Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


రెండు సంవత్సరాల క్రితం చైనా నుంచి వెయ్యి కంపెనీలు మన దేశానికి వస్తున్నట్లు పెద్ద ఎత్తున మీడియాలో వార్తలు వచ్చిన అంశాన్ని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవాలి. ఇదిగో తోక అంటే అదిగో పులి అన్నట్లుగా ఇంకే ముంది చైనాలో ఫ్యాక్టరీలన్నీ ఖాళీ అవుతున్నాయన్నట్లుగా వాటిని చూసి అనేక మంది కొండంత రాగాలు తీశారు. తాజాగా రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో కేంద్ర ప్రభుత్వం ఒక సమావేశం నిర్వహించింది.దానిలో జెపి మోర్గాన్‌ కంపెనీ ప్రతినిధులతో మన దేశానికి ఉన్న ఎగుమతుల అవకాశాల గురించి చెప్పించారు. చైనా ప్రస్తుతం తక్కువ నైపుణ్యంతో ఉత్పత్తి చేసే దుస్తులు, పాదరక్షలు, తోలు వస్తువులు, ఫర్నీచర్‌ వంటి ఎగుమతుల నుంచి వైదొలుగుతున్నదని, ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఇప్పుడు భారత్‌కు అవకాశం వచ్చింది కనుక వినియోగించుకోవాలని ఆ సంస్థ ప్రతినిధులు చెప్పారు. దాని కొనసాగింపుగా రాష్ట్రాలు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర పెద్దలు చెప్పారు. పూర్వకాలంలో రాజుల దగ్గర ఉండే కొందరు వారి మనసెరిగి దానికి అనుగుణంగా కబుర్లు చెప్పేవారు. ప్రస్తుతం రెండింజన్ల సర్కార్లున్న రాష్ట్రాలలో ప్రభుత్వాలు మేకిన్‌ ఇండియా ఎగుమతుల బదులు బుల్డోజర్ల మీద కేంద్రీకరించిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఎగుమతులకు అవకాశం లేదు గనుక ఇప్పుడైనా వాటిని పక్కన పెడతారేమో, పనికి వచ్చే పనులు చేస్తారేమో చూద్దాం. ఇంతకూ చైనా నుంచి వచ్చే ఫ్యాక్టరీలేమైనట్లు ? జనాలు ఈ చెవితో విని ఆ చెవితో వదిలేస్తారు గనుక ఎప్పటికప్పుడు కొత్త కతలు చెబుదాం మిత్రోం !


తాజాగా వచ్చిన వార్తల ప్రకారం చైనా కంపెనీలు కొన్ని అమెరికా సరిహద్దుల్లో ఉన్న మెక్సికోకు తరలేందుకు చూస్తున్నట్లు, అక్కడ వేతనాలు తక్కువ, పన్ను రాయితీలు ఎక్కువ, సరకు రవాణా ఖర్చులు తగ్గుతాయన్నది సారాంశం. దాన్ని వేరే విధంగా చూస్తే చైనాలో వేతనాలు పెరుగుతున్నాయి, కార్పొరేట్లకు ఇచ్చే రాయితీలు తగ్గుతున్నాయి. చైనాలో పెట్టిన కొన్ని అమెరికన్‌ కంపెనీలు ఇలాంటి ఆలోచనలు చేస్తున్నాయి. ఎందుకని ? అమెరికా మాజీ నేత నోటి దూల ట్రంప్‌ అధికారంలో ఉండగా 2018లో చైనా మీద ప్రారంభించిన వాణిజ్యం యుద్ధం నుంచి ఎలా వెనక్కు తగ్గాలా అని ప్రస్తుత నేత జో బైడెన్‌ చూస్తున్నాడు. చైనా నుంచి వచ్చే వస్తువుల మీద దిగుమతి పన్ను పెంచి వారిని దెబ్బతీస్తానని ట్రంప్‌ కలలు గన్నాడు. అవే పన్నులు అమెరికన్ల మీద భారాలు మోపాయి. గోరుచుట్టు మీద రోకటి పోటులా ఇప్పుడు అక్కడ తలెత్తిన ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదలను నివారించాలంటే చైనా వస్తువుల మీద పన్ను తగ్గించటం మినహా మరొక మార్గం లేదని బైడెన్‌కు అర్ధమైంది.

