• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: AP NEWS

విశాఖ ఉక్కును ఎందుకు అమ్మాలనుకుంటున్నారు?

09 Tuesday Feb 2021

Posted by raomk in AP NEWS, BJP, Congress, CPI(M), Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Others, Political Parties

≈ Leave a comment

Tags

Narendra Modi, Vizag steel agitation, Vizag Steel Plant, Vizag Steel Plant Privatisation


డాక్టర్‌ కొల్లా రాజమోహన్‌

విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయాలని కేంద్ర ప్రభుత్వ క్యాబినెట్‌ నిర్ణయించింది. పెట్టుబడుల ఉపసంహరణద్వారా రూ.1.75 లక్షలకోట్ల ఆదాయాన్ని సమకూర్చుకోవాలనే లక్ష్యంతో కేంద్రప్రభుత్వం ప్రయత్నాలలో ఉంది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను నిరసిస్తూ ఆంధ్రప్రజలు ఉవ్వెత్తున తమ వ్యతిరేకతను వెల్లడించారు. దాదాపు అన్నిపార్టీలు,ప్రజాసంఘాలు విశాఖ ఉక్కు కర్మాగార ప్రైవేటీకరణను అడ్డుకొంటామని శపధాలు చేశాయి. ఆంధ్రుల హక్కైన విశాఖఉక్కును ప్రైవేటుపరం చేయాలని చూస్తే మరో ఉక్కుఉద్యమం తప్పదని హెచ్చరించాయి. అవసరమైతే ప్రాణత్యాగానికైనా సిద్ధమేనని నేతలు ప్రకటించారు. ”వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ లో ఒక్క అంగుళంకూడా ప్రయివేటుకి అమ్మనివ్వం, మా ఉక్కుజోలికొస్తే తొక్కేస్తాం, బీజేపీ మోడీ ఖబడ్దార్‌” అంటూ చేసిన నినాదాలతో విశాఖ నగరమంతా స్టీల్‌ ప్లాంట్‌ రక్షణ నినాదాలతో దద్దరిల్లింది.
అసలు ఎందుకు అమ్మేయాలనుకుంటున్నారు?. విశాఖస్టీల్‌ ప్లాంట్‌ నష్టాలలో ఉన్నందువలననా? లేక ప్రభుత్వ ఆస్ధిని అమ్మి సొమ్ము చేసుకోవటానికా? ప్లాంటు సరిగ్గా పని చేయటంలేదా? ప్రభుత్వం ఎంత పెట్టుబడి పెట్టింది? తిరిగి ప్రభుత్వానికి ఏమైనా వచ్చిందా? నష్టాలలో ఉన్నపుడు అమ్మకుండా ఎట్లా ఉంటారు అని కొందరు అంటున్నారు. నిజంగా నష్టాలలో ఉందా? నష్టాలలో ఉంటే వాటికి కారణాలు ఏమిటి?

1. విశాఖ స్టీల్‌ ప్లాంటు నష్టాలలో లేదు. ప్రతి సంవత్సరం నగదు లెక్కలు తీస్తే లాభాలలోనే వుంది. ప్లాంటు విస్తరణకు ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేదు. కార్మికుల కష్టంతో వచ్చిన లాభాలతోనూ, బ్యాంకు అప్పుల తోనూ ప్లాంటును విస్తరించారు. 63 లక్షల టన్నుల ఉత్పత్తిని సాధించారు. నష్టాలు ఉంటే వాటికి కారణం కేంద్ర ప్రభుత్వమే. 1971 సం. జనవరి 20 న శ్రీమతి ఇందిరాగాంధీ గారు బాలసముద్రం వద్ద పైలాన్‌ ను ప్రారంభించి విశాఖస్టీల్‌ ప్లాంట్‌ స్ధాపన నిర్ణయాన్ని ప్రకటించారు. ఏడు సంవత్సరాల పాటు నిధులు కేటాయించలేదు. 1978 లో కేంద్రంలోని జనతా ప్రభుత్వం విశాఖస్టీల్‌ కు రూ.1000కోట్లు కేటాయించి పనులు ప్రారంభించింది. 1979 జూన్‌ లో రష్యాతో ఒప్పందం కుదుర్చుకున్నారు. తరువాత 82 జనవరిలో మొదటి బ్లాస్ట్‌ ఫర్నెస్‌ , టౌన్‌ షిప్‌ శంకుస్ధాపనతో నిర్మాణం ఊపందుకుంది. 1992 ఆగస్టు 1 న ప్రధాని పీ.వీ.నరసింహరావు 32 లక్షల టన్నుల సామర్ధ్యంగల విశాఖ స్టీల్‌ ను జాతికి అంకితం చేశారు. తరువాత ్‌ ప్లాంటు విస్తరణకు ప్రభుత్వ పెట్టుబడులు ఆగిపోయాయి. బ్యాంకుల నుండి అప్పులను తీసుకుని స్టీల్‌ ప్లాంటు ను విస్తరించారు. ఉత్పత్తిని పెంచి కర్మాగారాన్ని లాభాలబాటలోకి తెచ్చారు. 2002 నుండి 2008 వరకు వరస లాభాలలోవుంది. 2004 సం.లో రూ. 2800 కోట్లు, రికార్డు స్ధాయి లాభాలను ఆరించింది. ప్లాంట్‌ విస్తరించితే , పూర్తి సామర్ధ్యాన్ని వినియోగించితే ఎక్కువ ఉక్కును ఉత్పత్తి చేయవచ్చని 2006 సం.లో ప్లాంట్‌ విస్తరణకు ఆనాటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ శంఖుస్ధాపనచేశారు.32లక్షల టన్నులనుండి 63 లక్షల టన్నులకు ఉత్పత్తిని సాధించారు. విశాఖస్టీల్‌ ప్లాంట్‌ సామర్ధ్యాన్ని గుర్తించి ”నవరత్న ” గా గుర్తించారు. ఏడాది గడవ కుండానే నవరత్నగా గుర్తించిన సంవత్సరం లోనే ప్లాంట్‌లో 10 శాతం వాటా అమ్మకానికి పెట్టారు.(2011 జనవరి )

కార్మికుల , ప్రజల ఆందోళన తరువాత కేంద్రం వెనక్కి తగ్గింది. వాటాలఉపసంహరణ ను ఆపేశామని కేంద్రం ప్రకటించింది. మరల 2014 సెప్టెంబర్‌ లో ప్లాంట్‌ అమ్మకానికి కేంద్రం తిరిగి ప్రతిపాదించింది. స్టీల్‌ ప్లాంట్‌ విలువను రూ. 4898 కోట్లుగా నిర్ణయించింది. 22 వేల ఎకరాల భూమిని, 63 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్ధ్యం గత అత్యంత ఆధునిక స్టీల్‌ ప్లాంట్‌ ను కారుచౌకగా అమ్మకానికి పెట్టారు. దక్షిణకొరియా కంపెనీ ”పోస్కో” కు కట్టబెట్టటానికి తయారయ్యారు. ఒక ఎకరం భూమి మార్కెట్‌ విలువ 10 కోట్ల రూ. పైననే వుంటే, 22 వేల ఎకరాల భూమి ఎంతఅవుతుందో తెలియదా? స్టీల్‌ ప్లాం ట్‌ నిర్మించటానికి ఎంత అవుతుందో తెలియదా? హిందూ పత్రిక అంచనా ప్రకారం 3.2 లక్షలకోట్లకన్నా తక్కువ వుండదు. ప్రభుత్వం ఇంత దివాళాతీసిందా? ఆస్ధులను అమ్ముకుని తింటానికి పూనుకున్నారా? లక్షల కోట్ల ప్రజల ఆస్ధిని అమ్ముకోవటానికేనా వీరికి అధికారం కట్టపెట్టింది.

2 )అన్ని స్టీల్‌ ప్లాంట్లకూ స్వంత ఇనప ఖనిజ గనులుంటాయి. ప్రభుత్వ సంస్ధ అయిన విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ కు స్వంత గనులను ప్రభుత్వం కేటాయించలేదు. ఫలితంగా రూ. 500, రవాణా ఖర్చులతో 1000 రూ. అయ్యే టన్ను ఇనప ఖనిజానికి 3 వేలు పెట్టి కొనుక్కోవలసివస్తోంది. ప్రతి టన్నుకీ అదనంగా 2వేలు ఖర్చు చేస్తున్నది. స్వంత గనులు వుంటే పరిశ్రమ నష్టాలలో పడే ప్రసక్తే లేదు. నాణ్యమైన స్టీల్‌ ను తక్కువ ధరకు ప్రజలకు అందిస్తుంది. ప్రైవేటు కంపెనీలైన టాటా, మిట్టల్‌ లాంటి వారికి ఇనప ఖనిజ గనులను కేటాయించారు. అసలు కర్మాగారమే లేని బ్రాహ్మణీ స్టీల్స్‌కు గనులను కేటాయించారు. గాలి జనార్ధనరెడ్డికి గనులను కేటాయించి ఇతరదేశాలకు ఇనపఖనిజం అమ్ముకోవటానికి అన్ని అనుమతులనూ ఇచ్చి దేశ సంపదను దోచిపెట్తున్నారు. విశాఖ స్టీల్‌ ప్లాంటుకు గనులను కేటాయించమని కార్మికులు నిరంతరం పోరు పెట్తున్నారు. అయినా తమ వర్గ మిత్రులైన పెద్దపెట్టుబడిదారులైన టాటా, మిట్టల్‌, గాలిజనార్ధనరెడ్డిగార్లకు, విదేశీ దోపిడీ మిత్రులైన పోస్కో లాంటి కంపెనీలకు సహజవనరైన ఇనప ఖనిజాన్ని దోచిపెట్తున్నారు. అదిగో నష్టం వచ్చిందికదాఅని అబద్ధాలు చెప్పి ప్లాంట్‌ అమ్మకానికి పెట్టి అదేమన్నవారిని బెదిరిస్తున్నారు.

విశాఖపట్నంలో ఉక్కు ఫ్యాక్టరీ స్ధాపిస్తామన్న కేంద్ర మంత్రి సీ.సుబ్రమణ్యం, ప్రధానమంత్రి లాల్‌ బహదూర్‌ శాస్త్రి వాగ్దానాలను, శాసనసభ ఏకగ్రీవ తీర్మానాల అమలును ఆంధ్రప్రజలు ప్రశ్నించారు. అమ తరావు నిరాహారదీక్షను పూర్తిగా బలపరిచారు. ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డిగారి మాటవిని అమ తరావు అర్దంతరంగా నిరాహారదీక్షను విరమించినా, తెలుగు ప్రజలు పోరాటాన్నికొనసాగించారు. విద్యార్ధుల, యువకుల, కార్మికుల ఐక్యపోరాటంవలననే విశాఖ ఉక్కు సాధ్యమయింది.

విశాఖఉక్కు సాధన లో తెలుగు ప్రజలు వీరోచితంగా పోరాడారు. ప్రజల న్యాయమైన పోరాటాన్ని ప్రభుత్వం పరమ కిరాతకంగా అణచివేయప్రయత్నించింది. 32 మంది తెలుగు బిడ్డలను అన్యాయంగా పిట్టలను కాల్చినట్లు కాల్చేశారు. 100 మందికి పైగా ప్రజలను తుపాకీ గుళ్ళతో గాయపరిచారు. లాఠీ ఛార్జీలతో శరీరాన్నికుళ్ళపొడిచారు. వేలాదిమందిని బాష్పవాయువు ప్రయోగంతో బాధలు పెట్టారు. వెయ్యి మందికి పైగాఅరెస్టులు చేశారు. క్రిమినల్‌ కేసులు పెట్టి సంవత్సరాలతరబడి కోర్టుల చుట్టూ తిప్పారు. సైనికులను విమానాలద్వారా విశాఖలో దించి కవాతులు చేశారు. నెలల తరబడి సైనికులు, పోలీసులు పరిపాలించారు. తీవ్ర నిర్బంధాన్ని సైతం ప్రజలు ఎదిరించారు. అయిదేళ్ళ తరువాత విశాఖస్టీల్‌ ప్లాంట్‌ ను ఇవ్వక తప్పలేదు.

ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ది లో ప్రజాపోరాటాలదే కీలక పాత్ర. భూమి కోసం, భూమి పై హక్కుకోసం సామాన్య ప్రజలు సాగించిన పోరాటాలు, జమీందారీ వ్యతిరేక పోరాటాలు, రుణ విముక్తికోసం రైతుయాత్రలూ, నైజాం వ్యతిరేక సాయుధపోరాటం, నాగార్జున సాగర్‌ కోసం, విశాఖఉక్కు-ఆంధ్రులహక్కు అంటూ సాగిన పోరాటాల ఫలితంగానే సాధించబడింది. పోరాట ఫలాలను, భూమిని, కంపెనీలను మింగేయటానికి కోర్పోరేట్‌ కంపెనీలు కాచుకు కూర్చున్నాయి. ద్రవ్యపెట్టుబడి దెయ్యంలాగా జడలువిప్పుకుని నాట్యంచేస్తున్నది.

ఈ ప్లాంట్‌ లో ఉత్పత్తి అయ్యే ఉక్కు కేవలం కోల్‌, ఐరన్‌ ఓర్‌ నుండి రావటంలేదు. తెలుగు ప్రజల రక్తమాంసాలు, స్వేదం, కన్నీరు దీనిలో ఇమిడివున్నాయి. 2006లో నాటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ఇలా అన్నారు. ”ఆధునీకరణ, పారిశ్రామీకరణ, అభివృద్ధి కోసం ప్రజలు పోరాడటం చాలా అరుదుగా వుంటుంది. కానీ ఇక్కడ ప్రజలు, కార్మికులు దాన్ని చేసి చూపారు.ఈ ప్లాంట్‌ ఇక్కడ నిర్మాణం అవ్వటానికి తమ ప్రాణాలను త్యాగం చేసినవారందరికీ నేను సెల్యూట్‌ చేస్తున్నాను. ఈ ప్లాంట్‌ లో ఉత్పత్తి అయ్యే ఉక్కు -కోల్‌, ఐరన్‌ ఓర్‌ నుండి రావటంలేదు. తెలుగు ప్రజల రక్తమాంసాలు, స్వేదం, కన్నీరు దీనిలో ఇమిడివున్నాయి. విశాఖపట్నం సముద్రతీరంలో వుంది.ప్రపంచానికి ఇది ద్వారాలు తెరుస్తున్నది.బ్రహ్మాండమైన పారిశ్రామిక కేంద్రంగా రూపుదిద్దుకుంటున్నది. స్టీల్‌ ప్లాంటు విస్తరణ విశాఖపట్నం అభివృద్ధికి మరింత తోడ్పడుతుంది.” అన్నారు .

పోర్టు సిటీగా పేరు పడిన విశాఖ స్టీల్‌ సిటీగా మారింది. మూలపెట్టుబడి రూ. 4898 కోట్లతో ప్రారంభించిన పరిశ్రమ ఈ రోజున 3.2 లక్షల కోట్లకు మించిన విలువతో, 22 వేలఎకరాల భూమిలో, ఆధునిక సాంకేతికతను స్వంతంచేసుకుని అత్యంత నాణ్యమైన ఉక్కును అందిస్తున్నది. రిజర్వేషన్లను అమలుపరుస్తూ 35 వేలమందికి ఉపాధి కల్పిస్తున్నది. వీరిపై ఆధారపడి రెండు లక్షల మంది ప్రజలు బతుకుతున్నారు. కేంద్రం పెట్టుబడి పెట్టిన రూ.4898 కోట్లకు గాను – పన్నులు, డివిడెండ్ల రూపంలో 40 వేల కోట్ల రూపాయలను విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ కేంద్రప్రభుత్వానికి సమకూర్చింది. రూ.7977 కోట్ల ను రాష్ట్ర ప్రభుత్వానికి పన్నుల రూపంలో చెల్లించింది. ప్లాంట్‌ విస్తరణ అప్పులకు వడ్డీ గా రూ.18,000 కోట్లు చెల్లించింది.

గత డిసెంబరు నెలలో వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ సాధించిన పనితీరు గమనిస్తే. వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ను లాభదాయకంగా నడపడం సాధ్యమేనని రుజువవుతోంది. 2020 డిసెంబరు నెలలో 98 శాతం ఉత్పత్తితో పని చేసి 2,100 కోట్ల రూపాయల టర్నోవర్‌ను, 170 కోట్ల రూపాయల నికర లాభాన్ని అర్జించింది.

అత్యంతవిలువైన ఈ కర్మాగారాన్ని కాజేయటానికి కోర్పోరేట్‌ కంపెనీలు గద్దల్లా కాచుకుని కూర్చున్నాయి. హారతి పళ్ళెంలో పెట్టి అందించటానికి ప్రభుత్వాలు సిద్దంగావున్నాయి. రక్తం ధారబోసి సాధించుకున్న విశాఖ ఉక్కును రక్షించుకునే బాధ్యత ఆంధ్రప్రజలందరిదీ. విద్యార్ధుల, యువకుల, కార్మికుల ఐక్యపోరాటంవలననే ఇది సాధ్యమవుతుంది..

వ్యాస రచయిత గుంటూరు జిల్లా నల్లమడ రైతు సంఘనేత, ఆనాటి విశాఖ ఉక్కు ఉద్యమ కార్యకర్త.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

వ్యవసాయ చట్టాలు : మోడీ గారూ రైతులు కల్మషం లేని వారు తప్ప కుయుక్తులు కాదు !

11 Monday Jan 2021

Posted by raomk in AP NEWS, Current Affairs, Economics, Farmers, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, STATES NEWS

≈ Leave a comment

Tags

Farmers agitations, India - 1991 Country economic memorandum, India-World Bank, indian farmers, Narendra Modi


ఎం కోటేశ్వరరావు


కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని కోరూతూ ప్రారంభమైన ఆందోళన సోమవారం నాటికి 48 రోజులు పూర్తి చేసుకుంది. ప్రభుత్వం చేసిన వ్యవసాయ చట్టాల అమలు నిలిపివేయాలని ఉన్నత న్యాయ స్ధానం అదే రోజు సలహాయిచ్చింది, లేనట్లయితే తాము ఒక నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని స్పష్టం చేసింది. అయితే చేసిన చట్టాల ప్రకారం రెండువేల మంది రైతులు ఒప్పందాలు చేసుకున్నారని, వాటిని నిలిపివేస్తే వారికి నష్టం జరుగుతుంది కనుక నిలిపివేయటం కుదరదని, నిలిపివేసే అధికారం కోర్టులకు లేదని కేంద్ర ప్రభుత్వ అటార్నీ జనరల్‌ కెకె వేణుగోపాల్‌ వాదించారు. అయితే 2018లో మహారాష్ట్ర చేసిన చట్టాన్ని నిలిపివేసిన విషయాన్ని సుప్రీం కోర్టు ఈ సందర్భంగా ఉటంకించింది.


సుప్రీం కోర్టు ముందు ఉన్న ఈ కేసు ఏ విధంగా పరిష్కారం అవుతుంది, కోర్టు హితవును నరేంద్రమోడీ సర్కార్‌ పట్టించుకుంటుందా ? ఒక వేళ ఏదో ఒక కారణాన్ని పేర్కొని ఆందోళనను విరమించాలని కోర్టు గనుక తీర్పు ఇస్తే రైతులు విరమించుకుంటారా ? పరిష్కారం ఏమిటి ? ఇలా అనేక ప్రశ్నలు మన ముందు ఉన్నాయి. ఏదైనా జరగవచ్చు. తమ ప్రభుత్వం చేసిన వ్యవసాయ చట్టాల మేళ్ల గురించి చెప్పేందుకు హర్యానా బిజెపి ప్రభుత్వం కర్నాల్‌ జిల్లా కైమ్లా గ్రామంలో ఆదివారం నాడు ఒక సభను ఏర్పాటు చేసింది.కిసాన్‌ పంచాయత్‌ పేరుతో ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ పాల్గొనాల్సిన ఆ సభ జరగకుండా రైతులు అడ్డుకున్నారు. ఆ గ్రామానికి వెళ్లే వారి మీద పోలీసులు నీటిఫిరంగులు, బాష్పవాయు ప్రయోగం జరిపి అడ్డుకోవాలని చూసినా రైతులు వెనక్కు తగ్గలేదు. సభా ప్రాంగణం, హెలిపాడ్‌ను స్వాధీనం చేసుకోవటంతో ముఖ్యమంత్రి తన కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు. తాను సవరించిన చట్టాలను ఎలాగైనా అమలు జరిపేందుకు కేంద్రం- వాటిని ఎలాగైనా సరే అడ్డుకోవాలని రైతులు పట్టుదలగా ఉన్నారని ఈ ఉదంతం వెల్లడిస్తున్నది.
కేంద్ర ప్రభుత్వం చర్చల పేరుతో జరుపుతున్న తతంగం ఈనెల 15వ తేదీన కూడా జరగనుంది. రైతులను రహదారుల మీద నుంచి తొలగించాలని సుప్రీం కోర్టులో పిటీషన్‌ దాఖలు చేసిన వ్యక్తి తాజాగా మరొక పిటీషన్‌ వేశాడు. ఢిల్లీలో షాహిన్‌బాగ్‌ ఆందోళన కారులను తొలగించేందుకు సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును రైతుల విషయంలో కూడా అమలు జరపాలని కోరాడు. సుప్రీం కోర్టు ఏమి చేయనుందనే ఆసక్తి సర్వత్రా నెలకొన్నది. ఇక్కడ న్యాయమూర్తులు, న్యాయవ్యవస్ధకు దురుద్ధేశ్యాలను అంటకట్టటం లేదు, ఈ రచయితకు అలాంటి ఆలోచనలు కూడా లేవు. అయితే గతంలో వివిధ ఉద్యమాల సమయంలో ఇలాంటి పిటీషన్లే దాఖలైనపుడు వివిధ కోర్టుల న్యాయమూర్తులు విచారణ సందర్భంగా ఎలాంటి వ్యాఖ్యలు చేసినప్పటికీ తీర్పుల విషయానికి వస్తే ఆందోళన చేస్తున్నవారికి వ్యతిరేకంగానే వచ్చాయి. రైతుల విషయంలో కూడా అదే పునరావృతం అవుతుందా, రైతులు అంగీకరిస్తారా, ప్రభుత్వం బలప్రయోగానికి పూనుకుంటుందా? అన్నవి ఊహాజనిత ప్రశ్నలే.


కేంద్ర ప్రభుత్వం ఎందుకింత మొండితనంతో వ్యవహరిస్తున్నది ? అని పదే పదే ప్రశ్నలు వేస్తున్నా సమాధానం రావటం లేదు. 1991లో ప్రారంభించిన ఆర్ధిక సంస్కరణల సమయంలో కేంద్ర ప్రభుత్వం ప్రపంచ బ్యాంకుతో కుదుర్చుకున్న ఒప్పందాలు లేదా బ్యాంకు నిర్దేశించిన షరతులు ఏమిటో, ఆ తరువాత గత ప్రభుత్వాలు నియమించిన కమిటీలు ఏమి చెప్పాయో తెలుసుకుంటే తప్ప మోడీ సర్కార్‌ మొండి పట్టుదలను అర్ధం చేసుకోలేము. దేశానికి కాంగ్రెస్‌నుంచి విముక్తి కలిగించామని పదే పదే చెప్పుకుంటుంది బిజెపి, కానీ దాని విధానాలను మరింత పట్టుదలతో అమలు జరుపుతోందన్నది నమ్మలేని నిజం.


ప్రపంచబ్యాంకుతో ఒప్పందాలు చేసుకున్న కేంద్ర ప్రభుత్వం, గతంలో చంద్రబాబు నాయుడి నాయకత్వంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కూడా బ్యాంకు పధకాలను తమవిగానే నమ్మించేందుకు నానా పాట్లు పడ్డాయి, పడుతున్నాయి. ఆక్రమంలోనే అందుకే పలు కమిటీలను వేసి సిఫార్సులను ఆహ్వానించాయి. వాటిలో అనేకం ఉంటాయి, కానీ తమకు అనుకూలమైన వాటినే తీసుకుంటారు, మిగిలిన వాటి గురించి అసలు ఏమాత్రం తెలియనట్లు అమాయకంగా ఫోజు పెడతారు.


2004 డిసెంబరు 13న నం. 164తో లోక్‌సభలో ఒక ప్రశ్న అడిగారు. భారత ఆహార సంస్దను పునర్వ్యస్ధీకరించేందుకు మెకెన్సీ కంపెనీని నియమించిందా ? అభిజిత్‌ సేన్‌ కమిటీ, హైదరాబాద్‌ అడ్మినిస్ట్రేటివ్‌ కాలేజీ నివేదికలు ఉన్నాయా ? వాటి ప్రధాన సిఫార్సులేమిటి అని దానిలో అడిగారు.ఈ నియామకాలన్నీ బిజెపి నేత అతల్‌ బిహారీ వాజ్‌పేయి ఏలుబడిలో జరిగాయి. ఆ ప్రశ్నలకు ప్రభుత్వం ఇచ్చిన సమాధానాల సారాంశం ఇలా ఉంది. ఆస్కీ నివేదికలో చేసిన ముఖ్యమైన సిఫార్సులు ఇలా ఉన్నాయి. లెవీ పద్దతిలోనే ఎఫ్‌సిఐ ధాన్యం కొనుగోళ్లు చేయాలి.నాణ్యతా ప్రమాణాలను సడలించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకూడదు, విపత్తు యాజమాన్య కార్యక్రమాలు ఎఫ్‌సిఐ పనిగా ఉండకూడదు. వివిధ పధకాలకు, ఆపద్దర్మ నిల్వలకు అవసరమయ్యే ఆహార ధాన్యాల మొత్తాలను మాత్రమే కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయాలి. రాష్ట్రాలు తమ స్వంత సేకరణ పద్దతులను అభివృద్ది చేసుకోవాలి, విత్త సంబంధ మద్దతు కోసమే కేంద్రంపై ఆధారపడాలి. ఆహార ధాన్యాలను ఆరుబయట నిల్వచేయటాన్ని నిలిపివేయాలి, నిల్వపద్దతులను నవీకరించాలి. గ్రామీణ అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం నిధులకు బదులు ఆహారధాన్యాలను కేటాయించాలి. ఆపద్దర్మ నిల్వలకు కేంద్ర ప్రభుత్వం గ్రాంటులు ఇవ్వాలి తప్ప బ్యాంకుల నుంచి రుణాలు తీసుకో కూడదు.కనీస మద్దతు ధరలకు కొనుగోలు, కేంద్ర జారీ ధరలు, ఎంత మొత్తం సేకరించాలనే అంశాలపై ఎఫ్‌సిఐ కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. ధాన్య సేకరణ, నిల్వ, పంపిణీలను వేరు చేయాలి. జాతీయ ఆపద్దర్మ నిల్వలను వ్యూహాత్మక ప్రాంతాలలో మాత్రమే ఎఫ్‌సిఐ నిర్వహించాలి.మార్కెట్లలో ఏజంట్ల కమిషన్‌ నిలిపివేయాలి. ధాన్య సేకరణకు, స్వంత సేకరణ ధరల నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వాలను ప్రోత్సహించాలి. వ్యవసాయాన్ని వివిధీకరించేందుకు ప్రత్యేకించి పంజాబ్‌, హర్యానాలలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. ఆహారధాన్యాల మార్కెట్లో ప్రయివేటు రంగం మరియు బహుళజాతి కార్పొరేషన్లను ప్రోత్సహించాలి.


దీర్ఘకాలిక ధాన్య విధాన రూపకల్పనకు సిఫార్సులు చేసేందుకు ఏర్పాటు చేసిన ఫ్రొఫెసర్‌ అభిజిత్‌ సేన్‌ కమిటీ చేసిన ముఖ్య సిఫార్సులేమిటో చూద్దాం. కనీస మద్దతు ధరలను అత్యంత సమర్ధవంతమైన ప్రాంతాలలో సి2 ఖర్చు ప్రాతిపదికన (అంటే కుటుంబసభ్యుల శ్రమ, స్వంత పెట్టుబడి, భూమి కౌలు) నిర్ణయించాలి. కనీస మద్దతు ధరల కింద కొనుగోలు చేసే వాటి మీద కేంద్ర ప్రభుత్వం గరిష్టంగా నాలుగుశాతం పన్నులు మరియు లెవీలు చెల్లించాలి. పంజాబ్‌, హర్యానా వంటి రాష్ట్రాల నుంచి ధాన్య సేకరణ నుంచి ఎఫ్‌సిఐ ఉపసంహరించుకొని తన మానవనరులను తూర్పు, మధ్య భారత్‌లో నియమించాలి. రాష్ట్రాలకు మరింత ఆకర్షణీయంగా, వికేంద్రీకరణ సేకరణను మెరుగుపరచాలి. ఎఫ్‌సిఐ ధాన్య సేకరణలో మెరుగైన సగటు ప్రమాణాలను పాటించాలి. రైస్‌ మిల్లరు లెవీ ఇచ్చే విధానాన్ని రద్దు చేయాలి.సి2 స్ధాయికి కనీస మద్దతు ధరలను నిర్ణయించటంతో పాటు రాష్ట్రాలకు పరిహార పాకేజ్‌లను అమలు జరపాలి.వాటితో పంటల వివిధీకరణను ప్రోత్సహించాలి. వేగంగా వాణిజ్య ప్రాతిపదికన నిర్ణయం తీసుకొనే విధంగా ఎఫ్‌సిఐ మారాల్సిన అవసరం ఉంది. ఆహారధాన్యాల ఎగుమతి పూర్తిగా ప్రయివేటుకే అప్పగించాలి. ఎగుమతులకు మాత్రమే సబ్సిడీలు ఇవ్వాలి. కనీస మద్దతు ధరలకు చట్టబద్దత కల్పించాలి, వాటిని సిఫార్సు చేసే సిఏసిపిని సాధికార చట్టబద్దమైన సంస్దగా మార్చాలి.

