్కార్‌లో చేరిన బిజెపి నేతలు, వారి లాబీయిస్టులు, ప్రభుత్వాలు భాగస్వాములు. ఆ విద్యుత్‌ కంపెనీలన్నీ విదేశీ బడా సంస్ధలకు చెందినవి. వాటి వత్తిడి మామాలుగా వుండదు. తాజాగా అందిన సమాచారం ప్రకారం తాము అన్ని ఒప్పందాలను తిరగదోడబోమని, అక్రమాలు జరిగిన వాటికే పరిమితం అవుతామని జగన్‌ సర్కార్‌ కేంద్ర ప్రభుత్వానికి వివరణ ఇచ్చింది. అందువలన పంచపాండవులంటే మంచం కోళ్ల మాదిరి మూడనుకొని రెండంకె వేసి తప్పని కొట్టేసి ఒకటిగా చివరికి సున్నాగా మారుస్తారా అన్నది చూడాల్సి వుంది. నవయుక కంపెనీ ఒప్పందం రద్దు కోర్టులో వుంది. రివర్స్‌ టెండర్ల ప్రక్రియ ఏమౌతుందో చూడాల్సి వుంది. టెండర్ల జారీకి ముందే పరిశీలనకు ఒక రిటైర్డ్‌ న్యాయమూర్తితో పరిశీలనకు ఏర్పాటు చేశారు. భవిష్యత్‌లో అన్నీ రివర్స్‌ టెండర్లే వుంటాయని ప్రకటించిన సర్కార్‌ మరో వైపు ఈ కమిటీని ఏర్పాటు చేసింది.

ఎన్నికల ప్రణాళికలో వాగ్దానం చేసిన నవరత్నాల గురించి జనం మరచిపోయే విధంగా రాజధాని వివాదాన్ని తలకు చుట్టుకోవటంలో వైసిపి జయప్రదమైంది. రాజధాని నిర్మాణం గురించి అనవసర చర్చకు తెరలేపింది, దాన్ని సమర్ధించుకొనేందుకు ఆ ప్రాంతంలో భూముల కొనుగోలులో తెలుగుదేశం నేతలు అక్రమాలకు పాల్పడ్డారని చెప్పింది. ఇది ఒక ఎత్తుగడగా ముందుకు తీసుకు వచ్చారా? అది తప్పుడు ఎత్తుగడా అన్నది పక్కన పెడితే వైసిపి కొత్త సమస్యలను కొని తెచ్చుకున్నది. మార్కుల భాషలో చెప్పుకోవాలంటే ఆ పార్టీ తన సిలబస్‌లో లేని అంశాలను తానే ముందుకు తెచ్చి తలెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, రాయలేక ఇబ్బందులకు గురి అవుతోంది. అందువలన దానికి అత్తెసరు తప్ప పెద్దగా మార్కులు రాలేదు. రాజధాని సమస్యపై రగడ సృష్టించిన మంత్రి బొత్స సత్యనారాయణకు, ఆయనను సమర్ధించిన పార్టీ వారిని చుట్టుముట్టిన ప్రశ్నలకు వుక్కిరి బిక్కిరై రాజధాని మారుస్తామని మేము చెప్పామా అంటున్నారు. అభివృద్ది మొత్తం ఒక్క రాజధాని ప్రాంతంలోనే చేస్తే ఎలా మిగతా ప్రాంతాలలో జరగనవసరం లేదా అనే ఎదురుదాడికి దిగారు. ఇక రాజధాని ప్రాంతంలో భూములు కొనుగోలులో అక్రమాలకు పాల్పడ్డారు అనే ఆరోపణ ఒక ప్రతిపక్ష పార్టీగా చేయటం వేరు. అధికారానికి వచ్చిన తరువాత కూడా అదే ఆరోపణలు చేస్తే ఫలితం లేదు. వాటిని నిగ్గుతేల్చాల్సిన బాధ్యత తమదే అని మర్చిపోరాదు. తగు సమయంలో బయట పెడతాం అంటే కుదరదు.

ప్రజాకర్షక సంక్షేమ పధకాలకు సంబంధించి తప్ప వైసిపి వద్ద అభివృద్ధి ఆలోచనలు లేదా పధకాలు గానీ లేవు. వర్షాధారిత రైతు మాదిరి ప్రయివేటు పెట్టుబడుల కోసం ఎదురు చూడటం తప్ప, ప్రభుత్వంగా పెట్టుబడులు పెట్టి వుపాధి కల్పించటానికి ఎలాంటి ఆలోచనా లేదు. చర్చల్లో నిలదీస్తే మా నాయకుడు త్వరలో వెల్లడిస్తారు అని చెప్పటం తప్ప మరొక మాట లేదు. దేశంలోనూ, ప్రపంచ వ్యాపితంగా ఆర్ధిక మాంద్యం సూచనలు కనిపిస్తున్న తరుణంలో ప్రధాని నరేంద్రమోడీ మౌన ముద్ర వహించినట్లుగానే మూలవిరాట్టు ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి రాజధాని గురించి, అన్ని ప్రాంతాల అభివృద్ధి గురించి ఇంతవరకు నోరు విప్పలేదు. వైసిపి వుత్స విగ్రహాలే మాట్లాడుతున్నాయి. రైతాంగానికి గిట్టుబాటు ధరలు, వ్యవసాయానికి ప్రోత్సాహం, నిరుద్యోగ యువతకు వుపాధి కలిగించకుండా ఎన్ని కబుర్లు చెప్పినా ఫలితం లేదు. సర్వరోగ నివారిణి జిందా తిలిస్మాత్‌ అన్నట్లుగా గ్రామ సచివాలయాల ఏర్పాటు గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వం చెబుతున్నట్లుగా గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా జనానికి 237 సేవలను అందిస్తామంటున్నారు. లక్ష్యం మంచిదే, ఇవి కార్యరూపం దాల్చితే తప్ప వాటి గురించి చెప్పలేము. అయితే ఇదే అభివృద్ధి, నాలుగు లక్షల మంది వలంటీర్లనియామకాన్ని నాలుగు లక్షల వుద్యోగాల కల్పనగా చిత్రిస్తే ఎదురు దెబ్బలు తగలటం ఖాయం.

ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు చలో ఆత్మకూరు పేరుతో తొలి ఆందోళనా యాత్రకు తెరతీశారు. గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలోని ముఠా కక్షలకు నిలయమైన గ్రామాల్లో అదొకటి. అక్కడ ఎక్కువ మంది జనాభా దళితులే. అయినా తెలుగుదేశం, వైసిపి పెత్తందార్ల మధ్య చీలిపోయి వున్నారు. పరస్పర దాడులు, కేసుల్లో బాధితులుగా కూడా వారే వుంటారు. గ్రామాల్లో ముఠా కక్షలకు ఎవరు తెరతీసినా, వాటిని ఎవరు కొనసాగించినా గర్హనీయమే. ఎక్కువ సందర్భాలలో ఎక్కడైనా బాధితులుగా వెనుకబడిన తరగతులు, దళితులే ఎక్కువగా వుంటారు. పెత్తందార్లు రెండు పార్టీల మద్దతుదార్లుగా మోహరించినపుడు ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ పెత్తందార్లదే ఆ గ్రామంలో పెత్తనం. వారికి అదొక ఆదాయ మార్గం కూడా, అందుకే అధికారం లేనపుడు పెట్టుబడులు పెడతారు, ముఠాలను నిర్వహిస్తారు. అధికారం రాగానే వడ్డీతో సహా రాబట్టుకుంటారు.

తమ చలో ఆత్మకూరు పిలుపును సాగనివ్వలేదని, మరోసారి అలాంటి ప్రయత్నం చేస్తామని చంద్రబాబుతో సహా తెలుగుదేశం నాయకత్వం గుండెలు బాదుకొని ప్రజాస్వామ్యం గురించి కడవల కొద్దీ కన్నీరు కార్చింది. నిజానికి వారికి నైతికంగా వున్న హక్కు వున్నదా ? తెలుగు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా వున్న సమయంలో అధికారికంగా, పార్టీగా తెలుగుదేశం కూడా ప్రతిపక్ష పార్టీలు ఇచ్చిన ప్రతి చలో పిలుపును పోలీసు యంత్రాంగంతో, పార్టీ పరంగా సాగకుండా చేసేందుకు చేయాల్సిందంతా చేశారు. అంతే కాదు, చంద్రబాబు ఎక్కడ పర్యటనకు పోతే అక్కడి సిపిఎం, సిపిఐ పార్టీలు, ఇతర ప్రజాసంఘాల నేతలను ముందుగానే అదుపులోకి తీసుకోవటం, దూర ప్రాంత పోలీసు స్టేషన్లకు తరలించటం అందరికీ తెలిసిన అంశమే. కొన్ని సందర్భాలలో వైసిపి నేతలను కూడా అక్కడక్కడా అలా ముందుస్తుగా నిర్బంధించిన వుదంతాలు కొన్ని లేకపోలేదు. అదే గుంటూరు జిల్లా పెద్ద గొట్టిపాడులో దళితులమీద జరిగిన దాడిని ఖండించేందుకు సిపిఎం, ఇతర పార్టీలు, సంస్ధలు ఇచ్చిన పిలుపును తెలుగుదేశం సర్కార్‌ సాగనివ్వలేదు. ప్రకాశం జిల్లా దేవరపల్లిలో దళితుల భూ సమస్య మీద కూడా అదే చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా గరికపర్రులో అంబేద్కర్‌ విగ్రహం, సామాజిక బహిష్కరణ వివాదంలో ఒక్క ఆగ్రామానికి రానివ్వకపోవటమే కాదు పది కిలోమీటర్ల దూరంలో వున్న భీమవరంలో కూడా నిరసన తెలిపేందుకు అవకాశం ఇవ్వలేదు. ఈ మూడూ దళితుల ప్రమేయం వున్న సామాజిక న్యాయ వుదంతాలు, ఆత్మకూరు మాదిరి పెత్తందార్ల ముఠాకక్షల సమస్య కాదు. మరొకటి పశ్చిమ గోదావరి జిల్లాలోని కాలుష్యకారక తుందుర్రు ఆక్వా ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా జరిగిన ఆందోళన సమయంలోనూ తప్పుడు కేసులు పెట్టి మహిళలతో సహా ఎందరినో జైలు పాలు చేసింది చంద్రబాబు సర్కార్‌. అక్కడ కూడా అంతే పరిసర పట్టణాల్లో కూడా నిరసన తెలిపేందుకు అవకాశం ఇవ్వలేదు. అలాంటి పార్టీ తమ పెత్తందార్లకు మద్దతుగా ఆత్మకూరు యాత్ర జరపాలని ప్రయత్నించింది. అంగన్‌ వాడీలు, ఆశావర్కర్లు,ఇతర అనేక చిరుద్యోగ సంఘాలు చలో అమరావతి పిలుపు ఇస్తే (వారేమీ సచివాలయం దగ్గరకు వెళ్లేందుకు కాదు) విజయవాడకు రాకుండా చేసేందుకు రైళ్లలో,బస్సులో బయలు దేరిన వారిని ఎక్కడికక్కడ దింపివేసి అడ్డుకున్న చరిత్రను చెరిపేస్తే చెరగదు. తాను రెండు కాళ్లతో నడుస్తూ వెళుతున్నా అడ్డగించారని అసెంబ్లీలో తెలుగుదేశం వుపనేత కె అచ్చన్నాయుడు వాపోయారు. ఆయన మంత్రిగా వున్న సమయంలో వివిధ చలో పిలుపులు ఇచ్చిన వారు కూడా కాలినడకనే వెళ్లేందుకు ప్రయత్నించారు. వారేమీ అనుమతి లేని ఆయుధాలు తీసుకొని రాలేదు. అంగన్‌ వాడీలు, ఆశాలు అందరూ మహిళలు కూడా. అధికారంలో వుంటే ఒక పాట ప్రతిపక్షంలో వుంటే మరొక పల్లవి.

Image result for ys jagan vs chandrababu naidu

అయితే చలో ఆత్మకూరు విషయంలో అధికార వైసిపి లేదా ప్రభుత్వ వైఖరిని ఎలా చూడాలి. పైన పేర్కొన్న పెదగొట్టిపాడు, గరికపర్రు, తుందుర్రు వుదంతాల్లో వైసిపి జనం తరఫున నిలబడేందుకు ముందుకు రాలేదు. గరికపర్రు దళితులను ఓదార్చాలనే ఆలోచనే జగన్‌కు రాలేదు. అంటే ఆ ప్రాంతాల్లో వున్న పెత్తందార్లు వారికి ముఖ్యంగా కనిపించారు తప్ప జనం కాదు. ఆత్మకూరు విషయంలో కూడా పెత్తందారీ పోకడలనే వైసిపి ప్రదర్శించింది. చంద్రబాబు నాయుడు వైసిపి బాధితుల శిబిరం పేరుతో గుంటూరులో హడావుడి చేస్తే, దానికి పోటీగా తెలుగుదేశం బాధితుల పేరుతో తాను కూడా సమీకరించింది. చలో ఆత్మకూరుకు పోటీగా తమ మద్దతుదార్లకు అనుకూలంగా పోటీగా అదే చలో ఆత్మకూరు పిలుపు ఇచ్చింది. ఒక అధికార పార్టీ ఇలా వ్యవహరించటం సమస్యను పరిష్కరించటంగాక తమ శిబిరాన్ని నిలబెట్టుకొనే యత్నం తప్ప మరొకటి కాదు. ఇలాంటి పార్టీ రేపు మరొక సామాజిక న్యాయ సమస్య మీదో, ప్రజాసమస్యల మీదో వామపక్షాలో, ప్రజా సంస్ధలో ఇచ్చిన పిలుపును కూడా సాగనిస్తారనే గ్యారంటీ లేదు. ఇప్పటికే అలాంటి కొన్ని సూచనలు వున్నాయి. తెలుగుదేశం చలో ఆత్మకూరు పిలుపు ఇచ్చేంత వరకు గుంటూరు శిబిరంలో వున్న ఆత్మకూరు, ఇతర గ్రామాల వారికి భరోసా కల్పించి వారిని గ్రామాలకు పంపించి తగు రక్షణ కల్పించేందుకు జిల్లా అధికార యంత్రాంగం ముందుకు రాలేదు. తీరా ఆందోళన రోజు ఆ పని చేసింది? అదే ముందు ఎందుకు చేయలేదు ? చంద్రబాబు హయాంలో అధికార యంత్రాంగం తెలుగుదేశం కనుసన్నలలో పని చేస్తే జగన్‌ ఏలుబడిలో వైసిపికి అనుకూలంగా వ్యవహరించనుందని ఈ వుదంతం వెల్లడించింది.

తెలుగుదేశం వైఖరిని సమర్ధించటమా, దెబ్బకు దెబ్బ, వారి పాఠం వారికే తిరిగి చెప్పారు అనుకుంటే పొరపాటు. గత ఐదేండ్ల చంద్రబాబు పాలనలో లెక్కలు తీస్తే ముందస్తు అరెస్టులు, నిరసనలను అడ్డుకోవటాలు ప్రధాన ప్రతిపక్షంగా వున్న వైసిపి పట్లకాదు, బలం పరిమితంగానే వున్నా, అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేకపోయినా ప్రజల సమస్యల మీద నిరంతరం పోరాడిన వామపక్షాలు, ప్రజాసంఘాలు, సామాన్య జనం మీదనే దాడిని ఎక్కు పెట్టారు. ఇది న్యాయమైన ప్రజాస్వామ్య లేదా ఆర్ధిక హక్కుల మీదనే దాడి అన్నది గ్రహించాలి. అందువలన గత ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటు వేసినా ఇలాంటి అప్రజాస్వామిక చర్యలకు ఏ ప్రభుత్వం పాల్పడినా ప్రశ్నించాలి. లేకపోతే అంతిమంగా నష్టపోయేది మనమే అని జనం గ్రహించాలి.

గమనిక : చంద్రబాబు నాయుడు 2004,2009లో రెండు సార్లు ప్రతిపక్ష నేతగా పదేండ్లు కొనసాగటాన్ని ఒక విడతగా, తాజాగా నిర్వహిస్తున్న పాత్రను రెండోదిగా పరిగణించి ఈ విశ్లేషణలో రెండుసార్లు అని పేర్కొన్నాను. సాంకేతికంగా చూస్తే మూడవ సారి, అందువలన ఆ మేరకు శీర్షికను, విశ్లేషణ అంశంలో ఆ మేరకు సవరించాను.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

నిర్మలమ్మా నిజాలను అంగీకరించండి, నివారణ చర్యలు తీసుకోండి !

11 Wednesday Sep 2019

Posted by raomk in BJP, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion

≈ 1 Comment

Tags

automobile, BoycottMillennials, mindset of millenials, Nirmala Sitharaman

Image result for Twitter trolls Nirmala Sitharaman's 'mindset of millennials' remarks cartoon

అమ్మా నిర్మలమ్మా ఒక తెలుగింటి కోడలివనే గౌరవంతో ఒక తెలుగువాడిగా ఈ బహిరంగ లేఖలో నాలుగు ముక్కలు రాస్తున్నా. ఆటో మొబైల్‌ పరిశ్రమలో తలెత్తిన పరిస్ధితికి కారణాలను వివరించాలని మీరే అనుకున్నారో, విలేకర్లు ఎవరైనా వ్యాఖ్యానించమని కోరారో తెలియదు. మీ అధినేత ప్రధాని నరేంద్రమోడీయే ఇంతవరకు నోరు విప్పలేదు, మన్‌కీ బాత్‌లో కూడా చెప్పలేదు. ప్లాస్టిక్‌ గురించి, ఫిట్‌నెస్‌ వంటి సుభాషితాలనే పలికారు. మీ రెందుకమ్మా అలా వ్యాఖ్యానించారు. కార్ల అమ్మకాలు పడిపోవటానికి యువత ఓలాలు, వూబర్‌లు, మెట్రోలు ఎక్కటం, వాయిదాలు కట్టేందుకు సిద్దం గాకపోవటం, బిఎస్‌ 6 కారణాలని చెప్పటం ఏమిటి తల్లీ ?