ఈ పూర్వరంగంలోనే చైనాలో ఉన్న కొన్ని కంపెనీల ఆలోచనల గురించి ఎటి కియర్నీ అనే కంపెనీ ఒక నివేదికను విడుదల చేసింది. చైనా నుంచి కంపెనీలను మెక్సికో, కెనడా లేదా మధ్య అమెరికా దేశాలకు తరలిస్తే లాభదాయకమని గతేడాది 78శాతం మంది అమెరికన్‌ కంపెనీల అధికారులు భావిస్తే ఈ ఏడాది మార్చి నెలలో 92శాతానికి పెరిగారట.పదహేడు శాతం మంది ఇప్పటికే మెక్సికో వెళ్లినట్లు చెప్పారు. 2018లో అమెరికా-కెనడా-మెక్సికో కుదుర్చుకున్న స్వేచ్చా వాణిజ్య ఒప్పందం ప్రకారం ఫర్నీచర్‌ తయారీదారులు స్థానికంగా దొరికే వాటి నుంచి 50శాతం ముడివస్తువులను ఉపయోగిస్తేనే మెక్సికో పన్ను రాయితీలు వర్తిస్తాయి.దీన్ని అమలు జరపటం కష్టం కనుక ఏం జరుగుతుందో చెప్పలేం. జో బైడెన్‌ దిగుమతి పన్ను ఎత్తివేస్తే చైనాలోనే కొన్ని కానసాగవచ్చు, కొన్ని మెక్సికోకు తరలవచ్చు తప్ప మన దేశం వైపు వచ్చే అవకాశం లేదు. లాభసాటిగా ఉంటే అమెరికన్లతో పాటు కొన్ని చైనా కంపెనీలు కూడా మెక్సికోలో కొత్తగా పరిశ్రమలు పెట్టవచ్చు. అలా పెట్టకూడదనే ఆంక్షలను చైనా ప్రభుత్వం విధించలేదు.మెక్సికోకు చైనా కంపెనీలు తరలే అవకాశం గురించి పెద్దగా ఆశలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని కూడా కొందరు చెబుతున్నారు. ఎవరిష్టం వారిది ఎవరి లాభం వారిది గనుక వారికే వదిలేద్దాం !


చైనా మార్కెట్లో ప్రవేశించేందుకు విదేశాల నుంచి అనేక మంది అక్కడకు వెళ్లి కంపెనీలు పెట్టటం, తరువాత ఎక్కడ లాభసాటిగా ఉంటే అక్కడకు పోవటం నిరంతరం జరుగుతున్నదే.దుస్తుల ఉత్పత్తి బంగ్లాదేశ్‌, వియత్నాంలో లాభసాటిగా ఉంటుందని దశాబ్దక్రితమే అనేక మంది తరలి వెళ్లారు. మొత్తం మీద చూసినపుడు అనేక మంది భావిస్తున్నట్లు లేదా కొందరు కోరుకుంటున్నట్లుగా పొలోమంటూ చైనా నుంచి వలసలు లేవు. విదేశీ పెట్టుబడుల పెరుగుదల రేటు తగ్గటం, పెరగటం తప్ప పూర్తిగా ఆగిపోలేదు. కనీస వేతనాలు క్రమంగా పెరుగుతున్నాయి. గతేడాది చైనా గ్వాంగఝౌ దుస్తుల పరిశ్రమలో కనీసవేతనం 313 డాలర్లుంటే, ఇండోనేషియాలో 243, కంపూచియాలో 190,మయన్మార్‌లో 157, బంగ్లాదేశ్‌లో 95 డాలర్లుందని జర్మనీ స్టాటిస్టా సంస్థ పేర్కొన్నది. ఇతర దేశాల్లో లేని సంక్షేమ పధకాలు చైనాలో అదనం అన్నది తెలిసిందే. చైనా ప్రస్తుతం అధిక విలువ గలిగిన ఉత్పత్తుల తయారీ మీద కేంద్రీకరించినందున గిట్టుబాటుగాని తక్కువ విలువగల వస్తు తయారీ సంస్థలు రాకపోవచ్చు, ఉన్నవి వెళ్లిపోవచ్చు.