గతంలో ప్రపంచ షరతులలో భాగంగా అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడి సర్కార్‌ ముందుకు తెచ్చిన విద్యుత్‌ సంస్కరణలకు వ్యతిరేకంగా సాగిన పెద్ద ఉద్యమం గురించి తెలిసినదే.డిసెంబరు 18వ తేదీన ప్రధాని నరేంద్రమోడీ మధ్యప్రదేశ్‌ రైతులతో వీడియో కాన్పరెన్సుద్వారా మాట్లాడారు. ఇప్పుడు తీసుకున్న చర్యలు 25-30 సంవత్సరాల క్రితమే అమలు జరపాల్సినవి. తెల్లవారేసరికి ఇవి రాలేదు. ప్రతి ప్రభుత్వమూ వివిధ రాష్ట్ర ప్రభుత్వాలతో గత 20-22 సంవత్సరాలుగా విస్తృతంగా చర్చించినవే అని ప్రధాని చెప్పారు.పైన పేర్కొన్న అభిజిత్‌ సేన్‌, ఆస్కీ సిఫార్సులు ఇరవై సంవత్సరాల నాటి వాజ్‌పేయి సర్కార్‌ హయాంలోనివే.వాటిలో కొన్నింటిని ప్రభుత్వాలు అమలు జరిపాయి. ప్రధాని చెప్పిన 25-30 సంవత్సరాల విషయానికి వస్తే అంతకు ముందుకు అంటే 30 సంవత్సరాల నాటి ప్రపంచ బాంకు షరతులు ఏమిటో తెలుసుకుంటే ఆ మాటలకు అర్ధం తెలుస్తుంది. వ్యవసాయ చట్టాల బండారం మరింతగా బయటపడుతుంది.


ప్రపంచబ్యాంకు మన కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి, సమాచారం తీసుకొని పద్దెనిమిది నెలల సమయం తీసుకొని ఒక నివేదికను రూపొందించింది. ఇండియా 1991 కంట్రీ ఎకమిక్‌ మెమోరాండం( రిపోర్ట్‌ నం.9412 ఇండియా) పేరుతో 1991 ఆగస్టు 23న రెండు సంపుటాలుగా తయారు చేశారు. దాన్ని రెండు దశాబ్దాలు రహస్యంగా ఉంచి 2010 జూన్‌ 12న బహిర్గతం చేశారు. వీటిలో ఉన్న అన్ని అంశాలను ఇక్కడ ఉటంకించటం సాధ్యం కాదు కనుక ముఖ్యమైన సిఫార్సుల గురించే చూద్దాం. వాటి నేపధ్యంలోనే గత మూడు దశాబ్దాలలో కేంద్రంలో, రాష్ట్రాలలో ఏ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నా అనేక చర్యలు అమలు జరిపి ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్‌ను సంతృప్తి పరచారు. ఇప్పుడు నరేంద్రమోడీ గారు అదే సంతుష్టీకరణపనిలో ఉన్నారు. కరోనా కనుక ఎవరూ వ్యతిరేకంగా ఆందోళన చేసేందుకు ముందుకు రారనే అంచనాతో గతేడాది జూన్‌లో ఆర్డినెన్స్‌, సెప్టెంబరులో పార్లమెంట్‌లో చర్చలేకుండా బిల్లులు, వెంటనే రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయించి చూశారా నేను ఎంత వేగంగా పని చేస్తానో అని దేశ-విదేశీ కార్పొరేట్ల ముందు రొమ్ము విరుచుకున్నారు.

1991లో అమలు ప్రారంభించిన నూతన ఆర్ధిక విధానాలు పారిశ్రామిక రంగంలో తీవ్ర సమస్యలకు దారి తీయటంతో మిగిలిన సిఫార్సుల అమలుకు తటపటాయించటం, ఒక్కొక్కదాన్ని అమలు జరుపుతున్నారు తప్ప వెనక్కు తగ్గటం లేదు. వాటిలో భాగమే ప్రయివేటీకరణ. ముందు నష్టాలు వచ్చే కంపెనీలని జనానికి చెప్పి సరే అనిపించారు. అవి పూర్తయిన తరువాత ప్రభుత్వాలు పాలనా వ్యవహారాలు చూడాలే తప్ప వ్యాపారాలు చేయకూడదు అనే సన్నాయి నొక్కులతో లాభాలు వచ్చేవాటిని ఇప్పుడు వదిలించుకోచూస్తున్నారు. వ్యవసాయ రంగాన్ని ఇప్పటికే కొంత మేరకు విదేశీ-స్వదేశీ కార్పొరేట్లకు తెరిచారు. ఒకప్పుడు నూతన విత్తనాలను రూపొందించటం, ఉత్పత్తి ప్రభుత్వరంగ సంస్ధలే చేసేవి. ఇప్పుడు ఎక్కడా వాటి ఊసేలేకుండా చేశారు. తాజా వ్యవసాయ చట్టాలతో మార్కెట్‌ను మరింతగా తెరిచేందుకు, ప్రభుత్వం బాధ్యతల నుంచి తప్పుకొనేందుకు ప్రాతిపాదిక వేశారు.


మన దేశీ కార్పొరేట్‌లు, విదేశీ కార్పొరేట్‌ కంపెనీలలో వివిధ రూపాలలో అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడులు, ప్రత్యక్ష పెట్టుబడులు వస్తున్నాయి. వాటి అవసరాలకు అనుగుణ్యంగా ప్రభుత్వాలు మన మార్కెట్లను తెరుస్తున్నాయి. వాటి ద్వారా ఉపాధి రాదా, దేశానికి ప్రయోజనం కలగదా అనే వాదనలు ముందుకు వస్తున్నాయి. ఒకసారి అమలు జరిపి చూస్తే పోలా అంటున్నారు. కరవులు, తుపాన్ల వంటి ప్రకృతి వైపరీత్యాల నుంచి కూడా లబ్ది కలిగే వారు ఉన్నారు. అంతమాత్రాన వాటిని కోరుకుంటామా ? నిప్పును ముట్టుకున్నా, నీళ్లలో మునిగినా, కొండ మీద నుంచి దూకినా చస్తామని తెలిసినా ఒకసారి ఎలా ఉంటుందో చూస్తే పోలా అని ఎవరైనా అంటే ఆపని చేస్తారా ? విదేశీ పెట్టుబడులు, ద్రవ్యపెట్టుబడులు పెట్టేవారికి – వినియోగించుకొనే దేశాలకూ లబ్ది చేకూరే విధంగా ఉంటే ఎవరికీ వ్యతిరేకత లేదు. స్ధూలంగా చెప్పాలంటే చైనాలో జరుగుతున్నది అదే. మన దేశంలో సామాన్యుల కంటే ధనికులు, కార్పొరేట్లే బాగుపడుతున్నారు. సంపదతారతమ్యాలు పెరుగుతున్నాయి. అందుకే వ్యతిరేకత.ఇంతకీ ప్రపంచబ్యాంకు వ్యవసాయరంగం గురించి ఆదేశించిన లేదా సూచించిన సిఫార్సులేమిటి ?


అవి మూడు రకాలు. తక్షణం చేపట్టవలసినవి, మధ్యంతర, దీర్ఘకాలిక చర్యలుగా సూచించారు.1ఏ). వ్యవసాయానికి ఉన్న – ఎరువులు, నీటి, విద్యుత్‌, బ్యాంకురుణాల సబ్సిడీలన్నింటినీ రద్దు చేయాలి. విదేశీవాణిజ్యానికి వ్యవసాయ మార్కెట్‌ను తెరవాలి. నాలుగు సంవత్సరాల వ్యవధిలో ఎరువుల సబ్సిడీలను ఎత్తివేయాలి.( అనివార్యమైన స్దితిలో కేంద్ర ప్రభుత్వం 1991లో జిడిపిలో 0.85శాతంగా ఉన్న ఎరువుల సబ్సిడీని 2008-09నాటికి 1.52శాతానికి పెంచాల్సి వచ్చింది. ఆ తరువాత చూస్తే ” రైతు బంధు ” నరేంద్రమోడీ గారి ఏలుబడి ప్రారంభంలో 2014నాటికి 0.6శాతానికి తగ్గింది.2016లో 0.5, తరువాత 2019వరకు 0.4శాతానికి పడిపోయింది. తరువాత సంవత్సరం కూడా కేటాయింపుల మొత్తం పెరగని కారణంగా జిడిపిలో శాతం ఇంకా తగ్గిపోతుంది తప్ప పెరగదు.)
బి) ప్రాధాన్యతా రంగానికి నిర్ణీత శాతాలలో రుణాలు ఇవ్వాలనే నిబంధన కింద వ్యవసాయానికి ఇచ్చే కోటాను ఎత్తివేయాలి. సబ్సిడీలను ఎత్తివేసి వడ్డీ రేటు పెంచాలి.( తాజాగా కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్‌ సంస్దలు బ్యాంకులను ఏర్పాటు చేసుకొనేందుకు అవకాశం ఇచ్చింది కనుక, ఇప్పటికే ఉన్న ప్రయివేటు బ్యాంకులకు, వాటికి ప్రాధాన్యతా రంగాలు ఉండవు)
సి) సాగు నీరు, పశువైద్యం వంటి విస్తరణ సేవలకు వసూలు చేస్తున్న చార్జీల మొత్తాలను పెంచాలి. వీటిలో ప్రయివేటు రంగానికి పెద్దపీట వేయాలి, పెట్టుబడులకు అవకాశం ఇవ్వాలి.
డి) వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతులకు సంబంధించి ఉన్న రక్షణలన్నింటినీ తొలగించాలి. తొలిచర్యగా ఖాద్యతైలాల గింజలను అనుమతించాలి. వ్యవసాయ ఎగుమతులపై ఉన్న ఆంక్షలను తొలగించాలి.
ఇ) ప్రయివేటు పరిశోధనా సంస్ధల విత్తనాలను ప్రోత్సహించాలి, ప్రయివేటు మార్కెటింగ్‌పై నిబంధనలను తొలగించాలి, విత్తన సబ్సిడీలను ఎత్తివేయాలి.
ఎఫ్‌) వ్యవసాయేతర చార్జీల స్ధాయికి వ్యవసాయ విద్యుత్‌ ఛార్జీలను కూడా పెంచాలి.
2. మొత్తం ఆహార సేకరణ మరియు ప్రజాపంపిణీ వ్యవస్ధను రద్దు చేయాలి.
ఏ) భారత ఆహార సంస్ద ప్రత్యక్ష పాత్రను తగ్గించాలి. కొనుగోలు, రవాణా, ధాన్య నిల్వ వంటి పనులన్నీ లైసన్సు ఉన్న ప్రయివేటు వారి ద్వారా చేపట్టాలి. రైతులు నిల్వ చేస్తే ప్రోత్సాహకాలు ఇవ్వాలి.
బి)ఆపద్దర్మ నిల్వలను కొద్దిగా నిర్వహించాలి. కొరత వచ్చినపుడు ప్రపంచ మార్కెట్లవైపు చూడాలి. విదేశీమారక ద్రవ్యం ఎంత ఉందో చూసుకొని కొరత ఉన్న సంవత్సరాలలో బయటి నుంచి కొనుగోలు చేయాలి.
సి) మద్దతు ధరల కార్యక్రమాలను ప్రభుత్వం సేకరణకు అమలు చేయకూడదు.
డి) అధికారయుతంగా పేదలుగా గుర్తించిన వారికి మాత్రమే ఆహార సబ్సిడీలు ఇవ్వాలి. ప్రయివేటు రంగం ద్వారా పంపిణీ పద్దతిని కూడా వినియోగించాలి.

పైన పేర్కొన్నవి మూడు దశాబ్దాల నాటి ప్రపంచ బ్యాంకు ఆదేశాలు. అధికారంలో ఎవరున్నా వాటిని అమలు జరపటం తప్ప వెనక్కు పోవటం లేదు. ఆ తరువాత ఎన్ని కమిటీలు వేసినా కొన్ని సిఫార్సులు అదనంగా చేయటం తప్ప ప్రపంచ బ్యాంకు అజెండా పరిధిలోనే ఉన్నాయి. యుపిఏ హయాంలో అన్ని సంస్కరణలూ చేయలేదనే కోపంతో కార్పొరేట్‌ శక్తులు గుజరాత్‌లో మారణకాండ సమయంలో నరేంద్రమోడీ వ్యవహరించిన తీరేమిటో తెలుసు గనుక మోడీ వెనుక సమీకృతం అయ్యాయి. ఇప్పుడు ఆచరణ చూస్తున్నాము. ఇక్కడ మోడీగారు లేదా బిజెపి, కేంద్రప్రభుత్వ చర్యలను గుడ్డిగా బలపరుస్తున్న ప్రాంతీయ పార్టీలు, ప్రభుత్వాలు గుర్తించాల్సింది ఒక్కటే. భారత రైతు ఉన్నది ఉన్నట్లు సూటిగా మాట్లాడే కల్మషం, కాపట్యం లేని వ్యక్తి కావచ్చుగానీ ఆమాయకుడు కాదు ! జిమ్మిక్కులు ప్రదర్శిస్తే చెల్లవు !!

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

మీరు ఎటు వైపో తేల్చుకోండి

10 Sunday Jan 2021

Posted by raomk in AP NEWS, Current Affairs, Economics, Farmers, History, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

Farmers agitations, Farmers Delhi agitation, indian farmers

డాక్టర్ కొల్లా రాజమోహన్

మూడు వ్యవసాయ చట్టాలను రద్దుచేయమని సెప్టెంబరునుండి భారత దేశ రైతులు ఆందోళన చేస్తున్నారు. భారత దేశ రైతు ఉద్యమ చరిత్రలో దేశరాజధానిని లక్షలాదిమంది రైతులు ముట్టడించటం ఇదే ప్రధమం.

ఢిల్లీకి వచ్చి ధర్నాచేయాలనుకున్న రైతులను ఢిల్లీసరిహద్దులలోనే సైన్యం ఆపేసింది. ఢిల్లీలోకి ప్రవేశించకుండా పెద్ద బండరాళ్ళను రోడ్డుకి అడ్డంగా పెట్టారు. వాహనాలు ముందుకు వెళ్ళకుండా  రోడ్డ్డుకు గుంటలు తవ్వారు. ఇనుప కంచెలు వేశారు. బారికేడ్లు నిర్మించారు. బాష్పవాయువును  ప్రయోగించారు. చలిలో వణుకుతున్నప్రజలపై వాటర్ గన్స్ తో నీళ్ళను కొట్టారు. అయినా రైతులు వెనుకాడలేదు. ఎన్ని కష్టాలనైనా భరించి ఎన్నాళ్ళైనా వుండి తాడోపెడో తేల్చుకుంటామని ఏకైక దీక్షతో ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు.

 దేశానికి అన్నంపెట్టే రైతులకు రోడ్డే ఇల్లయింది. ప్రభుత్వం -రైతుల మధ్య చర్చలు విఫలం కావటంతో, దశలవారీగా ఆందోళనను ఐక్యంగా కొనసాగిస్తున్నారు. ఎవరైనా కలుస్తారేమో కానీ రైతులు మాత్రం ఐక్యం కారు అనే మాటను వమ్ము చేశారు . 500 రైతు సంఘాలు ఐక్యమయ్యాయి. లక్షలాదిమంది రైతులు రోడ్డెక్కారు. ఇదొక అపూర్వ  సంఘటన. ఈ ఉద్యమం భారత దేశ ప్రజలకు ఒక సవాలు విసిరింది. మీరు ఎటువైపో తేల్చకోమంది.

విశాల ప్రజల ప్రయోజనాలా లేక కొద్దిమంది ప్రయోజనాలా ,రైతు ప్రయోజనాలా లేక కార్పోరేటు కంపెననీల ప్రయోజనాలా తేల్చుకోమని రైతు ఉద్యమం కోరింది. ఢిల్లీ సరిహద్దు ప్రాంతాలన్నీ  ప్రస్తుతం అన్నదాతల నిరసనల కేంద్రాలయ్యాయి. ఢిల్లీ నగర ప్రవేశమార్గాలయిన సింఘూ. టిక్రీ,నోయిడా, పల్వల్ ప్రాంతాలలో లక్షలాదిమంది రైతాంగం భైఠాయించారు, ప్రపంచ ప్రసిధ వాల్ స్ట్రీట్ పోరాటాన్ని మించిపోయింది.

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో అలుపెరగకుండా రైతులు సాగిస్తున్న ఉద్యమం  నెలరోజులకు మించింది. కాగా, ఈ చట్టాలు రద్దును కోరుతూ ఏడో దఫాకూడా  చర్చలు జరిగాయి. కేంద్ర మంత్రులతో రైతు సంఘాల నేతలు భేటీ అయ్యారు. కాగా, చట్టాల రద్దు చేయాలని రైతు సంఘాలన్నీ బలంగా కోరుతున్నారు. తమ ప్రతిపాదనలను అంగీకరిస్తేనే ఆందోళనలను విరమించుకుంటామని అన్నదాతలు చెబుతున్నారు. ప్రభుత్వం కూడా అంతే పట్టుదలగా ఉన్నది. చర్చలకు లాజిక్, రీజన్ తో రావాలని ప్రధాన మంత్రి చెబుతున్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ నేతృత్వంలోని కేంద్ర మంత్రుల బృందం…రైతులతో చర్చలు సాగిస్తోంది. కాగా, ఈ . 40 రైతు సంఘాల నేతలతో తోమర్‌ పాటు పీయూష్‌ గోయల్‌, సోం ప్రకాశ్‌ చర్చిస్తున్నారు. కాగా, చట్టాల రద్దు, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని రైతు సంఘాలు ఒకే మాటపై నిల్చున్నాయి.,ఢిల్లీ చుట్టుపక్కల గడ్డి కాల్చటం పై ఆర్డినెస్స్‌, 2020 విద్యుత్‌బిల్లు సవరణ,ఈ రెండు అంశాలపై ప్రభుత్వం సానుకూలం గా స్పందించింది. చర్చలు సాఫీగా జరుగుతున్నాయనే ప్రచారం చేస్తున్నారు. అయితే ముఖ్యంగా రైతులు కోరుతున్న వ్యవసాయ చట్టాల రద్దు సమస్యపై ప్రభుత్వం నోరు మెదపడం లేదు.

రైతు పోరాటాన్ని ప్రత్యక్షంగా చూసి ఉద్యమంలో భాగమవుదామని బయల్దేరాం.

ఈ నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ నుండి రైతు సంఘాల ప్రతినిధులు 12 మంది ఢిల్లీ బయల్దేరాము. ఢిల్లీ సరిహద్దులలో నవంబరు 26 నుండి రైతు పోరాటాన్ని ప్రత్యక్షంగా చూసి ఉద్యమంలో భాగ మయి, సంఘీభావం తెలపాలని బయలుదేరిన మా ప్రతినిధి వర్గానికి కొంతమంది రైతులు వీడ్కోలు పలికారు. మరో ఇద్దరు ఢిల్లీ లో కలిశారు. చారిత్రాత్మక రైతు ఉద్యమంలో భాగమయి పోరాడుతున్న రైతులను ఆంధ్ర ప్రదేష్ కు చెందిన 12 మంది రైతుసంఘాల ప్రతినిధులు మనసారా అభినందించారు. స్ఫూర్తి పొందారు.

 డిసెంబరు 27 ఉదయం ఢిల్లీ చేరిన వెంటనే ఆల్ ఇండియా కిసాన్ సంఘర్ష్ కోఆర్డినేషన్ కమిటీ సభ్యులైన హన్నన్ మొల్లా , ఆల్ ఇండియా కిసాన్ సభ నాయకులు అశోక్ ధావలే లను, విజూ కృష్ణన్, ప్రసాద్ , వ్యవసాయ కార్మిక నాయకులు వెంకట్ ,సునీల్ చోప్రా గారిని కిసాన్ సభ కార్యాలయంలో కలిశాం. వారు ఢిల్లీ సరిహద్దులలో జరుగుతున్న రైతుల పోరాటాన్ని వివరించారు. ఈ పోరాటం ఈ శతాబ్దంలో అతి ముఖ్యమైన పోరాటం అన్నారు. స్వాతంత్ర పోరాటం తర్వాత ఇంత పెద్ద పోరాటం లేదన్నారు. ఈ పోరాటాన్ని విజయవంతం చేయవలసిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ఈ పోరాటం పరాజయం చెందితే రైతాంగ వ్యతిరేక శక్తులు ముఖ్యంగా కార్పొరేట్ శక్తులు విజృంభిస్తాయి అన్నారు. ఈ రైతు ఉద్యమానికి సంఘీభావం తెలపటానికి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన రైతు ప్రతినిధులకు, సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. పోరాటం ఉధృతం చేయటానికి అందరూ కృషి చేయాలని కోరారు.

అక్కడ నుండి ఢిల్లీ సింఘు సరిహద్దు ప్రాంతానికి వెళ్ళాం. మాతో పాటుగావ్యవసాయ కార్మిక నాయకులు వెంకట్ గారు, ఢిల్లీలోని తెలుగు పత్రికా విలేకరులు వచ్చారు. వారి సహాయం విలువైనది. ఢిల్లీ లో ఉన్నన్ని రోజులూ మాకు బస కల్పించి వాహన సదుపాయాలు కల్పించిన ఉద్యమ మిత్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు.

పోరాట ప్రాంతానికి పయనం 

శోభనాద్రీశ్వరరావు గారి ఆరోగ్యం దృష్ట్యా పోరాట ప్రాంతానికి వారు వెళ్ళటం కష్టం అన్నారు. అయినా శోభనాద్రీశ్వరరావు గారు అంగీకరించకపోవడంతో వారితో పాటు అందరూ కలిసి వెళ్ళాం. పోలీసు సరిహద్దులను దాటుకొని పోరాట ప్రాంతానికి చేరుకున్నాం. అక్కడ చేరిన ప్రజల సమూహాన్ని చూస్తే మాకు ఆశ్చర్యంతో కూడిన ఆనందం వేసింది. అక్కడున్న వేదికకు చేరడానికి చాలా కష్టమైంది. ప్రజా సమూహం మధ్య దారి చేసుకుంటూ పదండి ముందుకు అనుకుంటూనడిచాము.శోభనాద్రీశ్వరరావు గారు నడవటం చాలా కష్టమైంది. అయినా ఆయన పట్టుదలతో ముందుకు సాగాడు. అంతలో టాపు లేని చెక్క రిక్షా ఒకటి అందుబాటులోకి వచ్చింది. ఆ రిక్షా పై వారిని కూర్చోబెట్టి కొంత దూరం నడిచాం. ఆ రిక్షాకూడా ఇకపై ముందుకు వెళ్లే పరిస్థితి కనిపించలేదు. అంతలో కొంతమంది మిత్రులు ఒక మోటార్ సైకిల్ ని తీసుకొచ్చారు.. ఆ మోటార్ సైకిల్ పై కూర్చోబెట్టి కొంత దూరం నడిచాం.

మోటార్ సైకిల్ ముందుకు వెళ్ళటం మరీ కష్టమైంది. ప్రజల తోపులాటలో కింద పడే పరిస్థితి వచ్చింది.

ఎలాగోలా వేదిక వద్దకు చేరుకున్నాం.  మాలో కొంతమందిని వేదిక పైకి తీసుకుని వెళ్లారు. వేదికపై నుండి కొంతమంది మహిళలు ఉపన్యాసాలు చేస్తున్నారు. వేదిక ముందు, చూపు ఆనినంతవరకుతవరకు ప్రజలు కూర్చుని ఉన్నారు. ఎక్కువ  మంది మహిళలు పాల్గొన్నారు.

వేదిక వెనుక ఉన్న గుడారంలో ప్రెస్ మీట్ లను ఏర్పాటు చేశారు. అక్కడ ఎక్కువ మంది యువకులు ఏర్పాట్లన్నీ చూస్తున్నారు. సినిమా నటులు హరిబీత్ సింఘ్, , ప్రసిద్ధ గాయకులు, ప్రసిధ క్రీడాకారులు మంగీ, జిలానీ జోహాల్ వంటివారు పత్రికా విలేకరుల సమావేశాలు జరిపి ఉద్యమానికి సంఘీభావం ప్రకటిస్తున్నారు. 

ప్రెస్ మీట్ లో శోభనాద్రీశ్వరరావు గారు రామకృష్ణ గారు రైతు ఉద్యమం గురించి వివరంగా మాట్లాడారు. టీవీలు ప్రత్యక్ష ప్రసారం చేశాయి. పత్రికా విలేఖరులు అత్యుత్సాహంతో తోపులాడుకుంటూ వార్తలు సేకరించారు.బిస్కెట్లు, రస్కులు, మంచినీటి సీసాలు , టీ, నిరంతరాయంగా సరఫరా జరుగుతుంది.  

కొన్ని వారాలుగా పోరాడుతున్నరైతు ఉద్యమానికి ,రు.10 లక్షల ఆంధ్ర ప్రజల ఆర్థిక సహాయాన్ని శ్రీ వడ్డే శోభనాద్రీశివరరావు గారి చేతుల మీదుగా ఎఐకేఎస్ సిసి నేత హన్నన్ మొల్లా, సంయుక్త కిసాన్ మోర్చానేత దర్శన్పాల్ లకు చెరొక రూ.ఐదు లక్షలనగదును అందించారు.

రోడ్ పై ఎలా బతుకుతున్నారు?

వేదిక నుండి బయటకు వచ్చిన తర్వాత కొంత దూరం రోడ్డు మీద నడిచాం. కనిపించినంత వరకు లక్షలాదిమంది ప్రజా సమూహం కనబడుతుంది.వారిలో పిల్లల వద్ద నుండి వృద్ధుల వరకు ఉన్నారు. ఒక దృఢమైన నిశ్చయం వారి ముఖాలలో కనబడుతుంది. తీవ్రమైన చలి లో, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ గుడారాలలో నివసించుచున్న రైతుల పోరాటపటిమను భారత ప్రజలందరూ స్పూర్తిగా తీసుకోవాలని అనుకున్నాం.. ఎవరితో మాట్లాడి నా  రెండు విషయాలపై స్పష్టత కనిపిస్తున్నది. నూతన వ్యవసాయ చట్టాలు రైతులప్రయోజనాలకు వ్యతిరేకమయినవనీ, కార్పోరేటు కంపెనీలకు అనుకూలమయినవనీ  చాలా స్పష్టంగా చెప్తున్నారు. ప్రజలందరూ చైతన్యంతో స్పషంగా కార్పోరేట్  రైతు  వ్యతిరేక చట్టాలను రద్దు చేసేవరకు పోరాడాలనటం వారి చైతన్యస్ధాయికి నిదర్శనం. ఇక్కడ ఎన్నాళ్ళు ఈ విధంగా ఉంటారు అని అడిగితే రైతు వ్యతిరేక చట్టాలను రద్దు అయిందాకా అని అందరూ చెప్తున్నారు. మీరిక్కడ ఉంటే వ్యవసాయం ఎలా అని అడిగాను. నిజమే. పొలాలలో పనులున్నాయి. ఇంటివద్ద పశువులున్నాయి. నా భార్య బాధ్యతగా పని భారాన్ని భరిస్తున్నది. వ్యవసాయచట్టాలను రధ్దు చేసుకుని ఇంటికి రమ్మని భరోసా ఇచ్చిందన్నారు. ఊరిలో ఉన్న వాళ్ళు మా వ్యవసాయాన్ని కూడా చూస్తున్నారని ఆ రైతు చెప్పాడు. కార్పొరేటు అనుకూల చట్టాలు రద్దయిందాక ఇంటికి రావద్దు అని చెప్తున్నారు. ప్రభుత్వం పోలీసులను సైన్యాన్ని ఉపయోగించి ఈ రైతాంగ ఉద్యమాన్ని అణచి వేస్తుందేమో అని అనుమానం వ్యక్తం చేశాము. మేము ఎటువంటి పోరాటానికైనా సిద్ధం. మాకు ఆదర్శం భగత్ సింగ్ అన్నారు.

