Tags

, , , , , ,


ఎం కోటేశ్వరరావు


” విదేశీయులు చెప్పింది నమ్ముతారు తప్ప భారతీయులు చెప్పింది నమ్మరు ” అదానీ కంపెనీల అవకతవకలంటూ అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్‌ సంస్థ ప్రకటించిన నివేదిక మీద స్పందనగా స్వయం ప్రకటిత ” దేశభక్తులు ”గా చెప్పుకుంటున్నవారి స్పందన. నిజమే, బ్రిటన్ను వెనక్కు నెట్టి ప్రపంచ జిడిపిలో ఐదవ స్థానానికి మన దేశాన్ని తీసుకుపోవటంలో నరేంద్రమోడీ గొప్పతనం గురించి గతేడాది మన భారతీయులు చెప్పారు. దానికి తోడు ఆత్మనిర్భరత పేరుతో ప్రకటించిన భరోసా, రాయితీల గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేయటంతో 2022లో ప్రపంచ స్టాక్‌మార్కెట్లో మన వాటాల విలువ 3.6శాతం పెరిగింది. ఎవరో విదేశీయులో మరొకరో చెప్పిన మాటలను బట్టి కాదు పక్కా భారతీయులు చెప్పిందాన్ని నమ్మబట్టే. కానీ తాజాగా ఒక్క విదేశీ కంపెనీ చెప్పిన అంశాలతో అలాంటి మార్కెట్‌ వాటా 3.1శాతానికి తగ్గింది, దాని విలువ 3.2లక్షల కోట్ల డాలర్లు.అబ్బే నిజం అసలే అక్రమాలేం జరగలేదని పక్కా భారతీయుడు అదానీ జాతీయ జండాను ఎగురవేసి 413 పేజీల వివరణ ఇచ్చినా మార్కెట్లో అతని కంపెనీల షేర్ల పతనం ఆగలేదు.


ఇప్పుడంతా విదేశీయులు చెప్పిందే నడుస్తున్నట్లు కనిపిస్తోంది. స్వదేశీయులు గుజరాత్‌ మారణకాండ గురించి గతంలో చెప్పిందాన్ని జనం విశ్వసించలేదు, కనుకనే ఇప్పుడు బిబిసి డాక్యుమెంటరీలో చెప్పిందేమిటి అనే ఆసక్తి పెరిగింది ? దాన్ని చూసిన విద్యార్థులను రాజస్తాన్‌లో అరెస్టు చేసినట్లు వార్తలు. నాడు జరిగిన ఉదంతాలపై బ్రిటీష్‌ రాయబారి తమ దేశానికి నివేదించిన అంశాలను బిబిసి వెల్లడించింది. విశ్వహిందూపరిషత్‌ వంటి సంస్థల పాత్రను పేర్కొన్నారు. దాని గురించి మీరు చెప్పాల్సిందేమైనా ఉందా అని మన కేంద్ర ప్రభుత్వాన్ని అడిగితే చెప్పేందుకు నిరాకరించింది. గుజరాత్‌లో జరిగిందేమిటో, ఎవరు మారణకాండకు పాల్పడ్డారో మన జనానికి తెలియదా ? నిజానికి తమకేమీ సంబంధం లేదని చెప్పే సంస్థలు, బిజెపి గానీ బిబిసికి పోటీగా దేశమంతటా ఊరూవాడా తిరిగి సభలు పెట్టి జరిగిందేమిటో వివరించవచ్చు. స్వంత డాక్యుమెంటరీలను తీసి తాము చెప్పదలచుకున్నదానిని చెప్పవచ్చు. నటించేందుకు కమలశ్రీ కంగన రనౌత్‌ వంటి నటీమణులు, ఎందరో నటులు, కాశ్మీరీ ఫైల్స్‌ ఫేమ్‌ వివేక్‌ అగ్నిహౌత్రి వంటి ఎలా కావాలంటే అలా తీసే దర్శకులకేమీ కొదవ లేదు.


దానికి బదులు అధికారం ఉంది కదా అని సామాజిక మాధ్యమాల్లో కనిపించకుండా అడ్డుకున్నారు. ప్రపంచంలోని పలు దేశాలు, చివరికి మన దేశానికి సంబంధించి అనేక అంశాల మీద సమాచారం కోసం బిబిసి రేడియో మీదనే ఆధారపడిన రోజులు దేశంలో ఉన్నాయి.1975లో అత్యవసర పరిస్థితి ప్రకటన అనేక మంది ముందుగా దాని ద్వారానే తెలుసుకున్నారు. మన ప్రభుత్వ, ప్రయివేటు మీడియా సంస్థలు పాలకులకు బాకాలుగా మారిన స్థితిలో నిజాల కోసం పరితపించిన జనాలు విదేశీ మీడియా కోసం ఎదురు చూశారు. అర్నాబ్‌ గోస్వామి వంటి వారి కారణంగా ఇప్పటికీ అదే స్థితి. హిండెన్‌బర్గ్‌ నివేదిక తరువాత అదానీ కంపెనీల వాటాలను తెగనమ్ముకున్నవారికి అదానీ మీద నమ్మకం లేకనే కదా ఆ పని చేశారు. వారందరినీ దేశద్రోహులు అంటారా ! గతంలో సత్యం కంప్యూటర్స్‌ వంటి కంపెనీలెన్ని జనాన్ని ముంచలేదు ? అదానీ కంపెనీల వాటాల ధరలు విపరీతంగా పెరగటాన్ని చూసిన అనేక మంది ఇది ఏదో ఒక ముహూర్తాన వాటి బాటన పడుతుందని చెబుతూనే ఉన్నారు.


ఇప్పుడు చూస్తే అదానీ గ్రూపు కంపెనీల తీరుతెన్నుల గురించి వెలువడిన హిండెన్‌బర్గ్‌ నివేదిక దేశమంతటా సంచలనం సృష్టించింది. ఇది నరేంద్రమోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రలో భాగమనే పల్లవిని అందుకున్నారు. అవినీతి మరకలేని కేంద్ర ప్రభుత్వం మీద అవినీతి ఆరోపణలకు శ్రీకారం చుట్టేందుకు అదానీ గ్రూపును తీసుకున్నారన్నది ప్రచార సారం. కానీ నరేంద్రమోడీ అలా అనుకుంటున్నట్లు లేదు, లేకుంటే ఎందుకు స్పందించటం లేదు? మోడీ అంటే అదానీ – అదానీ అంటే మోడీ అన్న వాతావరణం దేశంలో ఉన్నమాట వాస్తవం. అందువల్లనే అదానీ కంపెనీ మీద వచ్చిన నివేదికను మోడీకి కూడా కలిపి ప్రభుత్వం మీద కుట్రగా చెప్పటం తప్ప మరొకటి కాదు. మోడీ సర్కార్‌ విధానాలను విమర్శించటం దేశద్రోహం అని చిత్రించినట్లుగానే ఇప్పుడు అదానీ కంపెనీ గురించి ఏదైనా ప్రతికూల అంశాలను చెబితే దాన్ని కూడా దేశద్రోహం అనే స్థితికి వెళ్లారు. మన వారు ధనికులు కావటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని నిందిస్తున్నారు.


అదానీ కంపెనీ ఆర్థిక విభాగ అధిపతి జగుషిందర్‌ సింగ్‌ హిండెన్‌ బర్గ్‌ నివేదికను బ్రిటీష్‌ వారి జలియన్‌వాలాబాగ్‌ మారణకాండతో పోల్చారు. దేశం మీద, దాని సంస్థల మీద పథకం ప్రకారం జరిపిన దాడి అన్నారు. మదుపుదార్లు ఈ నివేదికను ఎందుకు నమ్మారు అన్న ప్రశ్నకు తోటి భారతీయులు కొందరి తీరు తనకు ఆశ్చర్యం కలిగించలేదని సెలవిచ్చారు. జనవరి 24న హిండెన్‌బర్గ్‌ నివేదిక వెల్లడైంది. తరువాత స్టాక్‌ మార్కెట్లో అదానీ కంపెనీల వాటా ధరల పతనానికి దారితీసింది. రాచపీనుగ ఒంటరిగా పోదన్నట్లు మిగతా కంపెనీల వాటాల ధరలు కూడా తగ్గాయి. కొన్ని లక్షల కోట్ల మేరకు వాటాదార్ల సంపద ఆవిరైంది. సోమవారం నాడు రాయిటర్‌ వార్తా సంస్థ ఇచ్చిన కథనం మేరకు 65బిలియన్‌ డాలర్ల సంపద హరీమంది. ప్రతి పైసాకు జవాబుదారీగా ఉంటానని చెప్పిన చౌకీదార్‌ ప్రధాని నరేంద్రమోడీ జనవరి 31న ఇది రాసిన సమయం వరకు దీని మీద ఎలాంటి ప్రకటన చేయలేదు. పత్రికా గోష్టి పెట్టి విలేకర్ల ప్రశ్నలను ఎదుర్కొనేందుకు మనస్కరించకపోవచ్చు, విశ్వగురువుగా తన స్థాయికి తగిన విధంగా ప్రశ్నలు అడిగే విలేకర్లు లేరని భావించవచ్చు. ఆర్నాబ్‌ గోస్వామి వంటి ఒకరిద్దరు ధైర్యం చేసి అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు సిద్దంగాకపోవచ్చు. ఇంత పెద్ద సంచలనం మీద జనాలకు ఏదో ఒకటి చెప్పాలా లేదా ? నిజంగా అదానీ కంపెనీల నిజాయితీ మీద అంత నమ్మకం ఉంటే అవి ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని ప్రకటించి అనుమానాలకు తెరదించాలి, లేదా వాజ్‌పాయి చెప్పినట్లు అధికారంలో ఉన్నవారు రాజధర్మాన్ని పాటించి విచారించి నిజా నిజాలు తేలుస్తామనైనా చెప్పాలి. మౌనానికి అర్ధం ఏమిటి ?మన్మోహన్‌ సింగ్‌ను మౌన ముని అంటూ ఎద్దేవా చేసిన వారు దీన్ని గురించి ఏమంటారు ? మోడీ స్పందించాల్సినంత పెద్దది కాదు అనుకోవాలా ? అంటే మీరు నందంటే నంది పందంటే పందని జనం కూడా చెవులో పూలు పెట్టుకొని తలూపాలా ?


ఒక అగ్రదేశ ఇంటిలిజన్స్‌ నిధులతో నడుస్తున్న హిండెన్‌బర్గ్‌ అని వాట్సాప్‌లో ఒక ప్రచారం జరుగుతున్నది. అమెరికాలో సిఐఏ, ఎఫ్‌బిఐ గురించి అందరికీ తెలిసిందే. వాటిలో ఏదో ఒకటి దీనికి నిధులు ఇచ్చిందంటున్నారు. నిజమే అనుకుందాం. మన దేశం అమెరికాకు జిగినీ దోస్తుగా ఉంది కదా ! మా దేశానికి వ్యతిరేకంగా ఇలాంటి కుట్రలు చేయిస్తున్నారేమిటని నరేంద్రమోడీ ఎందుకు ప్రశ్నించరు ? 2014కు ముందు అదానీ గ్రూపు లేదా అప్పటి ప్రభుత్వం దాన్ని పెంచి పోషించలేదా, రుణాలు ఇవ్వలేదా ఇప్పుడెందుకు గగ్గోలు అంటున్నారు. లేదని ఎవరు చెప్పారు, కాంగ్రెస్‌ పాలకులు పెంచి పోషించలేదని ఎవరు అన్నారు. నరేంద్రమోడీ కూడా ఆపని చేస్తున్నారా లేదా అది తప్పా ఒప్పా అన్నదే ప్రశ్న. గతానికి నరేంద్రమోడీ పాలనకూ పోల్చి అనేక అంశాలు చెబుతున్నవారు 1988లో ప్రారంభమైన అదానీ కంపెనీల ఆస్తులు 2014కు ముందు తరువాత ఎంత అన్నది చెప్పలేరా ? నరేంద్రమోడీ తిరిగేందుకు తన జెట్‌ విమానాన్ని ఇచ్చారు తప్ప కాంగ్రెస్‌ నేతలకు ఇచ్చారా లేదా అన్నది కూడా చెప్పాలి. 2014లో అదానీ సంపదల విలువ 8 బిలియన్‌ డాలర్లు కాగా 2022లో అది 137బి.డాలర్లకు (1,600శాతం) పెరిగింది. ఈ వాస్తవాన్ని కాదనగలరా ? మిగతా కంపెనీలకు లేని ఈ పెరుగుదల అదానీకి ఎలా వచ్చింది ? ఏదైనా మంత్రదండం ఉందా ? మిగతా పారిశ్రామికవేత్తలు కూడా చొక్కా – పాంట్లు విప్పి పక్కనపెట్టి పలుగూ పారా, సుత్తీ రెంచీలు పట్టుకొని పని చేసిన వారు కాదా ? వందల సంవత్సరాలుగా పారిశ్రామికవేత్తలుగా ఉన్న టాటా, బిర్లా, తరువాత వచ్చిన అంబానీ కంపెనీలకు రాని లాభాలు అదానీకి ఎలా వచ్చినట్లు ?


హిండెన్‌బర్గ్‌ లేవనెత్తిన అంశాల్లో అదానీ గ్రూపు రుణాల గురించి మాత్రమే కాదు అదొకటి మాత్రమే. పన్ను స్వర్గాలతో సంబంధాలు పెట్టుకొని ఎగవేసినట్లు కూడా ఆరోపించింది. రుణ ఎగవేతదార్ల జాబితాలో అదానీ ఉన్నట్లు ఎవరూ చెప్పటం లేదు, అలాంటి ప్రమాదం ఉందని మాత్రమే అంటున్నారు.2015లోనే క్రెడిట్‌ సూసీ తన నివేదికలో తీవ్ర రుణ వత్తిడిని ఎదుర్కొంటున్న పది సంస్థలలో అదానీ గ్రూపు ఒకటని పేర్కొన్నది. తాజాగా అమ్మకానికి పెట్టిన ఎఫ్‌పిఓ వాటాలతో వచ్చిన సొమ్మును కొత్త పెట్టుబడి కోసం గాక ఇప్పటికే ఉన్న కంపెనీల అప్పులు తీర్చేందుకు అన్నది తెలిసిందే. బమ్మిని తిమ్మిని చేసి లేని విలువను సృష్టించి మోసానికి పాల్పడిన సత్యం కంపెనీ మాదిరి అదానీ చేసినట్లు చెప్పింది ప్రధాన అంశం, దాని గురించి చెప్పకుండా రుణాల చుట్టూ తిప్పుతున్నారు. ఎల్‌ఐసి పెట్టిన పెట్టుబడుల కంటే ఇప్పటికీ విలువ ఎక్కువే ఉన్నదని, నష్టం లేదు కదా అని లెక్కలు చెబుతూ పక్కదారి పట్టించేందుకు చూస్తున్నారు. ఎల్‌ఐసి కొనుగోలు చేసిందంటే కంపెనీ విశ్వసనీయత కలిగినదని మదుపుదార్లు విశ్వసిస్తారు. అందుకోసమే కేంద్ర ప్రభుత్వ పెద్దలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టించి ఉంటారన్నది ఒక అభిప్రాయం.


అదానీ కంపెనీలకు బాంకులు కాంగ్రెస్‌ ఏలుబడిలో రుణాలు ఇవ్వలేదా అని సవాలు విసురుతున్నారు. ఇవ్వలేదని ఎవరూ చెప్పటం లేదే. పారుబాకీల పారిశ్రామికవేత్తలందరికీ కాంగ్రెస్‌ నేతలు రుణాలు ఇప్పించి ఎగవేయించారని చెప్పింది బిజెపి నేతలు. అదానీ కంపెనీకి ఉన్న అప్పు మొత్తాన్ని చూస్తే మిగతా వారి మాదిరే ఈ కంపెనీ కూడా చేతులెత్తేసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. హిండెన్‌బర్గ్‌ నివేదిక రాకముందే గత ఏడాదే అనేక మంది ఈ అంశాన్ని లేవనెత్తినపుడు అదానీ కంపెనీ అప్పులు తీర్చే స్థితిలో ఉందని అనేక మంది కంపెనీ లాబీయిస్టులు మీడియాలో రాశారు. అదానీ కంపెనీలకు ఎస్‌బిఐ రుణాలు ఇవ్వటం, ఎల్‌ఐసి పెద్ద మొత్తంలో వాటాలు కొనటం వెనుక బిజెపి పెద్దల హస్తం ఉందన్న విమర్శలున్నాయి. ఎవరో ఏదో అన్నదాని గురించి రాముడు, సీత, అగ్ని ప్రవేశం గురించి రోజూ చెబుతారు కదా ! అది తమకు వర్తించదా, సచ్చీలతను నిరూపించుకోరా, సీత మాదిరి అగ్ని ప్రవేశాన్ని గానీ రాజీనామాను గానీ ఎవరూ కోరటం లేదు. బ్యాంకు కార్మిక యూనియన్లలో ఉన్న కమ్యూనిస్టు పార్టీలు ఇప్పించిన రుణాల మీద కూడా విచారణ జరిపించాలని, కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో జరిగిన లోన్ల దందాలపై కూడా నిష్పాక్షిక విచారణ జరిపించాలని వాట్సాప్‌ పండితులు వాదిస్తున్నారు. అసలు వీరి సమస్య ఏమిటి ? ఆ పని చేస్తే నరేంద్రమోడీకి ఎవరు అడ్డుపడ్డారు ? ఇడి, సిబిఐలను అలాంటి అక్రమాల నిగ్గుతేల్చేందుకు పంపండి. అధికారానికి వచ్చి తొమ్మిదేండ్లు , అరిగిపోయిన రికార్డులను ఎన్ని సంవత్సరాలు ఇంకా వినిపిస్తారు ?


హిండెన్‌బర్గ్‌ లేవనెత్తిన అంశాలకు అదానీ కంపెనీ 413 పేజీలతో సుదీర్ఘ వివరణ ఇచ్చింది.అసలు అంశాలను పక్కన పెట్టిందని, జాతీయజండాను కప్పి అక్రమాలను కనపడకుండా చేసేందుకు పూనుకున్నదని హిండెన్‌బర్గ్‌ స్పందించింది. గౌతమ్‌ అదానీ సోదరుడు వినోద్‌ అదానీకి సంబంధించిన విదేశీ సూట్‌కేస్‌ కంపెనీల లావాదేవీల గురించి తాము ప్రశ్నించినదానికి సమాధానం లేదని పేర్కొన్నది. వాటికి అదానీ కంపెనీల నుంచి పంపినవి, తిరిగి వాటి నుంచి అదానీ కంపెనీలకు చేరిన బిలియన్ల డాలర్ల నిధుల సంగతేమిటని, అవి వినోద్‌ అదానీకి ఎక్కడి నుంచి వచ్చిందీ చెప్పాలని హిండెన్‌బర్గ్‌ కోరింది. దానికి అదానీ కంపెనీ ఇచ్చిన వివరణ ఏమిటో తెలుసా ! ” ఆ కంపెనీలకు నిధులు ఎక్కడివో మాకు తెలియదు, ఎక్కడి నుంచి వచ్చిందీ తెలుసుకోవాల్సిన అవసరమూ మాకు లేదు. వినోద్‌ అదానీ వాణిజ్యం, లావాదేవీల గురించి వ్యాఖ్యానించే స్థితిలో మేము లేము ” అని పేర్కొన్నారు. అదే గనుక నిజమైతే గౌతమ్‌ అదానీ తన సోదరుడిని విడిగా లేదా కుటుంబ సంస్థను నడుపుతున్నారు గనుక భోజన టేబుల్‌ దగ్గర గానీ ఆ వివరాలన్నీ అడిగి రహస్యాన్ని చేధించాలని, తాము లేవనెత్తిన ప్రశ్నలలో 62 నుంచి 88 వరకు నిర్దిష్ట సమాధానాలు చెప్పలేదని పేర్కొన్నది.
హిండెన్‌బర్గ్‌ సంస్థ నివేదిక వెనక కుట్ర ఉంది అంటున్నారు. మనకు జేమ్స్‌ బాండ్‌ అజిత్‌ దోవల్‌, అనేక కుట్రలను ఛేదించిందని అని చెబుతున్న ” రా ” ఎన్‌ఐఏ వంటి సంస్థలున్నాయి, ఆఫ్టరాల్‌ ఒక చిన్న సంస్థ సంగతి తేల్చేందుకు అమెరికా మీద వత్తిడి తేలేరా ? దాని బండారాన్ని బయటపెట్టి జనానికి, అదానీ వంటి పారిశ్రామికవేత్తలకు, వారి కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన వారికి, వాటాలు కొనుగోలు చేసిన లక్షలాది మంది మదుపుదార్లకు ధైర్యం కల్పించలేరా ? నష్టాలను నివారించలేరా? విమర్శకుల నోరు మూయించలేరా ? భద్రమైన చేతుల్లో దేశం ఉందని,ప్రతి పైసాకు జవాబుదారునని చెప్పటం కాదు నిరూపించాలి.ఇది తగిన తరుణం. బిబిసి చిత్రం గురించి మాట్లాడలేదు, హిండెన్‌బర్గ్‌ వంటి సంస్థల కుట్రలను గురించీ అదే మౌనం. చిన్న సందేహం, అవసరమైనపుడు కూడా నరేంద్రమోడీ నోరు విప్పకపోతే చరిత్ర క్షమిస్తుందా ?