Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


దేశంలో ఏం జరుగుతోంది ? ఎవరేం మాట్లాడుతున్నారు ? కొందరు పాత్రధారులైతే – తెరవెనుక సూత్రధారులెవరు ? ఆఫ్టరాల్‌ 164.5 కోట్ల రూపాయల కాంటాక్టును కేంద్ర ప్రభుత్వం నుంచి పొందిన ఇన్ఫోసిస్‌ కంపెనీ మీద ఆర్‌ఎస్‌ఎస్‌ పత్రిక పాంచజన్య దాడి చేసింది. అది టీ కప్పులో తుపానులా ముగుస్తుందా ? దీని వెనుక ప్రజలను తప్పుదారి పట్టించే ఎత్తుగడ ఉందా ? ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్నలు ఎన్నో ! ఎన్నో !! ఆ దాడితో తమకు సంబంధం లేదని ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రకటించింది, ఆ పత్రిక తమ అధికార వాణి కాదని కూడా చెప్పుకుంది. పత్రికా స్వేచ్చ ఉంది గనుక పాంచజన్య ఏమైనా రాయవచ్చని బిజెపి సమర్ధించింది. లక్షలాది కుటుంబాలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి చూపుతున్న కంపెనీ మీద నిరాధార ఆరోపణ చేస్తే, అది అవునో కాదో తానే చెప్పాల్సిన కేంద్ర ప్రభుత్వం మౌనం దాల్చింది. దాని అర్ధం ఏమిటి ?


ఇన్ఫోసిస్‌ కంపెనీ వార్షిక ఆదాయం రు. 26,823 కోట్లు(2021) నిఖరాదాయం రు.19,423 కోట్లు, కంపెనీ మొత్తం ఆస్తుల విలువ రు.1,08,386 కోట్లు. దానిలో పని చేస్తున్న సిబ్బంది 2,59,619. అలాంటి కంపెనీ మీద ఎలాంటి ఆధారాలు లేవని చెబుతూనే దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందని కేంద్ర ప్రభుత్వానికి అన్ని విధాలుగా మద్దతు ఇస్తున్న ఒక పత్రిక తప్పుడు రాతల మీద నోరు విప్పని కేంద్ర ప్రభుత్వం స్వదేశీ, విదేశీ కార్పొరేట్లకు పంపుతున్న సందేశం ఏమిటి ? ఇలా ప్రశ్నించటం అంటే కార్పొరేట్లను, వాటి అక్రమాలను సమర్ధించటం కాదు. దేని కదే. సందర్భం వచ్చినపుడూ వాటినీ ప్రశ్నిద్దాం !


ఆర్‌ఎస్‌ఎస్‌ హిందీ వార పత్రిక పాంచజన్య సెప్టెంబరు ఐదవ తేదీ సంచికలో ఇన్ఫోసిస్‌ దేశవ్యతిరేక శక్తంటూ ఆధారం లేని ఆరోపణలతో విషం చల్లారు. అలాంటి చౌకబారు పనికి విలువలు-వలువల గురించి నిత్యం వల్లించే మరో పత్రిక ఏదైనా పాల్పడుతుందా ? ఏమి రాసినా తమను రక్షించేవారు పైన ఉన్నారనే తెగింపు గాకపోతే మరేమిటి ? కొన్ని పత్రికలు ఈ దిగజారుడు రాతలను విమర్శించినా మొత్తంగా మీడియా, కార్పొరేట్‌ రంగం దీని గురించి నోరు విప్పేందుకు భయపడింది. కొన్ని సంస్దల అధికారులు కార్పొరేట్‌ జవాబుదారీ తనం గురించి చెప్పారు. అనేక కార్పొరేట్‌ కంపెనీలు వాటాదార్లను నిలువునా ముంచాయి. అప్పుడు ఈ సుద్దులు చెప్పలేదేం. అవి ఆయా కంపెనీల అంతర్గత వ్యవహారాలైతే ఇదేమిటి ? ఇప్పుడు ఎవరిని సంతృప్తి పరచేందుకు, మెప్పు పొందేందుకు, తద్వారా లబ్ది పొందేందుకు ఈ సుభాషితాలు ?