కరోనా, ఇతర పరిణామాల కారణంగా ప్రపంచ సరఫరా వ్యవస్థలకు తీవ్ర అంతరాయం కలిగింది. వాటికి తోడు రాజకీయాలు ఉండనే ఉన్నాయి. దానిలో భాగంగా చైనా మీద ఆధారపడటం తగ్గించాలని అనేక మంది చెబుతున్నారు. నిజానికి ఆధారపడాలని ఎవరూ వత్తిడి తేలేదు. అమెరికా ముందుకు తెచ్చిన ఇండో పసిఫిక్‌ ఆర్ధిక చట్రం(ఐపిఇఎఫ్‌) మీద ఎక్కువగా ఆధారపడాలని కొందరు సూచిస్తున్నారు. ఎవరూ మనకు సరకులు ఉచితంగా ఇవ్వనపుడు ఎక్కడ తక్కువ ధరలు ఉంటే అక్కడే కొనుగోలు చేయవచ్చు. ఎవరు మన వస్తువులను కొంటే వారికే అమ్ముతాం. మబ్బులను చూసి చేతిలో ఉన్న ముంత నీళ్లు పారపోసుకున్నట్లుగా పరిస్థితి మారకుండా చూసుకోవాలి.చైనాకు మన ఎగుమతులు దెబ్బతినకూడదు. చెరువు మీద అలిగే వారు కొందరు చైనా వస్తువుల కొనుగోలు నిలిపివేసి, వారికి వస్తువులు ఎగుమతి ఆపివేస్తే మన కాళ్ల దగ్గరకు వస్తారని పగటి కలలు కనేవారిని వారి లోకంలోనే ఉండనిద్దాం. రాత్రంతా సత్రాలు, మఠాల్లో గంజాయి దమ్ము లేదా బార్లలో మందుకొట్టి అది చేయాలి, ఇది చేయాలి అని వాగి తెల్లవారి మత్తుదిగిన తరువాత ఎవరిదారిన వారు పోవటం తెలిసిందే.


పులిని చూసి నక్కవాతలు పెట్టుకున్నట్లుగా కాకుండా వస్తూత్పతికి చైనాను అనుకరించాల్సిన అవసరం లేదని, గత కొద్ది సంవత్సరాలుగా అది పని చేయలేదని అందువలన సేవారంగం మీద కేంద్రీకరించాలని రఘురామ్‌ రాజన్‌ వంటి వారు చెబుతున్నారు. ప్రధాని నరేంద్రమోడీ విదేశీ పెట్టుబడుల గురించి ఎన్ని కబుర్లు చెప్పినా ఫలితం కనిపించటం లేదు. 2014 నుంచి 2021 నవంబరు వరకు వివిధ కారణాలతో మన దేశం నుంచి 2,783 విదేశీ కంపెనీలు, వాటి అనుబంధ సంస్థలు వెళ్లిపోయాయి.2021 నవంబరు 30 నాటికి దేశంలో 12,458 విదేశీ కంపెనీలు చురుకుగా పని చేస్తున్నట్లు కూడా కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి పియుష్‌ గోయల్‌ పార్లమెంటులో చెప్పినట్లు 2021 డిసెంబరు ఎనిమిదవ తేదీన ఎకనమిక్‌ టైమ్స్‌ వార్త పేర్కొన్నది. మన దేశంలోని జనరల్‌ మోటార్స్‌ కంపెనీ తన ఉత్పత్తి కేంద్రాలను మూసివేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. గుజరాత్‌లోని హలోల్‌ ప్లాంట్‌ను చైనా సంస్ధ అనుబంధ ఎంజి మోటార్‌ ఇండియా 2017లో కొనుగోలు చేసింది. ఇటీవల మహారాష్ట్రలోని తాలేగాంలోని ప్లాంట్‌ను కొనుగోలు చేసేందుకు చైనాకు చెందిన గ్రేట్‌వాల్‌ మోటార్‌ కంపెనీ ముందుకు రాగా కేంద్ర ప్రభుత్వం అడ్డుకోవటంతో లావాదేవీ ఆగింది. ” గుజరాత్‌ను ఆదర్శంగా చూపుతూ చైనా పెట్టుబడులను కోరిన మోడీ ” అనే శీర్షికతో 2011నవంబరు తొమ్మిదిన తన బీజింగ్‌ ప్రతినిధి పంపిన వార్తను హిందూ పత్రిక ప్రచురించింది. ఇప్పుడు ససేమిరా చైనా పెట్టుబడులను అంగీకరించేది లేదంటున్నారు. పదేండ్లలో ఎంత మార్పు ! పెట్టుబడులు వద్దుగానీ మనకు చైనా కరెన్సీ యువాన్లు కావలసి వచ్చాయి.


