Tags
ayodhya verdict, economic challenges before narendra modi, Narendra Modi, post ayodhya verdict, probable scenario of the post ayodhya verdict
ఎం కోటేశ్వరరావు
అయోధ్య బాబరీ మసీదు వివాదంపై సుప్రీం కోర్టు ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఒక తీర్పు వెలువరించింది. నిజానికి ఆ కేసు రాముడు ఎక్కడ జన్మించాడు అన్నది కాదు, వివాదాస్పద రెండు ఎకరాల 77సెంట్ల భూమి మీద హక్కులకు సంబంధించిన వాజ్యం మీద అలహాబాదు హైకోర్టు ఇచ్చిన తీర్పు మీద దాఖలైన పునర్విచారణ అంశం. దానికి పరిమితం కాకుండా విశ్వాసాలను కలగలపి ప్రభుత్వ భూమి గనుక రాముడికి కేటాయిస్తూ ఇచ్చిన తీర్పు. సరే దీని పర్యవసానాలు, పరిణామాలు ఎలా ఉంటాయన్నది రాబోయే రోజుల్లో నిపుణులు చర్చిస్తారు. ఒక్క ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు తప్ప మిగిలిన ముస్లిం సంస్ధలన్నీ కొన్ని మినహాయింపులతో అయినా తీర్పును స్వాగతించాయి. పునర్విచారణ పిటీషన్ దాఖలు చేయాలా లేదా అన్నది త్వరలోనే ముస్లిం పర్సనల్ లాబోర్డు నిర్ణయిస్తుంది. పిటీషన్ దాఖలు చేస్తే ఈ వివాదం మరికొంతకాలం సాగుతుంది. లేకపోతే ఇంతటితో ముగుస్తుంది. న్యాయమూర్తులకు దురుద్ధేశ్యాలను ఆపాదించకూడదు తప్ప తీర్పు మంచి చెడ్డల గురించి చర్చించే అవకాశం ఇంకా మన దేశంలో మిగిలే ఉంది కనుక ఎవరైనా ఉపయోగించుకోవచ్చు. సద్వివిమర్శనాత్మక వైఖరి ప్రజాస్వామ్యాన్ని, న్యాయ వ్యవస్ధలను మరింత పటిష్ట పరుస్తుందే తప్ప ప్రపంచంలో ఎక్కడా దెబ్బతీసిన దాఖలాలు లేవు. అయితే ప్రభుత్వ విధానాలను విమర్శించటం కూడా దేశద్రోహమే అన్న వైఖరి రోజురోజుకూ పాలకుల్లో బలపడుతున్న కారణంగా ఈ స్వేచ్చ ఎంతకాలం ఉంటుంది అన్నది ఊహాజనితమైన ప్రశ్న.
చరిత్రలో ప్రతి ముగింపు మరో దానికి నాంది కావటాన్ని అనేక పరిణామాల్లో చూశాము. సుప్రీం కోర్టు ఎవరికి ఎలా కనిపించినా అది ఒక నూతన అధ్యాయానికి తెర తీసింది అన్నది నిర్వివాదం. గతంలో అనేక ముఖ్య అంశాలపై ఇచ్చిన తీర్పులు వాటి స్వభావాన్ని బట్టి న్యాయమూర్తుల మీద పూలూ రాళ్లూ కూడా పడ్డాయి. మహాత్మా గాంధీ ప్రస్తావన వచ్చినపుడు ఆయన హంతకుడైన హిందూ మతోన్మాది గాడ్సే పేరును తలవకుండా ఉండలేము కదా ! చరిత్ర పేజీలో ఎవరి అవగాహన మేరకు వారు రాసేందుకు అవకాశం ఉంది కనుక దీని గురించి కూడా అదే జరుగుతుంది. అయోధ్యపై సుప్రీం తీర్పు గురించి గాంధీ ముని మనవడు తుషార్ గాంధీ వ్యాఖ్యానిస్తూ మన న్యాయవ్యవస్ధలో విశ్వాసానికి సంబంధించిన నేరం కూడా చేరిందని, మహాత్మాగాంధీ హత్యకేసును ఇప్పుడు గనుక సుప్రీం కోర్టు పునర్విచారణ జరిపితే గాడ్సే హంతకుడే అయితే అతను దేశభక్తుడు కూడా అని తీర్పు చెప్పి ఉండేవారు అని వ్యాఖ్యానించాడు. దీనికి టీకా, తాత్పర్యాలు చెబితే అంత బాగోదు ! అయోధ్య తీర్పు అనంతరం ఏమి జరుగుతుంది ?
