Tags

, , , , ,


మన చుట్టూ జరుగుతున్నదేమిటి – 4

ఎం కోటేశ్వరరావు


ప్రపంచంలో నిత్యం అనేక కుట్ర సిద్దాంతాలు, వాటికి అనుగుణ్యంగా కట్టుకథలు-పిట్టకథలూ వెలువడుతుంటాయి. ఇది ప్రచార దాడిలో భాగం అని చాలా మందికి తెలియదు. నిజమే అని విశ్వసిస్తారు. వాస్తవం కాదని తెలిసేసరికి ఆ సమస్య ఉనికిలో ఉండదు కనుక పట్టించుకోరు. ఉదాహరణకు ఇరాక్‌ అధ్యక్షుడు సద్దామ్‌ హుస్సేన్‌ మారణాయుధాలను గుట్టలుగా పోసినందున తాము దాడి చేశామని అమెరికా ప్రపంచాన్ని నమ్మించింది. సద్దాంను అంతం చేసిన తరువాత అదే అమెరికా తరువాత కొన్ని సంవత్సరాల తరువాత అబ్బే అలాంటి గుట్టలేమీ దొరకలేదు అని చెప్పింది. ఎంత మంది దానిని పట్టించుకున్నారు.

గతంలో అమెరికన్లు రష్యన్లను విలన్లుగా చిత్రిస్తే ఇప్పుడు వారి బదులు చైనీయులను చేర్చారు. వారి పొడ మనకు గిట్టదు అని చెబుతుంటారు. కానీ అమెరికాలోని కాటో ఇనిస్టిట్యూట్‌ అనే ఒక మేథో సంస్ధకు చెందిన ఇద్దరు మేథావులు ఈ మధ్యే ఒక వ్యాసం రాశారు. చైనా నుంచి వలస వచ్చే వారిని అమెరికా ప్రోత్సహించాలి అని దానిలో ప్రభుత్వానికి సలహా ఇచ్చారు. నాలుగు సంవత్సరాలు అధికారంలో ఉన్న డోనాల్డ్‌ ట్రంప్‌ చైనా వారిని అమెరికా గడ్డమీద అడుగు పెట్టనివ్వొద్దు అన్నట్లుగా చెలరేగి పోయాడు.వారు గూఢచర్యాలకు పాల్పడుతున్నారని, విద్యా సంస్ధలలో కమ్యూనిస్టు సిద్దాంతాలను వ్యాపింపచేస్తున్నారని, అమెరికా సాంకేతిక పరిజ్ఞానాలను తస్కరిస్తున్నారని మొత్తం మీద అమెరికా భద్రతకే ముప్పు తెస్తున్నారన్నట్లుగా ప్రచారం చేయించాడు. చైనా మిలిటరీ-పౌర సంస్దలు సమ్మిళితంగా అనుసరించే వ్యూహాలతో సంబంధం ఉన్న ఎఫ్‌-1 విద్యార్ధులు, జె-1పర్యాటకులను అడుగుపెట్టనివ్వవద్దని ఆదేశాలు జారీ చేశాడు.చైనా సంస్ధల నుంచి నిధులు పొందే అమెరికన్‌ విశ్వవిద్యాలయాల మీద కూడా చర్యలు తీసుకున్నాడు. శాస్త్ర, సాంకేతిక సంస్ధలలో ప్రవేశం కోరే చైనీయుల వీసాలను ప్రత్యేకంగా తనిఖీ చేయాలన్నాడు.దాంతో ప్రతి వీసా నెలల తరబడి విచారణల్లోనే ఉండేది. కాటో సంస్ధ మేథావులు వీటన్నింటితో ఏకీ భావం కలిగిన వారే.


అయితే వారి దూరా లేదా దురాలోచనను దాచుకోలేదు.గతంలో సోవియట్‌ యూనియన్‌తో ప్రచ్చన్న యుద్దం సాగించినపుడు దాని పౌరులను ఆకర్షించటాన్ని ఒక విధానంగా అమెరికా అనుసరించింది. ఇప్పుడు దాన్ని చైనాకు ఎందుకు వర్తింప చేయకూడదన్నది వారి తర్కం. రెండవ ప్రపంచ యుద్ద సమయంలో సోవియట్‌ యూనియన్‌ ఎర్రసైన్యం అనేక తూర్పు ఐరోపా దేశాలను హిట్లర్‌ ఆక్రమణ, దుర్మార్గాల నుంచి విముక్తి చేసింది. స్ధానిక కమ్యూనిస్టు, వర్కర్స్‌ పార్టీలు అధికారంలోకి వచ్చి సోషలిస్టు రాజ్యాలను నెలకొల్పటం ఒకపరిణామం. అదే సమయంలో ఆ దేశాలకు చెందిన కమ్యూనిస్టు వ్యతిరేకులు, పెట్టుబడిదారులను అమెరికాకు ఆహ్వానించి కమ్యూనిస్టు నియంతృత్వం నుంచి బయటపడిన స్వేచ్చా జీవులుగా ముద్రవేసి వారితో కట్టుకథలు చెప్పించి అమెరికన్లను, ప్రపంచాన్ని నమ్మించారు. నాటి అధ్యక్షుడు ట్రూమన్‌ అలా 80వేల మందికి ఆశ్రయం కల్పించాడు.1990లో సోవియట్‌, తూర్పు ఐరోపాలోని సోషలిస్టు వ్యవస్ధలను కూల్చివేసిన సమయంలో కూడా అదే ఎత్తుగడను అనుసరించి వలసలను సరళతరం గావించారు.

అలా వచ్చిన లక్షలాది మంది రాజకీయ, నైతిక, కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారానికి ఎంతగానో తోడ్పడ్డారు. కమ్యూనిజం కంటే పెట్టుబడిదారీ విధానం ఎంత గొప్పదో వారి చేత చిలుకపలుకులు పలికించి ప్రపంచ కమ్యూనిస్టు వ్యతిరేకులకు వీనుల విందు చేశారు. అదే సమయంలో అమెరికాకు ఆర్ధికంగా ఎంతో ఉపయోగపడ్డారు. ఇప్పుడు చైనీయులు సాంకేతిక రంగంలో కూడా అమెరికా, ఇతర పశ్చిమ దేశాలకు సవాలు విసురుతున్నారు. అందువలన అత్యంత ప్రతిభావంతులు, విద్యావంతులైన చైనీయులను అమెరికాకు రప్పించటం ఎంతో లాభదాయకం అన్నది కాటో తర్కం. అలావచ్చిన వారు గూఢచర్యానికి పాల్పడి, రహస్యాలను చైనాకు చేరవేస్తేనో అన్న ప్రశ్నకు కూడా వారే సమాధానం చెప్పారు.అలాంటి చర్యలవలన జరిగే నష్టం చాలా తక్కువ అని అంతకంటే ఎక్కువగా చైనా నుంచి వచ్చే వారు చేసే పరిశోధన, అభివృద్ధి ఎక్కువ లాభం అని బల్లలు చరిచి మరీ చెపుతున్నారు. కరోనా వైరస్‌ను ఊహాన్‌ పరిశోధనాకేంద్రంలోనే తయారు చేశారనే కథనాలు చైనా నుంచి ఫిరాయించిన ఒకరిద్దరు చెబుతున్నవే. వాటన్నింటితో ప్రపంచ మీడియా చైనా వ్యతిరేక పండగ చేసుకొంటోంది.


అయితే ఈ మేథావులు, వారిని సమర్ధించేవారు గానీ ఒక విషయాన్ని మరచి పోతున్నారు. మూడు దశాబ్దాల నాడు కూల్చి వేసిన సోవియట్‌ నాడు అమెరికాతో పోలిస్తే ఒక మిలిటరీ శక్తి తప్ప ఆర్ధిక శక్తి కాదు.ఇప్పుడు చైనా అమెరికా ఆర్ధికశక్తిని సవాలు చేసి రెండవ స్ధానం నుంచి మొదటి స్దానానికి పరుగులు తీస్తున్నది. మిలిటరీ పరంగా కూడా పటిష్టంగానే ఉంది. సోవియట్‌ నాయకత్వం సామ్రాజ్యావాదం, పెట్టుబడిదారీ విధానాల ప్రమాదాన్ని తక్కువ అంచనా వేసింది. పర్యవసానంగా జనానికి వాటి ముప్పు గురించి చైతన్యం కలిగించటంలో నిర్లక్ష్యం చేసింది. చైనా అలాంటి భ్రమల్లో లేదు. మూడు దశాబ్దాల క్రితం తూర్పు ఐరోపా రాజ్యాలను కూల్చివేసే సమయంలో సంభవించిన తియన్మెన్‌ స్క్వేర్‌ ఆందోళన వెనుక ఉన్న అంశాలను పసిగట్టి మొగ్గలోనే తుంచి వేసింది. జనాన్ని హెచ్చరించింది.ఇదే సమయంలో ప్రచ్చన్న యుద్దంలో విజయం సాధించామని చెప్పుకున్న అమెరికాలో నేడు పెట్టుబడిదారీ విధానం విఫలమైందని నమ్ముతున్న వారు రోజు రోజుకూ పెరుగుతున్నారు. సోషలిస్టు చైనా విజయాలు ఎలా సాధ్యం అవుతున్నాయనే ఆలోచన కలుగుతోంది.

అమెరికా ఇప్పటికీ బలమైన, ప్రమాదకర దేశమే అయినప్పటికీ దాని సమస్యలు దానికి ఉన్నాయి. అందుకే ఎక్కడన్నా బావేగానీ వంగతోట దగ్గర కాదు అన్నట్లుగా వ్యవహరిస్తోంది. ఇండో-పసిఫిక్‌ ప్రాంతం మీద పట్టుకోసం అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియా, భారత్‌తో చతుష్టయం (క్వాడ్‌) పేరుతో జట్టుకడుతున్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో ఫసిఫిక్‌ ప్రాంత భాగస్వామ్య కోసం సమగ్ర మరియు పురోగామి ఒప్పందం (సిపిటిపిపి) ఒప్పందంపై సంతకం చేసేందుకు అమెరికా సిద్దం కావటం లేదు. అది లేకుండా మిగతా దేశాలు చేసేదేమీ లేదు. అమెరికాలో తలెత్తిన ఆర్ధిక సమస్యల కారణంగా స్వంతగడ్డమీద పెట్టుబడులను ప్రోత్సహించాలని బైడెన్‌ సర్కార్‌ భావిస్తోంది. గడచిన నాలుగు సంవత్సరాలలో చైనాతో వాణిజ్యలోటు తగ్గింపులక్ష్యంతో దేశ భద్రత పేరుతో చైనా నుంచి వచ్చే ఉక్కు, అల్యూమినియం తదితర వస్తువుల మీద డోనాల్డ్‌ ట్రంప్‌ దిగుమతి సుంకాల పెంపు అమెరికన్ల మీదనే భారం మోపాయి. పనిలో పనిగా జపాన్‌, ఐరోపా మిత్ర దేశాల మీద కూడా అదేపని చేశాడు. ఈ పన్నులను ఎత్తివేయాలని చైనా కంటే అమెరికా వాణిజ్యవేత్తలే ఇప్పుడు బైడెన్‌ మీద ఎక్కువ వత్తిడి తెస్తున్నారు.


చైనాతో పోరు సంగతి తరువాత, అమెరికా వెలుపలి నుంచి వచ్చే వస్తువుల మీద దిగుమతి పన్నుల విధింపు కారణంగా తాము మార్కెట్లో పోటీ పడలేకున్నామని అందువలన వాటిని ఎత్తివేయాలని మూడువందల సంస్దలు బైడెన్‌కు విజ్ఞప్తి చేశాయి. అమెరికన్ల కొనుగోలు శక్తి పెంచేందుకు ఆరులక్షల కోట్ల డాలర్లతో అనేక పధకాలను అమలు జరిపేందుకు ఆమోదం తెలపాలని బైడెన్‌ పార్లమెంట్‌ను కోరారు. దీని వలన తమ మీద పడే ప్రభావం, పర్యవసానాలు ఏమిటని జపాన్‌, దక్షిణ కొరియా వంటి దేశాలు జాగ్రత్తగా పరిశీలిస్తున్నాయి. అమెరికన్లు ఎంత హడావుడి చేసినా ఇతర దేశాల సహకారం లేకుండా చైనాను వారేమీ చేయలేరు. అదే సమయంలో చైనీయులు కూడా ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకుంటున్నారు.సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగుపరచుకుంటున్నారు. పరిశోధన-అభివృద్ధికి పెద్ద ఎత్తున ఖర్చు చేస్తున్నారు. అమెరికా, ఐరోపా పశ్చిమ దేశాల మీద ఆధారపడకుండా స్వంత గడ్డమీద జనం కొనుగోలు శక్తి పెంచేందుకు, ఇతర దేశాల్లో మార్కెట్‌ను పెంచుకొనేందుకు ఎప్పటి నుంచో ప్రయత్నాలు ప్రారంభించారు.దానిలో భాగమే బెల్ట్‌ మరియు రోడ్‌ (బిఆర్‌ఐ) పధకాలు. రాజకీయంగా తమకు వ్యతిరేకంగా జట్టుకట్టిన ఆస్ట్రేలియాకు చైనా చుక్కలు చూపిస్తోంది.గతంలో ఏటా 50 కోట్ల డాలర్ల విలువగల పీతలు ఆస్ట్రేలియా ఎగుమతి చేసేది. అమెరికాతో జతకట్టి బస్తీమే సవాల్‌ అనగానే ఆ పీతల దిగుమతులను చైనా నిషేధించింది. ఇలాంటి అనేక చర్యలు తీసుకోవటంతో ఆస్ట్రేలియన్‌ వ్యాపారులు లబోదిబోమంటున్నారు. అమెరికా అండచూసుకొని చైనా వస్తువులను బహిష్కరించాలంటూ కొండంత రాగం తీసి హడావుడి చేసిన మన పాలకులు తిరిగి చైనా వస్తువుల దిగుమతులను పెంచారు.


మన దేశంలో చైనా అంటే అభిమానం లేని వారు కూడా దానితో వైరం తెచ్చుకొని సాధించేదేమిటి అన్న ప్రశ్నను ఇప్పుడు ముందుకు తెస్తున్నారు. మనతో సహా అమెరికా నాయకత్వంలోని దేశాలు చైనాను ఒంటరి పాటు చేయాలని చూస్తున్నాయి. చైనాను దెబ్బతీయటం అంటే తమను తాము నాశనం చేసుకోవటం అనే అంశాన్ని అవి మరచిపోతున్నాయి. నూటనలభై కోట్ల మంది జనాభా ఉన్న చైనా ప్రపంచ ఫ్యాక్టరీగా ఉండటమే కాదు, వినియోగ మార్కెట్‌ అని మరచి పోరాదు. ఎవరి సంగతి వారు చూసుకుంటున్న ఈ తరుణంలో చైనాతో ఆసియన్‌ దేశాల కూటమి వాణిజ్యం 732 బిలియన్‌ డాలర్లకు పెరిగింది.అమెరికా, ఐరోపాయూనియన్‌, జపాన్‌ వంటి దేశాలు చైనాతో జరుపుతున్న ఎగుమతి దిగుమతుల విలువ 1,600 బిలియన్‌ డాలర్లు. చైనా ప్రారంభించిన బిఆర్‌ఐ పధకానికి చైనా ప్రభుత్వం లక్ష కోట్ల డాలర్లను సమకూర్చగలదని వార్తలు వచ్చాయి. తానే స్వయంగా వాగ్దానం చేసినట్లుగా జనానికి వాక్సిన్లు వేయించకుండా భారాన్ని రాష్ట్రాల మీద నెట్టేందుకు ప్రయత్నించిన మన కేంద్ర ప్రభుత్వం నుంచి అంత మొత్తంలో విదేశాల్లో పెట్టుబడులను పెడుతుందని ఎవరైనా ఆశించగలరా ? దానితో పోటీగా మనమూ తయారైతే తప్ప కమ్యూనిస్టు వ్యతిరేకత పేరుతో అవి మనతో కలసి వస్తాయా ? మనలను నమ్ముకొని మిగతా దేశాలు చైనాకు వ్యతిరేకంగా జట్టుకడతాయా ?

పగలంతా ఎక్కడెక్కడో తిరిగిన సన్యాసులు రాత్రికి మఠానికి చేరి గంజాయి దమ్ము కొట్టి తెల్లవారిన తరువాత అది చేయాలి ఇది చేయాలని ప్రగల్భాలు పలికి తెల్లవారేసరికి మత్తు దిగి ఎవరి కర్రా బుర్రా వారు తీసుకొని ఎవరిదారిన వారు పోయినట్లు ఇప్పటికి 47 సార్లు జి7 దేశాల సమావేశాల కబుర్లున్నాయి తప్ప ఎవరికైనా విశ్వాసం కలిగించాయా ? గాల్వన్‌ లోయ ఉదంతాల సమయంలో మన ప్రధాని నరేంద్రమోడీ అఖిలపక్ష సమావేశంలో చెప్పిందేమిటి ? చైనీయులు మన సరిహద్దుల్లోకి చొరబడిందీ లేదు, మన పోస్టులను తమతో తీసుకుపోయిందీ లేదు అన్నారు. అలాంటపుడు చైనాతో ఏ సమస్య మీద పోరాడుతారు ? చతుష్టయం పేరుతో శతృత్వం పెంచుకోవటం తప్ప సాధించేదేమిటి ? మనకంటే ఎంతో బలమైన చైనా సరిహద్దుల్లో సైన్యాన్ని మోహరించగలిగిన ఆర్ధిక వనరులను కలిగి ఉంది. మన పరిస్ధితి ఏమిటి ? కమ్యూనిస్టు వ్యతిరేకతను రెచ్చగొట్టటం ఎందుకు ? దాన్ని సంతుష్టీకరించేందుకు చైనాతో వైరం ఎందుకు, సైన్య మోహరింపు ఎవరికోసం, ఆ ఖర్చును జనం మీద మోపటం ఎందుకు ? గతంలో సోవియట్‌ యూనియన్‌, తూర్పు ఐరోపా దేశాలతో పోరాడి అక్కడి వ్యవస్ధలను కూల్చివేసిన అమెరికా కొన్ని దేశాల మార్కెట్లను ఆక్రమించుకుంది. అయినా దాని ఆర్ధిక సమస్యలు తీరలేదు. 2008లో దానితో సహా తూర్పు ఐరోపాను పంచుకున్న ధనికదేశాలన్నీ ఆర్ధిక సంక్షోభానికి గురయ్యాయి. ఇప్పుడు చతుష్టయం పేరుతో చైనాను ఢకొీని దాని మార్కెట్‌ను ఆక్రమించుకోవటం సాధ్యమయ్యేనా. ఒకవేళ జరిగినా ఆమెరికా మిగతాదేశాలకు వాటా ఇస్తుందా ? ఎవరిపని వారు చేసుకోకుండా మనకెందుకీ ఆయాసం !