రష్యా నుంచి దిగుమతులు చేసుకొని మన చమురు సంస్థలు ఎంతో లబ్ది పొందుతున్నాయి.పశ్చిమ దేశాల ఆంక్షలు ఎంతకాలం కొనసాగుతాయో చెప్పలేము. ఈ లోగా రష్యా నుంచి దిగుమతులు చేసుకొనే మన దేశ సంస్థలు కొత్త దారులు వెతుకుతున్నాయి. మన దేశంలో సిమెంటు తయారీలో పెద్ద కంపెనీ ఆల్ట్రాటెక్‌. అది చైనా కరెన్సీ యువాన్లు చెల్లించి రష్యా నుంచి 1,57,000 టన్నుల బొగ్గు దిగుమతి చేసుకొంటోంది. ఇది మన కస్టమ్స్‌ పత్రాల్లో నమోదైన సమాచారమని రాయిటర్స్‌ వార్తా సంస్థ జూన్‌ 29న తెలిపింది.ఈ లావాదేవీల విలువ 17,26,52,900 యువాన్లు లేదా 2.581 కోట్ల డాలర్లు. రష్యా – మన దేశం మధ్య రూపాయి-రూబుల్‌ లావాదేవీల గురించి కూడా చర్చలు జరుగుతున్నాయి. మన కరెన్సీ విలువ పడిపోతున్నందున అది ఏ మేరకు ఖరారు అవుతుందో చెప్పలేము. ఈ లోగా చైనా కరెన్సీతో చెల్లింపులు జరిపే అవకాశాన్ని మన కార్పొరేట్‌ సంస్థలు కనుగొన్నాయి.దీనితో వచ్చే సమస్యల గురించి, తదుపరి కూడా కొనసాగుతుందా లేదా అన్నది ఎవరూ చెప్పటం లేదు. మన దేశంలోని బాంకులు చైనా, హాంకాంగ్‌, సింగపూర్లలో ఉన్న బ్రాంచీల ద్వారా డాలర్లతో యువాన్‌లు కొనుగోలు చేసి రష్యాకు చెల్లిస్తారు. లేదా చైనా బాంకుల నుంచి మన బాంకులు యువాన్‌ల రుణాలు తీసుకుంటాయి. దీన్ని నరేంద్రమోడీ సర్కార్‌ ఇప్పటి వరకు అడ్డుకున్నట్లు వార్తలు లేవు. వచ్చే రోజుల్లో ఈ లావాదేవీలు ఇంకా పెరుగుతాయా, మన ఆర్ధిక రంగం మీద వాటి ప్రభావం ఎలా ఉంటుందన్నది ఇప్పటికైతే చెప్పగలిగింది లేదు.


చైనాలో పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ కంపెనీలు బారులు తీరాయంటే అక్కడ చౌకగా వస్తు ఉత్పత్తి చేసి ఎగుమతులు చేసేందుకు మాత్రమే కాదు, అంతకంటే ఎక్కువగా ఉన్న స్థానిక మార్కెట్లో అమ్ముకొనేందుకు అని గ్రహించాలి. ప్రపంచ కంపెనీలు 2020లో చైనా నుంచి 900 బిలియన్‌ డాలర్లు ఎగుమతులు చేయగా 1.4లక్షల కోట్ల డాలర్ల మేర స్థానికంగా విక్రయించారంటే దాని ప్రాధాన్యతను అర్ధం చేసుకోవచ్చని కియర్‌నీ గ్రేటర్‌ చైనా సంస్థ చైర్మన్‌ హి షియావోక్వింగ్‌ అన్నాడు. 2015 నాటికి చైనాలో విదేశీ పెట్టుబడులతో పని చేసే వివిధ కంపెనీల 8,36,595 ఉన్నట్లు, 2020 చివరి నాటికి అవి 10,40,480కి పెరిగినట్లు చైనా వాణిజ్య శాఖ తెలిపింది. అందువలన కొన్ని వేల కంపెనీలు చైనా నుంచి తరలి వెళ్లినా అదేమీ పెద్ద పరిణామం కాదు.