వారి జీవన విధానాన్ని పరిశీలించాము. ట్రాక్టర్లు, ట్రాలీలు వాడకం చాలా ఎక్కువగా ఉంది, ట్రాక్టర్ ట్రాలీ లో కింద గడ్డి పరిచి దానిపై పడుకుంటున్నారు. కొన్నిచోట్ల పైన ప్లాస్టిక్ షీట్లు తో గుడారాలను ఏర్పాటు చేసుకున్నారు. కిందనే గడ్డి వేసుకొని దానిపై పడుకుంటున్నారు.

దాదాపు యాభై కిలోమీటర్లు  గుడారాలు వేసుకొని నివసిస్తున్నారు. ముందు వచ్చిన వారు ఢిల్లీ నగరం దగ్గరగా రోడ్డుపై వుంటే, వెనక వచ్చినవారు వారి పక్కన గుడారాలు వేసుకుని నిరసన తెలియచేస్తూ జీవిస్తున్నారు. సింఘూప్రాంతంలో ఉంటే వెనక వచ్చిన వారు 50 కిలోమీటర్ల దూరంలో టెంట్ వేసుకుని ఉంటున్నారు. దేశప్రజలంతా ఈ రైతాంగపోరాటానికి  అండగా వుంటారన్నారు.

చలిని తట్టుకోవటానికి గుడారాలముందు చలిమంటలు వేసుకుంటున్నారు .ఎముకలు కొరికే చలిలో కొంతమంది చన్నీళ్ల స్నానం చేస్తున్నారు.

వర్షం నీళ్ళు పడటం వల్ల దుప్పట్లు, బట్టలు, తడిసిపోయాయని నిరసన వ్యక్తం చేసిన రైతు వీర్‌పాల్ సింగ్ తెలిపారు.  “వర్షపు నీరుతో కట్టెలు తడిసినందున మేము ఆహారాన్ని వండడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము.  మాకు ఎల్‌పిజి సిలిండర్ ఉంది, కానీ ఇక్కడ ప్రతిఒక్కరికీ అది లేదు, ”అన్నారాయన.

లంగరు సేవ

ఎక్కడికక్కడే  వంటలు చేసుకుంటున్నారు. వేలాది మంది భోజనాలు చేస్తున్నారు. లోటు లేదు.వంట చేసేవారికి కొదవ లేదు. గ్రామంలోని రైతులు కూరగాయలు,పళ్ళు , వంట సరుకులు తీసుకుని వస్తున్నారు. నెలలపాటు సరిపోయే ఆహారాన్ని వెంట తెచ్చుకున్నారు. వంట మనుషులు, వడ్డించే వారు ప్రత్యేకంగా ఎవరూ లేరు. రైతులతో పాటుగా చూడటానికి వచ్చిన విద్యార్ధులు, ఉద్యోగస్తులు అందరూ పని చేస్తున్నారు. వెల్లుల్లిపాయలు వలవటం దగ్గరనుండి, కూరగాయలు కోయటం వరకూ అన్ని పనులూ చేస్తున్నారు. పెద్దవాళ్లు కూడా నడుము వంచి వంటలు చేస్తున్నారు. వండేవారు, వడ్డించే వారు అంతా సేవకులే. సేవే పరమావధి గా భావిస్తున్న పంజాబీ ప్రజలు లంగర్ సేవ ధర్మంగా ఆచరిస్తున్నారు.లక్షలాది మంది ప్రజలకు భోజనం సరఫరా చేయడం చాలా కష్టమైన పని. లంగర్ సేవ ఆధారంగా ఈ సమస్యలు ఆందోళనకారులు పరిష్కరించారు. చూడటానికి పోయిన వారందరికీ కూడా భోజనాలను ఏర్పాటు చేస్తున్నారు. సేవా దృక్పథంతో రోటి మేకర్ల ను కూడా తీసుకొచ్చి ప్రేమతో బహుమానంగా కొంతమంది ఇచ్చారు. అయినా చేతుల తోనే సులువుగా రొట్టెలు చేస్తున్నారు. రొట్టెలు పెద్ద పెద్ద పెనములపై కాలుస్తున్నారు.

కొన్ని ప్రాంతాలలో జిమ్‌లు, లైబ్రరీలు, కమ్యూనిటీ సెంటర్లు పని చేస్తున్నాయి. పుస్తకాలు ప్రముఖంగా ప్రదర్శిస్తున్నారు. భగత్సింగ్ పుస్తకాలు , ఫొటోలు అన్నిచోట్లా ప్రదర్శిస్తున్నారు.

‘ట్రాలీటైమ్‌’ అనే వార్తా పత్రిక కూడా వస్తోంది. రైతుల ఉద్యమం కోసమే పుట్టిన ఆ పత్రికలో ఆందోళనకు సంబంధించిన సమాచారం ఇస్తున్నారు. ఉద్యమం కోసమే పుట్టిన ఆ పత్రికలో అనేకమంది రాసిన కథనాలు, వ్యాసాలు ఉన్నాయి. ఆందోళనకు సంబంధించిన సమాచారం ఉంటుంది. ఉద్యమానికి మద్దతుగా రైతులు, విద్యార్ధులు రాసిన కవితలు ప్రచురితమయ్యాయి.

మరికొంతమంది నిరశనకారులలో ఉత్సాహం నింపేందుకు సంగీత కచేరీలు నిర్వహిస్తూన్నారు.

మల మూత్ర విసర్జనకు టాయిలెట్స్ ఏర్పాటు చేశారు.బయో టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేశారు. రోడ్డు పక్కన మలమూత్ర విసర్జన కనిపించలేదు. పరిసరాలు చాలా పరిశుభ్రంగా ఉంచుతున్నారు. కావలసిన నీళ్లను టాంకుల ద్వారా తీసుకొచ్చి నిల్వ పెట్టుకుంటున్నారు.

ఉద్యమం ప్రారంభమైన కొద్ది సమయానికి అందరి సెల్లులకు  చార్జింగ్ అయిపోయింది.  చార్జింగ్ ఎలా అనే సమస్య ముందుకు వచ్చింది. ఎలక్ట్రిసిటీ లేదు. కరెంటు లేకుండా సెల్ ఛార్జింగ్ కాదు. వెంటనే సోలార్ ప్యానల్ తడికలను తీసుకొచ్చి బిగించారు.కరెంటు సమస్యను పరిష్కరించి వెలుగు ను ప్రసాదించారు.ఆధునిక అవసరాలలో అతి ముఖ్య అవసరమైన సెల్ చార్జింగ్ సమస్యను పరిష్కరించారు కొంతమంది టూత్ బ్రష్ లను పేస్ట్ లను అందిస్తున్నారు. 

వైద్య సహాయం చేయటానికి పంజాబ్, హర్యానా, ఢిల్లీ  నుండి డాక్టర్లు, నర్సులు స్వచ్ఛందంగా వచ్చారు. మందులను, పేస్ మాస్క్ లను ఉచితంగా ఇస్తున్నారు. 50 చోట్ల “లంగర్ మెడికల్ క్యాంపు” లను ఏర్పాటు చేశారు. పేరున్న స్పెషలిస్టులు కూడా వచ్చి మెరుగైన చికిత్సలను అంది స్తున్నారు. అందోళనకారుల లో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యలను, మానసిక  అందోళనను నివారించటానికి కౌన్సిలింగ్ సెంటర్ లను ఏర్పారిచారు. అత్యవసరం గా సీరియస్ కేసులను పంపటానికి అంబులెన్సులను రెడీ గా ఉంచారు.

చదువుకునేందుకు పుస్తకాలను కొన్ని స్వఛంద సంస్ధలు సరఫరా చేశాయి. 

కొందరు ఆఫీసులకు సెలవులు పెట్టి కుటుంబంతో ఆ ప్రాంతాన్ని సందర్శిస్తున్నారు. “చరిత్రలో భాగం కావాలంటే రైతుల నిరసనల్లో ఒక్కసారైనా పాల్గొనాల్సిందే” అని అంటున్నారు. “మా కుటుంబం రైతు కుటుంబమని చెప్పుకోవడానికి నేను ఎంతో గర్వపడుతున్నాను. ఇక్కడి రైతుల డిమాండు న్యాయమైనది. ఈ వాతావరణం చూస్తుంటే వ్యవసాయ బిల్లుల ఉపసంహరణ అయ్యేవరకు వీరు కదలకూడదు అని ప్రతిజ్ఞ చేసుకున్నట్లుగా ఉంది” అని ఒక పెద్దాయన అన్నాడు.

అన్నం పెట్టే రైతన్నలకు సేవ చేయడానికి మించింది ఏదీ లేదని నిరూపిస్తున్నారు. ఇలా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చే సందర్శకుల తాకిడి రోజురోజుకూ పెరిగిపోతూ ఉంది. సందర్శించేందుకు పెద్ద మొత్తంలో వస్తున్న జన సందోహానికి కూడా కడుపు నింపుతున్న లంగర్ కార్యకర్తలు అభినందనీయులు.

“ ఈ వ్యవసాయ చట్టాలు వయసుడిగిన మాకు పెద్ద నష్టం కలిగించకపోవచ్చు కాని మా తరువాతి తరాన్ని మాత్రం తీవ్రంగా నష్ట పరుస్తాయి. అందుకే వీటిని ఉపసంహరించేంత వరకు పోరాడతాం. మా భూమిని వదిలి వెళ్లే ప్రసక్తే లేదు “ అంటున్నాడు ఒక వయస్సు మళ్లిన రైతు. 

యూపీ నుంచి వచ్చి ఈ ప్రాంతంలో రోడ్డు పక్కన సెలూన్‌ పెట్టుకున్న ఓ వ్యక్తి కస్టమర్లకు షేవింగ్‌, కటింగ్‌ చేసే పనిలో నిమగ్నమై ఉన్నాడు.రైతుల ఆందోళన మొదలయ్యాకే ఆయన ఇక్కడ షాప్‌ తెరిచారు. ఆయనలాంటి మరికొందరు కూడా ఉద్యమం మొదలైన వారంలోనే ఇక్కడ షాపులు పెట్టారు.మరో దుకాణదారు రైతులకు చెప్పులు అమ్మతున్నారు. కొంత దూరంలో కొందరు చలికోట్లు అమ్ముతున్నారు. ఇక్కడ నిరసన స్థిర రూపం దాల్చింది. ఈ ప్రాంతం ఆందోళన చేసే ప్రాంతంగా మారింది.

నెల  రోజులకు పైగా నిరసనలు తెలపడం చరిత్ర సృష్టించడమే. స్వాతంత్య్రం వచ్చిన తరువాత లక్షలాది నిరసనకారులు, లక్షలాది మద్దతుదారుల సంఘీభావంతో సుదీర్ఘకాలం నడుస్తున్న పోరాటం ఇది. ఇప్పుడు ఢిల్లీ సరిహద్దులలో నిరసనలు చేస్తోంది హర్యానా, పంజాబ్‌లకు చెందిన రైతులే కాదు; ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, మహారాష్ట్ర, బీహార్‌ల నుంచి తండోపతండాలుగా వచ్చి చేరుతున్నారు. 

షాజన్ పూర్ నిరశనప్రాంత సందర్శన.

చరిత్ర సృష్టించిన రైతాంగం

సోమవారం రైతు సంఘ ప్రతినిధులు హర్యానా రాజస్థాన్ సరిహద్దు ప్రాంతమైన షాజన్ పూర్ వద్ద జరుగుతున్నరైతు ఉద్యమానికి సంఘీభావం తెలిపాము. అక్కడ ఉద్యమ నేతలు యోగేంద్రయాదవ్, అమ్రా రామ్, అజిత్ నవలీలను కలిసి మద్దతు తెలియజేశాం. అక్కడ చేరిన రైతులను ఉద్దేశించి వడ్డే శోభనాద్రీశ్వరరావు గారు మాట్లాడుతూ వ్యవసాయ చట్టాలు అమలు అయితే భారత రైతాంగం తీవ్రంగా నష్టపోతుందన్నారు. రైతులు వ్యవసాయాన్ని వదిలేసే పరిస్థితి అవుతుందన్నారు. ఆహార భద్రతకు ముప్పు వాటిల్లుతుంది అన్నారు.

వడ్డే శోభనాద్రీశ్వరరావురావు గారి ప్రసంగాన్ని పంజాబీ భాష లోకి అనువదించారు. ప్రముఖ పంజాబీ టీవీలు డైరెక్ట్ గా రిలే చేశాయి. యోగేంద్ర యాదవ్ ఆంధ్ర ప్రజల ఈ సహకారాన్ని అభినందించారు. “లడేంగే-జీతేంగే”,  “కిసాన్ ఏక్తా-జిందాబాద్.” అని నినాదాలు చేశారు.

దూరంగా కన్పడుతున్న రైతులనందరినీ చూద్దామని కొంతదూరం నడిచాము. ఎంతదూరంనడిచినా చివరి గుడారాన్ని చేరుకోలేకపోయాం.కొన్ని మైళ్ళబారున రైతులు జీవిస్తున్నారు. కృతనిశ్చయంతో నిలబడ్డారు. మా బతుకు కోసం, మా భూమికోసం రోడ్డుమీదకు వచ్చామంటున్నారు.పెప్సీ లాంటి కార్పోరేట్ కంపెనీలతో చేసిన కాంట్రాక్టు వ్యవసాయం వలన రైతులకు లభించిన నష్ఠాలు ఆరైతులుఇంకా మరచిపోలేదంటున్నారు.ప్రభుత్వం ,ఈ పోరాటాన్ని ఖలిస్తాన్ వాదుల పోరాటం, టెర్రరిస్టుల పోరాటం,    నక్సలైట్ల పోరాటం, ప్రతిపక్ష పార్టీల పోరాటం, ఆర్ధియాస్ దళారీల పోరాటం గా చిత్రీకరించే ప్రయత్నాలు చేస్తున్నది. దేశం మొత్తంగా ప్రచార  దళాలను ఏర్పరిచారు. స్వయానా ప్రధాన మంత్రి గంగానది సాక్షిగా రైతుఉద్యమాన్ని కించపరిచారు. మన్ కీ బాత్ లో అవాస్తవాలను చిత్రీకరించారు. కానీ రైతులు వారి మాటలను నమ్మలేదు. పౌర సమాజం గమనిస్తోంది. రైతుల నిరసనలను అర్థం చేసుకుని, వారికి అండగా నిలిచే దిశలో కదులుతోంది. 

రైతుల ఐక్యత కోసం అనుసరించిన మార్గాన్ని రైతు కార్యకర్తలు, మేధావులు అధ్యయనం చేయాలి.

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు రైతు ప్రయోజనాలను బలిపెట్టేవేనంటూ రైతులు చేస్తున్న ఢిల్లీ ముట్టడి రెండోనెలలో ప్రవేశించింది. .అనవసర కాలయాపన చేస్తూ ప్రమాదకర ప్రతిష్టంబనను పొడిగించుతూ ప్రభుత్వం ప్రతిష్టకు పోతున్నది. ఢిల్లీలోకి రానివ్వకుండా సృషించిన అడ్డంకులను తొలగించుకుని రోడ్డులనే నివాసంగామార్చుకున్న రోజునే ప్రభుత్వ ప్రతిష్ట మంటగలిసింది. చర్చల లో పాల్గొన్న రైతునాయకులందరూ ఒకే మాటపై నిలబడి ఏకైక ఎజెండా గా నూతన చట్టాలను రద్దు చేయమని అడగటం రైతాంగ ఐక్యతకు చిహ్నం. 500 రైతు సంఘాలను , లక్షలాదిమంది రైతుల అపూర్వమైన ఐక్యత ను సాధించి  రైతులను ఏక  తాటి పై నిలబెట్టిన రైతు నాయకులందరూ  అభినందనీయులు. రైతుల ఐక్యత కోసం అనుసరించిన మార్గాన్ని రైతు కార్యకర్తలు, మేధావులు అధ్యయనం చేయాలి.

ఒకపక్క వర్షం కురుస్తున్నా మరోపక్క ఎముకలు కొరికే చలిలో కూడా రైతులు నిరసనను కొనసాగిస్తున్నారు. తమతో పాటుగా ఆందోళన చేస్తున్న 50 మంది సహచరులు తమ ఎదురుగా మరణించినా మౌనంగా రోదిస్తున్నారు తప్ప , తమ ఆందోళన విరమించలేదు.

కిసాన్ ఏక్తా జిందాబాద్ ; కిసాన్ మజ్దాూర్ ఏక్తా జిందాబాద్ ; లడేంగే- జీతేంగే; “జబ్ తక్  కానూన్ వాపస్ నహీ – తబ్  తక్ ఘర్ వాపసు నహీ ” , నినాదాలతో ఆ ప్రాంతమంతా హోరెత్తుతున్నది.

మీడియాలోమొక్కుబడి వార్తలు.

ముఖ్యంగా పెద్ద టీవీలు, ప్రధాన  మీడియా రైతుల ఉద్యమాన్ని చిన్నచూపు చూస్తూ, రైతుల ఆత్మ స్ధైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తోందని ప్రజలు గ్రహించారు. కొన్ని టీవీ ఛానళ్లు, పత్రికలు రైతుల పోరాటాన్ని కించపరిచాయి. రైతుల చైతన్యాన్ని ఎగతాళి చేశాయి. ప్రజలు తమ జీవిత అనుభవం నుండి జీవన పోరాటాన్ని సాగిస్తున్నారనే విషయాన్ని విస్మరిస్తున్నారు. జీవనోపాధికి ప్రభుత్వం కలిగిస్తున్న అడ్డంకులను ఉద్యమకారులు ఛేదిస్తున్న తీరును ప్రజలు హర్షిస్తున్నారు. కానీ కార్పొరేట్ కబంధహస్తాల్లో బంధించబడిన మీడియాకు రైతు ఉద్యమo కనపడలేదు. ఆ లోటును సోషల్ మీడియా కొంతవరకు భర్తీ చేసింది. కిసాన్ ఏక్తా వార్తా సంస్ధను రైతులు ప్రారంభించారు. కొద్దికాలంలోనే అనన్య ప్రచారం, గుర్తింపు పొందింది.  

ఇప్పుడు, నిరసన, అసమ్మతి , సంఘీభావం తెలియజేయడానికి  ప్రజలు ధైర్యంగా ముందుకు వస్తున్నారు. పోరాట ప్రాంతం పుణ్యస్ధలమయింది. ఢిల్లీ నుండి వేలాదిమంది తీర్ధయాత్రకు వచ్చినట్లుగా వస్తున్నారు. పోరాటం జయప్రదం  కావాలని మనసారా కాంక్షిస్తూ చదివింపులు చదివిస్తున్నారు. లంగర్ సేవలో పాలు పంచుకుంటున్నారు . పౌర సమాజంలో కొందరు  తమ హక్కుల గురించి పోరాడడమే కాకుండా తోటి ప్రజల సమస్యల పట్ల ముఖ్యంగా రైతుల ఉద్యమం పట్ల సానుభూతి ప్రదర్శిస్తున్నారు. రైతుల ఉద్యమం కేవలం కొద్దిమంది ఉద్యమకారుల గొంతుగా మిగిలిపోలేదు. సన్న, చిన్నకారు రైతులు,  భూమిలేని శ్రామికులు, ధనిక, మధ్య తరగతి రైతులు విశాల రైతాంగ ఉద్యమంలో భాగమయ్యారు. రోజురోజుకీ బలం పెరుగుతున్నది. గెలవగలమన్న ధైర్యం పెరుగుతున్నది. 

కార్పొరేట్ కంపెనీల పునాది కదులుతున్నది.

ఈ ఉద్యమ ప్రభావంతో అంబానీ ప్రకటన చేయక తప్పలేదు.

‘మా గ్రూప్‌ సంస్థలు ఒప్పంద వ్యవసాయ రంగంలో లేవు. భవిష్యత్తులో ప్రవేశించాలన్న ఆలోచనా లేదు. దేశవ్యాప్తంగా ఎక్కడా మేం  వ్యవసాయ భూమిని కొనలేదు’ అని రిలయన్స్‌ పేర్కొంది. సంస్థకు చెందిన రిటెయిల్‌ యూనిట్లు ఆహార ధాన్యాలు సహా నిత్యావసరాలను కొని అమ్ముతున్నాయన్న విషయం తెలిసిందే. ఈ విషయంపై కూడా రిలయన్స్‌ స్పష్టత ఇచ్చింది. తాము రైతుల నుంచి నేరుగా ఆహార ధాన్యాలను కొనుగోలు చేయమని వివరించింది. పంజాబ్‌లో ఉన్న 9 వేల జియో టవర్లలో దాదాపు 1,800 టవర్లు ధ్వంసమయ్యాయి. రైతుల పంటలకు న్యాయమైన, లాభదాయకమైన ధరలు లభించాలన్న డిమాండ్‌కు తాము పూర్తి మద్దతు ఇస్తున్నట్లు రిలయన్స్‌ పేర్కొంది.

రైతుల ఆందోళనకు గల రాజకీయ ప్రాధాన్యం ఏమిటి? 

ప్రజాస్వామ్యం  అంటే ఎన్నికలు, పదవులేనని  పాలకవర్గ పార్టీలు  వ్యవహరిస్తున్నాయి. జనాభాలో సగం పైగా ఉన్న తమ జీవన విధానం అయిన వ్యవసాయ విధానం మెరుగ్గా సాగాలని, శ్రమకు ఫలితం దక్కాలని రైతులు కోరుకుంటున్నారు.

రైతులు ఆ విధముగా ఆలోచించి ప్రశ్నించటం మొదలెట్టారు. ప్రజాస్వామ్య మంటే  కార్పోరేట్ కంపెనీల సేవ కాదని స్పష్టంగా వెల్లడిస్తున్నారు. శాంతియుతంగా ఢిల్లీ సరిహద్దులలో మకాం పెట్టి , ఒక నూతన పోరాట రూపాన్ని రూపొందించారు. కొన్ని లోపాలున్నప్పటికీ క్రియాశీలంగా వున్నారు. దేశ ప్రజలకు ఆదర్శంగా నిలిచారు.

ప్రతిపక్ష పార్టీలు ఇప్పుడు మూగబోయినట్లుగా, నిష్ప్రయోజనంగా కనిపిస్తున్నాయి. అయినా ప్రజల పక్షాన మాట్లాడక తప్పటంలేదు. కాంగ్రెస్ పార్టీ బలహీనంగా కనిపిస్తోంది. అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు కేంద్ర ప్రభుత్వాన్ని చూసి భయపడుతున్నాయి. అధికారంలో లేని ప్రాంతీయ ప్రతిపక్ష పార్టీలు కూడా రైతుల పక్షాన నిలబడటానికి వెనకాడు తున్నాయి. వామపక్ష పార్టీలు బలహీనంగా ఉన్నాయి.

ముఖ్యంగా మధ్యతరగతి వర్గం ప్రేక్షక పాత్ర వహిస్తున్నది. అయితే,  మేధావులు ఇదొక ప్రయోగంగా భావిస్తున్నారు. చారిత్రాత్మకమైన రైతుల ఆందోళన ఒక ప్రయోగంలా కాకుండా చూడాలి.పౌర సమాజం మేధావులతో కలిసి చర్చించి, చైతన్యవంతం కావాలి. ప్రజలను చైతన్య పరచవలసిన  సమయం ఆసన్నమయ్యింది. 

ఇప్పుడు, ప్రజలు అసమ్మతి తెలియజేయడానికి ధైర్యంగా ముందుకు వస్తున్నారు. 

కార్పొరేట్ శక్తులతో పోరాటం సామాన్యమైనది కాదు. రైతులు తలకు మించిన భారాన్ని నెత్తికి ఎత్తుకున్నారు. రైతుల వైపా లేక కార్పొరేట్ శక్తుల వైపా అని అందరూ తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. అంతర్గత నిరాశావాదంతో పోరాటం  సులభంగా ఉండదు. పౌర సమాజం మరింత శక్తిని కూడగట్టుకుని పోరాటానికి సిద్ధం కావాలి.

సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు.

  1. జనవరి 6 నుండి 20 వరకు, జన జాగరన్ అభియాన్ జరగాలి. గ్రామాలలో రైతులను చైతన్యపరచాలి. జనవరి 13 న భోగి మంటల్లో చట్టాల కాపీలను దగ్ధం చేయటం,”జనవరి 18 న, మహిళా కిసాన్ దివాస్ జరగాలి.    4)  జనవరి 23 న, నేతాజీ సుభాష్   చంద్రబోస్ జన్మదినం సందర్భంగా, ఆజాద్ హింద్ కిసాన్దివాస్ జరుపుకోవాలి.   5) జనవరి 26 న రిపబ్లిక్ దినోత్సవ సందర్భంగా ట్రాక్టర్ పెరేడ్ ఊరేగింపు జరపాలి..

ఢిల్లీ  వెళ్లి వచ్చిన వారు 

వడ్డే శోభనాద్రీశ్వరరావు, AIKSCC ఆంధ్ర ప్రదేశ్ కన్వీనర్ , ఎర్నేని నాగేంద్రనాధ్, రైతుసంఘాల సమన్వయ సమాఖ్య, రామక్రిష్ణ, సీపీఐ నేత, రావుల వెంకయ్య, ఎఐకేఎస్ , జాతీయ ఉపాధ్యక్షులు, వై కేశవరావు, ఏపీ రైతుసంఘం రాష్ట్ర కార్యదర్శి,శ్రీమతి సింహాద్రిఝాన్సీ, ఏపీ రైతు కూలీ సంఘం,రాష్ట్రఅద్యక్షులు, జమలయ్య, ఏ పీ కౌలు రైతు సంఘం కార్యదర్శి. హరనాధ్ ,ఎఐకేఎం, రాష్ట్రకార్యదర్శి,  తోట ఆంజనేయులు, ఎఐకేఎం,  రాష్ట్రఅద్యక్షులు, కే విద్యాధరరావు, ఎఐకేఎస్.శ్రీమతి చల్లపల్లి విజయ, స్త్రీ విముక్తి సంఘటన,  జెట్టి. గుర్నాధరావు, ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కిసాన్ సెల్ ఛైర్మన్,డాక్టర్ కొల్లా రాజమోహన్, నల్లమడ రైతు సంఘం.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

నరేంద్రమోడీ ఏలుబడి : కార్పొరేట్లకు విశ్వాసం – రైతాంగంలో అవిశ్వాసం !

13 Sunday Dec 2020

Posted by raomk in AP NEWS, BJP, CPI(M), Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

#Farmers’ protest, CACP, Indian Farmer Protest 2020, MSP, Narendra Modi


ఎం కోటేశ్వరరావు


మాకు మీరు చెబుతున్నదాని మీద విశ్వాసం లేదు మహా ప్రభో అని రైతాంగం గత 18రోజులుగా (డిసెంబరు 13) తమ రాజధాని ఢిల్లీ శివార్లలో తిష్టవేసి ఒక వైపు నిరసన తెలుపుతున్నది. మరోవైపు గత ఆరు సంవత్సరాలుగా భారత్‌ మీద ప్రపంచం చూపుతున్న విశ్వాసం గత కొద్ది నెలలుగా మరింతగా పెరిగింది నా ఏలుబడిని చూడండో అని ప్రధాని నరేంద్రమోడీ తన గొప్ప గురించి చెప్పుకున్నారు. అదీ ఎక్కడా ! వాణిజ్య, పారిశ్రామికవేత్తల ప్రతినిధి ఫిక్కీ సమావేశంలో మోడీ చెప్పారు. చర్చల పేరుతో కేంద్ర ప్రభుత్వం వేస్తున్న పిల్లిమొగ్గలను రైతులు పట్టించుకోవటం లేదు. గత ఆరు సంవత్సరాలుగా పలు తరగతులలో భాగంగా నరేంద్రమోడీ మీద రైతులు పెంచుకున్న భ్రమలు తొలగి గత కొద్ది నెలలుగా వేగంగా అవిశ్వాసాన్ని పెంచుకుంటున్నట్లు జరుగుతున్న ఉద్యమం వెల్లడిస్తోంది. మరి నరేంద్రమోడీ గారు చెప్పింది అబద్దమా ? అదియును సూనృతమే ఇదియును సూనృతమే.( రెండూ నిజమే ) తమకు దోచి పెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నందుకు మోడీ గారి మీద దేశీ-విదేశీ కార్పొరేట్లలో విశ్వాసం పెరుగుతుంటే ఆ చర్యలు తమ కొంప ముంచుతాయని రైతాంగం భయపడటం ఎక్కువైంది.


