ఎం కోటేశ్వరరావు
” షిరిడీ సాయి ట్రస్టు మసీదులకు రు.96 కోట్లు విరాళమిచ్చింది. షిరిడీ సాయి ట్రస్టు హాజ్కు రు.35 కోట్లు విరాళమిచ్చింది.” ఈ రెండింటికీ జత చేసిన అంశాలేమిటంటే షిరిడీ దేవాలయానికి విరాళాలు ఎక్కువగా ఇచ్చేది హిందూ భక్తులు. అలాంటి సంస్థ అయోధ్య రామ మందిరానికి విరాళం ఇచ్చేందుకు తిరస్కరించింది. తాము హిందువులకు భిన్నమని చెప్పినట్లు కూడా వాట్సాప్, ఫేస్బుక్, ట్విటర్లో ప్రచారం జోరుగా సాగుతున్నది. ఇది నిజమేనా అంటూ దీన్నే సరికొత్త పద్దతుల్లో కూడా ప్రచారం చేస్తున్నారు. తన పేరుతో జరుగుతున్న ఇలాంటి ప్రచారాన్ని అడ్డుకొనేందుకు రాముడు పూనుకున్నట్లు మనకు ఎక్కడా దాఖలా లేదు. రామజన్మభూమి ట్రస్టు ఏదైనా వివరణ ప్రకటన చేసినట్లు గూగుల్ వెతుకులాటలో కనిపించలేదు. దొరికిన వారెవరైనా పంపితే ఈ విశ్లేషణకు జత చేస్తాను. కాగలపని గంధర్వులు తీర్చారు అన్నట్లుగా కాషాయ మరుగుజ్జులు చేస్తున్నదాన్ని చూసీ చూడనట్లు ఉందన్నది స్పష్టం. ఈ ప్రచారానికి సంబంధించి కొన్ని మీడియా సంస్థలు నిజనిర్దారణలు జరిపి షిరిడీ సాయి ట్రస్టు అలాంటి విరాళాలు ఇవ్వలేదని ప్రకటించినప్పటికీ ఇంకా ప్రచారం జరుగుతూనే ఉంది. పని గట్టుకు చేసేదే చేసే గోబెల్స్ ప్రచారం గనుక వారికి వాస్తవాలతో నిమిత్తం ఉండదు. సత్యమునే చెప్పవలెను-అబద్దమాడరాదు, సత్యహరిశ్చంద్రుడు పుట్టిన గడ్డ ఇది అని చెప్పుకొనే చోట ఇలాంటి ప్రచారం జరుగుతున్నదంటే నిజానికి అది రాముడికి, హరిశ్చంద్రుడికి ఘోర అవమానం, వారి పేర్లను స్మరిస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నది స్పష్టం.ఇలాంటి ప్రచారాలు చేసే చీకటి శక్తులేవో అందరికీ తెలిసిందే.ఏకత, శీలము ఉన్నవారు చేసే పనేనా ఇది ?
ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమంటే అయోధ్య రామాలయ నిర్మాణానికి విరాళం ఇమ్మని షిరిడీ సాయి ట్రస్టును అసలు అడగలేదని ది క్వింట్ అనే వెబ్ పత్రిక 2021 జనవరి 18న స్పష్టం చేసింది. ఈ ప్రచారం పచ్చి అవాస్తవమని, విరాళం కోరుతూ తమకు ఎలాంటి సమాచారం లేదని ట్రస్టు సిఇఓ కెహెచ్ బగాటే, విరాళం కోసం తామెలాంటి వినతి పంపలేదని రామాలయ ట్రస్టు సభ్యుడు మోహన ప్రతాప్ మిశ్రా చెప్పినట్లు పేర్కొన్నది. హిందూస్తాన్ టైమ్స్లో వచ్చిన ఒక వార్త ప్రకారం రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు విరాళాలు తీసుకోవటం 2021 జనవరి 15 నుంచి ప్రారంభించిందని, దాని కంటే ముందే ఐదవ తేదీ నుంచే షిరిడీ ట్రస్టు నిరాకరణ గురించి ప్రచారం జరుగుతున్నట్లు క్వింట్ పేర్కొన్నది.
ఈ ప్రచారాన్నే ” హార్డ్ కోర్ హిందూ సేన ఆఫ్ చీఫ్ మినిస్టర్ యోగి ఆదిత్య నాథ్ ” పేరుతో నడుపుతున్న ఒక గ్రూపులో, హిందూ రాష్ట్ర భారత్ వంటి గ్రూపుల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేసినట్లు ది లాలన్టాప్ అనే వెబ్సైట్ 2020 జూన్ 22న వెల్లడించింది. దీని గురించి శ్రీ సాయి బాబా సంస్థాన్ ట్రస్టు సిఇఓ అరుణ్ కిషోర్ డోంగ్రే మాట్లాడుతూ ఇక్కడికి అన్ని మతాలకు చెందిన వారు వస్తారని, ఒక చట్టం ప్రకారం పని చేస్తున్న ట్రస్టు రు.50లక్షలకు మించి అదనంగా ఎవరికైనా విరాళం ఇవ్వాలంటే హైకోర్టు అనుమతి తీసుకోవాలని, రామ మందిరానికి విరాళం ప్రతిపాదన ఎలాంటిదీ తమ వద్దకు రాలేదని, జరుగుతున్నదంతా తప్పుడు ప్రచారమని చెప్పినట్లు కూడా ఆ సైట్ పేర్కొన్నది. ఈ ప్రచారం 2019 డిసెంబరులో కూడా జరిగిందని, అప్పుడు షిరిడీ ట్రస్టు సిఇఓగా ఉన్న దీపక్ ముఘాలికర్ కూడా అది తప్పుడు ప్రచారమని చెప్పారు. మసీదుల మరమ్మతు, నిర్మాణాలకు రు.96 కోట్లను షిరిడీ ట్రస్టు విరాళంగా ఇచ్చినట్లు, రామ మందిరానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని జరుపుతున్న ప్రచారం వాస్తవం కాదని చెక్పోస్ట్ అనే మరాఠీ వెబ్సైట్ 2021అక్టోబరు 30న పేర్కొన్నది. ” బుద్దిలేని మన హిందువులు సాయి గుడికి వెళుతున్నారు. తలలు వంచి కానుకలు సమర్పిస్తున్నారు. ఒక కుట్ర ప్రకారం సాయి విగ్రహాలను హిందువుల గుళ్లలో పెడుతున్నారు.హిందువులారా జాగ్రత్తగా ఉండండి, నిజాలను తెలుసుకొనేందుకు ప్రయత్నించండి ” అంటూ కూడా వాట్సాప్లో ప్రచారం చేస్తున్నట్లు అది పేర్కొన్నది. షిరిడీ ట్రస్ట్ వెబ్సైట్లో ఉంచిన ఒక నివేదిక ప్రకారం 2019-20 ఆర్థిక సంవత్సరంలో ట్రస్టు ఇచ్చిన 58 విరాళాల జాబితా ప్రకారం వాటికి ఇచ్చిన మొత్తం రు. 101.48 కోట్లని, దానిలో కరోనా సమయంలో సిఎం సహాయ నిధికి 51 కోట్లు ఇచ్చినట్లు ఉంది తప్ప ఎలాంటి మసీదు పేరు లేదని చెక్పోస్ట్ పేర్కొన్నది.
విరాళాన్ని తిరస్కరించిన రామ మందిర ట్రస్టు !
రామ మందిర ట్రస్టు నిబంధనావళిని 2020 ఫిబ్రవరి ఐదున ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించినట్లుగా మనీకంట్రోల్ వెబ్సైట్ అదే ఏడాది ఫిబ్రవరి 20న ఒక వార్తలో పేర్కొన్నది. విరాళాలను స్వీకరించే వ్యవస్థను ఇంకా ఏర్పాటు చేయాల్సి ఉందని, పెద్ద మొత్తంలో వచ్చిన విరాళాన్ని ట్రస్టు తిరస్కరించినట్లు ద ప్రింట్ అనే వెబ్సైట్ వార్తను అది ఉటంకించింది. దాని ప్రకారం బీహార్కు చెందిన రిటైర్డ్ ఐపిఎస్ అధికారి కిషోర్ కునాల్ తాను రామ మందిరానికి పది కోట్ల మేరకు విరాళం ఇవ్వదలచుకున్నట్లు ప్రకటించారని, దానిలో భాగంగా రు. రెండు కోట్ల చెక్ తీసుకొని అయోధ్య రాగా విరాళాలను స్వీకరించే వ్యవస్థ లేనందున దాన్ని తిరస్కరిస్తున్నట్లు చెప్పారని ప్రింట్ పేర్కొన్నది. రామమందిర ట్రస్ట్లోని ఏకైక దళిత సభ్యుడు, విశ్వహిందూ పరిషత్ నేత కమలేష్ చౌపాల్ మాట్లాడుతూ దేశమంతటి నుంచి అనేక మంది విరాళాలు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నారని , మందిర నిర్మాణానికి నిధుల కొరత లేదని అన్నట్లు కూడా రాసింది.
షిరిడీ సాయి మందిరం గురించి తప్పుడు ప్రచారం కొత్త కాదు. షిరిడీ సాయిబాబా హిందూాముస్లిం ఐక్యతకు ప్రతీక కాదు, దేవుడూ కాదని మానవుడు కనుక పూజించ వద్దని ద్వారకా పీఠం శంకరాచార్య స్వామి స్వరూపానంద 2014 జూన్ 24న చెన్నైలో పిలుపునిచ్చారు. నిజంగా సాయిబాబా హిందూ-ముస్లిం ఐక్యతకు ప్రతీకైతే ముస్లింలు కూడా విశ్వాసం వెల్లడించేవారని అన్నారు. సాయిబాబా గంగలో మునిగేందుకు తిరస్కరించారని, అతని పేరుతో గుళ్లు కట్టటం డబ్బు సంపాదనకేనని, సనాతన ధర్మంలో విష్ణువు 24 అవతారాల గురించి చెప్పారని దానిలో సాయిబాబా లేరని, హిందువుల మధ్య విభజన కుట్రలో భాగంగా బాబాకు పూజలు చేస్తున్నారని ఆరోపించారు. బ్రిటీష్ వారు బాబాను ముందుకు తెచ్చారని కూడా ఆరోపించారు.
దేశంలో ఇప్పుడు తిరుపతి వెంకటేశ్వర ఆలయం, షిరిడీ మందిరం ఆదాయంలో పోటీ పడుతున్నాయి. భక్తులను అయోధ్య రామమందిరం వైపు మళ్లించేందుకు చూస్తున్నారు. దేశంలో భక్తి ముదరటంతో గుళ్లు, గోపురాలు, బాబాలకు డిమాండ్ బాగా పెరిగింది. అందుకే అనేక గుళ్లను నవీకరించి రాబడి పెంచేందుకు పూనుకున్నారు. హిందూత్వ రాతలకు ప్రతీకగా ఉన్న ఒపి ఇండియా వెబ్సైట్లో 2020జనవరి 23న ఒక విశ్లేషణ వెలువడింది. షిరిడీ సాయి బాబా జన్మ స్థలంగా భావిస్తున్న పత్రి అనే చోట బాబా ఆలయాన్ని వృద్ది చేసేందుకు (అప్పటి శివసేన-కాంగ్రెస్-ఎన్సిపి ) ప్రభుత్వం రు. వంద కోట్లు కేటాయించిందని షిరిడీకి పోటీగా దాన్ని రూపొందించాలని చూస్తున్నదని ఆరోపించారు. ఇప్పటికే పత్రిలో బాబా ఆలయం ఉన్నప్పటికీ దాని గురించి అంతగా ప్రచారం లేదని, దానికి వంద కోట్లు కేటాయించి అభివృద్ధి చేస్తే మతపరమైన టూరిజం మీద ఆధారపడిన షిరిడీలోని జనం ఆర్థికంగా నష్టపోతారని, అందువలన ఆ ప్రతిపాదనకు నిరసనగా షిరిడీలో బంద్ కూడా పాటించారని పేర్కొన్నారు. అహమ్మద్ నగర్ జిల్లాలో ఉన్న షిరిడీ ట్రస్టు మీద పెత్తనం చేస్తున్న ప్రముఖ కాంగ్రెస్ నేత రాధాకృష్ణ విఖీ పాటిల్ ఆ పార్టీని వదలి బిజెపిలో చేరినప్పటికీ ట్రస్టు మీద పట్టుకోల్పోలేదని, అందువలన దాన్ని దెబ్బతీసేందుకు పత్రి ఆలయ ట్రస్టు మీద పట్టు ఉన్న ఎన్సిపి-కాంగ్రెస్ దాని వృద్దికి కుట్ర చేశారని ఆ వెబ్సైట్ ఆరోపించింది.ద్వారకా పీఠం శంకరాచార్య స్వామి స్వరూపానంద అసలు షిరిడీ వెళ్లవద్దని, పూజలు జరపవద్దని ఇచ్చిన పిలుపులో దానికి జనాలకు వచ్చే అర్థిక నష్టకోణం కనిపించలేదు. ఈ రాజకీయాలను ఆ దేవుళ్లు, దేవతలు ఎలా భరిస్తున్నారో కదా !