Tags
Afghanistan Talibans, BJP, Hindu Fundamentalism, Hinduism, Manu Statue, Manusmriti, RSS, saffron talibans
ఎం కోటేశ్వరరావు
అమెరికా వాడు ఆఫ్ఘనిస్తాన్నుంచి పారిపోవటాన్ని ఎవరి కోణంలో వారు చూస్తున్నారు. మిగతా అంశాల గురించి రాబోయే రోజుల్లో ఎలాగూ చర్చించుకుంటాం. మన దేశానికి చేసిన ఒక మంచి గురించి చెప్పకతప్పదు. తమకు ఏది మంచి అయితే దాన్ని చేయటం తప్ప నమ్మిన వారిని పట్టించుకొనే అవసరం మాకు లేదు అని మన దేశంలో వారి మీద మరులు గొన్నవారికి చెంపచెళ్లు మనిపించి మరీ చెప్పాడు. మతశక్తుల మంచి చెడ్డల గురించి చర్చ, విశ్లేషణలు జరిగేందుకు దోహదం చేశాడు. ఇప్పుడు అదే జరుగుతోంది.అనేక మంది తాలిబాన్లు-ఆర్ఎస్ఎస్ పోలికలను ముందుకు తెస్తున్నారు. గతంలో ఏదైనా అడిగితే పాకిస్తాన్ వెళ్లండి అని చెప్పే బిజెపి నేతలు ఇప్పుడు బాణీ మార్చి ఆప్ఘనిస్తాన్ వెళ్లమని సలహా ఇస్తున్నారు. తమ ప్రత్యర్ధులను తాలిబాన్ల మాదిరి తన్నాలని పిలుపులు ఇస్తున్నారు.
మధ్య ప్రదేశ్లోని కట్ని జిల్లా బిజెపి అధ్యక్షుడు రామ్రతన్ పాయల్ను ద్రవ్యోల్బణం, పెట్రోలు ధరల గురించి ఒక విలేకరి అడిగితే దురదగొండి ఆకు పూసుకున్నట్లుగా ప్రవర్తించారు. ఆఫ్ఘనిస్తాన్లో పెట్రోలు లీటరు 50రూపాయలైనా కొనేవారు లేరంట అక్కడికి వెళ్లి కొనుక్కోండి అంటూ మండిపడ్డారు. కరోనా మూడవ తరంగం వస్తుందని అందరూ అనుకుంటుంటే పెట్రోలు గురించి మాట్లాడుతున్నావు, కరోనా కనిపించటం లేదా అని ఎదురుదాడికి దిగిన వీడియో తెగ ప్రచారం అయింది. బీహార్లోని బిస్ఫీ నియోజకవర్గ బిజెపి ఎంఎల్ఏ హరిభూషన్ ఠాకూర్ను ఒక విలేకరి తాలిబాన్లు అధికారానికి వచ్చిన ప్రభావం భారత్ మీద ఎలా ఉంటుంది అని అడిగారు. ఆ పాపానికి ఇక్కడ భయపడేవారంతా అక్కడికి పోవచ్చు, పెట్రోలు, డీజిలు ధరలు చౌక అని ఎద్దేవా చేశారు. ఒకసారి అక్కడికి వెళితే ఇక్కడి ప్రత్యేకత తెలుస్తుంది అన్నారు. మతమేదైనా ఆప్ఘన్ శరణార్దులను అందరినీ అనుమతించాలన్న జెడియు నేత వ్యాఖ్యను గేలిచేస్తూ అప్పుడు మన దేశం కూడా తాలిబాన్లతో నిండిపోతుందన్నారు. తాలిబాన్లు మన దేశంలో స్వాతంత్య్ర సమర యోధుల వంటి వారు అని ఉత్తర ప్రదేశ్లోని సమాజవాది పార్టీ ఎంపీ షఫికుర్ రహమాన్ వ్యాఖ్యానించినందుకు యుపి బిజెపి ప్రభుత్వం దేశద్రోహ కేసు బనాయించింది. ఇటీవలనే కేంద్ర మంత్రిగా నియమితులైన ప్రతిమా భౌమిక్ గారిని సన్మానించేందుకు త్రిపురలోని బెలోనియా పట్టణంలో బిజెపి వారు ఒక సభను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో తృణమూల్ కాంగ్రెస్ నేతలు అడుగుపెడితే తాలిబాన్ల పద్దతుల్లో వారిని తరిమివేయాలని పార్టీ ఎంఎల్ఏ అరుణ్ చంద్ర భౌమిక్ బిజెపి కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
