ఎం కోటేశ్వరరావు
ధరల పెరుగుదలతో జనాల జేబులు గుల్లవుతున్నాయి. సిఎంఐఇ సమాచారం మేరకు 2022 మార్చి నెలలో నిరుద్యోగం 7.29శాతం ఉంది. ఏప్రిల్ మాసం తొలి పదిహేను రోజుల్లో అదింకా పెరిగినట్లు గణాంకాలు తెలిపాయి. ఉపాధి ఉన్న వారికి కూడా వేతనాల పెరుగుదల ఉండటం లేదు. 2004-05 నుంచి 2011-12 వరకు కాజువల్, రెగ్యుల కార్మికుల వేతన పెరుగుదల 5.2శాతం ఉంటే 2011-12 నుంచి 2018-18 వరకు 1.05శాతానికి తగ్గిందని(ఇనిస్టిట్యూట్ ఫర్ హ్యూమన్ డెవలప్ మెంట్ వర్కింగ్ పేపర్ 1-2020) తేలింది. కరోనా కాలంలో పరిస్ధితి ఎలా దిగజారిందో, తరువాత ఎలా ఉందో తెలిసిందే. 2021 మార్చినెలతో పోలిస్తే 2022 మార్చినెలలో ఆహార ధరల పెరుగుదల రేటు రెట్టింపు అంటేే నమ్ముతారా ? ఇవి ఏప్రిల్ 12న ప్రకటించిన మోడీ ప్రభుత్వ లెక్కలే.గ్రామీణ ప్రాంతాల్లో వినియోగదారుల ఆహార ధరల ద్రవ్యోల్బణం 2021 మార్చినెలలో 3.94శాతం ఉంటే, ఈ ఏడాది 8.04శాతానికి పెరిగింది. ఇదే మాదిరి ధరల సూచిక 4.61 నుంచి 7.66శాతానికి పెరిగింది. ఈ ఏడాది ఫిబ్రవరి-మార్చినెలల్లో 5.81 నుంచి 8.04శాతానికి చేరింది. దేశం మొత్తంగా ఆహార ద్రవ్యోల్బణం ఏడాది కాలంలో 4.87 నుంచి 7.68శాతానికి, మొత్తంగా ధరల సూచిక గత పదిహేడు నెలల్లో గరిష్టంగా 6.95శాతానికి ఈ ఏడాది మార్చిలో పెరిగింది. ఆహార వస్తువుల్లో నూనెల ధరల సూచిక ఏడాది క్రితంతో పోలిస్తే 18.79 పెరిగింది.
ధరలు పెరిగితే ఏమౌతుంది ? ప్రతి ఒక శాతం ఆహార ధరల పెరుగుదల కోటి మందిని దుర్భర దారిద్య్రంలోకి నెడుతుందని ప్రపంచ బాంకు అధ్యక్షుడు డేవిడ్ మల్పాస్ చెప్పాడు. ధనికులు తట్టుకుంటారు, పేదలు ఓపలేరు, పోషకాహరలేమితో పిల్లలు గిడసబారతారు అని కూడా చెప్పాడు.
ద్రవ్యోల్బణ పెరుగుదల ఒక్క భారత్లోనే కాదు ప్రపంచమంతటా ఉంది, అమెరికా,బ్రిటన్, చైనా, శ్రీలంక, పాకిస్తాన్లో కూడా ఉంది అని కొంత మంది కేంద్ర ప్రభుత్వ వైఫల్యాన్ని వెనకేసుకు వచ్చేందుకు పూనుకున్నారు. అంటే మన ఏలికలు దేశాన్ని లంక, పాకిస్తాన్గా మార్చబోతున్నారా ? నరేంద్రమోడీ విధానాల ఘనత ఎక్కడికి పోయినట్లు ? దున్నబోతే దూడల్లో మెయ్యబోతే ఎద్దుల్లో అన్నట్లుగా ఇతర సందర్భాల్లో వాటితో మనలను పోల్చటం ఏమిటని అంటారు. బ్రిటన్లో గాస్, విద్యుత్ ఛార్జీలు ఇటీవలి కాలంలో 54శాతం పెంచిన కారణంగా అక్కడ ఏడుశాతం ద్రవ్యోల్బణం ఉంది. మరి మన దేశంలో కూడా అదే స్దాయిలో ఎందుకున్నట్లో మోడీ సమర్ధకులు చెప్పాలి. అమెరికాలో ధరల సూచిక 8.5శాతం పెరిగింది. చైనాలో ఫిబ్రవరి నెలలో 0.9శాతం వినియోగదారుల సూచి పెరగ్గా మార్చినెలలో 1.5శాతం ఉన్నట్లు రాయిటర్ వార్తా సంస్ధ పేర్కొన్నది.దక్షిణ కొరియాలో 4.1శాతం ఉంది. పాకిస్తాన్లో మార్చి నెలలో 12.7, శ్రీలంకలో 18.7 శాతం చొప్పున ఉంది. మనం ఎవరి బాటలో నడవబోతున్నాం ? చైనా మార్గమా ? ఇతర దేశాల వెంటా ? ఎవరి మార్గం అనుసరిస్తారో మనకు అనవసరం, ధరలు తగ్గకపోతేమానే పెరగకుండా చూడండి మహా ప్రభో అంటున్నారు జనం.
ప్రతిదానికీ ఉక్రెయిన్ యుద్ధాన్ని ఒక సాకుగా చూపటం, జనాన్ని వెర్రివాళ్లను గావించటం మామూలైంది. మనం కూడా గుడ్డిగా నమ్ముతున్నామనుకోండి ! సదరు యుద్దం ప్రారంభమైంది ఫిబ్రవరి 24న, కానీ ఆ నెలలో మన దేశ పారిశ్రామిక ఉత్పత్తి వార్షిక వృద్ధి 1.7శాతమే, కానీ అంతకు గతేడాది ఫిబ్రవరితో పోలిస్తే 4.7శాతం తగ్గింది. ఈ కాలంలో అంతా బాగుందన్నారు, నవంబరు నాలుగు నుంచి 137 రోజులు చమురు ధరలను మన సర్కారు పెంచలేదు. ఇతరంగా ప్రభావాలేమీ లేవు, ఈ కాలంలో కార్మికుల సమ్మెలు లేవు, అంతా ప్రశాంతంగా ఉంది.మరి ఉత్పత్తి ఎందుకు పడిపోయినట్లు ? ఎలక్ట్రానిక్స్ వంటి గృహౌపకరణాలు, ఇతర పరికరాల ఉత్పత్తి 8.2, 5.5శాతాల చొప్పున తిరోగమనంలో ఉంది. మార్చి నెల, తరువాత రోజుల్లో యుద్ద ప్రభావాల గురించి నిపుణులు చెబుతున్న అంశాలను చూస్తే పారిశ్రామిక ఉత్పత్తి వృద్ది మరింతగా పడిపోనుంది.
ప్రపంచ గోధుమ, మొక్కజొన్న ఎగుమతుల్లో రష్యా, ఉక్రెయిన్ వాటా 30,20శాతాల చొప్పున ఉంది. అక్కడి నుంచి దిగుమతి చేసుకొనే దేశాల్లో కొరత ఏర్పడి ధరలు పెరిగాయంటే అర్ధం చేసుకోవచ్చు, మన దేశంలో ఎందుకు పెరగాలి? ఆహార ధాన్యాలు అవసరానికి మించి ఉత్పత్తి అవుతున్నట్లు కొందరు చెబుతారు. అదే నిజమైతే ధరలెందుకు తగ్గటం లేదు. దేశంలో 23-25మిలియటన్నుల ఖాద్యతైలాల వినియోగం ఉండగా స్ధానికంగా ఉత్పత్తి పదిమిలియటన్నులు. మిగతాదంతా దిగుమతే. మన దేశం దిగుమతి చేసుకొనే ఖాద్య తైలాల్లో పామాయిల్ 62శాతం ఉంది. పొద్దుతిరుగుడు గింజల నూనె వాటా 14శాతమే. అది ఫిబ్రవరి వరకు సజావుగానే వచ్చింది. అక్టోబరుతో ముగిసిన ఏడాదిలో మనం 1.89మిలియన్ టన్నుల పొద్దుతిరుగుడు నూనె దిగుమతి చేసుకున్నాం. మన దిగుమతుల్లో ఉక్రెయిన్నుంచి 74, రష్యా, అర్జెంటీనాల నుంచి 12శాతాల చొప్పున జరుగుతోంది. ఉక్రెయిన్నుంచి మార్చినెలలో దిగుమతులు నిలిచినా ఇతర దేశాల నుంచి ఆ మేరకు పామాయిల్ దిగుమతులు పెరిగినట్లు వివరాలు వెల్లడిస్తున్నాయి. అలాంటపుడు నూనెల ధరలు ఇంత పెద్ద ఎత్తున పెరగాల్సిన అవసరం ఏముంది?
ధరల మీద పాలకుల నియంత్రణ కొరవడిందన్నదే అసలు కారణం. పర్యవసానంగా రు.120 నుంచి 190 వరకు నూనెల ధరలు పెరిగాయి. మన దేశం దిగుమతి చేసుకొనే నూనెల మీద విధించిన పన్నుల ద్వారా ఏటా రు.35వేల కోట్లు కేంద్రానికి రాబడి వస్తున్నది. నూనె గింజల సాగు గిట్టుబాటు కాని కారణంగానే రైతాంగం వరి, గోధుమల వైపు మొగ్గుతున్నారు. సగటున ఏటా పదిబిలియన్ డాలర్లను దిగుమతులకు వెచ్చిస్తున్నారు తప్ప రైతాంగాన్ని ప్రోత్సహించేందుకు ఎలాంటి చర్యలు లేవు. తొలి ఐదేండ్లలో అన్ని లోపాలను సరిదిద్దారు అని గతంలో నరేంద్రమోడీ గురించి చెప్పారు.మరి ఇప్పుడు ఎనిమేదేండ్లుగడచినా ఈ లోపాన్ని ఎందుకు సరిచేయలేదన్నది ప్రశ్న. 2013-14లో మన దేశం 11.82 మి.టన్నులు దిగుమతి చేసుకోగా ఇప్పుడు 15మి.టన్నులకు పెరిగిందే తప్ప తరగలేదు.
ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణంతో పాటు నిరుద్యోగం పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. ధరల పెరుగుదలకు అనుగుణంగా వేతన పెరుగుదల ఉండదు, దాంతో కొనుగోలు శక్తి పడిపోతుంది. అది వస్తువినిమయం తగ్గటానికి, ఉత్పత్తి తగ్గేందుకు. అది ఉపాధి కోల్పోవటానికి దారితీస్తుంది. ఇదంతా ఒక విషవలయం. పట్టణ ప్రాంతాల్లో గతేడాది ఏప్రిల్-జూన్లో నిరుద్యోగం12.6శాతానికి చేరింది. అంతకు ముందు మూడు నెలలతో పోలిస్తే ఉపాధి పొందుతున్న 15ఏండ్లకు పైబడిన వారి శాతం 43.1 నుంచి 40.9శాతానికి తగ్గింది.
కొంత మంది నమ్మిక ప్రకారం ఏ జన్మలో చేసుకున్న ఖర్మ ఫలితమో ఇప్పుడు జనం అనుభవిస్తున్నారు.ధరల పెరుగుదల గురించి బిజెపి నేతలేమంటున్నారో చూద్దాం. పిటిఐ వార్తా సంస్ధ 2021 ఆగస్టు ఒకటిన ఇచ్చిన కధనం ప్రకారం మధ్య ప్రదేశ్ వైద్య విద్యాశాఖ మంత్రి విశ్వాస్ సారంగ్ కాంగ్రెస్ నిరసన మీద మండిపడుతూ అసలు దేశంలో ద్రవ్యోల్బణ సమస్య ఒకటి రెండు రోజుల్లో వచ్చింది కాదని, 1947 ఆగస్టు 15న ఎర్రకోట దగ్గర ప్రధాని నెహ్రూ చేసిన ప్రసంగంతో ప్రారంభమైందని సెలవిచ్చారు. వాక్సిన్లు ఉచితంగా వేయటం ద్రవ్యోల్బణం పెరుగుదలకు దారి తీసిందని బిజెపి ఎంపీ మనోజ్ తివారీ చెప్పారు. 2014లో అధికారానికి రాక ముందు పార్టీ పెద్దలు పలికిన సుభాషితాలను చూద్దాం. పెట్రోలు ధరలు పెంచటం యుపిఏ సర్కార్ ప్రాధమిక వైఫల్యానికి నిదర్శనమని,సమావేశాలు ముగిసిన తరువాత చేయటం పార్లమెంటును అగౌరవ పరచటమే అని, పెంపుదల వలన గుజరాత్ జనాలపై వందల కోట్ల భారం పడుతుందని 2012 మే 23వ తేదీన గుజరాత్ సిఎంగా నరేంద్రమోడీ ట్వీట్ చేశారు. ఇప్పుడు అదే మోడీ ఏలుబడిలో ధరల పెంపుదలకు అసలు పార్లమెంటుతోనే పనిలేదు.
