ఎం కోటేశ్వరరావు
ఉదరపోషణార్ధం బహుకృతవేషాలు అన్నట్లుగా అధికారం కోసం పార్టీలు, నేతలు ఎన్ని మాటలు చెబుతున్నారో కదా ! తాము అధికారంలోకి వస్తే ఆవు పేడ కొనుగోలు చేస్తామని ఉత్తర ప్రదేశ్ కాంగ్రెస్ రైతులకు వాగ్దానం చేసింది. ఆవు రాజకీయంలో ఇదో కొత్త కోణం. తమ పార్టీ అధికారంలో ఉన్న చత్తీస్ఘర్లో ఇప్పటికే ఈ పధకాన్ని అమలు జరుపుతున్నామని, తమను ఎన్నుకుంటే ఉత్తర ప్రదేశ్లో కూడా అమలు చేస్తామని చెప్పింది. అవినీతి అక్రమాలను అంతం చేసేందుకు కృష్ణుడే నరేంద్రమోడీ అవతారంలో జన్మించారని ఉత్తర ప్రదేశ్ బిజెపి మంత్రి ఒకరు చెప్పారు. తనకు కృష్ణుడు ప్రతిరోజూ కలలోకి వచ్చి ఉత్తర ప్రదేశ్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ పోరు పెడుతున్నట్లు సమాజవాది నేత అఖిలేష్ యాదవ్ చెప్పారు. ఎన్నికలు భలే వినోదాన్ని కలిగిస్తాయి కదా !
గౌధన్ న్యాయ యోజన పధకం కింద కిలో రు.1.50 వంతున ఆవు పేడ కొని సేంద్రియ ఎరువులను తయారు రైతులకు అందచేస్తామని గతేడాది జూలైలో చత్తీస్ఘడ్ ప్రభుత్వం ప్రకటించింది. ఇది ఆచరణ సాధ్యం కాదని ప్రతిపక్ష బిజెపి అప్పుడు విమర్శించింది. అదే పార్టీకి చెందిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తమ ప్రభుత్వం ఆవుపేడను సేకరించి ఎరువులు, ఇతర ఉత్పత్తుల తయారీ తలపెట్టినట్లు గతేడాది నవంబరులో ప్రకటించారు. అంతే కాదు పశువులకు సుస్తీ చేసినపుడు 109నంబరుకు ఫోన్ చేస్తే వైద్యులు ఇంటికి వచ్చి చికిత్స చేస్తారని కూడా ప్రకటించారు. పశువుల పేడతో ఎరువును రైతులు తయారు చేసుకోవటం కొత్తేమీ కాదు. ఆవు పేరు జోడించటమే గమనించాల్సిన అంశం. ఆవు, ఎద్దు, దున్న, గేదె-బర్రెలకు పెట్టే మేత అంతా ఒకటే, అవి వేసే పేడ సేమ్ టు సేమ్. పాలివ్వటం ఆగిపోయిన ఆవులను రైతులు వదలివేస్తున్నారని, అవి వేసే పేడను ప్రభుత్వానికి అమ్మి సొమ్ము చేసుకోవాలని చత్తీస్ఘర్ సిఎం భూపేష్ భాగెల్ చెప్పారు. వాటికి పెట్టే మేత, నిర్వహణ ఖర్చుకు తగ్గ ఆదాయం పేడ అమ్మకం ద్వారా వస్తుందా అన్నదే సమస్య. రాష్ట్రంలో రైతులెవరూ పేడ అమ్మరని బిజెపి మాజీ మంత్రి అజయ చక్రధర్ అన్నారు. డిసెంబరు నాటికి రెండు లక్షల మంది రైతుల నుంచి 59లక్షల క్వింటాళ్ల ( రు.114 కోట్ల ) ఆవు పేడను కొనుగోలు చేసినట్లు, పదిలక్షల క్వింటాళ్ల వర్మీకంపోస్టు తయారు చేసినట్లు ప్రభుత్వం చెబుతోంది.
కాంగ్రెస్ అవినీతిని అంత మొందించేందుకు, ఆ పార్టీ నాశనం చేసిన సంస్కృతి పరిరక్షణ కృష్ణుడు నరేంద్రమోడీ అవతారమెత్తి జన్మించినట్లు ఉత్తర ప్రదేశ్ వ ్యవసాయ మంత్రి కమల్ పటేల్ చెప్పారు.భారత్కు ముప్పు తలెత్తినపుడల్లా భగవంతుడు ఏదో ఒక అవతారమెత్తుతున్నాడని ఇప్పుడు మోడీ రూపంలో ఉన్నారని చెప్పారు. మధుర నియోజకవర్గంనుంచి సిఎం యోగి ఆదిత్యనాధ్ను పోటీకి నిలపాలని ఎందుకంటే కృష్ణుడు కలలోకి వచ్చి మధుర నుంచి పోటీ చేసే రాష్ట్ర ముఖ్యమంత్రి విజయం సాధిస్తారని చెప్పారంటూ బిజెపి రాజ్యసభ సభ్యుడు హరనాధ్ సింగ్ పార్టీ అధ్యక్షుడు జెపి నడ్డాకు లేఖ రాశారు. అయితే కృష్ణుడి జన్మ స్ధలంగా చెప్పుకొనే మధుర, రాముడి జన్మకేంద్రంగా చెప్పే అయోధ్యను కాదని గోరఖ్పూర్ నుంచి యోగి పోటీ చేస్తున్నారు. మరి కృష్ణుడు, రాముడికి కోపం వస్తుందా రాదా అన్నది చూడాల్సి ఉంది. హరనాధ్ సింగ్ లేఖ వార్తలను చూసిన తరువాత సమాజవాది నేత అఖిలేష్ యాదవ్ స్పందిస్తూ కృష్ణుడు తనకు ప్రతి రోజూ కలలోకి వస్తూ సమాజవాది పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుందని తనకు చెబుతున్నారని ప్రకటించారు.
గతంలో అధికారంలో ఉన్న సమాజవాది నేతలు ములాయం సింగ్ యాదవ్, అఖిలేష్ యాదవ్ కుటుంబ పాలన కేంద్రాలుగా మారినట్లు బిజెపి ధ్వజమెత్తింది. ఇప్పుడు అలాంటి ఆరోపణలు-విమర్శలకు గురైన కుటుంబ సభ్యులను బిజెపి చేరదీసింది. ములాయం సింగ్ రెండో భార్య కోడలైన అపర్ణా యాదవ్, రెండో భార్య బావమరిది, మాజీ ఎంఎల్ఏ ప్రమోద్ గుప్తాను పార్టీలో చేర్చుకుంది. దీంతో తనకు కుటుంబ భారాన్ని బిజెపి తగ్గించిందని అఖిలేష్ యాదవ్ చమత్కరించారు. అపర్ణా యాదవ్ బిజెపిలో చేరిన కొద్ది రోజుల తరువాత శుక్రవారం నాడు ములాయం సింగ్ యాదవ్ను కలసి ఆశీస్సులు అందుకున్నట్లు తెలుపుతూ కలసినప్పటి ఫొటో అంటూ ఒక చిత్రాన్ని ట్విటర్ద్వారా విడుదల చేశారు.ములాయం సింగ్ కోడళ్లు ఇద్దరూ ఠాకూర్ సామాజిక తరగతికి చెందిన వారు తప్ప యాదవులు కాదు. అందువలన అపర్ణ బిజెపిలో చేరినంత మాత్రాన ఆ పార్టీకి కలిగే లాభమూ సమాజవాదికి వచ్చే నష్టమూ ఏమీ ఉండదని చెబుతున్నారు. ములాయం రాజకీయ వారసుడిగా తన కుమారుడిని ప్రకటించాలని రెండో భార్య సాధన చేసిన వత్తిడి ఫలించలేవు. ములాయం సోదరుడు శివపాల్ తిరుగుబాటు చేసి వేరే పార్టీని పెట్టినా ఫలితం లేకపోవటంతో ఇప్పుడు అఖిలేష్తో రాజీకి వచ్చినట్లు వార్తలు.
కాంగ్రెస్ నుంచి ముఖ్యమంత్రి అభ్యర్ధి ఎవరంటూ విలేకర్లు అడిగిన ప్రశ్నకు కాంగ్రెస్ పార్టీ నుంచి మీకు మరొకరి ముఖం ఎక్కడైనా కనిపిస్తోందా ? ప్రతి చోటా మీకు నా ముఖమే కనిపిస్తోందని ప్రియాంక గాంధీ స్పందించారు. శుక్రవారం నాడు తన సోదరుడు రాహుల్ గాంధీతో కలసి యువజన ప్రణాళికను విడుదల చేసిన సందర్భంగా విలేకర్లతో ఆమె మాట్లాడారు.తాను పోటీ చేసేది లేనిదీ ఇంకా నిర్ణయించలేదన్నారు.