తాలిబాన్లను ఎవరూ సమర్ధించటం లేదు. ఆప్ఘనిస్తాన్ నుంచి అమెరికా పారిపోయినందుకు సంతోషం తప్ప మతఛాందసులు వచ్చినందుకు కాదు. అయినా మన దేశంలో తాము తప్ప మిగిలిన వారందరూ తాలిబాన్లకు మద్దతు ఇస్తున్నారన్నట్లుగా బిజెపి నేతలు ప్రచారం చేస్తున్నారు. తాలిబాన్లకు అధికారాన్ని అప్పగించేందుకు ఒప్పందం చేసుకున్నది అమెరికా, దాని సంతకాల కార్యక్రమానికి హాజరై సంతోషాన్ని వెలిబుచ్చింది నరేంద్రమోడీ సర్కార్. అమెరికా తప్పుకున్న తరువాత దేశం తాలిబాన్ల వశం అవుతుందన్న కనీస పరిజ్ఞానం మన ప్రభుత్వానికి లేదా ? ఎందుకు సమర్ధించినట్లు ? జనానికి బుర్రల్లేవనుకుంటున్నారా ? తాలిబాన్ షరియా చట్టాల గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్న బిజెపి వారు ఇప్పటికే అమల్లో ఉన్న దేశాల్లో మహిళల గురించి ఎప్పుడైనా ఈ మాదిరి గుండెలు బాదుకున్నారా ? ముస్లింలు ఉన్న ప్రతి చోట దేశ రాజ్యాంగాలతో నిమిత్తం లేకుండా మత పెద్దలు అనధికారికంగా ఆ చట్టాలను అమలు జరుపుతున్నారు. ఇక పూర్తిగా లేదా పాక్షికంగా అధికారిక గుర్తింపు ఇచ్చిన దేశాలలో ఆఫ్ఘనిస్తాన్, ఇండోనేషియా, పాకిస్తాన్, ఈజిప్టు, ఎమెన్, ఇరాన్, ఇరాక్, మలేషియా, మాల్దీవులు, మారుటేనియా, కతార్, సౌదీ అరేబియా,నైజీరియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉన్నాయి.
ఇక మనుస్మృతి విషయానికి వస్తే ఇస్లాంలో షరియత్ను ముస్లింలు అందరూ ఆమోదించారని, ఆ మాదిరి మనుస్మృతిని హిందువులందరూ ఆమోదించాలనే బలవంతం ఏమీ లేదని కొందరు సన్నాయి నొక్కులు నొక్కుతారు. ఇస్లామిక్ రాజ్యాలుగా ప్రకటించుకున్నవి బలవంతంగా అమలు జరపటం తప్ప షరియత్ను పాటించటమా లేదా అన్నది ఎవరికి వారు నిర్ణయించుకొనే స్వేచ్చ ఇస్తే అప్పుడు తెలుస్తుంది. మన దేశాన్ని హిందూ రాజ్యంగా మార్చాలని, సమాజాన్ని వేల సంవత్సరాల వెనక్కు తీసుకుపోవాలని చూస్తున్న మనువాదుల లక్ష్యం నెరవేరితే జరిగితే సంభవించే పరిణామం ఏమిటి ? మరో పాకిస్తాన్గా మారిపోతుంది. అవకాశం లేకగానీ లేకుంటే ఈ పాటికి దేశాన్ని ఎప్పుడో మతరాజ్యంగా మార్చి ఉండేవారు. అప్పుడు రాజ్యాంగం స్దానంలో మనుస్మృతిని అమలు చేసేవారు.ఇదేమీ నిరాధార ఆరోపణ కాదు. అనేక మంది ఈ దేశంలో ఇప్పుడు భయపడుతున్నది ఇదే.
ఆర్ఎస్ఎస్ వాణి ఆర్గనైజర్ పత్రిక 1949 నవంబరు 30వ తేదీ సంచికలో రాసిందేమిటి ? ” భారత నూతన రాజ్యాంగం గురించి చెప్పాలంటే అత్యంత చెడు ఏమంటే దానిలో భారతీయం లేకపోవటమే.రాజ్యాంగాన్ని రాసిన వారు బ్రిటీష్, అమెరికా, కెనడా, స్విస్ మరియు ఇతర రాజ్యాంగాలలోని అంశాలను చేర్చారు. పురాతన భారతీయ చట్టాల ఆనవాళ్లు, వ్యవస్ధలు, నామావళి,శబ్ద-శైలీ విన్యాసాలుగానీ లేవు. పురాతన భారత్లో జరిగిన అపూర్వమైన రాజ్యాంగ అభివృద్ది ప్రస్తావన గానీ లేదు. పురాతన గ్రీకు, పర్షియా చట్టాల కంటే ఎంతో ముందుగా రాసినవి మను చట్టాలు.మనుస్మృతిలో ఉద్ఘోషించిన చట్టాలు ప్రపంచవ్యాపితంగా ఉద్వేగ పరిచే, ఆరాధించేవి, అనుసరణకు పురికొల్పేవి, కానీ మన రాజ్యాంగ పండితులకు అర్ధం లేనివి.” కాశ్మీరు రాష్ట్రాన్ని , రాజ్యాంగంలోని మౌలిక అంశమైన ఆర్టికల్ 370 ఒక్క రోజులో ఎలాంటి చర్చ లేకుండా రద్దు చేసిన పెద్దలు రాబోయే రోజుల్లో మనుస్మృతి, పురాణాలు, వేదాలతో రాజ్యాంగాన్ని నింపివేయరనేే హామీ ఏముంది ?
మనుస్మృతిలో ఏముంది ? రెండున్నరవేల శ్లోకాలు ఉంటే వాటిలో బ్రాహ్మలు, క్షత్రియుల విధులు, కర్తవ్యాలు, పాలన,హక్కులకు సంబంధించి రెండువేలకు పైగా ఉంటే, వైశ్యులు, శూద్రుల బాధ్యతలు, మహిళల కట్టుబాట్లు, పరిమితుల గురించి మిగిలినవి ఉన్నాయి. పాలక – పురోహిత పెత్తనం తప్ప సామాన్యుల హక్కుల గురించి ఉన్నదేమిటో ఎవరైనా చెబితే సంతోషం. అలాంటి దాని ప్రాతిపదికన రాజ్యాంగ రచన అంటే కాషాయ తాలిబానిజం తప్ప మరొకటి ఏముంది? మనువాదం అంత గొప్పది, పురాతనమూ, ఆదర్శమూ అయితే ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అంటరానితనం, పిల్లలను కనటానికి, వంట, ఇంటికి మహిళలను ఎందుకు పరిమితం చేసినట్లు ?
మనుస్మృతిలో పరస్పర విరుద్ద అంశాలు కూడా ఉన్నాయి. ఎవరికి వారు తమకు అనుకూలమైన వాటిని తీసుకొని వాదనలను సమర్ధించుకుంటున్నారు. అయితే ఆచరణను గీటురాయిగా తీసుకుంటే వ్యతిరేకమైనవే అమల్లో ఉన్నాయి.ఉదాహరణకు మహిళల హక్కులకు సంబంధించి ఒక దగ్గర స్త్రీ పురుషులెవరూ వివాహాన్ని రద్దు చేసుకోరాదని ఉంది. మరికొన్ని చోట్ల చేసుకోవచ్చని ఉంది. కానీ హిందూకోడ్ బిల్లు వచ్చేంత వరకు అలాంటి హక్కులు అమలు జరుపుకున్నవారెంత మంది ? తన కులం గాని వారిని వివాహం చేసుకోవటాన్ని నిషేధించింది. ఇప్పుడు జరుగుతున్న అనేక హత్యలు, కులపంచాయతీలకు ప్రాతిపదిక అదే కదా ! బాల్యంలో తండ్రి, యవ్వనంలో భర్త, అవసానదశలో మగపిల్లల రక్షణలో ఉండాలని, భర్తను దేవుడిగా పూజించాలని చెప్పారు. మహిళలను ఎక్కడ గౌరవిస్తారో అక్కడ దేవతలు సంతోషిస్తారని ఒక చోట చెబుతారు. స్వంతంత్ర జీవనం కోరుకోరాదని మరోచోట అదేశిస్తారు. పురుషులను భ్రష్టు పట్టించటం మహిళల సహజలక్షణ మని చెబుతారు.ఇలా స్త్రీని కించపరిచే, ఆంక్షలు విధించే అంశాలు ఎన్నో ఉన్నాయి.
కొన్ని కులాల వారు ” గుట్టలు, చెట్లు, శ్మశానాల దగ్గర, కొండలు, తోపుల్లో ఉండాలి.జన్మసిద్దమైన కార్యకలాపాల జీవనంతో గుర్తు పట్టేవిధంగా ఉండాలి.” ” భరించలేని అంటరాని వారు,కుల భ్రష్ట జనితులు గ్రామాల వెలుపల ఉండాలి, పారవేసిన పాత్రలు, కుక్కలు, గాడిదలను తమ సంపదలుగా పరిగణించాలి. వారు మరణించిన వారి దుస్తులను ధరించాలి, పగిలిపోయిన పాత్రల్లో వారి ఆహారం ఉండాలి, ఆభరణాలు ఇనుముతో చేసినవిగా ఉండాలి, ఎప్పుడూ దూరంగానే తిరుగుతుండాలి. తన విధులు నిర్వర్తిస్తున్న పురుషుడు వారితో సంబంధాన్ని కోరుకోకూడదు, ఒకరి తరువాత ఒకరితో కార్యకలాపాలు నిర్వహించాలి.వారి మాదిరి ఉండేవారితోనే వివాహం చేసుకోవాలి. ఆహారం కోసం వారు ఇతరుల మీద ఆధారపడాలి.వారికి పగిలిపోయిన పాత్రల్లోనే ఆహారం పెట్టాలి. వారు పట్టణాలు,గ్రామాల్లో రాత్రుళ్లు నడవ కూడదు. పగలు తమ పనికోసం వారు తిరగవచ్చు. రాజు జారీ చేసిన ఆజ్ఞల ప్రకారం ప్రత్యేకమైన గుర్తులతో గుర్తుపట్టేవిధంగా వారు ఉండాలి. బంధువులు లేని వారి శవాలను వారు మోయాలి, ఇది తిరుగులేని నిబంధన. రాజాజ్ఞ ప్రకారం మరణశిక్షలను అమలు జరపాలి. మరణశిక్షకు గురైనవారి దుస్తులు, పక్కలు, ఆభరణాలను తమ కోసం తీసుకోవాలి.” ఈ మనుచట్టాలను రాజ్యాంగం రచనలో పరిగణనకు తీసుకోలేదనే వైఖరిని ఆర్ఎస్ఎస్ లేదా ఆర్గనైజర్ మార్చుకున్నదా ? నాకు ఎలాంటి ఆధారాలు దొరకలేదు, ఎవరైనా చెబితే అంగీకరిద్దాం ! అంతేనా ? ” పూజారి పేరు శుభప్రదమైన, సౌకర్యవంతమైన పదంతో ఉండాలి, పాలకుడి పేరు బలాన్ని, రక్షణను సూచించాలి, సాధారణ జనానికి ఆస్తి సంబంధమైనవి, సేవకుడి పేరు సేవను సూచించే, చిరాకు పుట్టించేదిగా ఉండాలి.” ఇవి కూడా మనుధర్మంలో చెప్పినవే సుమా ! సినిమాల్లో అలాంటి ఉదంతాలను ఎవరైనా గుర్తు పట్టవచ్చు.
ముస్లిం మహిళల రక్షణకు ఎవరూ తీసుకురాని చట్టాన్ని తీసుకు వచ్చామని బిజెపి ఊరూ వాడా ప్రచారం చేసుకుంటున్నది. ఎప్పటికెయ్యది అప్పటికా అవసరాలు, అజెండాకు అనుగుణ్యంగా ఎత్తుగడలను మార్చుకోవటాన్ని చూసి ఊసరవెల్లులే సిగ్గుపడతాయి. హిందూ మహిళలకు ఆస్తి , వివాహ, విడాకుల హక్కులు ఇచ్చేందుకు, బహు భార్యాత్వాన్ని నిషేధించేందుకు ఉద్దేశించిన హిందూకోడ్ బిల్లు పట్ల అనుసరించిన వైఖరి ఏమిటి ? కేంద్ర మంత్రిగా అంబేద్కర్ ప్రతిపాదించిన బిల్లులను వ్యతిరేకిస్తూ 1949 డిసెంబరు 11న ఢిల్లీ రామలీలా మైదానంలో ఆర్ఎస్ఎస్ సభ నిర్వహించింది. హిందూ సమాజం మీద ఆటంబాంబు వంటిది ఈ బిల్లు అని ఒక వక్త సెలవిచ్చారు. అవి పార్లమెంట్ ముందుకు వచ్చినపుడు బెంగాల్ నుంచి స్వతంత్య్ర అభ్యర్ధిగా ఎన్నికైన హిందూమహాసభ నేత నిర్మల్ ఛటర్జీ( సిపిఎం నేత, లోక్సభ స్పీకర్గా పని చేసిన సోమనాధ్ చటర్జీ తండ్రి) వాటిని తీవ్రంగా వ్యతిరేకించారు. సంఘపరివార్, హిందూత్వశక్తులే కాదు, కాంగ్రెస్లోని మితవాదులు కూడా వాటికి వ్యతిరేకమే. తొలి రాష్ట్రపతి బాబూ రాజేంద్ర ప్రసాద్ కూడా వారిలో ఒకరు. ఇలాంటి ప్రతిపాదనలను ముందు పార్టీల ఎన్నికల ప్రణాళికల్లో పెట్టి ఓటర్ల ముందు చర్చ తరువాత పార్లమెంట్కు తీసుకురావాలన్నారు. ఎందుకని మనుధర్మం వాటికి వ్యతిరేకం గనుక ! చివరికి నెహ్రూ అనేక రాజీలతో చట్టానికి ఆమోదం పొందారు.
మన రాజ్యాంగం ప్రకారం మనువు, మహమ్మద్, ఏసుక్రీస్తు మరొక మత బోధనలకు స్ధానం లేదు. అయినప్పటికీ రాజస్తాన్ హైకోర్టు ముందు 1989లో రాజస్తాన్ జుడీషియల్ ఆఫీసర్స్ అసోసియేషన్ మను పేరుతో ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి దానికి వ్యతిరేకంగా అనుకూలంగా నిరనసలు-సమర్ధనలు జరుగుతున్నాయి. అదే ఏడాది ఆ విగ్రహాన్ని తొలగించాలని ఆదేశిస్తూ హైకోర్టు ఒక పాలనాపరమైన ఉత్తరువు జారీ చేసింది. దాన్ని సవాలు చేస్తూ విశ్వహిందూపరిషత్ నేతలు, ఇతరులు ఒక ప్రజాప్రయోజన వ్యాజ్యం వేశారు. దాని మీద ఆదేశాన్ని నిలుపు చేస్తూ హైకోర్టు ఆదేశించింది. ప్రదాన న్యాయమూర్తి ఆధ్వర్యాన ఏర్పడిన డివిజన్ బెంచ్ వాజ్యవిచారణ చేపట్టింది. గత మూడు దశాబ్దాలుగా ఆ కేసులో ఎలాంటి పురోగతి లేదు. కొంత మంది దళిత సంఘకార్యకర్తలు ఆ కేసులో ప్రతివాదులుగా చేరారు. చివరి విచారణ 2015లో జరిగింది. బ్రాహ్మణ న్యాయవాదుల నిరసనల కారణంగా కేసు ముందుకు పోలేదు. ప్రతి ఏటా మను విగ్రహాన్ని తొలగించాలని కోరుతూ నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఈ ఏడాది కూడా జరిగాయి. కేసు తేలేవరకు విగ్రహం కనపడకుండా ముసుగు కప్పాలని అధికారులు ఆపని చేయకపోతే తామే అందుకు పూనుకుంటామని కార్యకర్తలు హెచ్చరించారు.మనుధర్మం పేరుతో అమలు చేసిన అంశాలు దళితులు, మహిళలను అణచివేశాయని కొందరు చెబుతున్నారు. వాటికీ మను ధర్మానికి సంబంధం లేదు అని మరికొందరు అంటున్నారు. మరోనోటితో మను ధర్మాలు అమలు జరిగాయంటారు. ఏది నిజం ? మరి స్వేచ్చ లేకపోవటానికి, అణచివేత, అంటరానితనం, కులాలవారీ చీలిపోవటానికి కారణాలు ఏమిటి ? మనువాదుల నుంచి సరైన సమాధానం లేదు.వారు చెప్పేవి తర్కానికి నిలిచేవి కాదు. ఇదే సూత్రం షరియ చట్టాలకూ వర్తిస్తుంది.అదీ తర్కానికి నిలవదు.