ఎం కోటేశ్వరరావు
ముందుగా పొద్దున్నే వచ్చిన ఒక ఫోన్ గురించి చెప్పాలి. సార్ మన ప్రధాని నరేంద్రమోడీ ఢిల్లీ గల్లీలో కూర్చుని అదేదో ఐరోపా దేశమంట అక్కడి కారు నడిపిండట నిజమేనా అని ఒకతను అడిగాడు. నిజమే అన్నాను. మా పక్కింటి పిల్లోడు ఆఫీసుకు పోకుండా ఇంటి నుంచే పని చేస్తే కంపినోళ్లు నెలాఖరుకు బాంకులో పైసలేస్తున్నరు. నేను కూడా అదే చేస్త అన్నాడు. ఇంతకూ నువ్వేం చేస్తావని అడిగా , ఓలా కాబ్ డ్రైవర్ను సార్ అన్నాడు. అలాగా , నువ్కొక్కడివే ఏమిటి మీ ఇంటిలో అందరి పేరా తలా ఒక కారు కొని అందరూ కలసి కబుర్లు చెప్పుకుంటూ, టీవీల్లో సినిమాలు చూస్తూ, బిర్యానీ తింటూ, టీ తాగుతూ మజా చేసుకుంటూ కార్లు నడుపుతూ మస్తుగా సంపాదించుకోవచ్చు అని చెప్పా. ఏంది సార్ మజాక్ చేస్తున్నరా అని అనుమానంగా అడిగాడు.మజాక్ చేసేందుకు, మభ్య పెట్టేందుకు నేనేమన్నా నరేంద్రమోడీ, కెసిఆర్,జగనన్న, చంద్రబాబు అనుకుంటున్నవా ఏమిటి, నిజమే చెబుతున్నా అన్నా. ఏం మాట్లాడకుండా ఫోన్ పెట్టేసిండో బాలన్స్ లేక అదే ఆగిందో తెలియదు గానీ, చెప్పాలనుకున్నది పూర్తిగా చెప్పలేకపోయా !
మాంత్రికులు, మహా మాంత్రికులు కలిస్తే మహాభారతంలో ఘటోత్కచుడి కోసం ఆహార పదార్ధాలను ఎలా సృష్టించారో మాయాబజార్ సినిమా చూస్తే తెలుస్తుంది. కానీ నేటి భారతంలో జనాలు కడుపునింపుకొనేందుకు అన్నం కూరల కోసం ఎదురు చూడాల్సిన పని లేదు. అరచేతిలో చౌకగా లభించే సినిమాలు, సీరియళ్లు, పోసుకోలు కబుర్లు, ఇతర సమాచారంతో కడుపు నింపుకొనేందుకు ఒక సెల్ ఫోను ఉంటే చాలు. ప్రధాని నరేంద్రమోడీ, ప్రముఖ పారిశ్రామిక, వాణిజ్యవేత్త ముకేష్ అంబానీ తాజాగా దేశ ప్రజలకు అందించిన అమూల్య సందేశమిదే ! అక్టోబరు ఒకటిన ఢిల్లీలోని ప్రగతి మైదాన్లో జరిగిన ఇండియన్ మొబైల్ కాంగ్రెస్-2022 సభలలో 5జి సేవలను ప్రారంభించిన నరేంద్రమోడీ సదరు డ్రైవర్ అడిగినట్లు అక్కడి నుంచి ఐరోపాలోని ఒక దేశంలో కారు నడిపినట్లు అందరూ చూశారు. ఏదో ఒక పెద్ద బొమ్మకారు ముందు చక్రాలు కదులుతున్నట్లు నాకుమాత్రమే కనిపించిందా, అందరికీనా అన్న సందేహం, అడిగితే ఏమనుకుంటారో అన్న సంకోచం. తీర్చితే దేశానికి వచ్చే లాభం సంగతి తెలీదు, తీర్చకపోతే నాకు ఎలాంటి నష్టమూ ఉండదు.
ఇంతకూ మన ప్రధాని మోడీ చెప్పిందేమిటి ? 5జి(ఐదవ తరం) సాంకేతిక పరిజ్ఞానం విప్లవాత్మక మార్పులు తెస్తుంది. ఇది 130 కోట్ల మంది దేశ ప్రజలకు ఒక బహుమతి. నూతన యుగం వైపు ఒక ముందడుగు. అంతం లేని అవకాశాలకు ప్రారంభం. నూతన భారతం కేవలం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొనేది మాత్రమే గాక అభివృద్ది, అమల్లో చురుకైన పాత్ర పోషిస్తుంది.ప్రపంచంలో సాంకేతిక అభివృద్ధి సారధిగా దేశం ఉంటుంది.(2015లో 81వ స్థానంలో ఉన్నదానిని నరేంద్రమోడీ 2022లో 40వ స్థానానికి తెచ్చారని పొగుడుతున్నారు. ఇదే కాలంలో పాకిస్తాన్ 131 నుంచి 87వ స్థానానికి ఎదిగింది. మన దేశం 41రాంకులు పెంచుకుంటే పాకిస్తాన్ 44 పెంచుకుంది.అయినా 40వ స్థానంలో ఉన్న మనం ప్రపంచ సారధి ఎలా అవుతామో ఆ గోమాతకే తెలియాలి) 2014లో ఒక్క ఫోనూ ఎగుమతి చేయని మనం ఇప్పుడు వేల కోట్ల విలువల వాటిని ఎగుమతి చేస్తున్నాము. తక్కువ ఖర్చులో ఎక్కువ విశేషతలను ఫోన్లలో అమర్చుతున్నాము. దేశంలోని పేదలు నూతన సాంకేతిక పద్దతులను అనుసరించేందుకు ముందుకు రావటాన్ని చూశాను. గతంలో కొన్నేండ్ల క్రితం ఒక జిబి(సులభంగా అర్ధం కావాలనుకుంటే ఒక కిలో అనుకుందాం) ధర రు.300 ఉంటే, ఇప్పుడు రు.10కి తగ్గింది. సగటున ప్రతి మనిషి నెలకు 14 జిబిలు వాడుతున్నారు. అంటే నెలకు రు.4,200 గా ఉండేది రు.125-150కి తగ్గింది. ప్రభుత్వ ప్రయత్నాలు దీనికి దోహదం చేసింది. వీధుల్లో అమ్ముకొనే చిరువ్యాపారి కూడా ఇప్పుడు యుపిఐ ( పేటిఎం, గూగుల్ పే, ఫోన్పే వంటివి) వాడుతున్నారు. కూరగాయల వంటి వాటిని అమ్మేవారు కూడా నగదు వద్దు యుపిఐ చేయమంటున్నారు. బ్రోకర్లు లేకుండా లబ్దిదార్లకు నేరుగా ఫలాలు అందుతున్నాయి. ఈ దశాబ్దమే కాదు ఇది భారత శతాబ్దం.నాల్గవతరం పారిశ్రామిక విప్లవానికి దేశం నాయకత్వం వహించనుంది. ఆత్మనిర్భర్ గురించి చెప్పినపుడు జనాలు నవ్వారు, 2014లో కేవలం రెండే మొబైల్ ఫోన్ల తయారీ కేంద్రాలుంటే ఇప్పుడు 200కు పెరిగాయి.
బహుశా నరేంద్రమోడీ గారు గంగిరెద్దుల వారిని చూసి ఉండరు. ఆ ఎద్దుల మొహాల మీద కూడా యుపిఐ అట్టలను వేలాడదీస్తున్నారు. ప్రధాని చూడనివి, చూసేందుకు ఇష్టపడనివి, కనిపించనివి,కనిపించినా చూడనట్లు ముఖం తిప్పుకొనేవి, పోల్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఎనిమిన్నరేండ్ల మోడీ ఏలుబడిలో బియ్యం, పప్పులు, నూనెల ధరలు ఎంత తగ్గాయన్నది తప్ప అచ్చేదిన్ అంటే సమాచార ధర తగ్గటం కాదు. 2013 ప్రపంచ ఆకలి సూచికలో 120కి గాను 63వ స్ధానంలో ఉన్న మనం మరుసటి ఏడాది 55కు చేరాం ,అలాంటిది మోడీ ఏలుబడిలోకి వచ్చాక 2021లో 116 దేశాల్లో వందవ స్థానానికి ఎందుకు దిగజారినట్లు ? చౌకగా దొరికే సమాచారంతో జనాలు కడుపు నింపుకోలేకపోతున్నారా ? ఇక పెంచిన చమురు పన్నులు, గాస్ ధరల గురించి చెప్పనవసరం లేదు. అందువల సమాచార ధర 300 నుంచి పదికి తగ్గించిన మోడీ ప్రతిభను పొగిడేవారు మిగతావాటి ధరలను ఆమేరకు తగ్గించకపోగా విపరీతంగా పెంచిన సంగతేమిటో చెబుతారా ?
ఇక అరవై ఐదేండ్ల ముకేష్ అంబానీ ఇండియన్ మొబైల్ కాంగ్రెస్-2022 సభలో నరేంద్రమోడీ మనసెరిగి మెచ్చుకోలు మాటలు మాట్లాడారు ? ఐదవతరం సమాచార పరిజ్ఞానం తోడ్పాటుతో ఇప్పుడున్న మూడులక్షల కోట్ల డాలర్ల జిడిపి 2047 నాటికి 40 లక్షల కోట్ల డాలర్లకు పెరుగుతుందని, రెండువేల డాలర్ల తలసరి ఆదాయం ఇరవైవేల డాలర్లకు పెరుగుతుందని చెప్పారు. 5జి సాంకేతిక పరిజ్ఞానం కోరుకున్నవారికి కోరుకున్నది ఇచ్చే కామధేనువు వంటిదని కూడా చెప్పారు. వచ్చే ఏడాది డిసెంబరు నాటికి ప్రతి తాలుకా కేంద్రం వరకు తమ 5జి అందుబాటులోకి వస్తుందన్నారు. తమ 5జిలో ఎక్కువ భాగం భారత్లోనే రూపొందినందున దీన్ని ఆత్మనిర్భర్ ముద్రతో ముందుకు తీసుకుపోతామన్నారు. ఈ అరచేతిలో వైకుంఠానికి ఆధారం ఏమిటో, ఏ అంచనాతో చెప్పారో అడిగేందుకు అప్పటికి ఎంత మందిమి ఉంటామో చెప్పలేము.
ఐదవ తరం గానీ అంతకు ముందు తరాల వచ్చే సమాచార సాంకేతిక పరిజ్ఞానం గొప్పదే తప్ప జీవితాలను సమూలంగా మార్చేది కాదు. అదే సర్వస్వం కాదు. ప్రతి తరాన్ని ఆవిష్కరించినపుడు అంతకు ముందుతో పోల్చితే విప్లవాత్మక మార్పులనే చెప్పారు, అది ఆ రంగంలో నిజమే. అది జనజీవితాలను మార్చేట్లయితే ఒకటి నుంచి ఐదవ తరం (1జి నుంచి 5జి ) వరకు వచ్చిన విప్లవం పేదరికం, నిరుద్యోగాన్ని ఎంత మేరకు తగ్గించిందీ ఎవరైనా చెప్పగలరా ? అమెరికాలో కూడా మన చౌక బియ్యం మాదిరి ఉచిత ఆహార కూపన్ల కోసం వరుసల్లో నిలిచే ,ఇళ్ల అద్దెలు కట్టలేక వారాల తరబడి కార్లలో కాపురాలు చేసే జనం ఎందుకున్నట్లు ? ఇప్పటి వరకు ప్రతి పది సంవత్సరాలకు ఒక నూతన తరం సెల్ ఫోను, పరిజ్ఞానం వచ్చింది.1979లో నిప్పన్ టెలిగ్రాఫ్ మరియు టెలిఫోన్ కంపెనీ జపాన్లో ఒకటవ తరం సెల్ఫోన్ను టోకియో నగరంలో ప్రవేశపెట్టింది.1984 నాటికి దేశమంతటికీ విస్తరించింది.1983లో అమెరికా, తరువాత కెనడాలకు వచ్చింది.1991లో ఫిన్లండ్ 2జిని, 2001లో జపాన్ 3జి, నార్వే 2009 చివరిలో 4జి, 2019లో దక్షిణ కొరియా 5జిని ప్రవేశపెట్టింది. 1995 జూలై 21న మన దేశంలో తొలి సెల్ఫోన్తో పశ్చిమ బెంగాల్ సిఎం జ్యోతిబాసు నాటి టెలికాం మంత్రి సుఖరామ్తో మాట్లాడారు. అది మూడవ తరం ఫోను. తరువాత 2012లో అదే కొల్కతాలో 4జి ఫోన్లను ప్రవేశపెట్టారు. పది సంవత్సరాల తరువాత నరేంద్రమోడీ 5జిని ప్రారంభించారు.
మూడు నుంచి ఐదు లక్షల కోట్లకు జిడిపిని పెంచేందుకు ఎంత కష్టపడుతున్నామో దానికి 4జి ఎందుకు దోహదపడలేదో పెద్దలు చెప్పాలి.2024-25 నాటికి మన జిడిపి ఐదు లక్షల కోట్ల డాలర్లకు చేరుతుందని 2019లో ప్రధాని నరేంద్రమోడీ చెప్పారు. అది ఎప్పటికి జరుగుతుందనే అంచనాపై ఏకీభావం లేదు.2026-27 నాటికి సాధిస్తామని ప్రధాన ఆర్ధిక సలహాదారు అనంత నాగేశ్వరన్ చెబుతున్నారు. తరువాత 2033-34 నాటికి పది లక్షల కోట్లడాలర్లకు చేరుతుందని కూడా చెప్పారు. రానున్న ఐదు సంవత్సరాల్లో స్థిరంగా ఏటా తొమ్మిది శాతం వృద్ధి సాధిస్తే 2028-29 నాటికి ఐదులక్షల డాలర్లను సాధిస్తామని రిజర్వుబాంకు మాజీ గవర్నర్ డి సుబ్బారావు చెప్పినట్లు 2022 ఆగస్టు పదిహేనవ తేదీ పత్రికలు ప్రకటించాయి.
2010లో అమెరికాలో 4జిని ప్రవేశపెట్టారు. ఆ ఏడాది దాని జిడిపి వృద్ధి రేటు 2.71 శాతం, ఆ ఏడాదితో సహా 2021నాటికి పన్నెండు సంవత్సరాల సగటు వృద్ధి రేటు 2.06శాతం. అందువలన జిడిపి వృద్ధి రేటుకు 4జి తోడ్పడినట్లా అడ్డుపడినట్లా ? అక్కడి 4జి వేగానికి మన దేశంలో 4జి వేగానికి ఎక్కడైనా పొంతన ఉందా ? సమాచార విశ్లేషణ, దాన్ని బట్టి ఉత్పత్తులు, మార్కెటింగ్ ఎత్తుగడల వంటివాటితో కంపెనీల లాభాలను పెంచుతుందనటంలో ఎలాంటి సందేహం లేదు.మహాకవి గురజాడ చెప్పినట్లు దేశమంటే మనుషులు తప్ప కార్పొరేట్స్ కాదు కదా ! 5జి, తరువాత వచ్చే ప్రతితరం కూడా చేసేది అదే.
5జి వస్తే జరిగేదేమిటి ? నరేంద్రమోడీ తొలిసారి అధికారానికి వచ్చిన నాలుగున్నర సంవత్సరాల తరువాత డిజిటల్ ఇండియా పేరుతో కేంద్ర ప్రభుత్వం ఒక పుస్తకాన్ని ప్రచురించింది. దానికి ముందు మాట రాసిన ఆర్ధిక సలహాదారు సిమ్మీ చౌదరి పేర్కొన్న అంశాల సారాన్ని చూద్దాం. నాలుగు సంవత్సరాల కాలంలో నేరుగా నగదు బదిలీ విధానం ద్వారా 438 ప్రభుత్వ పధకాలకు సంబంధించి రు. 6.21 లక్షల కోట్లను బదిలీ చేసినట్లు, తద్వారా రు 1.1లక్షల కోట్ల మేర ఆదా జరిగినట్లు ఆమె పేర్కొన్నారు. ఒకసారి నకిలీ ఖాతాలను రద్దు చేసిన తరువాత 5జి వచ్చినా కొత్తగా మిగిలేదేమీ ఉండదు. ఇప్పటికే అనేక సేవలను అందుబాటులోకి తెచ్చినందున వాటి వేగం పెరగటం తప్ప ఒరిగేదేమీ ఉండదు. 2018 వరకు 3.21లక్షల కామన్ సర్వీసు సెంటర్స్(సిఎస్సి) ద్వారా పదిలక్షల మంది ఇప్పటికే పని చేస్తున్నారని పన్నెండు లక్షల మందికి ఉపాధి చూపుతున్నారని సిమ్మి పేర్కొన్నారు. ఈ పధకాన్ని 2006లో ప్రారంభించారు, ఆరులక్షల గ్రామాలకు గాను ప్రతి ఆరింటికి ఒకటి చొప్పున లక్ష కేంద్రాల ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 28 నాటికి ఉన్న సమాచారం ప్రకారం గ్రామానికి కనీసం ఒక కేంద్రం చొప్పున రెండున్నర లక్షల గ్రామాల్లో పెట్టాలన్నది లక్ష్యమని, ప్రస్తుతం 4,63,705 కేంద్రాల్లో నేరుగా, పరోక్షంగా 15లక్షల మంది ఉపాధి పొందుతున్నట్లు 2022 ఏప్రిల్ ఆరున కేంద్రమంత్రి చంద్రశేఖర్ పార్లమెంటుకు తెలిపారు. మరి 2018నాటికే సిమ్మీ చెప్పినట్లు 22లక్షల మంది ఉపాధి పొందుతుండగా తరువాత లక్షా 40వేల కేంద్రాలు పెరిగినా పదిహేను లక్షలని మంత్రి చెప్పటమేమిటి ? 5జి సేవలకు కొత్త పరికరాలు అవసరం కనుక వాటి ఉత్పత్తి, ఉపాధి పెరుగుతుందని చెబుతున్నారు. అది నిజమే కావచ్చు, పాత తరాల పరికరాల ఉత్పత్తి నిలిపివేసి కొత్తవాటికి మళ్లుతారు, అదే కార్మికులతో పని చేయిస్తారు, కొత్తగా వచ్చేదేముంటుంది ?
జిఎస్ఎంఎ అంచనా ప్రకారం 5జి సేవల వలన భారత ఆర్ధిక రంగానికి 2023 నుంచి 2040 మధ్య 455బిలియన్ డాలర్ల లబ్ది ఉంటుంది. ముకేష్ అంబానీ 2047 నాటికి మన జిడిపి మూడు నుంచి 40లక్షల కోట్లడాలర్లని చెప్పారు తప్ప ఏ పద్దతిలో అంచనా అన్నది చెప్పలేదు. నామినల్ పద్దతిలో ఆ నాటికి 30లక్షల కోట్ల డాలర్లని, పిపిపి పద్దతిలో 40లక్షల కోట్లని కొంత మంది ఎప్పుడో అంచనా వేశారు, అంబానీ మూడు లక్షల కోట్లను నామినల్ అంచనాను తీసుకొని పిపిపి పద్దతిలో రెండోదాన్ని తీసుకున్నారు. అది సరైన పోలిక కాదు. కనుక దీన్ని అంగీకరించాలా ? 2021 జూన్ 21న ప్రకటించిన ప్రపంచబాంక్, ఐఎంఎఫ్ అంచనా ప్రకారం మన నామినల్ జిడిపి 2020లో 2.71 లక్షల కోట్ల డాలర్లు కాగా పిపిపి పద్దతిలో 8.91 లక్షల కోట్లుగా ఉంది. 2011నవంబరు 12 ఎకనమిక్ టైమ్స్లో మిన్హాజ్ మర్చంట్ రాసినదాని ప్రకారం అమెరికా సిటీ బాంకు వేసిన అంచనా 2050 నాటికి భారత జిడిపి పిపిపి పద్దతిలో 85.97 లక్షల కోట్ల డాలర్లుంటుందని, రెండవ స్థానంలో చైనా 80.02 లక్షల కోట్లు, మూడవ స్థానంలో అమెరికా జడిపి 39.07 లక్షల కోట్ల డాలర్లతో ఉంటుందని, మన దేశ జనాభా అప్పటికి 160కోట్లకు చేరుతుందని తలసరి ఆదాయం 53వేల డాలర్లు ఉంటుందని, 39 సంవత్సరాల పాటు సగటున ఏటా 8.1శాతం వృద్ధి రేటు ఉంటేనే అనే షరతును కూడా ఉటంకించారు. మరి దీన్ని తిరస్కరించాలా, అంబానీ అంచనాను అంగీకరించాలా? ఇంత తేడా ఎందుకున్నట్లు ? ఇక ఫోన్ చేసిన కాబ్ డ్రైవర్కు నేను చెప్పదలచుకున్నదేమంటే నువ్వు ఇంటి దగ్గర నుంచి కాబ్ను ఆపరేట్ చేసే అవకాశం ఓలా కంపెనీ నీకు ఎందుకు ఇస్తుంది. కార్లు కొని తక్కువ ఖర్చుతో ఇతరులతో అదే ఆపని చేస్తది, కలలు కనొద్దు బాబూ అని ! కలలు కనేందుకు, అడుక్కోవటంలో పిసినారి తనం ఎందుకని పెద్దలు మందలిస్తారు. మాయ మహామాయ లోకంలో ఉన్నాం ! వశీకరణ విద్యలో ఆరితేరిన నరేంద్రమోడీ మాటల మాంత్రికుడైతే, ముకేష్ అంబానీ కార్పొరేట్ లాభాల మహా మాంత్రికుడు. ఇద్దరికీ జోడి కుదిరిందని ఎనిమిదేండ్ల అనుభవం చెబుతోంది మరి !!