• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Monthly Archives: December 2019

సిఎఎ వివాదం : హద్దులు దాటిన కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌

29 Sunday Dec 2019

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties

≈ Leave a comment

Tags

CAA, governor arif mohammad khan, Historian Irfan Habib, Indian constitution, Indian History Congress, Nathuram Godse

Image result for as a governor arif mohammad khan crossed his limits
ఎం కోటేశ్వరరావు
దేశంలో ఎవరు ‘అసహనంతో ప్రజాస్వామ్యవిరుద్దంగా ‘ ప్రవర్తిస్తున్నారో చూశారా అంటూ పొద్దున్నే ఒక పలకరింపు. కేరళలోని కన్నూరు విశ్వవిద్యాలయంలో శనివారం నాడు (ఇండియన్‌ హిస్టరీ కాంగ్రెస్‌) భారత చరిత్ర కారుల 80వ మహాసభను ప్రారంభిస్తూ ఆ రాష్ట్ర గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ చేసిన ప్రసంగం, దాని మీద వ్యక్తమైన నిరసన గురించి ఆ పరామర్శ. తర్కబద్దంగా సమాధానం చెబితే వినే ‘సహనం’ కనిపించకపోవటంతో మహాశయా మీరు చిన్నతనంలో చదువుకున్న కుక్క పని గాడిద చేస్తే….. కథను ఒక్కసారి చదువుకుంటే చాలు అని చెప్పి ముగించాల్సి వచ్చింది.
దేెశంలో గవర్నర్ల పాత్ర అంటే ఎవరికైనా వెంటనే గుర్తుకు వచ్చేది, రాష్ట్రాలలో రాజకీయ సంక్షోభాలు వచ్చినపుడు తీసుకుంటున్న వివాదాస్పద నిర్ణయాలే గుర్తుకు వస్తాయి. ఆ విషయంలో కాంగ్రెస్‌ ముందుంటే, దాన్ని అధిగమించేందుకు, కొత్త పుంతలు తొక్కేందుకు బిజెపి తహతహలాడుతోంది. మన రాజ్యాంగంలో గవర్నర్ల పాత్ర పరిమితం, వారు రాజకీయాలు చేయకూడదు, చేస్తున్నారు గనుక ఎవరైనా విమర్శిస్తే భరించాల్సిందే, గవర్నర్లంటే గౌరవం లేదా అంటే కుదరదు. ఇటీవలి కాలంలో మహారాష్ట్ర గవర్నర్‌ ప్రవర్తించిన తీరు తెన్నులను మరచి పోకముందే కేరళ గవర్నర్‌ తానూ తక్కువ తినలేదని, పదవి ఇచ్చిన వారి ఉప్పుతిన్నందున వారికి విధేయుడనై ఉన్నానని ప్రదర్శించుకొనేందుకు తాపత్రయ పడ్డారు అని చెప్పక తప్పదు.
గవర్నరు పదవిలో ఉన్న వారికి అధికారికంగా చట్ట సభల్లో ప్రభుత్వ అభిప్రాయాలు తప్ప వ్యక్తి గత అభిప్రాయాలు వ్యక్తం చేసే నిబంధనలు లేవు. బయట గవర్నర్లు గౌరవ అధ్యక్షులో మరొకటో అయిన సంస్దలు లేదా పర్యటనల్లో పరిమితమైన అంశాల మీద సందేశాలు, ప్రకటనలు చేయవచ్చు తప్ప. రాజకీయాల జోలికి పోకూడదు. అయితే చరిత్రకారుల మహాసభ లేదా మరొక సభ దేనినైనా ప్రారంభించాలని ఆహ్వానించినపుడు రావాలా లేదా అనేది గవర్నర్ల విచక్షణకు సంబంధించిన అంశం. అలా వచ్చినపుడు సాధారణంగా ముందుగా తయారు చేసుకున్న సంబంధిత అంశం మీదనే ప్రసంగిస్తారు. దానితో అందరూ ఏకీభవించాలని లేదు. కన్నూరులో జరిగింది అది కాదు. గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ తాను తయారు చేసుకు వచ్చిన ప్రసంగాన్ని పక్కన పెట్టి అంతకు ముందు వక్తలు సిఎఎ, కాశ్మీర్‌ పరిణామాలపై చేసిన ప్రస్తావనలు లేదా విమర్శలకు రాజకీయ సమాధానాలు చెప్పటం ప్రారంభించటంతో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఒక పార్టీ నాయకత్వంలో నడిచే ప్రభుత్వం చేసిన నిర్ణయాలు, చట్టాలను విమర్శించే హక్కు ఎవరికైనా ఉంది. వాటికి రాజకీయ పరమైన సమాధానం చెప్పాల్సింది మంత్రులు, పార్టీ నేతలు మాత్రమే. ప్రభుత్వ ప్రతినిధులుగా ఉన్న అధికారులు చట్టంలోని అంశాల మీద వివరణ ఇస్తారు తప్ప రాజకీయ పరమైన విమర్శలకు సమాధానం చెప్పే అవకాశం లేదు. గవర్నర్లకూ లేదు.
తనను ప్రసంగించకుండా చరిత్రకారుడు ఇర్ఫాన్‌ హబీబ్‌, శ్రోతల నుంచీ కొందరు అడ్డుకున్నారని, గేలిచేశారని గవర్నర్‌ ఆరోపించారు. ఒక భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తంచేయటాన్ని సహించలేకపోవటం అప్రజాస్వామికం అని కూడా వ్యాఖ్యానించారు. భౌతికంగా తనను నిరోధించేందుకు ఇర్ఫాన్‌ హబీబ్‌ ప్రయత్నించారని కూడా ట్వీట్ల ద్వారా తీవ్ర ఆరోపణ చేశారు. అయితే ఆ ట్వీట్లలోనే గవర్నరే జరిగిందేమిటో వివరించాల్సి వచ్చింది.” భారత చరిత్రకారుల మహాసభ ప్రారంభం ఎలాంటి వివాదాలను రేకెత్తించలేదు.అయితే కన్నూరు విశ్వవిద్యాలయంలో జరిగిన 80వ చరిత్రకారుల మహాసభలో సిఎఎ మీద ఇర్ఫాన్‌ హబీబ్‌ కొన్ని అంశాలను లేవనెత్తారు. వీటి గురించి గవర్నర్‌ జవాబు చెబుతున్న సమయంలో గవర్నర్‌ను భౌతికంగా నిరోధించేందుకు ఇర్ఫాన్‌ హబీబ్‌ తన స్ధానం నుంచి లేచారు. మౌలానా అబ్దుల్‌ కలామ్‌ పేరు ఉటంకించటానికి గవర్నర్‌కు ఉన్న హక్కును ఆయన ప్రశ్నించారు, చప్పట్లు కొడుతూ ఆయన గాడ్సే పేరును ప్రస్తావించాలని అన్నారు. అవాంఛనీయ ప్రవర్తనను అడ్డుకొనేందుకు ప్రయత్నించిన గవర్నర్‌ ఎడిసి మరియు రక్షణ అధికారిని తోసివేశారు. రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ఉన్న ఒక వ్యక్తిగా తాను తనకంటే ముందు మాట్లాడిన వక్తలు పేర్కొన్న కొన్ని అంశాలపై మాత్రమే తాను స్పందించానని ” గవర్నర్‌ ట్వీట్లలో పేర్కొన్నారు.
కన్నూరు సభలో గవర్నర్‌ కంటే ముందు మాట్లాడిన వక్తలు పౌరసత్వ సవరణ చట్టం, ఇతర అంశాలపై విమర్శలు చేశారు. రాజ్యాంగంలోనే కొన్ని అంశాలపై లోపాలు ఉన్నాయనే అభిప్రాయం వెలిబుచ్చటం తప్పు కాదు, రాజ్యాంగ ఉల్లంఘన అంతకంటే కాదు, దానికి ముప్పు తలపెట్టినట్లు కాదు. ఇప్పటికి 104 రాజ్యాంగ సవరణలు చేశారు, రాబోయే రోజుల్లో ఇంకా చేయవచ్చు. చట్ట సభల్లో దళితులు, గిరిజనుల రిజర్వేషన్లను మరొక పది సంవత్సరాల పాటు పొడిగిస్తూ, ఆంగ్లో ఇండియన్‌ల నామినేటెట్‌ సీట్లను రద్దు చేస్తూ 104 సవరణలో తీర్మానించారు. ఎవరైనా వీటిని కూడా విమర్శించవచ్చు.అలాంటపుడు పౌరసత్వ సవరణ చట్టాన్ని సవరించటాన్ని విమర్శించటం, రాజ్యాంగానికి వచ్చిన ముప్పుగా పరిగణించటం, దాన్ని కాపాడే బాధ్యతలో భాగంగా విమర్శలకు సమాధానం చెప్పబూనుకోవటమే అసలైన రాజ్యాంగ నిబంధనలకు విరుద్దం.
అదే వేదికపై ఉన్న సిపిఐ(ఎం) రాజ్యసభ సభ్యుడు కెకె రాగేష్‌ గవర్నర్‌ కంటే ముందు మాట్లాడారు.” చరిత్రకారుల సభలో గవర్నర్‌ పూర్తిగా రాజకీయ ప్రసంగం చేశారు. ఆయన ఒక ఆర్‌ఎస్‌ఎస్‌ వాదిలా మాట్లాడారు. ఎంపీ గారూ ఇది మీ కోసమే అంటూ నన్ను ఉద్దేశించి ప్రసంగాన్ని ప్రారంభించారు. నేనుకూడా ఇతర పెద్దలతో పాటే వేదిక మీద ఉన్నాను. ఇర్ఫాన్‌ హబీబ్‌ గవర్నర్‌ను తోసివేయలేదు, కనీసం తాకను కూడా తాకలేదు. మౌలానా అబ్దుల్‌ కలామ్‌ అజాద్‌ మాటలను వక్రీకరించటానికి బదులు గాడ్సే చెప్పిందాన్ని ఉటంకించమని మాత్రమే కోరారు.” అని రాగేష్‌ చెప్పినట్లు మీడియా పేర్కొన్నది. అంతే కాదు సభలో ఉన్న ఒక ప్రతినిధి జరిగిన సంఘటన గురించి ” గవర్నర్‌ మౌలానా అజాద్‌, గాంధీ ఇతరుల పేర్లను పూర్తి అసందర్భంగా ప్రస్తావించారు, అదే సమయంలో పౌరసత్వ సవరణ చట్టాన్ని కూడా పొగడటం ప్రారంభించారు. ఎవరైనా ఆయనకు ఏమి చెబుతారు, వారిని వక్రీకరిస్తూ మాట్లాడినపుడు తరువాత గాడ్సేను కూడా ప్రస్తావించాలని చెప్పారు. ఇది చరిత్రకారుల మహాసభ, పౌరసత్వ సవరణ చట్టం మీద సెమినార్‌ కాదు.” అని పేర్కొన్నట్లు ఇండియా టుడే వెల్లడించింది. ఖాన్‌ చెత్త మాట్లాడుతున్న సమయంలో మీరెందుకు అజాద్‌, గాంధీలను ఉదహరిస్తున్నారు గాడ్సే గురించి చెప్పండి అంటూ హబీబ్‌ అడ్డుకున్నారు అని అలీఘర్‌ ముస్లిం విశ్వవిద్యాలయ ప్రొఫెసర్‌ షిరీన్‌ మూస్వీ చెప్పారు.
గవర్నర్‌ ప్రసంగంశాలపై అనేక మంది ప్రతినిధులు, విద్యార్ధులు కూడా నిరసన తెలిపారు. వారిని ఉద్దేశించి ” మీకు నిరసన తెలిపే హక్కుంది, కానీ నన్ను నోరు మూయించలేరు. మీరు చర్చల ద్వారాన్ని మూయటం అంటే మీరు హింసా సంస్కృతిని ప్రోత్సహించటమే అని” వారితో గొంతు కలిపారు. నిరసనల మధ్య తన ప్రసంగాన్ని ముగించిన అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ తాను ముందే సిద్ధం చేసుకున్న ప్రసంగంతోనే వచ్చానని, అయితే తనకంటే ముందు మాట్లాడిన వక్తలు ఈ అంశాన్ని(సిఎఎ) ప్రస్తావించకుండా ఉంటే నేను మాట్లాడేవాడినే కాదు, మీరు ప్రస్తావించి రాజకీయ ప్రకటనలు చేశారు.రాజ్యాంగాన్ని సమర్ధించుతానని, రక్షించాలని నేను ప్రమాణం చేశాను. దానిలో భాగంగా నేను హబీబ్‌ లేవనెత్తిన అంశాలపై ప్రతిస్పందించాను. అయితే ఆయన నా ప్రసంగాన్ని అడ్డుకొనేందుకు ప్రయత్నించారు” అని గవర్నర్‌ ఆరోపించారు.
ఈ ఉదంతంపై ఇద్దరు జర్నలిస్టులు చేసిన ట్వీట్లను గమనించాల్సిన అవసరం ఉంది. బిజెపి ఎంపీ యజమానిగా ఉన్న రిపబ్లిక్‌ టీవీతో సహా అనేక సంస్ధలలో పని చేసిన జర్నలిస్టు ఆదిత్య రాజ్‌ కౌల్‌ చేసిన ట్వీట్‌లో ఇలా పేర్కొన్నారు.’ దిగ్భ్రాంతి కలిగిస్తోంది. కొంత మంది కుహనా ఉదారవాదులనబడే వారు ఇప్పుడు మాట్లాడే, భావప్రకటనా స్వేచ్చ హక్కులేదని అంటున్నారు. మౌలానా అబ్దుల్‌ కలామ్‌ అజాద్‌ను ప్రస్తావిస్తూ సుప్రసిద్ద పండితుడైన కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ మాట్లాడుతున్న సమయంలో ఆయన్ను గేలిచేశారు” అని విమర్శించారు. దీనికి స్పందనగా ఎన్‌డిటీవీ జర్నలిస్టు గార్గి రావత్‌ ఒక ట్వీట్‌ చేస్తూ ” ఆశ్చర్యంగా ఉంది. గేలి చేయటాన్ని సమర్ధించటం లేదు. కానీ, అవకాశవాద మాజీ రాజకీయవేత్త అయిన గవర్నర్‌ అరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ను మీరు ఒక పండితుడు అంటున్నారు, సుప్రసిద్ధ చరిత్రకారుడు ఇర్ఫాన్‌ హబీబ్‌ను కుహనా ఉదారవాదిగా పిలుస్తున్నారు” అని చురక అంటించారు.


ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ను అవకాశవాది అనటం సరికాదని, నిజంగా అవకాశవాది అయితే షా బానో కేసులో సుప్రీం కోర్టు తీర్పును తిరస్కరించే నిర్ణయం తీసుకున్న రాజీవ్‌ గాంధీని ఎందుకు వ్యతిరేకిస్తారు, మంత్రి పదవికి ఎందుకు రాజీనామా చేస్తారని కొందరు మీడియా విశ్లేషకులు వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో ఇర్ఫాన్‌ హబీబ్‌ అబద్దాలు చెబుతున్నట్లు ఆరోపణలు చేశారు. ఆయోధ్యలో ముస్లింలు రాజీపడేందుకు సిద్దపడినపుడు హబీబ్‌ ఇతరులు పడనీయలేదని ఆరోపించారు. అంతవరకు పరిమితం కాలేదు గార్గి కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు ముక్తార్‌ అబ్బాస్‌ అహమ్మద్‌ అన్సారీ మనవడిని వివాహం చేసుకుందని, ఆమె భర్త యూసుఫ్‌ అహమ్మద్‌ అన్సారీ కాంగ్రెస్‌ అభ్యర్ధిగా పోటీ చేశారని, ఆమె కాంగ్రెస్‌ అనుకూల జర్నలిస్టు అని అసందర్భ వ్యాఖ్యలు చేయటాన్ని బట్టి వారు కాషాయ దళసైనికులన్నది స్పష్టం.
ఇక ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ విషయానికి వస్తే షాబానో కేసు తీర్పును వమ్ము చేసేందుకు నిర్ణయించిన రాజీవ్‌ గాంధీ చర్యను వ్యతిరేకించిన మాట వాస్తవం.ఆచర్యను అనేక మంది పురోగామి వాదులు ప్రశంసించారు. అలీఘర్‌ ముస్లిం విద్యార్ధి సంఘనాయకుడిగా పని చేశారు. తొలుత బికెడి తరఫున పోటీ చేసి ఓడిపోయారు, తరువాత 26 ఏండ్ల వయస్సులోనే ఎంఎల్‌సి అయ్యారు. తరువాత కాంగ్రెస్‌లో చేరి రెండుసార్లు ఎంపీగా గెలిచారు. మంత్రిగా పని చేస్తూ రాజీనామా చేశారు. తరువాత జనతాదళ్‌ తరఫున లోక్‌సభకు ఎన్నికయ్యారు. మరోసారి మంత్రిగా పని చేశారు. తరువాత ఆ పార్టీ నుంచి బిఎస్‌పిలో చేరి మరోసారి ఎంపీ అయ్యారు. తరువాత 2004లో బిజెపిలో చేరి ఎన్నికలలో ఓడిపోయారు. మూడు సంవత్సరాల తరువాత బిజెపికి రాజీనామా చేసినట్లు ప్రకటించినా ఆ పార్టీతో సంబంధాలను వదులు కోని కారణంగానే నరేంద్రమోడీ సర్కార్‌ కేరళ గవర్నర్‌గా నియమించింది. ఇన్ని పార్టీలు మారిన వ్యక్తిని అవకాశవాది అనాలో మరొక విధంగా పిలవాలో ఎవరికి వారే నిర్ణయించుకోవచ్చు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

దిగుబడుల పెరుగుదలకు దున్నకం తగ్గించాలా !

26 Thursday Dec 2019

Posted by raomk in Current Affairs, Economics, Farmers, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Science, USA

≈ Leave a comment

Tags

Agricultural, Reduced soil tilling, Smart Agriculture, soils, yields

Image result for could Reduced soil tilling helps both soils and yields

 

 

 

 

 

 

 

 

ఎం కోటేశ్వరరావు
భూమిని ఇష్టం వచ్చినట్లుగా ప్రతిదానికీ దున్నకూడదు, ఎంత తక్కువ దున్నితే అంతగా భూమి ఆరోగ్యం బాగుపడుతుంది, దిగుబడులు కూడా పెరుగుతాయని తమ అధ్యయనంలో తేలిందని తాజాగా కొందరు పరిశోధకులు చెప్పారు. రైతాంగం ముఖ్యంగా మన వంటి వర్ధమాన దేశాల రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు ఎన్నో. పండించిన పంటకు గిట్టుబాటు ధర రాకపోవటం ఒక అంశమైతే, పంట మార్కెటింగ్‌ మరొక అంశం. ప్రపంచ వాణిజ్య సంస్ద ఉనికిలోకి రాక ముందే ప్రపంచీకరణ, దానిలో భాగంగా నయా ఉదారవాద విధానాలు వ్యవసాయాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి. మన దేశంలో ఆ విధానాలు అమలులోకి వచ్చిన 1991 తరువాత అంతకు ముందు తలెత్తినదాని కంటే వ్యవసాయ రంగంలో తీవ్ర సంక్షోభం దానికి సూచికగానే ఆత్మహత్యలన్న విషయం తెలిసిందే. వ్యవసాయం గిట్టుబాటు కానందున అనేక మంది వ్యవసాయ మానివేస్తే, అంతకంటే ఎక్కువగా మరోపని లేక కౌలు రైతులు ఉనికిలోకి వచ్చారు. పశ్చిమ దేశాలతో పోల్చితే మన దేశంలో వ్యవసాయ కమతాల సంఖ్య, వాటి మీద పని చేసే వారి సంఖ్యా ఎక్కువే.
తాజా సమాచారం ప్రకారం మన దేశంలో వ్యవసాయం మీద ఆధారపడుతున్నవారు 58శాతం ఉన్నారు.మన కంటే వెనుకబడిన, దారిద్య్రంతో మగ్గుతున్న దే శాలలో తప్ప మరే ఇతర వర్ధమాన దేశంలో ఇంత సంఖ్యలో లేరు. గడచిన ఆర్దిక సంవత్సరంలో 28.5 కోట్ల టన్నుల ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేశాము. 2015-16లో ఒక రైతు కుటుంబ సగటు ఆదాయం రూ.96,703ను 2022-23 నాటికి రూ.2,19,724 చేస్తామని నరేంద్రమోడీ నాయకత్వంలోని ఎన్‌డిఏ సర్కార్‌ వాగ్దానం చేసింది. ఇది ఎలా జరుగుతుందో ఇప్పటి వరకైతే అంతుబట్టలేదు, నరేంద్రమోడీ ఇటీవలి కాలంలో దాని గురించి మాట్లాడటం లేదు. దీని గురించి మరో సందర్భంలో చూద్దాం. మన దేశ రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలకు, వందల, వేల ఎకరాల విస్తీర్ణంలో ఉండే ఐరోపా, అమెరికాల్లో ఉండే రైతుల సమస్యలు వేరుగా ఉంటాయి. అయితే దేశం ఏదైనా భూమి ఎదుర్కొంటున్న సమస్యలు ఎక్కడైనా ఒకటే. తగ్గుతున్న భూసారం, దెబ్బతింటున్న భూమి ఆరోగ్యం.ఈ సెగ మనకు తగిలిన కారణంగానే ఇప్పటికే మన రైతాంగానికి పది కోట్ల మేరకు భూ ఆరోగ్య కార్డులు పంపిణీ చేశారు. ఒక మొబైల్‌ యాప్‌ను కూడా అందుబాటులోకి తెచ్చారు.
ఈ తరం సూపర్‌ తిండి తింటున్నది కనుకనే మా తరం మాదిరి గట్టిగా ఉండటం లేదని వృద్ధులు అనటం వింటాం. దానిలో పాక్షిక సత్యం లేకపోలేదు. ఈ అంశాలన్నీ ఒక ఎత్తయితే ఇటీవలి కాలంలో భూమి ఆరోగ్యం దిగజారుతోందన్న అంశాలు రైతాంగాన్ని మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి. భూ ఆరోగ్య బాగుకు అయ్యే ఖర్చుకూడా రైతుమీదే పడుతుందని వేరే చెప్పనవసరం లేదు. ఇది మునిగే పడవకు గడ్డిపోచకూడా భారం మాదిరే అన్న విషయం తెలిసిందే. ప్రతి ఏటా 2.4 కోట్ల ఎకరాల భూమి సారం లేనిదిగా తయారు అవుతున్నదన్నది ఒక అంచనా. ఇది ప్రపంచ ఆహార భద్రతను ప్ర శ్నార్దకం చేయటంతో పాటు భూమి మీద వత్తిడిని పెంచటంతో పాటు మన వంటి దేశాలలో రైతు మీద భారాన్ని కూడా మోపనుంది.
దీనికి రైతులు వ్యక్తిగతంగా చేయగలిగింది పరిమితం, ప్రభుత్వాలు మాత్రమే పరిష్కరించగలిగిన అంశం. వ్యవసాయ అభివృద్ధి, విస్తరణ, పరిశోధన బాధ్యతల నుంచి వైదొలిగే విధానాలు అనుసరిస్తున్న పాలకుల నుంచి ఏమి ఆశించగలమన్నది ఒక ప్రశ్న. ఈ నేపధ్యంలో ప్రపంచంలో ఏమి జరుగుతోంది, శాస్త్రవేత్తలు ఏమి చెబుతున్నారో చూద్దాం. ఒక దేశంలో జరిగిన అధ్యయనాలు మరొక దేశానికి లేదా ప్రాంతానికి మక్కీకి మక్కీ వర్తించకపోవచ్చుగానీ, ఆయాదేశాల, ప్రాంతాలకు సంబంధించి ఏమి చేయాలన్నదానికి దారి చూపుతాయి.

Image result for could Reduced soil tilling helps both soils and yields
కొన్ని అంశాలు విపరీతంగా కూడా అనిపించవచ్చు, వాటి మంచి చెడ్డలను శాస్త్రవేత్తలు మాత్రమే వివరించగలరు. అమెరికాలోని స్టాన్‌ఫోర్డ్‌ విశ్వవిద్యాలయం తాజాగా విడుదల చేసిన పరిశోధన అంశాల సారం ఏమంటే భూమిని ఇష్టం వచ్చినట్లుగా ప్రతిదానికీ దున్నకూడదు, ఎంత తక్కువ దున్నితే అంతగా భూమి ఆరోగ్యం బాగుపడుతుంది, దిగుబడులు కూడా పెరుగుతాయని చెబుతున్నారు.1930దశకంలో అమెరికా, కెనడాలలో తీవ్రమైన దుమ్ము తుపాన్లు,వర్షాభావ పరిస్ధితులు ఏర్పడి, కొన్ని చోట్ల సాగు నిలిపివేయాల్సి వచ్చింది.కొంత కాలం దున్నకం నిలిపివేసిన తరువాత పంటల దిగుబడి అక్కడ పెరిగిందని, భూ ఆరోగ్య మెరుగుదల, దిగుబడుల పెరుగుదలకు దాన్నుంచి పాఠాలు నేర్చుకోవచ్చు అంటున్నారు పరిశోధకులు.
రైతులు సాధారణంగా సాగుకు ముందు పాటు కలుపు మొక్కల తొలగింపుకు, ఎరువులు వేసే సమయంలోనూ దున్నటం, విత్తే సమయంలో దున్నటం తెలిసిందే. ఇలా ఎక్కువ సార్లు దున్ని భూమిలో కలుపు మొక్కలు లేకుండా చేయటం వలన స్వల్పకాలంలో దిగుబడులు పెరగవచ్చుగానీ దీర్ఘకాలంలో భూమి సారం తగ్గుతుందట.భూమికి మేలు చేసే బాక్టీరియా, ఇతర క్రిమి కీటకాలు అంతరిస్తున్నాయి. ప్రపంచ ఆహార మరియు వ్యవసాయ సంస్ధ(ఎఫ్‌ఏఓ) 2015నివేదిక ప్రకారం గత నాలుగు దశాబ్దాల కాలంలో మూడో వంతు సాగు భూమిలో సారం తగ్గిందట. పదే పదే భూమి దున్నకం, దాని పర్యవసానాల గురించి అమెరికాలోని సోయా, మొక్కజొన్న సాగు చేసే భూముల మీద చేసిన అధ్యయనం మేరకు ఎంత తక్కువగా దున్నితే అంత మంచిదనే అభిప్రాయానికి వచ్చారు.తక్కువ సార్లు దున్నితే ఆరోగ్యకరమైన భూ యాజమాన్య పద్దతులను ప్రోత్సహించటంతో పాటు, కోతనిరోధం, నీటిని నిలుపుకోవటం మెరుగుపడుతుంది.యంత్రాలను వినియోగించకపోవటం లేదా పరిమితంగా దున్నటం ద్వారా గత సంవత్సరపు పంట కోసిన తరువాత మిగిలే సోయా, మొక్కజన్న దుబ్బులు కూడా భూమికి మేలు చేస్తాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. పరిమిత దున్నకపు పద్దతులను ప్రస్తుతం అమెరికా ఖండ దేశాలు, ఓషియానా ప్రాంతంలో 37 కోట్ల ఎకరాల్లో వినియోగిస్తున్నారు.పరిమిత దున్నక సాగు అమెరికా మొక్కజొన్న పొలాల్లో 2012-17 మధ్య పదిహేడు శాతం పెరిగింది. అయితే మొత్తం సాగులో ఇది 3.4శాతమే. అయితే దిగబడులు, లాభాలు తగ్గుతున్నాయని రైతాంగం ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు. గతంలో ఈ పద్దతులను కొన్ని పరిశోధనా కేంద్రాల్లోనే అమలు జరిపారు, అక్కడ కూడా ఉత్పాకత మీద పడే ప్రభావం గాక భూసార మెరుగుదల గురించే కేంద్రీకరించారు.
స్టాన్‌ఫోర్డ్‌ బృందం ఎక్కువ సార్లు దున్నే ప్రాంతాలు, పరిమిత దున్నకపు ప్రాంతాల మధ్య ఉన్న వ్యత్యాసం గురించి అధ్యయనానికి 2005 నుంచి 2016వరకు కంప్యూటర్లలో సేకరించిన సమాచారంతో పాటు ఉపగ్రహ చిత్రాలద్వారా సేకరించిన సమాచారాన్ని విశ్లేషించారు. దీనిలో పంటల దిగుబడులపై వాతావరణ మార్పులు, పంటల తీరు తెన్నులు, భూమి స్వభావం వంటి అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్నారు. అమెరికాలోని తొమ్మిది రాష్ట్రాలలో అధ్యయనానికి ఎంచుకున్న కేంద్రాల సమాచారాన్ని విశ్లేషించారు. దీర్ఘకాలం పాటు పరిమితంగా దున్నిన పొలాల్లో సగటున మొక్కజొన్న దిగుబడి 3.3, సోయా 0.74 శాతం చొప్పున ఎక్కువ సార్లు దున్నిన పొలాలతో పోల్చితే పెరిగినట్లు వెల్లడైంది. కొన్ని కేంద్రాల్లో ఈ దిగుబడులు గరిష్టంగా 8.1,5.8 శాతాల చొప్పున ఉన్నాయి. కొన్ని చోట్ల 1.3, 4.7 శాతాల చొప్పున మొక్కజన్న, సోయా దిగుబడులు తగ్గినట్లు కూడా గమనించారు. ఇంతటి తేడాలు రావటానికి భూమిలో నీరు, ఉష్ణోగ్రతల్లో వచ్చిన మార్పులు ప్రధానంగా పని చేసినట్లు వెల్లడైంది. ఎక్కువ సార్లు దున్నే ప్రాంతాలలో నేలలు పొడిబారటం, నీటిని నిలువ చేసే సామర్ధ్యం తగ్గగా తక్కువ సార్లు దున్నిన ప్రాంతాలలో నేలలో తేమ దిగుబడులు పెరిగేందుకు ఉపయోగపడింది.
అధ్యయనం వెల్లడైన ధోరణులను వెల్లడించింది తప్ప ఇంకా నిర్దిష్ట నిర్ధారణలకు రాలేదు. మరింత విస్తృత అధ్యయనాలు జరపాల్సి ఉంది.1980దశకం నుంచి ఈ విధానాన్ని ప్రోత్సహిస్తున్నారు.తక్కువ సార్లు దున్నిన చోట రైతులు పూర్తి స్ధాయిలో లబ్ది పొందేందుకు మొక్కజొన్న విషయంలో పదకొండు సంవత్సరాలు పడితే సోయా విషయంలో రెట్టింపు వ్యవధి తీసుకుంది. తక్కువసార్లు దున్నకం వలన భూమి సారం అభివృద్ధి చెందటం ఒకటైతే యంత్రాల వాడకం, వాటికి అవసరమయ్యే ఇంధనం, కార్మికుల ఖర్చు తగ్గింది. భూసారం పెరిగే కొలదీ దిగుబడులు పెరగటాన్ని గమనించారు.2017 అమెరికా వ్యవసాయ గణాంకాల ప్రకారం దీర్ఘకాలిక పెట్టుబడుల వైపు మొగ్గుచూపుతున్నట్లు, అమెరికాలోని పంటలు పండే భూమిలో 35శాతం వరకు తక్కువ సార్లు దున్నే పద్దతులను అనుసరిస్తున్నట్లు వెల్లడైంది. పరిశోధనా కేంద్రాల నుంచి వెల్లడైన సమాచారానికి, సాగు చేస్తున్న రైతాంగ అనుభవానికి అనేక మార్లు పొంతన కుదరకపోవటంతో రైతుల్లో పూర్తి విశ్వాసం ఇంకా ఏర్పడ లేదు. ఫలితంగా కొందరు రైతులు ఈ పద్దతికి మళ్లేందుకు ముందుకు రాని పరిస్ధితి కూడా ఉంది. తక్కువ ఉత్పాదకత ఉండే భూములను సారవంతవమైనవిగా మార్చవచ్చని క్వీన్‌లాండ్‌ విశ్వవిద్యాలయ పరిశోధకులు చెబుతున్నారు. స్ధానిక, గిరిజన తెగల సహకారంతో నిస్సారమైన భూములను చాలా చౌకగా, తక్కువ వ్యవధిలోనే పదిల పరచవచ్చంటున్నారు.
ప్రపంచ వ్యవసాయ రంగంలో తీవ్రమైన పోటీ, ఇటీవలి కాలంలో ఉత్పత్తుల ధరలపతనం వంటి అనేక అంశాలు కొత్త పరిశోధనలకు తెరలేపుతున్నాయి. అయితే ఇవి చిన్న, సన్నకారు రైతులు ఎక్కువగా ఉండే మన వంటి వ్యవసాయ పరిస్దితులున్న చోట పరిశోధనల ఫలితాలను ఎలా వుపయోగించుకోవాలి, ఎలా వర్తింప చేసుకోవాలి అన్నది ఒక పెద్ద సవాలే. అయినా ఎంత మేరకు వీలైతే అంతమేరకు వినియోగించుకోవటం తప్ప మరొక మార్గం కనిపించటం లేదు.సూక్ష్మ వ్యవసాయం, మార్కెట్‌ పద్దతుల గురించి ప్రస్తుతం అనేక చోట్ల కేంద్రీకరిస్తున్నారు. గ్లోబల్‌ మార్కెట్‌ ఇన్‌సైట్‌ ఇంటర్నేషనల్‌ కార్పొరేషన్‌ అనే సంస్ధ తాజాగా విడుదల చేసిన అధ్యయనం ప్రకారం 2025 నాటికి ప్రస్తుతం ఉన్న నాలుగు బిలియన్‌ డాలర్లుగా ఉన్న సూక్ష్మ వ్యయవసాయ మార్కెట్‌ పన్నెండు బిలియన్‌ డాలర్లవరకు పెరగవచ్చని అంచనా వేసింది.

Image result for could Reduced soil tilling helps both soils and yields
స్మార్ట్‌ ఫోన్ల మాదిరి స్మార్ట్‌ వ్యవసాయ పద్దతులకు గాను సమాచారాన్ని, సమాచార వ్యవస్ధలను వినియోగించుకొని రైతాంగానికి తోడ్పడేందుకు ప్రయత్నిస్తున్నారు. పంటల స్ధితిగతులను తెలుసుకొనేందుకు, కంప్యూటర్‌ వ్యవస్ధలతో పాటు డ్రోన్ల వినియోగం కూడా రోజు రోజుకూ పెరుగుతోంది. సూక్ష్మ వ్యవసాయ పద్దతులంటే పరిమిత ప్రాంతాలలో సైతం ఎలాంటి పంటలను సాగు చేయాలి, ఎంత నీరు, ఎరువుల వినియోగం వంటి నిర్ధిష్ట సూచనలు చేసే వ్యవస్ద ఏర్పాటు. ఇందుకోసం 2017లో డచ్‌ ప్రభుత్వం పంటల సమాచార సేకరణకు ఉపగ్రహ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించేందుకు అవసరమైన నిధులను విడుదల చేసింది. గగనతలం నుంచి సమాచారాన్ని సేకరించేందుకు ద్రోన్స్‌, సెన్సర్లు, జిపిఎస్‌ వ్యవస్ధలు, స్మార్ట్‌ ఫోన్ల వినియోగం 2025నాటికి 70శాతం వరకు ఉండవచ్చని అంచనా. మెరుగైన, పొదుపు పద్దతుల్లో నేల, నీటి వినియోగానికి ఇలాంటివన్నీ ఉపయోగపడతాయి. రానున్న ఆరు సంవత్సరాలలో పరికరాలను గరిష్టంగా, జాగ్రత్తగా వినియోగించటం దగ్గర నుంచి సూక్ష్మ వ్యవసాయ సేవల వరకు మార్కెట్‌ పెరుగుదల రేటు 27శాతం ఉంటుందని అంచనా. పొలాల్లో ఎక్కడ ఏ లోపం ఉందో తెలుసుకొనేందుకు, వాటి నివారణకు తగు చర్యలను తీసుకొనేందుకు 3డి మాపింగ్‌తో సహా అనేక పద్దతులు అందుబాటులోకి వచ్చాయి.
అమెరికా, ఐరోపా వంటి దేశాల్లో జరుపుతున్న పరిశోధనలన్నీ కార్పొరేట్‌ వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చే లక్ష్యంతో చేస్తున్నవే, వాటిని వినియోగించుకోగలిగింది కార్పొరేట్‌ సంస్ధలే అన్నది వేరే చెప్పనవసరం లేదు. ఆ ఫలితాలను మన వ్యవసాయ రంగానికి ఎలా వర్తింప చేయాలి, వినియోగించుకోవాలి అన్నది మన ప్రభుత్వాలు చేయాల్సిన పని. వ్యవసాయ విస్తరణ, అభివృద్ధి వ్యవస్ధ, సిబ్బంది నియామకం పట్ల పూర్తి నిర్లక్ష్యం వహించిన ఫలితాల పర్యవసానాలను చూస్తున్నాము. యూరియా, క్రిమి, కీటక నాశనులను అవసరానికి మించి వాడుతున్నందున జరుగుతున్న నష్టాల గురించి చెబితే చాలదు, ఇతర ఎరువుల ధరలు ఆకా శాన్ని అంటిన కారణంగా సబ్సిడీ వున్నందున రైతాంగం యూరియాను ఎక్కువగా వాడుతున్నారన్నది తెలిసిందే. అందువలన రైతాంగాన్ని చైతన్యపరచటంతో పాటు, భూ సారం, ఆరోగ్యాన్ని మెరుగుపరచేందుకు ప్రభుత్వమే బాధ్యత తీసుకోవటం, అందుకు అవసరమైన సబ్సిడీలు, బడ్జెట్‌ కేటాయింపులు చేయటం అవసరం.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

మోడీ-షా ద్వయ అవాస్తవాలు: ‘వివక్ష’ లేని సమాచారం ఇస్తున్న గూగులమ్మ !

25 Wednesday Dec 2019

Posted by raomk in BJP, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

Narendra modi on NRC, Narendra modi u turn on NRC, NRC controversy, NRIC

Image result for modi - shah duo sad
ఎం కోటేశ్వరరావు
నరేంద్రమోడీ ఈ దేశానికి దేవుడు ఇచ్చిన వరం అని మన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఒక సందర్భంలో చెప్పారు. ఆ వరపుత్రుడు ప్రధాని నరేంద్రమోడీ, ఆయన ఆత్మవంటి అమిత్‌ షా ద్వయం అబద్దాలు లేదా అవాస్తవాలు చెబుతున్నదా ? జాతీయ పౌర నమోదు(ఎన్‌ఆర్‌సి) గురించి ఇంతవరకు అసలు ఎలాంటి చర్చ జరపలేదని మోడీ మహాశయుడు రామ్‌లీలా(ఒకే మాట మీద నిలిచినట్లు చెప్పే రాముడి పేరుతో ఉంది) మైదానంలో ఒట్టేసి మరీ చెప్పారు. ముందుగా ఆశ్చర్యపోయింది, అవాక్కయింది బిజెపి నేతలు, అభిమానులు అంటే అతిశయోక్తి కాదు. ఏది నిజం, ఏది అవాస్తవం మోడీ మహాశయా అని బయటికి కాకున్నా లోలోపల జుట్టుపీక్కుంటున్నారు. రెండు రోజుల తరువాత నరేంద్రమోడీ ఏది చెబితే అదే కరెక్టు అసలు ఎన్‌ఆర్‌సిగురించి మేము చర్చించని మాట నిజమే అని మోడీగారి ఆత్మగా పరిగణించుతున్న కేంద్ర హౌం మంత్రి అమిత్‌ షా గారు ఒక వార్తా సంస్ధతో చెప్పారు. జాతీయ జన జాబితా, జాతీయ పౌరజాబితా తయారీకి సంబంధం లేదని కూడా అన్నారు.
ఏదో ఒకసారి చెబితే ఎవరికైనా ఇలాంటి సందేహం రావటంలో అర్ధం ఉంది గానీ మోడీ అవాస్తవాల గురించి చర్చ చేయటం ఒక సినిమాలో హీరో మాదిరి ‘చాల బాగోదు’. దేశ రాజకీయాల్లో ప్రజాప్రతినిధులుగా ఉన్న వారిలో నేర చరితలు లేని, కోటీశ్వరులు, వ్యాపార, పారిశ్రామికవేత్తలు గాని వారెందరు అని బూతద్దం పెట్టి వెతకాల్సిన రోజులివి. అలాగే మోడీ లేదా బిజెపి నేతలు ఎన్ని నిజాలు చెప్పారనేందుకు అంజనం వేసి చూడాలి. లేదా ధర్మపీఠాలను ఎక్కించి నిజాలు పలికించాలి అంటే అన్ని దొరుకుతాయా, మేకిన్‌ ఇండియాలో కూడా తయారు చేయగలమా అన్నది సందేహమే. మోడీ ప్రకటన తరువాత ఎన్ని అబద్దాలు, ఎప్పుడు చెప్పారన్న వివరాలు తెలిపే పనిలో ఊపిరి సలపకుండా గూగులమ్మ తల్లి నిండా మునిగి ఉంది. ఊరట ఏమంటే ఆ మాత తనను కోరిన సమాచారం అందించేందుకు ” ఎంపిక చేసిన దేశాలకు మాత్రమే” ”మతపరమైన మినహాయింపు” వంటి నిబంధనలు పెట్టలేదు.
మీకు తెలుసా, నాకైతే ఇప్పటి వరకు తెలియదు. మోడీ, షా ద్వయం అవాస్తవాల గురించి చెప్పవే తల్లీ అని అడిగితే ‘మోడీ లైస్‌.ఇన్‌’ పేరుతో ప్రత్యేకంగా వాటికే పరిమితమైన ప్రత్యేక వెబ్‌ సైట్‌ కూడా ఉంది నాయనా అని గూగులమ్మ ఒక దారి చూపింది. ప్రపంచంలో ఇతర నేతల మీద ఎక్కడైనా వెబ్‌ సైట్‌లు ఉన్నాయోమో నాకు తెలియదు, సమాచారం అందించిన వారికి కృతజ్ఞతలు చెబుతాను. యాభై అంగుళాల ఛాతీతో ధైర్యం ఉన్న మోడీ అభిమానులు కూడా దాన్ని చూసి వివరాలు తెలుసుకోవచ్చు. నిజాలు తెలుసుకొనేందుకు భయపడాల్సిన పనిలేదు !
అన్నం ఉడికిందో లేదో తెలుసుకొనేందుకు కుండలో ఉన్నమొత్తాన్ని చూడనవసరం లేదు ఒక మెతుకును పట్టుకుంటే చాలు. ప్రెషర్‌ కుకర్‌లలో వండే వారికి అలాంటి అవకాశం లేదు. తోటకూర నాడే అడ్డుకోవాల్సింది అన్నట్లుగా కాషాయ దళాలు చెప్పే అవాస్తవాలను ప్రారంభంలోనే నిలదీసి ఉంటే పరిస్ధితి వేరుగా ఉండేది. అయితే కాంగ్రెస్‌ నిర్వాకాల కారణంగా విసిగిపోయి బిజెపి ఏమి చెప్పినా సరైనదే అనే ఒక అభిప్రాయానికి చాలా మంది వచ్చారు. వెనుకబడిన సమాజం కనుక ఒకసారి ఒకరిని నమ్మిన తరువాత వారు తప్పులు చేసినా వెంటనే నిలదీయలేని బలహీనత మనలో ఉంది. దేవుడు నైవేద్యం తినడన్నది ఎంత వాస్తవమో, ఆ దేవుడి పేరుతో రాజకీయాలు చేసే కాషాయ పరివారం ఎన్నడూ నిజాలు చెప్పదన్నది పచ్చి నిజం. ఎన్‌ఆర్‌సి గురించి అసలు చర్చించనేలేదని నరేంద్రమోడీ, అమిత్‌ షా స్వయంగా చెప్పినప్పటికీ పూజారుల వంటి ఆనుచరులు ఎలాగూ నమ్మరు. కానీ అనేక మంది కళ్లుతెరిపించారు. స్ధలాభావం రీత్యా పరిమితంగా మోడీ గారి తాజా సుభాషితాల గురించి మాత్రమే చూద్దాం !
నిర్బంధ శిబిరాల గురించి అర్బన్స్‌ నక్సల్స్‌ మరియు కాంగ్రెస్‌ పుకార్లను వ్యాపింప చేస్తోందని ప్రధాని చెప్పారు.
అసలు నిర్భంధ శిబిరాల గురించి ప్రధాని ఎందుకు దాస్తున్నట్లు ? అవి అసోంలో కాంగ్రెస్‌ హయాంలోనే ప్రారంభమయ్యాయి. వాటిలో ప్రవేశానికి ముస్లింలు, ఇతర మతాల వారు అనే నిబంధనలు లేవు. అక్రమంగా వచ్చి అడ్డంగా దొరికి పోయిన వారందరినీ ముందు అక్కడ వేయాలన్నది వాటి లక్ష్యం. తన మంత్రులు పార్లమెంటులో ఏ సమాధానం, సమాచారం ఇస్తున్నారో తెలియని స్ధితిలో నరేంద్రమోడీ ఉన్నారా ? 2019 నవంబరు 22 నాటికి తమ రాష్ట్రంలోని ఆరు నిర్బంధ కేంద్రాలలో 988 మంది విదేశీయులున్నారని అసోం లోని బిజెపి రాష్ట్ర ప్రభుత్వం పంపిన సమాచారాన్ని కేంద్ర హౌంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రారు రాజ్యసభకు రాతపూర్వక సమాధానంలో చెప్పారు. 2016 నుంచి 2019అక్టోబరు 13వరకు నిర్బంధితుల్లో 28 మంది శిబిరాల్లో లేదా ఆసుపత్రుల్లో మరణించారని కూడా వెల్లడించారు. అసోంలోని ఆరింటిలో ఒక శిబిరం ఏడు ఫుట్‌బాల్‌(కాలి బంతి) మైదానాలంత విస్తీర్ణంలో ఉందని టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా పేర్కొన్నది. అంతేనా అక్రమంగా వలస వచ్చేందుకు వీలున్న అన్ని జిల్లాలు, పట్టణ కేంద్రాలలో దేశమంతటా నిర్బంధశిబిరాలను ఎలా ఏర్పాటు చేయాలో సూచిస్తూ కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు ఒక నమూనాను కూడా పంపింది. కర్ణాటక, మహారాష్ట్రల్లో రెండింటి నిర్మాణాలు పూర్తయ్యాయని, అసోంలో మరో పదింటిని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అక్రమంగా వచ్చిన వారెవరినైనా నిర్బంధించాల్సిందే, అయితే శరణార్దులతో పాటు, అక్రమంగా వలస వచ్చిన వారిలో ముస్లిమేతర మతాలవారికి పౌరసత్వం ఇవ్వాలంటూ పౌరసత్వ సవరణ చట్టాన్ని సవరించటంతో ముస్లింలలో భయ సందేహాలు తలెత్తాయి. నిర్బంధ శిబిరాల్లో ముస్లింలను మాత్రమే పెడతారనేది ఒకటైతే, ఎన్‌ఆర్‌సిలో అక్రమంగా వచ్చారంటూ ముస్లింలను పెద్ద సంఖ్యలో విదేశీయులుగా తేల్చి నిర్బంధిస్తారనే అనుమానాలు తలెత్తాయి. బతుకుతెరువు కోసం స్వస్ధాలలను వదలి కొత్త ప్రాంతాలకు వెళ్లిన వారిని స్ధానికులని ఎవరు నిర్ధారిస్తారు, వారి దగ్గర ఆధారాలేముంటాయి అన్నది అసలు సమస్య. ఈ నేపధ్యంలో అసలు నిర్బంధ శిబిరాలే లేవంటూ మోడీ ప్రకటించటం మరిన్ని అనుమానాలకు తెరలేపింది.

Image result for modi - shah duo u turn on nrc
ఎన్‌ఆర్‌సి గురించి అనేక అవాస్తవాలను వ్యాపింప చేస్తున్నారు. మేము దాన్ని రూపొందించలేదు, పార్లమెంటు ముందుకు తేలేదు, అసలు ప్రకటించలేదు, ఎన్‌ఆర్‌సి పదం గురించి కూడా చర్చించలేదు అని నరేంద్రమోడీ అన్నారు.
2019 జూన్‌ 20న పార్లమెంట్‌ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామనాధ్‌ కోవింద్‌ చేసిన ప్రసంగంలో చొరబాటు సమస్యలు తలెత్తిన ప్రాంతాలలో ప్రాధాన్యతా క్రమంలో ఎన్‌ఆర్‌సిని అమలు చేయటం తన ప్రభుత్వ ప్రాధాన్యత అని చెప్పారు. రాష్రపతి ప్రసంగం అంటే ఏదో దారినపోయే దానయ్య మాట్లాడేది కాదు. తమ విధానాలు, ప్రాధాన్యతల గురించి ప్రభుత్వాలు తయారు ఇచ్చే అంశాలతోనే కేంద్రంలో రాష్ట్రపతి, రాష్ట్రాల్లో గవర్నర్లు తన ప్రభుత్వం అంటూ ప్రసంగిస్తారు, అదీ రాతపూర్వకంగా ఉన్నదాన్ని చదువుతారు. ఒక్క మాట కూడా స్వంతంగా మాట్లాడేందుకు వీల్లేదు. మంత్రివర్గంతో లేదా ప్రధాని కార్యాలయ ప్రమేయలేకుండానే రాష్ట్రపతి ప్రసంగం చేశారా ? ఆయన కూడా అర్బన్‌ నక్సల్‌ జాబితాలోకే వస్తారా ? రాష్ట్రపతి ప్రసంగం నాటికే సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు అసోంలో ఎన్‌ఆర్‌సి జాబితాను రూపొందించే ప్రక్రియ జరుగుతోంది.
ఎన్నికలకు ముందు ఏప్రిల్‌ నెలలో మాట్లాడుతూ ముందు పౌరసత్వ సవరణ బిల్లు తరువాత ఎన్‌ఆర్‌సి అని చెప్పిన అంశాలన్నీ మీడియాలో వచ్చాయి. ఏప్రిల్‌ 11న పశ్చిమబెంగాల్‌లోని రారుగంజ్‌లో మాట్లాడుతూ దేశమంతటా ఎన్‌ఆర్‌సిని అమలు జరుపుతామన్నారు. ఏప్రిల్‌ 23న బిజెపి యూట్యూబ్‌ ఛానల్‌లో పెట్టిన ఒక వీడియోలో తొలుత శరణార్దులకు పౌరసత్వం, తరువాత దేశవ్యాపితంగా ఎన్‌ఆర్‌సిని ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. మే ఒకటవ తేదీన పశ్చిమ బెంగాల్లోని బంగావ్‌లో మాట్లాడుతూ ఎన్‌ఆర్‌సి తయారు చేసి చొరబాటుదార్లను దేశం నుంచి బయటకు పంపివేస్తామని చెప్పారు. నవంబరు 20వ తేదీన రాజ్యసభలో మాట్లాడుతూ దేశ వ్యాపితంగా ఎన్‌ఆర్‌సిని నిర్వహిస్తామని చెప్పారు. భాషా పరమైన సర్వే నిర్వహణకు రూపొందించిన వెబ్‌సైట్‌లో సైతం ఎన్‌ఆర్‌సికి ఏర్పాటు చేశారు. డిసెంబరు రెండున ఝార్ఖండ్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా చక్రధర్‌ పూర్‌లో మాట్లాడుతూ ఎన్‌ఆర్‌సి అమలుకు 2024 చివరి గడువు అని చెప్పారు. పౌరసత్వ సవరణ చట్ట బిల్లుపై చర్చ సందర్భంగా ఈ బిల్లుకు ఎన్‌ఆర్‌సికి సంబంధం లేదంటూ త్వరలో ఎన్‌ఆర్‌సిని కూడా తీసుకువస్తామని కేంద్ర హౌం మంత్రి అమిత్‌ షా పార్లమెంటులోనే ప్రకటించారు. డిసెంబరు 17న ఇటి నౌ ఛానల్‌లో మాట్లాడుతూ సిఏఏ-ఎన్‌ఆర్‌సికి ఉన్న సంబంధం గురించి చెప్పారు. ఎన్‌ఆర్‌సి గురించి భయపడాల్సిన అవసరం ఏముందని ఎదురు ప్రశ్నించారు. ఇన్ని చెప్పిన వారు, వాటి మీద మీడియాలో వచ్చిన వార్తలను ఒక్కదానిని కూడా ఖండించలేదు, ఇప్పుడు అబ్బే, అంతా ఉట్టిదే అని చెబుతుంటే నమ్మేదెలా !

Image result for modi - shah duo sad
అవాస్తవాలు ఒక అంశానికే పరిమితమా ? కానే కాదు. ఉగ్రవాదాన్ని నిర్మూలించాం అన్నారు. నల్లధనాన్ని వెలికి తీస్తామన్నారు, అచ్చేదిన్‌ అన్నారు, గుజరాత్‌ తరహా అభివృద్ధి చేస్తాం చూడండన్నారు. పెద్ద నోట్ల రద్దు ఫలితాలు వెంటనే రావు, కొంత కాలం ఆగాలి అన్నారు. ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. జనం నిజమే అనుకున్నారు. సంవత్సరాలు గడిచాయి. దేశ అర్ధిక పరిస్ధితి గురించి ఐఎంఎఫ్‌ చెప్పిన అంచనాలను ఉటంకిస్తూ చూడండి మా పనితనాన్ని అంతర్జాతీయ సంస్ధ కూడా నిర్దారించింది అని చెప్పి ఊదరగొట్టారు. అదే సంస్ధ తాజాగా దేశ పరిస్ధితి మరింతగా దిగజారనుందని చెప్పింది. ఇప్పుడు దాని ప్రస్తావనే తీసుకురారు. మన సమాజం నోట్లో వేలు వేసుకొని గుడ్లప్పగించి చూస్తూ ఉంటే ఐఎంఎఫ్‌ వెనుక కూడా ప్రతిపక్షాల హస్తం ఉంది, అలా చెప్పిస్తున్నాయని, దాని అంకెలు కూడా తప్పులు తడకలని ఎదురుదాడి చేయగల ఘనులు. లంచం తీసుకోవటమే కాదు ఇవ్వటం కూడా నేరమే కదా, అలాగే అబద్దాలు చెప్పటం ఎంత మోసమో, నిజాలు చెప్పకపోవటం అంతకంటే పెద్ద మోసం కదూ ! నల్లధనాన్ని వెలికి తీసి ప్రతివారి ఖాతాలో పదిహేను లక్షలు వేస్తామని చెప్పిన అంశం గురించి ఒకసారి అడిగితే షా గారు తన గడ్డాన్ని సవరించుకొని ఒక నవ్వు నవ్వుతూ జుమ్లా (ఏదో చెబుతుంటాం) అని సమాధానం చెప్పారు. కొద్ది రోజుల తరువాత ఎన్‌ఆర్‌సి గురించి ఆలోచించనే లేదని చెప్పింది కూడా జుమ్లా అంటే !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

అక్రమాల ట్రంప్‌కు అభిశంసన-మోడీ అభినందన !

25 Wednesday Dec 2019

Posted by raomk in Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

Donald trump impeachment, Impeachment, Narendra Modi, US President impeachment

Image result for donald trump impeachment
ఎం కోటేశ్వరరావు
అమెరికాకు 1776లో స్వాతంత్య్రం వస్తే రాజ్యాంగం 1789 నుంచి అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నలుగురు అధ్యక్షులను అభిశంసన ద్వారా గద్దె దించే ప్రయత్నాలు జరిగాయి. రెండు ప్రయత్నాలు విఫలం కాగా, ఒక అధ్యక్షుడు అభిశంసన ప్రక్రియ ప్రారంభానికి ముందే రాజీనామా చేశాడు. నాలుగవ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌. అతగాడి మీద వచ్చిన అభియోగాలపై విచారణ జరిపి ఈ నెల 19న పార్లమెంట్‌ దిగువ సభ అమెరికన్‌ కాంగ్రెస్‌(ప్రజాప్రతినిధుల సభ) విచారణ జరిపి ట్రంప్‌ నేరం చేశాడంటూ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. అభిశంసన ప్రక్రియ ప్రకారం ఎగువ సభ సెనెట్‌ కూడా అభియోగాలపై విచారణ జరిపి నిజమే అని నిర్ధారిస్తే ట్రంప్‌ ఇంటికి పోవాల్సి ఉంటుంది.
ప్రజాప్రతినిదుల సభలోని 441 స్ధానాలకు గాను 435 మందికి ఓటింగ్‌ హక్కు ఉంటుంది. ప్రస్తుత ట్రంప్‌ నాయకత్వంలోని రిపబ్లికన్‌ పార్టీ 198 స్దానాలు, ప్రతిపక్ష డెమోక్రటిక్‌ పార్టీకి 232, ఇతరులు ఒకరుండగా, నాలుగు స్దానాలు ఖాళీగా ఉన్నాయి. ఈ కారణంగా ప్రతిపక్షానికి చెందిన నాన్సీపెలోసీ స్పీకర్‌గా ట్రంప్‌ మీద అభిశంసన ప్రక్రియను ప్రారంభించటం, మెజారిటీ ఉంది కనుక ఆమోదం జరిగిపోయాయి.అయితే రిపబ్లికన్‌ పార్టీకి వంద స్ధానాలున్న సెనెట్‌లో 53 మంది సభ్యులుండగా ప్రతిపక్ష డెమోక్రటిక్‌ పార్టీకి 45, స్వతంత్రులు ఇద్దరు ఉన్నారు. సెనెట్‌ నిబంధనల ప్రకారం మూడింట రెండువంతుల మెజారిటీ కావాల్సి ఉన్నందున అసాధారణ పరిస్ధితి ఏర్పడి రిపబ్లికన్‌ పార్టీలో తిరుగుబాటు వంటివి జరిగితే తప్ప అభిశంసన వీగిపోవటం ఖాయం. ఎందుకంటే అలాంటి తీవ్ర పరిస్దితి, పరిణామాలేమీ ఇంతవరకు లేవు, సూచనలు కూడా కనిపించటం లేదు. ఈ కారణంగానే ఆ పనేదో త్వరగా కానివ్వండి అని ట్రంప్‌ సవాళ్లు విసురుతున్నాడు.
ట్రంప్‌ను అభిశంసించటానికి కారణాలు రెండు. వచ్చే ఏడాది జరగనున్న అధ్యక్ష ఎన్నికలలో తనకు ప్రత్యర్ధి అవుతాడు అనుకున్న డెమోక్రటిక్‌ పార్టీ నేత జోబిడెన్‌, అతని కుమారుడి అవినీతి అక్రమాలకు సంబంధించి విచారణ జరిపి వారిని కేసులలో ఇరికించాలని ఉక్రెయిన్‌ అధ్యక్షుడి మీద వత్తిడి తేవటం, ఆ క్రమంలో ఆ దేశానికి వాగ్దానం చేసిన మిలిటరీ సాయాన్ని తొక్కిపెట్టారన్నది ఒకటి. దీని మీద అభిశంసన ప్రక్రియను అడ్డుకొనేందుకు ప్రయత్నించటాన్ని మరొక అభియోగంగా విచారణ జరిపి నిర్ధారించారు. ఈ రెండూ అధికార దుర్వినియోగాలుగా పరిగణించారు. జనవరి ఏడవ తేదీన సెనెట్‌ విచారణ ప్రారంభం అవుతుందని భావిస్తున్నారు. విచారణ ఎలా జరగాలన్న అంశంపై రెండు పార్టీల మధ్య ప్రస్తుతం జరుగుతున్న వాదోపవాదాల నేపధ్యంలో ఆ రోజున ప్రారంభం కావచ్చు లేదా తరువాత అవుతుంది.
ఇంతవరకు ప్రజాప్రతినిదుల సభ స్పీకర్‌ తమకు అభియోగ అంశాల గురించి అధికారికంగా ఎలాంటి వర్తమానం పంపలేదని అందువలన తాము సెలవులను ఆనందంగా గడపటం తప్ప తాము చేసేదేమీ లేదని, విచారణ ఏ రోజున ప్రారంభమయ్యేది చెప్పలేనని సెనెట్‌ సభానాయకుడు మిచ్‌ మెకొనెల్‌ వ్యాఖ్యానించాడు. అయితే సెనేట్‌ వైపు నుంచి ఏం జరుగుతుందో తెలియకుండా తాము తమ ప్రతినిధుల నియామకం చేయలేమని ప్రజాప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ పెలోసీ పేర్కొన్నారు. ఇంతవరకు న్యాయసమ్మతంగా ఏమి జరుగుతుందో తమకు కనిపించటం లేదన్నారు. ప్రజాప్రతినిధుల సభలో సాక్ష్యం చెప్పటానికి నిరాకరించిన ట్రంప్‌ యంత్రాంగ అధికారులు నలుగురు సెనెట్‌ విచారణకు హాజరవుతారా లేదా అన్నది ఈ ప్రతిష్ఠంభనకు కారణంగా చెబుతున్నారు. వారిని రప్పించాలని, ట్రంప్‌ కార్యాలయం తొక్కిపెట్టిన కొన్ని పత్రాలను కూడా సమర్పించాలని కోరుతూ సెనెట్‌లో డెమోక్రటిక్‌ పార్టీ నేత చుక్‌ ష్కమర్‌ గతవారంలో మెకొనెల్‌కు లేఖ రాశారు. ముఖ్యాంశాలను ట్రంప్‌ దాచనట్లయితే ఎందుకు నిరాకరిస్తున్నారని విలేకర్లతో ప్రశ్నించారు. దీనిపై మెకొనెల్‌ ప్రతిస్పందిస్తూ విచారణపై తమకు అభ్యంతరం లేదని, గతంలో రెండు దశాబ్దాల క్రితం బిల్‌ క్లింటన్‌ మీద జరిగినట్లుగానే ఇప్పుడు కూడా జరుపుతామని, న్యాయం అందరికీ ఒకటే కదా అన్నారు.
ఇక్కడే తిరకాసు ఉంది. క్లింటన్‌ విచారణ సమయంలో డెమోక్రాట్‌ సెనెటర్‌ చుక్‌ ష్కమర్‌ అప్పుడే సభలో కొత్తగా అడుగు పెట్టారు. ఆ సమయంలో మెకొనెల్‌ కూడా సభ్యుడే. ఆ సమయంలో విచారణ తీరుతెన్నులపై అప్పుడు తీసుకున్న వైఖరికి విరుద్దంగా రెండు పార్టీల వారూ ఇప్పుడు మాట్లాడుతున్నారు. అభియోగాల గురించి సెనెట్‌లో వాదోపవాదాలు ప్రారంభించటం, రాతపూర్వకంగా ప్రశ్నలను అనుమతించటానికి తగిన వ్యవధి ఇచ్చి వాటి ప్రాతిపదికగా సాక్షులను పిలవాలా లేదా అన్నది నిర్ణయిస్తారు. బిల్‌ క్లింటన్‌ విషయంలో ఇదే జరిగింది. ఇప్పుడు కూడా తాము అదే పద్దతి పాటిస్తామని రిపబ్లికన్లు చెబుతున్నారు. అయితే ముందుగానే ఫలానా వారిని సాక్షులుగా పిలవాలని డెమోక్రాట్లు ఇప్పుడు కోరుతున్నారు. క్లింటన్‌ విచారణ సమయంలో ప్రజాప్రతినిదుల సభలో అన్ని విషయాలు చర్చించినందున సెనెట్‌లో కొత్తగా సాక్షులను విచారించాల్సిందేమీ లేదని అప్పుడు డెమోక్రాట్లు వాదించగా రిపబ్లికన్లు వ్యతిరేకించారు. కనీసం ముగ్గురు కొత్త సాక్షులను విచారించాల్సిందే అన్నారు. ఇప్పుడు విచారణలో కొత్తగా సాక్షులను పిలవాలని డెమోక్రాట్లు కోరుతుండగా అవసరం లేదని రిపబ్లికన్లు అంటున్నారు, దాన్ని నిర్ణయించటానికి సెనెట్‌లో అవసరమైన బలం రిపబ్లికన్లకు ఉంది కనుక ప్రారంభంలోనే అడ్డుకోవాలన్నది వారి ఎత్తుగడ. తన వివాహేతర సంబంధాల గురించి బిల్‌ క్లింటన్‌ అసత్యాలు చెప్పారన్న ఆరోపణపై ఆయనను అభిశంసించారు,1999 ఫిబ్రవరి పన్నెండున క్లింటన్‌ నిర్దోషిగా సెనెట్‌ తీర్మానించింది.
అనేక దేశాలలో ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడటం సర్వసాధారణంగా జరుగుతోంది. అమెరికా అందుకు మినహాయింపు కాదు. తమ బలాన్ని, చేసిన దాన్ని చెప్పుకోవటం కంటే ప్రత్యర్దుల బలహీనతలను ముందుకు తెచ్చి ఎదురుదాడి చేయటం ఇటీవలి కాలంలో పెరిగింది. డెమోక్రాటిక్‌ పార్టీనేత జోబిడెన్‌ కుమారుడు ఉక్రెయిన్‌కు చెందిన ఒక గ్యాస్‌ కంపెనీలో పని చేశాడు. ఆసమయంలో పాల్పడిన అక్రమాల వివరాలను తెప్పించుకొని ప్రత్యర్ధిని దెబ్బతీయాలన్నది ట్రంప్‌ ఎత్తుగడ. పార్లమెంట్‌ ఆమోదించిన మేరకు ఉక్రెయిన్‌కు మిలిటరీ సాయం అందించాలంటే తనకు ఆ సమాచారాన్ని ఇవ్వాలని ట్రంప్‌ షరతు పెట్టాడు, ఒత్తిడి తెచ్చేందుకు గాను సాయం అందించకుండా తొక్కి పెట్టాడు. ఈ వ్యవహారం బయటకు వచ్చిన తీరు చూస్తే అంతర్జాతీయ స్ధాయిలో అగ్రనేతలు ఎలా ప్రవర్తిస్తారో అర్ధం అవుతుంది.
జోబిడెన్‌, అతని కుమారుడి అక్రమాల గురించి సమాచారం సేకరించాలని ట్రంప్‌ ఎంతో ముందుగానే పధకం వేశాడన్నది స్పష్టం. ఈ ఏడాది ఏప్రిల్‌ నెలలో జరిగిన ఎన్నికలలో ఉక్రెయిన్‌ అధ్యక్షుడిగా వ్లదిమిర్‌ జెలెనెస్కీ ఎన్నికయ్యాడు. అతడి ప్రమాణ స్వీకారానికి హాజరైన ఐరోపా యూనియన్‌ రాయబారి, ఇంధన శాఖ మంత్రి, ఉక్రెయిన్‌ ప్రత్యేక దౌత్యవేత్తలు ముగ్గురూ తిరిగి వచ్చిన వెంటనే ఉక్రెయిన్‌ అధ్యక్షుడితో కథ నడిపించవచ్చని ట్రంప్‌కు చెప్పారు. అక్కడి నుంచి అసలు కథ ప్రారంభమై అనేక మలుపులు తిరిగింది.ఒక అవగాహన కుదిరిన తరువాత ట్రంప్‌-జెలెనిస్కీ ఫోన్‌ సంభాషణ జరిపారు. ఈ వివరాలను తెలుసుకున్న ఒక ఆకాశరామన్న ఫిర్యాదు చేశాడు. అది తెలిసిన సిఐఏ అధికారి ఒకరు తన ఉన్నతాధికారికి నివేదించాడు. చివరకు ఈ వార్త మీడియాలో వచ్చింది. వెంటనే తొక్కి పెట్టిన మిలటరీ సాయాన్ని విడుదల చేశారు. అధ్యక్షుడి అధికార దుర్వినియోగంపై అభిశంసన జరపాలని డెమోక్రాట్లు డిమాండ్‌ చేశారు. ఆ మేరకు సెప్టెంబరు 24న విచారణకు శ్రీకారం చుట్టారు, డిసెంబరు 19న ప్రజాప్రతినిధుల సభలో అభి శంసన తీర్మానాన్ని ఆమోదించారు. విచారణకు హాజరైన సాక్షులు తమను ట్రంప్‌ ఎలా బెదిరించిందీ వివరించారు, విచారణను అడ్డుకునేందుకు ప్రయత్నించటాన్ని వెల్లడించారు. నాకిది నీకది అనే పద్దతుల్లో ట్రంప్‌-ఉక్రెయిన్‌ అధ్యక్షుడి మధ్య సంభాషణలు నడిచాయని తేలింది.

Image result for donald trump impeachment- narendra modi commendation
ప్రజాప్రతినిధుల సభలో అభిశంసన తీర్మానం ఆమోదం పొందింది.సెనెట్‌ ముందుకు రావటం, అది అక్కడ వీగిపోవటం లాంఛనమే. అందువలన ఒక వేళ ఆమోదం పొందితే, రాజ్యాంగంలో పేర్కొన్న వరుస ప్రకారం ఉపాధ్యక్షుడు అధ్యక్షుడు అవుతారు. ఒక వేళ ఉపాధ్యక్షుడు లేకపోతే ఎవరు కావాలో ఒక జాబితా ఉంది, సెనెట్‌లో తీర్మానం ఆమోదం పొందే అవకాశం లేదు గనుక ఆ వివరాలు అవసరం లేదు. సాంకేతికంగా ట్రంప్‌కు ఎలాంటి ఢోకాలేనప్పటికీ నైతికంగా ఇది పెద్ద ఎదురు దెబ్బ. అనేక సర్వేలలో ట్రంప్‌ పరిస్ధితి బాగోలేదని తేలినప్పటికీ పుంజుకుంటున్నారనే అభిప్రాయాలు కూడా వ్యక్తమౌతున్నాయి. తాజాగా సిఎన్‌ఎన్‌ జరిపిన సర్వేలో ప్రతిపక్ష డెమోక్రాట్‌ జోబిడెన్‌కు 49శాతం మంది, ట్రంప్‌కు 44శాతం మద్దతు ఇస్తున్నారని వెల్లడైంది. అక్టోబరు కంటే ఐదు పాయింట్లు డెమోక్రాట్లకు తగ్గినట్లు పేర్కొన్నది. ప్రజాప్రతినిధుల సభలో అభిశంసన తీర్మానం ఆమోదం పొందిన కొద్ది గంటల్లో జరిపిన ఒక ఫోన్‌ సర్వేలో 53శాతం మంది ట్రంప్‌ అదికార దుర్వినియోగానికి పాల్పడినట్లు, విచారణను అడ్డుకునేందుకు ప్రయత్నించినట్లు 51శాతం మంది అభిప్రాయ పడ్డారు.
ఈ అక్రమం వెలుగులోకి వచ్చిన తరువాత అమెరికా సమాజంలోని పలు తరగతుల నుంచి తీవ్రమైన వత్తిడి, నిరసన వ్యక్తమైన కారణంగానే ప్రజాప్రతినిధుల సభ విచారణకు స్వీకరించాల్సి వచ్చిందనే అంశాన్ని మరచిపోరాదు. ప్రతిపక్షమే తేల్చుకుంటుందిలే అని ఉపేక్షించలేదు. ఇటీవలి కాలంలో అసంతృప్తికి గురవుతున్న యువత, వివిధ తరగతుల ప్రజానీకం వీధుల్లోకి వస్తున్నది.ట్రంప్‌ అక్రమాల గురించి మీడియాలో వెల్లడై అమెరికన్‌ సమాజంలో తీవ్ర నిరసన వ్యక్తమౌతున్న తరుణంలో మన ప్రధాని నరేంద్రమోడీ అమెరికా పర్యటనకు వెళ్లి హౌడీ మోడీ కార్యక్రమం పేరుతో ట్రంప్‌కు మద్దతు పలికి, తిరిగి అధికారానికి రావాలని కోరి వచ్చారు. అక్కడి భారతీయులందరూ ట్రంప్‌కు మద్దతు ఇవ్వాలని చెప్పారు. ఒక అధ్యక్షుడిగా మీకు డోనాల్ట్‌ ట్రంప్‌ వంటి మిత్రుడు మరొకరు లేరు అని చెప్పగలను అని నరేంద్రమోడీ చెప్పారు. దానికి ప్రతిగా నరేంద్రమోడీ భారత దేశ పిత అని ట్రంప్‌ కితాబు ఇచ్చిన విషయం తెలిసిందే. నీవెలాంటి వాడివో తెలుసుకోవాలంటే నీ స్నేహితులను చూస్తే చాలు అన్న లోకోక్తి తెలిసిందే.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

నరేంద్రమోడీ నియంత – ది న్యూయార్క్‌ర్‌ !

23 Monday Dec 2019

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Politics

≈ Leave a comment

Tags

CAA, India citizenship amendment act 2019, Narendra Modi an authoritarian, NRC

Image result for Narendra Modi authoritarian, protest keralaఎం కోటేశ్వరరావు
”భారత ఆర్ధిక సంస్కరణకు మంచి భవిష్యత్‌ నరేంద్రమోడీ అని నేను వాదించాను. ఇప్పుడు సంగతులు మారిపోయాయి.” అని చెప్పాడు ది టైమ్‌ జర్నలిస్టు ఇయాన్‌ బ్రెమర్‌. నరేంద్రమోడీ నియంతగా మారారు అని ది న్యూయార్క్‌ర్‌ అనే పత్రిక జర్నలిస్టు డెక్సటర్‌ ఫిల్‌కిన్స్‌ వ్యాఖ్యానించారు.
”వివాదాస్పద పౌర సత్వ బిల్లును ఆమోదించటంతో భారత్‌ అంతటా నిరసనలు చెలరేగాయి. దేశ లౌకిక రాజ్యాంగానికి పెద్ద ఒక పెద్ద సవాలుగా భారత్‌ తన 20కోట్ల ముస్లిం మైనారిటీలలో కొందరిని సులభంగా జైల్లో పెట్టటానికి, బయటకు పంపివేయటానికి సులభతరం గావించేందుకు పూనుకుంది.” అని ఈనెల 20న అమెరికాలోని ప్రముఖ పత్రిక టైమ్‌ విదేశీ వ్యవహారాల సంపాదకుడైన ఇయాన్‌ బ్రెమర్‌ రాసిన విశ్లేషణ, దాని సారాంశంగా రాసిన వాక్యాలను పైన చూశాము. వెంటనే మన దేశంలోని కాషాయతాలిబాన్లు దీని వెనుక పౌరసత్వ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న వామపక్షాలు, కాంగ్రెస్‌ అని వెంటనే వాట్సాప్‌ యూనివర్సిటీ, అసహ్యంగా కనిపించే ఫేస్‌బుక్‌ వంటి వాటిలో దాడులు మొదలు పెడతారని వేరే చెప్పనవసరం లేదు. వాటిని గుడ్డిగా నమ్మే జనానికి మనం చెప్పాల్సిందేమంటే మగాను భావులారా అరచేతిని చూసుకొనేందుకు అద్దం అవసరం లేదు.
”తన ప్రజాస్వామ్యానికి ఉన్న పరిమితులను పరీక్షించుకొనేందుకు అమెరికా ప్రయత్నిస్తున్నండగా తన పరిమితులు ఏమిటో ప్రపంచానికి చూపేందుకు భారత్‌ తీరిక లేకుండా ఉంది. పొరపాటు చేయవద్దు. మానవతా పూర్వక దృక్కోణంలో చూస్తే ప్రత్యేకించి దేశంలో దాదాపుగా ఉన్న 20కోట్ల మంది ముస్లింలకు భారత్‌లో ఇప్పుడు జరుగుతున్నది విషాదం. అయితే ఇది పనిచేస్తున్న, సంఘటితమైన ప్రజాస్వామ్యానికి, తన 140 కోట్ల మంది పౌరులకు అవసరమైన సేవలు, అవకాశాలను కల్పించగల ఆధునిక మరియు సంక్లిష్ట ఆర్ధిక వ్యవస్ధ ఉన్న భారత భవిష్యత్‌కు సైతం విషాదమే.”
పైన పేర్కొన్న విధంగా తన విశ్లేషణను ప్రారంభించిన బ్రెమర్‌ గతలోక్‌ సభ ఎన్నికల ఫలితాలు వెలువడక ముందు మే ఒకటవ తేదీ టైమ్‌ సంచికలో తాను నరేంద్రమోడీ గురించి ప్రశంసా పూర్వకంగా రాసిన అంశాలను ఉటంకించారు. గత కొద్ది నెలలుగా(అంటే రెండవ సారి మోడీ అధికారానికి వచ్చిన తరువాత) మరమ్మతులు చేయటానికి వీలులేని విధంగా ఆ ప్రతిమ దెబ్బతిన్నది అని వ్యాఖ్యానించారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనల కారణంగా తమ పౌరులు భారత ప్రయాణాల గురించి జాగ్రత్తలు తీసుకోవాలని అమెరికాతో సహా అనేక పశ్చిమ దేశాలు హెచ్చరికలు జారీ చేశాయి. టైమ్‌ వంటి కార్పొరేట్‌ పత్రికలు ఇలా రాసిన తరువాత మన దేశంలో పెట్టుబడులు పెట్టేవారు వాటిని పట్టించుకోకుండా ఉంటారా, హెచ్చరికలుగా తీసుకోరా ? ప్రశాంతంగా ఉన్న ప్రాంతాలకే పెట్టుబడిదారులు బారులు తీరతారు. బిజెపి మరియు నరేంద్రమోడీ మన దేశాన్ని ప్రశాంతంగా ఉంచేందుకు, తాము చెప్పిన మంచి రోజులను తెచ్చేందుకు లేదా ఇంకా దిగజార్చేందుకు చూస్తున్నారో ఎవరికి వారు విశ్లేషించుకోవాలి.

Image result for Narendra Modi authoritarian
ఇయాన్‌ బ్రెయిన్‌ తన విశ్లేషణ ముగింపులో పేర్కొన్న అంశాలు ఇప్పటి వరకు బుర్రలకు పని పెట్టని వారికి ఎంతో ఉపయోగపడతాయి. వాటి సారాన్ని ఇలా చెప్పుకోవచ్చు.(అనుమానాలు ఉన్నవారు, ఆసక్తి కలిగిన వారికి వీలుగా లింక్‌ కూడా ఇస్తున్నాను)https://time.com/5753624/india-narendra-modi-nationalism/ ” భారత్‌ రాజకీయాల్లో స్ధిరపడిపోయిన వ్యక్తులతో విసిగిపోయిన కారణంగా అద్బుతమైన ప్రచారంతో 2014లో బిజెపి, నరేంద్రమోడీ అధికారానికి వచ్చారు. అధికారానికి వచ్చారు గనుక తన పెరుగుదలకు తోడ్పడిన హిందూ జాతీయ వాదం నుంచి పక్కకు తప్పుకొని పాలనా బాధ్యతలను స్వీకరిస్తారని కొంత మంది ఆశించారు. అయితే భారత ఆర్ధిక వ్యవస్ధ మందగించటం ప్రారంభమైన తరువాత 2019లో తన విజయం కోసం హిందూ జాతీయవాదం వైపు తిరిగారు. ఆర్ధిక అంశాలను నిర్లక్ష్యం చేశారు. ప్రభుత్వ విధానంలో జాతీయవాదం ప్రముఖపాత్రను తీసుకుంది. రాజ్యాంగబద్దంగా ఆదేశించిన లౌకిక ప్రజాస్వామ్యాన్ని ప్రత్యక్షంగా సవాలు చేయటం ప్రారంభించింది. జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేక హౌదాను రద్దు చేసింది. ఒక ప్రజాస్వామిక వ్యవస్ధలో ఇంటర్నెట్‌ను సుదీర్ఘకాలం మూసివేసిన ప్రభుత్వంగా అంతర్జాతీయంగా పతాక శీర్షికలకు ఎక్కింది. జాతీయ పౌరుల నమోదు(ఎన్‌ఆర్‌సి) అమలును ముందుకు తెచ్చింది. ఈ కారణంగా అసోంలో దాదాపు 20లక్షల మంది తమ పౌరసత్వాన్ని కోల్పోయారు. తాజా నమోదులో పౌరసత్వం కోల్పోయిన వారిలో పన్నెండు లక్షల మంది హిందువులే ఉన్నట్లు తేలింది. ఇది ముస్లింలు కాని ఇరుగుపొరుగు దేశాల నుంచి వలస వచ్చిన వారికి పౌరసత్వం కల్పించాలనే చట్టాన్ని చేసేందుకు పురికొల్పింది. అక్రమంగా వలస వచ్చిన ముస్లింలను వెనక్కు పంపాలని బిజెపి డిమాండ్‌ చేసింది, బంగ్లాదేశ్‌ వారిని వెనక్కు తీసుకొనేందుకు అంగీకరించే అవకాశం లేదు.” అని బ్రెమర్‌ పేర్కొన్నారు.
లోక్‌సభ ఎన్నికల సమయంలో బిజెపి ముందుకు తెచ్చిన అంశాల గురించి వామపక్షాలు ఎన్నో హెచ్చరికలు చేశాయి. ప్రస్తుతం బిజెపి పోకడలకు వ్యతిరేకంగా ఆందోళనలకు ముందుకు వచ్చిన వారితో సహా ఎక్కువ మంది వాటిని ఖాతరు చేయలేదు. ఎన్నికల ఫలితాలు రాకముందే అమెరికా టెలివిజన్‌ సిఎన్‌ఎన్‌ ప్రతినిధి గతంలో ఎన్నడూ లేని దానికంటే దేశాన్ని ఎన్నికలు మరింతగా విడదీశాయంటూ ఒక విశ్లేషణ రాశారు. బిజెపి, నరేంద్రమోడీ తీరుతెన్నులు, ప్రచార సరళిలో వచ్చిన మార్పును వర్ణిస్తూ 2014లో కొద్ది మందిని మాత్రమే లక్ష్యంగా చేసుకున్న పరిమిత హిందూ జాతీయవాద శబ్దాలను ఇప్పుడు దేశమంతా వినిపించే లౌడ్‌ స్పీకర్లు అక్రమించాయని పేర్కొన్నారు( ఆంగ్లంలో- డాగ్‌ విజిల్‌ వస్‌ రిప్లేస్‌డ్‌ బై ఏ బుల్‌హారన్‌). ఎన్నికల ఫలితాల తరువాత నరేంద్రమోడీ విజయం భారతీయ ఆత్మకు చెడు అని లండన్‌ నుంచి వెలువడే గార్డియన్‌ పత్రిక వ్యాఖ్యానించింది. ఎవరి మీద అయినా మరులు గొన్నపుడు మనం మంచి చెడ్డలు, ఎలాంటి వారమో కూడా పట్టించుకోము. ఎవరి హెచ్చరికలను పట్టించుకోము.
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలను అంతర్జాతీయ మీడియా ప్రముఖంగానే వార్తలుగా ఇస్తోంది. అవి పెడుతున్న శీర్షికలు వాటి అవగాహన, అభిప్రాయాలను ప్రతిబింబిస్తున్నాయి. ” పెల్లుబుకుతున్న ఆగ్రహం, హిందూ రాజ్యంగా మారేందుకు భారత్‌ దగ్గర అవుతోందా ?” అని అమెరికా నుంచి వెలువడే న్యూయార్క్‌ టైమ్స్‌ పేర్కొన్నది. ముస్లింలను మినహాయించటం ద్వారా మౌలికంగా వివక్షా పూరితమైనదని, దాన్ని సమీక్షించాలని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కమిషన్‌ చేసిన వ్యాఖ్యను ఉటంకించింది. దేని మీదా ఏకీభావానికి రాని ప్రతిపక్షాలు ఒక్కటయ్యాయని వ్యాఖ్యానించింది.
బ్రిటన్‌ నుంచి వెలువడే గార్డియన్‌ పత్రిక మూడు వార్తలను ప్రచురించింది. వాటిలో ఒక దాని శీర్షిక ఇలా ఉంది.” భారత పౌరసత్వ చట్టం: తీవ్ర అణచివేత మోడీ వ్యతిరేకులను ఐక్యపరచవచ్చు” నిరసనల తీవ్రత గురించి వ్యాఖ్యానిస్తూ నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన ఆరు సంవత్సరాల తరువాత వెల్లడైన ముఖ్యమైన నిరసన అని పేర్కొన్నది.
నరేంద్రమోడీ చివరకు చాలా దూరం పోయారా అని న్యూయార్కర్‌ అనే పత్రిక విశ్లేషించింది.” ప్రస్తుతం భారత్‌లో జరుగుతున్న ప్రదర్శనలు రాజకీయాల్లో ఇప్పుడో తరువాతో నియంతలు చాలా దూరం ప్రయాణిస్తారు అని ఎంతగానో నమ్మిన పురాతన సిద్దాంతాన్ని క్రమబద్దీకరించాయి. ఈ ఉదంతంలో నియంత నరేంద్రమోడీ, భారత ప్రధాని ” అని పేర్కొన్నది.డెక్సటర్‌ ఫిల్‌కిన్స్‌ రాసిన విశ్లేషణలో ప్రధాని నాయకత్వం వహిస్తున్న హిందూ జాతీయవాద ప్రభుత్వం ఇరవై కోట్ల ముస్లింలను అంతర్గత శత్రువులుగా మలచింది అని వ్యాఖ్యానించారు.

Image result for Narendra Modi authoritarian
అంతర్జాతీయ మీడియాలో వెల్లడైన అభిప్రాయాలలో ఇవి కొన్ని మాత్రమే. భారత రాజకీయాలు ఏవైపు పయనిస్తున్నాయనే చర్చ మరోసారి ప్రపంచంలో ప్రారంభమైంది. మన దేశంలో సరేసరి. నరేంద్రమోడీ నియంతా, ఫాసిస్టా, మరొక ప్రమాదకారా ఏ తరగతికి చెందుతారు అన్న అంశంపై అనేక మందిలో ఏకీభావం ఉండకపోవచ్చు. మన విభేదాలను తరువాత చూద్దాం, ఈ అన్ని లక్షణాలు కలిగిన శక్తిని ముందు వ్యతిరేకిద్దాం అనే ఏకాభిప్రాయ క్రమం ప్రారంభమైందని చెప్పవచ్చు. ఓట్ల రాజకీయంలో బిజెపి పోటీ పడి అది ముందుకు తెస్తున్న మతోన్మాదంతో రాజీపడుతున్న రాజకీయ పార్టీల పట్ల కూడా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. ఇదే సమయంలో హిందూ జాతీయవాదాన్ని ప్రత్యక్షంగా కాకపోయినా దానికి ప్రాతినిధ్యం వహించే నరేంద్రమోడీ సర్కార్‌ను బలపరిచేందుకు పోటీ పడుతున్న తెలుగుదేశం, వైసిపి వంటి పార్టీలు తమ వైఖరిని పునరాలోచించుకుంటాయా లేదా అన్నది ఇప్పుడు ఒక ప్రశ్న. వాటి వెనుక ఉన్న మైనారిటీ తరగతుల వారు ఆలోచనలో పడుతున్నారు. ఒక మెజారిటీ మతోన్మాద శక్తిని ఎదుర్కొనేందుకు మరొక మైనారిటీ మతోన్మాదశక్తి వెనుక సమీకరణ కావటం, బలపరచటం కూడా ప్రమాదకరమే. అలాంటి మొగ్గునే మెజారిటీ మతశక్తులు కోరుకుంటున్నాయి. ఆ ఊబిలో ఎప్పుడు దిగుతారా అని చూస్తున్నాయి. ఎందుకంటే దాన్ని చూపి మెజారిటీ మద్దతును కూడగట్టుకోవటం సులభం కనుక ప్రస్తుతం తీవ్ర ఆందోళనలో ఉన్న మైనారిటీలు జాగ్రత్తగా ఉండటం కూడా అవసరమే. లౌకిక, వామపక్ష భావాలవైపు సమీకృతమై ఉమ్మడిగా లౌకిక రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టుకొనేందుకు పూనుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

నాడు ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌-నేడు ఇన్‌సైడర్‌ బ్రీఫింగ్‌ = ఆంధ్రుల రాజధానులు !

21 Saturday Dec 2019

Posted by raomk in AP, AP NEWS, Current Affairs, History, NATIONAL NEWS, Opinion, STATES NEWS

≈ Leave a comment

Tags

AP three capitals, GN RAO Committee, YS jagan

Image result for andhra pradesh

ఎం కోటేశ్వరరావు
రాజధాని అమరావతితో సహా రాష్ట్ర సమగ్ర అభివృద్ధి గురించి మాజీ అయ్యేఎస్‌ అధికారి జిఎన్‌ రావు కార్యదర్శిగా నియమించిన ఐదుగురు నిపుణుల కమిటీ ఒక రోజు ముందుగానే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి పుట్టిన రోజు కానుకగా తమ నివేదిను అందించింది. దీనిలో ఏదో అలా జరిగిపోయింది గానీ, ముందస్తు ఆలోచనేమీ లేదని జగన్‌ అభిమానులు చెప్పుకోవచ్చు గానీ, అంతర్గతంగా వారే మరోవిధంగా అనుకుంటారు. ఎవరేమనుకున్నా వచ్చేది లేదు పోయేది లేదు. ఆంధ్రుల గురించి అలారాసి పెట్టి ఉంది, కనుక జరగాల్సింది జరిగింది అనుకోవాలా ?
ఒక్కటి మాత్రం స్పష్టం. అదేమిటో నాకన్నీ ముందే అలా తెలిసిపోతుంటాయి అన్నట్లుగా నివేదిక ఇవ్వక ముందే ముఖ్యమంత్రి అసెంబ్లీలో మూడు రాజధానులు రావచ్చు అని చెప్పారు. కాలజ్ఞానం విషయంలో పోతులూరి వీరబ్రహ్మం గారిని మించి పోయారు. గత సర్కార్‌ హయాంలో రాజధాని నిర్ణయం జరగముందే అంతర్గత వ్యాపారం జరిగిందని ఎంత బలంగా నమ్ముతున్నామో, ఇప్పుడు మూడు రాజధానుల విషయంలో నివేదిక తయారీకి అంతర్గత బోధ జరిగిందన్నది కూడా అంతే స్పష్టం. అమరావతిలో అంతర్గత వ్యాపారం(ఇన్‌ సైడర్‌ ట్రేడింగ్‌) జరిగిందనటానికి జగన్‌ సర్కార్‌ వెల్లడించిన భూముల వివరాలు సాక్ష్యం అనుకుంటే, జగన్‌ ముందే చెప్పినట్లుగానే మూడు రాజధానుల మీద అంతర్గత బోధ (ఇన్‌సైడర్‌ బ్రీఫింగ్‌) జరిగిందనేందుకు జిఎన్‌ రావు కమిటీ నివేదిక తిరుగులేని సాక్ష్యం ! ఈ సిఫార్సులను రాష్ట్ర మంత్రివర్గం, అసెంబ్లీ ఆమోదించి, కేంద్రానికి పంపి, ఆమోదం వచ్చిన తరువాత ఎంతవరకు అమలు జరుగుతాయన్నది చూడాల్సి ఉంది. వీటిలో కేంద్ర ప్రమేయం, రాష్ట్ర అధికారాల గురించి చూడాల్సి ఉంది.
ఇక ఈ నివేదిక పూర్తి పాఠం ఇంకా అందలేదు కనుక జిఎన్‌రావు విలేకర్లతో చెప్పిన అంశాలకే ఈ పరిశీలన పరిమితం. రాష్ట్రాన్ని నాలుగు ప్రాంతీయ కమిషనరేట్స్‌గా ఏర్పాటు చేయాలని, ఒక దానిలో మూడు ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, రెండవ దానిలో ఉభయ గోదావరులు, కృష్ణా, మూడవ దానిలో గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, నాలుగవ దానిలో చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాలు ఉండాలని పేర్కొన్నారు. విశాఖలో సచివాలయం, అమరావతిలో అసెంబ్లీ, కర్నూలులో హైకోర్టు పెట్టాలని అమరావతి, విశాఖలో డివిజన్‌ బెంచ్‌లు పెట్టాలని సూచించారు. అమరావతిలో భాగం గాని మంగళగిరి ప్రాంతంలో మంత్రుల నివాసాలు, అమరావతిలో గవర్నర్‌, అసెంబ్లీ అని చెప్పారు. విశాఖలో అసెంబ్లీ వేసవి సమావేశాలు జరపాలన్నారు. ఇవన్నీ కూడా పదివేల కిలోమీటర్ల దూరం తిరిగి జనాభిప్రాయ సేకరణ చేసిన తరువాత చెప్పామన్నారు.
ఈ నివేదిక ఇచ్చేందుకు కమిటీ సభ్యులు పదివేల కిలోమీటర్ల దూరం తిరిగి వారు ప్రయాసకు గురై రాస్ట్ర ప్రజల సొమ్మును దుబారా చేశారనిపిస్తోంది. నాలుగు ప్రాంతీయ కమిషనరేట్స్‌ను కర్ణాటక తరహాలో అని వారే చెప్పారు. ఇంటర్నెట్‌లో ఆ వివరాలన్నీ ఉన్నాయి. రెండవది ప్రాంతీయ కమిషనరేట్స్‌ లేదా ప్రాంతీయ అభివృద్ధి మండళ్లు అనేవి మనకు తెలియనివి కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణా ప్రాంతీయ అభివృద్ధి మండలిని ఏర్పాటు చేశారు. ముల్కీ నిబంధనల అమలును సుప్రీం కోర్టు సమర్ధించిన తరువాత దానిని రద్దు చేసి ఆరుసూత్రాల పధకంలో భాగంగా ప్రాంతీయ అభివృద్ధి మండళ్లను ఏర్పాటు చేశారు. తరువాత వాటిని కూడా రద్దు చేశారు. ఇప్పుడు నాలుగు ప్రాంతీయ కమిషనరేట్స్‌ అంటే వాటి స్వరూప స్వభావాలు ఎలా ఉంటాయో తెలియదు. కర్ణాటక కమిషనరేట్స్‌ అయితే రెవెన్యూ డివిజన్లు. అంటే రాష్ట్ర కేంద్రం, జిల్లాల మధ్య మరొక అధికార దొంతర ఏర్పడుతుంది. లేదా గతంలో మాదిరి ప్రాంతీయ అభివృద్ధి మండళ్లు అయితే రాజకీయనేతలకు ఉద్యోగాలిస్తారు. ఏది చేసినా వీటి ద్వారా ఆయా జిల్లాలను ఎలా అభివృద్ది చేస్తారు ? ఇప్పుడున్న వ్యవస్ధలో అభివృద్దికి అడ్డువస్తున్న ఆటంకా లేమిటి ?
కర్ణాటకలో అలాంటి ఏర్పాటు చేసినా అనేక ప్రాంతాలు వెనుకబడిపోయాయి. నైజాం సంస్ధానం నుంచి విడదీసి కర్ణాటకలో విలీనం చేసిన కన్నడ ప్రాంతాలలో ఇది చివరకు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు డిమాండ్‌ వరకు దారి తీసింది. ఇప్పటికీ దానిని ముందుకు తెస్తూనే ఉన్నారు. అనేక రాష్ట్రాలలోని వెనుకబడిన ప్రాంతాలలో అలాంటి డిమాండ్లే ఉన్నాయి. మొత్తంగా దేశంలో జరుగుతున్న పరిణామాలను చూసినపుడు ఎక్కడ గతంలో అభివృద్ది చెందిన ప్రాంతాలున్నాయో అక్కడే, ఎక్కడ రేవులు, రోడ్డు, ఇతర రాష్ట్రాలకు సులభంగా సరకు రవాణా అవకాశాలుంటాయో అక్కడికే పెట్టుబడులు తరలి వెళుతున్నాయి తప్ప వెనుకబడిన ప్రాంతాలకు రావటం లేదు. నయా ఉదారవాద విధానాలు అమల్లోకి వచ్చిన తరువాత ఇది మరింత కొట్టవచ్చినట్లు కనిపిస్తోంది. గతంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు పెట్టుబడులు పెట్టి పరిశ్రమలు, అనేక సంస్ధలను ఏర్పాటు చేశాయి. ఇప్పుడు ఆ విధానానికి స్వస్తి పలికి ఉన్న ప్రభుత్వ రంగ సంస్ధలను అయినకాడికి తమ అనుయాయలకు తెగనమ్మి కట్టబెట్టే విధానాలను పాలకులు అనుసరిస్తున్నారు. అటువంటపుడు నాలుగు కమిషనరేట్ల ఏర్పాటుకు, అభివృద్ధికి సంబంధం ఏమిటి ? వైసిపి దగ్గర నవరత్నాలు తప్ప ఇతర అభివృద్ధి పధకాల ఊసే లేదు. ప్రయివేటు పెట్టుబడుల గురించి ప్రధాని నరేంద్రమోడీ పలు విమర్శలపాలై పెట్టుబడుల కోసం విదేశాలు తిరిగా అని చెప్పుకున్నా వచ్చిన పెట్టుబడులు లేవు, మేకిన్‌ ఇండియా పిలుపు ఘోరంగా విఫలం కావటం చూస్తున్నాం. అలాంటిది ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులను ఎక్కడి నుంచి తీసుకువస్తారు ?
జిఎన్‌ రావు కమిటీలో ఉన్నదంతా పట్ణణ ప్రణాళికల నిపుణులే కనుక పట్టణీకరణ గురించి ప్రస్తావించి, వెనుకబడిన ప్రాంతాలలో అభివృద్ధి చేయాలని పేర్కొన్నారు. నిజానికి ఇది సామాన్యులకు కూడా తెలిసిన అంశమే. వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ది చేసేది ఎవరనేదే కదా ప్రశ్న. సహజవనరులను దోచుకోవటానికి పెట్టుబడిదారులు ఎక్కడికైనా వెళతారు తప్ప పరిశ్రమలు, వ్యాపారాలు పెట్టేందుకు ఎక్కడా ఎవరూ ముందుకు రాలేదు. ప్రభుత్వాలు పెట్టుబడి పెట్టిన చోట్లనే అనుబంధ పరిశ్రమలు వచ్చాయి. మధ్య కోస్తోలో వ్యవసాయ రంగంలో మిగులు పట్టణీకరణ, వ్యాపారాల అభివృద్ధికి ఒక కారణం తప్ప ఒక్క పట్టుమని పదివేల మందికి ఒక దగ్గర ఉపాధి కల్పించేందుకు ఒక్క పరిశ్రమ లేదు.
2019 జనవరి ఒకటి నుంచి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు అమరావతిలో పని చేయటం ప్రారంభమైంది. తిరిగి దానిని కర్నూలుకు తరలించటానికి, విశాఖ, అమరావతిలో బెంచ్‌లు ఏర్పాటు చేయటానికి సుప్రీం కోర్టు, కేంద్ర ప్రభుత్వం ఏమేరకు ఆమోదిస్తాయన్నది సందేహమే. మద్రాసు ప్రావిన్సులోని తెలుగు ప్రాంతాలలో ఒక విశ్వవిద్యాలయం(తెలుగుకు పర్యాయపదం ఆంధ్రం కనుక ఆంధ్రా విశ్వవిద్యాలయాన్ని స్ధాపించాలనే డిమాండ్‌ వచ్చింది. అయితే దానిని ఎక్కడ ఏర్పాటు చేయాలన్న అంశంపై నాటి కాంగ్రెస్‌ నేతల( ఆంధ్రా-రాయలసీమ) మధ్య వివాదం వచ్చింది. చాలా సంవత్సరాల పాటు కొనసాగి చివరికి విశాఖలో 1926లో ఏర్పాటు చేశారు. ఆంధ్రా విశ్వవిద్యాలయాన్ని ఆంధ్రప్రాంత నేతలు తన్నుకు పోయారనే అసంతృప్తిలో ఉన్న రాయలసీమ నేతలను సంతృప్తి పరచేందుకు చిత్తూరు, ఇతర రాయలసీమ(సీడెడ్‌) జిల్లాలను మాత్రం దానిలో చేర్చకుండా మద్రాసు యూనివర్సిటీకి అనుబంధంగా కొనసాగించారు. తరువాత మద్రాసు ప్రావిన్సు నుంచి ప్రత్యేక ఆంధ్ర ఏర్పడాలన్న డిమాండ్‌ ముందుకు వచ్చినపుడు మరోసారి రాయల సీమకు అన్యాయం జరుగుతుందనే భయాన్ని ఆ ప్రాంత నేతలు వ్యక్తం చేసి ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌కు మద్దతు ఇవ్వలేదు. దాంతో ఉభయ ప్రాంతాల నేతలు కాశీనాధుని నాగేశ్వరరావు గృహం శ్రీబాగ్‌లో సమావేశమై భవిష్యత్‌లో ప్రత్యేక ఆంధ్ర ఏర్పడితే రాయలసీమలో హైకోర్టు లేదా రాజధానిని ఏర్పాటు చేయాలనే ( పెద్ద మనుషుల )ఒప్పందానికి వచ్చారు. ఆమేరకు కర్నూలులో రాజధాని, గుంటూరులో హైకోర్టు ఏర్పడింది. తరువాత రెండింటినీ హైదరాబాద్‌కు తరలించారు.
నరేంద్రమోడీ సర్కార్‌ అధికారానికి వచ్చిన తరువాత వివిధ చోట్ల హైకోర్టు బెంచ్‌లను ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌లు ఒక్కదానినీ ఆమోదించలేదు. ఇరవై రెండు కోట్ల జనాభా ఉన్న ఉత్తర ప్రదేశ్‌లో అలహాబాద్‌లోహైకోర్టు, లక్నోలో బెంచ్‌ ఉంది. మరో ఐదు బెంచ్‌లు ఏర్పాటు చేయాలన్న డిమాండ్లు ఉన్నాయి, అలాగే ఇతర రాష్ట్రాలలో కూడా అలాంటి డిమాండ్లు ఉన్నాయి. వీటన్నింటినీ పక్కన పెట్టి ఆంధ్రప్రదేశ్‌లో మూడు చోట్ల బెంచ్‌లు పెట్టాలన్న ప్రతిపాదనను అంగీకరించటానికి కేంద్రం ఏ ప్రాతిపదికన ముందుకు వస్తుంది అన్నది ప్రశ్న. శ్రీబాగ్‌ ఒప్పందాన్ని జిఎన్‌ రావు కమిటీ ఉటంకించింది.

Image result for ys jagan mohan reddy
ఈ కమిటీ నివేదిక ఒక ప్రహసన ప్రాయం అన్నది స్పష్టం. అమరావతిని రాజధానిగా కొనసాగించాలన్న ఆకాంక్ష వైసిపిలో ఎన్నడూ కనిపించలేదు. వారు కోరుకున్న విధంగా వ్యవహరించేందుకు ఒక ప్రాతిపదిక ఉండాలంటే దానికి ఒక కమిటీ నివేదిక కావాలి. అందుకోసం ఏర్పాటు చేసి తమకు అనుకూలంగా ఏమి రాయాలో రాయించుకున్నారు అన్న అభిప్రాయాలు సర్వత్రా వెల్లడి అవుతున్నాయి. గతంలో రాజధాని నిర్ణయానికి ముందు అనుయాయులకు ఉప్పందించి లబ్ది చేకూర్చేట్లు చేశారని, చంద్రబాబుతో సహా అనేక మంది భూములు కొనుగోలు చేసిన గ్రామాలను రాజధాని పరిధి, భూ సేకరణ నుంచి తప్పించారని వైసిపి చెబుతోంది. ఆమేరకు అసెంబ్లీలో కొన్ని వివరాలు కూడా ఇచ్చారు. ఇప్పుడు మూడు రాజధానుల వెనుక వైసిపి నేతలు కూడా అదే పనికి పాల్పడ్డారని తెలుగుదేశం ఆరోపిస్తోంది. ఈ వివరాలు ఐదేండ్ల తరువాత కొత్త ప్రభుత్వం వస్తే, వారు బయట పెట్టేంత వరకు అనుమానాలు, ఆరోపణలుగానే ఉంటాయి. ఐదేండ్ల తరువాత వచ్చే పాలకులు మూడు రాజధానుల్లో అనుకున్నట్లుగా అభివృద్ది జరగలేదంటూ మరొక కమిటీని వేసి మరో మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామంటే ? తన అధికారానికి ఇక తిరుగులేదని వైఎస్‌ జగన్‌ అనుకుంటున్నట్లే గతంలో చంద్రబాబు కూడా అనుకున్నారు, అయినా వేరేలా జరగలా ? రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

మూడు రాజధానులతో అభివృద్ది-మూడు ఎండమావులు !

19 Thursday Dec 2019

Posted by raomk in AP NEWS, BJP, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties

≈ Leave a comment

Tags

Aandhra Pradesh three Capitals, Amaravathi capital, ANDHRA PRADESH Capital Politics, Andhrapradesh new Capitol

Image result for three capitals

ఎం కోటేశ్వరరావు
ఆంధ్రప్రదేశ్‌లో ఐదేండ్ల క్రితం ప్రారంభమైన రాజధాని రాజకీయం కొత్త పుంతలు తొక్కింది. అది కూడా రాజధానికి-అభివృద్ధికి ముడి పెట్టటం, ఇది ప్రపంచంలో ఎనిమిదో వింత అని చెప్పక తప్పదు. తెలుగుదేశం గత ఐదేండ్ల పాలనలో భ్రమరావతిగా ఒక్క అమరావతినే చూపారు. ఇప్పుడు అభివృద్ది వికేంద్రీకరణ, అభివృద్ది పేరుతో మరో రెండు భ్రమరావతులను ప్రదర్శించేందుకు వైసిపి ఆరునెలల పాలన నాంది పలికిందా అన్న అనుమానాలు తలెత్తాయి. దీనిపై అధికారిక నిర్ణయం ఇంకా వెలువడలేదు గనుక దీని మంచి చెడ్డల పరిశీలన కూడా ఆ పరిమితుల్లోనే ఉంటుంది.
కన్యాశుల్కంలో తాంబూలాలిచ్చేశాం తన్నుకు చావండి అని అగ్నిహౌత్రావధానులు ఆంటాడు. డిసెంబరు17న అసెంబ్లీలో మాట్లాడుతూ మూడు రాజధానులు రావచ్చునేమో అన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డి ప్రకటన ద్వారా తాంబూలాలతో నిమిత్తం లేకుండానే తన్నుకు చచ్చేందుకు తెరతీశారు. అప్పుడే నిర్ణయం జరిగిపోయినట్లుగా విశాఖ, కర్నూల్లో హార్షాతిరేకాలు వ్యక్తం చేస్తుండగా తమను మోసం చేశారంటూ అమరావతిలో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ బంద్‌ చేశారు. అమరావతిలో అసెంబ్లీ, కర్నూలులో హైకోర్టు, విశాఖలో సచివాలయం అని వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి చెప్పేశారు.

Image result for three capitals
ఒక ప్రతిపక్ష పార్టీకి చెందిన నేతో మరొకరో , మీడియా ఊహాగానాల్లోనో ఉన్నరాజధానిపోవచ్చు, కొత్త రాజధానులు రావచ్చేమో అంటే అదొక తీరు. సాక్షాత్తూ ముఖ్యమంత్రే అసెంబ్లీలో వచ్చు భాష మాట్లాడితే దాన్ని రాజకీయం తప్ప అని మరొకటి అనలేరు. రాజధాని అమరావతితో సహా రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి సూచనలు చేసేందుకు ఐదుగురు పట్టణ ప్రణాళికల నిపుణులతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. పట్టణాల నిపుణులు రాష్ట్ర అభివృద్ధి, అమరావతి గురించి ఏమి చెబుతారో తెలియదు. వివిధ తరగతుల నుంచి అభిప్రాయలు సేకరించారు గనుక ఏదో ఒకటి చెబుతారనుకుందాం. కొద్ది రోజుల్లో అలాంటి నివేదిక ఇవ్వబోతున్నారని వార్తలు వచ్చాయి. రాకముందే రాజధానులు మూడు వుండవచ్చు అని సిఎం చెప్పేశారంటే నివేదికలో అలాగే ఇమ్మని ముందుగానే ఉప్పందించారనే అనుకోవాలి. ఒక వేళ దానికి భిన్నంగా ఇస్తే ఏమిటి అన్నది ప్రశ్న !
రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్లు పాలకులు తలచుకొంటే ఏదీ అసాధ్యం కాదు. కమిటీల నివేదికల సిఫార్సులకు, పాలకుల నిర్ణయాలకు సంబంధం లేదు. రాజధాని గురించి గతంలో శివరామకృష్ణ కమిటీ చేసిన సిఫార్సులను పక్కన పెట్టి తెలుగుదేశం ప్రభుత్వం తన స్వంత నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు రోగి కోరుకున్నదే వైద్యుడు రాసి ఇచ్చినట్లుగా వైసిపి ప్రభుత్వం నియమించిన కమిటీ సిఫార్సు చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. భిన్నంగా ఇస్తే చంద్రబాబు చెప్పుల్లో కాళ్లు పెట్టి వైఎస్‌ జగన్‌ స్వంత నిర్ణయాలు తీసుకోవచ్చు.
ఎన్నో తర్జన భర్జనలు, తెరవెనుక మంత్రాంగాలు, లావాదేవీలు పూర్తయ్యాక అక్కడా, ఇక్కడా అని చెప్పిన పుకార్ల వ్యాప్తి, శివరామకృష్ణన్‌ కమిటీ సిఫార్సుల తరువాత వాటికి భిన్నంగా రాజధాని నిర్మాణానికి చివరకు అమరావతి ప్రాంతాన్ని ఎంపిక చేశారు. దానికి ప్రతిపక్షంగా ఉన్న వైసిపి, దానికి నేతగా ఉన్న జగన్మోహన్‌ రెడ్డి కూడా అంగీకరించారు. అప్పుడు జగన్‌ ఆయన పరివారానికి ‘ ఇంగ్లీషు, తెలుగు ‘ భాష వచ్చు అయినా ఆ సమయంలో అధికార వికేంద్రీకరణ, భిన్న రాజధానుల గురించి మాట్లాడలేదు. ఎన్నికల ప్రణాళికలో అలాంటి ఊసు లేదు. అసెంబ్లీలో అంగీకరించినా జగన్‌ అధికారానికి వస్తే రాజధానిని మార్చివేస్తారని తెలుగుదేశం ప్రచారదాడి చేసింది. చంద్రబాబు రాజధానిలో స్దిరనివాసం ఏర్పరచుకోలేదు, మానేత తాడేపల్లిలో ఏకంగా ఇల్లుకట్టుకున్నారు, అలాంటి వ్యక్తి అమరావతి నుంచి రాజధానిని ఎలా మారుస్తారని వైసిపి నేతలు ఎదురుదాడి చేశారు. ఆయనే ఇప్పుడు అధికారపీఠమెక్కారు. చంద్రబాబు అధికారానికి వచ్చిన ఆరునెలల తరువాత రాజధాని మీద నిర్ణయం తీసుకుంటే, వైఎస్‌ జగన్‌ కూడా సరిగ్గా ఆరునెలల తరువాతే రాజధాని గురించి తన మన్‌కీ బాత్‌ వెల్లడించారు. అదియును సూనృతమే ఇదియును సూనృతమే అన్నట్లుగా బిజెపి నేతల మాటలు ఉన్నాయి.

Image result for three capitals
అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. మరో నాలుగున్నర సంవత్సరాల తరువాత మరో పార్టీ, ముఖ్య మంత్రి అధికారానికి వస్తే మూడింటితో అభివృద్ధి ముడిపడలేదు, మూడును పదమూడు చేస్తా అంటే ? వంతుల వారీగా ప్రతి జిల్లాలోనూ రాజధానులను ఏర్పాటు చేయవచ్చు. వారికి పోయేదేముంది. వారు లేదా వారి అనుయాయులుగా ఉన్న వారి రియలెస్టేట్‌ ప్రయోజనాలు కదా ముఖ్యం. గుడ్డిగా సమర్ధించే మద్దతుదారులు ఎలాగూ ఉంటారు. గతంలో చంద్రబాబు వాషింగ్టన్‌, కౌలాలంపూర్‌, సింగపూర్‌ ఇలా ఏ నగరం పేరు చెప్పి అలాంటి నగరాల మాదిరి ప్రపంచ స్ధాయి రాజధానిని నిర్మిస్తామంటే తెలుగుదేశం మద్దతుదారులు, అభిమానులు బుర్రలను తీసి పక్కన పెట్టి తలలు ఊపారు. మూడు ప్రాంతాలలో రాజధానులు ఏర్పాటు చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని జగన్మోహన్‌ రెడ్డి చెబుతుంటే ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. తేడా రంగులు, అభిమానులు మారారంతే !
రాజధాని రాజకీయంలో చంద్రబాబు కొన్ని నగరాల పేర్లను ముందుకు తెస్తే జగన్మోహన్‌రెడ్డి రాజధాని రాజకీయానికి దక్షిణాఫ్రికా దేశాన్ని తెరమీదకు తెచ్చారు. సినిమా ఇంటర్వెల్‌ వరకే చెప్పి ముగింపు చెప్పకపోతే ఏం జరుగుతుంది? ముఖ్యమంత్రికి దక్షిణాఫ్రికా కధను చెప్పిన వారు అదే పని చేశారు. జాత్యంహార వ్యవస్ధ చిహ్నాలుగా ఉన్న మూడు రాజధానులకు బదులు సరికొత్త రాజధాని నిర్మాణం జరపాలనే ప్రతిపాదన ముందుకు వచ్చినట్లు చెప్పలేదు. వందిమాగధులు రాజుగారికి ఇష్టమైన అంశాలనే చెప్పేవారు. ఇప్పుడు వారి స్ధానాన్ని ప్రభుత్వ సలహాదారులు అక్రమించారు కనుక సగమే చెప్పి ఉండాలి.
దక్షిణాఫ్రికాకు మూడు రాజధానులుంటే రెండు రాజధానులున్న దేశాల మరో డజను వరకు ఉన్నాయి. అసలు రాజధానికి ప్రత్యేకంగా ఒక నగరమంటూ లేకుండానే ఒక మున్సిపల్‌ జిల్లాలోని ఒక పట్టణంలో రాజధాని కలిగి ఉన్న హొండూరాస్‌ గురించి సలహాదారులకు తెలిసినా చెప్పి ఉండరు. రాజధాని-అభివృద్ధి గురించి చర్చించబోయే ముందు సిఎం ప్రకటనతో దక్షిణాఫ్రికాకు మూడు రాజధానులు ఎందుకున్నాయని అనేక మందిలో ఉత్సుకత తలెత్తింది. కేప్‌టౌన్‌లో పార్లమెంట్‌, ప్రిటోరియాలో పాలనా యంత్రాంగం, న్యాయవ్యవస్ధ కేంద్రంగా బ్లోయెమ్‌ ఫోంటెన్‌ ఉంది.
నేడు దక్షిణాఫ్రికాగా పిలుస్తున్న ప్రాంతాన్ని 1657లో డచ్‌ ఈస్టిండియా కంపెనీ ఆక్రమించింది. తరువాత డచ్‌వారు ఆ ప్రాంతాన్ని 1806లో బ్రిటీష్‌ వారికి ధారాదత్తం చేశారు. డచ్‌ పాలనా కాలంలో డచ్‌ జాతీయుల ఆధిపత్యంలోని ఆరు ప్రాంతాలకు స్వయంప్రతిపత్తి ఇచ్చారు. వాటిని బోయర్‌ రిపబ్లిక్‌లని పిలిచారు. వాటిలో దక్షిణాఫ్రికా, ఆరెంజ్‌ ఫ్రీ స్టేట్‌ అనే రిపబ్లిక్‌లు పెద్దవి. బ్రిటీష్‌ వారు పెత్తనానికి వచ్చిన సమయంలో ఇచ్చిన హామీలు లేదా యథాతధ స్ధితిని కొనసాగించటానికి భిన్నంగా బోయర్‌ రిపబ్లిక్‌ల మీద తమ ఆధిపత్యాన్ని నెలకొల్పే ప్రయత్నంలో బోయర్‌ రిపబ్లిక్‌లు ప్రతిఘటించాయి. వాటినే ఆంగ్లో-బోయర్‌ యుద్ధాలు అని పిలిచారు. చివరికి 1910లో బ్రిటీష్‌ వారు పాక్షిక స్వాతంత్య్రం, బ్రిటీష్‌ ప్రాంతాలు-బోయర్‌ రిపబ్లిక్‌లతో కూడిన ఒక యూనియన్‌ ఏర్పాటు చేశారు. అప్పుడు కుదిరిన ఒప్పందం ప్రకారం వారికి చెందిన రెండు పెద్ద పాలిత ప్రాంతాల రాజధానులలో ,బ్రిటీష్‌ వారి రాజధానిలో ఒక్కొక్క చోట ఒక్కో విభాగాన్ని ఏర్పాటు చేయాలనే నిబంధన అమల్లో భాగంగా పైన చెప్పుకున్న మూడు రాజధానులు ఉనికిలోకి వచ్చాయి.
1934లో పూర్తి స్వాతంత్య్రం వచ్చింది. డచ్‌, బ్రిటీష్‌ వారు ఎవరు అధికారంలో ఉన్నా వారు స్ధానిక ఆఫ్రికన్ల పట్ల జాత్యహంకారంతో వ్యవహరించారు. ఆ పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరుతో చివరకు జైలు నుంచి నెల్సన్‌ మండేలా విడుదల, 1994 ఎన్నికల్లో ఎఎన్‌సి విజయంతో జాత్యహంకార పాలన ముగిసింది. ఆ వ్యవస్ధ చిహ్నాలుగా ఉన్న రాజధానుల స్ధానంలో ఒక చోట కొత్త రాజధాని నిర్మాణం జరపాలని అనేక మంది కోరారు. అయితే దాని కంటే ఇతర ప్రాధాన్యతలకు నిధులు అవసరమైనందున ఆప్రతిపాదనను పక్కన పెట్టి ఉన్న వ్యవస్ధలనే కొనసాగిస్తున్నారు.
ఈ నేపధ్యంలో దక్షిణాఫ్రికా అనుభవం నుంచి ఏమి నేర్చుకోవాలి? మూడు చోట్ల ఉన్నవాటిని ఒక చోటకు చేర్చాలంటే వారికి నిధుల సమస్య ఎదురైంది. తాత్కాలికంగా అయినా వాయిదా వేసుకున్నారు. అప్పులు, ఆర్ధిక ఇబ్బందుల గురించి చెబుతున్న జగన్మోహన్‌ రెడ్డి ఉన్న ఒక రాజధానిని మూడుకు పెంచవచ్చని చెప్పటం గమనించాల్సిన అంశం. ప్రస్తుతం ఉన్న రాజధానిలో పాలన సాగించటానికి ఎలాంటి ఇబ్బంది లేదు. తాత్కాలిక కట్టడాలుగా ఉన్నవాటినే ఉపయోగపడినంత కాలం శాశ్వతంగా మార్చినా పోయేదేమీ లేదు. ఇప్పటి వరకు సామాన్య జనానికి లేని ఇబ్బంది కొత్తగా వచ్చేదేమీ ఉండదు.
ఎన్ని రాజధానులు ఉండాలి అనేది దేశాలన్నింటా ఒకే విధంగా లేదు. నెదర్లాండ్స్‌ రాజధాని ఆమస్టర్‌ డామ్‌. మరో పట్టణం హేగ్‌ వందల సంవత్సరాలుగా రాజధానిగా ఉంది. బొలీవియాలో లాపాజ్‌ మరియు సకురే పట్టణాలను రాజధానులుగా పరిగణించి అక్కడ కొన్ని ఇక్కడ కొన్ని శాఖలను పని చేయిస్తున్నారు. 19వ శతాబ్దంలో తలెత్తిన విబేధాల కారణాంగా ఇలా చేశారు.కోట్‌ డిలోవరీ అనే ఆఫ్రికన్‌ దేశం అధికారిక రాజధాని యెమౌసుకోరో, అయితే ప్రభుత్వం మాత్రం అబిడ్‌జాన్‌లో ఉంటుంది. అధికారికంగా రాజధాని కాదు. బెనిన్‌ అనే దేశ రాజధాని పోర్టో నోవా, కానీ పాలన మాత్రమ కోటోనౌ పట్టణం నుంచి జరుగుతుంది. చిలీ రాజధాని శాంటియాగో, కానీ 1990లో పార్లమెంట్‌ను వలపారిసోకు తరలించారు. పూర్వపు సోవియట్‌ రిప్లబిక్‌గా ఉండి ఇప్పుడు స్వతంత్ర దేశమైన జార్జియా రాజధాని తిబిలిసి, పార్లమెంట్‌ మాత్రం కుటారుసిలో ఉంది. హొండురాస్‌ అనే దేశానికి అసలు దేశ రాజధాని పట్టణం లేదు. సెంట్రల్‌ డిస్ట్రిక్ట్‌ మున్సిపాలిటీ అనే పాలనా ప్రాంతంలో తెగుసియోగాల్పా అనే పట్టణం నుంచి పాలన సాగుతుంది. మలేసియా రాజధాని కౌలాలంపూర్‌, అయితే 1999లో పుత్ర జయ అనే పట్టణానికి తరలించారు. మాంటెనీగ్రో అనే దేశ రాజధాని పోడ్‌గార్సియా. అయితే మాజీ రాజధాని అయిన సెటినిజేను గౌరవ రాజధానిగా పరిగణిస్తున్నారు. దక్షిణ కొరియాకు రెండు రాజధానులున్నాయి. సియోల్‌ పట్టణం రద్దీగా మారినందున 2012 నుంచి సిజోంగ్‌ పట్టణాన్ని పాలనా రాజధానిగా చేశారు. శ్రీలంక రాజధాని కొలంబో అయితే శివార్లలో జయవర్ధనే పుర కొటే అనే చోట రాజధాని నిర్మాణం చేశారు. స్వాజీలాండ్‌ అనే దేశంలో కార్యాలయాలు మబాబ్‌నేలో ఉంటే లొబాంబాలో పార్లమెంట్‌ ఉంది. టాంజానియా రాజధాని దారెస్‌ సలామ్‌, అయితే దేశంలో మధ్యలో ఉండే డోడోమాకు 1973లో రాజధానిని మార్చారు. పశ్చిమ సహారాలో అంతర్యుద్ధం జరుగుతున్నది. రెండు ప్రధాన పక్షాలు రెండు ప్రాంతాలను తమ రాజధానులుగా ప్రకటించకున్నాయి. మొరాకో తన రాజధాని లాయునే అంటే సహరావీ అరబ్‌ రిపబ్లిక్‌ టిఫారిటీని రాజధానిగా పరిగణిస్తుంది.
మన దేశంలో రద్దయిన కాశ్మీర్‌కు,మహారాష్ట్రకు రెండు రాజధానులు ఉన్నాయి. చలికాలంలో శ్రీనగర్‌లో మంచు కారణంగా జమ్మూలో రాజధాని పని చేస్తుంది. స్వాతంత్య్రానికి ముందు తరువాత సెంట్రల్‌ ప్రావిన్సుగా ఉన్న ప్రాంతానికి రాజధాని నాగపూర్‌. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో భాగంగా ఏర్పడిన మహారాష్ట్రలో నాగపూర్‌ ఉన్న విదర్భ ప్రాంతాన్ని విలీనం చేశారు. రాజధాని ముంబైలో ఉంటే తమ ప్రాంత అభివృద్ధి కుంటుపడుతుందేమో అన్న భయం ఆప్రాంత జనంలో ఏర్పడటంతో నాగపూర్‌ను అనుబంధ రాజధానిగా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఒక అసెంబ్లీ సమావేశాన్ని అక్కడ జరుపుతారు.
మద్రాస్‌ ప్రావిన్సు నుంచి తెలుగు ప్రాంతాలను విడదీసి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలన్నపుడు రాయలసీమనేతలు లేవనెత్తిన సందేహాలను తీర్చేందుకు శ్రీబాగ్‌ ఒప్పందంలో భాగంగా కర్నూలులో రాష్ట్ర రాజధాని ఏర్పాటు చేశారు. అందరికీ అందుబాటులో విజయవాడలో ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌కూడా ఉంది. అయితే విజయవాడ ప్రాంతంలో కమ్యూనిస్టుల ప్రాబల్యం ఉన్నందున అక్కడ రాజధాని ఏర్పాటుకు కాంగ్రెస్‌ నేతలు వ్యతిరేకించారు. అయితే ఆ ప్రాంతాన్ని సంతృప్తి పరచేందుకు గుంటూరులో హైకోర్టును ఏర్పాటు చేశారు. తరువాత ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటు సమయంలో గుంటూరులో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు చేయాలని కోరటం తప్ప ఎలాంటి హామీలను కోరలేదు. ఆంధ్రప్రదేశ్‌ను విడదీసినపుడు, రాజధాని ఏర్పాటు సమయంలోనూ ఎలాంటి ప్రత్యేక డిమాండ్లు ముందుకు రాలేదు. అమరావతి నిర్ణయం సాఫీగానే జరిగింది.

Image result for three capitals
ప్రపంచంలో ప్రతి దేశానికి, మన దేశంలో ప్రతి రాష్ట్రానికి రాజధానులు ఉన్నాయి. అవేమీ జనాన్ని దారిద్య్రం, నిరుద్యోగం, ధరల పెరుగుదల, వెనుకబాటు తనం, నిరక్షరాస్యత, వ్యవసాయ సంక్షోభం, సంపదల కేంద్రీకరణ, ప్రాంతీయ అసమానతల వంటి వాటి నుంచి జనాన్ని బయటపడలేక పోయాయి. అయినా రాజధానితో అభివృద్ధి సాధిస్తామని చెబుతుంటే ఎంత మంది నమ్ముతున్నారో తెలియదు గానీ నమ్మే వారంతా గుడ్డిగా ఉన్నారని చెప్పకతప్పదు.పైన పేర్కొన్నట్లుగా దేశాల రాజధానుల, మన దేశంలో రెండు రాష్ట్రాల రా నిర్ణయంలో అనేక అంశాలు పని చేశాయి. అసలే ఆర్ధికంగా ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రంలో అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు మూడు మూడూ చోట్ల ఉంటే అది ఆర్ధికంగా భారాన్ని మోపేదే అనటంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా సచివాలయం, అసెంబ్లీ వేరు వేరు నగరాల్లో ఉంటే అధికారులు, సిబ్బంది పనికి అంతరాయంతో పాటు ఆర్ధికంగా అదనపు భారాన్ని మోపుతుంది. అనేక రాష్ట్రాల్లో హైకోర్టులు రాజధానికి దూరంగా ఉన్నాయి. కొన్ని చోట్ల హైకోర్టు బెంచ్‌లు ఉన్నాయి. అలాగే కొన్ని శాఖలకు ప్రాంతీయ డైరెక్టరేట్‌ కార్యాలయాలు కూడా ఉన్నాయి. అందువలన అలాంటి వాటి గురించి ఆలోచించవచ్చు తప్ప మూడు వ్యవస్దల ప్రధాన కేంద్రాలను వేర్వేరు చోట్ల నుంచి పని చేయించటం సరైంది కాదు.
అనేక మంది అధికార వికేంద్రీకరణ అంటే పలు చోట్ల ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయటం అనే అర్ధంలో మాట్లాడుతున్నారు. రాష్ట్ర కేంద్రంగా ఉన్న అధికారాలను వాటిని స్ధానిక సంస్ధలకు బదలాయించటం అనే విషయాన్ని మరచిపోతున్నారు. రెండవది ప్రభుత్వ కార్యాలయాలు ఉన్న ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయనేది మరొక భ్రమ. గతంలో రాజధాని ప్రాంతాలలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడులు పెట్టి పరిశ్రమలను స్ధాపించాయి. ఇప్పుడు వాటిని తెగనమ్మే కార్యక్రమాన్ని అమలు జరుపుతున్నాయి. అందువలన ప్రభుత్వాల పెట్టుబడులు రావు. ప్రయివేటు పెట్టుబడులు రాజధానిగా ఉన్న నగర ప్రాతిపదికన రావు. వాటికి ఎక్కడ లాభసాటి అయితే అక్కడకు పోతాయి తప్ప మరొకటి కాదు. విశాఖలో సచివాలయాన్ని ఏర్పాటు చేస్తే ఉత్తరాంధ్రవెనుకబాటు తనమూ, కర్నూల్లో హైకోర్టు ఏర్పడితే రాయలసీమ వెనుకబాటు తనమూ, అమరావతిలో అసెంబ్లీ ఉంటే కోస్తా జిల్లాల్లోని వెనుకబడిన ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి అని ఎవరైనా వాదిస్తే వారికి వంద నమస్కారాలు పెట్టటంతప్ప తర్కంతో చర్చ జరిపితే వినే స్ధితిలో ఉండరు.
ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తే అభివృద్ది జరుగుతుందని చెబుతున్న లేదా నిజంగా నమ్ముతుంటే బిజెపి నేతలు, ఇతరులు ఢిల్లీలో ఉన్న కేంద్ర రాజధానిని విభజించి ప్రతి రాష్ట్రంలోనూ అత్యంత వెనుకబడిన ప్రాంతంలో కేంద్ర రాజధానుల శాఖలను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేయాలి. అప్పుడు దేశమంతా అభివృద్ధి చెందుతుంది.అంతకంటే కావాల్సింది ఏముంది. ప్రత్యేక హౌదా కావాలన్న డిమాండ్లు రావు, ఆ వాగ్దానంపై మడమ తిప్పను అని చెప్పుకొనే వారికి ఇబ్బంది ఉండదు ! సర్వేజనా సుఖినో భవంతు !!

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

పౌరసత్వ సవరణ చట్టం-వాదనలు, వాస్తవాలు !

16 Monday Dec 2019

Posted by raomk in BJP, Communalism, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, RELIGION

≈ 1 Comment

Tags

CAA, CAB, citizenship amendment act 2019 : some arguments and facts, India citizenship amendment act 2019

Image result for citizenship amendment act 2019పౌరసత్వ సవరణ చట్టం-వాదనలు, వాస్తవాలు !
ఎం కోటేశ్వరరావు
పార్లమెంట్‌ ఆమోదించిన పౌరసత్వ సవరణ బిల్లు రాష్ట్రపతి ఆమోదంతో చట్టంగా మారింది.దీని చట్టబద్దతను సవాలు చేస్తూ అనేక మంది సుప్రీం కోర్టు తలుపు తట్టనున్నారు. ఈ చట్టం గురించి అనేక మందిలో తలెత్తిన అనుమానాలు, కొన్ని వాదనలు, వాస్తవాలను చూద్దాం.
ఈ చట్టం ద్వారా ప్రస్తుతం దేశంలో ఉన్న ముస్లింలకు పోయేదేమీ లేదు, అయినా ఎందుకు ఆందోళనలు చేస్తున్నారు, వారిని ఎవరో రెచ్చగొడుతున్నారు, విదేశీ ముస్లింలను ఆహ్వానించి పౌరసత్వం ఇవ్వాలని వారు కోరుతున్నారా అన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ మాటలు మాట్లాడే వారు ఈశాన్య రాష్ట్రాలలో నిరసనలు తెలుపుతున్నది ప్రధానంగా హిందువులే అన్న అంశాన్ని కావాలనే విస్మరిస్తున్నారు. అసోంలో ఇప్పటికే కొందరు బిజెపి నేతలు పదవులకు రాజీనామాలు చేశారు, బిజెపి మద్దతుదారైన ఏజిపి పునరాలోచనలో పడింది. మరి వీరిని ఎవరు ప్రేరేపిస్తున్నట్లు ?
1985లో కుదిరిన అస్సాం ఒప్పందం ప్రకారం 1971 మార్చి 24 తరువాత దేశంలో అక్రమంగా ప్రవేశించిన వారందరినీ మతంతో నిమిత్తం లేకుండా వెనక్కు పంపాల్సి ఉండగా విదేశీయులకు స్వాగతం పలికేందుకు ఎవరూ సిద్ధం కాదు, అలాంటి అవసరమూ లేదు. దేశంలోని ఏ ముస్లిమూ అలాంటి డిమాండ్‌ను ఎన్నడూ ముందుకు తేలేదు. గతంలో లేని మాదిరి శరణార్దులుగా వచ్చిన వారికి మత ప్రాతిపదికన పౌరసత్వం ఇవ్వాలని నిర్ణయించిన వారు, రేపు అదే ప్రాతిపదికన ఇచ్చిన పౌరసత్వాన్ని రద్దు చేసేందుకు కూడా వెనుకాడరన్నదే ఇప్పుడు తలెత్తిన భయం. రాజ్యాంగాన్ని దెబ్బతీసే అనేక చర్యలను వేగంగా తీసుకుంటున్న పూర్వరంగంలో ఇతర మత రాజ్యాలలో మాదిరి తమ హక్కులను హరిస్తారా, రెండవ తరగతి పౌరులుగా మారుస్తారా అన్న ఆందోళనే మైనారిటీలను ఆందోళనకు గురి చేస్తోంది.
సవరించిన చట్టం ప్రకారం పాకిస్ధాన్‌, బంగ్లాదేశ్‌, ఆఫ్ఘ్‌నిస్తాన్‌లో ఉన్న హిందువులు ఎవరైనా మన దేశంలోని బంధువులు, కుటుంబాలతో కలసిపోయేందుకు అక్కడి నుంచి వలస వస్తే వారికి పౌరసత్వం ఇచ్చే వీలు కల్పిస్తుంది. ఇదే సూత్రం ముస్లింలకు వర్తించదు. హిందువుల మాదిరే ఈ దేశాల్లో ఉన్న ముస్లింలకు కూడా మన దేశంలో బంధుత్వాలు, కుటుంబాలు ఉన్నాయి. ఒక మతం వారికి ఒక సూత్రం, మరొక మతం వారికి మరొక సూత్రం మన రాజ్యాంగంలో లేదే !
ఈ మూడు దేశాల్లో ఉన్నది ఇస్లామిక్‌ ప్రభుత్వాలు. పాక్‌, ఆప్ఘనిస్తాన్‌ మాత్రమే ఇస్లామిక్‌ అని ప్రకటించుకున్నాయి.1972లో బంగ్లాదేశ్‌ లౌకిక రాజ్యంగా ఏర్పడింది. తరువాత దానిని 1980లో ఇస్లామిక్‌ రాజ్యంగా మార్చారు.1972లో ఆమోదించిన లౌకిక సూత్రాలే చెల్లుబాటు అవుతాయని 2010లో అక్కడి సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. అయినప్పటికీ ఆచరణలో మత రాజ్యంగా ఉందనే కొందరు చెబుతారు.
ఈ మూడు దేశాల్లో అత్యధికులు ముస్లింలు, మిగిలిన వారందరూ మైనారిటీలు, వారి మీద దాడులు జరుగుతున్నాయి కనుక వారు మాత్రమే భారత్‌లో పౌరసత్వం పొందేందుకు అర్హులు అన్నది ఒక వాదన. ప్రపంచంలో మైనారిటీలు అన్నిదేశాలలో ఉన్నారు. పాకిస్ధాన్‌లో కంటే ఇండోనేషియాలో హిందువుల సంఖ్య. మన దేశంలో మైనారిటీల మీద దాడులు జరుగుతున్నట్లుగానే ప్రపంచంలో అనేక దేశాల్లో దాడులు జరుగుతున్నాయి. అలాంటి వారు మరొక దేశంలో ఆశ్రయం కోరితే వారికి మత ప్రాతిపదికన పౌరసత్వం మంజూరు చేసే పద్దతి ఏ దేశంలోనూ లేదు.
పాకిస్ధాన్‌లో మైనారిటీలు అంటే ఒక్క హిందువులే కాదు. హిందువులలో వివిధ తరగతులు ఉన్నట్లే ముస్లింలలో కూడా మెజారిటీ, మైనారిటీలు ఉన్నారు. అక్కడి షియాలు, అహమ్మదీయాలు, సూఫీలు మైనారిటీలే. హిందువులు ఇతర మైనారిటీల మీద దాడులు జరిగినట్లే వీరి మీద కూడా నిత్యం దాడులు జరుగుతున్నాయి.హిందువులకు ఉన్నట్లే వీరి పూర్వీకులు కూడా మన దేశంలో ఉన్నారు. అయినప్పటికీ ఈ మైనారిటీలు ఆశ్రయం కోరితే తాజాగా చేసిన సవరణ చట్టంలో అంగీకరించే అవకాశం లేదు. పాకిస్ధాన్‌లో లష్కరే జాంగ్వీ పేరుతో ఒక ఉగ్రవాద సంస్ధ ఉంది. దీని పని షియాల మీద దాడులు, వారిని చంపటమే. వారిని ముస్లిమేతరులుగా ప్రకటించాలని అది డిమాండ్‌ చేస్తోంది. 2003-16 మధ్య 2,558 మందిని హత్య చేయగా 4,518 మందిని గాయపరిచారు. జనాభాలో షియాలు 15నుంచి 20శాతం వరకు ఉన్నారు.
1974లో పాకిస్ధాన్‌ ఒక రాజ్యాంగ సవరణ చేసి అహమ్మదీలను ముస్లిమేతరులుగా ప్రకటించింది. తరువాత నియంత జియావుల్‌ హక్‌ అహమ్మదీయాలు తమను ముస్లింలుగా పిలుచుకోవటాన్ని నిషేధించాడు. తెహరిక్‌ ఇ తాలిబాన్‌ పాకిస్ధాన్‌ అనే సంస్ధ లాహౌర్‌ తదితర చోట్ల అహమ్మదీలు, వారి మసీదులపై దాడులు చేస్తున్నది. పోలీసులు కూడా అదే దుండగాలకు పాల్పడుతున్నారు. మన దేశంలో ముస్లింలు, క్రైస్తవుల మీద విద్వేష ప్రచారం చేస్తున్నట్లుగానే అహమ్మదీల మీద పత్రికల్లోనే అలాంటి ప్రచారానికి సంబంధించి 3,963 వార్తలు, 532 వ్యాసాలను ఉటంకిస్తూ బాధితులు ఒక నివేదికను విడుదల చేశారు. బంగ్లాదేశ్‌లో దేవుడు, దేవదూతలు, ప్రవక్తల పట్ల విశ్వాసం లేని వారు గణనీయ సంఖ్యలో ఉన్నారు. వారందరూ ఆచరణలో ముస్లిం మైనారిటీలే, వారు గాక బీహారీ ముస్లింలు, అస్సామీ ముస్లింల పట్ల బంగ్లాదేశ్‌లో వివక్ష కొనసాగుతోంది, వారు దాడులకు గురవుతున్నారు, వారు శరణు కోరితే వైఖరి ఏమిటి ?

Image result for citizenship amendment act 2019
బనారస్‌ హిందూ విశ్వవిద్యాలయంలోని సంస్క త విద్యా ధర్మ విజ్ఞాన కేంద్రంలో సంస్క తంలో ఉన్న హిందూ పురాణాలను జంధ్యం లేని, ఫిరోజ్‌ ఖాన్‌ అనే ఒక ముస్లిం అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ బోధించటాన్ని అంగీకరించేది లేదంటూ అక్కడి విద్యార్ధులు, కొందరు టీచర్లు కూడా ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. దాంతో ఫిరోజ్‌ఖాన్‌ రాజీనామా చేశారు. అక్కడి రాష్ట్ర ప్రభుత్వం పోయిన తన పరువును కాపాడుకొనేందుకు రాజీమార్గంగా ఫిరోజ్‌ఖాన్‌ను తిరిగి ఉద్యోగంలోకి తీసుకొని ఆర్ట్స్‌ విభాగంలో సంస్క త సాహిత్యం, భాషా విభాగంలో నియమించింది.
పాకిస్ధాన్‌లో కూడా మతఛాందస శక్తులు అతిఫ్‌ మియాన్‌ అనే అహమ్మదీ సామాజిక తరగతికి చెందిన ఆర్ధికవేత్తను ఆర్ధిక సలహా మండలిలో పని చేయటానికి అంగీకరించబోమని వత్తిడి చేయటంతో వారంలోపే నియామకాన్ని రద్దు చేశారు. మత అసహనం, వివక్షకు ఇది పక్కా నిదర్శనం. సూఫీ ముస్లింల మీద కూడా అక్కడ ఇలాంటి దాడులే జరుగుతున్నాయి. వారు కూడా పాక్‌లో హిందువుల మాదిరే మన పూర్వీకులే కదా ! శరణార్ధులంటే ఎవరైనా శరణార్ధులే, వారిని అనుమతించటమా లేదా అనే ఒక విధానం తీసుకోవటంలో తప్పు లేదు కానీ వారి పట్ల మత విబేధాన్ని పాటించటం అంటే ముస్లింలను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూడటమే. ఇది మన భారతీయ సంప్రదాయం కానే కాదు. అఖండ్‌ భారత్‌ను పునరుద్దరించాలని చెప్పే వారు, ఈ సంకుచిత వైఖరిని అనుసరించటంలో హిందూ ఓటు బ్యాంకు రాజకీయం తప్ప, విశాల భావనకు చోటెక్కడ ? పౌరసత్వ చట్ట సవరణ ద్వారా అఖండ భారత్‌లో విభజనకు పూర్వం ఉన్న ముస్లింలకు చోటు లేదని తేల్చి చెప్పారు.
రాజ్యాంగ విరుద్దం అని ఎందుకు అంటున్నారు ?
పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకించే వారు ముస్లిం అనుకూలురు, ఇతర దేశాల నుంచి ముస్లింలు వలస రావాలని కోరుతున్నారనే తప్పుడు ప్రచారం జరుగుతోంది. రాజ్యాంగ విరుద్దమైన చర్యను వ్యతిరేకించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. ముస్లింలే వ్యతిరేకిస్తున్నారు అనేది తప్పుడు ప్రచారం, వక్రీకరణ. దేశ విభజన నేపధ్యంలో తలెత్తే పౌరసత్వ సమస్యలను పరిష్కరించేందుకు హింద్షూముస్లిం అనే వివక్ష లేకుండా రాజ్యాంగంలోని ఐదు నుంచి పదకొండు వరకు ఉన్న ఆర్టికల్స్‌ నిబంధనలు, విధి విధానాలను స్పష్టంగా పేర్కొన్నాయి. ఆర్టికల్‌ పదకొండు ప్రకారం పౌరసత్వాన్ని ఇచ్చేందుకు, తిరస్కరించేందుకు పార్లమెంట్‌కు అధికారం ఇచ్చింది. ఇప్పుడు దాన్ని వినియోగించుకొని ఆ ఆర్టికల్‌ను సవరిస్తూ మత ప్రాతిపదికన ముస్లిం మినహా పైన పేర్కొన్న మూడు దేశాల నుంచి వచ్చిన హిందూ, బౌద్ద, జైన, సిక్కు, పార్సీ, క్రైస్తవులకు పౌరసత్వాన్ని ఇచ్చేందుకు ఎన్‌డిఏ సర్కార్‌ చట్టసవరణ చేసింది. గతంలో లేని మత వివక్షను చొప్పించింది, ఇది లౌకిక స్వభావం నుంచి మత రాజ్యంవైపు వేసే అడుగులో భాగం తప్ప మరొకటి కాదు. ఆర్టికల్‌ 14కు విరుద్ధం.
1955 చట్టం ప్రకారం అక్రమంగా దేశంలో ప్రవేశించిన వారికి పౌరసత్వాన్ని ఇచ్చే అవకాశం లేదు. సవరించిన చట్టంలో దీనికి మినహాయింపులు ఇచ్చారు. 2015లో పాస్‌పోర్టు, విదేశీయుల చట్టానికి సంబంధించి చేసిన సవరణల ప్రకారం ముస్లిమేతరులు తగిన పత్రాలు లేకుండా దేశంలో ప్రవేశించినప్పటికీ పౌరసత్వాన్ని పొందేందుకు అవసరమైన ఎత్తుగడ దీనిలో స్పష్టంగా కనిపిస్తోంది. గతేడాది చట్టసవరణకు ప్రవేశపెట్టిన బిల్లుకు ఈశాన్య రాష్ట్రాలలో తీవ్ర నిరసన వ్యక్తమైంది. దాంతో రాజ్యాంగ ఆరవ షెడ్యూలులో చేర్చిన గిరిజన ప్రాంతాలకు ఇప్పుడు ఈ చట్టం నుంచి మినహాయింపు ఇచ్చారు. అయితే ఒకసారి పౌరసత్వం ఇచ్చిన తరువాత ఈ ప్రాంతాలకు వలసలను ఎలా నిరోధిస్తారన్నది ఒక ప్రశ్న. తెలుగు రాష్ట్రాలలో ఒన్‌ ఆఫ్‌ 70 చట్టం ఉన్నప్పటికీ గిరిజనేతరులు గిరిజన ప్రాంతాలకు ఎలా చేరుతున్నదీ చూస్తున్నాము.ఈశాన్యరాష్ట్రాలలోని గిరిజనేతర ప్రాంతాలను ఇప్పటి వరకు శరణార్ధులుగా ఉన్న వారికి పౌరసత్వం ఇచ్చి నింపితే స్ధానికులు తాము మైనారిటీలుగా మారతామని, తమ భాష, భూమి, సంస్క తులకు ముప్పు వస్తుందనే భయంతో ఆ ప్రాంతాలన్నీ ఒక్కసారిగా భగ్గుమన్నాయి.

Image result for citizenship amendment act 2019
శరణార్ధుల విషయంలో మత ప్రాతిపదికను ప్రవేశపెట్టిన కేంద్రం ఇంతటితో ఆగుతుందనే హామీ లేని కారణంగా మైనారిటీల్లో భయం ఏర్పడింది. ఈశాన్య ప్రాంతాలలో తమ అస్ధిత్వం, అవకాశాల గురించి హిందువులు ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా వీధుల్లోకి వచ్చింది వారే. ఇదే సమయంలో దేశ వ్యాపితంగా ఎన్‌ఆర్‌సిని అమలు జరుపుతామని కేంద్రం ప్రకటించింది. అసోం ఎన్‌ఆర్‌సి జాబితాలో అవకతవకలు, పేర్లను తొలగించే అధికారం అధికారులకు కట్టబెట్టం మైనారిటీల్లో ఇప్పటికే అనేక అనుమానాలు, ఆందోళనలను రేకెత్తించింది. శరణార్ధుల విషయంలో మతవివక్షను ప్రవేశపెట్టిన కేంద్రం ఎన్‌ఆర్‌సి పేరుతో దేశంలో ఉన్న లక్షల మంది ముస్లింల పౌరసత్వాలను రద్దు చేస్తారనే భయం అనేక చోట్ల వారిని ఆందోళనకు పురికొల్పింది.
ఆఫ్ఘనిస్తాన్‌కు మన దేశానికి ఇప్పుడు ఆచరణలో సరిహద్దులేదు. అయినప్పటికీ ఆ దేశాన్ని ఎందుకు చేర్చారో తెలియదు. మన పొరుగునే ఉన్న మయన్మార్‌లో మైనారిటీలుగా ఉన్న రోహింగ్యాలు, శ్రీలంకలో మైనారిటీలుగా హిందువులు, ముస్లింలు ఉన్నారు. నేపాల్‌, భూటాన్‌ ప్రాంతాల్లో మైనారిటీలు ఉన్నారు. వారందరినీ మినహాయించటానికి తగిన కారణాలను చెప్పలేదు. 1985లో కుదిరిన అస్సాం ఒప్పందం ప్రకారం 1971 మార్చి 24 తరువాత అక్రమంగా దేశంలో ప్రవేశించిన వారందరినీ మతంతో నిమిత్తం లేకుండా వెనక్కు పంపాల్సి ఉంది.
ఇతర దేశాల్లో ఉన్న హిందువులు, సిక్కులు అక్కడ పౌరులు కానట్లయితే, మన దేశం పౌరసత్వం కావాలనుకుంటే మంజూరు చేయాలన్న మత ప్రాతిపదిక ప్రతిపాదనను రాజ్యాంగ రచన సమయంలోనే కొందరు ముందుకు తెచ్చారు.1949 ఆగస్టు పన్నెండున ఆ ప్రతిపాదనపై రాజ్యాంగ పరిషత్‌లో ఓటింగ్‌ జరపగా తిరస్కరించారు. ఇప్పుడు హిందూత్వశక్తులు, వారిని సమర్ధించే వారు గతంలో తిరస్కరించిన ప్రాతిపదికనే ఇప్పుడు ముందుకు తెచ్చారు. పార్లమెంట్‌లో మెజారిటీ ఉన్నందున 70సంవత్సరాల తరువాత మత ప్రాతిపదికను అమల్లోకి తెస్తున్నారు. ఇది ఇక్కడితో ఆగుతుందనే హామీ లేదు. ఆర్టికల్‌ పదకొండు ప్రకారం పౌరసత్వాన్ని మంజూరు చేసే రద్దు చేసే హక్కు పార్లమెంట్‌కు ఉంది. ఇప్పుడు మతాల ఆధారంగా మంజూరుకు చట్టాన్ని సవరించిన వారు, రేపు అదే ప్రాతికన మైనారిటీల పౌరసత్వాన్ని రద్దు చేస్తే, ఆంక్షలు విధిస్తే పరిస్ధితి ఏమిటి ? ఇప్పటికి లేదు కదా రాబోయే రోజుల్లో ఏదో చేస్తారని ఎందుకు అనుమానించాలి అని కొందరు అతితెలివిగా ప్రశ్నిస్తున్నారు. ఈ దే శాన్ని హిందూ రాజ్యంగా మార్చాలని నిరంతరం ప్రచారం చేస్తున్నవారిని సమర్ధిస్దున్న వారే కేంద్రంలో పాలకులుగా ఉండగా వారికి మద్దతు ఇచ్చేందుకు తెలుగుదే శం, వైసిపి వంటి పార్టీలు పోటీపడుతున్నాయి. ఎవరైనా జమ్మూ-కాశ్మీర్‌ రాష్ట్రాన్ని రద్దు చేసి రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా మారుస్తారని, మొత్తం రాష్ట్రాన్ని అప్రకటిత కర్ఫ్యూ ప్రాంతంగా మార్చివేస్తారని, అభ్యంతర తెలిపిన పార్టీల నేతలను జైలు పాలు చేస్తారని ఊహించారా ? బాబరీ మసీదును కూల్చివేస్తామని సంఘపరివార్‌ ఎన్నడూ చెప్పలేదు, అయినా ఉత్తర ప్రదే శ్‌లో అధికారాన్ని అడ్డుపెట్టుకొని దాన్ని కూల్చివేస్తుంటే ఎవరేమి చేయగలిగారు? ఒకసారి మతరాజ్యంగా మారిన తరువాత హిందూ మతానికి ప్రాతిపదిక మనుధర్మం కనుక ఇస్లామిక్‌ దేశాల్లో షరియత్‌ను అమలు చేసినట్లుగా మనుధర్మాన్ని జనం మీద రుద్దరనే హామీ ఉందా ? సామాజిక వివక్ష నివారణలో భాగంగా ఏర్పాటు చేసిన రిజర్వేషన్లకు వ్యతిరేకంగా లేదా చర్చ జరగాలనే పేరుతో వాటి రద్దు డిమాండ్‌ను ముందుకు తెస్తున్నది సంఘపరివార్‌, అందువలన ఒక విషయంలో ఒక సామాజిక తరగతి మౌనం వహిస్తే మరొక విషయంలో వారికే ముప్పు తెస్తే దిక్కేమిటి ? ఈ సందర్భంగా హిట్లర్‌ దాష్టీకానికి గురైన జర్మన్‌ మతాధికారి మార్టిన్‌ నైమిలర్‌ జైలులో పశ్చాత్తాపం లేదా కుట్రను గ్రహించి నాజీల తీరుతెన్నుల గురించి రాసిన కవితను ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకోవటం అవసరం.

తొలుత వారు కమ్యూనిస్టుల కోసం వచ్చారు !
నేను కమ్యూనిస్టును కాదు కనుక మాట్లాడలేదు.
తరువాత వారు సోషలిస్టుల కోసం వచ్చారు !
నేను సోషలిస్టును కాదు గనుక నోరు విప్పలేదు.
తరువాత వారు కార్మికనేతల కోసం వచ్చారు !
నేను కార్మికుడిని కాదు కనుక పెదవి విప్పలేదు.
తరువాత వారు యూదుల కోసం వచ్చారు !
నేను యూదును కాదు గనుక మౌనంగా ఉన్నాను.
తరువాత వారు నాకోసం వచ్చారు !
మాట్లాడేందుకు అక్కడ ఎవరూ మిగల్లేదు .

సవరణ చట్టం రాజ్యాంగానికి విరుద్ధంగా ఉందంటూ అనేక మంది సుప్రీం కోర్టులో సవాలు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే రాజ్యాంగ మౌలిక స్వభావానికి విరుద్దంగా ఉన్న ఆర్టికల్‌ 370 రద్దు అంశం ఉన్నత న్యాయ స్ధానం ముందు ఉంది. ఇటీవలి కొన్ని తీర్పుల తీరు తెన్నులు చూసిన తరువాత అనేక మందిలో తలెత్తిన సందేహాలు, అనుమానాలకు సుప్రీం కోర్టు తెరదించుతుందా ? మన రాజ్యాంగం మనుగడలో ఉంటుందా ? మత రాజ్యాంగంగా మారనుందా ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

సావర్కర్‌పై రాహుల్‌ వ్యాఖ్యతో బిజెపి రుసరుస !

15 Sunday Dec 2019

Posted by raomk in BJP, Congress, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties

≈ Leave a comment

Tags

BJP, Not Rahul Savarkar, Rahul Jinnah, vd savarkar

Image result for rahul gandhi ramlila maidan

ఎం కోటేశ్వరరావు
మరోసారి కాషాయ పరివారం హిందుత్వ ప్రతీక విడి సావర్కర్‌ను దేశ భక్తుడిగా దేశం ముందుకు తెచ్చింది. నరేంద్రమోడీ పాలన దేశాన్ని మేకిన్‌ ఇండియాగా మార్చటానికి బదులు రేప్‌ ఇన్‌ ఇండియా(అత్యాచారాల భారత్‌)గా మార్చిందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ కొద్ది రోజుల క్రితం ఒక ఎన్నికల సభలో చేసిన వ్యాఖ్య దీనికి మూలం. రాహుల్‌ గాంధీ క్షమాపణ చెప్పాలంటూ బిజెపి పార్లమెంట్‌లోపలా బయటా డిమాండ్‌ చేసింది. ఈ అంశంపై వివాదం చెలరేగటంతో పార్లమెంట్‌ పలుసార్లు వాయిదా పడింది. రాహుల్‌ వ్యాఖ్య దేశాన్ని, మహిళలను అవమానించటమే అని, అత్యాచారాలు చేయాల్సిందిగా ఆహ్వానం పలకటం వంటిదే అని బిజెపి ఎంపీలు ఆరోపించారు. సావర్కర్‌పై చేసిన వ్యాఖ్యలో దేశద్రోహంతో సమానమని అందుకు రాహుల్‌ను జైల్లో పెట్టాలని సంఘపరివార్‌కు చెందిన వారు డిమాండ్‌ చేశారు. రాహుల్‌ ఇటలీకి పోవాలన్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దావ్‌ ధాకరే బహిరంగంగా రాహుల్‌ గాంధీని కొట్టాలని సావర్కర్‌ మనవడు కోరారు.
‘నరేంద్రమోడీ మేకిన్‌ ఇండియా గురించి మాట్లాడతారు, అయితే ఈ రోజుల్లో ఎక్కడ చూసినా అది అత్యాచారాల భారత్‌గా కనిపిస్తోంది’ అన్నది రాహుల్‌ గాంధీ వ్యాఖ్య. క్షమాపణ చెప్పాలని బిజెపి చేసిన డిమాండును న్యూఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో భారత్‌ను రక్షించండి అనే నినాదంతో కాంగ్రెస్‌ నిర్వహించిన సభలో రాహుల్‌ గాంధీ తిప్పి కొట్టారు. పదే పదే క్షమాపణలు చెప్పటానికి నేనేమీ రాహుల్‌ సావర్కర్‌ను కాదు అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. తనకు క్షమాభిక్ష పెడితే బ్రిటీష్‌ వారికి సేవచేసుకుంటానని అండమాన్‌ జైలు నుంచి విడి సావర్కర్‌ పదే పదే లేఖలు రాసి వేడుకున్న అంశాన్ని రాహుల్‌ గాంధీ తన వ్యాఖ్యద్వారా ప్రస్తావించారు. దీనిపై చెలరేగిన వివాదం కారణంగా సావర్కర్‌ దే శభక్తుడని నమ్ముతున్నవారికి సావర్కర్‌ అసలు రూపం ఏమిటో చూసేందుకు ఆసక్తి రేకెత్తించినందుకు బిజెపికి ‘అభినందనలు’ చెప్పాల్సిందే.
తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పేది లేదంటూ రాహుల్‌ గాంధీ విమర్శలను తిప్పికొట్టారు. ఢిల్లీని అత్యాచారాల రాజధాని అని ప్రతిపక్షంలో ఉన్నపుడు అనేక సార్లు బిజెపి పేర్కొన్నదని, సాక్షాత్తూ నరేంద్రమోడీ 2014 ఎన్నికల సందర్భంగా చేసిన వ్యాఖ్యల వీడియో క్లిప్పింగ్‌ను విడుదల చేశారు. గుక్కతిప్పుకోలేని బిజెపి నేతలు రాహుల్‌ గాంధీకి తగిన పేరు రాహుల్‌ జిన్నా అని వ్యాఖ్యానించారు. సిపాయి తిరుగుబాటుగా బ్రిటీష్‌ చరిత్రకారులు వర్ణించిన 1857 పరిణామాలను ప్రధమ భారత స్వాతంత్య్ర సంగ్రామం అని ముందుగా వర్ణించిన సావర్కర్‌ గొప్ప దేశభక్తుడని కేంద్ర హౌం మంత్రి అమిత్‌ షా గతంలో చేసిన వ్యాఖ్యను ఈ సందర్భంగా మరోసారి పునరుద్ఘాటించారు.
1857 మే పదవ తేదీన బ్రిటీష్‌ ఈస్టిండియా కంపెనీ పాలనకు వ్యతిరేకంగా మీరట్‌లో ప్రారంభమైన మిలిటరీ తీరుగుబాటు తరువాత దేశంలోని వివిధ ప్రాంతాలకు విస్తరించింది.1858 జూన్‌ 20న గ్వాలియర్‌లో తిరుగుబాటుదార్లను అణచివేయటంతో వెనుకపట్టు పట్టింది. అయితే సిపాయిలపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటే తమ పాలన అంతానికి నాంది అవుతుందని భయపడిన బ్రిటీష్‌ పాలకులు హత్యకేసులతో సంబంధం ఉన్నవారికి మినహా మిగిలిన తిరుగుబాటుదారులందరికీ క్షమాభిక్ష పెడుతున్నట్లు ప్రకటించారు.1859 జూలై ఎనిమిది తిరుగుబాటు లాంఛనంగా ముగిసింది.
ప్రధమ భారత స్వాతంత్య్ర సంగ్రామం గురించి నాటి పాలకుల కనుసన్నలలో నడిచే బ్రిటన్‌ పత్రికలు, అధికారిక ప్రకటనలు తప్ప ప్రపంచానికి ప్రత్యామ్నాయ వాస్తవ సమాచారం అందుబాటులో లేదు. అయినప్పటికీ తిరుగుబాటు ప్రారంభమైన 50 రోజుల్లోనే కారల్‌ మార్క్స్‌- ఫెడరిక్‌ ఎంగెల్స్‌ దాని స్వభావాన్ని పసిగట్టారు. తరువాత మరొక నెల రోజులకే భారత్‌లో జరిగిన అలజడి ఒక సిపాయి తిరుగుబాటు కాదు, ఒక జాతీయ తిరుగుబాటు, జాన్‌ బుల్‌ దానిని మిలిటరీ తిరుగుబాటుగా పరిగణించవచ్చుగానీ వాస్తవం ఏమంటే అది జాతీయ తిరుగుబాటు అని 1857 జూలై 28, 31 తేదీలలోనే కారల్‌ మార్క్సు వ్యాఖ్యానించారు. 1857 జూన్‌ 30న భారత్‌లోని పరిణామాలను మార్క్స్‌ ఇలా వర్ణించారు. ‘ ముస్లింలు, హిందువుల తమ ఉమ్మడి యజమానులకు వ్యతిరేకంగా ఐక్యమయ్యారు. తిరుగుబాటు కొన్ని ప్రాంతాలకే పరిమితం కాలేదు. ఆసియా దేశాలలో తలెత్తిన సాధారణ అసంతృప్తి కాలంలోనే ఇది జరిగింది.’ అని రాశారు.ఆ తిరుగుబాటును అణచివేయటంలో నాటి సంస్ధానాధీశులలో ఒకరైన సింధియా, ఇతర ప్యూడల్‌ శక్తుల పాత్ర గురించి కూడా మార్క్స్‌-ఎంగెల్స్‌ అనుమానించారు.
సిపాయిల తిరుగుబాటులో ప్రధమ భారత స్వాతంత్య్రం సంగ్రామ లక్షణాల గురించి మార్క్స్‌-ఎంగెల్స్‌ వ్యాఖ్యానించే నాటికి అసలు వి డి సావర్కర్‌ పుట్టనే లేదు. ఐదు ద శాబ్దాల తరువాత లండన్‌లో బారిష్టర్‌ చదవటానికి వెళ్లిన సమయంలో వారి రచనలు చదివి సావర్కర్‌ ఆ అభిప్రాయానికి వచ్చి వుండవచ్చు, వారి అవగాహన, అభిప్రాయాన్ని అంగీకరించారంటే అర్ధం చేసుకోవచ్చు గానీ అసలు ముందుగా వ్యాఖ్యా నించింది సావర్కరే అంటే చరిత్రను వక్రీకరించటమే. సావర్కర్‌ లండన్‌లో ఉన్న సమయంలో 1909లో మరాఠీలో సిపాయి తిరుగుబాటును ప్రధమ భారత స్వాతంత్య్రం సంగ్రామంగా వర్ణిస్తూ పుస్తకాన్ని రాశారు. దానికి మూలం లండన్‌లో విద్యార్ధి విప్లవకారులకు కేంద్రంగా ఉన్న ఇండియా హౌస్‌లో ఏర్పడిన పరిచయాలు, అధ్యయనమే అన్నది వేరే చెప్పనవసరం లేదు.
అభినవ్‌ భారత్‌ లేదా ఇండియా హౌస్‌లో సావర్కర్‌ పని చేసిన కాలంలో ఆయన పాత్ర గురించి ఎవరికీ పేచీ లేదు. బ్రిటీష్‌ వారి అరెస్టు నుంచి తప్పించుకొని ఫ్రెంచి వారికి చిక్కారు. వారు సావర్కర్‌ను బ్రిటీష్‌ వారికి అప్పగించారు.1910లో అరెస్టయిన కేసులో మరుసటి ఏడాది అండమాన్‌ జైలుకు తరలించిన తరువాత సావర్కర్‌ లొంగుబాటు అధ్యాయం ప్రారంభమైంది. 1911,13,17,20 సంవత్సరాలలో లేఖల మీద లేఖలు రాసి క్షమాభిక్ష కోసం ప్రాకులాడిన విషయం దాస్తే దాగదు. ఎలా కావాలంటే అలా బ్రిటీష్‌ వారికి అనుకూలంగా పని చేస్తానని రాశారు. 1923లో జైలు నుంచి విడుదల అయిన తరువాత ఇచ్చిన మాట తప్పకుండా మడమ తిప్పకుండా స్వాతంత్య్ర పోరాటానికి దూరమయ్యారు. అంతవరకైతే అదొక దారి క్విట్‌ ఇండియా ఉద్యమాన్ని వ్యతిరేకించి బ్రిటీష్‌ వారికి తన విధేయతను చాటుకున్నారు. రెండవ ప్రపంచ యుద్ధంలో భారతీయులు మిలిటరీలో చేరి బ్రిటీష్‌ వారికి తోడ్పడాలని ప్రచారం చేశారు. అదే ఏడాది హిందూ మహాసభ నాయకత్వాన్ని స్వీకరించి తొలిసారిగా హిందుత్వను ప్రతిపాదించి ద్విజాతి సిద్దాంతాన్ని ముందుకు తెచ్చారు. ముస్లిం ద్వేషిగా మారి చివరకు మహాత్మా గాంధీ హత్య కుట్రకేసులో ముద్దాయిగా మారిన విషయం తెలిసిందే. సాక్ష్యాలను సరిగా ప్రవేశ పెట్టని కారణంగా ఆ కేసునుంచి బయటపడ్డారు.
సావర్కర్‌తో పాటు అనేక మంది దే శభక్తులు అండమాన్‌ జైలు పాలయ్యారు. వారెవరూ బ్రిటీష్‌ వారి దయాదాక్షిణ్యాల కోసం పాకులాడలేదు. అనేక మంది తరువాత కమ్యూనిస్టులుగా మారారు. అయితే సావర్కర్‌ బ్రిటీష్‌ వారికి లేఖలు రాసిన విషయం చాలా కాలం వరకు బయటకు రాలేదు. ఆయన 1966లో మరణించారు. 1975లో నాటి కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ స్వాతంత్య్ర పోరాటంలో అండమాన్‌ జైలుకు వెళ్లినవారి గురించి ఒక పుస్తకం ప్రచురించాలని నిర్ణయించింది. దాన్ని ఆర్‌సి మజుందార్‌ అనే చరిత్రకారుడు రాశారు. ఆయన 1857 తిరుగుబాటును ప్రధమ భారత స్వాతంత్య్ర సంగ్రామంగా గుర్తించేందుకు నిరాకరించిన వ్యక్తి. సావర్కర్‌ అభిమానిగా ఆయన గొప్పతనాన్ని చిత్రించేందుకు ఎంతగా ప్రయత్నించినా బ్రిటీష్‌ వారికి రాసిన లొంగుబాటు లేఖలను దాచిపెట్టలేకపోయారు. అలాంటి సావర్కర్‌కు భారత రత్న బిరుదు ఇవ్వాలని కాషాయ దళాలు ఎప్పటి నుంచో కోరుతున్నాయి. మోడీ సర్కార్‌ అందుకు ఇప్పటి వరకు ‘ఆ సాహసానికి ‘పూనుకొనేందుకు జంకింది. అక్టోబరు నెలలో మహారాష్ట్ర ఎన్నికల సమయంలో తాము అధికారానికి వస్తే సావర్కర్‌కు భారత రత్న కోసం కృషి చేస్తామని బిజెపి-శివసేన ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్నాయి.

Image result for rahul gandhi ramlila maidan
రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలతో తలెత్తిన వివాదంలో శివసేన నేతలు సావర్కర్‌ దే శభక్తుడనే తమ పాత వైఖరిని పునరుద్ఘాటించారు. నాటకీయ పరిణామాల మధ్య శివసేన, ఎన్‌సిపి, కాంగ్రెస్‌ మహారాష్ట్రలో సంకీర్ణ సర్కార్‌ భాగస్వాములుగా ఉన్నాయి. తాము గాంధీ, నెహ్రూలను గౌరవిస్తామని అలాగే కాంగ్రెస్‌ కూడా సావర్కర్‌ను గౌరవించాలని శివసేన నేత సంజయరౌత్‌ వ్యాఖ్యానించారు. ప్రతిఒక్కరూ ప్రతిదానినీ అంగీకరించలేరని రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలను కూడా అలాగే చూడాలంటూ ఎన్‌సిపి నేత ఛాగన్‌ భుజబల్‌ రాహుల్‌కు మద్దతు ప్రకటించారు. ఆవు మన మాతృమూర్తి కాదని సావర్కర్‌ అన్నారు, బిజెపి దానితో విబేధిస్తోంది, అదే మాదిరి పెద్ద వారి గురించి ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయని చెప్పారు. దేశంలో ఈ వ్యాఖ్యల ప్రభావం ఎలా ఉన్నప్పటికీ ఈ కారణంగా మహారాష్ట్ర సంకీర్ణ కూటమికి వచ్చే ముప్పు ఉండదని చెప్పవచ్చు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

దేవుని స్తుతి – సైతాను దూషణ = జగన్‌ సైన్యం

15 Sunday Dec 2019

Posted by raomk in AP, AP NEWS, Current Affairs, History, NATIONAL NEWS, Opinion, Political Parties, STATES NEWS

≈ Leave a comment

Tags

Aandhra Pradesh Politics, chandrababu naidu, tdp, Ycp, YS jagan, ys jagan vs chandrababu naidu

Image result for ys jagan vs chandrababu naidu

ఎం కోటేశ్వరరావు
అన్నం ఉడికిందో లేదో చూడాలంటే ఒక్క మెతుకును చూస్తే చాలు అన్నది గత సామెత. ఇప్పుడు ప్రెషర్‌కుకర్లలో వండుతున్నందున వెలువడే మోతలు లేదా ఈలలను బట్టి ఉడికిందో లేదో చెప్పేయవచ్చు. ప్రస్తుతం జరుగుతున్న ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సమావేశాలలో చోటు చేసుకుంటున్న వాక్‌ ధ్వనులు, మోతలను బట్టి రాబోయే రోజుల్లో ఏమి జరగనుందో, ప్రజాప్రతినిధులు ఎలా ఉండబోతున్నారో ఇప్పటికే ఒక స్పష్టత వచ్చింది. ఆరు నెలలు గడిస్తే వారు వీరవుతారు, వీరు వారవుతారంటారు. అరునెలలకు ముందు అసెంబ్లీలో తెలుగుదేశం ఎలా వ్యవహరించిందో, ఆరునెలల తరువాత వైసిపి అదే విధంగా వ్యవహరించనున్నట్లు స్పష్టమైన సంకేతాలిచ్చింది.
మేము పరిశుద్ధ రాజకీయాలు చేస్తాము, కొత్త వరవడికి శ్రీకారం చుడతాము, మాటతప్పము మడమ తిప్పము అని చెప్పుకొనేందుకు వైసిపి నాయకత్వానికి నైతికంగా ఇంకే మాత్రం అవకాశం లేదు.తెలుగుదేశం పార్టీ సభ్యుడు వల్లభనేని వంశీమోహన్‌ తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్‌ అయ్యారు. అసెంబ్లీలో తనకు ప్రత్యేక స్ధానం కేటాయించమని అడగటం, స్పీకర్‌ తమ్మినేని సీతారాం సదరు సభ్యుడిని ప్రత్యేక సభ్యుడిగా గుర్తించటం వెంటనే జరిగిపోయింది. ఫిరాయింపుల నిరోధక చట్టం నిబంధనలను పట్టించుకోకుండా స్పీకర్‌ విచక్షణ అధికారాల మేరకు ఇది జరిగింది. వంశీమోహన్‌ వైసిపికి దగ్గర అయ్యారు, అసెంబ్లీ సభ్యత్వానికీ ఢోకా లేదు. అసెంబ్లీలో చంద్రబాబు మీద ధ్వజమెత్తటానికి ఒక సభ్యుడు తోడయ్యారు. కావాల్సిన కార్యాన్ని స్పీకర్‌ తీర్చారు
తెలుగుదేశం నుంచి ఎవరైనా ఎంఎల్‌ఏలు బయటకు వచ్చి సభ్యత్వాలను కోల్పోకుండా మరొక పార్టీలో చేరాలంటే ఒక కొత్త దారిని కనుగొన్నారు. దీనికి వైసిపి దారి లేదా జగన్‌ బాట అని పేర పెట్టవచ్చు. ఎవరైనా పార్టీ మారదలచుకుంటే నాయకత్వం గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడి సస్పెన్షన్‌కు గురి కావటం, తరువాత తమకు ప్రత్యేక స్ధానం కేటాయించాలని స్పీకర్‌ను కోరవచ్చు, నచ్చిన పార్టీతో కలసి ఊరేగవచ్చు అని తేలిపోయింది.అయితే వంశీ ఉదంతం తరువాత ఇతర ఎంఎల్‌ఏలు ఎవరైనా తమ నాయకత్వాన్ని ఎంతగా తూలనాడినా తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా వారిని సస్పెండ్‌ చేయకపోవచ్చు. అయితే అది ఎంతకాలం అన్నది ప్రశ్న. పార్టీ మారాలనుకున్న సభ్యులు సస్పెండ్‌ అయ్యే వరకు విమర్శలు, తిట్లదండకాన్ని కొనసాగిస్తే మీడియా, జనానికి ఉచిత వినోదాన్ని పంచినట్లు అవుతుంది. సస్పెండ్‌ చేస్తే ప్రత్యేక స్ధానాల సంఖ్య పెరుగుతుంది. అయితే ఈ సౌకర్యం ఎంఎల్‌సీలకు తాత్కాలికంగా ఉండకపోవచ్చు. ప్రస్తుతం శాసన మండలిలో తెలుగుదేశం పెద్ద పార్టీగా ఉంది, ఆ పార్టీకి చెందిన షరీఫ్‌ మహమ్మద్‌ మండలి చైర్మన్‌గా ఉన్నందున ప్రత్యేక స్ధానాలు కేటాయించే అవకాశం ఉండదు. అధికారపక్షం మెజారిటీ సాధించి మండలి చైర్మన్‌ను మార్చేవరకు లేదా షరీఫ్‌ మారు మనసు పుచ్చుకుంటే తప్ప అదే పరిస్ధితి కొనసాగుతుంది. అప్పటికి తెలుగుదేశం పార్టీలో ఎందరు మిగులుతారన్నది ప్రశ్న.

Image result for ys jagan vs chandrababu naidu
ఇక అసెంబ్లీ సమావేశాల తీరుతెన్నులను చూస్తే వైసిపి సభ్యులు దేవుని స్తుతి, సైతాను నింద కొనసాగించేందుకు అస్త్ర శస్త్రాలను సమకూర్చుకున్నట్లు కనిపిస్తోంది. వ్యవసాయ ప్రధానమైన ఆంధ్రప్రదేశ్‌లో పంటలు మార్కెట్‌కు రావటం ఇప్పుడే ప్రారంభమైంది. వాటిని అమ్ముకోవటం,గిట్టుబాటు ధరల సంగతి దేవుడెరుగు కనీసం మద్దతు ధరలు అయినా వస్తాయా అన్నది పెద్ద ప్రశ్నగా ముందుకు వస్తోంది. ఎన్నికల సమయంలో వైసిపి అభ్యర్ధులతో పాటు మద్దతుదారులు పెట్టిన పెట్టుబడులకు ఏదో ఒక రూపంలో లాభాలు వచ్చే విధంగా పాలకులు చూడగలరు గానీ, రైతాంగానికి ధరలు, మార్కెటింగ్‌ సౌకర్యం కల్పించే అవకాశాలు ఉండవు. ప్రభుత్వ విధానాల వలన తమకు నష్టం వస్తున్నట్లు గ్రహించిన తరువాత వైసిపి అభిమానం ఆవిరిగావటానికి ఎక్కువ సమయం పట్టదు. అసెంబ్లీ సమావేశాల్లో వాగ్వివాదాల హౌరులో వీటి గురించి పట్టించుకున్న దాఖలాలు కనిపించటం లేదు. తెలుగుదేశం నేతలపై ధ్వజం, గతపాలన తీరుతెన్నులను విమర్శిస్తూ వైసిపి ఎంతకాలం కాలం కాలక్షేపం చేయగలదు ?
దేన్నయినా మూసిపెడితే పాచిపోతుంది. ఇసుక విషయంలో ప్రభుత్వం అదే చేసింది. తీరా అది వివాదాస్పదం అయిన తరువాత ఎన్నడూ లేని విధంగా ఇసుక వారోత్సవాలను ప్రకటించాల్సి వచ్చింది. రాజధాని అమరావతి గురించి చంద్రబాబు నాయుడి పర్యటన తరువాత సిఆర్‌డిఏ పరిధిలో నిర్మాణాలను కొనసాగిస్తున్నట్లు ప్రకటించాల్సి వచ్చింది. రాజధానిపై ఇప్పటికీ స్పష్టత లేదు. మారుస్తామని మేమెక్కడ చెప్పామంటారు? రాజధాని అమరావతితో సహా రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి సూచనలు చేయాల్సిందిగా ఒక కమిటీని వేశామని, దాని సిఫార్సులు వచ్చిన తరువాత స్పష్టత వస్తుందని మరోవైపు చెబుతారు. రాష్ట్ర ప్రభుత్వం అంతిమంగా నిర్ణయాలు తీసుకొనే హక్కు, అవకాశం ఉన్నప్పటికీ ప్రధాన అంశాల మీద ప్రతిపక్షాలు, సామాజిక సంస్ధలు, ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకోవాలనే ప్రజాస్వామిక ప్రక్రియ పట్ల జగన్మోహనరెడ్డి సర్కార్‌కు విశ్వాసం, వైఖరి లేదనేది స్పష్టమైంది. నెలల తరబడి జాప్యం చేసి ప్రకటించిన ఇసుక విధానం, వివాదాస్పద ఆంగ్లమాధ్యమం అమలు- తెలుగు మాధ్యమ విద్యాబోధన ఎత్తివేత నిర్ణయాలు స్పష్టం చేశాయి.
వైఎస్‌ జగన్‌మోహనరెడ్డి తానొక ముఖ్యమంత్రి అని మరచిపోయినట్లున్నారు. దిశపై అత్యాచారం, హత్యకేసులో నిందితులుగా ఉన్న నలుగురిని ఎన్‌కౌంటర్‌పేరుతో పోలీసులు హత్యచేస్తే అసెంబ్లీ సాక్షిగా ఆచర్యను సమర్ధించటం, తెలంగాణా ప్రభుత్వం, పోలీసులకు అభినందనలు చెప్పటం, ఎన్‌కౌంటర్‌ ఉదంతంపై విచారణకు రాజ్యాంగబద్ద సంస్ధ జాతీయ మానవహక్కుల సంఘం విచారణకు రావటాన్ని తప్పు పట్టటం రాజ్యాంగబద్ద పదవిలో ఉన్నవారు చేయాల్సింది కాదు. ఏ ముఖ్య మంత్రీ గర్హనీయమైన ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదు
కేంద్రంతో ప్రతి విషయం మీద ఘర్షణ పడాలని ఎవరూ కోరుకోరు. కేంద్రంలో ఉన్న అధికార పార్టీ అడుగులకు మడుగలొత్తటం, మోసేందుకు పోటీపడటం ఆంధ్రప్రదేశ్‌లోని మూడు ప్రధాన పార్టీల వైఖరిగా ఉంది. వివాదాస్పద అంశాలైన ఆర్టికల్‌ 370, కాశ్మీరు రాష్ట్ర రద్దు, పౌరసత్వ సవరణ బిల్లువంటి మీద కేంద్రానికి మద్దతు ఇచ్చేందుకు తెలుగుదేశం, వైసిపి పోటీ పడ్డాయి. కనీసం తటస్ధంగా కూడా లేవు. ‘బిజెపికి నేను ఎప్పుడు దూరమయ్యాను? దగ్గరగానే ఉన్నా. రాష్ట్రానికి ప్రత్యేక హౌదా కోసం కేంద్రంతో విభేదించాను. అమిత్‌షా అంటే నాకు అమితమైన గౌరవం. వైసిపి వాళ్లకు ఆయనంటే భయం. ప్రజలు బిజెపిని మంచి మోజార్టీతో రెండోసారి అధికారంలో కూర్చోబెట్టారు, మోడీ అమిత్‌షా దేశ ప్రయోజనాలు, దేశ రక్షణ కోసం పాటుపడుతున్నారు. నేను సెక్యులరిస్టును. ఓట్లు వచ్చినా, రాకపోయినా నేను నమ్మే హిందూ సిద్ధాంతం గురించి మాట్లాడుతున్నాను. హిందూధర్మ పరిరక్షణ గురించి నేను మాట్లాడితే, దాన్ని వక్రీకరించి వైసిపి అసత్య ప్రచారం చేసింది. ఎవరైనా సరే మత విశ్వాసాలను గౌరవించి తీరాల్సిందే. ‘మీరు టిడిపి, బిజెపితో పొత్తు పెట్టుకుంటారా?’ అని విలేకర్లు అడిగిన ప్రశ్నకు ‘చెప్పలేం… ఉండొచ్చు ఏమో… ఉత్తరప్రదేశ్‌లో మాయావతి దళిత, బలహీన వర్గాల కోసం పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చింది. రెండోసారి అధికారం కోసం ఎవరిని పక్కన పెట్టి పార్టీని స్థాపించిందో ఆ బ్రాహ్మణులను అక్కున చేర్చుకుంది, రాజకీయాలు ఇలా ఉంటాయంటూ జనసేన నేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ఇంత చక్కటి తెలుగులో చెప్పిన తరువాత దానికి టీకా తాత్పర్యాలు అవసరం లేదు. పవన్‌ కల్యాణ్‌ బాట చే గువేరాతో ప్రారంభమై అమిత్‌ షా వైపు పయనిస్తున్నదని మరొకరు చెప్పనవసరం లేదు.
ఆంధ్రప్రదేశ్‌లో బిజెపి బలపడాలంటే దానికి రాష్ట్రంలో అధికారం కూడా ముఖ్యం. పార్లమెంట్‌ సభ్యులు ఏ పార్టీలో ఉన్నా వారిని ఆకర్షించటం దానికి పెద్ద కష్టం కాదు. ఎందుకంటే వారిలో చాలా మంది ఆర్ధిక లావాదేవీలు ఎక్కువ భాగం రాష్ట్రం వెలుపలే ఉంటాయి లేదా వారి లాబీ కంపెనీలు ఎక్కడైనా ఉండవచ్చు గనుక కేంద్రంతోనే ఎక్కువ అవసరాలుంటాయి. దీనికి వైసిపి ఎంపీలు అతీతులు కాదు గనుక కొత్తగా ఎంపీలైనవారు, పారిశ్రామిక, వాణిజ్యాలను ఇంకా ప్రారంభించని వారు మినహా మిగిలిన వారు జగన్‌తో కంటే నరేంద్రమోడీ, అమిత్‌ షాలకే గ్గరగా ఉంటారన్నది జగమెరిగిన సత్యం.
రాష్ట్రంలో స్ధానిక నేతలు బిజెపిలోకి రావాలంటే వారికి రాష్ట్రంలో అధికారం ముఖ్యం. అది ఉంటేనే వారికి లాభం. తెలుగుదేశం పార్టీతో ఆ పార్టీ అధికారాన్ని పంచుకున్నపుడు ఇదే రుజువైంది. అందుకే పవన్‌ కల్యాణ్‌ను ఒకవైపు రంగంలోకి దించి మరోవైపున వైసిపిని దారికి తెచ్చుకొనే ఎత్తుగడ ఉన్నట్లు భావిస్తున్నవారు కూడా లేకపోలేదు. తమ ప్రయోజనం నెరవేర్చుకొనేందుకు ఎన్ని పార్టీలు, ఎన్నికశక్తులనైనా తన మందలో చేర్చుకోగల శక్తి కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి సహజంగానే ఉంటుంది. వైఎస్‌ జగన్‌ మీద ఇప్పటికే కావలసినన్ని కేసులు ఉన్నందున బిజెపి పని సులువు అవుతుందని వేరే చెప్పనవసరం లేదు. ఆ వత్తిడిని తట్టుకొని వైసిపి ఎంతకాలం నిలుస్తుందో చెప్పలేము.
రక్తం రుచి మరిగిన పులిని బోనులో బంధిస్తే దాన్నుంచి బయట పడేందుకు ప్రయత్నిస్తుంది. అలాగే వైసిపిలో అధికార రుచిమరగిన నేతలకు కొదవలేదు. అవినీతికి దూరంగా ఉండాలని వైసిపి నాయకత్వం ఎంతగా చెబితే అంతగా వారిలో అసహనం పెరుగుతుంది. అవకాశాల కోసం ఎదురు చూస్తున్నట్లు ఎవరిని కదిలించినా ఇట్టే తెలిసిపోతుంది. ఆనం రామనారాయణ రెడ్డి వంటి సీనియర్‌ నేత నెల్లూరు జిల్లాలో పరిస్ధితి గురించి బహిరంగంగానే బయటపడ్డారు. అలాంటి వారిని తాత్కాలికంగా నోరు మూయించగలరు తప్ప ఎక్కువ కాలం కట్టడి చేయగలరా ? ప్రభుత్వ వైఫల్యాలు పెరుగుతున్న కొద్దీ, పార్టీలో, ప్రభుత్వంలో అధికార కేంద్రాలు కుదురుకున్నతరువాత వాటిలో చోటు దక్కని వారిని అదుపు చేయటం అంత తేలిక కాదు.

Image result for ys jagan vs chandrababu naidu
కేంద్రం నుంచి రావాల్సిన నిధుల గురించి బడ్జెట్‌లో చూపిన మేరకు వచ్చే అవకాశ ం లేదని ఇప్పటికే తేలిపోయింది. అందువలన ప్రకటించిన లేదా అమలు జరుపుతున్న పధకాలకు కోత పెట్టటం అనివార్యం. అదే జరిగితే జనంలో అసంతృప్తి ప్రారంభం అవుతుంది. పార్టీ క్యాడర్‌లో, జనంలో అలాంటి పరిస్ధితి ఏర్పడితే ఇంక చెప్పాల్సిందేముంటుంది ? ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో గతంలో తెలుగుదేశం-చంద్రబాబు నాయకత్వ వైఖరి, తీరు తెన్నులను విమర్శించిన వారు, ఇప్పుడు వైసిపి-జగన్‌ నాయకత్వ తీరు తెన్నులను హర్షిస్తారనుకుంటే భ్రమలో ఉన్నట్లే !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...
← Older posts

Recent Posts

  • మనవాళ్లు వట్టి వెధవాయి లోయి అన్న గిరీశాన్ని గుర్తుకు తెస్తున్న వాట్సాప్‌ పండితులు !
  • బిజెపి మిత్రోం అదానీ, బికినీలను కాదు సామాన్య జనాన్ని చూడండి !
  • వైవిధ్య సమస్యలతో ప్రపంచ వ్యవసాయ రంగం !
  • రష్యా – జర్మనీలను శాశ్వత శత్రు దేశాలుగా మార్చే అమెరికా కుటిల పన్నాగం !
  • అక్రమం జరిగిందా లేదా విచారణకు ఆదేశిస్తారా లేదా : అదానీ కంపెనీలపై నోరు విప్పని ప్రధాని నరేంద్రమోడీ !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • మనవాళ్లు వట్టి వెధవాయి లోయి అన్న గిరీశాన్ని గుర్తుకు తెస్తున్న వాట్సాప్‌ పండితులు !
  • బిజెపి మిత్రోం అదానీ, బికినీలను కాదు సామాన్య జనాన్ని చూడండి !
  • వైవిధ్య సమస్యలతో ప్రపంచ వ్యవసాయ రంగం !
  • రష్యా – జర్మనీలను శాశ్వత శత్రు దేశాలుగా మార్చే అమెరికా కుటిల పన్నాగం !
  • అక్రమం జరిగిందా లేదా విచారణకు ఆదేశిస్తారా లేదా : అదానీ కంపెనీలపై నోరు విప్పని ప్రధాని నరేంద్రమోడీ !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • మనవాళ్లు వట్టి వెధవాయి లోయి అన్న గిరీశాన్ని గుర్తుకు తెస్తున్న వాట్సాప్‌ పండితులు !
  • బిజెపి మిత్రోం అదానీ, బికినీలను కాదు సామాన్య జనాన్ని చూడండి !
  • వైవిధ్య సమస్యలతో ప్రపంచ వ్యవసాయ రంగం !
  • రష్యా – జర్మనీలను శాశ్వత శత్రు దేశాలుగా మార్చే అమెరికా కుటిల పన్నాగం !
  • అక్రమం జరిగిందా లేదా విచారణకు ఆదేశిస్తారా లేదా : అదానీ కంపెనీలపై నోరు విప్పని ప్రధాని నరేంద్రమోడీ !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Follow Following
    • vedika
    • Join 234 other followers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Customize
    • Follow Following
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d bloggers like this: