Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


2021నవంబరు నాలుగవ తేదీ నుంచి డిసెంబరు నాలుగవ తేదీన ఇది రాస్తున్న సమయం వరకు దేశంలో ప్రభుత్వం (చమురు సంస్ధలు) పెట్రోలు,డీజిలు ధరలను పెంచలేదు. నెల రోజులైనా జేబులు కొల్లగొట్టనందుకు నరేంద్రమోడీ సర్కార్‌ను మెచ్చుకోవాలనే వారితో కాసేపు ఏకీభవిద్దాం. త్వరలో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల పోలింగ్‌ ముగిసేవరకు ఇదే స్ధితిని కొనసాగించినా ఆశ్చర్యం లేదు. ఆవిధంగా ముందుకు పోయి జనం మీద ప్రేమను పొంగి పొర్లించి మురికి గంగను చేర్చి ప్రక్షాళన జరిపించినా ముక్కు మీద వేలేసుకోవద్దు. ఇది తెరముందు మనకు కనిపిస్తున్నదృశ్యం. తెరవెనుక ఏం జరుగుతోందో ముందు చూద్దాం. ఇలా చెబుతున్నామంటే జోశ్యం కాదు. పాలకుల ఆచరణ ప్రాతిపదిక ఉంది. ఒక్కసారి గతాన్ని గుర్తు చేసుకోండి. 2021 ఫిబ్రవరి 27 నుంచి మార్చి 23 వరకు రు.91.17, మరుసటి రోజు రు.90.99, 25 నుంచి 29వరకు పెట్రోలు రేటు రు.90.78, మరుసటి రోజు నుంచి ఏప్రిల్‌ 14వరకు రు.90.56, ఆ మరుసటి రోజు నుంచి మే మూడవ తేదీ వరకు రు.90.40. ఇదంతా ఐదు రాష్ట్రాల ఎన్నికల అచ్చేదిన్‌లో జరిగింది. ఈ కాలంలో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఎలా ఉన్నాయి?


ఫిబ్రవరినెల 28 రోజుల్లో చమురు ధరలను 17 సార్లు సవరించారు. ఆ నెలలో ముడి చమురు మనం కొనుగోలు చేస్తున్న రకం పీపా ధర నెల సగటు 61.22 డాలర్లుంది. మార్చి నెలలో 64.73 డాలర్లకు పెరిగింది. ఐనా ఫిబ్రవరి 27 నుంచి మార్చి 23వరకు ఒకే ధర రు.91.17, ఆ తరువాత ఇంకా తగ్గింది. ఏప్రిల్‌ నెలలో ముడిచమురు సగటు ధర 63.40 డాలర్లు. మార్చి నెల కంటే ఏప్రిల్‌లో తగ్గిన మొత్తం 1.33 డాలర్లు, దాన్ని వినియోగదారులకు బదలాయించారు గనుక లీటరుకు 38 పైసలు తగ్గించారనుకుందాం ? మరి ఫిబ్రవరి-మార్చినెలల మధ్య పీపా ధరలో 3.51 డాలర్ల పెరుగుదల ఉంటే ధరలను స్ధిరంగా ఉంచటం ఎలా సాధ్యమైనట్లు ? ఇవి ఐదు రాష్ట్రాల ఎన్నికల అచ్చేదినాలు కదా ! మోడీ మాయాజాలం అన్నది అంగీకరించాల్సిందే. బవిరి గడ్డాలను చూసి నీతి నిజాయితీలు ఉంటాయని నమ్మే రోజులు కావివి !


ఇక వచ్చే ఏడాది జరగనున్న మరో ఐదు రాష్ట్రాల అచ్చేదిన్‌ సంగతి చూద్దాం. ఉప ఎన్నికల్లో తగిలిన ఎదురుదెబ్బలతో కేంద్ర ప్రభుత్వం పెట్రోలు మీద ఐదు, డీజిలు మీద పది చొప్పున పన్నులు తగ్గించినట్లు ప్రకటించింది. సంతోషం. చాలా రాష్ట్రాలు నరేంద్రమోడీగారిని ఆదర్శంగా తీసుకొని గతంలో ఆ పెద్దమనిషి మాదిరి పన్నులు పెంచకపోయినా వాట్‌ను తగ్గించాయి. ఇంకా సంతోషం. ఆ తరువాత జరుగుతున్నదేమిటి ? అదే జనాలు తెలుసుకోవలసింది. అక్టోబరు ఒకటి నుంచి నవంబరు 3వరకు 34రోజుల్లో చమురు ధరలను 28 సార్లు సవరించారు. ఆ నెలలో ముడిచమురు సగటు ధర 82.11 డాలర్లు, నవంబరు నెలలో అది 80.64డాలర్లకు తగ్గింది.దీపావళి ధమాకా పేరుతో కేంద్రం, రాష్ట్రాలు తగ్గించిన పన్నుల మేరకు తప్ప చమురు కంపెనీలు నెల రోజులుగా తమ ధరలను ఒక్క పైసా కూడా ఎందుకు తగ్గించలేదు ? వాటికి పన్నులతో సంబంధం లేదు కదా ? ముడిచమురు ధరలు పెరిగితే పెంచుతాం తగ్గితే దించుతాం అని చెప్పిన విధానం అక్టోబరులో పక్కాగా అమలు చేశారు, నవంబరులో ఏమైంది ? విశ్వగురువు నరేంద్రమోడీని అడిగేందుకు విలేకర్లకు అవకాశం ఇవ్వరు, ఆ పెద్దమనిషి నోరు విప్పరు ? అసలు కథ ఇక్కడే ప్రారంభమైంది.


అక్టోబరు 25న గరిష్టంగా మన కొనుగోలు ధర పీపా 84.77 డాలర్లను తాకింది.నవంబరు 10న 84.07 డాలర్ల తరువాత క్రమంగా పడిపోతూ డిసెంబరు నాలుగున 69.52 డాలర్లకు తగ్గింది.మొత్తం మీద పదిహేను డాలర్లు తగ్గినా చమురు ధరలు పైసా తగ్గించలేదు. చంబల్‌ బందిపోట్లు ఆప్రాంత ధనికులను మాత్రమే దోచుకొనే వారు. ప్రభుత్వం దేశవ్యాప్తంగా పెట్రోలు కొనే సర్‌ గోచిపాత రాయుడి మొదలు అత్యంత పేదలైన అంబానీ, అదానీల వరకు అందరినీ సమంగా చూస్తోంది. చంబల్‌ దోపిడీ పెద్దదా ఇది పెద్దదా ? ప్రకటిత ధరల విధానం ఏమైంది ? ప్రభుత్వరంగ సంస్థలదే మార్కెట్‌లో ప్రధాన వాటా అయినా నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత రిలయన్స్‌ బంకులు తిరిగి తెరుచుకున్నాయి.ప్రభుత్వ ధరలనే అవీ వసూలు చేస్తున్నాయి. ముడి చమురు ధర తగ్గిన మేరకు అదేమీ తగ్గించలేదు. ప్రభుత్వ విధానం దానికి లాభాల పంట పండిస్తున్నపుడు వాటిలో కొంత మొత్తాన్ని ఎన్నికల బాండ్లు, ఇతర రూపాల్లో బిజెపికి అప్పగిస్తుంది గానీ జనాలకు ఎందుకు తగ్గిస్తుంది. ఓకే, రిలయన్స్‌ ప్రైవేటు కంపెనీ కనుక అలా చేస్తోంది అనుకుందాం, మరి ప్రభుత్వ కంపెనీలు ? మరో విధంగా, అదే ఓట్ల రూపంలో బిజెపికి లబ్ది కలిగించేందుకు చూస్తున్నాయి. ఎన్నికల తరుణంలో నెలల తరబడి ధరలను సవరించకుండా పాలక పార్టీకి సానుకూలతను సృష్టించేందుకు తమ వంతు చేస్తున్నాయి.


తమ పాలిత రాష్ట్రాల మాదిరి ఇతర పార్టీల ఏలుబడిలోని రాష్ట్రాలు కూడా పన్నులు తగ్గించాల్సిందే అని బిజెపి డిమాండ్‌ చేస్తోంది.రాష్ట్రాలను దెబ్బతీసే కేంద్ర ప్రభుత్వ ఎత్తుగడ కారణంగా ఇప్పటికే రాష్ట్రాలు ఎక్సయిజు పన్ను వాటాను గణనీయంగా కోల్పోయాయి, వాటిలో మెజారిటీ బిజెపి పాలనలో ఉన్నవే. కేంద్రంలో అధికారం ఉంది కనుక ఆ మేరకు అవి వేరే రూపంలో ఆ నష్టాన్ని పూడ్చుకోవచ్చు. ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలకు అలాంటి అవకాశం లేదు.2017లో పెట్రోలు మీద ఎక్సయిజు పన్ను లీటరుకు రు.9.48, డీజిలు మీద రు.11.33 ఉండగా 2021 ఫిబ్రవరిలో ఆ మొత్తాలను కేంద్రం రు.1.40-1.80కి తగ్గించింది. ఆ మేరకు, తరువాత అదనంగా సెస్‌లను విధించింది. వినియోగదారులకు ఎలాంటి మార్పు లేనందున వారికి ఈ మతలబు అర్దం కాలేదు. దీపావళి పేరుతో తగ్గించిన మేరకు రాష్ట్రాలకు వాట్‌ శాతం తగ్గి రాబడి తగ్గింది. అసలు భారీ మొత్తాల్లో సెస్‌లు పెంచిన కేంద్రాన్ని వదలి బిజెపి రాష్ట్రాల్లో రాజకీయం చేస్తోంది.


ఢిల్లీ ఆమ్‌ ఆద్మీ ప్రభుత్వం పెట్రోలుపై వాట్‌ను 30నుంచి 19.4శాతానికి తగ్గించటంతో డిసెంబరు ఒకటిన రు.104.01గా ఉన్న రేటు నాలుగవ తేదీన రు.95.41కి తగ్గింది. డీజిలు మీద అంతకు ముందే వాట్‌ 16.75శాతం ఉన్నందున డీజిలు ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ఢిల్లీలో ఇప్పుడు డీజిలుపై కేంద్ర పన్నులు, సెస్‌ల మొత్తం రు.21.80కాగా రాష్ట్ర పన్ను రు.12.69 మాత్రమే. పెట్రోలు మీద కేంద్ర పన్ను రు.27.90 కాగా ఢిల్లీ రాష్ట్రపన్ను రు.15.60 మాత్రమే. కేంద్ర పన్నులు అన్ని చోట్లా ఒకే విధంగా ఉంటాయి. రాష్ట్రాలలో వాట్‌ రేట్లు భిన్నంగా ఉన్నందున వాటికి అనుగుణంగా మొత్తాలు మారతాయి.


