Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు
అవును సిపిఎం నాయకత్వంలోని ఎల్‌డిఎఫ్‌ కూటమి నాలుగు దశాబ్దాల చరిత్రను తిరగరాసింది. ఒకసారి ఎల్‌డిఎఫ్‌ను ఎన్నుకుంటే మరోసారి యుడిఎఫ్‌ను ఎన్నుకొనే కేరళీయులు అధికారాన్ని తమకు అప్పనంగా కట్టపెడతారని ఆశపడ్డ కాంగ్రెస్‌కు దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చారు. ఈ ఎన్నికలలో తమకు స్వంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన సంఖ్యలో సీట్లు రాకపోయినా వచ్చే కొన్ని సీట్లతో చక్రం తిప్పుతామని, అన్నీ అనుకూలిస్తే అధికారం తమను వరిస్తుందని పగటి కలలు కన్న బిజెపికి ఉన్న ఒక్కసీటును లేకుండా చేసి ఖాతాను మూసివేశారు. ఎల్లవేళలా జన సంక్షేమమే ధ్యేయంగా పనిచేసిన ప్రభుత్వం ఆపత్కాలంలో తమను ఎలా అదుకున్నదో చూసిన జనం తమ మనోభావాన్ని గతేడాది చివరిలో జరిగిన స్ధానిక సంస్దల ఎన్నికలలోనే ఎల్‌డిఎఫ్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చి వెల్లడించారు. ఏప్రిల్‌ ఆరవ తేదీన జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో మరింత స్పష్టంగా తమకు కావాల్సిన వారెవరో ఎంచుకున్నారు. ఎన్ని అభాండాలు, ఎన్ని అవాస్తవాలు, ఎన్ని తప్పుడు ప్రచారాలు, ఎన్ని ఆటంకాలు అన్నింటిని మేము కాచుకుంటామంటూ జనం ముందుకు వచ్చారు.


ప్రజలు మమ్మల్ని విశ్వసించారు, యుడిఎఫ్‌ను తిరస్కరించారు, బిజెకి బుద్ది చెప్పారు అని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ఫలితాలపై తొలి స్పందనలో పేర్కొన్నారు. వామపక్ష ప్రజాతంత్ర సంఘటన మాత్రమే లౌకిక వాదాన్ని పరిరక్షించగలదని, సామాజిక న్యాయం చేకూర్చగలదని నమ్మారని ఇది ప్రజావిజయం అన్నారు. ఎన్నికల సమయంలో యుడిఎఫ్‌ లేవనెత్తిన అంశాలన్నింటినీ జనం తిరస్కరించారని అన్నారు. ఉన్న ఒక్క సీటును పొగొట్టుకున్న బిజెపి గురించి మాట్లాడుతూ దేశంలోని కొన్ని రాష్ట్రాలలో జిమ్మిక్కులు చేయగలదేమో గానీ ఇక్కడ పని చేయవని కేరళ గడ్డ మీద మతత్వానికి తావులేదన్నారు. గతంలో కాంగ్రెస్‌ నేత ఏకె ఆంటోని నాయకత్వంలో 2001లో యుడిఎఫ్‌ 99 స్ధానాలను సాధించి అప్పటికి ఒక రికార్డు నెలకొల్పింది. దాన్ని పినరయి విజయన్‌ సమం చేశారు. ఓట్లశాతాలు, తీర్పు ఇతర వివరాలను మరో సందర్భంలో వివరంగా సమీక్షించుదాం. రెండు ఫ్రంట్లలో పార్టీల వారీగా సీట్ల వివరాలు ఇలా ఉన్నాయి.


ఎల్‌డిఎఫ్‌ ×× సీట్లు ×××× యుడిఎఫ్‌××××× సీట్లు
సిపిఎం ×××× 68 ×××× కాంగ్రెస్‌ ×××× 22
సిపిఐ –×××× 17 ×××× ముస్లింలీగ్‌ ×××× 14
కెసి(ఎం) ×××× 5 ××××కేరళకాంగ్రెస్‌ ×××× 2
జెడిఎస్‌ ×××× 2 ×××× కెసిజె ×××× 1
ఎన్‌సిపి ×××× 2 ×××× ఎన్‌సికె ×××× 1


ఎల్‌డిఎఫ్‌లోని మరో ఐదు చిన్న పార్టీలకు ఒక్కొక్క స్దానం చొప్పున వచ్చాయి. యుడిఎఫ్‌లోని మూడు పార్టీలకు బిజెపి మిత్రపక్షాలు మూడింటికి, ఇతర పార్టీలు నాలిగింటికి ఒక్క స్దానమూ రాలేదు. గత ఎన్నికలలో స్వతంత్ర అభ్యరిగా గెలిచిన సభ్యుడు ఈ సారి ఎల్‌డిఎఫ్‌ చేతిలో ఓడిపోయారు.


వివిధ జిల్లాలో ఫలితాల తీరుతెన్నులను ఒక్కసారి చూద్దాం. పద్నాలుగు జిల్లాల్లోని 140 స్ధానాల్లో ఇది రాసిన సమయానికి విజయాలను ఖరారు చేసినవి, ఆధిక్యతలో ఉండి అధికారికంగా ప్రకటించని స్ధానాలు దిగువ విధంగా ఉన్నాయి.


జిల్లా పేరు ×××× 2016 ఎన్నికలు×××××× 2021 ఎన్నికలు
××××××××ఎల్‌డిఎఫ్‌××యుడిఎఫ్‌ ××× ఎల్‌డిఎఫ్‌ ×××× యుడిఎఫ్‌
తిరువనంతపురం ×× 9 ×× 4 ×× 13 ×××× 1
కాసరగోడ్‌ ××××× 3 ×× 2 ××× 3 ×××× 2
వయనాడ్‌ ××××× 2 ×× 1 ××× 2 ×××× 1
కన్నూరు ××××× 8 ×× 3 ××× 13 ×××× 1
కోజికోడ్‌ ××××× 11 ×× 2 ××× 11 ×××× 2
మలప్పురం ××× 4 ×× 12 ××× 4 ×××× 12
పాలక్కాడ్‌ ××××× 9 ×× 3 ××× 10 ×××× 2
త్రిసూర్‌ ××××× 12 ×× 1 ××× 12 ×××× 1
ఎర్నాకుళం ××××× 5 ×× 9 ××× 5 ×××× 9
ఇడుక్కి ××××× 3 ×× 2 ××× 4 ×××× 1
కొట్టాయం ××××× 2 ×× 6 ××× 5 ×××× 4
అలప్పూజ ××××× 8 ×× 1 ××× 8 ×××× 1
పత్తానంతిట్ట ××××× 4 ×× 1 ××× 5 ×××× 0
కొల్లం ××××× 11 ×× 0 ××× 9 ×××× 2

ఇలా అనుకోలేదు, ఓటమిని అంగీకరిస్తున్నాం, ఆత్మశోధన చేసుకుంటాం : కాంగ్రెస్‌


ఇలాంటి ఫలితాలు వస్తాయని మేము అనుకోలేదు. విజయన్‌ ప్రభుత్వం మీద అనేక ఆరోపణలు చేశాము. వారు విజయం సాధించినంత మాత్రాన అవన్నీ కొట్టుకుపోవు. పరాజయాన్ని ఆత్మశోధన చేసుకుంటాం అని హరిపాద నియోజకవర్గంలో విజయం సాధించిన ప్రతిపక్ష కాంగ్రెస్‌ నేత రమేష్‌ చెన్నితల చెప్పారు.రెండు సార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన కాంగ్రెస్‌ నేత ఊమెన్‌ చాందీ పుతుపల్లి నియోజకవర్గం నుంచి పన్నెండవ సారి విజయం సాధించి గతంలో ఉన్న దివంగత కెఎం మణి రికార్డుతో సమం చేశారు. గత ఎన్నికలలో ఇరవై వేలకు పైగా మెజారిటీ తెచ్చుకున్న చాందీ ఈ సారి ఎనిమిదివేలతో సరిపెట్టుకున్నారు. ఒక విద్యార్ది నేత మీద ఇంత తక్కువ మెజారిటీ తెచ్చుకోవటం ఏమిటని కాంగ్రెస్‌ వర్గాలు దిగ్భ్రాంతికి గురయ్యాయి. పరాజయాన్ని సవాలుగా తీసుకొని పని చేస్తామని చాందీ అన్నారు.


కరుణాకరన్‌ బిడ్డలు : అన్నకు మూడో స్ధానం – చెల్లికి రెండో స్దానం !


ఓడిపోయిన వారిలో మంత్రి, సిపిఎం సీనియర్‌ నేత మెర్సికుట్టి అమ్మ ఉన్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె సురేంద్రన్‌ రెండు సీట్లలో పోటీ చేశారు. శబరిమల ఆలయం ఉన్న కొన్ని నియోజకవర్గంలో సిపిఎం చేతిలో, మరో నియోజకవర్గంలో యుడిఎఫ్‌ ముస్లింలీగ్‌ అభ్యర్ధి చేతిలో ఓడిపోయారు. గత ఎన్నికలలో మంజేశ్వరమ్‌లో కేవలం 89 ఓట్ల తేడాతో ఓడిపోయిన సురేంద్రన్‌ ఈ సారి 1,143 తేడాతో పరాజయం పొందారు. కొన్ని నియోజకవర్గంలోని శబరిమల వివాదాన్ని రెచ్చగొట్టి గెలవాలని చూసి అక్కడ కూడా పరాజయం పాలయ్యారు. రెండు చోట్ల పోటీ చేయటం, ప్రచారానికి హెలికాప్టర్‌ను ఉపయోగించటం వంటి చర్యలు మంజేశ్వరమ్‌లో పరాజయానికి కారణమని మీడియా వ్యాఖ్యానించింది. కేరళ అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేని బిజెపి తొలిసారిగా తిరువనంతపురం నగరంలోని నీమమ్‌ నియోజకవర్గంలో గత ఎన్నికలలో కాంగ్రెస్‌ పరోక్ష మద్దతుతో గెలిచి ప్రాతినిధ్యం పొందింది. ఈసారి సిపిఎం చేతిలో ఓడిపోయింది. బిజెపి మాజీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ గవర్నర్‌ అయిన కుమనం రాజశేఖరన్‌ ఇక్కడ పోటీ చేశారు. కాంగ్రెస్‌ మాజీ ముఖ్యమంత్రి కరుణాకరన్‌ కుమారుడైన లోక్‌సభ సభ్యుడు మురళీధరన్‌ను అక్కడ నిలిపింది. ఆయన మూడవ స్దానంలో నిలిచారు. తన రాకతో బిజెపికి పెద్ద ఊపు వచ్చిందని, తానే ముఖ్యమంత్రి అభ్యర్ధిని అని చెప్పుకున్న మెట్రోమాన్‌ శ్రీధరన్‌ పాలక్కాడ్‌లో యుడిఎఫ్‌ కాంగ్రెస్‌ అభ్యర్ధి షఫీ పరంబిల్‌ చేతిలో ఓడిపోయారు. ఇక్కడ గత ఎన్నికలలో కూడా బిజెపి రెండవ స్దానంలో నిలిచింది. పాలక్కాడ్‌ మున్సిపాలిటీలో బిజెపి విజయం సాధించింది. పట్టణ ఓట్ల లెక్కింపులో ఆధిక్యంలో ఉన్న శ్రీధరన్‌ గ్రామీణ ప్రాంతంలోకి వచ్చే సరికి వెనుకబడిపోయారు. సినీహీరో సురేష్‌ గోపి బిజెపి అభ్యర్ధిగా త్రిసూర్‌లో పోటీ చేసి మూడవ స్ధానంలో వచ్చారు. ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి కె కరుణాకరన్‌ కుమార్తె పద్మజా వేణుగోపాల్‌ కాంగ్రెస్‌ అభ్యర్దిగా పోటీ చేశారు. ఆమెపై సిపిఐ అభ్యర్ధి పి బాలచంద్రన్‌ విజయం సాధించారు. పాల నియోజకవర్గంలో కేరళ కాంగ్రెస్‌ (ఎం) జోస్‌కె మణి పరాజయం పొందటం ఎల్‌డిఎఫ్‌ శ్రేణులను ఆశ్చర్యానికి గురి చేసింది. మణి ఎల్‌డిఎఫ్‌లో చేరటంతో అంతకు ముందు ఉప ఎన్నికలో గెలిచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎన్‌సిపి సభ్యుడు మణి సి కప్పన్‌కు వేరే చోట సీటు ఇస్తామని చెప్పినప్పటికీ అదే సీటు కావాలని పట్టుబట్టటం, ఎల్‌డిఎఫ్‌ తిరస్కరించటంతో కప్పన్‌ యుడిఎఫ్‌లో చేరి అదే సీటులో పోటీ చేసి పదివేలకు పైగా మెజారిటీతో విజయం సాధించారు.


జయహౌ శైలజ టీచర్‌ – అయ్యప్పకు ఆగ్రహం !


ఎల్‌డిఎఫ్‌ను రెండవ సారి అధికారానికి తీసుకురావటంలో పినరయి విజయన్‌ ఒక రికార్డు స్దాపిస్తే, ఈ ఎన్నికలో ఆరోగ్యశాఖ మంత్రి సిపిఎం అభ్యర్ధిగా కెకె శైలజ రికార్డు స్ధాయిలో 61వేలకు పైగా ఓట్లతో కన్నూరు జిల్లాలో విజయం సాధించారు. గత ఎన్నికలలో ఇక్కడ సిపిఎం నేత ఇపి జయరాజన్‌ 43,381 ఓట్ల మెజారిటీ ఒక రికార్డు కాగా శైలజ దాన్ని బద్దలు కొట్టారు.
వయస్సులో ఉన్న మహిళలకు శబరిమల ఆలయ ప్రవేశ సమస్యపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును అమలు జరిపినందుకు ప్రభుత్వంపై ధ్వజమెత్తి శాంతి భద్రతల సమస్యను సృష్టించిన కాంగ్రెస్‌, బిజెపిలకు ఈ ఎన్నికల్లో శృంగభంగమైంది. ఆ సమస్య సుప్రీం కోర్టు పునర్విచారణలో ఉన్నందున కోర్టు ధిక్కారమని తెలిసినప్పటికీ ఆ సమస్యను ప్రచారం చేశారు. తాము అధికారానికి వస్తే ప్రత్యేక చట్టం చేస్తామని రెండు పార్టీలు ప్రకటించాయి. శబరిమల ఆలయ ప్రాంతం, పరిసరాలలో ఉన్న నియోజకవర్గాలలో ఎల్‌డిఎఫ్‌ అభ్యర్దులు విజయం సాధించారు. తనను అనవసరంగా వివాదంలోకి లాగినందుకు ఆ రెండు పార్టీల మీద అయ్యప్ప ఆగ్రహం పూనారా అన్నట్లుగా ఫలితాలు వచ్చాయి. తాము రాజకీయాలకు తటస్ధం అని ప్రకటించిన నాయర్‌ సర్వీసు సొసైటీ పోలింగ్‌ ప్రారంభమైన తొలిగంటలోనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని సంస్ధ నేత ప్రకటించి తామెవరి పక్షమో వెల్లడించారు. కాంగ్రెస్‌ ఈ విషయంలో బిజెపికి కార్బన్‌ కాపీ మాదిరిగా వ్యవహరించింది. ఎల్‌డిఎఫ్‌ మాత్రమే ఏకైక లౌకికశక్తిగా జనం చూశారు. మైనారిటీలు అనేక ప్రాంతాలలో ఎల్‌డిఎఫ్‌ వైపు మొగ్గారని మధ్య, దక్షిణ కేరళ ఫలితాలు వెల్లడించాయి. తమ అభ్యర్ధి మెట్రోమాన్‌ శ్రీధరన్‌ను ఓడించేందుకు సిపిఎం మద్దతుదారులైన ముస్లింలు యుడిఎఫ్‌ అభ్యర్ధికి ఓటువేసి ఓడించారని, అనేక చోట్ల తమకు వ్యతిరేకంగా ఇదే చేశారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె సురేంద్రన్‌ ఆరోపించారు. తాము 35 సీట్లు సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని సురేంద్రన్‌ ఎన్నికల ముందు ప్రకటించిన విషయం తెలిసిందే.

ఓటమితో గుండు కొట్టించుకోవద్దని ప్రత్యర్ధికి సలహా ఇచ్చిన మంత్రి !


ప్రియమైన స్నేహితుడా ఎన్నికల్లో ఓటమిని వ్యక్తిగతంగా తీసుకోవద్దు. నియోజకవర్గంలో పరిస్ధితికి అనుగుణ్యంగా ఓటు వేశారని కేరళ విద్యుత్‌శాఖ మంత్రి ఎం ఎం మణి కాంగ్రెస్‌ అభ్యర్ధి ఇఎం అగస్తీకి సలహా ఇచ్చారు. తాను ఓడిపోతే గుండు గీయించుకుంటానని ఒక టీవీ ఛానల్లో అగస్తి శపధం చేశారు. ఇడుక్కి జిల్లాలోని ఉడుంబాలోంచా నియోజకవర్గంలో 38,305 పైగా ఓట్ల ఆధిక్యంతో గెలుపొందిన మంత్రి తన విజయానికి దోహదం చేసిన ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. భోళామనిషిగా పేరున్న మంత్రి ప్రత్యర్ధుల మీద పంచ్‌లు వేయటంలో ఆయనకు ఆయనే సాటి.