Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు


కన్సర్వేటివ్‌ పార్టీ నేత రిషి సునాక్‌ కొత్త చరిత్రను సృష్టించాడు.పంజాబు మూలాలున్న తొలి ఆసియన్ను బ్రిటన్‌ నూతన ప్రధానిగా బకింగ్‌హామ్‌ పాలెస్‌లో మంగళవారం నాడు రాజు ఛార్లెస్‌ నియమించాడు. హిందువు, భారతీయుడు,మనవాడు అంటూ మన మీడియా స్పందించింది. ఏడు వారాలలో ఇద్దరు ప్రధానుల రాజీనామాతో మూడవ కృష్ణుడిగా రిషి రంగంలోకి వచ్చాడు. ఆరు సంవత్సరాల కాలంలో ఐదుగురు ప్రధానులు మారటం బ్రిటన్‌లో ఏర్పడిన అస్థిరతకు తాజా పరిణామాలు నిదర్శనం. బ్రిటన్‌ చరిత్రలో కేవలం 50 రోజులు మాత్రమే పదవిలో ఉండి అతి తక్కువ కాలం ప్రధానిగా పనిచేసిన వ్యక్తిగా లిజ్‌ ట్రస్‌ చరిత్రకెక్కారు. అంతకు ముందు ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ రాజీనామా కారణంగా ప్రధాని పదవికి కన్సర్వేటివ్‌ పార్టీలో జరిగిన పోటీలో సునాక్‌ను వెనక్కు నెట్టి ట్రస్‌ మొదటి స్థానంలో నిలవటంతో సెప్టెంబరు ఆరున ఆమె పదవిలోకి వచ్చారు.(బ్రిటన్‌ పార్టీల నిబంధనల ప్రకారం పార్లమెంటులో పార్టీ నేతగా ఎన్నిక కావాలంటే నిర్ణీత సంఖ్యలో పార్టీ ఎంపీల మద్దతు పొందిన వారు పోటీ పడతారు, తొలి రెండు స్థానాల్లో వచ్చిన వారికి ఆ పార్టీల సాధారణ సభ్యులు ఎన్నుకుంటారు. ఒక్కరే ఉంటే ఏకగ్రీవం అవుతారు). ప్రధానిగా సునాక్‌ తొలిసారి మాట్లాడుతూ దేశం తీవ్రమైన ఆర్ధిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నదని, మాజీ ప్రధాని లిజ్‌ ట్రస్‌ చేసిన తప్పిదాలను సరిదిద్దాల్సి ఉందన్నాడు.ప్రతిపక్ష లేబర్‌ పార్టీ, ఇతరులు డిమాండ్‌ చేసినట్లుగా ముందస్తు ఎన్నికలకు వెళ్లేది లేదని స్పష్టం చేశాడు.


ఎన్నికల సందర్భంగా చేసిన వాగ్దానాలకు భిన్నంగా పన్ను రాయితీలు ప్రకటించటంతో విమర్శలపాలు కావటమే కాదు, స్వంత పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత తలెత్తటంతో లిజ్‌ ట్రస్‌ ఇంటిదారి పట్టారు. తొలుత తాను రాజీనామా చేసేది లేదని బీరాలు పలికినా చివరకు తలొగ్గక తప్పలేదు. దీంతో మరోసారి పార్టీలో పోటీ తలెత్తింది. ఈ సారి ప్రధాని పదవికి పోటీ పడేవారికి కనీసం వంద మంది ఎంపీల మద్దతు ఉన్నవారే అర్హులని నిర్ణయించారు. మాజీ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ రేసులో నిలిచేందుకు పావులు కదిపినా ఆశించిన మద్దతురాకపోవటంతో వెనక్కు తగ్గి పరువు నిలుపుకున్నాడు. పార్లమెంటులో పార్టీ నాయకురాలు పెనీ మోర్డాంట్‌ అర్హతకు అవసరమైన మద్దతును కూడగట్టటంలో విఫలం కావటంతో చివరి క్షణంలో ఆమె కూడా తప్పుకోవటంతో సునాక్‌ ఒక్కరే మిగిలారు. లండన్‌ కాలమానం ప్రకారం అక్టోబరు 25వ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు(మన దేశం కంటే నాలుగున్నర గంటలు వెనుక) తన చివరి కాబినెట్‌ సమావేశాన్ని ఏర్పాటు చేసిన లిజ్‌ ట్రస్‌ రాజీనామా ప్రకటించి రాజు ఛార్లెస్‌కు అందచేశారు. చివరి మంత్రి వర్గ సమావేశం తరువాత లిజ్‌ ట్రస్‌ పన్నుల తగ్గింపు తన చర్యను సమర్ధించుకున్నారు.అధికారంలో ఉన్న వారు ధైర్యంగా ఉండాలన్నారు.


సునాక్‌ పదవి నిజానికి ముళ్ల కిరీటం వంటిదే. లిజ్‌ ట్రస్‌ సెప్టెంబరు 23న మినీ బడ్జెట్‌గా పిలిచిన చర్యలలో కొన్ని ఇలా ఉన్నాయి. కార్పొరేట్‌ సంస్థల మీద పన్ను మొత్తాన్ని 25శాతానికి పెంచాలన్న ప్రతిపాదనకు భిన్నంగా 19శాతానికి తగ్గించారు. జి20 దేశాలలో ఇది కనిష్టం. మౌలిక ఆదాయపన్ను 20 నుంచి 19శాతానికి తగ్గించారు.లక్షన్నర పౌండ్లకు మించి రాబడి ఉన్నవారికి పన్ను మొత్తాన్ని 45 నుంచి 40శాతానికి తగ్గించారు. బీమా పధకానికి పెంచిన 1.25 శాతం చెల్లింపును రద్దు చేశారు. ఇండ్ల కొనుగోలుపై పన్నుల తగ్గింపు, పన్ను తగ్గింపు జోన్ల ఏర్పాటు, అక్కడ నిబంధనలను నీరు గార్చటం, టూరిస్టులు తాము చెల్లించిన అమ్మకపు పన్నును తిరిగి తీసుకొనే వెసులుబాటు, మద్యంపై పెంచిన పన్నుల తగ్గింపు. నలభై ఐదు బిలియన్‌ పౌండ్ల మేర ఖజానాకు గండిపడేచర్యలివి. నిజానికి ఈ కారణంగా ఆమె పదవిని కోల్పోవటం పెట్టుబడిదారీ వ్యవస్థలో చిత్రంగానే కనిపించవచ్చు. దీని వలన దేశ లోటు, రుణ భారం మరింతగా పెరగనుంది, సంక్షేమ చర్యలకు కోత పడుతుంది. ఇప్పటికే కార్మికులు, మధ్యతరగతి వారి మీద గతంలో పెంచిన పన్నులు, ఇటీవలి కాలంలో ధరల పెరుగుదలతో జీవన వ్యయం విపరీతంగా పెరిగి జనజీవితాలు అతలాకుతలం అవుతున్న నేపధ్యంలో కార్పొరేట్‌లు, ధనికులకు ప్రకటించిన రాయితీలు తీవ్ర విమర్శలకు, అధికారపార్టీలో కుమ్ములాటలకు దారి తీశాయి.


ఏక్షణంలోనైనా ఆర్ధిక రంగం మాంద్యంలోకి జారనుందనే సూచనలు కనిపిస్తున్నాయి. నాలుగు దశాబ్దాల రికార్డును బద్దలు కొట్టి ద్రవ్యోల్బణం 10.1శాతం దాటింది. వడ్డీ రేట్లు పెరుగుతున్నాయి. దీంతో రుణాల భారం పెరుగుతుంది. మరోవైపు పౌండు విలువ దారుణంగా దిగజారింది. అధికారపక్ష పలుకుబడి అధమ స్థాయికి పడిపోయింది. ట్రస్‌ – రిషి ఇద్దరూ ఒకే తానులో ముక్కలైనా అనుసరించే పద్దతుల్లో మాత్రమే తేడా. 2024 వరకు పార్లమెంటు గడువు ఉన్నందున వెంటనే ఎన్నికలు జరగాలని టోరీ పార్టీ కోరుకోవటం లేదు. ఇంకా తగినంత గడువు ఉన్నందున ఆర్ధిక రంగాన్ని పునరుజ్జీవింపచేసి, జీవన ప్రమాణాలను పెంచి ఓటర్ల ముందుకు వెళ్లాలని చూస్తున్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఓడిపోవటం ఖాయం. ప్రభుత్వ ఖర్చు తగ్గింపు ద్వారా లోటు బడ్జెట్‌ తగ్గింపు, పన్నుల పెంపును ఐఎంఎఫ్‌ కోరుతున్నది.ఇదే జరిగితే కార్మికుల జీవితాలు మరింతగా దిగజారతాయి. అందువలన రానున్న రోజుల్లో రిషి సునాక్‌ కత్తిమీద సాము చేయాల్సి ఉంటుంది. ఈ నెల 31న తన విధానాల గురించి సునాక్‌ చేసే ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారు.


పెరిగిన ఇంథన, ఆహార, ఇతర వస్తువుల ధరల తగ్గింపు, నిజవేతనాల పెరుగుదల కోసం జనాలు చూస్తున్నారు. దేశం తీవ్రమైన ఆర్ధిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నదని సునాక్‌ చెప్పాడు.2020 ఫిబ్రవరి నుంచి 2022 జూలై వరకు ఆర్ధిక మంత్రిగా పని చేసిన సునాక్‌ 1950 దశకం తరువాత తొలిసారిగా పన్నుల భారాన్ని పెంచాడు. ప్రభుత్వ ఖర్చునూ పెంచాడు. ద్రవ్యోల్బణం తగ్గి అదుపులోకి వచ్చిన తరువాత మాత్రమే పన్నులను తగ్గిస్తానని లిజ్‌ ట్రస్‌తో ప్రధాని పదవికి పోటీపడినపుడు రిషి చెప్పాడు. 2029 నాటికి ఆదాయపన్నును 20 నుంచి 16శాతానికి తగ్గిస్తామని చెప్పాడు. గతంలో ఎన్నడూ లేని విధంగా కన్సర్వేటివ్‌ పార్టీలో విబేధాలు ఉన్నాయి. ఈ కారణంగానే బోరిస్‌ జాన్సన్‌, లిజ్‌ ట్రస్‌ ఇంటిదారి పట్టారు. ఐరోపా సమాఖ్య నుంచి బ్రిటన్‌ వేరుపడాలన్న వైఖరిని రిషి సమర్ధించాడు. అది పొరపాటని తిరిగి చేరాలంటూ కొందరు ఇప్పుడు వత్తిడి చేస్తున్నారు. వెలుపల ఉండటం ద్వారా బ్రిటన్‌కు కలిగే ప్రయోజనాలను వెంటనే చూపకపోతే ఆ డిమాండ్‌ మరింతగా పెరగవచ్చు. విదేశీ వలసలను అరికట్టాలని కన్సర్వేటివ్‌ పార్టీలో మెజారిటీ కోరుతున్నారు. అయితే అలాంటి వలసవచ్చిన వారి సంతతికి చెందిన సునాక్‌ ఈ సమస్యను ఎలా ఎదుర్కొంటారన్నది ఆసక్తికరం. అలాంటి కుటుంబం నుంచి వచ్చినందుకు తాను గర్వస్తానని అన్నాడు. ఆర్ధిక రంగ సమస్యలను నిర్ధారించి, పార్టీని ఐక్య పరచి దేశాన్ని ముందుకు తీసుకుపోతానని సునాక్‌ చెప్పాడు. విధ్వంసం జరిగిన ప్రాంతంలోకి సునాక్‌ అడుగుపెడుతున్నాడని ఒక టీవీ వ్యాఖ్యాత చేసిన వర్ణన వాస్తవానికి దగ్గరగా ఉంది. ప్రభుత్వ ఖర్చును 30బిలియన్‌ పౌండ్ల మేర తగ్గించటం లేదా ఆ మేరకు అదనపు రాబడిని చేకూర్చాల్సి ఉంది.రానున్న మూడు సంవత్సరాల్లో ప్రభుత్వ రుణభారాన్ని తగ్గిస్తామన్న వాగ్దానాన్ని కూడా అమలు జరపాల్సి ఉంది.


బ్రిటన్‌లో ప్రధాని పదవిని చేపట్టిన రెండవ క్రైస్తవేతరుడిగా, తొలి హిందువుగా రిషి సునాక్‌ చరిత్రకెక్కారు. అతడు భారతీయ మూలాల కంటే హిందువు కావటంతోనే మన దేశంలో మీడియా, సామాజిక మాధ్యమంలో ప్రచారం జరుగుతున్నది. నిజానికి సునాక్‌ తాతలు ప్రస్తుతం పాకిస్తాన్‌లోని పంజాబ్‌ ప్రాంతంలోని గుజ్రాన్‌వాలాకు చెందిన వారు. దేశ విభజనకు ముందే వారు బతుకు తెరువు కోసం ఆఫ్రికాలోని కెన్యా, టాంజానియాకు వలస వెళ్లారు. అక్కడే సునాక్‌ తండ్రి జన్మించాడు.1960 దశకంలో వారి కుటుంబం బ్రిటన్‌ వలస వచ్చింది. తరువాత 1980లో రిషి సునాక్‌ బ్రిటన్‌లో జన్మించాడు. చదువుకొనేటపుడు మన దేశానికి చెందిన ప్రముఖ ఐటి సంస్థ ఇన్ఫోసిన్‌ నారాయణ మూర్తి కుమార్తె అక్షత లండన్‌లో చదివేటపుడు ప్రేమలో పడి వివాహం చేసుకున్నాడు. సునాక్‌ నానమ్మ ఆఫ్రికన్‌. వారి కుటుంబం పుట్టింది, పెరిగిందీ ఆఫ్రికాలోనే ఉగండాలో ఇడీ అమీన్‌ పాలనలో జరిగిన దాడులపుడు అనేక మంది బ్రిటన్‌ ఇతర దేశాలకు వలస వెళ్లారు. అలాంటి కుటుంబాలలో సునాక్‌ తండ్రి ఒకరు. అందువలన నిజంగా చెప్పాల్సి వస్తే ఆఫ్రికా మూలాలు లేదా తాతలు పుట్టిందీ పెరిగినదాన్ని ప్రాతిపదికగా తీసుకుంటే పాక్‌ మూలాలని కూడా చెప్పాల్సి ఉంటుంది. మన మాజీ ప్రధాని ఐకె గుజ్రాల్‌, మన్మోహన్‌ సింగ్‌, ఉప ప్రధాని ఎల్‌కె అద్వానీ కుటుంబాలు విభజన సమయంలో పాకిస్తాన్‌ నుంచి వలస వచ్చినవే. అలాగే పాక్‌ అధ్యక్షుడిగా పనిచేసిన పర్వేజ్‌ ముషారఫ్‌ కుటుంబం భారత్‌ నుంచి పాక్‌ వలస వెళ్లింది. వారు పదవుల్లోకి వచ్చినపుడు వారి మూలాల గురించి ఎలాంటి చర్చ లేదు. సోనియా గాంధీ 1983లోనే పూర్తిగా భారత పౌరురాలిగా మారినప్పటికీ తరువాత 2004లో బిజెపి లేని వివాదాన్ని ముందుకు తెచ్చి ప్రధాని గాకుండా మనోభావాలతో ఆడుకొనేందుకు ప్రయత్నించిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ ఆమె ఇటలీ మూలాల గురించి ఏదో రూపంలో ప్రస్తావిస్తూనే ఓటర్లను తప్పుదారి పట్టించేందుకు చూస్తున్నారు. వసుధైక కుటుంబం కబుర్లు చెప్పేది కూడా వారే అన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు రిషి సునాక్‌ మూలాలు భారత్‌లో ఉన్నట్లు మన మీడియా చిత్రిస్తున్నది, దాన్ని ఏ ప్రాతిపదికన చెబుతారు. దాని వలన ఒరిగేదేమిటి ? అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన బరాక్‌ ఒబామా తొలి ఆఫ్రికన్‌ సంతతికి చెందినవాడు. లాటిన్‌ అమెరికా, ఐరోపాలోని అనేక దేశాల్లో ఇలా వలస వచ్చిన వారు, వారి సంతతి ఉన్నత పదవులను పొందారు. అందువలన అదేమీ వింత కాదు.


ఈ దేశంలో పుట్టిన ముస్లింలను పాకిస్తాన్‌ పోవాలని చెబుతున్న విద్వేష శక్తులే రిషి సునాక్‌ మూలాల గురించి ఎక్కువగా ముందుకు తెస్తున్నాయి.బ్రిటన్‌లో కూడా జాత్యహంకార శక్తులు లేకపోలేదు. వారికి భారత్‌, పాకిస్తాన్‌, చైనా ఇలా ఎక్కడ నుంచి వలస వచ్చిన కుటుంబాలనైనా ఆసియన్లంటూ చులకనగా చూసేవారున్నారు.మొత్తం మీద చూస్తే అలాంటి సంకుచిత భావాలకు అతీతంగా అక్కడి సమాజం ఎదిగిన కారణంగానే సునాక్‌తో సహా అనేక మంది ఇతర ఖండాల మూలాలు ఉన్న సంతతికి చెందినప్పటికీ మంత్రులుగా, ఏకంగా ఇప్పుడు ప్రధానిగానే అంగీకరించారు. రిషి సునాక్కు అమెరికా గ్రీన్‌ కార్డు కూడా ఉందని కూడా తెలిసిందే. రిషి సునాక్‌ కుటుంబం మీద విమర్శలు కూడా ఉన్నాయి. భార్య అక్షిత 20లక్షల పౌండ్ల పన్ను ఎగవేతకు పాల్పడ్డారని విమర్శలు రాగా తరువాత ఆ మొత్తాన్ని తాను చెల్లిస్తానని ఆమె వివాదానికి స్వస్థిపలికారు. సునాక్‌ ఎక్కడ పుట్టాడు, ఎక్కడ పెరిగాడు అనేది కాదు, వర్తమానంలో ఎవరి కోసం పని చేస్తున్నాడు అన్నది కీలకం. ఆ విధంగా చూస్తే కార్పొరేట్లకు చెందిన కన్సర్వేటివ్‌ పార్టీ నేతగా వారి సేవలోనే తరిస్తున్నాడు. ఒకనాడు తెల్లవారు మన దేశాన్ని పరిపాలిస్తే నేడు మన వాడు బ్రిటన్‌ పాలకుడిగా ఉన్నారని కొందరు చెబుతున్నారు. గతంలో ఎంపీగా భగవద్గీత మీద ప్రమాణం చేసినట్లు మురిసిపోతున్నారు. ఎవరి విశ్వాసం వారిది. వందల సంవత్సరాల పాటు బ్రిటీష్‌ వారు మన సంపదలను కొల్లగొట్టి తమ దేశానికి తరిలించారు. అణచివేతలో భాగంగా లక్షలాది మంది ప్రాణాలను బలిగొన్నారు. వారు చేసిన నేరాలకు ఎన్నడూ క్షమాపణ కాదు కదా తమ పూర్వీకులు తప్పు చేసినట్లు విచారం కూడా ప్రకటించలేదు. చెప్పేందుకు సిద్దంగా కూడా లేరు.అందరూ చెబుతున్నట్లు భారత మూలాలు ఉన్న ఒక పంజాబీగా జలియన్‌వాలా బాగ్‌ దురంతాన్ని రిషి గుర్తు చేసుకోగలరా ? ఇదే రిషి సునాక్‌ ఆర్ధిక మంత్రిగా తమ దేశానికి లబ్ది చేకూర్చే వాణిజ్య ఒప్పందాల చర్చలను కొనసాగించారని తెలుసా ? వాటితో మన దేశాన్ని కొత్తగా కొల్లగొట్టకుండా ప్రధానిగా తన గడ్డ రుణం తీర్చుకుంటారని అతను మనవాడని భుజాన వేసుకుంటున్న వారు చెప్పగలరా ? అదే భగవద్గీత మీద ప్రమాణం చేసి తన జాతికి చేసిన అన్యాయాలకు బ్రిటన్‌ అధినేతగా క్షమాపణ సరే కనీసం విచారమైనా ప్రకటించగలరా ?