బిజెపి చెప్పినట్లుగా రైతుల ఆదాయాలు రెట్టింపు అవలేదు, కనుచూపు మేరలో అయ్యే అవకాశాలు కనిపించటంలేదు. మాంద్యం లేదా కరోనా మహమ్మారి వచ్చినా మోడీ ఏలుబడిలో కార్పొరేట్ల లాభాలు పెరుగుతాయే తప్ప తగ్గవని తేలిపోయింది. అందుకే బిజెపి ఆదాయం ఇంతింతై వటుడింతై అన్నట్లుగా పెరుగుతోంది.కేంద్ర ఎన్నికల సంఘానికి రాజకీయ పార్టీలు అందచేసిన వివరాల ప్రకారం 2018లో రూ.1,027.37 కోట్లున్న బిజెపి ఆదాయం 2019 నాటికి రూ.2,410.08(134.59శాతం)కు పెరిగింది. అనధికారికంగా వచ్చే ఆదాయం గురించి చెప్పనవసరం లేదు. కార్పొరేట్‌ కంపెనీలు, ఇతర వ్యాపార సంస్ధలు ఇచ్చిన ఇంత డబ్బు ఉంది కనుకనే రైతులకు వ్యతిరేకంగా దేశ వ్యాపితంగా 700 జిల్లాల్లో సభలు, ప్రచారం, 700 పత్రికా సమావేశాలు పెట్టాలని నిర్ణయించింది. ఇప్పటి వరకు చెప్పిన అసత్యాలు, అర్ధసత్యాలను జనం మెదళ్లకు ఎక్కించే ప్రయత్నమే ఇది. పెరుగుట విరుగుట కొరకే అన్నట్లుగా ఎంత ఎక్కువగా చెబితే అంతగా జనం వాస్తవాలు తెలుసుకుంటారు. మీడియాలో బిజెపికి ఇచ్చినంత గాక పోయినా ఎంతో కొంత చోటు ఇవ్వక తప్పదు కదా !


రైతాంగ ఆందోళన అనేక అంశాలను ముందుకు తెస్తోంది. రాజకీయ పార్టీలు, మేథావులు, మీడియా ఎవరి అసలు రంగు ఏమిటో బయటపెడుతోంది. తొలి రోజుల్లో విస్మరించినా ప్రధాన స్రవంతి మీడియా రైతుల ఆందోళన వార్తలను అరకొరగా అయినా ఇవ్వకతప్పటం లేదు. సెప్టెంబరు నెలలో పార్లమెంట్‌లో అప్రజాస్వాకంగా ఆమోదించిన వివాదాస్పద చట్ట సవరణల మీద ముందుకు తెస్తున్న కొన్ని వాదనల తీరు తెన్నులను చూద్దాం. వాటిలో ప్రధానమైనది – వ్యవసాయ చట్టాలకు కనీస మద్దతు ధరలకు సంబంధం లేదు !


దేశంలోని మిగతా రాష్ట్రాలకూ కాశ్మీరుకు ఉన్న ఆర్టికల్‌ 370కి సంబంధం లేదు. అయినా సంబంధం అంటగట్టి దాన్ని రద్దు చేసేంత వరకు నిదురపోలేదు. దేశం మొత్తానికి వర్తించే కనీస మద్దతు ధరలకూ వ్యవసాయ చట్టాలకు ఇప్పటి వరకు సంబంధం లేదు నిజమే ! సంబంధం కలపమని, తమకు భరోసా కల్పించమనే కదా రైతులు కోరుతోంది. ఎందుకు నిరాకరిస్తున్నారో చెప్పమంటే సమాధానం చెప్పకుండా అడ్డగోలు వాదనలు ముందుకు తెస్తున్నారు ? మూడు చట్టసవరణలను పూర్తిగా వెనక్కు తీసుకోవాలని, ఇతర సమస్యలను పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు. తాజా ఆందోళనతో నిమిత్తం లేకుండానే గత కొన్ని సంవత్సరాలుగా కనీస మద్దతు ధరలకు చట్టబద్దత కల్పించాలన్న డిమాండ్‌ ముందుకు వచ్చిందా లేదా ? ఎన్నడూ లేని విధంగా రైతాంగానికి ఇప్పుడు బిజెపి మీద అనుమానాలు ఎందుకు బలపడ్డాయి ?
సంస్కరణల పేరుతో అన్ని వ్యవస్దలకు తిలోదకాలు ఇచ్చేందుకు, బాధ్యతల నుంచి తప్పుకొనేందుకు, లాభాలు వస్తున్న ఎల్‌ఐసి, చమురు సంస్ధలను కూడా ప్రయివేటు పరం చేసేందుకు మోడీ సర్కార్‌ కుంటి సాకులు చెబుతున్నది. కనీస మద్దతు ధరలు, వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ వ్యవస్ధలను ప్రభావితం చేసే మూడు చట్టాలలో ఎక్కడా కనీసం మద్దతు ధరల ప్రస్తావన లేదు. కనుకనే రైతాంగం కనీస మద్దతు ధరలను చట్టబద్దం చేయమంటోంది. గతంలో కూడా రైతు సంఘాలు ఈ డిమాండ్‌ను ముందుకు తెచ్చాయి. చట్టాలకు ఎంఎస్‌పికి సంబంధం లేదని చెబుతున్న బిజెపి పెద్దలు గతాన్ని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటారా లేక దొంగ నిద్ర నటిస్తారా ? 2011లో గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నరేంద్రమోడీ నాయకత్వంలోని ముఖ్యమంత్రుల కమిటీ కనీస మద్దతు ధరలకు చట్టబద్దత కల్పించాలని ఆషామాషీగా కేంద్రానికి సిఫార్సు చేసిందా ? ఈ కమిటీలో నాటి మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు ముఖ్యమంత్రులు ఇతర సభ్యులు. సిఎంగా ఉన్న మోడీ చేసిన సిఫార్సును పిఎం మోడీ ఎందుకు పక్కన పడేస్తున్నారు ? బిజెపి నేతలు అసలు ఆ ప్రస్తావనే ఎందుకు తేవటం లేదు. నాడు ఎందుకు సిఫార్సు చేసినట్లు ఇప్పుడు ఎందుకు తిరస్కరిస్తున్నట్లు ? మా దారే వేరు అని చెప్పుకుంటున్న నరేంద్రమోడీకి ఇతరులకు తేడా ఏముంది ?


వ్యవసాయ చట్టాలకు-కనీస మద్దతు ధరలకు సంబంధం ఉందా లేదా అన్నది అసలు చర్చే కాదు, సంబంధం కల్పించాలని రైతులు అడుగుతున్నారు. గతంలో కూడా లేదుగా అని బిజెపి అంటోంది. నిజమే, గతంలో లేని వాటిని మోడీ సర్కార్‌ అనేకం తెచ్చిందిగా దీన్నెందుకు తీసుకురాదు. తెస్తే వారికి పోయేదేముంది? రైతులు శాశ్వతంగా మద్దతుదారులుగా మారతారు కదా ! ఇంతకీ 2011 నివేదికలో మోడీ కమిటీ చేసిన సిఫార్సు ఏమిటి ? నివేదికలోని క్లాజ్‌ బి.3లో ఇలా ఉంది.” చట్టబద్దంగా ఎంఎస్‌పి అమలు : మార్కెట్‌ పని చేయటంలో మధ్యవర్తులు కీలకమైన పాత్ర పోషిస్తున్నారు మరియు ఆ సమయంలో వారు ముందుగానే రైతులతో ఒప్పందం చేసుకుంటున్నారు. అన్ని నిత్యావసర వస్తువులకు సంబంధించి చట్టబద్దమైన అంశాలతో శాసనం ద్వారా రైతుల ప్రయోజనాలను కాపాడాలి. అదేమంటే రైతు-వ్యాపారి లావాదేవీల్లో ఎక్కడా నిర్ణీత కనీస మద్దతు ధరలకు తగ్గకూడదు.” దీని అర్ధం ఏమిటి ? చట్టబద్దత కల్పించాలనే కదా ! అన్నింటికీ మించి సంబంధం లేదనటం పచ్చి అబద్దం. వ్యవసాయ మార్కెట్‌ యార్డులలో జరిగే లావాదేవీలలో కనీస మద్దతు ధరలకంటే తక్కువకు కొనుగోలు చేయకూడదు. కొత్త చట్టం ఆ యార్డుల పరిధిని కుదించి దాని వెలుపల వ్యాపారులు ఎలాంటి పన్నులు, సెస్సులు చెల్లించకుండా కొనుగోళ్లు జరపవచ్చని చెప్పింది. ఏ ధరలకు కొనుగోలు చేయాలో చెప్పలేదు. కనీస మద్దతు ధరలు అమలు జరుగుతున్నాయా లేదా అని పర్యవేక్షించే యంత్రాంగం అక్కడ లేనపుడు ఏమి చేయాలో సవరించిన చట్టాల్లో ఎందుకు చెప్పలేదు?


అంతేనా 2014 మే 26న నరేంద్రమోడీ దేశ ప్రధాని అయ్యారు. అంతకు ముందు ఏప్రిల్‌ 14న చేసిన ట్వీట్‌లో మన రైతులు సరైన ధర ఎందుకు పొందకూడదు, వారేమీ అడుక్కోవటం లేదు, కష్టపడుతున్నారు, మంచి ధర పొందాలంటూ దానిలో పేర్కొన్నారు. ఇప్పుడు కూడా రైతులు దేన్నీ దేబిరించటం లేదు. కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ ఏమంటున్నారు ? ” నిజమేనయ్యా మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉన్న కమిటీ చేసిన సిఫార్సు ప్రకారం ఎంఎస్‌పికి చట్టబద్దత కల్పించాలని ప్రతిపక్షం కోరుతోంది. నేను వారిని అడుగుతున్నా మీరు చాలా సంవత్సరాలు పాలన సాగించారుగా ఎందుకు చేయలేదు ” అని ప్రశ్నించారు. ఇప్పుడు అధికారంలో ఉన్నది బిజెపి. గడ్డం లేని సమయంలో స్వయంగా మోడీఏ సిఫార్సు చేశారు. ఇప్పుడు గడ్డం పెంచటాన్ని చూసిన అనేక మంది మోడీలో పరిణితి, పెద్దరికం వచ్చింది అని చెబుతున్న తరుణంలో కాంగ్రెస్‌ ఐదు దశాబ్దాల్లో చేయని దాన్ని ఇప్పుడెందుకు చేయరు అంటే ఉన్న ఆటంకం ఏమిటో చెప్పకుండా గతంలో ఎందుకు చేయలేదని ఎదురుదాడి చేయటం ఏమిటి ?


కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కూడా ఎంఎస్‌పికి-వ్యవసాయ చట్టాలకు సంబంధం లేదనే పాటనే పాడారు. ఆమె మరొక అడుగు ముందుకు వేశారు.చట్టసవరణలు చేయబోయే ముందు సంప్రదింపులు, చర్చలు ఎందుకు జరపలేదు అని అడిగితే ఈ అంశాల మీద 2000 సంవత్సరంలో వాజ్‌పేయి సర్కార్‌ హయాం నుంచీ చర్చలు జరుగుతూనే ఉన్నాయి పొమ్మన్నారు. కనీస మద్దతు ధరలకు చట్టబద్దత గురించి కూడా చర్చ ఉన్నది దాన్నెందుకు పట్టించుకోవటం లేదు ? కిసాన్‌ ముక్తి బిల్లుల పేరుతో రుణభారం నుంచి విముక్తి కలిగించాలని, మద్దతు ధరలకు చట్టబద్దత కల్పించాలని కోరుతూ 2018 జూలై, ఆగస్టు నెలల్లో పార్లమెంట్‌లో రెండు అనధికార బిల్లులను ప్రవేశపెట్టారు. ఆలిండియా కిసాన్‌ సంఘర్ష సమితిలో భాగస్వాములైన స్వాభిమాని షేత్కారి సంఘటన నేత, ఎంపీ అయిన రాజు షెట్టి లోక్‌సభలో, ఆలిండియా కిసాన్‌సభ నేత, సిపిఎం ఎంపీ అయిన కెకె రాగేష్‌ రాజ్యసభలో వాటిని ప్రవేశ పెట్టారు. వాటిని ప్రభుత్వం తిరస్కరించింది.
స్వామినాధన్‌ కమిషన్‌ సిఫార్సులను అమలు చేసినట్లు, ఉత్పాదక ఖర్చు మీద 50శాతం అదనంగా కనీస మద్దతు ధరలు అమలు జరుపుతున్నట్లు బిజెపి ప్రచారం చేస్తున్నది. దీన్ని చూసి నేను చచ్చినా నా సిద్దాంతం బతికి ఉన్నందుకు సంతోషంగా ఉందని అబద్దాల జర్మన్‌ నాజీ మంత్రి గోబెల్స్‌ ఆత్మ సంతోషపడుతూ ప్రత్యేక అభిమానంతో మన దేశం చుట్టూ తిరుగుతూ ఉండి ఉండాలి ( ఆత్మ గురించి విశ్వాసం ఉన్నవారి మనోభావాల మేరకు ). 2014 హర్యానా అసెంబ్లీ ఎన్నికల వరంగా స్వామినాధన్‌ కమిషన్‌ సిఫార్సులు అమలు చేస్తామని బిజెపి చెప్పింది. అమిత్‌ షా భాషలో చెప్పాలంటే ఇదొక జుమ్లా (ఏదో అవసరానికి అనేకం చెబుతుంటాం). 2016 ఏప్రిల్‌ ఆరవ తేదీన కేంద్ర వ్యవసాయ శాఖ హర్యానాలోని పానిపట్‌ జిల్లా సమలఖాకు చెందిన పి.పి కపూర్‌ అనే సమాచార హక్కు కార్యకర్తకు ఇచ్చిన సమాధానం మోడీ ప్రభుత్వ నిజస్వరూపాన్ని వెల్లడిస్తున్నది. ” అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని వ్యవసాయ ఖర్చులు మరియు ధరల నిర్ణాయక కమిషన్‌ (సిఏసిపి) కనీస మద్దతు ధరలను నిర్ణయిస్తుంది. కనుక కనీస మద్దతు ధరలకు సంబంధించి స్వామినాధన్‌ కమిషన్‌ చేసిన సిఫార్సును ప్రభుత్వం తిరస్కరించింది. ఉత్పాదక ఖర్చు మీద 50శాతం కనీసంగా పెంచి నిర్ణయించటం మార్కెట్లో వక్రీకరణకు దారి తీస్తుంది.” అని పేర్కొన్నారు. గతంలో మాదిరే మద్దతు ధరలను కొనసాగిస్తున్నారు తప్ప స్వామినాధన్‌ కమిషన్‌ చెప్పినదాని ప్రకారం భూమి(విలువ) కౌలు మొత్తాన్ని కూడా ఖర్చులలో కలిపి మద్దతు ధరలను నిర్ణయించాల్సి ఉండగా మోడీ సర్కార్‌ దాన్ని వదలివేసింది.

సిఏసిపి మద్దతు ధరలను సూచించేందుకే పరిమితం తప్ప వాటి అమలు నిర్ణయం ప్రభుత్వానిదే. ఇప్పుడున్న నిబంధనల ప్రకారం కనీస మద్దతు ధరకు విధిగా కొనుగోలు చేయాలని ప్రయివేటు రంగ వ్యాపారులను ఆదేశించే అవకాశం లేదు. కొంత మేరకు చెరకు విషయంలోనే ఏ రంగంలో ఉన్నవారైనా ఎఫ్‌ఆర్‌పి ధరలను అమలు జరపాల్సి ఉంది. దీన్నే ఇంతకు ముందు ఎస్‌ఎంపి అని పిలిచారు.2018-19లో సిఏసిపి తన ధరల విధాన నివేదికలో కనీస మద్దతు ధరలకు రైతులు అమ్ముకొనే హక్కును కల్పిస్తూ చట్టం చేయాలని ప్రతిపాదించింది. రైతుల్లో విశ్వాసం కల్పించేందుకు ఈ చర్య అవసరమని పేర్కొన్నది. అయితే దీన్ని కేంద్రం అంగీకరించలేదు. ఇప్పుడు విశ్వాస సమస్య మరింతగా ముందుకు వచ్చింది. రైతులు చేస్తున్న ఆందోళన ప్రభుత్వం మీద, పాలక వ్యవస్ధ మీద విశ్వాసరాహిత్యాన్ని సూచిస్తున్నది. 1966-67లో గోధుమలకు తొలిసారిగా మద్దతు ధర నిర్ణయం అధిక దిగుబడి వంగడాల సాగు, పెరిగిన ఉత్పత్తి మార్కెటింగ్‌పై రైతులకు విశ్వాసం కొల్పేందుకు ఉద్దేశించిందే అన్నది గమనించాలి.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

రైతుల ఆందోళన : బి-జెపి-అండ్‌కో వంచనాపూరిత వాదనలు -వాస్తవాలూ !

08 Tuesday Dec 2020

Posted by raomk in AP, AP NEWS, BJP, Congress, CPI(M), Current Affairs, Farmers, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Telangana

≈ 1 Comment

Tags

Bharat Bandh 2020, Farmers agitations, India farmers' protest


ఎం కోటేశ్వరరావు
డిసెంబరు ఎనిమిదిన రైతు సంఘాల ఐక్యకార్యాచరణ కమిటీ పిలుపు మేరకు భారత బంద్‌ జయప్రదంగా జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఒక వైపు చర్చలంటున్నది. మరోవైపు ప్రధాని నరేంద్రమోడీ గారే స్వయంగా రెచ్చగొట్టేందుకు పూనుకొని వెనక్కు తగ్గేది లేదని చెబుతున్నారు. తాజా ఆందోళన ఎంతకాలం కొనసాగుతుంది, ఏమౌతుంది అన్నది ఒక అంశమైతే రైతుల ఆందోళనల సందర్భంగా జయప్రకాష్‌ నారాయణ వంటి మేథావులు అనేక వాదనలను ముందుకు తెస్తున్నారు. ప్రతి ఉద్యమ సమయంలో దాన్ని వ్యతిరేకించే శక్తులు తప్పుడు వాదనలూ, అవాస్తవ సమాచారాన్ని ప్రచారం చేసేందుకు సామాజిక మాధ్యమాలను పెద్ద ఎత్తున ఉపయోగిస్తున్నారు. పంజాబు రైతులే ఎందుకు ఆందోళనలో ముందున్నారు, మిగతా రాష్ట్రాల వారు ఎందుకు స్పందించటం లేదు వంటి కొన్నింటి తీరు తెన్నులను చూద్దాం.


1.పార్లమెంట్‌ అంగీకరించిన తరువాత రాద్దాంతం ఎందుకు చేస్తున్నారు ?
ఇది తర్కానికి నిలిచేది కాదు. పార్లమెంట్‌ ఆమోదించినంత మాత్రాన వ్యతిరేకత వ్యక్తం చేయకూడదని చెప్పటం నిరంకుశత్వలక్షణం. ఇందిరా గాంధీ హయాంలో విధించిన అత్యవసర పరిస్ధితిని అప్పటి పార్లమెంట్‌, రాష్ట్రపతి ఆమోదించారు. అయినా నేటి బిజెపి పూర్వ రూపమైన జనసంఘం ఎందుకు వ్యతిరేకించింది ? ఆర్టికల్‌ 370, కాశ్మీరుకు ప్రత్యేక ప్రతిపత్తి కూడా పార్లమెంటు ఆమోదించినవే అయినా బిజెపి ఎందుకు వ్యతిరేకించింది, రద్దు చేసింది ?


2.ముందే ఎందుకు అభ్యంతరం చెప్పలేదు, ఆందోళన చేయలేదు ?
ఇది తప్పుడు ప్రచారం. ఆర్డినెన్స్‌లు తెచ్చినపుడే వ్యతిరేకతను వ్యక్తం చేశారు. కరోనా కారణంగా వీధుల్లోకి రాలేదు, అన్నింటికీ మించి వ్యతిరేకతను పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వం వెనక్కు తగ్గుతుందనే ఆశ, నమ్మకం ఉండటం. ఇవి రెండూ పోయిన తరువాత మరొక మార్గం లేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి రాజీనామా చేసిన బిజెపి మిత్రపక్షం అకాలీదళ్‌ చెప్పింది అదే. రెండు వ్యవసాయ, ఒక వినియోగదారుల చట్టాలకు సంబంధించి మార్పులను ఆర్డినెన్సుల ద్వారా అమల్లోకి తెచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఈ రెండు అంశాలూ ఉమ్మడి జాబితాలో ఉన్నప్పటికీ రాష్ట్రాల అభిప్రాయాలను తీసుకోలేదు. చర్చలు జరపలేదు. మెజారిటీ రాష్ట్రాలు బిజెపి పాలనలో ఉన్నాయి గనుక మౌనం దాల్చాయి.


3. ప్రజాస్వామ్య బద్దంగానే జరిగింది కదా !
పార్లమెంట్‌లో ఆర్డినెన్స్‌ స్దానే బిల్లులను ప్రవేశపెట్టినపుడు సెలెక్టు కమిటీకి పంపాలన్న ప్రతిపక్షాల అభిప్రాయాలను కేంద్రం తోసి పుచ్చింది. నిరసనల మధ్య ఆమోద తతంగాన్ని పూర్తి చేసింది. 2019లో లోక్‌సభ ఎన్నికలు జరిగిన తరువాత కేంద్ర ప్రభుత్వం 17 బిల్లులను పార్లమెంటరీ కమిటీలకు పంపింది. వీటిని ఎందుకు తిరస్కరించినట్లు ? ఇది ప్రజాస్వామ్యమా ? విదేశీ-స్వదేశీ కార్పొరేట్లకు అంతర్గతంగా హామీ ఇచ్చారు కనుకనే ఆర్డినెన్సు, తరువాత పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి విరుద్దంగా ఆమోద తతంగం చేశారు. అందువలన అవి రద్దయ్యేవరకు గళం విప్పుతూనే ఉండటం తప్పెలా అవుతుంది.


4. రైతులు మొండిగా ఉన్నారు, కమిటీ వేస్తామన్నారు కదా, ఎందుకు అంగీకరించరు ?
మొండిగా ఉన్నది ప్రభుత్వమే. తమ మిత్రపక్షం అకాలీదళ్‌ నిరసన వ్యక్తం చేసినా రాజకీయంగా దానితో విడగొట్టుకొనేందుకు అయినా సిద్దపడింది గానీ ఆ పార్టీ చెబుతున్నదానిని కూడా వినిపించుకోలేదు. సెప్టెంబరు 25న అఖిల భారత నిరసన దినం పాటించాలని అఖిల భారత కిసాన్‌ సంఘర్ష సమితి పిలుపు ఇచ్చింది, పాటించారు. అప్పుడు స్పందించలేదు. తరువాత నవంబరు 26న ఆందోళన పిలుపునూ పట్టించుకోలేదు. తీరా రైతులు ఢిల్లీ బయలు దేరిన తరువాత శివార్లలో కందకాలు తవ్వేందుకు, ఆటంకాలు ఏర్పాటుకు చూపిన శ్రద్ద పరిష్కారం మీద లేదు. రైతులు వచ్చిన వారం తరువాత చర్చలు జరుపుతామని కేంద్రం ప్రకటించింది. అయితే వత్తిడిని తట్టుకోలేక ముందే చర్చలకు పిలిచింది. కమిటీని వేస్తామనటం తప్ప మార్పులకు సంబంధించి నిర్దిష్ట ప్రతిపాదనలు కేంద్రం వైపు నుంచి లేవు. ఇది కాలయాపన, ఉద్యమాన్ని చల్లార్చే ఎత్తుగడ. అలాంటపుడు రైతులేమి చేయాలి ?


5. కేంద్రం చెబుతున్నది ఏమిటి ? రైతులు కోరుతున్నది ఏమిటి ?
ఐదుసార్లు చర్చలు జరిపారు. చట్టాలను పూర్తిగా వెనక్కు తీసుకోవాలని రైతులు ప్రతిసారీ చెప్పారు. సావిత్రీ నీ పతి ప్రాణంబుదక్క వరాలు కోరుకోమన్నట్లుగా అది మినహా ఇతర అంశాల గురించి మాట్లాడుదాం అనటం తప్ప కేంద్రం నుంచి మరొకమాటలేదు. రైతులు చెప్పాల్సింది చెప్పారు. ప్రభుత్వ ప్రతిపాదనలేమిటో ఇంతవరకు చెప్పలేదు.


6. కొన్ని మార్పులు చేస్తామని చెప్పారు, కనీస మద్దతు ధర కొనసాగుతుందని ప్రధాని చెప్పిన తరువాత కూడా రైతులు ఆందోళన చేయటం ఏమిటి ?
ఆ మార్పులేమిటో నిర్దిష్టంగా చెబితే రైతులు ఆలోచిస్తారు. ఎవరు చెబుతున్నది ఏమిటో జనమూ గ్రహిస్తారు. రైతులు గొంతెమ్మ కోరికలు కోరితే ఆందోళనకు మద్దతు తగ్గిపోతుంది. అయినా ప్రభుత్వం లేదా నరేంద్రమోడీ మన్‌కీ బాత్‌లో చెప్పిందేమీ లేదు. ఎవరితో సంప్రదించకుండానే ఆర్డినెన్సు తెచ్చారు. పార్లమెంట్‌లో అభ్యంతరాలను పట్టించుకోలేదు. పార్లమెంట్‌ సాక్షిగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హౌదా గురించి బిజెపి ఎంత హడావుడి చేసిందో తరువాత ఎలా ప్లేటు ఫిరాయించిందో తెలిసిందే. యాభై రోజుల్లో పెద్ద నోట్ల రద్దు సమస్యను పరిష్కరించలేకపోతే శిక్షించమని మోడీ చెప్పారు. నాలుగేండ్ల తరువాత నల్లధనాన్ని తగ్గించామని బుకాయించటం తప్ప అంకెల్లో చూపారా? జిఎస్‌టి ఆదాయం తగ్గితే పరిహారం ఇస్తామని చేసుకున్న ఒప్పందానికే ఎగనామం పెడుతూ దేవుడి లీల, కేంద్రం పరిహారం ఇవ్వలేదని బుకాయించిన తీరు చూశాము. అందువలన ప్రధాని నోటి మాటలను ఎవరైనా ఎలా నమ్ముతారు ? కనీస మద్దతు ధర గురించి చెబుతున్న మాటలనే చట్టబద్దం ఎందుకు చేయరని రాజస్దాన్‌, హర్యానాలో ఉన్న బిజెపి మిత్రపక్షాలే చెబుతున్నాయి. దాన్నయినా చేస్తామని ఎందుకు చెప్పటం లేదు ?


7. రైతులకు ఉపయోగం లేకపోతే జయప్రకాష్‌ నారాయణ వంటి మేథావులు కేంద్రాన్ని ఎందుకు సమర్ధిస్తున్నారు ?
జయప్రకాష్‌ నారాయణ ఒక మాజీ ఐఏఎస్‌ అధికారి. రాజకీయాల్లో ఒక విఫలనేత. ఆయన ఎందుకు సమర్ధిస్తున్నారో స్కాన్‌ చేసి చూడలేము. అయితే ఒక మేథావిగా ఆయన చెప్పిన మాటలను వినాల్సిందే. కానీ అవే ప్రమాణం కాదు. జెపి కంటే వ్యవసాయ-ఆర్ధిక రంగంలో ఎంతో పరిశోధనలు చేసిన నిపుణులు అనేక మంది వ్యతిరేకించారు. తెలుగు రాష్ట్రాల్లో జెపి ఎంత బాగా తెలిసిన వ్యక్తో ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ కూడా అంతే తెలుసు. మరి నాగేశ్వర్‌ వ్యతిరేకతను ఎందుకు పరిగణనలోకి తీసుకోరు.

7. రైతులను బిజెపి వ్యతిరేక పార్టీలు తప్పుదారి పట్టిస్తున్నాయి !
రైతులు అంత అమాయకులు కాదు. ఒక వేళ ఇతర పార్టీలు తప్పుదారి పట్టిస్తే బిజెపి వారిని సరైనదారిలో పెట్టలేనంత అసమర్ధంగా ఉందా ? ఈ ఆరోపణ రైతుల అనుభవం, తెలివితేటలను అవమానించటం తప్ప మరొకటి కాదు. మన దేశంలో, ప్రపంచంలో రైతాంగ ఉద్యమాలు కొత్త కాదు,ఎన్నో చారిత్మ్రాక పోరాటాలు చేశారని మరచిపోకూడదు. పంజాబ్‌ పోరాటాల గడ్డ, పంజాబీలు అటు సైన్యంలో జైజవాన్లుగా, వ్యవసాయంలో జైకిసాన్లుగా వారి పాత్రను ఎవరూ తక్కువ చేసి చూపలేరు. సెప్టెంబరు 25న తొలి ఆందోళన ప్రారంభమైంది. అప్పటి నుంచి రైతులను సమాధాన పరిచేందుకు బిజెపి చేసింది ఏమిటి ?


