Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు
ప్రధాని నరేంద్రమోడీ నోట రెండోసారి పలికేందుకు ఇబ్బంది పడిన పెద్ద నోట్ల రద్దును సమర్ధిస్తూ రిజర్వుబాంకు ద్రవ్యవిధాన పర్యవేక్షక కమిటీ సభ్యురాలుద, ఆర్ధికవేత్త అషిమా గోయల్‌ ఇటీవల ముందుకు వచ్చారు. దేశ చరిత్రలో పెద్ద నోట్ల రద్దు జనానికి ఒక పెద్ద పీడకల, పాలకులకు ఘోర వైఫల్యం. దీని గురించి ఆరు సంవత్సరాల తరువాత ఐదుగురు జడ్జీలతో కూడిన సుప్రీం కోర్డు డివిజన్‌ బెంచ్‌ పెద్ద నోట్ల రద్దు లక్షా˜్యన్ని సాధించిందా అన్న అంశాన్ని విచారించేందుకు అంగీకరించింది. ప్రభుత్వ విధానాల సమీక్ష మీద తమకు ఉన్న లక్ష్మణ రేఖ గురించి తెలుసునని కూడా కోర్టు పేర్కొన్నది. అందువలన ఈ కేసులో ఎలాంటి తీర్పు వస్తుందనే అంశం గురించి ఊహాగానాలు అవసరం లేదు. తీర్పు తీరు తెన్నులు ఎలా ఉన్నప్పటికీ పెద్ద నోట్ల రద్దు నిర్ణయ ఫలితాలు, పర్యవసానాల మంచి చెడ్డల గురించి జరిగే చర్చలో అనేక అంశాలు వెలుగులోకి వస్తాయి, పాలకుల మాటలను, నాటి పరిస్థితి, ప్రహసనాలను జనాలకు మరోసారి గుర్తుకు తెస్తాయి.


పెద్ద నోట్ల రద్దు బడా వైఫల్యమని తెలిసినప్పటికీ పన్ను వసూళ్ల ప్లవనశక్తి వెనుక పెద్ద నోట్ల రద్దు ప్రక్రియ ఉన్నదని అషిమా గోయల్‌ పిటిఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. అది నిజమా, ఆ వైఖరితో అందరూ ఏకీభవించాలా? అఫ్‌ కోర్సు ఇదే తర్కం ఆర్ధికవేత్తలందరికీ వర్తిస్తుంది కదా అని ఎవరైనా అనవచ్చు. నిజమే, ఎవరేం చెప్పినా వారు చెప్పినదానికి ప్రాతిపదికలే విశ్వసనీయతను వెల్లడిస్తాయి. ఇదే అషిమాకూ వర్తిస్తుంది. దేశంలో పెద్ద నోట్ల రద్దుకు ముందు- తరువాత పన్ను వసూళ్ల అంకెలు ఏమి చెబుతున్నాయి ? ఇలా అనేక అంశాలను చూడాల్సి ఉంది. పెద్ద నోట్ల రద్దు గురించి ఆర్‌బిఐ, కేంద్ర ప్రభుత్వం కూడా సుప్రీం కోర్టులో దాఖలు చేసే అఫిడవిట్లలో ఏమి చెబుతారన్నది ఆసక్తి కలిగించే అంశమే. అషిమా గోస్వామి చెప్పిన అంశాల ప్రాతిపదిక, వాదనే వాటిలో ఉంటుందా ? చూద్దాం.


పెద్ద నోట్ల రద్దు ద్వారా నల్లధనాన్ని వెలికి తీస్తామని, ఉగ్రవాదులు, ఇతర విద్రోహశక్తులకు నిధులు అందకుండా చూస్తామని,సమాంతర ఆర్థిక వ్యవస్థ అంతు చూస్తామని, తెరవెనుక లావాదేవీలను బహిర్గతపరుస్తామని ప్రధాని నరేంద్రమోడీ 2016నవంబరు 8న పెద్ద నోట్ల రద్దు ప్రకటనలో చెప్పారు. ” ప్రభుత్వ అధికారుల పరుపుల కింద కరెన్సీ కట్టలు లేదా గోనె సంచుల్లో నగదు దొరికింది అనే వార్తలతో నిజాయితీపరులైన పౌరులు బాధపడకూడదనే ” పెద్ద నోట్ల రద్దు విధానాన్ని ప్రకటించినట్లు చెప్పారు. లెక్కాపత్రం లేని ధనాన్ని పన్ను అధికారులకు వెల్లడించటం లేదా బాంకుల్లో జమ మినహా మరొక మార్గం లేదన్న ఎందరో దాన్ని అవినీతి, నల్లధనంపై మెరుపు (సర్జికల్‌) దాడిగా పేర్కొన్నారు. ఆ తరువాత తెలంగాణాలో జరిగిన హుజూరాబాద్‌ ఉప ఎన్నిక, ఇప్పుడు జరుగుతున్న మునుగోడు ఉప ఎన్నికలో లెక్కా పత్రం లేని డబ్బు ప్రవాహాన్ని చూసిన తరువాత మోడీ అమాయకుడై అలా చెప్పారా లేక జనాలను వెంగళప్పలుగా భావించినట్లా ? ఇటీవలనే పశ్చిమ బెంగాల్‌ మంత్రి పార్థా చటర్జీ, అతని సన్నిహితురాలు అపర్ణా ముఖర్జీ ఇండ్లలో అధికారికంగా ప్రకటించిన రు.49.80 కోట్ల నగదు కట్టలు, ఐదు కోట్ల విలువైన బంగారం వారి వద్దకు ఎలా చేరినట్లు ? ఇది సముద్రంలో కాకిరెట్ట వంటిది. ఆ పెద్దమనిషి రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు గనుక, మమతాబెనర్జీకి కూడా వాటా వుండి చూసీ చూడనట్లు ఉన్నారనుకుందాం, మరి కేంద్ర సంస్థలు ఏం చేస్తున్నట్లు ? నిజానికి చిత్తశుద్దితో దాడులు చేస్తే దేశంలో అలాంటివి ఇంకా ఎన్ని దొరికేదీ చెప్పాల్సినపని లేదు. పెద్ద నోట్ల రద్దు తరువాత కొంత ఇబ్బంది పడినప్పటికీ ఇప్పుడు దాని ఫలాలు అందుతున్నట్లు అషిమా చెప్పారు. ఫలాలంటే ఏమిటి ? ఆర్ధిక వ్యవస్థ క్రమబద్దీకరణ జరిగింది, డిజిటైజేషన్ను పెంచింది, పన్నుల ఎగవేతను నిరోధించింది అని ఆమె చెప్పారు. గత ఏడాదితో పోల్చితే వర్తమాన ఆర్ధిక సంవత్సరంలో కార్పొరేట్‌, వ్యక్తిగత పన్ను చెల్లింపు 24శాతం పెరిగి రు.8.98లక్షల కోట్లకు, జిఎస్‌టి గత ఏడాది సెప్టెంబరుతో పోల్చితే ఈ ఏడాది 26శాతం చేరినట్లు అక్టోబరు 9న పన్నుల శాఖ చెప్పిన అంశాన్ని ఆమె తన వాదనకు రుజువుగా పేర్కొన్నారు.


పెద్ద నోట్ల రద్దు వలన సుమారు నాలుగున్నరలక్షల కోట్ల మేర నగదు చలామణి నుంచి అదృశ్యమౌతుందని ఎస్‌బిఐ ప్రధాన ఆర్ధిక సలహాదారుగా ఉన్న సౌమ్యకాంతి ఘోష్‌ 2016 నవంబరు 14వ తేదీన బిజినెస్‌ స్టాండర్డ్‌ అనే పత్రికలో రాసిన విశ్లేషణలో పేర్కొన్నారు.( అంటే ఆమేరకు ప్రభుత్వానికి లబ్ది చేకూరినట్లే) అంతే కాదు ఇప్పటికే ఉన్న ఢిల్లీ పొగను మరింత పెంచేవిధంగా అంత మొత్తాన్ని తగుల పెట్టబోరనే చతురోక్తిని కూడా విసిరారు. అషిమా అభిప్రాయం కూడా అలాంటిదేనా ? ఇద్దరూ ఆర్ధికవేత్తలే కదా ! చివరికి ఏమైంది, ఒక్కరంటే ఒక్కరు కూడా నోట్లు తగలబెట్టలేదు, పోపుల డబ్బాల్లో దాచుకొని నోట్ల రద్దు తెలియని వారు, ఇతర కుటుంబ సభ్యులకు తెలపకుండా కొంత మొత్తాలను దాచుకొని అవి వెల్లడైతే కుటుంబంలో కలతల గురించి భయపడినవారు తప్ప నల్ల ధనికులందరూ తమ సొమ్మును తెల్లగా మార్చుకున్నారని అధికారిక గణాంకాలే చెప్పాయి.ఆశించిన ఫలితాలు రాకపోవటంతో భంగపడిన అధికారపార్టీ పెద్దలు పెద్ద నోట్ల రద్దు వలన అసలెందుకు చేశారో చెప్పటం మానేసి దీని వలన డిజిటల్‌ చెల్లింపులు పెరిగాయి కదా అని వాదించారు. మొగుడు పోతే పోయాడు గానీ గుండు మాత్రం పొన్నకాయలా భలే ఉందే అన్న సామెతను గుర్తుకు తెచ్చారు. అది కూడా నిజం కాదు. కార్డుల ద్వారా చెల్లిస్తే రెండు శాతం అదనంగా వసూలు చేస్తుండటంతో జనాలు తిరిగి నగదుకే మొగ్గారు. అనేక దుకాణాల్లో యుపిఐ చెల్లింపులను అంగీకరించటం లేదు.కార్డులు లేదా యుపిఐ లావాదేవీలను పెంచేందుకు ప్రపంచంలో ఏ దేశంలో కూడా పెద్ద నోట్ల రద్దు అనే పిచ్చిపనులు చేయలేదు. కానీ కొందరు ఈ ఘనతను నరేంద్రమోడీకి ఆపాదించేందుకు మరోసాకు లేక పెద్ద నోట్ల రద్దుకు ముడిపెట్టారు.

2016 నవంబరు 14న గోవాలోని మోపా విమానాశ్రయ శంఖుస్థాపన సందర్భంగా గౌరవనీయ ప్రధాని నరేంద్రమోడీ దేశానికి ఒక విన్నపం చేశారు. ‘నేను కేవలం 50రోజులు మాత్రమే అడుగుతున్నాను. డిసెంబరు 30వరకు గడువు ఇవ్వండి. ఆ తరువాత నా వుద్ధేశ్యాలు లేదా చర్యలలో ఏదైనా లోపం కనపడితే దేశం ఏ శిక్ష విధించినా భరించటానికి నేను సిద్దంగా వున్నాను, వురికైనా సిద్దమే, సజీవ దహనం చేయండి’ అన్నట్లు కూడా మీడియాలో వార్తలు వచ్చాయి. డెబ్బయ్యేండ్ల నుంచి కుంభకోణాలకు పాల్పడిన వారు నన్ను బతకనివ్వరు, వారంతా ఇప్పుడు తమ దగ్గర వున్న నల్లధనాన్ని మార్చుకొనేందుకు బ్యాంకుల ముందు బారులు తీరారని కూడా సెలవిచ్చారు.


పెద్ద నోట్ల రద్దు గురించి దివంగత ఆరుణ్‌ జైట్లీ ఆర్ధిక మంత్రిగా 2017 ఫిబ్రవరి రెండున పార్లమెంటులో చేసిన ప్రసంగంలో చెప్పిందేమిటి ? 2016 నవంబరు ఎనిమిది నుంచి డిసెంబరు 30వరకు రెండు నుంచి 80లక్షల వరకు డిపాజిట్లు చేసిన ఖాతాలు 1.09 కోట్లు కాగా ఒక్కొక్క ఖాతా సగటు మొత్తం రు.5.03 లక్షలు, 80లక్షలకు మించి దాఖలు చేసిన ఖాతాలు 1.48 లక్షలు, వీటి సగటు రు.3.31 కోట్లు. వీటిని మరొక విధంగా చెప్పారు కొందరు. రు.80లక్షల లోపు డిపాజిట్లు చేసిన ఖాతాల్లో చేరిన మొత్తం రు.5.48 లక్షల కోట్లు కాగా అంతకు మించి చేసిన ఖాతాల మొత్తం రు.4.89 లక్షల కోట్లు.ఆర్‌బిఐ ప్రకటించిన దాని ప్రకారం 99శాతంపైగా నగదు వెనక్కు వచ్చింది, రిజర్వుబ్యాంకు నివేదిక ప్రకారం 99.3శాతం రద్దయిన నోట్లు వెనక్కు తిరిగి వచ్చాయి.10,720 కోట్లు మాత్రమే వెనక్కు రాలేదని, మొత్తం నోట్లలో 0.0005శాతం అంటే 5,22,783 మాత్రమే నకిలీ నోట్లను కనుగొన్నట్లు రిజర్వుబ్యాంకు వెల్లడించింది.రిజర్వుబ్యాంకు అధికారికంగా చెప్పినదాని ప్రకారమే వెనక్కు రాని నోట్ల కంటే కొత్త నోట్లు అచ్చేసి, పంపిణీ చేసేందుకు అయిన ఖర్చు ఎక్కువ. పదమూడు వేల కోట్ల రూపాయలని చెప్పింది. రద్దు చేసిన నోట్ల విలువ రు.15.44లక్షల కోట్లు. మూడోవంతు(31శాతం) సొమ్ము రు.4.89 లక్షల కోట్లు 80లక్షలకు పైగా డిపాజిట్లు కేవలం 1.48 లక్షల మంది నుంచే వచ్చిందంటే నోట్ల రద్దు వలన లబ్ది పొందింది నల్ల మహా ధనికులా మరొకరా ?


పెద్ద నోట్ల రద్దు తరువాత నగదు రహిత ఆర్ధిక వ్యవస్థగా మారిందని చెప్పే పెద్దమనుషులతో, డిజిటల్‌ లావాదేవీలు పెరిగాయంటూ టీ స్టాల్‌, కూరల దుకాణాల ఉదాహరణలు చెప్పేవారితో నాకు పేచీ లేదు. అది వేరే సమస్య. పెద్ద మొత్తంలో నగదు లావాదేవీలకు అవినీతితో సంబంధం ఉంటుందని పెద్ద నోట్ల రద్దు ప్రసంగంలో నరేంద్రమోడీ గారే చెప్పారు.” పెద్ద మొత్తంలో నగదు చెలామణి అవినీతి స్థాయితో ప్రత్యక్ష సంబంధం ఉంటుంది. అవినీతి పద్దతుల్లో నగదు సమీకరణతో ద్రవ్యోల్బణం అదుపు తప్పుతుంది. పేదలు ఈ భారాన్ని భరించాల్సి ఉంటుంది. మీరు స్వయంగా అనుభవించి ఉంటారు. భూమి లేదా ఇంటినో కొనుగోలు చేసినపుడు చెక్కు ద్వారా చెల్లించేదానితో పాటు పెద్ద మొత్తంలో నగదును డిమాండ్‌ చేస్తారు. ఒక నిజాయితీ పరుడు ఆస్తిని కొనుగోలు చేసినపుడు సమస్యలను సృష్టిస్తుంది. నగదును దుర్వినియోగం చేస్తే వస్తువుల ధరలు, సేవలైన ఇండ్లు, భూమి, ఉన్నత విద్య, ఆరోగ్య సంరక్షణ ఇంకా ఎన్నింటి ధరలో కృత్రిమంగా పెరుగుతాయి.” ఇవన్నీ చెప్పింది మన గౌరవనీయ ప్రధాని నరేంద్రమోడీ గారే. నోట్ల రద్దు జరిగి ఆరేండ్లు కావస్తోంది, నల్లధనం ఎలా జడలు విరుచుకొని తిరుగుతోందో రిజిస్ట్రారు కార్యాలయాలను సందర్శించిన వారికి తెలిసిందే. నిజాయితీపరులైన వారు చెక్కుల ద్వారా ఇండ్లు కొనుక్కున్న ఉదంతం ఒక్కదాన్ని ఎవరైనా చూపగలరా ? ఆత్మవంచన చేసుకోకుండా ఎవరికి వారు అవలోకించుకోవాలి.


పెద్ద నోట్ల రద్దుకు ముందు 2015 -16లో నగదు చెలామణి జిడిపిలో 12.1శాతం ఉంది. రద్దు తరువాత సంవత్సరం అది 8.7 శాతానికి తగ్గింది. నగదును తీసుకొనేందుకు బాంకులు పడిన ఇబ్బంది గురించి వాటిలో పని చేసే వారికి తెలుసు. తరువాత అది ఇంతింతై వటుడింతై అన్నట్లుగా నరేంద్రమోడీ ఏలుబడిలో కొత్త రికార్డులను బద్దలు చేసింది. నగదు చెలామణి – అవినీతికి ఉన్న సంబంధం గురించి ప్రధాని నరేంద్ర మోడీ చెప్పినట్లుగా వరదలపుడు గోదావరి నీటి మట్టం పెరిగే మాదిరి 2021-22లో 16.8 శాతానికి పెరిగింది. మోడినోమిక్స్‌ ప్రకారం ఉక్రెయిన్‌ సంక్షోభం లేకున్నా నగదు చెలామణితో ద్రవ్యోల్బణం, ధరలు పెరిగి ఉండేవి. గత ఏడాది కేంద్ర ప్రభుత్వం చమురు మీద పన్నులు తగ్గించినపుడు బంకుల వద్ద పన్నుల గురించి బోర్డులు పెట్టాలని బిజెపి పెద్దలు చెప్పినట్లుగా ఇప్పుడు అవినీతి స్థాయి గురించి బోర్డులు పెడితే తప్ప జనానికి అర్ధం కాదు.


పెద్ద నోట్ల రద్దు వలన పన్నుల వసూలు పెరిగిందని చెప్పవచ్చు తప్ప దానికి ఆధారాలు చూపటం చాలా కష్టం. ఎందుకంటే అది జరిగిన కొద్ది నెలలకే 2017 జూలైలో జిఎస్‌టి విధానాన్ని తీసుకువచ్చారు.ఆ తరువాత కార్పొరేట్‌ పన్ను మొత్తాన్ని గణనీయంగా తగ్గించారు. అందువలన పన్ను లక్ష్యాలను ఏ మేరకు సాధించిందీ, దాన్ని పెద్ద నోట్ల రద్దుకు ముందు తరువాత చూడాలన్నది కొందరి అభిప్రాయం. తాత్కాలికంగా ఇబ్బందులు పెట్టినా దీర్ఘకాలంలో పరిస్థితి మెరుగుపడుతుందని చెప్పారు. కానీ జరిగిందేమిటి ? పెద్ద నోట్ల రద్దుకు ముందు 2011-12 నుంచి 2016-17 వరకు జిడిపి వృద్ధి రేటు 5.2 నుంచి 8.3 శాతానికి పెరిగింది. తరువాత దానికి భిన్నంగా కరోనాకు ముందు 2019-20 నాటికి నాలుగు శాతానికి దిగజారింది.మరుసటి ఏడాది కరోనాతో 7.3శాతం తిరోగమనంలో పడింది. తరువాత వృద్ధి రేటు ఇంకా కరోనా పూర్వపు స్థితికి చేరుకోలేదు. అలాంటపుడు అషిమా గోయల్‌ ఏ శాస్త్రీయ పరిశీలన ప్రాతిపదికన పెద్ద నోట్ల రద్దుకు-పన్నుకు ముడిపెట్టారు ? అదేవిధంగా యుపిఐ చెల్లింపుల పెరుగుదల గణనీయంగా ఉంది. అది పెద్ద నోట్ల రద్దుకు ముందే ప్రారంభమై ఉంటే తరువాత పెరుగుదల ఎక్కువగా ఉంటే దాని ఫలితమే అనవచ్చు.యుపిఐ సౌకర్యాన్ని ప్రవేశపెట్టిందే 2016ఏప్రిల్‌ పదకొండున, ఆ ఏడాది అసలు లావాదేవీలు జరగలేదు.2017 నవంబరు నాటికి కూడా నామమాత్రమే. అందువలన దానికి పెద్ద నోట్ల రద్దుకు సంబంధమే లేదు. ఈ లావాదేవీల పెరుగుదలకు వాటి మీద అవగాహన పెరగటం, ఇటీవలి కాలంలో ఇంటర్నెట్‌ జనాలకు అందుబాటులోకి రావటం, వేగం పెరగటమే కారణంగా చెప్పవచ్చు. దీన్ని ఆర్ధిక రంగ క్రమబద్దీకరణ అని చెప్పగలమా ?


ఆర్ధికరంగం క్రమబద్దీకరణ జరిగి పన్ను ఎగవేతలు, ఆర్ధిక నేరాలకు తావు లేకపోతే గత ఎనిమిదిన్నర సంవత్సరాల్లో దాడుల సంఖ్య విపరీత పెరుగుదలకు ఏ భాష్యం చెబుతారు ? పోనీ దాడులతో సాధించింది ఏమిటో చెప్పాలి.2004 నుంచి 2014 వరకు 112 ఇడి దాడులు జరిగితే 2014నుంచి 2022 వరకు3,010 డాడులు చేసినట్లు ప్రభుత్వం పేర్కొన్నది. నూటపన్నెండు దాడుల్లో స్వాధీనం చేసుకున్న మొత్తం రు.5,346 కోట్లు సగటున 47.73 కోట్లు కాగా 3010 దాడుల్లో చేసుకున్నది రు.99,356 కోట్లు సగటున 33 కోట్లు ఉంది. దేశంలో అక్రమలావాదేవీలు ఇంతేనా ? ఎంతకాలం జనాన్ని మభ్య పెడతారు.3010 కేసుల్లో శిక్షలు పడింది కేవలం 23 ఉదంతాల్లోనే, అందుకే వీటిని ప్రతిపక్షాల నేతల మీద బెదిరింపు దాడులని జనాలు అనుకుంటున్నారు. ఏటా జిఎస్‌టి 85వేల కోట్ల మేరకు ఎగవేస్తున్నట్లు బ్రిటన్‌కు చెందిన రుబిక్స్‌ సంస్థ అంచనా వేసింది. ప్రభుత్వం కూడా దాదాపు ఇలాంటి మొత్తాల గురించే అధికారికంగా ప్రకటిస్తున్నది. ఇలాంటి వైఫల్యాల గురించి ఎన్నైనా చెప్పుకోవచ్చు. సుప్రీం కోర్టులో తన చర్యను కేంద్ర ప్రభుత్వం ఎలా సమర్ధించుకుంటుందో ఏ వాదనలను ముందుకు తెస్తుందో చూద్దాం !