Tags
ఎం కోటేశ్వరరావు
ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ(ఎపిఎస్ఆర్టి) డీజిల్ సెస్ పేరుతో ప్రయాణీకుల మీద భారం మోపింది. 2022 జూలై ఒకటవ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది.ఈ సందర్భంగా సంస్థ చేసిన ప్రకటనలో ” పొరుగు రాష్ట్రంలో అన్ని బస్సుల టిక్కెట్లు మరియు పాస్ల ధరలు 9.6.2022 నుంచి పెంచటం జరిగినది ” అని సమర్ధించుకుంది.ఎదుటి వారు తొడ కోసుకుంటే మనం మెడ కోసుకుంటామా అన్న లోకోక్తి తెలిసిందే. భారం మోపేందుకు ఇది ఒక సాకు తప్ప హేతుబద్దత లేదు. ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో ఉన్న వాటన్నింటినీ ఆంధ్రప్రదేశ్ అమలు జరుపుతున్నదా, ఎపిలో ఉన్న వాటిని ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్నాయా ! ఒకరు పెంచితే మిగతావారు పెంచాలని, తగ్గిస్తే తగ్గించాలనే ఒప్పందం గానీ విధిగానీ లేదు. జూలై రెండవ తేదీన ఇరుగు పొరుగు రాష్ట్రాలలో ఒక లీటరు పెట్రోలు, డీజిలు ధరలు దిగువ విధంగా ఉన్నాయి.
పట్టణం ×××× పెట్రోలు××× డీజిలు
విజయవాడ×× 111.66 ××× 99.43
హైదరాబాదు × 109.66 ××× 97.82
బెంగలూరు ×× 101.94 ××× 87.89
చెన్నై ×××××× 102.63 ××× 94.24
భువనేశ్వర్ ××× 103.19 ××× 95.28
ఆర్టిసీ ఛార్జీల పెంపుదల కోసం పొరుగు రాష్ట్రంతో పోలిక తెచ్చిన జగన్మోహనరెడ్డి సర్కార్ మరి ఈ రేట్లను గమనించి తక్కువ ఎక్కడుందో దాన్ని ఎందుకు అనుసరించటం లేదు ? దున్నబోతే దూడల్లో తినబోతే ఎద్దుల్లో అంటే ఇదే కదా ! అడ్డగోలు సమర్ధనకు ఒక తర్కం-పద్దతీ పాడూ ఉండదు. ఆర్టిసి ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో కూడా సర్వీసులను నిర్వహిస్తున్నది. ఇప్పుడు రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్నవారు పొరుగునే తక్కువగా ఉన్న ధరలకు డీజిలు, పెట్రోలు కొనుగోలు చేస్తున్నారు.అలాగే ఎపిఎస్ఆర్టిసి ఛార్జీలు తక్కువగా ఉంటే పొరుగు రాష్ట్రాల జనాలు మన బస్సులు ఎక్కుతారు, రాబడి కూడా పెరుగుతుంది కదా ! సిఎం జగన్మోహన్ రెడ్డి చుట్టూ తిష్టవేసిన సలహాదారులకు, అధికారులకు గానీ ఈ చిన్న అంశం తట్టలేదా ! గతంలో కూడా డీజిలు ధరలు పెరిగాయి. ఎన్నడూ ఆర్టిసి చరిత్రలో దొడ్డిదారిన డీజిల్ సెస్ పేరుతో భారం మోపలేదు.
నవరత్నాలలో భాగంగా గత మూడు సంవత్సరాలలో లక్షా 50వేల కోట్ల వరకు జనానికి లబ్ది చేకూర్చినట్లు వైసిపి ప్రభుత్వ విజయాలలో చెప్పుకుంటున్నారు. ఆర్టిసి అధికారికంగా వెల్లడించిన సమాచారం ప్రకారం గత మూడు సంవత్సరాలలో వరుసగా వచ్చినట్లు చెప్పిన నష్టం 2019-20లో రు.1,222.96 కోట్లు, 2020-21లో రు.2,982.32 కోట్లు, 2021-22లో రు.2,698.86 కోట్లు. ఆర్టిసిని ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించారు.ఇది మిగిలిన ప్రభుత్వశాఖల వంటిది కాగా నష్టాల గురించి ఎందుకు చెబుతున్నారన్నది ప్రశ్న. వైద్య ఆరోగ్యశాఖలో కూడా అందించేది సేవ మాత్రమే. ఆర్టిసిలో సిబ్బంది వేతనాలు, బస్సుల కొనుగోలు, నిర్వహణ ఉన్నట్లే అక్కడా సిబ్బంది వేతనాలు, ఆసుపత్రులు, వాటికి అవసరమైన వైద్య పరికరాలు, ఔషధాల కొనుగోలు వంటివి ఉంటాయి. దానిలో లేని లాభనష్టాల లెక్కలు ఆర్టీసికి ఎందుకు చెబుతున్నట్లు ? ఆసుపత్రుల్లో వాణిజ్య దుకాణాలు ఉండవు,అదే బస్టాండ్లలో ఎంతో కొంత దుకాణాల ద్వారా రాబడి వస్తుంది. ఆర్టిసి బస్సుల్లో ప్రయాణించేది పేద, మధ్య తరగతి వారు మాత్రమే. వారి కోసం రవాణా సబ్సిడీని కూడా నవరత్నాల్లో భాగంగా పరిగణించి ఏడాదికి మూడువేల కోట్ల రూపాయల భారాన్ని భరించే శక్తిలేనిదిగా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదా ? నిజానికి నష్టం అని చెబుతున్నదంతా నష్టం కాదు. వృద్దులు, స్కూలు విద్యార్దులు, బస్పాస్లు, ఆర్టిసి మాజీ సిబ్బంది, జర్నలిస్టులు, ఇతరులకు ఇస్తున్న రాయితీలు కూడా దీనిలో ఉన్నందున ఆ మేరకు ప్రభుత్వం సంస్థకు చెల్లిస్తే నష్టాల మొత్తం తగ్గుతుంది. గత మూడు సంవత్సరాల్లో డీజిలు ధర లీటరుకు రు.40 పెరిగిందని ఆర్టిసి తన ప్రకటనలో చెప్పింది. డీజిలు మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 22.25శాతం పన్ను విధిస్తున్నది అంటే, అంత మేర రాష్ట్ర ప్రభుత్వానికి అదనపు ఆదాయం వస్తున్నదనేది పచ్చినిజం. ఆ మేరకు ఆర్టిసి కొనుగోలు చేసే డీజిలు మీద పన్ను తగ్గించినా భారం తగ్గుతుంది కదా !
పెద్ద మొత్తంలో డీజిలు కొనుగోలు చేసేవారికి లీటరుకు రు.30 అదనంగా కేంద్ర ప్రభుత్వం అమ్ముతున్నది. ఇది జనం మీద విధిస్తున్న మోడీ టాక్సు అని చెప్పవచ్చు. తెలంగాణా వంటి చోట్ల ఆర్టిసి ఏకమొత్త కొనుగోలు నిలిపివేసి ఆ భారాన్ని తగ్గించుకొనేందుకు విడిగా కొనుగోలు చేస్తున్నారు. ఎపిఎస్ఆర్టిసి కూడా అదే పద్దతిని అనుసరించవచ్చు.ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పుడు కొనుగోలు నిలిపివేశారని చెబుతున్నారు. అలాంటపుడు ఆ పేరుతో జనాల మీద భారం మోపారంటే దీన్ని మోడీ-జగన్ టాక్సు అని పిలవాల్సి ఉంటుంది. ఆర్టిసి బస్సుల్లో ఇప్పటికే టోలు, పాసింజరు, సేఫ్టీ పేరుతో అదనపు మొత్తాలను ప్రయాణీకుల నుంచే వసూలు చేస్తున్నారు. ఇప్పుడు ఇది అదనపు భారం.
ఆర్టిసిలో వివిధ సర్వీసుల మీద పెంచిన డీజిల్ భారం వెనుక పాలకపార్టీ పెద్దలు-ప్రయివేటు బస్ యజమానుల కుమ్మక్కును కొట్టి పారవేయలేము. వారు విడిగా తక్కువ ధరలకు బంకుల్లో డీజిలు కొనుగోలు చేస్తారు కనుక ఆర్టిసి పెంచిన మొత్తం ఎంతైతే అంత వారికి వచ్చే అదనపు లాభమే. డిమాండ్ ఉన్నపుడు తప్ప మిగిలిన రోజుల్లో ఇప్పటికే ఆర్టీసి కంటే తక్కువ చార్జీలకే తిప్పుతున్నారు. అందువలన ఇప్పుడు ఆర్టిసిలో పెంపుదల వారికి మరింత లాభం ఉంటుంది. దానిలో కొంత తగ్గించుకొని ఆర్టీసి కంటే తక్కువ ఛార్జీలకు ప్రయాణీకులను ఆకర్షించేందుకు అవకాశం పెరుగుతుంది. ఇప్పటికే ఆర్టిసిలో ఎక్కేవారు తగ్గుతున్నారు. లాభం వుండే దూరపు సర్వీసుల్లో మరింతగా తగ్గితే నష్టాలు మరింతగా పెరుగుతాయి. అందువలన ఏ విధంగా చూసినా సంస్థను మరింత దెబ్బతీసేపనే తప్ప మరొకటి కాదు