• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: AP NEWS

మార్కెట్‌ సునామీకి విలవిల్లాడుతున్న వనామీ రైతు !

03 Saturday Dec 2022

Posted by raomk in AP, AP NEWS, CHINA, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Prices, RUSSIA, USA

≈ Leave a comment

Tags

Andhra Pradesh Aqua farmers, AP shrimp farmers, Aquaculturists, seafood export, vannamei shrimp


ఎం కోటేశ్వరరావు


దేశంలో దాదాపు రెండు లక్షల 70వేల ఎకరాల్లో వనామీ రకం రొయ్యల రకం సాగు జరుగుతోంది. దీనిలో లక్షా 80వేల ఎకరాలు ఆంధ్రప్రదేశ్‌లోనే ఉంది. టైగర్‌ రొయ్యల రకం మరొక లక్షా 50వేల ఎకరాల్లో జరుగుతోంది. ఇది ప్రధానంగా లక్షా పాతికవేల ఎకరాలు ఒక్క పశ్చిమ బెంగాల్లోనే జరుగుతోంది. ప్రస్తుతం తమ పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని వనామీ రైతులు వాపోతున్నారు. వివిధ కారణాలతో ప్రపంచంలో రొయ్యల ఎగుమతి మార్కెట్‌ అవకాశాలు తగ్గాయి. ఒక వైపు మేత ధరలు విపరీతంగా పెరగటం మరొక వైపు కొనే వారు లేక చేతికి వచ్చిన వాటిని తెగనమ్ముకోవాల్సిన పరిస్థితి. రానున్న కొద్ది నెలలు కూడా ఇలాగే కొనసాగితే ఈ రంగం మొత్తం తీవ్ర సంక్షోభంలో పడనుంది. ఒక అంచనా ప్రకారం ఇప్పటికే రు.25వేల కోట్ల మేరకు నష్టపోయినట్లు అంచనా. రొయ్యలను శుద్ది చేసి ఎగుమతికి అనువుగా తయారు చేసే ఫ్యాక్టరీలలో చిన్నా, మధ్యతరగతివి మూసివేతకు దగ్గరగా ఉన్నట్లు చెబుతున్నారు. ఎగుమతులు లేవనే పేరుతో కొందరు రైతులకు చెల్లించాల్సిన సొమ్మును సకాలంలో ముట్టచెప్పటం లేదు.


అమెరికా, ఐరోపా, జపాన్‌ దేశాలలో క్రిస్మస్‌ సందర్భంగా పలు ఉత్పత్తులకు డిమాండ్‌ ఉంటుంది. ప్రస్తుతం తలెత్తిన ఆర్థిక వడిదుడుకుల కారణంగా ఈ ఏడాది దానికి తగిన విధంగా మన దేశం నుంచి దిగుమతి ఆర్డర్లు లేవు. చైనాలో కరోనా కేసులను సున్నాకు తగ్గించాలని అక్కడి ప్రభుత్వం లాక్‌డౌన్లు ఇతర ఆంక్షలను విధించిన కారణంగా అక్కడి డిమాండ్‌ కూడా తగ్గినట్లు వార్తలు. ఆగస్టు నెల నుంచి ఎగుమతి డిమాండ్‌ తగ్గిన కారణంగా ఆంధ్రప్రదేశ్‌ రొయ్యల మార్కెట్‌ సంక్షోభం మొదలైంది. విదేశాల్లో డిమాండ్‌ తగ్గటంతో ధరలు కూడా పడిపోయాయి. 2021-22లో మన దేశం నుంచి 7.76 బిలియన్‌ డాలర్ల మేర సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు జరగ్గా కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది లక్ష్యంగా 8.6బి.డాలర్లను నిర్ణయించింది. అది నెరవేరే పరిస్థితి కనిపించటం లేదు. గిరాకీ తగ్గుదల 30 నుంచి 35శాతం వరకు, ధరల పతనం 20 నుంచి 25శాతం ఉన్నందున జనవరి తరువాత తిరిగి పూర్వపు స్థాయికి చేరితే తప్ప అటు కేంద్ర ప్రభుత్వానికి విదేశీ మారకద్రవ్యం తగ్గుదల ఇటు రైతాంగానికి ఆర్థిక నష్టం జరుగుతుంది. ఎగుమతి-దిగుమతి దేశాలన్నింటా శీతల గిడ్డంగులన్నీ ఆక్వా ఉత్పత్తులతో నిండి ఉన్నట్లు వార్తలు.ఈ కారణంగానే కొనుగోళ్లు మందగింపు, పరిస్థితి మెరుగుపడకపోదా అనే ఆశ ఉన్న ఎగుమతిదార్లు రైతుల నుంచి తక్కువ ధరలకు కొనుగోలు చేసి నిల్వ చేస్తున్నారు. మెరుగుపడితే మంచి లాభాలు లేకపోతే నష్టం ఉండదు అన్న అంచనాలే దీనికి కారణం. గతంలో కూడా మార్కెట్లో కొన్ని ఇబ్బందులు తలెత్తినా ఇలాంటి తీవ్రత గడచిన నాలుగు దశాబ్దాల్లో ఎన్నడూ లేదని ఆ రంగంలోని ప్రముఖులు చెబుతున్నారు.


ధనిక దేశాల్లో తలెత్తిన ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల కారణంగా జేబులకు చిల్లుపడుతున్నందున జనం తమ అలవాట్లు, అవసరాల ప్రాధాన్యతలను కూడా మార్చుకుంటారు. అత్యవసరమైన వాటినే కొనుగోలు చేస్తారు.ఈ పరిస్థితికి తోడు గతేడాది ప్రపంచంలో 40లక్షల టన్నుల మేర రొయ్యల ఉత్పత్తి జరిగితే ఈ ఏడాది 50లక్షల టన్నుల వరకు ఉండవచ్చని అంచనా. ఇది కూడా ధరల పతనానికి ఒక కారణం అంటున్నారు. ఈక్వెడోర్‌, ఇండోనేషియా, వియత్నాంలో ఉత్పత్తి పెరిగింది. పన్నెండు లక్షల టన్నులతో ఈక్వెడోర్‌ ఇప్పుడు ప్రపంచంలో అగ్రదేశంగా ఎదిగింది.చమురు ధరల పెరుగుదలతో రవాణా ఖర్చు పెరిగింది. మన దేశం నుంచి అమెరికా, తరువాత స్థానాల్లో చైనా ఎక్కువగా దిగుమతులు చేసుకుంటున్నాయి. రవాణా ఖర్చుల పెరుగుదల కారణంగా పక్కనే ఉన్న ఈక్వెడోర్‌ నుంచి దిగుమతి చేసుకోవటం అమెరికాలోని దిగుమతి కంపెనీలకు ఎక్కువ లాభం కనుక అక్కడి ఉత్పత్తులకు మొగ్గు చూపుతున్నారు. చైనా కూడా అక్కడి నుంచి కొంత దిగుమతి చేసుకుంటున్నది.


మన కరెన్సీ విలువ తగ్గినందున ఎగుమతిదార్లకు పెరిగిన రవాణా ఖర్చు కలసి వచ్చి కొనుగోలు చేస్తారని భావిస్తే అమెరికా మినహా మిగిలిన దిగుమతి చేసుకొనే దేశాల కరెన్సీ విలువలు కూడా మన రూపాయి మాదిరి పతనమై ఆ దేశాలలో కొనుగోలు శక్తి తగ్గింది. ఆంధ్రప్రదేశ్‌లో కిలోకు వంద తూగే వనామీ రకం రొయ్యలకు కనీసం రు.240 చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది, ఎవరూ కొనుగోలుకు ముందుకు రాకపోవటంతో దాన్ని రు.210కి తగ్గించినా చిత్తశుద్దితో అమలు జరిపేవారు లేరు. నిల్వ ఉండే సరకు కానందున చివరకు రు.180, ఇంకా అంతకు తక్కువకు సైతం అమ్ముకోవాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. ఉత్పత్తి ఖర్చులు కూడా రాక ఆర్థికంగా నష్టపోతున్నారు. చివరకు టైగర్‌ రకం ధర కూడా రు.600 నుంచి 450కి పడిపోయింది. ఈ కారణంగా గతేడాది జరిగిన 9.2లక్షల టన్నుల ఉత్పత్తి ఈ ఏడాది ఎనిమిది లేదా ఇంకా తక్కువకు పడిపోవచ్చని అంచనా వేస్తున్నారు. ఇతర దేశాల రైతులకు సైతం ఎగుమతి అవరోధాలు ఉన్నప్పటికీ మలేషియా, వియత్నాం, థాయిలాండ్‌ వంటి దేశాల్లో వంద కౌంట్‌ ఉన్న వాటికి రు.290 నుంచి 310వరకు రైతుకు వస్తుండగా మన దగ్గర రెండువందలకంటే తక్కువకు దిగజారిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. కిలోకు రు.300లకు తగ్గితే గిట్టుబాటు కాదని, 270 కంటే తగ్గితే నష్టమని అంటున్నారు.


మన దేశం 123 దేశాలకు సముద్ర ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నది. వీటిలో ఎక్కువ భాగం రొయ్యలే ఉండటంతో గతేడాది జరిగిన మొత్తం ఆరులక్షల టన్నుల ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్‌ వాటా 60శాతం వరకు ఉంది. చైనా తన దిగుమతుల్లో 70శాతం మన దేశం నుంచి చేసుకొనేది ఇప్పుడు ఈక్వెడోర్‌ నుంచి కూడా చేసుకుంటున్నది. వివిధ దేశాలు చేసుకొనే దిగుమతులపై వర్తమాన రాజకీయాలు, వాణిజ్య సంబంధాలు కూడా ప్రభావం చూపుతాయి. తమకు వ్యతిరేకంగా పని చేస్తున్న అమెరికాతో భారత్‌ చేతులు కలుపుతోందన్న అభిప్రాయం చైనాకు ఉంది. మరోవైపున మనదేశంలో బిజెపి, దానికి మార్గదర్శకంగా పనిచేసే సంఘపరివార్‌ సంస్థల దళాలు, వారికి వంతపాడే మీడియా విశ్లేషకులు సుప్రభాతం మాదిరి రోజు చైనా ఉత్పత్తులను బహిష్కరించాలని, ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకొని దానికి బుద్ది చెప్పాలని,మన కాళ్ల దగ్గరకు తెచ్చుకోవాలని ప్రచారం చేస్తుంటారు. ఈ నోటి దూలను చూసిన తరువాత మన ఉత్పత్తులకు ప్రత్యామ్నాయంగా ఎగుమతి చేసే దేశాలున్నపుడు వాటి నుంచి దిగుమతుల చేసుకోవాలనే అలోచన కలగవచ్చు. లేకపోతే ఎంతో దూరంలో ఉన్న ఈక్వెడోర్‌ నుంచి చైనా దిగుమతులు చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చినట్లు ? వాటికి ప్రతిగా చైనాకు తన వస్తువులను అక్కడికి ఎగుమతి చేసేందుకు అవకాశాలు పెరుగుతాయి.మన ప్రభుత్వం విధిస్తున్న ఎగుమతి పన్నులు, మన దేశంతో ఒప్పందాలు లేని కారణంగా దిగుమతి చేసే దేశాలు మన ఉత్పత్తులపై విధిస్తున్న పన్నులు కూడా దిగుమతిదార్లను అవి లేని దేశాలవైపుకు నెడతాయి. అందువలన ఇలాంటి పన్నులు లేకుండా ఉండాలంటే మన దేశం ఇతర దేశాలతో వాణిజ్య ఒప్పందాలు చేసుకోవటం కూడా అవసరమే. అయితే అలాంటి ఒప్పందాలకు వెళ్లే ముందు మన దేశ లబ్దిని కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ఐరోపా, ఇతర దేశాలతో వియత్నాం స్వేచ్చా వాణిజ్య ఒప్పందాలు చేసుకున్నందున అవి మనకు బదులు అక్కడి నుంచి దిగుమతి చేసుకుంటాయి. మన రొయ్యలపై తెల్లమచ్చల కారణంగా ఆస్ట్రేలియా దిగుమతులను నిలిపివేసింది. అందువలన ఎగుమతి చేసే దేశాలు కోరుకున్న ప్రమాణాల మేరకు వ్యాధులు, నిషేధిత మందుల అవశేషాలు లేకుండా మన ఉత్పత్తులుండటం కూడా అవసరమే. ఒక వేళ ఇక్కడ కన్ను గప్పి పంపినా ఎక్కడైనా పట్టుబడితే మొదటికే మోసం వస్తుంది.


ఇక స్థానిక సమస్యల సంగతులను చూస్తే నాణ్యమైన రొయ్య విత్తన(పిల్లల) లభ్యత కూడా తీవ్రంగానే ఉంది.ఆంధ్రప్రదేశ్‌ప్రభుత్వం విద్యుత్‌ సబ్సిడి ఎత్తివేసేందుకు దారులు వెతికి రైతుల్లో ఆందోళన కలిగించింది. ఆక్వా జోన్‌, నాన్‌ ఆక్వా జోన్‌ అని కొన్ని రోజులు, ఐదెకరాల లోపు, ఆపైవారు అని మరికొన్ని రోజులు, సర్వేల పేరుతో చేస్తున్న కాలయాపన గురించి రైతుల్లో అసంతృప్తి ఉంది. ప్రతి గ్రామంలో సచివాల యాలు, వలంటీర్లు ఉన్నందున ఒక్క రోజులో సమాచారాన్ని సేకరించవచ్చు. మరోవైపు విపరీతంగా పెరుగుతున్న మేత ధరలు అదుపులో ఉండటం లేదు. కనీస మద్దతు ధరను అమలు జరిపే అధికారులు, ఉల్లంఘించిన వారి మీద చర్యలు గానీ ఉండటం లేదు. ఎగుమతి పరిస్థితి మెరుగుపడేంతవరకు పంటవిరామం ప్రకటించాలని కూడా కొందరు రైతులు సూచిస్తున్నారు. లక్షలాది మందికి ఆక్వా ఉపాధి కల్పిస్తున్నది. అందువలన ఈ రంగాన్ని కూడా పరిశ్రమగానే గుర్తించి ఇతర పరిశ్రమలకు మాదిరే ఇస్తున్న విద్యుత్‌, ఇతర రాయితీలను అందరికీ వర్తింప చేయాలని కూడా రైతులు కోరుతున్నారు.సంక్షోభ సమయాల్లో అన్ని రంగాలను ఆదుకున్నట్లుగానే ఆక్వాను కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. వారి గోడును పాలకులు వినిపించుకుంటారా ? అనుమానమే !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

ఎపిఎస్‌ఆర్‌టిసి ప్రయాణీకులపై మోడీ – జగన్‌ బాదుడే బాదుడు !

02 Saturday Jul 2022

Posted by raomk in AP NEWS, Current Affairs, Economics, INDIA, NATIONAL NEWS, Opinion, Prices

≈ Leave a comment

Tags

APSRTC, Narendra Modi, YS jagan


ఎం కోటేశ్వరరావు


ఆంధ్రప్రదేశ్‌ రోడ్డు రవాణా సంస్థ(ఎపిఎస్‌ఆర్‌టి) డీజిల్‌ సెస్‌ పేరుతో ప్రయాణీకుల మీద భారం మోపింది. 2022 జూలై ఒకటవ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది.ఈ సందర్భంగా సంస్థ చేసిన ప్రకటనలో ” పొరుగు రాష్ట్రంలో అన్ని బస్సుల టిక్కెట్లు మరియు పాస్‌ల ధరలు 9.6.2022 నుంచి పెంచటం జరిగినది ” అని సమర్ధించుకుంది.ఎదుటి వారు తొడ కోసుకుంటే మనం మెడ కోసుకుంటామా అన్న లోకోక్తి తెలిసిందే. భారం మోపేందుకు ఇది ఒక సాకు తప్ప హేతుబద్దత లేదు. ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో ఉన్న వాటన్నింటినీ ఆంధ్రప్రదేశ్‌ అమలు జరుపుతున్నదా, ఎపిలో ఉన్న వాటిని ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్నాయా ! ఒకరు పెంచితే మిగతావారు పెంచాలని, తగ్గిస్తే తగ్గించాలనే ఒప్పందం గానీ విధిగానీ లేదు. జూలై రెండవ తేదీన ఇరుగు పొరుగు రాష్ట్రాలలో ఒక లీటరు పెట్రోలు, డీజిలు ధరలు దిగువ విధంగా ఉన్నాయి.
పట్టణం ×××× పెట్రోలు××× డీజిలు
విజయవాడ×× 111.66 ××× 99.43
హైదరాబాదు × 109.66 ××× 97.82
బెంగలూరు ×× 101.94 ××× 87.89
చెన్నై ×××××× 102.63 ××× 94.24
భువనేశ్వర్‌ ××× 103.19 ××× 95.28
ఆర్‌టిసీ ఛార్జీల పెంపుదల కోసం పొరుగు రాష్ట్రంతో పోలిక తెచ్చిన జగన్‌మోహనరెడ్డి సర్కార్‌ మరి ఈ రేట్లను గమనించి తక్కువ ఎక్కడుందో దాన్ని ఎందుకు అనుసరించటం లేదు ? దున్నబోతే దూడల్లో తినబోతే ఎద్దుల్లో అంటే ఇదే కదా ! అడ్డగోలు సమర్ధనకు ఒక తర్కం-పద్దతీ పాడూ ఉండదు. ఆర్‌టిసి ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో కూడా సర్వీసులను నిర్వహిస్తున్నది. ఇప్పుడు రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్నవారు పొరుగునే తక్కువగా ఉన్న ధరలకు డీజిలు, పెట్రోలు కొనుగోలు చేస్తున్నారు.అలాగే ఎపిఎస్‌ఆర్‌టిసి ఛార్జీలు తక్కువగా ఉంటే పొరుగు రాష్ట్రాల జనాలు మన బస్సులు ఎక్కుతారు, రాబడి కూడా పెరుగుతుంది కదా ! సిఎం జగన్‌మోహన్‌ రెడ్డి చుట్టూ తిష్టవేసిన సలహాదారులకు, అధికారులకు గానీ ఈ చిన్న అంశం తట్టలేదా ! గతంలో కూడా డీజిలు ధరలు పెరిగాయి. ఎన్నడూ ఆర్‌టిసి చరిత్రలో దొడ్డిదారిన డీజిల్‌ సెస్‌ పేరుతో భారం మోపలేదు.


నవరత్నాలలో భాగంగా గత మూడు సంవత్సరాలలో లక్షా 50వేల కోట్ల వరకు జనానికి లబ్ది చేకూర్చినట్లు వైసిపి ప్రభుత్వ విజయాలలో చెప్పుకుంటున్నారు. ఆర్‌టిసి అధికారికంగా వెల్లడించిన సమాచారం ప్రకారం గత మూడు సంవత్సరాలలో వరుసగా వచ్చినట్లు చెప్పిన నష్టం 2019-20లో రు.1,222.96 కోట్లు, 2020-21లో రు.2,982.32 కోట్లు, 2021-22లో రు.2,698.86 కోట్లు. ఆర్‌టిసిని ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించారు.ఇది మిగిలిన ప్రభుత్వశాఖల వంటిది కాగా నష్టాల గురించి ఎందుకు చెబుతున్నారన్నది ప్రశ్న. వైద్య ఆరోగ్యశాఖలో కూడా అందించేది సేవ మాత్రమే. ఆర్‌టిసిలో సిబ్బంది వేతనాలు, బస్సుల కొనుగోలు, నిర్వహణ ఉన్నట్లే అక్కడా సిబ్బంది వేతనాలు, ఆసుపత్రులు, వాటికి అవసరమైన వైద్య పరికరాలు, ఔషధాల కొనుగోలు వంటివి ఉంటాయి. దానిలో లేని లాభనష్టాల లెక్కలు ఆర్టీసికి ఎందుకు చెబుతున్నట్లు ? ఆసుపత్రుల్లో వాణిజ్య దుకాణాలు ఉండవు,అదే బస్టాండ్లలో ఎంతో కొంత దుకాణాల ద్వారా రాబడి వస్తుంది. ఆర్‌టిసి బస్సుల్లో ప్రయాణించేది పేద, మధ్య తరగతి వారు మాత్రమే. వారి కోసం రవాణా సబ్సిడీని కూడా నవరత్నాల్లో భాగంగా పరిగణించి ఏడాదికి మూడువేల కోట్ల రూపాయల భారాన్ని భరించే శక్తిలేనిదిగా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదా ? నిజానికి నష్టం అని చెబుతున్నదంతా నష్టం కాదు. వృద్దులు, స్కూలు విద్యార్దులు, బస్‌పాస్‌లు, ఆర్‌టిసి మాజీ సిబ్బంది, జర్నలిస్టులు, ఇతరులకు ఇస్తున్న రాయితీలు కూడా దీనిలో ఉన్నందున ఆ మేరకు ప్రభుత్వం సంస్థకు చెల్లిస్తే నష్టాల మొత్తం తగ్గుతుంది. గత మూడు సంవత్సరాల్లో డీజిలు ధర లీటరుకు రు.40 పెరిగిందని ఆర్‌టిసి తన ప్రకటనలో చెప్పింది. డీజిలు మీద ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 22.25శాతం పన్ను విధిస్తున్నది అంటే, అంత మేర రాష్ట్ర ప్రభుత్వానికి అదనపు ఆదాయం వస్తున్నదనేది పచ్చినిజం. ఆ మేరకు ఆర్‌టిసి కొనుగోలు చేసే డీజిలు మీద పన్ను తగ్గించినా భారం తగ్గుతుంది కదా !