8.ప్రతిపక్షాలు ప్లేటు ఫిరాయించాయి. మార్కెట్‌ కమిటీలను రద్దు చేస్తామని కాంగ్రెస్‌ 2019 మానిఫెస్టోలో చెప్పింది.
ప్లేటు ఫిరాయించటం రాజకీయాల్లో కొత్త కాదు, అది ప్రజలకు మేలు చేసేది, తప్పిదాన్ని సరిదిద్దుకొనేది అయితే ఇబ్బంది ఏమిటి. ముఖ్యమంత్రిగా జిఎస్‌టిని వ్యతిరేకించిన నరేంద్రమోడీ తీరా తాను ప్రధాని అయిన తరువాత తగినకసరత్తు లేకుండా అమలు జరపటాన్ని , దేశాన్ని ఇబ్బందుల పాటు చేయటాన్ని ఏమనాలి. అనేక రాష్ట్రాలకు ప్రకటించిన పాకేజీలు, హామీలను తిరస్కరించటం ఏమిటి ? రెండు తెలుగు రాష్ట్రాలకు బిజెపి, కేంద్రి ఇచ్చిన హామీలకు మొండి చేయి చూపటాన్ని ఏమనాలి? బిజెపి గురివింద గింజ మాదిరి వ్యవహరిస్తోంది.

9. పంజాబ్‌ రైతులు, జాట్‌కులస్తులు తప్ప ఉద్యమంలో ఎవరూ లేరు ?
జయప్రకాష్‌ నారాయణ వంటి మేథావులు చేస్తున్న తప్పుడు వాదన ఇది. కుల వ్యవస్ధ ఉన్న కారణంగా ప్రతి వారూ పుట్టుకతో ఏదో ఒక కులానికి చెందుతున్నారు. అనేక మంది ఐఎఎస్‌, ఐపిఎస్‌లు ఉన్నారు ? మరి జెపి ఒక్కరే లోక్‌సత్తా ఎందుకు పెట్టారు ? ఎన్నికల్లో ఎందుకు పోటీ చేశారు ? ప్రజల సొమ్ముతో వైద్య విద్యను చదివి ప్రాక్టీస్‌ చేయకపోవటం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయటం, జనానికి అవసరమైన మరొక వైద్యుడు తయారు కాకుండా అడ్డుకోవటమే. అలాంటి వారిలో జెపి ఒకరు ఎందుకు అయ్యారు ? పోనీ ఐఎఎస్‌ అధికారిగా అయినా కొనసాగి జనానికి మేలు చేయలేదు.
ఎస్‌ పంజాబ్‌ రైతులు ఉద్యమంలో ముందున్నారు. సంస్కరణ ఉద్యమాలు, స్వాతంత్య్ర ఉద్యమంలో దేశంలోని అన్ని ప్రాంతాలూ ఒకేసారి ముందుకు ఎందుకు రాలేదో జెపి వంటి వారు చెప్పాలి. హరిత విప్లవంలో పంజాబ్‌ రైతులు ముందున్నారు. వ్యవసాయ మిగులును సాధించటంలోనూ వారే ముందున్నారు. ఆ మిగులుకు మార్కెటింగ్‌ సమస్యలు వచ్చినపుడు ప్రభావితమయ్యేదీ వారే కనుక, ముందుగా మేలుకున్నారు.
2015-16 గణాంకాల ప్రకారం దేశంలో వంద ఎకరాలలో వంద కిలోల ఆహారధాన్యాలు ఉత్పత్తి అయ్యాయనుకుంటే ఉత్తర ప్రదేశ్‌లోని 15.71 ఎకరాల్లో 16.91 కిలోలు, మధ్య ప్రదేశ్‌లోని 12.7 ఎకరాల్లో 12.08 కిలోలు పంజాబ్‌లోని 5.4 ఎకరాల్లో 11.29 కిలోలు పండుతున్నాయి. మిగిలిన సంవత్సరాలలో కూడా స్వల్ప తేడాలతో ఇదే విధంగా ఉంటాయి. దీనర్దం ఏమిటి పంజాబ్‌లో అమ్ముకోవాల్సిందీ ఎక్కువే. మార్కెట్‌ కమిటీలను, సేకరణ వ్యవస్ధలను పనికిరాకుండా చేసి, కనీస మద్దతు ధరలను నీరుగారిస్తే ఎక్కువగా నష్టపోయేది పంజాబ్‌ రైతులే కనుక వారే ముందుగా మేలుకున్నారు.
2017-18 వివరాల ప్రకారం బియ్యం ఉత్పత్తిలో పశ్చిమబెంగాల్‌ 13.26శాతంతో దేశంలో అగ్రస్దానంలో ఉంటే 11.85శాతంతో పంజాబ్‌, 11.75శాతంతో ఉత్తర ప్రదేశ్‌ రెండు, మూడు స్దానాల్లో ఉన్నాయి. ఇక బియ్యం వినియోగంలో నెలకు తలసరి వినియోగం పంజాబ్‌లో బియ్యం 0.4కిలోలు ఉంటే 14.5కిలోలతో ఒడిషా ప్రధమ స్దానంలో ఉంది. అందువలన రెండు రాష్ట్రాల రైతులకూ మార్కెటింగ్‌ సమస్యలు ఒకే విధంగా ఉంటాయా ? ఎంత పండినా వినియోగించే స్దితిలో ఒడిషా రైతు, అమ్ముకోవాల్సిన అవసరంతో పంజాబ్‌ రైతు ఉంటాడు. అందుకే ఆందోళనలో ముందుంటాడు. ఇలాంటి తేడాలే ఉంటాయి.


10.ఆందోళన చేస్తున్నది రైతులు కాదా ?
మరి ఎవరు ? సామాజిక మాధ్యమంలో మరుగుజ్జులు పంజాబ్‌ గురించి అనేక తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. అలాంటి వాటిలో ఒకదానిలో చెప్పినదాని ప్రకారం పంజాబ్‌లో వ్యవసాయం చేసే గ్రామాలు కేవలం 1,500 మాత్రమేనట. అక్కడ 30వేల మంది అడితియాస్‌(కమిషన్‌ ఏజంట్లు), వారి వద్ద పని చేసే మూడులక్షల మంది సహాయకులు కలిపి ప్రతి గ్రామానికి 220 మంది చొప్పున వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నారట. చెవుల్లో కమలం పూలు పెట్టటం తప్ప మరొకటి కాదు. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2001లో 12,729 గ్రామాలున్నాయి. తరువాత ఏవైనా కొన్నింటితో మున్సిపాలిటీలు ఏర్పాటు అయి ఉండవచ్చు. పన్నెండు వేలకు తగ్గవు.పంజాబ్‌ను వ్యవసాయ రాష్ట్రంగా చెబుతుంటే 1500 గ్రామాలతో అంత ఉత్పత్తి సాధ్యమా ? దీన్ని ప్రచారం చేస్తున్న వారు కాస్త బుర్రపెట్టి ఆలోచించాలి. ఇలాంటి లెక్కలతోనే అడితియాసే రైతుల ముసుగులో ఆందోళన చేస్తున్నట్లు బిజెపి, దాని తొత్తులు ప్రచారం చేస్తున్నారు.


11. ఇతర రాష్ట్రాలతో పోల్చటం తప్పంటారా ?
ఈ ప్రశ్నకు పంజాబ్‌ రైతుల గురించి చెప్పినదానిలోనే కొంత సమాధానం ఉంది. మార్కెట్‌ యార్డుల వెలుపల అమ్ముకొనే స్వేచ్చ ఇస్తే రైతులకు లాభం అని చెప్పేవారి దగ్గర ఆధారం లేదు. ఒక భ్రమ మాత్రమే. బీహార్‌లో నితీష్‌ కుమార్‌ ప్రభుత్వం 2006లోనే వ్యవసాయ మార్కెట్‌ కమిటీలను రద్దు చేసింది. ధాన్య సేకరణ బాధ్యతను సహకార సంస్దలకు, వ్యాపారమండళ్లకు అప్పగించింది. గత ఏడాది 30లక్షల టన్నులు సేకరణ లక్ష్యంగా చెప్పారు, 20లక్షల టన్నులకు దాట లేదు. గతేడాది క్వింటాలు ధాన్యం కనీస మద్దతు ధర రూ.1,815 ఉంటే బహిరంగ మార్కెట్లో సీజన్లో రూ.1,350కి అమ్ముకున్నారు( మే 8, 2019 డౌన్‌టు ఎర్త్‌). ఏటా బీహార్‌లో 1.6 కోట్ల టన్నుల ధాన్యం పండుతుందని అంచనా. దీనిలో 30లక్షల టన్నుల సేకరణ లక్ష్యం. ఈ ఏడాది నవంబరు 15 నుంచి డిసెంబరు ఐదువరకు కొన్నది కేవలం 793 టన్నులు మాత్రమే. కనీస మద్దతు ధర రూ.1,868 కాగా రైతులు రూ.800-1200 మధ్య అమ్ముకుంటున్నారు(డిసెంబరు ఆరు, 2020 ఇండియన్‌ ఎక్స్‌ ప్రెస్‌). అందుకే బీహార్‌ పరిస్ధితితో పోల్చుకొని పంజాబ్‌ రైతులు ముందే మేలుకున్నారు. పంజాబీలను చూసి బీహారీలు కూడా వీధుల్లోకి రావచ్చు.అందువలన అందరూ ఉద్యమంలోకి ఎందుకు రావటం లేదని కాదు వచ్చిన వారి డిమాండ్లలో న్యాయం ఎంత అన్నది ముఖ్యం.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

జస్టిస్‌ ఎన్‌వి రమణపై సిఎం జగన్‌ ఫిర్యాదు-పర్యవసానాలేమిటి ?

11 Sunday Oct 2020

Posted by raomk in AP NEWS, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ 2 Comments

Tags

Chief Justice of India S A Bobde, SC judge NV Ramana, YS jagan


ఎం కోటేశ్వరరావు


న్యాయమూర్తుల మీద ఫిర్యాదులు చేయటం కొత్త కాదు. అయితే చేసిన ఫిర్యాదును ఒక ముఖ్యమంత్రి పత్రికలకు విడుదల చేయటం దేశ న్యాయ, రాజకీయ చరిత్రలో కొత్త అధ్యాయానికి నాంది పలికింది. సుప్రీం కోర్టులో ప్రస్తుతం ద్వితీయ స్ధానంలో ఉండి తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందనున్న జస్టిస్‌ ఎన్‌వి రమణ ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారని తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రతిపక్ష తెలుగుదేశం నేత చంద్రబాబు నాయుడికి అనుకూలంగా న్యాయమూర్తులను ప్రభావితం చేస్తున్నారంటూ ప్రధాన న్యాయమూర్తికి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్య మంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి రాసిన లేఖలో పేర్కొన్నారు.


న్యాయమూర్తుల మీద గతంలో కూడా అధికారంలో ఉన్న వారు ఫిర్యాదులు చేసినప్పటికీ ఈ విధంగా వాటిని బహిరంగపరచలేదు. పదోన్నతి వరుసలో ఉన్న న్యాయమూర్తుల మీద ఆరోపణలు చేయటం ఒక ధోరణిగా మారిందని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఏ బోబ్డే కొద్ది వారాల క్రితం ఒక కేసు విచారణ సందర్భంగా వ్యాఖ్యానించారు. దాని తరువాత ఇప్పుడు ఈ పరిణామం చోటు చేసుకుంది. గతంలో న్యాయమూర్తుల వ్యక్తిగత ప్రవర్తన మీద, అధికార దుర్వినియోగం గురించి ఫిర్యాదులు కోర్టు విచారణల వరకు వెళ్లాయి. మధ్య ప్రదేశ్‌కు చెందిన ఒక సీనియర్‌ జిల్లా న్యాయమూర్తి తనను లైంగికంగా వేధించారంటూ ఒక మహిళా జడ్జి చేసిన ఫిర్యాదు విచారణ సమయంలో జస్టిస్‌ బోబ్డే వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు జస్టిస్‌ ఎన్‌వి రమణ కూడా ప్రమోషన్‌ వరుసలో ఉన్నారు. అయితే ఈ ఫిర్యాదు కోర్టులో లేదా పోలీస్‌ సేష్టన్‌లో దాఖలు కాలేదు. గతంలో న్యాయమూర్తులకు రాసిన లేఖలను, పత్రికా వార్తల మీద స్పందించి విచారణకు ఆదేశించిన ఉదంతాలు ఉన్నాయి. ఇప్పుడు దీన్ని ఎలా పరిగణిస్తారు అన్నది పెద్ద ప్రశ్న.


మధ్య ప్రదేశ్‌ జిల్లా జడ్జిపై వచ్చిన ఆరోపణల కేసులో ఎవరైనా పదోన్నతి పొందుతారు అనగానే మన వ్యవస్దలో అన్ని రకాల అంశాలు ప్రారంభం అవుతాయి. ఫిర్యాదులు చేస్తారు, పత్రికల్లో వార్తలు కనిపిస్తాయి, అరే ఇతను అంత చెడ్డవాడా అని ఆకస్మికంగా జనాలు గుర్తు చేసుకుంటారు అని జస్టిస్‌ బోబ్డే వ్యాఖ్యానించారు. ఆ జిల్లా జడ్జి ఈ ఏడాది చివరిలో ఉద్యోగ విరమణ చేయాల్సి ఉంది. హైకోర్టు న్యాయమూర్తిగా ప్రమోషన్‌ అవకాశాలున్నాయని అనుకుంటున్న సమయంలో అతని మీద 2018లో పని స్ధలంలో లైంగిక వేధింపుల కేసు నమోదైంది. ఫిర్యాదు చేసింది కూడా మరొక జడ్జి కావటం గమనార్హం. జిల్లా ప్రధాన జడ్జిని మరొక జిల్లాకు బదిలీ చేశారు. అతని మీద వచ్చిన ఫిర్యాదులను విచారించిన అంతర్గత ఫిర్యాదుల విచారణ కమిటీ క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసింది. తన మీద చర్యను నిలిపివేయించాలని కోరుతూ సదరు న్యాయమూర్తిని సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ముందు హైకోర్టుకు వెళ్లండి అని సుప్రీం కోర్టు సలహాయిచ్చింది. అయితే హైకోర్టులో ఎలాంటి ఊరట లభించకపోవటంతో తిరిగి సుప్రీం కోర్టును ఆశ్రయించారు.


న్యాయమూర్తుల మీద ఫిర్యాదులు చేయకూడనే నిబంధనలేవీ లేవు. ఎవరి మీద అయినా ఫిర్యాదులు చేయవచ్చు. అయితే రాజ్యాంగ పదవిలో ఉన్నవారికి వాటి మీద విచారణ జరిపే పరిస్ధితి వస్తే కొన్ని రక్షణలు ఉన్నాయి. బాబరీ మసీదు కూల్చివేత సమయంలో ఉత్తర ప్రదేశ్‌ ముఖ్య మంత్రిగా ఉన్న బిజెపి నేత కల్యాణ్‌ సింగ్‌ మీద సిబిఐ కేసు దాఖలు చేసింది. అయితే 2014లో రాజస్ధాన్‌ గవర్నర్‌గా నియమించటంతో విచారణ నిలిపివేశారు. పదవీ కాలం ముగిసిన తరువాత విచారణకు పిలవ వచ్చని సుప్రీం కోర్టు చెప్పింది.


ఇప్పుడు జస్టిస్‌ ఎన్‌వి రమణ మీద ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి లేఖ ద్వారా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి చేసింది ఫిర్యాదు మాత్రమే. దాని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు అన్నది ప్రస్తుతానికి ఊహాజనితమైన అంశమే. ప్రతి కేసులో ఒకరు ఓడిపోతారు, రెండవ వారు గెలుస్తారు. ఓడిన వారు న్యాయమూర్తి వల్లనే తనకు అన్యాయం జరిగిందని విమర్శ లేదా ఆరోపణ చేయవచ్చు. అది ఇతర న్యాయమూర్తుల మీద ప్రభావం చూపుతుంది. చివరకు న్యాయవ్యవస్ధ మీదనే విశ్వాసం సన్నగిల్లుతుంది. ఈ నేపధ్యంలోనే న్యాయమూర్తులకు రక్షణ కల్పిస్తూ బ్రిటీష్‌ వారి హయాంలోనే చట్టాలు చేశారు.
న్యాయమూర్తిగా వ్యవహరించే వారు ఇచ్చిన తీర్పులను పై కోర్టులో సవాలు చేయవచ్చు తప్ప వారి మీద చర్యలు తీసుకొనేందుకు వీలు లేకుండా రక్షణ కల్పించారు. అయితే కొన్ని ఉదంతాలలో న్యాయమూర్తులు తప్పు చేసినట్లు ఫిర్యాదులు దాఖలయ్యాయి. అవి వాస్తవమే అని తేలిన సందర్భాలలో వారికి రక్షణ వర్తించదు అన్న తీర్పులు వచ్చాయి. ఒక సబ్‌డివిజనల్‌ మెజిస్ట్రేట్‌ ఒక వ్యక్తి అరెస్టు మరియు నిర్బంధానికి ఇచ్చిన ఉత్తరువు నిర్లక్ష్యపూరితంగా ఉందని భావించిన సుప్రీం కోర్టు బాధితుడికి నష్టపరిహారంగా ఐదువేల రూపాయలు ఇవ్వాలన్న తీర్పును సమర్ధించింది. మరో కేసులో ఒక మెజిస్ట్రేట్‌ తన బుర్రను ఉపయోగించకుండా ఒక వారంట్‌ మీద సంతకం చేయటం అక్రమం అని బాధితుడు సెషన్స్‌ కోర్టులో వేసిన కేసులో న్యాయమూర్తి తప్పు చేశారని బాధితుడికి ఐదు వందల రూపాయల పరిహారం చెల్లించాలని తీర్పు వచ్చింది. మరో కేసులో ఆరోపణలు చేసిన న్యాయవాది ఒక రౌడీ గూండా, జూదగాడని ఒక మెజిస్ట్రేట్‌ స్వయంగా కోర్టులో చెప్పటం విధి నిర్వహణలో భాగం కాదని అందువలన అతని మీద చర్య తీసుకోవచ్చని సుప్రీం కోర్టు చెప్పింది. మరో కేసులో ఒక మున్సిఫ్‌ మెజిస్ట్రేట్‌ విధి నిర్వహణలో ఎల్‌ఎల్‌ఎం పరీక్ష రాస్తూ కాపీ చేస్తూ దొరికి పోయాడు. తాను న్యాయాధికారిని కనుక తనమీద చర్య తీసుకోరాదని వాదించటాన్ని కోర్టు అంగీకరించలేదు.


ఉద్యోగ బాధ్యతల్లో ఉన్న న్యాయమూర్తులపై చర్యలు తీసుకోవాల్సి వస్తే ముందుగా రాష్ట్రపతి నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంది. రాష్ట్రపతి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి సలహా మేరకు వ్యవహరించాలి. ప్రధాన న్యాయమూర్తి సలహాను రాష్ట్రపతి పాటించాలి. ఇప్పుడు జస్టిస్‌ ఎన్‌వి రమణపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ఆరోపణలతో లేఖద్వారా ఫిర్యాదు చేశారు. ఇలాంటి ఉదంతాలు గతంలో లేవు లేదా రహస్యంగా చేసిన ఫిర్యాదుల మీద చర్యలు తీసుకున్న ఉదంతాలు లేవు. ఫిర్యాదుల స్వభావాన్ని బట్టి ప్రధాన న్యాయమూర్తి తోటి న్యాయమూర్తి మీద విచారణకు ఆదేశిస్తారా లేక ఫిర్యాదుల్లో పసలేదని, బహిరంగంగా ప్రకటించి ఒక న్యాయమూర్తి ప్రతిష్టకు భంగం కలిగించారని ఫిర్యాదుదారు మీద చర్య తీసుకుంటారా ?


ఒక వేళ హైకోర్టు, సుప్రీం కోర్టు న్యాయమూర్తుల మీద తొలగింపు వంటి చర్యలు తీసుకోవాల్సి రాష్ట్రపతి ఉత్తరువు జారీ చేయాలి. దానికి ముందు పార్లమెంట్‌ ఉభయ సభల్లో మెజారిటీ సభ్యులు చర్యలకు ఆమోదం తెలపాలి. ఓటింగ్‌ సమయంలో మూడింట రెండువంతుల మంది సభ్యులు హాజరు ఉండాలి. న్యాయమూర్తుల తీరుతెన్నులపై చర్చ జరపకూడదు. గతంలో జస్టిస్‌ రామస్వామి మీద చర్యకు పార్లమెంట్‌లో జరిగిన ఓటింగ్‌లో మెజారిటీ లేక ప్రతిపాదన వీగిపోయింది. ఒక ప్రధాన న్యాయమూర్తి మీద చర్యను ప్రతిపాదన దశలోనే రాజ్యసభలో తిరస్కరించి అసలు ఓటింగ్‌ వరకే రానివ్వలేదు.


సమాజ సరళి ప్రతి వారి మీద ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం ముందుకు వచ్చిన ఈ సమస్య మన వ్యవస్దలో ఇప్పటి వరకు అంతర్గతంగా జరుగుతున్నట్లు భావిస్తున్న, చెవులు కొరుకుతున్న కుమ్ములాటలను బహిర్గతం చేసింది. దీని పర్యవసానాలపై ఎవరు ఎలాంటి వ్యాఖ్యానాలు అయినా చేయవచ్చు. జరుగుతున్న పరిణామాలు, ప్రచారాలు న్యాయవ్యవస్ధ మీద జనానికి విశ్వాసం మరింత సడలటానికే దోహదం చేస్తున్నాయి. రానున్న రోజుల్లో ప్రతి కేసును కుల, ప్రభావాల ప్రాతిపదికన జనం చూసినా ఆశ్చర్యం లేదు. ఇలాంటి పరిణామాన్నే పాలకులు కోరుకుంటున్నారా ?

కోర్టుల తీరుతెన్నుల మీద సీనియర్‌ న్యాయవాది నలుగురు మాజీ ప్రధాన న్యాయమూర్తుల తీర్పుల తీరుతెన్నులపై చేసిన విమర్శలు వ్యక్తిగతం కానప్పటికీ సుప్రీం కోర్టు నేరంగా పరిగణించింది. ఇప్పుడు ప్రత్యేకించి ఒక న్యాయమూర్తి మీద జగన్‌ ఫిర్యాదు చేశారు. రాసిన లేఖకు ప్రధాన న్యాయమూర్తి నుంచి సమాధానం వచ్చేవరకు ఆగి ఉండాల్సిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. హైకోర్టు న్యాయమూర్తులు సుప్రీం కోర్టు న్యాయమూర్తి రమణ ప్రభావానికి లోనై తీర్పులు ఇస్తున్నారని ఆరోపించటం ఇప్పుడు విధి నిర్వహణలో ఉన్న న్యాయమూర్తులను బ్లాక్‌మెయిల్‌ చేయటమే అంటున్నవారు లేకపోలేదు. తీర్పులను విమర్శించ వచ్చు తప్ప న్యాయమూర్తులకు దురుద్దేశ్యాలను ఆపాదించిన వారు దాన్ని నిరూపించుకోవాలి లేకపోతే వారి మీదనే చర్యలు తీసుకోవచ్చు. ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్‌ రాసిన లేఖ హైకోర్టు న్యాయమూర్తులకు దురుద్దేశ్యాలను ఆపాదించటం ఒకటైతే, వారిని సుప్రీం కోర్టు న్యాయమూర్తి రమణ ప్రభావితం చేశారని ఆరోపించటం మరొకటి. ఈ రెండింటికీ తగిన ఆధారాలను చూపాల్సి ఉంటుంది. జస్టిస్‌ రమణ కుటుంబ సభ్యుల పేరు మీద ఉన్న కొన్ని ఆస్తుల వివరాలను కూడా ముఖ్యమంత్రి ప్రధాన న్యాయమూర్తికి పంపటమే కాదు, బహిరంగపరిచారు. ఆస్తులు ఉండటం తప్పు కాదు, వాటిని ఎలా సంపాదించారనేది సమస్య. ఆదాయానికి మించి సంపాదిస్తే ఆదాయ వనరులను తెలియచేయాల్సి ఉంటుంది. వీగిపోయిన లేదా గెలిచిన ప్రతి కేసు వెనుక ఎవరో ఒకరు న్యాయమూర్తులను ప్రభావితం చేశారని ఆరోపించితే రాబోయే రోజుల్లో కేసులు నమోదైతే వాటి మీద ప్రభావం పడకుండా ఉంటుందా ? సుప్రీం కోర్టులో కూడా కేసులు వీగిపోతే అక్కడి న్యాయమూర్తుల మీద కూడా ఇలాంటి ఆరోపణలే చేస్తారా ? వీటికి అంతమెక్కడ ? ఈ వివాదానికి ముగింపు ఎలా ఉంటుంది ? అన్నీ శేష ప్రశ్నలే.


ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో నడుస్తున్న కేసుల మీద, న్యాయమూర్తుల మీద సామాజిక మాధ్యమంలో జరుగుతున్న ప్రచారం ఒకటైతే. పార్టీలు, మీడియా వ్యాఖ్యాతలు చేస్తున్న అంశాలు కూడా ప్రాధాన్యత సంతరించుకుంటున్నాయి. చంద్రబాబు నాయుడు కోర్టులను ప్రభావితం చేస్తున్నారని గతంలో విమర్శించిన వైసిపి నేతలు ఇప్పుడు ఏకంగా సుప్రీం కోర్టు న్యాయమూర్తి రమణ స్వయంగా జోక్యం చేసుకొని ప్రభావితం చేస్తున్నారని రోడ్డెక్కారు. గతంలో 16నెలల పాటు జైల్లో ఉన్న జగన్‌ బెయిలు పొందేందుకు నాటి యుపిఏ ప్రభుత్వ సహకారాన్ని పొందారంటూ ఒక వ్యాఖ్యాత పలికారు. ఇప్పుడు కేసులు తుది విచారణకు వస్తున్నందున తిరిగి కేంద్ర సాయం కావాల్సి వచ్చిందని, మోడీ-షా ద్వయం సహకరిస్తారనే నమ్మకం లేకపోయినా సన్నిహితంగా మెలిగేందుకు ప్రయత్నిస్తున్నారని కూడా రాశారు. గతంలో కేంద్రంలో అధికారంలో ఉన్న పెద్దలు న్యాయమూర్తులను ప్రభావితం చేసి బెయిల్‌ ఇప్పించారని సూటిగానే చెప్పారు. అధికారంలో ఉన్న వారికి అలాంటి ప్రభావం చూపే అవకాశం ఉందన్నపుడు వైసిపి ఆరోపిస్తున్నట్లుగా చంద్రబాబు సైతం అలా ప్రభావితం చేస్తారనేందుకు ఆస్కారం లేదా ? జస్టిస్‌ రమణ పూర్వాశ్రమంలో న్యాయవాదిగా తెలుగుదేశం పార్టీలో పని చేయలేదా కేసులను చూడలేదా ? ఆ పరిచయంతో చంద్రబాబు ప్రభావితం చేసి ఉండవచ్చని జనం అనుకొనేందుకు ఆస్కారం లేదా ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

విశాఖ రైల్వేజోన్‌ ఎండమావేనా ?

04 Sunday Oct 2020

Posted by raomk in AP, AP NEWS, BJP, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Telangana

≈ Leave a comment

Tags

Indian Railways, SCoR-Visakhapatnam, South Coast Railway (SCoR) zone


ఎం కోటేశ్వరరావు


ప్రధాని నరేంద్రమోడీ నిజంగా తలచుకోవాలేగానీ ఏదైనా క్షణాల్లో అయిపోతుంది. కోరుకున్నవాటిని మాత్రమే తలచుకుంటారు, అదే అవుతుంది. జూన్‌ ఐదున వ్యవసాయ చట్ట సవరణ ఆర్డినెన్స్‌ తీసుకు వచ్చి సెప్టెంబరు మూడవ వారానికి పార్లమెంటులో ఆమోదం కూడా పొందారు. కరోనా అడ్డం రాలేదు. కాశ్మీరు రాష్ట్ర రద్దు అయితే ఒకే ఒక్క రోజులో పూర్తి చేశారు. అసెంబ్లీ అభిప్రాయం కూడా తీసుకోలేదు, ఎంత పట్టుదల, ఎంత వేగం ? ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డి సర్కారు మూడురాజధానులు, ఇతర కొన్ని కేసుల మీద ఉన్న ఆత్రంతో వివాదాల విచారణను వేగవంతం చేయించాలని సుప్రీం కోర్టు తలుపులు తట్టటాన్ని చూశాము. రాష్ట్రానికి అది అత్యంత ప్రాముఖ్యత అంశంగా భావించారు. విశాఖ రైల్వే జోన్‌ సంగతేమిటి ? ఎవరికైనా పట్టిందా, వెంటనే ఉనికిలోకి తీసుకురావాలనే కోరిక ఉందా ?


కేంద్ర ప్రభుత్వం అంగీకరించినట్లు ప్రకటించిన విశాఖ రైల్వే జోన్‌ ఉనికిలోకి రావటం గురించి అటు కేంద్రానికి పట్టలేదు, ఇటు రాష్ట్రమూ పట్టించుకోలేదు. ఎంత సమయం తీసుకుంటారు ? ఏమిటి ఆటంకాలు ? రాష్ట్ర పునర్విభజన చట్టంలో వాగ్దానం చేసినమేరకు నిర్ణయం తీసుకొనేందుకు దాదాపు ఐదు సంవత్సరాలు పట్టింది. గతేడాది ఫిబ్రవరిలో ఎన్నికల ముందు ప్రకటించారు. పందొమ్మిది నెలలు గడుస్తోంది. ఇప్పుడు ప్రతిదానికి కరోనాను చూపుతున్నారు ? కరోనా కారణంగా ఏది ఆగింది ? రైల్వే జోన్‌ ఉనికిలోకి ఎందుకు రావటం లేదు ?


విశాఖ రైల్వే డివిజన్‌ను రద్దు చేస్తారు, ఆ భవనాల్లో జోనల్‌ కార్యాలయాలను ఏర్పాటు చేయవచ్చు. సిబ్బందిని కొత్తగా నియమించటం లేదు, ఉన్నవారినే సర్దుబాటు చేయవచ్చు, దానికీ ఇబ్బందీ లేదు.లాక్‌డౌన్‌ దశలవారీ ఎత్తివేస్తున్నారు.నామ మాత్రంగానే కొన్ని ఆంక్షలు ఉన్నాయి. మరి ఆటంకం ఏమిటి ? కొన్ని వసతులు ఏర్పాటు చేసేందుకు డబ్బు కొరతా ? అదేమీ వేల కోట్లు కాదే ! పోనీ అదైనా చెప్పాలి కదా ? రైల్వే బడ్జెట్‌ను సాధారణ బడ్జెట్‌లో కలిపివేశారు. వస్తున్న వార్తలను బట్టి వచ్చే ఏడాది కూడా దేశ జిడిపి తిరోగమనంలో ఉంటుందని చెబుతున్నారు. పోనీ పురోగమనంలోకి వచ్చిన తరువాతే ఉనికిలోకి వస్తుందని స్పష్టంగా చెప్పవచ్చు. ఎవరూ ఏమీ మాట్లాడరు ? ఏమనుకోవాలి ?
వస్తున్న వార్తలను బట్టి సంస్కరణల పేరుతో ఇప్పుడు ఉన్న 17 రైల్వే జోన్లను తగ్గిస్తారా ? అందుకే 18వ జోన్‌ విశాఖను తాత్సారం చేస్తున్నారా ? రైల్వే సంస్కరణల్లో భాగంగా అసలు జోనల్‌ వ్యవస్ధలనే ఎత్తివేసి కార్యకాలపాల ఆధారంగా కొత్త సంస్ధలను ఏర్పాటు చేస్తారా ? అనేక ప్రశ్నలు ముసురుతున్నాయి.ఏమైనా జరగవచ్చు. రైల్వేలను కూడా దశలవారీ ప్రయివేటీకరించే ఆలోచనలో పాలకులు ఉన్నారు.దానికి అవసరమైన నియంత్రణ కమిషన్‌, ధరల పెరుగుదలకో మరొక పెరుగుదలకో చార్జీల పెంపును ముడిపెట్టి ప్రభుత్వ నిర్ణయంతో పని లేకుండా అధికార యంత్రాంగమే నిర్ణయించే ఏర్పాట్లు కూడా ఆలోచనలో ఉన్నాయి.


జపాన్‌లో రైల్వే వ్యవస్ధ ప్రయివేటీకరణ తరువాత సరకు రవాణాకు దేశం మొత్తాన్ని ఒక యూనిట్‌గానే పరిగణించారు, ప్రయాణీకుల విషయానికి వస్తే ఆరు ప్రాంతీయ కంపెనీలను ఏర్పాటు చేసి ఏ మార్గంలో రైళ్లు నడపాలో లేదో నిర్ణయించుకొనే స్వేచ్చ ఇచ్చారు. చైనాలో పునర్వ్యవస్దీకరణలో భాగంగా సరకు రవాణా, ప్రయాణీకులు, రైలు మార్గాల యాజమాన్యాలకు స్వతంత్ర సంస్దలను ఏర్పాటు చేశారు. ఆ మూడు విభాగాల్లో కూడా ఉప విభాగాలు ఉంటాయి. బ్రిటన్‌లో ప్రయివేటీకరణలో భాగంగా 25కంపెనీలను ఏర్పాటు చేసి ప్రయివేటీకరించారు. మన దేశంలో కూడా ప్రయివేటు రైళ్లను అనుమతించాలని నిర్ణయించిన విషయం తెలిసినదే. రైల్వే బోర్డు, జోనల్‌, డివిజన్లను రద్దు చేసి కొత్త వాటిని తీసుకు రారనే హామీ లేదు.


ఈ నేపధ్యంలోనే మూడులక్షల ఉద్యోగాలను రద్దు చేయాలని 55 ఏండ్లు దాటిన వారి జాబితాలను సిద్దం చేయాలని, సిబ్బంది పని తీరును సమీక్షించాలని నిర్ణయించారు. ఈ మేరకు అన్ని జోన్లకు లేఖలు రాసిన విషయం తెలిసిందే.ప్రస్తుతం 13-14 లక్షల మంది సిబ్బంది ఉన్నారు.రిటైరైన ఖాళీలను భర్తీ చేయకుండా ఉంచటం, పని తీరు బాగోలేదని భావించిన వారిని నిర్బంధంగా రిటైర్‌ చేయించే ఆలోచన చేస్తున్నారు. అయితే ఈ విషయమై జోనల్‌ అధికారులకు రాసిన లేఖలు తీవ్ర సంచలనం, ఉద్యోగుల్లో వ్యతిరేకత తలెత్తటంతో వివరణ పేరుతో శాంత పరిచేందుకు మరొక ప్రకటన చేశారు.పని తీరుబాగో లేని వారిని తొలగించటం అంటే కొత్త ఉద్యోగాలు ఉండవని కాదన్నదే దాని సారాంశం. 2014-19 మధ్య 2,83,637 పోస్టుల భర్తీ కసరత్తు జరిగిందని వాటిలో 1,41,060పోస్టులకు పరీక్షలను పూర్తిచేశామని ఆ ప్రక్రియ త్వరలో పూర్తి అవుతుందని పేర్కొన్నది.


పొదుపు చర్యల్లో భాగంగా కొత్తగా రక్షణ సిబ్బందిని తప్ప కొత్తగా ఏ పోస్టును సృష్టించవద్దని ఆదేశించారు. ఉన్న సిబ్బందితో పలు రకాల పనులు చేయించాలి. కనీస సంఖ్యలో సిబ్బందితో పని చేయించేందుకు ఏర్పాటు చేయాలని, కొత్తగా నియామకాలు జరపవద్దని, గత రెండు సంవత్సరాల్లో సృష్టించిన పోస్టుల గురించి సమీక్ష జరపాలని, వాటిలో నియామకాలు జరపకపోతే నిలిపివేయాలని, సిబ్బందిని హేతుబద్దీకరించాలని, ఆర్ధికంగా లాభసాటి గాని శాఖలను మూసివేయాలని, ఇంకా అనేక పొదుపు చర్యలను ఆదేశించారు. 2014కు ముందు ప్రకటించిన గుల్బర్గ, జమ్ము, సిల్చార్‌ తప్ప కొత్త డివిజన్ల ఏర్పాటు ఆలోచన లేదని 2015లో కేంద్ర ప్రకటించింది.విశాఖను రద్దు చేస్తున్నారు కనుక రాయఘడ డివిజన్‌ ఏర్పాటుకు ప్రతిపాదించారు.


విశాఖలో ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించిన దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ఏర్పాటుకు గాను విశాఖ డివిజన్‌ను రద్దు చేసి దాని ఆధీనంలోని 30శాతం మార్గాలను విజయవాడ డివిజన్‌లో విలీనం చేసి మిగిలిన వాటితో రాయఘడ కేంద్రంగా కొత్త డివిజన్‌ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఈ ఏడాది ఏప్రిల్‌ ఒకటి నుంచి విశాఖ జోన్‌ ఉనికిలోకి రానున్నదని సంకేతాలు ఇచ్చారు.వివరణాత్మక ప్రాజెక్టు నివేదిక(డిపిఆర్‌)ను గత ఆగస్టులో సమర్పించారు. ఈ ఏడాది ఫిబ్రవరి లేదా ఏప్రిల్‌ ఒకటి నుంచి కొత్త జోన్‌ కార్యకలాపాలు ప్రారంభించవచ్చని దానిలో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దుల్లో ఉన్న రైల్వే మార్గాలన్నీ విశాఖ జోన్‌లో ఉంచాలని పలువురు కోరారు. కేంద్ర ప్రభుత్వం డిపిఆర్‌ మీద ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదు. నిర్ణయం తీసుకున్న తరువాత కార్యకలాపాల ప్రారంభానికి నాలుగు నుంచి ఆరునెలల వ్యవధి అవసరం అవుతుందని అంచనా. డిపిఆర్‌ గురించి ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవటం అనేక అనుమానాలకు తావిస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోనరెడ్డి లేదా ఢిల్లీలోని రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు గానీ ఈ అంశం మీద కేంద్రాన్ని సంప్రదించినట్లు వార్తలు లేవు.


విశాఖ జోన్‌ ఉనికిలోకి వస్తే ఈస్ట్‌కోస్ట్‌ రైల్వే జోన్‌ పరిధి గణనీయంగా తగ్గిపోతుంది. ఇది ఒడిషాలో రాజకీయ సమస్యలకు దారి తీయవచ్చు. ఈ నేపధ్యంలో రెండు రాష్ట్రాలను ఒకేసారి సంతృప్తి పరచటం సాధ్యం కాదు. ఆంధ్రప్రదేశ్‌లో బిజెపికి కొత్తగా పోయేదేమీ లేదు. ఈస్ట్‌కోస్ట్‌ రైల్వే ప్రధాన కేంద్రం భువనేశ్వర్‌లో ఉంది. తమ జోన్‌ పరిధి తగ్గిపోనుందనే భయంతో బిజెపి, దాని మిత్ర పక్షం బిజెడి తెచ్చిన వత్తిడి మేరకు విశాఖ డివిజన్నే రద్దు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఒడిషాలో బిజెపి పరువును కాపాడేందుకు ఏదో ఒక సాకుతో విశాఖ జోన్‌ ఉనికిలోకి రాకుండా చూడాలని కేంద్రం చూస్తున్నదా ? రైల్వేజోన్ల తగ్గింపు అంశం కూడా పరిశీలనలో ఉన్నదని రైల్వే మంత్రి పార్లమెంట్‌లో చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. అదే వాస్తవమైతే ఆ పేరుతో విశాఖ రైల్వేజోన్‌ ఇచ్చినట్లుగానూ ఇవ్వనట్లుగానూ ఎటూ తేల్చకుండా ఉంచేందుకు పూనుకున్నారా ? ఏమో ! కేంద్ర పెద్దలు దేనికైనా సమర్ధులు. ఆంధ్రప్రదేశ్‌లో పాలకపార్టీ లేదా బిజెపి లేదా దాని మిత్ర పక్షాలకు ఇదేమీ పట్టినట్లు లేదు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హౌదా ఒక దగా ! వి శాఖ రైల్వే జోన్‌ మరో దగా కాదు కదా !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

అమెరికాతో వాణిజ్య ఒప్పందం – మన రైతాంగానికి పొంచి ఉన్న మరో ముప్పు !

01 Thursday Oct 2020

Posted by raomk in AP NEWS, CHINA, Current Affairs, Economics, Farmers, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, USA

≈ Leave a comment

Tags

Indian agriculture, indian farmers, minimum support price, Trade agreement with US, WTO-India


ఎం కోటేశ్వరరావు


కర్ణుడి చావుకు కారణాలు అనేకం అన్నట్లుగా మన దేశ రైతాంగానికి అనేక వైపుల నుంచి ముప్పు ముంచుకు వస్తోంది. ఏ కష్టం వచ్చినా కాచుకొనే ప్రభుత్వం ఉంటే అదొక తీరు. బాధ్యతల నుంచి తప్పుకొంటున్న పాలకులు ఒక వైపు ఉంటే రైతాంగాన్ని నిలువు దోపిడీ చేసే శక్తులు మరోవైపు కమ్ముకు వస్తున్నట్లుగా ఉంది. ప్రభుత్వ సేకరణ, కనీస మద్దతు ధరల విధానాన్ని ఎత్తివేయాలని ప్రపంచ వాణిజ్య సంస్ధ (డబ్ల్యుటిఓ) ద్వారా ధనిక దేశాల కార్పొరేట్‌ సంస్దలు తెస్తున్న వత్తిడికి ప్రధాని నరేంద్రమోడీ లొంగిపోయారా ? దాన్ని నీరుగార్చే చర్యల్లో భాగంగానే సంస్కరణల పేరుతో వ్యవసాయ, నిత్యావసర వస్తువుల చట్టాలలో సవరణలు చేశారా ? యావత్‌ వినియోగదారులు, రైతాంగ ప్రయోజనాలను ఫణంగా పెట్టారా ? మరోవైపు అమెరికాతో కుదరబోతోందని చెబుతున్న ఒప్పంద రూపంలో మరో ముప్పు పొంచి ఉంది. ఒక వేళ కుదిరితే దాని బాటలోనే ఇంకా ఏ దేశాలు ఏ గొంతెమ్మ కోరికలు కోరతాయో తెలియదు. ఇవన్నీ చుట్టుముడుతున్న ప్రశ్నలు, సమస్యలు.


వ్యవసాయ ఉత్పత్తుల పన్నులలో మార్పులు చేర్పులు గురించి ముందుగానే తెలియచేయాలన్న కెనడా తదితర దేశాల ప్రతిపాదనను మన దేశం వ్యతిరేకించింది. అలా చేస్తే అది సట్టాబేరాలకు, ఇతర అక్రమ లావాదేవీలకు దారి తీస్తుందని, ఆహార ధాన్యాల నిల్వల మీద ప్రభావం చూపుతుందని పేర్కొన్నది. పారదర్శకత, వర్తించే పన్నుల గురించి అంచనాలకు వచ్చేందుకు వీలుగా ముందుగానే పన్నుల వివరాలు వెల్లడించాలని ప్రపంచ వాణిజ్య సంస్ధ సభ్య దేశాలైన కెనడా, ఆస్ట్రేలియా, బ్రెజిల్‌ తరఫున కెనడా ప్రతినిధి ప్రపంచ వాణిజ్య సంస్ధలోని వ్యవసాయ కమిటీ సమావేశంలో ఈ ప్రతిపాదనను ముందుకు తెచ్చారు. వచ్చే ఏడాది జరగనున్న వ్యవసాయ మంత్రుల సమావేశ అజండాను ఖరారు చేసేందుకు ఇటీవల జరిగిన సమావేశంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. ముందుగానే పన్నుల వివరాలను వెల్లడిస్తే పండ్లవంటి తాజా ఉత్పత్తులకు ఎంతో మేలు జరుగుతుందని బ్రెజిల్‌ పేర్కొన్నది. ఈ మూడు దేశాల, అదేమాదిరి అభిప్రాయాన్ని ముందుకు తెచ్చిన రష్యా ప్రతిపాదనకు అమెరికా, అర్జెంటీనా, న్యూజిలాండ్‌, ఉరుగ్వే,ఉక్రెయిన్‌ కూడా మద్దతు తెలిపాయి. మనదేశంతో పాటు దక్షిణాఫ్రికా, ఈజిప్టు వ్యతిరేకించాయి.ఈ దేశాలు వ్యక్తం చేసిన కొన్ని అంశాలతో తాము కూడా ఏకీభవిస్తున్నట్లు చైనా పేర్కొన్నది.


ఈ సమావేశంలోనే మన ప్రభుత్వం ఇస్తున్న పంచదార రాయితీలు, రవాణా, మార్కెటింగ్‌ రాయితీల గురించి, ఆహార నిల్వల ప్రభావం ఏమిటంటూ మిగతా దేశాలు ఆరాతీశాయి. పందొమ్మిది బిలియన్‌ డాలర్ల పరిమితిని అతిక్రమించి అమెరికాలో ఇస్తున్న 34బిలియన్‌ డాలర్ల రాయితీల సంగతేమిటని మన దేశంతో సహా అనేక దేశాలు ప్రశ్నించాయి. మన ప్రభుత్వం అనుసరిస్తున్న కనీస మద్దతు ధరల విధానం రైతులకు రాయితీలు ఇవ్వటమేనని, ఇది ప్రపంచ వాణిజ్య సంస్ధ నిబంధనలకు విరుద్దం కనుక ఆ విధానాన్ని ఎత్తివేయాలి లేదా ధరలను తగ్గించాలని అమెరికా, ఐరోపా యూనియన్‌ తదితర దేశాలన్నీ ఎప్పటి నుంచో వత్తిడి తెస్తున్నాయి. తమ చర్యలు నిబంధనలకు లోబడే ఉన్నాయని ఆ వాదనలను ఇప్పటి వరకు మన దేశం తిరస్కరిస్తూ వస్తోంది.


వ్యవసాయ మార్కెట్‌ యార్డులలో కనీస మద్దతు ధరల కంటే తక్కువకు ఎవరూ కొనటానికి వీలులేదు. దీని ర్ధం వ్యాపారులు పోటీ పడి ఎక్కువకు కొనుగోలు చేయవద్దని కాదు. చమార్కెట్‌ యార్డుల పరిధిలో కొనుగోలు చేసే వారి మీద పర్యవేక్షణ ఉంటుంది. తాజాగా చేసిన సవరణల ప్రకారం యార్డుల పరిధిని కుదించారు. ఆ పరిధి వెలుపల ఎవరైనా ఎలాంటి సెస్‌ చెల్లించకుడా ఉత్పత్తులను కొనుగోలు చేయవచ్చు. ధరలను పర్యవేక్షించే యంత్రాంగం ఉండదు. ఒప్పంద వ్యవసాయం చేసేందుకు కూడా అనుమతిస్తున్నందున రైతులు-వ్యాపార సంస్ధల మధ్య ఒప్పందంలో కనీస మద్దతు ధరల అంశం- ప్రస్తావనే ఉండదు. కంపెనీలు ఏదో ఒక సాకుతో ధరలు దిగ్గొస్తే అధికారులను ఆశ్రయించటం తప్ప న్యాయస్ధానాలకు వెళ్లే అవకాశం లేదు. అధికార యంత్రాంగం ఎవరివైపున ఉంటుందో తెలిసిందే.


2013లో నైరోబీలో జరిగిన ప్రపంచ వాణిజ్య సంస్ధ మంత్రుల సమావేశ నిర్ణయం ప్రకారం 2023వరకు వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతి, రవాణా, మార్కెటింగ్‌ రాయితీలు ఇచ్చేందుకు అవకాశం ఉంది. తరువాత రద్దు లేదా పరిమితం అయ్యే అవకాశం ఉంది. దీని పర్యవసానాలు రైతులకు హానికరంగా ఉంటాయి తప్ప మరో తీరులో ఉండే అవకాశం లేదు.
అమెరికాతో త్వరలో ఒక వాణిజ్య ఒప్పందం కుదరబోతోందని వాణిజ్యశాఖ మంత్రి పియూష్‌ గోయల్‌ నెల రోజుల క్రితం చెప్పారు. వచ్చిన వార్తలు, జరుగుతున్న చర్చల తీరుతెన్నులను చూస్తే ముందుగా ఒక పరిమిత ఒప్పందం తరువాత సమగ్ర ఒప్పందం జరగబోతున్నట్లు చెబుతున్నారు. ఒప్పందాలకు ముందే అమెరికా కార్పొరేట్లను సంతృప్తి పరచటం లేదా విశ్వాసం కలిగించటానికే కేంద్ర ప్రభుత్వం రెండు వ్యవసాయ చట్టాలు, నిత్యావసర వస్తువుల చట్టానిక సవరణలను ఆర్డినెన్సులుగా తీసుకు వచ్చి పార్లమెంటులో ఆమోదింప చేయించుకున్నట్లుగా స్పష్టం అవుతోంది. ఒక ఆర్డినెన్స్‌ అనేది అత్యవసర సందర్భాలలో మాత్రమే ఉపయోగించే అధికారం. వ్యవసాయ సంస్కరణలు అలాంటివి కాదు. ఉమ్మడి జాబితాలో అంశాల మీద రాష్ట్రాలను సంప్రదించకుండా, రైతు సంఘాలు, పార్టీలతో చర్చించకుండా అసలు పార్లమెంటుతో కూడా నిమిత్తం లేకుండా ముందే ఒక నిర్ణయం చేసి దానికి తరువాత పార్లమెంట్‌ ఆమోద ముద్ర వేయించటం ప్రజాస్వామ్య ప్రక్రియకు విరుద్దం. అమెరికాతో ఒప్పందం కుదరితే అది మన వ్యవసాయ రంగం మీద తీవ్ర ప్రభావం చూపనుందని చెబుతున్నారు. అనేక దేశాలతో అది కుదుర్చుకున్న ఒప్పందాలన్నీ దాని కార్పొరేట్‌ ప్రయోజనాలకే అనుకూలంగా ఉన్నాయి తప్ప మరొకటి కాదు.


ప్రపంచంలో అడ్డదారి, దొడ్డిదారుల్లో నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవసాయ సబ్సిడీలు ఇస్తున్నది అమెరికా అన్నది స్పష్టం. 2014లో అమెరికా ఆమోదించిన వ్యవసాయ చట్టం మేరకు పది సంవత్సరాల కాలంలో 956 బిలియన్‌ డాలర్ల సబ్సిడీలు ఇవ్వాలని నిర్ణయించారు. తరువాత 2019లో మరో పదేండ్ల పాటు 867 బిలియన్‌ డాలర్లు అదనంగా కేటాయించాలని నిర్ణయించారు. ప్రస్తుతం రెండు దేశాల మధ్య జరుగుతున్న వాణిజ్యంలో మన దేశం మిగులుతో ఉంది. దాన్ని సమం చేసేందుకు మన దేశం మీద వత్తిడి తెచ్చి ఇరాన్‌ నుంచి చమురు కొనుగోలు బంద్‌ చేయించి తన చమురును మనకు విక్రయిస్తున్నది. త్వరలో వాణిజ్య ఒప్పందం కుదిరితే అమెరికా వ్యవసాయ సరకులు మన దేశాన్ని ముంచెత్తటం ఖాయం.
చైనాతో వాణిజ్య యుద్దం ప్రారంభించిన అమెరికన్లు దానిలో ముందుకు పోలేక- వెనక్కు రాలేక ఇతర దేశాలకు తమ వస్తువులను అమ్ముకొనేందుకు పూనుకున్నారు.2018లో అమెరికా 7,15,491 టన్నుల పాలపొడి, 5,45,890 టన్నుల పన్నీరు పొడి ( పాలవిరుగుడు), 3,48,561టన్నుల జున్ను, 3,92,166 టన్నుల పాలచక్కెర(లాక్టోజ్‌)ను ఎగుమతి చేసింది. చైనాతో లడాయి కారణంగా అమెరికా పదిశాతం ఎగుమతిని కోల్పోయింది. దీంతో అమెరికాలో రికార్డు స్ధాయిలో ఆరులక్షల టన్నులకు జున్ను నిల్వలు పేరుకుపోయాయి. ఇది మన దేశంలో పన్నెండు సంవత్సరాల జున్ను వినియోగానికి సమానమని అంచనా. ఇప్పుడు మన వంటి దేశాలకు పాడి ఉత్పత్తులను ఎగుమతి చేయాలని అమెరికా ప్రయత్నిస్తోంది.
దేశంలో పన్నీరు పొడి ధర కిలో రు.130-150 మధ్య ఉండగా 30శాతం దిగుమతి పన్ను ఉన్నప్పటికీ కిలో రు.70కంటే తక్కువ ధరకే ప్రతి నెలా వెయ్యి టన్నుల మేరకు మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాము. పన్నీరు, జున్నుతో అనేక ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. పాల పొడి ధర మన దేశంలో రు.280-300 మధ్య ఉంది. కొందరు పన్నీరు పొడిని కూడా పాలపొడిగా వినియోగిస్తున్నారు. ఇప్పుడు అమెరికా, ఇతర దేశాల నుంచి గనుక పాల ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటే మన పాల రైతాంగం పరిస్ధితి ఏమిటి ? దిగుమతి పన్ను 30శాతానికి మించి పెంచినా అమెరికా లేదా న్యూజిలాండ్‌ వంటి దేశాలు ఇస్తున్న సబ్సిడీల కారణంగా మన దేశంలో ఉన్న ధరల కంటే తక్కువ ధరకే దిగుమతి చేసుకోవచ్చు. దాంతో మన పాలరైతులు పాడి పరిశ్రమకు దూరం కావాల్సిందే. ప్రపంచ వ్యాపితంగా జున్ను తయారీలో దూడల పేగుల్లోంచి తీసిన పదార్దాన్ని తోడు కింద వినియోగిస్తారు. మన దేశంలో అలా వినియోగించటం చట్టవిరుద్దం. అయితే దిగుమతి చేసుకొనే దానిలో అలాంటి తోడు వినియోగించారా లేదా అన్నది తయారీదారులు చెబితే తప్ప తెలుసుకోవటం కష్టం.అమెరికా, ఐరోపా దేశాల్లో ఆవులకు వేసే దాణాలో జంతువుల ఎముకలతో తయారు చేసిందాన్ని వినియోగిస్తారు. అలాంటి వాటితో తయారు చేసిన పదార్ధాలు మన దేశానికి ఇప్పటికే దొడ్డిదారిన వస్తున్నాయి. ఇది ఒక విధంగా కొన్ని తరగతుల వినియోగదారులను మోసం చేయటం తప్ప మరొకటి కాదు. ఇలాంటి వాటిని కస్టమ్స్‌ సిబ్బంది గుర్తించలేరు.వ్యవసాయం తరువాత మన దేశంలో పాడి రైతులు ఎక్కువ. పాలకూ కనీస సేకరణ ధర నిర్ణయించాలని చాలా కాలం నుంచి రైతులు కోరుతున్నారు. అయితే తమకటువంటి ఆలోచన లేదని కేంద్ర ప్రభుత్వం గతేడాది జూన్‌లో స్పష్టం చేసింది.


మన దేశంలో సోయాను గణనీయంగా ఉత్పత్తి చేస్తున్నారు. చైనాతో సాగిస్తున్న వాణిజ్య యుద్దం కారణంగా అమెరికా సోయా ఎగుమతులు పదకొండు శాతం పడిపోయాయి. దాన్ని మన దేశానికి ఎగుమతులు చేయటం ద్వారా భర్తీ చేసుకోవాలని అమెరికా ఆత్రంగా ఉంది. ప్రపంచ వాణిజ్య సంస్ద నిబంధనల మేరకు 2019-20లో టారిఫ్‌ రేటు కోటా కింద లక్ష టన్నులు, 2020-21లో మరో ఐదు లక్షల టన్నుల మొక్కజొన్నలను కేంద్ర ప్రభుత్వం విదేశాల నుంచి కేవలం 15శాతం పన్నుతోనే దిగుమతులకు అనుమతించింది.ఇది అమెరికా, ఆస్ట్రేలియా దేశాల వత్తిడి మేరకు జరిగింది. ఈ కారణంగా మన దేశంలో రైతాంగం కనీస మద్దతు ధరలకంటే తక్కువకు అమ్ముకోవాల్సి వచ్చింది. 2016 డిసెంబరులో కేంద్ర ప్రభుత్వం గోధుమల దిగుమతుల మీద పన్నులను తగ్గించింది దాంతో 5.9 మిలియన్‌ టన్నులను దిగుమతి చేసుకున్నాము. తరువాత కాలంలో రైతాంగం గగ్గోలు పెట్టటంతో గత ఏడాది ఎన్నికల సమయంలో తిరిగి దిగుమతి పన్ను పెంచింది. అంటే పన్ను తగ్గింపు మన వ్యవసాయ ఉత్పత్తుల మీద ఎలాంటి ప్రభావం చూపుతాయో ఈ ఉదంతాలు వెల్లడిస్తున్నాయి. ఒక వైపు మనం గోధుమలను ఎగుమతి చేసే స్ధితిలో ఉన్నామని చెప్పే ప్రభుత్వం దిగుమతులను ఎందుకు అనుమతిస్తున్నట్లు ? ప్రపంచ వాణిజ్య సంస్ధ నిబంధనలని చెబుతున్నారు. మరి రైతాంగానికి ప్రభుత్వం కల్పిస్తున్న రక్షణ ఏమిటి ? విదేశీ గోధుమలతో మన దేశంలో డిమాండ్‌ తగ్గి ధరలు తగ్గితే పరిస్దితి ఏమిటి ?


అమెరికా నుంచి ఇప్పటికే పండ్లు, కూరగాయలను మనం దిగుమతి చేసుకుంటున్నాము, అవి పెరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం తాజాగా చేసిన వ్యవసాయ చట్టాల సవరణల్లో ఒప్పంద వ్యవసాయం గురించి చెప్పింది. భారీ ఎత్తున అమెరికా ఇస్తున్న సబ్సిడీలతో పోటీ పడి మన దేశం పండ్లు, కూరగాయలు, పూలను ఎగుమతి చేసే స్ధితిలో ఉందా ? మన రైతాంగాన్ని దెబ్బతీసే దిగుమతులు ఎందుకు, విదేశీ కొనుగోలుదారులకు సబ్సిడీలు ఇచ్చి మన దేశం నుంచి ఎగుమతులెందుకు ?
అమెరికా లేదా మరొక దేశంతో వ్యవసాయ ఉత్పత్తుల గురించి మన దేశం కుదుర్చుకోబోయే ఒప్పందంలో ఇప్పుడున్న దిగుమతి పన్నులను తగ్గించకుండా అమెరికా అంగీకరిస్తుందా ? తగ్గిస్తే మన రైతుల సంగతేమిటి ? ఉదాహరణకు యాపిల్‌ పండ్లపై మన దేశం విధిస్తున్న పన్ను 50శాతం ఉన్నపుడు 2018 జనవరి నుంచి జూన్‌ 15 మధ్య అమెరికా నుంచి 78లక్షల బాక్సులను దిగుమతి చేసుకున్నాము. పన్ను మొత్తాన్ని 70శాతానికి పెంచటంతో మరుసటి ఏడాది అదే కాలంలో దిగుమతులు 26లక్షల బాక్సులకు పడిపోయాయి. దిగుమతి పన్నులు ఎక్కువగా ఉంటేనే కాశ్మీర్‌, హిమచల ప్రదేశ్‌ తదితర ప్రాంతాల్లోని యాపిల్‌ రైతులకు మేలు జరుగుతుంది. అదే తగ్గిస్తే ?


మనం పత్తిని ఎగుమతి చేస్తున్నాం-ఇదే సమయంలో భారీ సబ్సిడీలు ఇస్తున్న అమెరికా పత్తిని మన మిల్లు యజమానులు దిగుమతి చేసుకుంటున్నారు. అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్న అనేక వ్యవసాయ ఉత్పత్తుల పరిస్ధితి ఇదే, పన్ను తక్కువగా ఉన్నపుడు ఇబ్బడి ముబ్బడిగా మన కార్పొరేట్‌ లేదా వాణిజ్య ” దేశభక్తులు ” దిగుమతి చేసుకొని మన రైతాంగాన్ని దెబ్బతీస్తున్నారు. రైతాంగం కన్నెర్ర చేయటంతో పాలకులు పన్నులు పెంచాల్సి వస్తోంది. దాంతా కాస్త ఊరట కలుగుతోంది. ఈ దోబూచులాట ఎంతకాలం ? రైతులు ఆరుగాలం పంటలు పండించాలా ? ప్రతిక్షణం పాలకుల విధానాల మీద కన్నువేసి వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేయాలా ?


ప్రస్తుతం మన దేశం అమెరికా మధ్య జరుగుతున్న వాణిజ్య సంప్రదింపుల స్వభావం ఏమిటి ? మన దిగుమతి పన్నులను తగ్గించేందుకు బేరమాడుతోంది. బెదిరింపులకు దిగింది. మన దేశం నుంచి దిగుమతి చేసుకుంటున్న వస్తువులకు ప్రాధాన్యత పధకం (జనరలైజ్‌డ్‌ సిస్టమ్‌ ఆఫ్‌ ప్రిఫరెన్సెస్‌ ాజిఎస్‌పి) కింద ఇస్తున్న పన్ను రాయితీలను డోనాల్డ్‌ ట్రంప్‌ ఎత్తివేశాడు. అదే విధంగా మరికొన్ని ఉత్పత్తుల మీద అదనంగా దిగుమతి పన్ను విధించాడు. ఇవన్నీ మనలను లొంగదీసుకొనేందుకు అమెరికా అనుసరిస్తున్న బెదిరింపు ఎత్తుగడల్లో భాగమే.


బర్డ్‌ ఫ్లూ సమస్య తలెత్తినపుడు 2007లో మన దేశం అమెరికా నుంచి కోళ్ల ఉత్పత్తుల దిగుమతులపై నిషేధం విధించింది. మన కోళ్ల పరిశ్రమ రక్షణ కోసం ఆ సమస్య తొలగిన తరువాత కూడా అది కానసాగింది. అయితే ఆ చర్య నిబంధనలకు విరుద్దం అంటూ ప్రపంచ వాణిజ్య సంస్ధలో కేసు వేసి 2014లో అమెరికా గెలిచింది. దాంతో నరేంద్రమోడీ సర్కార్‌ 2017లో నిషేధాన్ని ఎత్తివేసింది. దిగుమతులపై వందశాతం పన్ను విధించింది. అయినప్పటికీ మన మార్కెట్లో దొరికే వాటి కంటే చౌక కావటంతో కోడి కాళ్ల దిగుమతులు ప్రారంభం అయ్యాయి. ఆ పన్ను మొత్తాన్ని తగ్గించాలని అమెరికా డిమాండ్‌ చేస్తోంది. అదే జరిగితే మన బాయిలర్‌ కోళ్ల ఫారాలు, వాటికి రుణాలు ఇస్తున్న బ్యాంకులు కూడా తీవ్రంగా ప్రభావితం అవుతాయి.


అమెరికా ఇప్పటికే మధ్య అమెరికాలోని చిలీ వంటి దేశాలతో కుదుర్చుకున్న స్వేచ్చా వాణిజ్య ఒప్పందాల ప్రాతిపదికనే మన దేశం కూడా ఒప్పందం చేసుకోవాలని వత్తిడి వస్తోంది. అదే జరిగితే వ్యవసాయ రంగం కుదేలు అవుతుంది. అది ఒక్క అమెరికాకే పరిమితం కాదు. మనతో వాణిజ్య సంబంధాలున్న మిగతా దేశాలు కూడా అదే విధమైన రాయితీలు కోరతాయి. విత్తన వాణిజ్యం మీద ప్రస్తుతం ఉన్న నియంత్రణలను మరింత సడలిస్తే మాన్‌శాంటో, కార్గిల్‌, సింజెంటా వంటి కంపెనీల దోపిడీకి అడ్డు ఉండదు. గుజరాత్‌లో పెప్సీ కంపెనీ తన అనుమతి లేకుండా తన పేటెంట్‌ హక్కు ఉన్న బంగాళాదుంప విత్తనాలను సాగు చేశారంటూ మన దేశానికి వర్తించని నిబంధనలతో పదకొండు మంది రైతుల మీద కేసులు వేసిన విషయం తెలిసిందే.
మన కేంద్ర ప్రభుత్వం కొన్ని పంటలకు నిర్ణయిస్తున్న కనీస మద్దతు ధర ప్రపంచ వాణిజ్య సంస్ధ నిబంధనలకు వ్యతిరేకం కనుక ఆ విధానాన్ని రద్దు చేసేట్లు ఆదేశించాలని అమెరికా, కెనడా దాఖలు చేసిన కేసులు విచారణలో ఉన్నాయి. ఈ ధరల నిర్ణయం రాయితీగా వర్ణిస్తూ అవి అనుమతించిన దానికంటే 26 రెట్లు ఎక్కువగా ఉన్నాయన్నది వాటి వాదన. ఉత్పత్తి విలువ లెక్కింపు పద్దతిలో తేడా ఉంది. అమెరికా, కెనడా వంటి దేశాలు మన రూపాయిని యూనిట్‌గా తీసుకొని లెక్కిస్తున్నాయి. మన దేశం డాలరు ప్రాతిపదికగా లెక్కవేస్తోంది. ఉదాహరణకు మన దేశం పప్పుదినుసుల విలువ రూ.2,677 కోట్ల రూపాయలుగా చూపుతుంటే అమెరికా రూ.69,923కోట్లుగా లెక్క చెబుతోంది. మన ప్రభుత్వం సేకరించే సరకునే పరిగణనలోకి తీసుకుంటే అమెరికా మొత్తం ఉత్పత్తి విలువను లెక్క వేస్తోంది. చైనా మీద కూడా అమెరికా ఇలాంటి కేసే వేసింది. వీటిని భారత్‌, చైనా రెండూ కలసి వ్యతిరేకిస్తున్నాయి.


భారత ఆహార సంస్ధ అనవసరంగా ధాన్య నిల్వలు చేస్తున్నదనీ, కనీస మద్దతు ధరల విధానం అసమర్దతకు ప్రోత్సాహం అనే దివాలాకోరు వాదనలు చేసే వారు కూడా ఉన్నారు. ఒక ఎకరానికి పది క్వింటాళ్ల ధాన్యం పండించే రైతుకూ, 15క్వింటాళ్లు పండించే రైతుకూ కనీస మద్దతు ధర ఒకటే ఉంటుందనే రీతిలో వారి వాదనలు ఉన్నాయి. తక్కువ ఉత్పత్తి ఖర్చు, తక్కువ నీటిని వినియోగించే వారికి ప్రోత్సాహం ఇవ్వటం లేదని చెబుతారు. ఇవన్నీ ఆ విధానాలను రద్దు చేయాలనే దుష్ట ఆలోచన ఉన్నవారు ముందుకు తెచ్చే వాదనలు. కనీస మద్దతు ధర ఎత్తివేస్తే ప్రయివేటు వ్యాపారులు అలాంటి రైతులను గుర్తించి వారికి అదనపు ధర లేదా మరో రూపంలో ప్రోత్సాహం అందిస్తారా ? ఏ దేశంలో అయినా అలా జరిగిందా ? ఉన్న వ్యవస్ధలో లోపాలను సరిదిద్దటాన్ని ఎవరూ వ్యతిరేకించటం లేదు. అంతకంటే మెరుగైన వ్యవస్ధ లేకుండా ఉన్నదాన్ని నిర్వీర్యం చేస్తే దిక్కేమిటి ? ఇదే రైతులు ముందుకు తెస్తున్న ప్రశ్న !


రెండు దేశాల మధ్య ఉన్న సమస్యలు ఒక కొలిక్కి వచ్చేందుకు వీలుగా ముందు ఒక పరిమిత ఒప్పందం కుదుర్చుకోవాలని అమెరికాలో మన రాయబారిగా ఉన్న తరంజిత్‌ సింగ్‌ సంధు ఆగస్టు 21న ఫిక్కి సమావేశంలో చెప్పారు. ప్రస్తుతం మన దేశం మన అల్యూమినియం, ఉక్కు ఉత్పత్తుల మీద అమెరికా విధించిన అధిక పన్నులను వెనక్కు తీసుకోవాలని, జిఎస్‌పి కింద రద్దు చేసిన రాయితీలను పునరుద్దరించాలని కోరుతోంది. తాము ఆపని చేయాలంటే తమ వ్యవసాయ, పాడి ఉత్పత్తులకు భారత మార్కెట్‌ను తెరవాలని, ఐటి ఉత్పత్తుల మీద పన్నులు తగ్గించాలని వాణిజ్యలోటును తగ్గించాలని అమెరికా అంటోంది. తమకే అగ్రస్ధానం అన్నది అమెరికాలో ఎవరు అధికారంలో ఉన్నా అనుసరించే వైఖరి. నవంబరు ఎన్నికల్లో ఎవరు గెలిచినా ఇదే సమస్య ముందుకు రానుంది. ఆ వత్తిడిని మన పాలకులు తట్టుకుంటారా ? మన రైతులు, పరిశ్రమలకు రక్షణ కల్పించే చర్యలు తీసుకుంటారా ? ఇది మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా మన ముందు ఉంది !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

జిఎస్‌టి మాదిరి దేవుడి లీల అంటే మా రైతుల గతేంగాను మోడీ గారూ !

23 Wednesday Sep 2020

Posted by raomk in AP NEWS, BJP, Congress, CPI(M), Current Affairs, Economics, Farmers, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Prices

≈ Leave a comment

Tags

Act of God, Farmers matters, Indian agri reforms, indian farmers, narendra modi promises and facts


అయ్యా నరేంద్రమోడీ గారూ !


ఒక రైతు బిడ్డగా మీకు ఈ బహిరంగ లేఖ రాస్తున్నా. మీకు గానీ, మీ అభిమానులకు గానీ నచ్చకపోతే నచ్చ లేదని చెప్పండి, నేను చెప్పినదాంట్లో తప్పేమిటో చర్చించండిగానీ దేశద్రోహులు అని ముద్రవేయటం చాల బాగోదని మీ వారికి చెప్పండి. రైతులను తూలనాడిన వారికి ఈ దేశంలో భవిష్యత్‌ ఉండదు. వెన్ను విరగ కొడతారు.


ఉద్యోగాలు రాకపోవటానికి కుర్రాళ్లకు నైపుణ్యం లేదని ఎత్తున శిక్షణా కేంద్రాలంటూ పెద్ద హడావుడి చేశారు. నైపుణ్యం సంగతి దేవుడెరుగు ఆ పేరుతో వేల కోట్ల రూపాయలను ఆ పేరుతో స్వాహా చేశారు. కొత్త ఉద్యోగులు రాకపోగా ఉన్న ఉపాధిపోయింది. మభ్యపెట్టే కళలో మీకు మాత్రం నైపుణ్యం పెరిగిందన్నది స్పష్టం. ఆ చాతుర్యం గురించి గతంలో మా పెద్దలు ఇందిరా గాంధీ గురించి చెప్పేవారు. ఇప్పుడు మీరు ఆమెను మించిపోయినట్లు చెబుతున్నారు. తాడిని ఎక్కేవాడుంటే వాడి తలదన్నే వాడు వస్తాడు. తెలివి ఏ ఒక్కరి సొత్తూ కాదు. ఇక విషయానికి వస్తా !
పార్లమెంట్‌లో ఆమోదించిన వ్యవసాయ సంస్కరణల చట్ట సవరణ బిల్లులు ఒక మూలమలుపు అని మీరు వర్ణించారు. నిజంగానే, అయితే అది రైతులను ముంచేందుకా తేల్చేందుకా అన్నదే సమస్య. అధికారానికి వచ్చిన నాటి నుంచి నేటి వరకు చెప్పిన మాట చెప్పకుండా, చెప్పినదాని గురించి మరోసారి మాట్లాడకుండా కొత్త విషయాలను జనానికి చెప్పటంలో దిట్టగా మారారు. ఈ విషయంలో మీకు మరొకరు సాటి రారు. అమెరికా అగ్రనేత అబ్రహాం లింకన్‌ ఒక మాట చెప్పారు. ” మీరు కొంత మంది జనాన్ని ఎల్లవేళలా, అందరినీ కొన్ని వేళల్లో వెర్రి వెంగళప్పలను చేయగలరు. అయితే మీరు అందరినీ, అన్ని వేళలా ఆ పని చేయలేరు ” అన్నారు. ఆ మాదిరిగానో మరో విధంగానో తెలియదు గానీ ఈ సారి మీ మాటలను నమ్మేందుకు సిద్దంగా లేమంటూ కరోనాను సైతం ధిక్కరించి రైతులు వీధుల్లోకి వస్తున్నారు. మీ సిబ్బంది లేదా మీ పార్టీ వారు మీకు ఈ విషయాలు సరిగా చెబుతున్నట్లు లేదు ? లేక మీరే వినేందుకు సిద్దంగా లేరా ? ఏదైనా కావచ్చు, జనానికి మీరు ఏం చేస్తున్నారనేదే ముఖ్యం. నా అమాయకత్వం గాకపోతే అప్రియములు రాజుగారికి చెప్పకూడదనే వంది మాగధుల లోకోక్తి మీకు తెలియకుండా ఉంటుందా ? మీ దోస్తు డోనాల్డ్‌ ట్రంప్‌ మాదిరి మీరు తరచూ విలేకర్ల సమావేశాలు పెడితే రెండోవైపు ఏం జరుగుతోందో మీకు తెలిసేది. సముద్రాలు ఇంకి పోయినా, భూమ్యాకాశాలు దద్దరిల్లినా, అటు సూర్యుడు ఇటు పొడిచినా, ఇసుక నుంచి తైలం తీసినా, కుందేటి కొమ్ము సాధించినా పదవిలో ఉన్నంత కాలం విలేకర్ల గోష్టి పెట్టను, వారి ముందు నోరు విప్పను అని మీరు పట్టిన పంతం అనితర సాధ్యమే ! మీరు తప్ప ఇంతవరకు ప్రపంచంలో మరొక లేరు, భవిష్యత్తులో ఉండరు !


2022-23 నాటికి రైతుల ఆదాయాలు రెట్టింపు చేస్తామని మీరు గతంలో ఎంతో ఆర్భాటంగా ప్రకటించారు. దాని గడువు ఇంకా రెండున్నర సంవత్సరాలు ఉంది. 2015-16 సంవత్సరాన్ని ప్రాతిపదికగా తీసుకొని ఏడు సంవత్సరాల్లో రైతుల ఆదాయాలు రెట్టింపు చేయాలని మీరు ఏర్పాటు చేసిన నీతి ఆయోగ్‌ తయారు చేసిన ఒక పత్రంలో పేర్కొన్నారు. దీనికి గాను ఏటా వృద్ధి రేటు 10.4శాతం ఉండాలని పేర్కొన్నారు. ఇప్పుడు మీరు దాని ప్రస్తావన లేకుండా కొత్తవిషయాలు చెబుతున్నారు. పాత వాగ్దానం మరచిపోయినట్లుగా కనిపిస్తోంది, దేని మీదా నిలకడ కనిపించటం లేదు. అందుకే మాకు అనుమానం. ఈ విషయంలో మీకు మీరే సాటి కదా ! నల్లధనం అన్నారు, పెద్ద నోట్లను రద్దు చేశారు. సాధించిందేమిటో మీ నోట మేం వినలేదు. గుజరాత్‌ తరహా అభివృద్ధి అన్నారు, అదీ అంతే, అచ్చే దినాలన్నారు. చచ్చేదినాలు వచ్చాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి. ఆ మధ్య మన్‌కీ బాత్‌లో కుక్కలను పెంచాలని పిలుపు ఇచ్చారు. ఆకలో అన్నమో రామచంద్రా అని జనం అంటుంటే పోషకాహారం తినాలని చెప్పారు. ఎమితిని సెపితివి కపితము అన్నట్లుగా అలా ఎందుకు మాట్లాడుతున్నారో, మీకు ఏమైందో అని మేమంతా జుట్టు పీక్కుంటున్నాము.


కరోనాతో నిమిత్తం లేకుండానే మీ అచ్చేదిన్‌లోనే ఒక్క ఏడాది కూడా నీతి అయోగ్‌ చెప్పిన 10.4శాతం వృద్ధి రేటు లేదు. అసలు మొత్తం జిడిపి వృద్ధి రేటే ఆ స్దాయిలో లేదు. అయితే ఈ కాలంలో విత్తనాల బిల్లు, నగదు బదిలీ, కనీస మద్దతు ధరల పెంపు, జీరో బడ్జెట్‌, సహజ వ్యవసాయ సాగు, వ్యవసాయ ఉత్పత్తిదార్ల వ్యాపార సంఘాల గురించి మీరు, మీ మంత్రులు ఎన్ని కబుర్లు చెప్పారో ఎప్పుడైనా ఒక్కసారి వెనక్కు తిరిగి చూసుకుంటారా ? అవన్నీ పక్కన పెట్టి కొత్త విషయాలు చెబుతున్నారు ? నిజమే, ఇన్ని తెలివి తేటలు ఎక్కడి నుంచి వచ్చాయా అని సాగుపనులు ముగిసిన తరువాత పిచ్చాపాటీలో మేము అనుకుంటూ ఉంటాం.


మాట్లాడితే స్వామినాధన్‌ పేరు చెబుతారు. కనీస మద్దతు ధరల నిర్ణయంలో ఆయన కమిటీ చేసిన సిఫార్సును గత పాలకులు, మీరూ పట్టించుకోలేదు.విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ కూలీలు, దున్నకం,కుటుంబ సభ్యుల శ్రమ, భూమి కౌలును పరిగణనంలోకి దీసుకొని ఉత్పాదక ఖర్చు మీద 50శాతం అదనంగా కనీస మద్దతు ధరలను ప్రకటించాల్సి ఉండగా దాన్ని నీరుగార్చారు. చిన్న రైతుల వ్యవసాయ వాణిజ్య సహాయతా సంఘం(సఫాక్‌) పేరుతో ఒక సంస్ధను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.నిజానికి అలాంటి ఉత్పత్తిదారుల సంఘాలు చాలా కాలం నుంచి ఉన్నాయి. అవిగాక కొత్తగా ఐదువేల కోట్ల రూపాయలతో 2023-24 నాటికి పదివేల నూతన సంఘాలను ఏర్పాటు చేయతలపెట్టారు. ఇప్పటి వరకు నాలుగు వేల సంస్ధలను నాబార్డ్‌ ఏర్పాటు చేసింది. ఇవన్నీ సహకార సంఘాల వంటివే. గతంలో భూస్వాములు, ధనిక రైతులు సహకార వ్యవస్ధలను ఎలా నాశనం చేసిందీ చూశాము. అయితే సహకార సంఘాలకు, వీటికీ తేడా ఉంది. వీటికి రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకు రావటం లేదు, హామీ కావాలని డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ సంస్ధలు ఎదుర్కొంటున్న సమస్యల కారణంగా గతంలో ఏర్పాటు చేసిన అనేక సంస్ధలు మూతపడ్డాయి, అనేకం నామమాత్రంగా పని చేస్తున్నాయి. సఫాక్‌ ఇటీవల విడుదల చేసిన ఒక పత్రంలో వెల్లడించిన సమాచారం ప్రకారం 30శాతం సంస్దలు మాత్రమే బతికి బట్టగలుగుతున్నాయి, 20శాతం జీవన పోరాటం చేస్తున్నాయి. మిగిలిన కంపెనీలు వివిధ దశల్లో ఉన్నాయి, కార్యకలాపాలను ప్రారంభించలేదు. కొత్తగా ఏర్పాటు చేసే సంస్ధలకు ఐదు సంవత్సరాల పాటు ఏటా ప్రతి సభ్యుడికీ రెండువేల రూపాయల చొప్పున లేదా ఒక సంస్దకు గరిష్టంగా 15లక్షలకు మించకుండా మాచింగ్‌ గ్రాంట్‌, రెండు కోట్ల రూపాయల వరకు రుణం ఇస్తుంది. ఈ పరిమితుల కారణంగా అనేక సంస్ధలు చిన్న స్ధాయిలో మాత్రమే వ్యాపారం చేస్తున్నాయి. అయినా కంఠశోష గాకపోతే మీకు ఈ విషయాలు తెలియవా ? కేంద్ర ప్రభుత్వం తాజాగా పార్లమెంట్‌లో ఆమోదం పొందిన బిల్లులు చట్ట రూపం దాల్చిన తరువాత బడాకంపెనీలు పెద్ద ఎత్తున రంగంలోకి దిగుతాయి. పెద్ద కంపెనీలే బడా సంస్ధల దెబ్బకు తట్టుకోలేకపోతున్నపుడు వాటితో రైతు సంస్ధలు ఏమేరకు బతికి బట్టకడతాయన్నది మా ప్రశ్న.


నేరుగా (సబ్సిడీ) నగదు బదిలీ పధకం వలన తమ పెట్టుబడి ఖర్చులు పెరుగుతున్నాయని, గతంలో మాదిరే సబ్సిడీ ధరలకే ఎరువులను అందించాలని నీతి అయోగ్‌ తరఫున జరిపిన ఒక సర్వేలో 64శాతం మంది రైతులు చెప్పినట్లు తేలింది. అయితే దీన్ని అంగీకరిస్తే సబ్సిడీల ఎత్తివేతకు సోపానమైన నేరుగా నగదు బదిలీ పధకాన్ని నిలిపివేయాల్సి వస్తుందని గాకపోతే దాన్ని ఎందుకు అంగీకరించలేదో చెబుతారా ? నిరుద్యోగం నాలుగు దశాబ్దాల రికార్డును బద్దలు కొట్టింది అని గతేడాది పార్లమెంట్‌ ఎన్నికల ముందు ఒక ప్రభుత్వ నివేదిక వచ్చింది. పకోడీలు అమ్మేవారికి కూడా ఉపాధి కల్పించినట్లే, అలాంటి వాటిని లెక్కల్లోకి తీసుకోలేదని అప్పుడు చెప్పారు. తరువాత గుట్టుచప్పుడు కాకుండా దాన్నే ఆమోదించారు. నేరుగా సబ్సిడీ బదిలి గురించి అబ్బే అబ్బే ఇది సమగ్రమైన సర్వే కాదు, తగినంత మంది లబ్దిదారులను ప్రశ్నించలేదు అని నివేదికను తిరస్కరిస్తున్నట్లు 2019నవంబరు 19న పార్లమెంట్‌లో ఒక ప్రశ్నకు చెప్పించిన మీ చతురతను ఎలా మరచిపోగలం !


జీరో బడ్జెట్‌, సేంద్రీయ వ్యవసాయం పేరుతో మీ బిజెపితో కలసి పాలన సాగించిన చంద్రబాబు నాయుడు పెద్ద ఎత్తున ఊదరగొట్టారు. అది రైతాంగ ఆదాయాలు రెట్టింపు కావటానికి, రైతులు రుణ విముక్తులు కావటానికి తోడ్పడుతుందని చెప్పారు.ఈ తరహా వ్యవసాయాన్ని చేయించే తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ ఉన్నట్లు 2018లో పెద్ద హడావుడి చేశారు. ఎనభై లక్షల ఎకరాల్లో రసాయన ఎరువులు లేని సేంద్రీయ వ్యవసాయాన్ని 60లక్షల మంది రైతులు 2024 నాటికి సాగిస్తారని చెప్పారు. ఏమైనట్లు ? దేశంలో ఇప్పుడు దాని ఊసే ఎత్తటం లేదేమి ? ఆవు పేడ, మూత్రం పేరుతో రాజకీయాలు చేయటం తప్ప మీ పాలిత ప్రాంతాల్లో ఎక్కడైనా వాటితోనే పంటలు పండిస్తున్నారా ? ఇప్పుడు మీరు చెబుతున్న కార్పొరేట్‌ లేదా కాంట్రాక్టు వ్యవసాయం ఆవు పేడ, మూత్రంతోనే చేయిస్తారా ? అమాయక రైతులం మీరు ఏం చెప్పినా వినక చస్తామా ?


కేంద్ర వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా రైతులు వీధుల్లోకి వచ్చారు. దీని వెనుక మార్కెట్లు రద్దయితే ఆదాయం కోల్పోయే వ్యాపారులు ఉండి నడిపిస్తున్నారని మీ పార్టీ బిజెపి ప్రచారం చేస్తోంది. ఒక వైపు మార్కెట్లను రద్దు చేస్తామని మేమెక్క డ చెప్పాం అంటారు , ఏంది సారూ ఇది ! ఆందోళనకు దిగిన వారు దేశద్రోహులని మీవారే సామాజిక మాధ్యమంలో దాడి చేస్తున్నారు. రైతులకు వ్యవసాయం గిట్టుబాటు కాకపోవటానికి ప్రధాన కారణం ఈ రంగానికి సబ్సిడీలను రద్దు లేదా గణనీయంగ కోత పెట్టటం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడులు పెట్టకపోవటం, తగిన ధరలు లేకపోవటం, దిగుబడులు పెరగకపోవటం, పరిశోధనలను పక్కన పెట్టటం వంటి అనేక కారణాలు ఉన్నాయి. వ్యాపారుల దోపిడీ అనేది ఒక కారణం మాత్రమే. పాలకులకు చిత్తశుద్ది ఉంటే దాన్ని కూడా తగ్గించవచ్చు. వ్యవసాయాన్ని కార్పొరేట్లకు అప్పగించాలి కనుక ఏదో ఒక సాకు చూపాలి. రైతులకు ప్రత్యక్షంగా కనిపించేది వ్యాపారులు, వారి అక్రమాలే కనుక వారిని చూపి మీరు చేయదలచుకున్నది చేస్తున్నారు తప్ప మరొకటి కాదని అనుకుంటున్నాం. పార్లమెంటులో మాదిరి వ్యవసాయ చట్టాలను మా మీద రుద్దటం సాధ్యం కాదని సవినయంగా మనవి.
వ్యవసాయ మార్కెట్‌ యార్డులను రాష్ట్ర ప్రభుత్వాలు నియంత్రిస్తాయి. అక్కడ వ్యాపారం చేసే వారు విధిగా ప్రభుత్వం వద్ద నమోదు కావాలి. అక్కడ జరిగే లావాదేవీల వలన ప్రభుత్వాలకు ఆదాయం వస్తుంది. కనీస మద్దతు ధరలకంటే తక్కువకు కొనుగోలు చేస్తే ప్రభుత్వ యంత్రాంగం జోక్యం చేసుకొనేందుకు అవకాశం ఉంటుంది. దళారులను అరికట్టేందుకే జాతీయ ఎలక్ట్రానిక్‌ వ్యవసాయ మార్కెట్‌ (ఇనామ్‌)ను ప్రవేశపెడుతున్నట్లు మీరు 2016లోనే చెప్పారు. అనేక రాష్ట్రాలకు చెందిన మార్కెట్లను వాటితో అనుసంధానం చేశారు. మొత్తం 2,500 మార్కెట్‌ కమిటీలకు గాను 585 ఈ వ్యవస్ధలో ఉన్నాయి. (బీహార్‌లో వాటిని 2006లోనే రద్దు చేశారు) ఇప్పటివరకు దాని వలన గతం కంటే రైతులు పొందిన ప్రయోజనాలు ఏమిటో ఎవరైనా రైతులకు వివరించారా ? అది నిజంగా ప్రయోజనకరంగా ఉంటే అన్నింటినీ అనుసంధానించాలని వత్తిడి తెచ్చి ఉండేవారు కాదా ?ఈ పాటికి రైతులు మొత్తం ఆ వ్యవస్ధ ద్వారానే లావాదేవీలు ఎందుకు జరపటం లేదు ?


ఇక్కడ మరో విషయాన్ని కూడా చెప్పాలి. మార్కెట్‌ యార్డుల వెలుపల వాణిజ్య లావాదేవీలు జరిపితే వ్యాపారులు పన్ను చెల్లించాలి. ఇప్పుడు మీరు మార్కెట్‌ యార్డులతో నిమిత్తం లేకుండా ఎక్కడైనా వ్యాపారులు కొనుగోలు చేయవచ్చు అన్నారు. వైఎస్‌ఆర్‌సిపి నేతలు ఈ బిల్లులకు మద్దతు ఇచ్చే విషయంలో తెలుగుదేశంతో పోటీపడి మరీ మద్దతు ఇచ్చారు. జగన్‌ నవరత్నాల అమలుకు ఇప్పటికే డబ్బు లేదు. ఇప్పుడు మార్కెట్ల ఆదాయం కూడా పోతే ఏం చేస్తారో తెలియదు. ఆదాయ నష్టానికి కేంద్రం ఒక్క పైసా కూడ ఇవ్వదు మరి. సీత కష్టాలు సీతవి- పీత కష్టాలు పీతవి అన్నట్లుగా జగన్‌ కష్టాలు జగన్‌వి పాపం !


ఆంధ్రప్రదేశ్‌ను మీరూ కాంగ్రెస్‌ మరికొన్ని పార్టీలు కలసి పోటీ బడి విభజించాయి. అప్పుడు నా సామిరంగా పార్లమెంటులో మీ వెంకయ్య నాయుడు, సుష్మ స్వరాజ్‌ వంటి నేతలు చేసిన హడావుడి, అబ్బో చూడవలసిందేగానీ చెప్పతరం కాదు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హౌదా ఐదు సంవత్సరాలు పెడతామని మన్మోహన్‌ సింగ్‌ చెబితే మీ వెంకయ్య నాయుడు హడావుడి చేసి ఐదును పదేండ్లకు ఒప్పించటానికి చెమటోడ్చాల్సి వచ్చినట్లు చెప్పారు. తరువాత మీరు తిరుపతి వెంకన్న సాక్షిగా అదే చెప్పారు. తీరా జరిగిందేమిటి ? ప్రత్యేక హౌదా లేదూ పాడూ లేదు. కాంగ్రెస్‌ నేతలు విభజన చట్టంలో పెట్టి ఉంటే సాధ్యమయ్యేది నేరం వారిదే అంటూ తప్పించుకున్నారు. దాని గురించి మరోసారి మాట్లాడవద్దని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ఇప్పటి సిఎం జగన్మోహనరెడ్డిగారికీ తెగేసి చెప్పారు.
పార్లమెంట్‌లో చర్చనూ విస్మరించారు. నిత్యం దేవుడి గురించి చెప్పే మీరు వెంకన్న సాక్షిగా చేసిన వాగ్దానాన్ని ఖాతరు చేయలేదు. వ్యవసాయ చట్ట సవరణల్లో కనీస మద్దతు ధర గురించి, పంటల సేకరణ హామీలను చేర్చకుండా బిల్లులను ఆమోదించారు. మరోవైపు అబ్బే అవేమీ రద్దు కావు అని నమ్మమంటున్నారు. ఒక్క మాట అడిగితే ఏమనుకోరుగా సారూ ! మీరు దేవుడు అని మా వెంకయ్య నాయుడు గారు గతంలో వర్ణించారు. జిఎస్‌టి విషయంలో కేంద్రం-రాష్ట్రాల మధ్య చట్టబద్దమైన ఒప్పందం కుదిరింది. ఐదేండ్ల పాటు పన్ను ఆదాయం తగ్గితే కేంద్రం భర్తీ చేస్తుందని దానిలో అంగీకరించారు. మన నిర్మలమ్మగారు దేవుడి లీల కారణంగా తగినంత ఆదాయం రాలేదు కనుక కేంద్రం చేసేదేమీ లేదు, కావాలంటే అప్పులిప్పిస్తాం అప్పు ఎలా కావాలో తేల్చుకోండి అన్నారు. అదేంటి సారూ మీరు దేవుడై ఉండి ఇంతవరకు మాట్లాడలేదు. పోనీ అదేమి నిర్మలమ్మా అలా మాట్లాడావేమిటి, ఆ లీల లేదా పాపం నాకు అంటుకోదా అన్ని అంతర్గతంగా కూడా ప్రశ్నించినట్లు లీకుల వార్తలు కూడా రాలేదు.


నిత్యావసర సరకుల చట్టాన్ని కూడా సవరించారు. ఏ సరుకును ఎంతైనా నిల్వచేసుకోవచ్చు. విపరీతంగా ధరలు పెరిగినపుడు మాత్రమే ఆంక్షలు అమల్లోకి వస్తాయన్నారు. ఇదేంటి సారు, నిల్వ చేసుకొనేందుకు అవకాశం ఇవ్వటం ఎందుకు, ధరలు విపరీతంగా పెరిగేంతవరకు చోద్యం చూడటం ఎందుకు ? అప్పుడు ఆంక్షలు ఎందుకు ? దీన్నే మేము నక్క పోయిన తరువాత బొక్క కొట్టటం అంటాం. మేం పండిస్తాంగానీ, వినియోగదారులంగా కూడా ఉంటాం. అంటే మా పంటలను మేమే అదానీ, అంబానీ, అమెజాన్‌లకు అమ్ముకోవాలి వారి దగ్గర నుంచి అధిక ధరలకు కొనుక్కోవాలా ఏంది సారూ. దీన్నే గోడదెబ్బ చెంపదెబ్బ అనుకుంటాం మేము. పాలనా జోక్యం తక్కువ పేరుతో మమ్మల్ని ఉత్పత్తిదారులుగా, వినియోగదారులుగా కార్పొరేట్లకు అప్పగిస్తూ చట్టాలు చేసి మీ చేతులు మీరు దులుపుకొని పోతే రేపు మాగతేంగాను ? జిఎస్‌టి మాదిరే రేపు మాకు సైతం అన్యాయం జరిగితే, అప్పుడు కూడా అంతా దైవ లీల, విధి వైపరీత్యం, మనం నిమిత్త మాత్రులం, దేవుడు ఆడించినట్లు ఆడటం, అనుభవించటం తప్ప విధి లేదా తలరాత మార్చలేం అంటే మా గతేంగాను సారూ ?
భవదీయుడు
ఎం కోటేశ్వరరావు

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

సాధికారత కాదు రైతులపై దాడి-కార్పొరేట్ల దోపిడీకి అప్పగింత !

21 Monday Sep 2020

Posted by raomk in AP, AP NEWS, BJP, Congress, CPI(M), Current Affairs, Economics, Farmers, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Prices, Telangana

≈ Leave a comment

Tags

Agri Bills, agriculture in india, Farmers empowerment, indian farmers


డాక్టర్‌ కొల్లా రాజమోహన్‌


రైతుల స్థితిగతుల గురించి ఏమాత్రం స్పహ లేకుండా కేంద్ర ప్రభుత్వం మూడు బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆమోదం పొందిన సెప్టెంబరు 20 ” రైతుల పాలిట దుర్దినం”. పైగా బిల్లులు రైతుల పరిస్థితులను మెరుగుపరుస్తాయని చెబుతున్నారు. రైతులు తమ ఉత్పత్తులను ఎక్కడైనా ఎవరికైనా అమ్ముకోవచ్చని, ధరలను తామే నిర్ణయించుకోవచ్చు అని కూడా చెప్తున్నారు. వ్యవసాయ రంగంలో సంస్కరణలు అంటూ కేంద్రం తెచ్చిన ఈ మూడు బిల్లులు ”కరోనా వ్యాధికన్నా కూడా ప్రమాదమైనవి”.
కేవలం పెట్టుబడులు- లాభాలు తప్ప ఏ నిబంధనలు పాటించని విదేశీ, స్వదేశీ కంపెనీలు రైతుల పంటలను తక్కువ ధరలకు కొని, భారీగా నిల్వ చేసి, వినియోగదారులకు ఎక్కువ ధరకు అమ్ముతాయి. ఇప్పటివరకు చట్టవిరుద్దంగా బ్లాక్‌ మార్కెటింగ్‌ చేస్తున్నారు.కొత్త బిల్లు ప్రకారం ఎంతైనా నిల్వ చేసుకోవచ్చని చట్టమే అనుమతిస్తే ఇక వీరికి అడ్డెవరు? ఎవరూ ప్రశ్నించటానికికూడా చట్టం అనుమతించదు. ఇప్పటివరకూ చట్టవిరుద్దమైన బ్లాక్‌ మార్కెటింగ్‌ ఇకనుండి చట్టబద్దమవుతుంది. వ్యవసాయ మార్కెట్‌ కమిటీలు నిర్వీర్యంమవుతాయి. ప్రభుత్వం నిర్ణయిస్తున్న మద్దతు ధరను అమలుపరచటానికి మార్కెట్‌ యార్డులుండవు. ప్రైవేట్‌ కంపెనీలు ఇష్టమొచ్చిన ధరకు ఇష్టమొచ్చిన చోట కొనుక్కోవచ్చు, ఇష్టమొచ్చినంత సరుకును గోదాములలో దాచుకోవచ్చు. వారిపై ఎటువంటి పన్నులూ వుండవు. అగ్రి బిజినెస్‌ కంపెనీలు ధరలు నిర్ణయించటానికి, ముందస్తు వ్యాపారానికి( ఫ్యూచర్‌ ట్రేడింగ్‌ )కీఈబిల్లులు అవకాశం కల్పిస్తాయి.

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నిత్యావసర వస్తువుల చట్టంలో చిరుధాన్యాలు,పప్పు ధాన్యాలు,ఆలుగడ్డలు ఉల్లిపాయలు ఇకపై నిత్యావసర సరుకుల చట్టం పరిధిలోకి రావు, నిల్వ చేసుకోవచ్చు. అసాధారణంగా ధరలు పెరిగినపుడే ప్రభుత్వాలు ఆంక్షలు విధించాలని చెబుతున్నాయి. ప్రభుత్వానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. పెద్ద మొత్తంలో నిల్వ చేసుకున్నవారే ధరలను నియంత్రిస్తారు.ఎగుమతి దిగుమతి విధానాలు కూడా వీరే నిర్ణయిస్తారు. ఇకపై వ్యాపార సంస్ధలు,కంపెనీలు, ఎటువంటి రుసుములు లేకుండా వ్యాపారం చేసుకోవచ్చని కొత్తచట్టం చెప్తోంది.రిలయన్స్‌, అదానీ, పెప్సీ వంటి బడా కంపెనీలు వ్యవసాయ వ్యాపారంలో ప్రవేశించారు. వారికి మార్గం సుగమం చేయటమే వ్యవసాయ, నిత్యావసర సరకుల చట్టాల సవరణ బిల్లుల లక్ష్యం.
ఈబిల్లు వలన నిత్యావసర సరుకుల కత్రిమ కొరత సష్టించేందుకు దారితీసే ప్రమాదం ఉందని అనుభవం చెప్ప్తున్నది. బ్రిటిష్‌ పాలనలో రైతులను కాల్చుకు తిన్నారు. అదే విధంగా ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం కూడా ఈ చట్టం ద్వారా అన్నదాత పొట్ట కొట్టేందుకు ప్రయత్నం చేస్తున్నది. రైల్వేల నుంచి విమానాల వరకు అన్నింటిని ప్రైవేటు కార్పొరేట్‌ సంస్థలకు అప్పచెప్తున్నది. కోల్డ్‌ స్టోరేజ్‌లు ఎక్కువ కట్టినందువలన వ్యవసాయఉత్పత్తులను నిల్వ చేసుకోటానికి రైతులకు అవకాశం లభిస్తుందంటున్నారు. కోల్డ్‌ స్టోరేజి లు ఎవరివి? ఎవరు కడతారు? వ్యాపారులకు అది కూడా ఒక లాభసాటి వ్యవహారమే.
ఎక్కువ రోజులు వ్యవసాయ ఉత్పత్తులను ఆపుకోగలిగిన శక్తి సామాన్య రైతులకు లేదు. చిన్న రైతులు 86.2 శాతం మందివున్నారు. 12 కోట్ల 60 లక్షల చిన్న రైతులకు ఒక్కొక్కరికీసగటున 0.6 హెక్టార్ల సాగు భూమి మాత్రమేవున్న విషయాన్ని గమనించాలి. కౌలు రైతులైనా చిన్న రైతులయినా పంటను ఎక్కువ రోజులు నిల్వ చేసి మంచి ధర కోసం ఎదురు చూడలేరు. తెచ్చిన అప్పులను చెల్లించటానికి, కుటుంబం గడవటానికి పంటను అమ్ముకోక తప్పదు. ఎక్కువ శాతం పంట అమ్ముకున్న తరువాత ధరలను పెంచటం ప్రపంచ అగ్రిబిజినెస్‌ నాటకంలో భాగమే.

కనీస మద్దతు ధరకే కొనాలని ఈ బిల్లులో వుందా?
కనీస మద్దతు ధరకన్నా తక్కువ ధరకు కంపెనీలు కొనటానికి వీలులేదని ఈ బిల్లులో ఎందుకు చేర్చ లేదని రైతులు ప్రశ్నిస్తున్నారు.పెద్ద పెద్ద కంపెనీలకు స్టోరేజ్‌, ప్రాసెసింగ్‌ సదుపాయాలు కల్పించి మార్కెట్‌ పై పూర్తి అధికారాలను వారికి కట్టపెట్టే ప్రయత్నంలో భాగమే ఈ బిల్లు, ఇది రైతులకు గిట్టుబాటు ధర లభించే పరిస్థితిని ఇంకా దూరం చేస్తుంది. కార్పొరేటు కంపెనీలకి మేలుచేసేందుకే ఈ బిల్లులకు ఆమోదం పొందారు. ఒప్పంద వ్యవసాయం ప్రారంభమైతే ప్రభుత్వం నిర్ణయించే కనీస మద్దతు ధరల ప్రమేయం ఉండదు. ఒప్పంద షరతులను ఒక సారి రైతులు అంగీకరించిన తరువాత ఎవరైనా కోర్టుకు వెళ్లినా చెల్లదు.
ఆందోళనకరమైన విషయం ఏమిటంటే ఆంధ్ర రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రతిపక్ష పార్టీలైన వైసీపీ , తెలుగుదేశం రెండు కూడా ఈ బిల్లును సమర్థించాయి. దీన్ని ఎలా వ్యతిరేకించాలా అని రైతులు, ప్రజలు ఆలోచించాలి. స్వామీనాధన్‌ కమిటీ సిఫార్సుల ప్రకారం కనీస మద్దతు ధరల నిర్ణయం, అవసరమైనపుడు పంట కొనుగోళ్ళను ప్రభుత్వం చేపట్టనంతకాలం రైతుకు మంచి ధర దొరకదు. వ్యవస్ధలో వున్న లోపాలను సవరించి రైతులకు లాభంచేయాల్సిన ఫ్రభుత్వాలు ఏకంగా వ్యవసాయమార్కెట్లను నాశనం చేయపూనుకున్నాయి. ఇల్లంతా ఎలుకలున్నాయని ఇల్లు తగలపెట్టడానికి పూనుకుంటున్నారు.
ఆహారస్వావలంబన సాధించి దేశానికి అన్నం పెట్టే రైతులను నాశనం చేయటం వలన దేశ స్వాతంత్య్రం, సార్వభౌమత్వం నాశన మౌతాయి. బీహార్‌ రాష్ట్రం లో 2006 సం.లోనే వ్యవసాయమార్కెట్‌ లను రద్దు చేశారు.మార్కెట్‌ కమిటీల రద్దు తర్వాత ధరలు తగ్గిపోయాయి. ఉదాహరణకు మొక్కజొన్న క్విటాలుకు మద్దతుధర రూ.1850.వుంది. ఎక్కువ మంది రైతులు 1000 రూపాయల కన్నా తక్కువ ధర కే అమ్ముకోక తప్పలేదు. మద్దతు ధర కే కొనాలనే నిబంధన బిల్లులో ఎక్కడా లేదు. క్రమేపీ కనీస మద్దతు ధరను ఉపసంహరించుకోవటానికే ఆ నిబంధనలను చేర్చలేదని అర్ధమౌతుంది.

ఫెడరలిజం స్ఫూర్తికి వ్యతిరేకం

రాజ్యాంగం ప్రకారం వ్యవసాయం ఉమ్మడి జాబితా లోనిది. ఫెడరలిజం స్ఫూర్తికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తన పెత్తనాన్ని రుద్దుతున్నది. రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించకుండానే బిల్లులను నిరంకుశంగా తెచ్చారు. రైతన్నలలో తలెత్తుతున్న ఆందోళనలను ఖాతరు చేయకుండా ప్రవేశపెట్టొందంటూ తాను ఎంత మొత్తుకున్నా ప్రభుత్వం వినిపించుకోలేదని అకాలీదళ్‌ నేత, కేంద్ర మంత్రి హరిసిమ్రత్‌ కౌర్‌ బాదల్‌ రాజీనామా చేశారు.

బిల్లులను ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. బిల్లులను సెలెక్ట్‌ కమిటీ కి పంపాలన్న ప్రతిపాదనను కూడా ప్రభుత్వం తిరస్కరించింది. ఓటింగ్‌ జరపాలన్న ప్రతిపాదనను ఖాతరు చేయలేదు. రూల్స్‌ ప్రకారం ఒక్క ఎంపీ అడిగినా ఓటింగ్‌ పెట్టాలి. పార్లమెంటు సభ్యులు చేసేదేమీ లేక కోపంతో బిల్లు ప్రతులను చించివేశారు. పోడియం వైపు దూసుకు వెళ్లారు. గొంతెత్తి అరిచారు.
విపక్షాల తీవ్ర అభ్యంతరాల మధ్య మూజువాణి ఓటుతో ఆమోదం పొందినట్లు రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ హరివంశ్‌ సింగ్‌ ప్రకటించారు.

బిల్లుల పై భిన్న వ్యాఖ్యానాలు..

వ్యవసాయ బిల్లులను పార్లమెంటు ఆమోదించటం వ్యవసాయరంగ ముఖచిత్రాన్ని మార్చేస్తుందని, కోట్లాదిమంది రైతులకు సాధికారతను ఇస్తుందని ప్రధాన మంత్రి నరేంద్రమోడీ వ్యాఖ్యానించారు.
రైతుల దగ్గర నుంచి ప్రైవేటు వ్యక్తులు పంటను కొనేధర కనీస మద్దతు ధర కంటే తక్కువ ఉండకూడదనే నిబంధనను బిల్లులలో ఎందుకు పొందుపరచ లేదని మాజీ మంత్రి చిదంబరం ప్రశ్నించారు. ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లులు ఆహార భద్రతకు విఘాతం కల్పిస్తాయని కూడా అన్నారు.

వ్యవసాయ రంగ బిల్లులు” రైతుల పాలిట మత్యు గంటలు” అని డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ అన్నారు. ఈ బిల్లు చట్టంగా మారితే వ్యవసాయ ఉత్పత్తుల నిల్వలు అన్ని కార్పొరేట్ల చేతుల్లోకి వెళ్తాయని ఫలితంగా రైతులకు కనీస మద్దతు ధర లేకుండా పోతుందని స్ఠాలిన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. సంస్కరణల పేరుతో మోదీ సర్కార్‌ తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులు దేశానికి తీరని నష్టం చేస్తాయని, దేశానికి వెన్నెముక అయిన రైతుల్ని కార్పొరేట్‌ శక్తులకు బానిసలుగా మార్చేస్తుందని కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ అన్నారు. రైతాంగం, వ్యవసాయం పై ముప్పేట దాడి చేస్తున్నారని, బడా వ్యా పారవేత్తలు, కార్పోరేట్‌ సంస్ధలు, అగ్రిబిజినెస్‌ సంస్ధలు పెద్దఎత్తున దోపిడీ చేయటానికి ఒక నిబంధనావళిని రూపొందిస్పున్నారని మార్క్సిస్టు పార్టీ నాయకులు అన్నారు.
తమకున్న కొద్దిపాటి సరుకును ఎన్నో రవాణా ఖర్చులు భరించి లారీల ద్వారా వేరే చోటుకు తీసుకెళ్ళి అమ్ముకోవటం సాధ్యమేనా ? ఇది తేనెపూసిన కత్తి లాంటి చట్టం అని, దీన్ని ఖచ్చితంగా వ్యతిరేకించితీరాలని, కార్పోరేట్‌ గద్దలకోసమే ఈ వ్యవసాయ బిల్లు అని తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. వ్యవసాయబిల్లులు అన్నదాతలకు డెత్‌ వారెంట్‌ లాంటివని కాంగ్రెస్‌ ఎంపీ ప్రతాప్‌ సింగ్‌ బస్వా వ్యాఖ్యానించారు.రైతుల ప్రాణాలను హరించే ఈ బిల్లిలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.
రైతులనుబానిసలుగా మారుస్తారా అని డీయంకే ఎంపీ ఇళంగోవాన్‌ ప్రశ్నించారు. రైతుల ఉసురు తీసుకునేవి.రైతులను ఆటవస్తువులుగా మార్చేస్తాయని ఇళంగోవాన్‌ విమర్శించారు.ఈ బిల్లులు ప్రవేశపెట్టే సమయంలో కనీసం ఆర్‌ యస్‌ యస్‌ అనుబంధరైతు సంఘాలతోనూ చర్చించలేదని ఎస్‌ పీ నేత రాంగోపాల్‌ యాదవ్‌ అన్నారు.

25న ఆందోళనకు 250 రైతుసంఘాల పిలుపు

వ్యవసాయ రంగ బిల్లుల్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న రైతులు పంజాబ్‌, హర్యానా, ఉత్తరప్రదేష్‌ రాష్ట్రాలలో తీవ్ర ఆందోళనలు మొదలు పెట్టారు. బిల్లులను ఉపసంహరించుకునేలా ఆందోళన తీవ్రతరం చేయాలని భారతదేశంలోని 250 రైతుసంఘాలు నిర్ణయించాయి. ఈ నెల 25న బందుకు పిలుపునిచ్చారు. అన్ని రాష్ట్రాలలోనూ కలెక్టర్‌ఆఫీసుల వద్ద ఆందోళనలకు సిద్దమవుతున్నారు. రైతుల పైనా వ్యవసాయం పైనా జరుగుతున్నదాడిని ఎదుర్కోవాలి.

గమనిక : వ్యాస రచయిత ఆంధ్రప్రదేశ్‌లోని నల్లమడ ప్రాంత రైతు సంఘం నాయకులు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...
← Older posts

Recent Posts

  • కేరళ ఎన్నికలు : చర్చ్‌ల చుట్టూ బిజెపి ప్రదక్షిణలు – ముస్లిం లీగ్‌కూ లవ్‌ జీహాద్‌ !
  • చారిత్రక రైతు ఉద్యమం నూతన దశ, దిశ ఏమిటి !
  • కేరళ రాజకీయ చిత్రం : మెట్రోమాన్‌ జోక్‌ – కాంగ్రెస్‌ స్వంత డబ్బా !
  • మనం గంగిరెద్దులం కాదు – అయినా ప్రతిదానికి తలలూపుతున్నామెందుకు ?
  • నరేంద్రమోడీ పగటి కల : కేరళలో ఒకటి నుంచి డెబ్బయి ఒకటి !

Recent Comments

B. Govardhan on ప్రియాంక చోప్రా మీద మౌనం…
Janaki Ram on ఎంత పని చేస్తివే ట్వీటా : కంగన…
Rajamohan Kolla on రైతుల ఆందోళన : బి-జెపి-అండ్‌కో…
V VENKATA KRISHNA on మెజారిటీ-మైనారిటీ మతవాదుల అడ్డ…
CHIMME JOHN BARNABAS… on జస్టిస్‌ ఎన్‌వి రమణపై సిఎం జగన…

Archives

  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • కేరళ ఎన్నికలు : చర్చ్‌ల చుట్టూ బిజెపి ప్రదక్షిణలు – ముస్లిం లీగ్‌కూ లవ్‌ జీహాద్‌ !
  • చారిత్రక రైతు ఉద్యమం నూతన దశ, దిశ ఏమిటి !
  • కేరళ రాజకీయ చిత్రం : మెట్రోమాన్‌ జోక్‌ – కాంగ్రెస్‌ స్వంత డబ్బా !
  • మనం గంగిరెద్దులం కాదు – అయినా ప్రతిదానికి తలలూపుతున్నామెందుకు ?
  • నరేంద్రమోడీ పగటి కల : కేరళలో ఒకటి నుంచి డెబ్బయి ఒకటి !

Recent Comments

B. Govardhan on ప్రియాంక చోప్రా మీద మౌనం…
Janaki Ram on ఎంత పని చేస్తివే ట్వీటా : కంగన…
Rajamohan Kolla on రైతుల ఆందోళన : బి-జెపి-అండ్‌కో…
V VENKATA KRISHNA on మెజారిటీ-మైనారిటీ మతవాదుల అడ్డ…
CHIMME JOHN BARNABAS… on జస్టిస్‌ ఎన్‌వి రమణపై సిఎం జగన…

Archives

  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • కేరళ ఎన్నికలు : చర్చ్‌ల చుట్టూ బిజెపి ప్రదక్షిణలు – ముస్లిం లీగ్‌కూ లవ్‌ జీహాద్‌ !
  • చారిత్రక రైతు ఉద్యమం నూతన దశ, దిశ ఏమిటి !
  • కేరళ రాజకీయ చిత్రం : మెట్రోమాన్‌ జోక్‌ – కాంగ్రెస్‌ స్వంత డబ్బా !
  • మనం గంగిరెద్దులం కాదు – అయినా ప్రతిదానికి తలలూపుతున్నామెందుకు ?
  • నరేంద్రమోడీ పగటి కల : కేరళలో ఒకటి నుంచి డెబ్బయి ఒకటి !

Recent Comments

B. Govardhan on ప్రియాంక చోప్రా మీద మౌనం…
Janaki Ram on ఎంత పని చేస్తివే ట్వీటా : కంగన…
Rajamohan Kolla on రైతుల ఆందోళన : బి-జెపి-అండ్‌కో…
V VENKATA KRISHNA on మెజారిటీ-మైనారిటీ మతవాదుల అడ్డ…
CHIMME JOHN BARNABAS… on జస్టిస్‌ ఎన్‌వి రమణపై సిఎం జగన…

Archives

  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
%d bloggers like this: