Tags
#2020 US Elections, 2020 United States presidential election, Donald trump, Joe Biden, Trump eye on faithless electors
ఎం కోటేశ్వరరావు
కీలకమైన రాష్ట్రాలలో ఓటమి ఖరారు అయిన తరువాత కూడా డోనాల్డ్ ట్రంప్ తన ఓటమిని అంగీకరించలేదు. తమ నేత రెండవ సారి పదవీ బాధ్యతలు చేపడతారు, అందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో చెప్పారు. కోర్టుల విచారణలో ఉన్న కేసులు, విజేతలకు ఇంకా ధృవీకరణ పత్రాలు ఇవ్వకపోవటం, పోస్టల్ బ్యాలట్ల వివాదం వంటి అంశాలలో తమకే అనుకూలంగా తీర్పు వస్తుందని భావిస్తున్నారు. మరో వైపు ట్రంప్ మద్దతుదారులు వాషింగ్టన్ డిసిలో అతనికి మద్దతుగా ప్రదర్శనలు చేశారు. రక్షణశాఖలో ట్రంప్ తనకు అనుకూలమైన వారిని నియమిస్తూ ఎన్నికల ఫలితాలు స్పష్టమైన తరువాత నిర్ణయం తీసుకున్నారు. జనవరిలో జార్జియాలో జరగాల్సిన రెండు సెనెట్ స్దానాలను ఎలాగైనా సాధించి ఎగువ సభలో మెజారిటీ నిలుపుకొనే ఎత్తుగడలో భాగంగా అక్కడి ఓటర్లను ప్రభావితం చేసేందుకు తానే విజయం సాధించాననే ఎత్తుగడతో ముందుకు సాగుతున్నట్లు పరిపరి విధాలుగా వార్తలు వస్తున్నాయి. ఇవేనా ఇంకా ఏమైనా కుట్రలు న్నాయా అన్న అనుమానాలు సహజంగానే ముందుకు వస్తున్నాయి. అధికారం కోసం ఎంతకైనా తెగిస్తున్నందున వాటిలో ఒకటి ఫిరాయింపులను పోత్సహించి తీర్పును తారు మారు చేసే ఎత్తుగడను కూడా కొట్టి పారవేయలేము.
ఎన్నికలు జరిగిన పది రోజుల తరువాత అమెరికా 46వ అధ్యక్షుడిగా డెమోక్రటిక్ పార్టీ అభ్యర్ధి జోసెఫ్ రోబినెట్ బైడెన్ జూనియర్ అలియాస్ జో బైడెన్ ఖరారు అయ్యారు. ఎలక్ట్రరల్ కాలేజీలోని 538కి గాను 306 ఓట్లతో ముందుండగా మెజారిటీకి అవసరమైన 270 తెచ్చుకోలేని డోనాల్డ్ ట్రంప్ 232తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. గత ఎన్నికలలో ట్రంప్కు 306 రాగా హిల్లరీ క్లింటన్కు 232 వచ్చాయి. డిసెంబరు 14న అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నిక జరగనుంది, జనవరి 20న పదవీ బాధ్యతలను చేపడతారు. ఇప్పటికీ ఓటమిని అంగీకరించేందుకు మొరాయిస్తున్న డోనాల్డ్ ట్రంప్ నూతన అధ్యక్షుడికి అధికారాన్ని అప్పగించేందుకు రాకపోయినా పదవీ స్వీకార ప్రమాణం ఆగదు. అధికారంలో ఉండి ఓడిపోయిన అధ్యక్షుల జాబితాకు ఎక్కిన ట్రంప్ అధికార మార్పిడికి సహకరించపోతే మెడపట్టి గెంటించుకున్న వ్యక్తిగా చరిత్రకు ఎక్కనున్నాడు.