అవును, ఇన్ఫోసిస్‌ సంస్ధ తయారు చేసిన ఆదాయపన్ను శాఖ పోర్టల్‌ ఆశించిన విధంగా పని చేయటం లేదు.అదొక్కటేనా, అనేకం సరిగా పని చేయటం లేదు. సరిదిద్దుతామని ఆ సంస్ధ చెప్పిన వ్యవధిలోపల పూర్తి కాలేదు. ఏం చేయాలి ? దానితో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలి. దానికి చెల్లించిన మొత్తాన్ని వడ్డీతో సహా రాబట్టాలి లేదా అవకాశం ఉంటే నష్టపరిహారం కూడా రాబట్టాలి. లేదూ సాధ్యం గాకపోతే మరొక సంస్దతో కొత్త పోర్టల్‌ను తయారు చేయించాలి. అది ప్రభుత్వం-ఇన్ఫోసిస్‌ మధ్య వ్యవహారం. అప్పటి వరకు దేశం ఆర్ధికంగా స్థంభించించి పోదుగా ! ఒక సాంస్కృతిక సంస్ధ పత్రిక నుంచి ఎందుకీ దాడి !


దేశవ్యతిరేక శక్తులకు మద్దతు ఇస్తూ పని గట్టుకొని దేశ ఆర్ధిక వ్యవస్ధను అస్ధిరం గావించేందుకు ప్రయత్నిసోందని, నక్సలైట్లు, వామపక్షవాదులు, మరియు టుకడే టుకడే గ్యాంగ్‌(దేశాన్ని విచ్చిన్నం చేసే ముఠాలు)కు నిధులు ఇస్తోందని ” తీవ్ర ఆరోపణ చేసింది. దీనికి సంబంధించి నిర్ధిష్టమైన ఆధారం తమ వద్ద లేదని చరిత్ర మరియు పరిస్ధితులను బట్టి ఇలా చెప్పాల్సి వచ్చిందని కూడా వ్యాసంలో పేర్కొన్నారు. ఇలాంటి అనుమానాస్పద కంపెనీ చైనా, ఐఎస్‌ఐ(పాక్‌ గూఢచార సంస్ద)తో కలసి దేశద్రోహానికి పాల్పడే అవకాశం ఉందని రాసింది. దీని మీద దేశం అంతటా తీవ్ర విమర్శలు వెల్లువెత్తటంతో ఆర్‌ఎస్‌ఎస్‌ నష్ట నివారణ చర్యకు పూనుకుంది. ఇన్ఫోసిన్‌ నిర్వహిస్తున్న పోర్టల్‌తో కొన్ని సమస్యలు ఉండి ఉండవచ్చు.అయితే పాంచజన్య ఈ నేపధ్యంలో ప్రచురించిన ఒక వ్యాసం కేవలం వ్యాసకర్త వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే అని ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రతినిధి సునీల్‌ అంబేద్కర్‌ ప్రకటించారు. ఆ పత్రిక తమ భావజాలాన్ని తీసుకొని ఉండవచ్చు తప్ప ఆ పత్రిక తమ సంస్ధ అధికార పత్రిక కాదని పత్రికను, దానిలోని అంశాలను తమ సంస్ధకు అంటగట్ట కూడదన్నారు. అయితే పత్రిక సంపాదకుడు హితేష్‌ శంకర్‌ మాత్రం తాము ప్రచురించినదానికి కట్టుబడి ఉన్నామని, ఆర్‌ఎస్‌ఎస్‌కు దీనికి ఎలాంటి సంబంధం లేదని అన్నారు.బిజెపి జాతీయ ప్రతినిధి నళిన్‌ కోహ్లి పరోక్షంగా పాంచజన్యను సమర్దించారు. ప్రతివారికి తమ అభిప్రాయాలను వెల్లడించే హక్కు ఉంది కదా ! పత్రికా స్వేచ్చను మనం కాపాడుతున్నాం అన్నారు. దీన్నే పిర్రగిల్లి జోలపాడటం అంటారు.

దేశంలో ఒక పెద్ద సంస్ధ గురించి ఇంత రచ్చ జరుగుతుంటే ప్రభుత్వ పెద్దలెవరూ నోరు విప్పలేదు. పాంచజన్యం ఇన్ఫోసిన్‌ మీద దాడిలో కొన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆ సంస్ధ రూపొందించిన పోర్టల్‌ లోపాలను ఎత్తి చూపవచ్చు. ఇలాంటి దానికి ఎలా ఇచ్చారని ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించవచ్చు. కానీ రెండవ అంశంలో దేశ విచ్చిన్న ముఠాలకు నిధులు ఇస్తున్నారని, దేశ ఆర్ధిక వ్యవస్ధను అస్ధిరం గావిస్తున్నారని చెబుతున్నారు. ఎక్కడైనా ఒక పోర్టల్‌ అదీ పన్ను చెల్లింపుదారులకు సంబంధించి సరిగా నడవనంత మాత్రాన దేశ ఆర్ధిక వ్యవస్ధ విచ్చిన్నం అవుతుందా ? మతి ఉండి రాసిన రాతలేనా ? అంత ద్రోహం జరుగుతుంటే కేంద్ర పాలకులు ఏ గుడ్డి గుర్రాలకు పండ్లు తోముతున్నట్లు ?


పాంచజన్య దాడి వెనుక అజెండా లేకుండా ఉండదు. కార్పొరేట్‌ శక్తుల హస్తం ఉండే అవకాశం లేకపోలేదు. ఒకనాటికి బయటకు రాకపోదు. ప్రభుత్వ వైఖరులు, విధానాలను విమర్శించే కొన్ని న్యూస్‌ పోర్టల్స్‌, వెబ్‌సైట్లకు ఇన్ఫోసిస్‌ సంస్ధ నిధులు అందచేస్తున్నదనే ప్రచారాన్ని ఆర్‌ఎస్‌్‌ఎస్‌లో కొందరు చేస్తున్నారని కూడా వార్తలు వచ్చాయి. వారు కూడా దీని వెనుక ఉండవచ్చు. తమకు నచ్చని లేదా భిన్నాభిప్రాయం వ్యక్తం చేసే వారిని దేశద్రోహులుగా చిత్రించి ప్రచారం చేయటం గత ఏడు సంవత్సరాలుగా పెద్ద ఎత్తున సాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు పారిశ్రామిక, వాణిజ్యవేత్తలను కూడా ఆ జాబితాలో చేర్చి దాడి ప్రారంభించారు. ఇన్ఫోసిస్‌ కంపెనీ స్ధాపకుల్లో ఒకరైన నందన్‌ నీలేకని 2014లో కాంగ్రెస్‌ అభ్యర్ధిగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశారని, ప్రస్తుత ప్రభుత్వ ”భావజాలాన్ని” నారాయణ మూర్తి వ్యతిరేకించటం ఏమాత్రం దాచలేరని, ఒక నిర్ణీత భావజాలానికి చెందిన వారిని ముఖ్యమైన బాధ్యతల్లో నియమించటం, అలాంటి కంపెనీ ముఖ్యమైన ప్రభుత్వ కాంట్రాక్టులను పొందటం,చైనా మరియు ఐఎస్‌ఐ ప్రభావితం చేసే ముప్పు లేదా అని కూడా ఆ వ్యాసకర్త పేర్కొన్నారు. అసలు విషయం పోర్టల్లో లోపం కాదన్నది ఈమాటలను బట్టి అర్ధం అవుతోంది.


ఇన్ఫోసిస్‌పై పాంచజన్య దాడే జాతీయ ప్రయోజనాలకు నష్టం కలిగిస్తున్నదని , భారతీయ కార్పొరేట్లు నోరువిప్పాలని, ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ సంపాదకీయం రాసింది. భావ ప్రకటన స్వేచ్చ గురించి రెండు నాలికలతో మాట్లాడుతున్నారని బిజినెస్‌ స్టాండర్డ్‌ పేర్కొన్నది.ప్రత్యర్ధుల మీద, ముస్లింల మీద నోరు పారవేసుకున్న వారెవరి మీద ఇంతవరకు బిజెపి లేదా సంఘపరివార్‌ చర్య తీసుకున్నది లేదు. మహా అయితే అదివారి వ్యక్తిగత అభిప్రాయం మాకేమీ సంబంధం లేదని తప్పించుకుంటారు. అందుకే పదే పదే అవి పునరావృతం అవుతున్నాయి. ఉదాహరణకు కేంద్ర మంత్రి నిరంజన్‌ జ్యోతి ముస్లింల మీద వ్యాఖ్యలు చేసి విధిలేక క్షమాపణ చెప్పారు. తిరిగి రెండవసారి ఆమెకు మంత్రిపదవిని బహుకరించారు. కంపు మాటలు సంపదలను నాశనం చేస్తాయనే శీర్షికతో ఎకనమిక్‌ టైమ్స్‌ తప్పు పట్టింది. పాంచజన్యకు ఇంత ధైర్యం ఎలా వచ్చింది. పోర్టల్‌ సరిగా పనిచేయకపోతే కంపెనీని సంప్రదించేందుకు గౌరవ ప్రదమైన పద్దతులు ఉన్నాయి. ఆర్దిక మంత్రిత్వశాఖ ఒక ట్వీట్‌ ద్వారా అంత పెద్ద కంపెనీ సిఇఓ తమను కలవాలని ఆదేశించింది. ఇది ఎవరి గౌరవానికి భంగం ?


ఇన్ఫోసిస్‌ కంటే ఎన్నో రెట్లు పెద్దదైన టాటా గ్రూపు కంపెనీ మీద కూడా ఆగస్టు నెలలో వాణిజ్య మంత్రి పియూష్‌ గోయల్‌ దాడి చేశారు. అంబానీ గ్రూపు కోసం అమెజాన్ను అడ్డుకుంటున్న దేశభక్తి ఒకవైపు మనకు కనిపిస్తూనే ఉంది. అనేక మంది అమెజాన్‌పై దాడిని సమర్ధించి మన స్వదేశీ కార్పొరేట్లకు మద్దతు ఇస్తే తప్పేమిటి అని ఎదురుదాడికి దిగిన వారున్నారు. మరి ఇప్పుడు ఇన్ఫోసిస్‌, టాటా కంపెనీల మీద జరుగుతున్నదాడి గురించి ఏం చెబుతారు ? ఇలా విదేశీ-స్వదేశీ కంపెనీల మీద దాడులకు దిగితే బయటి నుంచి ఎవరైనా పెట్టుబడులు పెడతారా ? స్వదేశీ కార్పొరేట్లు తమకు అనువైన విదేశాలకు పెట్టుబడులను తరలించవా ? ఉపాధి కోసం ఎదురు చూస్తున్న యువతకు ఏం సమాధానం చెబుతారు ? ఆవు-ఆక్సిజన్‌-గోమూత్రంలో బంగారం, దాని పేడను మండిస్తే ఏదో జరుగుతుందన్నది తప్ప వారి దగ్గర వేరే సమాధానాలున్నాయా ?


ఒక కంపెనీ వైఫల్యం గురించి ఇంతగా గుండెలు బాదుకుంటున్నవారు, దేశద్రోహాన్ని, ఆర్ధిక వ్యవస్ద విచ్చిన్నాన్ని చూస్తున్న వారికి నరేంద్రమోడీ సర్కార్‌ తప్పిదాలు, దిద్దుబాటులో వైఫల్యాలు కనిపించవా ? నల్లధనాన్ని వెలికి తీసేందుకు పెద్ద నోట్లను రద్దు చేశానని 2016 నవంబరు ఎనిమిదిన ప్రకటించిన నరేంద్రమోడీ ఇప్పటి వరకు వెలికితీసిన నల్లధనం ఎంతో నోరు విప్పి చెప్పారా ? నాలుగు సంవత్సరాల తరువాత తీరికగా సెలవిచ్చిందేమిటి ? తన చర్యతో దేశంలో నల్లధనం తగ్గిందట, బ్యాంకులావాదేవీలు పెరిగాయట ? దేనితో నవ్వాలో జనానికి అర్ధం కాలేదు. నోట్ల రద్దు, తగిన కసరత్తులేకుండా చేసిన జిఎస్‌టి వలన జరిగిన నష్టాన్ని సంవత్సరాలు గడిచినా పూడ్చలేని మోడీ సర్కార్‌ ఘోర వైఫల్యం కనపడలేదు గానీ పాంచజన్యానికి ఇన్ఫోసిస్‌ దేశద్రోహం కనిపించిందా ? నరేంద్రమోడీ సర్కార్‌ ఇవన్నీ జవాబుదారీతనంతో చేసిన నిర్వాకాలని చెబుతారా ?పాంచజన్య చేసిన దాడి గురించి వ్యాఖ్యానించాలని కోరగా ఇన్ఫోసిస్‌, టాటా కంపెనీలు స్పందించలేదని రాయిటర్స్‌ వార్తా సంస్ద పేర్కొన్నది. తమతో మాట్లాడిన ప్రతి ఒక్కరూ ప్రభుత్వం, ఆర్‌ఎస్‌ఎస్‌కు వ్యతిరేకంగా నోరు విప్పితే సంభవించే పర్యవసానాల గురించి భయపడ్డారని కూడా రాసింది. ఈ వార్త ప్రపంచవ్యాపితంగా మీడియాలో ప్రాచుర్యం పొందింది. విదేశీ పెట్టుబడిదారులు ఈ పరిణామాన్ని గమనించరా ?


ఇ కామర్స్‌ నిబంధనలను విమర్శించినందుకు గాను వాణిజ్య మంత్రి పియుష్‌ గోయల్‌ టాటా గ్రూప్‌ కంపెనీపై ధ్వజమెత్తారు. స్ధానిక వ్యాపారులు కేవలం లాభాల గురించే ఆలోచించకూడదని సుభాషితం పలికారు. జాతీయ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్నాయని ఆరోపించారు.టాటా సన్స్‌ చైర్మన్‌ ఎన్‌ చంద్రశేఖరన్‌ పేరు ప్రస్తావిస్తూ మంత్రి వ్యాఖ్యలు చేశారు. వినియోగదారులకు లబ్దిచేకూర్చేందుకు తాను తెస్తున్న చట్టాలను టాటా సన్స్‌ అభ్యంతర పెడుతున్నారు, అదెంతో బాధ కలిగించింది. కొన్ని విదేశీ కంపెనీలను కొనుగోలు చేసిన తరువాత జాతీయ ప్రయోజనం కంటే అది మరింత ముఖ్యమైంది. నేను, నాది, నా కంపెనీ అనే వైఖరి నుంచి మనం ముందుకు పోవాలి. జాతీయవాద దేశాలైన జపాన్‌, దక్షిణ కొరియాల్లో మీ ఉక్కు ఉత్పత్తులను అమ్మేందుకు ప్రయత్నించి చూడండి. దేశంలోని ఎంఎస్‌ఎంఇల నుంచి ధర ఎక్కువైనా జాతీయ ప్రయోజనాలను గమనంలో ఉంచుకొని వాటిని కొనుగోలు చేయాలని మంత్రి అన్నారని వార్తలు వచ్చాయి. పియూష్‌ గోయల్‌ సిఐఐ ఏర్పాటు చేసిన నాలుగు గోడల మధ్య జరిగిన వార్షిక సమావేశంలో ఆ విమర్శ చేశారు. అధికారికంగానే సమావేశం తరువాత సదరు మంత్రి ప్రసంగం ఉన్న వీడియోను సిఐఐ యూట్యూబ్‌ ఛానల్లో పెట్టారు. అయితే దాని మీద విమర్శలు రావటంతో ప్రభుత్వమే ఉపసంహరించాలని కోరింది. దాంతో వివాదాస్పద అంశాలను కత్తిరించి తిరిగి విడుదల చేశారు. తరువాత కారణాలు చెప్పకుండానే తరువాత దాన్ని తొలగించారు.పియూష్‌ గోయల్‌ స్ఫూర్తితో పాంచజన్య బహిరంగదాడికి పాల్పడింది.


ప్రతి క్షణం నరేంద్రమోడీ సర్కార్‌ విదేశీ కంపెనీలు రావాలంటూ ఎర్ర తివాచీలు పరుస్తుంటారు. ప్రభుత్వ ఆస్తులను అప్పనంగా అప్పగిస్తాం ప్రభుత్వానికి నాలుగు రూపాయలిమ్మని ఆహ్వానాలు, విదేశీ, స్వదేశీ కార్పొరేట్లకు దారులు తెరుస్తున్నారు. కార్పొరేట్‌ కంపెనీలు లాభాల కోసం గాక ప్రజాసేవకోసం వస్తాయా ?సులభతర వాణిజ్యం, మరొక పేరుతో విదేశీ పెట్టుబడులు, కంపెనీలు, కొనుగోళ్లు, అమ్మకాలను అనుమతిస్తున్నది కేంద్ర ప్రభుత్వం. మన మార్కెట్‌ను విదేశీ కంపెనీలకు, వస్తువులకు ఎప్పుడో తెరిచారు. వాటి పర్యవసానాలకు నిదర్శనమే పియూష్‌ గోయల్‌ మండిపాటు అన్నది స్పష్టం. పోటీలో చిన్న సంస్ధలు నిలవలేవు, దేశీయ వ్యాపారాలకు ఎసరు ముంచుకు వస్తున్నది. సూదీ, దారాల మొదలు ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయలేని వస్తువు లేదు. మార్కెట్లో ఉన్న రేట్ల కంటే తక్కువకు మన ఇంటికి ఉచితంగా తెచ్చి ఇస్తున్నారు. ఆ పోటీ కారణంగానే ఆ రంగంలో ప్రవేశించిన బడా సంస్దలు విదేశీ కంపెనీలతో చేతులు కలుపుతున్నాయి. తమకు అనుకూలమైన నిబంధనల కోసం పట్టుబడుతున్నాయి. లేనపుడు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. వాటిని పూర్తిగా అంగీకరిస్తే బిజెపి ఓటు బ్యాంకుగా ఉన్న చిన్న, చిల్లర వ్యాపారులు దెబ్బతింటారు. చిన్న, సన్నకారు పరిశ్రమలు మరింతగా మూతపడతాయి. ఉపాధి గల్లంతు అవుతుంది. ఇప్పటికే ఈ సెగ నరేంద్రమోడీ సర్కార్‌కు తగలటం ప్రారంభమైంది. అందువల్లనే చిన్న పరిశ్రమల నుంచి వస్తువులను కొనుగోలు చేయాలంటూ పియూష్‌ గోయల్‌ మాట్లాడాల్సి వస్తోంది. అయితే దానికీ ఒక పద్దతి ఉంటుంది. సాధారణ వ్యాఖ్యలు చేయటం వేరు, ప్రత్యేకించి ఒక కంపెనీ మీద దాడి చేయటం వేరు. ఆ బాటను గోయల్‌ చూపారు కనుకనే పాంచజన్య తాజాగా ఇన్ఫోసిస్‌ మీద దాడికి దిగింది.


టాటా గ్రూపు నిర్వహించే ప్రోగ్రెసివ్‌ ఎలక్ట్రరల్‌ ట్రస్టు నుంచి 2018-19లో బిజెపికి రు.356 కోట్ల విరాళం ముట్టింది.ఆ ఏడాది అంత మొత్తం ఏ కార్పొరేట్‌ కంపెనీ నుంచి బిజెపికి రాలేదు. ఎందుకు అంతేసి మొత్తాలు కార్పొరేట్‌లు ఇస్తున్నాయంటే తమకు అనుకూలమైన విధానాలను రూపొందించాలని ఇచ్చే అధికారిక ముడుపులే అవి. అనధికారిక మొత్తాలు చేతులు మారటం గురించి చెప్పనవసరం లేదు.


కేంద్ర ప్రభుత్వం తమకు అనుకూలమైన విధానాలను అనుసరించినంత కాలం బడా సంస్దలు మౌనంగా ఉంటాయి. లేనపుడు పాలకులనే మార్చివేసేందుకు పావులు కదుపుతాయి. మన్మోహన్‌ సింగ్‌ కంటే మరింతగా, నిర్దాక్షిణ్యంగా తమకు దోచిపెడతారనే కారణంతోనే నరేంద్రమోడీని విదేశీ, స్వదేశీ కార్పొరేట్‌ సంస్దలు, వాటి ఆధీనంలోని బడా మీడియా ఆకాశానికి ఎత్తిందన్నది బహిరంగ రహస్యం. ద్విచక్ర వాహనాల మీద 28శాతంగా ఉన్న జిఎస్‌టిని తగ్గింపు గురించి ఆలోచిస్తామని చెప్పిన నిర్మలా సీతారామన్‌ ప్రకటనను బజాజ్‌ కంపెనీ సహజంగానే స్వాగతించింది. పద్దెనిమిది శాతానికి తగ్గించే అవకాశం ఉందని, మోటార్‌ సైకిళ్లు, స్కూటర్ల వెల ఎనిమిది నుంచి పదివేల మేరకు తగ్గుతుందని ఒక టీవీ ఇంటర్వ్యూలో బజాజ్‌ ఆటో ఎండీ రాజీవ్‌ బజాజ్‌ చెప్పారు. ఎగుమతి ప్రోత్సహాకాలను రద్దు చేసినందుకు అదే ఇంటర్వ్యూలో రాజీవ్‌ బజాజ్‌ కేంద్ర ప్రభుత్వం మీద ధ్వజమెత్తారు. దాని వలన తమ కంపెనీ రు.300 కోట్లు నష్టపోయిందని చెప్పారు.ఎగుమతుల ప్రోత్సాహకపధకాన్ని ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం, 2017-18లో ఎగుమతి ప్రోత్సాహాల కింద వివిధ సంస్థలకు చేకూర్చిన లబ్ది రు.34,750 కోట్లు. 2020లో ఏప్రిల్‌-డిసెంబరు మాసాల మధ్య ఆ మొత్తాన్ని తొమ్మిదివేల కోట్లకు కుదించారు. తరువాత కొత్త దరఖాస్తులను స్వీకరించటాన్నే నిలిపివేశారు.


కేసుల నుంచి తప్పుకొనేందుకు తమది రాజకీయ సంస్ద కాదు కేవలం సాంస్కృతిక సంస్ద అని రాజకీయాల్లో పాల్గొనబోమని రాతపూర్వకంగా జాతి పిత గాంధీ హత్య సందర్భంగా రాసి ఇచ్చిన సంస్ద. అప్పటి నుంచి అది చేస్తున్న రాజకీయం ఏమిటో తెలిసిందే. అందువలన అవసరార్ధం అవాస్తవాలు చెప్పవచ్చని మార్గం చూపిన ఆదర్శం దానిది. ఈ నేపధ్యంలో పాంచజన్య తమ అధికార పత్రిక కాదని ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రతినిధి చెప్పారు. ఇది వాస్తవమా ? అతల్‌ బిహారీ వాజ్‌పాయి సంపాదకుడిగా 1948లో అది ప్రారంభమైంది. రాష్ట్ర ధర్మ ప్రకాషన్‌ పేరుతో ఆర్‌ఎస్‌ఎస్‌ ఒక ప్రచురణ కేంద్రాన్ని ప్రారంభించింది. 1977లో పత్రిక ప్రచురణ హక్కులను ఆర్‌ఎస్‌ఎస్‌ ఏర్పాటు చేసిన మరో సంస్ధ భారత ప్రకాషన్‌ ఢిల్లీ లిమిటెడ్‌కు బదలాయించింది. అందువలన పత్రిక మాది కాదంటే దబాయింపు తప్ప మరొకటి కాదు. ఇలాంటి వైఖరిని అర్ధం చేసుకోలేని స్ధితిలో జనం ఉన్నారా ?


లోక్‌సభ ఎన్నికలు ముగిసి రెండవ సారి నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత బజాజ్‌ గ్రూప్‌ అధిపతి రాహుల్‌ బజాజ్‌ మాట్లాడింది గుర్తుందా ? గోరక్షకుల పేరుతో మూకలు చెలరేగి హత్యాకాండకు పాల్పడుతున్నవారి మీద, పార్లమెంట్‌లో జాతిపిత హంతకుడు గాడ్సేను స్తుతించిన బిజెపి ఎంపీ ప్రజ్ఞాసింగ్‌ ఠాకూర్‌ మీద ఎలాంటి చర్య తీసుకోలేదని రాహుల్‌ బజాజ్‌ నరేంద్రమోడీని విమర్శించారు. ఇదెక్కడో ఎసి గదుల్లో గుసగుసలాడింది కాదు. మోడీ కంటే ఎక్కువ పలుకుబడి కలిగిననేతగా ప్రాచుర్యం పొందిన అమిత్‌ షా, పియూష్‌ గోయల్‌, నిర్మలాసీతారామన్‌ సమక్షంలోనే బహిరంగంగా 2019 డిసెంబరు ఒకటిన చెప్పిన మాటలు. అంతేనా ! మోడీ ప్రభుత్వాన్ని విమర్శించలేకపోతున్నారని, కార్పొరేట్‌లు భయంతో జీవిస్తున్నారని కూడా అన్నారు. అప్పటికీ ఇప్పటికీ పరిస్ధితిలో ఎలాంటి మార్పు లేదని, ఇన్ఫోసిస్‌పై దాడిని మౌనంగా చూస్తున్న కార్పొరేట్‌ల వైఖరి వెల్లడించటం లేదా ?