తెలుగునాట ఒక సామెత వుంది, తాటి చెట్టు ఎందుకు ఎక్కావంటే దూడ గడ్డి ఎక్కడుందో చూడటానికని చెప్పాడట ఒకడు. అసలు విషయం కల్లుకోసం ఎక్కాడని వేరే చెప్పనవసరం లేదు. మీరు కూడా సమస్య వుంది, పరిశీలిస్తున్నాం, తగిన సమయంలో తగు చర్యలు తీసుకుంటాం ఇలా ఏదో ఒకటి చెప్పకుండా ఈ సహస్రాబ్ది కుర్రకారు మానసిక స్ధితి గురించి అలా మాట్లాడారేమి తల్లీ ! అయినా కార్ల అమ్మకాలు, కుర్రకారు గురించి మీరు చెప్పిన మాటలను ఏడాది క్రితమే మహింద్రా సంస్ధ అధిపతి ఆనంద్‌ మహింద్ర, మారుతి కంపెనీ చైర్మన్‌ ఆర్‌సి భార్గవ చెప్పారమ్మా. వాటినే ఇప్పుడు మీరు పునశ్చరణ చేశారు. కార్లంటే అదేదో కుర్ర వ్యవహారంగా మార్చి వేశారు. మన దేశంలో వున్న జనాభాలో 40 కోట్ల మంది కుర్రకారే. వారిలో ఒక కోటి మంది కొనుగోలు చేసినా ఎంతో మార్కెట్‌ వుంటుంది. 2018 మార్చినెలతో ముగిసిన ఆర్దిక సంవత్సరంలో మన దేశంలో వుత్పత్తి అయిన అన్ని రకాల మోటారు వాహనాల సంఖ్య 2.91 కోట్లు. వీటిలో ద్విచక్ర వాహనాలు 2.31 కోట్లు, కార్లు 21.7లక్షలు, త్రిచక్ర వాహనాలు పది లక్షలు, వాణిజ్య వాహనాలు ఆరులక్షల అరవై వేలు,ఎగుమతి చేసిన కార్లు ఏడు లక్షలు, ద్విచక్ర వాహనాలు 32.6లక్షలు, వాణిజ్యవాహనాలు లక్ష,త్రిచక్ర వాహనాలు 5.3లక్షలు.

Image result for Twitter trolls Nirmala Sitharaman's 'mindset of millennials' remarks cartoon

మీరు వూహా లోకంలో వున్నట్లున్నారు. మన యువతీ, యువకులందరూ కార్లు కొనేంతగా వేతనాలు తెచ్చుకోవటం లేదు గనుక మన దగ్గర అంత సీన్‌ లేదు తల్లీ. 2018 డిసెంబరు 12న ఆటో. ఎకనమిక్‌ టైమ్స్‌ సమాచారం ప్రకారం మన దేశంలో ప్రతి వెయ్యి మందికి 22 కార్లు వుంటే చైనాలో 164, జపాన్‌లో 591, కెనడాలో 662, ఆస్ట్రేలియాలో 740, న్యూజీలాండ్‌లో 774, బ్రిటన్‌లో 850, అమెరికాలో 980 వున్నాయట. సహస్రాబ్ది కుర్రకారు అందరూ కార్లు కొనటం మానుకోలేదు. వారికి అంత ఆర్ధిక శక్తి కూడా లేదు. అంతర్జాతీయ చమురు సంస్ధ(ఐఇఏ) అంచనా ప్రకారం 2040 నాటికి మన దేశంలో వెయ్యి మందికి 175 కార్లు వుంటాయట. మోడీగారు చెప్పినట్లు పకోడీల బండ్లు నిర్వహించే వారు కూడా వుద్యోగులే అయితే వారందరికీ ఐటి ఇంజనీర్లలో కొంత మందికి వస్తున్న మంచి ఆదాయాలు వారికి కూడా వస్తే వారు కూడా కారులో వచ్చి పకోడీలు అమ్మి తిరిగి కారుల్లోనే ఇండ్లకు వెళతారు. అమెరికాలో రోడ్లు వూడ్చే వారు కూడా కార్లలో వస్తారని మా చిన్నపుడు చెబితే అబ్బో అక్కడికి వెళ్లి వీధులూడ్చినా మన జీవితం ధన్యం అనుకొనే వాళ్లం. ఎందుకంటే అసమయంలో సినిమాల్లో తప్ప పల్లెటూళ్లలో వాస్తవంగా కార్లు చూసిన వారి సంఖ్య చాలా నామమాత్రంగా వుండేది మరి.

అనేక కంపెనీలు మందగమనం కారణంగా తమ వుత్పాదకతను తగ్గించిన తరువాత ఈ ఏడాది జూలై నెలలో కార్లు 25-30 రోజుల వుత్పత్తి, వాణిజ్య వాహనాలు 55-60 రోజుల, ద్విచక్ర వాహనాలు 60ా65 రోజుల వుత్పత్తి నిల్వలు వున్నాయని ఆటో పరిశ్రమ అంచనా. కుర్రకారంటే కార్లు కొనటం లేదు, మరి వాణిజ్య వాహనాలు, ద్విచక్రవాహనాల అమ్మకాల్లో ఎందుకు మాంద్యం ఏర్పడినట్లు ? బిఎస్‌ 6 ను ఒక కారణంగా చూపుతున్నారు. ఇది కూడా అంతగా అతకటం లేదమ్మా! బిఎస్‌ ఒకటి నుంచి ఐదు వరకు లేని సమస్య ఆరుకు వచ్చిందంటే ఎలా? కొత్తగా వచ్చే తరం వాహనాల కోసం ఎదురు చూసే వారు చాలా నామమాత్రంగా వుంటారు తప్ప అసలు కొనుగోళ్లను బంద్‌ చేసిన వుదంతం లేదు. అసలు కంపెనీలే కొత్త తరం గడువుకు అనుగుణ్యంగా తమ పాత తరం వుత్పత్తి క్రమంగా తగ్గించటం లేదా నిలిపివేసే ప్రణాళికలను రూపొందించుకుంటాయి తప్ప అమాయకంగా అమ్ముడు పోని వాహనాలను తయారు చేసి పెట్టుకుంటాయా ? మన కార్పొరేట్‌ సంస్ధలు మరీ అంత అమాయకంగా లేవు తల్లీ !

Image result for Twitter trolls Nirmala Sitharaman's 'mindset of millennials' remarks cartoon

మీరు గానీ మీ సర్కార్‌ గానీ దేశంలో ఆర్దిక మాంద్యం పెరుగుతోంది అని అంగీకరించటానికి సిద్ధంగా లేరు. కుర్రకారు కార్లు కొనేందుకు విముఖత చూపుతున్నారు గనుక ఆటోమొబైల్‌ రంగం కుదేలైందని కాసేపు మీ అభిప్రాయాన్ని అంగీకరిద్దాం. అమెరికా-చైనా వారు వాణిజ్య యుద్ధంలో మునిగితే దాన్ని వుపయోగించుకొని మన దేశం చైనా స్ధానాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తామని ఎప్పటి నుంచో చెబుతున్నారు కదా ? అదే వాస్తవమైతే గత ఏడాది కాలంలో మన ఎగుమతులు పెరగాల్సింది పోయి తగ్గాయి ఎందుకని ? ఎనిమిది కీలక రంగాల్లో వృద్ధి రేటు గతేడాది జూలైలో 7.3శాతం వుంటే ఈ ఏడాది జూలైలో 2.1శాతానికి పడిపోవటానికి కారకులు ఎవరు. ప్రభుత్వం ప్రకటించినట్లుగా గత 25నెలల్లో అత్యంత కనిష్టంగా టోకు ధరల సూచి పెరుగుదల 1.8శాతంగా నమోదైంది. అంటే ధరల పెరుగుదల వున్నా పెద్దగా లేవు. అయినప్పటికీ వినియోగ వస్తువులను తయారు చేసే కంపెనీలు తమ వస్తువులకు డిమాండ్‌ తగ్గిపోయిందని గగ్గోలు పెడుతున్నాయి. వినియోగవస్తువులను వుపయోగించే విషయంలో సహస్రాబ్ది కుర్రకారు పాత తరాలను మించిపోయింది కదా ! మరి ఆ వస్తువులకు డిమాండ్‌ ఎందుకు తగ్గినట్లు ? చివరకు ఐదు రూపాయల బిస్కెట్‌ పాకెట్లు కూడా సరిగా అమ్ముడు పోవటం లేదని పార్లే కంపెనీ ముంబైలోని విల్‌ పార్లే ఫ్యాక్టరీని మూసివేసింది. వీటికి ఓలా, వూబర్‌లు ఎక్కే కుర్రకారేనా ? అందుకే తల్లీ నిజాలను అంగీకరించండి, ఆత్మావలోకనం చేసుకోండి. వైఫల్యానికి ఎవరో ఒకరిని బలి చేయాలి కనుక ఆర్‌ఎస్‌ఎస్‌ మరో కొత్త బమ్మను రంగంలోకి తెస్తే ఏమో గాని లేకపోతే మరో నాలుగు సంవత్సరాల వరకు మీ సర్కార్‌కు ఎలాంటి ఢోకా వుండదు. నిజాన్ని అంగీకరించి నివారణ చర్యలు చేపట్టండి, మూసిపెడితే పాచిపోతుందని గుర్తించండి.

Image result for Twitter trolls Nirmala Sitharaman's 'mindset of millennials' remarks cartoon

చెన్నయ్‌లో మీరు విలేకర్ల సమావేశంలో మాట్లాడిన మాటలు విన్న వారు టీవీల్లో కన్నవారిలో కుర్రకారు ఒకటే జోకులు వేసిన విషయం మీ వరకు వచ్చే వుంటుంది. ఏది ఏమైతేనేం ఒకందుకు మాత్రం మిమ్మల్ని అభినందించక తప్పదు. రేపేం కానుందో అని అన్ని తరగతుల వారు ఆందోళనపడుతున్న తరుణంలో మీ ప్రకటనతో పేలుతున్న జోకులతో విషాదంలో వినోదం మాదిరి నవ్వుకుంటున్నారంటే అది మీ పుణ్యమే. ఇదే మాట నరేంద్రమోడీ నోట వచ్చి వుంటే దేశం ఇంకా విరగబడి నవ్వి వుండేది. కొన్ని జోకులు ఎలా వున్నాయో మీకు చెబుదామనుకుంటున్న. దేశంలో మంచి నీటి కొరతకు మిలీనియల్స్‌ ఎక్కువగా తాగటం, ఆక్సిజన్‌ కొరతకు ఎక్కువగా పీల్చటం. పారగాన్‌ చెప్పుల అమ్మకాలు పడిపోవటానికి మిలీనియల్స్‌ చెప్పులు లేకుండా తిరగటమే కారణం. ఎంఎల్‌ ఏలను కొనేందుకు అమిత్‌ షా పేటిఎంను వినియోగిస్తున్న కారణంగా నల్లధనం తగ్గిపోయింది. అనిల్‌ అంబానీ అప్పులు చెప్పులు చెల్లిస్తున్నందున నిరర్ధక ఆస్ధులు తగ్గుతున్నాయి. పార్లమెంట్‌ సభ్యురాలైన సాధ్వి ప్రజ్ఞాసింగ్‌ బిజెపి మంత్రుల మీద చేతబడి చేస్తున్న కారణంగా జనాభా తగ్గుతోంది. కార్ల అమ్మకాలు ఢమాల్‌ అన్నందుకు దేశం నుంచి మిలీనియన్స్‌ను బహిష్కరించాలంటూ ఒకటే ట్వీట్లు. ఇంకా వున్నాయి గానీ వినోదం కాస్త విషాదం అవుతుంది. వుంటా మరి

ఓ తెలుగోడు

ఎం కోటేశ్వరరావు

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

చంద్రయాన్‌ 2 ప్రయోగం : తీవ్ర ఆశాభంగం చెందింది నరేంద్రమోడీనా , శాస్త్రవేత్తలా !

09 Monday Sep 2019

Posted by raomk in CHINA, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, Politics, RUSSIA, USA

≈ Leave a comment

Tags

Chandrayaan 2, ISRO scientists, Narendra Modi, Vikram Lander

Image result for chandrayaan 2

ఎం కోటేశ్వరరావు

చంద్రయాన్‌ -2 ప్రయోగం విఫలమైందా ? ఈ ప్రయోగం ఫలితంపై తీవ్ర ఆశాభంగానికి గురైంది ఇస్రో శాస్త్రవేత్తలా లేక రాజకీయవేత్త ప్రధాని నరేంద్రమోడీనా ? ప్రయోగం విజయవంతంగా కావాలని మఠాధిపతులు, గుడి పూజారులు, చిన్న దేవుళ్లు, దేవతలు, పెద్ద వెంకటేశ్వరస్వామి ఆశీర్వచనాలు, వాట్సాప్‌ భక్తుల పూజలు ఏమైనట్లు ? అసలు శాస్త్రవేత్తలకు కావాల్సింది ఏమిటి ? ఈ ప్రాతిపదికన కొన్ని అంశాల మీద వెల్లడించే అభిప్రాయాలు తమ మనోభావాలను గాయపరుస్తాయని భావించే వారు, భయపడే వారు ఇక్కడి నుంచి చదివేందుకు ముందుకు పోవాలా లేదా అన్నది వారి స్వేచ్చకే వదలి వేస్తున్నాను.

నూతన ఆవిష్కరణలు గావించే మానవాళి శాస్త్ర పరిశోధనా, ప్రయోగాలు నిర్దిష్టంగా ఫలానా రోజున ప్రారంభం అయ్యాయని చెప్పలేము. ప్రతి చిన్న ఆవిష్కరణ ఎంతో పెద్ద పరిణామాలు, పర్యవసానాలకు దారి తీసింది. పెద్ద బండరాయి కంటే అంచు వాడిగా వుండే చిన్న రాయి ఎంతో శక్తివంతమైనదని, పశువులను చంపి తినటం కంటే వాటిని పెంచి అవసరమైనపుడు ఆహారానికి వినియోగించుకోవచ్చన్న ఆలోచన రావటం, వాటిని భూమిని దున్నటానికి వినియోగించవచ్చని ప్రయోగించటం ఎన్నో విప్లవాత్మక మార్పులకు దారితీసిన చరిత్ర తెలిసిందే. అందువలన అది నిరంతర ప్రక్రియ, మానవుడి లక్షణాల్లో ఒకటి. శాస్త్రవిజ్ఞానమే కాదు, ఏ విజ్ఞాన అభివృద్ధికైనా ఎదురుదెబ్బలే స్ఫూర్తి,కసిని పుట్టిస్తాయి. పరిశోధనా, ప్రయోగాలు వ్యక్తిగతం కంటే సమిష్టి కృషి ఫలితాలు, పర్యవసానాలే. అయితే ప్రతి ఆవిష్కరణలోనూ వ్యక్తిగత పాత్ర లేదా అంటే వుంటుంది. దానిలో కూడా ఇతరుల అనుభవాల సారం వుంటుంది. విద్యుత్‌ బల్బ్‌ను కనుగొన్నది ఎవరంటే ధామస్‌ ఆల్వా ఎడిసన్‌ అని చెబుతాము. నిజానికి అంతకు ముందు ఎందరో దాని మీద చేసిన పరిశోధనలు ఆయనకు తోడ్పడ్డాయి. ప్రతి దేశ అంతరిక్ష పరిశోధనకూ ఇదే వర్తిస్తుంది.

గత ఆరు దశాబ్దాలలో చంద్రుడి మీద అడుగు పెట్టేందుకు చేసిన ప్రతి ప్రయోగం విజయవంతం కాలేదు. అయినప్పటికీ ఏ దేశమూ నీరసించి తన ప్రయత్నాలను మానుకోలేదు. అమెరికాకు చెందిన నాసా సంస్ధ నిర్వహిస్త్ను చంద్రుడి వాస్తవ పత్రం(మూన్‌ ఫ్యాక్ట్‌ షీట్‌)లో వున్న సమాచారం ప్రకారం వివిధ దేశాలు ఇప్పటి వరకు 109 ప్రయోగాలు జరపగా 61 విజయవంతం కాగా 48 విఫలమయ్యాయి. మన చంద్రయాన్‌-2కు ముందు 2019 ఫిబ్రవరిలో ఇజ్రాయెల్‌లో ఒక ప్రయివేటు సంస్ధ చేసిన ప్రయోగం ఏప్రిల్‌లో విఫలమైంది.

1958,59 సంవత్సరాలలో నాటి సోవియట్‌ యూనియన్‌, అమెరికా దేశాలు 14 ప్రయోగాలు చేశాయి. వాటిలో సోవియట్‌ లూనా 1,2,3 మాత్రమే విజయవంతమయ్యాయి. మొదటి విజయానికి ముందు సోవియట్‌ ప్రయోగాలు ఆరు విఫలమయ్యాయి. తరువాత 1964లో అమెరికా జరిపిన ఏడవ ప్రయోగం విజయవంతమైంది. 1966లో సోవియట్‌ లూనా 9 చంద్రుడి మీద దిగి చంద్రుడి వుపరితల చిత్రాలను తొలిసారిగా పంపింది. ఐదునెలల తరువాత అమెరికా అలాంటి ప్రయోగంలోనే విజయవంతమైంది. తొలుత సోవియట్‌ యూనియన్‌ అంతరిక్షంలోకి యూరీ గగారిన్‌ను పంపి చరిత్ర సృష్టిస్తే, తరువాత అపోలో 11వ ప్రయోగంలో నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌ నాయకత్వంలో చంద్రుడి మీద తొలిసారి కాలుమోపిన చారిత్రాత్మక ఘటన తెలిసిందే. 1958 నుంచి 1979 వరకు అమెరికా, సోవియట్‌ యూనియన్‌ 90 ప్రయోగాలు జరిపాయి. తరువాత ఒక దశాబ్దం పాటు ఎలాంటి ప్రయోగాలు జరగలేదు. తరువాత జపాన్‌, ఐరోపాయూనియన్‌, చైనా, భారత్‌, ఇజ్రాయెల్‌ తమ ప్రయోగాలను ప్రారంభించాయి. 2009-19 మధ్య పది ప్రయోగాలు జరిగాయి. రష్యా, అమెరికా, చైనా మాత్రమే ఆ రంగంలో మొదటి మూడు స్ధానాలను ఆక్రమించాయి. మన చంద్రయాన్‌ 2 సఫలీకృతం అయితే మనది నాల్గో స్ధానం అవుతుంది. మన కంటే ఆర్ధికంగా బలమైన జపాన్‌ ఎంతో వెనుకబడి వుంది, అంతమాత్రాన దాని పలుకుబడి తగ్గలేదు. మిగతా కొన్ని రంగాలలో తన ప్రతిభ చూపింది.

ఒక ప్రయోగం విఫలమైనపుడు, మరొకటి సఫలమైనపుడు శాస్త్రవేత్తలు, సమాజం భావోద్వేగాలకు గురి కావటం సహజం. వస్తువు గురుత్వాకర్షణ, సాంద్రత, చలన శక్తి సూత్రాన్ని కనుగొన్న శాస్త్రవేత్త ఆర్కిమెడిస్‌ గురించి ప్రచారంలో వున్న కధ తెలిసిందే. తన సింహాసనం పూర్తి బంగారంతో చేసింది కాదని తనకు అనుమానంగా వుందని దాన్ని రుజువు చేయాలని రాజుగారు ఒక కర్తవ్యాన్ని నిర్దేశించారు. ఒక రోజు ఆర్కిమెడిస్‌ స్నానం చేస్తుండగా ఆయన కూర్చున్న తొట్టెలోంచి నీరు పైకి వుబికింది. అది తన బరువుకు సమానంగా గుర్తించి భావోద్వేగానికి గురై యురేకా యురేకా ( నాకు అర్ధమైంది, నాకు అర్ధమైంది) అంటూ నీటి తొట్టెలోంచి లేచి బట్టల్లేకుండానే వీధుల్లో పరుగెత్తి రాజుగారి దగ్గరకు వెళ్లాడు. తరువాత బంగారంలో వేరే లోహాన్ని కలిపినట్లు బయటపెట్టాడు. అంతకు ముందు ఆర్కిమెడిస్‌తో పాటు అనేక మంది బంగారంలో కల్తీని కనుగొనేందుకు అనేక ఆలోచనలు, ప్రయోగాలు చేయకపోలేదు. అయితే తామెలా చేసేది చూడండని రాజుగారిని వారు పిలిచిగానీ, లేదా మీ ప్రయోగాన్ని స్వయంగా చూస్తానని రాజుగారు వచ్చి కూర్చున్న వుదంతాలుగానీ, ప్రయోగం లేదా వివరణలో విఫలమైతే శాస్త్రవేత్తలు కంటినీరు పెట్టుకున్నట్లు, వారిని రాజుగారు ఓదార్చినట్లు ఎక్కడా చదవలేదు. అసాధారణంగా ఎక్కడైనా జరిగిందేమో నాకు తెలియదు.

ప్రస్తుతం మన దేశంలో ప్రతి అంశం మీద జనంలో భావోద్వేగాలు, మనోభావాలు రేపే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని జరుగుతున్న పరిణామాలను బట్టి భావించాల్సి వస్తోంది. శాస్త్ర పరిశోధనల మీద దేశమంతటా ఆసక్తిని కలిగించే యత్నాలు, శాస్త్రంపట్ల ఆసక్తిని కలిగించేందుకు తీసుకొనే చర్యలు వేరు. అనేక దేశాల్లో అంతరిక్ష ప్రయోగాలు జరిగాయి, కానీ మన ప్రధాని నరేంద్రమోడీ మాదిరి ఒక దేశాధినేత స్వయంగా పరిశోధనా కేంద్రానికి వచ్చి కూర్చొని వీక్షించిన వుదంతం వుందేమో చెప్పమ్మా అని గూగులమ్మ తల్లిని అడిగితే చెప్పలేదు. ఎవరి దగ్గర అయినా అలాంటి సమాచారం వుంటే నా వ్యక్తీకరణను సవరించుకొనేందుకు సిద్దం. ఇస్రో చరిత్రలో విజయాలతో పాటు అపజయాలు కూడా వున్నాయి. అపజయాలు సంభవించినపుడు వుత్సాహం కొరవడ వచ్చుగానీ, ఎప్పుడూ కంటనీరు పెట్టుకున్నట్లు చదవలేదు. చంద్రయాన్‌ 2 వుదంతంలో రాజకీయం, మీడియా జనంలో భావోద్వేగాలను పెంచటంలో , వుపయోగించుకోవటంలో మాత్రం విజయం సాధించింది. మన దేశంలో క్రికెట్‌ మీద, మరొక దేశంలో మరొక క్రీడను సొమ్ము చేసుకొనేందుకు జనంలో పిచ్చిని పెంచే విధంగా మీడియా రాతలు, ప్రకటనల ద్వారా ఆదాయాన్ని పొందే బిసిసిఐ తీరుతెన్నులను చూశాము.అది ముదిరిపోయి కొన్ని చోట్ల తాము ఆశించిన జట్టు విజయం సాధించని సందర్భాలలో అభిమానం దురభిమానంగా మారిన వుదంతాలు కూడా చూశాము. శాస్త్ర ప్రయోగాలు అలాంటివి కాదు. వాటి విజయం గురించి ఎవరూ హామీ ఇవ్వలేరు. మన చంద్రయాన్‌ మాదిరే ఇజ్రాయెల్‌ శాస్త్రవేత్తల మన ఖర్చులో సగంతో ఒక ప్రయోగం జరిపారు. అది ఏప్రిల్‌ 19వ తేదీన చివరిక్షణాల్లో సమాచార వ్యవస్ధతో సంబంధాలు తెగిపోయి, మన ప్రయోగం మాదిరే జయప్రదం కాలేదు. మన దేశంలో మాదిరి దృశ్యాలు,ఓదార్పు యాత్రలు అక్కడ లేవు. ప్రపంచంలో ఎక్కడా లేనిది మన దగ్గర ఎందుకో జనం ఆలోచించాలి.

చంద్రయాన్‌ ప్రయోగానికి ముందు సామాజిక మాధ్యమంలో ఒక అంశం చక్కర్లు కొట్టింది. అది నిడివి పెద్దది అయినా ఇక్కడ పూర్తి పాఠం ఇస్తున్నాను. ” చంద్రయాన్‌-2 ప్రయోగానికి అంతా రెడీ, కానీ ఎక్కడో ఏదో చిక్కుముడి తెమలడం లేదు, తేలడం లేదు లెక్క తెగడమే లేదు.900 కోట్ల ప్రాజెక్టు. కోట్ల మంది భారతీయుల ఆశలు. ప్రపంచ కన్ను . ఇస్రో ఛైర్మన్‌కు ఓ సీనియర్‌ సైంటిస్టు ఓ సలహా ఇచ్చాడు. ఇస్రో శివన్‌ కూడా ప్రతిదీ వినే తరహా, దేన్నీ తేలికగా తీసేసే రకం కాదు. ఆ సలహా ఏమిటంటే..? ‘పూరి శంకరాచార్యను కలుద్దాం సార్‌, ఆయన ఏమైనా పరిష్కారం చెప్పవచ్చు తను ఓ క్షణం విస్తుపోయాడు ఆధునిక గణితవేత్తలు, అంతరిక్ష శాస్త్రవేత్తలు, భౌతికశాస్త్ర పరిశోధకులకే చేతకానిది ఓ కాషాయగుడ్డల సన్యాసికి ఏం తెలుసు అని బయటికి వెల్లడించలేదు తన మనసులో భావాన్ని..! కానీ వాళ్లు వెళ్లలేదు స్వామివారినే శ్రీహరికోటకు రమ్మని ఆహ్వానించారు ఆయన వచ్చాడు,చూశాడు. ఆ లెక్కను చిటికెలో సాల్వ్‌ చేసేశాడు శంకరాచార్య అలియాస్‌ నిశ్చలానంద సరస్వతి. ఆయన ఎదుట అక్షరాలా భక్తిభావంతో సాగిలపడ్డాడు ఇస్రో చీఫ్‌. ఆ తరువాత కొద్దిరోజులకే చంద్రయాన్‌-2 మన పతాకాన్ని రెపరెపలాడిస్తూ ఖగోళంలోకి చంద్రుడి వైపు దూసుకుపోయింది అబ్బే, ఏమాత్రం నమ్మబుల్‌గా లేదు, ఉత్త ఫేక్‌ అని కొట్టేసేవాళ్లు బోలెడు మంది ఉంటారు కదా ఈ వార్తను..! కానీ కాస్త అతిశయోక్తి ఉంది గానీ వార్త నిజమే. కాకపోతే మన మెయిన్‌ స్ట్రీమ్‌ మీడియాకు ఇలాంటివి పట్టవు. అయితే ఇక్కడ గమనించాల్సిన అంశాలు కొన్ని ఉన్నయ్‌.ఈ స్వామి పూరి శంకరాచార్య నంబర్‌ 145, ఈయన 143వ శంకరాచార్యుడు భారతక ష్ణ తీర్థకు ప్రియమైన శిష్యుడు. ఆయన వేదగణితంలో దిట్ట. ఆధునిక గణితం వల్ల కాని అనేకానేక సంక్లిష్టమైన సూత్రాల్ని, సమీకరణాల్ని ఇట్టే సాల్వ్‌ చేసేవాడు. ఈ నిశ్చలానంద కూడా ఆయన దగ్గర నేర్చుకుని, పాత వేదగణిత గ్రంథాల్ని ఔపోసన పట్టి, తన జ్ఞానానికి మరింత మెరుగుపెట్టుకున్నాడు.

ఆహారానికి, భాషకు, మందులకు, ఆహార్యానికీ, అలవాట్లకూ మతాన్ని రుద్దినట్టుగా ఈ గణితానికి మతాన్ని రుద్దకండి.లెక్కలంటే లెక్కలే. ఆధునిక గణితం పోకడ వేరు, వేదగణితం పోకడ వేరు .రెండూ సొల్యూషన్సే చూపిస్తాయి. కాకపోతే వేదగణితం సులభంగా స్టెప్‌ బై స్టెప్‌ ఉంటుంది. ఆధునిక గణితం కాస్త సంక్లిష్టంగా ఉంటుంది.”ఇందులో వింత ఏమీ లేదు, ఇదేమీ మాయ కాదు, లీల కాదు, మహత్తు అసలే కాదు. వేల ఏళ్ల క్రితమే భారతీయ రుషులకు లెక్కలు, జ్యోతిష్యం, క్షిపణి పరిజ్ఞానం, ఖగోళ జ్ఞానం, గగనయానంపై బ్రహ్మాండమైన విద్వత్తు ఉంది. మన పురాణాల్లో, భగవద్గీతలో బోలెడు అంశాలు దొరుకుతాయి. నిశ్చలానంద సరస్వతి ఆధ్యాత్మక గురువే కాదు, వేదగణితంలో బోలెడంత సాధన చేశాడు.11 పుస్తకాలు రాశాడు తను. దీనిపై చాలా మంది విదేశీ గణిత పరిశోధకులు స్వామితో టచ్‌లో ఉంటారు. సందేహాలకు వేదగణితంలో పరిష్కారాలు వెతుక్కుంటారు అంటున్నాడు ఈ శంకరాచార్యుడి గోవర్ధన పీఠం పబ్లిక్‌ రిలేషన్స్‌ ఆఫీసర్‌ మనోజ్‌ రత్తా.

నిజానికి నిశ్చలానందుడికి ఇస్రో స్పేస్‌ సైన్స్‌తో పరిచయం కొత్తదేమీ కాదు. చాలాసార్లు తను ఇస్రో లెక్కలకు సాయం చేశాడు. రెండేళ్ల క్రితం అహ్మదాబాద్‌ స్పేస్‌ రీసెర్చ్‌ స్టేషన్‌కు వెళ్లి దాదాపు 1000 మంది సైంటిస్టులు, రీసెర్చ్‌ స్కాలర్లను ఉద్దేశించి ప్రసంగించాడు. అహ్మదాబాద్‌ ఐఐఎంలో ఏడాది క్రితం మేనేజ్‌మెంట్‌ పాఠాలు కూడా చెప్పాడు సో, స్వామి అనగానే కాషాయాలు (మన తెలుగు స్వాములతో అస్సలు పోల్చుకోవద్దు దయచేసి..) ఉపవాసాలు, పూజలు, ధ్యానాలు, ఆధ్యాత్మిక ప్రవచనాలే అనుకోకండి. ఇదుగో, ఈ నిశ్చలానందులూ ఉంటారు. ఆధునిక సాంకేతిక విజ్ఞానానికి పురాతన జ్ఞానాన్ని అద్ది సుసంపన్నం చేస్తారు. తమ చుట్టూ ఛాందసాల మడి గీతలు గీసుకుని, వాటిల్లో బందీలుగా ఉండరు. విభిన్నరంగాల్లో ఇదుగో ఇలా తళుక్కుమంటారు. అవసరమైన వేళల్లో..!! ”

రోజూ సామాజిక మాధ్యమాల్లో ‘ మేకిన్‌ ఇండియా ‘ ఫ్యాక్టరీల్లో తయారవుతున్న ఫేక్‌ న్యూస్‌ల్లో పైదొకటి. ఇస్రో అంటే ఏదో గణిత శాస్త్ర సంస్ధ అన్నట్లు, లెక్కల చిక్కు ముడి పడినట్లు ? చిత్రించారు. చంద్రయాన్‌ 2 ప్రాజెక్టు 2007లో ప్రారంభమైంది. 2008లో కేంద్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. 2013లో ప్రయోగించాల్సిన ఈ ప్రాజెక్టు వివిధ కారణాలతో ఆలస్యమైంది. అలాంటిదానికి ప్రయోగించబోయే ముందు లెక్కల చిక్కుముడి పడిందని చెప్పటం నిజంగా మన శాస్త్రవేత్తలను అవమానించటం, స్వామీజీలు, బాబాలకే లేని ప్రతిభను ఆపాదించటం తప్ప మరొకటి కాదు. సదరు నిశ్చలానంద సరస్వతి తన శిష్యులతో ఇస్రోకు సమాంతరంగా ఇప్పటికైనా తన ప్రతిభతో ప్రయోగాలను చేపట్టమనండి.

విక్రమ్‌ లాండర్‌ను సులభంగా చంద్రుడి దక్షిణ ధృవం మీద దించటం, అది పద్నాలుగు రోజుల పాటు వుపరితలం మీద కదలాడుతూ సమాచారాన్ని సేకరించటం కీలకాంశం. దానికి ముందు వున్న దశలను మన శాస్త్రవేత్తలు ఎప్పుడో జయప్రదంగా అధిగమించారు. రష్యా సహకారంలో భాగంగా వారు లాండర్‌ను తయారు చేసి ఇవ్వాల్సి వుంది. అయితే వారికి తలెత్తిన సాంకేతిక సమస్యలు కావచ్చు, బయటికి తెలియని ఇతర కారణాలతో గానీ తాము ఇవ్వలేమని చెప్పిన తరువాత మన వారే స్వంతంగా తయారు చేశారు. ఇది కూడా ఆలశ్యానికి ఒక కారణం.

Image result for disappointed Narendra Modi at ISRO

మన దేశంలో ప్రతి అంతరిక్ష ప్రయోగానికి ముందు వాటి ప్రతిమలతో తిరుపతి వెంకన్న , సుళ్లూరు పేట చెంగాలమ్మ దేవాలయాల్లో పూజలు చేయటం చేస్తున్నారు. ఈ ఏడాది ఇస్రో అధిపతి కె శివన్‌ వుడిపి శ్రీకృష్ణ మఠాధిపతి ఆశీస్సులు కూడా అందుకున్నారు. ఇక వాట్సాప్‌ భక్తులు, ఇతరులు చేసిన వినతులకు కొదవ లేదు. ఈ వుత్తరం అందిన వారు మరొక పదకొండు మందికి లేఖలు రాయకపోతే అరిష్టానికి గురి అవుతారు అన్నట్లు గాక పోయినా అందరికీ పంపి ప్రార్ధనలు చేయండని కోరారు. మరి శంకరాచార్య లెక్కలేమయ్యాయి. దేవుళ్ల కరుణాకటాక్షం, మఠాధిపతుల, తిరుపతి వేద పండితుల ఆశీర్వాచనాల మహత్తు, శక్తి ఏమైపోయినట్లు ? మనం చేయాల్సింది చేయాలి, దేవుడి కటాక్షం కోరాలి అని చెప్పేవారు వుంటారు. అలాంటపుడు ఓదార్పు శాస్త్రవేత్తలకే ఎందుకు, ప్రయోగాన్ని కాపాడలేకపోయినందుకు దేవుళ్లు దేవతలు, స్వాములను కూడా ఓదార్చాలి లేదా అభిశంచించాలి. మూఢనమ్మకాలను పెంచే, శాస్త్రవిజ్ఞానం మీద పూర్తి నమ్మకంలేని తరాలను మనం తయారు చేస్తున్నాము.

ఆయుధాలు, అంతరిక్ష ప్రయోగాల కోసం దేశాలు పోటీ పడ్డాయి. దీనిలో సాంకేతికంగా, మిలిటరీ రీత్యా పై చేయి సాధించటంతో పాటు ‘రాజకీయ’ ప్రయోజనం కూడా చోటు చేసుకుంది. వుదాహరణకు హిట్లర్‌ నాయకత్వంలోని జర్మనీ, ఇటలీ, జపాన్‌ కూటమికి వ్యతిరేకంగా తమతో చేయి కలపాలని అమెరికా, బ్రిటన్‌ దేశాలు నాటి సోవియట్‌ను కోరాయి. 1945 జూలై 16న ప్రపంచంలో తొలిసారిగా అమెరికా అణుబాంబు పరీక్ష జరిపింది. మరుసటి రోజు అమెరికా అధ్యక్షుడు ట్రూమన్‌ బ్రిటన్‌ ప్రధాని చర్చిల్‌కు ఈ విషయం చెప్పాడు. అయితే అప్పటికే సోవియట్‌ నేత స్టాలిన్‌ వారితో కలవటానికి సూత్ర ప్రాయంగా అంగీకరించారు. మిత్రపక్షాల మధ్య ఒప్పందం కుదరలేదు. అందువలన ఈ విషయం తెలిస్తే ఒక వేళ స్టాలిన్‌ వెనక్కు తగ్గుతారేమో, కొత్త షరతులను పెడతారేమో అనే అనుమానంతో వెంటనే చెప్పవద్దని ఇద్దరు నేతలూ అనుకున్నారు. జపాన్‌ మీద యుద్దం చేసేందుకు స్టాలిన్‌ అంగీకరించిన తరువాత జూలై 25 తమ దగ్గర ప్రమాదకరమైన ఒక బాంబు వుందని ట్రూమన్‌ సూచన ప్రాయంగా స్టాలిన్‌కు చెప్పాడు. దీనిలో వున్న రాజకీయం ఏమంటే అప్పటికే అమెరికన్లు బాంబు ప్రయోగానికి నిర్ణయించుకున్నారు. ఆగస్టు పదిలోగా బాంబును ప్రయోగించాలని, అలాంటి బాంబులు హిట్లర్‌, స్టాలిన్‌ దగ్గర లేవని ట్రూమన్‌ తన డైరీలో రాసుకున్నాడు. అది జరిగిన తరువాత సోవియట్‌ యూనియన్‌ భయపడిపోయి యుద్ధానంతరం ఐరోపాను పంచుకొనే విషయంలో తమ షరతులకు అంగీకారానికి రాకతప్పదనే ఆలోచన దాగుంది. అయితే స్టాలిన్‌ ఆ సమాచారం విని తాపీగా అలాగా, సంతోషం, మంచికోసమే వుపయోగించాలి అనటం తప్ప ఎలాంటి భావాన్ని వ్యక్తం చేయలేదు. అప్పటికే యుద్ధం ముగింపుదశలో వుంది. మరో వారం రోజుల్లో సోవియట్‌ సేనలు జపాన్‌పై దాడికి వస్తాయనగా ట్రూమన్‌ ఆగస్టు ఆరున తొలి బాంబును, రెండు రోజుల తరువాత రెండవ బాంబును ప్రయోగించాలని ఆదేశించాడు.యుద్ధం ముగిసిన తరువాత మూడు సంవత్సరాల్లో అంటే 1949 ఆగస్టు 29న సోవియట్‌ యూనియన్‌ తొలి అణుపరీక్ష జరిపింది.అది ప్రపంచ రాజకీయాలను ఒక మలుపు తిప్పిన విషయం తెలిసిందే.

Image result for chandrayaan 2 : who disappointed most Narendra Modi or ISRO scientists

సోవియట్‌ పట్టుదల అంతటితో ఆగలేదు. అణుబాంబును మోసుకుపోయి లక్ష్యాల మీద వేసే క్షిపణుల తయారీకి పూనుంది. అమెరికా కంటే ముందుగా అలాంటి ఒక క్షిపణిని ప్రయోగించింది. అదే తరువాత కాలంలో అంతరిక్ష ప్రయోగాలకు ఎన్నో పాఠాలు నేర్పింది. తాము మరో రెండు సంవత్సరాలలో అంతరికక్ష వుపగ్రహాన్ని ప్రయోగించనున్నట్లు 1955లో అమెరికా ప్రకటించింది. దానికంటే ముందే సోవియట్‌ వుపగ్రహాన్ని ప్రయోగించింది, అంతటితో ఆగలేదు 1961లో యూరీ గగారిన్‌ అంతరిక్ష ప్రయాణం చేయించింది. అదే ఏడాది అమెరికన్లు క్యూబామీద దాడి చేసేందుకు ప్రయత్నించి ఎదురు దెబ్బతిన్నారు.దీంతో సాంకేతిక పరిజ్ఞానంలో ప్రపంచంలో అమెరికాకు ఎదురు లేదన్న ప్రతిష్ట అడుగంటింది. ఈ పూర్వరంగంలో అమెరికా ఆధిపత్యానికి తిరుగులేదు అంటే ఏమి చెయ్యాలి? అంతరిక్షంలో ఒక పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేసి మనం సోవియట్‌ను అధిగమించగలమా ? చంద్రుడి చుట్టూ తిరిగి రాగలమా, చంద్రుడి మీద రాకెట్లను దించగలమా ? రాకెట్లలో మనిషిని పంపి తిరిగి వెనక్కు తీసుకురాగలమా ? ఇవిగాక మన ఆధిపత్యాన్ని చాటి చెప్పేందుకు అవసరమైన నాటకీయ ఫలితాలను సాధించే అంతరిక్ష కార్యక్రమం ఏదైనా వుంటే చెప్పండి అని నాటి అమెరికా అధ్యక్షుడు కెన్నడీ తన సలహాదారులను అడిగాడు. రెండు వారాల తరువాత వుపాధ్యక్షుడు లిండన్‌ జాన్సన్‌ నాయకత్వంలోని ఒక కమిటీ సోవియట్‌తో పోటీలో అధిగమించకపోయినా సమంగా అయినా వుండేట్లు చూడాలని కెన్నడీ కోరాడు. దాని ఫలితమే అపోలో కార్యక్రమం.

1961 మే 25న అమెరికా పార్లమెంట్‌, దేశ ప్రజలను వుద్దేశించి మాట్లాడుతూ ప్రపంచ వ్యాపితంగా వున్న మన స్నేహితులుా,శత్రువుల మధ్య జరుగుతున్న పోరులో మనం విజయం సాధించాల్సి వుంది. మనం సైనికుల హృదయాలను చూరగొన గలగాలి. అంతరిక్షంలో 1957లో స్పుత్నిక్‌(సోవియట్‌) సాధించిన నాటకీయ పరిణామాలు మనకు ఒక విషయాన్ని స్పష్టం చేశాయి. ప్రతి చోటా ముందుకు పోవాలనే పట్టుదలతో వున్న మార్గంలో ప్రయాణిస్తున్న సైనికులపై ప్రభావం పడింది. మనం అంతరిక్షంలోకి పోవాలి. ఇలా సాగింది ఆ ప్రసంగం. అంతటి అమెరికన్లే తమ రాజకీయ, ఇతర ప్రయోజనాల కోసం అంతరిక్ష కార్యక్రమాన్ని వుపయోగించుకున్నారన్నది స్పష్టం.

ఇదే సమయంలో తమ సోషలిస్టు భావజాలం గొప్పతనాన్ని ప్రపంచానికి చాటేందుకు, ఇతర దేశాలను అమెరికా నుంచి దూరం చేసి తమ వైపుకు తిప్పుకొనే రాజకీయాల్లో భాగంగా సోవియట్‌ కూడా తన పాత్ర నిర్వహించింది. పెద్ద విజయంగా టాంటాం వేసుకుంటున్న కాశ్మీరు రాష్ట్ర విభజన, ఆర్టికల్‌ 370 గురించి ఎన్నో రోజులు వూదరగొట్టేందుకు నరేంద్రమోడీకి, బిజెపికి అవకాశం లేదు. ఎంత ఎక్కువగా ప్రచారం చేస్తే అంత ఎక్కువగా ఆ చర్య వలన ఇతర రాష్ట్రాలకు జరిగిన మేలు ఏమిటని జనం ప్రశ్నిస్తారు. ఇదిలా వుండగా దేశంలో ఆర్ధిక మాంద్యం సూచనలు కనిపిస్తున్నాయి. నిరుద్యోగం మరింత పెరుగుతోంది, పరిశ్రమల మూతలు పెరుగుతున్నాయి. వాటిని గురించి ఇంతవరకు ఒక్క మాట కూడా మాట్లాడని నరేంద్రమోడీ అండ్‌కోకు జనం దృష్టిని మళ్లించే ఒక పెద్ద అంశం కావాలి. అందువలన ఈ పూర్వరంగంలో చంద్రయాన్‌ 2 ప్రయోగాన్ని తనకు అనుకూలంగా మలచుకొనేందుకు నరేంద్రమోడీ ప్రయత్నించారా అన్న సందేహం కలగటంలో తప్పేముంది. ప్రయోగాల వైఫల్యం ఇస్రో శాస్త్రవేత్తలకు కొత్త కాదు. అందువలన వారి కంటే నరేంద్రమోడీ ఎక్కువగా హతాశులయ్యారా ? చంద్రయాన్‌ అందినట్లే అంది అందకుండా పోయింది.

చంద్రయాన్‌ 2 విఫలం కాదు, ప్రయోగాలలో అది ఒక భాగమే. ఆర్యభట్ట నుంచి సాగుతున్న విజయాల పరంపరలో ఇదొక చిన్న ప్రయోగం. వైఫల్యాలతో గతంలో ఏ శాస్త్రవేత్త కుంగిపోలేదు. నిరాశపడలేదు. అది అసలు వారి లక్షణం కాదు. వారి ప్రయోగాలు విజయవంతం కావాలని, అది దేశానికి వుపయోగపడాలని అందరూ కోరుకుంటున్నారు. చంద్రయాన్‌ 1లో 2008లోనే దాదాపు 10 నెలలపాటు మన పరిశోధనలు చంద్రునిపై సాగాయి, కొన్ని లోపాలు ఉన్నా అది విజయమే, ప్రపంచంలో స్థానం ఆనాడే సాధించాము. గతకాలంలో ఎన్నో విజయాలు సాధించాము. తక్కువ ఖర్చుతో చేపట్టబోయే, 2024లో మొదలయ్యే చంద్రయాన్‌-3 విజయవంతం కావాలని కోరుకుంటున్నాము.. మన శాస్త్రవేత్తలు ప్రపంచంలో ఎవరికంటే తీసిపోరు, 104దేశ విదేశీ ఉపగ్రహాలను ఒక్కసారిగా ప్రయోగించిన ఘనత మనవారిదే కదా. అయినా.. కొంతమందికి బాధ అనిపించినా మన దేశానికి ముందు కావలసింది దేశ అభివ ద్ధికి ప్రత్యక్షంగా ఉపయోగపడే ప్రయోగాలు అని గుర్తించాలి. ప్రస్తుత చంద్రయాన్‌ 2 లో ఆర్బిటర్‌ లక్షణంగా పని చేస్తున్నది. లాండర్‌ మాత్రమే విఫలమైంది.

Image result for chandrayaan 2 : who disappointed most Narendra Modi or ISRO scientists

నరేంద్రమోడీ సర్కార్‌ వుగ్రవాదులు, నల్లధనం వున్న వారి మీద కంటే మేధావులు, శాస్త్ర పరిశోధనల మీద సమర్దవంతంగా మెరుపు దాడులు చేసిందని (సర్జికల్‌ స్ట్రెక్స్‌ ) ప్రముఖ చరిత్ర కారుడు రామచంద్ర గుహ వ్యాఖ్యానించారు. 2014లో అధికారానికి వచ్చినప్పటి నుంచి మేథావుల మీద నిరంతరం యుద్ధం సాగిస్తున్నదని, ఒక విశ్వవిద్యాలయం తరువాత మరొక విశ్వవిద్యాలయాన్ని, పరిశోధనా సంస్ధలను లక్ష్యంగా చేసుకొని వాటి విశ్వసనీయతను దెబ్బతీస్తున్నదని పేర్కొన్నారు. మోడీ సర్కార్‌లో ఇద్దరు మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రులకు విద్య లేదా పరిశోధన చేసిన పూర్వరంగం లేదని వారు ఆర్‌ఎస్‌ఎస్‌ నుంచి సూచనలను స్వీకరించటం తప్ప నిపుణులు చెప్పేది వినటం లేదని అన్నారు. మన పూర్వీకులు ప్లాస్టిక్‌ సర్జరీ చేశారని, కృత్రిమ గర్భధారణ పద్దతులను అభివృద్ధి చేశారని స్వయంగా నరేంద్రమోడీయే చెప్పారు. ఇలాంటి ఆధారం లేని ఆశాస్త్రీయ ప్రచారాలను చేయటంలో మోడీని ఆయన మంత్రులు పెద్ద ఎత్తున అనుకరిస్తున్నారు.ఇలాంటి విషయాలను (చెప్పింది వినటం తప్ప ప్రశ్నించటానికి సాహసం చేయని) ఆర్‌ఎస్‌ఎస్‌ శాఖల్లో లేదా ప్రయివేటు సంభాషణల్లో కాదు, ఏకంగా సైన్స్‌ కాంగ్రెస్‌లోనే చెప్పారని రామచంద్ర గుహ వ్యాఖ్యానించారు.

యుపిఏ హయాంలో శాస్త్ర, పరిశోధనల మీద జిడిపిలో 0.8శాతం ఖర్చు చేస్తే మోడీ హయాంలో అది 0.69కి పడిపోయింది. అమెరికా అత్యధికంగా 3-4శాతం వరకు ఖర్చు చేస్తుండగా చైనా రెండుశాతంపైగా చేస్తున్నది. వైఫల్యాలన్నీ పరిశోధన బడ్జెట్‌ను బట్టే వుంటాయని చెప్పలేము గానీ,తగినన్ని నిధుల కేటాయింపు లేకపోయినా ప్రయోగాలు విజయవంతం కావు. పరిశోధనల మీద ఖర్చును పెంచాలని దేశవ్యాపితంగా శాస్త్రవేత్తలు ప్రదర్శనలు చేసిన విషయం తెలిసినదే.విజయం అంచున ఖ్యాతిని సొంతం చేసుకొనేందుకు పరిశోధనా కేంద్రాలకు చేరి తాపత్రయం పడే రాజకీయాలకు నేటి నేతలు స్వస్తి పలకాలి. అలాంటివి శాస్త్రవేత్తలను మరింత వత్తిడికి గురిచేస్తాయి. ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర ప్రభుత్వం చేయాల్సింది ఓదార్పులు, ఆ పేరుతో ప్రచారం కాదు. వర్తమానంలో వున్న ఆవిష్కరణలన్నింటినీ మన పూర్వీకులు ఎప్పుడో కనుగొని వాడిపారేశారు, ఆ విజ్ఞానమంతా వేదాల్లో , సంస్కృత గ్రంధాల్లో వుందనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. వాటిని వెలికి తీసి దేశానికి మేలు చేసి పక్కా దేశభక్తులని నిరూపించుకోండని చేసిన సూచనలను ఏ ఘనాపాఠీ, సంస్కృత పండితులు పట్టించుకోలేదు. ఎందుకంటే దేవుడు నైవేద్యం తినడనే నిజం పూజారికి తెలిసినట్లుగా మరొకరికి తెలియనట్లే వాటిలో కావలసినంత అజ్ఞానం తప్ప విజ్ఞానం లేదని పండితులకు బాగా తెలుసు. ఇస్రో లేదా మరొక శాస్త్ర పరిశోధనల్లో పని చేస్తున్న శాస్త్రవేత్తలు అలా కాదు, వారిలో నిజాయితీ వుంది, తాము నమ్మిన దాన్ని ఆచరణలో పెట్టేందుకు చేయాల్సిందంతా చేస్తున్నారు. వారిని మరింతగా ప్రోత్సహించాలంటే వాటిని నిరుత్సాహపరిచే అశాస్త్రీయ భావాల ప్రచారాన్ని కట్టిపెట్టాలి. ఆవు మూత్రం, పేడలో ఏముందని తెలుసుకొనేందుకు కాదు, జనానికి పనికి వచ్చే పరిశోధన, అభివృద్ధికి నిధులను గణనీయంగా పెంచాలి. అవి లేకుండా ఓదార్పుల వలన ప్రయోజనం లేదు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

పాలకుల దాడి – ప్రశ్నార్ధకంగా మారిన మీడియా విశ్వసనీయత !

06 Friday Sep 2019

Posted by raomk in BJP, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion

≈ 1 Comment

Tags

attacks on journalists, BJP, BJP's social media, Indian media credibility, Journalism in India, Media, Narendra Modi

Image result for government attack and question of indian media credibility

ఎం కోటేశ్వరరావు

ఒకే దేశం ఒకే చట్టం అనే భావోద్వేగాల ముసుగులో దేశ చరిత్రలో తొలిసారిగా ఒక్క దెబ్బతో ఒక రాష్ట్రాన్ని ఏకంగా రద్దు చేశారు. జమ్మూ కాశ్మీర్‌ రాష్ట్రాన్ని రద్దు చేసి అక్కడి జనానికి దేశంతో సంబంధాలను తెంపివేసిన ఆగస్టు ఐదు, 2019 నాటి అత్యంత అప్రజాస్వామిక చర్య వారాలు గడిచినా సాధారణ పరిస్ధితులు ఏర్పడలేదు. దేశంలో ఎన్ని పత్రికలు, టీవీలు ఈ చర్యను విమర్శనాత్మకంగా చూశాయి అన్నది ఒక ప్రధానమైన అంశం. కేంద్ర ప్రభుత్వంతో ముడిపడి వున్న అనేక వివాదాస్పద అంశాలు, జనజీవితంతో పెనవేసుకున్న ఆర్ధిక వ్యవస్ధ దిగజారుడు పర్యవసానాల గురించి మీడియాలో ఎంత చోటు దక్కిందన్నది ఒక శేష ప్రశ్నగా మారింది.కాశ్మీరు గురించి మీడియా చర్చల్లో ఎక్కడో కొంత మంది చేసిన విమర్శనాత్మక వ్యాఖ్యలు తప్ప స్వంత కధనాలను జనం ముందుకు ఎన్ని తెచ్చాయంటే చెప్పలేని స్ధితి. అధికార పార్టీని చూసి నిజం చెప్పలేని స్ధితిలో మీడియా పడిపోయిందా ?ప్రస్తుతం భారత మీడియాలో వేళ్ల మీద లెక్కించదగిన సంస్ధలు తప్ప మొత్తం మీద విశ్వసనీయత సమస్యను ఎదుర్కొంటున్నది. అంతకు ముందు కూడా ఆ సమస్య వున్నప్పటికీ గత ఐదు సంవత్సరాలుగా వేగంగా దిగజారుతున్నది.

ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్ధగా చెప్పుకుంటున్న మన దేశంలో జర్నలిజం ఎదుర్కొంటున్న ఇబ్బందుల పర్యవసానాలు తీవ్రంగా వుంటాయి. వుత్తర ప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాధ్‌ సర్కార్‌ చర్య ఒక వుదాహరణ. మధ్యాహ్న భోజన పధకంలో రొట్టెలతో కూరలకు బదులు వుప్పు అందచేసిన అంశాన్ని వీడియో తీసి వెలుగులోకి తెచ్చిన జర్నలిస్టు మీద అక్కడి అధికార యంత్రాంగం కేసు పెట్టింది. మీరు కావాలంటే ఫొటోలు తీసుకోవచ్చు, మీకు తప్పుగా కనిపించినదాని గురించి ఏమైనా రాసుకోవచ్చు. కానీ వీడియో తీయటం అంటే అనుమానించాల్సి వస్తోంది. ఒక కుట్రలో భాగంగానే వీడియో తీశారంటూ జిల్లా కలెక్టర్‌ అనురాగ్‌ పటేల్‌ సదరు జర్నలిస్టు మీద పెట్టిన కేసును సమర్ధించారు. కేసు పెట్టాలి, దానికి ఒక సాకు చూపాలి అంతకు మించి దీనిలో మరొకటి కనిపించటం లేదు. ఫొటోలు తీయటానికి అర్హత వున్న ఒక జర్నలిస్టు వీడియో తీయకూడదని ఏ నిబంధనలు చెబుతున్నాయి. జర్నలిస్టుల పట్ల బిజెపి పాలకుల వైఖరికి ఇది చక్కటి నిదర్శనం. అధికారంలో వున్న వారికి వ్యతిరేకంగా నిజం చెప్పకూడదు, చూపకూడదు.

నరేంద్రమోడీ తొలిసారి ఎన్నికైనపుడు చమురు ధరలు భారీగా క్షీణించి జనానికి పెద్దగా వుపయోగపడకపోయినా దిగుమతి బిల్లు తగ్గించి కేంద్ర ప్రభుత్వానికి ఎంతో మేలు చేశాయి. అయినా ఎప్పుడైతే ఆర్ధికంగా దిగజారుడు ప్రారంభమైందో దాన్నుంచి దృష్టి మళ్లించేందుకు ఎన్నో జిమ్మిక్కులు చేశారు.1970దశకం తరువాత గత ఏడాది నిరుద్యోగ శాతం 6.1శాతానికి పెరిగి పాత రికార్డును బద్దలు కొడితే ఇప్పుడు మొత్తంగా 8.2శాతానికి, పట్టణ ప్రాంతాల్లో 9.4శాతానికి చేరిందని తాజా పరిశీలనలు వెల్లడించాయి. వుద్యోగాలు ఎంత మందికి కల్పించారు అని అడిగితే లెక్కలు సరిగా వేయటం లేదు అని ఒకసారి, పకోడీలు తయారు చేయటం కూడా వుపాధి కల్పనే వాటన్నింటినీ కూడి తరువాత చెబుతామంటూ మోడీ దాటవేశారు. ఇంతవరకు లెక్కలు చెప్పలేదు. కొత్త వుద్యోగాలు కల్పించకపోగా వున్న వుద్యోగాలు కూడా పోతున్నాయని, ఆర్ధిక వ్యవస్ధ మాంద్యంలోకి జారుతోందనే సూచనలు కనిపిస్తున్నాయి. పలుకే బంగారమాయెగా అన్నట్లు అసలేం జరుగుతోందో చెప్పటానికి మోడీ నోరు విప్పటం లేదు. బ్యాంకులకు పని గట్టుకొని రుణాలు ఎగవేసినట్లుగా ముఖ్య విషయాలపై మౌనం ఒక ప్రధాన సమస్యగా మారింది అంటే అతిశయోక్తి కాదు. ప్రజాస్వామ్యంలో ఒక దేశాధినేత లేదా ప్రభుత్వ తీరు తెన్నుల గురించి మీడియా శల్యపరీక్ష చేయాల్సి వుంది. జర్నలిస్టులు, మీడియా ఈ విషయంలో శక్తిహీనులైతే అది ప్రజాస్వామ్యాన్ని బలహీనపరచటం తప్ప మరొకటి కాదు. విమర్శనాత్మకంగా తమ కలాలు, గళాలను పని చేయించే జర్నలిస్టులు వున్నప్పటికీ మీడియా మొత్తంగా కార్పొరేట్ల చేతిలోకి పోవటంతో యాజమాన్యాలు తొక్కిపడుతున్నాయి. ఇది మరింత ప్రమాదకరం.

Image result for government attack and question of indian media credibility

మూడు సంవత్సరాల క్రితం దేశంలో నల్లధనాన్ని వెలికి తీసేందుకు, అవినీతిని అరికట్టేందుకు పెద్ద నోట్లను రద్దు చేసినట్లు ప్ర్రకటించారు. దాని ఫలితాలు వెంటనే కాదు, తరువాత వస్తాయని నరేంద్రమోడీ చెప్పారు. జిందా తిలిస్మాత్‌ సర్వరోగ నివారిణి అన్నట్లుగా తన చర్యతో అవినీతి మటుమాయం అవుతుందని బల్లగుద్దారు. ఆర్ధికవేత్తలుగా వున్న వారు కూడా ఖాళీ పత్రం మీద సంతకాలు చేసినట్లుగా సమర్ధించారు. ఆ సమయంలో ఒకటీ అరా తప్ప మొత్తంగా మీడియా నిజమే నిజమే అన్నట్లుగా వంత పాడి జనాల్లో భ్రమలను పెంచింది తప్ప ప్రపంచంలో ఎక్కడైనా ఇలాంటి చర్యలతో అవినీతి తగ్గిందా అనే చర్చకు తెరతీయలేదు. విషాదం ఏమిటంటే త్వరలో పెద్ద నోట్ల రద్దు మూడో వార్షికోత్సవానికి సిద్దం అవుతున్నాము. ఈ కాలంలో నరేంద్రమోడీ దాని గురించి ఒక్కసారి కూడా ఎందుకు నోరు విప్పలేదో ఏ మీడియా అయినా అడిగిందా, ఏ జర్నలిస్టు అయినా ధైర్యం చేశారా? ఏ ఆర్ధిక వేత్త అయినా తాము చెప్పింది తప్పని చెంపలు వేసుకున్నారా?

పుల్వామా వుగ్రదాడి తరువాత మన సైనిక దళాలు బాలాకోట్‌ పట్టణం మీద మెరుపుదాడి చేసి వందల మంది వుగ్రవాదులను మట్టుబెట్టినట్లు మీడియాకు చెప్పారు. అందుకు రుజువు ఏమిటని అడిగిన రాజకీయపార్టీలను దేశద్రోహులు, మన సైనిక సామర్ధ్యాన్ని అవమానిస్తున్నారంటూ మనోభావాలను రెచ్చగొట్టి బిజెపి, దాని సోదర సంస్ధలు జనాన్ని వుసిగొల్పాయి. అది రాజకీయ క్రీడలో భాగం అనుకోండి. మీడియా ఎలాంటి తటపటాయింపులు లేకుండా ఒకదానితో మరొకటి పోటీపడి ఆ ప్రచారాన్ని తలకెత్తుకొని యుద్దోన్మాదాన్ని, దాన్ని వ్యతిరేకించిన వారిపై వ్యతిరేకతను రెచ్చగొట్టటాన్ని చూశాము. అధికార రాజకీయ పక్షానికి, మీడియా వైఖరికి తేడా చెరిగిపోయింది. రాయిటర్స్‌, ఇతర అంతర్జాతీయ మీడియా సంస్ధలు మాత్రమే ప్రభుత్వ, అధికారపక్ష ప్రచారాన్ని సవాలు చేశాయి. ఫలితంగా దేశీయ మీడియా విశ్వసనీయత ప్రశ్నార్ధకంగా మారింది.

ఆర్ధిక వ్యవస్ధ అభివృద్ధి రేటు గురించి ఎన్నికలకు ముందు మార్చినెలలో వందకు పైగా ఆర్ధికవేత్తలు రాసిన ఒక బహిరంగలేఖను మీడియా విస్మరించిది. వార్త ముగింపులో ఫలానా వారు కూడా ప్రసంగించారు అని రాసినట్లుగా మోడీ సర్కార్‌ చెప్పుకుంటున్న అభివృద్ధిని తమ లేఖలో ప్రశ్నించారు అన్నట్లుగా వార్తలు ఇచ్చాయి. ఇప్పుడు ప్రభుత్వమే అసలు విషయాలను బయటపెట్టాల్సి వస్తోంది. మీడియా దాన్ని పాఠకులకు అందించే సమయంలో గతంలోనే ఫలానా ఆర్ధికవేత్తలు సర్కార్‌ ప్రచారాన్ని ప్రశ్నించారు అని రాయటానికి చేతులు, చెప్పటానికి నోరు రావటం లేదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే తమ మనుగడకోసం విధిలేక కొన్ని అంశాలను వెల్లడించాల్సి రావటం తప్ప ఎక్కువ భాగం జాతీయ, ప్రాంతీయ మీడియా సంస్ధలు పాలకపార్టీల బాకాలుగా మారాయి.

ఒక ప్రధానిగా ఇంతవరకు నరేంద్రమోడీ పత్రికా గోష్టి పెట్టలేదు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు కొద్ది రోజుల్లో వెలువడ నుండగా బిజెపి ప్రధాన కార్యాలయంలో ఒక పత్రికా గోష్టి నిర్వహించారు. ముందే తయారు చేయించిన ఒక ప్రకటన విడుదల చేసి పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా పక్కన చిరునవ్వులు చిందిస్తూ మోడీ కూర్చున్నారు, విలేకర్ల ప్రశ్నలకు అమిత్‌ షా సమాధానం చెప్పారు. చూశారా ప్రధాని అయ్యుండి కూడా పార్టీ అధ్యక్షుడికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో అంటూ దాన్ని కూడా మోడీ ఘనతగా మీడియా చిత్రించింది.ఎన్నికల సమయంలో మోడీతో ప్రత్యేక ఇంటర్వ్యూల పేరుతో జాతీయ మీడియా సంస్ధలు గంటల తరబడి ప్రత్యక్ష ప్రసారాలు నిర్వహించాయి. అలాంటి అవకాశం ప్రతిపక్ష పార్టీలకు ఇవ్వని కారణంగా అదంతా అధికారపక్ష ఆర్ధిక పాకేజీల్లో భాగమని జనం అనుకున్నారు. లాలూచీ కుస్తీ మాదిరి ఇంటర్వ్యూలు సాగాయి తప్ప విమర్శనాత్మక ప్రశ్నలు ఒక్కటీ వేయలేదు. ఎన్నికల సమయంలో విమర్శనాత్మకంగా వార్తలిచ్చిన హిందూ, టెలిగ్రాఫ్‌, టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా పత్రికలకు రెండోసారి అధికారానికి వచ్చిన తరువాత మోడీ సర్కార్‌ ప్రభుత్వ ప్రకటనల జారీలో కోత పెట్టిందని రాయిటర్స్‌ పేర్కొన్నది. 2002లో మీడియా స్వేచ్చలో 139దేశాల్లో మన స్ధానం 80వది, అలాంటిది తాజాగా సరిహద్దులు లేని విలేకర్ల సంస్ధ ప్రకటించిన 180 దేశాల్లో మనది 140వ స్ధానం. నిత్యం హింసా వాతావరణం వుండే దేశాలకంటే మనది దిగువన వుంది అని చెప్పుకోవాల్సి రావటం సిగ్గు చేటు.

1975లో నాటి కాంగ్రెస్‌ ప్రధాని ఇందిరా గాంధీ అత్యవసర పరిస్ధితిని ప్రకటించినపుడు దేశంలో ఏం జరుగుతోందో తెలుసుకోవాలంటే జనం బిబిసి రేడియో మీద ఆధారపడాల్సి వచ్చింది. ఎదిరించిన మీడియాను అణచివేస్తే లొంగిపోయిన మీడియా ప్రభుత్వ బాకాగా మారిపోయింది. ఇప్పుడు దేశంలో అత్యవసర పరిస్ధితి లేదు. అయినా కాశ్మీరులో ఏం జరుగుతోంది అని తెలుసుకోవాలంటే జాతీయా మీడియాతో ఫలితం లేదని తేలిపోయింది. నాటి అత్యవసర పరిస్ధితిలో మాదిరి తిరిగి నేడు కాశ్మీర్‌లో వేలాది మందిని అరెస్టు చేశారనే వార్తల కోసం విదేశీమీడియాను, ఇంటర్నెట్‌ను ఆశ్రయించాల్సి వస్తోంది. అలాంటి ఆసక్తి ఎందరికి , అందరిలో వుండే అవకాశం లేదు, అందువలన హిజ్‌మాస్టర్‌ వాయిస్‌ లేదా రాణీగారీ ప్రతిపక్షం మాదిరి మన మీడియా అందిస్తున్న అంతా బాగుంది వార్తలనే చదవటం, చూడాల్సి వస్తోంది. జమ్మూకాశ్మీర్‌ను మొత్తంగా మూసివేసిన మోడీ సర్కార్‌ చర్యను ఏ విదేశీ నేత కూడా ప్రశ్నించలేదు కదా అనే వాదనను మన మీడియా ముందుకు తెస్తోంది. నాణానికి రెండోవైపు చూస్తే ఏ నేత ఏ దేశం కూడా సమర్ధించిన దాఖలా కూడా లేదు. మన దేశంతో వున్న ఆర్ధిక సంబంధాలు, మార్కెట్‌ మీద ఆశతో విదేశాలేవీ మన సర్కార్‌తో ఘర్షణపడేందుకు సిద్దంగా లేవు.

భారత్‌లో పత్రికలు, టీవీ ఛానల్స్‌ పైకీ కిందికీ గంతులు వేస్తూ కేరింతలు కొడుతున్నాయని కాశ్మీర్‌లో పరిస్ధితి గురించి అంతర్జాతీయ పత్రిక ఎకానమిస్టు పేర్కొన్నది. విదేశీ మీడియా ఛానల్స్‌ కధనాల మీద దాడి చేయటంలో సామాజిక మాధ్యమంలో ప్రభుత్వ అనుకూల మరుగుజ్జుల(ట్రోల్స్‌)తో పాటు, సాంప్రదాయక మీడియాలో పని చేస్తున్న జర్నలిస్టులు కూడా తోడవుతున్నారు. ప్రతిపక్ష పార్టీల ప్రతినిధులను కాశ్మీర్‌లో ప్రవేశించకుండా ప్రభుత్వం అడ్డుకోవటాన్ని మీడియా దాదాపుగా సమర్దించిందని బ్లూమ్‌బెర్గ్‌ వ్యాఖ్యానించింది. ఆర్టికల్‌ 370ని రద్దు చేస్తామని తమ ఎన్నికల ప్రణాళికల్లో ఎప్పటి నుంచో చెబుతున్నామని బిజెపి చెబుతోంది. దాని మంచి చెడ్డల గురించి ఇప్పటికే ఎంతో చర్చ జరిగింది కనుక కాసేపు పక్కన పెడదాము. కాశ్మీర్‌ రాష్ట్రాన్ని రద్దు చేస్తామని, రెండుగా చేసి కేంద్ర పాలిత ప్రాంతాలుగా మారుస్తామని, ఆప్రక్రియకు ముందూ, తరువాత దాన్ని మొత్తంగా బహిరంగ జైలుగా మారుస్తామని, కమ్యూనికేషన్‌ వ్యవస్ధను మూలన పడేస్తామని బిజెపి ఎక్కడా ముందు చెప్పలేదు కదా ? దీన్ని గురించి మన మీడియా ఎన్నడైనా ప్రశ్నించిందా ? ప్రభుత్వ చర్యలను ప్రశ్నించే గళాలకు చోటు ఇస్తోందా ? కాశ్మీర్‌పై తీసుకున్న చర్యలకు మద్దతుగా మీడియాలో ఇచ్చిన కవరేజి, దేశవ్యాపితంగా దిగజారుతున్న ఆర్ధిక వ్యవస్ధ మంచి చెడ్డల గురించి వివరించేందుకు కేటాయిస్తున్న సమయం, స్ధలం ఎంత ?.

కాశ్మీరు ఒక పంజరం అనే ఒక డాక్యుమెంటరీని ప్రదర్శించేందుకు ఢిల్లీ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వం వత్తిడి తీసుకురావటంతో క్లబ్‌ నిర్వాహకులు ఆ కార్యక్రమాన్ని రద్దుచేశారు. అదే విధంగా సంత్‌ రవిదాస్‌ దేవాలయ కూల్చివేతకు నిరసనగా కొన్ని సంస్ధల వారు ఢిల్లీలోని మహిళా జర్నలిస్టుల క్లబ్బులో పత్రికా గోష్టి నిర్వహించేందుకు హాలును అద్దెకు తీసుకున్నారు. ప్రభుత్వం క్లబ్‌ నిర్వాహకుల మీద వత్తిడి తీసుకువచ్చి అనుమతిని రద్దు చేయించింది.1992లో బాబరీ మసీదును కూల్చివేయటాన్ని ఖండిస్తూ అనేక మంది పారిశ్రామికవేత్తలు పత్రికలకు ఇచ్చిన యాడ్స్‌లో తమ పేర్లను నమోదు చేసుకున్నారని, ఇప్పుడు కాశ్మీర్‌ విషయంలో అలా బహిరంగంగా వ్యతిరేకతను వ్యక్తం చేసేందుకు భయపడుతున్నారని చరిత్రకారుడు రామచంద్ర గుహ వ్యాఖ్యానించారు. 2015లో అద్వానీ, ఆయనేమీ మోడీ అభిమాని కాదు, వెంటనే గాకపోయినా త్వరలో దేశంలో మరో అత్యవసర పరిస్ధితిని ప్రకటిస్తే తాను ఆశ్చర్యపోనని చెప్పారు.అది తీవ్రమైన అనుమానంగానే వుంటుంది, అయితే ఒక విషయం ఖాయం, దాన్ని సమర్ధించేందుకు మీడియా సిద్దంగా వుంటుంది అని ఎకానమిస్ట్‌ పేర్కొన్నది.

డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ను మౌన మునిగా వర్ణించిన నరేంద్రమోడీ అండ్‌ కో ఆయన మాదిరిగా కూడా నోరు విప్పిన పాపాన పోలేదు. సామాజిక మాధ్యమం గురించి జరిపిన పరిశీలనలో 201-18 మధ్య సోషల్‌ నెట్‌వర్క్‌ల సంఖ్య 16.8 కోట్ల నుంచి 32.6 కోట్లకు పెరిగింది. వీటి ద్వారా పాలక బిజెపి అర్ధసత్యాలు, అసత్యాలను పెద్ద ఎత్తున ప్రచారంలోకి తెచ్చింది. వాటికి సమాధానం చెప్పేందుకు ప్రయత్నించిన జర్నలిస్టుల మీద ప్రచారదాడులు జరుగుతున్నాయి. భారత సంస్కృతి పరిరక్షణ, వున్నతి గురించి సుద్దులు చెప్పిన నోళ్లతోనే మహిళా జర్నలిస్టులను నోరు బట్టని బూతులు తిట్టటం, మానభంగాలు చేస్తామని బెదిరింపులు కూడా సాగించిన, సాగిస్తున్న వుదంతాలు తెలిసిందే. విమర్శకుల నోరు మూయించే ఆయుధాలుగా సామాజిక మాధ్యమాలను ప్రయోగిస్తున్నారు. ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకించిన, విమర్శించిన వారిని దేశద్రోహులుగా, పాకిస్ధాన్‌, చైనా ఏజంట్లుగా, వుగ్రవాదుల మద్దతుదారులుగా ముద్రవేశారు. స్వాతి చతుర్వేది అనే జర్నలిస్టు బిజెపికి చెందిన వారు ఎలా ఈ ప్రచార దాడిని సాగిస్తున్నారో ఒక పుస్తకంలో వివరించారు. తమ పట్ల విమర్శనాత్మకంగా వ్యవహరించే ఛానల్స్‌,పత్రికల యాజమాన్యాల మీద సిబిఐ, ఇడి వంటి సంస్ధలతో దాడులు చేయించటం, ప్రభుత్వ ప్రకటనలు నిలిపివేయటం, అధికారపక్షం నుంచి చర్చలను బహిష్కరించటం వంటి చర్యలు సర్వసాధారణం అయ్యాయి.

తమ ప్రభుత్వం సాధించిన విజయాల గురించి గొప్పలు చెప్పుకొనేందుకు మీడియాను నరేంద్రమోడీ ఎలా వుపయోగించుకున్నారో 2018లో ఒక వుదంతం వెల్లడించింది. చత్తీస్‌ఘర్‌కు చెందిన ఒక గిరిజన మహిళా రైతుతో నరేంద్రమోడీ మాట్లాడినదానిని ప్రత్యక్ష ప్రసారం చేశారు. ధాన్యం బదులు సీతాఫలాలను పండించటం ద్వారా తన ఆదాయం రెట్టింపు అయిందని ఆ మహిళ చెప్పింది. అయితే దాని గురించి అనుమానం వచ్చిన ఎబిపి ఛానల్‌ ప్రతినిధులు ఆ మహిళ వద్దకు వెళ్లి విచారించగా అలా చెప్పాలని బిజెపి నేతలకు తనకు చెప్పినట్లు ఆమె వెల్లడించింది. ఈ వార్తను మాస్టర్‌ స్ట్రోక్‌ కార్యక్రమాన్ని నిర్వహించే పుణ్య ప్రసూన్‌ వాజ్‌పేయి ప్రసారం చేయటంతో ప్రధాని పరువుపోయింది. దాంతో కక్ష గట్టిన ప్రభుత్వం రామ్‌దేవ్‌ బాబా కంపెనీ పతంజలితో సహా దాదాపు వంద కోట్ల రూపాయల విలువగల అనేక ప్రయివేటు కంపెనీల వాణిజ్య ప్రకటనలను ఆ ఛానల్‌కు నిలిపివేయాలని వత్తిడి తెచ్చింది. దాంతో యాజమాన్యం ఆ జర్నలిస్టును బలవంతంగా రాజీనామా చేయించి ప్రభుత్వాన్ని తృప్తి పరచింది. తన కార్యక్రమంలో మోడీ ప్రస్తావన రాకుండా చూడాలని యాజమాన్యం ఆదేశించిందని, మీడియాలో మోడీ గురించి వస్తున్న వార్తల తీరుతెన్నులను విశ్లేషించేందుకు రెండు వందల మందితో ప్రభుత్వం ఒక విభాగాన్ని ఏర్పాటు చేసిందని, అక్కడి నుంచి మోడీ గురించి ఏమి చెప్పాలో, ఎలా చెప్పాలో సంపాదకులకు ఆదేశాలు వెళతాయని ప్రసూన్‌ వాజ్‌పేయి వెల్లడించారు. దేశంలో విద్వేష నేరాలు ఎలా పెరుగుతున్నాయో తెలిపేందుకు హిందూస్ధాన్‌ టైమ్స్‌లో ఒక పర్యవేక్షణ ప్రారంభించిన బాబీ ఘోష్‌ అనే జర్నలిస్టు పని తీరు ప్రభుత్వానికి నచ్చలేదంటూ యాజమాన్యంపై వత్తిడి తేవటంతో అతను రాజీనామా చేసి ఇంటికిపోవాల్సి వచ్చింది. ఆ తరువాత ఆ పత్రిక ఆ పర్యవేక్షణను నిలిపివేసింది. లైసన్సు రాజ్యం అంటూ కాంగ్రెస్‌ను తీవ్రంగా విమర్శించే బిజెపి ఆ విషయంలో తక్కువేమీ తినలేదు. టీవీ ఛానల్స్‌ ప్రారంభానికి కేంద్ర ప్రభుత్వ అనుమతి అవసరం. బిజెపి ఎంపీ యాజమాన్యంలో, బిజెపి అనుకూల ఆర్నాబ్‌ గోస్వామి నిర్వహణలో రిపబ్లిక్‌ టీవీకి అలా దరఖాస్తు చేయగానే ఇలా అనుమతి ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. అయితే మోడీ సర్కార్‌ పట్ల విమర్శనాత్మకంగా వుండే రాజీవ్‌ బహాల్‌ నిర్వహణలో బ్లూమ్‌బెర్గ్‌ క్వింట్‌ సంస్ధ దరఖాస్తు చేసి రెండు సంవత్సరాలు గడిచినా ఎటూ తేల్చలేదు.

Image result for government attack and question of indian media credibility

దేశంలో అతి పెద్ద పారిశ్రామిక సంస్ధ రిలయన్స్‌, దాని యజమాని ముకేష్‌ అంబానీ పెద్ద సంఖ్యలో అన్ని భాషలల్లో ఛానళ్లను ప్రారంభించటం లేదా కొనుగోలు చేసి పెద్ద మీడియా అధిపతిగా మారిన విషయం తెలిసిందే. తన వ్యాపారాలకు ఎలాంటి నష్టం జరగకుండా అధికారంలో ఎవరుంటే వారికి మద్దతుగా పెద్ద ఎత్తున ప్రచార అవకాశాలు కల్పించటం, విమర్శలకు దూరంగా వాటిని నిర్వహిస్తారు. కోబ్రాపోస్ట్‌ నిర్వహించిన ఒక శూల శోధనలో టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా, ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌, ఇండియా టుడే వంటి బడా సంస్ధలతో పాటు 25 మీడియా సంస్ధల ప్రతినిధులు మాట్లాడుతూ ఇచ్చే సొమ్మును బట్టి బిజెపికి ప్రచారంతో పాటు మతపరమైన విద్వేషాన్ని కూడా రెచ్చగొట్టేందుకు సిద్దం అని చెప్పిన విషయాలు వెల్లడయ్యాయి. అంటే మన మీడియా సంస్ధలు డబ్బుకోసం ఎంతకైనా తెగించటానికి సిద్దపడుతున్నాయి.అయితే అన్నీ ఇలాంటి సంస్ధలే లేవు. హిందూ పత్రిక, ఎన్‌డిటివీ వంటి న్యూస్‌ ఛానల్స్‌, వైర్‌, స్క్రోల్‌, బూమ్‌లైవ్‌, న్యూస్‌ మినిట్‌, ఆల్ట్‌న్యూస్‌ వంటి వెబ్‌ మీడియా సంస్ధలు వాస్తవాలను వెల్లడించటానికి వెనుకాడటం లేదు. అలాంటి సంస్ధలు వెల్లడించిన కుంభకోణాలు, అక్రమాల మీద వందల కోట్ల రూపాయల మేర నేరపూరిత పరువు నష్టదావాలను వేస్తూ వాటి నోరు మూయించే ప్రయత్నం జరుగుతున్నది. అలాంటి సంస్ధలకు ఆదాయాలు పరిమితం, ప్రభుత్వ దాడులను తట్టుకొని అవి ఎంత కాలం నిలబడగలవు అన్నది శేష ప్రశ్న.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

తరిగిపోతున్న అమెరికన్‌ కార్మిక సంపద !

04 Wednesday Sep 2019

Posted by raomk in Current Affairs, Economics, History, International, INTERNATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

American Workers, Inequality in USA, US Plutocracy, USA Labor Day

Image result for inequality in wealth holdings, usa

ఎం కోటే శ్వరరావు

ప్రపంచంలో మెజారిటీ దేశాల్లో మే ఒకటవ తేదీ కార్మిక దినం. చిత్రం ఏమిటంటే మే డే పోరాటాల గడ్డ అమెరికాలో మాత్రం అధికారయుతంగా సెప్టెంబరు 2 కార్మిక దినం. అంతర్జాతీయ కార్మిక వుద్యమం ఖరారు చేసిన మే డేను అంగీకరిస్తే కార్మికవర్గం ఎక్కడ కమ్యూనిజం వైపు పయనిస్తుందో  అనే భయంతో  అమెరికా పారిశ్రామికవేత్తలు దానికి బదులుగా 1880దశకంలో సెప్టెంబరు రెండవ తేదీని కార్మిక దినంగా నిర్ణయించాలని తమకు అనుకూలురైన కార్మికులతో ఒక ప్రతిపాదన చేయించారు. ముందే తెలుసుగనుక నాటి అమెరికా అధ్యక్షుడు గ్రోవర్‌ క్లీవ్‌లాండ్‌ అంగీకరించారు. అంటే ఆచరణలో అది కార్మికవర్గానికి చెందినది కాదు యజమానుల దినం.

అమెరికా కార్మికదినాన్ని జరుపుకొనేందుకు నిజానికి అక్కడి కార్మికవర్గం సంతోషించాల్సిందేమీ లేదు. నానాటికీ వారి పరిస్ధితులు దిగజారుతున్నాయి.2003తో పోల్చితే సగం అమెరికన్‌ కుటుంబాల(12.9 కోట్ల మంది) సంపద ఇప్పుడు 32శాతం తక్కువ. ఇదే కాలంలో ఎగువన వున్న ఒక శాతం మంది(పన్నెండు లక్షల 90వేల మంది) ధనికుల సంపద రెండు రెట్లు పెరిగింది.రెండవ ప్రపంచ యుద్దం తరువాత ప్రతి ఏటా  సగటు వేతనాలు 1970వరకు పెరిగాయి. ముఖ్యంగా గత రెండు దశాబ్దాల్లో పేదలు మరింత పేదలుగానూ, ధనికులు మరింత ధనికులుగా మారారు. డోనాల్డ్‌ ట్రంప్‌ బడ్జెట్‌లో లక్ష కోట్ల డాలర్లమేరకు లోటును పెంచి ఒక శాతం ధనికులకు పెద్ద ఎత్తున రాయితీలు ఇచ్చాడు. ఇది వారికి రాయితీలు అనటం కంటే పేదల మీద విధించిన పన్ను అనటం సబబు.

1894లో అమెరికా పార్లమెంట్‌ ఒక చట్టం చేసింది. దాని ప్రకారం ప్రతి ఏడాది సెప్టెంబరులో వచ్చే మొదటి సోమవారం సెలవు ప్రకటించి అమెరికా కార్మిదినంగా పాటించాల్సి వుంది. అదే ఏడాది అమెరికా రైల్వే కార్మికుల సమ్మెను నిరంకుశంగా అణచివేయటంలో అప్పటి అధ్యక్షుడు గ్రోవర్‌ క్లీవ్‌లాండ్‌ పేరు మోశాడు. ప్రస్తుతం అమెరికాలో యూనియన్‌లు నామ మాత్రంగా మారాయన్నది ఒక అభిప్రాయం. ఈ కారణంగానే వారి ఆదాయాలు ఏడాదికేడాది పడిపోతున్నాయి, మధ్యతరగతి అంతరిస్తున్నది.1950దశకంలో మూడో వంతు మంది కార్మికులు ఏదో ఒక యూనియన్‌లో వుండే వారు. 1983 నాటికి ప్రయివేటు రంగంలోని కార్మికులు 16.8శాతం మంది యూనియన్లలో వుండగా గతేడాది అది 6.4శాతానికి పడిపోయింది. ప్రభుత్వ రంగంలో 37 నుంచి 34శాతానికి తగ్గింది. యూనియన్లకు కార్మికులు ఎప్పుడైతే దూరంగా వుంటారో అప్పుడు కార్మిక సంఘాల బేరమాడేశక్తి తగ్గుతుంది.1940 దశకం నుంచి చూస్తే 66శాతం మేరకు  యూనియన్ల సభ్యత్వం పడిపోగా ఆర్ధిక అసమానతలు 30శాతం వరకు పెరిగాయని ఒక అధ్యయనం తెలిపింది.

అమెరికాలో ఏర్పడిన మహా సంక్షోభ సమయంలో అధికారానికి వచ్చిన డెమోక్రటిక్‌ పార్టీకి చెందిన ఫ్రాంక్లిన్‌ డి రూజ్‌వెల్ట్‌ తన తొలి పదవీ కాలం 1935లో జాతీయ కార్మిక సంబంధాల చట్టాన్ని తెచ్చారు. దాని ప్రకారం ప్రయివేటు రంగంలోని కార్మికులకు యూనియన్‌ ఏర్పాటు చేసుకొనే హక్కుతో పాటు బేరమాడే, సమ్మె చేసే హక్కులు కూడా సంక్రమించాయి. రెండవ సారి అధికారానికి వచ్చిన తరువాత న్యాయమైన కార్మిక ప్రమాణాల పేరుతో మరొక చట్టాన్ని తెచ్చారు.దాన్లో భాగంగానే కనీస వేతన వ్యవస్ధను ఏర్పాటు చేశారు. బాలలతో పని చేయించటాన్ని నిషేధించటం, వారానికి నలభై గంటలకు మించి పని చేసిన వారికి ఒకటిన్నర రెట్లు ఓవర్‌ టైమ్‌ చెల్లింపులు వచ్చాయి. ఈ కారణంగానే నేటికీ అమెరికాలో వున్న మేరకు కార్మిక సంఘాలు ఎక్కువ భాగం డెమోక్రటిక్‌ పార్టీతోనే వుంటాయి.

కార్మికులు పై మెరుగులు, నాయకుల దయాదాక్షిణ్యాలను కాదు, తమకు అనుకూలమైన ఆర్ధిక వ్యవస్ధ దిశగా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారని కార్మికదినం సందర్భంగా క్రిస్టియన్‌ సైన్స్‌ మానిటర్‌ పత్రిక నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఎఎఫ్‌ఎల్‌-సిఐఓ అధ్యక్షుడు రిచర్డ్‌ ట్రమ్‌కా  చెప్పారు. ఎన్నికల ప్రచారంలో వున్న అభ్యర్ధులను తాము ఇదే అడుగుతున్నామని అన్నారు.కేవలం వాణిజ్య ఒప్పందాలు కాదు, ఆర్ధిక వ్యవస్దలో మార్పులు తెచ్చే కార్యాచరణ కావాలి. యూనియన్ల అవసరం వుందని గుర్తించిన వారి సంఖ్య 64శాతానికి పెరిగినట్లు గాలప్‌ పోల్‌ వెల్లడించింది, అయితే అమెరికా కార్మిక చట్టంలోని లోపాల కారణంగా అది సభ్యత్వంగా మారటం లేదు అన్నారు. గతేడాది సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు తరువాత ప్రభుత్వ రంగంలోని వుద్యోగులు యూనియన్లలో చేరటం తగ్గవచ్చని భయపడ్డాము కానీ వుద్యోగ సంఘంలో రెండు లక్షల మంది, టీచర్స్‌ యూనియన్‌లో 88వేల మంది తోడయ్యారని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్ధులను అడగాల్సి ప్రశ్నల గురించి కార్మిక సంఘాలకు పెద్ద ఎత్తున శిక్షణ ఇస్తామని వెల్లడించారు. స్ధంభించిన వేతనాలు, పెన్షన్ల గురించే కాదు ఆరోగ్య సంరక్షణకు చేస్తున్న ఖర్చు, స్వేచ్చా వాణిజ్య ఒప్పందాలు, అమెరికా వుద్యోగాలను మెక్సికో, ఇతర చోట్లకు తరలించటం వంటి అనేక అంశాల గురించి పోటీ చేయనున్న అభ్యర్దులను ప్రశ్నిస్తామని అన్నారు. కొత్త ఒప్పందంలో భాగస్వాములు కానున్న అమెరికా, కెనడా, మెక్సికో దేశాలలో కార్మికుల హక్కులు, గౌరవ మర్యాదలను కాపాడవలసి వుందని చెప్పారు. గతంలో మెక్సికోలోని అమెరికా కార్పొరేట్‌ కంపెనీలు ప్రభుత్వ అనుకూల, కంపెనీ అనుకూల యూనియన్లతో ఏడు లక్షల ఒప్పందాల గురించి చర్చించాయని  కొత్త ఒప్పందం అమల్లోకి వస్తే నాలుగు సంవత్సరాల కాలంలో వాటిని రద్దు చేసి స్వతంత్ర కార్మిక సంఘాలతో ఒప్పందాలు చేసుకొనే విధంగా చేస్తామనే మెక్సికో ప్రతిన ఎంతమేరకు నెరవేరుతుందో, అక్కడి కార్మికుల వేతనాలు ఎంత మేరకు పెరుగుతాయో అనుమానమే అన్నారు. చట్టాలను అమలు జరిపే యంత్రాంగం లేకపోతే అది కార్మికుల పాలిట వినాశకరంగానూ, కార్పొరేట్లకు విపరీత లాభాలకు దారి తీస్తుందని, మెక్సికో నూతన అధ్యక్షుడు ఒబ్రాడర్‌ కార్మికుల హక్కులను కాపాడతానన్న తన హామీని ఎలా నిలబెట్టుకుంటారో వెల్లడించాలని అన్నారు.

ఇతర దేశాలతో ఎగుమతుల్లో పోటీ పడేందుకు కార్మికులు వేతనాలు తగ్గించుకొని దేశ భక్తిని చూపాలని లేకపోతే వున్న వుద్యోగాలు కూడా వుండవని బెదిరించిన అమెరికన్‌ కార్పొరేట్ల వత్తిడికి కార్మికవర్గం తలవంచి వేతన స్ధంభనకు అంగీకరించింది. అయినా ఎగుమతులు పెరగలేదు. ఆర్ధిక వ్యవస్ధలో ఎదుగూ బొదుగూ లేదు. ఈ పూర్వరంగంలోనే చైనా, ఐరోపా యూనియన్‌ తదితర దేశాలతో డోనాల్డ్‌ ట్రంప్‌ వాణిజ్య యుద్ధానికి దిగుతున్న విషయం తెలిసిందే. మరోవైపున ట్రంప్‌ కార్మికవర్గం మీద మొత్తంగా దాడి కొనసాగిస్తూనే వున్నాడు. అనేక సంక్షేమ చర్యలకు కోతపెట్టటం దానిలో భాగమే. పేరుకు  అనేక పధకాలు వున్నప్పటికీ వాటిని పొందాలంటే కార్మికులు ఎంతో నష్టపోవాల్సి వుంది. మన దేశంలో ఇఎస్‌ఐ ఆసుపత్రులలో వైద్యం కోసం కార్మికులు ఎన్ని ఇబ్బందులు పడాలో చూస్తున్నదే. కార్మికోద్యమాన్ని బలహీనపరిచేందుకు యూనియన్లను దెబ్బతీస్తున్నారు.

కుటుంబ నియంత్రణ కార్యక్రమ ప్రచారానికి దానిని వ్యతిరేకించే వారిని నియమించినట్లుగా కార్మిక వ్యతిరేకులుగా రుజువైన వారిని కార్మిక మంత్రులుగా నియమించటం వంటి చర్యలకు ట్రంప్‌ పూనుకున్నాడు. తన సంస్దలలో కార్మిక చట్టాలను వుల్లంఘించి, కార్మికులను మోసం చేసి విధిలేక మిలియన్ల డాలర్ల మేరకు జరిమానాలు చెల్లించిన ఒకరిని కార్మిక మంత్రిగా నియమిస్తే  రిపబ్లికన్లు కూడా అంగీకరించలేదు. రెండవ మంత్రి కూడా అలాంటి వ్యక్తే, తాజాగా ప్రతిపాదించిన మూడవ మంత్రి ఇప్పటివరకు చేసిందేమిటయ్యా అంటే వాణిజ్య సంస్ధలను సమర్ధించటమే పని. ట్రంప్‌ విషయానికి వస్తే ఎన్నికల్లో చేసిన సామాజిక భద్రత, వైద్యం గురించి వాగ్దానాలకు విరుద్దంగా వ్యవహరిస్తున్నాడు. సామాజిక భద్రత యంత్రాంగాన్ని పెద్ద ఎత్తున తగ్గించి దరఖాస్తుల పరిశీలన తతంగాన్ని సంవత్సరాల తరబడి సాగదీస్తున్నారు. మంజూరైన తరువాత కూడా లబ్ది అందుకోవటంలో అనేక ఇబ్బందులు పెడుతున్నారు. ఒక వాణిజ్య, పారిశ్రామికవేత్తగా ట్రంప్‌ తక్కువ తినలేదు. అధ్యక్షుడిగా ఎన్నికవటానికి ముందు సంవత్సరాలలో కార్మికులు, వుద్యోగులను వేధించిన చరిత్ర చాలా వుంది. పని చేయించుకొని కాంట్రాక్టర్లు, కార్మికులకు ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వకపోవటం, చట్టాల వుల్లంఘన వంటి వివిధ వుదంతాలకు సంబంధించి అరవై కేసులను ట్రంప్‌ సంస్దలు ఎదుర్కొన్నాయి.

అమెరికాలో ఎన్నికల వాతావరణం మొదలైంది గనుక సహజంగానే కార్మికులు ఎవరికి ఓటు వేయాలో నిర్ణయించుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది. ఎనిమిదేండ్ల డెమోక్రటిక్‌ పార్టీ నేత బరాక్‌ ఒబామా పాలనలో వుద్యోగాలను కాపాడటంలో, కొత్త వాటి కల్పనలో దారుణంగా విఫలమయ్యాడు. ఎన్నో వాగ్దానాలతో రిపబ్లికన్‌ పార్టీకి చెందిన ట్రంప్‌ జనంలో వున్న అసంతృప్తిని సొమ్ము చేసుకున్నాడు. గత మూడు సంవత్సరాలలో అన్ని రంగాల్లో విఫలమై వుద్యోగాల రక్షణ, మరొక పేరుతో అనేక వివాదాస్పద ప్రకటనలు చేస్తున్నాడు. చైనా, భారత్‌ వంటి దేశాలతో బలవంతంగా అధికరేట్లకు తమ సరకులు కొనాలని వత్తిడి, ప్రతి చర్యలకు దిగుతున్నాడు. డెమోక్రటిక్‌ పార్టీ తరఫున ఎలిజబెత్‌ వారెన్‌, బెర్నీ శాండర్స్‌తో పాటు మరికొందరు అధ్యక్ష పదవి అభ్యర్ధిత్వం కోసం పోటీ పడుతూ తాము అధికారానికి వస్తే ఏం చేయనున్నారో వెల్లడిస్తున్నారు. వాటిలో కొన్ని ఇలా వున్నాయి.

Image result for inequality in wealth holdings, usa

గంటకు పదిహేను డాలర్ల కనీస వేతనం ఇవ్వాలన్న ప్రతిపాదనకు డెమోక్రటిక్‌ పార్టీనేతలు మద్దతు తెలుపుతున్నారు. అంతేకాదు కొన్ని ఐరోపా దేశాల్లో మాదిరి కార్పొరేట్‌ డైరెక్టర్ల బోర్డుల్లో కార్మిక ప్రతినిధులకు చోటు కల్పించాలన్న ప్రతిపాదనలను కూడా చేస్తున్నవారు లేకపోలేదు. జవాబుదారీ పెట్టుబడిదారీ బిల్లు ప్రతిపాదన వాటిలో ఒకటి. దాని ప్రకారం డైరెక్టర్లుగా 40శాతం మంది కార్మికుల నుంచి ఎన్నుకోవాల్సి వుంటుంది. జర్మనీలో కొన్ని పరిశ్రమల్లో సగం మంది వరకు డైరెక్టర్లు కార్మికుల నుంచి వున్నారు. పని స్ధలాల్లో ప్రజాస్వామ్యం పేరుతో గత ఎన్నికల్లో డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్ధిత్వం కోసం పోటీ పడిన,  మరోసారి అదే ప్రయత్నం చేస్తున్న బెర్నీ శాండర్స్‌ కూడా కొన్ని ప్రతిపాదనలను ముందుకు తెచ్చారు.  బ్రిటన్‌లోని బడా పరిశ్రమల్లో వచ్చిన లాభాల్లో పదిశాతం వాటాల వరకు వచ్చిన మొత్తాన్ని కార్మిక నిధులకు జమ చేస్తారు. ప్రతి ఏటా కార్మికులు 600 పౌండ్లు డివిడెండ్‌ పొందుతారు. ఇలాంటి అంశాలను చర్చకు తెస్తున్నారు.

కార్మికోద్యమాన్ని నిర్మించకుండా అమెరికాలో మధ్యతరగతి పెరిగే అవకాశాలు లేవని బెర్నీ శాండర్స్‌ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అధికారాలన్నీ యజమానులు, బడా కార్పొరేట్ల చేతుల్లో వున్నాయి, యూనియన్లు లేకుండా వేతనాలు, ఇతర లబ్ది పొందటం అసాధ్యం అని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. మౌలికంగా వీటి స్వభావం సంస్కరణలు తప్ప మౌలిక మార్పులను కోరేవి కాదు. అమెరికాలో ఇప్పుడున్న వాతావరణంలో ఆ పెట్టుబడిదారీ సంస్కరణల మీద కూడా దాడి జరుగుతున్నది, కనీసం వాటిని రక్షించుకొనే స్ధితిలో కూడా కార్మికవర్గం లేదని గమనించాలి.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

మన్‌కీ బాత్‌ కాదు – మోడీ మభ్య పెట్టే మాటలు !

02 Monday Sep 2019

Posted by raomk in BJP, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

India economy 2019, Manki baat, manki baat-modi, modi duping and diversionary tactics, Narendra Modi and Nero

Image result for not his manki baat-modi duping and diversionary tactics

మిత్రమా వినాయక చవితి శుభాకాంక్షలతో పాటు అక్షింతలు కూడా అందుకో ! గత ఐదు సంవత్సరాలుగా దేశభక్తి, జాతీయవాదాన్ని జనం చేత తినిపించి, తాగించి, పీల్పించారు. అదేదో సినిమాలో డివైన్‌ అంటే వైన్‌ ఎంత తాగితే అంత జ్ఞానం వస్తుంది అని చెప్పినట్లుగా వాటికి అర్ధం తెలియకుండానే, తప్పుడు లేదా అనర్ధక అర్ధాలను వ్యాపింప చేసిన వారి స్వరూపం తెలియకనే చాలా మంది వాటిని పాటించారు, పాటిస్తున్నారు.

మన ఘనత వహించిన ప్రధాన మంత్రి నరేంద్రమోడీ తెలివితేటలు, సామర్ధ్యం, ఆర్ధిక విషయాల్లో ఆయన పరిజ్ఞానం గురించి మీ వంటి వారంతా ఇప్పటికీ నమ్ముతూ ఆహా, ఓహో అంటూ హారతులు పడుతూనే వున్నారు. పెద్ద నోట్ల రద్దు ఫలితాలు వెంటనే రావు తరువాత చూడండి అంటే నిజమే కామోసు అనుకున్నారు, నాలాంటి వారు ఎవరైనా కాదంటే ఖండించి మీద పడి కొట్టినంత పని చేశారు. మూడేండ్లు కావస్తోంది, ఆ ఛాయలు లేవు, మోడీ మాటల్లో ఆ వూసుల్లేవు. ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి చర్యలు తీసుకోలేదు అంటే అది మా మోడీ ప్రత్యేకం మోడినోమిక్స్‌ అన్నారు. ఇప్పుడు దేశం మాంద్యంలోకి పోతోంది అంటే అది ప్రపంచ పరిణామాల్లో భాగం అని పన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. మీవి నోళ్లా , మరింకేమైనానా ! మోడీ-షా ద్వయం తెలివితేటలు ఏ మయ్యాయి. ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడి తప్పించుకు తిరిగే వారికి డామిట్‌ కధ అడ్డం తిరిగింది అని గిరీశాన్ని తలచుకోవాల్సిన రోజులు దగ్గరలోనే వున్నాయి.

సందర్భం ఏమంటే మిత్రమా గతనెల మన్‌కీ బాత్‌ విన్న తరువాత అవధానం గుర్తుకు వచ్చింది. అష్టావధాని గారికి ఎనిమిది మంది ప్రచ్చకులు సమస్యలను, ప్రశ్నలను సంధిస్తారు. అలాంటి వారిలో ఒకరు అసందర్భ ప్రలాపి వుంటారు. అంటే అవధాని దృష్టిని మళ్లించినా గాడి తప్పకుండా తన పాండిత్యాన్ని ప్రదర్శించటానికి వుద్దేశించింది. దేశమంతటా దిగజారుతున్న ఆర్ధిక స్ధితి గురించి పృచ్ఛకులు అంటే ప్రాశ్నికులు లేదా ప్రశ్నించేవారు సంధిస్తున్న ప్రశ్నలకు అవధాని స్ధానంలో వుండి సమాధానం చెప్పాల్సిన నరేంద్రమోడీ తానే ఒక పృచ్ఛకుడిగా మారి అదీ అసందర్బ Ûప్రలాపి పాత్ర తీసుకున్నారని నేనంటే నీకు, నీ బృందానికి చెప్పుకోలేని చోట మండటం సహజం.

మన్‌కీ బాత్‌ కంటే ముందు స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో కూడా ప్లాస్టిక్‌ అనర్ధాల గురించి మోడీగారు సెలవిచ్చారు. ప్లాస్టిక్‌ అనర్ధాల గురించి ఎందరో ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్నారు. గత ఐదు సంవత్సరాలుగా ఆయన సర్కార్‌ తీసుకున్న చర్యలేమిటో వాటి ఫలితాలేమిటో చెప్పి సుభాషితాలను కొనసాగించి వుంటే విశ్వసనీయత వుండేది. ఇలా వ్యాఖ్యానించిన వారు మీ దృష్టిలో దేశద్రోహులు అవుతారని తెలుసు. రాబోయే రోజుల్లో ఇలాంటి దేశద్రోహులు మరింతగా పెరిగే విధంగా మోడీగారి తీరు తెన్నులు వున్నందుకు ముందుగా ఆయనకు కృతజ్ఞతలు చెప్పాలి. ఏ పదజాలం వెనుక ఏ ప్రయోజనం దాగుందో తెలియనంత కాలం జనం మోసపోతూనే వుంటారు అని కమ్యూనిస్టు అగ్రనేత లెనిన్‌ మహాశయుడు చెప్పారు. కొందరిని కొంత కాలం మభ్యపెట్టగలరు గానీ అందరినీ ఎల్లకాలం మోసగించలేరని మన పెద్దలు చెప్పారు. రెండింటి అర్ధం ఒకటే. ఐదేండ్ల క్రితం మోడీ చెప్పిందేమిటి, దేశం ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్యలేమిటి, మోడీ నోట వెలువడుతున్న మాటలేమిటి ? ఒకదానికికొకటికి పొంతన వుందా ? ఏ ఒక్క సమస్యపై అయినా సమగ్రంగా పని చేశారా? ఫలితాలు సాధించారా ?

మిత్రమా నా లాంటి వారు చెబితే కుహనా మేథావులు, విదేశీ తొత్తులు, తప్పుదారి పట్టించేందుకు ఇస్తున్న తప్పుడు సలహాలు అని పక్కన పెట్టేస్తారు. మీ మోడీగారికి ప్రసంగాలు, అంశాలను రాసిచ్చే వారు మోడీని విమర్శించే వారికి అవసరమైన సమాచారాన్ని సరఫరా చేస్తున్నారని మీరైనా చెప్పండి. గొడ్డు మాంసం ద్వారా గో సంతతికి ముప్పు తెస్తున్నారని మోడీ అండ్‌కో ఎన్నికల సమయంలో పెద్ద ఎత్తున ఆవు మనోభావాలను రెచ్చగొట్టిన విషయం గుర్తుందా ? అదే మోడీ గారి చేత గో హంతకులంటే ప్లాస్టిక్‌ వల్లనే ఆవులకు ముప్పు ఎక్కువగా వుందని,చనిపోతున్నాయని చెప్పించిన దానిని యాది చేసుకోండి.2015 సెప్టెంబరు 28 గో రక్షకుల ముసుగులో మహమ్మద్‌ అఖ్లక్‌ను దాద్రి గ్రామంలో హత్య చేసిన పదకొండు నెలలకు మోడీగారు నోరు తెరిచారు. ఆ దురంతాన్ని ఖండించేందుకు కాదు సుమా !

పంజాబ్‌, వుత్తర ప్రదేశ్‌ ఎన్నికలను దృష్టిలో వుంచుకొని మాట్లాడారు తప్ప మరొకటి కాదు. ‘ కొందరు జనాలు గో రక్షణ పేరుతో దుకాణాలు తెరిచారు. కొంత మంది రాత్రిపూట సంఘవ్యతిరేక పనులు చేస్తారు, పగలు గోరక్షకులుగా వ్యవహరిస్తారు. ఇలాంటి చెడ్డ పనులు చేసిన వారిలో 70 నుంచి 80శాతం మంది చర్యలను సమాజం అంగీకరించలేదు, వారి చెడు కార్యకలాపాలను కప్పి పుచ్చుకొనేందుకు గోరక్షకుల ముసుగు వేసుకున్నారు ‘ అని చెప్పిన ప్రధాని పార్టీ వారు ఆ పేరుతో నేరాలకు పాల్పడిన వారిని బిజెపి పాలిత ప్రాంతాల్లో ఎందరిని శిక్షించారు. మోడీ అంతటితో ఆగలేదు గోహంతకుల చేతుల్లో కంటే ప్లాస్టిక్‌ తిన్న కారణంగా మరణిస్తున్న ఆవులే ఎక్కువ అని కూడా చెప్పారు. జనం సంగతి వదలి పెట్టండి వుద్యోగం సద్యోగం, ఆదాయం లేకపోయినా మోడీగారి పుణ్యమా అని దేశభక్తి, జాతీయవాదంతో ప్రాణాలు నిలుపు కుంటున్నారు. గోవులకు అంత బుర్రలేదు కనుక కనీసం బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఆవులు ప్లాస్టిక్‌ తినకుండా తీసుకున్న చర్యలు ఏమిటో సెలవిస్తారా మిత్రమా ? గోరక్షకులు లేదా వారి వెనుక వున్న ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలు రోడ్ల మీద తిరుగుతున్న ఆవులు ప్లాస్టిక్‌ తినకుండా వాటి వెనుక తిరుగుతూ కాపాడుతున్న సేవా దృశ్యాలు మనకు ఎక్కడా కానరావు.

ఆవులు తిన కుండా వుండేందుకు ప్లాస్టిక్‌పై నిషేధం విధించాలంటూ కరుణా సొసైటీ సుప్రీం కోర్టులో 2012లో ఒక ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది.2016లో దాని మీద తీర్పు చెబుతూ నిషేధం గురించి పరిశీలించాలని కోర్టు తీర్పు చెప్పింది. ఇంతవరకు మోడీ సర్కార్‌ ఆ దిశగా ఎలాంటి ప్రయత్నమూ చేయలేదు. ఇప్పుడు ప్లాస్టిక్‌ నిషేధం గురించి కబుర్లు చెబుతున్నారు. బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఆవుల రక్షణకు చట్టాలను చేశారు గానీ మోడీ చెప్పినట్లు వాటి మరణాలకు కారణం అవుతున్న ప్లాస్టిక్‌ గురించి ఎలాంటి చర్యలూ లేవు. గతంలో స్కైలాబ్‌ కూలిపోతోందనే వార్తలతో జనం రాత్రింబవళ్లు అదేదో తమ మీదే పడనుందన్నట్లు భయపడ్డారు. ఇప్పుడు ప్లాస్టిక్‌ ముప్పు గురించి కొత్తగా వెలువడిన ఆకస్మిక సమాచారమూ లేదు, కొత్తగా ఆందోళన పడాల్సిందీ లేదు. మరొక సమస్యదీ లేనట్లు మోడీ గారు దాని గురించి చెబుతుంటే ఆయన గారి చిత్తశుద్ధిని శంకించాల్సి వస్తోంది. రిజర్వుబ్యాంకు నిధులను ఖాళీ చేసి దాన్ని దివాలా తీయించటానికి రంగం సిద్ధం చేశారన్న విమర్శలూ పట్టవు, ఆర్ధిక వ్యవస్ధ దిగజారుతోందన్న ఆందోళనా లేదు. రోమ్‌ తగులబడుతోంటే పట్టించుకోకుండా ఫిడేలు వాయించిన నీరో చక్రవర్తి మాదిరి ప్లాస్టిక్‌, ఫిట్‌ నెస్‌ గురించి కబుర్లు చెప్పటం ఏమిటి ?

మిత్రమా నీకు ఒక ప్రశ్న వేయక తప్పదు. ప్లాస్టిక్‌ గురించి ఆందోళన వ్యక్తం చేసిన ప్రధాని పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌తో తయారు చేసే వినాయకవిగ్రహాలు, వాటిని నీటి వనరుల్లో కలిపి కలుషితం చేస్తున్న తీరు గురించి ఎందుకు నోరు విప్పరు. మీరే చెప్పినట్లు మెజారిటీ రాష్ట్రాల్లో మెజారిటీ జనం మీ వెనుకే వున్నారు, అంటే మెజారిటీ కాలుష్య వినాయక విగ్రహాలకు కూడా మీరే బాధ్యులు. మరి దాని గురించి ఎందుకు చెప్పరు? వినాయకుడి పేరుతో వసూలు చేసే వారి వుపాధి, ఆదాయాలు పోతాయనా, మీ ఓటు బ్యాంకుకు నష్టం జరుగుతుందనా? కాలుష్యం, పర్యావరణ రక్షణ అంటే సమగ్ర చర్యలు తీసుకోవాలి తప్ప ప్లాస్టిక్‌ వరకే పరిమితం కాకూడదు. బిజెపి నేతలకు నిజంగా చిత్తశుద్ది పర్యావరణ పట్ల శ్రద్ద వుంటే ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌తో చేసిన వినాయక బొమ్మలు పెట్టిన పందిళ్లను సందర్శించటం మానుకోవాలి, నిమజ్జనాలకు దూరంగా వుండాలి.లేకపోతే మోడీ ప్లాస్టిక్‌ మీద చెప్పిన సుద్దులను తుంగలో తొక్కినట్లే అనుకోవాల్సి వస్తుంది.

మోడీగారి మన్‌కీ బాత్‌లో మరొక అంశం ఫిట్‌ ఇండియా ! మిత్రమా కాలేజీ రోజుల్లో నువ్వెంత కష్టపడినా బక్కపీచుగానే వుండిపోయావు గుర్తుందా ? మోడీ మాటలు వింటుంటే నవ్వాలో ఏడవాలో తెలియటం లేదు. మీరిచ్చిన ప్రోత్సాహంతో ప్రబోధకుడు చాగంటి కోటేశ్వరరావు గారు కోడి గుడ్లు తినేవారి దగ్గరకు దేవతలు రారని వేదాల్లో వుంది అంటారు. మీరేమో ప్రొటీన్లు అధికంగా వుండి చౌకగా లభించే బీఫ్‌ను ఎవరైనా తింటే ఆవు మాంసం తింటున్నారంటూ దాడులు చేస్తారు, బీఫ్‌ నిషేధించాలంటారు. మరోవైపు ఫిట్‌గా వుండాలంటారు, ఇదెక్కడి విపరీతం ! దేశంలో 2022 నాటికి మన పిల్లల్లో 31.4శాతం మంది గిడసబారి పోతారని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ స్ధితిలో కడుపునిండా తిండి లేని వారికి ఫిట్‌నెస్‌ గురించి మోడీ గారు పాఠాలు చెబుతున్నారు. ఇంతకు ముందు యోగా, స్వచ్చ భారత్‌ గురించి హడావుడి చేశారు. జనం వాటిని మరచి పోయారు గనుక ఫిట్‌నెస్‌ గురించి కొత్త పల్లవి అందుకున్నారు. మీరు, మీ మిత్రులు పరిపాలన సాగించే బీహార్‌, యుపిల్లో ప్రతి ఇద్దరిలో ఒక పిల్ల లేదా పిల్లవాడు గిడసబారి వున్నారు.

Image result for manki baat-modi

బండ బడ మీ వ్యవహారం చూస్తా వుంటే దేశంలో ముంచుకు వస్తున్న ఆర్ధిక తిరోగమనం, మాంద్యాల నుంచి జనం దృష్టిని మళ్లించేందుకే ప్రధాని పని చేస్తున్నట్లుగా వుంది. ఆర్ధికరంగంలో పరిస్ధితి గురించి మీడియాకు ఇష్టం వున్నా లేకపోయినా వార్తలు ఇవ్వక తప్పటం లేదు. గత నెల రోజులుగా ఏదో ఒక వార్త వస్తోంది. మీడియాతో మాట్లాడటానికి అంటే ధైర్యం లేదు గనుక పత్రికా గోష్టి పెట్టరు అని సరిపెట్టుకుందాం. ఇష్టం వచ్చింది మాట్లాడటానికి అవకాశం వున్న మన్‌కీ బాత్‌లో ఆ విషయాలు ప్రస్తావించరా ? మీడియా వార్తలన్నీ తప్పు , దేశమంతా భేషుగ్గా వుంది, అచ్చేదినాల్లోనే వున్నాం అని చెప్పొచ్చుగా ! ప్రతిపక్షాలకు మోడీ అన్నా ఆయన సర్కార్‌ అన్నా గిట్టదు అనుకుందాం. నీతి అయోగ్‌ అధిపతి రాజీవ్‌ కుమార్‌ 70 సంవత్సరాల్లో ఎన్నడూ లేని పరిస్ధితి వచ్చిందన్నారు, మోడీ కోరి ఎంచుకున్న రిజర్వు బ్యాంకు గవర్నర్‌ శక్తికాంత దాస్‌ కూడా అదియును సూనృతమే ఇదియును సూనృతమే అన్నట్లుగా మాట్లాడారు. మోడీగారు పత్రికలు చదవరు, టీవీలు చూసే తీరిక వుండదు, సంసార బంధనాలు లేవు ఎప్పుడూ దేశం గురించే ఆలోచిస్తారు అనుకుందాం, కనీసం తాను నియమించుకున్న వారి మాటలు కూడా పట్టించుకోరా ?

ఈ మధ్య ప్రధాని, రాష్ట్రాలో ముఖ్యమంత్రులు ఇబ్బంది కలిగించే, వివాదాస్పద అంశాలపై నేరుగా మాట్లాడకుండా వుత్సవిగ్రహాలతో మాట్లాడించి స్పందన ఎలా వుందో చూస్తున్నారు. మోడీ మౌనంతో బిజెపి నేతలు తమ అతితెలివిని ప్రదర్శిస్తున్నారు. ఎవరేం మాట్లాడుతున్నారో తెలియటం లేదు.ఐదు లక్షల కోట్ల ఆర్ధిక వ్యవస్ధ లక్ష్యానికి తిలోదకాలివ్వాలి. మనకు ధైర్యం లేదు, ఆర్ధిక వ్యవస్ధను ఎలా కాపాడాలో తెలివీ లేదు అని బిజెపి నేత సుబ్రమణ్య స్వామి అన్నారు. ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధలో మాంద్యం వున్నప్పటికీ భారత ఆర్ధిక వ్యవస్ధ ఎంతో బాగా పని చేస్తోందని బిజెపి ప్రతినిధి సంబిత్‌ పాత్ర వర్ణించారు. దీనికి గత ఆరు సంవత్సరాలలో జిఎస్‌టి, పన్నుల సంస్కరణల వంటి పునాదులు వేశారని అన్నారు. అంతటితో ఆగలేదు, మోడీ ఆర్ధిక విధానం ప్రపంచంలోని అగ్రరాజ్యాలలో ఒకదానిగా దేశాన్ని తీసుకుపోయింది, మోడీ కారణంగానే ఇది సాధ్యమైందనే వాతావరణం ఇప్పుడుంది అన్నారు. బిజెపికి చెందిన బీహార్‌ వుప ముఖ్యమంత్రి సుశీల్‌ కుమార్‌ మోడీ కొత్త ప్రచారానికి తెరతీశారు. ప్రతి ఏటా ఐదు, ఆరు హిందూ నెలల్లో ఆర్ధిక వ్యవస్ధ మందగిస్తుందట. ఎన్నికల్లో ఓడిపోయిన అసంతృప్తిని వెల్లడించేందుకు రాజకీయ పార్టీలు ఈ అంశం మీద ఈ ఏడాది గోల చేస్తున్నాయట. తొలిసారిగా గత ఆరు సంవత్సరాల్లో మొదటి మూడు మాసాల్లో అభివృద్ధి రేటు ఐదుశాతానికి పడిపోయిందని ప్రభుత్వమే ప్రకటించినా, ఇది ప్రతి ఏటా జరిగేదే అని బుకాయిస్తున్నారంటే జనం ఇంకా చెవుల్లో పూలు పెట్టుకున్నారనే అనుకుంటున్నారు.

మిత్రమా ఇంకా నయం దీనికి కూడా జవహర్‌ లాల్‌ నెహ్రూయే కారణం అని చెప్పినా మీ లాంటి వారంతా గొర్రెల్లా తలలూపుతారనే నమ్మకం బిజెపి నేతల్లో గట్టిగా వున్నట్లుంది,జనం తాము తాగించిన దేశభక్తి, జాతీయవాద మత్తులోనే జనం వూగుతూ తూగుతున్నారనే అనుకుంటున్నారు ! ఈ స్ధితిలో వున్న వారికి ఎదుటి వారు చెప్పేది ఎక్కదు కదా ! మరో సమస్య మీద మరో లేఖ రాస్తా ! వుంటా మరి.

ఎం కోటేశ్వరరావు

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...
← Older posts

Recent Posts

  • మనవాళ్లు వట్టి వెధవాయి లోయి అన్న గిరీశాన్ని గుర్తుకు తెస్తున్న వాట్సాప్‌ పండితులు !
  • బిజెపి మిత్రోం అదానీ, బికినీలను కాదు సామాన్య జనాన్ని చూడండి !
  • వైవిధ్య సమస్యలతో ప్రపంచ వ్యవసాయ రంగం !
  • రష్యా – జర్మనీలను శాశ్వత శత్రు దేశాలుగా మార్చే అమెరికా కుటిల పన్నాగం !
  • అక్రమం జరిగిందా లేదా విచారణకు ఆదేశిస్తారా లేదా : అదానీ కంపెనీలపై నోరు విప్పని ప్రధాని నరేంద్రమోడీ !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • మనవాళ్లు వట్టి వెధవాయి లోయి అన్న గిరీశాన్ని గుర్తుకు తెస్తున్న వాట్సాప్‌ పండితులు !
  • బిజెపి మిత్రోం అదానీ, బికినీలను కాదు సామాన్య జనాన్ని చూడండి !
  • వైవిధ్య సమస్యలతో ప్రపంచ వ్యవసాయ రంగం !
  • రష్యా – జర్మనీలను శాశ్వత శత్రు దేశాలుగా మార్చే అమెరికా కుటిల పన్నాగం !
  • అక్రమం జరిగిందా లేదా విచారణకు ఆదేశిస్తారా లేదా : అదానీ కంపెనీలపై నోరు విప్పని ప్రధాని నరేంద్రమోడీ !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • మనవాళ్లు వట్టి వెధవాయి లోయి అన్న గిరీశాన్ని గుర్తుకు తెస్తున్న వాట్సాప్‌ పండితులు !
  • బిజెపి మిత్రోం అదానీ, బికినీలను కాదు సామాన్య జనాన్ని చూడండి !
  • వైవిధ్య సమస్యలతో ప్రపంచ వ్యవసాయ రంగం !
  • రష్యా – జర్మనీలను శాశ్వత శత్రు దేశాలుగా మార్చే అమెరికా కుటిల పన్నాగం !
  • అక్రమం జరిగిందా లేదా విచారణకు ఆదేశిస్తారా లేదా : అదానీ కంపెనీలపై నోరు విప్పని ప్రధాని నరేంద్రమోడీ !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Follow Following
    • vedika
    • Join 234 other followers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Customize
    • Follow Following
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d bloggers like this: