• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Monthly Archives: January 2020

ఎన్‌ఆర్‌సి : నరేంద్రమోడీని నిలువరించే సమయం ఆసన్నం !

30 Thursday Jan 2020

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

#CAA Protest, CAA, Narendra Modi, NPR, NRC, Shaheen Bagh, Shaheen Bagh protest

Image result for shaheen bagh"
స్వామినాధన్‌ ఎస్‌ అంక్లేసరియా అయ్యర్‌
జనవరి 26,రిపబ్లిక్‌ దినోత్సవం రోజున రాజ్యాంగం ప్రసిద్దికెక్కుతుంది. కానీ న్యూఢిల్లీలోని షాహీన్‌బాగ్‌లో డిసెంబరు 15నే ఆ ఉత్సవం ప్రారంభమైంది. పౌరసత్వ సవరణ చట్టానికి(సిఎఎ) వ్యతిరేకంగా జామియా మిలియా ఇస్లామియా విద్యార్ధుల ప్రదర్శనను చెదరగొట్టేందుకు పోలీసులు ప్రదర్శించిన క్రూరత్వానికి నిరసనగా ముస్లిం మహిళలు ఒక ముఖ్యమైన రోడ్డు మీద ధర్నా ప్రారంభించారు. అయితే అది వెంటనే తాము కూడా రాజ్యాంగానికి బద్దులమైన దేశభక్తులమే అని, దాన్ని ఉల్లంఘిస్తున్న అధికారంలోని వారికి వ్యతిరేకంగా రాజ్యాంగాన్ని రక్షించుకుంటామంటూ ముస్లింల ఉద్రేకపూరితమైన దేశవ్యాపిత ఆందోళనకు మొగ్గ తొడిగింది.
షాహీన్‌బాగ్‌ను సందర్శించిన వారు ఐదువందల మంది మహిళలు ఎంతో కాలం నిలవలేరు లేదా పెద్ద ప్రభావం చూపలేరు అనుకోవచ్చు. వాస్తవానికి షాహీన్‌బాగ్‌ భారత్‌ను మార్చింది. ఒకనాడు నిర్నినిరోధక శక్తి అనుకున్న నరేంద్రమోడీని నిలువరించే సమయం ఆసన్నమైందంటోంది.
పార్లమెంట్‌లో సిఎఎ గురించి చర్చ జరిగినపుడు ప్రతిపక్ష పార్టీలు దానికి వ్యతిరేకంగా గట్టిగా అభ్యంతరం చెబితే తమను ఎక్కడ దేశవ్యతిరేకులు అంటారోనని పిరికిబారినట్లు కనిపించింది. కానీ తరువాత అనేక నగరాలలో విద్యార్ధుల నిరసనలు చెలరేగాయి. తొలుత షాహీన్‌బాగ్‌లో ముస్లిం మహిళల ప్రదర్శన తరువాత బిజెపి పాలిత రాష్ట్రాలన్నింటా ప్రారంభమయ్యాయి. సిఏఏ రాజ్యాంగవ్యతిరేకమని తిరస్కరిస్తూ గళం విప్పేందుకు ప్రతిపక్షాలను ఇది ఉద్యుక్తులను గావించింది. బిజెపియేతర పాలిత రాష్ట్రాలలో జాతీయ పౌర చిట్టా(ఎన్‌ఆర్‌సి)ను అమలు జరిపేందుకు తిరస్కరించేట్లు చేసింది. దీన్ని అమలు జరపబోమనే దాని అర్ధం సిఎఎ అమలు సాధ్యం కానిదని చెప్పటమే. ఇది షాహీన్‌బాగ్‌లోని మహిళలకు ఒక అపూర్వ విజయమే.
రిపబ్లిక్‌ దినోత్సవం రోజు కేరళలో 620కిలోమీటర్ల పొడవున నిర్వహించిన మానవహారంలో మిలియన్ల మంది పాల్గొన్నారు, కొల్‌కతాలో పదకొండు కిలోమీటర్ల హారాన్ని నిర్వహించారు. ఇంతటి ఉద్రేకపూరితమైన, విస్తృత నిరసనను గతంలో ఎన్నడూ ప్రభుత్వం ఎదుర్కోలేదు.హింసకు గురైన హిందువులకు హానిలేని పద్దతిలో సాయం చేసేందుకే సిఎఎ అని చెప్పుకోవటాన్ని ప్రపంచవ్యాపితంగా అపహాస్యం చేస్తూ కొట్టివేశారు. మానవ హక్కుల ఉల్లంఘనకు భారత్‌ పాల్పడిందని మీడియా, అమెరికా, ఐరోపా యూనియన్‌, ఆసియాలోని అగ్ర రాజకీయవేత్తల నిందకు దేశం గురైంది.
భారత్‌లో మానవహక్కుల ఉల్లంఘన జరిగిందని మలేసియా ప్రధాని విమర్శించినందుకు ఆ దేశం నుంచి పామ్‌ ఆయిల్‌ దిగుమతుల నిలిపివేత ద్వారా బిజెపి దెబ్బతీసింది. మిలియన్ల మంది భారత ముస్లింల వద్ద సరైన పత్రాలు లేవనే పేరుతో ఎన్‌ఆర్‌సి, సిఎఎ అనే పట్టకారులతో అదుపు చేయటం మరియు పౌరసత్వ రద్దుకు పూనుకున్నారని భావిస్తున్న విమర్శకులను ఒప్పించటానికి ఇది మార్గం కాదు.అసోంలో ఎన్‌ఆర్‌సి ప్రక్రియ పన్నెండులక్షల మంది హిందువులు, ఏడు లక్షల మంది ముస్లింలతో సహా 19లక్షల మంది దగ్గర సరైన పత్రాలు లేవని వెల్లడించింది. బంగ్లాదేశ్‌ నుంచి ”అక్రమంగా ప్రవేశించిన వారు మరియు చెదలు ”గా వర్ణించిన వారిని ఏరివేసేందుకు ఉద్దేశించిన ప్రక్రియలో ఆధారాలు లేని పేదలు దొరికిపోయారు. నమోదు తక్కువగా ఉండే దేశంలో ఇది సాధారణం.
అసోం అనుభవాన్ని బట్టి జాతీయ స్ధాయిలో ఎన్‌ఆర్‌సి ఖర్చు యాభైవేల కోట్ల రూపాయలు కాగలదు, ఎనిమిది కోట్ల మంది నమోదు పత్రాలు లేని వారిని తేల్చుతుంది. మిలియన్ల మంది ముస్లింలను ఖైదు చేయవచ్చనే ఆలోచనతో కొంతమంది రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఫ్‌ు సభ్యులు ఉప్పొంగిపోవచ్చు, అది సరైనదే అనుకోవచ్చుగానీ ప్రపంచంలో దేశ గౌరవం మట్టి కొట్టుకుపోతుంది.


జరుగుతున్న ఆందోళన దేశ వ్యతిరేక విద్రోహం అని బిజెపి చిత్రిస్తున్నది. ఆ ప్రాంతానికి వెళ్లిన వారికి రాజ్యాంగ పీఠికలోని అంశాలను పెద్ద ఎత్తున ప్రదర్శించే బ్యానర్లు,చిత్రాలు, బోర్టులు కనిపిస్తాయి. దేశ భక్తియుతమైన జాతి పౌరులుగా వాటిని పరిరక్షిస్తామంటూ ముస్లింలు ” భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని ఆలోచన, భావ ప్రకటన, విశ్వాసం, ధర్మం, ఆరాధనలలో స్వాతంత్య్రాన్ని చేకూర్చుటకు, వారందరిలో వ్యక్తి గౌరవమును, జాతి ఐక్యతను, అఖండతను తప్పక సంరక్షిస్తూ సౌభ్రాత్వత్వాన్ని పెంపొందించుటకు సత్యనిష్టా పూర్వకంగా తీర్మానించుకొని 26 నవంబరు 1949న మన రాజ్యాంగ పరిషత్తులో పరిగ్రహించి శాసనంగా రూపొందించుకొన్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకుంటున్నాం. ” అనే పీఠికను, రాజ్యాంగాన్ని పారాయణం చేయటం చూస్తారు.
ఈ 85పదాలను నిరసన కేంద్రాలలో కేవలం బ్యానర్ల మీద పెద్దగా ప్రదర్శించటమే కాదు, వాటిని ముద్రించిన దాదాపు పదిలక్షల టీషర్టులు పెద్ద ప్రయత్నం చేయకుండానే అమ్ముడు పోయాయి. షాహీన్‌ బాగ్‌ ఇస్లామిక్‌ తీవ్రవాదుల సొమ్ముతో ఏర్పడిన ఒక చిన్న పాకిస్ధాన్‌ అని బిజెపి ప్రతినిధి చిత్రించారు. రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తున్న ఉద్యమానికి పాకిస్ధాన్‌ నిధులు అందచేస్తున్నదని బిజెపి నిజంగానే అనుకుంటున్నదా ? ముస్లింలు నిబద్దులైన దేశభక్త భారతీయులని షాహిన్‌బాగ్‌ చెప్పటం లేదా ? మహాత్మా గాంధీ, బిఆర్‌ అంబేద్కర్‌, సుభాష్‌ చంద్రబోస్‌, భగత్‌ సింగ్‌, సరోజిని నాయుడు బోధనలకు కట్టుబడి లేదా ? షాహీన్‌బాగ్‌ వేదికమీద అలంకరించిన ఈ దిగ్గజాల పెద్ద చిత్రాలు మాట్లాడుతున్నాయి. మహిళలు వంతుల వారీగా ప్రతి రెండు మూడు గంటలకు వచ్చిపోతున్నారు, కాబట్టి గుడారం ఎప్పుడూ నిండుగా ఉంటోంది. ఆందోళన నిరంతరం కొనసాగనున్నట్లు సూచిస్తున్నది. ‘నేను భారత్‌ను ప్రేమిస్తున్నాను ‘ అని మహిళలు ధరించిన తల నాడాలు(హెడ్‌బాండ్స్‌) చెబుతున్నాయి, జాతీయ పతాకాలను ప్రదర్శిస్తున్నారు, జాతీయ గీతాన్ని ఆలపిస్తున్నారు. బిజెపి పర్యవేక్షణలో ఉన్న దేశ భక్తిని వారు అపహరించారు.
ప్యాసా సినిమాలో గురుదత్‌ పాటను తెలివిగా మలచి ఏర్పాటు చేసిన బ్యానర్‌ నాకు నచ్చింది. ” జిన్హే నాజ్‌ హై హింద్‌ పార్‌, ఓ కహా హై… కహా హై….కహా హై…( ఆ భారత స్వాభిమానాలు ఎక్కడ ? అవి ఎక్కడ ఉన్నాయి? అవి ఎక్కడ ఉన్నాయి? అవి ఎక్కడ ఉన్నాయి?) దానిని షాహిన్‌ బాగ్‌లో ఇలా రాశారు. జిన్హే నాజ్‌ హై హింద్‌ పార్‌, ఓ కహా హై…యహా హై…యహా హై….యహా హై….( ‘ ఆ భారత స్వాభిమానాలు ఎక్కడ ? అవి ఎక్కడ ఉన్నాయి? అవి ఇక్కడ ఉన్నాయి, అవి ఇక్కడ ఉన్నాయి, అవి ఇక్కడ ఉన్నాయి).

Image result for shaheen bagh"
ఇటీవలి కాలంలో అనేక తీర్పుల విషయానికి వస్తే సుప్రీం కోర్టు బిజెపి వైపు మొగ్గుతున్నట్లు కనిపించింది.రాజకీయ వాతావరణానికి కోర్టులు ప్రభావితమౌతాయని ప్రపంచ అనుభవం చూపుతోంది. 2019 సాధారణ ఎన్నికల్లో బిజెపి ఒక పెనుగాలి మాదిరి సులభంగా విజయం సాధించింది. ప్రతిపక్ష పార్టీలు తమ గాయాలను మాన్చుకుంటూ పార్లమెంట్‌లో సిఎఎను దాదాపు ప్రతిఘటించలేదు. కానీ ప్రతి పక్షాలు మరోసారి గళమెత్తటానికి విద్యార్ధులు, షాహిన్‌బాగ్‌ మహిళలు సాయం చేశారు. రాజ్యాంగ హక్కుల రక్షణ పట్ల తల ఒగ్గని సుప్రీం కోర్టు కూడా తన గళాన్ని విప్పుతుందని ఆశిస్తున్నాను.

గమనిక: స్వామినాధన్‌ ఎస్‌ అంక్లేసరియా అయ్యర్‌ ప్రముఖ జర్నలిస్టు. ఎకనమిక్‌ టైమ్స్‌, టైమ్స్‌ఆఫ్‌ ఇండియా కన్సల్టింగ్‌ ఎడిటర్‌గా పని చేశారు. ఆయన రాసిన ఈ వ్యాసం తొలుత ఎకనమిక్‌ టైమ్స్‌ వెబ్‌సైట్‌లో జనవరి 28వ తేదీన ప్రచురితమైనది,దానికి ఇది అనువాదం, శీర్షిక మార్చటమైనది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

తగ్గిన కారు వేగం – వేగిరంగా కెటిఆర్‌ పట్టాభిషేకం !

26 Sunday Jan 2020

Posted by raomk in Current Affairs, History, Political Parties, Telangana

≈ Leave a comment

Tags

KCR, KTR, Telagana politics, Telangana CM, Telangana Municipal Election Results

Image result for kcr, ktr
ఎం కోటేశ్వరరావు ,
తెలంగాణాలో పట్టణ స్ధానిక సంస్ధల ఎన్నికలలో ప్రధాన అధ్యాయం ముగిసింది. ఎన్నికల చట్టం లేదా నిబంధనావళిలో ఉన్న లొసుగును ఆధారం చేసుకొని ఓటింగ్‌ హక్కు ఉన్న ఎక్స్‌ అఫిసియో సభ్యులైన ఎంపీ, ఎంఎల్‌ఏ, ఎంఎల్‌సీలు ఫలితాలు వెలువడిన తరువాత అధికార పార్టీకి అవసరమైన చోట ఓటు వేసేందుకు వీలుగా తాము ఎక్కడ ఓటు వేయబోయేది తెలియ చేశారు. సరే క్యాంపు రాజకీయాల గురించి చెప్పనవసరం లేదు. అధికార పార్టీలో ముఠా తగాదాలను సర్దుబాటు (అది ఎలా అన్నది అందరికీ తెలిసిందే) కోసం క్యాంపులను నిర్వహిస్తే తమ వారిని లేదా తమకు మద్దతు ఇచ్చే వారిని ఎక్కడ పాలకపార్టీ తన్నుకుపోతుందో అన్న భయంతో ప్రతిపక్ష కాంగ్రెస్‌ కూడా పరిమితంగా అయినా క్యాంపులను నిర్వహించకతప్పలేదు.
ఇప్పుడు అధికార తెరాస సాధించిన విజయం కంటే యువరాజు కెటిఆర్‌ పట్టాభిషేకం ఎప్పుడు జరగనుందా అన్న అంశమే ఎక్కువగా రాజకీయ వర్గాలలో చర్చించుకుంటున్నారా ? హంగ్‌ ఏర్పడిన చోట ఏమి జరగనుందో అన్న స్ధానిక ఉత్సుకత తప్ప మున్సిపల్‌ చైర్మన్లు, చైర్‌ పర్సన్స్‌, కార్పొరేషన్ల మేయర్‌ ఎన్నికల అనంతరం అసలైన చర్చ కెటిఆర్‌ ముఖ్యమంత్రిగా ఎప్పుడు కానున్నారో అన్నదే అసలైన ఆసక్తి అనటం అతిశయోక్తి కాదు. ఆయనకు బ్రహ్మరధం పట్టటం అప్పుడే ఆరంభమైంది. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లోపే ఆ పని చేస్తారా లేక తరువాతనా అన్నది తప్ప పట్టాభిషేకం ఖాయం అన్నది స్పష్టమని విశ్లేషకులు చెబుతున్నారు.
దవోస్‌లో జరిగిన ప్రపంచ వాణిజ్య వేదిక సమావేశాల్లొ కెటిఆర్‌ పాల్గొని అక్కడ పలువురు కార్పొరేట్ల ప్రతినిధులను కలసి రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రయత్నించినట్లు మీడియా పెద్ద ఎత్తున వార్తలు ఇచ్చింది. దేశంలో ఆర్ధిక మాంద్యం ఏర్పడిన స్ధితిలో ప్రతి కార్పొరేట్‌ సంస్ద ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటోంది. రెండవది కేంద్రంలోని బిజెపి సర్కార్‌ సామాజిక విభజన, అశాంతికి కారణమయ్యే నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పోతోంది. ఈ పూర్వరంగంలో పెట్టుబడులు ఏమేరకు వస్తాయన్నది ప్రశ్నార్ధకమే. పక్కనే ఉన్న ఆంధ్రప్రదే శ్‌ ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు నాయుడు ప్రతి ఏటా దవోస్‌ వెళ్లి ఆర్భాటం చేసి వచ్చే వారు. అయినా ఆంధ్రప్రదే శ్‌కు వచ్చింది వట్టిస్తరి, మంచినీళ్లు మాత్రమే.
గత చరిత్రలో ఒక రాజు లేదా యువరాజు పట్టాభిషేకం సమయంలో దేశ పరిస్ధితులు, ఇరుగు పొరుగు రాజుల కదలికలు తదితర అంశాల గురించి మదింపు వేసేవారు. ఇప్పుడు రాజులు, రాజ్యాలు లేకపోయినా రాజకీయ పార్టీలలో వారసత్వాలు ప్రారంభమై కొనసాగుతున్న విషయం దాస్తే దాగేది కాదు. ప్రాంతీయ పార్టీలలో అది మరీ ఎక్కువగా కనిపిస్తోంది. ప్రారంభంలో ఏ లక్ష్యంతో, ఏ వాగ్దానాలతో ప్రారంభమైనా కొంత కాలం తరువాత అవి కుటుంబ పార్టీలుగా మారిపోవటం అన్ని రాష్ట్రాలలో చూస్తున్నదే. ఈ కారణంగానే కెటిఆర్‌ పట్టాభిషేకం గురించి మాట్లాడాల్సి వస్తోంది. ఒక విజయాన్ని పోల్చవలసి వచ్చినపుడు ఏదో ఒక ప్రాతిపదికను తీసుకోవాల్సి ఉంటుంది. దాంతో ఎవరైనా విబేధిస్తే చేయగలిగిందేమీ లేదు.
2019లో గ్రామీణ స్థానిక సంస్థలైన మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ పార్టీ ఘనవిజయాలు సాధించింది. మొత్తం 32 జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పదవులను టిఆర్‌ఎస్‌ దక్కించుకుంది. 537 జిల్లా పరిషత్‌ ప్రాదేశిక నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగితే, టిఆర్‌ఎస్‌ 448 స్థానాలు (83.42 శాతం) దక్కించుకుంది. కాంగ్రెస్‌ కేవలం 75 స్థానాలు (13.96 శాతం), బిజెపి 8 స్థానాలు (0.14శాతం) దక్కించుకోగలిగాయి.
రాష్ట్రంలో మొత్తం 5,817 మండల పరిషత్‌ ప్రాదేశిక నియోజకవర్గాలకు (ఎంపిటిసి) ఎన్నికలు జరగగా, టిఆర్‌ఎస్‌ 3,556 స్థానాలు (61.13) దక్కించుకుంది. కాంగ్రెస్‌ 1,377 స్థానాలు (23.67 శాతం), బిజెపి 211 స్థానాలు (3.62 శాతం) గెలుచుకోగలిగాయి. మొత్తం 537 మండల పరిషత్‌ అధ్యక్ష పదవులకు గాను, టిఆర్‌ఎస్‌ 431, కాంగ్రెస్‌ 72, బిజెపి 6 చోట్ల ఎంపిపిలుగా గెలిచారు.
2016లో జరిగిన గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జిహెచ్‌ఎంసి) ఎన్నికల్లో కూడా టిఆర్‌ఎస్‌ ఘనమైన రికార్డు విజయం సాధించింది. 150 వార్డులకు గాను, టిఆర్‌ఎస్‌ పార్టీ 99 స్థానాలు, తన మిత్రపక్షమైన ఎంఐఎం 44 స్థానాలు దక్కించుకుంది. కాంగ్రెస్‌ పార్టీ రెండు, బిజెపి 4, టిడిపి 1 స్థానం పొందాయి. జిహెచ్‌ఎంసి చరిత్రలో ఒక రాజకీయ పార్టీ ఇన్ని స్థానాలు దక్కించుకోవడం, ఎవరితో పొత్తు లేకుండానే మేయర్‌ స్థానం దక్కించుకోవడం అదే మొదటి సారి.
2018 డిసెంబర్లో 119 స్థానాలున్న తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో అధికార టిఆర్‌ఎస్‌ పార్టీ ఏకపక్ష విజయం సాధించి, రెండో సారి అధికారంలోకి వచ్చింది. ఈ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ పార్టీ 46.87 శాతం ఓట్లు సాధించి, 88 స్థానాలు దక్కించుకుంది. కాంగ్రెస్‌ పార్టీ 28.43 శాతం ఓట్లు పొంది, 19 స్థానాలు గెలుచుకుంది. బిజెపి 6.98 శాతం ఓట్లు మాత్రమే పొంది, కేవలం ఒకే సీటుకు పరిమితం అయింది. ఎంఐఎం 2.71 శాతం ఓట్లు పొంది, 7 స్థానాలు గెలుచుకుంది.
2019 పార్లమెంటు ఎన్నికల్లో దేశవ్యాప్తంగా నరేంద్రమోడీ హవా, బిజెపి ప్రభావం కనిపించినా తెలంగాణలో మాత్రం టిఆర్‌ఎస్‌ ఆధిక్యం కొనసాగింది. 17 లోక్‌ సభ స్థానాలున్న తెలంగాణలో టిఆర్‌ఎస్‌ పార్టీ 41.71 శాతం ఓట్లు సాధించి 9 స్థానాలు గెలుచుకుంది. కాంగ్రెస్‌ పార్టీ 29.79 శాతం ఓట్లతో 3 స్థానాలు, బిజెపి 19.65 శాతం ఓట్లతో 4 స్థానాలు, ఎంఐఎం 2.8 శాతం ఓట్లతో ఒక సీటు గెలిచింది. ఈ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ ఓటింగ్‌ శాతం అసెంబ్లీతో పోలిస్తే ఐదుశాతం తగ్గగా కాంగ్రెస్‌ ఒకశాతం ఓట్లను పెంచుకుంది. బిజెపి అసాధారణంగా పన్నెండుశాతానికి పైగా ఓట్లు పెంచుకుంది. అయితే అది తరువాత జరిగిన గ్రామీణ స్ధానిక సంస్ధల ఎన్నికల్లో బొక్కబోర్లా పడింది. లోక్‌సభలో వచ్చిన ఓట్లకు అనుగుణ్యంగా గ్రామీణ ఎన్నికల్లో దానికి సీట్లు రాలేదు.

Image result for kcr, ktr
గ్రామీణ ఎన్నికలు జరిగిన ఆరు నెలల్లోపే పట్టణ ప్రాంతాల్లో జరిగిన ఎన్నికల తీరు తెన్నులతో పోల్చితే కారు వేగం బాగా తగ్గింది. ఇది యువరాజుకు రుచించని వ్యవహారమే. వంది మాగధులకు వాస్తవాలతో పని ఉండదు కనుక భజన చేస్తారు, ఒక కోణాన్ని చూపి బొమ్మ మొత్తం అదే విధంగా ఉందని మనల్ని నమ్మమంటారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కలిపి తెరాసకు 41.14శాతం, కాంగ్రెస్‌కు 19శాతం, బిజెపికి 17.80శాతం, మజ్లిస్‌కు 4.17 రాగా ఇతరులకు 17.86 శాతం వచ్చాయి.

మున్సిపాలిటీల వారీ పార్టీల ఓట్లశాతాలు
పార్టీ         50శాతంపైన 40-50 30-40 20-30 10-20 10శాతం కంటే తక్కువ
తెరాస          28            71      20       0       1          1
కాంగ్రెస్‌         1             10      35     30     26         18
బిజెపి            0              3        4     14     40         59
మజ్లిస్‌           0              0        2       1      2          40
ఇతరులు       1              2       11     17     48        41
పురపాలక సంఘాలలోని 2727 వార్డులలో తెరకు 1579 అంటే 57.87శాతం, కాంగ్రెస్‌కు 541(19.80) ఇతరులు 300(11.01) బిజెపి 236(8.61) మజ్లిస్‌ 71(2.60) సీట్లు వచ్చాయి. కార్పొరేషన్ల విషయానికి వస్తే కరీంనగర్‌ మినహా తొమ్మిదింటిలో 325 స్ధానాలకు గాను తెరాస 152(47.38) బిజెపి 66(20.30), ఇతరులు 49(15.07) కాంగ్రెస్‌ 41(12.61) మజ్లిస్‌ 17(5.29) తెచ్చుకున్నాయి. మున్సిపల్‌, కార్పొరేషన్ల ఫలితాలను కలిపి చూస్తే తెరాసకు 52.62, కాంగ్రెస్‌కు 16.2, బిజెపికి 14.45 శాతం వచ్చాయి. గ్రామీణ ఎన్నికల్లో మండల ప్రాదేశిక నియోజక వర్గాలను ప్రాతిపదికగా తీసుకుంటే తెరాస సీట్ల శాతం 61.13 నుంచి 52.62కు పడిపోయింది. ఇదే సమయంలో కాంగ్రెస్‌ బలం 23.67 నుంచి 16.2కుతగ్గింది, మరోవైపు బిజెపి 3.62 నుంచి 14.45శాతానికి పెంచుకుంది, ఇదే సమయంలో బిజెపి అధికార పార్టీకి తామే ప్రత్యామ్నాయం అని లోక్‌సభ ఎన్నికల నుంచీ చెబుతున్న బిజెపి ఆ స్ధితిలో లేదని ఈ ఎన్నికలు స్పష్టం చేశాయి. పార్టీ 2727 మున్సిపల్‌ స్ధానాల్లో 2025 చోట్ల పోటీ చేసింది. 120 పురపాలక సంఘాలకు గాను 45, తొమ్మిదింటిలో రెండు కార్పారేేషన్లలో అసలు ఖాతాయే తెరవలేదు. కాంగ్రెస్‌ విషయానికి వస్తే 14 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్‌లో ప్రాతినిధ్యం పొందలేకపోయింది. ఆ పార్టీ తాము గెలుస్తామని ఆశలు పెట్టుకున్న ప్రాంతాలకు బదులు ఇతర చోట్ల అనూహ్య ఫలితాలను పొందింది. పార్టీ ఎంపీలు ఉన్న ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌లలో దానికి ఆశించిన ఫలితాలు రాలేదు. నిజామాబాద్‌లో కాంగ్రెస్‌ లేదా కాంగ్రెస్‌ అభ్యర్ధులతో కుమ్మక్కు అయిన కారణంగానే కాస్త మెరుగైన సీట్లు సీట్లు వచ్చినట్లు చెబుతున్నారు. నిజాంపేట కార్పొరేషన్‌లోని 33 స్ధానాలకు గాను, తెరాస 26 గెలుచుకుంది. గతంలో సిపిఎం ప్రతినిధులు సర్పంచ్‌లుగా ఉన్న ప్రగతి నగర్‌ ప్రస్తుతం నిజాంపేట కార్పొరేషన్‌లో భాగం. అక్కడ ప్రగతి నగర్‌ అభివృద్ధి కమిటీ పేరుతో పోటీ చేసిన వారు ఆరుగురు విజయం సాధించారు, ఆ ప్రాంతంలోని మరొక వార్డులో స్వతంత్ర అభ్యర్ధి గెలిచారు.
ఆర్‌టిసి సిబ్బంది సమ్మెను అవకాశంగా తీసుకొని ప్రయాణీకులపై ప్రభుత్వం భారం మోపింది. ఇప్పుడు పురపాలక ఎన్నికలు ముగిసి ఫలితాలు వెలువడిన తరువాత ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు విలేకర్లతో మాట్లాడుతూ త్వరలో పన్నులు పెంచనున్నట్లు ప్రకటించారు. హైదరాబాదు, ఇతర కార్పొరేషన్లలో కొనసాగుతున్న అనారోగ్యం, అద్వాన్న పరిస్ధితులను చూసిన తరువాత మిగతా ప్రాంతాలలో కూడా పన్నుల బాదుడు తప్ప జనానికి ప్రయోజనాలు అనుమానమే !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

జనం సొమ్ము పొదుపు- వైఎస్‌ జగన్‌ ఆత్మవంచన, పరవంచన !

24 Friday Jan 2020

Posted by raomk in AP NEWS, Current Affairs, History, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

Aandhra Pradesh three Capitals, Amaravati capital controversy, CM YS Jagan

Image result for ys jagan hypocrisy on people's money
ఎం కోటేశ్వరరావు
శాసన మండలిలో అనూహ్యంగా తగిలిన ఎదురు దెబ్బతో అధికార వైసిపి నాయకత్వం ఒక విధంగా చెప్పాలంటే కకావికలైంది. మూడు రాజధానులు, సిఆర్‌డిఏ రద్దు బిల్లులను సెలెక్టు కమిటికీ పంపే ప్రకటనకు దారి తీసిన చర్చలను శాసనమండలి నుంచి ప్రత్యక్ష ప్రసారం చేసి ఉంటే జనానికి అనేక విషయాలు తెలిసి ఉండేవి. సాధారణంగా ప్రతిపక్ష సభ్యులు పోడియం ముందుకు పోవటం, మైకులు విరగ్గొట్టటం వంటి తీవ్ర నిరసనలను వ్యక్తం చేయటం తెలిసిందే. కానీ శాసనమండలిలో ఏకంగా కొందరు మంత్రులే కుర్చీలు, బల్లలు ఎక్కి శాసనమండలి అధ్యక్షుడికి నిరసన తెలపటం బహుశా ఎక్కడా జరిగి ఉండదు. శాసనమండలి పరిణామాలతో గురువారం నాడు శాసనసభలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి చేసిన ప్రసంగంలోని కొన్ని అంశాలను చూస్తే ఆత్మవంచన, పరవంచన గుర్తుకు వస్తోంది.
” శాసనమండలి చైర్మన్‌.. నిష్పాక్షికంగా మండలి నిర్వహించే పరిస్థితి లేదని నిన్న (బుధవారం) చంద్రబాబు గ్యాలరీలో కూర్చొని జారీ చేసిన ఆదేశాల వల్ల ఎవరికైనా అర్థమవుతోంది. అక్కడ డైరెక్షన్‌ ఇవ్వడానికి తనకు సంబంధం లేని సభ గ్యాలరీలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కూర్చున్నది అందరం చూశాం. ”
చట్ట సభల కార్యకలాపాల ప్రత్యక్ష ప్రసారం సభా కార్యక్రమాలకే తప్ప గ్యాలరీల్లో కూర్చున్న వారిని చూపించటానికి కాదు. అయినా చంద్రబాబు కూర్చోవటాన్ని అందరం చూశాం అని సిఎం చెబుతున్నారు. అసలు మండలి సమావేశాల ప్రత్యక్ష ప్రసారాలే లేనపుడు అదెలా సాధ్యం . అయినా చట్ట సభల లాబీలు, గ్యాలరీల్లో అనుమతి ఉన్నవారెవరైనా కూర్చోవచ్చు, తిరగవచ్చు. చంద్రబాబుతో పాటు ముఖ్యమంత్రి తరువాత వరసలో ఉండే వైసిపి నాయకత్వం కూడా గ్యాలరీలో కూర్చున్నది. లాబీల్లో పచార్లు చేసింది. సభలో కనుసైగలు, ఇతర పద్దతుల ద్వారా స్పీకర్‌, మండలి అధ్యక్షులకు సూచనలు, ఇతర అంశాలను పంపటం ముఖ్యమంత్రులు, అధికారపక్షం చేస్తున్నది బహిరంగ రహస్యం. గ్యాలరీలో కూర్చొని కూడా మండలి చైర్మన్‌కు ఆదేశాలు జారీ చేశారని ముఖ్యమంత్రి స్ధాయిలో ఉన్న వారు ఆరోపించటం వైపరీత్యం తప్ప మరొకటి కాదు. అదే సాధ్యమైతే మంత్రులను పోడియం వద్దకు వెళ్లమని, కుర్చీలు, బల్లలు ఎక్కాలని, మండలి చైర్మన్‌ ముందు నిరసన తెలపాలని లేదా ఆల్లరి చేయాలని గ్యాలరీల్లో ఉన్నవైసిపి నాయకులు ఆదేశాలు జారీ చేశారని అనుకోవాలా ?

” దేశంలో కేవలం 6 రాష్ట్రాల్లో మాత్రమే శాసనమండలి ఉంది. విడిపోయిన ఈ పేద రాష్ట్రానికి మండలి అవసరమా అనేది ఆలోచించాలి. మండలి కోసం సంవత్సరానికి రూ.60 కోట్లు ఖర్చు పెడుతున్నాం. 60 రోజులు సభ జరుగుతుందనుకుంటే రోజుకు రూ.కోటి ఖర్చు పెడుతున్నాం.అసలే పేదరికంలో ఉన్న రాష్ట్రం. ఇంత ఖర్చు అవసరమా? మంచి చేయడం కోసం తమ బుర్రలను పెట్టకుండా, ప్రతి మంచి పనిని ఎలా జరగకుండా ఆపాలి.. ఎలా డిలే చేయాలి.. అని రూల్స్‌ను సైతం ధిక్కరిస్తున్న ఇలాంటి మండలిని కొనసాగించాలా.. వద్దా.. అన్నది సీరియస్‌గా ఆలోచించాలి.”
ముందుగా ఆలోచించాల్సింది, ఇంత పేద రాష్ట్రానికి దేశంలో ఎక్కడా లేని విధంగా మూడు రాజధానులు అవసరమా అన్నది. ఒక వైపు ఎలాంటి ఖర్చు లేకుండా హైదరాబాదులో పది సంవత్సరాల పాటు రాజధానిగా పాలన సాగించే అవకాశాన్ని వదులు కున్నారని తెలుగుదేశం మీద విమర్శలు చేస్తారు. అమరావతిని ఖరారు చేశాక అక్కడ నిర్మించిన భవనాల్లోనే సచివాలయం, ఉభయ సభలు, హైకోర్టు పని చేస్తున్నది. మంత్రులు, ఎంఎల్‌ఏలు, సిబ్బందికి అవసరమైన నివాసాలు, ఇతర నిర్మాణాలు జరుగుతున్నాయి. వాటన్నింటినీ అర్ధంతరంగా వదలి వేసి విశాఖకు సచివాలయం, కర్నూలుకు హైకోర్టును తరలించాలనటం పొదుపు చర్య అవుతుందా ? దుబారానా ? ప్రజల సొమ్ముకు జవాబుదారీ వహించాల్సిన వారు చేయాల్సిన పనేనా ఇది.
శాసనమండళ్లు అవసరం లేదని, డబ్బు దండగ, అవి రాజకీయ నిరుద్యోగులు, ప్రజాక్షేత్రంలో గెలవలేని వారికి నిలయాలుగా మారాయన్నది సాధారణ విమర్శ. ఆ విషయం జగన్‌మోహనరెడ్డి గారికి ఆకస్మికంగా గుర్తుకు రావటమే చర్చనీయాంశం. ఆకస్మికంగా జ్ఞానోదయం అయిందా ? నిజంగా పేద రాష్ట్రం, ఖర్చు అనవసరం అనుకుంటే తాము గెలిస్తే మండలిని రద్దు చేస్తామని మానిఫెస్టోలోనే పెట్టవచ్చు. అలాంటిదేమీ లేదు. అందని ద్రాక్ష పుల్లన అన్నట్లుగా తన రాజకీయ అజెండాకు ఎదురు దెబ్బతో ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు తప్ప గతంలో కనీసం చర్చ జరగాలని కూడా చెప్పిన దాఖలాలు లేవు.
ఇక్కడ మరొక అంశం, కేవలం ఆరు రాష్ట్రాల్లోనే మండలి అన్నవారికి దేశంలో అసలు ఎక్కడా లేని, ఇంతవరకు ఎవరికీ రాని ఆలోచన మూడు రాజధానులు ఎలా బుర్రలోకి వచ్చినట్లు ? అది అదనపు ఖర్చు కాదా ? ఒక ముఖ్యమంత్రిగా ఉంటూ వారానికి ఒకసారి కేసుల విచారణకు హైదరాబాదు రావటానికి కొన్ని లక్షల ప్రజాధనం వృధా అవుతుందని చెప్పిన ముఖ్యమంత్రికి మూడు రాజధానులకు తిరగటానికి తనకు తన పరివారానికి రోజూ అయ్యే అదనపు ఖర్చు గురించి ఆలోచన రాలేదా ? ముఖ్య మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో మంచినీటి సీసాల విషయంలో పాటించిన పొదుపు గురించి ఎంతగానో ప్రచారం చేస్తే జనమంతా నిజమే అనుకున్నారు. సంక్రాంతి సంబరాల్లో పాల్గొనేందుకు విజయవాడ నుంచి గుడివాడ వెళ్లటానికి హెలికాప్టర్‌ ప్రయాణం పొదుపు చర్య అవుతుందా ?
” రాజ్యాంగంలో క్యాపిటల్‌ అనే పదమే లేదు. పరిపాలన కోసం వికేంద్రీకరణ చేయవచ్చు. ప్రజలు ఇచ్చిన అధికారం మేరకు ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఎక్కడ కూర్చొని అయినా మంత్రులు, సెక్రటరీలకు సూచనలు ఇస్తూ పాలన సాగించవచ్చు. ఇందుకు ఏ చట్టం అవసరం లేదు. ఏ బిల్లూ అవసరం లేదు. ఒక తీర్మానం చేసి ఈ పని చేయొచ్చు. రాష్ట్రంలో ఎక్కడైనా అసెంబ్లీ పెట్టొచ్చు. ఆర్టికల్‌ 174 ప్రకారం రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా చట్టాలు చేయవచ్చని రాజ్యాంగం చెబుతోంది. ”
పూర్వం కొందరు రాజులు విలాసాలకు అలవాటు పడి రాజనర్తకి, ఇతర రంగసానుల దగ్గర చేరి ఆస్ధానాలకు రాకుండా పాలన సాగించినట్లు చెప్పే కథలు మనకు తెలిసిందే. సచివాలయానికి రాకుండా తన నివాసం లేదా వ్యవసాయ క్షేత్రం నుంచి పాలన సాగిస్తున్న తెలంగాణా ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు నుంచి స్పూర్తి పొంది ఇలా మాట్లాడుతున్నట్లు కనిపిస్తోంది. అలాంటపుడు రాజధానికి 30వేల ఎకరాలు కావాలని(ప్రభుత్వ భూములు కావాలని అన్నారని ఇప్పుడు వైసిపి నేతలు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు), అమరావతిలో పెట్టాలని 2014లో అసెంబ్లీలో చెప్పినపుడు జగన్‌గారికి ఈ విషయాలు తెలియవా ? అసలు రాజధానే అవసరం లేదని చెప్పే వారు మూడు రాజధానులు కావాలని ఇంత రచ్చ, గందరగోళం సృష్టించటం ఎందుకు ? రాజధానితో నిమిత్తం లేకుండా పాలన సాగించగలిగిన వారికి పదమూడు జిల్లాలను అభివృద్ధి చేయటం ఒక లెక్కా ! ఆ మాత్రం దానికి ప్రాంతీయ విబేధాలను రెచ్చగొట్టటం, ప్రాంతాల మధ్య పోటీ పెట్టటం ఎందుకు !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

జగన్‌ అభివృద్ధి ప్రణాళిక గుట్టు విప్పాలి-చేసేదేమిటో చెప్పాలి !

23 Thursday Jan 2020

Posted by raomk in AP NEWS, Current Affairs, History, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

Aandhra Pradesh Politics, Aandhra Pradesh three Capitals, YS jagan, ys jagan development plan

Image result for now ys jagan should reveal his development plan

ఎం కోటేశ్వరరావు
నీతులు ఉన్నదెందుకు అంటే ఎదుటి వారికి చెప్పేటందుకే అన్నట్లుగా ఆంధ్రపదేశ్‌ రాజకీయాలు ఉన్నాయి. రాష్ట్ర శాసనసభ మరియు శాసనమండలిలో జరిగిన పరిణామాలను చూస్తే ఇలా జరుగుతుందని పోతులూరి వీరబ్రహ్మం లేదా ఫ్రెంచి జ్యోతిష్కుడు నోస్ట్రోడామస్‌ లేదా తామే చెప్పామనో బతికున్న జ్యోతిష్కులు ఎవరైనా చెబుతారేమో చూడాలి. అధికారపక్షానికి మెజారిటీ ఉన్న అసెంబ్లీలో ప్రతిపక్ష సభ్యులు స్పీకర్‌ పొడియంలోకి దూసుకువస్తే తప్పు పట్టిన వారు, తాము మైనారిటీగా ఉన్న శాసనమండలిలో సభ్యులుగాని మంత్రులే ఏకంగా మండలి అధ్యక్షుడి పోడియంను, అధ్యక్షుడినే చుట్టుముట్టారు. ఇదొక వైపరీత్యం. అసెంబ్లీలో ప్రతిపక్షచర్యలను జనానికి చూపేందుకు టీవీల్లో ప్రసారం చే శారు. అదే తమ చర్యలను జనం చూడకుండా చేసేందుకు సాంకేతిక కారణాల పేరుతో మండలి టీవీ ప్రసారాలను నిలిపివేశారు. అక్కడ సభ్య సమాజం సిగ్గుపడే విధంగా వ్యవహరించినట్లు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. స్పీకర్లు ఎలా అధికారపక్షానికి అనుకూలంగా, ప్రతిపక్షానికి వ్యతిరేకంగా ఎలా వ్యవహరిస్తున్నారో విచక్షణ అధికారాన్ని ఎలా ఉపయోగించుతున్నారో గత అసెంబ్లీలోనూ, ఇప్పుడూ చూస్తున్నాము. ఇప్పుడు మండలి చైర్మన్‌ కూడా అదే విచక్షణ అధికారంతో అధికారపక్షాన్ని ఇరుకున పెట్టారు. అందువలన విచక్షణ అధికారాల వినియోగానికి సంబంధించి నిబంధనలను సవరించాల్సి ఉంటుంది. దేశ రాజ్యాంగ వ్యవస్ధలను నీరుగార్చుతున్న నేపధ్యంలో ఈ పరిణామాలను చూడాల్సి ఉంది.
మూడు రాజధానుల రాజకీయం ఎటు తిరుగుతుందో, ఎవరి దగ్గర ఎలాంటి తురుపు ముక్కలున్నాయో, వాటిని ఎప్పుడు ఎలా ప్రయోగిస్తారో ఊహించి చెప్పలేము. సామాన్య జనం కోసం, ప్రాంతీయ మనోభావాలను రేకెత్తించటానికి మూడు రాజధానులు అని చెప్పినప్పటికీ చట్టపరంగా అది పాలనా వికేంద్రీకరణ పేరుతో జరుగుతోంది. వాణిజ్య కంపెనీలు లేదా పారిశ్రామిక సంస్ధల నమోదు(రిజిస్టర్డ్‌) కార్యాలయాలు ఒక చోట, కార్యకలాపాల నిర్వహణ పలు చోట్ల ఉండటం తెలిసిందే. రిజిస్టర్డ్‌ కార్యాలయాల్లో కార్యకలాపాలు పరిమితమే. రాజధానిగా అమరావతిని కేంద్రం గుర్తించి నోటిఫికేషన్‌ కూడా జారీ చేసింది. దానిని అలాగే కొనసాగిస్తూ కార్యకలాపాలను పరిమితం చేస్తూ సచివాలయాన్ని విశాఖకు, హైకోర్టును కర్నూలుకు తరలించాలని పాలకపార్టీ తలపెట్టింది. అందుకు అవసరమైన బిల్లును అసెంబ్లీలో ఆమోదించింది. అనూహ్యంగా శాసనమండలిలో ఎదురు దెబ్బ తగిలింది. ఎదురు దెబ్బలు తగిలితే వాటి తీవ్రతను బట్టి విరామం ఉంటుంది తప్ప ప్రయాణం ఆగదు. తమ మూడు రాజధానుల అజెండా కూడా అలాంటిదే అని అధికారపార్టీ చెబుతోంది. దాన్ని సాధ్యమైనంత మేరకు ఆలస్యం కావించేందుకు తెలుగుదేశం పార్టీ తాను చేయగలిగిందంతా చేస్తోంది.
పాలన వికేంద్రీకరణను ఒక విధానంగా జగన్‌మోహనరెడ్డి ప్రభుత్వం ముందుకు తెస్తోంది గనుక కోర్టులు అభ్యంతర పెట్టే అవకాశాలు పరిమితం అని చెప్పవచ్చు. రాజ్యాంగానికి అనుగుణ్యంగా ఉన్న విధానాలను అభ్యంతర పెట్టే అధికారం కోర్టులకు లేదు. కేంద్రం కూడా అడ్డుకొనే అవకాశాలు అంతంత మాత్రమే. సమస్య హైకోర్టు తరలింపు దగ్గరే ఎదురు కానుంది.అన్ని పార్టీలు హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేసేందుకు తమకు అభ్యంతరం లేదని చెబుతున్నాయి. అది మాత్రమే చాలదు. రాజధాని ఖరారు సమయంలోనే కర్నూలులోనో మరొక చోటో హైకోర్టును ప్రతిపాదించి కేంద్రానికి పంపి ఉంటే పరిస్ధితి వేరుగా ఉండేది. దేశ విభజన తరువాత తలెత్తిన పరిస్ధితులలో ఏర్పడిన తూర్పు పంజాబ్‌ హైకోర్టు, తరువాత కొత్తగా ఏర్పడిన రాష్ట్రాల నూతన హైకోర్టులు లేదా ఉన్న బెంచ్‌లను హైకోర్టులుగా మార్చటం తప్ప ఒక రాష్ట్రంలో ఒకసారి ఖరారు అయిన హైకోర్టును మరొక చోటికి తరలించిన ఉదంతం మన దేశంలో ఇంతవరకు లేదు. రాష్ట్ర పునర్వ్యస్దీకరణ చట్టం, ఇతర విధి, విధానాల ప్రకారం హైకోర్టును అమరావతి నుంచి కర్నూలుకు తరలించటం సాధ్యం కాదని కొందరు నిపుణుల తాత్పర్యం. చట్టంలో ఏ అడ్డంకులు ఉన్నా సుప్రీం కోర్టు, రాష్ట్రపతి అనుమతి ఇస్తే మరొక నోటిఫికేషన్‌ ద్వారా తరలించవచ్చన్నది మరొక భాష్యం. తరలింపును వ్యతిరేకిస్తున్నదీ, కోరుకుంటున్న వారిలో న్యాయవాదులు సహజంగానే ముందున్నారు కనుక రెండు వైపులా ఉద్దండులనే న్యాయపోరాటంలో రంగంలోకి దించుతారు.
హైకోర్టు విషయంలో న్యాయ పోరాటం అవసరం లేకపోతే సమస్యే లేదు, రణం తప్పనిసరైతే అదెలా జరుగుతుందో, ఎలా ముగుస్తుందో చూద్దాం. దానిలో జగన్‌ సర్కార్‌ గెలిస్తే హైకోర్టు కర్నూలుకు వెళుతుంది. ఓడిపోతే అమరావతిలోనే ఉండిపోతుంది. పర్యవసానాలకు జగన్‌మోహనరెడ్డి ఇప్పటి నుంచే సిద్దం కావాల్సి ఉంటుంది. వెలువడుతున్న అభిప్రాయాల మేరకు సెలెక్టు కమిటీ పేరుతో గరిష్టంగా ఆరునెలల పాటు అడ్డుకోవటం తప్ప మండలి చేసేదేమీ లేదు. ఆమోదించినా ఆమోదించకపోయినా అసెంబ్లీ తీర్మానం ఖరారు అవుతుంది. ఆ తరువాతే హైకోర్టు తరలింపు ప్రక్రియ ప్రారంభం. దానికి కేంద్రం నుంచి అనుమతి ఎంతకాలానికి వస్తుందో, అసలు రాదో కూడా తెలియదు. హైకోర్టు తరలింపు తక్షణమే జరగదని తెలిసినా దానితో నిమిత్తం లేకుండానే విశాఖకు సచివాలయాన్ని తరలించాలని మౌఖింగా ఆదేశాలు, ఏర్పాట్ల గురించి సూచనలు వెళ్లాయి గనుక హైకోర్టు విషయం తేలేవరకు బండి గుర్రం కళ్ల ముందు గడ్డి ఉంచి పరుగెత్తించినట్లుగా రాయలసీమ వాసులకు కేంద్రాన్ని చూపుతూ కాలక్షేపం చేయవచ్చు. అది ఆలస్యమయ్యే కొద్దీ అధికారపక్షానికి సమస్యలు పెరుగుతాయి తప్ప తగ్గవు. తరలింపు సాధ్యం కాదని తేలితే రాయలసీమలో వైసిపి భవిష్యత్‌ ఏమిటి? రాయలసీమ జనాన్ని సంతృప్తి పరచటం ఎలా అనే సమస్య తిరిగి ముందుకు వస్తుంది. అధికారపక్షానికి అది ఇరకాటమే.
మూడు రాజధానుల ప్రక్రియను అడ్డుకోకుండా ఉండేందుకు అవసరమైతే అసలు మండలినే రద్దు చేస్తామనే సూచనలు అధికారపక్షం నుంచి వెలువడ్డాయి. అవి బెదిరింపులా, ప్రలోభాలా మరొకటా అన్నది అన్నది ఎవరికి వారే భాష్యం చెప్పుకోవచ్చు. తరువాత అలాంటిదేమీ లేదని వైసిపి నేతలు చెబుతున్నప్పటికీ ఎవరి అనుమానాలు వారికి ఉన్నాయి. ఇక్కడ కొన్ని విషయాలున్నాయి. ఒకవేళ నిబంధనలు అంగీకరించి రద్దుకు సిఫార్సు చేస్తే వెంటనే రద్దవుతుందా ? కేంద్రంలోని అధికారపార్టీ సన్నాయి నొక్కులు నొక్కుతూనే ఒకే రాజధాని అని చెబుతోంది కనుక ఆ సిఫార్సును వెంటనే ఆమోదించటానికి ఎందుకు చర్య తీసుకుంటుంది? ఆమోదించాలని కోరే పార్టీ వైసిపి తప్ప మరొకటి ఉండదు. రాజకీయ వర్గాల్లో నలుగుతున్న చర్చ ప్రకారం రాజ్యసభ సీట్లకోసం బిజెపి నాయకత్వం ఒక వేళ రాజీపడి శాసన మండలిని వెంటనే రద్దు చేస్తే నష్టపోయే వాటిలో వైసిపి కూడా ఉంటుంది. తక్షణమే మోపిదేవి వెంకట రమణ, పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ మంత్రి ఉద్యోగాలు ఊడతాయి. తెలుగుదేశం సభ్యుల పదవీ కాలం ముగియగానే తలెత్తే ఖాళీల కోసం ఎదురు చూస్తున్న వైసిపి రాజకీయ నిరుద్యోగుల ఆశలకు నీళ్లొదులు కోవాల్సిందే. వారిని సంతృప్తిపరచేందుకు పాలకపార్టీ ఆయాసపడాల్సిందే. రెండవది ఇప్పటికే రివర్సు(తిరగదోడే) సర్కార్‌ అని తెలుగుదేశం చేస్తున్న రాజకీయ దాడికి మరొక అస్త్రాన్ని అందించినట్లు అవుతుంది. రాజశేఖరరెడ్డి కార్యక్రమాలన్నింటినీ సమర్ధవంతంగా అమలు జరుపుతామన్న వైసిపి ఆయన హయాంలో పునరుద్దరణ జరిగిన మండలిని రద్దు చేశారనే సెంటిమెంటును కూడా తెలుగుదేశం ముందుకు తెస్తుంది.
మూడు రాజధానుల ప్రక్రియతో పాటు స్ధానిక సంస్ధలకు ఎన్నికలకు కూడా వైసిపి సిద్దపడింది. రిజర్వేషన్ల అంశంపై కోర్టుకు ఎక్కిన కారణంగా ఆలస్యం కానుంది. ఇప్పుడు బిల్లు సెలక్టు కమిటీకి వెళ్లటంతో దాని ప్రక్రియ ఎప్పుడు పూర్తి అవుతుందో తెలియదు. అంతవరకు స్ధానిక సంస్ధల ఎన్నికలను వాయిదా వేస్తారా? వేయకపోతే మూడు రాజధానుల అంశంతో ఎన్నికలు కూడా జరగవచ్చు, సహజంగానే కొన్ని చోట్ల ఎదురుదెబ్బలు తగిలినా ఎక్కువ చోట్ల లబ్ది పొందవచ్చన్న అంచనాతోనే వైసిపి ముందుకు పోవచ్చు. పెద్ద మెజారిటీతో అనుకూల ఫలితాలు వస్తే వాటిని చూపి మరింతగా రెచ్చిపోవటం ఖాయం. ఒక వేళ ప్రతిపక్షాలకు తగినన్ని స్ధానాలు వస్తే ఒకే రాజధాని గురించి సమీకరణలు మరింతగా పెరుగుతాయి.
అధికార వికేంద్రీకరణ ఎత్తుగడతో సచివాలయ తరలింపును సాంకేతికంగా అడ్డుకొనే అవకాశాలు లేవు గనుకనే బిజెపి రాజకీయ పార్టీగా వ్యతిరేకతకు పరిమితమైంది, కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోదు అని చెబుతోంది. లేదా అడ్డుకొనేందుకు ఉన్న నిబంధనా పరమైన అంశాల పరిశీలన, అధ్యయనం కోసం సమయం తీసుకుంటోందా అన్న అనుమానాలు కూడా లేకపోలేదు. వైసిపి అజెండాను జయప్రదంగా అమలు జరిగేందుకు సహకరిస్తే లోపాయికారిగా ప్రయోజనాలు పొందవచ్చేమోగానీ రాజకీయంగా బిజెపి దానితో ముడివేసుకున్న జనసేన పని ముగిసినట్లే. అన్ని చోట్లా తన దుకాణామే ఉండాలి, మిగిలిన పార్టీల దుకాణాలు మూతపడాలని కోరుకుంటున్న, అందుకోసం దేనికైనా తెగించే బిజెపి అలాంటి ఆత్మహత్యా సదృశ్యమైన చర్యలకు పాల్పడుతుందా ? ప్రస్తుతం పార్లమెంటు ఉభయ సభల్లో దాని మెజారిటికి ఢోకా లేదు. స్వయంగా దానికే సంపూర్ణ మెజారిటీ వుండే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. అందువలన రాజకీయ కోణంలోనే బిజెపి ఆలోచించే అవకాశాలు ఎక్కువ. ఇటీవల బిజెపి-జనసేన సంయుక్త మీడియా సమావేశంలో ఆ పార్టీ నేతలు మాట్లాడిన మాటలను తామే దిగమింగుకోవటం కష్టం.
అనుకోని ఇబ్బందుల్లో పడిన వైసిపి ఇప్పుడేం చేస్తోంది? అసలేం చేయాలి? ఆస్ద్ధులన్నీ కరిగి పోయినా ఫర్వాలేదు, కేసు గెలవటం ముఖ్యం అని ఫ్యూడల్‌ ప్రభువులు వ్యవహరించినట్లుగా తాను తలపెట్టినదాన్ని నెగ్గించుకొనేందుకు ఎంతదాకా అయినా పోతాను అన్నట్లుగా వుంది ప్రభుత్వ తీరు. ఎందరో ప్రభుత్వ న్యాయవాదులు ఉన్నప్పటికీ అమరావతి కేసుల్లో వాదనలకు ఐదు కోట్ల రూపాయల ఫీజుతో సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహతగిని నియమించుకున్న విషయం తెలిసిందే. అవసరమైతే అలాంటి వారిని మరికొందరిని నియమించుకున్నా ఆశ్చర్యం లేదు, జనం సొమ్ము కదా ! మండలిని పూర్వపక్షం చేసేందుకు ఆర్డినెన్స్‌ తెస్తారా, దానికి గవర్నర్‌ రబ్బరు స్టాంపు వేస్తారా ? వంటి అనేక అంశాలు ఉన్నాయి.
సెలక్టు కమిటీ, ఇతర ఆటంకాల పర్యవసానాలు ఎలా ఉన్నా వైసిపి సర్కార్‌ రోజువారీ పాలన సాగించక తప్పదు. ఎన్నికలకు ముందే ముందుకు తెచ్చిన సంక్షేమ పధకాలను అమలు జరపాల్సి ఉంది. అమరావతి నిర్మాణానికి అవసరమైన లక్షకోట్ల రూపాయలను దాని ఒక్కదానికే ఖర్చు చేసేది లేదని తేల్చి చెప్పింది కనుక ఇప్పుడు ఆ సొమ్మును, ఇతర అభివృద్ధి పధకాల సొమ్ముతో కలిపి పదమూడు జిల్లాల అభివృద్ధికి ఎంత మొత్తాన్ని, ఎలా ఖర్చు చేయనుందో ప్రణాళికను వెల్లడించాలి. నవరత్నాలను ఎలా అమలు జరుపుతామో వివరంగా చెప్పిన వారికి రాష్ట్ర అభివృద్ది పధకాలు రూపొందించటం ఒక లెక్క కాదు. సెలక్టు కమిటీ తీసుకొనే వ్యవధిని ప్రభుత్వం దీనికి ఉపయోగించుకొని మూడు రాజధానులు అయితే, ఒక వేళ కాకున్నా పదమూడు జిల్లాల అభివృద్ధి సూచికలు ఎంతెంత ఉన్నాయో, రానున్న నాలుగు సంవత్సరాలలో వాటిని ఎంత మేరకు, ఎలా పెంచుతారో జనానికి వెల్లడిస్తూ శ్వేత పత్రం ప్రకటించాలి. ప్రభుత్వం తానుగా అభివృద్ధికి పెట్టుబడుల సంగతి తేల్చాలి. మూడు రాజధానులతో నిమిత్తం లేకుండానే ఇప్పటికే అమలు జరుపుతున్న అభివృద్ధి పధకాలు ఎలాగూ కొనసాగుతాయి గనుక నిమిత్తం వాటితో లేకుండా వాటిని ప్రత్యేకంగా చేసే అభివృద్ధి ఏమిటో వెల్లడించాలి. అప్పుడే ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా, రాయలసీమ పేదలు తమ వలసలను విరమించుకొని ఇక్కడే ఉపాధి పొందేందుకు పూనుకుంటారు. అమరావతితో సహా రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి జిఎన్‌ రావు కమిటీ, లేదా బోస్టన్‌ కన్సల్టెన్సీ బృందం సమర్పించిన నివేదికలను మధించిన మంత్రుల ఉన్నత సా ్ధయి కమిటీ చేసిన సూచనలేమిటో, పూర్తి నివేదిక ఏమిటో జనానికి అందుబాటులో ఉంచాలి. ఇదేమీ రహస్యం కాదు, పారదర్శకతకు పక్కా నిదర్శనం అవుతుంది. అలాగాక మూడు రాజధానుల అంశం తేలిన తరువాతే మా గుప్పెట తెరుస్తాము లేదా మనసులో ఉన్నది చెబుతాము అంటే అందులో ఏమీ లేదనే అనుకోవాల్సి వస్తుంది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

నాడు సారస్‌, నేడు చైనాను వణికిస్తున్న ఉహాన్‌ న్యుమోనియా

22 Wednesday Jan 2020

Posted by raomk in CHINA, Current Affairs, History, INTERNATIONAL NEWS

≈ Leave a comment

Tags

China, Novel Coronavirus, SARS


ఎం కోటేశ్వరరావు
ప్రస్తుతం ఊహాన్‌ న్యూమోనియాగా పిలుస్తున్న వ్యాధికి కారణమైన వైరస్‌ను అదుపు చేసేందుకు చైనా ప్రయత్నిస్తుండగా ప్రపంచ ఆరోగ్య సంస్ధ నిపుణులు బుధవారం నాడు అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి తీసుకోవాల్సిన చర్యలు, ఇతర అంశాల గురించి చర్చించనున్నారు. చైనాతో పాటు మరో మూడు దేశాల్లో ఈ వైరస్‌ సోకినట్లు గుర్తించారు. గతంలో 2003లో వ్యాపించిన సారస్‌ మాదిరి వైరస్‌ మనుషుల నుంచి మనుషులకు వ్యాపిస్తున్నదని చైనా ప్రకటించింది. దీని గురించి ఆందోళన చెందాల్సిన పని లేదని చెబుతున్నప్పటికీ అటు చైనాలోనూ, ఇటు ప్రపంచ వ్యాపితంగా ఆందోళన వ్యక్తం అవుతోంది.
మీడియాలో నోవెల్‌ కొరోనా వైరస్‌(2019-ఎన్‌సిఓవి), ఉహాన్‌ సీఫుడ్‌ మార్కెట్‌ న్యుమోనియా వైరస్‌, ఉహాన్‌ న్యుమోనియా, ఉహాన్‌ కొరోనావైరస్‌ అని ఏ పేరుతో పిలిచినా అవన్నీ ఒకటే. దీనికి గుడ్లగూబల నుంచి వ్యాప్తి చెందే ఒక వైరస్‌ లక్షణాలున్నట్లు ప్రాధమికంగా తేలింది. గతనెలలో గుర్తు తెలియని ఈ వైరస్‌తో బాధపడుతున్న వారిని గుర్తించారు. ఇప్పటి వరకు 9 మంది మరణించారని వార్తలు వచ్చాయి. బుధవారం ఉదయం ఏడు గంటల సమయానికి పద్నాలుగు రాష్ట్రాలలో 324 మందికి వైరస్‌ సోకినట్లు చైనా ప్రకటించింది. అంతకు రెండు రోజుల ముందు లండన్‌లోని ఇంపీరియల్‌ మెడికల్‌ కాలేజీ నిపుణులు కనీసం 1700కి సోకి వుండవచ్చునని పేర్కొన్నారు. చైనా వెలుపల దక్షిణ కొరియాలో ఒకరికి సోకినట్లు సోమవారం నాడు, చైనా నుంచి అమెరికా వెళ్లిన ఒక యువకుడికి వైరస్‌ సోకినట్లు మంగళవారం నాడు అమెరికా వెల్లడించింది. హాంకాంగ్‌లో 117 మందికి సోకినట్లు అనుమానం తప్ప నిర్దారణ కాలేదు.
మధ్యచైనా రాష్ట్రంగా పిలిచే హుబెరు రాష్ట్ర రాజధాని ఉహాన్‌ పట్టణం. చైనా నూతన సంవత్సర సందర్భంగా కోట్లాది మంది చైనీయులు బంధు, మిత్రులను స్వయంగా కలిసి పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుంటూ వేడుకలు జరుపుకుంటారు. పెద్ద ఎత్తున స్వదేశంలోనూ, విదేశాలకు విహార యాత్రలకు వెళతారు. ఈ సమయంలో చైనాలో 20 కోట్ల మంది ప్రయాణాలు చేస్తారని అంచనా కాగా ఒక్క ఉహాన్‌ నగరం నుంచి కోటిన్నర మంది ఉంటారని అంచనా వేస్తున్నారు. మనుషుల నుంచి మనుషులకు వ్యాప్తి చెందుతున్నట్లు అధికారికంగా ప్రకటించిన నేపధ్యంలో ఇప్పటికే అనేక మంది తమ ప్రయాణాలను పరిమితం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. జనవరి 25 నుంచి ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ వరకు నూతన సంవత్సర వేడుకలు జరుగుతాయి. ఇరవై అయిదు నుంచి 30వ తేదీ వరకు అధికారిక సెలవుదినాలుగా ప్రకటించారు. జనవరి పది నుంచి ఫిబ్రవరి 18వరకు వసంత రుతు ఉత్సవాలు జరుగుతాయి. ఈ కాలంలో కనీసం 20 కోట్ల మంది ప్రయాణాలు చేస్తారని అంచనా. ఉహాన్‌ నగర జనాభా కోటీ పదిలక్షలు, పెద్ద రవాణా కేంద్రం. జనవరి 20-27 తేదీల మధ్య దేశంలోని వివిధ ప్రాంతాలకు 2,105, విదేశాలకు 231 విమానాలను నడిపేందుకు ఏర్పాట్లు చేశారు. ఉహాన్‌ న్యూమోనియా వైరస్‌ లక్షణాలు కనిపించిన వెంటనే చైనా సర్కార్‌ దేశవ్యాపితంగా శ్వాస సంబంధ అనారోగ్యంతో బాధపడుతున్నవారిని గుర్తించి పరీక్షించిన కారణంగా నూతన కేసులు బయట పడినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్ధ పేర్కొన్నది. ఉహాన్‌ నుంచే గాక హుబెరు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారి మీద కూడ వ్యాధిలక్షణాల గురించి నిఘావేశామని, హాంకాంగ్‌లో వంద మందిని పర్యవేక్షిస్తున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు. అనేక దేశాల విమానాశ్రయాలలో చైనా నుంచి వచ్చేవారిని పరీక్షించే ఏర్పాట్లు చేశారు.
తాజా వైరస్‌ వార్తలతో యావత్‌ చైనా సమాజంలో ఒక విధమైన ఆందోళన, అప్రమత్తత కూడా వెల్లడి అయినట్లు వార్తలు వచ్చాయి. దీని గురించి దాయాల్సిన అవసరం లేదని, అదే సమయంలో గతంలో సారస్‌ మాదిరి పరిస్దితి లేదని చైనా మీడియా పేర్కొన్నది. 2004 తరువాత ఇంతవరకు చైనాలో సారస్‌ లక్షణాలు వెల్లడి కాలేదు. ఇదే సమయంలో సారస్‌ వైరస్‌ను నిరోధించే టీకాలను కూడా ఇంతవరకు రూపొందించలేకపోయారు. ఆ లక్షణాలున్న వారి నుంచి ఇతరులకు వ్యాపించకుండా నిరోధ చర్యలు మాత్రమే తీసుకుంటున్నారు, ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. ఇంటర్నెట్‌ అందరికీ అందుబాటులో ఉన్నందున ప్రభుత్వం సమాచారాన్ని దాచినా దాగదని, అంతర్జాతీయ మీడియా కూడా మిన్నకుండజాలదని చైనా అధికారులు చెబుతున్నారు. సంక్లిష్ట పరిస్ధితులు తలెత్తినపుడు వాస్తవాలను వెల్లడించటం ద్వారానే జనానికి భరోసా కల్పించవచ్చని అన్నారు. సారస్‌ వ్యాప్తి నుంచి చైనా వైద్యనిపుణులు ఎన్నో అనుభవాలను పొందారని, ఇలాంటి పరిస్ధితులను ఎలా ఎదుర్కోవాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదని అంటున్నారు. ఈ వైరస్‌ను ఎదుర్కొనేందుకు యావత్‌ చైనా సమాజాన్ని కదిలించాల్సిన అవసరం ప్రస్తుతానికైతే లేదని చెబుతున్నారు.
గతంలో సారస్‌ వైరస్‌ దక్షిణ చైనాలోని గ్వాంగ్‌ డాంగ్‌ రాష్ట్రం షండే ప్రాంతం నుంచి ప్రారంభమై 2002 నవంబరు నుంచి 2003 జూలై మధ్యకాలంలో పద్నాలుగు దేశాల ( పదిహేడు ప్రాంతాలు)లో వ్యాపించింది. మొత్తం 8,273మందికి సోకగా 775 మంది ఐదు దేశాల(ఏడు ప్రాంతాలు)లో మరణించారు, వీరిలో సారస్‌ సోకినప్పటికీ ఇతర కారణాలతో మరణించిన వారు 60 మంది ఉన్నారు. సగటున 9.6శాతం మంది మృతి చెందారు. దేశాల వారీ చైనా ప్రధాన భూభాగంలో 5,328 మందికి సోకగా 349 మంది మరణించారు, చైనాలో భాగమైన హాంకాంగ్‌లో 1,755 మందికి గాను 299 మంది చనిపోయారు. కెనడాలో 251 మందికి 44, సింగపూర్‌లో 238 మందికి 33, చైనా తిరుగుబాటు రాష్ట్రమైన తైవాన్‌లో 346 మందికి 37, వియత్నాంలో 63కు ఐదు, ఫిలిప్పైన్స్‌లో 14కు రెండు మరణాలు సంభవించాయి. చైనా గ్వాంగ్‌ డాంగ్‌లో వైరస్‌ ప్రారంభమైన బీజింగ్‌ నగరంలో పెద్ద ఎత్తున వ్యాపించింది. ఆ సమయంలో అక్కడి ప్రాధమిక, మాధ్యమిక పాఠశాలలను మూసివేశారు. చైనాలో ప్రతి ఏటా వసంత రుతు సమయంలో జలుబు సాధారణంగా వస్తుంది. అయితే జలుబు చేసిన వారి శరీర ఉష్ణోగ్రత 37.3 సెంటీగ్రేడ్‌ డిగ్రీలు దాటితే వారికి ఉహాన్‌ న్యుమోనియా అనుమానంతో చికిత్స చేస్తున్నారు. ఇటీవలి కాలంలో మీరు ఎక్కడెక్కడికి ప్రయాణాలు చేశారని వైద్య సిబ్బంది ప్రశ్నిస్తున్నారు. ఉహాన్‌ వెళ్లి వచ్చిన తరువాత జ్వరంలో కూడిన జలుబు చేస్తే పనులకు పోవద్దని, రక్షణ ముసుగులు ధరించాలని సలహా ఇస్తున్నారు. దేశంలో కొన్ని చోట్ల ఉహాన్‌ న్యుమోనియా లక్షణాలు,తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పెద్ద ఎత్తున బ్యానర్ల ద్వారా ప్రచారం చేస్తున్నారు.
ప్రస్తుతం చైనాలో ప్రపంచంలోనే అతి పెద్దదైన వ్యాధికారక వైరస్‌, బాక్టీరియాలను పరిశీలించే ప్రయోగశాలల వ్యవస్ధ ఉంది. దేశంలో పన్నెండు ప్రధాన ప్రయోగశాలలు, 91 ప్రాంతీయ, 800 ఆసుపత్రుల ప్రయోగశాలలు ఉన్నాయి. ఇప్పటికి తెలిసిన 300 వ్యాధికారక వైరస్‌లను అక్కడ వెంటనే గుర్తించే ఏర్పాట్లు ఉన్నాయి. 2003 సారస్‌ విస్తరణ తరువాత వీటిని మరింత పటిష్ట పరిచారు. గుర్తు తెలియని వైరస్‌లను గుర్తించే నిరంతర పరిశోధనల గురించి చెప్పనవసరం లేదు. సారస్‌ తరువాత పెద్ద ఎత్తున వ్యాప్తి చెందే వ్యాధులను గుర్తించేందుకు 17ప్రత్యేక బృందాలకు శిక్షణ ఇచ్చారు. సాధారణ న్యూమోనియా వైరస్‌ పది రోజుల కంటే ప్రభావం చూపలేదు, అయితే సారస్‌ మూడు నెలలకు మించి ఉన్నట్లు విదేశీ నిపుణులు గుర్తించారు.
ప్రస్తుతం వ్యాపించిన ఉహాన్‌ న్యూమోనియా కోరోనా వైరస్‌ కేంద్రం నగరంలోని సముద్ర ఉత్పత్తుల మార్కెట్‌గా గుర్తించారు. ఇతర ప్రాంతాల్లోని చేపలు, కోళ్ల మార్కెట్లలో అలాంటి లక్షణాలు కనిపించనందున వైరస్‌ సాధారణ లక్షణాలను నిర్ధారించటం ఆలస్యం అవుతున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ ఏడాది ఉహాన్‌లో వైరస్‌ వ్యాప్తికి తోడ్పడే వాతావరణం ఉండటంతో వైరస్‌ల గుర్తింపు, నివారణ సవాలుగా మారింది. ఈ నగరంలో 198 మందిలో వైరస్‌ను గుర్తించారు, 25 మందికి చికిత్స చేసి ఆసుపత్రి నుంచి పంపారు, తొమ్మిది మంది పరిస్ధితి విషమంగా ఉంది. చికిత్స చేస్తున్న సిబ్బందిలో 15 మందికి సోకినట్లు గుర్తించగా వారిలో ఒకరి పరిస్ధితి తీవ్రంగా ఉంది. అవసరమైతే తప్ప జనాలు బయటకు రావద్దని నగరపాలక సంస్ధ సలహా ఇచ్చింది.
చైనాలో కలరా, ప్లేగ్‌ వంటి వాటికి కారణమయ్యే వైరస్‌ను మొదటి తరగతిగా వర్గీకరించి అధిక ప్రాధాన్యత ఇస్తారు, సారస్‌, ఎయిడ్స్‌ వంటి వైరస్‌ల వంటి బి తరగతిలో ఉహాన్‌ వైరస్‌ను చేర్చారు. అంటే వీటిని ఎదుర్కొనేందుకు కూడా అధిక ప్రాధాన్యత ఇస్తారు. జపాన్‌, థారులాండ్‌, దక్షిణ కొరియాల్లో కూడా ఈ వైరస్‌ను గుర్తించిన కారణంగా సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించాలని దేశాధ్యక్షుడు గ్జీ జింపింగ్‌ అధికారులను కోరారు.
ఈ వైరస్‌ గురించి దీని గురించి చైనా వాస్తవాలను బయటకు వెల్లడించటం లేదని పశ్చిమ దేశాల మీడియాలో కథనాలు రాస్తున్నారు. నిజానికి చైనా దాచిందీ లేదు, పశ్చిమ దేశాలు శోధించి కనుగొన్నదీ లేదు. డిసెంబరు 31న ఉహాన్‌లో అంతుబట్టని న్యుమోనియాను గుర్తించినట్లు చైనా ప్రపంచ ఆరోగ్య సంస్దకు తెలియ చేసింది. వ్యాధి వ్యాపించటానికి కారణమైన వైరస్‌ కేంద్రంగా అనుమానించిన సముద్ర ఉత్పత్తుల మార్కెట్‌ను జనవరి ఒకటిన మూసివేశారు. ఈ వ్యాధి గురించి తమకు తెలిసిందని జనవరి రెండున సింగపూర్‌ ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. జనవరి ఒకటిన ఈ వైరస్‌ కారణంగా తమ దేశంలో తొలి మరణం సంభవించినట్లు చైనా తెలిపింది. ఉహాన్‌ నుంచి వచ్చిన ఒక మహిళకు వ్యాధి సోకినట్లు థారులాండ్‌లో జనవరి 13న గుర్తించారు, పదహారవ తేదీన జపాన్‌లో ఒక కేసు బయట పడింది.పదిహేడవ తేదీన రెండవ,20న మూడవ,21న నాల్గవ వ్యక్తి మరణించారు. ఉహాన్‌ నుంచి దక్షిణ కొరియాకు వచ్చిన ఒక వ్యక్తికి వైరస్‌ సోకినట్లు గుర్తించారు. చైనా నుంచి వచ్చే కొన్ని విమానాల ప్రయాణీకులకు పరీక్షలు జరుపుతామని ఆస్ట్రేలియా ప్రకటించింది.
ఇలాంటి అంతుతెలియని ప్రమాదకర వైరస్‌లు వ్యాప్తి చెందినపుడు వాటిని యావత్‌ అంతర్జాతీయ సమాజం ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. ప్రతి వారు తమ అనుభవం, పరిశోధనల సమాచారాన్ని ఏ దేశంలో అయితే వైరస్‌ ప్రారంభమైందో దానికి అందచేస్తే మానవాళికి మేలు కలుగుతుంది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

సోషలిస్టు తాతయ్యకే మద్దతు అంటున్న అమెరికా మనవళ్లు !

19 Sunday Jan 2020

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Latin America, Left politics, Opinion, USA

≈ Leave a comment

Tags

'Socialist' Bernie Sanders, capitalism or socialism, chin peng, Nicolás Maduro, Pedro Sanchez, Venezuela, Young People Embracing Socialism

Image result for generation z and millennials support to bernie sanders
ఎం కోటేశ్వరరావు
ఐరోపాను కమ్యూనిస్టు భూతం భయపెడుతున్నదని కారల్‌ మార్క్స్‌-ఫెడరిక్‌ ఎంగెల్స్‌ కమ్యూనిస్టు ప్రణాళికలో వ్యాఖ్యానించారు. కమ్యూనిజాన్ని అంతం చేసి విజయం సాధించామని అమెరికా ప్రకటించుకుంది. కానీ ఇప్పుడు అక్కడే కమ్యూనిస్టు భూతం భయపెడుతోందంటే అతిశయోక్తి కాదు. సోషలిస్టు వ్యవస్ధలకు, కమ్యూనిస్టు సిద్దాంతానికి తగిలిన ఎదురు దెబ్బలు అనేక మందిని నిరాశకు గురి చేశాయి. సమాజం పారే నది వంటిది అనుకుంటే కొత్త నీరు వచ్చి పాత నీటిని వెనక్కు నెట్టేస్తుంది. అనేక దేశాల్లో జరుగుతున్న పరిణామాలు నిరాశకు గురైన వారిలో ఆశలు చిగురింప చేస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. నాలుగు ఖండాలలోని కొన్ని దేశాలలో ఇటీవలి పరిణామాలను ఒక్కసారి అవలోకిద్దాం, ఆలోచనలకు పదును పెడదాం.
అమెరికా పాలకవర్గాన్ని, దాన్ని ఆశ్రయించి బతికే పరాన్న జీవులైన మేథావులకు ఆందోళన కలిగిస్తున్న అంశం ఏమిటి? చైనాతో వాణిజ్య యుద్దంలో ఏమి చేయలేక ఆయాస పడటమా, ప్రపంచంలో తమ పలుకుబడి తగ్గి ప్రతిఘటన పెరుగుతోందనే ఆందోళనా, మరొకటా, మరకొటా ? ఇవేవీ కాదు, తమ యువతరంలో పెట్టుబడిదారీ విధానం పట్ల దిగజారుతున్న విశ్వాసం, సోషలిజం పట్ల పెరుగుతున్న మక్కువ అంటే అతిశయోక్తి కాదు. అఫ్‌ కోర్సు అమెరికా ప్రచారాన్ని నమ్మి దాన్నే మెదళ్లకు ఎక్కించుకున్న వారు మింగా కక్కలేని స్ధితిలో ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అలాంటి వారిని కొత్త నీరు వెనక్కు నెట్టేస్తుంది.
జనవరి రెండవ వారంలో బ్రిటీష్‌ మార్కెట్‌ పరిశోధనా సంస్ధ ”యుగవ్‌ ” నిర్వహించిన ఒక సర్వేలో 23-38 సంవత్సరాల యువతరం( మిలీనియనల్స్‌)లో ప్రతి ఇద్దరిలో ఒకరు సోషలిజానికి మద్దతు ఇస్తున్నారని తేలింది. అంతకంటే కమ్యూనిస్టు వ్యతిరేకులు గుండెలు బాదుకొనే అంశం ఏమంటే ఈ యువతలో 36శాతం మంది కమ్యూనిజానికి జై కొట్టడం. అమెరికన్లు ఏర్పాటు చేసిన అనేక సంస్ధలలో ‘కమ్యూనిజం బాధితుల స్మారక ఫౌండేషన్‌’ ఒకటి. దీని పనేమిటో చెప్పక్కర లేదు. ఆ సంస్ధ కార్యనిర్వాహక డైరెక్టర్‌ మరియాన్‌ స్మిత్‌ సర్వే వివరాల గురించి ఒక ప్రకటన చేశాడు.” సోషలిజం, కమ్యూనిజాల ప్రమాదాల గురించి చారిత్రాత్మక విస్మృతి ఈ నివేదికలో పూర్తిగా కనిపిస్తోంది. గత శతాబ్దిలో కమ్యూనిస్టు పాలకుల చేతుల్లో పది కోట్ల మంది బాధితులయ్యారనే చారిత్రాత్మక నిజం గురించి మన యువతరానికి తెలియ చెప్పనట్లయితే వారు మార్క్సిస్టు సిద్దాంతాలను అంగీకరిస్తే మనం ఆశ్చర్యపోనవసరం లేదు.” అన్నాడు. పది కోట్ల మందిని కమ్యూనిస్టులు చంపారనే తప్పుడు ప్రచారం నిత్యం ఇంటర్నెట్‌తో అనుబంధం ఉన్న యువతీ యువకులకు తెలియంది కాదు, అవన్నీ కట్టుకధలని కొట్టి పారవేస్తూ నేటి యువత సోషలిజం పట్ల సానుకూలంగా స్పందిస్తున్నారనే చారిత్రక సత్యాన్ని గుర్తించ నిరాకరిస్తున్నారు.
ప్రయివేటు ఆస్ధులన్నింటినీ రద్దు చేస్తే సమాజం మెరుగ్గా ఉంటుందని మిలీనియల్స్‌లో 22శాతం మంది, ఉన్నత విద్య ఉచితంగా అందించాలని జడ్‌ తరం(1997-2012 మధ్యలో పుట్టిన వారు)లో 45శాతం మంది భావిస్తున్నారని కూడా తాజా సర్వే వెల్లడించింది. ఇరవయ్యవ శతాబ్దపు సోషలిస్టు ప్రయోగాలను చూసిన తరువాత కూడా ఆ సోషలిస్టు భావజాలం ఇంకా ఆకర్షిస్తూనే ఉండటం, ప్రభుత్వ పాఠశాలలు, మీడియా, సాధారణ సంస్కృతి కారణంగా పెద్ద ఎత్తున సామాజీకరణ పెరగటంతో ఈ భావజాలం విశాల ఆమోదం పొందింది, ఇప్పుడది రానున్న తరాలకు ఒక పటిష్టమైన ఓటు తరగతిగా మారుతోంది, గతంలో సోషలిస్టు ప్రభుత్వాలను దెబ్బతీసేందుకు విరుచుకుపడినట్లుగా అదే పద్దతుల్లో అమెరికా ఇప్పుడు చేయలేదు అని సర్వేపై విశ్లేషణ చేసిన ఒక రచయిత పేర్కొన్నాడు.
అమెరికాలో 2016 అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్ధిగా సెనెటర్‌, తాను సోషలిస్టు అని చెప్పుకున్న బెర్నీ శాండర్స్‌ పోటీ పడ్డారు. చివరకు హిల్లరీ క్లింటన్‌ వైపు ఆ పార్టీ మొగ్గింది. తిరిగి ఈ సారి కూడా 78 సంవత్సరాల బెర్నీ శాండర్స్‌ పోటీ పడుతున్నారు. చివరకు ఏమి జరుగనుందో తెలియదు. ఇక్కడ గమనించాల్సిందేమంటే గత ఎన్నికల్లో బెర్నీ శాండర్స్‌ రంగంలో లేనందుకు యువత నిరాశ చెందలేదు, తరువాత జరిగిన అనేక సర్వేలలో సోషలిజం పట్ల ఆకర్షితులౌతున్నవారి శాతం పెరుగుతోందే తప్ప తగ్గలేదు. ఎందుకీ పరిణామం అంటే పెట్టుబడిదారీ విధాన వైఫల్యం, దాని పట్ల మోజు తగ్గటమే కారణం. అయితే నాలుగు పదులు దాటిన వారిలో అత్యధికులు పెట్టుబడిదారీ విదానం పట్ల ఇంకా మొగ్గు చూపుతూనే ఉన్నారు. చదువుకోసం చేసిన రుణాలు గుదిబండలుగా మారటం, వేతనాల స్థంభన ముఖ్యమైన కారణాలుగా చెబుతున్నారు.జడ్‌ తరం, మిలీనియల్స్‌లో అత్యధికులు తాము సోషలిస్టు అభ్యర్ధికే ఓటు వేస్తామని ఎటు తిప్పి ఎటు ప్రశ్నించినా ప్రతి సర్వేలో చెబుతున్నారు.
సూపర్‌ మనీ అనే సంస్ధ చేసిన విశ్లేషణ ప్రకారం 1974 నుంచి 2017 మధ్యకాలంలో 24-34 సంవత్సరాల వారికి ద్రవ్యోల్బణ సవరింపు తరువాత వార్షిక సగటు నిజవేతనాలు 35,426 నుంచి 35,455 డాలర్లకు అంటే కేవలం 29 డాలర్లు మాత్రమే పెరిగాయి. అదే కాలంలో 35-44 సంవత్సరాల వారికి 2,900 డాలర్లు, 45-54 వారికి 5,400 డాలర్లు పెరిగాయి. పెరుగుతున్న జీవన వ్యయంతో పోల్చితే వేతనాల పెరుగుదల అన్ని వయస్సుల వారిలో ఆందోళన కలిగిస్తున్నప్పటికీ యువతరంలో మరింత ఎక్కువగా ఉంది. స్టూడెంట్స్‌ లోన్‌ హీరో సంస్ధ విశ్లేషణ ప్రకారం అండర్‌ గ్రాడ్యుయేట్‌ డిగ్రీ ట్యూషన్‌ ఫీజు 1980 -2018 మధ్య కాలంలో ప్రభుత్వ కాలేజీల్లో 213, ప్రయివేటు కాలేజీల్లో 129శాతం పెరిగింది. విద్యకోసం చేసిన రుణాల మొత్తం 1.5లక్షల కోట్ల డాలర్లు, అంటే సగటున 29,800 డాలర్లు. అప్పుచేసి డిగ్రీ సంపాదించి ఉద్యోగం పొంది రుణం తీర్చుదామని వేసుకున్న అంచనాలు తలకిందులయ్యాయని సగం మంది మిలీనియల్స్‌ అభిప్రాయపడుతున్నారు. నలభై సంవత్సరాలలో ఇండ్ల ధరలు నలభైశాతం పెరిగాయి. వాయిదాలు చెల్లించలేమనే భయంతో ఇళ్లు కొనుక్కోవటాన్ని కూడా వారు వాయిదా వేస్తున్నారు. ఇన్ని అప్పులు చేసి ఇబ్బందులు పడుతున్నవారిని చూసిన తరువాత అసలు తమకు పిల్లలు వద్దని 13శాతం అమెరికన్లు భావిస్తున్నట్లు గతేడాది న్యూయార్క్‌ టైమ్స్‌ సర్వే పేర్కొన్నది. అన్ని రకాల జీవన వ్యయం పెరగటం, అందుకు అనుగుణ్యంగా ఆదాయాలు పెరగకపోవటంతో ఓటర్లు వామపక్ష భావజాల అభ్యర్దులవైపు మొగ్గుతున్నారని వ్యాఖ్యాతలు నిర్ధారణకు వస్తున్నారు.
డెమోక్రటిక్‌ పార్టీనేత బెర్నీ శాండర్స్‌ తన ప్రచారంలో ఆర్ధిక అసమానతల తగ్గింపు, అందరికీ వైద్యం, ధనికులపై పన్ను పెంపు వంటి నినాదాలను ముందుకు తెస్తున్నారు. డెమోక్రటిక్‌ పార్టీ ఇతర నేతలు కూడా ప్రభుత్వ కాలేజీల్లో ఉచిత విద్య, విద్యార్ధి రుణాల రద్దు, పిల్లలందరికీ సామూహిక ఆరోగ్యబీమా వంటి అంశాలను ప్రస్తావించక తప్పటం లేదు. ట్రంప్‌ ప్రభుత్వం విద్యార్ధి రుణాల వ్యవస్ధను మౌలికంగా దెబ్బతీసిందని విమర్శిస్తూ ఆ విభాగంలో పని చేస్తున్న అధికారి ఏ వేయనె జాన్సన్‌ గతేడాది నవంబరులో రాజీనామా చేశాడు.
అమెరికా యువత సోషలిజం పట్ల మక్కువ చూపటానికి కారణం ఏమంటే కాలేజీల్లో ప్రొఫెసర్లలో ఎక్కువ మంది వామపక్ష భావాలు కలిగి ఉండటం అని కొంత మంది తడుముకోకుండా వెంటనే చెప్పేస్తారు. ఎక్కడైనా కొన్ని సంస్ధలలో ఉన్నారంటే అర్ధం చేసుకోవచ్చు, యావత్‌ దేశమంతటా అదే పరిస్ధితి ఉందా ? స్వేచ్చా మార్కెట్‌ను సమర్ధించే ప్రొఫెసర్‌ ఎడ్వర్డ్‌ గ్లాసెర్‌ ఈ అభిప్రాయాన్ని పూర్వపక్షం చేశారు. అనేక విధాలుగా ఆధునిక అమెరికా ఆర్ధిక వ్యవస్ధ యువత సంక్షేమానికి అనుగుణ్యంగా పని చేయటం లేదు. అనేక ప్రభుత్వ విధానాలు ఉద్యోగం పొందాలంటే ఆటంకంగా ఉన్నాయి, డబ్బు పొదుపు చేసుకోవాలన్నా , ఇల్లు కొనుక్కోవాలన్నా కుదరకపోవటం యువతరాన్ని ఆదర్శభావజాలం గురించి ఆలోచింపచేస్తున్నది, ఒకసారి సోషలిజం ఎలా ఉంటుందో ఎందుకు ప్రయత్నించి చూడకూడదు అనుకుంటున్నారని గ్లాసెర్‌ అంటున్నారు. ప్రచ్చన్న యుద్ద సమయంలో సోషలిజం గురించి చర్చ ఉండేది కాదు, ఎందుకంటే దాన్ని ఒక దుష్ట ప్రభుత్వంగా చూసి వ్యతిరేకించాము. సోవియట్‌ యూనియన్‌లో పేదరికం, అణచివేత కారణంగా ఆ వ్యవస్ధ ఆచరణ సాధ్యం కాదని భావించాము. ఆ జ్ఞాపకాలు లేనివారికి, ప్రస్తుతం 30 సంవత్సరాల లోపు ఉన్న అందరికీ అలాంటిది లేదు అని గ్లాసెర్‌ వాపోయాడు.

Image result for Pedro Sanchez
” స్పెయిన్‌లో మార్క్సిస్టు కమ్యూనిజం పునర్జన్మించింది ”
కమ్యూనిస్టు వ్యతిరేకులు పురోగామి శక్తుల ఉనికిని సహించలేకుండా ఉన్నారు.” బెర్లిన్‌ గోడ కూల్చివేతతో నాశనం అయిందనుకున్న మార్క్సిస్టు కమ్యూనిజం తిరిగి ఆవిర్భవించింది, స్పెయిన్‌లో పాలన సాగించటం ఖాయం, నవంబరులో సంకీర్ణ కూటమి ఎన్నికైనపుడు అనుకున్న లేదా విశ్వసించిన దాని కంటే పరిస్ధితి ఇప్పుడు మరింత తీవ్రంగా ఉంది ” అని స్పానిష్‌ బిషప్పుల సంఘం ఉపాధ్యక్షుడు కార్డినల్‌ ఆంటోనియో కానిజారెస్‌ లొవెరా వ్యాఖ్యానించాడు. ఈనెల 11న మత వెబ్‌ సైట్‌లో పోస్టు చేసిన లేఖలో ఈ అభిప్రాయాలను వెల్లడించాడు. వెనిజులా వంటి లాటిన్‌ అమెరికా దేశాల తప్పుల తడకలతో ఉన్న సోషలిస్టు విధానాలను దాదాపుగా స్పెయిన్‌ కాపీ చేస్తున్నదని భావిస్తున్నారు. స్పెయిన్‌ను స్పెయిన్‌గా ఉంచకుండా ఒక ప్రయత్నం జరుగుతోందని ఎంతో బాధతో చెబుతున్నా మరియు హెచ్చరిస్తున్నా. అంతర్యుద్ధం తరువాత నియంత్రత్వం నుంచి ప్రజాస్వామ్యానికి మారాలన్న స్ఫూర్తి ఖాళీ అయింది, మరచిపోయారు. ఎల్లవేళలా విభజించే మరియు ఎన్నడూ ఐక్యం కానివ్వని భావజాలంతో నింపేస్తున్నారు అని ఆరోపించాడు. మరుసటి రోజు మరొక ఆర్చిబిషప్‌ జీసస్‌ శాంజ్‌ మాంటెస్‌ మరొక లేఖ రాస్తూ చరిత్రలో దేశం మరొక తీవ్ర పరిస్ధితిలోకి పోతున్నదని, వివిధ పద్దతుల్లో స్వేచ్చను పరిమితం చేస్తున్నారని ఆరోపించాడు.ఈ నెల ఎనిమిది పోడెమాస్‌తో కలసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సోషలిస్టు పార్టీ నేత పెడ్రో శాంఛెజ్‌ ప్రధానిగా పదవీ స్వీకారం చేస్తూ సాంప్రదాయకమైన శిలువ, బైబిల్‌ మీద ప్రమాణం చేసేందుకు తిరస్కరించాడు. పాఠశాల విద్య పాఠ్యాంశాల నుంచి మతాన్ని తొలగించటంతో సహా లౌకిక విధానాల అజెండాను అమలు జరుపుతామని ప్రకటించాడు. అంతే కాదు, గతంలో అక్రమంగా చర్చ్‌లకు దఖలు పరచిన ఆస్తులను జాతీయం చేస్తామని, విద్యార్ధులకు లైంగిక విద్యను బోధిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ చర్యలు సహజంగానే చర్చ్‌కు ఆగ్రహం కలిగిస్తున్నాయని వేరే చెప్పనవసరం లేదు. నిజానికి సోషలిస్టు పార్టీ గతంలో కూడా అధికారంలోకి వచ్చింది. కొన్ని పురోగామి సంస్కరణలు తప్ప అదేమీ విప్లవకార్యాచరణను చేపట్టటం లేదు. అయినా మతం ఆగ్రహిస్తోంది.

Image result for chin peng
మలేసియాను భయపెట్టిన కమ్యూనిస్టు చితా భస్మం !
కమ్యూనిస్టు వ్యతిరేకులకు కమ్యూనిస్టులే కాదు చివరకు వారి చితా భస్మం కూడా భయపెడుతోందా ? అవును మలేషియాలో అదే జరిగింది. వృద్ధాప్యంతో మరణించిన పూర్వపు మలేషియా కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి చిన్‌ పెంగ్‌ చివరి కోర్కె మేరకు ఆయన మరణించిన ఆరు సంవత్సరాల తరువాత థారులాండ్‌ నుంచి తెచ్చిన చితాభస్మాన్ని సముద్రంలోనూ, పెంగ్‌ సాయుధపోరాటం సాగించిన అడవుల్లోనూ గతేడాది సెప్టెంబరు 16న చల్లినట్లు ఒక వెబ్‌సైట్‌ పేర్కొన్నది. ఈ వార్తతో పాటు 1989లో సాయుధ పోరాటాన్ని విరమించి మూడు దశాబ్దాలు గడిచిన సందర్భంగా దానితో సంబంధం ఉన్న వారు, దాని గురించి తెలిసిన వారు మలేషియాలో కొన్ని చోట్ల సభలు జరిపారని మీడియా పేర్కొన్నది. వారిలో కొందరు జర్నలిస్టులు కూడా ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. ఇంకే ముంది ఇవన్నీ మలేషియాలో తిరిగి కమ్యూనిస్టు పార్టీని పునరుద్దరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, వాటిని కఠినంగా అణచివేయాలని మాజీ పోలీసు, పారా మిలిటరీ అధికారుల సంఘాల నాయకత్వంలో ప్రదర్శనలు చేసి, చితాభస్మం తెచ్చిన వారి మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఇప్పటికే తొమ్మిది సంస్ధలకు చెందిన వారు ఆ సభలో పాల్గొన్నట్లు, వారి నుంచి పోలీసులు సంజాయిషీ కోరి నట్లు వార్తలు వచ్చాయి. బ్రిటీష్‌ పాలనలోని పూర్వపు మలయా కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో జపాన్‌ దురాక్రమణకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు పోరాడారు. తరువాత స్వాతంత్య్రం వచ్చి మలయా, మలేషియాగా రెండు దేశాలు ఏర్పడిన తరువాత కమ్యూనిస్టులు మలేషియాలో విప్లవ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు 1968 నుంచి 1989వరకు పోరాడారు. ఆ ఏడాది మలేషియా సర్కార్‌తో పోరు విరమణకు ఒప్పందం చేసుకున్నారు. ఆ మేరకు పార్టీ నేత చిన్‌ పెంగ్‌ థారులాండ్‌లో ఆశ్రయం పొంది 2013లో అక్కడే 90 ఏండ్ల వయస్సులో మ రణించారు. ఒప్పందం మేరకు మలేషియాకు తిరిగి వచ్చేందుకు అనుమతించిన నేతలు తిరిగి పార్టీని పునరుద్దరించేందుకు ప్రయత్నిస్తున్నారని మాజీ పోలీసులు చెబుతున్నారు. అయితే ప్రభుత్వ అండతోనే పోలీసులు వీధుల్లోకి వచ్చి ప్రదర్శనలు చేశారు.

(Reuters/edited by Ricardo Vaz for Venezuelanalysis.com)
పరువు పోగొట్టుకున్న వెనిజులా ప్రతిపక్ష నేత గుయడో !
గత సంవత్సరం లాటిన్‌ అమెరికా పరిణామాలను గుర్తుకు తెచ్చుకుంటే అరవైకి పైగా దేశాలు వెనిజులా అసలైన అధ్యక్షుడిగా గుర్తించిన జువాన్‌ గుయడో ఈనెల మొదటి వారంలో పరువు పోగొట్టుకొని అపహాస్యం పాలయ్యాడు. అధ్యక్షుడు మదురో ఎత్తుగడకు చిత్తయి గిలగిలా కొట్టుకుంటున్నాడు.2018 వెనిజులా ఎన్నికల్లో అధ్యక్షుడిగా సోషలిస్టు నికోలస్‌ మదురో ఎన్నికైనా, అంతకు ముందు పార్లమెంట్‌లో మెజారిటీ సీట్లను తెచ్చుకోవటంలో సోషలిస్టు పార్టీ విఫలమైంది. దాంతో ప్రతిపనికీ ప్రతిపక్షం అడ్డం పడటంతో పాటు గతేడాది పార్లమెంట్‌ స్పీకర్‌గా ఉన్న ప్రతిపక్ష జువాన్‌ గుయడో తనను తాను తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రకటించుకున్నాడు. పొలో మంటూ అమెరికా కనుసన్నలలో నడిచే అరవైకిపైగా దేశాలు గుర్తింపును ప్రకటించాయి. మిలిటరీలో తిరుగుబాటును రెచ్చగొట్టేందుకు చేసిన యత్నం కూడా విఫలమైంది. ఇదే మరొక దేశంలో అయితే అందుకు పాల్పడిన వారిని కాల్చివేయటం లేదా కటకటాల వెనుక ఉంచుతారు. జనం, మిలిటరీ, పోలీసు, పారా మిలిటరీ మద్దతు ఉన్న సోషలిస్టు మదురో అలాంటి చర్యలకు పాల్పడకుండా అతడి వలన ప్రమాదం లేదనే అంచనా, ఇతర కారణాలతో గుయడోను స్వేచ్చగా తిరగనిస్తున్నారు.
అమెరికాతో సహా దాని మిత్ర దేశాలన్నీ మదురోను ఇప్పటికీ అధ్యక్షుడిగా గుర్తించటం లేదు గానీ పార్లమెంట్‌ను గుర్తిస్తున్నాయి.ఈనెల ఐదున పార్లమెంట్‌ స్పీకర్‌ ఎన్నిక జరిగి, దానికి తిరిగి గుయడో ఎన్నికైతేనే వెనిజులా తాత్కాలిక అధ్యక్షుడిగా అమెరికా కూటమి గుర్తింపు ఉంటుంది. గుయడోను తిరిగి ఎన్నుకొనే పరిస్ధితి లేదు. అయితే ఏదో ఒకసాకుతో పార్లమెంట్‌ను బహిష్కరిస్తే అధికారపక్షం నుంచి లేదా దాని మద్దతు ఉన్నవారు స్పీకర్‌ అవుతారు. గత ఏడాదిలో జరిగిన పరిణామాలలో ప్రతిపక్ష పార్టీలలో చీలిక వచ్చింది. దాన్ని ఉపయోగించుకొని మదురో ప్రధాన ప్రతిపక్షాన్ని చావు దెబ్బతీశాడు. జనవరి ఐదో తేదీన ఎన్నిక జరగాల్సి ఉండగా భద్రతా దళాలు తనను పార్లమెంట్‌లో ప్రవేశించనివ్వకుండా అడ్డుకుంటున్నాయంటూ గుయడో కేకలు వేస్తూ తన మద్దతుదార్ల వీపుల మీద ఎక్కి పార్లమెంట్‌ గేట్‌ దూకుతున్నట్లు అంతర్జాతీయ మీడియాకు ఫోజులిచ్చాడు. నిజానికి అతగాడి ప్రవేశాన్ని ఎవరూ అడ్డుకోలేదు. ఎన్నికలో చీలిక పక్షనేతకు అధికారపక్షం మద్దతు ఇవ్వటంతో గుయడో ఓడిపోయాడు. తరువాత తన మద్దతుదారులతో తనకు వత్తాసు పలికే ఒక మీడియా కార్యాలయంలో స్పీకర్‌ ఎన్నిక తతంగాన్ని నిర్వహించి తిరిగి తాను ఎన్నికైనట్లు ప్రకటించుకున్నాడు. ఇది అమెరికాను కూడా ఇరకాటంలో పడేసింది. త్వరలో జరగనున్న పార్లమెంటరీ ఎన్నికలలో పాల్గొనాలా వద్దా అన్న మీమాంసలో ప్రతిపక్షాలు పడ్డాయి. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన పార్లమెంట్‌ ఎన్నికలకు దూరంగా ఉంటే సోషలిస్టులు దానిలో మెజారిటీ సాధించి మరింత బలపడతారు. విఫల తిరుగుబాట్ల నేపధ్యంలో పోటీ చేస్తే తిరిగి గెలుస్తామన్న ధైర్యమూ ప్రతిపక్షానికి లేదు.
పైన పేర్కొన్న పరిణామాలను చూస్తే దుష్ట పెట్టుబడిదారీ వ్యవస్ద దోపిడీ కొనసాగినంత కాలం, ఎదురు దెబ్బలు తగిలినా సోషలిస్టు, కమ్యూనిస్టు శక్తులు వాటిని తట్టుకొని ముందుకు పోతాయి, అంతకు మించిన ప్రత్యామ్నాయం మరొకటి లేదు అన్నది స్పష్టంగా కనిపిస్తోంది. నిరాశావాదులు అరగ్లాసు నీటిని చూసి అయ్యోపూర్తిగా నిండలేదే కూలబడితే, ఆశావాదులు సగం గ్లాసు నిండిందనే ధీమాతో ముందుకు పోతారు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

పవన్‌ కల్యాణ్‌ బుర్ర తిరిగిందా ? మెదడు మార్పిడి జరిగిందా !

17 Friday Jan 2020

Posted by raomk in AP NEWS, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

Aandhra Pradesh Politics, BJP, Pawan kalyan

Image result for pawan kalyan, bjp
ఎం కోటేశ్వరరావు
పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ గారికి
ఒక తెలుగు వాడిగా ఈ లేఖ రాస్తున్నా, వాడిగా, వేడిగా ఉందని విసుక్కోకుండా ఒక సారి గడ్డం సవరించుకొని కాస్త తీరిక చేసుకొని చదివి ఒకసారి గతాన్ని గుర్తుకు తెచ్చుకొని, భవిష్యత్‌లో కాస్త ఆచితూచి మాట్లాడతారని అనుకుంటున్నా. ఒక వేళ మీకు ఎవరైనా స్క్రిప్టు రాసిస్తూ ఉంటే (అదేమీ తప్పు కాదు, ఏం మాట్లాడాలో తెలియనపుడు పెద్ద పెద్ద నేతలందరూ అదే చేస్తారు ) వారికి ఈ లేఖను అందించండి. లేకపోతే ఏదేదో మాట్లాడి మీరు అభాసుపాలౌతారు. మీరు మాట్లాడుతున్న తీరు చూస్తుంటే ఏదో జరిగినట్లు అని పిస్తోంది. చిల్లంగా లేక చేతబడా మరొకటా ? లేఖ ముగింపుకు వచ్చే సరికి ఏదైనా సమాధానం దొరుకుతుందేమో చూస్తా !
రాజకీయ పార్టీకి నిజాయితీ ముఖ్యం. ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడి తప్పించుకు తిరిగి ధన్యత పొందాలంటే కుదదరదు. అందునా ప్రజాజీవితంలో ఉన్నపుడు తనను ఎవరూ చూడటం లేదనుకొనే పిల్లి మాదిరి ఆలోచిస్తే ఎదురుతన్నుతుంది. ప్రజా జీవితంలో ఉన్నపుడు
” ఆడిన మాటలు తప్పిన – గాడిద కొడుకంచు తిట్టగా విని,
మదిలో వీడా కొడుకని ఏడ్చును – గాడిదయును కుందవరపు కవి చౌడప్పా ”

అన్న కవి చౌడప్ప పద్యం గుర్తుకు తేవాల్సి వచ్చినందుకు ఏమీ అనుకోవద్దేం ! వహ్వా వహ్వా అనే అభిమానుల పూలే కాదు, ఏమిటిది అనే విమర్శకుల రాళ్లను కూడా సమంగా చూడాలి మరి ! మీకు తెలిసిన సినిమా భాషలో చెప్పాలంటే హిట్లను చూసి పొంగిపోకూడదు, ప్లాప్‌లను చూసి కుంగిపోకూడదు మరి !
ఆదిలోనే హంసపాదు అన్నట్లు మరిచాను. ” నేను ప్రశ్నించడానికే రాజకీయాల్లోకి వచ్చాను” అని చెప్పారు మీరు. మీ అంత హీరో చెప్పారు కనుక మేమంతా మీ పుణ్యమా అని కొత్తగా ప్రశ్నించటం నేర్చుకున్నాం. నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా అని మేమూ కొన్ని ప్రశ్నలు అడిగేందుకు మీరు అవకాశం ఇచ్చారు. ఊరందరిని ఉల్లిపాయను తినొద్దని చెప్పాను గానీ ఇంట్లో నిన్ను వేయవద్దని చెప్పానా అని పెళ్లాన్ని బాదిన ప్రవచన కారుడిలా మారవదు,్ద వీలైతే నాలుగు సమాధానాలు చెప్పండి.
బిజెపితో జతకడుతున్న మీరు వామపక్షాలకేమి చెబుతారని విలేకర్లడిిగితే అదేమిటి పీకే గారూ ఠకీమని వామపక్షాలకు నేనేమన్నా బాకీ ఉన్నానా అన్నారు. అప్పులు వడ్డీల లెక్కల పద్దతిలో చెప్పాలంటే మీరు బిజెపితో రెండో సారి జతకడుతున్నారంటే మరో పాకేజీయా అనటం లేదు గానీ, బిజెపి మీకు కొత్తగా ఏమన్నా అప్పు ఇచ్చిందా లేక ఇప్పుడు సినిమాలేమీ లేవు, రాబోయే నాలుగున్నరేండ్లు రాజకీయాలే రాజకీయాలు అంటున్నారు గనుక బిజెపి దగ్గర మీరేమన్నా అప్పు తీసుకున్నారా అన్న అనుమానం మాత్రం వస్తోంది. ఎందుకంటే గతంలో మీ ఆర్ధిక పరిస్ధితి ఎంత దిగజారిందో మీరే చెప్పిన విషయం గుర్తుకు వస్తోంది. వామపక్షాలకు నేను చెప్పాల్సిందేమీ లేదు బ్రదర్‌ అని మామూలుగా చెబితే మీ సొమ్మేం పోయేది, రాజకీయాల్లో అంత ఎటకారాలాడితే, జనం మిమ్మల్ని ఆడుకుంటారనే చిన్న లాజిక్కు మర్చిపోతే ఎలా ! కాస్త మన్నన నేర్చుకుంటే మంచిదేమో !
ఏ పార్టీతో కలవాలో ఏం ఊరేగాలో అది మీ ఇష్టం. దానిలో కాస్త నిజాయితీ ఉండాలి సార్‌ ! వివిధ సందర్భాల్లో మీరు చేసిన కొన్ని ఆణిముత్యాలందామా లేక గోల్డెన్‌ వర్డ్స్‌ అందామా అన్నది తరువాత మాట్లాడుకుందాం. మచ్చుకు కొన్నింటి కోసం పాత సినిమాల్లో లేదా కొత్త సినిమాల్లో మాదిరి అయినా ఒక్కసారి వెనక్కు చూద్దాం. మీకు గతాన్ని గుర్తు చేసినందుకు కోపం రావచ్చు. తప్పదు మరి ?
”చస్తే చస్తాం గానీ.. జనసేన పార్టీని ఎప్పటికీ భారతీయ జనతా పార్టీలో విలీనం చేయం. తెలుగుజాతి ఉన్నతిని, గౌరవాన్ని ఎప్పటికీ కాపాడుకుంటూనే ఉంటాం” అంటూ ప్రజాపోరాట యాత్ర సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు సభలో సెలవిచ్చారు. సరే ప్రస్తుతం విలీనం లేదు కనుక అది నాకు వర్తించదు అంటారా !
” పాచిపోయిన లడ్డూ లాంటి ప్రత్యేక ప్యాకేజీ కూడా మోదీ సర్కారు రాష్ట్రానికి సరిగా ఇవ్వలేదు. ఉడుముకు ముఖంపై రాసిన తేనెలా రాష్ట్రం పరిస్థితి తయారైంది. కేంద్ర ప్రభుత్వం స ష్టించిన అయోమయ పరిస్థితి వల్ల రాష్ట్ర ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టంలోని అంశాలను నాలుగేళ్లుగా అమలు చేయలేదు. నన్ను, బీజేపీని, టీడీపీని భాగస్వాములుగా ప్రజలు భావించారు. అందువల్ల వారికి నైతికంగా సమాధానం చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంది. ” సంయుక్త నిజ నిర్ధారణ కమిటీ నివేదికపై తుది కసరత్తు అనంతరం హైదరాబాద్‌ మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలివి.
”ప్రధాన మంత్రి మోదీ ఆంధ్రప్రదేశ్‌ను అభివ ద్ధి చేయకుండా మోసం చేశారు. సీఎం చంద్రబాబు మీద కోపం ఉంటే ఆయన మీద చూపించండి. మా రాష్ట్రం మీద ఎందుకు చూపిస్తారు? ” రాజమహేంద్రవరంలో జరిగిన పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో చెప్పిన గౌరవ ప్రదమైన మాటలివి. ‘
‘ 10 లక్షల రూపాయల సూట్‌ వేసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ వ థా చేసేంది ప్రజాధనమే. సర్దార్‌ వల్లభారు పటేల్‌ విగ్రహం ఏర్పాటు విషయంలో ప్రధాని మోదీని అడగాల్సి ఉంది. ” విశాఖలో మీట్‌ ది ప్రెస్‌. ” నా దేశభక్తిని శంకిస్తున్న బీజేపీ నేతలు హద్దుల్లో ఉండాలి. అవాకులు, చెవాకులు పేలితే సహించే ప్రశ్నే లేదు. నేను మొదలు పెడితే బీజేపీ నేతలు నోరు తెరవలేరు. ”చిత్తూరులో జరిగిన బహిరంగ సభలో. ” వెనుకేసుకురావడానికి నాకు బీజేపీ బంధువూ కాదు. మోదీ అన్నయ్యా కాదు. అమిత్‌షా బాబయ్యా కాదు. వారిని ఎందుకు వెనుకేసుకొస్తాను? రాజకీయ జవాబుదారీతనం లేనందునే ఆంధ్రప్రదేశ్‌కు దక్కాల్సిన ప్రత్యేక హౌదా దక్కలేదు. ఈ విషయంలో ప్రధానమంత్రి మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు ఇద్దరూ మాట తప్పారు. ” విజయవాడలో జనసేన పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం సందర్భంగా.
బిజెపితో కమ్యూనికేషన్‌ గ్యాప్‌ (సమాచార అంతరం) కారణంగా మధ్యలో విడిపోయామని పవన్‌ కల్యాణ్‌ చెబుతున్నారు. ఇది రాజకీయం, సినిమా లావాదేవీల్లో మాదిరి లెక్కల్లో చూపేందుకు వీలుగా ఇచ్చే ప్రతిఫలం ఒకటి, చాటు మాటుగా ఇచ్చేది మరొకటి కాదు కదా ! చెప్పుకోలేని చాటు మాటు వ్యవహారాల్లో సైగలను అర్ధం చేసుకోలేక, బయటకు చెప్పుకోలేక అపార్ధాలతో మేము గత కొంత కాలంగా మౌనంగా ఉన్నామనో మాట్లాడుకోవటం లేదనో, ఇప్పడు మబ్బులు వీడెనులో, తనువులు కలిసెనులే అని పాట పాడుకుంటున్నాం అంటే అర్ధం చేసుకుంటాం. పైన మీరు చేసిన వ్యాఖ్యలు, చెప్పిన మాటలు చూస్తే సమాచార అంతరం కాదు. మీరేమీ మౌనంగా లేరు, 2014-2019 ఎన్నికల సందర్బంగా మాట్లాడిన మాటలను చూస్తే ఎడమ జేబులో ఒక ప్రకటన, కుడి జేబులో ఒక ప్రకటన పెట్టుకొని వచ్చే అనుకూల, వ్యతిరేక సిగల్‌ను బట్టి జేబులో ప్రకటనలు తీసి రెచ్చిపోయి చదివినట్లుగా ఉంది.
రాజకీయాల్లో నీతి, నిజాయితీలకు కట్టుబడి ఉండాలనుకుంటే అసలు మీ మధ్య వచ్చిన సమాచార అంతరం ఏమిటి, అప్పుడెందుకు అలా మాట్లాడారు, ఇప్పుడు తొలిగిన అంతరం ఏమిటి, ఇప్పుడెందుకు ఇలా మాట్లాడుతున్నారో చెప్పాలి మరి. లేకపోతే మిమ్మల్మి నమ్మేదెలా ? కొంత కాలం తరువాత మరొక వైఖరి తీసుకొని అప్పుడు మరొక సమాచార అంతర కథతో జనాల చెవిలో పూలు పెడితే పరిస్ధితి ఏమిటి ? ఎందుకంటే ఏ సినిమా వ్యక్తిని కదలించినా బోల్డు కధలు ఉన్నాయి అని చెబుతుంటారు కదా !
ప్రత్యేక హౌదా గురించి అడిగితే దాన్ని ఇవ్వాల్సిన నరేంద్రమోడీని అడగండి అని చెప్పాల్సిన మీరు అడ్డం తిరిగి తెలుగుదేశం పార్టీని, వైసిపిని అడగండి అంటారేమిటి స్వామీ ! ఢిల్లీ పర్యటనల తరువాత కిందిది పైన పైది కిందకు కనిపిస్తున్నట్లుగా ఉంది మీకు. తాట తీస్తా, తోలు వలుస్తా అన్న మీకు ఏమీ కాకపోతే ఇవ్వాల్సిన వారినా అడగాల్సింది తీసుకొనే వాళ్లనా ? ఇదెక్కడి విడ్డూరం, ఇదేమి ట్విస్టు, సినిమా కథ అనుకుంటున్నారా ? మీరు హీరో కనుక మీతో సినిమా తీయాలనుకొనే వారు మీరు చెప్పినట్లు కథను మార్చవచ్చు తప్ప, ఇది రాజకీయం, మీ ఇష్టం వచ్చినట్లు మారిస్తే కుదరదు.
ఒకే భావం జాలం కలిగినట్లు చెప్పుకుంటున్న మీరు విరుద్ద భావజాలంతో పని చేసే కమ్యూనిస్టులతో ఎలా కలిశారు, ఒకే భావజాలం కలిగిన బిజెపి వారిని అంత తీవ్రంగా ఎలా విమర్శించారు? ఎన్నికలు ముగిశాక మారు మనసు పుచ్చుకున్నారా, బిజెపి జమానాలో బుర్ర మార్పిడి జరిగిందా? ఎన్నికల్లో తగిలిన ఎదురు దెబ్బ హిట్‌ అనుకున్న సినిమా అట్టర్‌ ప్లాఫ్‌ అయినట్లుగా మీరు అనుకున్న అధికారం రాకపోవటంతో రగిలిన విరహంతో మీరే ఢిల్లీ చూట్టూ ప్రదక్షిణలు చేశారా లేక బిజెపికి రాష్ట్రంలో కిక్కు ఇచ్చేవారెవరూ లేరని వారే మీ కోసం రాయబారాలు(కొందరు మీ వ్యతిరేకులు రాయ బేరాలు అనుకుంటున్నారు) పంపారో చెప్పాలి. గతంలో పాచిపోయింది మీకు మోడీ సర్కార్‌ ఇప్పుడే తయారు చేసి పెట్టిన ఘుమఘమ లాడుతున్న లడ్డులా అనిపించిందా ? లేక కొన్ని స్వీట్‌ షాపుల్లో మిగిలిపోయిన స్వీట్లను పారవేయకుండా వాటితోనే కొత్త స్వీట్లు తయారు చేసి వినియోగదారులకు సరికొత్తగా విక్రయించినట్లు మీకు వడ్డించారేమో చూసుకోండి.

Image result for pawan kalyan anti bjp
సరే చంద్రబాబు ప్రత్యేక హౌదా మీద డింకీలు కొట్టారు. దాని కంటే ప్రత్యేక పాకేజి మెరుగు అన్నారు. అసలు ప్రత్యేక పాకేజిలో ఉన్న ఇతర రాష్ట్రాలకు లేని ప్రత్యేకత ఏమిటి ? దాన్నెందుకు కేంద్రం అమలు జరపలేదో తాజాగా జరిపిన ఢిల్లీ ప్రదక్షిణలలో అయినా దేవుడు మోడీని ప్రార్ధించారా ? నిజానికి ప్రత్యేక పాకేజీ మోడీ – చంద్రబాబు లేదా ఇప్పుడు మోడీ-జగన్‌ ప్రయివేటు వ్యాపారం కాదు. రాష్ట్రానికి చేసిన వాగ్దానం. బాబు గద్దె దిగి పోయారు జగన్‌ వచ్చారు, కేంద్రం అమలు జరపటానికి వచ్చిన అడ్డంకి ఏమిటి ? ఏడు నెలలుగా ఏమి చేశారు ? పౌర సత్వ సవరణ చట్టం గురించి బిజెపి ఏ పలుకులనైతే వల్లిస్తోందో వాటినే మీరు వల్లించారు. ఏ గూటి చిలక ఆ గూటి పలుకులే పలుకుతుందంటే ఇదే కదా !
చివరాఖరుగా పేపరు కాగితం మీద ఇంక్‌ సిరాతో మీరు రాసిస్తారో లేక టైపు చేసి ఇస్తారో తెలియదు. జగన్‌ మూడు రాజధానులతో మూడు ప్రాంతాల అభివృద్ధి అంటూ సరికొత్త ప్రమాదకర రాజకీయానికి తెరతీసింది వైసిపి. దాన్ని జనసేన-బిజెపి కూడా అదే అభివృద్ధి నినాదంతోనే ఎదుర్కొంటామని చెబుతున్నాయి. జగన్‌ దగ్గర ఒక నిర్ధిష్ట అజెండా లేదా ప్రతిపాదనలు లేవు. మీ దగ్గర ఉన్న మంత్రదండం ఏమిటి ? దాన్ని ఎప్పుడు బయటకు తీస్తారు ? నాలుగున్నర సంవత్సరాల పాటు కబుర్లు చెబుతూ కాలక్షేపం చేస్తారా ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

జెఎన్‌యు మూత సలహా ఇతర ‘వర్సిటీలు, సంఘపరివార్‌కూ వర్తింప చేస్తారా ?

15 Wednesday Jan 2020

Posted by raomk in Communalism, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

ABVP, Closer of JNU, India R&D expenditure, JNU, JNU ROW, Patents, RSS

Image result for jnu,

ఎం కోటేశ్వరరావు
జెఎన్‌యు గురించి వివరాలు తెలుసుకుందాం. రఘునాథ రామారావు గారి ఆంగ్ల లేఖకు తెలుగు అనువాదం మరి కొంత నా సేకరణ. మదన్‌ గుప్త పేరుతో ఒక పోస్టు సామాజిక మాధ్యమాల్లో తిరుగుతోంది. దీన్ని చదివి కొంత మంది దానిలోని అంశాలు నిజమే కదా అని నిజంగానే ఆందోళన పడుతున్నారు. కొందరు దీన్ని పూర్వపక్షం చేస్తూ వాస్తవాలు బయటపెడితే బాగుండు అనుకుంటున్నవారు కూడా లేకపోలేదు. ‘వాట్సాప్‌ యూనివర్సిటీ’ గురించి తెలిసిన వారికి కాషాయ తాలిబాన్లు విసిరిన మరొక బాణం ఇది అని ఇట్టే పసిగట్టగలరు. దీనిలో జెఎన్‌యు గురించి కొత్తగా తెలిపిందేమీ లేదు, చదివిన వారు తెలుసుకొనేదీ ఏమీ లేదు.
ముందుగా అడగాల్సింది అసలు ఆ రామారావు ఎవరు, ఆయనెందుకు ఆంగ్లంలో లేఖ రాశారు, ఆపెద్ద మనిషి కవిత్వానికి మదన్‌ గుప్త తనపైత్యాన్ని జోడించటమెందుకు ? ఈ పోస్టు ఎవరిపేరుతో అయితే ఉందో వారి విశ్వసనీయత, అసలు ఆ పేరుతో ఎవరైనా ఉన్నారో కల్పిత వ్యక్తులో తెలియదు. వారు పేర్కొన్న అంశాలకు ఆధారాలేమిటో అసలే తెలియదు కనుక దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. జెఎన్‌యు మీద దాడిలో ఇదో కొత్త కోణం. దీపికా పదుకోన్‌ ఆ విశ ్వవిద్యాలయాన్ని సందర్శించి ముసుగు గూండాల దాడిలో గాయపడిన వారికి మద్దతు తెలిపిన అంశం గురించి ‘కంటి చూపుతో కాషాయ తాలిబాన్లపై విరుచుకుపడ్డ హీరో దీపిక ‘ అనే శీర్షికతో రాసిన నా విశ్లేషణపై కాషాయ మరుగుజ్జులు(ట్రోల్స్‌) ఎగిరెగిరి పడ్డారు. జెఎన్‌యు కమ్యూనిస్టుల కిస్‌ కల్చర్‌ (ముద్దుల సంస్కృతి) కేంద్రం అని నోరుపారవేసుకున్నారు. ఆ కేంద్రంలోనే బిజెపి నేతలు నిర్మలా సీతారామన్‌, మేనకా గాంధీ వంటి వారు విద్యాభ్యాసం చేశారు. వారెంత మందికి ముద్దులిచ్చారు, ఎంత మందినుంచి ముద్దులు తీసుకొని ఉంటారో చెప్పగలరా అన్న ప్రశ్నకు జవాబు లేదు. ఇప్పుడు ఎబివిపికి చెందిన ఆమ్మాయిలు, అబ్బాయిలు కూడా అక్కడ చాలా మంది ఉన్నారు. అలాంటి సంస్కృతి అక్కడ ఉందనుకుంటే దానిలో కొనసాగటం ఎందుకు, చదువు మానుకొని బయటకు రావచ్చు, వేద పాఠశాలలు, సంస్ధలలో చేరవచ్చు !
అందువలన ఎవరికిి తెలిసిన భాషలో చెబితేనే వారికి సులభంగా అర్ధం అవుతాయి. ఈ పోస్టుకూడా ఇంచు మించు అలాంటిదే కనుక కొన్ని అంశాలను చూద్దాం. మామిడి చెట్టు నాటితే మామిడి కాయలే కాస్తాయి, జాంకాయలు ఎందుకు కాయటం లేదనే కుతర్కం, బుర్రతక్కువ జనాలకు ఏం చెప్పాలి. జెఎన్‌యు సాంకేతిక విద్యా సంస్ధ కాదు. ప్రధానంగా సామాజికాంశాలతో పాటు సైన్సు కోర్సులు కూడా బోధించే సాధారణ విశ్వవిద్యాలయం. అక్కడ పరిశోధనలు కూడా జరుగుతున్నాయి. డాక్టరేట్స్‌ను ఇస్తున్నారు. ప్రత్యేకించి శాస్త్ర, సాంకేతిక అంశాల అధ్యయనం, పరిశోధనలకు ఐఐటిలు, ఇతర పరిశోధనా సంస్దలు ఉన్నాయి. సాధారణ విశ్వవిద్యాలయాలను, వీటినీ రెండింటినీ ఒకే గాటన కట్టటం వక్రీకరణ.
ఈ పోస్టులో లాభనష్టాల గురించి చర్చ చేశారు. విద్యా సంస్ధలు చేసేది వాణిజ్యం కాదు కనుక లాభనష్టాల ప్రమాణాలు వర్తింప చేయటం అనుచితం. ఇతర విశ్వవిద్యాలయాలు కూడా ఇదే మాదిరి బోధన, పరిశోధన అవకాశాలను కల్పిస్తున్నాయి. కనుక వాటితో పోల్చి చూపితే ఆ పోస్టుపెట్టిన వారి బండారం ఏమిటో తెలిసి ఉండేది. ఆ చిత్తశుద్ది పోస్టులో లేదు. దానిలో పేర్కొన్న కొన్ని అంశాలకు ఆధారాలేమిటో తెలియదు. జెఎన్‌యులో చదివిన వారు ఎందరు ఉపాధి పొందారో తెలియదు అన్నారు. ఆ పరిశోధకుడు, పరిశీలకుడు కలసి ఇతర విశ్వవిద్యాలయాల్లో చదివి పట్టాలు పొందిన వారు ఎందరు ఉపాధి పొందారో ఏమి చేస్తున్నారో లెక్కలు చెప్పగలరా ? లేదా నరేంద్రమోడీ గారు సెలవిచ్చినట్లు పకోడీ బండ్లు ఎందరు పెట్టారో తెలుపగలరా ?

Image result for jnu attack
చెడిపోయిన ప్రజాస్వామ్యానికి జెఎన్‌యు ఓ గొప్ప ఉదాహరణ అట. సరే అంగీకరిద్దాం, బాగున్న ప్రజాస్వామ్యానికి ఓ గొప్ప ఉదాహరణగా ఉన్న విశ్వవిద్యాలయం పేరేమిటో చెప్పి ఉంటే వివేక వంతులు పోల్చి చూసుకొనే వారు. ఇప్పటికైనా చెప్పండి, సవాలు కాదు సవినయంగా అడుగుతున్నాం. అక్కడి విద్యార్ధులకు ఖాళీ సమయం ఎక్కువ కాబట్టి కొత్త సమస్యలు సృష్టించటంపైన, మైండు కూడా ఖాళీగా ఉంటుంది కాబట్టి అడ్డమైన భావజాలంతో నింపేస్తారట, అన్నీ ఉచితంగా అందుతూ ఉంటే ముసలి వారైనా అక్కడే వారి జీవితాన్ని గడిపేస్తారుట. సాంఘిక సంస్కరణల ఊసులేదట, ఇలా సాగిన, రాసిన చెత్తకంతకూ సమాధానం చెప్పటం వాణిజ్య భాషలో దండగ, కనుక ఆపని చేయటం లేదు. ఇలాంటి పోస్టులు ఏ మాత్రం విమర్శనాత్మక వైఖరిలేని వారి బుర్రలను ఖరాబు చేస్తాయి. వాటి లక్ష్యమే అది. రెండు రెళ్లు నాలుగే ఎందుకు కావాలి, మూడు ఎందుకు కాకూడదు అని ఎవరైనా వాదించే వారిని సంతృప్తి పరచ చూడటం వృధా ప్రయాస. ఒక సినిమాలో నువ్వు ఎవరు అనే ప్రశ్నతో ఉన్న దృశ్యాలను వారికి చూపటం తప్ప మరొక మార్గం లేదు. దేశంలో పేటెంట్‌లు, పరిశోధనలు తక్కువగా ఉండటానికి కారణం జెఎన్‌యు అన్నట్లుగా చిత్రించిన పెద్దలు ఈ దేశంలో ఎన్ని విశ్వవిద్యాలయాలు, వాటితో సమానమైన సంస్ధలు, ఎన్ని లక్షల మంది వాటిలో చదువుతూ, పరిశోధనలు చేస్తున్నారో తెలుసుకుంటే జెఎన్‌యులోని ఎనిమిదివేల సంఖ్య ఎంత తక్కువో తెలుస్తుంది. జెఎన్‌యును మూసివేయాలని వాదించేందుకు తెగ ఆయాసపడిపోవటం గాకుండా అసలు మొత్తంగా పరిశోధనలు, పేటెంట్ల నమోదులో దేశం ఎందుకు వెనుకబడి పోయిందో, దానికి పరిష్కారాలు ఏమిటో చెప్పి ఉంటే వారి శ్రమ ఫలించేది.

Image result for jnu attack
పరిశోధనలు, నవకల్పనలను ప్రోత్సహించే వాతావరణం, అందుకు అవసరమైన పెట్టుబడి వంటి అంశాలను మనం చూడాల్సి ఉంది. ప్రధాన మంత్రి ఆర్ధిక సలహా మండలి ఆరునెలల క్రితం చేసిన సిఫార్సులో దేశంలో పరిశోధన మరియు అభివృద్ది కార్యకలాపాలకు 2022నాటికి జిడిపిలో కనీసం రెండు శాతం ఖర్చు చేయాలని కోరింది. గత రెండు ద శాబ్దాలుగా చేస్తున్న ఖర్చు 0.6 నుంచి 0.7శాతం మధ్య ఉంది. అలాంటిది మరో రెండు సంవత్సరాల్లో రెండుశాతానికి పెరుగుతుందని ఆశించే పరిస్ధితి ప్రస్తుతం ఉందా.


ప్రపంచ నవకల్పన సూచికలో మన దేశ స్ధానం గురించి చెప్పుకోబోయే ముందు పరిశోధనకు వివిధ దేశాలు జిడిపిలో చేస్తున్న ఖర్చును చూస్తే ఇజ్రాయెల్‌ 4.3, దక్షిణ కొరియా 4.2, జపాన్‌ 3.2, అమెరికా 2.8, చైనా 2.1 శాతం ఖర్చు (2017) చేస్తున్నాయి. ఈ మధ్య మన కాషాయ పరివారం ప్రతిదానికి పాకిస్ధాన్‌తో పోల్చుకోవటాన్ని ఎక్కువ చేసింది. దాని ఖర్చు 0.5శాతంగా ఉంది కనుక, మన దేశాన్ని మోడీ సర్కార్‌ దాని కంటే కొన్ని మెట్లు ఎగువ నిలిపిందని గొప్పలు చెప్పుకోవచ్చు.
దేశంలో నేడున్న పరిస్ధితి ఏమిటి? ఆపరేషన్లకు ఎలాంటి విఘ్నం కలగ కూడదని వైద్యులు గణపతికి మొక్కుతారు. పోలేరమ్మలకు సద్ది నైవేద్యాలు పెడతారు. ప్రయోగం విజయవంతం కావాలని ఇస్త్రో శాస్త్రవేత్తలు వెంకటేశ్వరుడిని, సుళ్లూరు పేట గ్రామ దేవతలను వేడుకుంటారు. వేదాల్లోనే అన్నీ ఉన్నాయష అని చెప్పేవారు తామరతంపరగా పెరిగిపోతున్నారు. లక్షల సంవత్సరాల నాడే మన పూర్వీకులు ఎలాంటి ఇంధనం లేకుండా పలు ఖండాలకు ఎటు కావాలంటే అటు తిరిగే, ఎందరు ఎక్కినా మరొకరికి సీటు దొరిక విమానాలు నడిపారని, కృత్రిమ గర్భధారణ పద్దతుల్లో నూరుగురు కౌరవులను పుట్టించారని, ప్లాస్టిక్‌ సర్జరీ తెలిసిన కారణంగానే వినాయకుడికి ఏనుగు తలను అతికించారని, ఆవు మూత్రంలో బంగారం ఉందని, ఆవు పేడలో ఔషధ గుణాలున్నాయని, వాటి మీద పరిశోధనలు చేయండని చెప్పేందుకు ప్రధాని నుంచి కింది స్ధాయి ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్త వరకు పోటీ పడుతుండటాన్ని చూస్తున్నాము. మూఢనమ్మకాలతో రోజు ప్రారంభమై ముగుస్తున్న సమాజంలో , నరికిన వినాయకుడి తలనే తిరిగి అతికించకుండా ఏనుగు తలను ఎందుకు అతికించారు అనే ప్రశ్ననే అడగకుండా నీకు తెలియదులో నోరు మూసుకో చెప్పింది విను అని మొగ్గలోనే చిదిమేస్తున్నకుటుంబవాతావరణంలో, రాయి రప్పలు, చెట్లు పుట్టలకు మొక్కితే పోయేదేముందిలే అనే తరాలు పెరుగుతున్న తరుణంలో లక్షలు ఎలా సంపాదించాలి, అమెరికా,ఆస్ట్రేలియా ఎలా వెళ్లాలి అనే యావతప్ప శాస్త్ర, సాంకేతిక రంగాలు, పరిశోధనల పట్ల ఆసక్తి ఏమి ఉంటుంది, పరిశోధనల్లో విజయాల కంటే వైఫల్యాలే ఎక్కువ ఉంటాయి, అయినా ముందుకు పోవాలంటే ఆసక్తి కలిగిన వారికి ఆర్ధిక భరోసా కలిగించకపోతే, సాధించిన విజయాలకు ప్రోత్సాహం లేకపోతే యువతరానికి ఆ రంగంలో కొనసాగాలనే ఆసక్తి ఎలా ఉంటుంది ?
నవకల్పనల విషయంలో మన దేశ స్ధానం ఎక్కడ అన్నది చూద్దాం. ఈ మధ్యకాలంలో మన ప్రధాని నరేంద్రమోడీ కొత్త విషయాలు చెబుతున్నారు. ఐదేండ్ల క్రితం అచ్చేదిన్‌, గుజరాత్‌ మోడల్‌ అభివృద్ధి అని ఊదరగొట్టారు. ఇప్పుడు వాటి ఊసే లేదు. అంటే వాటన్నింటినీ సాధించారని మనం అనుకోవాలి. రెండో సారి ఎన్నికైన తరువాత 70ఏండ్లలో సాధించలేని వాటిని అన్నింటినీ సాధించామని చెప్పుకుంటున్నారు.మారు మాట్లాడకుండా చెవుల్లో కమలం పువ్వులు పెట్టుకొని భజన చేయాలి. లేకపోతే దే శద్రోహులం అవుతాం, రాబోయే ఎన్‌పిఆర్‌, ఎన్‌ఆర్‌సిలలో మన పేర్లను పక్కన పెట్టి జాతీయతను నిరూపించుకొనే ఆధారాలు సమర్పించమంటారు.
2014లో ప్రపంచ నవకల్పనల సూచికలో 143 దేశాల జాబితాలో మన దేశం 33.7శాతం మార్కులతో 76వ స్ధానంలో ఉంది. మన ఒక పొరుగుదేశం మోడీ అండ్‌కో నిత్యం కలవరించే పాకిస్ధాన్‌ 24 మార్కులతో 134వ స్ధానంలో, చైనా 46.57 శాతం మార్కులతో 29వ స్ధానంలో ఉంది.( ఒకటవ స్ధానంలో ఉన్న స్విడ్జర్లాండ్‌కు వచ్చిన మార్కులు 64.78శాతం). ఐదేండ్ల తరువాత 129 దేశాలలో మోడీ పాలనలో మన మార్కులు 36.58శాతంతో 52 స్ధానాన్ని పొందాము. ఇదే సమయంలో పాకిస్ధాన్‌ 31.62 మార్కులతో 113 స్ధానాన్ని, చైనా 54.82 మార్కులతో 14వ స్ధానానికి చేరింది.ఒకటవ స్ధానంలో ఉన్న స్విడ్జర్లాండ్‌ మార్కులు 67.24. దీన్ని బట్టి ఎక్కడ ఎలాంటి ప్రోత్సాహం, పోటీ ఉందో ఎవరికి వారే అర్ధం చేసుకోవచ్చు. అన్ని విజయాలు సాధించిన నరేంద్రమోడీ ఈ విషయంలో ఎందుకు విఫలమయ్యారు ? చైనా ఐదేండ్లలో తన మార్కులను 8.25, పాకిస్ధాన్‌ 7.62 పెంచుకోగా మనం 2.88కి మాత్రమే ఎందుకు పరిమితం అయ్యాం ?
ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే పరిశోధన, అభివృద్ధికి ఖర్చు చేయకుండా ముందుకు పోజాలదు. మన ప్రధాని దేశాన్ని ఐదు లక్షల కోట్ల డాలర్ల ఆర్ధిక వ్యవస్ధగా మార్చుతామని చెప్పటం తప్ప అందుకు అవసరమైన కనీస చర్యలు కూడా చేపట్టలేదు. కుండలో కూడు కుండలోనే ఉండాలి బిడ్డడు గుండ్రాయిలా తయారు కావాలంటే కుదురుతుందా? పరిశోధనా ఖర్చును ఎందుకు పెంచలేదో ఎవరైనా చెప్పగలరా ? గతేడాది అక్టోబరు ఆరవ తేదీన ఎకనమిక్స్‌ టైమ్స్‌లో జి సీతారామన్‌ రాసిన ఒక విశ్లేషణ వచ్చింది. దాని సారాంశం, వివరాలు ఇలా ఉన్నాయి. ” ప్రపంచ మేథోసంపత్తి సంస్ధ వివరాల మేరకు 2017లో కొన్ని దేశాలలో దాఖలైన పేటెంట్ల దరఖాస్తులు, మంజూరైన పేటెంట్‌ల వివరాలు ఇలా ఉన్నాయి.
దేశం         దరఖాస్తులు         పేటెంట్ల మంజూరు
చైనా         13,81,594             4,20,144
అమెరికా      6.06,956              3,18,481
జపాన్‌         3,18,481              1,99,577
ఐరోపా         1,66,585              1.05,645
భారత్‌            46,582                12,387
ప్రతి పదిలక్షల మందికి జపాన్‌లో 2,053, అమెరికాలో 904, చైనాలో 899, జర్మనీలో 887 మంది పేటెంట్లకు దరఖాస్తు చేయగా మన దేశంలో కేవలం పదకొండు మంది మాత్రమే ఉన్నారు. పరిశోధకుల విషయానికి వస్తే యునెస్కో సమాచారం 2015 ప్రకారం ప్రతి పదిలక్షల మందికి గాను జపాన్‌లో 5,210, అమెరికాలో 4,313,ఐరోపాయూనియన్‌లో 3,749, చైనాలో 1,206 మంది ఉండగా మన దేశంలో 216 మాత్రమే ఉన్నారు.
దేశంలోని ఐఐటీల్లో 2018-19లో బొంబాయి ఐఐటి 98 పేటెంట్లకు దరఖాస్తు చేసింది. మిగతా అన్ని ఐఐటిలు దాఖలు చేసిన వాటిలో ఇవి ఆరోవంతు. ఇదే ఏడాది బొంబాయి ఐఐటి పరిశోధన ఖర్చు 335 కోట్ల రూపాయలు కాగా దానిలో 80శాతం ప్రభుత్వం నుంచి మిగిలిన మొత్తం ప్రయివేటు రంగం నుంచి వచ్చింది.”

Image result for who are advocating closure of jnu, will they extend rss and its affiliates too
అమెరికా, జపాన్‌, ఐరోపా యూనియన్‌ దేశాల్లో గణనీయ మొత్తాలను ప్రయివేటు కార్పొరేట్లు కూడా ఖర్చు చేస్తున్నాయి. మన దేశంలో పరిశోధనల ఖర్చు పేరుతో రాయితీలు పొందటం తప్ప వాస్తవ ఖర్చు పరిమితం. ఇక వేదాల్లో, సంస్కృత గ్రంధాల్లో అపార సాంకేతిక పరిజ్ఞానం ఉంది అని చెప్పేవారు వాటిని వెలికి తీసి పేటెంట్‌ దరఖాస్తులను ఎందుకు దాఖలు చేయలేదు ? ఏ గుడ్డి గుర్రాలకు పండ్లుతోముతున్నారు ? వారిని అడ్డుకున్నదెవరు ? చైనా, పాకిస్ధాన్ల గురించి సొల్లు కబుర్లతో కాషాయ దళాలు పోసుకోలు కబుర్లు చెప్పటాన్ని పక్కన పెట్టి వేద విజ్ఞానాన్ని ఎందుకు వెలికి తీయించలేకపోయారు? జెఎన్‌యు గురించి ప్రశ్నిస్తున్నవారు సంఘపరివార్‌ నడిపే సరస్వతి శిశుమందిర్‌లు, ఇతర విద్యా సంస్ధలలో శిక్షణ పొందిన వారిలో ఎందరు పేటెంట్‌లు పొందారో, పరిశోధనలు చేసి ఏమి సాధించారో చెబుతారా ?

Image result for who are advocating closure of jnu, will they extend rss and its affiliates too
విద్యా సంస్ధలలో లెక్చరర్లు, విద్యార్ధులతో కూడి దేశంలో అతి పెద్ద విద్యార్ధి సంఘం అని చెప్పుకొనే ఎబివిపి ఎప్పటి నుంచో దేశభక్తిని నూరిపోస్తున్నట్లు చెప్పుకుంటుంది. అలాంటి సంస్ధ తన సభ్యులతో ముసుగులు వేసి దాడులు చేయించటాలు, విద్యా సంస్ధల్లో గణేష్‌ పూజలు, తిరోగామి భావాలను ప్రోత్సహించటం వంటి వాటిని పక్కనపెట్టి పరిశోధనల వంటి అంశాలపై తన సభ్యులను పురికొల్పి ఉంటే ఈ పాటికి చైనాతో సహా ఎన్నడో ఇతర అన్ని దేశాలను అధిగమించే వారం కదా ? ఎన్నో పేటెంట్‌లు వచ్చి ఉండేవి కదా ? నరేంద్రమోడీ సర్కార్‌కు ఆర్ధికంగా ఇన్ని ఇబ్బందులు వచ్చేవి కాదు, ఐదు లక్షల కోట్ల డాలర్ల జిడిపి కల నెరవేరేది. పరిశోధనలు లేవు, పేటెంట్లను సాధించని కారణంగా జెఎన్‌యును మూసివేయాలని సలహా ఇస్తున్న పెద్దలు ఎబివిపికి లేదా దాని మాతృసంస్ధ ఆర్‌ఎస్‌ఎస్‌కు , ఇతర యూనివర్సిటీల గురించి ఏమి సలహా యిస్తారు ? విద్యా సంస్దలను, సంఘపరివార్‌ సంస్ధలను మూసుకొమ్మంటారా, లేకపోతే ఇప్పటి మాదిరే పైవిధంగా ముందుకు పొమ్మని ప్రోత్సహిస్తారా ? పనికి రానివి, ప్రయోజనం లేనివి ప్రభుత్వ సంస్దలైతేనేం, ప్రయివేటువైతేనేమి ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

ఒక భ్రమరావతి మూడు కానుందా-చంద్రబాబు చెప్పుల్లో జగన్‌ దూరుతున్నారా?

12 Sunday Jan 2020

Posted by raomk in AP NEWS, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

Aandhra Pradesh three Capitals, Chandra Babu, CM YS Jagan

Image result for jagan three capitals

ఎం కోటేశ్వరరావు
తాను అనుకున్న పద్దతుల్లోనే రాజధాని రాజకీయాన్ని ముందుకు తీసుకుపోయేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి కృతనిశ్చయంతో ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలో ఎన్ని విమర్శలు ఎదురైనా స్వయంగా కొత్త సమస్యలను సృష్టించుకుంటున్నారా, అవే చివరకు గుది బండలుగా మారతాయా? రాజకీయంగా పతనానికి నాంది పలుకుతాయా ? జగన్‌ తలకెత్తుకున్న మూడు రాజధానుల రాజకీయం నల్లేరు మీద నడకంత సులభంగా సాగుతుందా, అసలు అనుకున్న గమ్యస్ధానం చేరుతుందా ? గతంలో ఉత్తర ప్రదేశ్‌తో సహా అనేక రాష్ట్రాల అసెంబ్లీలు తమకు హైకోర్టు బెంచ్‌లు కావాలని చేసిన తీర్మానాలన్నీ ప్రస్తుతం చెత్తబుట్టలో ఉన్నాయి. ఈ నేపధ్యంలో ఉన్న హైకోర్టును అమరావతి నుంచి కర్నూలుకు తరలించటం, అమరావతి, విశాఖల్లో బెంచ్‌లు ఏర్పాటు చేయాలని జగన్‌ కోరగానే అమలు జరపటానికి సిద్దంగా ఉన్నదెవరు ? ఉత్తర ప్రదేశ్‌ 22 కోట్ల మంది జనాభా ఉన్న రాష్ట్రం తమ అవసరాలకు ఐదు హైకోర్టు బెంచ్‌లు కావాలని ఎప్పటి నుంచో కోరుతున్నారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి కంటే ప్రధాని నరేంద్రమోడీ దగ్గర జగన్‌కు పలుకుబడి ఎక్కువ ఉందా లేదా తన పలుకుబడి గురించి ఎక్కువగా ఊహించుకుంటున్నారా ? నిజానికి అంత ఉంటే ఈ పాటికి రాష్ట్రానికి ప్రత్యేక హౌదాను ఎందుకు సాధించలేకపోయార? దాన్ని సాధించి ఉంటే కేంద్రం ఇచ్చే రాయితీలతో, పరి శమలకు ఇచ్చే మినహాయింపులతో రాష్ట్రంలోని పదమూడు జిల్లాలూ అభివృద్ది చెందుతాయి కదా ? జగన్‌ అజెండాను, రాజకీయాన్ని కేంద్రంలోని బిజెపి అనుమతిస్తే ఆంధ్రప్రదేశ్‌లో ఆ పార్టీని, దాన్ని నమ్ముకున్న వారి పరిస్ధితి ఏమిటి? ఒక కులాన్ని లక్ష్యంగా చేసుకొన్నట్లుగా జగన్‌ తీరు కనిపిస్తోంది. కులాల కళ్లద్దాలతో చూస్తే సదరు కులానికి ఉన్న బలమైన లాబీ కంటే కేంద్రంలో జగన్‌కు పలుకుబడి ఎక్కువా ? తీరా ఏదీ అనుకున్నది అనుకున్నట్లు జరగకపోతే వచ్చే ఎన్నికల్లో దాన్నే ఒక అస్త్రంగా చేసుకొని ఎన్నికల బరిలో దిగుతారా ? అసలు అభివృద్ది అజెండాను పక్కన పెట్టి ఆ పేరుతో మూడు రాజధానుల రాజకీయ చదరంగాన్ని ప్రారంభించి తప్పుటడుగు వేశారా ? ఎవరు ఎవరిని కట్టడి చేస్తారు, ఎవరు ఎవరిని హతమారుస్తారు. ఇదే కదా చదరంగం !
రాజకీయాల్లో ముఖ్యంగా కక్షపూరితంగా వ్యవహరించే కుమ్ములాటల్లో ఎప్పుడు ఏమైనా జరగవచ్చు ! జగన్‌మోహనరెడ్డి తానొక ముఖ్యమంత్రి అని భావిస్తున్నట్లు కనిపించటం లేదు. ఓదార్పు యాత్రల బ్రాండ్‌ అంబాసిడర్‌ లేదా ఓదార్పుకు మారు పేరుగా ఖ్యాతి పొందిన వ్యక్తికి ఆందోళన చెందుతున్న వారి భయాలను పోగొట్టాలనే బాధ్యత ఉందనే స్పృహ ఉన్నట్లు లేదు. గత ఐదు సంవత్సరాలలో ఏదో ఒక పేరుతో జనానికి దగ్గరైన వ్యక్తి అనుకున్న అధికారాన్ని సాధించగానే జనానికి దూరమై ప్రతిపక్ష నేతలు ఓదార్పు యాత్రలను ప్రారంభించేందుకు తొలి ఆరునెలల్లోనే నాంది పలికారా ?
ఓట్లు, సీట్లతో నిమిత్తం లేకుండా ప్రజాసమస్యల మీద గళమెత్తే వామపక్ష పార్టీలు పోలీసుల దెబ్బలు తింటూ, నిర్బంధాలను ఎదుర్కొంటూ నిరంతరం తమ కార్యక్రమాలను చేస్తాయన్నది తెలిసిందే. అలాగాక కేవలం అధికారం, దానితో రెండు చేతులా ఎలా సంపాదించుకోవాలా అని తప్ప మరొకటి పట్టని, రాజకీయంగా దెబ్బతిన్న తెలుగుదేశం,బిజెపి, జనసేన పార్టీలకు ముఖ్యమంత్రి రాజకీయ ఉపాధి కల్పిస్తున్నారు. అసమ్మతి తెలిపిన వారికి పోలీసు దెబ్బలను రుచి చూపుతున్నారు. ఇప్పటి వరకు అధికారంలో ఉన్నపుడు ఒక విధంగా లేనపుడు మరోతీరునా ప్రవర్తించే తీరు తెన్నులను తెలుగుదేశం నేత చంద్రబాబులో, కొంత మేరకు పవన్‌ కల్యాణ్‌లో జనం చూశారు. గతంలో జగన్‌ ప్రతిపక్ష రూపాన్ని జనం చూ శారు. ఇప్పుడు తన రెండో రూపాన్ని జనానికి స్వయంగా చూపుతున్నారు.

Image result for ap capital news
తాము కన్న కలలను కల్లలుగా చేస్తున్నారనే భావనతో రాజధాని ప్రాంత గ్రామాల జనం ప్రారంభించిన శాంతియుత ఆందోళనను పట్టించుకోకపోగా పోలీసులతో అణచివేయించటం ఆందోళనకరం, గర్హనీయం. గతంలో చంద్రబాబు నాయుడు సిఎంగా ఉన్నపుడు రాజధాని భూసేకరణ విధానాన్ని వ్యతిరేకించిన వామపక్షాలు, ఇతర పార్టీలు, వ్యక్తులు, సంస్ధల వారు తమ అభిప్రాయాలను జనానికి చెప్పేందుకు ఆ గ్రామాలకు వెళ్లినపుడు వారిని అక్కడి జనం పట్టించుకోలేదు, చెప్పేది వినిపించుకొనేందుకు సైతం సిద్దపడలేదు. కొన్ని చోట్ల మరింత రెచ్చిపోయి గ్రామాల వారు, వారికి మద్దతుగా అధికార పార్టీ పెద్దలు, పోలీసులు ఎన్ని ఆటంకాలు కల్పించారో, అసలు గ్రామాల్లోకే రానివ్వని రోజులను చూశాము. ఇప్పుడు జగన్‌ సర్కార్‌ కూడా పోలీసులతో అదే పని చేయిస్తున్నది. అప్పుడు పూలింగ్‌ పద్దతుల్లో నష్టపోతారు, పాలకపార్టీలు కల్పించే భ్రమలను నమ్మవద్దని చెప్పిన వారిని రైతులు పట్టించుకోలేదు, అధికారపార్టీ, ప్రభుత్వం వ్యతిరేకించింది. రాజధాని అంశాన్ని తిరగదోడిన జగన్‌ సర్కార్‌ ఇప్పుడు అదే చేస్తున్నది. భూములిచ్చిన రైతులకు న్యాయం కలిగించాలని కోరుతున్నవారిని అధికార పార్టీ వ్యతిరేకిస్తున్నది, ప్రభుత్వం అడ్డుకుంటున్నది, మహిళలు అనే విచక్షణ కూడా పాటించకుండా లాఠీలతో కొట్టిస్తున్నది, కేసులు బనాయిస్తున్నది. రైతులను నిస్సహాయులను చేసేందుకు ప్రయత్నిస్తున్నది.
రాజధానిని మార్చాలని అనుకుంటే దాన్ని సూటిగానే చెప్పవచ్చు. అది మంచిదా చెడ్డదా,ఏమి చేయాలో జనం నిర్ణయించుకుంటారు. ఒక పెద్ద మనిషి అమరావతిని ఎడారి అన్నారు, మరొకరు శ్మశానం అన్నారు. ఇలా నోరు పారవేసుకున్న వారు ఆ ఎడారి లేదా శ్మశానంలోనే రోజూ రాకపోకలు సాగిస్తున్నారు, పాలన చేస్తున్నారు. ఇక వైసిపి నామినేటెడ్‌ పదవులు పొందిన సినీనటుడు పృద్ధ్వి,కొందరు నేతల నోళ్లు ఏం మాట్లాడుతున్నాయో అదుపులేని స్ధితిలో ఉన్నాయి. ఇలాంటి పరిస్ధితిని కల్పించిన వారికి సహజంగానే భయం పట్టుకున్నట్లుంది. రాజధాని ప్రాంత గ్రామాల్లోని జనానికి బేడీలు వేసి ఇండ్లలో నిర్బంధించలేరు. అందువలన రోడ్లపై ప్రయాణించే ముఖ్యమంత్రి, మంత్రులు, స్పీకరు, ఇతర నోటితుత్తర నేతలకు ఏమి జరుగుతుందో తెలియదు. దాంతో పోలీసులు రాజధాని గ్రామాల్లోని రోడ్డు పక్క ఇండ్ల నుంచి రాళ్లు , ఇతర వస్తువులను విసిరినా తగలకుండా చూసేందుకు తెరలతో కాపలాలు కాస్తున్నారని సామాజిక మాధ్యమాల్లో చిత్రాలతో సహా దర్శనమిచ్చాయి.(అవి ఇక్కడివా మరొక చోటివా అన్నది నిర్ధారించుకోవాలి) ఒక వేళ అవేగనుక నిజమైతే ఒక ప్రభుత్వానికి అంతకంటే అవమానకరం లేదు, లేదా పోలీసులే అలా చిత్రించి మంత్రులకు రక్షణ లేదు అని చెప్పటానికైనా కావచ్చు.
రాజధానికి భూములిచ్చిన రైతులను స్వార్ధపరులుగా వైసిపి నేతలు చిత్రిస్తున్నారు. అభివృద్ధి అంతా అక్కడే కేంద్రీకృతం కావాలన్న స్వార్ధ పరులు అంటున్నారు, మిగతా ప్రాంతాలు అభివృద్ధి చెందకూడదా అని ఎదురుదాడి చేస్తున్నారు. వారందరూ భూస్వాములు, వారి పిల్లలందరూ విదేశాల్లో, లేదా దేశంలోని ఇతర పెద్ద పట్టణాల్లో ఉంటారు, వ్యవసాయం చేయరు, ఒకే కులానికి చెందిన వారంటూ ముద్రవేస్తున్నారు. రాయలసీమ వారందరూ రౌడీలు, ఫాక్షనిస్టులని కొందరు ఎలా నిందిస్తారో ఇది కూడా అలాంటిదే. రాజధానికి స్వచ్చందంగా లేదా బలవంతంగా, ప్రలోభాలకు గురి చేసిగానీ సేకరించిన భూమి 33వేల ఎకరాలు, యజమానులు 29వేల మంది. ఎక్కడైనా వూరికి ఐదు పది మంది చొప్పున ఐదు పది ఎకరాలు కోల్పోయిన వారు ఉంటే ఉండవచ్చుగానీ వారందరూ చిన్న, సన్నకారు రైతులు. ఎక్కడైనా పట్టణాలలో ఒకే కులానికి చెందిన లేదా మతాలకు చెందిన వారి అపార్ట్‌మెంట్లు ఉన్నాయోమో గానీ, ఒకే కులానికి చెందిన గ్రామాలు ఎక్కడా లేవు. కొన్ని చోట్ల కొన్ని కులాల వారు అత్యధికంగా వుంటే ఉండవచ్చు. రాజధాని ప్రాంతం ఉన్న తాటికొండ నియోజకవర్గం షెడ్యూలు కులాలవారికి రిజర్వు చేసినది. అంటే మిగతా ప్రాంతాలతో పోలిస్తే అక్కడ ఆ కులాలకు చెందిన వారు గణనీయంగా ఉన్నారనేది నిర్ధారణ. ఒక వేళ ఒకే కులం, ఒకే పార్టీకి చెందిన వారు 29 గ్రామాల్లో ఉంటే వారి ఓట్లన్నీ ఒకే పార్టీకి గుండుగుత్తగా పడి ఉంటే అక్కడ వైసిపి గెలిచే అవకాశాలే లేవు. భూములిచ్చిన వారిలో అన్ని పార్టీలకు చెందిన, కులాల వారు ఉన్నారు.
మూడు రాజధానుల ప్రతిపాదనలో అమరావతికి భూములిచ్చిన వారి ఆందోళన ప్రత్యేకమైనది. ఇతర ప్రాంతాలలో ప్రాజెక్టులు లేదా పారిశ్రామిక ప్రాంతాలు లేదా ఇతర అవసరాలకు ప్రభుత్వాలు భూములు సేకరించి వారికి చట్టం ప్రకారం పరిహారం చెల్లించాయి. అది ఎక్కువా తక్కువా, సమంజసమా అంటే అవునని ఎవరూ చెప్పరు. వాస్తవ ధరకంటే ప్రభుత్వం నిర్ణయించిన మేరకే పరిహారం వుంటుంది. ఒకసారి సొమ్ము తీసుకున్న తరువాత భూములతో వారికి పని ఉండదు. అటు బొందితో స్వర్గానికి పోలేక ఇటు భూమి మీదకు తిరిగి రాలేక మధ్యలో విశ్వామిత్రుడు సృష్టించిన స్వర్గంలో తలకిందులుగా వేలాడిన త్రిశంకుడి మాదిరి అమరావతి ప్రాంత రైతుల పరిస్ధితి తయారైంది. దీనికి ఎవరిది బాధ్యత ?
ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రియలెస్టేట్‌ ద్వారా డబ్బులు సంపాదించి రాజధానితో పాటు నవనగరాలను నిర్మిస్తానని చంద్రబాబు నాయుడు భ్రమరావతికి తెరలేపారు. ఆ మైకంలో పడిన రైతాంగం తమ భూములన్నింటినీ సమర్పించుకుంది. రియలెస్టేట్‌ ఎండమావులను చూసి వర్షించే మేఘాలని భ్రమపడింది. పది సంవత్సరాల పాటు వారిచ్చిన భూములకు కౌలు చెల్లిస్తామని, పద్దెనిమిది నెలల్లో భూముల్లో కొన్ని ప్లాట్లను అభివృద్ధి చేసి వారికి ఇస్తామన్నది ప్రభుత్వం కుదుర్చుకున్న అవగాహన. ఆ మేరకు కౌలు చెల్లిస్తున్నారు తప్ప ప్లాట్లను అభివృద్ధి చూసి ఇంకా పూర్తిగా అప్పగించలేదు. కొత్త ప్రభుత్వం ఆపని చేస్తుందని ఆ శలు పెట్టుకున్న రైతాంగం అసలుకే మోసం తలపెట్టిన సర్కార్‌ తీరును చూసి హతాశులయ్యారు. జగన్‌ అసెంబ్లీలో చెప్పినట్లుగా, కమిటీలు సూచించినట్లుగా, రాబోయే హైపవర్‌ కమిటీ సూచించబోయేవాటి ప్రకారం అమరావతిని ఏడాదికి పది లేదా పదిహేను రోజుల పాటు జరిపే అసెంబ్లీ సమావేశాలకు(నెల రోజుల పాటు జరిగే వేసవి లేదా బడ్జెట్‌ సమావేశాలను విశాఖలో జరపాలనే సిఫార్సును అమలు చేస్తే) పరిమితం చేసి సచివాలయం, హైకోర్టు ఇతర కార్యాలయాలను ఇక్కడి నుంచి తరలిస్తే జరిగేదేమిటి? గడువు ముగిసిన తరువాత కౌలు మొత్తాన్ని నిలిపివేస్తారు, కేటాయించిన ప్లాట్లకు డిమాండు పడిపోతే లేదా కొనుగోలు చేసే వారు లేకపోతే తమ పరిస్ధితి ఏమిటి అన్నది ఆ ప్రాంత రైతుల ఆవేదన.
అమరావతితో సహా రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి సూచనలు చేయాలంటూ ఒక్క ఆర్ధిక, సామాజికవేత్త కూడా లేకుండా పట్టణ ప్రణాళికల నిపుణులతో మాజీ అయ్యేయెస్‌ అధికారి జిఎన్‌రావు కన్వీనర్‌గా ఒక కమిటిీని వేశారు. అది తన నివేదికలో ఏమి సిఫార్సు చేస్తుందో తెలియక ముందే కడుపులో ఉన్నదానిని దాచుకోలేక గానీ లేదా సదరు నివేదికలో ఏమి రాయాలో చెప్పిన విషయం గుర్తుకు వచ్చిగానీ మూడు రాజధానులు, ఎక్కడ ఏమివస్తాయో కూడా సూచన ప్రాయంగా అసెంబ్లీలో స్వయంగా ముఖ్యమంత్రే చెప్పిన తరువాత కమిటీ ఏమి ఇవ్వనున్నదో ముందే తెలిసిపోయింది. రాజధానుల గురించి చెప్పిన ముఖ్యమంత్రి ఏ ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమం చేపట్టబోతున్నామో, దానికింద ఏమేమి చేయబోతున్నామో కూడా చెప్పి ఉంటే అదొక తీరు. కమిటీ సిఫార్సులు, వాటికి ఉన్న చట్టబద్దత లేక ఆచరణ సాధ్యమా అన్న అంశాలు ఒక ఎత్తు. ఆ కమిటీతో పాటు బోస్టన్‌ కన్సల్టెన్సీ గ్రూపు సలహా అంటూ మరొకదాన్ని ముందుకు తెచ్చారు. లెక్కలేనంత మంది సలహాదారులు జగన్‌ చుట్టూ కొలువు తీరి ఉన్నారు. జనం సొమ్ము నుంచి ప్రతినెలా లక్షల రూపాయల ప్రతిఫలం, ఇతర సౌకర్యాలు పొందుతూ వారేమి సలహాలు ఇస్తున్నారో పాలకులేమి తీసుకుంటున్నారో మనకు తెలియదు. గతంలో చంద్రబాబు సలహాదారులు కూడా ఏమి చెప్పారో తెలియదు.(వారిచ్చిన సలహాలే తెలుగుదేశం పార్టీకి ఘోరపరాజయాన్ని చేకూర్చాయనే వారి అభిప్రాయాలను కాదనలేము. అదే బాటలో జగన్‌ సలహాదారులు కూడా ఉన్నారన్నది ఏడు నెలల పాలన చెబుతున్నది)
జిఎన్‌ రావు కమిటీ నివేదిక, బోస్టన్‌ సలహాలన్నింటినీ కలగలిపి సిఫార్సులు చేయాలంటూ పది మంది మంత్రులు, ఆరుగురు అధికారులతో ఉన్నతాధికార కమిటీ అంటూ మరొకటి వేశారు. వీరేమి చేయబోతున్నారనేందుకు బుర్రబద్దలు కొట్టుకోవాల్సిన పనిలేదు. జిఎన్‌రావు రాష్ట్రాన్ని నాలుగు అభివృద్ధి మండలాలుగా చేయాలంటే, బోస్టన్‌ ఆరు అని చెప్పింది. పదహారు మంది కమిటీ రెండింటినీ కలిపి పది అని చెప్పవచ్చు లేదా పదిని రెండుగా చేసి ఐదు అనవచ్చు, ఇలాంటి కమిటీల నుంచి అంతిమంగా ముఖ్యమంత్రులు ఏది చెబితే అదే బయటకు వస్తుందన్నది గత అనుభవం. మీరేది చెబితే అదే కరెక్టు అనే మంత్రులు, అధికారులే తాజా కమిటీలో కూడా ఉన్నారు.
మూడు రాజధానుల గురించి వైసిపి నేతలు తాము తెలివిగా మాట్లాడుతున్నామని అనుకుంటున్నారు. మూడు చోట్ల రాజధానులు ఏర్పాటు చేస్తే ఎందుకు వ్యతిరేకించాలి అని కొందరు, రాజ్యాంగంలో ఒక్క చోటే రాజధాని ఉండాలని ఉందా అని మరి కొందరు, మూడు చోట్ల అభివృద్ధి అవసరం లేదా అంటూ మాట్లాడుతున్నారు. మూడు రాజధానులు పెట్టుకోవచ్చని ఎక్కడైనా రాజ్యాంగంలో ఉందా అంటే సమాధానం లేదు. అభివృద్ది అవసరం లేదని ఎవరు అన్నారు, మూడు రాజధానులతో అభివృద్ది ఎలా చేస్తారో చెప్పమంటే కంటి చూపులే తప్ప నోటమాటలు లేవు, తరువాత వెల్లడిస్తామంటారు.
మూడు చోట్ల కాదు కొత్త రాజధాని ఎక్కడ అనే చర్చ సమయంలో ముప్ఫయి చోట్ల ఏర్పాటు చేయాలని ప్రతి పాదించి ఆమోదం పొందితే ఎవరికీ అభ్యంతరం లేదు.జగన్‌ మోహనరెడ్డి నాడు అసెంబ్లీలో భూ సేకరణ గురించి భిన్నాభి ప్రాయం వ్యక్తం చేయటం తప్ప అమరావతిని రాజధానిగా అంగీకరించారు. ముప్పయివేల ఎకరాలు కావాలన్నారు. కార్యనిర్వాహక, శాసన, న్యాయ రాజధానుల గురించిన ప్రస్తావన అప్పుడే కాదు, తరువాత గత ఐదు సంవత్సరాలలో ఎన్నడూ రాజధాని గురించి లేదా బహుళరాజధానుల గురించి చర్చ లేదు, కోరినవారూ లేరు. అధికారానికి వచ్చిన తరువాతే వైసిపి నాయకత్వంలో పునరాలోచన, కొత్త ఆలోచనలు పుట్టుకు వచ్చాయి. మూడు చోట్ల ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు, పదమూడు జిల్లాల్లో లేదా లోక్‌సభ నియోజకవర్గ ప్రాతిపదికన జిల్లాల పునర్విభజన అంటున్నారు కనుక 25 చోట్ల కూడా ఏర్పాటు చేయవచ్చు. ఇక్కడ తేలాల్సింది ఎవడబ్బ సొమ్మని రామ చంద్రా అని భక్త రామదాసు అడిగినట్లుగా ఎవరి జేబుల్లో సొమ్ముతో అన్ని రాజధానులు ఏర్పాటు చేయాలన్నదే అసలు సమస్య.
పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంత రాష్ట్రం. అది మూడు రాష్ట్రాల్లో నాలుగు ముక్కలుగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో యానామ్‌, తమిళనాడులో పుదుచ్చేరి, కరైకాల్‌, కేరళలో మాహే ప్రాంతాలు ఉన్నాయి. దానికి లేని రాజధాని సమస్య ఆంధ్రప్రదేశ్‌కు ఎలా వస్తుంది. రాజధానులతోనే అభివృద్ది జరిగేట్లయితే ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ రాజధాని ఢిల్లీ నుంచి ఒక ముక్కను ఏర్పాటు చేయాలని జగన్‌ సర్కార్‌ ఎందుకు కోరటం లేదు. దక్షిణాదిన సుప్రీం కోర్టు బెంచ్‌ పెట్టాలన్న డిమాండును వైసిపి ఎందుకు చేయటం లేదు ? ఆంధ్రుల హక్కుగా విశాఖ ఉక్కును సాధించుకున్న చరిత్ర తెలిసిందే. దాని వలన ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు లక్ష మందికి ఉపాధి లభిస్తోంది. దానికి ముడిఇనుప గనులను కేటాయించాలన్న డిమాండ్‌ను కేంద్ర పట్టించుకోవటం లేదు. అది చేయకపోగా దాన్ని విదేశీ కంపెనీలకు ధారదత్తం చేసేందుకు పూనుకుంటే దాని గురించి మాట్లాడని జగన్‌ సర్కార్‌ విశాఖ అభివృద్ది గురించి కాకమ్మ కబుర్లు చెబుతోంది.
చంద్రబాబు నాయుడు అమరావతి గురించి అతిగా మాట్లాడి, ప్రచారం చేసి దాన్నొక రియలెస్టేట్‌ ప్రాజెక్టుగా మార్చేందుకు చూశారు. ఒక్క రైతాంగాన్నే కాదు, అనేక మందిలో భ్రమలు కల్పించి చేతులు కాల్చుకొనేట్లు చేశారు. ఇప్పుడు చంద్రబాబు ప్రచారాన్నే అస్త్రంగా చేసుకొని వైసిపి రాజధాని రాజకీయానికి తెరలేపింది. గందరగోళాన్ని సృష్టించింది. అక్కడే లక్ష కోట్లు తగలేస్తే మిగతా ప్రాంతాల అభివృద్ధి సంగతేమిటని ప్రాంతీయ మనోభావాలను రెచ్చగొడుతోంది. ఎవరు కట్టమన్నారు, తాత్కాలిక ఏర్పాట్లలోనే పాలన సాగించవచ్చు, అసంపూర్ణంగా ఉన్నవాటిని పూర్తి చేసి మిగతా అవసరాలను తరువాత చూసుకోవచ్చు. గత కొన్ని దశాబ్దాలుగా పాలకులుగా కాంగ్రెస్‌ లేదా తెలుగుదేశం ఎవరున్నా ప్రజాకర్షక పధకాలతో జనాన్ని ఆవైపు మళ్లించాయి తప్ప అభివృద్ధి అజెండాను పక్కన పెట్టాయి. ప్రభుత్వాలు ప్రయివేటు వారికి వేల కోట్ల రూపాయలు లేదా వేల ఎకరాలను రాయితీలు, మరొక రూపంలో అప్పనంగా కట్టబెట్టటం తప్ప తాముగా పరిశ్రమలను నెలకొల్పాలనే విధానాల నుంచి వైదొలిగాయి.
వైసిపి నేతలు, వారికి మద్దతు ఇస్తున్న ఇతరులు పసలేని వాదనలను ముందుకు తెస్తున్నారు. హైదరాబాదులో అభివృద్ధి కేంద్రీకృతం అయిన అనుభవాన్ని తీసుకోనవసరం లేదా అని అమాయకత్వాన్ని నటిస్తున్నారు. వారే మరోవైపు హైదరాబాదు తరువాత కాస్త అభివృద్ది చెందిన విశాఖలో పెట్టాలని అంటారు. నూతన ఆర్ధిక విధానాలకు తెరలేపిన తరువాత హైదరాబాదులో గానీ మరొక రాష్ట్ర రాజధాని లేదా ఇతర పట్టణాలలో గానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్క రూపాయి కూడా పెట్టుబడులు పెట్టలేదు. హైదరాబాదు, విశాఖ వంటి చోట్ల గతంలో ప్రభుత్వాలు పెట్టుబడులు పెట్టాయి గనుకనే వాటితో పాటు వాటి అనుబంధ పరిశ్రమలు ప్రయివేటు రంగంలో అభివృద్ధి చెందాయి. అందువలన ఉపాధి అవకా శాలు, రియలెస్టేట్‌ పెరిగింది. ఇలాంటి నగరాలలో మూతపడిన పరిశ్రమలు ఎన్నో ఉన్నాయి, అవి పునరుద్దరణకు నోచుకోలేదు.
ఇక ప్రయివేటు పెట్టుబడుల విషయానికి వస్తే ప్రధాని, ముఖ్యమంత్రుల లావు, ఎత్తూ చూసి రావని తేలిపోయింది.గుజరాత్‌ మోడల్‌ అని, మేకిన్‌ ఇండియా పేరుతో హడావుడి చేసిన నరేంద్రమోడీ ఏలుబడిలో ఆర్ధికాభివృద్ది ఎనిమిది నుంచి నాలుగున్నర లేదా ఐదు శాతానికి పడిపోయింది. కొందరు ఆర్ధికవేత్తల అంచనా ప్రకారం రెండున్నర శాతమే వాస్తవమైనది. ఆంధ్రప్రదే శ్‌లో చంద్రబాబు నాయుడు, కుమారుడు లోకేష్‌ కూడా పెద్ద హడావుడి చేసి పెట్టుబడుల గురించి లక్షల కోట్ల మేరకు అవగాహన ఒప్పందాలు చేసుకున్నట్లు ఊదరగొట్టారు. ఆచరణలో అంతసీన్‌ లేదు కనుక ఎన్నికల్లో బొక్కబోర్లా పడ్డారు. ఇప్పుడు మూడు ప్రాంతాలలో రాజధానులతో అభివృద్ధి అంటున్నది వైసిపి నాయకత్వం.
జగన్‌ నాయకత్వంలోని వైసిపి వద్ద నవరత్నాలనే సంక్షేమ పధకాలలో జనానికి ఎంత అందచేస్తారనే నిర్దిష్టత తప్ప ఆర్ధిక వృద్ధికి అసలు ప్రతిపాదనలు లేదా అజెండాయే లేదు. వచ్చే రోజుల్లో నవరత్నాలకు ఎంత మేరకు కోతపెడతారనే ప్రశ్నలకు ఎలాగూ కొద్ది వారాల్లో స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది. మూడు ప్రాంతాల్లో అభివృద్ది అంటే కొన్ని కార్యాలయాలను నెలకొల్పితే ఆక్కడ రియలేస్టేట్‌ ధరలు పెరగటం అనేనా లేక ప్రభుత్వ రంగంలో పరిశ్రమలు, ఇతర వ్యాపారాలను పెడతారా ? సందేహాలు తీర్చేవారు లేరు. విశాఖలో ప్రస్తుతం ఉన్న ప్రయివేటు రంగంలోని బడా పరిశ్రమలెన్ని,కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ముఖ్యమంత్రి నివాసం ఉన్నంత మాత్రాన ప్రయివేటు పెట్టుబడులు ఎలా వస్తాయి? జిఎన్‌రావు, బోస్టన్‌ కన్సల్టెన్సీ చెప్పిన ప్రాంతాల వారీ కమిషనరేట్స్‌తో అభివృద్ది జరగదని కర్ణాటక అనుభవం చెబుతోంది. నయా వుదారవాద విధానాల కాలంలో పెట్టుబడులు ఎక్కడ లాభసాటిగా, విస్తరణకు అవకా శాలుంటే అక్కడికే వెళతాయి తప్ప వెనుక బడిన ప్రాంతాలకు రాలేదన్నది కర్ణాకటలో తేలిపోయింది. అలాంటి లాభ అవకా శాలుంటే పెట్టుబడులు ఎవరూ ప్రయత్నించకుండానే వస్తాయి.

Image result for jagan three capitals
రాజకీయంగా చూస్తే కేంద్రంలో మోడీ సర్కార్‌ తెస్తున్న అన్ని ప్రతిపాదనలనూ బలపరచటంలో తెలుగుదేశం-వైసిపి రెండూ పోటీ పడుతున్నాయి. ఎక్కడ కడితేనేం మా దొడ్లో ఈనితే చాలు అన్నట్లుగా ఇతర పార్టీల నుంచి నేతలను బిజెపి ఆకర్షిస్తోంది. రాష్ట్రంలో బలపడాలని చూస్తోంది. అలాంటపుడు మూడు రాజధానులు, మూడు హైకోర్టులంటూ, రెండు చోట్ల అసెంబ్లీ సమావేశాలంటూ వైసిపి ముందుకు తెచ్చిన అజెండాను ఆమోదించి అమలు జరిపితే వస్తే గిస్తే ఆ ఖ్యాతి జగన్‌కు దక్కుతుంది తప్ప బిజెపికి వచ్చేది ఏముంటుంది. సాంకేతికంగా రాజధానిని మార్చకుండా కార్యనిర్వాహక రాజధాని అనో మరొక పేరో తగిలించి కొన్ని కార్యాలయాలను విశాఖకు తరలిస్తే, అసెంబ్లీ సమావేశాల పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తే కేంద్రం చేయగలిగిందేమీ లేదు. కానీ హైకోర్టును తరలించటం, మరో రెండు బెంచ్‌లు ఏర్పాటు చేయటం జరిగేనా ? అది చేయకుండా జగన్‌ విశాఖలో కాపురం పెట్టి నెగ్గుకు రాగలరా ? రాజధానిని మూడు చోట్ల పెట్టిన తరువాత రిజర్వుబ్యాంకు వంటివి లేదా కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసే సంస్ధలు ఎక్కడ పెట్టాలనే విషయంలో ప్రతిదానికీ పంచాయతీలు తలెత్తటం, ఆలస్యం కావటం లేదా వేరేచోట్లకు తరలి పోవటం అనివార్యం. కృష్ణా జలాల బోర్డును హైదరాబాదు నుంచి విజయవాడకు తరలింపు అంశాన్ని రాజధాని ఎక్కడో తేలిన తరువాతే నిర్ణయించాలని వాయిదా వేసిన విషయం తెలిసిందే.
హైదరాబాదులో ఐటిని తానే అభివృద్ది చేసినట్లు చంద్రబాబు స్వంత డబ్బా కొట్టుకుంటారు. ఐటి రాజధానిగా పరిగణించే బెంగళూరు, చెన్నరు, పూనా వంటివి చంద్రబాబు వంటి వారు లేకుండానే అభివృద్ధి చెందాయా లేదా ? చంద్రబాబు పాలన ముగిసిన తరువాత హైదరాబాదులో కంపెనీల విస్తరణ పెరిగింది తప్ప ఆయన లేరనే కారణంగా ఆగిపోలేదు కదా ? చంద్రబాబు నాయుడు అమరావతిని ఒక భ్రమరావతిగా చూపి అక్కడి జనాన్ని హతాశులను చేశారు. రాజధాని ప్రాంతం పరిసరాల్లో ఒక్క సీటులో కూడా నెగ్గలేక ఎన్నికల్లో ఫలితాన్ని అనుభవించారు. ఇప్పుడు జగన్‌మోహనరెడ్డి ఆ అనుభవాన్ని విస్మరించి మూడు రాజధానులు-అభివృద్ధి పేరుతో రాజకీయానికి తెరలేపి మరో రెండు భ్రమరావతులకు తెరలేపారు.కాపురం చేసే కళ కాళ్ల గోళ్ల సమయంలోనే తెలుస్తందన్నది ఒక సామెత, ప్రస్తుతం జగన్‌మోహనరెడ్డి పాలన గురించి మద్దతుదారులతో సహా అనేక మందిలో అదే అనుమానం ప్రారంభమైంది. తెలుగుదేశం అనుభవం వచ్చే ఎన్నికల్లో వైసిపికి పునరావృతం అవుతుందా ? లేక అల్లావుద్దీన్‌ అద్బుతదీపాలతో జగన్‌ చరిత్రను తిరగరాస్తారా ? తానే సృష్టించిన గందరగోళాన్ని తానే ఏదో ఒక పేరుతో సరి చేసుకొని పాలన మీద దృష్టి కేంద్రీకరిస్తారా ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

కంటి చూపుతో కాషాయ తాలిబాన్లపై విరుచుకుపడ్డ హీరో దీపిక !

10 Friday Jan 2020

Posted by raomk in BJP, Communalism, Current Affairs, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion, Others, Political Parties

≈ Leave a comment

Tags

ABVP, Aishe Ghosh, Deepika Padukone, JNU violence, JNUSU President, saffron taliban, sfi, sound of silence

Image result for deepika padukone ,jnuఎం కోటేశ్వరరావు
దేశంలో ఒక్కొక్క ఉదంతం జరిగిన ప్రతిసారీ తామే పక్షంలో ఉండాలో తేల్చుకోవాలంటూ జనాన్ని కాషాయ తాలిబాన్లు ముందుకు తోస్తున్నారు. కాంగ్రెస్‌ తన ఐదు దశాబ్దాల పాలనలో చేయలేని ఈ సమీకరణ క్రమాన్ని గత ఐదు సంవత్సరాలలో వీరు వేగంగా ముందుకు తెచ్చారు. ఆ గట్టునుండాలో ఈ గట్టునుండాలో తేల్చుకోవాల్సింది ఇంక జనమే. అలాంటి తాజా ఉదంతం జనవరి ఐదవ తేదీ రాత్రి మూడు గంటల పాటు ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ముసుగులు ధరించిన కొందరు యువతులతో సహా గూండాలు విద్యార్ధులు, ప్రొఫెసర్ల మీద జరిపిన దాడి.
ఒక సినిమాలో ప్రముఖ హీరో బాలకృష్ణ కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తా అన్న మాటలు తెలుగు సినీ ప్రేక్షకుల్లో ఎంతగానో ప్రాచుర్యం పొందాయి. సుప్రసిద్ధ హీరోయిన్‌ దీపికా పదుకోన్‌ ఇప్పుడు ఒక్క దేశంలోనే కాదు,సకల భాషల్లోనూ, ప్రపంచంలోనూ ఉన్న కాషాయ తాలిబాన్లు, వారి సమర్ధకులమీద ‘కంటి చూపు’తో విరుచుకుపడ్డారు. ఒక్కోసారి నిశ్శబ్దం కూడా భరించలేనిదిగా మారుతుంది. దీపికా పదుకోన్‌ చేసింది అదే. దాడికి గురైన వారిని మౌనంగా పరామర్శచేశారు తప్ప దాడి చేసిన వారి గురించి ఆ సమయంలో పల్లెత్తు మాట అనలేదు. అయినా సరే దాన్ని కూడా భరించలేని కాషాయ మూకలకు గంగవెర్రులెత్తి సామాజిక , సాంప్రదాయ మాధ్యమాల్లో ఆమెపై ధ్వజమెత్తుతున్నారు. ఆమె నిర్మించి, నటించిన ‘ఛపాక్‌’ సినిమాను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. దేశద్రోహులకు, దేశాన్ని ముక్కలు ముక్కలు(తుకడే తుకడే) చేసే గ్యాంగ్‌లకు మద్దతు ఇచ్చినట్లు చిత్రించి నోరు మూయించేందుకు చూస్తున్నారు.
బేటీ బచావో బేటీ పఢావో అని ప్రధాని నరేంద్రమోడీ నాలుగేండ్ల క్రితం పిలుపునిచ్చినపుడు ఎందరో మంచి పని చేశారని అనుకున్నారు. ఆడపిల్లలను రక్షించండి, ఆడపిల్లలను చదివించండి అని దాని అర్ధం. జామియా మిలియా విశ్వవిద్యాలయంలో పోలీసులే స్వయంగా అనుమతి లేకుండా దూరి ఆడమగ తేడా లేకుండా దాడులు చేశారు. ఆ తీరు మీద తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. తన అనుమతి లేకుండా పోలీసులు ప్రవేశించి దాడులు చేశారని వైస్‌ ఛాన్సలర్‌ నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపధ్యంలో జెఎన్‌యు విశ్వవిద్యాలయంలో సరికొత్త దాడులకు తెరతీశారు. జామియా విద్యార్దులు సిఎఎ లేదా ఎన్‌ఆర్‌సి సమస్య మీద నిరసన తెలిపారు, అది వారి హక్కు, లేదా కేంద్ర ప్రభుత్వం చెబుతున్నట్లు దేశద్రోహం కనుక పోలీసులు దాడి చేశారని కాసేపు అనుకుందాం. జెఎన్‌యులో అలాంటి ఆందోళన లేదే !
దాదాపు 50మంది ప్రొఫెసర్లు, 200 మంది విద్యార్దులు గత రెండు నెలలుగా చేస్తున్న ఫీజులు, ఇతర ఛార్జీల పెంపుదల ఆందోళన గురించి ఒక చోట చర్చించుకుంటుండగా వారి మీద, హాస్టల్‌ గదుల్లో వున్నవారి మీద జై శ్రీరామ్‌, తదితర నినాదాలతో మూడు గంటల పాటు కొందరు యువతులతో సహా 50 మందికిపైగా ముసుగులు ధరించిన గూండాలు ఎంపిక చేసుకున్న విద్యార్ధుల మీద హాస్టళ్లపైనా దాడులు చేశారు. గాయపడిన వారికి చికిత్స అందించేందుకు వచ్చిన వైద్యులను అడ్డుకున్నారు. దాడి సమయంలో వీధి లైట్లను ఆర్పివేశారు. ఒక పధకం ప్రకారం జరిగిన ఈ దాడిలో 36 మంది గాయపడ్డారు. పోలీసులు, యూనివర్సిటీ అధికారులు, ఎబివిపితో కుమ్మక్కయి ముసుగులతో వచ్చిన గూండాలు చదువుకుంటున్న ఆడపిల్లల మీద ఎలా దాడులు చేశారో చూసిన దేశం నివ్వెరపోయింది. ఎటు తిరిగి ఎటు చూసినా వాటి వెనుక ఉన్నది నరేంద్రమోడీ అనుచర గళం, అధికార యంత్రాంగం కావటాన్ని ఆయన అభిమానులు చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు. చివరికి బిజెపి అగ్రనేత మురళీ మనోహర్‌ జోషి కూడా విసి జగదీష్‌ కుమార్‌(తెలుగువాడే అని చెప్పుకొనేందుకు చాలా మంది సిగ్గుపడుతున్నారు) రాజీనామా చేయాలని చెప్పాల్సి వచ్చింది. దాడులకు గురయిన వారి గురించి అందరూ మాట్లాడుతున్నారు తప్ప ఇతరుల గురించి ఎందుకు ప్రకటనలు చేయరంటూ ఆయన ఎదురుదాడులకు దిగారు. దుండగులు విశ్వవిద్యాలయాన్ని ఆక్రమించి దాడులు చేస్తుంటే అసలు విసి ఏమి చేస్తున్నట్లు అని ప్రశ్నిస్తూ రాజీనామా చేయాలని అందరూ డిమాండ్‌ చేస్తుంటే దాని గురించి మాట్లాడకుండా ఎదురుదాడులు, దాడులకు గురైన వారి మీదనే తప్పుడు కేసులు పెట్టించిన ఘనతను ఆయన సొంతం చేసుకున్నారు. ఆయుధాలు ధరించి ముసుగులు వేసుకున్నవారిలో తమ వారున్నట్లు ఎబివిపి నేతలు అంగీకరించారు. వారి దాడులకు గురైన బాధితులను పరామర్శించేందుకు జెఎన్‌యుకు రావటమే దీపికా పదుకోన్‌ చేసిన ‘ నేరం, ఘోరం ‘. నిందితులపై ఇంతవరకు చర్యలు లేవు.
ఈ తరహాదాడి మన దేశంలో ఇదే ప్రధమం. దాడులలో తీవ్రంగా గాయపడిన వారిని పరామర్శించేందుకు విశ్వవిద్యాలయానికి వచ్చిన దీపిక ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండానే తన సానుభూతి, మద్దతు ప్రకటించి వెళ్లారు. ఈ వార్త బయటకు రాగానే కాషాయ తాలిబాన్లు సామాజిక మాధ్యమంలో రెచ్చిపోయారు. ఆమె తాజా చిత్రం ‘ఛపాక్‌’ను బహిష్కరించాలని, దేశ ద్రోహులతో చేతులు కలిపారంటూ ఏకత, శీలము, సంస్కారం, సంస్కృతి, మహిళలకు ఇవ్వాల్సిన మర్యాదల గురించి నిత్యం ప్రవచనాలు చెప్పేవారు వాటన్నింటినీ తీసి గట్టున పెట్టి నోరు బట్టని విధంగా ఆమెపై దాడి ప్రారంభించారు. తమ అసహ్య రూపాన్ని మరోసారి స్వయంగా బహిర్గతపరచుకున్నారు.
ముంబైలో మరికొందరు బాలీవుడ్‌ నటీ నటులు దాడులను నిరసిస్తూ జరిగిన ప్రదర్శనల్లో పాల్గొన్నారు. ఈ దాడిని కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్‌, ఎస్‌ జైశంకర్‌లు ఖండించారు. వారి మీద ఎలాంటి వ్యాఖ్యలు చేయని పెద్దలు దాడికి గురైన వారిని పరామర్శించేందుకు వెళ్లిన బాలీవుడ్‌ హీరోయిన్‌ దీపికా పడుకోన్‌ చర్యను తప్పు పడుతూ దేశద్రోహి అని నిందలు వేస్తున్నారు. ముసుగులు వేసుకున్న దుండగులు తాము లక్ష్యంగా చేసుకున్న చేసిన వారి మీద మాత్రమే దాడులు చేశారు. ముసుగుల్లేని బిజెపి నేతలు కూడా ఎంపిక చేసిన వారి మీద మాత్రమే విరుచుకుపడుతున్నారు. వారికీ వీరికీ ఒక్క ముసుగులు తప్ప తేడా ఏముంది?

Image result for deepika padukone ,jnu
జనవరి పదవ తేదీన విడుదల కానున్న తన చిత్ర ప్రచారం కోసం దీపిక ఈ ఉదంతాన్ని వినియోగించుకున్నారని నిందించిన వారు లేకపోలేదు. బహుశా వారికి ఎన్నికల కోసం ఉగ్రవాదుల దాడులను ఉపయోగించుకున్న రాజకీయ పార్టీలు గుర్తుకు వచ్చి ఉంటాయి. కొన్ని రాజకీయ పార్టీలు రంగంలో ఉన్నపుడు మాత్రమే ఉగ్రవాదదాడులు జరుగుతాయని నమ్మే వారి గురించి తెలిసిందే. కాషాయ తాలిబాన్ల దాడి తీవ్రతను తక్కువ చేసి చూపేందుకు కొందరు కాషాయ జర్నలిస్టులు దీపిక చర్యను దాడులను సమర్ధించేవారితో పాటు దాడులకు గురైన వారు కూడా విమర్శించారని చిత్రించారు. ఆమె మాట్లాడకుండా మౌనంగా ఉండటాన్ని ఐషి ఘోష్‌ తప్పుపట్టినట్లుగా వ్యాఖ్యానించారు. పేరెన్నికగన్న బాలీవుడ్‌ బాద్‌షాలు కాషాయ తాలిబాన్ల నోటి దురుసుకు భయపడి అనేక అంశాల మీద నోరెత్తని స్ధితిని చూస్తున్నాము. బతికిన చేపలు ఏటికి ఎదురీదుతాయి, చచ్చిన చేపలు వాలునపడి కొట్టుకుపోతాయి. ఆమె చిత్ర ప్రచారం కోసమే అయితే ఇంకా అనేక మార్గాలున్నాయి. దీపిక మీద దాడులు జరగటం కొత్తేమీ కాదు. గతంలో పద్మావత్‌ సినిమా సందర్భంగా అటు బిజెపి ఇటు కాంగ్రెస్‌ వారు, సమాజాన్ని వెనక్కు తీసుకుపోవాలని చూసే శక్తులన్నీ ఆమెమీద ఎలాంటి ప్రచారం చేసిందీ, భౌతికంగా దాడులు చేసేందుకు యత్నించిన తీరు చూశాము. బహుశా ఇది కూడా ఆమెను ప్రేరేపించి ఉంటుందని భావించవచ్చు. రెండు రోజుల తరువాత ఆజ్‌తక్‌ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో దీపిన తన జెఎన్‌యు పర్యటన గురించి నోరు విప్పారు.
విద్యార్ధుల మీద హింస తనను బాధించిందని, పద్మావత్‌ సినిమా సందర్భంగా తాను ఇదే పరిస్ధితిని ఎదుర్కొన్నానని, ఇలాంటివి సర్వసాధారణంగా మారకూడదని తాను ఆశాభావంతో ఉన్నట్లు దీపిక చెప్పారు. ” నేను చెప్పదలచుకున్నది ఏమంటే రెండు సంవత్సరాల క్రితం పద్మావత్‌ విడుదల సందర్భంగా నేను ఇదే చెప్పాను. ఈ రోజు నేను చూస్తున్నది నాకు ఎంతో బాధ కలిగించింది. ఇది సర్వసాధారణ అంశంగా మారకూడదని నేను ఆశిస్తున్నాను. నాకు భయమూ విచారమూ కలిగింది. మన దేశపునాది ఇది కాదు. జరుగుతున్న వాటి పట్ల నాకు ఆగ్రహంగా ఉంది, అయితే ఎలాంటి చర్య తీసుకోకపోవటం అది మరింతదారుణం ‘ అన్నారు.

విద్యార్ధులను దీపిక పరామర్శించిన వార్త తెలియగానే బిజెపి నేత తేజీందర్‌ పాల్‌ సింగ్‌ బగ్గా ట్వీట్‌ చేస్తూ తుక్‌డే తుక్‌డే గ్యాంగ్‌ మరియు అఫ్జల్‌ గ్యాంగ్‌లకు మద్దతు ఇచ్చినందుకు దీపికా పదుకొనే చిత్రాలను బహిష్కరించాలని పిలుపునిచ్చాడు. అనురాగ్‌ కాశ్యప్‌, తాప్సీ, విశాల్‌ భరద్వాజ్‌, అలీ ఫజల్‌, రిచా చద్దా, అనుభవ్‌ సిన్హా, జోయా అక్తర్‌, దియా మీర్జా, సౌరవ్‌ శుక్లా, సుధీర్‌ మిశ్రా, రాహుల్‌ బోస్‌, స్వానంద కిర్కరే, షబనా ఆజ్మీ వంటి వారు దాడులను నిరసిస్తూ జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

Image result for deepika padukone ,jnu
పులి తన చారలను దాచుకొనేందుకు ఆవు మేకప్‌ వేసుకున్నంత మాత్రాన దాని స్వభావాన్ని దాచుకోగలుగుతుందా ? ఒక కేంద్ర మంత్రి జవదేవకర్‌ ఛపాక్‌ సినిమాను బహిష్కరించాలనటాన్ని తాను అంగీకరించనని చెబుతారు, మరో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మాత్రం దేశాన్ని విధ్వంసం చేసే వారితో దీపిక పదుకోన్‌ నిలిచిందని దాడి చేస్తారు. దేశంలో కాషాయ దళాలను అనుసరించే వారు, వారిని గుడ్డిగా నమ్మిన జనం చెవుల్లో పూలు పెట్టుకున్నారు తప్ప అందరూ పెట్టుకోలేదని మంత్రులకు అర్ధం కావటం లేదు. ఎవరైనా ఏదైనా వార్త చదివితే తాము ఎవరికి మద్దతు ఇచ్చేందుకు పోతున్నామో తెలుసుకోవాలని స్మృతి గారు సెలవిచ్చారు. మరి ఈ దాడిని ఖండించిన కేంద్ర మంత్రులకు సైతం ఇదే సూత్రం వర్తిస్తుందో లేదో ఆమె చెప్పాలి. వారిని కూడా దేశద్రోహులు అంటారా, ఒక వార్త వినగానే తాము ఎవరిని ఖండిస్తున్నామో తెలుసుకోవాలని వారికి చెబుతారా ? జెఎన్‌యులో ముసుగులు వేసుకొని గూండాయిజానికి పాల్పడింది ఎబివిపి వారే అని కొందరు, పోలీసులే ముసుగులతో దాడి చేశారని, బయటి వ్యక్తులను రప్పించి ముసుగులు తగిలించి ఎబివిపి వారు దగ్గరుండి కొట్టించారని రకరకాల అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ముసుగుల్లో వచ్చి దాడి చేసింది తామే అని హిందూ రక్షక దళం పేరుతో ఒక ప్రకటన వెలువడింది. ఎటు తిప్పి ఎటు చూసినా కాషాయ తాలిబాన్లు, వారికి మద్దతుగా ఉన్న పోలీసులు ఈ దాడికి బాధ్యులు అన్నది స్పష్టం. ఈ దుండగాన్ని ఖండిస్తూ పారిశ్రామికవేత్తలు ఆనంద మహింద్రా, కిరణ్‌ షా మజుందార్‌, హర్షా మారివాలా కూడా ఖండించారు.

Image result for deepika padukone ,jnu
మన దేశంలోనూ, ప్రపంచ వ్యాపితంగా అనేక మంది మేథావులు నిరసన తెలిపారు. ఈ రోజు జెఎన్‌యులోని విద్యార్ధులను, వారికి మద్దతు తెలిపిన వారినీ పాలకపార్టీ పెద్దలు దేశ ద్రోహులుగా చిత్రిస్తోంది. ఇదొక ప్రమాదకర పోకడ, భిన్నాభిప్రాయం వ్యక్తం చేయటం పాలకపార్టీకి భజన చేయకపోవటమే దేశద్రోహమా ? బ్రిటీష్‌ తెల్లజాతి పాలకులు కూడా అదే చేశారు. తమను వ్యతిరేకించిన వారిని దేశద్రోహులుగా చిత్రించారు. అలాంటి వారిని సాగనంపిన జాతి మనది. మరి ఈ కాషాయ నల్లజాతి పాలకులు బ్రిటీష్‌ వారి చెప్పుల్లో కాళ్లు దూర్చి అణచివేతకు పూనుకుంటే, తమతో ఏకీభవించని వారిని దేశద్రోహులుగా పరిగణిస్తే ఏమి చేయాలి?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...
← Older posts

Recent Posts

  • బెలూన్‌ కూల్చివేత ఉదంతం : చైనా వ్యతిరేక ప్రచారానికి అమెరికాకు ఒక సాకు మాత్రమే !
  • మనవాళ్లు వట్టి వెధవాయి లోయి అన్న గిరీశాన్ని గుర్తుకు తెస్తున్న వాట్సాప్‌ పండితులు !
  • బిజెపి మిత్రోం అదానీ, బికినీలను కాదు సామాన్య జనాన్ని చూడండి !
  • వైవిధ్య సమస్యలతో ప్రపంచ వ్యవసాయ రంగం !
  • రష్యా – జర్మనీలను శాశ్వత శత్రు దేశాలుగా మార్చే అమెరికా కుటిల పన్నాగం !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • బెలూన్‌ కూల్చివేత ఉదంతం : చైనా వ్యతిరేక ప్రచారానికి అమెరికాకు ఒక సాకు మాత్రమే !
  • మనవాళ్లు వట్టి వెధవాయి లోయి అన్న గిరీశాన్ని గుర్తుకు తెస్తున్న వాట్సాప్‌ పండితులు !
  • బిజెపి మిత్రోం అదానీ, బికినీలను కాదు సామాన్య జనాన్ని చూడండి !
  • వైవిధ్య సమస్యలతో ప్రపంచ వ్యవసాయ రంగం !
  • రష్యా – జర్మనీలను శాశ్వత శత్రు దేశాలుగా మార్చే అమెరికా కుటిల పన్నాగం !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • బెలూన్‌ కూల్చివేత ఉదంతం : చైనా వ్యతిరేక ప్రచారానికి అమెరికాకు ఒక సాకు మాత్రమే !
  • మనవాళ్లు వట్టి వెధవాయి లోయి అన్న గిరీశాన్ని గుర్తుకు తెస్తున్న వాట్సాప్‌ పండితులు !
  • బిజెపి మిత్రోం అదానీ, బికినీలను కాదు సామాన్య జనాన్ని చూడండి !
  • వైవిధ్య సమస్యలతో ప్రపంచ వ్యవసాయ రంగం !
  • రష్యా – జర్మనీలను శాశ్వత శత్రు దేశాలుగా మార్చే అమెరికా కుటిల పన్నాగం !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Follow Following
    • vedika
    • Join 234 other followers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Customize
    • Follow Following
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d bloggers like this: