Tags

, ,


ఎం కోటేశ్వరరావు


” మీరు ఎల్లవేళలా కొంత మందిని, అందరినీ కొంత కాలం వెర్రి వాళ్లను చేయవచ్చు. కానీ మీరు అందరినీ అన్ని వేళలా వెర్రి వాళ్లను చేయలేరు ” ఇది అమెరికా నేత అబ్రహాం లింకన్‌ చెప్పిన సుభాషితం.” ఏ పదజాలం వెనుక ఏ వర్గ ప్రయోజనం దాగుందో తెలుసుకోలేనంత కాలం జనం మోసపోతూనే ఉంటారు ” కమ్యూనిస్టు నేత లెనిన్‌ చేసిన హెచ్చరిక ఇది. ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎవరికైనా ఇది వర్తిస్తుంది.మన దేశంలో ఇదే జరుగుతోందా అంటే అవుననే చెప్పాలి. మరి జనం ఎల్లవేళలా మోసపోతారా ? తెలివిగా ఉంటున్నారా ? తమ తెంపరితనాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే మోసకారులు మండిపడతారు. తరువాత దెబ్బలాట, అణచివేతలకు పూనుకుంటారు. జనం దాన్ని సహిస్తారా ? లేదు అన్నది చరిత్ర చెప్పిన సత్యం. ప్రజలకు తెలియని భాష, లిపిలో రాసిన గ్రంధాల్లో ఉన్నదాన్ని కొంత మంది ఏ విధంగా చెబితే దాన్ని జనం నిజమని నమ్మారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. టీకా తాత్పర్యాలను విడదీసి అర్ధాలను వెల్లడించేవారు భిన్న కోణాన్ని ఆవిష్కరిస్తున్నారు.వాస్తవాన్ని జీర్ణించుకోలేని వారు తమకు అనువైన భాష్యాలను చెబుతూ వివక్షను, గతాన్ని సమర్ధించేందుకు పూనుకున్నారు.


తులసీదాస్‌ రచన రామచరిత మానస్‌లో వెనుకబడిన తరగతులు, మహిలు, దళితులను కించపరిచే భాగాలు, భావాలు ఉన్నట్లు సమాజవాది పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి స్వామి ప్రసాద్‌ మౌర్య, అయోధ్య హనుమాన్‌ దేవాలయపూజారి రాజు దాస్‌, అయోధ్య తపస్విచావని మహంత్‌ పరమహంస దాస్‌ గురువారం నాడు దాడులకు పాల్పడినట్లు పరస్పరం కేసులు దాఖలు చేశారు.రామచరిత మానస్‌ గ్రంధంలోని వివాదాస్పద అంశాలపై లక్నోలోని ఒక హౌటల్‌లో ఒక టీవీ ఛానల్‌ ఏర్పాటు చేసిన ఒక చర్చలో పాల్గొనేందుకు వారు వచ్చారు.చర్చ ముగిసిన తరువాత తాను హౌటల్‌ నుంచి వెళుతుండగా మౌర్య, అతని అనుచరులు తన మీద దాడిచేసినట్లు రాజుదాస్‌ ఆరోపిస్తూ ఆ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్లు చెప్పారు. పూజారి, మహంత్‌ తన మీద కత్తి, గొడ్డలితో దాడికి పాల్పడగా తన అనుచరుల కారణంగా తప్పించుకున్నానని ఆ మేరకు కేసు దాఖలు చేస్తున్నట్లు మౌర్య ప్రకటించారు.తనకు అదనపు రక్షణ కల్పించాలని కూడా పోలీసు కమిషనర్‌ను కోరారు. చర్చలో టీవీ యాంకర్‌ తన మీద దాడికి రెచ్చగొట్టినట్లు కూడా విమర్శించారు. అభ్యంతరకర భాగాలను రామచరిత మానస్‌ గ్రంధం నుంచి తొలగించాలి లేదా దాన్ని నిషేధించాలని మౌర్య కోరుతున్నారు. అలాంటివాటిని తాము అంగీకరించేది లేదని సాధు, సంతులు చెబుతున్నారు. చర్చ పక్కదారి పట్టి భౌతికదాడుల వైపు మళ్లటం ఒక ప్రమాదకర సూచన.మౌర్యను విమర్శిస్తూ పోస్టులు పెట్టినందుకు రిచా సింగ్‌, రోలీ తివారీ అనే ఇద్దరు మహిళా ప్రతినిధులను పార్టీ నుంచి సమాజవాది పార్టీ బహిష్కరించింది.సమాజవాదీ ఎంఎల్‌ఏ రాకేష్‌ సింగ్‌ ఈ వివాదంతో స్వంత పార్టీనేతపై ధ్వజమెత్తారు. మౌర్యకు మతి తప్పిందని అన్నారు.అతను సనాతనీ లేదా సోషలిస్టు కానీ కాదన్నారు.ఈ వివాదం జనవరిలో బీహార్‌ మంత్రి చంద్రశేఖర్‌,మౌర్య ప్రకటనలతో మొదలైంది.క్షమాపణలు చెప్పాలన్న బిజెపి నేతల స్పందనకు చెప్పేదే లే అంటూ స్వామి ప్రసాద్‌ మౌర్య జవాబిస్తూ రామచరిత మానస్‌కు ఎవరూ ఎవరూ వ్యతిరేకం కాదు, రామ ప్రభువుకూ కాదు, కొన్ని చరణాలకు మాత్రమే వ్యతిరేకం అన్నారు.మౌర్యను ఉరితీయాలని బిజెపి నేత నందకిషోర్‌ గుజార్‌ సుప్రీం కోర్టుకు లేఖరాశారు.

ప్రతి తరంలోనూ సమాజాన్ని వెనక్కు నడిపించాలని చూసిన వారు మనకు కనిపిస్తారు. కానీ సమాజం ముందుకు, మున్ముందుకు పోతున్నదే తప్ప తలకిందులుగా నడవటం లేదు. పనికిరాని వాటిని విసర్జిస్తూనే ఉంది. మానవ శరీరంలో ఎలాంటి ప్రయోజనం లేకపోగా ఒక్కోసారి ప్రాణాల మీదకు తెచ్చే భాగం క్రిమిక(అపెండిసైటిస్‌). అలాంటి శక్తులు రెచ్చిపోతున్న తరుణమిది. ఏ అంబేద్కరైతే భారత నాగరికత, సమాజానికి మాయనిమచ్చగా ఉందని మనుస్కృతిని దగ్దం చేశారో ఆ మహానుభావుడిని ఒకవైపు గౌరవిస్తున్నామని చెబుతున్నారు కొందరు. ఆ అంబేద్కర్‌ అధ్యక్షతన రూపొందించిన రాజ్యాంగ రచనకు ఆ మనుస్మృతిని పరిగణనలోకి తీసుకోలేదు. దానిలో ఉన్న అంశాలకు విరుద్దంగా సమానత్వాన్ని అమలు చేసే నిబంధనలు, స్ఫూర్తితో ఉన్న రాజ్యాంగాన్ని ఆమోదించుకున్నాం. సదరు మనుస్మృతిని భారత పురాతన రాజ్యాంగంగా వర్ణిస్తూ దాని తెలుగు అనువాదాన్ని ఆవిష్కరించేందుకు పూనుకున్న తిరోగమన వాదులకు ఎదురుదెబ్బ తగిలింది.హైదరాబాద్‌ నాంపల్లి తెలుగు విశ్వవిద్యాలయం వేదికగా ఒక సభలో ఆవిష్కరించేందుకు అభ్యంతరాలు వెల్లువెత్తటంతో ఇచ్చిన అనుమతిని అధికారులు రద్దు చేశారు. దాంతో నిర్వాహకులు తరువాత దాన్ని ఆవిష్కరిస్తామని ప్రకటించారు. ఏదో ఒక ప్రైవేటు స్థలంలో ఆ పని చేస్తారు, అది వేరే అంశం. మూడున్నర కిలోల బరువు, రు.2,100 విలువగల పుస్తకాన్ని అచ్చువేసేందుకు అవసరమైన భారీ పెట్టుబడితో ఆ పుస్తకాన్ని జనాలతో చదివించి తిరోగమనంవైపు నెట్టేందుకు పడుతున్న ప్రయాస స్పష్టంగా కనిపిస్తున్నది.


