Tags

, ,


ఎం కోటేశ్వరరావు


బుధవారం నాడు పదవికి రాజీనామా చేస్తానని చెప్పిన శ్రీ లంక అధ్యక్షుడు గొటబయ రాజపక్స మిలిటరీ జెట్‌లో మాల్దీవులకు పారిపోయినట్లు వార్తలు. దీంతో తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ప్రధాని విక్రమ సింఘే దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించాడు, కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీ చేశాడు. సోమవారం రాత్రి దుబాయి పారిపోయేందుకు చేసిన యత్నాన్ని ఇమ్మిగ్రేషన్‌ సిబ్బంది విఫలం చేశారని కొన్ని వార్తలు రాగా, అమెరికా వీసా నిరాకరించిందని మరికొన్ని వార్తలు. దాంతో సముద్ర మార్గం ద్వారా దేశం విడిచి పోవాలని చూశాడు. చివరకు మిలిటరీలో తనకు అనుకూలురైన వారి సహకారంతో దేశం వదలి వెళ్లాడు. గొటబయ పరారీకి మన దేశం సహకరించిందన్న వార్తలను విదేశాంగశాఖ ఖండించింది. అతగాడి ఆచూకీ గురించి చెప్పేందుకు మాల్దీవుల సర్కార్‌ కూడా తిరస్కరించింది. అక్కడి నుంచి మరో దేశానికి వెళ్లవచ్చని వార్తలు వచ్చాయి.


రాజీనామా డిమాండ్‌ చేసిన పౌరుల ఆందోళన కారణంగా శుక్రవారం రాత్రి అధ్యక్ష నివాసం నుంచి ఒక సైనిక నౌకా కేంద్రానికి గొటబయ వెళ్లాడు. అక్కడి నుంచి కటునాయకే సైనిక వైమానిక కేంద్రానికి తరలించారు. తదుపరి రెండు మిలిటరీ హెలికాప్టర్లలో గొటబయ పరివారం సోమవారం నాడు కొలంబో విమానాశ్రయానికి వెళ్లింది. ఎందుకు అన్నది అధికారికంగా ఎవరూ చెప్పకపోయినా దుబాయి పారిపోయేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఇమ్మిగ్రేషన్‌ సిబ్బంది ప్రముఖులు ఉండే గదికి వెళ్లి గొటబయ పాస్‌పోర్టుపై ముద్రవేసేందుకు తిరస్కరించారని, తాను పౌరులు ప్రయాణించే విమానాలు ఎక్కనంటూ గొటబయ తిరస్కరించినట్లు, తరువాత మధ్య ప్రాచ్యానికి నాలుగు విమానాలు గొటబయ లేకుండానే వెళ్లినట్లు వార్తలు. లంక అధ్యక్ష పదవిలో ఉన్న వారిని అరెస్టు చేసేందుకు అక్కడి నిబంధనలు అంగీకరించవు. దీన్ని అవకాశంగా తీసుకొని పారిపోయే ఎత్తుగడతోనే బుధవారం నాడు పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ముందస్తు తేదీ వేసిన రాజీనామా లేఖను ముందుగానే అందచేశారని చెబుతున్నారు. ఈనెల 20వ తేదీ నాటికి అఖిల పక్ష ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి.


విదేశీ రుణం 51బిలియన్‌ డాలర్లకు గాను జూన్‌లో చెల్లించాల్సిన 8.6బి.డాలర్ల కిస్తీ చెల్లింపులో లంక సర్కార్‌ విఫలమైంది. ఐఎంఎఫ్‌, ఇతర సంస్థలు, దేశాలతో కొత్త రుణాల కోసం చేస్తున్న సంప్రదింపులు ఇంకా కొలిక్కి రాలేదు. ” సార్థక ప్రజాస్వామిక పాలన ”ను ప్రోత్సహించే పేరుతో ”అంతర్జాతీయ అభివృద్ధికోసం పని చేసే అమెరికా సంస్థ( యుఎస్‌ఎయిడ్‌) నుంచి నిధులు పొందేందుకు లంక అంగీకరించింది. గతంలో ఈ సహాయాలను పొందేందుకు చెప్పిన అభ్యంతరాలను పక్కన పెట్టింది. గొటబయ సర్కారు అమెరికాతో చేసుకున్న ఒప్పందం పారదర్శకంగా లేదు. మంత్రివర్గంముందు ప్రతిపాదనలు ఉంచటం తప్ప బహిరంగపరచలేదు. ఇప్పటి వరకు ప్రపంచంలో ఏ దేశానికి అమెరికా సాయం చేసినా షరతులు, దానికి ఆర్ధిక లబ్ది లేకుండా ఒప్పందాలు చేసుకోలేదు. తక్షణం సంక్షోభం నుంచి బయటపడేందుకు ఎలాంటి ప్రమాదకర షరతులు అంగీకరించారో అన్న అనుమానాలు ఉన్నాయి. ఐఎంఎఫ్‌తో జూన్‌ 30నాటికి పదిరోజుల పాటు చర్చలు ముగిశాయి. ఒప్పందం ఇంకా ఖరారు కాలేదు. ఈ లోగా లంకలో కొత్త రాజకీయ సంక్షోభం తలెత్తింది. అప్పుగా ముడిచమురు, గాస్‌ ఇప్పించాలంటూ కతార్‌కు గొటబయ సర్కార్‌ ఒక ప్రతినిధి బృందాన్ని పంపింది. కతార్‌ను మంచి చేసుకొనేందుకు లంకలో పనిచేస్తున్న కతార్‌ ఛారిటీ అనే కతార్‌ ప్రభుత్వ సంస్థ మీద నిషేధాన్ని వెనక్కు తీసుకుంది.2019లో జరిగిన ఉగ్రవాద చర్యలకు ముస్లింలే కారణమని, వారికి కతార్‌ ఛారిటీ నిధులు అందచేసిందని ప్రభుత్వం విమర్శించింది. సదరు సంస్థ నిధులను ప్రభుత్వం స్థంభింపచేసింది. అంతే కాదు కరోనా కారణంగా మరణించిన ముస్లింల శవాలను ఖననం చేస్తే భూమి, భూగర్భ జలాలు కలుషితం అవుతాయని గొటబయ సర్కార్‌ నిషేధం విధించింది.


శ్రీలంక ప్రభుత్వం దిగివచ్చినప్పటికీ కతార్‌ సర్కార్‌ కరుణించలేదు. ఐఎంఎఫ్‌తో చేసుకొనే ఒప్పందాన్ని బట్టి తాము వ్యవహరిస్తామని స్పష్టం చేసింది. ఇదే సమయంలో ఒమన్‌ ప్రభుత్వం కూడా సాయానికి సిద్దం అంటూనే తమ సంగతి కూడా తేల్చాలని మెలికపెట్టింది. తాము చమురు సరఫరాకు అవసరమైన 360 కోట్ల డాలర్లకు గాను దానికి చెల్లించే వడ్డీ బదులు చమురు తవ్వకాలకు గాను లంకలో కొంత ప్రాంతాన్ని తమ అప్పగించాలని షరతు పెట్టగా ఈ ఏడాది జనవరిలో ప్రభుత్వం తిరస్కరించింది. నెలకు 30 కోట్ల డాలర్ల చొప్పున 12నెలల్లో రుణం ఇస్తామని, దాన్ని ఐదు సంవత్సరాల విరామం తరువాత పదిహేను సంవత్సరాల్లో చెల్లించాలని ఒమన్‌ ప్రతిపాదించింది. దీని సంగతి కూడా తేలిస్తే తాము చమురు కొనుగోలుకు రుణం ఇస్తామని లంకలో ఒమన్‌ రాయబారి స్పష్టం చేశారు. ఇవేవీ తేలకుండానే గొటబయ పరారీ, ఇతర పరిణామాలు సంభవించాయి.


శ్రీలంక పరిణామాలకు కుటుంబ పాలనే కారణమనే సూత్రీకరణలు, సంక్షేమ పధకాల అమలు వల్లనే సంక్షోభం తలెత్తిందనే రాగాలూ వినిపిస్తున్నాయి.అవినీతి అక్రమాలు జరిగినప్పటికీ నిజానికి లంక సమస్య తప్పుడు విధానాల వలన తలెత్తింది. దీనికి కరోనా, ఇతర కారణాలు కూడా తోడయ్యాయి.దేశ జిడిపిలో పన్నెండుశాతం సమకూర్చే టూరిజం 2019లో జరిగిన ఉగ్రవాద చర్యల కారణంగా దెబ్బతిన్నది. దీనికి కరోనా తోడైంది. విదేశాల్లో పనిచేసే శ్రీలంక వాసులు పంపే మొత్తాలు జిడిపిలో 8-10శాతం ఉండేవి. కరోనాతో అవి కూడా నిలిచిపోయాయి. 2019లో అధికారానికి వచ్చిన గొటబయ ప్రకటించిన పన్నుల రాయితీ కారణంగా పన్ను చెల్లించే ధనికుల సంఖ్య 15 నుంచి నాలుగు లక్షలకు తగ్గింది. వాట్‌ను 15 నుంచి 8శాతానికి తగ్గించాడు, మరో ఏడు పన్నులను రద్దు చేశాడు. వాటిలో ఒకటి దేశ పునర్‌నిర్మాణానికి కార్పొరేట్ల నుంచి వసూలు చేస్తున్న రెండు శాతం పన్ను. 2018లో టూరిజం ద్వారా 440 కోట్ల డాలర్లు రాగా 2021నాటికి 40 కోట్లకు పడిపోయింది. రసాయన ఎరువుల దిగుమతులు నిలిపివేసిన కారణంగా పంటలు దెబ్బతిని ఆహార కొరత ఏర్పడింది. ప్రపంచంలో తలెత్తిన సంక్షోభం కారణంగా వివిధ ప్రాజక్టుల మీద ఆశించిన రాబడి కూడా రాలేదు. ఇలా విధానపరమైన తప్పిదాలు,బయటి కారణాలు లంకను దెబ్బతీశాయి.


శ్రీలంక సంక్షోభానికి మూలం చైనా ఇచ్చిన అప్పులు అనే ప్రచారం పెద్ద ఎత్తున జరిగిన సంగతి తెలిసిందే. ఇది తప్పుడు ప్రచారం తప్ప మరొకటి కాదు. అనేక దేశాలు గతంలో లంక మాదిరే తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొన్నాయి. వాటిలో ఏ ఒక్కదానికీ చైనా రుణాలు ఇవ్వలేదు.1990 దశకంలో ఆసియా టైగర్‌గా పేరు తెచ్చుకున్న ఇండోనేషియా తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయి తిరిగి కోలుకున్నది.1960దశకం నుంచి ఇప్పటి వరకు 147 దేశాలు రుణ చెల్లింపుల్లో విఫలం చెందినట్లు ప్రపంచ ఆర్ధిక వేదిక సమాచారం పేర్కొన్నది. కంపెనీలు బాంకుల నుంచి రుణాలు తీసుకొని తిరిగి చెల్లించలేనట్లుగానే ప్రభుత్వాలు కూడా అప్పులు చేసి సకాలంలో కిస్తీ చెల్లించకపోతే దివాలా తీసినట్లు భావిస్తారు. చరిత్రలో 1557లో తొలిసారిగా స్పెయిన్‌ దివాలా ప్రకటించింది. తరువాత పద్దెనిమి, పందొమ్మిదవ శతాబ్దాలలో 15సార్లు సకాలంలో వాయిదాలు చెల్లించలేకపోయింది.వర్తమానంలో లాటిన్‌ అమెరికా దేశమైన అర్జెంటీనా 2001లో 132 బిలియన్‌ డాలర్లు, తరువాత 2016, 2020లో కూడా రుణాలను చెల్లించలేక చేతులెత్తేసింది. సోవియట్‌ విచ్చిన్నం తరువాత 1998లో రష్యాకూ అదే పరిస్థితి ఎదురైంది. ఉక్రెయిన్‌ 1998,2020లో, ఈక్వెడార్‌ 2008,2020లో, మెక్సికో 1982,1995లో, జమైకా 2010లో శ్రీలంక పరిస్థితినే ఎదుర్కొన్నాయి.


1960,70 దశకాల్లో అనేక లాటిన్‌ అమెరికా దేశాలు అంతర్జాతీయ సంస్థల నుంచి పారిశ్రామికీకరణ కోసం రుణాలు తీసుకున్నాయి. చమురు ఎగుమతి చేసే దేశాలలో ఒకటైన మెక్సికో 1970 దశకంలో భవిష్యత్‌లో వచ్చే చమురు ఆదాయాన్ని చూపి ప్రైవేటు బాంకుల నుంచి రుణాలు తీసుకుంది.1973లో చమురు ధరలు పతనం కావటంతో ఇబ్బందుల్లో పడింది. కొద్ది సంవత్సరాల క్రితం వెనెజులా కూడా చమురు ధరల పతనం, అమెరికా ఆంక్షలకారణంగా సకాలంలో రుణాలు చెల్లించలేకపోయింది.1975-83 కాలంలో వాణిజ్యబాంకుల నుంచి లాటిన్‌ అమెరికా దేశాలు తీసుకున్న రుణాలు ఏటా 20శాతం పైగా పెరిగాయి. రుణ మొత్తం 75 నుంచి 315 బిలియన్‌ డాలర్లకు పెరిగింది. ఇది ఆ ప్రాంత జిడిపిలో 50శాతం. ఇదే కాలంలో వడ్డీ రేట్లు కూడా పెరగటంతో వడ్డీ, అసలు చెల్లింపు ఏటా 12 నుంచి 66 బి.డాలర్లకు చేరింది. ఈ దేశాలేవీ చైనా నుంచి రుణాలు తీసుకోలేదు. మన కరెన్సీ విలువ పతనం కారణంగా విదేశాలకు చెల్లించాల్సిన డాలర్ల కొనుగోలు ధర పెరిగి ఎక్కువ మొత్తాలు చెల్లించాల్సి వస్తోంది.తాజా సమాచారం ప్రకారం మన దేశానికి ఉన్న 621బిలియన్‌ డాలర్ల విదేశీ రుణంలో స్వల్పకాలిక రుణాల మొత్తం 267 డాలర్లు ఉంది, రానున్న తొమ్మిది మాసాల్లో దీన్ని తీర్చాల్సి ఉంది. రూపాయి విలువ పతనం కారణంగా ప్రభుత్వ, ప్రైవేటు రుణాల మీద వత్తిడి పెరుగుతుంది. దీని కోసం కొత్త రుణాలు తీసుకోవాలి లేదా ఆస్తులను తెగనమ్మి చెల్లించాలి. డాలరు విలువ, అమెరికాలో వడ్డీ రేట్లు పెరుగుతున్న కారణంగా కొత్త రుణాలు మరింత భారంగా మారతాయి. రుణదాతలు కఠినమైన షరతులు విధిస్తారు. ఐఎంఎఫ్‌ లేదా ప్రపంచబాంకు జోక్యాలను అంగీకరించాలని, వాటి షరతులను అమలు జరపాలని డిమాండ్‌ చేస్తాయి. ఆ సంస్థలు రుణాలు తీసుకున్న దేశాలు తమ మార్కెట్లను మరింతగా తెరవాలని, సంక్షేమ పధకాలకు కోత పెట్టాలని, ప్రభుత్వ రంగాల ప్రైవేటీకరణ, కార్పొరేట్లకు అనుకూలగా చట్టాల సవరణ వంటి అనేక అంశాలను రుద్దుతాయి. ఈ సంస్థల్లో పెట్టుబడులు ఎక్కువ భాగం ధనికదేశాలవే వుంటాయి గనుక వాటి ప్రయోజనాలను ముందుకు తెస్తాయి. శ్రీలంకకు మన దేశం చేస్తున్న సాయాన్ని చూపి అదానీ కంపెనీ విద్యుత్‌ ప్రాజెక్టును అప్పగించాలని ప్రధాని నరేంద్రమోడీ వత్తిడి తెచ్చినట్లు వచ్చిన వార్తల గురించి తెలిసిందే.


శ్రీలంక విషయానికి వస్తే ఐఎంఎఫ్‌ నుంచి రుణాలు తీసుకోవాలని గొటబయ సర్కార్‌ నిర్ణయించి ఏప్రిల్‌ నుంచే సంప్రదింపులు ప్రారంభించింది.ఐబిఎఫ్‌డి( ఇంటర్నేషనల్‌ బ్యూరో ఆఫ్‌ ఫిస్కల్‌ డాక్యుమెంటేషన్‌-నెదర్లాండ్స్‌) సంస్థ మే 31న విడుదల చేసిన పత్రికా ప్రకటనలో లంక సర్కార్‌ తీసుకున్న నిర్ణయాలను వెల్లడించింది. ప్రభుత్వ రాబడిని పెంచేందుకు అక్టోబరు ఒకటి నుంచి అమల్లోకి వచ్చే విధంగా వాట్‌ను ఎనిమిది నుంచి పన్నెండు శాతానికి పెంచింది.వాట్‌ చెల్లించాల్సిస సంస్థల నమోదుకు లావాదేవీల ప్రారంభాన్ని 30 నుంచి 12 కోట్లకు తగ్గించారు.కార్పొరేట్‌ పన్ను 24 నుంచి 30శాతానికి పెంచింది. 2023 ఏప్రిల్‌ ఒకటి నుంచి దేశీయ కంపెనీలు విదేశీ వ్యక్తులకు చెల్లించే డివిడెండ్స్‌ను ఆదాయపన్ను పరిధిలోకి తెచ్చారు. టాక్స్‌ హాలిడేలను, పన్ను రాయితీలను కొన్ని రంగాలకు మినహాయించారు. వ్యక్తిగత ఆదాయపన్ను మినహాయింపు రాయితీ మొత్తాన్ని రు. 30 లక్షల నుంచి 18లక్షలకు తగ్గించారు. ఆదాయపన్ను విధింపు రు. 30 నుంచి గాక పన్నెండు లక్షల నుంచే ప్రారంభిస్తారు. ఇలాంటివే మరికొన్ని నిర్ణయాలను తీసుకున్నారు. ఇవన్నీ ఐఎంఎఫ్‌, ఇతర అంతర్జాతీయ సంస్థలను ప్రసన్నం చేసుకొనేందుకే. గతంలో గొటబయ సర్కార్‌ కార్పొరేట్లకు అప్పనంగా రాయితీలు ఇచ్చిందని, పన్ను చెల్లించగలిగిన వారికి మినహాయింపులిచ్చి ఖజానాను గుల్లచేసిందనే విమర్శలు ఉన్నాయి.పైన పేర్కొన్న అంశాలు గతంలో చేసిన వాటిని కొన్నింటిని సవరించినట్లు కనిపిస్తున్నాయి. సందట్లో సడేమియా అన్నట్లుగా సామాన్యజనంపై భారాలు మోపే వాట్‌ పెంపుదల వంటివి కూడా ఉన్నాయి. లాటిన్‌ అమెరికా దేశాల అనుభవం చూసినపుడు ఐఎంఎఫ్‌ షరతుల వలన కార్మికుల నిజవేతనాలు పడిపోవటం, భారాలు పెరగటం వంటి పరిణామాలను, వాటికి ప్రతిఘటన పోరాటాలను చూశాము. లంకకు ఐఎంఎఫ్‌ విధించే షరతులు పూర్తిగా వెల్లడైన తరువాత వాటి ప్రభావం గురించి చెప్పుకోవచ్చు. ఇప్పుడు పాలకుల అస్తవ్యస్త విధానాల మీద జనం చేసిన తిరుగుబాటు రేపు భారాలకు వ్యతిరేకంగా కూడా పునరావృతం అవుతుంది.