పెద్ద మొత్తంలో డీజిలు కొనుగోలు చేసేవారికి లీటరుకు రు.30 అదనంగా కేంద్ర ప్రభుత్వం అమ్ముతున్నది. ఇది జనం మీద విధిస్తున్న మోడీ టాక్సు అని చెప్పవచ్చు. తెలంగాణా వంటి చోట్ల ఆర్‌టిసి ఏకమొత్త కొనుగోలు నిలిపివేసి ఆ భారాన్ని తగ్గించుకొనేందుకు విడిగా కొనుగోలు చేస్తున్నారు. ఎపిఎస్‌ఆర్‌టిసి కూడా అదే పద్దతిని అనుసరించవచ్చు.ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇప్పుడు కొనుగోలు నిలిపివేశారని చెబుతున్నారు. అలాంటపుడు ఆ పేరుతో జనాల మీద భారం మోపారంటే దీన్ని మోడీ-జగన్‌ టాక్సు అని పిలవాల్సి ఉంటుంది. ఆర్‌టిసి బస్సుల్లో ఇప్పటికే టోలు, పాసింజరు, సేఫ్టీ పేరుతో అదనపు మొత్తాలను ప్రయాణీకుల నుంచే వసూలు చేస్తున్నారు. ఇప్పుడు ఇది అదనపు భారం.


ఆర్‌టిసిలో వివిధ సర్వీసుల మీద పెంచిన డీజిల్‌ భారం వెనుక పాలకపార్టీ పెద్దలు-ప్రయివేటు బస్‌ యజమానుల కుమ్మక్కును కొట్టి పారవేయలేము. వారు విడిగా తక్కువ ధరలకు బంకుల్లో డీజిలు కొనుగోలు చేస్తారు కనుక ఆర్‌టిసి పెంచిన మొత్తం ఎంతైతే అంత వారికి వచ్చే అదనపు లాభమే. డిమాండ్‌ ఉన్నపుడు తప్ప మిగిలిన రోజుల్లో ఇప్పటికే ఆర్టీసి కంటే తక్కువ చార్జీలకే తిప్పుతున్నారు. అందువలన ఇప్పుడు ఆర్‌టిసిలో పెంపుదల వారికి మరింత లాభం ఉంటుంది. దానిలో కొంత తగ్గించుకొని ఆర్టీసి కంటే తక్కువ ఛార్జీలకు ప్రయాణీకులను ఆకర్షించేందుకు అవకాశం పెరుగుతుంది. ఇప్పటికే ఆర్‌టిసిలో ఎక్కేవారు తగ్గుతున్నారు. లాభం వుండే దూరపు సర్వీసుల్లో మరింతగా తగ్గితే నష్టాలు మరింతగా పెరుగుతాయి. అందువలన ఏ విధంగా చూసినా సంస్థను మరింత దెబ్బతీసేపనే తప్ప మరొకటి కాదు

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

పాతవరవడిలోనే జగనన్న బడ్జెట్‌ – పెరుగుతున్న అప్పులు, తిప్పలు ?

12 Saturday Mar 2022

Posted by raomk in AP, AP NEWS, Current Affairs, Economics, INDIA, NATIONAL NEWS, Opinion, Telugu

≈ Leave a comment

Tags

ANDHRA PRADESH, AP Budget 2022-23, AP debt, YS jagan



ఎం కోటేశ్వరరావు


2022-23 ఆర్ధిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బడ్జెట్‌ను ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్‌ మార్చి 11వ తేదీన అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అంకెల గారడీ షరా మామూలే. భారీగా కొండంత రాగం తీసి చడీ చప్పుడు లేకుండా కోత పెట్టటం గత కొద్ది సంవత్సరాలుగా జరుగుతోంది. ప్రభుత్వ ఆర్ధిక స్ధితి గురించి ఆందోళనకరమైన వార్తలు వెలువడుతున్నా తగ్గేదేలే అన్నట్లుగా ముందుకు పోవాలని గట్టిగా శపధం పూనినట్లుగా ఉంది. కొత్త అప్పులు పుట్టే అవకాశాలు మూసుకుపోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. అలా తీసుకోవాలంటే షరతులకు అంగీకరించాలి. దానిలో భాగమే చెత్త పన్ను. మున్సిపల్‌ ఎన్నికల తరువాత అలాంటి భారాలు వేస్తారని వామపక్షాలు హెచ్చరించినా జనం కూడా తగ్గేదేలే అన్నట్లుగా వైసిపికి ఓట్లు వేశారు. బండి గుర్రానికి గడ్డి ఆశచూపి పరుగెత్తించినట్లు కేంద్రం తాను ప్రకటించిన లేదా ప్రతిపాదించిన సంస్కరణలు అమలు చేస్తే అప్పులకు సడలింపులు ఇస్తామని ప్రకటించింది. ఆమేరకు దాదాపు ఇరవై లక్షల రైతుల పంపుసెట్లకు మీటర్లు బిగించేందుకు నిర్ణయించింది తెలిసిందే.
ఇక బడ్జెట్‌ పత్రాలు వెల్లడించిన వివరాల ప్రకారం చంద్రబాబు నాయుడు దిగిపోయినపుడు 2018-19 రాష్ట్ర రుణభారం రు. 257509.87 కోట్లు, అది రాష్ట్ర జిఎస్‌డిపిలో 28.02శాతం. దీనికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చి వివిధ సంస్ధలు, శాఖలకు ఇప్పించిన అప్పు పేరుకు పోయిన మొత్తం రు.55508.46 కోట్లు. 2019 మే 30న అధికారానికి వచ్చిన జగనన్న వాటిని ఇబ్బడి ముబ్బడిగా పెంచారు. 2022 మార్చి నెలతో ముగిసే ఆర్ధిక సంవత్సరానికి ప్రభుత్వ రుణం రు.390670.19 కోట్లు, జిఎస్‌డిపిలో 32.51శాతం ఉంది. హామీగా ఉన్న అప్పుల మొత్తం 2021 డిసెంబరు 31నాటికి రు.117503.12 కోట్లకు పెరిగింది. 2022-23లో అప్పుల మొత్తాన్ని రు.439394.35 కోట్లు, 32.79 శాతం జిఎస్‌డిపిలో ఉంటుందని పేర్కొన్నారు. దీనికి హామీల రుణం అదనం. చంద్రబాబు ఏలుబడిలో అన్ని రకాల రుణాలు మూడు లక్షల కోట్లకు పైబడితే జగనన్న దాన్ని వచ్చే ఏడాది చివరికి ఐదున్నర లక్షల కోట్లకు పైగా పెంచనున్నారు. ఇది అంచనాలకు మించిన వృద్ధి.


ఆస్తుల కల్పన ద్వారా ఆదాయ, ఉపాధి పెరుగుదల ఉంటుంది. దీన్నే ఆర్ధిక పరిభాషలో పెట్టుబడి వ్యయం అంటారు.దీని తీరుతెన్నులను చూద్దాం. అప్పులకు సంబంధించి నిర్ణీత లక్ష్యాన్ని చేరేందుకు చూపే శ్రద్ద ఇతర వాటి మీద ఉండటం లేదు.పెట్టుబడివ్యయ పద్దు కింద గత ఏడాదిలో ప్రతిపాదించిన రు. 31,198 కోట్లను 18,529 కోట్లకు సవరించినట్లు చూపారు. అంతకు ముందు ఏడాది కూడా రు.29,300 కోట్లు ప్రతిపాదించి ఖర్చు చేసింది రు.18,974 కోట్లే. వచ్చే ఏడాది ఈ మొత్తాన్ని రు.30,679 కోట్లని పేర్కొన్నారు. దీన్ని అంకెల గారడీగాక ఏమనాలి ? ఇలాంటి కోతల కారణంగానే బడ్జెట్‌ ప్రతిపాదనలను ప్రకటించినపుడు గొప్పగా చెప్పి కోతలు వేస్తున్నారు.


బడ్జెట్‌ ప్రతిపాదనల ప్రకారం 2021- 22లో మొత్తం రు.2,29,779 కోట్లు ఖర్చు ఉంటుంది. దీన్ని ఇప్పుడు రు. 2,08,106.57 కోట్లుగా సవరించారు. వచ్చే ఏడాది బడ్జెట్‌ను రు.2,56,256.56 కోట్లుగా చూపారు. ద్రవ్యలోటు రు.48,724.11 కోట్లుగా చూపారు. ఈ మొత్తాన్ని ఎలా పూడుస్తారో తెలియదు. కేటాయింపులకు కోతలు పెట్టాలి, లేదా జనం మీద భారాలు మోపాలి. ఉదాహరణకు 2020-21లో కూడా ఖర్చు రు.2,24,789 కోట్లుగా చూపి చివరకు రు.1,85,468కి సవరించారు.


వర్తమాన ఆర్ధిక సంవత్సర అన్ని రకాల రాబడి రు.1,54,272.70 కోట్లుగా సవరించారు, వచ్చే ఏడాది ఈ మొత్తం రు.1,91,225.11కోట్లని చెప్పారు. దీనికి రు.64,816 కోట్ల మేరకు అప్పులు తెచ్చి బడ్జెట్‌ను అమలు చేస్తామన్నారు.ఈ అప్పులో రు.21,805 కోట్లు పాత వాటిని తీర్చేందుకే పోతుంది. వ్యవసాయ ప్రధానమైన రాష్ట్రంలో సాగు నీటి వనరుల వృద్ధి వలన రైతాంగ ఆదాయాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం కూడా పెరుగుతుంది. జగన్‌ అధికారానికి రాక ముందు మూడు సంవత్సరాల్లో పెట్టుబడి ఖర్చు రు.31,624 కోట్లు ఖర్చు చేస్తే ఈ మూడేండ్లలో ఆ మొత్తం రు.15,193 (2021-22 సవరించిన అంచనాతో) మాత్రమే ఖర్చు చేశారు. గతేడాది నీటి పారుదల రంగానికి రు.11,586 కోట్లు ప్రతిపాదించి దాన్ని రు.6,832 కోట్లకు కోత పెట్టారు. వచ్చే ఏడాది అసలు ప్రతిపాదనే రు.9,810 కోట్లుగా పేర్కొన్నారు. పెరిగిన బడ్జెట్‌కు అనుగుణంగా లేదా ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకొని భారీగా పెంచాల్సింది పోయి ఇలా చేయటం ఏమిటి ?


నవరత్నాలు లేకపోతే జగన్‌ రత్నాలు పేరు ఏది పెట్టినా పేదలకు అమలు చేస్తున్న సంక్షేమ పధకాలను తప్పు పట్టటం లేదు. అదే పేదలు కార్పొరేట్‌ ఆసుపత్రుల పాలైనపుడు ప్రభుత్వం ద్వారా వచ్చిన సంక్షేమ పధకాల సొమ్ము మొత్తం, ఇంకా అప్పులు చేసినదీ వాటి యజమానులకు సమర్పించుకుంటున్నారు. ఆ స్ధితిలో వైద్య, ఆరోగ్యం కుటుంబ సంక్షేమ ఖర్చును గణనీయం పెంచాలి. కానీ ఈ బడ్జెట్‌లో గతేడాది చేసిన ఖర్చు కంటే తగ్గించారు. సవరించిన అంచనా ప్రకారం రు.12,972 కోట్లనుంచి రు.11,974 కోట్లకు కుదించారు. షెడ్యూలు కులాలు, తరగతులు, వెనుకబడిన తరగతుల సంక్షేమానికి గతేడాది ప్రతిపాదించిన రు.27,401 కోట్లను రు.25,349కు కుదించారు. ఈ ఏడాది మాత్రం దాన్ని ఏకంగా రు.45,411 కోట్లుగా పేర్కొన్నారు. దీన్ని చూస్తే అంకెల గారడీ లేదా మధ్యంతర ఎన్నికల ప్రచార అస్త్రమా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.


రోడ్ల నిర్వహణ ఎంత అధ్వానంగా ఉందో తెలిసిందే. గతేడాది రోడ్లు, వంతెనలకు పెట్టుబడి ఖర్చు రు.2,792 కోట్లుగా చూపి దాన్ని రు.927 కోట్లకు కుదించారు. ఇప్పుడు రు.2,713 కోట్లు ఖర్చు చేస్తామని నమ్మబలుకుతున్నారు.మొత్తం ఆర్ధిక సేవల పెట్టుబడి ఖర్చు రు.18,319 కోట్లుగా ప్రకటించి ఆచరణలో రు.9,859 కు కోత పెట్టి ఈ ఏడాది రు.17,412 కోట్లు ఖర్చు చేస్తామంటున్నారు. ఏ శాఖను చూసినా ఇదే తీరు. నోరున్నదని చెప్పుకొనే ఉద్యోగులకు తాను ప్రకటించిన 27తాత్కాలిక భృతిలో కూడా కోత పెట్టి పిఆర్‌సిని బలవంతంగా రుద్దిన సర్కార్‌ ఇక నోరు లేని లేదా ఉన్నా నోరెత్తలేని జనాలకు సంబంధించిన, అభివృద్ధి పనులకు కోత పెట్టటంలో ఆశ్చర్యం ఏముంది ?


కేంద్ర ప్రభుత్వం తన అజండాను అమలు జరిపేందుకు రాష్ట్రాల మీద ఆంక్షలు పెడుతోంది, షరతులు విధిస్తోంది. 2005ఎఫ్‌ఆర్‌బిఎం చట్టం ప్రకారం రాష్ట్రాలు ఏవిధంగా నడుచుకోవాలో ముందుగానే లక్ష్యాలను నిర్దేశించింది. పదిహేనవ ఆర్ధిక సంఘం 2021-26 సంవత్సరాలలో ద్రవ్యలోటును సంవత్సరాల వారీగా జిఎస్‌డిపిలో 2021-22కు 4, 2022-23కు 3.5, 2023-26కు మూడుశాతాల చొప్పున పరిమితం చేసుకోవాలి. దీని వలన ఆంధ్రప్రదేశ్‌కు 2020-21లో జిఎస్‌డిపిలో ఉన్న 35శాతం రుణ భారం 2025-26 నాటికి 32.1శాతానికి తగ్గుతుందని 15వ ఆర్ధిక సంఘం పేర్కొన్నది. ఇవన్నీ పరిస్ధితులు సాధారణంగా ఉంటే, కానీ కరోనా కారణంగా ఇచ్చిన మినహాయింపులు, ఇతర అంశాల కారణంగా అది అమలు జరుగుతుందని చెప్పలేము. ఐదు సంవత్సరాల కాలంలో పరిమితులను తొలి నాలుగు సంవత్సరాలలో వినియోగించుకోనట్లైతే ఐదవ ఏడాది అదనపు రుణాలు తీసుకోవచ్చు. ఈ లోగా విద్యుత్‌ రంగంలో కేంద్రం ప్రతిపాదించిన షరతులను అమలు జరిపితే తొలి నాలుగు సంవత్సరాలు ప్రతి ఏటా జిఎస్‌డిపిలో 0.5 శాతం చొప్పున అదనంగా అప్పులు తీసుకోవచ్చు.2021-25 మధ్య విద్యుత్‌ నిర్వహణ నష్టాలు తగ్గించాలి.ఆదాయ తేడాను కుదించాలి. వినియోగదారులకు నేరుగా సబ్సిడీని అందించటం ద్వారా సబ్సిడీ మొత్తాలను తగ్గించాలి. ఆదాయాన్ని సబ్సిడీ రేట్లను తగ్గించాలి. ఇవన్నీ ఈ రంగాన్ని ప్రైవేటీకరించేందుకు దారి సుగమం చేయటమే.


జిఎస్‌డిపి ప్రతి ఏటా పెరుగుతూ ఉంటుంది కనుక ఆ దామాషాలో రుణ పరిమితి కూడా పెరుగుతూనే ఉంటుంది. ఉదాహరణకు 2014-15లో ఆంధ్రప్రదేశ్‌ జిఎస్‌డిపి విలువ రు.5,26,470 కోట్లుగా ఉంది. మూడుశాతం రుణ పరిమితి ప్రకారం రు.15,794 కోట్లు తీసుకోవచ్చు.2018-19నాటికి అది రు.9,33,402 కోట్లకు పెరిగింది కనుక రుణం 28వేల కోట్లు తీసుకోవచ్చు. అలాగే 2020-21లో రు.10,19,146 కోట్లుగా సవరించినందున రుణం 34వేల కోట్ల వరకు తీసుకోవచ్చు. 2021-22లో ముందస్తు అంచనా ప్రకారం అది రు. 12,01,736 కోట్లుగా ఉన్నట్లు ఆర్ధిక సర్వేలో పేర్కొన్నారు. అందువలన ఆ మేరకు రుణపరిమితి పెరుగుతుంది. ఆత్మనిర్భర పధకం కింద రెండు శాతం అదనంగా తీసుకొనేందుకు అనుమతించారు. ఇప్పుడు ఆర్ధిక సంఘం ఆంక్షలకు మించి ద్రవ్యలోటు ఉంది. 2020-21లో ద్రవ్యలోటు జిఎస్‌డిపిలో 4.78శాతంగా ప్రతిపాదిస్తే అది 5.38శాతానికి చేరింది. కేంద్రం కరోనా కారణంగా సడలించిన రుణ పరిమితి ఐదుశాతానికి మించి ఇది ఉంది. ఐదుశాతానికి కూడా కేంద్రం షరతులు విధించింది. నాలుగుశాతం వరకు ఎలాంటి షరతులు లేవు, ఒకశాతానికి నాలుగు ఉన్నాయి. ఒకే దేశం-ఒకే రేషన్‌ కార్డు ఒకటి, సులభతర వాణిజ్యం, స్ధానిక సంస్దలలో పన్నుల పెంపు, విద్యుత్‌ పంపిణీ సంస్కరణ. మొదటి మూడింటిని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నెరవేర్చింది. దీంతో అదనంగా 9,090 కోట్లు అదనంగా అప్పు చేసేందుకు అవకాశం వచ్చింది. విద్యుత్‌ సంస్కరణలో భాగంగా మీటర్లు పెట్టేందుకు నిర్ణయించిన అంశం తెలిసిందే. అది జరిగిన తరువాత వినియోగదారులు ముందుగా బిల్లులు చెల్లించాలి. మిగిలిన షరతుల ప్రకారం సబ్సిడీలో కోత వంటి వాటికి పూనుకుంటే వంటగాస్‌ మాదిరి క్రమంగా తగ్గించి వేసి నామమాత్రంగా సబ్సిడీని నేరుగా బ్యాంకు ఖాతాల్లో వేస్తారు. కేంద్రం ప్రతిపాదించిన విద్యుత్‌ సంస్కరణల ప్రకారం విద్యుత్‌ సరఫరా ధరలో 20శాతానికి మించి సబ్సిడీ ఇవ్వకూడదు. పెట్రోలు, డీజిలు ధరల మాదిరి ఖర్చు పెరిగినపుడల్లా చార్జీలను పెంచవచ్చు.


అసలేమీ ఇవ్వని వారి కంటే సంక్షేమ పధకాల పేరుతో జనాన్ని ఆదుకోవటాన్ని ఎవరైనా సమర్ధిస్తారు. వాటికీ పరిమితులుంటాయి. కానీ అవే జనాలను బొందితో కైలాసానికి చేరుస్తాయని ఎవరైనా చెబితే, నమ్మిస్తే అది వంచన అవుతుంది. జనాలకు కావలసినన్ని చేపలను తొలుత సరఫరా చేసినా వాటిని పట్టటం నేర్పితేనే ఎవరికైనా జీవితాంతం భరోసా ఉంటుంది, వారి బతుకు వారు బతుకుతారు. సంక్షేమ పధకాలూ అంతే ! రాబడి వనరులు లేక లేదా పెరగక, అప్పుల దారులన్నీ మూసుకుపోయినపుడు దాన్నుంచి బయట పడాలంటే సంక్షేమ పధకాలకు కోత పెట్టాలి లేదా మరిన్ని భారాలను జనం మీద మోపాలి. అందుకే ఐదేండ్లు గడిచే సరికి నవరత్నాలు, భరోసాలే బంధాలుగా మారి రాజకీయంగా కొంప ముంచినా ఆశ్చర్యంలేదు.జనం వైఫల్యాలను గుర్తించక, అసంతృప్తి పెరగముందే ఏదో ఒక సాకుతో ముందస్తు ఎన్నికలకు పోయినా పోవచ్చు !


Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

అప్పుచేసి పప్పు కూడు, కేంద్ర షరతులతో భారాలు – నవరత్నాలే జగనన్నకు ముప్పు తెస్తాయా ?

15 Monday Nov 2021

Posted by raomk in AP NEWS, Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

ANDHRA PRADESH, Andhra Pradesh Debt, AP’s financial matters, YS jagan


ఎం కోటేశ్వరరావు


ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ ఆర్ధిక స్ధితి గురించి ఆందోళనకరమైన వార్తలు వెలువడుతున్నాయి. మూసిపెడితే పాచి పోతుంది అన్నట్లు పరిస్ధితి ఉంది. అప్పుల తిప్పలు జగన్మోహనరెడ్డి సర్కారును చుట్టుముడుతున్నాయి. ఇప్పటికే నిబంధనల పరిమితిని మించి అప్పులు తీసుకున్నారు.రోజు గడవాలంటే కొత్త అప్పులు తీసుకోక తప్పటం లేదు. అలా తీసుకోవాలంటే కేంద్రం విధించే షరతులను అమలు జరపాల్సి ఉంటుంది. ఇప్పుడు అదే చేసి ఆ మేరకు జనాల మీద భారాలు పెంచుతున్నారు.వృతం చెడ్డా ఫలం దక్కని స్ధితి రానుంది.


తాజాగా కేంద్రం ప్రకటించిన వివరాల మేరకు 2021-22 ఆర్ధిక సంవత్సరం రెండవ త్రైమాసికం వరకు అంటే సెస్టెంబరు వరకు మూలధన( కొత్త ఆస్తుల కల్పన పెట్టుబడి) వ్యయ కేటాయింపులో నిర్ణీతశాతం ఖర్చు చేసిన రాష్ట్రాలకు పరిమితికి మించి 0.5శాతం జిఎస్‌డిపికి సమానమైన మొత్తాన్ని అదనంగా అప్పు తెచ్చుకొనేందుకు కేంద్రం అనుమతిని ప్రకటించింది. ఏడు రాష్ట్రాలు అలాంటి అర్హత సాధించాయి. ఆ విధంగా చత్తీస్‌ఘర్‌కు 895, కేరళకు 2,256, మధ్యప్రదేశ్‌కు 2,590, మేఘాలయ 96, పంజాబ్‌, 2,869, రాజస్తాన్‌ 2,593, తెలంగాణా 5,392 కోట్ల మేరకు కొత్తగా రుణాలు తీసుకోవచ్చు. సెప్టెంబరు 30వరకు 22 రాష్ట్రాలు అందచేసిన సమాచారం మేరకు సమీక్షించి ఈ నిర్ణయం తీసుకున్నారు. వర్తమాన సంవత్సరంలో ఏ రాష్ట్రమైనా జిఎస్‌డిపిలో నాలుగుశాతం వరకు రుణాలు తీసుకోవచ్చు. రాష్ట్రాలు తమ బడ్జెట్లలో మూలధన పెట్టుబడికింద చేసిన కేటాయింపులలో తొలి మూడు మాసాల్లో 15శాతం, ఆరుమాసాల్లో 45, తొమ్మిది మాసాల్లో 70, ఏడాది చివరికి నూరుశాతం ఖర్చు చేశారా లేదా అనే ప్రాతిపదికన సమీక్ష చేస్తారు. అందువలన ఒక మూడు మాసాల్లో ఆ మేరకు చేయకపోయినా తరువాత ఖర్చు చేస్తే అర్హత వస్తుంది. తొలి ఆరునెలల్లో ఆంధ్రప్రదేశ్‌ అలాంటి లక్ష్యాన్ని అందుకోలేకపోయింది. తదుపరి సమీక్ష డిసెంబరు 31న జరుగుతుంది.


తొలిఆరునెలల్లో రాష్ట్ర ఆదాయ(రెవెన్యూ)లోటు 662.8శాతంగా ఉంది. 2021-22 బడ్జెట్‌లో ఈ మొత్తాన్ని రు.5,000.08 కోట్లుగా చూపితే ఏప్రిల్‌-సెప్టెంబరునాటికి రు.33,140.62కోట్లకు చేరింది. కాగ్‌ వివరాల ప్రకారం ఆరునెలల్లో మొత్తం ఆదాయం రు.1,04,804.91 కోట్లు, దీనిలో అప్పుగా తెచ్చిన రు.39,914.18 కోట్లు కలసి ఉన్నాయి.రాబడిలో రు.50,419 కోట్లు సంక్షేమ పధకాలకు, మిగిలిన మొత్తంలో అప్పుల అసలు, వడ్డీలు, వేతనాలు, సబ్సిడీలకు చెల్లించినట్లు చూపారు. ఏడాది మొత్తంలో అప్పులుగా తీసుకుంటామని బడ్జెట్‌లో ప్రతిపాదించిన మొత్తం రు.37,029.79 కోట్లు కాగా ఆరునెలల్లో తీసుకున్నదే రు.39,914 కోట్లు. మరో ఆరునెలల్లో ఎంత అవుతుందో తెలియదు. గతేడాది కంటే ఆదాయం పెరిగినప్పటికీ చేసిన అప్పు ఇదని గమనించాలి. మూలధన పెట్టుబడి ఖర్చు రు.6,415.51 కోట్లు, ఇది గతేడాది తొలి ఆరునెలల కంటే రు.2,912 కోట్లు తక్కువ. ఏడాదిలో ప్రతిపాదించిన రు. 31,198 కోట్లు అంకెల్లో తప్ప అమలుకు నోచుకోదు. గతేడాది నిర్వాకం కూడా ఇదే రు.29,300 కోట్లు ప్రతిపాదించి ఖర్చు చేసింది రు.18,385 కోట్లే.


బడ్జెట్‌ ప్రతిపాదనల ప్రకారం 2021- 22లో మొత్తం రు.2,29,779 కోట్లు ఖర్చు ఉంటుంది. దీనికి గాను రు. 1,77,247 కోట్లు స్వంత వనరులు, కేంద్ర గ్రాంట్ల రూపంలో ఆదాయం వస్తుందని, రు.50,525 కోట్లు అప్పులు తీసుకువస్తామని చెప్పారు. ఆదాయలోటు ఐదువేల కోట్లు,ద్రవ్యలోటు 37వేల కోట్లు అని చూపారు. ప్రతి సంవత్సరం చివరిలో వాటిని సవరిస్తారు. ఉదాహరణకు 2020-21లో ఖర్చు రు.2,24,789 కోట్లుగా చూపి చివరకు రు.1,85,468కి సవరించారు. ఇదే ఆదాయాన్ని చూస్తే రు.1,62,558 కోట్లుగా చూపి రు.1,19,126 కోట్లకు తగ్గించగా అప్పు రు.60,258 కోట్లు తెస్తామని రు.57,805 కోట్లు తెచ్చారు.


ఇక కేటాయింపు, ఖర్చు అంశానికి వస్తే దీనిలో అనేక మతలబులున్నాయి.2020-21లో పెట్టుబడి వ్యయం రు.18,797 కోట్లు, ఇది కేటాయింపు కంటే 37శాతం తక్కువ. సాగునీరు, వరద నివారణ పధకాలకు రు.6,786, రవాణాకు 1,962 కోత పెట్టారు. పెట్టుబడి ఖర్చులో ఆస్తులను సమకూర్చే పధకాల నిర్మాణంతో పాటు, గతంలో వాటికోసం తెచ్చిన తీర్చే అప్పులు, వడ్డీలు కూడా ఉంటాయి. 2019-20లో ఇందుకోసం చేసిన వాస్తవ ఖర్చు రు.36, 226 కోట్లు, దీనిలో ఆస్తుల కల్పనకు చేసింది రు.12,242 కోట్లు. అంటే అప్పులకే ఎక్కువ పోయింది. 2020-21లో మొత్తం రు.44,397 కోట్లు కేటాయించి రు.32,478 కోట్లకు కుదించారు. దీనిలో అప్పులకు రు.13,681 కోట్లు, ఆస్తులకు రు.18,797 ఖర్చు చేశారు. వర్తమాన బడ్జెట్‌లో రెండింటికీ కలిపి రు. 47,583 కోట్లుగానూ, ఆస్తుల కల్పనకు రు.31,198 కోట్లుగాచూపారు. దీనిలో ముందే చెప్పుకున్నట్లు తొలి ఆరునెలల్లో ఖర్చు చేసింది రు. 6,415.51 మాత్రమే. రెవెన్యూ ఖర్చును చూస్తే 2019-20లో రు.1,37,475 కోట్లు, మరుసటి ఏడాది దాన్ని రు.1,80,393 కోట్ల నుంచి రు.1,52,990 కోట్లకు కోత పెట్టారు. వర్తమాన సంవత్సరంలో ప్రతిపాదనే రు.1,82,197 కోట్లు. దీన్లో ఎంత కోత పెడతారో తెలియదు. పరిస్ధితి ఇంత తీవ్రంగా ఉంది కనుకనే ఉద్యోగులు, టీచర్లకు కొత్త వేతనాలు ఖరారు చేసేందుకు ముందుకు రావటం లేదు. ఇక అప్పుల తిప్పల సంగతి చూద్దాం. 2019-20లో అసలు చెల్లింపు రు.18,625, వడ్డీకి రు.17,635 కోట్లు, 2020-21లో ఈ మొత్తాలు రు.11,973 – 22,026గా, 2021-22లో రు.15,503-22,740 కోట్లుగా చూపారు.


కేంద్ర ప్రభుత్వం తన అజండాను అమలు జరిపేందుకు రాష్ట్రాల మీద ఆంక్షలు పెడుతోంది, షరతులు విధిస్తోంది. కార్పొరేట్లకు మార్గాన్ని సుగమం చేస్తోంది. ఉదాహరణకు 2005ఎఫ్‌ఆర్‌బిఎం చట్టం ప్రకారం రాష్ట్రాలు ఏవిధంగా నడుచుకోవాలో ముందుగానే లక్ష్యాలను నిర్దేశించింది. పదిహేనవ ఆర్ధిక సంఘం 2021-26 సంవత్సరాలలో ద్రవ్యలోటును సంవత్సరాల వారీగా జిఎస్‌డిపిలో 2021-22కు 4, 2022-23కు 3.5, 2023-26కు మూడుశాతాల చొప్పున పరిమితం చేసుకోవాలి. దీని వలన ఆంధ్రప్రదేశ్‌కు 2020-21లో జిఎస్‌డిపిలో ఉన్న 35శాతం రుణ భారం 2025-26 నాటికి 32.1శాతానికి తగ్గుతుందని 15వ ఆర్ధిక సంఘం పేర్కొన్నది. ఇవన్నీ పరిస్ధితులు సాధారణంగా ఉంటే, కానీ కరోనా కారణంగా ఇచ్చిన మినహాయింపులు, ఇతర అంశాల కారణంగా అది అమలు జరుగుతుందని చెప్పలేము. ఐదు సంవత్సరాల కాలంలో పరిమితులను తొలి నాలుగు సంవత్సరాలలో వినియోగించుకోనట్లైతే ఐదవ ఏడాది అదనపు రుణాలు తీసుకోవచ్చు. ఈ లోగా విద్యుత్‌ రంగంలో కేంద్రం ప్రతిపాదించిన షరతులను అమలు జరిపితే తొలి నాలుగు సంవత్సరాలు ప్రతి ఏటా జిఎస్‌డిపిలో 0.5 శాతం చొప్పున అదనంగా అప్పులు తీసుకోవచ్చు.2021-25 మధ్య విద్యుత్‌ నిర్వహణ నష్టాలు తగ్గించాలి.ఆదాయ తేడాను కుదించాలి. వినియోగదారులకు నేరుగా సబ్సిడీని అందించటం ద్వారా సబ్సిడీ మొత్తాలను తగ్గించాలి. ఆదాయాన్ని సబ్సిడీ రేట్లను తగ్గించాలి. ఇవన్నీ ఈ రంగాన్ని ప్రైవేటీకరించేందుకు దారి సుగమం చేయటమే.


జిఎస్‌డిపి ప్రతి ఏటా పెరుగుతూ ఉంటుంది కనుక ఆ దామాషాలో రుణ పరిమితి కూడా పెరుగుతూనే ఉంటుంది. ఉదాహరణకు 2014-15లో ఆంధ్రప్రదేశ్‌ జిఎస్‌డిపి విలువ రు.5,26,470 కోట్లుగా ఉంది. మూడుశాతం రుణ పరిమితి ప్రకారం రు.15,794 కోట్లు తీసుకోవచ్చు.2018-19నాటికి అది రు.9,33,402 కోట్లకు పెరిగింది కనుక రుణం 28వేల కోట్లు తీసుకోవచ్చు. అలాగే 2020-21లో రు.10,19,146 కోట్లుగా సవరించినందున రుణం 34వేల కోట్ల వరకు తీసుకోవచ్చు. ఆత్మనిర్భర పధకం కింద రెండు శాతం అదనంగా తీసుకొనేందుకు అనుమతించారు. ఇప్పుడు ఆర్ధిక సంఘం ఆంక్షలకు మించి ద్రవ్యలోటు ఉంది. 2020-21లో ద్రవ్యలోటు జిఎస్‌డిపిలో 4.78శాతంగా ప్రతిపాదిస్తే అది 5.38శాతానికి చేరింది. కేంద్రం కరోనా కారణంగా సడలించిన రుణ పరిమితి ఐదుశాతానికి మించి ఇది ఉంది. ఐదుశాతానికి కూడా కేంద్రం షరతులు విధించింది. నాలుగుశాతం వరకు ఎలాంటి షరతులు లేవు, ఒకశాతానికి నాలుగు ఉన్నాయి. ఒకే దేశం-ఒకే రేషన్‌ కార్డు ఒకటి, సులభతర వాణిజ్యం, స్ధానిక సంస్దలలో పన్నుల పెంపు, విద్యుత్‌ పంపిణీ సంస్కరణ. మొదటి మూడింటిని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నెరవేర్చింది. దీంతో అదనంగా 9,090 కోట్లు అదనంగా అప్పు చేసేందుకు అవకాశం వచ్చింది. విద్యుత్‌ సంస్కరణలో భాగంగా మీటర్లు పెట్టేందుకు నిర్ణయించిన అంశం తెలిసిందే. అది జరిగిన తరువాత వినియోగదారులు ముందుగా బిల్లులు చెల్లించాలి. మిగిలిన షరతుల ప్రకారం సబ్సిడీలో కోత వంటి వాటికి పూనుకుంటే వంటగాస్‌ మాదిరి క్రమంగా తగ్గించి వేసి నామమాత్రంగా సబ్సిడీని నేరుగా బ్యాంకు ఖాతాల్లో వేస్తారు. కేంద్రం ప్రతిపాదించిన విద్యుత్‌ సంస్కరణల ప్రకారం విద్యుత్‌ సరఫరా ధరలో 20శాతానికి మించి సబ్సిడీ ఇవ్వకూడదు. పెట్రోలు, డీజిలు ధరల మాదిరి ఖర్చు పెరిగినపుడల్లా చార్జీలను పెంచవచ్చు.


రాష్ట్రానికి ఉన్న అన్నిరకాల అప్పుల సంగతి చూస్తే 2019-20 ఆదాయలోటు 2.7, ద్రవ్యలోటు 4.1శాతం ఉన్నపుడు జిఎస్‌డిపిలో రుణాలు 31శాతం ఉన్నాయి. మరుసటి ఏడాది అంచనాలను సవరించిన తరువాత అవి వరుసగా 3.5, 5.4, 35.2శాతంగా చూపారు. వర్తమాన సంవత్సరంలో 0.5, 3.5, 36.5 శాతాలుగా ప్రతిపాదించినప్పటికీ ఎంతకు సవరిస్తారో తెలీదు.ప్రభుత్వ పనితీరును చూస్తే కీలకమైన ఐదు శాఖల్లో మిగతా రాష్ట్రాల సగటుతో పోలిస్తే బడ్జెట్లలో కేటాయింపుల శాతాలు ,ఆంధ్ర ప్రదేశ్‌ తీరుతెన్నులు ఇలా ఉన్నాయి.ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపాదనలు 2021-22వి కాగా ఇతర రాష్ట్రాలవి 2020-21 వివరాలు.
శాఖ××××× ఆంధ్రప్రదేశ్‌ ×× మొత్తం రాష్ట్రాల సగటు
విద్య ×××××× 12.8 ××××× 15.8
ఆరోగ్యం ×××× 6.6 ××××× 5.5
వ్యవసాయం××× 6.2 ××××× 6.3
గ్రామీణాభివృద్ది×× 7 ××××× 6.1
రోడ్లు, వంతెనలు× 1.7 ××××× 4.3
కరోనా, మరొకపేరుతో గతేడాది మోపిన పన్నులు ఇప్పుడు కొంత మేరకు జగన్‌ సర్కార్‌కు ఊరటనిస్తున్నాయి. ఈ ఏడాది తొలి ఐదు నెలల్లోనే పన్నెండువేల కోట్ల మేరకు అదనపు ఆదాయం వచ్చింది. ఇదే సమయంలో ఏడాదికి తీసుకుంటామని చెప్పిన రుణాల మొత్తం కూడా తీసుకున్నారు. రెవెన్యూలోటు ఏడాదికి ఐదువేల కోట్లని చెబితే 31వేల కోట్లు దాటింది. సంక్షేమ పధకాలకు గతేడాది 75వేల కోట్లు ఖర్చు చేస్తే ఈ ఏడాది 84కోట్లకు పెరిగింది. దశలవారీగా మద్యనిషేధం గురించి చెప్పినా దాన్నొక ఆదాయ వనరుగా చూస్తున్నారు. ప్రొబేషన్‌ టాక్సు పేరుతో రు.4,500 కోట్లు, రోడ్ల అభివృద్ధి పేరుతో చమురు, సహజవాయువుపై 900 కోట్లు పన్ను విధించారు. వాటిని రోడ్ల మరమ్మతుకు వినియోగించినా ఇంత అధ్వానంగా ఉండేవి కాదు. పైన చెప్పుకున్నట్లు చెత్త పన్ను 350 కోట్లు, పట్టణ ఆస్తులపై రెండువేల కోట్లు, విద్యుత్‌పై 1000 కోట్లు వడ్డించారు.భూముల విలువ పెంచి అదనంగా 800 కోట్లు రాబట్టారు.


అసలేమీ ఇవ్వని వారి కంటే సంక్షేమ పధకాల పేరుతో జనాన్ని ఆదుకోవటాన్ని ఎవరైనా సమర్ధిస్తారు. వాటికీ పరిమితులుంటాయి. కానీ అవే జనాలను బొందితో కైలాసానికి చేరుస్తాయని ఎవరైనా చెబితే, నమ్మిస్తే అది వంచన అవుతుంది. జనాలకు కావలసినన్ని చేపలను తొలుత సరఫరా చేసినా వాటిని పట్టటం నేర్పితేనే ఎవరికైనా జీవితాంతం భరోసా ఉంటుంది, వారి బతుకు వారు బతుకుతారు. సంక్షేమ పధకాలూ అంతే !ఉద్యోగులకు పిఆర్‌సి ప్రకటించలేరు. ఏదో ఒక పేరుతో వాయిదా వేసే ఎత్తుగడ కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానాలను అమలు జరపలేరు. తెలంగాణా అనుభవం చూసిన తరువాత ఉద్యోగులు, ఇతరులను ఏమాత్రం మభ్యపెట్టలేరు. నవరత్నాలే సర్వస్వం కాదనే తత్వం ఇప్పుడే తలకెక్కుతోంది. కేంద్రం ఆదేశించిన మేరకు విధించిన భారాల గురించి చెప్పుకోలేరు, విద్యుత్‌ సంస్కరణలను ఎదిరించలేరు. మొత్తం మీద మూడో ఏడాది నాటికే తలకు మించిన ఆర్ధిక భారాన్ని తలకెత్తుకున్నారు. ప్రస్తుతం నాలుగు లక్షల కోట్ల వరకు అప్పులు పెరిగాయి. ఇవిగాక ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్దలు, శాఖలకు హామీ ఇచ్చిన అప్పులు మరో లక్ష కోట్లు ఉంటాయి. ఎఫ్‌ఆర్‌బిఎం పరిమితులను తప్పించుకొనేందుకు ఇలా రెండు ఖాతాల్లో చూపుతున్నారు. 2024 నాటికి 6.54 లక్షల కోట్లకు పెరగవచ్చని అంచనా. అప్పుల దారులన్నీ మూసుకుపోయినపుడు దాన్నుంచి బయట పడాలంటే సంక్షేమ పధకాలకు కోత పెట్టాలి లేదా మరిన్ని భారాలను జనం మీద మోపాలి. అందుకే ఐదేండ్లు గడిచే సరికి నవరత్నాలు, భరోసాలే బంధాలుగా మారి రాజకీయంగా కొంప ముంచినా ఆశ్చర్యలేదు.జనం వైఫల్యాలను గుర్తించక, అసంతృప్తి పెరగముందే ఏదో ఒక సాకుతో ముందస్తు ఎన్నికలకు పోయినా పోవచ్చు !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

కెసిఆర్‌ సారు విశ్వసనీయత ? జగనన్నకు బిజెపి సెగ !

10 Wednesday Nov 2021

Posted by raomk in AP, AP NEWS, BJP, Congress, Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Telangana

≈ Leave a comment

Tags

ANDHRA PRADESH, BJP, fuel politics, K. Chandrashekar Rao, KCR, telugudesam, YS jagan


ఎం కోటేశ్వరరావు


తెలంగాణా రాష్ట్రసమితి సారధి, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు ఏమైంది ? ఆంధ్రప్రదేశ్‌ పాలక పార్టీ వైసిపికి బిజెపి సెగ పెరిగిందా ? రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ పరిణామాల పర్యవసానాలేమిటి ? తెలంగాణాలో కాంగ్రెస్‌, ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం, జనసేనల దారెటు ? రెండు చోట్లా ముందస్తు ఎన్నికలు వస్తాయా ? అనేక మందిలో ఇప్పటికిప్పుడు సమాధానం దొరకని, తలెత్తుతున్న ప్రశ్నలలో ఇవి కొన్ని మాత్రమే. కెసిఆర్‌ వరుసగా రెండు రోజులు విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ బిజెపి మీద, కేంద్ర ప్రభుత్వంతో చావో రేవో తేల్చుకుంటామంటూ బ్యాటింగ్‌ ప్రారంభించి సిక్సర్లు కొట్టి తరువాత మంత్రులకు అప్పగించారు. కెసిఆర్‌ సారుకు ఏమైందీ అనుకుంటున్నవారికి చెప్పేదేమంటే, ఏమీ కాలేదు. హుజూరాబాద్‌లో అవమానకర ఓటమి, నాలుగువైపుల నుంచీ రాజకీయ సెగతగలటం ప్రారంభమైంది, పాత బంధులు-కొత్త బంధులు కుదురుగా కూర్చోనివ్వటం లేదు. అవే బంధనాలుగా మారతాయనే భయం కూడా తలెత్తి ఉండవచ్చు. అందువలన ఏదో ఒకటి మాట్లాడకపోతే పార్టీ శ్రేణులు మరింతగా డీలాపడతాయి.


మరి ఆంధ్రప్రదేశ్‌లో జగనన్నకు ఏమైంది. కెసిఆర్‌ మాదిరి మాటల మాంత్రికుడు కాదు. విలేకర్లతో మాట్లాడే అనుభవం సంగతేమో గానీ ఆసక్తిలేదని స్పష్టమైంది. వైసిపి అనేక సమస్యలను ఎదుర్కొంటోంది. ప్రభుత్వం అమలు జరుపుతున్న నవరత్నాలు ఏమౌతాయో తెలియని స్ధితి. వాటితో ఐదేండ్లూ ప్రచారం, కాలక్షేపం చేయలేమని రెండు సంవత్సరాలకే అర్ధమైంది. ఉన్నవాటినే ఎలా కొనసాగించాలో తెలియని అయోమయంలో పడి కెసిఆర్‌ మాదిరి కొత్త బంధులను తలకెత్తుకొనే సాహసం చేయటం లేదు. అప్పుల తిప్పలు గుక్కతిప్పుకోనివ్వటం లేదు. జెన్‌కో, ఏపి పవర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చెల్లించాల్సిన కిస్తీలను సకాలంలో చెల్లించకపోవటంతో ఆర్‌ఇసి జెన్‌కోను నిరర్దక ఆస్తిగా ప్రకటించిందంటే పరిస్ధితి ఏమిటో అర్ధం చేసుకోవచ్చు. ఈ నేపధ్యంలో పెట్రోలు, డీజిలు మీద వ్యాట్‌ తగ్గించాలని బిజెపి, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ వత్తిడి తెస్తున్నాయి. దీంతో ఏకంగా ప్రభుత్వమే పత్రికలకు పూర్తి పేజీ ప్రకటన జారీ చేసి చమురుపై కేంద్రం, రాష్ట్రాల పన్నుల గురించి వివరాలు అందచేసి కేంద్ర బిజెపిని ఎండగట్టేందుకు పూనుకుంది. కెసిఆర్‌ మాదిరి జగన్‌మోహనరెడ్డి మీడియా ముందుకు రాలేదు గానీ ప్రకటనలు, పార్టీ నేతలు, మంత్రులతో ఆ పని చేయిస్తున్నారు.


హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో తగిలిన తీవ్ర ఎదురుదెబ్బతో నాకు ఎదురులేదు, నా ఎత్తుగడకు తిరుగులేదు అనుకొనే వారు కెసిఆర్‌ లేదా మరొకరు ఎవరికైనా మైండ్‌ బ్లాంక్‌ కావాల్సిందే. అక్కడ గెలిచేందుకు బహుశా దేశంలో, ప్రపంచంలో కూడా ఏ పార్టీ కూడా ఇంతవరకు ఆ స్ధాయిలో డబ్బు వెదజల్లటం, అధికార దుర్వినియోగానికి పాల్పడి ఉండదంటే అతిశయోక్తి కాదు. వ్రతం చెడ్డా ఫలం దక్కనట్లుగా ఘోరపరాజయంతో టిఆర్‌ఎస్‌ శ్రేణులు డీలాపడిపోయాయి. తమనేత చాణక్యతను అనుమానించటం ప్రారంభించాయి. వారిని నిలబెట్టుకొనేందుకు కెసిఆర్‌ నడుంకట్టినట్లుగా కనిపిస్తోంది. అది జరిగేదేనా !


దుబ్బాక ఉప ఎన్నికల్లో అంతకు ముందు అక్కడ పోటీ చేసిన బిజెపినేత రఘునందనరావు మీద సానుభూతి, టిఆర్‌ఎస్‌లోని ఒక సామాజిక తరగతి సానుకూలత, దానిలో భాగంగా కెసిఆర్‌ సైతం ఉపేక్షించారన్న ప్రచార నేపధ్యం, చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాలను అభివృద్ధి చేసి దుబ్బాకను ఉపేక్షించారన్న ప్రచారం అన్నీ కలసి టిఆర్‌ఎస్‌ ఓటమి-బిజెపి గెలుపుకు తోడ్పడ్డాయి. తరువాత జరిగిన హైదరాబాద్‌ కార్పొరేషన్‌ ఎన్నికలలో అధికార పార్టీ కార్పొరేటర్ల మీద ఉన్న అసంతృప్తికి తోడు వరదల నివారణలో వైఫల్యం, సాయంలో అవకతవకలు అన్నీ కలసి అధికార పార్టీకి తలబొప్పి కట్టించాయి.తరువాత జరిగిన నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికల్లో బిజెపి బొక్కబోర్లాపడింది.అభ్యర్ధిని కూడా కాంగ్రెస్‌ నుంచి దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. బలమైన కాంగ్రెస్‌ నేత కె.జానారెడ్డిని ఓడించేందుకు టిఆర్‌ఎస్‌ పడరాని పాట్లు పడి గెలిచింది.తరువాత పట్టభద్రుల ఎంఎల్‌సి ఎన్నికల్లో హైదరాబాదులో బిజెపి ఉన్న సీటును కోల్పోయింది. మరొకస్ధానం వరంగల్‌లో ఊహించని ఎదురుదెబ్బతిన్నది. ఆ ఎన్నికల్లో గెలుపుకోసం టిఆర్‌ఎస్‌ ఎన్ని పాట్లు పడిందీ చూశాము.హుజూరాబాద్‌ గురించి ముందే చెప్పుకున్నాం. అక్కడ బిజెపి కంటే కెసిఆర్‌ అహం మీద ఈటెల దెబ్బకొట్టారు. మొత్తం మీద జరిగిందేమంటే టిఆర్‌ఎస్‌ సారధి కెసిఆర్‌ విశ్వసనీయత గ్రాఫ్‌ పడిపోతోందన్నది స్పష్టమైంది. హైదరాబాద్‌ కార్పొరేషన్‌ ఎన్నికల తరువాత వరదసాయం మిగిలిన వారికీ అందచేస్తామని ప్రకటించి మాటనిలుపుకోలేదు. ఈ కారణంగానే దళితబంధును హుజూరాబాద్‌ ఉప ఎన్నిక తరువాత రాష్ట్రమంతటా అమలు జరుపుతామని చెప్పినప్పటికీ జనాలు విశ్వసించలేదని తేలిపోయింది. దళితబంధును అమలు చేస్తానని ఉప ఎన్నిక తరువాత కూడా ప్రకటించారు. అయినా అమలు జరుపుతారా ? అప్పు రేపు అని గోడమీద రాస్తారా ? ఏదో ఒకపేరుతో నీరుగారుస్తారా అన్నది పెద్ద ప్రశ్న. దళితులకు ముఖ్యమంత్రి పదవి, మూడెకరాల భూమి గురించి జనం మరచిపోగలరా ?


పోగాలము దాపురించినపుడు తాడే పామై కరుస్తుందంటారు. బంధులే టిఆర్‌ఎస్‌, కెసిఆర్‌కు బంధనాలుగా మారే దృశ్యాలు కనిపిస్తున్నాయి.ప్రపంచమంతటా ఈ ఏడాది పత్తి ధరలు పెరిగాయి, దాన్లో భాగంగా మద్దతు ధరకంటే అదనంగా లభిస్తున్నందున రైతుల్లో సంతృప్తి ఉండవచ్చు. ధాన్యం ధర, మార్కెటింగ్‌,ఎఫ్‌సిఐ కొనుగోలు తీవ్ర సమస్యగా మారనుంది. అది రైతు బంధు సంతృప్తి స్ధానంలో అసంతృప్తికి దారి తీయవచ్చు. రైతులకు కావాల్సింది తాము పండించిన వరి, ఇతర పంటలకు మద్దతుధర, మార్కెటింగ్‌ తప్ప మిగతా అంశాలు అంతగా పట్టవు. ఆ బాధ్యతల నుంచి తప్పుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో నిర్ణయించింది. మన్మోహన్‌ సింగ్‌కు అమలు జరిపే ధైర్యం లేకపోయింది. నరేంద్రమోడీకి 56అంగుళాల ఛాతీ ఉందని చెబుతున్నారు గనుక ఎవరేమనుకున్నా ముందుకు పోవాలని నిర్ణయించారు. దానిలో భాగమే మూడు సాగు చట్టాలు. మద్దతు ధర అమల్లో ఉంది కనుక కాస్త భరోసా ఉందని వరి పండించటం తప్ప వడ్లను ఉప్పుడు బియ్యంగా మారుస్తారా, పచ్చి బియ్యాన్నే ఎఫ్‌సిఐకి ఇస్తారా అనేదానితో వారికి నిమిత్తం లేదు. ఎంత ధాన్యమైనా కొనుగోలు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వాలు ఇప్పుడు ఆకస్మికంగా వరి వద్దు అంటే కుదురుతుందా ? రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ వద్దు అంటే కేంద్రంలో ఉన్న పార్టీ పండించమంటోంది. తెలంగాణాలో పండించిన ధాన్యం ఉప్పుడు బియ్యానికి మాత్రమే పనికి వస్తుందని పాలకులకు, విధాన నిర్ణేతలకు ముందే తెలిస్తే వేరే రకాల సాగుకు రైతులను క్రమంగా ఎందుకు ప్రోత్సహించలేదు ? శాస్త్రీయంగా అలాంటి నిర్దారణలు ఎవరు చేశారు. అసలు సాగు వద్దే వద్దంటే ఎలా కుదురుతుంది. గతేడాది కరోనా కారణంగా చమురు నిల్వలు పెరిగిపోయి, నిల్వచేసే సౌకర్యాలు లేక అమ్మకందార్లకు కొనుగోలుదారులు ఎదురు డబ్బు ఇచ్చిన సంగతి తెలిసిందే. అదే మాదిరి తెలంగాణా రైతులు వరి వేయటం తక్షణమే నిలిపివేయాలంటే ప్రతామ్నాయం చూపేంతవరకు పరిహారం ఇస్తే నిరభ్యంతరంగా సాగు నిలిపివేస్తారు. వరి పండించాల్సిందే అని బిజెపి నేతలు కూడా చెబుతున్నారు గనుక పంట మొత్తాన్ని కొనుగోలు చేస్తారా లేక పరిహారం ఇస్తారా ? అది కేంద్రం ఇస్తుందా, రాష్ట్రం ఇస్తుందా అన్నది తేల్చాల్సింది రైతులు కాదు.


అసలేం జరుగుతోందో టిఆర్‌ఎస్‌ లేదా బిజెపి రైతాంగానికి ఎప్పుడైనా వాస్తవాలు చెప్పిన పాపాన పోయాయా ?ఇప్పుడు రెండు పార్టీలు రాజకీయానికి పాల్పడ్డాయి. గతవేసవిలో పండిన ధాన్యం నుంచి 24.75 లక్షల టన్నుల ఉప్పుడు బియ్యం మాత్రమే తీసుకుంటామని కేంద్రం చెప్పిన అంశాన్ని కెసిఆర్‌ రైతులకు ఎప్పుడైనా చెప్పారా ? అంతకు మించి ఉన్న మిగిలిన వాటిని తీసుకొనేది లేదని కేంద్రం చెప్పి ఉంటే అదైనా చెప్పాలి. మరిన్ని ఉప్పుడు బియ్యం తీసుకోవాలని కెసిఆర్‌ కేంద్రాన్ని కోరారు, మరో 20లక్షల టన్నులు తీసుకొనేందుకు అంగీకరించినట్లు చెప్పారు తప్ప దానికి తాను అంగీకరించిన షరతు గురించి చెప్పలేదు. ఆ ఇరవైలక్షల టన్నులు తీసుకుంటే భవిష్యతో ఇవ్వబోమనే షరతుకు అంగీకరించిన అంశాన్ని దాచిపెట్టారు. తమ చేత బలవంతంగా రాయించుకున్నారని ఇప్పుడు చెబుతున్నారు. దానిలో నిజాయితీ, విశ్వసనీయత ప్రశ్నార్దకమే. ఏవైనా కేసుల్లో దళితులు, ఇతర బలహీన తరగతుల వారిని పోలీసులు బెదిరించి బలవంతంగా తెల్లకాగితాల మీద సంతకాలు పెట్టించుకున్నారంటే నమ్మవచ్చు, కేంద్రం ఒక ముఖ్యమంత్రిని బలవంతం చేసిందంటే నమ్మగలమా, ఆ దారుణం గురించి జనానికి ఎందుకు చెప్పలేదు ? పంజాబ్‌లో మాదిరి తెలంగాణాలో కూడా ఎఫ్‌సిఐ నేరుగా ఎందుకు కొనుగోలు చేయదని ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. మేమే సేకరించి ఇస్తామని తొలుత ఎందుకు అంగీకరించినట్లు ? పోనీ ఎప్పుడైనా ఈ అంశాన్ని రైతులు, కేంద్రం దృష్టికి తెచ్చారా ? తమ నుంచి కొనుగోలును తప్పించటానికే కేంద్రం సాగు చట్టాలను తెచ్చిందని పంజాబ్‌,హర్యానా, ఉత్తర ప్రదేశ్‌ రైతులు ఏడాది కాలంగా రాజధాని శివార్లలో ఆందోళన చేస్తున్న అంశం కెసిఆర్‌కు తెలియదంటే నమ్మే అమాయకులెవరూ లేరు. ఆ సాగు చట్టాలకు మద్దతు ఎందుకు ఇచ్చారు, రైతులకు ఒకసారి మద్దతు ఇచ్చి తరువాత ఎందుకు ముఖం చాటేసినట్లు ? మొత్తం వడ్లు కొనుగోలు చేయాలని ఆందోళనకు ఇప్పుడు పిలుపులు ఇస్తే రైతులు నమ్ముతారా ? బిజెపి కూడా దాగుడుమూతలాడుతోంది, రైతులకు భరోసా కల్పించటం లేదు.


ఆంధ్రప్రదేశ్‌ విషయానికి వస్తే చమురు మీద వ్యాట్‌ తగ్గించాలని బిజెపి, తెలుగుదేశం వత్తిడి చేసిన తరువాత గానీ వైసిపికి చమురు మంట తగల్లేదా ? కేంద్రం పన్నుల పేరుతో పెంచిన సెస్‌ల నుంచి రాష్ట్రాలకు వాటాలు రావని రెండున్నర సంవత్సరాలుగా వారికి తెలియదా ? ఎందుకు మౌనంగా ఉన్నట్లు ? వ్యాట్‌ తక్కువగా ఉన్న ఉత్తర ప్రదేశ్‌ పన్నెండు రూపాయలు తగ్గిస్తే వ్యాట్‌ ఎక్కువగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌ ఎందుకు తగ్గించదు అంటున్నారు. బిజెపి పాలనలో ఉన్న ఉత్తర ప్రదేశ్‌లో పెట్రోలు, డీజిలు మీద 26.8-17.48శాతాల చొప్పున వ్యాట్‌ వుండగా అదే బిజెపి ఏలుబడిలోని అసోంలో 32.66-23.66శాతం ఉంది. అంత ఎక్కువ వసూలు చేస్తున్న అసోం ఏడు రూపాయలు మాత్రమే ఎందుకు తగ్గించినట్లు ? ఇన్ని సంవత్సరాలుగా కేంద్రం ఎందుకు, ఎంత పెంచింది, ఇంతకాలం ససేమిరా తగ్గించేది లేదని తిరస్కరించి ఇప్పుడు ఎందుకు, ముష్టి విదిల్చినట్లుగా తగ్గించిందో, ఉత్తర ప్రదేశ్‌ మాదిరి డీజిలు, పెట్రోలు మీద కేంద్రం కూడా పన్నెండు రూపాయలు కేంద్రం ఎందుకు తగ్గించలేదో బిజెపి నేతలు చెప్పాలి. మోడీ గారు అధికారంలోకి వచ్చినపుడు 58గా ఉన్న రూపాయి విలువ ఇప్పుడు 75కు పడిపోవటానికి కారణం మోడీ గారు అనుసరిస్తున్న విధానాలే. అందువలన ముందు దాన్ని కనీసం పూర్వపువిలువకైనా పెంచాలి, లేదా వారి అసమర్ధతకు జనాన్ని బలిచేయకుండా మరింతగా ఏడున్నర సంవత్సరాల స్ధాయికి పన్ను తగ్గించాలి. లేదా చమురును కూడా జిఎస్‌టి పరిధిలోకి తేవాలి, రాష్ట్రాల ఆదాయం తగ్గినంతకాలం ఇప్పుడు జిఎస్‌టి పరిహారం ఇస్తున్న మాదిరే ఎంతకాలం లోటు ఉంటే అంతకాలం చెల్లించాలి. కేంద్రం పెంచిన మాదిరి రాష్ట్రాలు వ్యాట్‌ విపరీతంగా పెంచలేదు. అందువలన కేంద్రం ముందు దారి చూపి రాష్ట్రాలను అనుసరించాలని కోరవచ్చు తప్ప డిమాండ్‌ చేసే హక్కు లేదు. కేంద్రం తగ్గిస్తే దానికి అనుగుణంగా రాష్ట్రాలు తగ్గించకుండానే భారం తగ్గుతుంది. కేంద్రం పెట్రోలు మీద ఐదు, డీజిలు మీద పది రూపాయలు తగ్గిస్తే ఆమేరకు రాష్ట్రాల వ్యాట్‌ భారం కూడా తగ్గుతుంది. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోలు మీద 31శాతం వ్యాట్‌ వసూలు చేస్తున్నారు. కేంద్రం తగ్గించినదాని ప్రకారం పెట్రోలు మీద లీటరుకు 155పైసలు, డీజిలు మీద 22.25శాతం ఉన్నందున 2.25పైసలు రాష్ట్రవాటాగా తగ్గుతుంది. కేంద్రం తగ్గించిన మేరకు ఆ దామాషాలో రాష్ట్రానికి కూడా వాటా తగ్గుతుంది.


కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన నిధుల గురించి కేంద్రం ఎటూ తేల్చదు, బిజెపికి పట్టదు.ప్రకటించిన విశాఖ రైల్వేజోన్‌ సంగతి మాట్లాడరు. చమురు ధరల తగ్గింపు గురించి ఆందోళనకు దిగిన తెలుగుదేశం రైల్వే జోన్‌, ఇతర అంశాల గురించి ఎందుకు మౌనంగా ఉన్నట్లు ? రెండు తెలుగు రాష్ట్రాల్లోను అధికార పార్టీలైన తెరాస-వైసిపి కేంద్రంలోని బిజెపితో ఘర్షణకు దిగేందుకు సిద్దం కావటం లేదు. తాజా పరిణామాలు అనివార్యంగా బిజెపితో తెరాస-వైసిపి మధ్యం దూరం పెంచనున్నాయని భావిస్తున్నారు. రెండు పార్టీలను మింగివేసేందుకు లేదా తన ఉపగ్రహాలుగా మార్చుకొనేందుకు బిజెపి చేయాల్సిందంతా చేస్తోంది. విధానపరమైన తేడాలు లేవు, తేడా అధికారం దగ్గరే కనుక, బిజెపి బలహీనపడుతున్న కారణంగా రెండు పార్టీలు రానున్న రోజుల్లో ప్రతిఘటించేందుకే పూనుకోవచ్చు.లేదూ బిజెపికి లొంగితే అది ఆత్మహత్యాసదృశ్యం అవుతుంది . సమస్యలు చుట్టుముడుతున్న నేపధ్యంలో రెండు రాష్ట్రాల సిఎంలూ ఏదో ఒకసాకుతో మధ్యంతర ఎన్నికలకు తెరలేపినా ఆశ్చర్యం లేదు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

ఏది ముందు పుట్టింది ? జ్ఞానమా , అజ్ఞానమా – మత శక్తులెందుకు జ్ఞానం మీద దాడి చేస్తాయి ?

07 Monday Jun 2021

Posted by raomk in AP NEWS, BJP, CHINA, Communalism, Current Affairs, Health, History, imperialism, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion, Political Parties, RELIGION, Religious Intolarence, Science, USA

≈ Leave a comment

Tags

Anandaiah's K medicine, Ignorance, knowledge, pseudoscience, Science, science literacy, scientific temper


ఎం కోటేశ్వరరావు


జ్ఞానం ముందు పుట్టిందా ? అజ్ఞానం ముందు పుట్టిందా ! ఆధునిక విజ్ఞానం అందుబాటులోకి రాక ముందు జనానికి అస్సలు విజ్ఞానం లేదా ? లేదని చెబితే పురాతన మానవుల అనుభవాలను, తరతరాలుగా వాటిని పరిరక్షించటాన్ని కించపరచటమే. ఈజిప్టు పిరమిడ్లు నిర్మించిన వారు, వాటిలో మమ్మీలను భద్రపరచిన వారి పరిజ్ఞాన్ని విస్మరించగలమా ? చైనా గోడ నిర్మాతలకు తట్టిన ఆలోచన సామాన్యమైనదా ? క్రీస్తు పూర్వమే మన దేశంలో చెక్కిన ఎల్లోరా శిల్పాలు, అజంతా చిత్రాలకు ప్రాతిపదిక విజ్ఞానం కాదా ? రోమ్‌ నగరంలో వేల సంవత్సరాల నాడు నిర్మించిన ప్రఖ్యాత బహిరంగ స్డేడియం కూడా అలాంటిదే. అయితే ఇవన్నీ కూడా ప్రపంచమంతటా వాటి నిర్మాణ కాలంలో లేదా తరువాత గానీ మరోచోట పునరావృతం కాలేదు. ఎందుకు ? విదేశీ దండయాత్రల నుంచి రక్షణకోసమే చైనా గోడ నిర్మాణమైందనుకుందాం. విదేశీ దండయాత్రలు ఒక్క చైనా మీదే జరిగాయా ? మిగతా దేశాలకు అలాంటి ఆలోచన ఎందుకు తట్టలేదు, చూసి కూడా ఎందుకు నిర్మించలేదు ? అలాగే మిగతావీనూ. ఎవరైనా ఈ కోణం నుంచి పరిశోధించారో లేదో నాకైతే తెలియదు, అలాంటి విశ్లేషణలు ఉంటే అందరం చదువుకుందాం.

గత కొద్ది వారాలుగా ఆనందయ్య ఆకుల మిశ్రమం ( మందు లేదా ఔషధం కాదని ఆయుష్‌ చెప్పింది కనుక), ఆధునిక వైద్య పరిజ్ఞానాన్ని తూలనాడిన రామ్‌దేవ్‌ బాబా గురించి చర్చలో అనేక అంశాలు ముందుకు వచ్చాయి. వాటన్నింటినీ సమగ్రంగా చర్చించటం ఇక్కడ సాధ్యం కాదు, కొన్ని పరిశీలనలకే పరిమితం. దక్షిణాసియా, మరికొన్ని ప్రాంతాలలో ఆకు, వక్క, సున్నంతో కిళ్లీలు వేసుకోవటం ఎప్పటి నుంచో ఉంది.దానితో నోరు ఎర్రగా పండుతుందని తెలుసు కానీ ఎరుపుకు బదులు వేరే రంగులో ఎందుకు పండదో లేదా అసలు ఎందుకు పండుతుందో వేసుకొనే వారందరికీ తెలుసా ? తెలియనంత మాత్రాన వారిది అజ్ఞానం అనలేము ? ఆకు, వక్కలను పూజల్లో వినియోగిస్తాము. ఎందుకు ? ముఖ్యమైన దేవతలంతా తమలపాకులోని వివిధ భాగాలలో ఉంటారనే పుక్కిటి పురాణాలు వీటికి మూలం.

మహలక్ష్మి ఆకు కింది భాగంలో, సరస్వతి మధ్యలో, జేష్టలక్ష్మి తొడిమ-ఆకు కలిసే చోట, పార్వతి, మాంగల్యదేవి ఎడమవైపు, భూదేవి కుడి వైపు, శివుడు ఆకు బయట, శుక్రుడు పైన, సూర్యుడు ఆకులో మొత్తంగా ఇలా అనేక మంది దేవతలు, దేవుళ్లు, కాని ప్రముఖులకు కూడా తమలపాకులో స్ధానం కల్పిస్తూ కథలు రాశారు. శివుడు, పార్వతి ఆకు, వక్క మొక్కలను హిమాలయ ప్రాంతంలో నాటారు అని చెబుతారు. వాటినే ఇప్పటికీ విద్యావంతులు కూడా నమ్ముతూ ఉంటే దాన్ని అజ్ఞానం అంటారు, వారిని అజ్ఞానులు అనటంలో ఎలాంటి సందేహం లేదు. చదువులేని వారికి తెలియని తనం తప్ప అజ్ఞానం అనలేము. శివుడు, పార్వతి వాటిని ఎక్కడి నుంచి తెచ్చారు, హిమాలయాల్లోనే ఎందుకు నాటారు, మిగతా ప్రాంతాలను ఎందుకు విస్మరించారు. దేవతలకు పక్షపాతం ఉండకూడదు కదా ? అనే ప్రశ్నలకు సమాధానం ఉందా ? అదంతే అంటే దాన్నేమనాలి ? ఆయుర్వేదంలో తమలపాకులో ఉన్న ఔషధ లక్షణాల గురించి రాశారు. అది వేల సంవత్సరాల మానవుల అనుభవ సారం తప్ప ఎవరో ఒకరు పరీక్షించి కనుగొన్న పర్యవసానం కాదు. ఆకు, వక్కలతో వేసుకునే సున్నం మోతాదు మించితే నోరు బొక్కుతుంది. ఇది కూడా అనుభవంలోంచి వచ్చిందే కదా ? ఎందుకు అని ఎవరైనా ప్రశ్నిస్తే అదంతే అంటే వితండవాదం, నాకు కనిపించేదాన్ని మాత్రమే నమ్ముతా మిగతావి నమ్మను అంటే మూర్ఖత్వం అవుతుంది.


ఇప్పుడంటే యావత్‌ ప్రపంచం ఒక కుగ్రామంగా మారిపోయింది. ఆ మూల నుంచి ఈ మూలకు కొన్ని గంటల్లోనే వెళ్లి రావచ్చు. ముందే చెప్పుకున్నట్లు ప్రతి దేశం లేదా ప్రాంతం వారు అనుభవంలో తమవైన వైద్య పద్దతులను ఉనికిలోకి తెచ్చారు. ఎవరికి వారు తమ పద్దతే గొప్ప అనుకోవటమే కాదు, మిగతావాటిని అంత తేలికగా స్వీకరించలేదు. ఐరోపాలో హౌమియోపతి వైద్యులు తొలి రోజుల్లో అల్లోపతిని అంగీకరించలేదు, అపహాస్యం చేశారు. నాగరిక సమాజాలతో సంబంధాలు లేకుండా ఆడవులు, కొండలకే పరిమితమైన గిరిజనులు ఇప్పటికీ తమవైన ఔషధాలను తయారు చేసుకొని వాడుతున్నారు. వారికి ఆయుర్వేదం అంటే తెలియదు, ఆయుర్వేదాన్ని గిరిజన ప్రాంతాలకు తీసుకుపోయిన చరిత్రా లేదు. ఉంటే ఇప్పటికీ వారు తమ నాటు మందులనే ఎందుకు నమ్ముతున్నారు. తమ సాంప్రదాయ గిరిజన వైద్య పద్దతులకే కట్టుబడి ప్రాణాలు పోగొట్టుకున్న ఉదంతాలు ఎన్నో. నల్లమలలోని చెంచు ఆదివాసులు కరోనా వాక్సిన్‌ తీసుకొనేందుకు నిరాకరిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఎక్కడికక్కడ స్ధానిక వైద్య పద్దతులు ఉనికిలోకి వచ్చాయి. వాటిని రకరకాల పేర్లతో పిలుస్తున్నారు. కానీ ఆయుర్వేదానికి మన కాషాయ దళాలు పెట్టినట్లు హిందూ వైద్యం, ముస్లిం, క్రైస్తవం, ఇతర మతాల పేర్లు పెట్టలేదు. మన దేశంలో బౌద్దం, జైనం ఒకప్పుడు ప్రధాన మతాలుగా ఉన్నాయి, మరి వాటి పేరుతో వైద్యం ఎందుకు లేదు ! మన దేశంలో హిందూత్వ శక్తులకు ఒక అజెండా ఉంది, దానిలో ఉన్మాదాన్ని రెచ్చగొట్టటం ఒక ఎత్తుగడ గనుక ఇప్పుడు ప్రతిదానికి మతాన్ని తగిలిస్తున్నారు. సిక్కులు, పార్సీలు, క్రైస్తవులు, ముస్లింలు ఈ దేశంలో విడదీయలేని భాగం, ఆయుర్వేదానికి మత, కుల ముద్రలు వేయటం ద్వారా దానికి ఆదరణ పెంచాలనుకుంటున్నారా ? దెబ్బతీయాలని తలపెట్టారా ? ఆనందయ్య మిశ్రమానికి కొందరు అతివాదులుగా చెలామణి అవుతున్నవారు కులాన్ని కూడా జత చేశారు. అందుకే అతివాదం-మితవాదం నాణానికి బొమ్మా బొరుసూ వంటివి అంటారు.


ఒక నాడు అల్లోపతి అప్పటికి ఉన్న వైద్యపద్దతులకు ప్రత్యామ్నాయ వైద్య విధానంగా ముందుకు వచ్చింది అనే విషయాన్ని మరచిపోకూడదు. ఇప్పుడు అదే అసలైనదిగా మారి, స్ధానిక, దేశీయ వైద్య పద్దతులు జనం దృష్టిలో ప్రత్యామ్నాయమైనవిగా మారిపోయాయి. ఆయా దేశాలలో అభివృద్ది చెందిన స్ధానిక వైద్య పద్దతులను ఎప్పటికప్పుడు అభివృద్ది చేసుకుంటూ పోయి ఉంటే అల్లోపతి రంగంలోకే వచ్చేదే కాదు కదా ? వాటికి చాదస్తాలను తగిలించి అభివృద్ది కాకుండా చేసింది ఎవరు ? వర్తమాన ప్రభుత్వాల సంగతి పక్కన పెడదాం. అమెరికా, ఐరోపా దేశాలలో ఉన్న స్ధానిక వైద్య పద్దతులు ఉన్నప్పటికీ వాటి స్ధానంలో అల్లోపతి అభివృద్ది చెందింది. అదేమీ రహస్యంగా జరగలేదు. బలవంతమూ చేయలేదు. మన దేశంలో ఆయుర్వేద పండితులు వాటిని చూసి తమ వైద్య పద్దతిని, ఔషధాలను అభివృద్ది చేయటాన్ని ఎవరు అడ్డుకున్నారు. బ్రిటీష్‌ పాలకులేమీ ఆంక్షలు పెట్టలేదు, అప్పటికి అల్లోపతి కార్పొరేట్‌ ఆసుపత్రులు వాటితో కుమ్మక్కయ్యే ఔషధ మాఫియాలు కూడా రంగంలో లేవే !

హౌమియోపతి వైద్యపద్దతి రోగి లక్షణాల మీద ఆధారపడింది. దానికి ప్రత్యామ్నాయంగా అమెరికా, ఐరోపాలో కొందరు ముందుకు తెచ్చినదానిని హౌమియోపతి నిపుణుడు హానిమన్‌ తొలిసారిగా అల్లోపతి అని వర్ణించాడు. రోగ లక్షణంతో సంబంధం లేకుండా చికిత్సకు వేరే పద్దతుల్లో వైద్యం చేయటాన్ని ఎగతాళి చేస్తూ తొలిసారిగా 1810లో ఆ పదాన్ని ఉపయోగించాడు. జ్వరం వస్తే లక్షణాలను బట్టి హౌమియో పద్దతిలో కొన్ని మందులు ఇచ్చి దాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తారు. ఆయుర్వేదంలో కాషాయం, లంఖణాలతో చిక్సిత చేస్తారు. అదే అల్లోపతిలో యాంటీబయోటెక్‌ ఇచ్చి జ్వరానికి కారణమైన బాక్టీరియా, వైరస్‌లను నాశనం చేయటం ద్వారా జ్వరాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తారు. ఆయుర్వేదం, హౌమియోపతి వంటి వాటిలో శస్త్రచికిత్సలు లేవు. ఇక్కడ చెప్పవచ్చేదేమంటే రెండు పద్దతులను అసలు పోటీ దృష్టితో చూడాల్సిన అవసరం లేదు. ఆధునిక ఔషధాలతో జ్వరాన్ని రెండు మూడు రోజుల్లో తగ్గిస్తే లంఖణం పరమౌషధం పేరుతో వారాల తరబడి మంచాలకే పరిమితం చేస్తే ఉద్యోగాలేమి కావాలి, సెలవులు ఎక్కడి నుంచి వస్తాయి. శస్త్రచికిత్సలు అవసరమైన చోట దానికి బదులు మన మతం, మన కులం, మనదేశ పద్దతుల పేరుతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటామా ?

” యావత్‌ దేశాన్ని క్రైస్తవంలోకి మార్చే కుట్రలో భాగంగా ఆయుర్వేదంపై బురద జల్లేందుకు లక్ష్యంగా చేసుకున్నారు, గాఢనిద్రలో ఉన్న దేశప్రజలు మేలుకోనట్లయితే రాబోవు తరాలు మిమ్మల్ని క్షమించవు ” ఇలాంటి ట్వీట్ల ద్వారా పతంజలి కంపెనీ సిఇఓ ఆచార్య బాలకృష్ణ ప్రజలను కూడా అవమానిస్తూ రెచ్చగొట్టేందుకు పూనుకున్నారు. ఈ పెద్దమనిషికి నిజంగా ఆయుర్వేదం మీద, అన్నింటికీ మించి తాము తయారు చేస్తున్న ఔషధాల మీద, సకల రోగ నివారిణిగా చిత్రిస్తున్న యోగా మీద విశ్వాసం ఉందా ? నిజంగా ఉంటే ఉత్తరాఖండ్‌ రిషీకేష్‌లోని ఆలిండియా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌( అల్లోపతి)లో చేరి ఎందుకు చికిత్స తీసుకున్నారు. 2019 ఆగస్టు 23న ఆసుపత్రిలో చేరినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి, బాలకృష్ణను పరామర్శిస్తూ రామ్‌దేవ్‌ బాబా నిలిచిన చిత్రాలూ దర్శనమిచ్చాయి. తాజాగా అలాంటి ఈ పెద్దమనుషులిద్దరూ అల్లోపతి వైద్యం మీద అనుచిత విమర్శలు చేయటంతో కొందరు పాతవీడియోలకు వ్యాఖ్యానాలు తోడు చేసి సామాజిక మాధ్యమంలో వైరల్‌ చేశారు. బాలకృష్ణకు గుండెపోటు వస్తే దివ్య అర్జున్‌ కషాయం ఇవ్వలేదు, అనులోమ విలోమ యోగా చేయించకుండా నేరుగా ఆసుపత్రిలో ఎందుకు చేర్చారు, ఇప్పుడు రామ్‌దేవ్‌ బాబా అల్లోపతిమీద విమర్శలు చేస్తున్నారు సిగ్గు చేటు అని పేర్కొన్నారు. అయితే బాలకృష్ణ ఆసుపత్రిలో చేరారా లేదా అని బూమ్‌ వెబ్‌సైట్‌ నిజానిజాలను వెలికి తీసే ప్రయత్నం చేస్తే ఆసుపత్రిలో చేరిన మాట నిజమే అని తేలింది. ఇండియా టుడే గుండెనొప్పితో అని రాస్తే జీ న్యూస్‌ కలుషిత ఆహారం కారణంగా అని రాసింది. అయితే ఆ సమయంలో రామ్‌దేవ్‌ ప్రతినిధి కెకె తిజార్‌వాలా చేసిన ట్వీట్‌లో కలుషిత ఆహారం గురించి పేర్కొన్నారు. ఇక్కడ సమస్య చిన్నదైనా పెద్దదైనా , జబ్బు ఏదైనా అల్లోపతి సామర్ధ్యం గురించి విమర్శిస్తున్న వారు అదే ఆసుపత్రిలో చేరటం ఏమిటి ? ఒక చెట్టునో, ఆవు మూతినో వాటేసుకోకుండా సిలిండర్ల ఆక్సిజన్‌ తీసుకోవటం ఏమిటి ?

