Tags

, , ,


ఎం కోటేశ్వరరావు


లాటిన్‌ అమెరికా ! సామ్రాజ్యవాదుల ప్రయోగశాల !! వలసల నుంచి ప్రజాస్వామ్య ఖూనీ- ప్రహసనం వరకు జరగని ప్రయోగాలు లేవంటే అతిశయోక్తి కాదు. ఈక్వెడోర్‌లో ఫిబ్రవరి ఏడవ తేదీన అక్కడ అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. వామపక్ష అభ్యర్ధి ఆండ్రెస్‌ అరౌజ్‌ తొలి దఫాలోనే విజయం సాధిస్తారని సర్వేలు వెల్లడించాయి. రాజ్యాంగం ప్రకారం అధ్యక్ష పదవికి పోటీ చేసిన వారు తొలి దఫాలో 50శాతానికి పైగా తెచ్చుకోవాలి, లేదా 40శాతానికి మించి తెచ్చుకొంటే సమీప ప్రత్యర్ధికంటే పదిశాతం ఆధిక్యతలో ఉండాలి. జనవరిలో చేసిన సర్వేల ప్రకారం ఆండ్రెస్‌ అరౌజ్‌కు 43శాతంతో ముందుండగా సమీప ప్రత్యర్దులు 25,19శాతాలతో ద్వితీయ, తృతీయ స్ధానాల్లో ఉన్నారు.


అధ్యక్ష పదవి ఎన్నికలలో ఎన్నికలలో మొత్తం పన్నెండు మంది పోటీ చేశారు. నలుగురు రెండంకెలకుపైగా ఓట్లు సాధించారు. వామపక్ష ఆండ్రెస్‌ అరౌజ్‌కు 32.7, మితవాద పార్టీ గులెర్మో లాసోకు 19.74, హరిత వామపక్షం అని చెప్పుకొనే యకు పెరెజ్‌కు 19.38, మరో అభ్యర్ధి గ్జేవియర్‌ హెరవాస్‌కు 15.69శాతం ఓట్లు వచ్చాయి. ప్రస్తుత అధ్యక్షుడు లెనిన్‌ మొరెనా పార్టీ అభ్యర్ధికి కేవలం 1.54శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. ఓట్ల లెక్కింపు ప్రారంభంలో ఆండ్రెస్‌ అరౌజ్‌ తొలి దఫాలోనే ఎన్నికయ్యేందుకు అవసరమైన మెజారిటీతో ఉన్నట్లు తేలింది. దాంతో తాను విజయం సాధించినట్లు ప్రకటించారు కూడా. ఆ తరువాతే ” లెక్క ” మారిపోయింది.


అక్రమాలు జరిగాయంటూ పచాకుటిక్‌ పార్టీ అభ్యర్ధి యకు పెరెజ్‌ రాజధాని క్విటోలోని కేంద్ర ఎన్నికల కార్యాలయం ముందు ధర్నా చేశాడు.తనను రెండవ స్ధానానికి చేరకుండా రాఫెల్‌ కొరెయా, ఎన్నికలలో మరో ప్రత్యర్ధి లాసో, మరొక పార్టీనేతలు తనకు వ్యతిరేకంగా కుట్రపన్నారని ఆరోపించాడు. తనకు 35శాతం రావాల్సి ఉండగా పదిహేనుశాతమే వచ్చేట్లు, తనకు వచ్చే వాటిని ఇతరులకు బదలాయించారని ఆరోపించాడు. డోనాల్డ్‌ ట్రంప్‌ మాదిరే ఓట్లను అపహరించారని చిందులు వేశాడు.నిజానికి రెండవ స్దానంలో ఉన్న లాసో ఎన్నికల ఫలితాల మీద తనకెలాంటి సందేహం లేదని, అయితే యకు పెరెజ్‌ కోర్కెకు మద్దతుగా తాను కూడా తిరిగి ఓట్ల లెక్కింపు కోరుతున్నట్లు చెప్పాడు.నిజానికి ఈ ఇద్దరూ ఎన్నికల ముందు దుమ్మెత్తి పోసుకున్నారు. బ్యాంకరు లాసోకు ఓటు వేయటం కంటే ఒక నియంతకు వేయటం మంచిదని పెరెజ్‌ వర్ణించాడు. ఓట్ల లెక్కింపు మధ్యలోనే ధోరణి మారిపోవటంతో అక్రమాలు జరిగాయని బెల్జియంలో ఉన్న రాఫెల్‌ కొరెయా ట్వీట్‌ చేశారు. తమ అభ్యర్ధికి 38శాతంపైగా రావాల్సి ఉండగా 31శాతం అని ప్రకటిస్తున్నారన్నారని ఇది అబద్దం అని అందరికీ తెలుసన్నారు.
పార్లమెంట్‌లోని 137 స్ధానాలను మూడు తరగతులుగా విభజించారు. పదిహేను స్దానాలను జాతీయ ప్రాతిపదికన, ఆరింటిలో రెండేసి చొప్పున అమెరికా-కెనడా, లాటిన్‌ అమెరికా, ఐరోపా- ఆసియా ఇతర ప్రాంతాల్లో ఉన్న ప్రవాస ఈక్వెడోరియన్లకు, 116 స్దానాలను రాష్ట్రాలలో ఆయా పార్టీలకు వచ్చిన ఓట్ల దామాషా ప్రకారం సీట్లు కేటాయిస్తారు. ఈ మేరకు తాజా ఎన్నికలలో అండ్రెస్‌ అరౌజ్‌ నాయకత్వంలోని వామపక్ష పార్టీకి 5,4,40 చొప్పున మొత్తం 49 వచ్చాయి.


అధ్యక్ష ఎన్నికల్లో ఎవరికీ తగినన్ని ఓట్లు రానందున రెండవ దఫా ఎన్నికలు ఏప్రిల్‌ 11న జరగాల్సి వుంది. ప్రధమ స్దానంలో వామపక్ష అభ్యర్ధి వచ్చినా రెండవ స్ధానంలో తన మద్దతు ఉన్న యకు పెరేజ్‌ రెండవ స్ధానంలో ఉంటారని, రెండవ దఫా ఎన్నికల్లో వామపక్ష వ్యతిరేక ఓట్లన్నింటినీ వేయించి గెలిపించవచ్చని అమెరికన్లు తలచారు. అయితే అదికూడా సాధ్యమయ్యేట్లు కనిపించకపోవటంతో సరికొత్త కుట్రకు తెరలేపారు. రెండవ దఫా ఎవరు ఎవరికి మద్దతు ఇస్తారు అనేదాని కంటే ఎన్నికలను ఎలా బూటకంగా మార్చుతారనే చర్చ ఇప్పుడు ముందుకు వచ్చింది.

కొన్ని రాష్ట్రాలలో ఓట్ల లెక్కింపులో అక్రమాలు జరిగాయని మొదట ఆరోపించారు. పెద్ద రాష్ట్రమైన గుయాస్‌లో మొత్తం, మిగిలిన 16 రాష్ట్రాలలో సగం ఓట్ల లెక్కింపు జరపాలని తాజాగా నిర్ణయించారు. ఇక్కడే ప్రహసనానికి నాంది పడింది. మొదటి స్ధానంలో ఉన్న అభ్యర్ధి అభిప్రాయం, అనుమతి, సంప్రదింపులు కూడా లేకుండానే రెండవ, మూడవ స్దానాల్లో ఉన్న అభ్యర్ధులు ఎన్నికల అధికారులతో సంప్రదింపులు జరపటం, వెంటనే ఓట్లను మరోసారి లెక్కించాలని నిర్ణయించటం వెంటవెంటనే జరిగిపోయాయి. దేనికి రెండవ సారి లెక్కింపు జరుపుతున్నారో, ఎంత వ్యవధిలో జరుపుతారో కూడా వెంటనే ప్రకటించలేదు. మాజీ అధ్యక్షుడు రాఫెల్‌ కొరెయా నాయకత్వంలోని పార్టీని అసలు ఎన్నికలలోనే పోటీ చేయనివ్వకుండా అడ్డుకోవాలని ప్రయత్నించారు. కొరెయాను ఒక తప్పుడు కేసులో ఇరికించి ఆయన పరోక్షంలో ఏకపక్షంగా శిక్ష విధించారు. దాన్ని సాకుగా చూపి కొరెయా, ఆయన నాయకత్వంలోని పార్టీని ఎన్నికలలో పోటీ చేయకుండా అడ్డుకోవాలని చూశారు. అయితే నామినేషన్లకు మరో 48 గంటల సమయం ఉందనగా కొరెయా మినహా ఇతరులు పోటీ చేసేందుకు ఎన్నికల కమిషన్‌ 3-2 ఓట్ల మెజారిటీతో అనుమతి ఇచ్చింది.


మరోసారి ఓట్ల లెక్కింపు పేరుతో ఏ అక్రమాలకు తెరతీయనున్నదీ చెప్పలేము. అక్రమాల పేరుతో మొత్తం ఎన్నికను రద్దు చేసి తిరిగి నిర్వహించటం, రాఫెల్‌ కొరెయా నాయకత్వంలోని పార్టీని ఏదో ఒక సాకుతో పోటీలో లేకుండా చేయటం. బహుశా దీనికోసమే కొరెయా బలపరిచిన అభ్యర్ది అరౌజ్‌ విదేశాల నుంచి అక్రమంగా వచ్చిన నిధులను ప్రచారంలో వినియోగించారని కట్టుకధలను మీడియాలో రాయించారు. లెక్కింపును తారుమారు చేసి అమెరికా బలపరచిన యకు పెరేజ్‌ను రెండవ స్దానంలోకి తెచ్చి, రెండవ దఫా ఎన్నికల్లో వామపక్ష వ్యతిరేకులందరనీ వీలైతే ఏకం చేయటం, సాధ్యంగాకపోతే పెరెజ్‌ను అడ్డగోలు పద్దతిలో గెలిచినట్లు ప్రకటించటం. ఇవన్నీ సాధ్యంగాకపోయినా, ప్రజాప్రతిఘటన తీవ్రంగా ఉంటుందని భావించినా బొలివీయాలో మాదిరి వెనక్కు తగ్గటం, ఏది జరిగినా ఆశ్చర్యం లేదు. గుయాస్‌ రాష్ట్రంలో ఆండ్రెజ్‌ అరౌజ్‌కు 41.82శాతం ఓట్లు రాగా లాసోకు 25.27, గ్జేవియర్‌ హెరవాస్‌కు 9.94, పెరెజ్‌కు 8.73శాతమే వచ్చాయి. ఇక్కడ మొత్తం ఓట్లను లెక్కించటం ద్వారా కొన్ని ఓట్లను పెరెజ్‌కు బదలాయించినా రెండవ స్ధానంలోకి వచ్చే అవకాశం ఉంది. లేదూ మొత్తంగా తొత్తడం చేస్తే రెండు మూడు స్దానాల్లో ఉన్నవారు తొలి రెండు స్ధానాల్లోకి వస్తే అరౌజ్‌ అసలు పోటీలో ఉండరు. మొదటి ఇద్దరులో ఎవరు గెలిచినా అమెరికాకు, వామపక్ష వ్యతిరేకులకు ఇబ్బంది లేదు.


ఈక్వెడార్‌ పరిణామాలు వామపక్ష శక్తుల ముందు మరో కొత్త సవాలను ముందుకు తెచ్చాయి. అనేక దేశాలలో పర్యావరణం లేద హరిత ఉద్యమ కార్యకర్తలు, కొన్ని చోట్ల పార్టీలు కూడా ముందుకు వచ్చాయి. పర్యావరణాన్ని కాపాడాలని కోరటం ఒక పురోగామి భావన అనటంలో ఎలాంటి సందేహం లేదు, అవసరం కూడా ఉంది.సాధారణంగా ఇలాంటి శక్తులన్నీ ప్రభుత్వాలకు వ్యతిరేకంగానే ఉంటాయి, పర్యావరణం రక్షణ విషయంలో వామపక్షాలు కూడా సానుకూలమే.అందువలన వారితో చేతులు కలపటం కూడా తెలిసిందే. ఈ నేపధ్యంలోనే పశ్చిమ దేశాల మీడియా వీరిని హరిత లేదా హరిత వామపక్షాలు అని వర్ణిస్తోంది. ఈక్వెడార్‌లో స్దానిక తెగల నేత కూడా అయిన యకు పెరేజ్‌ను ఈ కారణంగానే హరిత వామపక్ష వాది అని పిలుస్తున్నారు. అయితే ఇతగాడి నాయకత్వంలోని పార్టీ తీరు తెన్నులను చూసినపుడు వామపక్షాలకు బద్దశత్రువు అయిన అమెరికా పాలకవర్గ ఒళ్లో కూర్చున్నట్లు మనకు స్పష్టంగా కనిపిస్తుంది.


వామపక్ష వాది, ఆర్ధికవేత్త అయిన రాఫెల్‌ కొరెయా 2007 నుంచి 2017వరకు దేశాధ్యక్షుడిగా పని చేశారు.వామపక్ష విధానాలను అమలు జరిపేందుకు ప్రయత్నించారు. ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్‌ ప్రభావాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకున్నారు. అంతకు ముందు పాలకుల హయాంలో చేసిన అప్పు అక్రమం అని మూడు బిలియన్‌ డాలర్లమేరకు చెల్లించేది లేదని ప్రకటించాడు.దాని మీద అంతర్జాతీయ కోర్టుల్లో విచారణ జరిగింది.పర్యవసానంగా అప్పులో 60శాతం పైగా తగ్గింది. రాజ్యాంగ సవరణల కారణంగా 2009లో తిరిగి 2013లో కొరెయా విజయం సాధించారు. లాటిన్‌ అమెరికాలోని ఇతర వామపక్ష నేతలతో చేతులు కలిపారు.2006-16 మధ్య దేశంలో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న 36.7శాతం మందిని 22.5కు తగ్గించారు. అంతకు ముందు రెండు దశాబ్దాలలో జిడిపి వృద్ధి రేటు 0.6శాతంగా ఉన్నదానిని 1.5శాతానికి పెంచాడు. అసమానతలను కొలిచే గిని కోఎఫిసియెంట్‌ 0.55 నుంచి 0.47కు తగ్గింది. 2016లో వచ్చిన భూకంపంలో 650 మంది మరణించారు. ఆస్దినష్టం జిడిపిలో మూడుశాతం ఉంది. దాంతో దేశం మాంద్యంలోకి దిగజారి ప్రభుత్వ ఖర్చులో కోత పెట్టాల్సి వచ్చింది.

రెండు సార్లు అధ్యక్ష పదవిని స్వీకరించిన కారణంగా 2017ఎన్నికలలో కొరెయా పోటీ చేసేందుకు అవకాశం లేకపోయింది.పార్టీ అభ్యర్ధిగా 2007-13 మధ్య ఉపాధ్యక్షుడిగా పని చేసిన లెని(మ్‌)న్‌ మోరెనో పోటీ చేసి గెలిచారు. అనూహ్యంగా అంతకు ముందు అనుసరించిన వామపక్ష విధానాలకు స్వస్ధి చెప్పి తిరోగమన విధానాల అమలుకు పూనుకోవటంతో పార్టీలో విబేధాలు వచ్చాయి. కొరెయాను పక్కకు నెట్టి ఆయన మీద అవినీతి కేసులు నమోదు చేయించి జైలు పాలు చేసేందుకు కుట్ర చేశారు. దాన్ని గమనించి అదే ఏడాది తన భార్యతో కలసి బెల్జియం వెళ్లి తనకు రాజకీయ ఆశ్రయం కల్పించాలని దరఖాస్తు చేశారు. కొరెయా ఉన్నత విద్య అక్కడే జరగటం, ఆయన భార్య బెల్జియం పౌరురాలు కావటంతో అక్కడే ఉండిపోయిరు. కొరెయా అధికారంలో ఉన్న 2012లో ప్రత్యర్ధి ఒకరిని కిడ్నాప్‌ చేశారని తప్పుడు కేసు నమోదు చేశారు. దాని విచారణకు కోర్టుకు హాజరు కాలేదనే పేరుతో కొరియాను అరెస్టు చేయాలని 2018 జూలై 3న న్యాయమూర్తి అదేశించాడు.అరెస్టు చేయాలని ఇంటర్‌పోల్‌ను కోరారు. అయితే ఆయన మీద ఉన్న కేసులు రాజకీయ అంశాలుగా ఉండటంతో తాము అరెస్టు చేయలేమని స్పష్టం చేసింది. తరువాత 2020 ఏప్రిల్‌ 7న ఈక్వెడోర్‌ సుప్రీం కోర్టు ఎనిమిది సంవత్సరాల జైలు శిక్ష విధించింది.


లాటిన్‌ అమెరికాలో వామపక్షాలకు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్ర బహిరంగ రహస్యం. అంతర్జాతీయ వార్తా సంస్దల కట్టుకథలు వాటిలో ఒక భాగం. అక్కడ మాజీ అధ్యక్షుడు రాఫెల్‌ కొరెయా మీద తప్పుడువే అయినా కేసులున్నాయి గనుక ఆయనను అడ్డుకున్నారంటే అర్దం చేసుకోవచ్చు. నాలుగు సంవత్సరాల పాటు ఆయన మద్దతుదారులు కొత్త పార్టీని నమోదు చేసేందుకే అవకాశం ఇవ్వని అపర ప్రజాస్వామ్యం అక్కడ ఉంది. గతేడాది ఆగస్టులో కొరెయాకు మద్దతునిచ్చే ఒక పార్టీని ఎన్నికల సంఘం నిషేధించింది. వామపక్ష అభ్యర్ధి ఆండ్రెస్‌ అరౌజ్‌ను పోటీ చేయకుండా చూసేందుకు చివరి క్షణం వరకు ఒక ఎన్నికల కమిషనర్‌ ప్రయత్నించాడు. చిత్రం ఏమిటంటే ఎన్నికలలో కొరెయా చిత్రాన్ని వినియోగించి అనుకూల ప్రచారం చేయవద్దని నిషేధించిన ఎన్నికల సంఘం రాజకీయ వ్యతిరేకులు తమ ప్రచారంలో కొరెయా చిత్రాన్ని ఉంచి తప్పుడు ప్రచారం చేసేందుకు అనుమతించింది. తప్పుడు కేసులు, అరెస్టులకు సిద్దపడటంతో అనేక మంది కొరెయా మద్దతుదారులు విదేశాలకు వెళ్లిపోయారు.


2017 ఎన్నికలలో కొరెయా బలపరిచిన అభ్యర్ధిగా విజయం సాధించిన మొరెనో అమెరికా చంకనెక్కాడు, కొరెయాకే ఎసరు పెట్టాడు.పదవిలోకి వచ్చినపుడు 77శాతం మంది జనం మద్దతు ఉండగా 2019లో అది ఏడుశాతానిక పడిపోయిందంటే ఎంతగా జనానికి దూరమయ్యాడో తేలిపోయింది. అంతకు ముందు పార్లమెంటులో 74సీట్లు ఉన్న మొరెనో పార్టీ తాజా ఎన్నికలలో ఒక్క స్దానం కూడా తెచ్చుకోలేకపోయింది. ఆ పార్టీ అభ్యర్ధికి తాజా అధ్యక్ష ఎన్నికలలో 1.54శాతం ఓట్లు వచ్చాయి.


పచాకౌటిక్‌(హరిత పార్టీ) నేత యకు పెరెజ్‌ అమెరికా నాయకత్వంలో బొలీవియా, బ్రెజిల్‌, వెనెజులా, నికరాగువాలలో జరిపిన కుట్రలన్నింటినీ సమర్ధించాడు. అతని రాజకీయ చరిత్రను చూస్తే వామపక్ష ముసుగు వేసుకున్న ద్రోహిగా కనిపిస్తాడు. లాటిన్‌ అమెరికాలో అలాంటి శక్తులను అమెరికా ఎందరినో తయారు చేసింది. వారికి అవసరమైన నిధులు, జనాన్ని గందరగోళపరిచేందుకు, వామపక్ష శిబిరాల్లో అనుమానాలు రేపేందుకు నేషనల్‌ డెమోక్రటిక్‌ ఇనిస్టిట్యూట్‌ (ఎన్‌డిఐ) అనే సంస్ద ముసుగులో అవసరమైన శిక్షణ ఇచ్చింది. వారికి మద్దతుగా ప్రభుత్వేతర స్వచ్చంద(ఎన్‌జిఓ) సంస్దలను, సిఐఏ ఆధ్వర్యంలోపనిచేసే నేషనల్‌ ఎండోమెంట్‌ ఫర్‌ డెమోక్రసీ(ఎన్‌ఇడి) సంస్ధను ఏర్పాటు చేసింది.2007 అమెరికా ఎన్‌డిఐ పత్రంలో లాటిన్‌ అమెరికాలో వామపక్ష శక్తులకు వ్యతిరేకంగా, తమకు అనుకూలంగా పని చేసేందుకు శిక్షణ ఇచ్చిన పార్టీల పేర్లు బయటకు వచ్చాయి. వాటిలో ఒకటి పచాకౌటిక్‌ ఒకటి. మన దేశంలో కూడా అలాంటి ఎన్‌జిఓ శక్తులను చూడవచ్చు. 2016-19 మధ్య ఈక్వెడోర్‌లో ఎన్‌జిఓలకు 50లక్షల డాలర్లు ఇచ్చినట్లు బహిరంగంగా ఎన్‌ఇడి జాబితా వెల్లడించింది. రాఫెల్‌ కొరెయా అధ్యక్షుడిగా పని చేసిన సమయంలో ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా పచాకౌటిక్‌ పార్టీ ఆందోళనలు నిర్వహించింది.2010లో కొరెయాకు వ్యతిరేకంగా జరిగిన కుట్రలో ప్రధాన పాత్రపోషించింది.

ఒక రెడ్‌ ఇండియన్‌ తెగకు చెందిన యకు పెరెజ్‌ లాటిన్‌ అమెరికా ఐదువందల సంవత్సరాల చరిత్రలో తొలి రెడ్‌ ఇండియన్‌ తెగనేతగా బొలీవియాలో అధికారానికి వచ్చిన ఇవో మొరేల్స్‌ను వ్యతిరేకించిన సామ్రాజ్యవాదుల బంటు. అనేక మంది కుహనా వామపక్ష వాదుల మాదిరి పెరెజ్‌ సాధారణ జీవనం గడుపుతున్నట్లు కనిపించినా అమెరికా అజెండాలో భాగం తప్ప నిజాయితీతో కూడింది కాదు. ఈక్వెడోర్‌లో ఎక్కువ సంఖ్యలో కార్లు నడపకూడదని, గనులు తవ్వకూడదని, చమురు తీతను పరిమితం చేయాలంటూ కొరెయా పాలనా కాలంలో ఆందోళనలు నిర్వహించాడు. అక్కడ ఉన్న చమురు, ఖనిజ నిల్వలను వెలికి తీసి పేద దేశంగా ఉన్న ఈక్వెడోర్‌ను అభివృద్ది చేసేందుకు పూనుకున్న కొరెయా మీద కుట్రలో పెరెజ్‌ భాగస్వామి. ఇలాంటి తమ బంటును గద్దెనెక్కించేందుకు చేస్తున్న కుట్రను ఈక్వెడోరియన్లు సాగనిస్తారా ?
” ఎవరైనా కొరెయా తరఫున అభ్యర్ధులుగా పోటీ చేసేట్లయితే వారు పెద్ద ముప్పుకొని తెచ్చుకున్నట్లే ఇంకా దేశం విడిచిపోకపోయినా, కేసుల్లో శిక్షలు పడకపోయినా వ్యవస్ధ వారి మీద కన్నేసి ఉంచుతుంది అని కేంద్ర కాబినెట్‌ కార్యదర్శి స్వయంగా బెదిరింపులకు దిగాడు. అనివార్య పరిస్ధితుల్లో ఒక వేళ వామపక్ష అభ్యర్ధి అభ్యర్ధి ఎన్నికైనా పై బెదిరింపులను చూసినపుడు ఏదో ఒక సాకుతో అధికారంలో కొనసాగనిచ్చే అవకాశం ఉంటుందా ?చూద్దాం !