Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు


కేరళలో సిపిఎం నాయకత్వంలోని ఎల్‌డిఎఫ్‌ కూటమి ప్రభుత్వం అనేక అంశాలలో ముఖ్యంగా కరోనా నిరోధంలో చేస్తున్న కృషికి ప్రశంసలు వస్తున్న సంగతి తెలిసిందే. రెండవ తరంగంలో అక్కడ పెద్ద ఎత్తున కేసులు పెరిగిన నేపధ్యంలో సామాజిక మాధ్యమాల్లో సంఘపరివార్‌ మరుగుజ్జులు రెచ్చిపోయారు. కేరళ ఆదర్శం అన్నారు, కేసులు ఎందుకు పెరిగాయంటూ తమదైన పద్దతిలో ప్రచార దాడి చేశారు. దానికి కొందరు బలైపోయి ఉంటారు. అక్కడి ప్రభుత్వం పట్ల సానుకూలంగా వ్యవహరించే వారిలో కూడా ఎందుకిలా పెరుగుతున్నాయనే ఆందోళన వ్యక్తమైన మాట నిజం. శత్రువులు ఎలా చూసినా మిత్రులు ఎలా ఆవేదన చెందినప్పటికీ కేరళ జనం వాటిని పట్టించుకోలేదు. పాలకులు, ప్రభుత్వ చిత్తశుద్దిని విశ్వసించి చరిత్రను తిరగరాస్తూ రెండో సారి అధికారాన్ని కట్టబెట్టారన్నది తెలిసిందే. ఆ రాష్ట్రముఖ్యమంత్రి పినరయి విజయన్‌ కరోనా గురించి విలేకర్లతో మాట్లాడినన్ని రోజులు, నిర్వహించిన పత్రికా సమావేశాలు దేశంలో మరొకరెవరూ చేయలేదు. దేన్నీ దాచుకోలేదు,కేసులు ఎలా పెరగబోయేదీ ఆయనే చెప్పారు.


అన్నింటికంటే ముఖ్యవిషయం ఏమంటే దేశంలో మిగతా రాష్ట్రాలలో మాదిరి కరోనా మరణాలను, కేసులను కేరళ ప్రభుత్వం మూసిపెట్టలేదు. అలాచేసిన రాష్ట్రాలలో పరిస్ధితి ఎలా పాచిపోయిందో చూస్తున్నాము. సమాచార హక్కు కింద హిందూ పత్రిక సేకరించిన అధికారిక వివరాలు మరణాలను తక్కువ చేసి చూపిన రాష్ట్రాల బండారాన్ని బయటపెట్టాయి. కేరళ గురించి కూడా ఆ పత్రిక రాసిన విశ్లేషణ మరోసారి పినరయి ప్రభుత్వ నిజాయితీని నిర్ధారించింది. ఎక్కడైనా సాధారణ మరణాల రేటుకు ఒక ఏడాది ఒకటో రెండు శాతాలో ఎక్కువో తక్కువ ఉండవచ్చు. కరోనా మహమ్మారి కారణంగా జరిగిన మరణాలు అధికారిక లెక్కలకు ఎక్కినా వాటిని కరోనా ఖాతాలో చూపలేదన్నదే అసలు సమస్య. తెలంగాణా వంటి చోట్ల అలాంటివి పది రెట్లు ఎక్కువగా ఉన్నాయి. అయితే కేరళలో నూటికి నూరుశాతం మరణాలు నమోదవుతున్నాయా అంటే లాక్‌డౌన్‌,తదితర అనేక కారణాలతో సహజమరణాలు కూడా కొన్ని సకాలంలో నమోదు కావటం లేదనే అభిప్రాయం ఉంది.
కేరళ విషయానికి వస్తే ఏటా నమోదౌతున్న సాధారణ మరణాల కంటే కరోనా సమయంలో మరణాల సంఖ్య తగ్గింది.

రాజధాని తిరువనంతపురంలో 2020 ఏప్రిల్‌ నుంచి 2021 మేనెల వరకు కరోనా మరణాలు 765 కాగా ఇదే కాలంలో సాధారణ మరణాలతో సహా మొత్తం మీద 646 తగ్గాయి. 2015 నుంచి 2019 వరకు సగటున ఏటా నగరంలో మరణాలు 16,652 కాగా 2020లో కరోనా ఉన్నప్పటికీ 14,734 మాత్రమే నమోదయ్యాయి. కరోనాను పక్కన పెట్టి మరణాల పెరుగుదల రేటును పరిగణనలోకి తీసుకున్నప్పటికీ 18,340 వరకు పెరగాల్సింది, తగ్గాయి. ఒక్క రాజధాని నగరమే కాదు, మొత్తం రాష్ట్రంలో 2019తో పోల్చితే 2020లో 11.1శాతం తగ్గాయి. అయితే తాజా వివరాల ప్రకారం ఆ తగ్గుదల 7.9శాతంగా ఉంది. అంటే ఈ ఏడాది మరణాలు కొద్దిగా పెరిగాయి. అవి కరోనా మరణాలన్నది అధికారిక అంకెలే చెబుతున్నాయి. కేరళ మరణాల నమోదు నిబంధనల ప్రకారం మరణించిన 21 రోజుల్లోపల స్ధానిక సంస్ధలలో నమోదు చేసుకోవాలి. లేనట్లయితే ఆ ప్రక్రియ సంక్లిష్టం అవుతుంది. అందువలన ఆస్ధి, ఇతర వివాదాలు లేని మరణాలు నమోదు కాకపోవచ్చు. 2020లో లాక్‌డౌన్‌ కారణంగా సకాలంలో నమోదు ప్రక్రియ ఉండే శ్మశానాలలో తప్ప బయటివి నమోదు కానందున అధికారికంగా మరణాలు తగ్గినట్లు కనిపించవచ్చన్నది కూడా కొందరి అభిప్రాయం. దానిలో వాస్తవం కూడా ఉండవచ్చు.


కేరళలో మరణాల రేటు తగ్గటం అనేది ఇప్పుడే జరిగింది కాదు. గతంలో కూడా అలాంటి ధోరణి వ్యక్తమైంది. 2013లో రాష్ట్రంలో 2,53లక్షలు నమోదు కాగా 2014లో 12,621, 2015లో 3,920 తక్కువగా నమోదయ్యాయి. దీనికి రాష్ట్రంలో ఆరోగ్య సూచికల మెరుగుదల వలన సగటు జీవిత కాలం ఏడాదికేడాది పెరుగుతున్నది.అందువలన మరణాలు తగ్గుతాయి. 2021 జనవరి నుంచి మేనెలాఖరు వరకు పౌర నమోదు వ్యవస్ధ(సిఆర్‌ఎస్‌)లో ఉన్న సమాచారం మేరకు మొత్తం మరణాలు 1,13,372గా ఉన్నాయి. ఒక సంస్ధ చేసిన విశ్లేషణ ప్రకారం 2015 నుంచి 2019వరకు ఉన్న వివరాల ప్రకారం ప్రతి ఏటా జనవరి-మే మాసాల మధ్య మరణించిన సగటు సంఖ్య 98,387. దీని ప్రాతిపదికన చూస్తే ఈ ఏడాది ఐదు నెలల్లో నమోదైన అధిక మరణాలు 14,535 అని, ఇదే సమయంలో ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన కరోనా మరణాలు 6,700గా ఉన్నందున 8,867 నమోదు గాని కరోనా మరణాలు అని, అయితే అవి ఇతర రాష్ట్రాలతో పోల్చితే చాలా తక్కువ అని సదరు సంస్ధ పేర్కొన్నది. పైన పేర్కొన్న సంవత్సరాలలో మేనెల సగటు మరణాలు 19,600 అని ఈ ఏడాది మేనెలలో 28వేలుగా ఉన్నాయని వ్యాఖ్యానించింది.కేంద్ర ప్రభుత్వ సిఆర్‌ఎస్‌ సమాచారం ప్రకారం 2015-19 సంవత్సరాల మధ్య సగటు మరణాలు 1,08,425 మాత్రమే. దీని ప్రకారం చూస్తే అదనపు మరణాలు 4,950 మాత్రమే.

వివిధ మీడియా సంస్ధల విశ్లేషణ ప్రకారం కర్ణాటకలో 2021 జనవరి – జూన్‌ 15వ తేదీ మధ్య 1.02లక్షల మరణాలు నమోదయ్యాయి. అవి అధికారిక లెక్కల కంటే ఐదు రెట్లు ఎక్కువ. ఆంధ్రప్రదేశ్‌లో జనవరి-మే మాసాల మధ్య 1.3లక్షలు నమోదు కాగా అవి అధికారికంగా ప్రకటించిన వాటి కంటే 34 రెట్లు ఎక్కువ. తమిళనాడులో 1.29లక్షలు అదనం, అధికారిక లెక్కల కంటే 7.5 రెట్లు అదనం, తెలంగాణాలోని హైదరాబాదులో అధికంగా నమోదైనవి 14,332. కేరళలో అనేక మంది మరణించిన కుటుంబ సభ్యులను గృహ ప్రాంగణాలలోనే సమాధి చేస్తారని, అలాంటి వారు నమోదు చేయటం, ధృవీకరణ పత్రాలు తీసుకోవటం గానీ చేయరని, 2020లో లాక్‌డౌన్‌ కారణంగా నమోదు గణనీయంగా తగ్గి ఉండవచ్చన్నది ఒక అభిప్రాయం. 2018లో సాధారణ పరిస్ధితిలోనే సకాలంలో మరణ నమోదుశాతం 62శాతమే ఉంది.

రాజధానుల వివరాలను మాత్రమే చూస్తే కర్ణాటక రాజధాని బెంగళూరులో ప్రభుత్వం ప్రకటించిన కరోనా మరణాలు 13,346 కాగా అక్కడ సాధారణం కంటే ఎక్కువగా నమోదైనవి 31,029 ఉన్నాయి. అలాగే చెన్నయిలో 7,091కిగాను 29,910 ఉన్నాయి. హైదరాబాదులో సాధారణం కంటే 32,751 ఎక్కువ ఉన్నాయి. పైన చెప్పుకున్నట్లుగా తిరువనంతపురంలో 765 కరోనా మరణాలు ఉన్నా మొత్తంగా 645 తగ్గాయి. ఈ ఏడాది జనవరి నుంచి కరోనా మరణాలు గణనీయంగా పెరిగినట్లు కార్పొరేషన్‌ వివరాలు వెల్లడించాయి. వీటిలో పొరుగునే ఉన్న గ్రామాలు, కొల్లం జిల్లా, తమిళనాడు నుంచి చికిత్సకోసం వచ్చి మరణించిన వారు కూడా ఉన్నారు. అలాంటి ఉదంతాలు మిగతా రాష్ట్రాలలో కూడా ఉండవచ్చు.


సహజమరణాలు తగ్గటానికి జనాలు ఇండ్లకే పరిమితం కావటంతో రోడ్డు ప్రమాదాలు, మరణాలు తగ్గటం, న్యుమోనియా, ఫ్లూ, నీరు, బయటి ఆహార సంబంధ వ్యాధులు పరిమితం కావటం దోహదం చేశాయని భావిస్తున్నారు. అన్నింటి కంటే వెంటనే స్పందించే ప్రజారోగ్య సౌకర్యాలు, ప్రభుత్వ ఆసుపత్రుల వ్యవస్ధ, వాటిని పని చేయించే, పట్టించుకొనే రాజకీయ నాయకత్వం ప్రధాన కారణం. అక్షరాస్యత, విద్యావంతులు ఎక్కువగా ఉండటం వెంటనే స్పందించటం, పరీక్షలు, గుర్తించటం కూడా మిగతా చోట్లతో పోలిస్తే ఎక్కువే.కరోనా కారణంగా కేరళలో రోడ్డు ప్రమాద మరణాలు గణనీయంగా తగ్గాయి. మిగతా రాష్ట్రాలలో కూడా అదే జరిగి ఉండవచ్చు.2016-19 సంవత్సరాల మధ్య ఏడాదికి సగటున 4,290 మంది మరణించగా 2020లో 2,979, ఈ ఏడాది జూన్‌ 21వరకు 1,423 నమోదయ్యాయి.


అనేక రాష్ట్రాలలో జరుగుతున్న మాదిరే కేరళలో కూడా కొన్ని తేడాలు ఉండవచ్చు. ఉదాహరణకు కరోనా వచ్చి తగ్గిపోయిన తరువాత ఇతర కారణాలతో మరణిస్తే లేదా కరోనా లక్షణాలు లేనందున గుర్తించటంలో పొరపాటు గావచ్చు, మరణించిన తరువాత కరోనా అని తేలితే దాన్ని ఏ తరగతి కింద నమోదు చేయాలి అన్నది అందరికీ అవగాహన కూడా లేకపోవచ్చు. ఇటీవల సుప్రీం కోర్టు కరోనా మరణ ధృవీకరణ పత్రాల జారీని సులభతరం చేయాలని సూచించింది. ఆమేరకు అనేక రాష్ట్రాలలో కరోనా మరణాల సంఖ్యలను సవరిస్తున్నారు. కేరళలో కూడా అదే జరగవచ్చు, అయితే కేసులు స్వల్పంగా పెరుగుతాయి తప్ప మిగతా రాష్ట్రాలలో మాదిరి అసాధారణంగా ఉండవు. కేసులు, మరణాలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలతో పోల్చితే వాటిని దాచని రాష్ట్రం కేరళ ఒక్కటే అన్నది స్పష్టం.

కరోనా మరణాల విషయానికి వస్తే ప్రస్తుతం దేశంలో 1.3శాతం ఉండగా కేరళలో అది 0.44శాతమే ఉంది. దేశంలో వాస్తవ మరణాలను లెక్కిస్తే దేశ సగటు గణనీయంగా పెరుగుతుంది.కేరళలో తొలి దశలో కేసులు, మరణాలు తక్కువగా ఉన్నప్పటికీ రెండవ దశలో ఎక్కువగా ఎందుకు పెరిగాయన్నది పరిశీలించాల్సిన అంశం అయితే, దేశంతో పోల్చినపుడు మరణాలు తక్కువగా ఉండటం గమనించాల్సిన అంశం. తొలి దశలో మాదిరే రెండవ దశలో కూడా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కేసులు పెరిగాయి. ఆ దామాషాలో మరణాలు పెరగలేదు. రెండవ దశలో వేగంగా విస్తరించే డెల్టా రకం వైరస్‌ వ్యాప్తి ఒక కారణం అని కొందరు నిపుణులు చెబుతున్నారు. మరణాలు ఎక్కువగా ఉండటానికి ఆరోగ్య వ్యవస్ధ మీద వత్తిడి పెరగటం అన్నవారు కొందరు. కేవలం నలభై రోజుల్లోనే రెండవ దశలో మరణాలు గణనీయంగా ఉన్నాయి. ఇతర ఆరోగ్య సమస్యలతో ఇండ్ల దగ్గరే మరణించిన వారి వివరాలు కొన్ని ప్రభుత్వ వ్యవస్ధలో ఇంకా చేరాల్సి ఉండవచ్చని, అయినప్పటికీ సగటు, వాస్తవ మరణాల మధ్య తేడా తగ్గుతుందే తప్ప పెరిగే అవకాశం లేదన్నది కొందరి అభిప్రాయం. మిగతా రాష్ట్రాలలో మాదిరి కేరళ ప్రభుత్వం కూడా వివరాలను మూసి పెట్టి ఉంటే అక్కడి ప్రభుత్వాన్ని నిరంతరం స్కాన్‌ చేసి చూసే మీడియా ఈ పాటికి రచ్చ రచ్చచేసి ఉండేది. దేశంలో మిగతా రాష్ట్రాలతో పోల్చి కేరళలో కూడా వాస్తవ మరణాలు ఎక్కువ ఉండవచ్చని అమెరికా సంస్ద చేసిన విశ్లేషణను అక్కడి పత్రికలు ప్రకటించాయి తప్ప స్వంత కథనాలు లేవు.


కరోనా అనాధలకు ప్రభుత్వ ఆదరణ !


కరోనా కారణంగా తలిదండ్రులిద్దరినీ కోల్పోయి అనాధలైన పిల్లలను ఆదుకొనేందుకు కేరళ ప్రభుత్వం మూడు రకాలుగా ఆదుకోవాలని నిర్ణయించింది. ప్రతి ఒక్కరి పేరు మీద మూడు లక్షల రూపాయల ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేస్తారు. డిగ్రీ వరకు చదువుకు అయ్యే ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుంది. అప్పటి వరకు నెలకు రెండు వేల రూపాయల చొప్పున గుర్తింపు పొందిన సంరక్షకులు-పిల్లల సంయుక్త బ్యాంకు ఖాతాలో జమ చేస్తారని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జి చెప్పారు. ఈ వివరాలను ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలియచేసింది. కరోనాతో నిమిత్తం లేకుండా తలిదండ్రులలో ఒకరు మరణించినా, కరోనాతో మరొకరు మరణించి అనాధలైన పిల్లలకు కూడా ఈ పధకం వర్తిస్తుంది. ప్రస్తుతం ఇద్దరూ మరణించిన పిల్లలు 74 మంది ఉండగా, ఎవరో ఒకరు మరణించిన వారు వెయ్యి మంది ఉన్నారు.


కన్నూరులో సిపిఎం వినూత్న ప్రచార కార్యక్రమం !


కన్నూరు జిల్లాలో సిపిఎం వినూత్న కార్యక్రమం చేపట్టింది.” కొటేషన్‌ మాఫియా ”, సామాజిక రుగ్మతలకు వ్యతిరేకంగా జూలై ఐదున 3801 కేంద్రాలలో సాయంత్రం ఐదు గంటలకు పెద్ద ప్రచార కార్యక్రమం నిర్వహించనున్నట్లు పార్టీ జిల్లా కార్యదర్శి ఎంవి జయరాజన్‌ ప్రకటించారు. కేరళకు చెందిన వారు గల్ఫ్‌, ఇతర దేశాలలో ఉపాధి కోసం వెళ్లే వారు పెద్ద సంఖ్యలో ఉన్న విషయం తెలిసిందే. వారు తాము మిగుల్చుకున్న పొదుపుతో బంగారం, హవాలా పద్దతిలో నల్లధనాన్ని కేరళకు తీసుకువస్తారు. అలాంటి వాటిని విదేశాల నుంచి పంపి విమానాశ్రయాలు, ఇతర చోట్ల నుంచి తీసుకొని సంబంధిత వ్యక్తులకు చేర్చేందుకు ప్రయివేటు వారిని వినియోగించుకుంటారు. వీరినే కొటేషన్‌ గ్యాంగ్‌ అంటారు. ఇవి లెక్కల్లో చూపనివి కనుక అంతా నమ్మకం, రహస్య పద్దతుల్లో జరుగుతుంది. ఈ బలహీనతలను సొమ్ము చేసుకొనేందుకు ఇవే కొటేషన్‌ గ్యాంగులు ప్రయత్నిస్తాయి. ఉదాహరణకు ఒక కొటేషన్‌ గ్యాంగ్‌ మనుషులు బంగారం, డబ్బు తీసుకు వస్తున్న విషయాన్ని మరో గ్యాంగు పసికట్టిందనుకోండి. దారి మధ్యలో మొదటి గ్యాంగు నుంచి వాటిని కొట్టివేస్తారు. ఇలాంటి వారు నేరగాండ్లుగా, ముఠానేతలుగా మారి పెద్ద ఎత్తున సంపాదించి ఆస్తులు సమకూర్చుకున్నవారున్నారు. బాధితులు ఆ విషయాన్ని బయటకు చెప్పుకోలేరు. ఈ వ్యవహారాల్లో ముఠాల మధ్య వివాదాలు చెలరేగి హింసాత్మక చర్యలకు పాల్పడటం, కొందరు మధ్యవర్తులుగా రంగంలోకి దిగటం, దుండగులు రాజకీయ పార్టీలను ఆశ్రయించటం పరిపాటిగా మారింంది.


అసెంబ్లీ ఎన్నికల సమయంలో బిజెపి నేతలు పెద్ద ఎత్తున కర్ణాటక, ఇతర ప్రాంతాల నుంచి తెచ్చిన కోట్ల రూపాయలు ఈ మార్గాన ఇలాంటి కొటేషన్‌ గ్యాంగుల ద్వారా తెచ్చినవే. రాష్ట్రబిజెపి నేతలు గిలగిల్లాడిపోతున్న కొడక్కర హవాలా సొమ్ము దోపిడీ ఉదంతం దీనిలో భాగమే. ఒక ముఠా తెస్తున్న సొమ్మును మధ్యలో ఒక ముఠా అడ్డగించి సొమ్మును అపహరించింది. మూడున్నర కోట్ల రూపాయల వరకు పోగొట్టుకున్నవారు కేవలం ఇరవై అయిదు లక్షల రూపాయల దోపిడీ జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ కేసు తీగలాగటంతో డొంకంతా కదిలి ఇంకా పెద్ద మొత్తంలోనే చేతులు మారినట్లు, ఎన్నికల్లో ఖర్చు చేసినట్లు బయటపడుతోంది. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడి మీదే ఈ సంబంధిత కేసు నమోదైంది. అనేక మంది యువకులు ఇలాంటి ముఠాల్లో చేరి నేరపూరిత చర్యల ద్వారా సులభంగా డబ్బు సంపాదించి తెల్లవారే సరికి పెద్దవారై పోవాలని చూస్తున్నారు. అందువలన తలిదండ్రులు తమ బిడ్డలు ఏమి చేస్తున్నారు, నేరగాండ్ల చేతుల్లో చిక్కుతున్నారా, విలాస వంతమైన జీవితం లేదా విచ్చల విడిగా ఖర్చు చేస్తుంటే వారికి ఆ సొమ్ము ఎలా వస్తున్నదీ చూసుకోవాల్సిన, జాగ్రత్త పడాల్సిన అవసరాన్ని వివరిస్తూ సిపిఎం జిల్లాలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమం నిర్వహించనుంది. కొటేషన్‌ మాఫియా నిర్వాహకులు సమాజంలో గౌరవనీయ వ్యక్తులుగా కనిపించేందుకు ప్రయత్నిస్తూ తమ లావాదేవీలను పెంచుకొనేందుకు కుటుంబాలతో సంబంధాలను పెట్టుకుంటారు. వివాహాల వంటి సామాజిక, కుటుంబ కార్యక్రమాలకు, ధార్మిక కార్యక్రమాల్లో భాగస్వాములౌతారు. వాటి మాటున తమ నేరాలను కప్పి పుచ్చుకొనేందుకు ప్రయత్నిస్తున్నారని ఇలాంటి వారందరినీ సమాజం నుంచి వేరు చేయాలని సిపిఎం కోరింది.


మహిళా కమిషన్‌ అధ్యక్షురాలి రాజీనామా !


కేరళ మహిళా కమిషన్‌ అధ్యక్షురాలు ఎంసి జోసఫిన్‌ రాజీనామా చేశారు. ఒక న్యూస్‌ ఛానల్‌ నిర్వహించిన ప్రత్యక్ష ప్రసారంలో అత్తింటి వేధింపులకు గురైన ఒక యువతి చేసిన ఫిర్యాదు సందర్భంగా స్పందించిన తీరు రాష్ట్రంలో తీవ్ర విమర్శలు, నిరసనలకు గురైంది. వేధింపుల గురించి పోలీసులకు ఫిర్యాదు చేశావా అని జోసఫిన్‌ అడిగినపుడు లేదు అని యువతి సమాధానం చెప్పింది. అయితే అనుభవించు అని జోసఫిన్‌ చేసిన వ్యాఖ్య వివాదాస్పదమైంది. ఒక తల్లి మాదిరి అలా అన్నానే తప్ప మరొక విధంగా కాదని, తన వ్యాఖ్యకు విచారిస్తున్నానని ఆమె ప్రకటించారు. అయినా నిరసనలు ఆగలేదు, ఈ లోగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గం ఈ అంశాన్ని చర్చించి పదవికి రాజీనామా చేయాలని ఆదేశించటంతో శుక్రవారం నాడు ఆ మేరకు ప్రకటన చేశారు. జోసఫిన్‌ సిపిఎం కేంద్ర కమిటీ సభ్యురాలిగా ఉన్నారు. రాష్ట్రంలో చాలా కాలం తరువాత వరకట్న వేధింపులకు విస్మయి అనే యువతి బలైన ఉదంతం ఇదే సమయంలో రాష్ట్రంలో తీవ్ర సంచలనం కలిగించి, నిరసనలు వెల్లడవుతున్న సమయంలో ఆమె చేసిన వ్యాఖ్య సామాజిక మాధ్యమం, రాజకీయ, మహిళా సంఘాల నుంచి తీవ్ర విమర్శలకు గురైంది.