బిజెపి నేతలు, వారికి వంతపాడే నోళ్లు అమ్ముకొనే వారు చేసే వాదనల గురించి తెలిసిందే. కేంద్రం విధించే పన్నుల్లో 41శాతం వాటా రాష్ట్రాలకు వస్తుంది. కేంద్రం చేసే ఖర్చు కూడా రాష్ట్రాలలోనే కనుక రాష్ట్రాలకే ఎక్కువ దక్కుతోందని, అందువలన రాష్ట్రాలే పన్ను తగ్గించాలనే కుతర్కాన్ని ముందుకు తెస్తారు. ఇది జనాలను మోసం చేసే ప్రక్రియ. పిఆర్‌ఎస్‌ లెజిస్లేటివ్‌ రీసర్చ్‌ సంస్ద వెల్లడించిన వివరాల మేరకు 2017 ఏప్రిల్‌లో పెట్రోలు మీద కేంద్రం విధించిన ఎక్సయిజు పన్ను (రాష్ట్రాలకు వాటా ఇచ్చేది) రు.9.48, సెస్‌,సర్‌ఛార్జీలు రు.12. కేంద్ర పన్నుల్లో వీటి శాతాలు 44-56, కాగా 2021ఫిబ్రవరి నాటికి ఇవి రు.1.40 – 31.50గా ఉన్నాయి, శాతాలు 4-96 మారాయి. ఇదే డీజిలు సంగతి చూస్తే ఎక్సయిజు – సెస్‌,సర్‌ఛార్జీలు 2017 ఏప్రిల్‌లో రు.11.33- రు.6 శాతాల వారీ 65-35గా ఉన్నాయి. 2021 ఫిబ్రవరి నాటికి ఇవి రు.1.80- రు.30 కాగా శాతాలు 6-94కు మారాయి. రాష్ట్రాలకు హక్కుగా రావాల్సిన వాటాకు మోడీ సర్కార్‌ ఎలా కోత పెట్టిందో స్పష్టం. కేంద్రం పన్నుల పేరుతో వసూలు చేసిన మొత్తాలు 2014 తరువాత గణనీయంగా పెరిగాయి.2019-20లో ఆ మొత్తాలు రు.2.38లక్షల కోట్లుండగా 2020-21కి అవి 3.84లక్షల కోట్లకు పెరిగాయి.2020 మేనెలలో పెట్రోలు మీద పది, డీజిలు మీద రు. 13 చొప్పున భారం మోపటమే దీనికి కారణం. ఇదే కాలంలో రాష్ట్రాలకు వచ్చే వాటా మొత్తం తగ్గింది.


వచ్చే ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ఇంకా సమయం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఐదు, పది రూపాయల మేరకు భారం తగ్గించిన తరువాత ముడి చమురు ధరలు తగ్గాయి. ఒక చేత్తో ఇచ్చి మరోచేత్తో తీసుకుంటున్నట్లుగా ముడి చమురు ధరలు తగ్గిన మేరకు జనాలకు తగ్గించకుండా కేంద్రం ధరల రూపంలో దండుకుంటోంది. వచ్చే రోజుల్లో రెండు మూడు పరిణామాలు జరగవచ్చు. ఒకటి ముడి చమురు ధరలు ఇప్పుడు తగ్గుతున్నాయి. ఇంకా తగ్గినా గత నెల రోజుల మాదిరి ధరలను తగ్గించకపోవచ్చు.పెరిగితే ఇప్పుడు వచ్చిన లాభాలు కంపెనీల వద్ద ఉంటాయి గనుక ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసే వరకు ఇదే ధరలను కొనసాగించవచ్చు. మొత్తంగా నవంబరు-ఏప్రిల్‌ మధ్య జరిగిన లావాదేవీల లెక్కలు చూసుకున్నపుడు వచ్చిన లాభం హరించుకుపోయి నష్టం ఎక్కువ ఉందనుకోండి, ఎన్నికలు ముగిసిన తరువాత ఆమేరకు అసలు ఫాయిదాలను వడ్డీతో సహా వసూలు చేసినట్లు ధరలు పెంచి లోటు మొత్తాన్ని కంపెనీలు పూడ్చుకుంటాయి. మొత్తం మీద రాజకీయ-వాణిజ్య లాభనష్టాలను చూసుకుంటే ధరలను అదుపులో ఉంచితే కొందరినైనా మోసపుచ్చితే పాలకపార్టీకి ఎంతో కొంత రాజకీయ లబ్ది కలుగుతుంది. కంపెనీలకు వచ్చే ఆర్ధిక నష్టం ఏమీ ఉండదు. జనాల జేబు గుల్ల మామూలుగానే ఉంటుంది. అధికార పార్టీలపై వ్యతిరేకత పెరగటానికి ధరల పెరుగుదల ఒక కారణం మాత్రమే. అది ఒక్క చమురు ధరల మీదనే ఆధారపడి ఉండదు. అందువలన వాటిని నియంత్రించి జనాలను మాయ చేయ చూసినా వ్రతం చెడ్డా ఫలం దక్కనట్లు ఇతర కారణాలతో బిజెపికి ఎదురు దెబ్బలు తగలవచ్చు.