గాస్ సిలిండర్లు పట్టుకొని వీధుల్లో నిరసన ప్రదర్శనలు చేసిన బిజెపి నేత, ఇప్పుడు మంత్రిగా ఉన్న స్మృతి ఇరానీ గారేమన్నారంటే 2011 జూన్ 24న ఒక ట్వీట్ చేస్తూ ఆమ్ ఆద్మీ సర్కార్ అని చెప్పుకొనే యుపిఏ సర్కార్ గాస్ బండ మీద రు. 50 పెంపు ఎంత సిగ్గుచేటు అన్నారు.2012 డిసెంబరు 24న మరొక ట్వీట్లో యుపిఏ దృష్టిలో జిడిపి వృద్ది అంటే గాస్, డీజిల్, పెట్రోల్ ధరలు అని ఎద్దేవా చేశారు. ఇప్పుడు ప్రశ్నించిన వారి మీద ఆమె మండిపడుతున్నారు. ఎప్పటికప్పుడు అభిప్రాయాలు మార్చకపోతే పొలిటీషియన్లు కాదన్న గిరీశాన్ని బిజెపి నేతలు గుర్తుకు తెస్తున్నారు. ధరల పెరుగుదల ప్రభుత్వ వైఫల్యమని 2014కు ముందు చెప్పిన వారు ఇప్పుడు అంతర్జాతీయ పరిస్ధితుల మీద నెపాన్ని మోపుతున్నారు. మధ్య ప్రదేశ్ మంత్రి విశ్వాస్ సారంగ్ను ఆదర్శంగా తీసుకున్న ఆర్ధిక మంత్రి నిర్మలాసీతారామన్ గారు కూడా నెహ్రూను వదలిపెట్టలేదు. కాంగ్రెస్ వారిని ఎద్దేవా చేస్తూ ” చివరికి 1951లో కూడా పండిట్ జవహర్లాల్ నెహ్రూ భారత ద్రవ్యోల్బణాన్ని కొరియా యుద్ధం ప్రభావితం చేసిందని చెప్పి ఉండేవారు….. కానీ ఇప్పుడు ప్రపంచం విశ్వవ్యాప్తంగా అనుసంధానమై ఉంది కనుక ఉక్రెయిన్ మనలను ప్రభావితం చేస్తోందని చెబుతున్నాం, అంగీకరించరా ” అన్నారు. పెట్రోలియం శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తెలి మాట్లాడుతూ మధ్యతరగతి వారు కష్టాలను భరించి కరోనా వాక్సిన్లు అందచేసేందుకు ప్రభుత్వానికి తోడ్పడాలని చెప్పారు. టాక్సులు లేకపోతే చమురు ధరలు ఎక్కువ కాదు. మీరు మాత్రం ఉచితంగా వాక్సిన్లు పొందాలి, మరి వాటికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది, మీరేమీ చెల్లించలేదు, అందుకే ఈ విధంగా వసూలు చేస్తున్నాం ” అన్నారు. జనానికి తెలివితేటలుంటాయని వారు గనుక భావించి ఉంటే ఇంతగా బరితెగించి అడ్డగోలు వాదనలు చేసే వారు.
గత ఎనిమిది సంవత్సరాలుగా దేశంలో ఏం జరిగినా ఆ ఘనత నరేంద్రమోడీదే, చివరికి పొద్దు పొడుస్తుందన్నా, చీకటి పడుతుందన్నా మోడీ అధికారానికి వచ్చిన నాటి నుంచే జరుగుతోందని చెప్పే వారు మనకు కనిపిస్తారు. నిజమైన స్వాతంత్య్రం 2014లోనే వచ్చిందని పద్మశ్రీ కంగన రనౌత్ సెలవిచ్చిన సంగతి తెలిసిందే. పోనీ భక్తుల కోరిక మేరకు జరిగిన వాటన్నింటినీ నరేంద్రమోడీ ఖాతాలోనే వేద్దాం. మరి ఇప్పుడు ధరల పెరుగుదలను ఎవరి మెడకు చుడదాం ? 1947 నుంచే ప్రారంభమైందని, గాంధీ, నెహ్రూలే కారణం అని బిజెపి పెద్దలు సెలవిచ్చినా జనం నమ్మక తప్పదు, కాదంటే తంటా కొని తెచ్చుకోవటమే. అచ్చేదిన్ కనుక మౌనంగా భరిస్తున్నారు, ఏడవలేక నవ్వుతున్నారు !