Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు


ప్రపంచమంతా ఆసక్తితో ఎదురు చూసిన అమెరికా అధ్యక్ష ఎన్నికలు ముగిశాయి. ఫలితాల గురించి సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. పెద్ద సంఖ్యలో పోస్టల్‌, మెయిల్‌ ఓట్లు పోలు కావటంతో లెక్కింపు పూర్తి కావటం ఆలస్యం కావచ్చు. తాను ఓడిపోతే కోర్టుకు ఎక్కుతానని డోనాల్డ్‌ ట్రంప్‌ బెదిరించిన నేపధ్యంలో ఏమి జరుగుతుంది అన్నది ఆసక్తికరంగా మారింది. ట్రంప్‌ ఓడిపోతే ట్రంప్‌ మద్దతుదారులు అనేక చోట్ల వీధులకు ఎక్కటానికి సిద్ధం అవుతున్నారు. దానికి ప్రతిగా కార్మికులు కూడా సార్వత్రిక సమ్మెకు సిద్ధం కావాలని పిలుపులు వెలువడ్డాయి.


చివరి ఎన్నికల సర్వేలను బట్టి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్ధి జోబిడెన్‌కు 52శాతం ఓట్లు, ప్రస్తుత అధ్యక్షుడైన రిపబ్లికన్‌ అభ్యర్ధి డోనాల్డ్‌ ట్రంప్‌కు 43శాతం వస్తాయని వెల్లడైంది. కీలక రాష్ట్రాలుగా పరిగణిస్తున్న చోట కూడా బిడెన్‌ స్వల్ప మెజారిటీలో ఉన్నట్లు సమాచారం. మొత్తం ఓట్లలో మెజారిటీ బిడెన్‌కు వచ్చినా విజేత నిర్ణయం 538 మంది ఉండే ఎలక్ట్రొరల్‌ కాలేజీలో మెజారిటీ (270) తెచ్చుకున్నవారే పీఠమెక్కుతారు. అయితే గత ఎన్నికలలో మెజారిటీ ఓట్లు హిల్లరీ క్లింటన్‌కు ఎలక్ట్రొరల్‌ కాలేజీలో మెజారిటీ ట్రంప్‌కు వచ్చాయి. ఈ సారి కూడా అదే పునరావృతం అవుతుందన్నది ట్రంప్‌ శిబిరపు ప్రచారం. ఈ విశ్లేషణ పాఠకులకు చేరే సమయానికి పోలింగ్‌ చివరి దశలో ఉంటుంది. వెంటనే ఓట్లు లెక్కింపు ప్రారంభించినా ఫలితాలు వెల్లడయ్యే అవకాశం లేదు.


ఇది రాసిన సమయానికి ముందస్తుగా వేసిన ఓటర్లు 9.95 కోట్ల మంది ఉన్నారు. పోలింగ్‌ ముగిసిన తరువాత కూడా అందే పోస్టల్‌, మెయిల్‌ ఓట్లను కలుపుకుంటే పది కోట్లు దాట వచ్చని అంచనా.ఇంకా 2.82 కోట్ల మెయిల్‌ బాలట్లు రావాల్సి ఉంది. అందువలన సరికొత్త రికార్డు నమోదు కానుంది. గత ఎన్నికల్లో పోలైన మొత్తం ఓట్లతో పోలిస్తే ఇప్పటికే 73శాతం మంది ఓటు చేశారు. మొత్తం 15 కోట్ల మంది ఓటు హక్కువినియోగించుకోవచ్చని అంచనా. మంగళవారం నాడు వేసిన ఓట్లను తొలుత లెక్కిస్తారు. తరువాత ముందస్తు, పోస్టల్‌ ఓట్లను తీసుకుంటారు. ఇవి పెద్ద సంఖ్యలో ఉన్నందున లెక్కింపు పూర్తి కావటానికి చాలా రోజులు పట్టవచ్చని భావిస్తున్నారు. తొలి ఓట్ల లెక్కింపులో మెజారిటీ వస్తే తాను గెలిచినట్లే అని వెంటనే ప్రకటిస్తానని, పోస్టల్‌ బ్యాలట్లను పరిగణనలోకి తీసుకోనని, లేనట్లయితే ఫలితాలను న్యాయస్ధానంలో సవాలు చేసేందుకు వెంటనే న్యాయవాదులతో సమావేశమౌతానని ట్రంప్‌ ప్రకటించాడు. ఓటర్ల తీర్పును మీరు గౌరవిస్తారా అంటే ముందుగా తాను ఆమాట చెప్పలేనని సెప్టెంబరులోనే ట్రంప్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికలు ఒక పెద్ద కుంభకోణమని, పోస్టల్‌ బ్యాలట్లలో అక్రమాలు జరుగుతాయని పదే పదే చెప్పాడు. ఓడిపోతే వివాదాన్ని రేపాలనే ఆలోచన ట్రంప్‌కు ముందు నుంచి ఉన్నట్లు స్పష్టం. ప్రజాతీర్పును వమ్ము చేసే పక్షంలో సమ్మెకు దిగేందుకు సిద్దంగా ఉండాలని డెమోక్రటిక్‌ పార్టీకి చెందిన కార్మిక సంఘాలు కూడా పిలుపునిచ్చాయి. అనేక చోట్ల ట్రంప్‌ మద్దతుదారులు అల్లర్లు,ఘర్షణలకు పాల్పడాలనే యత్నాల్లో కూడా ఉన్నారనే వార్తలు వచ్చాయి. అందువలన ఫలితం తేలటం ఒకటైతే దాని పర్యసానాల గురించి యావత్‌ ప్రంచం ఎదురు చూస్తోంది. ఇలాంటి పరిస్ధితి గతంలో అమెరికాలో తలెత్తినట్లు లేదు.


ఒక వేళ ట్రంప్‌ ఓటమిని అంగీకరించకపోతే ఏమిటన్న ప్రశ్న ముందుకు వచ్చింది. కరోనా కారణంగా పోలింగ్‌ తేదీన ఓటు వేయటానికి వచ్చేవారికంటే ముందుగానే ఓటు వేసే వారు ఎక్కువగా ఉంటారని ట్రంప్‌ ముందే గ్రహించాడు. కరోనాతో నిమిత్తం లేకుండా గత మూడు ఎన్నికల సర్వేలను చూసినపుడు ముందుస్తుగా ఓట్లు వేసిన వారిలో డెమోక్రాట్లకే ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఈ సారి కూడా వారిదే పైచేయి అని వార్తలు వచ్చాయి. అందుకే పోస్టల్‌ ఓట్లను పరిగణనలోకి తీసుకోవద్దని ట్రంప్‌ చెబుతున్నాడు. పోలింగ్‌ రోజు వేసినవే అసలైన ఓట్లు అంటున్నాడు.అయితే పోలింగ్‌ తరువాత అందిన పోస్టల్‌ ఓట్లను కూడా పరిగణించాలని సుప్రీం కోర్టు చెప్పింది. వీటిని పరిగణలోకి తీసుకోవటాన్ని రిగ్గింగ్‌ అని ట్రంప్‌ ఆరోపిస్తున్నాడు.
ట్రంప్‌ గనుక ఓడిపోతే పలుచోట్ల హింసాకాండ తలెత్తే అవకాశం ఉందని పది రోజుల ముందు ఒక నివేదిక వెలువడింది. పెన్సిల్వేనియా, జార్జియా, మిషిగాన్‌, విస్కాన్సిన్‌, ఓరేగాన్‌ రాష్ట్రాలలో మితవాద మిలిటెంట్‌, సాయుధ గ్రూప్‌లనుంచి ముప్పు ఎక్కువగా ఉందని హెచ్చరించింది. ఆ గ్రూప్‌లు ఇప్పటికే ఆందోళనలు, దాడులు ఎలా చేయాలో, ఎలా పోలీసులను తప్పించుకోవాలో శిక్షణ ఇచ్చాయి. మొత్తం 80 అలాంటి బృందాలను గుర్తించినట్లు నివేదికను తయారు చేసిన సంస్ధలు పేర్కొన్నాయి. వారు ఓటర్లను బెదిరిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇలాంటి శక్తులు అడ్డుకున్న కారణంగానే శుక్రవారం నాడు టెక్సాస్‌ రాష్ట్రంలోని ఆస్టిన్‌ నగరంలో డెమోక్రాట్‌ అభ్యర్ధి జోబిడెన్‌ ప్రచారం రద్దయింది. రిపబ్లికన్ల కంచుకోటగా చెప్పుకొనే ఇక్కడ ట్రంప్‌ స్వల్ప మెజారిటీతో ఉన్నాడని సర్వేలు వెల్లడించటంతో మద్దతుదారులు తెగబడ్డారు. బిడెన్‌ ప్రయాణిస్తున్న బస్‌, ఇతర వాహనాలను సాయుధులైన వ్యక్తులు చుట్టుముట్టారు. మరోవైపు ట్రంప్‌ ప్రచార పతాకాలతో ఉన్న అనేక వాహనాలు కూడా చుట్టుముట్టాయి. పోలీసులు జోక్యంతో బిడెన్‌ ముందుకు సాగాల్సి వచ్చింది. ఈ ఉదంతాల వెనుక ట్రంప్‌ కుమారుడు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఉపాధ్యక్ష పదవికి పోటీపడుతున్న డెమోక్రాట్‌ అభ్యర్ధి కమలా హారిస్‌ ప్రచారం సందర్భంగా ట్రంప్‌ మద్దతుదారులందరూ రావాలని అతగాడు ముందురోజు పిలుపునిచ్చాడు. టెక్సాస్‌ ఇప్పటికీ ట్రంప్‌ కంచుకోట అని రుజువు చేయాలన్నాడు. బిడెన్‌ను అడ్డుకున్న వీడియోను ట్వీట్‌ చేస్తూ ఐ లవ్‌ టెక్సాస్‌ అని ట్రంప్‌ వ్యాఖ్యానించాడు. అంతకు ముందు ఒక ఆస్ట్రేలియన్‌ టీవి బృందాన్ని కూడా ట్రంప్‌ మద్దతుదారులు బెదిరించారు.
ట్రంప్‌ శ్వేతజాతి దురహంకారి మాత్రమే కాదు, మహిళా వ్యతిరేకి కూడా. విస్కాన్సిన్‌ రాష్ట్రంలోని కెనోషా ఎన్నికల సభలో డెమోక్రటిక్‌ పార్టీ ఉపాధ్యక్ష పదవి అభ్యర్ధి కమలా హారిస్‌ గురించి మాట్లాడుతూ ఈ అద్బుతమైన మహిళ దేశ తొలి మహిళా అధ్యక్షురాలు కావాలని కోరుకొంటోది. అది జరుగుతుందని నేను అనుకోను. అందుకే మీరు అలసి నిద్రపోయే జోబిడెన్‌ కూడా ఓటు వేయవద్దు అని నోరుపారవేసుకున్నాడు.


ప్రతి పార్టీ తన స్వంత ఎన్నికల పరిశీలకులను ఏర్పాటు చేసుకోవటం తెలిసిందే. అయితే పరిశీలకుల పేరుతో ఏర్పాటు చేసే అనధికార శక్తులు ముఖ్యంగా అమెరికాలో మిలిటెంట్స్‌ బృందాలను ట్రంప్‌ పెద్ద ఎత్తున ఏర్పాటు చేశాడు. వారంతా ఎన్నికలను క్షుణ్ణంగా పరిశీలించాలని కూడా పిలుపునిచ్చాడు. పరోక్షంగా డెమోక్రాట్‌ మద్దతుదార్లను అడ్డుకోమని చెప్పటమే. అలాంటి బృందం ఒకటి మిషిగన్‌ రాష్ట్ర డెమోక్రటిక్‌ పార్టీ గవర్నర్‌ వైట్‌మర్‌ను కిడ్నాప్‌ చేసేందుకు ప్రయత్నించి అరెస్టయింది. పోలింగ్‌ బూత్‌లలో ఆయుధాలతో ప్రవేశాన్ని నిషేధించటమే దీనికి కారణంగా చెప్పారు. అయితే కోర్టు ఆయుధాలకు అనుమతి ఇచ్చింది.
పోలింగ్‌ కొద్ది సేపట్లో ప్రారంభం కానుండగా సిఎన్‌ఎన్‌ చివరి జోశ్యంలో బిడెన్‌కు 279, ట్రంప్‌కు 163 ఎలక్ట్రోరల్‌ ఓట్లు వస్తాయని పేర్కొన్నది. ఆరు రాష్ట్రాలలోని 96ఎలక్ట్రోరల్‌ ఓట్ల విషయంలో పోటాపోటీగా ఉన్నట్లు పేర్కొన్నది. ఎన్నికలను విశ్లేషించే వెబ్‌సైట్లలో ఒకటైన 538 చెప్పిన జోశ్యంలో బిడెన్‌కు విజయావకాశాలు నూటికి 89శాతం, ట్రంప్‌కు పదిశాతం ఉన్నట్లు పేర్కొన్నది. సెనెట్‌లో డెమోక్రాట్స్‌ మెజారిటీ సాధిస్తారని తెలిపింది. ప్రముఖ పత్రిక ఎకనమిస్ట్‌ అంచనా ప్రకారం బిడెన్‌కు 96శాతం విజయాకాశాలు ఉన్నాయని, 350 ఎలక్ట్రొరల్‌ కాలేజీ ఓట్లు వస్తాయని తెలిపింది.


భారతీయ కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారు ఝామున(నాలుగవ తేదీ) 5.30కు తూర్పు రాష్ట్రాలైన జార్జియా, ఇండియానా, కెంటకీ, వర్జీనియా, సౌత్‌ కరోలినా, వెర్‌మౌంట్‌లో పోలింగ్‌ ముగుస్తుంది. పశ్చిమ తీరంలోని రాష్ట్రాలలో 9.30కు పూర్తి అవుతుంది.అలాస్కా, అడక్‌ వంటి చివరి చోట్ల తరువాత పూర్తి అవుతుంది. ఆ తరువాతే లెక్కింపు ప్రారంభం అవుతుంది.
మైనే,నెబరస్కాలలో మినహా మిగిలిన రాష్ట్రాలలో మెజారిటీ ఓట్లు తెచ్చుకున్న అభ్యర్ధికి ఆ రాష్ట్రానికి నిర్దేశించిన అన్ని ఎలక్ట్రరల్‌ ఓట్లు వస్తాయి. ఉదాహరణకు కాలిఫోర్నియాకు ఉన్న 55 ఓట్లు అక్కడ మెజారిటీ ఓట్లు తెచ్చుకున్నవారికే మొత్తం జమ అవుతాయి. 2000 ఎన్నికలలో అల్‌గోర్‌, 2016లో హిల్లరీ క్లింటన్‌ దేశం మొత్తం మీద మెజారిటీ ఓట్లు తెచ్చుకున్నా ఎలక్ట్రరల్‌ ఓట్లు తెచ్చుకోవటంలో విఫలం కావటంతో ఓడిపోయారు.నవంబరు మూడున ఎన్నికలు జరిగిన తరువాత డిసెంబరు 14న ఎలక్ట్రరల్‌ కాలేజీ సభ్యులు అధ్యక్ష ఎన్నికల్లో ఓట్లు వేస్తారు. జనవరి ఆరవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంటకు పార్లమెంట్‌ సమావేశమై ఓట్ల లెక్కింపు, విజేతల ప్రకటన చేస్తుంది. జనవరి 20న నూతన అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవికి ఎన్నికైన వారు పదవీ బాధ్యతలు స్వీకరిస్తారు.


తాను ఓడిపోయినట్లయితే అధికార మార్పిడి చేస్తానన్న హామీ ఇవ్వలేనని సెప్టెంబరు నెలలో ట్రంప్‌ ప్రకటించిన విషయం తెలిసినదే. ఒక వేళ అదే జరిగితే ఏమిటి అన్న ప్రశ్న తలెత్తింది. ట్రంప్‌ ప్రకటన వివాదాస్పదం కావటంతో అధ్యక్ష భవనం పత్రికా అధికారి ఒక ప్రకటన చేస్తూ స్వేచ్చగా, న్యాయంగా జరిగిన ఎన్నికలను ట్రంప్‌ ఆమోదిస్తారు అని పేర్కొన్నది. డెమోక్రాట్లు మోసంతో మాత్రమే గెలుస్తారని ట్రంప్‌ పదే పదే ఆరోపించటం వెనుక కుట్ర ఉందని అనుమానిస్తున్నారు. ఓటమిని తిరస్కరిస్తే, దానికొనసాగింపుగా నూతన అధ్యక్ష పదవీ స్వీకార కార్యక్రమాన్ని బహిష్కరిస్తే నిజానికి ఏమీ కాదు. దిగిపోతున్న అధ్యక్షుడు చివరి ఉపన్యాసం చేయటం ఒక సాంప్రదాయం తప్ప నిబంధనేమీ కాదు. అవినీతి జరిగిందని ఆరోపించిన వారు ప్రతి ఒక్క ఓటూ అక్రమంగా పడిందని నిరూపిస్తే అది అప్పుడు ఎన్నికల ఫలితాలు మారతాయి తప్ప ప్రకటనలతో జరిగేదేమీ ఉండదు. అయితే రిపబ్లికన్లు అధికారంలో ఉన్నచోట ఫలితాలను కోర్టుల్లో సవాలు చేయటం తప్ప చేసేదేమీ ఉండదని చెబుతున్నారు. ఒక వేళ ఫలితాన్ని ప్రకటించే పార్లమెంట్‌ ఉభయ సభలు ఆపని చేయకపోతే వివాదం సుప్రీం కోర్టు ముందుకు వెళుతుంది.అది జరుగుతుందా ? అలాజరిగిన ఉదంతం గతంలో లేదు. అదే జరిగితే గనుక ఆసక్తికరమనే చెప్పాలి.