మన చుట్టూ జరుగుతున్నదేమిటి -6
ఎం కోటేశ్వరరావు
జర్మనీ, ఫ్రాన్స్తో కలసి ఆఫ్రికా అభివృద్దికి పనిచేసేందుకు చైనా సిద్దంగా ఉందని చైనా అధినేత గ్జీ జింపింగ్ ప్రతిపాదించినట్లు జపాన్ వార్తా సంస్ధ పేర్కొన్నది.చైనాకు వ్యతిరేకంగా సమీకృతం అవుతున్న అమెరికా నాయకత్వంలోని చతుష్టయ కూటమి సమావేశాలు అక్టోబరులో జరగనున్నట్లు వార్త. ఒక వైపు అమెరికా దూకుడును అడ్డుకొనేందుకు చైనా కూడా పావులు కదుపుతున్నట్లు ఈ పరిణామం వెల్లడిస్తున్నది. జర్మనీ, ఫ్రాన్స్ గతంలో ఆఫ్రికాలోని కొన్ని దేశాలను వలసలుగా చేసుకున్న విషయం తెలిసిందే. గ్జీ చేసిన ప్రతిపాదన మీద రెండు దేశాల నుంచి స్పందన వెలువడలేదు. అయితే ఫ్రెంచి అధ్యక్ష భవనం చేసిన ప్రకటనలో చతుష్టయ ప్రతిపాదనను ప్రస్తావించనప్పటికీ అవసరమైన దేశాలకు రుణాల పునర్వ్యవస్తీకరణ చేసేందుకు చైనా ముందుకు రావటాన్ని ఫ్రాన్స్,జర్మనీ ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు.బ్రిటన్లో జరిగిన బి3డబ్ల్యు ప్రకటన తరువాత చైనా వైపు నుంచి ఈ ప్రతిపాదన వెలువడింది.
అమెరికా నాయకత్వంలోని చతుష్టయ కూటమి, ఐరోపా యూనియన్ ఇంకా కలసి వచ్చే దేశాలతో చైనాను దెబ్బతీయాలన్న ఆలోచన బహిరంగంగానే సాగుతోంది. ఎవరూ దాచుకోవటం లేదు. కానీ అదే అమెరికా మాటను మనం మాత్రం అది గీసిన గీతను జవదాటకుండా ఆర్సిఇపికి దూరంగా ఉన్నాము. జపాన్,ఆస్ట్రేలియా దేశాలు ఖాతరు చేయలేదు, తోటి సభ్యురాలైన మన దేశానికి విలువ ఇవ్వలేదు. చైనా భాగస్వామిగా ఉన్న ఆర్సిఇపి(ప్రాంతీయ సమగ్ర ఆర్ధిక భాగస్వామ్యం)కూటమిలో చేరాయి. మనం చెబుతున్న ఇండో-పసిఫిక్ మరియు మన దేశ ఈశాన్య ప్రాంత అభివృద్దికి వాటి చర్య విఘాతం కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అయినా కేంద్ర ప్రభుత్వం అమెరికా మోజుల్లో ఖాతరు చేయటం లేదు. ఒకవైపు అమెరికాతో కలసి చైనాకు వ్యతిరేకంగా మిలిటరీ ప్రతిఘటనకు ఆ రెండు దేశాలు సిద్దం అంటున్నాయి, మరోవైపు చైనాతో కలసి వ్యాపారాన్ని చేస్తామని చెబుతున్నాయి. ఒకేసారి ఇది ఎలా సాధ్యం ? మనమేమో చైనాతో వ్యాపారం చేయం, దాని సంగతి చూస్తామన్నట్లుగా మాట్లాడుతున్నాం. ఇది జరిగేదేనా ? అమెరికా తోక పట్టుకొని గంగానదిని ఈదగలమా ? అమెరికాను నమ్మి ఆర్సిఇపికి దూరంగా ఉన్నాం. పోనీ దానికి బదులు ప్రపంచ వాణిజ్య సంస్ధలో మనకు వ్యతిరేకంగా అమెరికా వేసిన కేసులు తప్ప ఇతర ” ప్రయోజనాలేమైనా ” పొందామా ? గతంలో మనకు ఇచ్చిన రాయితీలను కూడా రద్దు చేశారు. ఒకవైపు స్వేచ్చా వాణిజ్యం గురించి నరేంద్రమోడీ చెబుతారు. మరోవైపు ప్రపంచంలో అతి పెద్ద స్వేేచ్చావాణిజ్య కూటమి ప్రపంచ జిడిపిలో 30,జనాభాలో 30శాతం కలిగిన దేశాలకు మనం దూరం అంటారు. ఆ కూటమిలో చేరితే మనకు దెబ్బ అన్న పెద్దలు దాని బదులు సాధించిందేమిటి ?
చైనా ఉన్న కూటమిలో చేరితే దాని వస్తువులను మనం కొనాల్సి ఉంటుంది అంటారు. నిజమే, ఇప్పుడు కొనటం లేదా ? కరోనాకు ముందు 2019-20లో మన దేశ మొత్తం వాణిజ్య లోటు 161 బిలియన్ డాలర్లు, కరోనా కారణంగా మరుసటి ఏడాది 98బి.డాలర్లకు తగ్గిందనుకోండి. ఈలోటులో చైనా వాటా 55-60 బి.డాలర్ల మధ్య ఉంటోంది. మరి మిగతా లోటు సంగతి ఏమిటి ? మన పరిశ్రమలు, వ్యవసాయానికి రక్షణ కల్పించాల్సిందే. ఇక్కడ గమనించాల్సిందేమంటే ఏడు సంవత్సరాల నుంచి మేకిన్ ఇండియా పేరుతో మన దేశాన్ని కూడా చైనాకు పోటీగా ప్రపంచ ఫ్యాక్టరీగా తయారు చేయాలని నరేంద్రమోడీ పిలుపు నిచ్చారు. ఇప్పుడు చైనాతో పోటీ పడేందుకు భయపడుతున్నామంటే వైఫల్యాన్ని అంగీకరించినట్లే కదా ?సమీప భవిష్యత్లో కూడా చైనాతో పోటీపడలేమని చెప్పినట్లే కదా ? మన దేశ వస్తూత్పత్తికి అవసరమైన యంత్రాలను కూడా మనం చైనా నుంచి దిగుమతి చేసుకోకుండా గడవని స్ధితి.
ఆర్సిఇపి ఒప్పందానికి అమెరికా దూరంగా ఉంది. దాని అనుయాయి దేశాలు కూడా ఇప్పుడు చైనాకు దగ్గర అవుతున్నాయని వాయిస్ ఆఫ్ అమెరికాయే విశ్లేషణలో వాపోయింది. మన కోడి కూయకపోతే తెల్లవారదు అనుకున్న అమెరిన్లకు జ్ఞానోదయం అవుతున్నట్లా ? పదిహేను దేశాల ఈ కూటమి ఒప్పందం అమలుకు ఇప్పటికే చైనా, జపాన్ ఆమోదం తెలిపాయి.మరో నాలుగు ఆసియన్, ఒక ఆసియనేతర దేశ చట్టసభలు ఆమోదిస్తే అది అమల్లోకి వస్తుంది. ఒకసారి అంగీకరించిన తరువాత వెనుకో ముందో అది జరుగుతుంది. లేదూ అమెరికా అడ్డుపడితే ఏమి జరుగుతుందో చూడాల్సి ఉంది. ఆర్సిఇపికి పోటీగా లేదా ప్రత్యామ్నాయంగా చైనా లేకుండా పసిఫిక్ దేశాల భాగస్వామ్య ఒప్పందం(టిపిపి) చేసుకోవాలంటూ చర్చలు ప్రారంభించిన అమెరికాయే దాన్నుంచి వైదొలిగింది. దాంతో ఆర్సిఇపి ముందుకు సాగింది. దాని అనుయాయి దేశాల్లో విశ్వాసం సన్నగిల్లింది. ఆర్సిఇపిలో చైనా ప్రభావం ఎక్కువగా ఉంటుందని అనవసరంగా అమెరికా భయపడిందనే అభిప్రాయం ఇప్పుడు కొంత మంది అమెరికన్లలోనే వెల్లడి అవుతోంది.తమ దేశంలో టిపిపికి పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తం కాగా ఆర్సిఇపిని ఎవరూ వ్యతిరేకించలేదని న్యూజిలాండర్స్ చెప్పారు. అమెరికా తమకు ముఖ్యమైన వ్యూహాత్మక భాగస్వామి అయినప్పటికీ ప్రపంచంలో ఉన్నాం గనుక ఆర్సిఇపిలో చేరటం తమకు ముఖ్యమని ఆస్ట్రేలియన్ ఎంపీ చెప్పాడు.
అంతర్జాతీయ వాణిజ్యంలో భారత నష్టాలు చైనాకు లాభాలుగా మారుతున్నాయని మన దేశానికి చెందిన విశ్లేషకులు కొందరు చెబుతున్నారు.మనకు చిరకాలంగా మిత్ర దేశంగా ఉన్న ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు చైనాకు దగ్గర అవుతోంది. చైనా కమ్యూనిస్టు పార్టీ నూరు సంవత్సరాల ఉత్సవం సందర్భంగా శ్రీలంక ప్రభుత్వం చైనా మీద రెండు నాణాలను విడుదల చేసింది. మరి మోడీ గారు ఏమి చేస్తున్నట్లు ? ఇరాన్ మరింత స్పష్టమైన ఉదాహరణ. మన రూపాయిని ప్రపంచంలో స్వీకరించే వేళ్ల మీద లెక్కించే దేశాలలో ఇరాన్ ఒకటి. అమెరికా బెదిరింపులకు లొంగి మనం దాన్నుంచి చమురు కొనుగోలు చేయటం మాని అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్నాము. దాంతో ఇరాన్ సహజంగానే చైనాకు మరింత దగ్గరైంది. చాబహార్ రేవు అభివృద్ది పధకాన్ని మనం కోల్పోయాము, చైనా చేపట్టింది. రష్యా-అమెరికా మధ్య వివాదం ముదురుతుండటంతో రష్యన్లు చైనాకు దగ్గర అవుతున్నారు. భారత ఉపఖండ దేశాల మీద దీని ప్రభావం పడకుండా ఉండదు.
ప్రపంచంలో అమెరికా ఆర్ధికంగా అగ్రరాజ్యం అన్నది తెలిసిందే. అక్కడ రోడ్లు ఊడ్చేవారు కూడా సూటూ బూటూ వేసుకొని కార్లలో వచ్చి ఊడ్చిపోతారని దాన్ని అభిమానించే వారు లొట్టలు వేసుకుంటూ చెబుతారు, అక్కడి ఇండ్లలో మరుగుదొడ్లు మన పడక గదుల్లా ఉంటాయని చెప్పిన పెద్దలు ఉన్నారు. అలాంటి అమెరికాను చూసి మనం ఏమైనా నేర్చుకుంటున్నామా ? అంతటి ధనిక దేశం కూడా కరోనాతో కకావికలైంది.ఆర్ధికంగా ఇబ్బందుల్లో ఉన్నవారికి ఈ ఏడాది మూడువేల డాలర్ల మేరకు సాయం చేయాలని జో బైడెన్ సర్కార్ నిర్ణయించింది. మన ప్రధాని మూడు వేలు కాదు కదా ఈ ఏడాది పైసా కూడా ఇచ్చేది లేదని చెప్పేశారు. ఈ నెల 15 నుంచి అమెరికాలో ఆ పధకం అమలు చేయనున్నారు. కనీసంగా మూడువేల డాలర్లు , కొందరికి 3,600 డాలర్లు కూడా లభిస్తాయని వార్తలు. ఏడాదికి భార్యాభర్తకు లక్షా 50వేల డాలర్ల కంటే తక్కువ ఆదాయం వచ్చే వారు, ఒంటరిగా ఉన్నట్లయితే లక్షా 12వేల ఐదు వందల డాలర్లకంటే తక్కువగా వచ్చేవారు ఈ సాయం పొందేందుకు అర్హులు. వారికి ఆరు నుంచి 17 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలు ఉంటే ఒక్కొక్కరికి ప్రతి నెలా 250 డాలర్ల చొప్పున ఆరునెలల పాటు ఇస్తారు. ఆరు సంవత్సరాల లోపు పిల్లలుంటే మూడు వందల డాలర్లు ఇస్తారు. ఇంతే కాదు వారికి ప్రతి బిడ్డకు వచ్చే ఏడాది 1,500 నుంచి 1,800 డాలర్ల పన్ను రాయితీ కూడా ఇవ్వనున్నారు. ఇదంతా అక్కడ జనాల కొనుగోలు శక్తిని పెంచేందుకే, మరి మన దేశంలో జనం దగ్గర డబ్బు లేకుండా వస్తువులు ఎలా అమ్ముడు పోతాయి. ఆర్ధిక వ్యవస్ధ ఎలా ముందుకు పోతుంది. అందుకే భారత పరిశ్రమల సమాఖ్య వారు అవసరమైతే నోట్లను అదనంగా అచ్చువేసి మూడు లక్షల కోట్ల రూపాయల మేర జనానికి డబ్బు పంచాలని చెప్పారు. వారేమీ కమ్యూనిస్టులు కాదు. వారు తయారు చేసే వస్తువులను జనం కొంటేనే కదా పరిశ్రమలు నడిచేది. నరేంద్రమోడీకి ఈ మాత్రం ఆలోచన కూడా తట్టలేదా ?
బ్యాంక్ ఆఫ్ అమెరికా జరిపిన సర్వేలో మన దేశంలో 77శాతం మంది కార్మికులు ఉద్యోగం పోయింది లేదా ఆదాయానికి కోత పడిందని చెప్పారు, ఇరవైశాతం మంది ఉద్యోగాలు కోల్పోతే 57శాతానికి వేతనాల కోత పడింది. పరిస్ధితి ఎప్పుడు బాగుపడుతుందో తెలియదు. కార్పొరేట్లకు ఆత్మనిర్భరత – కష్టజీవులకు బతుకు దుర్భరత అన్నట్లుగా తయారైంది. చైనాకు సమంగా జనాభా మన దేశంలో ఉంది. గతేడాది మన దేశంలో ఎలక్ట్రానిక్ వాణిజ్య విలువ 38 బిలియన్ డాలర్లని రెడ్సీర్ విశ్లేషణ పేర్కొన్నది. అదే చైనాలో 1.8లక్షల కోట్ల డాలర్ల వాణిజ్యం జరిగింది. అందువలన మన దేశంలో ఉన్న ఉపాధి, వాటి మీద వస్తున్న ఆదాయం ఎంత తక్కువో ఈ అంకెలు వెల్లడిస్తున్నాయి. అందువలన మన దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు విదేశీయులు ఏమి చూసి ముందువస్తారు ? కార్పొరేట్లకు ప్రభుత్వం పెద్ద మొత్తంలో కట్టబెడుతోంది కనుక ఆర్ధిక కార్యకలాపాలు లేకపోయినా కంపెనీల లాభాలను పంచుకొనేందుకు విదేశీ సంస్ధలు మన కంపెనీల వాటాలను కొనేందుకు ముందుకు వస్తున్నాయి తప్ప ప్రత్యక్ష పెట్టుబడులకు కాదు.
నోట్లను ముద్రించి ప్రభుత్వానికి నగదు ఇవ్వటం రిజర్వుబ్యాంకుల పని అని నైజీరియా రిజర్వుబ్యాంకు గవర్నర్ ఎంఫిలీ చెప్పాడు.(మన దేశంలో దేశమంతటికీ చెందిన రిజర్వుబ్యాంకు లాభాలను కేంద్రం తన ఖాతాకు మరలించుకొని లోటును పూడ్చుకుంటున్నది) నైజీరియా రిజర్వుబ్యాంకు ముద్రించిన 60బిలియన్ నైరాలను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు పంచటంపై వచ్చిన విమర్శలను ఎంఫిలీ తిప్పి కొట్టారు. నోట్ల ముద్రణకు తిరస్కరించటం బాధ్యతా రాహిత్యం అన్నాడు.
గుడ్ ఏక్సప్లేన్ ధన్యవాదాలు
LikeLike