Tags

, , , , , , , , , ,


ఎం కోటేశ్వరరావు


శనివారం రాత్రి పదిన్నర గంటలపుడు (2023 ఏప్రిల్‌ 15వ తేదీ) పటిష్టమైన పోలీసు బందోబస్తులో విలేకర్లతో మాట్లాడుతుండగా అతిక్‌ అహమ్మద్‌, అతని సోదరుడు అష్రఫ్‌ అహమ్మద్‌ అనే నేరగాండ్లను ముగ్గురు దుండగులు అతి సమీపం నుంచి కాల్చి చంపారు. ఉత్తర ప్రదేశ్‌లో శాంతి భద్రతలకు ఇది చక్కటి ఉదాహరణ. సులభంగా ప్రాణాలు తీసేందుకు కొత్త దారి చూపింది. ఇది పూర్వపు అలహాబాద్‌ నేటి ప్రయాగ్‌ రాజ్‌లో జరిగింది. అంతకు రెండు రోజుల ముందు అతిక్‌ అహమ్మద్‌ 19 ఏండ్ల కుమారుడిని, అతని అనుచరుడిని పోలీసులు ఎన్‌కౌంటర్‌లో కాల్చి చంపారు. ప్రజాస్వామ్య పుట్టినిల్లు భారత్‌ అని, ఇందుకు అనేక చారిత్ర ఆధారాలున్నాయని కావాలంటే పదకొండు వందల సంవత్సరాల నాటి తమిళశాసనాన్ని చూడవచ్చని చరిత్రకారుడి అవతారం కూడా ఎత్తిన ప్రధాని నరేంద్రమోడీ తమిళ సంవత్సరాది సందర్భంగా చెప్పిన మాటలు ఇంకా చెవుల్లో వినిపిస్తుండగానే ఇది జరిగింది. శిష్యుడు యోగి ఏలుబడిలో ఆటవిక ఉదంతం. హంతకులు తుపాకులు కాల్చుతూ జై శ్రీరామ్‌ అని నినాదాలు చేశారట. ప్రస్తుతం అక్కడ ఏ నినాదమిస్తే ఏం చేసినా తప్పించుకోవచ్చని వారికి అవగతమై ఉందేమో !వారిలో ఒకడు భజరంగ్‌దళ్‌ జిల్లా నేత. ఒక పెద్ద గూండాను చంపి తాము పేరు తెచ్చుకోవాలని ఆ ముగ్గురు చిల్లర గూండాలు చెప్పారంటే బిజెపి రెండింజన్ల పాలన, ఏకంగా ప్రధాని నరేంద్రమోడీ ప్రాతినిధó్యవహిస్తున్న, యోగి ఆదిత్యనాధ్‌ ఏలుబడిలో ఉన్న ఉత్తర ప్రదేశ్‌లో గూండాలకు, గూండాయిజానికి ఎంత పలుకుబడి, ఆరాధన ఉందో వెల్లడించింది.


అమెరికాలో తుపాకి తీసుకొని టపటపా మంటూ కాల్చిచంపిన వారిని తరువాత వచ్చే పోలీసులు అనేక ఉదంతాల్లో మట్టుపెట్టటం తెలిసిందే. తమ ముందే ఇద్దరిని కాల్చిచంపుతుంటే కళ్లప్పగించి ఉత్తర ప్రదేశ్‌ పోలీసులు చూశారంటే వారి రాక గురించి ముందే ఉప్పంది ఉండాలి లేదా హంతకులు జై శ్రీరామ్‌ అన్నారు గనుక వారు అధికార పార్టీ వారైతే లేనిపోని తంటామనకెందుకని వదలివేశారా ? ఆ వచ్చిన దుండగులు జర్నలిస్టుల ముసుగులో వచ్చారు.పోలీసులకు వారెవరో తెలీదు.ఎవరినీ తనిఖీ జరపలేదు. ఇద్దరిని చంపిన తరువాత వారు మిగిలిన వారిని కూడా చంపుతారేమో అన్న అనుమానం కూడా వారికి రాలేదు. వారు పారిపోకుండా కనీసం కాళ్ల మీదనైనా కాల్పులు జరపలేదు. ఉత్తర ప్రదేశ్‌లో పరిణితి చెందిన ప్రజాస్వామ్యంలో పోలీసులకు ఇచ్చిన శిక్షణ ఎంత ఉన్నతమైనదో కదా !


అమెరికాలో నిందితులను కాల్చి చంపిన వెంటనే ఇంటర్నెట్‌ నిలిపివేతలు, ఒక చోట నలుగురు గుమికూడ కుండా ఆంక్షల విధింపు, పాలకులు తమ కార్యక్రమాలను రద్దు చేసుకోవటం వంటివి జరిగినట్లు ఎప్పుడూ వినలేదు, కనలేదు. కానీ ఉత్తర ప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాధ్‌ సర్కార్‌ ఆదివారం నాడు రాష్ట్రమంతటా ఆంక్షలు విధించి మిగిలిన పనులు కూడా చేసింది. గత ఆరు సంవత్సరాల్లో తన పాలనలో మాఫియా, గూండా గాంగులను అంతమొందించినట్లు చెప్పుకుంటున్న సిఎం అంతా సజావుగా ఉంటే ఈ పని ఎందుకు చేసినట్లు ? అవసరం ఏమి వచ్చింది ?


గూండాలను, గూండాయిజాన్ని ఉక్కు పాదంతో అణిచివేయాలనటంలో ఎవరికీ విబేధం లేదు. చట్టవిరుద్దమైన పనులు చేసినపుడే సమస్య. నిజంగా గూండాలు, తీవ్రవాదులు గానీ జనం మీద లేదా భద్రతా దళాల మీద దాడులకు దిగినపుడు జరిగే ఎన్‌కౌంటర్లలో వారిని చంపితే అదొక తీరు. నకిలీ ఎన్‌కౌంటర్లు జరిపితే అది ప్రజాస్వామ్యమా అన్నది నాగరికుల్లో కలిగే సందేహం. ఇటీవలి కాలంలో నకిలీ ఎన్‌కౌంటర్లను కూడా హర్షించే బాపతు రెచ్చిపోతున్నది.ప్రజాస్వామ్య పరిరక్షణ గురించి కూడా కబుర్లు చెప్పేది వారే కావటం విషాదం. అతిక్‌ అహమ్మద్‌ కుమారుడు, మరొకరిని బూటకపు ఎన్‌కౌంటర్‌లో చంపారని వేరే చెప్పనవసరం లేదు. దాని కొనసాగింపుగానే అతిక్‌ సోదరులను ఒక పధకం ప్రకారం మట్టుబెట్టించారని అనేక మంది భావిస్తున్నారు.పేరు మోసిన గూండాలను కాల్చిచంపినా తప్పుపడితే ఎలా అని తక్షణ న్యాయం కావాలని కోరుకొనే కొందరు ప్రశ్నిస్తారు. ఇలా ప్రశ్నించటం ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లు మన దేశం అని చెప్పిన ప్రధాని నరేంద్రమోడీని అవమానించటం తప్ప మరొకటి కాదు. మతమార్పిడి, లౌజీహాద్‌ నిరోధ చట్టాల మాదిరి పేరు మోసిన నిందితులను కాల్చి చంపాలని ప్రభుత్వ పెద్దలు తమకు ఉన్న మెజారిటీని ఆసరా చేసుకొని చట్టాలను చేసి అందుకు పూనుకుంటే అది వేరే. ప్రజాస్వామ్య ముసుగులో ఎన్‌కౌంటర్లు సమాజానికి పీడగా ఉండే నేరగాండ్లకే పరిమితం కావు, తమకు నచ్చనివారిని సైతం అధికారంలో ఉన్న పెద్దలు ఏదో ఒకసాకుతో ఏరిపారవేస్తారు.తమదాకా వచ్చినపుడు గానీ ” తక్షణ న్యాయ ” వాదులకు ఈ అంశం అర్ధం కాదు. అలా కోరుకోవటం, అలాంటి ఉదంతాలకు మద్దతు ఇవ్వటం అంటే నిరంకుశ శక్తులను ప్రోత్సహించటమే.


ఉత్తర ప్రదేశ్‌లో యోగి అధికారానికి వచ్చిన తరువాతే నేరగాండ్లను మట్టుబెట్టి పీడ లేకుండా చేస్తున్నట్లుగా ప్రచారం పెద్దఎత్తున సాగుతున్నది. 2017 నుంచి ఇప్పటి వరకు ఎన్‌కౌంటర్లలో 183 మంది నేరగాండ్లను లేపివేసిన బాహుబలిగా వర్ణిస్తున్నారు. జాతీయ మానవహక్కుల సంస్థ సమాచారం ప్రకారం 2017 మార్చి నుంచి 2022 మార్చినెల వరకు దేశంలో ప్రతి మూడు రోజులకు ఒక ఎన్‌కౌంటర్‌, 813 మంది మరణించినట్లు వెల్లడించింది. ఇవన్నీ ఉత్తర ప్రదేశ్‌లో జరిగినవి కాదు.దుండగులు తమ వద్ద ఉన్న తుపాకులను లాక్కొనేందుకు, తమ కస్టడీ నుంచి పారిపోయేందుకు, తనిఖీ జరుపుతుండగా కాల్పులు జరిపినపుడు ఆత్మరక్షణ కోసం కాల్చినట్లు పోలీసులు చెప్పటం తెలిసిందే.యోగి అధికారంలో లేనపుడు కూడా ఉత్తర ప్రదేశ్‌లో ఎన్‌కౌంటర్లు జరిగాయి. సావర్కర్‌ అండమాన్‌ జైల్లో ఉన్నపుడు బుల్‌బుల్‌ పిట్ట రెక్కల మీద ఎక్కి వెలుపలికి వచ్చి దేశంలోని కొన్ని ప్రాంతాలను చూసి తిరిగి జైలుకు చేరుకున్నట్లు కర్ణాటక బిజెపి ప్రభుత్వ స్కూలు పుస్తకాల్లో రాసిన సంగతి తెలిసిందే.ఇతర పార్టీలు ప్రభుత్వంలో ఉండగా బహుశా గోరఖ్‌పూర్‌లోని తన మఠం నుంచి యోగి మారు రూపంలో వచ్చి పోలీసులను ఆవహించి ఎన్‌కౌంటర్లను జరిపించి తిరిగి మఠానికి వెళ్లారని కూడా భక్తులు భక్తులు చెబుతారేమో చూడాలి.


జాతీయ మానవహక్కుల సంస్థ సమాచారం ప్రకారం 2002 నుంచి 2008 వరకు దేశంలో 440 ఎన్‌కౌంటర్‌ కేసులు జరిగితే రాష్ట్రాల వారీ ఉత్తర ప్రదేశ్‌ 231, రాజస్తాన్‌ 33, మహారాష్ట్ర 31, ఢిల్లీ 26, ఆంధ్రప్రదేశ్‌ 22, ఉత్తరాఖండ్‌ 19 ఉన్నాయి. తరువాత 2009 అక్టోబరు నుంచి 2013 ఫిబ్రవరి వరకు 555 ఉదంతాలు జరగ్గా రాష్ట్రాల వారీ ఉత్తర ప్రదేశ్‌ 138, మణిపూర్‌ 62, అసోం 52, పశ్చిమ బెంగాల్‌ 35, ఝార్ఖండ్‌ 30 ఉన్నాయి. వీటిలో కొన్ని రాష్ట్రాలలో ఉగ్రవాదులు, వేర్పాటు వాదులు మరణించారు. ఈ కాలంలో యోగి అధికారంలో లేరు. ఉత్తర ప్రదేశ్‌లో వేర్పాటు వాదం లేదా నక్సల్‌ సమస్యలేదు. జరిగిన ఎన్‌కౌంటర్లలో అగ్రస్థానంలో ఎందుకు ఉన్నట్లు ? ఉత్తర ప్రదేశ్‌ పోలీసు కస్టడీ మరణాలకు పేరుమోసింది. దీని గురించి ఎక్కడా ప్రచారం జరగదు ఎందుకు ? వారంతా ఎవరు, నేరగాండ్లేనా ? టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా 2022 జూలై 26 నాడు ప్రచురించిన వార్త చెప్పిందేమిటి ? 2020 ఏప్రిల్‌ ఒకటి నుంచి 2022 మార్చి 31 వరకు ఎన్‌హెచ్‌ఆర్‌సి సమాచారం ప్రకారం దేశంలో 4,484 పోలీసు కస్టడీ మరణాలు, 233 ఎన్‌కౌంటర్‌ మరణాలు జరిగినట్లు లోక్‌సభకు ప్రభుత్వం తెలిపింది. వీటిలో ఉత్తర ప్రదేశ్‌ 952 మరణాలతో అగ్రస్థానంలో ఉంది. నరేంద్రమోడీ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న చోట ఈ దుర్మార్గం ఏమిటనిగానీ, ప్రజాస్వామ్య కబుర్లు చెపితే జనం ఏమనుకుంటారని గానీ ఎప్పుడైనా ఆత్మావలోకనం చేసుకున్నారా ?


ఒక పెట్టుబడిదారుడిని చంపినంత మాత్రాన దోపిడీ, ఒక భూస్వామిని చంపినంత మాత్రాన గ్రామాల్లో అణచివేత అంతరించదు. అలాగే గూండాలను చంపినంత మాత్రాన గూండాయిజం అంతం కాదు. అదే జరిగి ఉంటే 1990 దశకం నుంచి 2000 దశకం వరకు ముంబై,మహారాష్ట్ర ఇతర ప్రాంతాల్లో గూండాలు, మాఫియాడాన్లను పోలీసులు చంపివేశారు. వాటితో అక్కడ ఇప్పుడు గూండాయిజం అంతరించిందా ? కొత్తవారు పుట్టుకువస్తూనే ఉంటారు. ఏప్రిల్‌ 13న ఎన్‌కౌంటర్‌లో చంపిన పందొమ్మిదేండ్ల అతిక్‌ అహమ్మద్‌ కుమారుడికి యోగి అధికారంలోకి వచ్చే నాటికి 13 సంవత్సరాలుంటాయి. అతను ఈ కాలంలో గూండాగా మారాడా ? నిజంగా మారితే ఎన్‌కౌంటర్లను, బాహుబలి యోగిని ఖాతరు చేయటం లేదనుకోవాలి, అలాగాకపోతే తండ్రి అతిక్‌ అహమ్మద్‌ మీద కసి తీర్చుకొనేందుకు పోలీసులు అతగాడిని హతమార్చి ఉండాలి.ఏది నిజం ? చట్టబద్ద పాలన సాగుతోందా, విరుద్దంగా ఉందా ?


అతిక్‌ అహమ్మద్‌ సోదరులను హతమార్చిన ముగ్గురు నేరగాండ్ల గురించి చూస్తే వారిలో లవలేష్‌ తివారీ అనే వాడు సంఘపరివార్‌ ఏర్పాటు చేసిన భజరంగ్‌ దళ్‌ నేతగా ఉన్నాడని వార్తలు. తమకేం సంబంధం లేదని ఆ సంస్థలు ప్రకటించటం ఊహించనిదేమీ కాదు. ఫేస్‌బుక్‌లో తనను భజరంగ్‌ దళ్‌ జిల్లా సహ నేతగా వర్ణించినపుడే తమకే సంబంధం లేదని ప్రకటించి ఉంటే వేరు, ఇప్పుడు చెబుతున్నారంటే గాడ్సేను కూడా అలాగే తమవాడు కాదని ఆర్‌ఎస్‌ఎస్‌ చెప్పిన సంగతి గుర్తుకు వస్తోంది. నేరం చేసిన తరువాత జై శ్రీరామ్‌ అనటాన్ని బట్టి, ముగ్గురూ కలసి వచ్చారంటే మిగిలిన ఇద్దరు కూడా ఆ బాపతే లేదా తోడు తెచ్చుకున్న నేరగాండ్లన్నది స్పష్టం. వివిధ ప్రాంతాలకు చెందిన వారిని పోలీసులే ఒక దగ్గరకు చేర్చి ఉండాలి. గతంలో వారి మీద కేసులు ఉన్నప్పటికీ ముగ్గురు కలసి చేసినట్లు ఇంతవరకు ఎవరూ చెప్పలేదు. విధి నిర్వహణలో ఉన్న 17 మంది పోలీసులను వెంటనే సస్పెండ్‌ చేసినట్లు వచ్చిన వార్తలు ఫేక్‌ అని ఇంతవరకు ఎలాంటి చర్యలు లేవని అదానీ ఆధీనంలోని ఎన్‌డిటివి పేర్కొన్నది.లవలేష్‌ తివారీతో తమకెలాంటి సంబంధం లేదని కుటుంబం చెప్పిందట. కొన్ని సంవత్సరాల నుంచి మాట్లాడటం లేదని కూడా తండ్రి చెప్పాడట.తాను బ్రాహ్మణుడనని శాస్త్రాలను గాక ఆయుధాలు పట్టుకు తిరుగుతానని లవలేష్‌ చెప్పేవాడట. సన్నీ అనే నేరగాడు రౌడీ షీటర్‌. పద్నాలుగు కేసులున్నాయి,ఎలా నేరగాడిగా మారిందీ తెలియదని సోదరుడు చెప్పాడు. మూడోవాడు అరుణ్‌ చిన్నపుడే ఇల్లువదలి వెళ్లాడు. తాము పేరు మోసిన నేరగాండ్లం కావాలనే కోరికతో అతిక్‌ సోదరులను కాల్చి చంపినట్లు పోలీసులకు చెప్పారట.యోగి పాలన ఇలాంటి ఉత్తేజాలకు దోహదం చేస్తున్నట్లే కదా ! ఇలాంటి గూండాలను ఒక దగ్గరకు చేరుస్తోందా ?


యోగి ఆదిత్యనాధ్‌ అధికారానికి వచ్చిన తరువాత ఇప్పటి వరకు పదివేలకు పైగా ఎన్‌కౌంటర్లు జరిపారని వార్తలు.దీనితో నేరాలు అదుపులోకి వచ్చినట్లు ప్రచారం చేస్తున్నారు. కానీ నేరాల వివరాలను చూసినపుడు అలాంటి దాఖలాలు లేవు.కేంద్ర ప్రభుత్వ జాతీయ గణాంకాలను చూద్దాం.
రాష్ట్రం ××2016×××××2017××××2018××××2019××××2020
ఉత్తరప్రదేశ్‌ ××494025××600082××585157××628578××657925
అన్ని రాష్ట్రాలు ×4575746×4722642×4769681×4801091×6291485
ఎగువన ఉన్న వివరాల ప్రకారం ఉత్తర ప్రదేశ్‌లో యోగి అధికారానికి రాక ముందు 2016లో నమోదైన అన్ని రకాల కేసులు 4,94,025 ఉంటే 2020లో అవి 6,57,925 కు పెరిగాయి. దేశంలో 45,75,746 నుంచి 62,91,485కు చేరాయి.దేశంలో పెరిగినట్లుగానూ ఉత్తర ప్రదేశ్‌లో కూడా ఉన్నాయి.మొత్తం కేసులలో అక్రమంగా ఆయుధాలు కలిగినవి 2021లో దేశంలో వందకు 3.3 ఉంటే ఉత్తర ప్రదేశ్‌ 11.8 శాతంతో అగ్రస్థానంలో ఉంది. రెండంకెలు గల రాష్ట్రం మరొకటి లేదు. అలాంటి స్థితిలో అక్కడి జనం సుఖంగా నిద్రపోతారా ? యోగి ఆదిత్యనాధ్‌కు రెండు తుపాకులకు లైసెన్సు కూడా ఉన్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. సర్వసంగ పరిత్యాగి, నిరంతరం భద్రతా వలయంలో ఉండే యోగి పరిస్థితి ఇది. గూండాలను అణచివేస్తే అన్ని అక్రమ ఆయుధాలు ఎలా ఉంటాయి ?


ఎన్‌కౌంటర్ల గురించి ప్రచారం మీద చూపిన శ్రద్ద ఇతర అంశాల మీద లేదు. తమకు విధించిన జీవితకాల శిక్ష గురించి చేసుకున్న అప్పీళ్లు సంవత్సరాల తరబడి విచారణకు రావటం లేదంటూ 18మంది నేరస్థులు సుప్రీం కోర్టుకు దాఖలు చేసిన విన్నపంలో అలహాబాద్‌ హైకోర్టులో 160 మంది జడ్జీలకు గాను 93 మందే ఉన్నారని పేర్కొన్నారు. 2022 ఫిబ్రవరిలో సుప్రీం కోర్టు వారికి బెయిల్‌ ఇచ్చింది.” బలహీన వర్గాలకు చెందిన వారు ఎప్పటికీ కస్టడీలోనే ఉంటున్నారు. మా అనుభవంలో అలాంటి వారు జైళ్లలో ఉంటున్నారు.ఉన్నత సమాజానికి చెందిన ఒక నేరగాడు శిక్ష పడే సమయానికి దేశం నుంచి తప్పించుకున్నాడని ” ఆ సందర్భంగా సుప్రీం కోర్టు పేర్కొన్నది. ఇది యోగి సర్కార్‌ సిగ్గుపడాల్సిన అంశం. 2021 ఆగస్టు నాటికి 1.8లక్షల క్రిమినల్‌ అప్పీళ్లు హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి. రెండువేల సంవత్సరం నుంచి కేవలం 31,044 కేసులనే హైకోర్టు పరిష్కరించింది. పదేండ్లకు ముందు అప్పీలు చేసిన ఖైదీలు 7,214 మంది జైల్లో ఉన్నారు.2017 మార్చి నుంచి 2021 ఆగస్టు వరకు ఉత్తర ప్రదేశ్‌ పోలీసులు జరిపిన 8,472 ఎన్‌కౌంటర్లలో 3,302 మంది నేరారోపణలు ఉన్నవారు గాయపడ్డారు.వారిలో 146 మంది మరణించారు. పోలీసు ఎన్‌కౌంటర్లు పెద్ద ఎత్తున జరగటం అంటే అక్కడ శాంతి భద్రతల పరిరక్షణ యంత్రాంగం, న్యాయాన్ని అందించాల్సిన వ్యవస్థ వైఫల్యానికి చిహ్నం. పోలీసు యంత్రాంగాన్ని ఎన్‌కౌంటర్ల విభాగంగా మార్చితే జవాబుదారీతనాన్ని లోపించిన దాన్ని సంస్కరించటం అంత తేలిక కాదు, ఏకుమేకై కూర్చుంటుంది. చివరకు పెంచి పోషించిన వారికే తలనొప్పిగా మారుతుంది. అధికారం మారితే అదే పోలీసు యంత్రాంగం పాలకులు ఎవరి మీద గురి పెట్టమంటే వారి మీదే తుపాకులను ఎక్కు పెడుతుంది.