Tags

, , , , , , ,


ఎం కోటేశ్వరరావు


అగ్గి పుల్లా సబ్బు బిళ్లా, కుక్క పిల్లా కాదేదీ కవిత కనర్హం అన్నాడు మహాకవి శ్రీశ్రీ. ఓట్ల కోసం ఏ గడ్డి కరచినా తప్పులేదన్నట్లు విశ్వగురువు నరేంద్రమోడీ నేతృత్వంలోని బిజెపి తీరుతెన్నులు ఉన్నాయి.ఈనెల పదవ తేదీన జరిగే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలన్నది బిజెపి లక్ష్యంగా కనిపిస్తున్నది.చట్టాన్ని వ్యక్తులు, నిషేధిత b పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా(పిఎఫ్‌ఐ), భజరంగ్‌ దళ్‌ వంటి సంస్థలు ఉల్లంఘిస్తే వాటి మీద నిషేధంతో సహా కఠిన చర్యలు తీసుకుంటామని కర్ణాటక కాంగ్రెస్‌ ఎన్నికల మానిఫెస్టోలో పేర్కొన్నారు. పదజాలం ఏదైనా నిషేధం విధిస్తామనే భావం దానిలో ఉంది. దీన్ని అవకాశంగా తీసుకొని ప్రధాని నరేంద్రమోడీ జై భజరంగ బలీ(జై హనుమాన్‌) అని నినాదమిస్తూ ఓటు వేయాలని ఎన్నికల సభల్లో పిలుపు ఇచ్చారు. మమ్మల్ని పిఎఫ్‌ఐ వంటి సంస్థలతో పోలుస్తారా, నిషేధిస్తామని అంటారా అంటూ సంఘపరివార్‌ సంస్థలు, బిజెపి దేశమంతటా వీధులకెక్కింది. కాంగ్రెస్‌ ఆఫీసుల మీదకు వెళ్లి శాంతి భద్రతల సమస్యలను సృష్టిస్తున్నారు.ప్రజాస్వామ్య పద్దతిలో ఎవరైనా నిరసన ప్రకటనలు లేదా వేరే చోట్ల ఆందోళనలు చేయటం వేరు, ఆఫీసుల మీదకు వెళ్లటం మూకస్వామ్యం, ఫాసిస్టు లక్షణమే. దీన్ని బట్టే వారి స్వభావం, ప్రమాదం ఏమిటో స్పష్టం అవుతున్నది. హనుమంతుడిని వీధుల్లోకి తేవటంతో ఓటర్ల మీద ప్రభావం పడుతుందేమో అన్న భయంతో కాంగ్రెస్‌ నష్ట నివారణకు పూనుకొని నిషేధం తమ ఉద్దేశ్యం కాదని, అలాంటి చర్యలు తీసుకొనే అధికారం రాష్ట్రాలకు లేదని ఆ పార్టీ నేతలు వివరణలు ఇచ్చారు. అయినప్పటికీ మత ఉద్రిక్తతలు, మనోభావాలను రెచ్చగొట్టటం ద్వారా లబ్ది పొందవచ్చనే ఎత్తుగడతో ఎన్నికల తేదీ వరకు బిజెపి రచ్చ చేసేందుకు పూనుకున్నట్లు కనిపిస్తోంది. మానిఫెస్టోలో పెట్టకపోయినా వారు చేసేది చేస్తారు. ఉచిత పథకాలను అమలు జరిపితే రాష్ట్రాలు రుణ ఊబిలో కూరుకుపోతాయంటూ సుభాషితాలు పలికిన నరేంద్రమోడీ కర్ణాటక బిజెపి ఎన్నికల ప్రణాళిక భేషుగ్గా ఉందని కితాబునిచ్చినట్లు వార్తలు. ఒక సంస్థ మీద ఒక రాష్ట్రం ఎలా నిషేధం విధించలేదో అలాంటిదే ఉమ్మడి పౌరస్మృతి. దాన్ని ఒక రాష్ట్రం అమలు జరిపేది కాదు. అయినప్పటికీ అమలు జరుపుతామని కర్ణాటక బిజెపి తన మానిఫెస్టోలో పెట్టింది. ఇది క్రైస్తవ, ముస్లిం, ఇతర మైనారిటీ మతాల వారిని రెచ్చగొట్టేందుకు, హిందూత్వ శక్తులను సంతుష్టీకరించేందుకు చేసిన కసరత్తు. బిజెపి ఇన్ని పాట్లు పడినా ఎన్నికల్లో గట్టెక్కుతుందా అన్నది శేష ప్రశ్న.


నిజానికి భజరంగదళ్‌, ఇతర హిందూత్వ సంస్థల మీద నిషేధంతో సహా చర్యలు తీసుకోవాలన్న డిమాండ్‌ ఈ నాటిది కాదు. విద్వేషాన్ని రెచ్చగొట్టే శక్తుల మీద ఫిర్యాదు లేకున్నా పోలీసులు కేసులు నమోదు చేయాలని ఉన్నత న్యాయ స్థానం సుప్రీం కోర్టు ఒకటికి రెండుసార్లు ఆదేశించిన సంగతి తెలిసిందే. అలాంటి నేరాలకు పాల్పడే వారు మెజారిటీ హిందూత్వ కావచ్చు మైనారిటీ మత శక్తులు కావచ్చు. భజరంగ్‌ దళ్‌ మీద నిషేధం విధించవచ్చు అని చెప్పిన కాంగ్రెస్‌ తనకు తానే హాని చేసుకుందని కొందరు విశ్లేషణల పేరుతో బిజెపి అనుకూల ప్రచారానికి దిగారు. ఈ అంశంతోనే కాంగ్రెస్‌ విజయావకాశాలు దెబ్బతింటాయా ? కర్ణాటక ఓటర్లు కాషాయ దళాల వలలో పడతారా ? నిషేధ ప్రతిపాదన లేదా డిమాండ్‌ లేకముందే హిజాబ్‌, లవ్‌ జీహాద్‌, ఇతర మతోన్మాద అజెండాతో మతవిద్వేషాన్ని రెచ్చగొట్టేందుకు, కర్ణాటకలో మెజారిటీ ఓటు బాంకు సృష్టికి బిజెపి ఎప్పటి నుంచో అనేక వివాదాలను ముందుకు తెచ్చింది. ఇప్పటి వరకు ఎక్కించిన మతోన్మాదం, కుల ఓటు బాంకు రాజకీయాలు తక్కువేమీ కాదు.వాటితో మతోన్మాద పులిని ఎక్కి వీరంగం వేస్తున్న వారు ఇప్పటికే ఉన్నారు. ఇన్ని తెచ్చిన తరువాత కూడా ఆ పార్టీ వచ్చే ఎన్నికల్లో ఓడిపోనుందనే వాతావరణం ఏర్పడిందని గమనించాలి.


కేరళలో శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశం గురించి సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పునే ఖాతరు చేయని అపర ప్రజాస్వామికశక్తులుగా కాషాయదళాలు రుజువు చేసుకున్నాయి. ఆ కేసుకు కమ్యూనిస్టులకు ఎలాంటి సంబంధమూ లేదు. కోర్టును తీర్పును అమలు జరుపుతామని అధికారంలో ఉన్న ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం చెప్పింది. దాంతో ఇంకేముంది హిందూమతానికి ముప్పు వచ్చింది అంటూ రెచ్చగొట్టారు. మహిళలను ముందు పెట్టి ఆగమాగం చేశారు.దాడులకు పాల్పడ్డారు.2021లో జరిగే ఎన్నికల్లో ఎల్‌డిఎఫ్‌ను దెబ్బతీసేందుకు చూశారు. చివరకు బొక్కబోర్లా పడి ఉన్న ఒక్క సీటునూ పోగొట్టుకున్నారు.శబరిమలతో సహా ప్రముఖ దేవాలయాలున్న ప్రతిచోటా అంతకు ముందు ఉన్న ఓట్లనూ తెచ్చుకోలేకపోయారు. హనుమంతుడు కర్ణాటకలోని హంపిలో పుట్టినట్లు కాషాయ దళాలు ఇప్పటికే ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే.