పునర్విచారణలో తీర్పును కొట్టి వేస్తే ?
ముస్లిం పర్సనల్ లా బోర్డు పునర్విచారణ కోరితే ఐదుగురు సభ్యుల బెంచ్ లేదా అంతకంటే ఎక్కువ సభ్యుల బెంచ్ గానీ దానిని విచారణ చేయవచ్చు. కోర్టు తీర్పులను ఊహించలేము గనుక పునర్విచారణలో ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పును తోసి పుచ్చ వచ్చు లేదా నిర్ధారించనూ వచ్చు, నిర్దారణ ఏక గ్రీవం కావచ్చు లేదా మెజారిటీ ప్రకారమూ కావచ్చు. ఒక వేళ ఇప్పుడిచ్చిన తీర్పును కొట్టి వేసి కొత్త తీర్పు ఇస్తే అది కేంద్రంలో ఉన్న పాలకపక్షానికి అంగీకారం కానట్లయితే ? గతంలో షాబానో కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును కాంగ్రెస్ సర్కార్ మైనారిటీలను సంతృప్తి పరచేందుకు పార్లమెంట్ ద్వారా ఆ తీర్పును రద్దు చేసింది. ఇప్పుడు బిజెపి సర్కార్కు నచ్చని తీర్పు వస్తే అదేపని చేసి మెజారిటీ పజానీకాన్ని సంతృప్తి పరచవచ్చు.
విశ్వాసాల ప్రాతిపదికన కొత్త డిమాండ్లను ముందుకు తెస్తే ?
ఒక్క అయోధ్య వివాదం తప్ప మిగిలిన ప్రార్ధనా స్ధలాలు 1947 ఆగస్టు 15 నాటికి అంటే స్వాతంత్య్రం వచ్చిన సమయానికి ఏ స్ధితిలో ఉన్నాయో వాటిని అదే విధంగా ఉంచాలని 1991లో కేంద్ర ప్రభుత్వం ప్రార్దనా స్ధలాల ప్రత్యేక అంశాల చట్టం నిర్దేశిస్తోంది. దాని ప్రకారం అప్పటి వరకు ఉన్న కేసులను కోర్టుల నిర్ణయానికి వదలి వేయాలి. మిగతా వాటిని వివాదం చేయటానికి లేదు. దానికి అనుగుణ్యంగానే అయోధ్య కేసును కోర్టు నిర్ణయానికి వదలివేశారు. అయోధ్య తీర్పు ప్రాతిపదికన మధుర, కాశీలోని మసీదులను కూడా దేవాలయాలను కూల్చి నిర్మించినవే అని లేదా లేదా ఇతర ప్రార్ధనా స్దలాల గురించి వివాదాలను ముందుకు తెచ్చినా కోర్టులలో చెల్లవు.
అయితే ఈ చట్టానికి సవరణలు లేదా రద్దు జరగనంత వరకు మాత్రమే ఆ స్ధితి కొనసాగుతుంది. ఒక వేళ ప్రస్తుత పాలకులు లేదా తరువాత వచ్చే వారు గానీ దాన్ని సవరిస్తే ఏమిటి ? ప్రస్తుతం ఊహాగానంగా లేదా మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నారని ఎవరైనా అనుకోవచ్చు రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చకూడదు అని సుప్రీం కోర్టు గతంలో తీర్పు చెప్పినప్పటికీ దాన్ని పక్కన పెట్టి తన రాజకీయ అజెండాకు అనుకూలంగా బిజెపి ఒక మౌలిక లక్షణమైన ఆర్టికల్ 370ని రద్దు చేసిన తీరు చూసిన తరువాత ఏ రాజకీయ పార్టీ అయినా తన రాజకీయ అజెండాకు అనుగుణంగా ఏ చట్టాన్ని అయినా మార్చే అవకాశం ఉంటుంది అన్నది స్పష్టమైంది. అనేక దేశాలలో పాత రాజ్యాంగాలను మార్చి కొత్త వాటిని ఉనికిలోకి తీసుకు వచ్చారు. ఎన్నడో మధ్యయుగాల్లో, అంతకు ముందో యూదులకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే పేరుతో ఇజ్రాయెల్ అనే దేశాన్నే ఐక్యరాజ్యసమితి సృష్టించటాన్ని చూశాము. అదే పేరుతో చరిత్రలో జరిగిన తప్పిదాలను సరిదిద్దే పేరుతో మన రాజ్యాంగాన్ని మార్చి తమ అజెండాను అమలు చేసేందుకు పూనుకోరు అన్న హామీ ఎక్కడుంది.
సంఘపరివార్ హిందూత్వ అజెండా పూర్తి అయినట్లేనా ?
మన దేశాన్ని హిందూ దేశంగా మార్చాలన్నది హిందూత్వశక్తుల లక్ష్యం. అందుకు గాను ఆర్ఎస్ఎస్ రాజకీయ విభాగంగా జనసంఘాన్ని ఏర్పాటు చేసింది. తరువాత దాన్ని జనతా పార్టీలో విలీనం చేసింది. దాన్నుంచి విడదీసి భారతీయ జనతా పార్టీగా మార్చింది. రాజకీయ, ఇతరంగా ఏర్పాటు చేసిస సంస్దల ద్వారా జన సమీకరణకు ఎంచుకున్న అనేక అంశాలలో ఆర్టికల్ 370, రామజన్మభూమి, ఉమ్మడి పౌరస్మృతి. వీటిలో రెండింటిని పూర్తి చేశారు.మూడవ దానిని కొంత చేశారు. ఒకసారి వివాదాస్పద అంశాలు పూర్తి అయిన తరువాత అజెండా అయిపోయింది కనుక దుకాణాన్ని మూసుకుంటారు అనుకుంటే పొరపాటు. గుళ్లకు, ఇళ్లకు పరిమితం కావాల్సిస దేవుళ్లను వీధుల్లోకి తీసుకు వచ్చారు. ఇంకా అనేక వివాదాస్పద అంశాల గురించి మాట్లాడుతున్నందున వాటిని ఏ రూపంలో ముందుకు తీసుకు వస్తారో చూడాల్సి ఉంది.
అయోధ్య తీర్పు అనంతర పర్యవసానాలు ఏమిటి ?
దేశంలో మతాలను నమ్మే వారు, నమ్మని వారు కూడా మతం,ఆలయం, మసీదుల పేరుతో జరిగిన రాజకీయాలు, మారణకాండలను చూసి ఏదో ఒక పరిష్కారం కావాలని కోరుకున్నారు. పెద్ద మనుషుల మాదిరి రెండు పక్షాలను సంతృప్తి పరచేందుకు ఇచ్చిన తీర్పుగా చూసి జనంలో కూడా ఒక సంతృప్తి వ్యక్తం అవుతోంది. మొత్తంగా చూసినపుడు 370 అర్టికల్ కంటే రామజన్మభూమి ఎక్కువ మందిని ఆకర్షిస్తుంది. ఎందుకంటే సదరు ఆర్టికల్ కాశ్మీర్కు చెందినదిగా భావిస్తే రాముడు అనే దేవుడి ఆలయం హిందువులందరూ తమదిగా భావించే స్ధితికి తీసుకువచ్చారు. అది ఒక కొలిక్కి వచ్చింది కనుక. జనం ఇప్పుడు తాము ఎదుర్కొన్న అసలు సమస్యల మీద దృష్టి కేంద్రీకరించే పరిస్ధితులు ఏర్పడతాయి.
అలా కేంద్రీకరించకపోతే జనమే నష్టపోతారు, కేంద్రీకరిస్తే బిజెపి నష్టపోతుంది. నరేంద్రమోడీ కల్పించిన భ్రమల తీవ్రత కారణంగా మూడు సంవత్సరాల క్రితం పెద్ద నోట్ల రద్దును వ్యతిరేకించిన వారిని దేశద్రోహులు అన్నట్లుగా చూశారు. నోట్ల మార్పిడి, బ్యాంకుల్లో వున్న సొమ్ము కోసం పని పాటలు మాని బ్యాంకుల వద్ద బారులు తీరటాన్ని దేశభక్తియుతమైనదిగా పరిగణించారు. మూడేండ్ల క్రితం రొమ్ము విరుచుకొని మతి మాలిన ఆ చర్యను సమర్ధించిన వారిలో ఇప్పుడా పరిస్ధితి లేదు. పకోడీలు అమ్ముకోవటం కూడా ఉపాధి కల్పనే అన్న మోడీ మాటను ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో సమర్ధించేవారిని జనం అపహాస్యం చేస్తారు.
ఓటు బ్యాంకు రాజకీయాలకు తెరపడుతుందా !
రాజకీయ, సామాజిక అంశాలలో వివాదాస్పద అంశాలను ముందుకు తీసుకురావటంలో, అధికారాన్ని పొందటంలో బిజెపి-కాంగ్రెస్ ఇతర ప్రాంతీయ పార్టీల మధ్య వివాదాలు, విబేధాలు ఉన్నాయి తప్ప విధానాల పరంగా వామపక్షాలు మినహా అన్నీ ఒక్కటే. మైనారిటీలను ఓటు బ్యాంకుగా చేసుకొనేందుకు కాంగ్రెస్ రాజకీయాలు చేసింది. మెజారిటీ జనంతో ఓటు బ్యాంకు ఏర్పాటుకు బిజెపి తెరతీసింది. అంతకు మినహా ఆర్ధిక విషయాల్లో వాటికి తేడా లేదా పంచాయితీ లేదు. అమలు జరపటంలో పోటీ పడుతున్నాయి. ఆవిధానాలే భారీ కుంభకోణాలు, అవినీతి అక్రమాలకు, జన జీవితాలు అతలాకుతలం కావటానికి తద్వారా కాంగ్రెస్, కొని ప్రాంతీయ పార్టీల పతనానికి దారి తీశాయి. బిజెపి విషయంలో కూడా అది జరగటానికి ఎంతో సమయం పట్టదు. అచ్చే దిన్ బదులు మోడీ విధానాలు జనాలు చచ్చే దినాలకు దారి తీశాయని, రోజు రోజుకూ ముదురుతున్న ఆర్ధిక మందగమనం వెల్లడిస్తోంది. ఆటోమొబైల్ రంగంలో కొనుగోళ్లు పడిపోయాయంటే జనం కొత్త మోడళ్ల కోసం కొనుగోలు వాయిదా వేసుకున్నారని చెప్పారు. ఇప్పుడు రోజువారీ వినియోగ వస్తువుల కొనుగోళ్లు, విదేశాల నుంచి దిగుమతులు కూడా పడి పోయాయని వస్తున్న వార్తలకు ఏ సాకు చెబుతారు? అక్టోబరు నెలలో నిరుద్యోగం 8.5శాతానికి పెరిగింది. అంటే మరింత మెరుగైన వాటికోసం జనాలు ఉద్యోగాల్లో చేరటం లేదని సిద్ధాంతీకరిస్తారా ? పని పాటలు లేని యువత కొంత భాగం పక్కదారి పట్టటమే కాదు, సరైనదారి కోసం కూడా ఆలోచించేది కూడా యువతే. ప్రస్తుతం అనేక దేశాల్లో జరుగుతున్న ఆందోళనలో ముందుంటున్నది వారే. ఆ ధోరణి నుంచి మన దేశం ఎలా తప్పించుకోగలదు ? కొందరిని కొంతకాలం మభ్యపెట్టగలరు గానీ అందరినీ ఎలా కాలం మోసగించలేరుగా !
బిజెపి చెబుతున్న జాతీయ వాదం పర్యవసానాలు ఏమిటి ?
బిజెపి ముందుకు తెచ్చిన హిందూత్వ అజెండాలో భాగమే జాతీయ వాదం. ఏ దేశమైనా కుంభకోణాలు, అవినీతి మయంగా మారినపుడు, పాలకుల విధానాల వైఫల్యాలతో ఆర్ధికంగా ఇబ్బందుల్లో ఉన్నపుడు జాతీయ వాదాలను, ప్రజాకర్షక నినాదాలను ముందుకు తేవటం సులభం. అయితే అవి ఎక్కువ కాలం పని చేయవన్నది అంతర్జాతీయ అనుభవం. ఒక దేశం వాటికి దూరంగా ఉండజాలదు. బిజెపి నేతలు ఒక వాదనను ముందుకు తెచ్చారు. మేము ముస్లింలందరినీ ఉగ్రవాదులు అనటం లేదు గానీ, ఉగ్రవాదులంతా ముస్లింలే ఉన్నారు అని చెబుతారు. ఇప్పుడు మన జనం నోళ్లలో నానుతున్న అంశం ఏమంటే పాకిస్ధాన్ నుంచి యుద్ధం, ఉగ్రవాద చర్యలు అందరికీ తెలిసినవే గానీ అదేమిటో బిజెపి అధికారంలో ఉన్నపుడు సరిగ్గా అవి ఎన్నికల ముందే జరుగుతున్నాయి అనే చర్చ ప్రతి ఉదంతం సందర్భంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఎందుకంటే వాటిని ఆ పార్టీ ఎన్నికల అస్త్రాలుగా, మనోభావాలను రెచ్చగొట్టేందుకు వినియోగిస్తున్న తీరు చూసిన తరువాత బిజెపి అభిమానుల్లో కూడా నాటుకున్న అనుమానం అదే. జాతీయ వాదం పులి స్వారీ వంటిది. పులినెక్కిన వారు దాన్ని అదుపులోకి తెచ్చుకోవాలి లేదా దానికే బలి కావాలి. నిరుద్యోగం వంటి సమస్యలను పరిష్కరించకుండా జాతీయ వాదాన్ని తిని, జాతీయవాదాన్ని చెప్పి, జాతీయ వాదాన్ని పీల్చి బతకమంటే కుదిరేది కాదు.
కిన్లే బదులు ఆవు మూత్రం తాగి, బాబా గారి సబ్బుల బదులు ఆవు పేడతో స్నానం చేస్తామా ?
దేశభక్తి అంటే ఆవు మూత్రం, ఆవు పేడలో సుగుణాలను అంగీకరించటంగా తయారైంది. నిజానికి అలా చెప్పే వారు రోజూ గోమూత్రం తాగుతూ సబ్బుల బదులు ఆవు పేడతో స్నానం చేస్తున్నారా ? ఎదుటి వారికి చెప్పేటందుకే నీతులు ! ప్రధాని నరేంద్రమోడీ గారూ, వారి పార్టీ నేతలూ కాంగ్రెస్ 50 ఏండ్లలో సాధించలేని వాటిని మేము ఐదేండ్లలో సాధించాం అని వూరూ వాడా ఎన్నికల ప్రచారం చెశారు. రెండోసారి అధికారానికి వచ్చాక 70 ఏండ్లుగా చేయలేని దానిని 70 రోజుల్లో చేశాం అన్నారు. నీతి ఆయోగ్ వుపాధ్యక్షుడు రాజీవ్ కుమార్ సరిగ్గా ఈ సమయంలోనే 70 సంవత్సరాలలో ఎన్నడూ తలెత్తని అసాధారణ పరిస్ధితి ఏర్పడింది అని వ్యాఖ్యానించారు.
ఆరు సంవత్సరాల క్రితం అంటే 2012, 2013లో రూపాయి విలువ పతనంతో ధరలు పెరుగుతాయని మిగతా వారంతా ఆందోళన పడుతుంటే ‘నేనూ పాలనలోనే వున్నాను(ముఖ్యమంత్రిగా) ఇంత వేగంగా రూపాయి విలువ పడిపోకూడదని నాకు తెలుసు, ఈ విధంగా పతనం కావటానికి కారణం ఏమై వుంటుంది. ఈ ప్రశ్నకు మీరు సమాధానం చెప్పాలి, సమాధానం కావాలని దేశం డిమాండ్ చేస్తోంది.రూపాయి ఈ రోజు ఆసుపత్రిలో వుంది, జీవన పోరాటం చేస్తోంది, అని మన్మోహన్ సింగ్ గురించి నరేంద్రమోడీ అన్నారు. గతేడాది గరిష్టంగా రికార్డు స్ధాయిలో ఒక రోజు రూపాయి విలువ 74.48కి పడిపోయింది. ఆజ్తక్ టీవీ యాంకర్ రూపాయి విలువ పతనం వార్త సందర్భంగా ‘ కాలం మారింది. నరేంద్రమోడీ ప్రధాని అయ్యారు. ఇప్పుడు రూపాయి విలువ పతనం అవుతోంది. ఆయనేమీ చెప్పటం లేదు’ అన్నారు.
ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడితే ….. ?
నల్ల ధనం దేశం నుంచి బయటకు పోతున్న కారణంగా రూపాయి విలువ పడిపోతున్నదని 2018 సెప్టెంబరు 23న గోవాలో జరిగిన ఒక సభలో బిజెపి నేత సుబ్రమణ్య స్వామి చెప్పారు. అమెరికా డాలరుతో మన రూపాయి విలువ పతనానికి ఎలాంటి సంబంధం లేదు. ఇప్పుడు నల్లధనం దేశం నుంచి బయటకు పోతున్నది, రూపాయల సరఫరా ఎక్కువైనపుడు విలువ పతనం అనివార్యం. ‘ అన్నారు. యుపిఏ హయాంలో రూపాయి విలువ పతనం భయానకం అన్న అరుణ్ జైట్లీ ఆర్ధిక మంత్రిగా మాట్లాడుతూ ‘ ప్రపంచలోనే అత్యంత వేగంగా అభివ ద్ధి చెందుతున్న ఆర్ధిక వ్యవస్ధ గనుక మనం భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదు ‘ అన్నారు.
స్వాతంత్య్రం వచ్చినపుడు రూపాయి విలువ 4.16 అంటే సుబ్రమణ్య స్వామి తర్కం ప్రకారం ఆ రోజు నల్లధనం బాగా వున్నట్లు, అది క్రమంగా తగ్గుతూ వున్న కారణంగా 2004లో 45.32కు పడిపోయింది. నల్లధనాన్ని వెలికి తీసే పేరుతో నరేంద్రమోడీ పెద్ద నోట్ల రద్దు చేసిన ఏడాది విలువ 66.46 అంటే అప్పటికి ఇంకా నల్లధనం తగ్గిపోయింది లేదా బయటకు పోయింది. 2018లో 70.09కి చేరింది. అంటే పెద్ద నోట్ల రద్దు తరువాత నల్లధనం ఇంకా వున్నట్లే, ఇప్పుడు 72రూపాయలకు చేరింది కనుక నోట్ల రద్దు తరువాత నల్లధనం ఇంకా పెరిగినట్లే కదా ! బిజెపి వారు ఎది చెబితే అదే దేశ భక్తి, అదే జాతీయవాదం, అదే ఆర్ధశాస్త్రం. దాన్ని నమ్మిన ఆమోదించిన వారు దేశభక్తులు, కాని వారు దేశద్రోహులు. నాడు బ్రిటీష్ వారి ద ష్టిలో భగత్ సింగ్, సుఖదేవ్, రాజ్గురు వంటి వారందరూ దేశ ద్రోహులే. ఇప్పుడు బిజెపి చెప్పేదాన్ని అంగీకరించని వారందరూ దేశ ద్రోహులే.
సంవత్సరం -రూపాయి సగటు విలువ
2004 45.32
2005 44.10
2006 45.31
2007 41.35
2008 43.51
2009 48.41
2010 45.73
2011 46.67
2012 53.44
2013 56.57
2014 62.33
2015 62.97
2016 66.46
2017 67.79
2018 70.09
2019 70.31 (జనవరి నుంచి నవంబరు పదవ తేదీ వరకు సగటు విలువ)
నరేంద్రమోడీ నిజం చెప్పినా జనం నమ్మని రోజులు రాబోతున్నాయి. యుపిఏ పదేండ్ల కాలంలో రూపాయి విలువ ఏడాది సగటు 47.04గా వుంది. అదే నరేంద్రమోడీ 2014-19 మధ్య 66.65కు పతనమైంది. రామాలయ సమస్య ఒక కొలిక్కి వచ్చింది కనుక అప్రకటిత కర్ఫ్యూ, ఆంక్షలతో మూతవేసిన కాశ్మీరును ఎప్పుడు తెరుస్తారు, నిరుద్యోగాన్ని కనీసం ఆరేండ్ల స్ధాయికి ఎప్పుడు తగ్గిస్తారు వంటి ప్రశ్నలన్నీ ఎదురు కానున్నాయి.