ప్రజాప్రతినిధుల సభ కాంగ్రెస్లో మెజారిటీకి అవసరమైన 218కి గాను డెమోక్రాట్లు 224 సీట్లు తెచ్చుకోగా రిపబ్లికన్లు 211 పొందారు. డెమోక్రాట్లు ఎనిమిది సీట్లు కోల్పోయారు. ఎగువ సభ సెనేట్లోని వంద స్ధానాలలో మెజారిటీకి 51రావాల్సి ఉండగా రిపబ్లికన్లు గతంలో ఉన్న 53కు గాను 50 తెచ్చుకోగా డెమోక్రాట్లు 45 నుంచి 46కు పెంచుకున్నారు. వారికి మరొక ఇద్దరు స్వతంత్ర సభ్యుల మద్దతు ఉంది. మరో రాష్ట్రమైన జార్జియాలోని రెండు సీట్లకు జనవరిలో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఎగువ సభలో మెజారిటీకి రిపబ్లికన్లు ఒక సీటు దూరంలో ఉండగా డెమోక్రాట్లు రెండూ తెచ్చుకుంటే సమాన బలం కలిగి ఉంటారు. ఇది రాసిన సమయానికి దేశవ్యాపిత ఓట్లలో 97శాతం లెక్కింపు పూర్తయింది. విజేత బైడెన్కు 7,86,06,350(50.8శాతం) రాగా ట్రంపుకు 7,36,69,853(47.2శాతం) వచ్చాయి. ఎన్నికలకు ముందు సర్వేలలో వెల్లడైన దాని కంటే ట్రంపుకు ఎక్కువ ఓట్లు వచ్చాయి. 1990 తరువాత రికార్డు స్ధాయిలో ఈ ఎన్నికల్లోనే ఓటర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇంకా లెక్కింపు కొనసాగుతున్నందున 66.2 నుంచి 72శాతం మధ్య ఖరారు కావచ్చు. గత ఎన్నికలలో డోనాల్డ్ ట్రంప్ మెజారిటీ ఖరారైన ఒక రోజులోనే చైనా అధ్యక్షుడు జింపింగ్ అభినందనలు తెలిపాడు. ఈ సారి బైడెన్కు మెజారిటీ ఖరారు అయ్యేందుకు వ్యవధి ఎక్కువ తీసుకోవటం, మరోవైపు తానే ఎన్నికైనట్లు ట్రంప్ ప్రకటించుకున్న నేపధ్యంలో పది రోజుల తరువాత చైనా అధికారికంగా జో బైడెన్కు అభినందనలు తెలిపింది. భారత్తో సహా అనేక దే శాలు వెంటనే అభినందనలు తెలిపాయి.
అధికారికంగా డిసెంబరు 14న అధ్యక్ష ఎన్నికజరగాల్సి ఉంది. అనేక చోట్ల రిపబ్లికన్లు కోర్టులలో వేసిన కేసుల కారణంగా ఇది రాస్తున్న సమయానికి ఎలక్ట్రరల్ కాలేజీ విజేతలకు సర్టిఫికెట్ల జారీ ప్రక్రియముగియ లేదు. దీన్ని అవకాశంగా తీసుకొని డోనాల్డ్ ట్రంప్ తానే గెలిచినట్లు వాదన ఇంకా చేస్తూనే ఉన్నాడు. రెండోసారి పదవీ బాధ్యతల స్వీకరణకు సిద్దం అవుతున్నట్లు మద్దతుదారులతో ప్రకటనలు చేయిస్తున్నాడు. రక్షణశాఖలో తనకు అనుకూలంగా ఉండే అధికారుల నియామకం చేశాడు. జనవరి 20వ తేదీన కొత్త అధ్యక్షుడు ప్రమాణస్వీకారం చేసే వరకు పూర్తి అధికారాలను కలిగి ఉన్నందున ట్రంప్ తాను చేయదలచుకున్నది చేసేందుకు పూనుకున్నట్లు పరిణామాలు వెల్లడిస్తున్నాయి.
సాధారణంగా అమెరికాలో ఫిరాయింపుల గురించి పెద్దగా జనానికి తెలియదు. దానికి కూడా అవకాశం లేకపోలేదు.2016 ఎన్నికలలో ట్రంప్కు 306, హిల్లరీ క్లింటన్కు 232 వచ్చినట్లు తెలిసిందే. అయితే ఎలక్ట్రరల్ కాలేజీలో ఎన్నిక సమయంలో ఏడుగురు సభ్యులు ఫిరాయించి వారికి ఓట్లు వేయలేదు. దాంతో వారి ఓట్లను చెల్లనివిగా ప్రకటించారు. ట్రంప్కు ఇద్దరు, హిల్లరీకి ఐదుగురు ఓటు వేయలేదు. నవంబరు 3వ తేదీ ఎన్నికలలో విజేతలకు అనేక రాష్ట్రాలలో ఇంకా ధృవీకరణ పత్రాలు ఇవ్వలేదు. అటువంటి చోట్ల ఆయా రాష్ట్రాల చట్టసభలు ఎలక్ట్రరల్ కాలేజీ ప్రతినిధులను నియమించుకోవచ్చు. రిపబ్లికన్లు అధికారంలో ఉండి చోట్ల డెమోక్రాట్లు గెలిచిన చోట ట్రంప్ ఇలాంటి అక్రమాలకు పాల్పడవచ్చని తద్వారా తనకు అవసరమైన 270 ఓట్లను సాధించి అధికారంలో కొనసాగాలనే పధకంతో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అందుకు అవకాశం లేదని కొందరు చెబుతున్నప్పటికీ అది జరిగితే ఏమిటన్నది ప్రశ్న. ఒక వేళ ట్రంప్ ఫిరాయింపులతో గట్టెక్కాలంటే పన్నెండు శాతం మంది అంటే బైడెన్కు వచ్చిన 306 ఓట్లలో పన్నెండు శాతం అంటే 38 మంది ఫిరాయిస్తేనే చెల్లుబాటు అవుతుందని కొన్ని వార్తలు సూచించాయి. ఒక్కో రాష్ట్రానికి ఒక్కో చట్టం ఉన్నందున అదే జరిగితే చట్టబద్దమైన వివాదం కూడా తలెత్తవచ్చు.
అమెరికాలో ఫిరాయింపులకు సంబంధించి దేశమంతటికీ వర్తించే ఒకే చట్టం లేదు. గతంలో ఫిరాయింపులు జరిగిన ఉదంతాలు ఉన్నప్పటికీ అధ్యక్ష ఎన్నికను ప్రభావితం చేయలేదు. ఇప్పటి వరకు 165 ఉదంతాలలో ఫిరాయింపులు చోటు చేసుకున్నాయి.1836లో 23 మంది వర్జీనీయా రాష్ట్ర ప్రతినిధులు అధ్యక్ష ఎన్నికలో తమ డెమోక్రటిక్ పార్టీ అభ్యర్దికి ఓటు వేసి ఉపాధ్యక్ష ఎన్నిక ఓటింగ్లో పాల్గొనలేదు. దాంతో తొలిసారిగా సెనెట్ ద్వారా ఎన్నుకోవాల్సి వచ్చింది. 1872లో పార్టీ అభ్యర్ధి ఎన్నికల తరువాత ఎలక్ట్రరల్ కాలేజీ సమావేశం జరగముందే మరణించాడు. దాంతో 63 మంది వేరే పార్టీకి ఓటు వేశారు. ప్రస్తుతం ఉన్న చట్టాల ప్రకారం 33 రాష్ట్రాలు, కొలంబియా జిల్లాలో గెలిచిన పార్టీకే ఎలక్ట్రరల్ కాలేజీ ప్రతినిధులు ఓటువేయాలనే నిబంధనలు ఉన్నప్పటికీ కేవలం 14 రాష్ట్రాలలో మాత్రమే ఫిరాయింపులు చేస్తే అనర్హత వేటు వేసే అవకాశం ఉంది.నిర్ధిష్టమైన చట్టాలేవీ లేవు.
మరోవైపు విజయం ఖాయం కావటంతో డెమోక్రటిక్ పార్టీలోని మితవాదులు రంగంలోకి దిగారు. అధ్యక్ష స్ధానంలో విజయం సాధించినప్పటికీ ప్రజాప్రతినిధుల సభలో మెజారిటీ తగ్గటానికి, సెనెట్లో మెజారిటీ సాధించలేకపోవటానికి డెమోక్రటిక్ పార్టీలోని పురోగామి విధానాలు లేదా సోషలిజానికి మద్దతే కారణమని ఆ పార్టీలోని మితవాదులు, కార్పొరేట్ల ప్రతినిధులు సూత్రీకరణలు ప్రారంభించారు. వామపక్ష నినాదాలు, విధానాలను ముందుకు తెస్తే జనవరిలో జార్జియాలో జరిగే సెనెటు ఎన్నికలలో ఓటమి తప్పదని డెమోక్రటిక్ పార్టీలోని కార్పొరేటటు శక్తులు అప్పుడే సన్నాయి నొక్కులు ప్రారంభించాయి.వాటిని డెమోక్రటిక్ సోషలిస్టుగా ఉన్న డెమోక్రటిక్ పార్టీ నేత బెర్నీ శాండర్స్ తిరస్కరించారు. అందరికీ వైద్య సదుపాయం,నూతన హరిత ఒప్పందానికి మద్దతు ఇవ్వటం వల్లనే దిగువ సభలో సీట్లు తగ్గాయని పార్టీలోని మితవాదులు విమర్శిస్తున్నారు. అయితే ఆ నినాదం లేదా విధానాలకు మద్దతు ఇచ్చిన వారెవరూ ఈ ఎన్నికల్లో ఓడిపోలేదు. అందరికీ వైద్యం అందించాలన్న తీర్మానాన్ని బలపరిచిన 112 మందికి గాను అందరూ ఈ ఎన్నికల్లో గెలిచారు. నూతన హరిత ఒప్పంద తీర్మానాన్ని బలపరిచిన 98 మందిలో ఒక్కరు మాత్రమే ఓడిపోయారు. కోట్లాది మంది జనాల జీవితాలను మెరుగుపరచాలన్న పురోగామి విధానాలను కార్మికులుగా ఉన్న అన్ని సామాజిక తరగతులకు చెందిన ఓటర్లు ఆమోదించారని, వారందరూ సాయం కోసం ఎదురు చూస్తున్నందున దానికి అనుగుణ్యంగా స్పందించాలని బెర్నీ శాండర్స్ చెప్పారు.
కీలక పాత్ర పోషించిన పోస్టల్ కార్మికులు
ఎన్నికల్లో కార్మికులు కీలక పాత్ర పోషించగలరా ? అవును. అమెరికా ఎన్నికలలో పోస్టల్ కార్మికులు పోషించిన కీలక పాత్ర విస్మరించరానిది. నిజానికి అమెరికా ప్రజాస్వామ్యం నిలిచిందంటే వారి పాత్ర లేకుండా సాధ్యమయ్యేది కాదంటే అతిశయోక్తి కాదు. 2016తో పోల్చితే రెట్టింపైన ఆరున్నర కోట్ల పోస్టల్ బ్యాలట్లను ఆరులక్షల 30వేల మంది కార్మికులు సకాలంలో అధికారులకు అందచేసేందుకు సర్వశక్తులూ ఒడ్డారు. తపాలా సేవలను ప్రయివేటీకరించాలన్న ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తమకు మద్దతు ఇచ్చే శక్తులు అధికారంలో ఉండాలన్న చైతన్యం ఆ కార్మికులను దీనికి పురికొల్పిందని చెప్పవచ్చు. పోస్టల్ బ్యాలట్లలో తనకు వ్యతిరేకంగా ఎక్కువ పడినట్లు గ్రహించిన ట్రంప్ వాటిని సకాలంలో అందకుండా చేసేందుకు పన్నిన కుయుక్తులను కూడా కార్మికులు వమ్ముచేశారు.
ట్రంప్ తన మద్దతుదారైన లూయీస్ డెజోరును ఎన్నికలకు ఎంతో ముందుగానే పోస్టు మాస్టర్ జనరల్గా నియమించాడు. దీని వెనుక మూడు లక్ష్యాలు ఉన్నాయి. తపాలాశాఖను ప్రయివేటీకరించాలంటే ముందు అది అసమర్దంగా తయారైందని జనానికి చెప్పాలి. తపాలా అందచేతను ఆలశ్యం గావించి వినియోగదారుల ముందు సిబ్బందిని దోషులుగా నిలపటం, ఎన్నికల్లో పోస్టల్ బ్యాలట్లను సకాలంతో డెలివరీ చేయకుండా చూడటం ఇతర అంశాలు. గడచిన మూడు అధ్యక్ష ఎన్నికలను పరిశీలించినపుడు పోస్టల్ బ్యాలట్లలో అత్యధిక ఓట్లు డెమోక్రటిక్ పార్టీకే పడ్డాయి. ఈ అంశం గమనంలో ఉంది కనుక ఈ సారి కరోనా కారణంగా వాటి సంఖ్య మరింతగా పెరుగుతుందని ట్రంప్ యంత్రాంగం ముందుగానే ఊహించింది. పోస్టు మాస్టర్ జనరల్ డెజోరు తన పధకాలను వెంటనే అమలు చేశాడు.
పోస్టు మాస్టరు జనరల్ కుట్రను పసిగట్టిన ఒక యూనియను ఒక స్ధానిక కోర్టులో దాఖలు చేసిన పిటీషనుపై నిర్ణీత గడువులోగా తపాలా బ్యాలట్లను బట్వాడా చేయాలని న్యాయమూర్తి ఆదేశించాడు. దాన్ని అమలు చేసేందుకు అధికారులు తిరస్కరించారు. మూడు లక్షల బ్యాలటు కవర్లు ఎక్కడున్నాయో తెలియటం లేదని అధికారులు కోర్టుకు తప్పుడు సమాచారమిచ్చారు. సకాలంలో ముద్రపడిన బ్యాలట్లను వెతికి మరీ ఎన్నికల తరువాత కూడా అందచేయాలని న్యాయమూర్తి ఆదేశించాడు. అయినా అధికారులు అనేక చోట్ల బాలట్ల బట్వాడాను అడ్డుకొనేందుకు ప్రయత్నించారు.
ఈ ఎన్నికలలో విజయం సాధించేందుకు డోనాల్డు ట్రంపు పాల్పడని తప్పుడు పని లేదు.చైనా, కమ్యూనిస్టు బూచిని చూపి ఓటర్లను ఆకట్టుకొనేందుకు ప్రయత్నించటం వాటిలో ఒకటి. దానిలో భాగంగానే జో బైడెను కమ్యూనిస్టు అని, అమెరికాను చైనాకు తాకట్టుపెడతాడు అని ప్రచారం చేశాడు. నిజానికి బైడెను పక్కా కార్పొరేటు మనిషి. గతంలో బరాక్ ఒబామా హయాంలో ఉపాధ్యక్షుడిగా పని చేసిన సమయంలో చైనాకు ప్రత్యేకమైన అనుకూలతను ఎక్కడా వ్యక్తం చేయలేదు. ట్రంప్ మితవాది, ఫాసిస్టుశక్తులకు మద్దతుదారు, శ్వేతజాతి దురహంకారి, కార్మిక వ్యతిరేకి కనుక శ్వేతజాతీయులైన సాధారణ కార్మికులతో సహా అనేక మంది తక్కువ ప్రమాదకారి అనే భావనతో బైడెన్ను బలపరిచారు. వారిలో కమ్యూనిస్టులు కూడా ఉన్నారు. అనేక శక్తులు బైడెను మీద అభిమానం కంటే ట్రంపు మీద ఉన్న వ్యతిరేకత కారణంగా డెమోక్రాట్లకు ఓటువేశారు. ఈ శక్తులన్నీ ఉన్నాయి కనుకనే పోటాపోటీగా జరిగిన ఎన్నికల్లో విజయం సాధ్యమైంది. అయితే గడచిన కాలంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా కార్పొరేట్లకే సేవ చేశారు, కార్మికులను విస్మరించారు. డెమోక్రటిక్ పార్టీలో ఇటీవలి కాలంలో పురోగామిశక్తులు సంఘటితం అవుతున్నాయి. అనేక స్ధానిక ఎన్నికలలో కార్పొరేట్ అనుకూల శక్తులను వెనక్కు నెట్టి పోటీకి దిగుతున్నాయి. ఈ నేపధ్యంలోనే ఎన్నికలు ముగిసిన వెంటనే తమ అజెండా అమలుకు వత్తిడి తేవాలని కూడా నిర్ణయించాయి.
బైడెన్ వచ్చినంత మాత్రాన జరిగిన అన్యాయాలన్నీ సరిదిద్దుతారని చెప్పలేము. మన యువతకు హెచ్1బి వీసాల గురించి ట్రంప్ ఎంత ప్రతికూలంగా వ్యవహరించిందీ చూశాము. నిజానికి ఆ వీసాలు మన మీదో మరొక దేశం మీదో ప్రేమతోనో ఇస్తున్నవి కాదు. అక్కడి కార్పొరేట్ కంపెనీలకు చౌకగా పని చేసే కార్మికులు అవసరం కనుక ఇస్తున్నారు. ఎన్నికలలో నిరుద్యోగుల ఓట్ల కోసం ట్రంప్ జిమ్మిక్కులు చేశాడు. ఇప్పుడు బైడెన్ ముందూ నిరుద్యోగం సమస్య ఉంది. అయినప్పటికీ వీసాల విషయంలో కార్పొరేట్ల వత్తిడి మేరకు సడలింపులు ఇస్తారని భావిస్తున్నారు. ఇస్తారా లేదా, చైనా ఇతర దేశాల పట్ల ట్రంపు అనుసరించిన దూకుడు ధోరణి మార్చుకుంటారా లేదా వంటి అనేక సమస్యల మీద జనవరి మూడవ వారంలోగానీ స్పష్టత వచ్చే అవకాశం లేదు.