కర్ణాటకలో భజరంగదళ్‌ అంశం ఏమేరకు పని చేస్తుందో చూడాల్సి ఉంది. అక్కడ ఆ సంస్థ చరిత్రను చూసినపుడు అనేక ఉదంతాల్లో అది భాగస్వామిగా ఉంది. 2008లో బిజెపి అధికారానికి వచ్చిన తరువాత కర్ణాటక కోస్తా ప్రాంతంలో చర్చ్‌లు, క్రైస్తవ సంస్థల మీద చేసిన దాడుల గురించి సిఎంగా ఉన్న ఎడియూరప్ప జస్టిస్‌ బికె సోమశేఖర కమిషన్‌ ఏర్పాటు చేశారు. మరుసటి ఏడాది సమర్పించిన మధ్యంతర నివేదికలో ఆ దాడుల్లో భజరంగదళ్‌ వంటి మితవాద బృందాలున్నట్లు పేర్కొన్నారు. మంగుళూరు ప్రాంతంలో చర్చ్‌ల మీద దాడులు తామే చేసినట్లు భజరంగ్‌దళనేతలు పత్రికా గోష్టి పెట్టిమరీ చెప్పారు. గతేడాది షిమోగాలో హలాల్‌ మాంసం అమ్మాడంటూ ఒక ముస్లిం వ్యాపారి మీద దాడి చేసిన కేసులు ఆ సంస్థకు చెందిన వారిని అరెస్టు చేశారు. ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే.ఒడిషా, కర్ణాటకల్లో జరిపిన హింసాకాండకు గాను విశ్వహిందూపరిషత్‌, భజరంగ్‌ దళ్‌ మీద నిషేధం విధించాలని 2013లో కేంద్ర మంత్రిగా ఉన్న లోక్‌జనశక్తి పార్టీ నేత రామ్‌ విలాస్‌ పాశ్వాన్‌ డిమాండ్‌ చేశారు. తరువాత అదే పెద్ద మనిషి బిజెపి చంకనెక్కి మంత్రిగా పని చేశారు.చివరిగా బిజెపి మద్దతుతో రాజ్యసభకు ఎన్నికయ్యారు.


అల్లుడికి బుద్ది చెప్పిన మామ అదే తప్పు చేసినట్లు ఉచితాల గురించి రచ్చ చేస్తున్న ప్రధాని నరేంద్రమోడీ కర్ణాటకలో తమ పార్టీ ఉచితాలను సమర్ధించారు.కర్ణాటక కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలతో రాష్ట్రం అప్పుల వూబిలో మునుగుతుందన్నారు. ఉచితాల సంస్మృతి భవిష్యత్‌ తరాల వనరులను హరించి వేస్తుందని, తాము రానున్న పాతిక సంవత్సరాల గురించి ఆలోచిస్తాము తప్ప దగ్గరదారుల్లో వెళ్లం అన్నారు. ప్రతి రోజు బిపిఎల్‌ కుటుంబాలకు పాల సరఫరా హామీ కూడా ఇచ్చారు. ఎందుకు అంటే ఆ రాష్ట్ర పాలరైతులకు మార్కెటింగ్‌ కల్పించి ఆదుకొనేందుకు అని బిజెపి నేతలు చెబుతున్నారు. మరి అధికారంలో ఇప్పటికే ఉన్న చోట్ల ఎందుకు ఇవ్వటం లేదు, కర్ణాటకలో కూడా ఇప్పటి వరకు ఎందుకు పాలు సరఫరా చేయలేదు ? కుటుంబ పాలన, అవినీతి గురించి మోడీ పెద్దగా ప్రస్తావించటం లేదు. ఎందుకంటే 40శాతం అవినీతి పాలన అని బిజెపి సర్కార్‌ గబ్బుపట్టింది. ఇక ఎడియూరప్పను పక్కన పెట్టుకొని కుటుంబపాలన గురించి చెబితే కన్నడిగులు ముఖం మీదే జనం నవ్వుతారు. మోడీ చేతుల్లో దేశం సురక్షితంగా ఉంటుందన్నారు. కాశ్మీరులో భద్రతా దళాలకు అధికారం ఇవ్వలేదంటూ ఆర్టికల్‌ 370 రద్దు, ఏకంగా రాష్ట్రానే రద్దు చేసి కేంద్ర పాలన సాగిస్తోంది. అక్కడ ఒక వైపు ఉగ్రవాదులు భద్రతాదళాల ప్రాణాలు తీస్తుంటే మరోవైపు కర్ణాటకలో మోడీ ఉగ్రవాదం గురించి ఇతరుల మీద రాళ్లు వేస్తున్నారు. వారితో చేతులు కలిపిన వారి మీద చర్యలు తీసుకుంటే ఎవరు అడ్డుకున్నారు ? ఇంతవరకు ఎంత మందిని పట్టుకున్నారు, ఎన్నికేసులు పెట్టారు ?


ఉచితాలకు వ్యతిరేకంగా బిజెపి నేత అశ్వనీకుమార్‌ ఉపాధ్యాయ సుప్రీం కోర్టులో కేసు వేశారు. సంక్షేమ చర్యలు అంటే ప్రతిదాన్నీ ఉచితంగా ఇవ్వటం కాదని కేంద్రం తరఫున వాదించిన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా చెప్పారు.కర్ణాటకలో ఉచిత పాలు, ఉచిత సిలిండర్లు, ఉచిత ఆహార ధాన్యాల సంగతేమిటి ? గత ఏడాది(2022) ఫిబ్రవరిలో ఉత్తర ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్‌కు కేవలం రెండు రోజుల ముందు లోక కల్యాణ సంకల్ప పత్రం పేరుతో బిజెపి ఎన్నికల వాగ్దాన పత్రాన్ని మోడీలో సగంగా భావిస్తున్న కేంద్ర మంత్రి అమిత్‌ షా విడుదల చేశారు. ఐదు సంవత్సరాల పాటు రైతులకు ఉచిత విద్యుత్‌, ఆరుపదులు దాటిన మహిళలకు ఉచిత ప్రయాణం ( కరోనా పేరుతో రైళ్లలో వృద్ద స్త్రీ, పురుషులకు ఇస్తున్న రాయితీలను , పేదలకు అందుబాటులో ఉన్న పాసింజరు రైళ్లను మోడీ సర్కార్‌ రద్దు చేసిన సంగతిని ఇక్కడ గుర్తుకు తేవాలి), ప్రతిభ చూపిన విద్యార్థినులకు స్కూటీలు, విద్యార్థులందరికీ రెండు కోట్ల స్మార్ట్‌ ఫోన్లు, టాబ్లెట్ల పంపిణీ, పిఎం ఉజ్వల పధకం కింద హౌలి, దీపావళి పండుగలకు రెండు ఉచిత గాస్‌ సిలిండర్లు, అన్న పూర్ణ కాంటీన్లు వాటిలో ఉన్నాయి. ఇదే ఉత్తర ప్రదేశ్‌లో ముఖ్యమంత్రి కన్య సుమంగళ యోజన పేరుతో ఉచితంగా నిధులు ఇచ్చేందుకు 2022-23 బడ్జెట్‌లో పన్నెండు వందల కోట్ల రూపాయలు కేటాయించారు.


అమ్‌దానీ ఆఠాణీ, ఖర్చా రూపయా (రాబడి ఎనిమిదణాలు ఖర్చు పదహారణాలు) అని నరేంద్రమోడీ ఉచితాల గురించి ఎద్దేవా చేశారు. ” ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పధకం కింద 39లక్షల మందికి రెండు ఉచిత గాస్‌ సిలిండర్లు ఇవ్వనున్నట్లు అక్టోబరు 17న గుజరాత్‌ ప్రభుత్వం ప్రకటించింది.” (డెక్కన్‌ హెరాల్డ్‌ 2022 నవంబరు 13). ” బిజెపి ప్రకటించిన వాటిలో ఉచిత విద్య,ఉచిత వైద్యం, రెండు ఉచిత సిలిండర్లు, సబ్సిడీతో సెనగలు, వంట నూనె, కాలేజీలకు వెళ్లే బాలికలకు ఉచిత ఎలక్ట్రిక్‌ స్కూటీలు కూడా ఉన్నాయి. సరిగ్గా ఎన్నికలకు ముందు హిమచల్‌ ప్రదేశ్‌లోని బిజెపి సర్కార్‌ ఏప్రిల్‌ నెలలో ఇండ్ల అవసరాలకు గాను 125 యుూనిట్లకు చార్జీ ఎత్తివేసి రు.250 కోట్లు లబ్ది చేకూర్చుతున్నట్లు, గ్రామాలలో నీటి సరఫరా చార్జీలను మాఫీ చేస్తున్నట్లు, రాష్ట్ర ఆర్టీసి బస్సుల్లో మహిళలకు సగం చార్జీ రాయితీ ఇస్తున్నట్లు, 18-60 సంవత్సరాల మహిళలకు నెలకు రు.1,500 ఇవ్వనున్నట్లు ప్రకటించింది. బిజెపి చేస్తే సంసారం, ఇతరులు చేస్తే మరొకటా ?


ఉచితాలను పన్ను చెల్లింపుదార్లు నిరసిస్తున్నారని అంటూ వాటికి వ్యతిరేకమైన వాతావరణాన్ని సృష్టించేందుకు ఒకవైపు నరేంద్రమోడీ చూస్తున్నారు.మరోవైపు అధికారం కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. గడచిన ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వ రంగ బాంకులు రు.10,09,510 కోట్ల మేరకు నిరర్ధక ఆస్తులుగా ప్రకటించగా ఇదే కాలంలో అలాంటి ఖాతాల నుంచి వసూలు చేసిన మొత్తం రు.1,32,036 కోట్లని ప్రభుత్వం తాజాగా పార్లమెంటులో, సమాచార హక్కు కింద ఆర్‌బిఐ వెల్లడించింది.(2022, డిసెంబరు 13వ తేదీ వార్త). వారి మీద తీసుకున్న చర్యలేమిటో ఎవరికైనా తెలుసా ?


కార్పొరేట్‌లపై పన్ను ద్వారా ఖజానాకు వచ్చే మొత్తం కూడా ప్రజలదే. కానీ ఒక్క పైసాను కూడా జాగ్రత్తగా చూస్తానని చెప్పిన నరేంద్రమోడీ కార్పొరేట్‌ పన్నును 30 నుంచి 22కు, 15శాతానికి తగ్గించారు. దీన్ని హర్షించే పెద్దలు సబ్సిడీ ధరలకు ఆహార ధాన్యాలను ఇస్తే పేదలు వాటిని తినకుండా వేరే వారికి అమ్ముకుంటున్నారని దాడి చేస్తున్న సంగతి తెలిసిందే. మరి కార్పొరేట్లకు ఇస్తున్న సబ్సిడీ అంతా తిరిగి పెట్టుబడిగా వస్తున్నదా ? అది దేశానికి, జనానికి లబ్ది చేకూర్చుతున్నదా ? దీన్ని కార్పొరేట్లకు ఇస్తున్న ఉచితం అంటారా, దోచిపెడుతున్న సొమ్మంటారా ? ఇదే కాలంలో కార్పొరేట్ల నుంచి ఎన్నికల బాండ్ల రూపంలో బిజెపికి వస్తున్న సొమ్మెంతో కూడా చూస్తున్నాము. కార్పొరేట్లకు పన్ను తగ్గిస్తే వారు తిరిగి దాన్ని పెట్టుబడి పెట్టి ఉపాధి కల్పిస్తారని చెబుతున్నారు. జనమూ అంతేగా ! ఒక వస్తువు లేదా సేవను ఉచితంగా పొందితే దానికి వెచ్చించే సొమ్ముతో మరొకదాన్ని కొనుగోలు చేసి దేశానికి తోడ్పడుతున్నారు. ఉదాహరణకు నరేంద్రమోడీ 2019 ఎన్నికలకు ముందు ఓట్ల కోసం రైతులకు ఉచితంగా ఏడాదికి ఆరువేల రూపాయలను మూడు విడతలుగా బాంకుల్లో వేసే పథకాన్ని ప్రకటించారు. రైతులు ఆ సొమ్మును స్విస్‌ బాంకుల్లోకి, ఇతర దేశాలకేమీ తరలించి దాచుకోవటం లేదు, ఎరువులో, పురుగుమందులో మరొక వస్తువునో కొనుక్కుంటున్నారు. సాగు చేయని వారు ఇతర వస్తువులకు వెచ్చిస్తున్నారు. అదీ దేశానికి మేలు చేస్తున్నట్లే !


స్వేచ్చా మార్కెట్‌, ఏదీ ఉచితం ఇవ్వకూడదు అన్న నయా ఉదారవాదం పేరుతో కార్పొరేట్లకు సంపదలను కట్టబెట్టే విధానాలు వచ్చిన దగ్గర నుంచీ అసమానతల పెరుగుదలతో పాటు ఉచితాల మీద దాడి ప్రారంభమైంది. ఉచితంగా ఉన్న విద్య, వైద్యాలను అమ్మకపు సేవలుగా మార్చివేశారు. ఒకనాడు అపహాస్యం చేసిన పధకాలనే తరువాత జాతీయంగా అమలు చేశారు.తొలుత తమిళనాడు స్కూలు పిల్లలకు మధ్యాహ్నభోజన పథకాన్ని అమలు చేసినపుడు అదే జరిగింది. ఇప్పుడు దేశమంతటా అమలు చేస్తున్నారు. ఎన్టీర్‌ కిలో రెండు రూపాయల బియ్యం పథకాన్ని ఎద్దేవా చేసిన వారున్నారు. ఆహార భద్రతా పధకం కింద ఇప్పుడు దేశమంతటా అమలు చేస్తున్నారు. ఒడిషా, తెలంగాణాలో ముందుగా రైతు బంధును ప్రకటిస్తే తరువాత నరేంద్రమోడీ కిసాన్‌ సమ్మాన్‌ పేరుతో దేశమంతటా అమలు చేస్తున్నారు. అందువలన ఈ రోజున ఉచితాలన్న వాటిని రేపు ఏం చేస్తారో చెప్పలేము. రాష్ట్రాల వనరులు తగ్గుతున్నట్లు ఉచితాలకు డబ్బు ఎక్కడి నుంచి తెస్తారంటూ కేంద్ర పెద్దలు గుండెలు బాదుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌ పత్రాల ప్రకారం 2014లో కేంద్ర ప్రభుత్వ అప్పు 55 లక్షల కోట్లు, మోడీ పదేండ్ల పాలన గడిచే నాటికి అది 169లక్షల కోట్లకు చేరనుంది. ఇంత అప్పు దేనికి చేసినట్లు, ఎక్కడ నుంచి తెచ్చిందీ, దేనికెంత ఖర్చు చేసిందీ మోడీ చెబుతారా ? దోమలు దూరే కంతలను చూసి గుండెలు బాదుకొనే వారికి ఏనుగులు పోతున్న మహాద్వారాలు కనిపించవా ? పార్లమెంటులో 2017జూలై 21 నక్షత్ర గుర్తులేని ప్రశ్న 938కి ఇచ్చిన సమాధానం ప్రకారం 2004-05 కస్టమ్స్‌, ఎక్సైజ్‌, కార్పొరేట్‌, వ్యక్తిగత పన్ను రాయితీల వలన ప్రభుత్వం కోల్పోయిన రాబడి లక్షా 95వేల కోట్ల రూపాయలు. తరువాత అది ఏటేటా పెరుగుతూ వచ్చింది నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత జనానికి అర్ధంగాకుండా లెక్కలను తారుమారు చేసి సరికొత్త పద్దతుల్లో దోచి పెట్టటం ప్రారంభించారు.2014-15లో కస్టమ్స్‌, ఎక్సైజ్‌ పన్నుల రాబడిలో కోల్పోయిన మొత్తం రు.4,35,756 కోట్లుగా పేర్కొనగా మరుసటి ఏడాది నాటకీయంగా ఆ మొత్తాలను రు.1,48,442 కోట్లుగా చెప్పారు. దీని అర్ధం ఖజానాకు మోడీ గారు రు.2,87,314 కోట్లు మిగిల్చినట్లా ? నిజానికి అంత మిగిల్చి ఉంటే పెట్రోలు, డీజిలు మీద 2014-15లో ఎక్సైజ్‌ పన్ను ఖాతా కింద కేంద్రానికి వచ్చిన మొత్తం రు.99,068 కోట్ల మొత్తాన్ని మరుసటి ఏడాదికి రు.1,78,447 కోట్లకు, తరువాత క్రమంగా పెంచి 2020-21నాటికి రు.3,72,970 కోట్లకు చేర్చారు. ఇంత మొత్తం భారాన్ని మోపటంతో పాటు గాస్‌ సబ్సిడీని భారీగా తగ్గించి ముష్టి విదిల్చినట్లుగా మార్చివేశారు. పైన పేర్కొన్నట్లుగా అప్పు తడిచి మోపెడైంది ? ఎవరికోసం బిజెపి పని చేస్తున్నట్లు ?