• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Monthly Archives: April 2021

హతవిధీ ! విమర్శించిన నెహ్రూ బాటలోనే నరేంద్రమోడీ !!

11 Sunday Apr 2021

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, Uncategorized, USA

≈ Leave a comment

Tags

Anti Dumping Duties, India Protectionism, Jawaharlal Nehru, Narendra Modi, Trade Protectionism, WTO


ఎం కోటేశ్వరరావు


జవహర్‌లాల్‌ నెహ్రూ, నరేంద్రమోడీ ఇద్దరూ పాలకవర్గాల సేవకులే అనటంలో మరో మాట లేదు. ఒకరు పదిహేడు సంవత్సరాలు ప్రధానిగా అధికారంలో ఉంటే మరొకరు ఇప్పటి వరకు ఏడు, మరో మూడు సంవత్సరాలు ఉండబోతున్నారు. దేశం కోసం అనే పేరుతో ఇంకేదైనా చేస్తే ఏం జరుగుతుందో చెప్పలేం. మనం అనేక రంగాలలో వెనుకబడి ఉండటానికి నెహ్రూ, తరువాత కాంగ్రెస్‌ అనుసరించిన విధానాలే కారణం అని సంఘపరివార్‌ అంశ నుంచి వచ్చిన ప్రధాని నరేంద్రమోడీ సందుదొరికినపుడల్లా దుమ్మెత్తి పోయటం తెలిసిందే. కాంగ్రెస్‌ యాభై సంవత్సరాలలో సాధించలేని దానిని తాము ఐదేండ్లలో అమలు చేశామని చెప్పుకొనే వారు ఆ పాచిపాట ఇంకేమాత్రం పాడలేరు. దేశ అభివృద్దికి సంబంధించి నిరంతరం చర్చ జరగాల్సిందే. అధికారంలో ఉన్న ఎవరి విధానాలనైనా విమర్శనాత్మకంగా చూడాల్సిందే. చిత్రం ఏమిటంటే నెహ్రూ విధానాలను విమర్శించటం దేశభక్తి, నరేంద్రమోడీ ఏలుబడిని తప్పుపట్టటం దేశద్రోహంగా పరిగణిస్తున్నారు. ప్రపంచంలో ఏం జరుగుతోంది ? తిరుగుతున్న చట్రంలో ఏ దేశం ఎక్కడ ఉంది ? వాటిలో మార్పుల కోసం జరుగుతున్న ప్రయత్నాలు, వాటి పర్యవసానాలేమిటి ? వీటి అంతరార్దం ఏమిటి ? కార్పొరేట్ల లాభాలుా, అందుకోసం రక్షణాత్మక చర్యలు. ధనిక దేశాలు, వాటిని అనుసరించాలని చూస్తున్న దేశాల విధానాల సారమిదే !

వాణిజ్య సమస్యలను పరిష్కరించేందుకు ప్రపంచ వాణిజ్య సంస్ద(డబ్ల్యుటివో)ను ఏర్పాటు చేశారు. వివాదాలు తలెత్తితే విచారించి తీర్పు చెప్పేందుకు ఒక న్యాయస్ధానం ఉంటుంది. దానికి న్యాయమూర్తులను నియమించేందుకు అమెరికాలో అధికారంలో ఉన్న ట్రంప్‌ నిరాకరించాడు, ఇప్పుడు జో బైడెన్‌ అదే బాటలో నడుస్తున్నాడు. కనుక ఎవరైనా దానికి ఫిర్యాదు చేస్తే వెంటనే తేలదు. మనం అమెరికా, ఇతర విదేశీ కంపెనీలపై డిజిటల్‌ సర్వీసు టాక్సు(డిఎస్‌టి) వేశాము. దాని మీద డబ్ల్యుటిఓకు వెళితే వెంటనే తేలదు. అది తెలుసు గనుక దానితో నిమిత్తం లేకుండా మన దేశం నుంచి దిగుమతి చేసుకొనే వస్తువుల మీద అమెరికా 25శాతం సుంకం విధించనున్నట్లు ప్రకటించింది.ఈ వివాదం ఎక్కడ తేలాలి ? తెలియదు !
చైనా నుంచి దిగుమతి చేసుకొనే సౌర విద్యుత్‌ పలకలు, సంబంధిత పరికరాలపై మన ప్రభుత్వం రక్షణ పేరుతో 2018లో విధించిన పన్ను గడువు ఈ ఏడాది జూలైలో తీరి పోనుంది. అందువలన సోలార్‌ ఫొటోఓల్టాయిక్‌ మోడ్యూల్స్‌(పివి) మీద 40శాతం, సోలార్‌ ఫొటోవోల్టాయిక్‌ సెల్స్‌ మీద 25శాతం చొప్పున దిగుమతి పన్నును 2022 ఏప్రిల్‌ నుంచి విధించాలని మన ప్రభుత్వం నిర్ణయించింది. దీన్ని డబ్ల్యుటివోలో సవాలు చేసినా వెంటనే తేలదు కనుక చైనా కూడా పోటీగా ప్రతీకార చర్య తీసుకుంటుంది. దానికీ అదే గతి, కనుక ఏం చేయాలి ? తెలియదు ! అలాంటపుడు జరిగేదేమిటి ? ఆయా దేశాల సామర్ధ్యం ముందుకు వస్తుంది. అది లేని దేశాలు మిగతావాటికి లొంగిపోతాయి. లేదూ తమకూ కొన్ని ప్రత్యేకతలు ఉంటే వాటిని తురుపుముక్కగా ఉపయోగించి రాజీకి వస్తాయి. మన దేశంలో సౌర విద్యుత్‌ తయారీకి అవసరమైన పరికరాకావచ్చు, మరొకటి కావచ్చు స్వంతంగా తయారు చేసుకుంటే ఎవరికీ లొంగాల్సిన, రాజీ పడాల్సిన పని లేదు.

ఇప్పుడున్న పరిస్దితి ఏమిటి ? ఈ ఏడాది మార్చి 24న అమెరికన్‌ ప్రాస్పెక్ట్‌ అనే పత్రిక ప్రచురించిన సమాచారం ప్రకారం సౌర విద్యుత్‌కు అవసరమైన నాలుగు పరికరాల విషయంలో ప్రపంచ సామర్ధ్యం ఇన్‌గాట్స్‌లో 95, వేఫర్స్‌లో 99,పివి సెల్స్‌ 80,పివి మోడ్యూల్స్‌లో 75శాతం చైనా వాటాగా ఉంది. ఈ రంగంలో చైనా తన సాంకేతికతను మరింతగా మెరుగుపరచుకొంటోంది. దీనికి సాంకేతికపరిజ్ఞానంతో పాటు పెద్ద మొత్తంలో పెట్టుబడులు అవసరం. ఇలాంటి పరిస్దితిలో అమెరికాను మెప్పించేందుకో మరొకందుకో చైనా దిగుమతుల మీద పన్నులు పెంచితే మనం దేశీయంగా ఉత్పత్తిని పెంచుకోవటం అనుమానాస్పదమే అనే వారిని దేశద్రోహులుగానో, స్వదేశీ పరిశ్రమ మీద ప్రేమ లేని వారుగానో ముద్రవేస్తారు. సంప్రదాయ విద్యుత్‌ బదులు ప్రత్యామ్నాయ సౌర విద్యుత్‌ మీద కేంద్రీకరించే దేశాలకు చైనా తన వస్తువులను ఎగుమతి చేస్తుంది. దానికి పోయేదేమీ లేదు. మేకిన్‌ ఇండియాను ప్రోత్సహించుదాం !


మన దేశంలో సోలార్‌ పానల్స్‌ తయారీలో బోరోసిల్‌ అనే కంపెనీ ఉంది. అది తయారు చేసేవి మన అవసరాలకు చాలవు.దీనికి తోడు సౌర విద్యుత్‌ ఉత్పత్తి చేసే వారు ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్య మన దేశంలో తయారయ్యే పివి సెల్స్‌ తయారీదారులు చెప్పుకున్నమాదిరి సామర్ద్యం కలిగినవి కాదన్నది విమర్శ. నాణ్యతా ప్రమాణాలను నిర్దేశించే ప్రభుత్వ సంస్దలు లేని కారణంగా ఎవరిష్టం వచ్చినట్లు వారు తమ ఉత్పత్తుల గురించి చెప్పుకుంటున్నారు. అది ఆయా సంస్దల గిట్టుబాటును కూడా ప్రశ్నార్ధకంగా మారుస్తోంది. ప్రస్తుతం మన దేశంలో సౌర విద్యుత్‌ ఉత్పత్తి సామర్ధ్యం 32గిగావాట్లు కాగా మన సోలార్‌ సెల్స్‌ ఉత్పత్తి మూడు, మాడ్యుల్స్‌ ఉత్పత్తి ఐదు గిగావాట్లకే సరిపోతుంది. మిగిలినదంతా చైనా నుంచి దిగుమతుల మీదే ఆధారపడి ఉంది. ఏడు సంవత్సరాల క్రితం మన దేశం ప్రపంచ సారధిగా మారాలని చాలా మంది ఆశించగా వాస్తవ పరిస్ధితి ఇలా ఉంది. దేశభక్తి ప్రదర్శన కాదు, ఆచరణలో చూపాలి మరి. మన దేశంలో సోలార్‌ పానల్స్‌ తయారు చేస్తున్న కంపెనీకి దన్నుగా కేంద్రం దిగుమతి సుంకాలు విధించి రక్షిస్తోంది.

మన దేశ పరిశ్రమలను రక్షించుకోవాలనటంలో ఎలాంటి సందేహం లేదు. ప్రభుత్వానికి వ్యాపారంతో పని లేదు అని చెబుతున్న పాలకులు నిత్యం వ్యాపారుల సేవలోనే మునిగితేలుతున్నారు.విశాఖ ఉక్కు వంటి వాటిని రక్షించుకొనేందుకు అవసరమైన చర్యలను నిరాకరిస్తున్న పాలకులు విదేశీ కంపెనీలకు కారుచౌకగా కట్టబెట్టేందుకు పూనుకోవటం ఏమిటి ? ఇక్కడా చేస్తున్నది దేశానికి దివాలాకోరు-విదేశాలకు లాభాల వ్యాపారమే. ఒకవైపు స్వేచ్చా వాణిజ్యం అని చెబుతారు, సులభతర వాణిజ్యంలో మన స్దానం ఎంతో మెరుగుపడింది చూడమంటారు. కానీ ఆచరణలో ఎలా ఉన్నారు.మనం చైనా ఉత్పత్తుల మీద సుంకాలు విధిస్తున్నాం. చైనా మనకు ఎంత దూరమో మనమూ చైనాకు అంతే దూరంలో ఉంటాం. ఒకరు రాళ్లు వేస్తుంటే మరొకరు పూలు వేస్తారా ? మన భాగస్వామ్య దేశం అని చెప్పుకుంటున్న అమెరికా ఏం చేస్తోందో చూశాము. శత్రుదేశం అంటూ నిత్యం కత్తులు దూస్తున్న చైనా ప్రతికార చర్యలకు పూనుకోకుండా ఎలా ఉంటుంది?


మన దేశం నుంచి దిగుమతి చేసుకొనే దున్న-బర్రె మాసం, రొయ్యలు, ఇతర సముద్ర ఉత్పత్తుల మీదచైనా ఆంక్షలు విధించింది. దాన్ని సవాలు చేస్తూ తాజాగా మన దేశం ప్రపంచ వాణిజ్య సంస్దకు ఫిర్యాదు చేసింది. గాళ్లు లేదా గాలి కుంటు వ్యాధి ముప్పు కారణంగా దున్న-బర్రె మాంసాన్ని నిషేధిస్తున్నామని, అదే విధంగా రొయ్యల గురించి తగినంత సమాచారం లేనందున వాటినీ నిషేధిస్తున్నట్లు చైనా చెబుతోంది. రొయ్యల్లో ఉండే వైరస్‌ మానవులకు హాని కలిగించేది కాదనే నిర్ధారణ పత్రాలు కావాలని చైనా చెబుతోంది. అయితే కొత్త నిబంధనలను ముందుకు తెస్తూ అడ్డుకుంటున్నదని, ఆ మేరకు నిర్దారణ పత్రాలను మనం ఇవ్వలేమని మన దేశం వాదిస్తోంది. నిజం చెప్పుకోవాలంటే చైనాతో మన సర్కారు వివాదం, పెట్టుబడులపై ఆంక్షలు, దిగుమతులపై సుంకాల విధింపు అసలు కారణం అని వేరే చెప్పనవసరం లేదు. 2019-20 సంవత్సరంలో మన దేశం 680కోట్ల డాలర్ల మేర సముద్ర ఉత్పత్తులను ఎగుమతి చేయగా వాటిలో ఐదోవంతు చైనా 130 కోట్ల డాలర్ల సరకు దిగుమతి చేసుకుంది.2020-21లో దిగుమతులు గణనీయంగా పడిపోయాయి. దున్న-బర్రె మాంసం పరిస్ధితి కూడా ఇంతే.

మనం నిత్యం వినియోగిస్తున్న ప్లాస్టిక్‌ సీసాలు, గ్లాసులను పోలిథిలిన్‌ టెరెఫాథలేట్‌(పెట్‌ రెసిన్‌) అనే పదార్ధంతో తయారు చేస్తారు.దీన్ని మన దేశంలో రిలయన్స్‌, ఇండో రమా కంపెనీలు ప్రధానంగా తయారు చేస్తాయి. వీటి వాటా 91శాతం ఉంది.అత్యధిక భాగం చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నాము. ఈ రెండు కంపెనీలు తమకు రక్షణ కల్పించాలని కోరిన మేరకు ఏడాది తరువాత నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం గతేడాది డిసెంబరు నుంచి అమల్లోకి వచ్చే విధంగా రానున్న ఐదు సంవత్సరాల పాటు చైనా దిగుమతుల మీద నాణ్యతను బట్టి టన్నుకు 16.92 నుంచి 200.66 డాలర్ల మేరకు దిగుమతి పన్ను విధించాలని నిర్ణయించింది. పెట్‌తో శీతల పానీయాల, మంచినీటి సీసాలు, జాడీల వంటివి తయారు చేస్తారు. 2018లో చైనా నుంచి 88,247 టన్నులు దిగుమతి చేసుకోగా 2019లో అది 147,601 టన్నులకు పెరిగింది. దీంతో చైనా దిగుమతులపై పన్ను విధించాలని రిలయన్స్‌, ఇండోరమా కంపెనీలు డిమాండ్‌ చేశాయి. లడఖ్‌ వివాదానికి ముందే ఈ కంపెనీలు కేంద్రం ముందు వత్తిడి తెచ్చాయి. ఆ సాకుతో దానికి మోడీ సర్కార్‌ తలొగ్గింది. దీనికి ఆత్మనిర్భర ముసుగు తొడిగింది. రక్షణ చర్యల పేరుతో ప్రతి దేశం తమ కార్పొరేట్ల ప్రయోజనాలకు పూనుకుంటే స్వేచ్చా వాణిజ్యం, పోటీ తత్వం గురించి చెప్పే కబుర్లకు విలువ ఉండదు. చైనా వస్తువులపై 200 బిలియన్‌ డాలర్ల మేరకు దిగుమతి సుంకాలు విధించిన అమెరికా చర్యను ప్రపంచ వాణిజ్య సంస్ధ విమర్శించింది.


నిజానికి రక్షణ చర్యలు మన దేశానికి కొత్తేమీ కాదు. జవహర్‌లాల్‌ నెహ్రూ పాలన ప్రారంభమైన తరువాత అంతకు ముందు మాదిరి తమ వస్తువులకు మార్కెట్‌గా భారత్‌ను మార్చుకోవాలని అమెరికా, ఇతర ఐరోపా ధనిక దేశాలు భావించాయి. మన దేశంలో పరిశ్రమలు నెలకొల్పేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం అందచేసేందుకు, పెట్టుబడులు పెట్టేందుకు కూడా ముందుకు రాలేదు. అప్పటికి మన పారిశ్రామికవేత్తలకు భారీ పెట్టుబడులు పెట్టగలిగిన సత్తా లేదు. అంతకు మించి పెట్టి లాభాలు సంపాదించగలమనే ధైర్యమూ లేదు. ఈ నేపధ్యంలోనే ప్రభుత్వ రంగంలో పరిశ్రమలు, వాణిజ్యానికి నాటి ప్రభుత్వం పునాదులు వేసింది. వాటిని ఆధారం చేసుకొని అనేక మంది పెట్టుబడిదారులు లబ్ది పొందారు, తమ పరిశ్రమలకు వాటిని ఆలంబనగా చేసుకున్నారు. హైదరాబాదులోని ఐడిపిఎల్‌లో పని చేసిన అనుభవాన్ని ఔషధ రంగంలో పరిశ్రమల స్ధాపనకు వినియోగించుకొని నేడు ఆ రంగాన్ని శాసిస్తున్న రెడ్డీలాబ్స్‌ వంటి కంపెనీల యజమానుల గురించి చెప్పనవసరం లేదు. ప్రయివేటు రంగం ముందుకు వచ్చిన తరువాత ఐడిపిఎల్‌ను మూసివేయించారు. అన్ని రంగాల్లోనూ అదే జరుగుతోంది. నాడు ప్రయివేటు రంగాన్ని ప్రోత్సహించేందుకు, దానికి ఆలంబనగా చేసేందుకు నెహ్రూ ప్రభుత్వ రంగాన్ని ప్రోత్సహించారు. నేడు వాటి అవసరం తీరిపోయింది గనుక ఆ ప్రభుత్వ రంగ సంస్దలను ప్రయివేటు వారికి తెగనమ్మి లేదా మూసివేసి లబ్ది చేకూర్చేందుకు నరేంద్రమోడీ అదేపని చేస్తున్నారు.ఐడిపిఎల్‌ను మరింతగా విస్తరించి జనానికి చౌకగా ఔషధాలు అందించవచ్చు, కానీ ప్రభుత్వం వ్యాపారం చేయదనే పేరుతో వదిలించుకుంటున్నారు.
1991 నుంచి నూతన ఆర్ధిక విధానాల పేరుతో మన దేశం విదేశీ పెట్టుబడులకు ద్వారాలు తెరిచింది. విదేశీ పెట్టుబడులకు ద్వారాలు తెరవాలన్న అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ద (ఐఎంఎఫ్‌), ప్రపంచబ్యాంకు ఆదేశాల మేరకు ఈ పని చేశారు. అప్పటి నుంచి మూడు దశాబ్దాల కాలంలో పదమూడు సంవత్సరాలు అతల్‌ బిహారీ వాజ్‌పాయి, నరేంద్రమోడీ ఏలుబడే ఉన్నది. సాధించింది ఏమిటి ? 2014లో అధికారానికి వచ్చిన మోడీ దగ్గర మంత్రదండం ఉందని, అద్భుతాలు చేస్తారని దేశీయ, అంతర్జాతీయ కార్పొరేట్‌ రంగం, దానికి వెన్నుదన్నుగా ఉండే మీడియా ఊదరగొట్టింది.అలాంటిదేమీ లేకపోగా తిరోగమనంలో నడుస్తోందన్న విమర్శలు ప్రారంభమయ్యాయి. పెద్ద దేశాలతో పోలిస్తే భారత్‌లోనే రక్షణ లేదా దిగుమతి సుంకాలు ఎక్కువగా ఉన్నాయని రెండవ సారి మోడీ అధికారానికి వచ్చిన సమయంలో తీవ్ర విమర్శలు వెలువడ్డాయి. సంస్కరణలను మరింత వేగవంతం చేస్తానని మోడీ కూడా చెప్పారు.


కాంగ్రెస్‌ హయాంలో అయినా, మోడీ ఏలుబడిలో అయినా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డిఐ) ఆశించిన మేరకు రాలేదు. వాటికి బదులు మన దేశంలో ఉన్న పరిశ్రమలు, వాణిజ్యాల షేర్‌మార్కెట్లో వాటాల కొనుగోలుకు పెట్టుబడులు పెట్టి లాభాలను తరలించుకుపోయే (ఎఫ్‌పిఐ) పెట్టుబడులు, వడ్డీ వసూలు చేసుకొనే అప్పుల రూపంలో మాత్రమే ఎక్కువగా వచ్చాయి. మన దేశానికి రావటం గొప్ప అన్నట్లుగా పాలకులు, వారికి వంతపాడే అధికార యంత్రాంగం చెబుతోంది.మన పారిశ్రామిక, వాణిజ్యవేత్తలకు ప్రభుత్వం ఇచ్చిన రాయితీలు, వాటిద్వారా వచ్చే లాభాల కోసం తప్ప మనకు మేలు చేసేందుకు కాదు అన్నది గమనించాలి.

నెహ్రూ హయాంలో అనుసరించిన విధానం అభివృద్ధికి దోహదం చేయలేదని కొంత మంది విమర్శిస్తారు. దాన్ని తప్పుపట్టనవసరం లేదు. వారు ప్రత్యామ్నాయంగా సూచించిన విధానాల పర్యవసానం ఏమిటి? 1990దశకానికి ముందు మన పారిశ్రామిక వస్తువులకు రక్షణగా దిగుమతుల మీద గరిష్టంగా విధించిన పన్ను మొత్తం 355శాతం ఉంటే సగటు 126శాతం. తరువాత 2010-11 నాటికి అవి 10-9.5శాతాలకు తగ్గాయి.2020-21లో 10-11.1శాతాలుగా ఉన్నాయి. నరేంద్రమోడీ హయాంలో తిరిగి రక్షణాత్మక చర్యలు ప్రారంభమయ్యాయి.2020జూన్‌ నాటికి వివిధ దేశాల్లో అమల్లో ఉన్న దిగుమతి వ్యతిరేక చర్యల వివరాలు ఇలా ఉన్నాయి.(ది.ని- దిగుమతి నిరోధ చర్యలు),ప్ర.వా.వా-ప్రపంచ వాణిజ్యంలో వాటాశాతం )
దేశం××× ది.ని ××× సుంకం×××× ప్ర.వా.వా
అమెరికా× 398 ××× 71 ×××× 13.3
భారత్‌ × 243 ××× 98 ×××× 2.5
చైనా × 156 ××× 4 ×××× 10.8
బ్రెజిల్‌ × 111 ××× 4 ×××× 1
ఆస్ట్రేలియా× 71 × 15 ×××× 1.2
గతంలో నెహ్రూ లేదా కాంగ్రెస్‌ హయాంలో రక్షణాత్మక చర్యలు ఎక్కువగా తీసుకున్నారు, వాణిజ్యానికి ఆటంకాలు ఎన్నో కలిగించారు. మేము వాటికి భిన్నంగా వ్యవహరిస్తున్నామని చెబుతున్న బిజెపి పెద్దలు ఏ దేశంతో పోల్చుకొని చెబుతున్నట్లు ? ప్రపంచ వాణిజ్యంలో మనవాటా శాతంతో పోల్చితే అవి ఎక్కువగా తక్కువా అన్నది చెప్పాలి. 1990దశకానికి ముందు, తరువాత గణాంకాలను చూసినపుడు ఎగుమతులు-దిగుమతుల ధోరణి ఒకే విధంగా ఎందుకు ఉన్నట్లు ? గతంలో స్వావలంబన అని చెప్పినా, ఇప్పుడు మేకిన్‌ ఇండియా, స్ధానిక వస్తువులనే కొనండి, ఆత్మనిర్బర్‌ అని ఏ పేరు చెప్పినా దిగుమతులదే పై చేయి ఎగుమతులు ఎందుకు పెరగటం లేదు ? యుపిఏ కాలంలో పెరిగిన ఎగుమతి-దిగుమతులు నరేంద్రమోడీ హయాంలో రెండూ ఎందుకు పడిపోయినట్లు ? ఉపాధి ఎందుకు పెరగటం లేదు, ఎందుకు తగ్గుతోంది ?
పెద్ద పరిశ్రమలను ప్రోత్సహించిన నెహ్రూ విధానంలో దుస్తులు, పాదరక్షలు,ఫర్నీచర్‌ వంటి వాటిని చిన్న లేదా కుటీర పరిశ్రమలుగా వర్గీకరించి వాటికి రక్షణ కల్పించారని, ఫలితంగా అవి గిడసబారి పోయినట్లు విమర్శ చేసే వారున్నారు. ఇప్పుడు అనుసరిస్తున్న విధానాలు బడా రంగం అది కూడా రక్షణ లేకపోతే విదేశీ దిగుమతుల దెబ్బకు విలవిల్లాడుతున్నాది. చిన్న పరిశ్రమల సంగతి సరేసరి మూతపడుతున్నవాటి సంఖ్యే అందుకు నిదర్శనం.చిన్న సన్నకారు పరిశ్రమల నుంచి ప్రభుత్వ రంగ సంస్ధలు కొనుగోలు చేయాలన్న రక్షణ విధానాలకు గతంలో అనుసరించిన వాటికి తేడా ఏమిటి ? కరోనా సమయంలో వాటికి ఇవ్వాల్సిన బకాయిలను కూడా మోడీ సర్కార్‌ చెల్లించలేకపోవటం వివాదంగా మారిన విషయం తెలిసినదే.

మన దేశాన్ని ఉత్పత్తి కేంద్రంగా మార్చి ఎగుమతులు చేయాలని నరేంద్రమోడీ ఇచ్చిన పిలుపు ఘోరంగా విఫలమైంది. దిగుమతుల నిరోధానికి విధించే పన్ను శాతాలు పెరుగుతున్నాయి. మనం ఆ పని చేస్తే మన వస్తువులను దిగుమతి చేసుకొనే దేశాలూ అదే చేస్తాయా లేదా ? మన ఎగుమతులు ఎందుకు పెరగటం లేదో మోడీ అండ్‌కో చెబుతారా ? ప్రభుత్వం వాణిజ్యం చేయకూడదంటూ విశాఖ ఉక్కు వంటి సంస్ధలను తెగనమ్మేందుకు పూనుకున్నారు. ప్రభుత్వం అమలు జరిపే ఉత్పత్తితో ముడిపెట్టిన ప్రోత్సాహకాల పధకం వంటి వాటి సంగతేమిటి ? విశాఖ ఉక్కు వంటి వాటికి ఈ పధకాన్ని ఎందుకు అమలు జరపరు ? ప్రయివేటు రంగం ముద్దు-ప్రభుత్వరంగం వద్దా ! భారీ పెట్టుబడులు-కార్మికులు తక్కువగా ఉండే ఎలక్ట్రానిక్‌ పరిశ్రమలకు ఐదేండ్ల పాటు నాలుగు నుంచి ఆరుశాతం రాయితీలు ఇస్తామని ప్రకటించారు. పారిశ్రామిక, వాణిజ్య సంస్ధలు తమ సంగతి తాము చూసుకుంటాయి కదా వాటికి జనం సొమ్ముతో రాయితీలు ఇవ్వటం ఏమిటి ? ఇది రక్షణాత్మక చర్య కాదా ? భారీ పెట్టుబడులు, ఆటోమేషన్‌తో పనిచేసే సంస్ధలే ఎక్కువ ఉత్పత్తి చేస్తాయి. వాటిలో ఉపాధి తక్కువ. అదే తక్కువ పెట్టుబడి, ఎక్కువ మంది కార్మికులు పని చేసే పరిశ్రమలు వాటితో పోటీ పడలేవు. అంటే బడా కంపెనీలకే ప్రోత్సాహకాలు ఇస్తే ఈ సంస్ధలేమి కావాలి ? విదేశాలు కూడా అదే పని చేస్తే మన ఉత్పత్తులు పోటీ పడతాయా ? నెహ్రూ విధానాలను విమర్శించేవారు తాము చేస్తున్నదేమిటి ?


నినాదాలు జనాన్ని ఆకర్షిస్తాయి తప్ప అమలు సందేహమే.అయితే చైనా అందుకు మినహాయింపుగా ఉంది. ఏ నినాదం వెనుక ఏ ప్రయోజనాలు దాగున్నాయో తెలుసుకోలేనంత కాలం జనం మోసపోతూనే ఉంటారన్న లెనిన్‌ మాటలు తెలిసిందే. మన దేశంలో గరీబీ హటావో నినాదం అలాంటిదే.ఇప్పుడు ఆత్మనిర్భరత కూడా అలాంటిదే అని అనేక మంది అభిప్రాయం. మన మార్కెట్‌ను విదేశాలకు తెరిచిన తరువాత వస్తున్న పోటీని స్ధానిక పరిశ్రమలు, వాణిజ్యం తట్టుకోలేకపోతోంది. తమకు రక్షణ కల్పించాలని డిమాండ్‌ చేస్తోంది. నరేంద్రమోడీ సర్కార్‌ ఇప్పుడు చేస్తున్నది అదే. ప్రాంతీయ సమగ్ర ఆర్ధిక భాగస్వామ్య(ఆర్‌సిఇపి) ఒప్పందంలో చేరకపోవటం కూడా రక్షణాత్మక చర్యల్లో భాగమే. దానిలో చేరితే మిగతాదేశాల సరకుల మీద దిగుమతి పన్నులు తగ్గించటంతో పాటు వాటిని అనుమతించాల్సి ఉంటుంది. మనకు ఎగుమతి చేసే అవకాశం ఉన్నప్పటికీ ఆ సామర్ధ్యం లేని కారణంగా బలమైన వారే ఉట్టి కొడతారు. మన ఎగుమతి అవకాశాలు ఇంకా తగ్గిపోతాయి. గత ఐదు సంవత్సరాలలో టారిఫ్‌ కోడ్‌లో ఉన్న 5,500కు గాను 3,600 వస్తువుల విషయంలో దిగుమతి సుంకాలు పెరిగాయి. గత ఏడాది కాలంలోనే ఆరువందల వస్తువుల మీద పన్నులు పెరిగాయి. నెహ్రూను విమర్శించేవారు తాము కక్కిన దానిని తామే తినటం అంటే ఇదే. ఇప్పటికే ప్రయివేటు రంగం పరిశోధన-అభివృద్దికి చేస్తున్నదేమీ లేదు, ఇక వాటికి రక్షణ కల్పిస్తే రాయితీలు మింగి మరింతగా పెరుగుతాయి తప్ప వినియోగదారులకు ప్రయోజనం ఏముంటుంది ?

అద్భుతాలు సృష్టించిన దేశాలుగా పేరు పడిన వాటిలో దక్షిణ కొరియా ఒకటి. ఇప్పుడు ఆ దేశ పరిస్ధితి ఏమిటి ? ప్రభుత్వం ఇచ్చిన మద్దతుకారణంగా ఎలక్ట్రానిక్స్‌ రంగంలో అది పురోగతి సాధించిన మాట వాస్తవం. అమెరికా రక్షణలో ఉన్న కారణంగా మిలిటరీ వ్యయం తక్కువగా ఉండటంతో అక్కడి ప్రభుత్వం ప్రయివేటు రంగానికి పెద్ద ఎత్తున రాయితీలు ఇచ్చింది. ఇప్పుడు దానికి చైనా రూపంలో పోటీ ఎదురైంది. అక్కడి సంస్ధలు కార్యకలాపాలను పరిమితం చేయటం, ఉత్పత్తులను నిలిపివేయటం వంటి చర్యలకు పూనుకున్నాయి.1998 తరువాత తొలిసారిగా 2019లో దాని జిడిపి ఒకశాతం తిరోగమనంలో ఉంది. కరోనా కారణంగా ఇంటి నుంచి పని చేసేందుకు ప్రపంచ వ్యాపితంగా పెద్ద ఎత్తున కంప్యూటర్లు అవసరమై అక్కడి సంస్ధలు ఎగుమతులతో 2020లో నిలదొక్కుకున్నాయి గానీ లేకుంటే పరిస్ధితి ఏమిటి ? అక్కడి పారిశ్రామికవేత్తల నుంచి వసూలు చేస్తున్న వడ్డీ రేటు కేవలం 0.5(అర)శాతమే. అటువంటి రాయితీ ఇచ్చే స్ధితిలో మన దేశం లేదు. అలాంటపుడు బస్తీమే సవాల్‌ అన్నట్లుగా అమెరికా అండచూసుకొని మనకంటే బలవంతుల మీద మీసాలు మెలివేయటం తగనిపని. వాణిజ్య యుద్దంలో అమెరికా వారే కిందామీద పడుతుంటే మనం నిలవగలమా ? చైనా మాదిరి వస్తువులను ఎగుమతి చేయాలని, దాన్ని అనుకరించాలని నాలుగు దశాబ్దాల తరువాత చెబుతున్నారు. మరోవైపు అక్కడి నుంచి వస్తువుల దిగుమతులను నిలిపివేసి ఆర్ధికంగా దెబ్బతీస్తామని అసాధ్యమైన అంశాన్ని టాంటాం వేస్తున్నారు.


అమెరికా, ఐరోపా ధనిక దేశాల మాదిరి చౌకగా వచ్చే చైనా వస్తువులను దిగుమతి చేసుకొని లబ్దిపొందినట్లుగానే గత కొద్ది సంవత్సరాలుగా మన దేశంలోని పారిశ్రామిక, వాణిజ్యవేత్తలు కూడా అదే పని చేస్తున్నారు.కొత్త ఆవిష్కరణలు చేసి తక్కువ ఖర్చుతో ఉత్పత్తిచేసేందుకు ముందుకు రావటం లేదు. గతంలో కాంగ్రెస్‌ ఏలుబడిలో లైసన్సు విధానం ద్వారా కొన్ని పరిశ్రమలకు రక్షణ కల్పించారు. దాన్ని విమర్శిస్తున్న సంఘపరివార్‌ పెద్దలు ఇప్పుడు చేస్తున్నదేమిటి. అదే రక్షణ విధానంలో భాగంగా విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలంటే అనుమతి తీసుకోవాలని, విధించిన పన్నులను చెల్లించాలంటున్నారు. సబ్సిడీలు ఇస్తున్నారు. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని ఎగవేస్తే ఒన్‌ టైమ్‌ సెటిల్‌మెంట్‌ పేరుతో తగ్గిస్తున్నారు. అసలు పూర్తిగా ఎగవేస్తే రద్దుచేస్తున్నారు. అలాంటపుడు పోటీ ఎలా ఉంటుంది ? చరిత్ర పునరావృతం అవుతుందంటారు. దాని అర్ధం గతం మాదిరే అని కాదు. విదేశీ పోటీ నుంచి రక్షణ కల్పిస్తున్నారు, గతంలో తెరిచిన ద్వారాలను మెల్లగా మూస్తున్నారు. స్వాతంత్య్రానంతరం విదేశీ మార్కెట్‌కు ద్వారాలు మూసినందుకు అమెరికా, ఐరోపా దేశాలు మనలను దెబ్బతీసేందుకు ప్రయత్నించాయి. అవి వేర్పాటు, ఉగ్రవాదం రూపంలో ఎలా మనలను దెబ్బతీశాయో చూశాము. ఇప్పుడు ఒక వైపు ధనిక దేశాలతో రాజకీయంగా చేతులు కలుపుతూ మరోవైపు ఆర్ధిక విధానాల్లో దేశీయ కార్పొరేట్లకు రక్షణ కల్పిస్తున్నారు.

అమెరికా బడా దిగ్గజం అమెజాన్‌కు పోటీగా మన దేశ కంపెనీ రిలయన్స్‌ ముందుకు వచ్చింది. రిలయన్స్‌కు దన్నుగా కేంద్ర ప్రభుత్వం ఉంది. అడుగడుగునా అమెజాన్ను అడ్డుకొనేందుకు ప్రభుత్వం పూనుకుంది. అదే విధంగా మెట్రో వంటి సంస్ధలను రిటెయిల్‌ రంగంలోకి రాకుండా ఆటంకం కలిగిస్తూ దేశీయ కార్పొరేట్లకు రక్షణ కల్పిస్తోంది మోడీ సర్కార్‌. అందువలన విదేశాలు ముఖ్యంగా ధనికదేశాలు మనలను చూస్తూ అలాగే వదలి వేస్తాయనుకుంటే పొరపాటు. ముందే చెప్పినట్లు నెహ్రూ-మోడీ ఇద్దరూ కార్పొరేట్ల ప్రతినిధులే. ఒకరు ప్రయివేటురంగం నిలబడేందుకు ప్రభుత్వ రంగాన్ని అభివృద్ధి చేస్తే, ప్రయివేటు రంగం బలపడింది కనుక మరొకరు దాన్ని కారుచౌకగా ప్రయివేటు, విదేశీ కంపెనీలకు అప్పగిస్తున్నారు. ప్రయివేటు రంగానికి రక్షణ, రాయితీలు కల్పించటంలో సేమ్‌ టు సేమ్‌ ! ప్రత్యామ్నాయ విధానాలను అనుసరిస్తే తప్ప చైనా మాదిరి అభివృద్ది చెందే అవకాశం ఉండదు. కానీ ఆర్ధిక విధానాల విషయంలో కాంగ్రెస్‌-బిజెపి రెండూ ఒకదాన్నే అనుసరిస్తున్నాయి. అంతర్గత వైరుధ్యాలు అప్పుడూ-ఇప్పుడూ ఉన్నాయి.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

అమెరికా ఎడమ చంకలో ఇమ్రాన్‌ – కుడి వైపున నరేంద్రమోడీ ! వావ్‌ !!

10 Saturday Apr 2021

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, USA

≈ Leave a comment

Tags

China, F-16 jets, imperialism, imran khan, Narendramodi, US, yankees


ఎం కోటేశ్వరరావు


మరో ఆరు రాఫేల్‌ యుద్ద విమానాలు ఏప్రిల్‌ 28న మన దేశానికి రానున్నాయన్నది ఒక వార్త . తన వ్యూహాత్మక భాగస్వామి పాకిస్ధాన్‌కు ఎనిమిది ఎఫ్‌-16 జెట్‌ యుద్దవిమానాలను విక్రయించాలని నిర్ణయించిన అమెరికా ఆమేరకు గెజిట్‌ నోటిఫికేషన్‌ కూడా ఇచ్చింది. డోక్లాంతో సహా చైనా-భూటాన్‌ మధ్య ఉన్న సరిహద్దు వివాదాలను పరిష్కరించుకోవాలని రెండు దేశాలూ మంగళవారం నుంచి శుక్రవారం వరకు జరిగిన సంప్రదింపులలో రెండు దేశాలూ నిర్ణయించాయి.


విమానాల కొనుగోలు లావాదేవీల్లో మధ్యవర్తిగా ఉన్న భారత ” దేశభక్తుడు ” సుషేన్‌ గుప్తా దొంగతనంగా మన సైన్యం వద్ద పత్రాలను దొంగిలించి అందచేసినందుకు బహుమతి పేరుతో గుప్తా, మరికొందరు మధ్యవర్తులకు రాఫేల్‌ కొన్ని మిలియన్ల యూరోలు సమర్పించుకుంది. మన పాలక దేశభక్తులు ఏం చేస్తారో తెలియదు. పాకిస్ధాన్‌కు ఎఫ్‌-16 యుద్ద విమానాలు అందచేయటం ‘ఉగ్రవాదం’ మీద జరిపే పోరుకు ఇబ్బంది అని నరేంద్రమోడీ ఎంత మొత్తుకున్నా -నిజంగా అలా చేశారో లేదో తెలియదు- అమెరికా ఖాతరు చేయలేదు. గెజిట్‌లో కూడా ప్రకటించాం తన్నుకు చావండి అన్నట్లుగా ఉంది.
డోక్లాంలో చైనా సైన్యాన్ని అడ్డుకొనేందుకు మన మిలిటరీ భూటాన్‌ ఆహ్వానం మీద వెళ్లిందా లేదా చిన్న దేశం కనుక పక్కకు నెట్టి వ్యవహరించిందా అన్నది ఇప్పటికీ తేలని విషయమే. తాజాగా చైనా-భూటాన్‌ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం స్వతంత్రంగానే భూటాన్‌ వ్యవహరించనున్నదని వార్తలు వచ్చాయి. అంటే మీకు చైనా ముప్పు ఉందంటూ మనం జోక్యం చేసుకొనేందుకు దారి మూసినట్లేనా ? అంతిమ ఒప్పందం కుదిరే వరకు రెండు దేశాల మధ్య శాంతి, సుస్ధిరతలను కాపాడాలని నిర్ణయించాయి. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు సరిగా లేకపోయినా ఈ ఒప్పందం కుదరటం విశేషం. భారత్‌ను దూరంగా ఉంచేందుకు చైనా వైపు నుంచి భూటాన్‌కు గణనీయంగా రాయితీలు ఇచ్చినా ఆశ్చర్యం లేదు. డోక్లాంకు తొమ్మిది కిలోమీటర్ల దూరంలో చైనీయులు భూటాన్‌ భూ భాగంలో ఒక గ్రామాన్ని నిర్మించారని మన పత్రికలు కట్టుకధలు రాసిన విషయం తెలిసిందే. అరుణాచల్‌లో కూడా అదే విధంగా గ్రామాలను నిర్మించినట్లు రాసిన విషయం తెలిసిందే.


నరేంద్రమోడీ సర్కార్‌ అమెరికా, దాని మిత్రపక్షాలతో జతకట్టదలచుకుంటే సూటిగానే చెప్పవచ్చు. దాని మంచి చెడ్డలను సమయం వచ్చినపుడు జనం తేలుస్తారు. మేము ఏదైనా బస్తీమే సవాల్‌ అన్నట్లుగా చెప్పి చేస్తాము అని చెప్పుకుంటున్న మోడీ నాయకత్వం ఆచరణలో అలా ఉందా ? ప్రతిదేశం ప్రతి సమస్య, పరిణామం నుంచి తామెలా లబ్ది పొందాలన్న తాపత్రయంలోనే ఉంది.అందుకే ఎన్నో ఎత్తులు, జిత్తులూ దీనికి ఏ దేశమూ మినహాయింపు కాదు. వాటి వలన జనానికి లబ్ది చేకూరుతుందా, వారి ప్రయోజనాలను ఫణంగా పెట్టి కార్పొరేట్లకు లాభాలు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారా అన్నదే గీటురాయి.ప్రపంచం వైరుధ్యాల మయం. అవి నిరంతరం ఉంటూనే ఉంటాయి. అయితే అన్నీ ఒకేసారి ముందుకు రావు. ఏదైనా ప్రధాన వైరుధ్యంగా ముందుకు వచ్చినపుడు వాటి పట్ల తీసుకొనే వైఖరి తరువాత వచ్చే వైరుధ్యాన్ని బట్టి మారిపోతూ ఉండవచ్చు. ప్రపంచం మొత్తాన్ని మింగివేయాలన్నది అమెరికా దురాశ. అది సాధ్యం కాదని ఐరోపాలోని ధనిక దేశాలకు ఇంతకు ముందే తెలుసు కనుక వైరుధ్యాలను ఉపయోగించుకోవాలని అవి నిత్యం చూస్తుంటాయి.అమెరికా, ఐరోపా ధనిక దేశాలు తమ పధకంలో ఏ దేశాన్ని ఎక్కడ నిలిపి ఎలా లబ్ది పొందాలా అని నిరంతరాన్వేషణ సాగిస్తున్నాయి.
ఇప్పుడు ప్రపంచంలో ఇండోాపసిఫిక్‌ ప్రాంతం మీద కేంద్రీకరణ పెరిగింది. భూమి తన చుట్టుతాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ఇది ప్రకృతి. అమెరికా అన్ని దేశాలనూ తన చుట్టూతిప్పుకోవాలనుకుంటుంది, అది వికృతి. తాటిని తన్నేవాడుంటే వాడి తలను తన్నేవాడుంటాడని చైనా నిరూపించింది. అతి పెద్ద దేశంలో ప్రవేశించి అక్కడి మార్కెట్‌ను కొల్లగొట్టాలన్నది అమెరికా, ఐరోపా ధనిక దేశాల ఆకాంక్ష. తమ దగ్గర లేని సాంకేతిక పరిజ్ఞానం, పెట్టుబడులను బయటి నుంచి తెచ్చుకొని తాము అభివృద్ధి చెందాలన్నది చైనా కమ్యూనిస్టుల లక్ష్యం. నాలుగుదశాబ్దాల ఈ పయనంలో చైనా కమ్యూనిస్టులే పైచేయి సాధించారు. ఎంతగా అంటే ఆర్ధికంగా అమెరికాను అధిగమించి పోయేంతగా అని వేరే చెప్పనవసరం లేదు. అందుకే దాన్ని అడ్డుకొనేందుకు ఎన్నో పధకాలు.


తన ఆర్ధిక, మిలిటరీ శక్తిని ఉపయోగించి మన దేశంతో సహా అనేక దేశాలను చైనాకు వ్యతిరేకంగా నిలబెట్టాలన్నది దాని పధకం. స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు గడచిన తరువాత అమెరికా కొంత మేరకు సఫలీకృతమైంది.దానిలో భాగమే గతేడాది జరిగిన లడఖ్‌, అంతకు ముందు సంభవించిన డోక్లాం పరిణామాలు. భూటాన్‌-చైనా మధ్య వివాదంగా ఉన్న ప్రాంతంలో చైనా రోడ్డు వేయకూడదని మన దేశం వెళ్లి అడ్డుకుంది. మన ప్రాంతాలను చైనా ఆక్రమించలేదని స్వయంగా ప్రధాని మోడీ చెప్పినప్పటికీ లడఖ్‌ ప్రాంతంలో రెండు దేశాల మధ్య సాయుధ ఘర్షణలు జరిగాయి.చైనాకు వ్యతిరేకంగా చతుష్టయం పేరుతో అమెరికా-జపాన్‌-ఆస్ట్రేలియాలతో మన దేశం జట్టుకట్టి బస్తీమే సవాల్‌ అంటున్నాయి.ఈ గుంపులోకి ఐరోపా ధనిక దేశాలను కూడా లాగాలని చూస్తున్నాయి. పశ్చిమ దేశాలు అనుకున్న, వేసిన పధకం సఫలం కావాలంటే కాగితాల మీద గీతలు గీసినంత సులువు కాదు. ముందుగా చైనా వస్తువుల మీద ధనిక దేశాలు ఆధారపడటం మానుకోవాలి. అంటే వాటికి చౌకగా వస్తువులను తయారు చేసి సరఫరా చేసే ప్రత్యామ్నాయ దేశాలు కావాలి. మన దేశంలో చౌకగా దొరికే మానవశక్తి ఉంది, పశ్చిమ దేశాల వస్తువులకు అవసరమైన మార్కెట్టూ ఉంది. అందుకే మన దేశాన్ని, ఎవరు గద్దెమీద ఉంటే వారిని ఇంద్రుడూ చంద్రుడూ అంటూ పొగుడుతున్నాయి. సమీప భవిష్యత్‌లో మనం ప్రత్యామ్నాయంగా ఎదుగుతామని ఎవరూ అనుకోవటం లేదు.


వివిధ పరిణామాలను ఒక దగ్గరకు చేర్చి చూస్తే దారులన్నీ రోమ్‌కే అన్నట్లుగా ప్రస్తుతానికి ప్రయత్నాలన్నీ చైనాకు వ్యతిరేకంగానే ఉంటున్నాయి. గతంలో బ్రిటన్‌-జపాన్‌-ఫ్రాన్స్‌ -స్పెయిన్‌- ఇటలీ-జర్మనీ చరిత్రను చూసినపుడు ప్రపంచాన్ని పంచుకొనేందుకు వాటి మధ్య వచ్చిన పంచాయతీలే అనేక ప్రాంతీయ, రెండు ప్రపంచ యుద్దాలకు దారి తీశాయి. ఇప్పుడు వీటన్నింటినీ పక్కకు నెట్టి అమెరికా ముందుకు వచ్చి అదే చేస్తోంది.చైనా మార్కెట్లో వాటికి ప్రవేశం కల్పిస్తే, చైనా తమకు పోటీ ఇవ్వకుండా ఉంటే అసలు పేచీయే లేదు. అది జరగటం లేదు గనుకనే ఏదో ఒక గిల్లికజ్జా పెట్టుకుంటున్నాయి. చైనాకు పోటీగా మన దేశాన్ని వినియోగించుకోవాలని చూసిన పశ్చిమ దేశాలు తీవ్ర ఆశాభంగం చెందాయి. దాని దరిదాపుల్లో కూడా మనం లేకపోవటంతో చైనాతో విధిలేక ముద్దులాట-దెబ్బలాట అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి. మన ప్రధాన బలహీనత జిడిపిలో 14శాతం వాటా ఉన్న వ్యవసాయ రంగంలో 50శాతం మంది ఉపాధిపొందుతున్నారు.అరవైశాతంగా ఉన్న సేవారంగం 28శాతం మందికే ఉపాధి చూపగలుగుతోంది.

లాహిరి లాహిరిలో అన్నట్లుగా చైనా అధినేత గ్జీ జింపింగ్‌ ా మన నరేంద్రమోడీ వ్యవహరించిన తీరును మనం చూశాము. అలాంటిది ఆకస్మికంగా గాల్వన్‌లోయ ఉదంతాలకు ఎందుకు దారి తీసింది ? చైనా మన ప్రాంతాలను ఆక్రమించుకోలేదని ప్రధాని నరేంద్రమోడీ అఖిలపక్ష సమావేశంలో చెప్పిన తరువాత సరిహద్దుల్లో జరిగిన ఉదంతాల గురించి పరిపరి విధాల ఆలోచనలు ముందుకు వచ్చాయి. చైనాతో వచ్చిన లేదా తెచ్చుకున్న సరిహద్దు వివాద అసలు లక్ష్యం ఏమిటి ?తెరవెనుక పాత్రధారులు, వారేం చేస్తున్నదీ మనకు కనిపించదు,వినిపించదు. తెర ముందు జరిగే వాటిని బట్టి నిర్దారణకు వస్తే తప్పులో కాలేస్తాము. చైనాతో సరిహద్దు వివాదం రాజకీయంగా నరేంద్రమోడీ పుట్టక ముందునుంచీ ఉంది.1962 తరువాత కొత్తగా మన భూభాగం చైనా ఆధీనంలోకి వెళ్లలేదని మోడీ సర్కారే పార్లమెంటులో కూడా చెప్పింది. మన పాలకులు చెబుతున్నట్లుగా సరిహద్దుల్లో చైనా కవ్వించిందనే అనుకుందాం. చర్చల ద్వారా అనేక అంశాలను పరిష్కరించుకుంటున్న మనం ఆ మార్గాన్ని ఎందుకు ఎందుకు ఎంచుకోలేదు ? కాసేపు పక్కన పెడదాం.

ఇరాన్‌తో మనకు గోడ-నీడ పంచాయతీల్లేవే. (ఇష్టం లేకపోతే నీ స్ధలమే గావచ్చు గోడ ఎత్తుగా కట్టావు, దాని నీడ మా ఇంటి మీద పడుతోందని గిల్లికజ్జా) ఇప్పుడు ఇరాన్‌-చైనా మధ్య ఏర్పడిన బంధం మన దేశానికి తలనొప్పిగా మారిందని, కొత్త సవాళ్లను ముందుకు తెచ్చిందని సంఘపరివార్‌ పత్రిక ఆర్గనైజర్‌ మాజీ సంపాదకుడు శేషాద్రి చారి పేర్కొన్నారు. తలనొప్పి స్వయంగా నరేంద్రమోడీ తెచ్చింది తప్ప మరొకటి కాదు. శేషాద్రి ముందుకు తెచ్చిన అంశాల సారాంశాన్ని చూద్దాం. ఇరాన్‌ మీద విధించిన ఆంక్షలను తొలగించే చిన్నపాటి సూచనలు కూడా అమెరికా నుంచి వెలువడని సమయంలో పాతికేండ్ల పాటు అమల్లో ఉండే 400 బిలియన్‌ డాలర్ల ఒప్పందాన్ని ఇరాన్‌తో చైనా కుదుర్చుకుంది.హార్ముజ్‌ జలసంధిలో కీలక స్ధానంలో ఉన్న బందర్‌ అబ్బాస్‌ రేవు ద్వారానే మన దేశానికి గరిష్టంగా సరకు రవాణా జరుగుతోంది.అమెరికా ఆంక్షల కారణంగా మన దేశానికి దాన్ని మూసివేసినందున మన రవాణా ఖర్చులు అనేక రెట్లు పెరుగుతున్నాయి.చమురు సరఫరాలు నిలిచిపోయిన కారణంగా ధరలు పెరిగిపోయి వాణిజ్యలోటులో సమస్యలు వస్తున్నాయి. అరవై రోజుల వరకు అరువు సౌకర్యం, ఆకర్షణీయమైన రాయితీలు, రూపాయి చెల్లింపులను అంగీకరించటం వంటివి ఇరాన్‌తో మనకున్న సానుకూల అంశాలలో కొన్ని మాత్రమే. ఇవన్నీ పోవటం మన వ్యూహాత్మక, రక్షణ ప్రయోజనాలకు వ్యతిరేకం. మధ్య ఆసియా దేశాలతో మన వాణిజ్యానికి ఇరాన్‌ ముఖద్వారం. పాకిస్ధాన్‌తో నిమిత్తం లేకుండా చబ్బార్‌ రేవు ద్వారా ఆఫ్ఘనిస్తాన్లో ప్రవేశించేందుకు ఉపయోగపడుతుంది. తుర్కుమెనిస్దాన్‌-ఆఫ్ఘనిస్దాన్‌-పాకిస్దాన్‌-భారత్‌ చమురు పైప్‌లైన్‌ మన ఇంధన భద్రతకు అవసరం. ఇవన్నీ సక్రమంగా జరగాలంటే ఇరాన్‌ సహకారం లేకుండా సాధ్యం కాదు, అందువలన ఇరాన్‌పై ఆంక్షల ఎత్తివేతకు మన దేశం అమెరికాను ఒప్పించాల్సి ఉందని శేషాద్రి చారి చెప్పారు. ఆ పెద్దమనిషి చైనా వ్యతిరేకి అని వేరే చెప్పనవసరం లేదు. అయినా నరేంద్రమోడీ సర్కార్‌ వైఖరిని ఎందుకు తప్పు పడుతున్నట్లు ? ప్రతి ఒక్కరూ ఆలోచించాలి.అమెరికాను నమ్ముకొని మోడీ ఇరుగు పొరుగు దేశాలను చైనా వైపు వెళ్లేట్లు నెడుతున్నారన్నది అసలు దుగ్ద. చైనాతో సరిహద్దు వివాదం ఉంది గనుక మన లడఖ్‌లో ప్రతాపం చూపాము అనుకుంటే అర్ధం ఉంది. మరి ఇరాన్‌ను ఎందుకు దూరం చేసుకుంటున్నాము ? అమెరికా కౌగిలింతలతో మునిగి తేలుతూ ఇరాన్‌ నుంచి చమురు దిగుమతులు నిలిపివేశాము.


ఇరాన్‌తో చైనా ఒప్పందం కేవలం దానికి అవసరమైన చమురు కోసమే అనుకుంటే పొరపాటు. అమెరికా ఆంక్షలతో ఇబ్బంది పడుతున్న ఇరాన్‌ ఆర్దిక వ్యవస్ధను ఆదుకోవటం కూడా దానిలో కీలక అంశం. ప్రపంచాన్ని ఆక్రమించాలని చూస్తున్న అమెరికాను కట్టడి చేసే మధ్య ప్రాచర్య వ్యూహంలో భాగం అది. ఇండో-పసిఫిక్‌ వ్యూహం పేరుతో చైనాను దెబ్బతీసేందుకు భారత్‌-జపాన్‌-ఆస్ట్రేలియాలను ఇప్పటికే అమెరికా ఒక దగ్గరకు చేర్చింది. దానికి ప్రతిగా చైనా తన ఎత్తుగడలను రూపొందించుకొంటోంది. రానున్న రోజుల్లో మధ్య ప్రాచ్యం అగ్రదేశాల అధికార పోరుకు వేదిక కానుందన్నది చైనా అంచనా.అందుకే ఆప్రాంతంతో పాటు ఆఫ్రికాలో కూడా చైనా వ్యూహాన్ని అమలు చేస్తూ అనేక దేశాలతో ఒప్పందాలతో ముందుకు పోతున్నది. పశ్చిమాసియాలో షియా-సున్నీ విభేదాలను ఉపయోగించుకొని అమెరికా రాజకీయం చేస్తుంటే చైనా దానికి భిన్నంగా వ్యవహరిస్తున్నది.సున్నీలు మెజారిటీగా ఉన్న సౌదీ అరేబియా-షియాలు మెజారిటీగాఉన్న ఇరాన్‌తోనూ సత్సంబంధాలను కలిగి ఉంది. రెండు దేశాల నుంచీ పెద్ద ఎత్తున చమురు కొనుగోలు చేస్తున్నది. అమెరికాను ఎదుర్కొనే ఎత్తుగడలో భాగంగా రష్యా కూడా తన పావులు కదుపుతున్నది. 2019లో చైనా-రష్యా-ఇరాన్‌ మిలిటరీ సంయుక్త విన్యాసాలు అమెరికాకు ఒక హెచ్చరిక తప్ప మరొకటి కాదు.


వర్దమాన దేశాలు తమలో తాము సహకరించుకోవటం ద్వారా అభివృద్ధి పొందాలి తప్ప సామ్రాజ్యవాదులతో చేతులు కలిపి బాగుపడదామనుకుంటే జరిగేది కాదన్నది ఇప్పటి వరకు ప్రపంచ అనుభవం. మన సంబంధాలు అమెరికా, జపాన్‌ వంటి దేశాలతో ఈ గీటురాయితోనే సరి చూసుకోవాలి. ఒకవైపు బ్రెజిల్‌, రష్యా,ఇండియా,చైనా, దక్షిణాఫ్రికా(బ్రిక్స్‌) ఒక కూటమిగా సహకరించుకోవాలని సంకల్పం చెప్పుకున్నాయి. మరోవైపు మన దేశం చైనాకు వ్యతిరేకంగా అమెరికాతో జతకడుతుంది. అలాంటపుడు ఈ కూటమి దేశాల మధ్య విశ్వాసం ఎలా ఉంటుంది, సహకారానికి ఎలా దారి చూపుతుంది ? అందుకే ముందుకు పోవటం లేదు. చతుష్టయంలో చైనాకు వ్యతిరేకంగా అమెరికాతో చేతులు కలిపిన ఆస్ట్రేలియా, జపాన్‌ మరోవైపు అమెరికా వ్యతిరేకించే ఆర్‌సిఇపి కూటమిలో చైనాతో చేతులు కలుపుతాయి.అమెరికా బెదిరింపులను కూడా ఖాతరు చేయకుండా చైనాతో ఒప్పందాలు చేసుకున్న ఐరోపాధనిక దేశాలు మరోవైపున ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో చైనాకు వ్యతిరేకంగా అమెరికాతో జట్టుకట్టేందుకు ఆసక్తి చూపుతాయి. అమెరికా రెచ్చగొట్టగానే చైనాతో తాడోపేడో తేల్చుకుంటామన్న మన నరేంద్రమోడీ సర్కార్‌ మరోవైపు దానితో చర్చల ప్రక్రియ సాగిస్తోంది.బాలాకోట్‌ దాడులతో పాక్‌ను దెబ్బతీశామని ప్రకటించిన మన దేశం తెరవెనుక వారితో 2018 నుంచే సంప్రదింపులు జరుపుతున్నట్లు బయటపడింది. రెండు దేశాలూ సఖ్యంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు ఇటీవలనే నాటకీయంగా ప్రకటన చేశాయి. ఆట మనకై మనమే ఆడుతున్నామా లేక ఎవరైనా ఆడించినట్లు ఆడుతున్నామా ?

ప్రపంచీకరణను ముందుకు తెచ్చింది అమెరికా, ఐరోపా అగ్రరాజ్యాలు. మనవంటి వర్ధమాన, పేద దేశాలను దానిలోకి లాగిందీ అవే. దశాబ్దాల పాటు చైనాను ప్రపంచీకరణలో భాగస్వామిని చేసేందుకు నిరాకరించాయి. తీరా ఇప్పుడు ప్రపంచీకరణకు భిన్నమైన చర్యలు తీసుకుంటున్నదీ దాన్ని ప్రారంభించిన దేశాలే. నిజమైన ప్రపంచీకరణ స్ఫూర్తిని పాటించాలని చైనా డిమాండ్‌ చేస్తున్నది. ప్రపంచ పరిణామాల్లో ఎంత మార్పు ? ఐక్యరాజ్యసమితి, ప్రపంచ వాణిజ్య సంస్ధ వంటి వాటన్నింటినీ పక్కన పెట్టి అమెరికా తన సంగతి తాను చూసుకుంటోంది. మనవంటి దేశాలను తన అజెండాకు అనుగుణ్యంగా నడవమంటోంది, బెదిరిస్తోంది.(ఇరాన్‌ చమురు కొనవద్దని ఆదేశించటం పక్కా నిదర్శనం). రెండవ ప్రపంచ యుద్దం తరువాత ప్రపంచీకరణ ద్వారా తన మార్కెట్‌ను పెంచుకోవాలన్నది ధనిక దేశాల ఎత్తుగడ. అవి అనుకున్నది ఒకటి జరిగింది ఒకటి.


మనలను ప్రధాన భాగస్వామి అని చెబుతున్న అమెరికన్లు పాకిస్ధాన్‌కూ అదే చెబుతున్నారు. ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవు గానీ అమెరికా చెరొక చంకలో ఇమ్రాన్‌ ఖాన్ను, నరేంద్రమోడీని ఎక్కించుకుంటున్నట్లు పరిణామాలు వెల్లడిస్తున్నాయి. అమెరికాను నమ్ముకొని చైనాతో శతృత్వం పెంచుకుంటే నష్టం మనకే. పశ్చిమాసియా, మధ్య ఆసియాలో అమెరికా ప్రయోజనాల రక్షణకు, ఇరాన్‌కు వ్యతిరేకంగా పాకిస్ధాన్‌ అవసరం. అందుకే మనలను మాయపుచ్చటానికి ఎన్ని కబుర్లు చెప్పినా చేయాల్సింది చేస్తోంది. పాక్‌తో సయోధ్యకు మన మెడలు వంచుతోంది. మనం లొంగిపోయామనే అంచనాకు వచ్చిన కారణంగానే వాణిజ్యం, దిగుమతుల విషయంలో సానుకూల ప్రకటన చేసిన పాకిస్ధాన్‌ మరుసటి రోజే అబ్బెబ్బె అదేం లేదంటూ మాట మార్చింది. ఎఫ్‌ -16 విమానాలను తెచ్చుకున్నాం గనుక తాడో పేడో తేల్చుకుందాం అన్నా ఆశ్చర్యం లేదు.


ఒక స్వతంత్ర విదేశాంగ విధానం లేనట్లయితే మనం ఎటువైపు ఉండాలో తేల్చుకోలేము.గతంలో నెహ్రూ, కాంగ్రెస్‌ హయాంలో సోవియట్‌కు అనుకూలంగా ఉండి భారీ పరిశ్రమలు, ఇప్పుడు అనేక విజయాలు సాధిస్తున్న అంతరిక్ష రంగానికి అవసరమైన వాటిని సాధించుకున్నాము. ఇప్పుడు అమెరికాకు అనుకూలంగా మారి చెప్పుకొనేందుకు సాధించింది ఏమైనా ఉందా ? లేకపోగా చుట్టుపక్కల వారినందరినీ దూరం చేసుకున్నాము. పాకిస్ధాన్‌, చైనాతో శతృత్వం పెంచుకుంటున్నాము. దాని ద్వారా ఆయుధాలు అమ్ముకుంటున్న అమెరికా తప్ప మనకు కలిగిన లబ్ది ఏమిటో ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. కరుడు గట్టిన నేరగాండ్లు, మాఫియా ముఠాలు కొత్త వారికి ఎరలు వేసి ఆకర్షిస్తారు. మెల్లగా వారికి తెలియకుండానే చిన్నపాటి నేరాలు చేయించి తమ బందీలుగా చేసుకుంటారు. తరువాత వారు చెప్పినట్లు చేయక తప్పని స్ధితిని కల్పిస్తారు. అమెరికా, ఇతర అగ్రదేశాలు కూడా అంతే ! ఈ అంశాన్ని మన పాలకులు గుర్తిస్తారా ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

జడ్‌పి ఎన్నికలపై జగన్‌కు పెద్ద షాక్‌ – తిరుపతి ఎన్నిక పర్యవసానాలు !

06 Tuesday Apr 2021

Posted by raomk in AP NEWS, BJP, Congress, CPI(M), Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Uncategorized

≈ Leave a comment

Tags

AP BJP, AP ZP elections, chandrababu naidu, Jana Sena, pavan kalyan, Tirupati lok sabha by election, YS jagan


ఎం కోటేశ్వరరావు


మామూలుగా ఒక ఉప ఎన్నిక సాధారణ ఎన్నికల మాదిరి ప్రాధాన్యతను సంతరించుకోదు. అధికారంలో ఉన్న పార్టీకే ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అసాధారణ పరిస్ధితులు ఏర్పడితే, లేదా అంతకు ముందు ఎన్నికలో మెజారిటీ స్వల్పంగా ఉంటే తప్ప ప్రతిపక్షం గెలిచే పరిస్ధితి ఉండదు. ఈ నేపధ్యంలో తిరుపతి లోక్‌సభ నియోజకవర్గ ఉప ఎన్నికను ఎలా చూడాలి ? దాని పర్యవసానాలు ఏమిటి ? ఏప్రిల్‌ 8న జరగాల్సిన జిల్లా, మండల పరిషత్‌ ఎన్నికల మీద రాష్ట్ర హైకోర్టు స్టే విధించటంతో తిరుపతి ఎన్నిక జరిగే 17వ తేదీ లోగా జరిగే అవకాశం లేదనే చెప్పవచ్చు. తిరుపతి ఎన్నికలోపు జరపాలనే అధికారపక్షానికి ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్‌మోనరెడ్డి, నూతన ఎన్నికల కమిషనర్‌ నీలం సాహ్నికి కోర్టులో పెద్ద ఎదురు దెబ్బతగిలింది. ఎన్నికల నిర్వహణ గురించి సవాలు చేస్తూ తెలుగుదేశం, జనసేన,బిజెపి, ఇతరులు దాఖలు చేసిన పిటీషన్లపై విచారించిన కోర్టు ఎన్నికలను వాయిదా వేసింది. కరోనా వైరస్‌ కారణంగా వారం రోజుల్లో ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలంటూ ఎన్నికల కమిషనర్‌ తీసుకున్న నిర్ణయాన్ని ఈ పార్టీలు సవాలు చేశాయి. కమిషనర్‌ ప్రకటనకు ముందే ఎన్నికల తేదీల గురించి వార్తలు వచ్చాయని, సుప్రీం కోర్టు చెప్పినట్లుగా నాలుగు వారాల ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పట్టించుకోలేదని అభ్యంతరం తెలిపాయి. దీన్ని విచారించిన కోర్టు ఈనెల 15వ తేదీన ఎన్నికల కమిషనరు కోర్టుకు అఫిడవిట్‌ సమర్పించాలని ఆదేశించింది. పిటీషన్లు దాఖలు చేసిన పార్టీలు కోరుతున్నట్లు కొత్త నోటిఫికేషన్‌కు హైకోర్టు అదేశించే అవకాశం లేదు. ఒకవేళ అదే జరిగితే ఇప్పటికే ఏకగ్రీవంగా ఎన్నికైన వారు, నామినేషన్లు వేసిన వారు కోర్టుకు ఎక్కుతారు. మున్సిపల్‌ ఎన్నికలకు కొత్త నోటిఫికేషన్‌ ఇవ్వాలన్న పిటిషన్లను తిరస్కరించిన విషయం తెలిసిందే. ఒకవేళ ఎన్నికల కమిషనరు, వైసిపి లేదా మరొకరు ఎవరైనా సుప్రీం కోర్టుకు వెళ్లినా ఈ నెల 8న ఎన్నికలు జరిగే అవకాశాలు ఉండవు. కోర్టు స్టే ఎత్తివేసి ఎన్నికలకు దారి సుగమం చేసినా నెల రోజుల పాటు ప్రవర్తనా నియమావళిని అమలుకు ఆదేశిస్తే మే నెలలో మాత్రమే జరిగే అవకాశం ఉంది.అప్పటికి తిరుపతి ఎన్నికల ఫలితాలు కూడా వెలువడుతాయి.


తిరుపతి నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను నాలుగు నెల్లూరు జిల్లాలో, మూడు చిత్తూరు జిల్లాలో ఉన్నాయి. ప్రస్తుతం అన్ని చోట్లా వైసిపి వారే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఏడింటిలో మూడు షెడ్యూలు కులాల రిజర్వుడు నియోజకవర్గాలు. మొత్తం ఓటర్లు 15,74,161. గత(2019) ఎన్నికలలో 13,16,473(79.76శాతం) పోలయ్యాయి. వివిధ పార్టీలకు వచ్చిన ఓట్లు, శాతాలు ఇలా ఉన్నాయి.
పార్టీ ×××× ఓట్లు ×××× శాతం
వైసిపి ××× 7,22,877 ×× 55.03
టిడిపి ××× 4,94,501 ×× 37.65
నోటా ××× 25,781 ×× 1.96
కాంగ్రెస్‌ ×× 24,039 ×× 1.83
బిఎస్‌పి ×× 20,971 ×× 1.60
బిజెపి ×× 16,125 ×× 1.22
వైసిపి మెజారిటీ 2,28,376 కాగా, బిఎస్‌పిని జనసేన బలపరించింది. తాజా ఎన్నికలలో మొత్తం 28 మంది అభ్యర్ధులు పోటీలో ఉండగా గుర్తింపు పొందిన పార్టీలలో వైసిపి, తెదే, కాంగ్రెస్‌, బిజెపి, సిపిఎం పోటీచేస్తున్నాయి. మిగిలిన వారందరూ గుర్తింపు లేని పార్టీ, స్వతంత్ర అభ్యర్దులు.


గ్రామ పంచాయతీ, మున్సిపల్‌, కార్పొరేషన్‌ ఎన్నికలలో వైసిపి సాధించిన విజయం, దానికి వచ్చిన ఓట్ల ప్రాతిపదికన చూస్తే అసాధారణ పరిణామాలు సంభవిస్తే తప్ప తిరుపతి లోక్‌సభ స్ధానాన్ని తిరిగి అది గెలుచుకొనే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గ్రామ పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితంగా జరిగినందున ఏ పార్టీ ఎంత శాతం ఓటింగ్‌ వచ్చిందని చెప్పుకున్నా ప్రయోజనం లేదు. మున్సిపల్‌ ఎన్నికలలో వైసిపికి 52.63, తెలుగుదేశం పార్టీకి 30.73, జనసేనకు 4.67, బిజెపికి 2.41శాతం ఓట్లు వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికలలో వచ్చిన 49.95 శాతంతో పోలిస్తే ఓటింగ్‌ పెద్దగా పెరిగినట్లు భావించలేము. నవరత్నాల గురించి ఆ పార్టీ చేసుకుంటున్న ప్రచారానికి ఓట్ల పెరుగుదలకు పొంతన కుదరటం లేదు. తిరుపతి ఎన్నికలో విజయావకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నా వైసిపి తన యావత్‌ శక్తిని ఉపయోగించి ఈ ఎన్నికలలో పోటీ చేస్తున్నది. గతం కంటే మెజారిటీ తెచ్చుకొని తమకు రాజకీయంగా రాష్ట్రంలో ఎదురు లేదని ప్రదర్శించుకోవటం, తద్వారా ప్రతిపక్ష తెలుగుదేశం శ్రేణులను నిరుత్సాహపరచటం, మతం పేరుతో ఎన్ని జిమ్మిక్కులు చేసినా, కుట్రలు పన్నినా మీ ఆటలను సాగనివ్వం అని కేంద్రంలోని బిజెపి అగ్రనేతలకు సందేశం ఇవ్వటం కూడా ఈ ప్రయత్నాల వెనుక ఉంది.2019 ఎన్నికలలో వచ్చిన మెజారిటీకి రెట్టింపు తీసుకు రావాలని మంత్రులు, ఎంఎల్‌ఏలను జగన్‌మోహనరెడ్డి ఆదేశించినట్లు వార్తలు వచ్చాయి. అందువలన ఓటింగ్‌ శాతం , మెజారిటీ తగ్గినా ఆ పార్టీ మీద వత్తిడి పెరగటం ఖాయం.


ఇక తెలుగు దేశం పార్టీ విషయానికి వస్తే పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికలలో దానికి తీవ్ర ఎదురు దెబ్బలు తగిలినా ఓటింగ్‌ శాతం గణనీయంగానే ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తంగా 39.17శాతం వస్తే మున్సిపల్‌ ఎన్నికలలో 30.73శాతం వచ్చాయి. గ్రామీణ ప్రాంతాలలో అనేక చోట్ల వైసిపికి ఏకగ్రీవాలు అత్యధికంగా ఉన్నప్పటికీ ఆ మేరకు ఓట్ల శాతం ఉండే అవకాశం లేదు. తెలుగుదేశం పార్టీకి గ్రామీణ ప్రాంతాలలో కూడా ఇదే బలం ఉంటుందని చెప్పవచ్చు. తిరుపతి ఎన్నిక ఆ పార్టీకి, ముఖ్యంగా అధినేత చంద్రబాబు నాయుడి ప్రతిష్టకు ప్రతీకగా భావించవచ్చు. విజయం సాధిస్తుందా లేదా అన్నది పక్కన పెడితే గత ఎన్నికలలో వచ్చిన ఓట్లను నిలుపుకున్నా కార్యకర్తలను నిలుపుకోవచ్చు. రాజకీయ పోరు కొనసాగించవచ్చు. జిల్లా పరిషత్‌ ఎన్నికలను బహిష్కరించాలని తెలుగుదేశం అధినేత చేసిన నిర్ణయం దిగువ స్దాయిలో అంతగా జీర్ణం కాలేదు. తాజాగా హైకోర్టు స్టే ఇచ్చినందున ఏదో ఒకసాకుతో కార్యకర్తలను సంతృప్తి పరచేందుకు పునరాలోచన చేసినా ఆశ్చర్యం లేదు. తిరుపతి ఉప ఎన్నికల్లో వచ్చే ఓట్లను బట్టి కూడా ఆ నిర్ణయం ఉండవచ్చు.


జనసేన-బిజెపి కూటమి విషయానికి వస్తే బిజెపి కంటే జనసేనాని పవన్‌ కల్యాణ్‌ ప్రతిష్టచుట్టూ ఈ ఎన్నికలు తిరుగుతాయి. మున్సిపల్‌ ఎన్నికల ఓటింగ్‌ తీరు తెన్నుల ప్రకారం రెండు పార్టీలకు వచ్చిన 7.18 శాతం కంటే తిరుపతిలో ఎక్కువ వస్తేనే ఆ రెండు పార్టీల పరువు నిలుస్తుంది. లేనట్లయితే బిజెపికి కొత్తగా పోయే పరువేమీ ఉండదు కనుక పవన్‌ కల్యాణ్‌ ఏ విధంగా సమర్ధించుకుంటారన్న ప్రశ్న ముందుకు రానుంది. ప్రశ్నిస్తా అంటూ బయలు దేరిన పవన్‌ కల్యాణ్‌కు ప్రశ్నలేమీ లేకపోగా ఎదురు ప్రశ్నలు ఎదురయ్యే అవకాశం ఉంది. ప్రత్యేక హౌదా, ఇతర అన్యాయాల గురించి మోసం చేసిన కేంద్రాన్ని ప్రశ్నించకుడా ఏమి చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ప్రయోజనం ఉండదు.


ఇక బిజెపి విషయానికి వస్తే పర్యవసానాలు తక్కువేమీ కాదు. పవన్‌ కల్యాణ్‌ మద్దతు ఉన్నా ఓట్ల సంఖ్య పెరగపోతే దాని పరువు పోవటమే కాదు, జనసేనాని మద్దతు చిత్తశుద్ది గురించి అది సందేహాలను లేవనెత్తవచ్చు. తిరుపతి ఆపద మొక్కుల్లో భాగంగా జనసేనాని తమ ముఖ్యమంత్రి అభ్యర్ధి అని ప్రకటించింది. అంతే కాదు భగవద్దీత పార్టీ కావాలా బైబిల్‌ పార్టీ కావాలా అనే ప్రచారాన్ని ముందుకు తెచ్చింది. ఎవరికి ఎలాంటి అభిప్రాయం ఉన్నా తిరుపతి వెంకటేశ్వరుడు అంతర్జాతీయ దేవుళ్లలో ఒకరు. అక్కడ హిందూమతానికి అపచారం, అన్యాయం జరుగుతోందని ఇప్పటికే ప్రచారం పెద్ద ఎత్తున చేసింది. ఇక్కడ డిపాజిట్లు రాకపోయినా, గణనీయంగా ఓట్లు సంపాదించకపోయినా ఆంధ్రప్రదేశ్‌ ఓటర్లు దాని మత రాజకీయాలకు గోరీ కట్టారనే అభిప్రాయం కలుగుతుంది. ఇది దేశ వ్యాపితంగా కూడా బిజెపి వ్యతిరేక పార్టీలకు ప్రచార అస్త్రంగా మారుతుందని వేరే చెప్పనవసరం లేదు.ఇప్పటికే కేరళలో శబరిమల వివాదంతో ఓట్లు పొందాలని చూసి గత లోక్‌సభ ఎన్నికల్లో భంగపడిన బిజెపికి తాజా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అదే జరగనుందనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

మిగిలిన అభ్యర్దులలో నవతరం పార్టీ పేరుతో పోటీ చేస్తున్న అభ్యర్ధికి గతంలో జనసేనకు కేటాయించిన గ్లాసు గుర్తును ఎన్నికల సంఘం కేటాయించింది. ఈ గుర్తు ఉన్న కారణంగా జనసేన మద్దతుదారులు సదరు అభ్యర్ధికి ఓటు చేసే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. బిజెపి-జనసేనలకు పోలింగ్‌ ముందకు వరకు ఇది ఒక సాకుగా ఉపయోగపడవచ్చు తప్ప ఓటర్ల విజ్ఞతను ప్ర శ్నించటమే అవుతుంది. నిజంగా జనసేన మద్దతుదారులు బిజెపికి మద్దతు ఇవ్వాలనుకుంటే అలాంటి ప్రశ్న ఉదయించదు. ఇష్టం లేని వారు గ్లాసు గుర్తుకు ఓటేయవచ్చు. ఇక్కడ సిపిఎం పోటీలో ఉన్నప్పటికీ పెద్దగా ప్రభావం చూపుతుందని చెప్పలేము. తమ విధానాల ప్రచారం కోసమే ఈ పోటీ అని చెప్పవచ్చు. అనేక దళిత సంఘాలు మద్దతు ప్రకటించినప్పటికీ నైతికంగా ప్రచారం చేసుకొనేందుకు ఉపయోగపడుతుంది.2014 ఎన్నికలలో ఈ స్ధానంలో పోటీ చేసిన సిపిఎంకు 11,168 ఓట్లు వచ్చాయి. మొత్తం మీద తిరుపతి ఉప ఎన్నిక అన్ని పార్టీలకూ ఏదో విధంగా పరీక్ష పెడుతోంది, పర్యవసానాలకు సిద్దం కావాలని చెబుతోంది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

మోడీ (కౌగిలింతల ) వ్రతం చెడ్డా ఫలం దక్కలే ! అమెరికాతో వాణిజ్య యుద్దానికి సిద్దమా !!

05 Monday Apr 2021

Posted by raomk in BJP, Current Affairs, Economics, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, Uncategorized, USA

≈ Leave a comment

Tags

Digital Service Tax, DST, Katherine Tai, Narendra Modi, Retaliatory tariffs on Indian goods, Trade Protectionism, USTR


ఎం కోటేశ్వరరావు


తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు లేకపోయినా, మీడియా పెద్దగా పట్టించుకోని కారణంగా అనేక విషయాలు మరుగున పడిపోతున్నాయి. కొద్ది రోజుల క్రితం మన ప్రభుత్వం సౌదీ అరేబియా మీద చమురు ఆయుధాన్ని ప్రయోగించాలంటూ వార్తలు వెలువడ్డాయి. చమురు ధరలు పెరిగితే కొనుక్కోలేము, తగ్గితే కొని నిలవ చేసుకొనేందుకు సౌకర్యాలు, స్వంత ఉత్పత్తిని పెంచుకోలేని మనం చమురు ఎగుమతి దేశాల మీద దాడి చేయటం ఏమిటి ? సౌదీ అరేబియా నుంచి కొనుగోళ్లను నిలిపివేసి లేదా బాగా తగ్గించి ఇతర మార్కెట్లలో ఏ రోజు ధర ఎంత ఉంటే అంతకు కొనుగోలు చేసి మన సత్తా ఏమిటో చూపాలన్నట్లుగా వార్తలు వచ్చాయి. మనది సర్వసత్తాక స్వతంత్ర భారత్‌ – స్వాతంత్య్ర ఉద్యమంతో సంబంధం, వారసత్వం లేని కేంద్రంలో అధికారంలో ఉన్న పెద్దలకు ఆ విషయం తెలుసో లేదో తెలియదు ( అయినా అమెరికా ఆదేశించింది గనుక మనమే ” స్వంత ” నిర్ణయం తీసుకొని ఇరాన్‌ నుంచి చమురు కొనుగోలు నిలిపివేశాము. ఇరాక్‌ నుంచి గణనీయంగా తగ్గించాము.) ఇప్పుడు సౌదీ అరేబియా ( కొద్ది రోజుల క్రితం సామాజిక మాధ్యమంలో బిజెపి మరుగుజ్జులు నరేంద్రమోడీ మీద గౌరవంతో సౌదీ అరేబియా మనకు రాయితీధరలకు చమురు విక్రయించేందుకు అంగీకరించిందని ప్రచారం చేశారు ) మీద కారాలు మిరియాలు నూరుతున్నాము. వారు నందంటే నంది పందంటే పంది అని జనం కూడా మాట్లాడాలి మరి, లేకుంటే దేశభక్తి లేదని ముద్రవేస్తారు మరి !


అసలు విషయం ఏమిటి ? గత కొద్ది సంవత్సరాలుగా చమురు దిగుమతి చేసుకొనే దేశంగా ఉన్న అమెరికా ఇటీవలి కాలంలో షేల్‌ ఆయిల్‌ ఉత్పత్తి కారణంగా చమురు ఎగుమతి దేశంగా మారిపోయింది. అమెరికాతో మన వాణిజ్యం కొద్దిగా మిగులులో ఉంది.కనుక తమ కంపెనీల నుంచి పారిశ్రామిక ఉత్పత్తులు, ఆయుధాలతో పాటు చమురు కూడా కొంటారా లేదా అని వత్తిడి చేస్తోంది. పశ్చిమాసియా, గల్ఫ్‌దేశాలు మనకు ఎప్పుడూ మిత్రులుగానే ఉన్నాయి తప్ప శత్రువులు కాదు. గల్ఫ్‌ దేశాల నుంచి కొనుగోళ్లు తగ్గించి ఆమేరకు అమెరికా చమురు కొనాలంటే ఏదో ఒకసాకు కావాలి. సౌదీ అరేబియా ఇటీవల చమురు ఉత్పత్తిని తగ్గించిన కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరిగాయి. తగ్గినపుడు ఆ మేరకు మన జనానికి తగ్గించకుండా పన్నులు వేసి ఆ మొత్తాలను అదానీ, అంబానీల వంటి కార్పొరేట్లకు పన్నుల రాయితీల రూపంలో మూటగట్టి మరీ ఇచ్చారు, ఇస్తున్నారు. ఇప్పుడు చమురు ధరలు పెరిగితే ప్రస్తుతం నరేంద్రమోడీ మత్తులో ఉన్న జనానికి అది వదిలిన తరువాత ఏం జరుగుతుందో అందరికంటే నరేంద్రమోడీకే బాగా తెలుసు గనుక చమురు ఎగుమతి దేశాల మీద రుసరుసలాడుతున్నారు. గతంలో మా దగ్గర కారుచౌకగా కొన్న చమురు ఉంది కదా ఆమేరకు మీ వినియోగదారులకు భారం తగ్గించండి అని సౌదీ అరేబియా సలహాయిచ్చింది.దాన్ని సాకుగా తీసుకొని వేరే మార్కెట్లలో కొనుగోలు చేయాలని మన చమురు కంపెనీలను కోరారు.


పోనీ ఆ వేరే మార్కెట్లలో మన లావు – పాత పోలిక వద్దు లెండి ఇప్పుడు గడ్డం పొడవు చూసి అనాలేమో ! తక్కువ ధరలకు ఏమైనా ఇస్తాయా ? ఒక్క సెంటు(మన ఏడు పైసలకు సమానం) కూడా తగ్గించవు. అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న ధరల ప్రకారమే, డాలర్లు మరీ చెల్లించి మనం కొనుక్కోవాలి, మన పొరుగునే ఉన్న గల్ఫ్‌ నుంచి రవాణా ఖర్చులు తక్కువ, అదే అమెరికా నుంచి కొనుగోలు చేస్తే తడచిమోపెడంత అవుతాయి……తనది కాదు గనుక తాటిపట్టవేసి గోక్కోమన్నాడట వెనుకటికెవడో ! అలాగే కేంద్ర పెద్దలదేముంది, భరించేది మనమే కదా ఎంతైనా, ఎక్కడి నుంచైనా తెస్తారు ? చమురు కార్పొరేట్లతో వారి సంబంధాలు ముఖ్యం కదా ! మన ప్రధాని నరేంద్రమోడీ అమెరికా స్నేహం పట్టినప్పటి నుంచీ కొంత చమురును మన రూపాయల్లో కొనే వెసులుబాటు కల్పించిన ఇరాన్‌ను వదలి పెట్టి అమెరికన్లను మెప్పించేందుకు చమురు కొనుగోళ్లను ఎలా పెంచారో తెలుసా ?


2017-18లో రోజుకు 38వేల పీపాల చమురు అమెరికా నుంచి దిగుమతి చేసుకున్నాము.2021 ఫిబ్రవరిలో ఆ మొత్తం 5,45,300 పీపాలకు పెరిగింది.ప్రస్తుతం 8,67,500 పీపాలతో మొదటి స్ధానంలో ఉన్న ఇరాక్‌ నుంచి దిగుమతులను గణనీయంగా తగ్గించి అమెరికా మీద అధికంగా ఆధారపడే విధంగా మోడీ వేగంగా ప్రయాణిస్తున్నారు. మన పశ్చిమాసియా మిత్ర దేశాలతో చమురు వైరుధ్యం తెచ్చుకొని ఆ దారులన్నీ మూసుకున్న తరువాత అమెరికా ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చోవాలి, ఎక్కడ, ఎలా నిలబడమంటే అలా నిలబడాల్సిన రోజు వచ్చినా ఆశ్చర్యం లేదు. మన చమురు ఆయుధాన్ని మనమీదే ప్రయోగిస్తే చేయగలిగిందేమీ లేదు.మనం ట్రంప్‌ హయాంలో కౌగిలింతల కోసం ఎంతగా లొంగిపోయామో అందరికీ తెలిసిందే. ఇప్పుడు జో బైడెన్ను మరింతగా ఆకర్షించేందుకు నానా పాట్లు పడుతున్నాము. అయినా వారు చేస్తున్నదేమిటి ?
డోనాల్డ్‌ ట్రంప్‌, జో బైడెన్‌ ఎవడైతేనేం అమెరికన్‌ కార్పొరేట్ల చౌకీదార్లు. వారికోసం ఏ గడ్డికరవమన్నా కరుస్తారు. వాటంగా ఉంటే కౌగలించుకొని మత్తులో ముంచుతారు లేకపోతే కాటువేసి దెబ్బతీస్తారు. ఈ మధ్య కాలంలో నరేంద్రమోడీ డిజిటలైజేషన్‌ గురించి ఎన్నో కబుర్లు చెబుతున్నారు. ఆయన ప్రత్యేకత ఏమంటే అసలు మన దేశంలో ఇంటర్నెట్‌, డిజిటల్‌ కెమెరా రాకముందే వాటిని ఉపయోగించి అద్వానీగారినే ఆశ్చర్యపరిచిన ఘనత ఆయన సొంతం. స్వయంగా ఆయనే చెప్పుకున్న విషయం, దాని మంచిచెడ్డలు వదలివేద్దాం. విదేశాలకు చెందిన సంస్ధలు మన దేశంలో డిజిటల్‌ సేవలను అందించి వ్యాపారం చేస్తున్నపుడు దానికిగాను డిజిటల్‌ సర్వీసు టాక్సు(డిఎస్‌టి) చెల్లించాలని మన దేశం 2016లోనే అనేక దేశాలతో పాటు ఆదాయం మీద ఆరుశాతం పన్ను విధించాలని నిర్ణయించింది. అయితే అంతర్జాతీయ కార్పొరేట్‌ సంస్ధల వత్తిడి మేరకు మోడీ సర్కార్‌ దాన్ని ఆన్‌లైన్‌ ప్రకటనల సేవలకు మాత్రమే పరిమితం చేసింది. తరువాత అన్ని రకాల డిజిటల్‌ సేవలకు గాను రెండు శాతం చెల్లించాలని గత ఏడాది మార్చినెలలో 2020 ఫైనాన్స్‌ చట్టం ద్వారా నిర్ణయించింది. అలాంటి సేవలందించే సంస్ధలలో అత్యధికభాగం అమెరికాకు చెందినవే. మన దేశం విధించిన పన్ను పరిధిలోకి వివిధ దేశాలకు చెందిన 119 సంస్ధలు వస్తాయి, వీటిలో కేవలం అమెరికా నుంచే 86 ఉన్నాయి. ఈ పన్ను అంతర్జాతీయ చట్టాలకు విరుద్దం, అమెరికా వాణిజ్య సంస్ధల పట్ల వివక్ష చూపటమే అని అమెరికా అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రపంచవ్యాపితంగా డిజిటల్‌ ఆర్ధిక వ్యవస్ధ శరవేగంగా అభివృద్ది చెందుతున్న దశలో ఏ దేశమూ దాని ద్వారా రావాల్సిన ఆదాయాన్ని వదులుకోజాలదు. మన దేశ వినియోగదారులతో విదేశీయులు జరిపే ప్రతిలావాదేవీకి ఈ పన్ను వర్తిస్తుంది.


అమెరికా వారు ఎంత అదరగొండి బాపతు అంటే వారికి అంతర్జాతీయ చట్టాలు పట్టవు. 1974వారు చేసిన అమెరికా వాణిజ్య చట్టంలోని 301 సెక్షన్‌ ప్రకారం ఏ దేశమైనా అమెరికా వాణిజ్యానికి వ్యతిరేకమైన చర్యలు తీసుకున్నదని భావిస్తే తమ స్వంత చట్టం ద్వారా విచారణ జరుపుతారట. ఆ మేరకు చర్యలు కూడా తీసుకుంటారు. మన దేశం విధించిన డిఎస్‌టి అమెరికా, తదితర విదేశీ డిజిటల్‌ సంస్ధలకు మాత్రమే వర్తింప చేస్తూ భారతీయ సంస్దలకు మినహాయింపు ఇవ్వటం వివక్ష కిందకు వస్తుందన్నది ఒక అభ్యంతరం.ఉదాహరణకు అమెజాన్‌,గూగుల్‌, ఫేస్‌బుక్‌ వంటి వాటితో పాటు అంబానీ-అదానీ కంపెనీలు డిజిటల్‌ సేవలు అందించినా ఈ చట్టం ప్రకారం అదానీ-అంబానీలు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. రెండవది కొన్ని నాన్‌ డిజిటల్‌ సేవా సంస్దలు డిజిటల్‌ సేవల మాదిరి వాటిని అందచేసినా వాటికి మినహాయింపు ఇవ్వటం వివక్షా పూరితం అన్నది అమెరికా అభ్యంతరం. దీన్ని మన దేశం అంగీకరించలేదు. ఏ కంపెనీ అయినా మన దేశంలో శాశ్వత కార్యాలయం ఏర్పాటు చేసుకుంటే దానికి మన దేశంలోని పన్ను చట్టాలు వర్తిస్తాయి గనుక వాటి మీద మరొక పన్ను విధించాల్సిన అవసరం లేదన్నది మన వాదన. అమెరికా సంస్ధలు ఏవైనా మన దేశంలో శాశ్వత కార్యాలయం ఏర్పాటు చేసుకుంటే అదే సూత్రం వర్తిస్తుంది. మనకు ఎలాంటి పన్నులు చెల్లించకుండా మన సేవల ద్వారా లాభాలు పొంది వాటిని తమ దేశాలకు తరలించుకుపోవాలన్నది విదేశీ కార్పొరేట్‌ శక్తుల ఎత్తుగడ. చైనా, భారత్‌ వంటి దేశాలలో పెద్ద ఎత్తున డిజిటల్‌ సేవలను విస్తరిస్తున్నందున వాటి నుంచి పన్ను ఆదాయం రాబట్టకుండా ఆర్ధిక వ్యవస్ధలు నడవవు.
అనేక దేశాలు వివిధ రూపాలలో వస్తు, సేవల మీద పన్నులు వసూలు చేస్తున్నాయి. ఇప్పటి వరకు చైనాలో డిఎస్‌టి లేదు. చైనాకు చెందిన అలీబాబా వంటి సంస్దలు డిజిటల్‌ సేవలు అందిస్తున్నాయి.చైనాలో ప్రస్తుతం 18 రకాల పన్నులు ఉన్నాయి. డిజిటల్‌ సేవల మీద కూడా పన్ను విధించాలనే ఆలోచన చేస్తున్నారు. అక్కడ కూడా అమలు చేస్తే ప్రస్తుతం సాగుతున్న వస్తు,సేవల వాణిజ్య యుద్దం డిజిటల్‌ సేవల వాణిజ్యానికి కూడా విస్తరించవచ్చు. మన దేశం విధించిన రెండుశాతం డిఎస్‌టికి ప్రతిగా కొన్ని భారతీయ వస్తువులపై 25శాతం దిగుమతి పన్ను విధించి బదులు తీర్చుకుంటామని మార్చినెల చివరి వారంలో అమెరికా నూతన వాణిజ్యప్రతినిధి కాథరీన్‌ తాయి బెదిరించారు.ఆస్ట్రియా, బ్రిటన్‌, ఇటలీ, టర్కీ, స్పెయిన్‌, ఇతర దేశాల మీద కూడా బస్తీమే సవాల్‌ అన్నారు. టర్కీ 7.5, ఆస్ట్రియా 5, ఇటలీ, స్పెయిన్‌, ఫ్రాన్సు మూడు శాతం చొప్పున, బ్రిటన్‌ రెండుశాతం డిఎస్‌టి విధిస్తామని ప్రకటించాయి, బ్రెజిల్‌ కూడా పన్ను విధింపు ఆలోచన చేస్తున్నది. ఒకవైపు డిజిటల్‌ సేవల పన్ను మీద ప్రపంచ ఒప్పందం చేసుకొనే అంశం గురించి చర్చించుదామని జో బైడెన్‌ మాట మాత్రంగా అంటున్నా, అది కుదిరే వరకు గతంలో ట్రంప్‌ ప్రతిపాదించిన ప్రతికూల చర్యలను ముందుకు తీసుకుపోవాలని నిర్ణయించుకున్నట్లుగా తారు ప్రకటన నిర్దారించింది.ఆమె ప్రకటనను అమెరికా ఇంటర్నెట్‌ అసోసియేషన్‌ అభినందించింది.

మన దేశం విధించిన డిఎస్‌టి ద్వారా ఏటా 5.5 కోట్ల డాలర్ల మేరకు పన్ను ఆదాయం వస్తుందని అంచనా. అంత మొత్తానికి సమంగా మన దేశం నుంచి దిగుమతి చేసుకొనే వస్తువులపై అమెరికా పన్ను విధించే ఆలోచన చేస్తున్నది. అదే గనుక జరిగితే మన రొయ్యలు, బాసుమతి బియ్యం, రంగురాళ్లు, వెదురు ఉత్పత్తులు, ఫర్నీచర్‌, బంగారు ఆభరణాలు మొదలైన వాటి మీద 25శాతం వరకు పన్నులు విధిస్తామని ప్రకటించింది. ఇంతకు ముందే మన ఎగుమతులకు ఇచ్చే రాయితీలను కొన్నింటిని ట్రంప్‌ రద్దు చేసిన విషయం తెలిసిందే. అప్పుడు ఉన్నవి పోయాయి, ఇప్పుడు కొత్తవి తగులుకుంటాయి. అయితే అమెరికా చర్యలకు ప్రతీకారంగా అమెరికాను ప్రపంచ వాణిజ్య సంస్ద కోర్టులోకి లాగవచ్చు. అమెరికా నుంచి వస్తున్న ఆడియో-వీడియో ప్రసారాల మీద పన్ను వేయవచ్చు, అమెరికా క్రెడిట్‌ కార్డు కంపెనీలు, మెసేజింగ్‌ సేవలను నిలిపివేయవచ్చు. ఆ చర్యలు తీసుకొనే దమ్మూ ధైర్యం మన 56 అంగుళాల ప్రధానికి ఉందా ? బహుశా మరొక పద్దతిలో బైడెన్‌న్ను ప్రసన్నం చేసుకొనేందుకు సౌదీ బదులు మరింతగా అమెరికా నుంచి చమురు కొంటామనే సంకేతం పంపారా ? అమెరికా వాణిజ్య ప్రతినిధి కాథరీన్‌ తాయి బెదిరింపు-ఈ సంకేతం ఒకే సమయంలో వెలువడటాన్ని ఎలా అర్దం చేసుకోవాలి ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

నాపేరుతో ఓట్లడిగే వారు దొంగ భక్తులు, గడ్డాలు, జులపాలను చూసి మోసపోవద్దు : స్వామి అయ్యప్ప

04 Sunday Apr 2021

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, History, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Uncategorized

≈ Leave a comment

Tags

#Pinarayi Vijayan, Kerala Assembly Elections 2021, Kerala BJP, Kerala CPI(M), Kerala political scene


ఎం కోటేశ్వరరావు


” ప్రియమైన భక్తులారా నేను ఎన్నికలలో పోటీ చేయటం లేదు. దయచేసి నా పేరుతో ఓట్లు అడిగే వారు దొంగ భక్తులని తెలుసుకోండి. వారి గడ్డాలు, జులపాలు చూసి మోసపోకండి. మీ అయ్యప్ప, స్వామి శరణం ” అంటూ అయ్యప్ప బొమ్మతో పెట్టిన ఫేస్‌బుక్‌ పోస్టు కేరళలో సంచలనం అయింది. స్వామి సందీపానందగిరి తన ఖాతాలో అయ్యప్ప స్వామి భక్తులతో మాట్లాడినట్లు పెట్టిన పోస్టు ద్వారా బిజెపి, గడ్డం పెంచుతున్న నరేంద్రమోడీని ఉతికి ఆరేసినట్లయింది. కేరళ ఎన్నికల ప్రచారంలో నరేంద్రమోడీ అయ్యప్ప నామ స్మరణతో ప్రసంగాలను ప్రారంభించి సుప్రీం కోర్టులో ఉన్న వివాదాన్ని పరోక్షంగా ముందుకు తెచ్చి ఓటర్లను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారన్న విమర్శలు వెలువడ్డాయి. కేరళకు చేసిన అన్యాయానికి ప్రాయచిత్తంగా నరేంద్రమోడీ అయ్యప్ప నామ స్మరణతో క్షమించాలని వేడుకొని ఉంటారని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ చురక అంటించారు. అయ్యప్ప భక్తుల మీద పోలీసులను ప్రయోగించిన దేవాదాయశాఖ మంత్రి కడకంపల్లి సురేంద్ర మంత్రి చేసిన పాపం ఐదు వందల సంవత్సరాలు తపస్సు చేసినా పోదని ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ వ్యాఖ్యానించారు. కమ్యూనిస్టు సిద్దాంతాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నారని, దాన్ని ప్రశ్నించిన వారి కాళ్లు ఇరగ్గొడుతున్నారని కన్నూరులో జరిగిన ప్రచారంలో ఆమె ఆరోపించారు. ఆదివారం నాడు రాష్ట్ర వ్యాపితంగా అన్ని పార్టీలు ప్రధానంగా రోడ్డు షోలు నిర్వహించాయి. ప్రచార గడువు ముగియటంతో మైకులు, నాయకుల నోళ్లు మూతపడ్డాయి.


అదానీ విద్యుత్‌ కొనుగోలు -రమేష్‌ చెన్నితల అబద్దాలు !


అదానీతో ఒప్పందం చేసుకొని అత్యధిక రేట్లకు ఎల్‌డిఎఫ్‌ సర్కార్‌ సౌర విద్యుత్‌ కొనుగోలు చేసిందన్న ఆరోపణ చేసిన కాంగ్రెస్‌ నేత రమేష్‌ చెన్నితల తన మాటలను తానే మింగాల్సి వచ్చింది. మార్కెట్లో యూనిట్‌ రెండు రూపాయలకు విద్యుత్‌ లభిస్తుండగా పాతిక సంవత్సరాల పాటు అమలులో ఉండే ఒప్పందం ద్వారా యూనిట్‌కు రు.2.83 చెల్లించే విధంగా ఒప్పందం చేసుకొని వెయ్యి కోట్ల లబ్ది చేకూర్చే విధంగా అక్రమాలకు పాల్పడ్డారని, అదానీ ప్రత్యేక విమానంలో కన్నూరు విమానాశ్రయానికి వస్తే ఆయనతో కలసి ముఖ్యమంత్రి, ఇతరులు మంతనాలు జరిపారని చెన్నితల తప్పుడు ఆరోపణలు చేశారు. దాన్ని పట్టుకొని ఇతర కాంగ్రెస్‌ నేతలు పాడిందే పాడారు. అయితే వాస్తవాలు ఇలా ఉన్నాయి. కేరళ ప్రభుత్వం సౌరవిద్యుత్‌ను అసలు కొనుగోలు చేయలేదు. ఏప్రిల్‌, మే మాసాల్లో అదనపు విద్యుత్‌ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వ వేలం కేంద్రం ద్వారా రెండు వందల మెగావాట్ల సాంప్రదాయ విద్యుత్‌ కోసం బహిరంగ టెండర్లు పిలిచింది.దానిలో వంద మెగావాట్లు రోజంతా, మరో వంద మెగావాట్లు మధ్యాహ్నం రెండు నుంచి అర్ధరాత్రి వరకు సరఫరా చేయాల్సి ఉంటుంది. దీనికి గాను మొదటి వంద మెగావాట్లకు ఆరు కంపెనీలు టెండర్లు వేశాయి.వాటిలో జిఎంఆర్‌ కంపెనీ యూనిట్‌ రు.3.04కు సరఫరా చేస్తామని వేసిన ధర అతితక్కువగా ఉంది. అయితే ఆ కంపెనీ టెండరు ఖరారు అయిన తరువాత తాము 50మెగావాట్లకు మించి సరఫరా చేయలేమని చెప్పింది. అయితే అదే ధరకు తాము మిగిలిన 50మెగావాట్లను సరఫరా చేస్తామని అదానీ గ్రూప్‌ చెప్పగా విద్యుత్‌ బోర్డు ఆమేరకు దానికి అర్డరు ఇచ్చింది. రెండవ వంద మెగావాట్లకోసం కూడా ఆరు కంపెనీలు పోటీ పడ్డాయి. దానిలో కూడా జిఎంఆర్‌ కంపెనీ రూ.3.41తో అతి తక్కువకు సరఫరా చేసేందుకు ముందుకు వచ్చింది. దీనిలో కూడా తాము 50మెగావాట్లే సరఫరా చేస్తామని చెప్పటంతో మిగిలిన 50 మెగావాట్లను పవర్‌ ట్రేడింగ్‌ కార్పొరేషన్‌కు ఇచ్చారు. ఇది వాస్తవం అని కావాలంటే ఫిబ్రవరి 15నాటి విద్యుత్‌ బోర్డు సమావేశ వివరాలు ఎవరైనా చూడవచ్చని బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది.

డబ్బిచ్చి సర్వేలు చేయించుకున్న ఎల్‌డిఎఫ్‌ – రాహుల్‌ గాంధీ ఉక్రోషం ! ఇరకాటంలో కాంగ్రెస్‌ !!

మరోసారి ఎల్‌డిఎఫ్‌ అధికారంలోకి రానుందని చెప్పిన సర్వేలన్నీ డబ్బిచ్చి రాయించుకున్నవి తప్ప మరొకటి కాదని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ కేరళ ఎన్నికల ప్రచారంలో ఆరోపించారు. బిజెపిని సిపిఎం ఎన్నడూ వ్యతిరేకించదని అందుకే ఆ పార్టీ దేశాన్ని కాంగ్రెస్‌ నుంచి విముక్తి చేయాలని చెప్పింది గానీ సిపిఎం నుంచి విముక్తి చేయాలని అనలేదన్నారు. కేరళలో కాంగ్రెస్‌ ఎంఎల్‌ఏలను ఆర్‌ఎస్‌ఎస్‌ కొనుగోలు చేయలేదన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్ధలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కోవిధంగా వ్యవహరిస్తున్నాయని, కేరళ దొంగబంగారం కేసులో వాస్తవాలు బయటకు రావన్నారు. కేరళలో గట్టిగా జోక్యం చేసుకోవటం లేదని విమర్శిస్తున్న రాహుల్‌ గాంధీ ఇతర రాష్ట్రాలో జోక్యం చేసుకుంటే అదే సంస్ధలను విమర్శిస్తున్నారని ముఖ్యమంత్రి విజయన్‌ ఎద్దేవా చేశారు. ఈ విషయంలో తమ వైఖరి అన్ని చోట్లా ఒకే విధంగా ఉందన్నారు.
కాసరగోడ్‌ జిల్లా మంజేశ్వరం నియోజకవర్గంలో యుడిఎఫ్‌ తరఫున పోటీ చేస్తున్న ముస్లింలీగ్‌ అభ్యర్ధికి మద్దతు ఇస్తున్నట్లు ఎస్‌డిపిఐ చేసిన ప్రకటన కాంగ్రెస్‌ కూటమిని ఇరుకున పెట్టింది. ఆ మద్దతు తీసుకుంటున్నదీ, తిరస్కరిస్తున్నదీ స్పష్టం చేయాలని బిజెపి డిమాండ్‌ చేసింది. మంజేశ్వరంలో పోటీ చేస్తున్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రన్‌ ఓటమికి తాము ముస్లింలీగుకు మద్దతు ఇస్తున్నట్లు ఎస్‌డిపిఐ ప్రకటించింది. దీని గురించి యుడిఎఫ్‌ వైపు నుంచి ఎలాంటి స్పందన రాలేదు. గత స్ధానిక సంస్ధల ఎన్నికలలో తమకు మంజేశ్వరంలో 7,800 ఓట్లు వచ్చాయని, వాటిని ముస్లింలీగుకు వేస్తే బిజెపి ఓడిపోతుందని తమ సర్వేలో తేలిందని ఎస్‌డిపిఐ రాష్ట్ర అధ్యక్షుడు అబ్దుల్‌ మజీద్‌ ఫైజీ చెప్పారు. మద్దతు గురించి తమకు తెలియదని ముస్లింలీగు నేత ఒకరు చెప్పారు.
వైనాడ్‌ జిల్లా మనంతవాడి నియోజకవర్గంలో రాహుల్‌ గాంధీ పర్యటన సమయంలో ముస్లింలీగు పతాకాలు కనిపించకపోవటం ఒకచర్చగా మారింది. కాంగ్రెస్‌-బిజెపి మధ్య కుదిరిన అవగాహన ప్రకారం బిజెపి ఓట్లు కాంగ్రెస్‌కు బదలాయిస్తారు. దానికి గాను ప్రచారంలో ముస్లింలీగు పతాకాలు కనిపించకూడదని బిజెపి షరతు పెట్టిందని సిపిఎం నేతలు పేర్కొన్నారు.


విదేశీ కంపెనీకి ఓటర్ల వివరాలు అందించినందుకు రమేష్‌ చెన్నితల మీద బిజెపి కేసు !


కేరళ ఓటర్ల వివరాలను సింగపూర్‌ కంపెనీకి వెల్లడించినందుకు గాను బిజెపి నేత జార్జి కురియన్‌ కేంద్ర ఎన్నికల సంఘానికి ఒక ఫిర్యాదు చేశారు. పౌరుల వ్యక్తిగత వివరాలను విదేశాలకు వెల్లడించటం తీవ్రమైన నేరమని, జాతీయ భద్రతకు ముప్పు అని పేర్కొన్నారు. ఓటర్ల మౌలిక సమాచారానికి ఎన్నికల కమిషన్‌ సంరక్షకురాలని, దాని అనుమతి లేకుండా విదేశీ సంస్ధకు సమాచారం అందించటం పౌరుల గోప్యతకు భంగకరమని పేర్కొన్నారు. రమేష్‌ చెన్నితల ఏర్పాటు చేసిన వెబ్‌సైట్‌లో 4,34,000 మంది రెండేసి ఓట్లు కలిగి ఉన్నారని ఆరోపించగా ఎన్నికల కమిషన్‌ ఆ సంఖ్యను 38వేలని పేర్కొన్నదని, 2017లో సుప్రీం కోర్టు విన్న పుట్టుస్వామి కేసు ప్రకారం రమేష్‌ చెన్నితల, కాంగ్రెస్‌ కమిటీ పౌరహక్కులను ఉల్లంఘించిందని కురియన్‌ పేర్కొన్నారు. సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎంఏ బేబీ ఫిర్యాదు చేయనప్పటికీ రమేష్‌చెన్నితల సమాచారాన్ని బహిర్గతపరిచారని విమర్శించారు. అయితే ఎన్నికల జాబితాను ఎవరైనా చూడవచ్చని తాను చేసిన దానిలో తప్పేమీ లేదని చెన్నితల సమర్ధించుకున్నారు. ఇప్పుడు అధికారికంగా ఫిర్యాదు చేసినందున ఎన్నికల కమిషన్‌ ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.


నేను ఈల వేశా చూడండి అంటున్న మెట్రోమాన్‌ !


నేను గానీ ఈల వేస్తే అని గారడీలు చేసే వ్యక్తి కబుర్లు చెప్పే మాదిరి మెట్రోమాన్‌గా సుపరిచితుడైన బిజెపి అభ్యర్ధి శ్రీధరన్‌ మాట్లాడుతున్నారు. తాను రంగంలోకి దిగిన కారణంగా బిజెపికి 30శాతం వరకు ఓట్లు వస్తాయని, కనీసం 40 సీట్లు, గరిష్టంగా 75 వచ్చినా ఆశ్చర్యం లేదని ఎన్నికల ప్రచారంలో చెప్పారు. నేను బిజెపిలో చేరిన తరువాత ఎంతో మంది ప్రముఖులు తనను చూసి పార్టీలో చేరారన్నారు. బిజెపి వ్యక్తిగా కాదు మెట్రోమాన్‌గా చూసి తనకు ఓటు వేయాలన్నారు. తమకు మెజారిటీ సీట్లు వస్తాయని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రన్‌ కూడా చెప్పారు. తమ విజయాన్ని ఎవరూ ఆపలేరని అన్నారు. మరోవైపు కాంగ్రెస్‌ ఎంపీ శశిధరూర్‌ మాట్లాడుతూ సర్వేలలో పేర్కొన్నదానికి భిన్నంగా తమకు జనం ఆదరణను ప్రకటించటాన్ని తాను చూశానని చెప్పారు.
దౌత్య సిబ్బంది ఉపయోగించే సంచుల్లో తెచ్చిన దొంగబంగారం కేసులో ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ తదితరులను ఇరికించాలని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు తనపై వత్తిడి తెచ్చారని ఆ కేసులో నిందితుడైన సందీప్‌ నాయర్‌ రాష్ట్ర క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసుల ముందు వాంగ్మూలం ఇచ్చాడు. తప్పుడు ప్రకటనలు చేయించిన ఇడి అధికారుల చర్యలపై రాష్ట్ర ప్రభుత్వం కేసులు నమోదు చేయటమేగాక విచారణ కమిషన్‌ కూడా ఏర్పాటు చేసిన విషయం తెలిసినదే. ఆ కేసులను కొట్టివేయాలన్న ఇడి దరఖాస్తును హైకోర్టు తిరస్కరించింది.


మీ నిర్వాకం మీ అద్దాల్లోనే చూసుకోండి : విజయన్

‌
ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వ ఆర్ధిక పని తీరుతో రాష్ట్రాన్ని రుణ ఊబిలో దింపిందన్న ఆరోపణలు చేసిన కాంగ్రెస్‌, బిజెపిలు తమ ప్రభుత్వాల నిర్వాకాలను చూసి సమాధానం చెప్పాలని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ చురకలంటించారు.రిజర్వుబ్యాంకు నివేదిక ప్రకారం 2019-20లో కాంగ్రెస్‌ పాలిత పంజాబ్‌కు 40.3, రాజస్దాన్‌కు 33.1, బిజెపి పాలిత ఉత్తర ప్రదేశ్‌కు 34.బీహార్‌కు 31.9, పశ్చిమ బెంగాల్‌కు 37.1శాతం అప్పులు ఉంటే కేరళకు 30.2శాతమే అన్నారు. 2006లో యుడిఎఫ్‌ పాలన పూర్తి అయిన సమయానికి 35శాతం అప్పు ఉంటే 2011లో ఎల్‌డిఎఫ్‌ దిగిపోయే నాటికి 31.8శాతం ఉందని ముఖ్యమంత్రి చెప్పారు. ఎవరు అప్పులో ఊబిలో దించారో, ఎవరు తేల్చారో జనం చూస్తున్నారని అన్నారు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

జిల్లా పరిషత్‌ ఎన్నికలను బహిష్కరిస్తున్న తెలుగు దేశం – పుదుచ్చేరి తరహా పాకేజ్‌ కోసమైనా పవన్‌ తాట తీస్తారా !

02 Friday Apr 2021

Posted by raomk in AP, AP NEWS, BJP, Congress, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, STATES NEWS, Telangana

≈ Leave a comment

Tags

chandrababu naidu, jana sena party, Pawan kalyan, special status to Puducherry, tdp, ycp jagan


ఎం కోటేశ్వరరావు


పుదుచ్చేరిలో పాగా వేసేందుకు బిజెపి చేసిన వాగ్దానం ఆ పార్టీకి ఆంధ్రప్రదేశలో ఎదురు తన్నిందా ? జరిగిన పరిణామాలను చూస్తే పెద్ద ఇరకాటంలో పడిందనే చెప్పాలి. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గుర్తు చేయాలి. ఐదు సంవత్సరాల క్రితం బీహార్‌ ఎన్నికల సమయంలో నరేంద్రమోడీ స్వయంగా ప్రత్యేక పాకేజ్‌లను ప్రకటించారు. తరువాత వాటికి అతీగతీ లేదు. ఇప్పుడు అమిత్‌ షా మాటల్లో చెప్పాలంటే పుదుచ్చేరి వాసుల విషయంలో జుమ్లా (అవసరార్దం అనేకం చెబుతుంటాం) కూడా కావచ్చు. తరువాత నిబంధనలు అంగీకరించటం లేదు, ఇతర రాష్ట్రాలు అభ్యంతర పెడుతున్నాయంటే చేసేదేమీ లేదు. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హౌదాను డిమాండ్‌ చేసిన పార్టీగా గొప్పలు చెప్పుకున్న బిజెపి తరువాత ఆ విషయంలో చేసిన వాగ్దానాన్ని తుంగలో తొక్కి రాష్ట్ర ద్రోహిగా ప్రజల ముందు తన స్వరూపాన్ని వెల్లడించుకుంది. ప్రత్యేక హౌదా ముగిసిన అధ్యాయంగా, కొత్తగా ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హౌదాలేమీ ఉండవు అని చెప్పి ఓట్లు వేసినా వేయకపోయినా దానికే తాము కట్టుబడి ఉంటామని అది కూడా తమ ఘనతే అన్నట్లుగా వ్యవహరించింది. ఇప్పుడు పుదుచ్చేరిలో పాగా వేసేందుకు అక్కడి ప్రజలకు ప్రత్యేక హౌదా ఎరవేసింది. తమకు అధికారం అప్పగిస్తే ప్రత్యేక కేంద్ర పాలిత ప్రాంత హౌదా కల్పించి జమ్మూకాశ్మీరుకు ఇచ్చిన మాదిరి కేంద్ర పన్నుల వాటాను 25 నుంచి 40శాతానికి పెంచేందుకు ప్రయత్నిస్తామని పేర్కొన్నది. అదే విధంగా కేంద్ర పధకాలకు గాను ప్రస్తుతం 70శాతం కేంద్ర పాలిత ప్రాంతం, 30శాతం కేంద్ర వాటాగా ఉన్నదానిని 30:70శాతాలుగా మారుస్తామని ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్నది. దీని మీద తెలుగుదేశం నేత లోకేష్‌ ట్వీట్లు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక హౌదాకోసం పోరాడుతుందా అని ప్రశ్నించారు. ప్రత్యేక హౌదాకోసం ఒక్క ప్రభుత్వం, అధికారపక్షమే కాదు, ఎవరైనా పోరాడవచ్చు. అయితే తెలుగుదేశం పార్టీ అలాంటి నైతిక హక్కును కోల్పోయింది. ఆంధ్రప్రదేశ్‌కు కావాలని కోరిన ప్రత్యేక హౌదాకు, పుదుచ్చేరికి ఇస్తామంటున్న హౌదాకు సంబంధం లేదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సమర్దించుకున్నారు.
కాశ్మీరు రాష్ట్రాన్ని రద్దు చేసిన కేంద్రం దానికి నలభైశాతం నిధులు ఇవ్వకపోతే అక్కడ దాని పరువు దక్కదు, తిరిగి రాష్ట్ర హౌదా ఇస్తామని చెబుతున్నారు. కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్న మరొక రాష్ట్రం ఢిల్లీ. అక్కడ ప్రభుత్వానికి అధికారాలను తగ్గించి, లెప్టినెంట్‌ గవర్నరకు ఎక్కువ అధికారాలు కట్టబెట్టేందుకు పూనుకున్న విషయం తెలిసిందే. అలాంటిది పుదుచ్చేరికి అధికారాలు, నిధులను ఎలా పెంచుతారు ? ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి ఒక ప్రాతిపదిక మరొక రాష్ట్రానికి మరొక ప్రాతిపదికా అన్న ప్రశ్న ముందుకు రానుంది. పుదుచ్చేరికి ఇలాంటి ప్రత్యేక హౌదా ఇచ్చేందుకు ప్రాతిపదిక ఏమిటి అన్నది ప్రశ్న. ఏ కమిటీ లేదా ఏ ఆర్ధిక సంఘం సిఫార్సులు దీనికి అవకాశం కల్పిస్తున్నాయి ? ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హౌదాకు బదులు ప్రత్యేక పాకేజి ఇస్తామని చెప్పిన కేంద్రం ఇలాంటిదానినే ఎందుకు అమలు జరపకూడదు ? ఇప్పటికే ఇరకాటంలో ఉన్న పవన్‌ కల్యాణ్‌ పుదుశ్చేరి తరహా హౌదాకోసమైనా కేంద్ర తాట తీసేందుకు, తోలు వలిచేందుకు తన పవర్‌ను చూపుతారా ? పులిలా గాండ్రిస్తారా, పిల్లిలా మ్యావ్‌ అంటారా ?

ఏపిలో ముద్దులాట – తెలంగాణాలో దెబ్బలాట : నాగార్జున సాగర్‌లో పవన్‌ కల్యాణ్‌ మద్దతు ఎవరికి ?

ఆంధ్రప్రదేశ్‌లో తమ కూటమి అధినేత, ముఖ్యమంత్రి అభ్యర్ధిగా జనసేనాని పవన్‌ కల్యాణ్‌ అని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన ప్రకటన రాష్ట్రంలో కొత్త రాజకీయ అంకానికి తెరలేపింది. దాని మీద పవన్‌ కల్యాణ్‌ వైపు నుంచి ఇంతవరకు ఎలాంటి స్పందన రాకపోవటం ఆశ్చర్యం కలిగిస్తున్నది. మరో మూడు సంవత్సరాల వరకు ఎన్నికలు లేకపోయినా ఇప్పుడే ప్రకటించటం గురించి చర్చ జరుగుతున్నది. స్ధానిక సంస్దల ఎన్నికలలో ఫలితాలు, విశాఖ ఉక్కు వంటి ఇతర అంశాలను చూసిన తరువాత బిజెపితో తెగతెంపులు చేసుకుంటామని కొద్ది రోజుల క్రితం పవన్‌ కల్యాణ్‌ చేసినట్లు చెబుతున్న హెచ్చరికల నేపధ్యంలో సోము వీర్రాజు తిరుపతి ఎన్నికల ఆపద మొక్కుగా ఈ ప్రకటన చేశారు తప్ప మరొకటి కాదన్నది ఒక అభిప్రాయం. పవన్‌ కల్యాణ్‌ అంటే ప్రధాని నరేంద్రమోడీ, అమిత్‌ షాలకు సైతం ఎంతో ఇష్టమని, పవన్‌ కల్యాణ్‌ను ఎంతో గౌరవంగా చూడాలని వారు చెప్పారని వీర్రాజు చెప్పారు. బిజెపి ఎక్కడా ఇంత వరకు ఇంత ముందుగా లేదా ఎన్నికల సమయంలో గానీ ముఖ్యమంత్రి అభ్యర్దులను ప్రకటించలేదు, దానికి భిన్నంగా ఈప్రకటన చేయటం రాజకీయ అవకాశవాదం అంటున్నవారు లేకపోలేదు. తిరుపతిలో తమ అభ్యర్దిని రంగంలోకి దించకపోతే బిజెపికి మద్దతు ఇచ్చేది లేదని కాపు సామాజిక తరగతికి చెందిన కొన్ని సంఘాల నేతలు హెచ్చరించిన నేపధ్యంలో వారిని బుజ్జగించి ఏమార్చేందుకు ఈ ప్రకటన చేసి ఉండవచ్చని కూడా భావిస్తున్నారు. రామాయణంలో పిడకల వేట మాదిరి సోము వీర్రాజు ప్రకటనకు వైసిపి అసంతృప్త ఎంపీ రఘురామ కృష్టం రాజు మరో వ్యాఖ్యానం చెప్పారు. తమ పార్టీలో ఏదైనా జరుగుతోందా అన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. జోగీ జోగీ రాసుకుంటే బూడిద రాలుతుందన్నట్లుగా ఈ ప్రకటనతో జరిగేదేమీ లేదని, తిరుపతి ఎన్నికల నేపధ్యంలో సోము వీర్రాజు ఒక బిస్కెట్‌ వేశారని వైసిపి నేత విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. మొత్తం మీద వీర్రాజు ప్రకటన నవ్వుల పాలైందని, పవర్‌ స్టార్‌ పరువు తీసిందని కొందరి అభిప్రాయం. అసలు తమది పెద్ద పార్టీ అయితే ముఖ్యమంత్రి అభ్యర్దిగా పవన్‌ కల్యాణ్‌ అని ప్రకటించటానికి వీర్రాజు ఎవరని కొందరు జనసైనికులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
బిజెపి-పవన్‌ కల్యాణ్‌ సంబంధాలు సజావుగా లేవన్నది స్పష్టం. తెలంగాణా ఎమ్మెల్సీ ఎన్నికల రోజున పోలింగ్‌ జరుగుతుండగా తెరాస అభ్యర్ది సురభి వాణీ దేవికి మద్దతు ప్రకటిస్తూ పవన్‌ కల్యాణ్‌ చేసి ప్రకటనే అందుకు నిదర్శనం. ఎన్ని ఓట్లు ఉన్నాయి లేవు అన్నది పక్కన పెడితే నాగార్జున సాగర్‌ ఉప ఎన్నికలో పవన్‌ కల్యాణ్‌ ఏమి చేస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తెలంగాణా బిజెపి నేతలు తనను అవమానించారనే ఆగ్రహంతో పవన్‌ కల్యాణ్‌ ఉన్నారు.

రుణ ఊబిలో జగనాంధ్ర ప్రదేశ్‌ – నిజాలను ఎంతకాలం దాస్తారు ?

కొన్ని సంక్షేమ పధకాలకు ఏదో ఒక సాకుతో కోత పెట్టక తప్పని స్ధితి, అది ఇంకా పూర్తి కావాల్సిన మండల, జిల్లా పరిషత్‌, అదే విధంగా తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల మీద పడకుండా చూసుకోవాల్సిన అగత్యం ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీకి ఏర్పడింది. ఈ నేపధ్యంలోనే ఓట్‌ఆన్‌ అకౌంట్‌తో అవన్నీ పూర్తయ్యేంత వరకు కాలక్షేపం చేద్దామనే ఆలోచనతో బడ్జెట్‌ను వాయిదా వేశారన్నది కాదనలేని సత్యం. దానికి అధికార పార్టీ ఏ సాకులు చెప్పినా అవి అతికేవి కాదు. అప్పుల గురించి కాగ్‌ చేసిన హెచ్చరిక, అది మీడియాలో చర్చకు దారి తీయటంతో ప్రభుత్వం తాజాగా సమాచార శాఖ ద్వారా ఒక పెద్ద వివరణ విడుదల చేసింది. దాన్ని రాసిన వారు ప్రభుత్వాన్ని సమర్ధించేందుకు ఎన్నో సాము గరిడీలు చేశారు. కేంద్ర ప్రభుత్వమే రికార్డు స్ధాయిలో అప్పులు చేసింది, మేమెంత అన్నట్లుగా చివరకు అప్పులు తీసుకురాక తప్పటం లేదు, సమర్ధనీయమే అని సమర్ధనకు పూనుకుంది. పోనీ దీనిలో అయినా నిజాయితీ ఉందా ?

అల్లుడికి బుద్ది చెప్పిన మామ అదే తప్పుచేశాడన్నట్లు !


సమాచార శాఖ వివరణలోని కొన్ని అంశాలు ఇలా ఉన్నాయి. కరోనా కారణంగా తలెత్తిన ఆర్ధిక పరిస్దితి కారణంగా కేంద్ర ప్రభుత్వమే 2020-21 ఆర్ధిక సంవత్సరంలో 18,48,655 కోట్లు అప్పు చేసింది. దేశ చరిత్రలో ఇంత మొత్తం అప్పు ఎన్నడూ చేయలేదు.కేంద్ర ప్రభుత్వ పని తీరు మొత్తం దేశానికి ఒక సూచిక.2014-19 సంవత్సరాలలో కేంద్ర ప్రభుత్వ అప్పు 56,48,471 కోట్ల నుంచి 84,68,085 కోట్లకు పెరిగింది. వృద్ది 49.92శాతం, వార్షిక వృద్ది రేటు 8.44శాతం. అదే రాష్ట్ర విషయంలో పైన చెప్పుకున్న కాలంలోనే 1,11,528 నుంచి 2,59,087 కోట్లకు పెరిగింది, వృద్ది 132.31శాతం, వార్షిక వృద్ది రేటు 18.36శాతం. ఇదంతా తెలుగు దేశం పాలనా కాలంలో జరిగింది.
కేంద్రంలో మోడీ 2.0, రాష్ట్రంలో వైసిపి 1.0 పాలనా కాలంలో అంటే 2019 మార్చి నుంచి 2021 మార్చినెల వరకు కేంద్ర అప్పులు 84,48,085 కోట్ల నుంచి 1,12,50,391 కోట్లకు, వృద్ది రేటు 32.86, వార్షిక వృద్ది రేటు 15.26శాతం ఉండగా రాష్ట్ర అప్పులు 2,59,087 నుంచి 3,48,998 కోట్లకు, వృద్ది రేటు 34.70, వార్షిక వృద్ది రేటు 16.06 శాతం ఉంది.
ఈ అంకెలతో ఎవరికీ పేచీ లేదు. వాటికి చెప్పే వ్యాఖ్యానాలే వివాదాస్పదం. సమాచార శాఖ విడుదల చేసిన అంకెలు వాస్తవమేనా ? ముఖ్యంగా వైసిపి రెండు సంవత్సరాల పాలనలో అప్పుగా పేర్కొన్న 3,48,998 కోట్ల రూపాయల అంకెలను ఏడాది క్రితం బడ్జెట్‌లోనే పేర్కొన్నారు. వాటిలో మార్పులేమీ లేవా ? సమర్ధనీయంగా పాలన ఉంటే అప్పులు తగ్గాలి, లేకపోతే పెరగాలి, పదిహేను నెలల నాటి అంకెలనే వల్లెవేస్తే కుదరదు. తెలుగుదేశం సర్కార్‌ చివరి ఏడాది రూ. 38,151 కోట్ల మేర అప్పులు తెచ్చింది. దాన్ని తీవ్రంగా విమర్శించిన జగన్‌ తొలి ఏడాది ఆ మొత్తాన్ని 52వేల కోట్లకు పెంచారు. వర్తమాన సంవత్సరానికి 48,295 కోట్లకు పెంచుతామని ప్రతిపాదించారు. కాగ్‌ చెప్పిన అంశాల ప్రకారం నవంబరు చివరి నాటికే రాష్ట్రం 73,811 కోట్లకు పైగా అప్పులు తెచ్చారు. నెలకు 9,226 కోట్ల రూపాయల చొప్పున ఉంది, మొత్తం అప్పు 3,73,140 కోట్లుగా ఉంది,డిసెంబరు-మార్చినెలల మధ్య ఇదే తీరున అప్పులు తెస్తే మరో 37 వేల కోట్ల రూపాయలు అప్పులు చేయవచ్చని అంచనా వేసింది. అంటే అప్పు నాలుగు లక్షల పదివేల కోట్ల చేరువలో ఉంటుంది. ఈ మొత్తంగాక వివిధ ప్రభుత్వ సంస్దలు తీసుకున్న అప్పులకు రాష్ట్ర ప్రభుత్వమే హామీదారుగా ఉంటుంది. అది కూడా రాష్ట్ర ప్రభుత్వ అప్పుగానే పరిగణించాలి. అయితే ఎఫ్‌ఆర్‌బిఎం చట్టం విధించిన జిఎస్‌డిపిలో మూడుశాతం రుణ పరిమితి దాటలేదు అని లెక్కల్లో చూపేందుకు ఆ మొత్తాలను విడిగా చూపుతున్నారు. చంద్రబాబు నాయుడి సర్కార్‌ చేసిన పనినే జగన్‌ ప్రభుత్వం కూడా చేస్తోంది. అందువలన అప్పు నాలుగున్నరలక్షల కోట్ల వరకు ఉన్నా ఆశ్చర్యం లేదు. ఇప్పుడు వెల్లడించకపోయినా మూడు నెలల్లో ప్రవేశ పెట్టే బడ్జెట్‌లో వాటిని వెల్లడించకతప్పదు. అందుకే పాత అంకెలను వల్లెవేస్తే తరువాత విమర్శకులకు మరో అవకాశం ఇచ్చినట్లు అవుతుంది.
రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌ వాటాగా వచ్చిన అప్పు 97వేల కోట్ల రూపాయలు. చంద్రబాబు ఏలుబడిలో అది 2018-19 నాటికి రెండులక్షల 57వేల 509 కోట్ల రూపాయలకు చేరింది. ఇవి గాక రాష్ట్ర ప్రభుత్వశాఖలు తీసుకున్న మరో 54వేల 250 కోట్ల రూపాయల అప్పులకు ప్రభుత్వం హామీ ఇచ్చింది. అంటే మొత్తం అప్పు మూడు లక్షల 11వేల కోట్లకు చేరింది. ఆ మొత్తాన్ని జగన్‌ సర్కార్‌, 3,02,202, 67,171 చొప్పున మొత్తం 3,69,373 కోట్లకు పెంచింది. 2021 మార్చి నాటికి 3,48,998 అప్పు పెరుగుతుందని పేర్కొన్నది, వీటికి అదనంగా హామీగా ఉన్న అప్పును కలుపుకోవాల్సి ఉంది. లక్ష్యానికి మించి అదనంగా చేసిన అప్పు, ప్రభుత్వం హామీ ఇచ్చిన అప్పులు మొత్తం నాలుగున్నర లక్షల కోట్లు దాటటం ఖాయం. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 2020వరకు నాలుగు సంవత్సరాలలో 27.92శాతంగా ఉన్న అప్పు 2021 మార్చి నాటికి 34.55 శాతానికి పెరుగుతుందని ఆర్ధిక మంత్రి బడ్జెట్‌ పత్రాల్లో వెల్లడించారు. వాస్తవానికి ఇది ఇంకా పెరగవచ్చు.
సమాచారశాఖ విడుదల చేసిన వివరణ పత్రంలో చెప్పినదాని ప్రకారం 2014-19 మధ్య రుణాల చెల్లింపు మొత్తం రు.25వేల కోట్లకు పెరిగింది. తెచ్చిన అప్పులను ఉత్పాదక ఖర్చుగా చేసి ఉంటే అనేక రంగాలు గణనీయంగా అభివృద్ది చెంది ఉండేవి, కాని అలా జరగలేదు అని పేర్కొన్నారు. తెలుగుదేశం అలా చేయలేదు సరే తమ రెండు సంవత్సరాల పాలనలో వైసిపి తెచ్చిన అప్పులను నవరత్న అనుత్పాదక సంక్షేమ పధకాలకు తప్ప ఇతరంగా ఏ ఉత్పాదక కార్యకలాపాల మీద ఖర్చు చేశారు, ఏమి సాధించారు అన్నదే ప్రశ్న.

నూతన ఎన్నికల కమిషనర్‌-పాత సవాళ్లు !


ఆంధ్రప్రదేశ్‌ నూతన ఎన్నికల కమిషనరుగా మాజీ ప్రధాన కార్యదర్శి, తరువాత రాష్ట్రప్రభుత్వ సలహాదారుగా ఉన్న నీలం సాహ్ని పదవీ బాధ్యతలు స్వీకరించారు.సాధారణంగా అయితే రాష్ట్ర ఎన్నికల కమిషనరు నియామకం పెద్ద చర్చనీయాంశం కాదు. అనేక మంది కమిషనర్ల నియామకం-పదవీ బాధ్యతల విరమణ వార్తలు కూడా గతంలో తెలిసేవి కాదు. కేంద్రంలో టిఎన్‌ శేషన్‌, రాష్ట్రంలో నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ ఎన్నికల కమిషన్లకు ఉన్న అధికారాలు ఎలాంటివో దేశానికి చూపించారు. గత ఏడాది కాలంలో రాష్ట్ర ప్రభుత్వమూ-రాష్ట్ర ఎన్నికల సంఘం మధ్య జరిగిన ప్రచ్చన్న, ప్రత్యక్ష యుద్దంలో మొత్తం మీద ఎన్నికల కమిషనర్‌దే పై చేయి అన్నది స్పష్టం. కింద పడినా గెలుపు మాదే అన్నట్లుగా అధికార పార్టీ నేతలు ఎంతగా, ఎలా సమర్దించుకున్నా వాస్తవాలు, కోర్టు తీర్పులు దానినే నిర్ధారిస్తాయి. తమ ఇష్టాను సారంగా ఒక ఎన్నికల కమిషనరును తొలగించటం సాధ్యం కాదని తెలిసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరించి ముక్కు పగల కొట్టించుకుంది. కొత్త ఎన్నికల కమిషనరు ముందు అధికారపక్షం వైపు నుంచి గతం మాదిరి ఎలాంటి సమస్యలు తలెత్తకపోవచ్చు. అయితే ప్రతిపక్షాల నుంచి అలాంటి పరిస్దితిని ఆశించలేము. మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికలు పూర్తయిన తరువాత మధ్యలో మధ్యంతర ఎన్నికలు వస్తే తప్ప లోక్‌సభ, అసెంబ్లీ గడువు ప్రకారం మూడు సంవత్సరాల పాటు అసలు ఎన్నికల కమిషనరు గురించి వార్తలే ఉండకపోవచ్చు.
స్వేచ్చగా ఎన్నికలు జరిగే అవకాశం లేకపోవటంతో జిల్లాపరిషత్‌ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు తెలుగుదేశం నేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు. దీని మీద పార్టీలో తీవ్ర భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. తెలుగుదేశం కార్యకర్తలు మరింత నీరుగారి పోతారని భయపడుతున్నారు. ఎన్నికలలో పాల్గొనాలా ? బహిష్కరించాలా అన్న తర్జన భర్జనలో బహిష్కరించాలని మెజారిటీ తెలుగుదేశం నేతలు అభిప్రాయపడినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ ముగిసినందున బహిష్కరించినా పోటీలో ఉన్న కారణంగా ఎన్నికలైతే జరుగుతాయి. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఎదురైన పరాజయాల నేపధ్యంలో తమకు అంతకు మించి భిన్నమైన ఫలితాలు రావన్నది తెలుగుదేశం అభిప్రాయం అన్నది స్పష్టం.
ఇక ఎన్నికల కమిషనరు విషయానికి వస్తే గతేడాది నామినేషన్ల సమయంలో అధికారపార్టీ ప్రత్యర్ధుల మీద దాడి చేసి నామినేషన్లు వేయనివ్వకుండా బలవంతపు ఏకగ్రీవాలు చేయించిందనే ఆరోపణలు, విమర్శల మీద ఏం చేస్తారన్నది చూడాల్సి ఉంది. గత ఎన్నికల కమిషనరు కొందరు పోలీసు, జిల్లా కలెక్టర్ల మీద చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేశారు. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఖాతరు చేయలేదు. ఒక వేళ గత కమిషనరు నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటే నూతన కమిషనరు విమర్శల పాలవుతారు, చర్యలకు ఉపక్రమిస్తే మరోమారు ప్రభుత్వంతో కయ్యం పెట్టుకోవాల్సి వస్తుంది. కేంద్రానికి గత కమిషనరు రాసిన లేఖలో తన రక్షణ విషయాలతో పాటు ఎన్నికల్లో అక్రమాల గురించిన ప్రస్తావన కూడా ఉన్నందున ఆ లేఖను వెనక్కు తీసుకుంటారా లేదా అన్నది ప్రశ్న.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

కాంగ్రెస్‌-ముస్లింలీగ్‌తో కుమ్మక్కు నిజమే : అప్రూవర్‌గా మారిన మరో బిజెపి నేత !

02 Friday Apr 2021

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties

≈ Leave a comment

Tags

#Pinarayi Vijayan, Co-le-b nexus in Kerala, Kerala Assembly Elections 2021, Kerala BJP, Kerala CPI(M)


ఎం కోటేశ్వరరావు


కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌-ముస్లింలీగుతో చేతులు కలిపింది నిజమే అంటూ మరో బిజెపి నేత సికె పద్మనాభన్‌ అప్రూవర్‌గా మారారు.2001లో కూడా అలాంటి అవగాహన ఉందన్నారు. ముస్లింలీగు నేత కున్హాలీకుట్టి, దివంగత కేరళ కాంగ్రెస్‌ నేత మణి, తాను, తమ నేతలు పిపి ముకుందన్‌, కేరళ బిజెపి పర్యవేక్షకుడు దేవ ప్రకాష్‌ గోయల్‌ కాసరగోడ్‌లో సమావేశమై సహకరించుకొనే విషయాలను చర్చించినట్లు పద్మనాభన్‌ చెప్పారు. 1991 ఎన్నికల్లో తాను కాసరగోడ్‌ లోక్‌సభ స్ధానంలో పోటీ చేయగా తమ నేత మరార్‌ మంజేశ్వరం అసెంబ్లీకి పోటీ చేశారని, మరార్‌ విజయం సాధించేట్లు చూడాలని కాంగ్రెస్‌-ముస్లింలీగ్‌ ఒక అవగాహనకు వచ్చాయని తమకు తెలిపారని, అయితే రాజీవ్‌ గాంధీ హత్యతో అంతా తారుమారైందని పద్మనాభన్‌ మాతృభూమి న్యూస్‌తో చెప్పారు. ప్రతిసారీ కాంగ్రెస్‌ తమను మోసం చేస్తున్నదని చెప్పారు.అదింకే మాత్రం కుదరదన్నారు. 2001 ఎన్నికల్లో తాను మంజేశ్వరమ్‌ బిజెపి అభ్యర్దిగా ఉన్నపుడు జరిగిన సమావేశంలో సిపిఎం వ్యతిరేక ఓట్ల గురించి చర్చించామన్నారు.1991లో మాదిరి మోసం చేస్తే కుదరదని తాను స్పష్టం చేశానన్నాను. కాంగ్రెస్‌, ముస్లింలీగ్‌లకు తమ ఓట్లు కావాలని అయితే మైనారిటీలు దూరం అవుతారనే భయంతో వారు బయటకు చెప్పరని, ఇప్పుడు వారి జిమ్మిక్కులు తమ మీద పని చేయవని వారు గ్రహించి ఉంటారని పద్మనాభన్‌ చెప్పారు. మూడు పార్టీల మధ్య ఉన్న అవగాహన నిజమే అని సీనియర్‌ నేత ఓ రాజగోపాల్‌ కొద్ది రోజుల క్రితం నిర్దారించిన విషయం తెలిసిందే. తమ మధ్య కుమ్మక్కు లేదని ముస్లింలీగులో ప్రముఖుడిగా ఉన్న కున్హాలీకుట్టి చెబుతున్నారు. పద్మనాభన్‌తో సహా బిజెపి నేతలను తాను కలసినట్లు గుర్తు లేదన్నారు. బిజెపి-సిపిఎం కుమ్మక్కు గురించి తాము బయట పెట్టిన తరువాత దాన్ని కప్పి పుచ్చుకొనేందుకు బిజెపి నేతలు ప్రయత్నిస్తున్నారన్నారు.


క్రైస్తవుల మీద దాడులు చేసిన వారు ఏసు పేరు చెప్పి ఓట్లడుగుతున్నారు : విజయన్

‌
క్రైస్తవుల మీద దాడులు చేసిన వారే కేరళలో ఏసు క్రీస్తు పేరుతో ఓట్లడిగేందుకు వచ్చారని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ఎద్దేవా చేశారు. కొద్ది పాటి వెండికోసం యూదులు ఏసుక్రీస్తును దెబ్బతీశారని నరేంద్రమోడీ వ్యాఖ్యానించిన నేపధ్యంలో విజయన్‌ స్పందించారు. ఏసు క్రీస్తు, యూదులు అంటూ మాట్లాడుతున్నవారు క్రైస్తవులను ప్రయాణాలు, ప్రార్ధనలు చేయకుండా అడ్డుకుంటున్నారని, ఒడిషాలోని కందమాల్‌ ప్రాంతంలో గ్రాహమ్‌ స్టెయిన్స్‌, ఆయన ఇద్దరు పిల్లలను సజీవదహనం చేసి హత్య చేసిన దారుణం వెనుక ఉన్న వారికి కేంద్రంలో మంత్రి పదవులిచ్చారని గుర్తు చేశారు. స్వాతంత్య్రం తరువాత దేశంలో పాలక పార్టీల అండతో రెండు పెద్ద మారణకాండలు జరిగాయని ఒకటి 1984లో కాంగ్రెస్‌ నాయకత్వాన ఢిల్లీలో వేలాది మంది సిక్కులను చంపివేశారని, 2002లో గుజరాత్‌లో సంఘపరివార్‌ సంస్ధలకు చెందిన వారు ముస్లింలను ఊచకోశారని, అలాంటి పార్టీల వారు కేరళ వచ్చి తమకు అహింస గురించి బోధలు చేస్తున్నారని, గత ఏడాది జరిగిన స్ధానిక సంస్ద ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌, బిజెపిలకు చెందిన వారు ఆరుగురు కమ్యూనిస్టులను హత్య చేశారని వారు ఇప్పుడు శాంతిదూతలుగా ఫోజు పెడుతున్నారని విజయన్‌ అన్నారు. మన పొరుగునే ఉన్న మయన్మార్‌లో రోహింగ్యా మైనారిటీల మీద సైన్యం దాడులు చేసినపుడు మెజారిటీ మౌనంగా ఉందని , ఇప్పుడు మెజారిటీ పౌరుల మీదనే అదే మిలిటరీ విరుచుకుపడుతోందని, ఫాసిస్టులు ఎలా ప్రవర్తిస్తారో అందరూ తెలుసుకోవాలని విజయన్‌ చెప్పారు. రాష్ట్రంలో జరిగిన అభివృద్ది గురించి చర్చించేందుకు కాంగ్రెస్‌ నేతలు సిద్దంగా ఉన్నారా అంటూ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ సవాల్‌ విసిరారు. ట్రాన్సపరెన్సీ ఇంటర్నేషనల్‌ తాజా నివేదిక ప్రకారం అతి తక్కువ అవినీతి ఉన్న రాష్ట్రంగా కేరళ ఉన్నట్లు, కాంగ్రెస్‌ పాలనలోని రాజస్దాన్‌లో పెద్ద ఎత్తున ఉందని తేలిందన్నారు. కేరళ పరిస్దితులను తెలుసుకోకుండా రాష్ట్ర నేతలు ఇచ్చిన తప్పుడు సమాచారాన్ని నోట కరుచుకొని జాతీయ నాయకులు ఇక్కడ మాట్లాడుతున్నారని విమర్శించారు.


2,224 దొంగబంగారం కేసుల్లో అధికారులు, బిజెపి నేతలకు సంబంధాలు !


తిరువనంతపురం విమానాశ్రయంలో రాయబార కార్యాలయ సంచుల్లో దొరికిన 30 కిలోల దొంగబంగారం గురించే మీడియా తరచూ ప్రస్తావిస్తున్నది. దాన్ని ముఖ్యమంత్రికి, ఇతర ఎల్‌డిఎఫ్‌ ప్రముఖులకు అంటకట్టి అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ది పొందాలని కేంద్రం చూస్తున్నది, దానికి కాంగ్రెస్‌ వంతపాడుతున్నది. సమాచారహక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నలకు కస్టమ్స్‌శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆర్‌ఆర్‌ గోస్వామి ఇచ్చిన సమాచారం మేరకు 2015 ఏప్రిల్‌ నుంచి 2021 ఫిబ్రవరి 28వరకు కేరళలోని నాలుగు విమానాశ్రయాలలో 2,224 కేసుల్లో 374.52 కోట్ల రూపాయల విలువగల 1327కిలోల బంగారం దొరికింది.
చిత్రం ఏమంటే ఈ కేసుల్లో ఏమి చేశారు అన్న ప్రశ్నకు బంగారాన్ని తీసుకువస్తున్నవారి మీద ఆరోపణలు మోపటం తప్ప అసలు ఆ బంగారం స్వంతదారుల మీద ఎలాంటి చర్యలూ లేవు. అత్యధిక సందర్భాలలో ఈ బంగారం గుజరాత్‌లోని మార్వాడీలకు చేర్చేందుకు ఉద్దేశించిందని తేలింది. వారందరికీ బిజెపితో సన్నిహిత సంబంధాలు ఉన్న విషయం తెలిసిందే.ఈ కారణంగానే కేసులు నమోదు తరువాత అడుగు ముందుకు సాగటం లేదు. అసలు నేరగాండ్లలో ఒక్కరిని కూడా బయటకు లాగలేదు. యుఏయి నుంచి దౌత్యపరమైన సంచుల్లో వచ్చి పట్టుబడిన బంగారాన్ని పంపింది ఎవరు, ఎవరికోసం పంపారో కూడా గత తొమ్మిది నెలల్లో కేంద్ర సంస్దలు తేల్చలేకపోయాయి. మలప్పురం సమీపంలో కరిపూర్‌ విమానాశ్రయంలో దొరికిన దొంగబంగారానికి సంబంధించి ముగ్గురు సూపరింటెంట్లతో సహా 14 మంది కస్టమ్స్‌ అధికారులను సిబిఐ పట్టుకుంది.


కాంగ్రెస్‌ అబద్దాల యంత్రానికి చార్జింగ్‌ చేస్తున్న బిజెపి – ఎల్‌డిఎఫ్‌కు వ్యతిరేకంగా రంగంలోకి దిగిన చర్చి !


కాంగ్రెస్‌లోని రమేష్‌ చెన్నితల అబద్దాల యంత్రానికి బిజెపి నేత సురేంద్రన్‌ చార్జింగ్‌ చేస్తున్నారని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందా కరత్‌ చెప్పారు. ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ ప్రతి రోజూ ఉదయాన్నే ఒక అబద్దాన్ని చెన్నితల తన యంత్రం నుంచి ఉత్పత్తి చేస్తున్నారు. ఆ యంత్రానికి సురేంద్రన్‌ చార్జింగ్‌ చేస్తున్నారని అన్నారు.కేరళ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న యుడిఎఫ్‌ ఎంపీలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్క మాటా మాట్లాడరని, కేరళలో ప్రత్యేకంగా తయారు చేసిన ఫెవికాల్‌ అంటించుకొని నోళ్లు మూసుకు వస్తారని బృందా ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్‌ నేత రమేష్‌ చెన్నితలకు బుర్ర సరిగా పని చేస్తున్నట్లు లేదని కేరళ విద్యుత్‌శాఖ మంత్రి ఎంఎం మణి వ్యాఖ్యానించారు. అదానీ కంపెనీ నుంచి అధిక ధరలకు విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం చేసుకుందని చెన్నితల ఆరోపణ చేయటం ఆయన స్ధితిని వెల్లడిస్తున్నదన్నారు. ఎవరి దగ్గర నుంచి ఎంతకు విద్యుత్‌ కొనుగోలు చేసిందీ వెబ్‌సైట్‌లో స్పష్టంగా ఉంది చూడవచ్చన్నారు. రాష్ట్రం కేంద్ర గ్రిడ్‌ నుంచి కొనుగోలు చేసింది తప్ప ప్రయివేటుగా చేయలేదన్నారు. యుడిఎఫ్‌ హయాంలో పది సంవత్సరాలకు కుదుర్చుకున్న అక్రమ ఒప్పందాలను రద్దు చేయాలన్నా కుదరలేదని మణి చెప్పారు. దానిలో షరతులు ప్రకారం రాష్ట్రం ఒప్పందం నుంచి వైదొలిగితే నష్ట పరిహారం చెల్లించాల్సి ఉంటుందని అన్నారు. విమానాశ్రయంలో బంగారం దొరికితే రాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేయలేదని గతంలో రమేష్‌ చెన్నితల చేసిన వ్యాఖ్యలను బట్టే ఆయన బుర్రపని చేయటం లేదని తేలిందన్నారు.
కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా జోక్యం చేసుకొన్న చరిత్ర ఉన్న కేరళ చర్చి అధికారులు ఈ ఎన్నికల్లో కూడా అదేపనిలో నిమగమైనట్లు కనిపిస్తోంది. త్రిసూరు నుంచి వెలువడే ” కాథలికో సభ ” అనే పత్రికలో తాజాగా రాసిన వ్యాసంలో కాంగ్రెస్‌ ప్రస్తావన లేకుండా ఎల్‌డిఎఫ్‌, బిజెపిల మీద ధ్వజమెత్తటాన్ని చూస్తే కాంగ్రెస్‌కు అనుకూలంగా ఓటర్లను ప్రభావితం చేయటం తప్ప మరొకటి కాదన్నది స్పష్టం. పరోక్షంగా బిజెపి మతతత్వాన్ని విమర్శించటంతో పాటు దొడ్డిదారిన సిపిఎం కుటుంబాలకు ఉద్యోగాలు ఇచ్చారని కాంగ్రెస్‌ చేసిన ఆరోపణలను కూడా పునశ్చరణ కావించటం ద్వారా ఎవరికి ఓటు వేయాలో సూచించినట్లయింది.


35 చోట్ల హౌరా హౌరీ పోటీ -ఓట్ల వ్యాపారులుగా మోడీ అనుచరులు !


ఏప్రిల్‌ ఆరవ తేదీన జరిగే అసెంబ్లీ ఎన్నికలకు ఆదివారం నాడు ప్రచారం ముగియనుంది. అన్ని పార్టీలకు చెందిన అగ్రనేతలు రంగంలోకి దిగి ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. నూట నలభైకి గాను 35 చోట్ల హౌరా హౌరీ పోటీ జరుగుతోందని ప్రస్తుత సరళి వెల్లడిస్తోంది. తమకు బలం ఉందని భావిస్తున్న రెండు నియోజకవర్గాలలో కాంగ్రెస్‌-ముస్లిం లీగుతో కుమ్మక్కయిన కారణంగానే నామినేషన్‌ పత్రాలు సరిగా వేయకుండా తిరస్కరణకు గురయ్యేట్లు చూసుకుందని బిజెపి మీద విమర్శలు వచ్చాయి. అవి పోను ఐదు చోట్ల చావో రేవో అన్నట్లు బిజెపి అభ్యర్దులు పోటీ చేస్తున్నారు. నరేంద్రమోడీ అనుచరులుగా ఉన్న వారు ఓట్ల వ్యాపారంలో ఉన్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి ఏ విజయరాఘవన్‌ వ్యాఖ్యానించారు. గత ఎన్నికల్లో నీమమ్‌లో బిజెపి ఎలా గెలిచిందో మోడీ చెప్పాలని అన్నారు. రాజ్యసభ ఎన్నికల గురించి స్వతంత్ర నిర్ణయం తీసుకొనేందుకు ఎన్నికల సంఘానికి అధికారం ఉందని కేంద్ర మంత్రి వి. మురళీధరన్‌ చెప్పారు. కేరళలో ఏప్రిల్‌ 12న జరగాల్సిన మూడు రాజ్యసభ స్ధానాల ఎన్నికలను వాయిదా వేసిన విషయం తెలిసినదే. దాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో దాఖలైన పిటీషన్‌ మీద స్పందించిన ఎన్నికల కమిషన్‌ ఎప్పుడు ఎన్నికలు నిర్వహించేది తెలుపుతామని హామీ ఇచ్చింది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

Recent Posts

  • హతవిధీ ! విమర్శించిన నెహ్రూ బాటలోనే నరేంద్రమోడీ !!
  • అమెరికా ఎడమ చంకలో ఇమ్రాన్‌ – కుడి వైపున నరేంద్రమోడీ ! వావ్‌ !!
  • జడ్‌పి ఎన్నికలపై జగన్‌కు పెద్ద షాక్‌ – తిరుపతి ఎన్నిక పర్యవసానాలు !
  • మోడీ (కౌగిలింతల ) వ్రతం చెడ్డా ఫలం దక్కలే ! అమెరికాతో వాణిజ్య యుద్దానికి సిద్దమా !!
  • నాపేరుతో ఓట్లడిగే వారు దొంగ భక్తులు, గడ్డాలు, జులపాలను చూసి మోసపోవద్దు : స్వామి అయ్యప్ప

Recent Comments

B. Govardhan on ప్రియాంక చోప్రా మీద మౌనం…
Janaki Ram on ఎంత పని చేస్తివే ట్వీటా : కంగన…
Rajamohan Kolla on రైతుల ఆందోళన : బి-జెపి-అండ్‌కో…
V VENKATA KRISHNA on మెజారిటీ-మైనారిటీ మతవాదుల అడ్డ…
CHIMME JOHN BARNABAS… on జస్టిస్‌ ఎన్‌వి రమణపై సిఎం జగన…

Archives

  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • హతవిధీ ! విమర్శించిన నెహ్రూ బాటలోనే నరేంద్రమోడీ !!
  • అమెరికా ఎడమ చంకలో ఇమ్రాన్‌ – కుడి వైపున నరేంద్రమోడీ ! వావ్‌ !!
  • జడ్‌పి ఎన్నికలపై జగన్‌కు పెద్ద షాక్‌ – తిరుపతి ఎన్నిక పర్యవసానాలు !
  • మోడీ (కౌగిలింతల ) వ్రతం చెడ్డా ఫలం దక్కలే ! అమెరికాతో వాణిజ్య యుద్దానికి సిద్దమా !!
  • నాపేరుతో ఓట్లడిగే వారు దొంగ భక్తులు, గడ్డాలు, జులపాలను చూసి మోసపోవద్దు : స్వామి అయ్యప్ప

Recent Comments

B. Govardhan on ప్రియాంక చోప్రా మీద మౌనం…
Janaki Ram on ఎంత పని చేస్తివే ట్వీటా : కంగన…
Rajamohan Kolla on రైతుల ఆందోళన : బి-జెపి-అండ్‌కో…
V VENKATA KRISHNA on మెజారిటీ-మైనారిటీ మతవాదుల అడ్డ…
CHIMME JOHN BARNABAS… on జస్టిస్‌ ఎన్‌వి రమణపై సిఎం జగన…

Archives

  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • హతవిధీ ! విమర్శించిన నెహ్రూ బాటలోనే నరేంద్రమోడీ !!
  • అమెరికా ఎడమ చంకలో ఇమ్రాన్‌ – కుడి వైపున నరేంద్రమోడీ ! వావ్‌ !!
  • జడ్‌పి ఎన్నికలపై జగన్‌కు పెద్ద షాక్‌ – తిరుపతి ఎన్నిక పర్యవసానాలు !
  • మోడీ (కౌగిలింతల ) వ్రతం చెడ్డా ఫలం దక్కలే ! అమెరికాతో వాణిజ్య యుద్దానికి సిద్దమా !!
  • నాపేరుతో ఓట్లడిగే వారు దొంగ భక్తులు, గడ్డాలు, జులపాలను చూసి మోసపోవద్దు : స్వామి అయ్యప్ప

Recent Comments

B. Govardhan on ప్రియాంక చోప్రా మీద మౌనం…
Janaki Ram on ఎంత పని చేస్తివే ట్వీటా : కంగన…
Rajamohan Kolla on రైతుల ఆందోళన : బి-జెపి-అండ్‌కో…
V VENKATA KRISHNA on మెజారిటీ-మైనారిటీ మతవాదుల అడ్డ…
CHIMME JOHN BARNABAS… on జస్టిస్‌ ఎన్‌వి రమణపై సిఎం జగన…

Archives

  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
%d bloggers like this: