Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


వసుదేవుడు అంతటి వాడు అవసరార్దం గాడిద కాళ్లు పట్టుకున్నాడన్న కథ తెలిసిందే.ఉత్తర ప్రదేశ్‌లో అధికారం కోసం అక్కడ పన్నెండు నుంచి పదిహేను శాతం వరకు ఓట్లున్న బ్రాహ్మణులను సంతుష్టీకరించేందుకు ఇప్పుడు ప్రధాన పార్టీలన్నీ పాట్లు పడుతున్నాయి. వచ్చే ఏడాది మార్చి నెలలోగా అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి వుంది. దేశ రాజకీయాలను ప్రభావితం చేసే ఆ రాష్ట్ర అధికారం కోసం రాబోయే రోజుల్లో ఇంకా ఏమేమి చూడాల్సి వస్తుందో తెలియదు. దేశవ్యాపితంగా ఐదుశాతం మంది (ఆరు ఏడు కోట్ల మధ్య) బ్రాహ్మణ సామాజిక తరగతి ఓటర్లు ఉంటారని అంచనా. ఉత్తరాదిన అత్యధిక మంది ఉన్నారు. జనాభాలో శాతాల రీత్యా ఉత్తరాఖండ్‌లో 20, హిమచల్‌ ప్రదేశ్‌ 14, ఢిల్లీ 12, జమ్మూ-కాశ్మీరు 11, ఉత్తర ప్రదేశ్‌ 10, ఒడిషా 9, రాజస్ధాన్‌, గోవా 7, హర్యానా, అరుణాచల్‌ ప్రదేశ్‌ 6, పశ్చిమ బెంగాల్‌, సిక్కిం, పంజాబ్‌, బీహార్‌, మధ్య ప్రదేశ్‌, గుజరాత్‌, కర్ణాటక ఐదు, మహారాష్ట్ర, అసోం నాలుగు, ఝార్ఖండ్‌, త్రిపుర మూడు, చత్తీస్‌ఘర్‌ రెండు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కేరళ ఒకశాతం చొప్పున ఈ సామాజిక తరగతిని కలిగి ఉన్నాయి. ఇవి పాత అంచనాలు, 2021లో శాతాలు స్వల్పంగా మారవచ్చు. ఉత్తర ప్రదేశ్‌లో సంఖ్య రీత్యా రెండున్నర కోట్ల మంది వరకు ఉంటారు. తెలుగు రాష్ట్రాల్లో బ్రాహ్మణులు అంటే పూజా పునస్కారాలు, ఇతర క్రతువులు నిర్వహించేవారిగా మాత్రమే తెలుసు. ఉత్తరాదిన వారు వీటితో పాటు వ్యవసాయం చేస్తారు. వీరిలో కూడా శాఖాబేధాలు, ఎక్కువ తక్కువ నిచ్చెనమెట్లు ఉన్నాయి. కొందరిని కొందరు బ్రాహ్మణులుగా గుర్తించని వంటి అంశాలూ ఉన్నాయి. ఉదాహరణకు భూమిహార్‌లను బ్రాహ్మణులుగా గుర్తించరు. వారిని కూడా కలిపితే ఉత్తర ప్రదేశ్‌లో వారి శాతం 14-15కు పెరుగుతుంది. మనువాదానికి ప్రతీకగా బ్రాహ్మణులను చూస్తున్నప్పటికీ అందరినీ ఆ గాటన కట్టలేము. నిజానికి మనువాదం ఇప్పుడు మిగతా కులాల్లోనే ఎక్కువగా ప్రబలింది. బిజెపి పెరుగుదలకు అది కూడా ఒక కారణం. ఇటీవలి బిజెపి చర్యలను చూసినపుడు ఉత్తర భారత్‌లోని కొన్ని రాష్ట్రాల్లో గణనీయంగా ఉన్న ఈ సామాజిక తరగతిని సంతుష్టీకరించేందుకు ఎంతకైనా తెగిస్తుందని తేలిపోయింది. కాశ్మీరీ పండిట్ల సమస్యను పెద్ద ఎత్తున ప్రచారం చేయటం, ఆర్టికల్‌ 370తో పాటు అసలు కాశ్మీరు రాష్ట్రాన్నే రద్దు చేయటం దానిలో భాగమే అని చెప్పవచ్చు.


మనువాద వ్యతిరేక భావజాల ప్రాతిపదికన ఏర్పడిన బహుజన సమాజవాది పార్టీ అధినేత్రి మాయావతి మరోసారి ఉత్తర ప్రదేశ్‌లో బ్రాహ్మణ సంతుష్టీకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఎనిమిది సంవత్సరాలు ఏలుబడి సాగించిన ఆమెకు అధికార రుచి, అది రంజుగా ఉండాలంటే బ్రాహ్మణ ఓట్ల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తొలిసారి 2007లో ఆమెకు అధికారం రావటంలో వారి మద్దతు ప్రధాన పాత్ర పోషించింది. దేశమంతటా దళితులు, గిరిజనులు, ఇతర సామాజిక బలహీనవర్గాల మీద దాడులు, అత్యాచారాల గురించి పార్టీలు చెప్పటం సాధారణ విషయం. కానీ దానికి భిన్నంగా ఉత్తర ప్రదేశ్‌లో బ్రాహ్మణుల మీద అవి జరుగుతున్నాయని మాయావతి చెప్పటమే గమనించాల్సిన అంశం.ఆమె ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దళితుల మీద అత్యాచారాలు, హత్యలు, దాడులు తగ్గిందేమీ లేదని, తక్కువ ఉన్నట్లు చూపేందుకు నమోదు చేయవద్దని పోలీసు శాఖను అదేశించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. తాను అధికారాన్ని చేపట్టిన తరువాత బ్రాహ్మల గౌరవం, ప్రయోజనాలను కాపాడతానని ఆమె ప్రకటించారు. జూలై 23న అయోధ్యలో పార్టీ ప్రధాన కార్యదర్శి సతీష్‌ చంద్ర మిశ్రా బ్రాహ్మణ మేలుకొలుపు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. 2007 అసెంబ్లీ ఎన్నికలలో బిఎస్‌పి విజయానికి బ్రాహ్మణ ఓటర్ల మద్దతు ఒక ప్రధాన కారణమనే అంశం మరోసారి మాయావతికి గుర్తుకు వచ్చింది. 2017లో బ్రాహ్మణ ఓటర్ల మద్దతు పొంది అధికారానికి వచ్చిన బిజెపి వారి సంక్షేమానికి పాల్పడకుండా వేధించిందని, వారిని దోచుకుందని, బిజెపికి మద్దతు ఇచ్చినందుకు వారు ఇప్పుడు పశ్చాత్తాపపడుతున్నారని మాయావతి చెప్పారు.


మాయావతి 2007 నుంచి 2012వరకు అధికారంలో ఉన్న సమయంలో సంతుష్టీకరణ రాజకీయాలకు పాల్పడ్డారని, అగ్రకులాల వారిని పక్కన పెట్టి ఇప్పుడు ఎన్నికల కారణంగా బ్రాహ్మణులను ఆకర్షించేందుకు పూనుకున్నారని బిజెపి ప్రతినిధి రాకేష్‌ త్రిపాఠీ విమర్శించారు. అయితే వారి గౌరవ మర్యాదలు, సంక్షేమానికి పాటు పడేది బిజెపి అని తెలుసు గనుక వచ్చే ఏడాది ఎన్నికల్లో తమకే ఓటు చేస్తారని చెప్పుకున్నారు. మద్దతు తగ్గిపోతున్న కారణంగా మాయావతి కుల రాజకీయాలకు పాల్పడుతున్నారని, తాము అన్ని కులాల వారి సంక్షేమానికి కృషి చేస్తామని కాంగ్రెస్‌ ప్రతినిధి నసీముద్దీన్‌ సిద్దికీ, తాము అన్ని కులావారినీ సమంగా చూస్తామని, మాయావతి ప్రతిపక్షాల మీద చేస్తున్న దాడిని చూస్తే బిజెపితో లోపాయి కారీ ఒప్పందం ఉందన్నది వెల్లడైందని సమాజవాది పార్టీ ప్రతినిధి అబ్దుల్‌ హఫీజ్‌ గాంధీ అన్నారు.


ఉత్తర ప్రదేశ్‌లో సామాజిక సమీకరణాలను చూసినపుడు బ్రాహ్మణులు సంఖ్యరీత్యా ఎక్కువ కానప్పటికీ విజయావకాశాలను ప్రభావితం చేసే స్ధితిలో ఉన్నారు.దళితులు 20.8, ముస్లింలు 19, ఓబిసి 40 అగ్రకులాలు 20 శాతం ఉంటారని అంచనా. కుల రాజకీయాలు ప్రభావం చూపే ఈ రాష్ట్రంలో గత మూడు దశాబ్దాలలో మొత్తంగా బ్రాహ్మణులు బిజెపితోనే ఉన్నారు. అయితే రాజపుత్రుల ప్రాబల్యం ముఖ్యంగా యోగి ఆదిత్యనాధ్‌ హయాంలో పెరిగిపోయి తమను నిర్లక్ష్యం చేస్తున్నారనే అభిప్రాయం పెరుగుతోంది. వికాస్‌ దూబే అనే గూండానేతను, ఐదుగురు సహచరులను పోలీసులు కాల్చిచంపారు. ఆ ఉదంతంలో దూబే గ్యాంగు చేతిలో ఎనిమిది మంది పోలీసులు మరణించారు. దూబే ఉదంతాన్ని చూపి బ్రాహ్మణ వ్యతిరేక చర్యగా చిత్రించే ప్రయత్నం ఆ సమయంలో జరిగింది.నిజానికి అది కులపరంగా జరిగిన ఉదంతం కాదు.బ్రాహ్మణులు బిజెపికి గట్టి మద్దతుదారులుగా ఉన్నట్లు సర్వేలు వెల్లడిస్తున్నప్పటికీ బిజెపికి ఎక్కడో అనుమానాలు ఉన్నాయన్నది స్పష్టం. అయినా ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులు కోకూడదని బిజెపి అనుకుంటోంది. అందుకే ప్రముఖ బ్రాహ్మణ నేతగా పేరున్న జితిన్‌ ప్రసాదను ఇటీవల కాంగ్రెస్‌ నుంచి ఆకర్షించింది. బ్రాహ్మణ చేతన పరిషత్‌ పేరుతో ప్రసాద ఒక సంస్దను ఏర్పాటు చేశారు. ఆ రాష్ట్రానికి చెందిన ఐఏఎస్‌ అధికారి ఎకె శర్మను ఉద్యోగానికి రాజీనామా చేయించి పార్టీలో చేర్చుకున్నారు. అంతే కాదు, ఎంఎల్‌సి పదవి ఇచ్చి మంత్రివర్గంలో చేర్చుకోవాలన్న అధిష్టాన వర్గ ఆదేశాన్ని యోగి ఖాతరు చేయలేదు. ఆయను ఎంఎల్‌సి చేసి రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షుడిగా నియమించారు. శర్మను కలుసుకొనేందుకు యోగి నిరాకరించారని కూడా వార్తలు వచ్చాయి. అయోధ్య రామాలయ నిర్మాణాన్ని కూడా సంతుష్టీకరణలో భాగంగా చూపుతున్నది. ఆర్ధికంగా బలహీనవర్గాలకు పదిశాతం ఉద్యోగ రిజర్వేషన్లు ఏర్పాటు చేసినందున వారే ఎక్కువ లబ్ది పొందుతారని ప్రచారం చేసింది. తాము పరశురాముడి అంశకు చెందిన వారమని బ్రాహ్మలు భావిస్తున్న కారణంగానే తాము అధికారానికి వస్తే భారీ పరుశురాముడి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని బిఎస్‌పి, సమాజవాది పార్టీ ప్రకటించాయి.


బిఎస్‌పి విషయానికి వస్తే 2002లో ఆ పార్టీకి బ్రాహ్మణులు ఆరుశాతం ఓటు వేయగా 2007నాటికి 17శాతానికి పెరిగింది. ఇదే సమయంలో బిజెపికి 50 నుంచి 42శాతానికి తగ్గాయి. తరువాత 2012లో 38శాతానికి పడిపోయినా 2014లోక్‌ సభ ఎన్నికల్లో 72, 2107 అసెంబ్లీలో 80శాతం, 2019లోక్‌సభ ఎన్నికల్లో 82శాతానికి పెరిగాయి. రాజపుత్రుల ఓట్లు కూడా అదేస్ధాయిలో బిజెపికి పడ్డాయి. నరేంద్రమోడీ కారణంగా పన్నెండుశాతం ఓట్లు బిజెపికి అదనంగా వచ్చినట్లు సర్వేలు తెలిపాయి. అగ్రకులాల, బిసిల్లోని కుర్మీల ఓట్లు ఈ ఎన్నికల్లో బిజెపికి ఐదింట నాలుగు వంతులు పడగా, ఓబిసీల్లోని దిగువ తరగతి వారు నాలుగింట మూడు వంతులు వేశారు. బిసిల్లో ముందుపడిన వారు సమాజవాది పార్టీతో ఉన్నందున దిగువ తరగతులను చేరదీసేందుకు బిజెపి ఎరవేసింది. బిజెపి ఎత్తుగడలో భాగంగా ముస్లింలను దూరంగా పెట్టి మెజారిటీ హిందువుల ఓటు బ్యాంకు సృష్టికి పూనుకుంది. అది సహజంగానే బ్రాహ్మణులకు సంతృప్తి నిస్తుంది.


బ్రాహ్మణ సంతుష్టీకరణకు రాహుల్‌ గాంధీ కూడా ప్రయత్నించారు. తాను కౌల్‌ బ్రాహ్మణ పూర్వీకుల వారసుడనని, తనది దత్తాత్రేయ గోత్రమని చెప్పుకున్నారు. గతంలో బ్రాహ్మణులు కాంగ్రెస్‌కు తిరుగులేని మద్దతుదారులుగా ఉండేవారు. బిఎస్‌పి పార్లమెంట్‌ ఉభయ సభల్లోనూ బ్రాహ్మణ సామాజిక తరగతికి చెందిన వారినే ఇప్పుడు నాయకులుగా నియమించారు. మాయావతి మంత్రివర్గంలో గరిష్ట స్ధాయిలో వారున్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో గరిష్ట సంఖ్యలో అభ్యర్దులుగా వారిని నిలిపారు. నామమాత్రంగా బ్రాహ్మణులు, నాలుగోవంతు దళితులు ఉన్న అంబేద్కర్‌ నగర్‌ లోక్‌ సభ స్ధానంలో పోటీ చేసిన రితేష్‌ పాండే తప్ప మిగిలిన బ్రాహ్మణ అభ్యర్ధులందరూ ఓడిపోయారు.


ఉత్తర ప్రదేశ్‌ మరికొన్ని ఉత్తరాది రాష్ట్రాలను ” ఆవు ప్రాంతం ” అని పిలుస్తారు. బిజెపి ముందుకు తెచ్చిన మతపరమైన అజెండాలో ఆవు కూడా ఒకటి. సాధారణంగానే తమ కారణంగానే హిందూమతం ఇంకా ఉనికిలో ఉందని బ్రాహ్మణులు అనుకుంటారనే అభిప్రాయం ఉంది. ఇలాంటి అనేక కారణాలతో వారు కాంగ్రెస్‌ నుంచి బిజెపి అభిమానులుగా మారారు.
ఉత్తర ప్రదేశ్‌ ఇప్పుడు కులాలు, మతాల రాజకీయం నడుస్తోంది. బిజెపి హిందూత్వ తన గుత్త సొమ్మని భావిస్తోంది. మాకూ వాటా ఉందని మేమూ హిందుత్వశక్తులమే అని ఓటర్ల ముందు నాలుగు ప్రధాన పార్టీలూ ఓట్ల జోలె పట్టుకొని నిలుచోబోతున్నాయి. ఆయోధ్య రామమందిరాన్ని చూపి ఓట్లడిగేందుకు బిజెపి పూనుకుంటే బిఎస్‌పి అక్కడే తన బ్రాహ్మణ సమ్మేళనాలకు శ్రీకారం చుట్టబోతున్నది. శ్రీరాముడి దర్శనం చేసుకొని కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. తరువాత మిగతా దేవుళ్ల పట్టణాల్లో సభలు జరుపుతారు. ప్రతిచోటా దేవుడి దర్శనంతోనే ప్రారంభం. గత ఎన్నికల్లో బిజెపికి ఓట్లు వేసిన వారిలో అగ్రకులాల వారే కాదు, దళితులు కూడా గణనీయంగా మొగ్గారు. అందువలన వారి హిందూత్వను సంతుష్టీకరించేందుకు బిఎస్‌పి ఎలాంటి కార్యక్రమాలను చేపడుతుందో చూడాల్సి ఉంది. గుళ్లు గోపురాలను సందర్శించి తామూ హిందువులమే అని కనిపించేందుకు బిఎస్‌పి, ఎస్‌పి, కాంగ్రెస్‌ నేతలు బారులు తీరుతున్నారు. స్ధానిక మనోభావాలను అర్ధం చేసుకోవాలీ అని ఎవరికి వారు సమర్ధించుకుంటున్నారు. అందరూ తమకు పోటీ వస్తున్నందున మత కిక్కు ఎక్కించేందుకు బిజెపి ఏం చేయనుందో చూద్దాం !