ఒకవైపు ఇలాంటి ప్రయత్నాలు జరుగుతుంటే దానికి ప్రతిఘటన ఉండటం సహజం.మనువు చెప్పినట్లుగా బతకటానికి జనం సిద్దంగా లేరు. ఆ బోధనలను బలవంతంగా అమలు జరిపే అవకాశమూ లేదు. ఇస్లాం మత ప్రభావం ఎక్కువగా ఉన్న దేశాల్లో షరియాను అమలు జరిపేందుకు పూనుకున్నవారికి , మన దేశంలో మనుస్మృతిని రుద్దాలని చూసే వారికి పెద్ద తేడా లేదు. దేశంలో అనేక మంది రామాయణాన్ని తిరగ రాశారు. వాటిలో పదహారవశతాబ్దినాటి తులసీదాన్‌ రచన ఒకటి.హిందీకి దగ్గరగా ఉండే అవధీ భాషలో రాసినందున జనానికి సులభంగా అర్ధం కావటంతో ప్రాచుర్యం పొందింది.తులసీదాస్‌ కలం నుంచి వెలువడిన రామచరిత మానస్‌ గ్రంధంలోని మనుస్మృతిలో చెప్పిన అంశాలు ఇప్పుడు ఉత్తర ప్రదేశ్‌, బీహార్‌ రాష్ట్రాలలో వివాదాన్ని రేపాయి. నల్లేరు మీద బండిలా తమ పథకాన్ని అమలు జరపాలని చూస్తున్న హిందూత్వశక్తులకు ఇది మింగుడు పడక మండిపడుతున్నాయి.శాపాలు పెట్టే శక్తి లేకపోవటం లేదా పని చేయవని తెలిసి గానీ అభ్యంతర అంశాలను విమర్శించిన బీహార్‌ మంత్రి చంద్రశేఖర్‌ నాలుక కోస్తే రు. పదికోట్ల బహుమానం ఇస్తామని అయోధ్యకు చెందిన జగద్గురు పరమహంస ఆచార్య ప్రకటించారు. స్వామి ప్రసాద్‌ మౌర్య తలనరికితే 21 లక్షలు ఇస్తానని హనుమాన్‌ గుడి పూజారి రాజు దాస్‌ ప్రకటించారు.ఈ ప్రకటనలను చూసిన తరువాత బాబాలు,సాధువులు, సంత్‌లు ఉగ్రవాదులు, కసాయిలుగా మారారని స్వామి ప్రసాద్‌ విమర్శించారు. గతంలో బాబాలు అంటే సన్యాసులుగా ఉండేవారు. గతంలో బాబాలు,సాధువులకు కోపం వచ్చేది కాదు, వచ్చినా శాపాలు పెట్టేవారు. నేటి బాబాలకు అలాంటి తపస్సు లేదు.వారికి నిజంగా శక్తి ఉంటే చైనాను భస్మం చేయమనండి, ఈ రోజు బాబాలు, సాధువులు ఉగ్రవాదులుగా మారారు. కొంత మంది ముక్కులు, నాలుకలు కోసేయమని, తలలు తీసేయమంటూ కసాయిలుగా మారుతున్నారు అని ప్రసాద్‌ అన్నారు. ఈ పూర్వరంగంలోనే గురువారం నాడు లక్నోలో ఇరువర్గాలకు చెందిన అనుచరులు గొడవకు దిగినట్లు చెప్పవచ్చు.


రామచరిత మానస్‌, మనుస్మృతి, పురాణాలు, ఇతర గ్రంధాల్లో ఉన్న అవాంఛనీయ వర్ణనలు, బోధల గురించి దశాబ్దాల క్రితమే తెలుగునాట హేతువాదులు, నాస్తికవాదులు ఎత్తి చూపిన అంశం తెలిసిందే.ఇప్పుడు ఉత్తరాదిన అలాంటి పరిణామం జరుగుతోంది. నాడు ఆ విమర్శ, సమర్థనలు ఎన్నికలతో నిమిత్తం లేవు. ఇప్పుడు వాటితో మిళితం చేస్తున్నారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత బిసిలను కించపరిచే భాగాలను నిషేధిస్తామని స్వామి ప్రసాద్‌ చెప్పారు.


సమాజవాదీ ఎంఎల్‌ఏ ఆర్‌కె వర్మ ఫేస్‌బుక్‌లో ఒక పోస్టు పెట్టారు. దానిలో ” తులసీదాస్‌ వివక్ష, అంటరానితనం,అసమానతను తలకు ఎక్కించుకున్న ఒక కవి. అతని రామచరిత మానస్‌లో రాజ్యాంగానికి విరుద్దమైన అనేక చరణాలున్నాయి.అవి వెనుబడిన తరగతులు, మహిళలు, దళితులు, సంత్‌ సమాజాన్ని అవమానిస్తున్నాయి.ఆ చరణాలను తొలగించాలి ” అని పేర్కొన్నారు. దీన్ని నిరసిస్తూ బిజెపి యువమోర్చా వారు ఎంఎల్‌ఏ శవయాత్ర జరిపి బొమ్మను దగ్దం చేశారు. రామచరిత మానస్‌ను అవమానించినందుకు ఆర్‌జెడి,సమాజవాది పార్టీల గుర్తింపును రద్దు చేయాలని విశ్వహిందూపరిషత్‌ నేతలు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. హిందూ సమాజంలో అపనమ్మకాన్ని కలిగించేందుకు ఆ పార్టీల నేతలు చూస్తున్నారని ఆరోపించింది.


ఉత్తరాదిలో 120లోక్‌ సభ స్థానాలున్న ఉత్తర ప్రదేశ్‌, బీహార్‌లో తలెత్తిన ఈ వివాదం ఇతర రాష్ట్రాలకు కూడా పాకే అవకాశం ఉంది.మరో ఏడాదిలో జరగనున్న ఎన్నికలపై దీని ప్రభావం పడుతుందేమో అని కంగారు పడుతున్న బిజెపి ఇతర సంస్థలు, సాధు సంతులను రంగంలోకి దింపి ఆచితూచి మాట్లాడుతున్నది.సున్నితమైన, మనోభావాలతో ముడిపడిన ఈ వివాదం పెరిగితే తన బిసి ఓటు బాంకుకు గండిపడుతుందన్న భయం దానిలో ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. సంఘపరివార్‌ సంస్థలకు చెందిన అగ్రవర్ణాలుగా అనుకుంటున్న కులాలకు చెందిన వారు హిందూత్వ అజెండాను దెబ్బతీసే ఈ పరిణామంపై మండిపడుతుండగా వారిని మాట్లాడవద్దని బిజెపి ఆదేశించినట్లు వార్తలు. రామచరిత మానస్‌లో తమను కులపరంగా కించపరిచినా తమకేమీ ఇబ్బంది లేదు అని చెప్పగల స్థితి లేనందున వెనుక బడిన తరగతుల నేతలు, మద్దతుదారులు నోరు మెదపలేని స్థితి ఏర్పడింది. వెనుకబడిన తరగతుల జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు ఉండాలన్న డిమాండ్‌ చాలా కాలం నుంచి ఉంది. ఆ జనాభా ఎంత అన్నది తాజా లెక్కలు లేవు. అందువలన కులపరమైన లెక్కలు తేల్చాలన్న డిమాండ్‌ను బిజెపి అంగీకరించటం లేదు. బీహార్‌లో గణాంకాల సేకరణకు ఆర్‌జెడి-జెడియు కూటమి నిర్ణయించటంతో ఉత్తర ప్రదేశ్‌లో కూడా ఆ డిమాండ్‌కు మద్దతు పెరుగుతున్నది. దాని కోసం ఆందోళన ప్రారంభిస్తామని సమాజవాదీ పార్టీ ప్రకటించింది. రామచరిత మానస్‌ వివాదం గురించి సిఎం యోగి ఆదిత్యనాధ్‌ను అడగ్గా వివాదం రేపే వారికి దాని గురించి తెలియదని, బిసి లెక్కల గురించి నిర్ణయించాల్సింది కేంద్రమని తప్పించుకున్నారు.


1980దశకంలో ఉత్తరాదిన మండలమా ా కమండలమా అన్న ప్రాతిపదికన ఓటర్లు చీలారు. మండల్‌ కమిషన్‌ నివేదికను సమర్ధించిన పార్టీలు ఒక వైపు బిజెపి మరోవైపు తారసిల్లాయి. తరువాత జరిగిన పరిణామాల్లో 2014 నాటికి ఎంబిసీలు బిజెపికి మద్దతు ఇచ్చారు. ఇప్పటికీ అదే కొనసాగుతున్నది. ఎంబిసిలు, కొందరు దళితులను ఆకట్టుకున్న బిజెపి మిగతావారిని కూడా తన వైపు తిప్పుకొనేందుకు పూనుకున్నప్పటికీ అది జరగలేదు. బిసి జనాభా గణనకు తిరస్కరించటంతో అనేక మంది బిజెపి మద్దతుదారుల్లో కూడా పునరాలోచన ప్రారంభమైన దశలో రామచరిత మానస్‌ వివాదం ముందుకు వచ్చింది. ఆ గ్రంధాన్ని లక్నోలో తగులబెట్టిన వారి మీద మీసాతో సహా ఇతర చట్టాల కింద మౌర్యతో సహా పది మందిపై బిజెపి సర్కార్‌ కేసులు పెట్టింది. ఈ వివాదం తలెత్తిన తరువాత సమాజవాదీ నేత అఖిలేష్‌ యాదవ్‌ తాను కూడా శూద్రుడనే అని అంటూ బిజెపి మీద అనేక ప్రశ్నలను సంధించారు. అసెంబ్లీలో సిఎం యోగి తులసీదాస్‌ రచనలో ఉన్నవాటిని అనువదించి చదివి శూద్రులు ఎవరో తేల్చాలని సవాలు చేశారు. దళితులను శూద్రులుగా బిజెపి వారు పరిగణిస్తున్నారా లేక మమ్మల్ని బిసిలుగానూ దళితులను శూద్రులుగా పరిగణిస్తున్నారా అన్నది తేల్చాలి అన్నారు.ఇదిలా ఉండగా లక్నోలోని సమాజవాదీ ఆఫీసు సమీపంలో పెద్ద బోర్డు వెలసింది. ” 6,743 కులాలు, శూద్ర సమాజం గర్వంతో చెబుతున్నాం మేం శూద్రులం, జై శూద్ర సమాజం, జై రాజ్యాంగం ” అని దాని మీద రాసి ఉంది. దాన్ని ఆలిండియా కుర్మీ క్షత్రియ మహాసభ( ముంబై) జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ శూద్ర ఉత్తమ్‌ ప్రకాష్‌ సింగ్‌ పటేల్‌ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.


పాము పాలు తాగితే విషంగా మారినట్లుగా దిగువ కులాల వారు విద్యనేర్చుకుంటే విషపూరితం అవుతారని దానిలో రాసినట్లు బీహార్‌ మంత్రి చంద్రశేఖర్‌ చెప్పారు.సకల గుణ హీనుడైనా బ్రాహ్మణుడిని పూజించాలి, వేద ప్రవీణులైనా శూద్రులను గౌరవించకూడదని, తెలీ, కుమ్‌హార్‌, కహార్‌,దళితులు, ఆదివాసీలు అధములని పేర్కొన్నట్లు కూడా చెప్పారు. మహిళలు, దళితుల గురించి తులసీదాస్‌ కించపరిచే విధంగా రాశారు, అవి ఒకటో రెండో వాక్యాలు కాదు అనేక చరణాలు రాశారు. ఒక దానిలో ఒక బ్రాహ్మణుడి నిండా చెడు లక్షణాలు ఉన్నా అతన్ని పూజించాలి. ఒక దళితుడు వేద పండితుడైనా అతన్ని గౌరవించకూడదు అని రాశారని, అంత వివక్షతో కూడిన వాటిని ఎలా అంగీకరించాలని జామియా విశ్వవిద్యాలయ ప్రొఫెసర్‌ హేమలత మహేశ్వర్‌ ప్రశ్నించారు.డోలు వాయించేవారు,నిరక్షరాస్యులు, మహిళలు,పశువులు, దళితులు దండనార్హులని రామచరిత మానస్‌లో తులసీదాస్‌ చెప్పినట్లు సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ కట్జూ 2018 ఆగస్టులో ఒక పోస్టులో పేర్కొన్నదాని మీద పెద్ద చర్చ జరిగింది. ఇది గృహ హింస చట్టం, ఎస్‌సి ఎస్‌టి చట్టాలను ఉల్లంఘించాలని ప్రోత్సహించటం కిందికి రాదా అని కట్జూ ప్రశ్నించారు.దళితులు,ఓబిసిలను శూద్రులని వర్ణించటం పట్ల బిఎస్‌పి నాయకురాలు మాయావతి నిరసన తెలిపారు.సమాజవాదీ వారిని శూద్రులని అప్రతిష్టపాలు చేస్తున్నదా, రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నదా అని ప్రశ్నించారు.వారిని ఓటు బాంకుగా పరిగణిస్తున్నదని విమర్శించారు.


తులసీదాస్‌ను సమర్ధించే కొందరు విపరీత తెలివిని ప్రదర్శిస్తున్నారు. అతనేమీ సంస్కర్తకాదు, కనుక అతనిలో వివక్ష ఉంటుంది. వివాదాస్పద అంశాలను అతను సృష్టించిన పాత్రలు చెప్పినవి తప్ప అతని స్వంత అభిప్రాయాలు కాదని వితండవాదం చేస్తున్నారు. అసందర్భంగా ప్రస్తావిస్తున్నారని, వాటి అసలు అర్ధం వారికి అవగతం కాలేదని చెబుతున్నారు.శూద్రులు లేదా బ్రాహ్మలు అనేది చేసే పనులను బట్టి తప్ప పుట్టుకనుబట్టి కాదని కొందరు చెబుతున్నారు. అలాంటి పరిగణన గతంలో ఉందో లేదు తెలీదు ఇప్పుడు ఉనికిలో లేదు. పుట్టుకతోనే కులం, మతం వస్తున్నది. ఆ మేరకు గౌరవ మర్యాదలు, హీనంగా చూడటం జరుగుతున్నది. మొత్తంగా చెప్పాలంటే నల్లేరు మీద బండిలా తమ హిందుత్వ అజెండాను అమలు జరపాలన్న కాషాయ దళాలను ఎదుర్కొనే శక్తులు సదరు హిందూత్వ భావజాలంలో ఉన్న అసంబద్దతలనే ఆయుధాలు చేసుకుంటుంటే మింగా కక్కలేని స్థితిలో బిజెపి గిలగిల కొట్టుకుంటున్నది.