ఏడాది తరువాత కరోనాకు,రోగనిరోధక శక్తికి ఇదిగో మందు అంటూ ఆనందయ్య రంగంలోకి వచ్చారు లేదా కొందరు తెచ్చారు. దీని నేపధ్యం ఏమిటి ? కరోనా కొత్త వైరస్‌ గనుక దానికి చికిత్స ఏమిటో ఏ వైద్య పద్దతికీ తెలియదు. జ్వరం వస్తుంది కనుక పారాసిటమాల్‌ వేసుకుంటే తగ్గిపోతుంది అన్నారు. ఇద్దరు ముఖ్యమంత్రులు దాన్నే చెప్పారు. మలేరియాకు వాడే హైడ్రోక్సీక్లోరోక్విన్‌ ఇస్తే ఫలితం ఉంటుందన్నారు. వెంటనే మన దేశం వాటిని ఎగుమతి చేయటాన్ని నిషేధించింది. నిషేధం ఎత్తివేయకపోతే డొక్క చించుతా అని డోనాల్డ్‌ ట్రంప్‌ బెదిరించాడు. తరువాత రెమిడెసివిర్‌ దివ్వ ఔషధం అన్నారు, ఎంతగా బ్లాక్‌ మార్కెట్‌ జరిగిందో చూశాము. చివరికి బిజెపి పెద్దలు కంపెనీ నుంచి తామే సేకరించి పెద్ద మేలు చేకూర్చేవారిగా ఫోజు పెట్టారు. తరువాత దాని వలన ఫలితం లేదని తేలిపోయింది. ఇదే సమయంలో ప్లాస్మా చికిత్స గురించి ప్రచారం. చివరికి అదీ ఫలితం లేదని తేలిపోయింది. రామ్‌దేవ్‌ బాబా కరోనిల్‌ పేరుతో కేంద్ర మంత్రుల సమక్షంలో ప్రారంభించి కరోనాకు దివ్వ ఔషధం అన్నారు. అది అసలు ఔషధమే కాదు తేలిపోయింది. ఒకవైపు కరోనా రెండవ తరంగం రెచ్చిపోతుంటే జనానికి దిక్కుతోచని స్ధితిలో ఆనందయ్యను రంగంలోకి తెచ్చారు. అతను గాకపోతే మరొకరు వచ్చి ఉండేవారు. గతంలో మెదడు వాపు వ్యాధి, స్వైన్‌ఫ్లూ వంటివి జనాన్ని భయపెట్టిన సమయంలో నిర్ధారణగాని హౌమియో, ఆయుర్వేదం మందులు ఇలాగే పెద్ద ఎత్తున పంచారు. నష్టం లేదు కదా అని జనం కూడా తీసుకున్నారు.


అల్లోపతిలో ప్రయత్నించిన ప్రతి ఔషధం ఉపశమనం కల్పించేది తప్ప నిరోధించేది కాదని తేలిన సమయంలో ఆనందయ్య మూలికల మిశ్రమం వచ్చింది. దాన్ని తినేందుకు మాత్రమే ఇస్తే ఇంత రగడ జరిగి ఉండేది కాదేమో ? కండ్లలో వేసే చుక్కలతో రోగనిరోధకశక్తి వస్తుందని చెప్పటమే తీవ్ర వివాదాన్ని రేపింది.నిర్ధారణ కాని వాటిని కరోనా రోగులు కంట్లో వేసుకున్నా, తిన్నా వారి కండ్లు,ప్రాణాలకు ముప్పు కనుక అనేక మంది అభ్యంతరాలు తెలిపారు. ఇది కూడా ఎందుకు జరిగింది. ఏడాదికి పైగా కరోనా జనాన్ని చంపేస్తుంటే ఆనందయ్య ఎక్కడున్నాడో తెలియదు. ఏడాది కాలంగా చేసిన పరిశోధన లేదా తెలుసుకున్న పరిజ్ఞానం ఎలా వచ్చిందో ఎవరికీ తెలియదు. తెల్లవారేసరికి మందు కనుగొన్నా అంటే సరిపోతుందా ? ఇక్కడ ఆనందయ్య ఒక చిన్న వ్యక్తి. కరోనా వైరస్‌ గురించి నిర్ధారణ కాగానే అనేక దేశాల్లో ఉన్న స్ధానిక వైద్యపద్దతుల నిపుణులు ఔషధాన్ని ఎందుకు అభివృద్ది చేయలేకపోయారు ? అల్లోపతి శాస్త్రవేత్తలు, వైద్యుల ప్రయోగాలే ఫలించి వాక్సిన్‌ ఉనికిలోకి వచ్చింది. సహజంగానే దాన్ని సొమ్ము చేసుకొనేందుకు కార్పొరేట్‌ సంస్ధలు పూనుకున్నాయి. వాటిని చూపి నిర్ధారణ కాని నాటు మందులను ఒకసారి వాడి చూస్తే ఏమౌతుంది? నష్టమేమీ లేదు కదా అనే వాదనలు చేసే వారికి చెప్పేదేముంది. వాడి చూడండి, అనుభవించండి. ఆయిల్‌ పుల్లింగు చూశాము, నీటి వైద్యం వంటి వాటిని చూశాము. సాధారణ రోగాలకు అలాంటి వాటిని వెయ్యి వాడండి ఎవరి ఖర్మ వారిది. కానీ కరోనా ఒక మహమ్మారి, ఆదమరిస్తే, సకాలంలో చికిత్స తీసుకోకపోతే ప్రాణాలు పోయేదానితో కూడా ఇలాంటి ప్రయోగాలు ఎందుకు చేయకూడదని చెబుతుంటే వితండవాదం చేసే వారి మానసిక స్ధితిని అనుమానించాల్సి వస్తోంది. చుక్క వేయగానే పక్కాగా తయారయ్యానని చెప్పిన కోటయ్య మాస్టారు కొద్ది రోజుల్లోనే ఎందుకు మరణించారు,సమర్ధించిన వారే ఆయన ప్రాణాలకు మీదకు తెచ్చారనటం వాస్తవం కాదా ?


వైద్య రంగంలో అల్లోపతి ఆసుపత్రులు, ఔషధాల మాఫియా ఎలా అయితే ఉందో ఆయుర్వేద మాఫియా కూడా ముందుకు వచ్చింది. జనం బలహీనతను సొమ్ము చేసుకొనేందుకు వేగంగా పావులు కదుపుతోంది. తాము తయారు చేసిన కరోనిల్‌ ఔషధం కరోనాను అరికడుతుందని ప్రచారం చేసి సొమ్ము చేసుకొనేందుకు పెద్ద పధకం వేసిన రామ్‌దేవ్‌ బాబా ఆయుర్వేద మాఫియా తెగకు చెందిన వారు కాదా ? ఇలాంటి వారిని చూసి పక్కా ప్రణాళికతోనే ఆనందయ్యను కొందరు రంగంలోకి దించారని చెబుతున్నారు ? కాదని నిరూపించండి. నిజానికి ఏ పట్టా లేని ఆనందయ్యకు కొన్ని మూలికల మిశ్రమంతో కరోనా తగ్గుతుందని, రోగనిరోధక శక్తి పెరుగుతుందని తెలిసినపుడు ఆమాత్రం కూడా ఆయుర్వేద నిపుణలకు ఎందుకు తట్టలేదు. జగదేక వీరుడి సినిమాలో మాదిరో లేక ఆఫ్రికా లేదా అమెజాన్‌ అడవుల నుంచి తెచ్చిన అపురూప మూలికలు కాదే. వేటితో తాను తయారు చేస్తున్నదీ ఆనందయ్యే చెప్పాడంటున్నారు కదా ? అప్పుడైనా ఆ మిశ్రమానికి ఆ లక్షణం ఉంటుందో లేదో నిపుణులు ఎందుకు చెప్పలేకపోయారు ? ఆయుష్‌ రంగంలోకి దిగి అలాంటి లక్షణాలేమీ లేవు వేసుకుంటే వేసుకోండి, చస్తే చావండి మీ ఇష్టం, ఇతర మందులను ఆపకుండా కావాలంటే దాన్ని కూడా తీసుకోండి తప్ప అల్లోపతి మందులను ఆపవద్దని చెప్పింది కదా ? దీనికి అనుగుణ్యంగానే దాన్ని పంపిణీ చేయవచ్చని రాష్ట్ర హైకోర్టు కూడా చెప్పింది. తిరుమల తిరుపతి దేవస్ధానం తామే దాన్ని తయారు చేస్తామని ప్రకటించింది. ఇప్పుడు అది ఔషధం కాదంటున్నారు గనుక ఆపని మానుకున్నాం అంటోంది. చిత్రం ఏమిటంటే ఆ పార్టీ ఎంఎల్‌ఏలు మాత్రం మందు తయారు చేయించి పంపిణీ ప్రారంభించారు. ఇంత చర్చ జరిగాక కూడా ఎవరైనా దాని మీదే ఆధారపడితే ఎవరూ చేయగలిగింది లేదు. తమ పార్టీ వారే ఈ పని చేస్తున్నారు గనుక ఏదైనా అనుకోనిది జరిగితే వైఎస్‌ జగన్‌ మరోమారు ఓదార్పు యాత్రలు చేయాల్సి ఉంటుంది.

ఆనందయ్య మందును ప్రశ్నించటం ఒక కులాన్ని అణగదొక్కటంగా లేదా ఆయుర్వేదం హిందూ ఔషధం గనుక దాన్ని వ్యతిరేకించటం అంటే హిందూమతాన్ని వ్యతిరేకించటం , నాశనం చేసేందుకు పూనుకోవటమే అంటూ వాటిని అనుమతించాల్సిందే అని ప్రచారం చేయటాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి. శాస్త్రీయ అంశాలు బయటికి రావటం మతశక్తులకు ఇష్టం ఉండదన్నది చరిత్ర చెప్పిన సత్యం. బాగ్దాద్‌లో మహమ్మద్‌ బిన్‌ జకారియ లేదా రహేజాగా సుపరిచితుడైన వైద్యుడు 860-932 సంవత్సరాల మధ్య జీవించాడు. హేతువాద భావనలు, ఆ నాటికి ఉన్న పశ్చిమ దేశాల బోధనలను ముందుకు తెచ్చాడు. వైద్యం గురించి ఒక పుస్తకం రాశాడు. దాన్ని తట్టుకోలేని ముస్లిం మత పెద్ద ఆ పుస్తకంతోనే తల మీద మోదాలని ఆదేశాలు జారీ చేశాడు. దాంతో అతని కండ్లు పోయాయి. మైఖైల్‌ సెర్వెటస్‌ అనే స్పెయిన్‌ వైద్యుడు 1511-53 మధ్య జీవించాడు. ఊపిరితిత్తుల పనితీరు గురించి, క్రైస్తవాన్ని సంస్కరించటం గురించి తన అభిప్రాయాలతో ఒక పుస్తకం రాశాడు.అది మతవిరుద్దమని ప్రకటించటంతో కాథలిక్‌ మతగురువుల విచారణ, శిక్ష నుంచి తప్పించుకొనేందుకు స్విడ్జర్లాండ్‌ వెళ్లాడు. అక్కడ ప్రొటెస్టెంట్‌ మతగురువులకూ కంటగింపయ్యాడు. జెనీవా సరస్సు ఒడ్డున సజీవదహనం చేశారు. అందరికీ తెలిసిన గెలీలియో (1564-1642) గురించి చెప్పాల్సిన పని లేదు. అప్పటి వరకు భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతాడని చెప్పటాన్ని సవాలు చేసి సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుందని చెప్పాడు. దాన్ని వ్యతిరేకించిన క్రైస్తవమత పెద్దలు జీవితాంతం గృహనిర్బంధంలో ఉంచాలని ఆదేశించటమే గాక ఆయన రచనలను నిషేధించారు.


మన దేశంలో హేతువాదం, భౌతికవాదానికి ఆదిపురుషులు చార్వాకులు అన్నది ఒక అభిప్రాయం. వారు బౌద్ద, హిందూ మతాలను రెండు చెప్పే ఆశాస్త్రీయ, పరస్పర విరుద్ద అంశాలను వ్యతిరేకించారు. స్వర్గ నరకాలు లేవన్నారు. అంతకు ముందు ఉనికిలో ఉన్న అనేక భావనలను వారు సవాలు చేశారు. అది తమ మతాల మనుగడకే ప్రమాదమని భావించిన నాటి మత పెద్దలు వారిని సర్వనాశనం చేశారు, వారి రచనలను దొరక్కుండా చేశారు. వారి మీద తప్పుడు ప్రచారం చేస్తూ వారి ప్రస్తావనలతో రాసిన వ్యతిరేక రచనల నుంచి వారి భావజాలం గురించి తెలిసింది, వారి అసలు రచనలు లేవు. మొత్తంగా చెప్పాలంటే ప్రశ్నించే తత్వాన్ని పూర్తిగా నాశనం చేశారు. పర్యవసానంగా ఒక నిర్వీర్యమైన జాతిగా మనది తయారు కావటానికి మతాలు తప్ప మరొకటి కాదన్నది కొందరి అభిప్రాయం. నాడు మతశక్తులు హేతువాదాన్ని అణగదొక్కితే నేటి మతశక్తులు మరోరూపంలో అశాస్త్రీయాన్ని ముందుకు తెచ్చి ఈసమాజాన్ని అజ్ఞానంలోకి నెట్టాలని చూస్తున్నాయి. దేశంలోని హిందూత్వ శక్తులు సమాజాన్ని వెనక్కు నడపాలని చూస్తున్నాయి గనుక మూఢనమ్మకాలకు, ఆశాస్త్రీయ అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. సైన్సు సమావేశాలనే వేదికగా చేసుకొని అశాస్త్రీయ, ఆధారంలేని అంశాలను ప్రచారం చేశారు. ఆవు మూత్రంలో బంగారం ఉందా మరొకటి ఉందా తేల్చమని నిధులు కేటాయిస్తున్నారంటే ఏమనుకోవాలి. తిరోగామి జాతీయవాద అజెండాలో భాగంగా పురాతన సంస్కృతికి, మెజారిటీ హిందూమతానికి ముప్పు వచ్చిందనే పేరుతో జరుగుతున్న ప్రచారం తెలిసిందే. దానిలో భాగంగానే హేతువాదం ఘర్షణ పడే ప్రతిదానికి మతానికి సంబంధం కలిపితే జనాన్ని తమవెంట తీసుకుపోవటం సులభమని వారు భావిస్తున్నారు.

ఆల్లోపతి వైద్యం చేసే కార్పొరేట్‌ ఆసుపత్రులు, ఔషధాలు తయారు చేసే కంపెనీల లాభాపేక్ష, ఇతర లోపాలను చూపి ఆయుర్వేదానికి మతాన్ని తగిలించి సొమ్ము చేసుకోవాలని చూస్తున్న పతంజలి వంటి కంపెనీల యజమానులు అలాంటి ధోరణులను ప్రోత్సహిస్తున్నారు.వారికి కేంద్ర ప్రభుత్వ పెద్దల మద్దతు గురించి చెప్పనవసరం లేదు. విదేశీ కార్పొరేట్‌లు పెరిగితే తప్పు పట్టని వారు స్వదేశీ కార్పొరేట్ల ఎదుగుదలను ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అమెజాన్‌ మాదిరి మన అంబానీ కంపెనీ ఎందుకు పెరగకూడదు, ఒక ఫైజర్‌, ఒక జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ మాదిరి రామ్‌దేవ్‌ బాబా పతంజలి ఎందుకు విస్తరించకూడదు అనే వాదనలకు స్వదేశీ కార్పొరేట్‌ జాతీయవాదమే మూలం. అసలు మొత్తంగా దేశాన్ని కార్పొరేట్‌లకు అప్పగించటం హానికరం అని ఎక్కడా చెప్పరు. ఐరోపా సామ్రాజ్యవాదులు ఇలాంటి కార్పొరేట్‌ జాతీయవాదంతోనే తమ కంపెనీలకు మార్కెట్‌ను కల్పించేందుకు గతంలో దేశాలను వలసలుగా చేసుకున్నారు, ఎన్నో ప్రాంతీయ యుద్దాలు, రెండు ప్రపంచ యుద్దాలకు, నిత్యం ఏదో ఒక మూల ఉద్రిక్తతలకు కారకులు అవుతున్నారు. ఆనందయ్య వంటి వారిని కొందరు తమ స్ధాయిలో ఉపయోగించుకోవాలని చూస్తుంటే మతశక్తులతో చేతులు కలిపిన పతంజలి పెద్దలు పెద్ద స్ధాయిలో లబ్ది పొందాలనుకుంటున్నారు. ” యావత్‌ దేశాన్ని క్రైస్తవంలోకి మార్చే కుట్రలో భాగంగా ఆయుర్వేదంపై బురద జల్లేందుకు లక్ష్యంగా చేసుకున్నారు, గాఢనిద్రలో ఉన్న దేశప్రజలు మేలుకోనట్లయితే రాబోవు తరాలు మిమ్మల్ని క్షమించవు ” అంటూ చేస్తున్న ట్వీట్లు, హిందువులను మైనారిటీలుగా మార్చే కుట్ర జరుగుతోందంటూ సంఘపరివారం చేసే ప్రచారానికి పెద్ద తేడా ఏముంది ?


శాస్త్రం, కుహనా శాస్త్రం, జ్ఞానం, అజ్ఞానం వీటిలో ఏది ముందు ? బతుకు పోరాటంలోనే మానవుడు అనేక అంశాలను నేర్చుకున్నాడు. చెట్టుమీది కాయలు కింద పడటం మానవులకు తెలియని అంశం కాదు. దానిక్కారణం తెలియక ముందు అది దేవుడు, దేవత లేదా ఆదృశ్యశక్తి మహిమ అనుకున్నారు. అది కారణం తెలియని స్ధితి. దీనికి అజ్ఞానం ఒక పర్యాపదం. చెట్టుమీది యాపిల్‌ పండ్లు పైకి పోకుండా, పక్కకు పడకుండా నిటారుగా కిందనే ఎందుకు పడుతున్నాయన్న ఆలోచన న్యూటన్‌కు వచ్చింది కనుకనే భూమ్యాకార్షణ సిద్దాంతం వచ్చింది. అది విజ్ఞానం. అంతకు ముందు దేవుడే అలా రాసిపెట్టాడు అనుకోవటం తప్పుకాదు. తరువాత కూడా ఆ సిద్దాంతం గురించి తెలియని వారు అనుకుంటే దాన్ని కూడా అర్ధం చేసుకోవచ్చు. కానీ చదువుకొన్న వారు కూడా దేవుడి మహిమే అంటే అది అజ్ఞానం. పిల్లలు ఎలా పుడతారో తెలియక ముందు దేవుడి దయ, తెలిసిన తరువాత కూడా అలా అనుకుంటే అజ్ఞానం. అందువలన మౌలికంగా తెలియని స్ధితి లేదా అజ్ఞానం నుంచి జ్ఞానం పుట్టింది. సైన్సు, కుహనా సైన్సు కూడా అంతే. వివేకం లేని జ్ఞానం ఇసుకలో నీరు వంటిది అన్నది ఒక సామెత. వానరుడు నరుడిగా మారిన పరిణామ క్రమం గురించి మీరు విశ్వసిస్తారా అంటూ కొన్ని సంవత్సరాల క్రితం అమెరికా సంస్ద జరిపిన సర్వే ప్రకారం జపాన్‌లో 78, ఐరోపాలో 70, చైనాలో 69, దక్షిణ కొరియాలో 64శాతం మంది అవునని అంగీకరిస్తే అమెరికాలో 45శాతం మందే ఉన్నారు. అజ్ఞానిగా ఉండటం పెద్దగా సిగ్గుపడాల్సిన అంశం కాదు, తెలుసు కొనేందుకు నిరాకరించటమే సిగ్గులేనితనం అని అమెరికా జాతిపితలలో ఒకడిగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఉన్న బెంజమిన్‌ ఫ్రాంక్లిన్‌ చెప్పారు. వేదాల్లో అన్నీ ఉన్నాయి, ఆయుర్వేదంలో అన్నింటి గురించి రాశారని, మన సంస్కృత గ్రంధాల్లో ఉన్నవాటిని పాశ్చాత్యులు అపహరించి తామే కనుగొన్నట్లు ప్రచారం చేసే, చెబుతున్నవారు కొత్తగా తెలుసుకొనేందుకు ముందుకు వస్తారని ఆశించటం అత్యాశే. తెలుసుకొనేందుకు నిరాకరించే జాతి ఎక్కడైనా ముందుకు పోయిందా ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

ఆనందయ్య అద్భుత మందు – తర్కం, కుతర్కం అసలు లక్ష్యం !

24 Monday May 2021

Posted by raomk in AP NEWS, Communalism, Current Affairs, Health, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, RELIGION

≈ Leave a comment

Tags

Anandaiah miracle medicine, Ayurvedic, Krishnapatnam medicine, Religious fanatics, Traditional Medicine


ఎం కోటేశ్వరరావు


నిజం గడప దాటక ముందే ఒక అబద్దం ఊరంతా తిరిగి వచ్చి నిజానికే తన మీద తనకే అనుమానం వచ్చేట్లు చేస్తుంది. ఆనందయ్య మందు గురించి సామాజిక మాధ్యమంలో వస్తున్న తర్క-కుతర్కాల గురించి చూద్దాం.
గతంలో కూడా పసరు లేదా ఇతర నాటు మందులు, వాస్తు గురించి కూడా వాటిని సమర్దించే వారు, నమ్మేవారు పుష్కలంగా ఉన్నారు. తాజా ఆనందయ్య మందుకు హిందూ మతాన్ని జోడించటం ద్వారా మతోన్మాద శక్తులు దీన్ని కూడా వెంటనే వినియోగించుకున్నాయి.


వనమూలికలు, పసరు మందులు లేదా ఆయుర్వేదం సాంప్రదాయకమైనవి అని చెబుతున్నారు. ఇది కుతర్కం. అవి సాంప్రదాయకం కాదు. మానవ జాతి జీవన పోరాటంలో తమ అనుభవంలోకి వచ్చిన వాటితో గాయాలు, రుగ్మతలను రూపు మాపేందుకు ఎందరో చేసిన ప్రయోగాలే. జ్వరం, కడుపు, తలనొప్పులు వస్తే మా తాత, మానాన్న ఫలానా మూలికలు, ఆకుపసరులు ఇచ్చే వారు, నేను కూడా అదే కొనసాగిస్తున్నా అని చెప్పే వారు మనకు కనిపిస్తారు. నిజానికి వాటిలో వుండే శాస్త్రీయ లక్షణాలు తెలిసి ఇచ్చేవి కాదు. అవి పూర్తిగా పని చేస్తాయనే నిర్దారణతో ఇచ్చేవి కాదు. నిజానికి జనానికి పూర్తి విశ్వాసమే ఉంటే అన్ని రకాల గాయాలు, జబ్బులను నయం చేసే లక్షణం ఉంటే అల్లోపతి ఆసుపత్రులు ఇలా కిటకిటలాడుతుండేవా ? జనం వాటిని ఎందుకు విస్మరిస్తున్నారో సమర్ధకులు చెప్పాలి. రోడ్డు మీద పోతుంటే ఒక పూజలు చేసిన ఒక చెట్టో, పుట్టో, గుండ్రాయో కనిపించగానే కొందరు ఒక దండం పడేసి పోతారు. వస్తే సంపదలు వస్తాయి, దండంతో పోయేదేమీ లేదు కదా అన్నదే వారి ఆలోచన. ఒక పక్క ప్రాణాలు తీస్తున్న మహమ్మారికి సరైన మందు లేదన్న ప్రచార నేపధ్యంలో తెల్లవారేసరికి అలాంటి మందు ఉంది అని చెప్పగానే జనం ఎగబడటం మన సామాజిక రుగ్మతల్లో ఒకటి. వాటిని అర్ధం చేసుకోవాలే గానీ ఆగ్రహిస్తే ప్రయోజనం లేదు.


నమ్మకం లేకపోతే జనం ఎందుకు ఎగబడుతున్నారు ? జనం ఎగబడే వన్నీ సమర్దనీయమేనా ? కొన్ని సంవత్సరాల క్రితం గుంటూరు పక్కనే ఉండే పలకలూరు అనే గ్రామం(ఇప్పుడు సిటీలో కలసిపోయింది)లోని ఒక బావిలో నీరు తాగితే రోగాలు నయం అవుతున్నాయని ప్రచారం సాగి జనం ఎగబడ్డారు. ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇక హైదరాబాదు బత్తిన సోదరుల చేప మందు సంగతి తెలిసిందే. ఉబ్బసానికి – మృగశిర కార్తెకు సంబంధం ఏమిటి అని ఎవరైనా ఆలోచించారా ? 1845లో ఒక సాధువు తమ పూర్వీకుడికి మందు గురించి చెప్పారని అప్పటి నుంచి తమ కుటుంబం పంపిణీ చేస్తున్నదని ఆ సోదరులు చెప్పారు. ఇక్కడ ఒక ప్రశ్న వారి పూర్వీకులకు సాధువు ఇవ్వక ముందు ఉబ్బసం లేదా దానికి ఎవరు మందు ఇచ్చారు ? అది ప్రపంచవ్యాపిత జబ్బు. పుప్పొడి, బొద్దింకలు, దుమ్ము ప్రధాన కారణం అని నిర్ధారించారు. ఉబ్బసం అనేది సర్వకాలాల్లోనూ వస్తున్న వ్యాధి. దీనికి ఉపశమనం తప్ప ఇంతవరకు చికిత్సలేదు. జలుబు కూడా అంతే. ఇవి అందరికీ ఒకే కారణంతో రావాలని లేదు.ఎవరి కారణాలు వారికి ప్రత్యేకమే. ప్రపంచంలోని ప్రతి దేశంలో ఆస్తమా రోగులు ఉన్నారు. అయితే దానికి బలి అవుతున్నవారు ఎక్కువగా పేద, వర్ధమాన దేశాల వారే. ప్రపంచంలో ప్రతి పది మంది ఆస్తమా రోగుల్లో ఒకరు మన దేశంలో ఉంటున్నారు. వారి సంఖ్య ఒకటిన్నర నుంచి రెండు కోట్ల వరకు ఉంటోంది. బత్తిన సోదరులు తమ మందు లేదా ప్రసాదం తీసుకున్న వారి సంఖ్య ఆరున్నర లక్షలు. అతి అతిశయోక్తి అంతలేరు అనే వారున్నారు. పోలీసు లెక్కల్లో అది కనపడదు, పోనీ అంత మంది తీసుకున్నారనుకున్నా మిగతావారు ఏం చేస్తున్నట్లు, ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నట్లే కదా. అందువలన మెడికల్‌ మాఫియాకు బత్తిన సోదరులు సవాలుగా తయారైందీ లేదు ఆసుపత్రుల వారు ఆందోళన చెందిందీ లేదు. ప్రతి మూఢనమ్మకాన్ని సొమ్ము చేసుకొనే వారే జనవిజ్ఞాన వేదికను చూసి ఆందోళన చెందారు. అందువలన ఇలాంటి వాటితో పాటు, మహమ్మారులు తలెత్తినపుడు, చికిత్సలేనపుడు సూక్ష్మంలో మోక్షం కోరుకున్నట్లుగా ఒకసారి వాడి చూద్దాం పని చేస్తే చేస్తుంది లేకుంటే ఏమీ కాదంట కదా అని జనం ఎగబడుతున్నారు తప్ప మరొకటి కాదు. వారికి అన్నీ తెలిసి ఎగబడుతున్నారని ఎవరైనా నిరూపించగలరా ?


1890దశకంలో బొంబాయిలో ప్లేగు వ్యాధి వ్యాపించినపుడు నివారణ కోసం సిబ్బంది ఇండ్లకు వచ్చినపుడు మతం, ఆచారాల పేరుతో కనీసం లోపలికి ప్రవేశించేందుకు సైతం అంగీకరించకుండా అడ్డుకున్నారని చదువుకున్నాం. చివరికి మత పెద్దల సాయంతో సిబ్బంది ప్లేగు బాధితులను బయటకు తీసుకురావాల్సి వచ్చింది. అయితే కొన్ని చోట్ల బ్రిటీష్‌ మిలిటరీ, పోలీసు, ఆరోగ్య యంత్రాంగం అలాంటి వారి మీద బల ప్రయోగం చేయాల్సి వచ్చిందని కూడా తెలిసిందే. ఇప్పుడు కూడా ఎవరికన్నా కరోనా ఉందని తెలిస్తే ఇంటి యజమానులు అద్దెకుండే వారిని బలవంతంగా ఖాళీ చేయిస్తున్న ఉదంతాలెన్ని లేవు. అందువలన జనం చేసేవన్నీ మంచివే అనీ చెప్పలేం. ఇప్పుడు లాక్‌డౌన్‌ను సక్రమంగా అమలు జరిపే పేరుతో పోలీసుల అతి చర్యలను కూడా చూస్తున్నాం-జనం కోసమే అయినా అలాంటి వాటిని సమర్ధిస్తామా ? ప్లేగు వ్యాధి నివారణకోసం నాటి నిజాం నవాబులు వేరే దిక్కుతోచక హైదరాబాద్‌లో చార్మినార్‌ను నిర్మించారన్నది తెలిసిందే. అదే సమయంలో దేశంలో ఇతర ప్రాంతాల్లో కూడా వచ్చిందిగా, బిజెపి భాషలో చెప్పాలంటే మరి హిందూ పాలకులు అనేక మంది ఉన్నారు కదా చికిత్సకు వారేం చేశారు, వారెందుకు కట్టడాలు కట్టించలేదు అంటే ఏం సమాధానం చెబుతారు ? కుతర్కానికి జవాబులుండవు ?

వేదాల్లో అన్నీ ఉన్నాయి, ఆయుర్వేదంలో లేనిది లేదు అని చెబుతారు. నిజమే ఉన్నాయనుకుందాం, మనకు పోయేదేమీ లేదు. వాటన్నింటినీ బయటకు తీసి దేశంలో కోట్లాది మందిని బలితీసుకున్న ప్లేగు, మసూచి, కలరా, మలేరియా, కుష్టు వంటి వాటికి ఔషధాలను ఎందుకు తయారు చేయలేదు, ప్రపంచ దేశాలకు ఎందుకు ఎగుమతి చేయలేదు ? 1890లో బొంబాయిలో ప్లేగు వ్యాధి వ్యాపించినపుడు నాటి బ్రిటీష్‌ ప్రభుత్వం రష్యా నుంచి బాక్టీరియాలజిస్టు డాక్టర్‌ వాల్డమర్‌ హాఫికిన్‌ను రప్పించింది. ఆయన రూపొందించిన వాక్సిన్‌ తరువాత కాలంలో ఎన్నో ప్రాణాలను కాపాడింది. అదే శాస్త్రవేత్త కలరా నిరోధ వ్యాక్సిన్ను కూడా రూపొందించాడు. మరి వేల సంవత్సరాల ఆయుర్వేదం, దాన్ని ఔపోసన పట్టిన వారు, సంస్కృత గ్రంధాల్లో అన్నీ ఉన్నాయని చెప్పేవారు ఎందుకు కనిపెట్టలేకపోయారు ? ప్రతి దేశంలోనూ అభివృద్ది చెందిన స్ధానిక వైద్య పద్దతులు లేదా ఔషధాలకు చాదస్ధాలను తగిలించి అభివృద్ధి నిరోధకంగా తయారు చేశారు. ఈ పరిణామం అన్ని దేశాలలో తరతమ స్ధాయిల్లో జరిగింది. ఆధునిక విజ్ఞానశాస్త్రం ముందు వాటికి ఆదరణ తగ్గింది. అల్లోపతితో పాటు స్ధానిక వైద్య విజ్ఞానాన్ని అభివృద్ది చేస్తే ఎవరు అడ్డుకున్నారు ? ఆయుర్వేదం గురించి భారతీయులకు మాత్రమే తెలుసు, కొంత మందిలో విశ్వాసం ఉంది. ఔషధాలకు ప్రపంచ మార్కెట్‌లేదు, కనుకనే ఆ రంగంలో పరిశోధనకు ఎవరూ ముందుకు రావటం లేదు. అందువలన దానికి, అల్లోపతి వైద్యానికి పోటీ పెట్టి ఇది విదేశీ అని ఆయుర్వేదం హిందూ వైద్యం కనుక అణచివేస్తున్నారని ప్రచారం చేయటం ఉన్మాదం ముదరటం తప్ప మరొకటి కాదు. ఆయుర్వేదంలో బిపికి, మధుమేహానికి మహా గొప్ప మందులు ఉన్నాయి, వాటిని మెడికల్‌ మాఫియా బయటకు రానివ్వటం లేదన్నది ఒక ప్రచారం. ఆడలేక మద్దెల ఓడని ఇలాంటి వారి గురించే చెప్పి ఉంటారు. భారతీయ పద్దతులను పరిరక్షించేవారు, వెలికి తీసేవారే కదా గత ఏడు సంవత్సరాలుగా కేంద్రంలో, ఎక్కువ రాష్ట్రాలలో అధికారంలో ఉన్నారు. వారంతా ఏమి చేస్తున్నట్లు ? సొల్లు కబ్లురు తప్పితే, చైనా అంత పెద్ద దేశాన్నే లొంగదీసుకొని చర్చలకు రప్పించామని చెప్పుకొంటున్న 56 అంగుళాల ఛాతీ గల నేతలు మెడికల్‌ మాఫియాను అదుపు చేయలేరా ?

ఆధునిక వైద్య శాస్త్రం అభివృద్ది క్రమంలో ఏవరైనా ఒక ఔషధాన్ని తయారు చేశామని ప్రకటిస్తే దానికి రుజువులు చూపాలని, సామర్ద్యం సంగతి తేల్చాలని కోరుతున్నారు గనుకనే అనేక ఔషధాలు, వాక్సిన్లపై సంవత్సరాల తరబడి ప్రయోగాలు చేస్తున్నారు. అల్లోపతి ఔషధాలను ఎవరూ ప్రశ్నించటం లేదనేది వక్రీకరణ తప్ప వాస్తవం కాదు. దానికి చట్టాలే ఉన్నాయి. ఆయుర్వేద వైద్యానికి శిక్షణా కళాశాలలు, విద్యార్ధులకు సిలబస్‌, పరీక్షల వంటివి అన్నీ ఉన్నాయి. కానీ ఆనందయ్య వంటి వారు ఆయుర్వేదం పేరుతో ఏ అర్హతలతో వైద్యం చేస్తున్నారు, తయారు చేసిన పసరు మందులు ఇస్తున్నారు ? కొందరు అలాంటి వారిని ప్రోత్సహించటం ఏమిటి ? ప్రశ్నించిన వారిని హిందూ ద్రోహులుగా చిత్రిస్తారా ? అల్లోపతి ఆసుపత్రుల్లో జరిగే వాటిని ప్రశ్నించరు అని ఒక ప్రచారం. ఈ ప్రశ ్న అడిగేవారు వేదికలను ఏర్పాటు చేసుకొని ఆ పని ఎందుకు చేయరు ? ఈ దేశంలో ఒక చట్టం, ఒక విధానం అన్నీ ఉన్నాయి. ఒక వేళ ఆనందయ్య లాంటి వారు ఆయుర్వేద వైద్యం చేయటానికి అర్హతలు ఉన్నాయనుకుంటే వారికి డిగ్రీలు ప్రదానం చేసి చట్టబద్దంగానే చేయించండి, ఎవరు వద్దన్నారు. కల్వరి తైలం గురించి శాస్త్రీయ నిరూపణ చేయాలని ఎవరూ అడగలేదు ఎందుకు అని ఒక ప్రశ్న. కల్వరి అయినా మరొకటి అయినా ఔషధం అని ప్రచారం చేస్తే జనవిజ్ఞానవేదికో మరొకటో రంగంలోకి వస్తాయి. లేదూ రాలేదు అనుకోండి ఈ ప్రశ్న వేస్తున్నవారు ఏ గుడ్డి గుర్రాలకు పండ్లుతోముతున్నట్లు? వారికి బాధ్యత లేదా ? గుళ్లూ గోపురాల్లో ప్రసాదం పేరుతో పెట్టేవాటిలో, పవిత్ర తీర్ధంలో , చర్చ్‌లలో బాప్తిజం, ఇతర సందర్భాలలో పవిత్ర జలంలో ఏముంది అని ఏ జనవిజ్ఞాన వేదిక కార్యకర్త అయినా ఎప్పుడైనా ప్రశ్నించిన ఉదంతం ఉదంతం ఉందా ? ఎందుకంటే వాటిని వారు ఔషధాలుగా ప్రచారం చేసుకోవటం లేదు. అడ్డగోలు తర్కాలకు అంతు ఉండదు.


ఉచితంగా ఇస్తున్న మందు గురించి ఇన్ని విచారణలా ? లక్షలు తీసుకుంటున్న ఆసుపత్రులను ఎందుకు పట్టించుకోరు ? ఈ దేశంలో ఒక చట్టం ఉంది. దాని ప్రకారం ఎవరైనా తెల్లవారే సరికి ఒక మందు ఇస్తున్నామంటూ ముందుకు వస్తే దానికి అనుమతి ఉందా , ఎక్కడ తయారైంది, ఇతర వివరాలన్నీ ముద్రించిన సమాచారం ఉండాలి. రామర్‌ పిళ్లే పెట్రోలు తయారీ, ఆనందయ్య మరొక వెంకయ్య గానీ వివరాలు, అనుమతుల్లేని మందు గురించి చెబితే ఈ సమస్యలన్నీ ముందుకు వస్తాయి. ఈ ప్రశ్న వేసే వారు చట్టాన్ని గౌరవిస్తున్నట్లా లేక అడ్డగోలు తనాన్ని ప్రోత్సహిస్తున్నట్లా ? విచారణ చట్టబద్దంగా జరుగుతోందా, విరుద్దంగా జరుగుతోందా ? ఒక మహిళకు పుట్టిన బిడ్డకు తనకు ఎలాంటి సంబంధం లేదని ఒక మగవాడు ప్రకటిస్తే డిఎన్‌ఏ పరీక్షలు చేసి నిర్ధారిస్తున్నారా లేదా అదే విధంగా ఆనందయ్య తయారు చేసినట్లు చెబుతున్న మందును ఎవరైనా ప్రశ్నించినా లేక వార్తలు తెలిసి తనంతటతానే అయినా ప్రభుత్వాలు, సంబంధిత సంస్దలు విచారణ జరుపుతాయి. అదే విధంగా ఆసుపత్రులు అక్రమాలకు పాల్పడినట్లు ఎవరైనా ఫిర్యాదు చేస్తే విచారణ జరిపి నిగ్గుతేల్చాలి. విచారణ సక్రమంగా జరగలేదు అంటే అది వేరే విషయం.

జనవిజ్ఞాన వేదిక లక్ష్యం ఈ దేశ అనాది సంస్కృతుల్ని విజ్ఞానం పేర నాశనం చేసి చైనాకు బానిసలుగా చేయటం అని ఒక ముక్తాయింపు. సంస్కృతి, సాంప్రదాయాల పేరిట అసలు ప్రశ్నించే తత్వాన్నే నాశనం చేసింది, నగుబాట్ల పాలు చేస్తున్నదీ జనవిజ్ఞానవేదిక లేదా అలాంటి మరొక సంస్ధ కాదు. విదేశీ పాలకులు వారు పశ్చిమ, మధ్య ఆసియా నుంచి వచ్చినా ఐరోపా నుంచి వచ్చినా ప్రతిఘటించకుండా జనాన్ని దద్దమ్మలుగా తయారు చేసింది, ఈ దేశంలో పుట్టి పెరిగిన బౌద్ధమతాన్ని విదేశాలకు తరిమి వేసింది ఎవరు ? ప్రపంచంలో ఎక్కడా లేని అంటరాని తనాన్ని పెంచి పోషించింది హిందూమతం లేదా గొప్పదని చెప్పుకుంటున్న హిందూ సంస్కృతా లేక జన విజ్ఞానవేదికలా ?


ఔషధ కంపెనీల మాఫియా లేదా వత్తిడి అని ఒక ప్రచారం. నిజమే మాఫియా లేదా వారి మాయాజాలం ఉన్న మాట నిజమే. అది ఉండబట్టే కదా భారత్‌ బయోటెక్‌, సీరం సంస్దల వాక్సిన్లు తప్ప నెలల తరబడి మరొక వాక్సిన్‌ రాకుండా మన నరేంద్రమోడీ సర్కార్‌ ఏదో ఒకసాకుతో మోకాలడ్డి జనం ప్రాణాల మీదకు తెచ్చింది. కాదంటారా ? నిజంగా జనం ప్రాణాలు కాపాడటం ముఖ్యం అనుకుంటే వాటికి అనుమతి ఇచ్చినట్లుగానే అత్యవసర ప్రాతిపదికన ఇతర వాక్సిన్లకు ఎందుకు అనుమతి ఇవ్వలేదు ? ఇలాంటి వాటికి సమాధానం చెప్పలేక ఆనందయ్యను అడ్డుపెట్టుకొని కాషాయ తాలిబాన్లు ఔషధ మాఫియా పేరుతో జనాన్ని తప్పుదారి పట్టిస్తున్నారు. లేదూ నిజంగానే ఔషధ మాఫియా పని చేస్తోందని అనుకుందాం. కొత్తగా ఆనందయ్య మందుతో వారు ముందుకు రాలేదుగా, ప్రధాని, మంత్రులు, వారందరికీ మార్గదర్శనం చేస్తున్న సంఘపరివార్‌ మేథావులు ఏడు సంవత్సరాలుగా ఏ గుడ్డి గుర్రాలకు పండ్లు తోముతున్నట్లు ? యాభై ఏండ్లలో కాంగ్రెస్‌ చేయలేనిదానిని ఐదేండ్లలో చేశామని చెప్పుకున్న గొంతులు మాట్లాడవేం. కంపల్సరీ లైసన్సులు ఇచ్చి ప్రాణావసర ఔషధాలు, వాక్సిన్లు తయారు చేయించి మెడికల్‌ మాఫియాను దునుమాడితే ఎవరు వద్దన్నారు ?


ఇప్పుడు కొంత మంది కోవిడ్‌ -19ను చైనా వైరస్‌ అని తప్పుడు ప్రచారం చేస్తున్నట్లుగానే బ్రిటీష్‌ వారి పాలనా కాలంలో మన దేశంలో తలెత్తిన కలరాను ఐరోపా, అమెరికా ఖండాలలో ఆసియా లేదా ఇండియన్‌ కలరా అని వర్ణించారు. తమ ప్రాంతంలో వచ్చిన కలరా కూడా దీని వలనే నిందించారు. బహుశా కరోనా గురించి చైనా మీద మన టీవీ యాంకర్లు, వాట్సప్‌ యూనివర్సిడీ పండితులు రెెచ్చి పోవటానికి ప్రేరణ ఇదే అయి ఉండవచ్చు. భారత్‌లోని హరిద్వార్‌, పూరీ, పండరిపూర్‌, పశ్చిమాసియాలోని మక్కా, మదీనా వంటి చోట్ల జరిగే మతకార్యక్రమాలకు హాజరయ్యే జనాలు దీనికి ఒక కారణమని నాటి బ్రిటీష్‌ పాలకులు భావించారు. 1892లో ఒక అమెరికన్‌ భారత్‌లో పారిశుధ్య నిబంధనలు అమలు చేయాలంటే ప్రతి యాత్రీకుడికి ఇద్దరు సిపాయిలు అవసరమని రాశాడు. భారత్‌లో హిందూ భక్తులు, ఈజిప్టులో ముస్లిం భక్తులు కొనసాగినంత కాలం ఐరోపా, అమెరికాలకు ముప్పుకొనసాగుతూనే ఉంటుందన్నాడు. ఒక మతం వారు, మరొక మతంలోని కొన్ని సామాజిక తరగతుల వారు పరిశుభ్రత పాటించరంటూ ఇప్పటికీ ప్రచారం చేసే వారు దీన్ని గమనంలో ఉంచుకోవాలి.

పూరీ జగన్నాధ రధయాత్రకు వచ్చే లక్షలాది మంది భక్తులు కలరా వ్యాప్తికి ప్రధాన కారకులౌతున్నారనే అభిప్రాయంతో ఆ కార్యక్రమాన్ని రద్దు చేయాలని బ్రిటీష్‌ పాలకులు ఒక దశలో ఆలోచించి, జనం నుంచి వచ్చే వ్యతిరేకతకు భయపడి పోతే పోనివ్వండి పోయేది వారేగా అన్నట్లు అలాంటి నిషేధాన్ని మానుకున్నారని చరిత్రకారులు రాశారు.బొంబాయి ప్లేగు, కలరా ఉదంతాలు 150 సంవత్సరాల క్రితం జరిగాయి. మహమ్మారుల గురించి ఎంతో పరిజ్ఞానం, విజ్ఞానం వచ్చిందనుకుంటున్న సమయంలో హిందూత్వశక్తుల అజ్ఞానం ఏ స్ధాయిలో ఉందో వారిని నమ్మి జనం ఎలా ప్రవర్తించారో చూశాము. గంగలో మునిగితే వైరస్‌ అంటుకోదని ప్రచారం చేశారా లేదా ! కుంభమేళాలో అంత మంది గుమికూడటం ప్రమాదకరమని హెచ్చరిస్తున్నా బిజెపి ముఖ్యమంత్రులు, నేతలు దానికి అనుమతి ఇవ్వాల్సిందే అని వాదించి జనాన్ని గంగలో మునకలేయించారు కదా ! కొందరు అఖారాలు మరణించటం, వ్యాధి ప్రబలటంతో ప్రధాని నరేంద్రమోడీ జోక్యం చేసుకొని మధ్యలోనే నిలిపివేశారు. ఎందుకు అనుమతించారో, ఎందుకు నిలిపివేయించారో, హిందూ భక్తుల మనోభావాలు ఏమయ్యాయో ఎవరైనా చెప్పగలరా ?


ఆఫ్రికా ఖండంలోని కొన్ని దేశాలలో ఎబోలా మహమ్మారి తలెత్తినపుడు జనం ఎలా ప్రవర్తించారో మనం చూశాము. వాటిని సమర్ధిస్తామా ? ఎబోలా చికిత్స కేంద్రాలకు జనం వెళితే కొన్ని శరీర భాగాలను అపహరిస్తారని కొందరు, తమ సాంప్రదాయాలు, ఆచారాలకు భంగం వాటిల్లుతుందని ముందుకు రాని వారు, వ్యతిరేకించిన వారు ఉన్నారు. అందువలన జనం పేరు చెప్పి మూఢవిశ్వాసాలను పెంచి పోషించే వారు పెద్ద దేశద్రోహులు. దాన్ని ప్రశ్నించారా,దీన్ని ప్రశ్నించారా అంటూ అనేక మంది ఇప్పుడు అడ్డుసవాళ్లు విసురుతున్నారు. ఆనందయ్య మందును కొందరు ప్రశ్నించారు గనుక వీరంతా రంగంలోకి దిగారు. ఆ మందు లేనపుడు కూడా వీరు చెబుతున్న అంశాలు ఉన్నాయి కదా వీరెందుకు స్పందించలేదు. అంటే వీరి ప్రశ్నలు,ప్రచార అసలు లక్ష్యం హిందూత్వతో సహా దేన్నీ ప్రశ్నించకూడదు. అది కుదిరేది, జరిగేది కాదు, ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఎందరు అడ్డుకున్నా సమాజాన్ని వెనక్కు నడపాలని గతంలో ప్రయత్నించినా కుదరలేదు, ఇక ముందు కుదరదు !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌ : అప్పుల చెల్లింపు ఎక్కువ – అభివృద్ది వ్యయం తక్కువ !

22 Saturday May 2021

Posted by raomk in AP, AP NEWS, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, STATES NEWS

≈ Leave a comment

Tags

Andhra Pradesh Budget 2021-22, Andhra Pradesh Budget Analysis, AP Budget Highlights, chandrababu naidu, YS jagan


ఎం కోటేశ్వరరావు


కరోనా కారణంగా ఒక రోజులోనే ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ 2021-22 బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. గత రెండు సంవత్సరాలుగా సంక్షేమ పధకాలు తప్ప అభివృద్దిని పట్టించుకోవటం లేదన్న విమర్శలు వెలువడుతున్నాయి. అయినా ఏమాత్రం ఖాతరు చేయకుండా వైఎస్‌ జగన్‌ సర్కార్‌ మూడవ బడ్జెట్‌ను కూడా ప్రవేశపెట్టింది.ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్‌ ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డి ప్రశంస మామూలుగానే కొనసాగింది. చంద్రబాబు నాయుడి సర్కార్‌ మాదిరి అంకెల గారడీ కొనసాగించింది. సంక్షేమ పధకాలకు ఇచ్చిన ప్రాధాన్యత అభివృద్ధి పధకాలకు ఇవ్వకపోతే రాబోయే రోజుల్లో జరిగేదేమిటో చెప్పనవసరం లేదు. ప్రతి ఏటా బడ్జెట్‌ మీద కొండంత రాగం తీసి ఏడాది చివరిలో కీచుగొంతుతో కోత పెట్టటం ఈ ఏడాది కూడా కొనసాగింది. నవరత్నాల భజన కొనసాగుతోంది. పాడిందే పాడరా అన్నట్లు వాటి గురించి ఎన్నిసార్లు చెబుతారు, మిగతా వాటి గురించి మాట్లాడరా అని జనం అనుకుంటున్నారు.


గత రెండు సంవత్సరాలలో వరుసగా 2,27,975 – 2,24,79 కోట్లు ఈ ఏడాది 2,29,779కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. తొలి బడ్జెట్‌ను 1,74,160, రెండవ దానిని 1,85,136 కోట్లుగా సవరించిన అంచనాను పేర్కొన్నారు. వాస్తవంలో ఇంకా తగ్గవచ్చు. ఇదే బాటలో తాజా బడ్జెట్‌కు సైతం కోత పెడతారని వేరే చెప్పనవసరం లేదు. ఎందుకీ గారడి, ఎవరిని తప్పుదారి పట్టించాలనుకుంటున్నారు ? గతంలో తెలుగుదేశం చంద్రబాబు నాయుడు చేసిన దానినే పునరావృతం చేస్తున్నారు, జనం ఏమన్నా అనుకుంటారని పాలకులు ఆలోచించరా ? చంద్రబాబు సర్కార్‌ దిగిపోయే ముందు ఏడాది లక్షా 91వేల కోట్లతో బడ్జెట్‌ను ప్రతిపాదించి ఏడాది చివరికి వచ్చేసరికి లక్షా 62వేల కోట్లకు (29వేల కోట్లు) కుదించింది. జగన్‌ ప్రభుత్వ మూడవ బడ్జెట్‌లో గత సంవత్సరాలను అనుసరిస్తే ఏడాది చివరికి యాభైవేలు కోత పెట్టి ఏ లక్షా 80వేల కోట్లకో కుదిస్తారు.
కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయక గ్రాంట్లుగా 2019-20లో రాష్ట్రానికి వచ్చిన మొత్తం రు.21,876 కోట్లు, గత ఏడాది వస్తుందని బడ్జెట్‌లో చూపిన మొత్తం రు. 53,175 కోట్లు, సవరించిన అంచనా రు.32,934 కోట్లు. తిరిగి ఈ ఏడాది రు.57,930 కోట్లు వస్తుందని చూపారు. పారు బాకీలను కూడా బ్యాంకులు తమ ఖాతాలలో చూపుతున్నట్లు ఎందుకిలా చేస్తున్నారు ? రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి వస్తాయో రావో అమీతుమీ తేల్చుకోవాలి. ఆంధ్రప్రదేశ్‌ అడుగుతున్న మొత్తం మేము ఇవ్వాల్సిన పనిలేదు అని కేంద్రం చెప్పదు, ఎటూ తేల్చరు-ఇవ్వరు ఏమిటీ నాటకం అని అడిగే దమ్ము రాష్ట్ర ప్రభుత్వానికి లేదా ?


రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌ వాటాగా వచ్చిన అప్పు 97వేల కోట్ల రూపాయలు. చంద్రబాబు ఏలుబడిలో అది 2018-19 నాటికి రెండులక్షల 57వేల 509 కోట్ల రూపాయలకు చేరింది. గత ఏడాది మార్చి నెల నాటికి రాష్ట్ర రుణభారం రు.3,01,802 కోట్లు. అది ఈ ఏడాది మార్చి నాటికి రు.3,55,939 కోట్లకు చేరింది. వచ్చే ఏడాది మార్చి నాటికి 3,87,125 కోట్లు ఉండవచ్చని అంచనా వేశారు. ఇది ప్రభుత్వం పేరుతో తీసుకుంటున్న అప్పు, ఇదిగాక ప్రభుత్వం హామీదారుగా ఉండి వివిధ సంస్దలకు ఇప్పించిన అప్పు మరో 91,330 కోట్లు ఉంది. ద్రవ్య సంబంధ స్వయం క్రమశిక్షణ నిబంధనలో (ఎఫ్‌ఆర్‌బిఎం) భాగంగా విధించుకున్న పరిమితి దాటలేదు అని చెప్పుకొనేందుకు రెండవ అప్పును ప్రభుత్వ ఖాతాలో చూపరు. ఇది గతంలో అన్ని ప్రభుత్వాలు చేశాయి.


చంద్రబాబు నాయుడి ఏలుబడి చివరి ఏడాదిలో కొత్త – పాత అప్పుల మొత్తం రాష్ట్ర స్ధూల ఆదాయం(జిఎస్‌డిపి)లో 28.02శాతం ఉండగా జగన్‌ తొలి ఏడాది దాన్ని 31.02శాతానికి, రెండవ సంవత్సరంలో 35.23( సవరించిన అంచనా)గా చూపారు. ఈ ఏడాది అది 40శాతానికి చేరినా ఆశ్చర్యం లేదు. అందువలన గత పాలకులను విమర్శించే నైతిక హక్కు వైసిపికి ఉందా ? అప్పుల మీద వడ్డీ -అసలు చెల్లింపు పెరుగుతోంది, అభివృద్ది వ్యయం తగ్గటం ఒక ప్రధాన ధోరణిగా కనిపిస్తోంది. 2018-19లో స్ధిర ఆస్దుల కొనుగోలు, కల్పనకు గాను చేసిన ఖర్చు రు.19,976 కోట్లు, అదే ఏడాది తెచ్చిన అప్పుల మీద, అసలు-వడ్డీ చెల్లింపులకు చేసిన ఖర్చు రు.28,877 కోట్లు. 2019-20లో అది రు.12,845 – 35,428 కోట్లుగానూ 2020-21లో రు.18,797-34,318 కోట్లుగా ఉంది. ఈ ఏడాది 50వేల కోట్ల రూపాయలకు పైగా రుణాలు చేయాలని సంకల్పించారు. వడ్డీ 23,205 కోట్లని అంచనా. ఏటా తెస్తున్న అప్పులో అధికభాగం వడ్డీ చెల్లింపులకే పోతున్నది. ప్రాధాన్యతా రంగాలకు కేటాయిస్తున్న మొత్తాలను చూస్తే మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌ ఎక్కువ రంగాలలో జాతీయ సగటు కంటే తక్కువ కేటాయిస్తున్నది.


రాష్ట్రంలో సేవారంగం తరువాత వ్యవసాయం ప్రధానంగా ఉంది. దీనికి సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాల్సిన అవసరం గురించి చెప్పనవసరం లేదు. ఈ రంగానికి పెట్టుబడి వ్యయంగా అన్ని రకాల ప్రాజెక్టులకు కలిపి 10,647 కోట్లు కేటాయించి ఖర్చు చేసింది కేవలం 3,860 కోట్లు మాత్రమే. ఈ ఏడాది తిరిగి 11,587 కోట్లు కేటాయించారు. మొత్తం అన్ని రకాల పెట్టుబడి వ్యయ ఖాతాలో 29,907 కోట్లు కేటాయింపు చూపి ఖర్చు చేసింది 18,797 కోట్లు మాత్రమే. తిరిగి ఈ ఏడాది 31,198 కోట్లు చూపారు. కరోనా కారణంగా ప్రజారోగ్య విభాగంలో ఖర్చు పెంచాల్సి ఉన్నప్పటికీ ఐదు వందల కోట్లకు పైగా గతేడాది కోత విధించారు. గృహనిర్మాణానికి గతేడాది 4,600 కోట్లు కేటాయించి ఖర్చు చేసింది 2,030 కోట్లు మాత్రమే. షెడ్యూలు కులాలు, తరగతులు, ఇతర వెనుక బడిన కులాల సంక్షేమానికి గత బడ్జెట్‌లో కేటాయింపు 41,162 కోట్లు ఖర్చు 23,253 మాత్రమే. ఈ ఏడాది కేటాయింపే 27,401 కోట్లకు తగ్గించారు, ఖర్చు ఎంత ఉంటుందో తెలియదు.


తన పాలనా కాలంలో దశల వారీ మద్య నిషేధాన్ని అమలు జరుపుతానని వాగ్దానం చేసిన వైసిపి ఆ దిశగా తీసుకున్న చర్యలేమీ లేవు. దానికి నిదర్శనం దాన్నొక ఆదాయ వనరుగా మార్చుకోవటమే. 2019-20 సంవత్సరంలో బీరు మీద వచ్చిన డ్యూటీ(పన్ను) 187 కోట్లు, అది 2020-21లో 351 కోట్లని అంచనా వేయగా 805 కోట్లకు పెరిగింది. ఈ ఏడాది ఆ మొత్తం వెయ్యి కోట్లు దాటనుందని అంచనా. ఇక మొత్తం మద్యం మీద ఆదాయ పెరుగుదల ఎలా ఉందో చూడండి. 2019-20లో మొత్తం ఆదాయం 6,914 కోట్లు కాగా గత ఏడాది లక్ష్యం 7,931 కోట్లని చెప్పి 11,575 కోట్లకు పెంచారు. ఈ ఏడాది పదిహేనువేల కోట్ల రూపాయల లక్ష్యం నిర్ణయించారు.ఈ మొత్తాన్ని మద్యం అమ్మకాల పెంపుదల లేదా మరింతగా పన్నుల బాదుడుతో మాత్రమే రాబట్టుకోవటం సాధ్యం. ఇంత మొత్తం ఆదాయాన్ని వదులుకొని మద్య నిషేధం అమలు జరుపుతామని ఇప్పటికీ కబుర్లు చెబితే నమ్మే జనాలుంటే చేయగలిగిందేమీ లేదు.


పెట్రోలియం ఉత్పత్తులపై వసూలు చేస్తున్న వ్యాట్‌, సెస్సులు తక్కువేమీ కాదు. పెట్రోలు, డీజిలు మీద లీటరుకు నాలుగు రూపాయలు స్ధిర వ్యాట్‌ , ధరను బట్టి మారే వ్యాట్‌ మరొకటి ఉంది. స్ధిర వ్యాట్‌ ఖాతా కింద గత ఏడాది రు.1,243 కోట్లు వసూలు చేస్తే వర్తమాన సంవత్సరంలో ఆ మొత్తం 2,648 కోట్లని పేర్కొన్నారు. ఇక ధరల పెరుగుదలను బట్టి మారే వ్యాట్‌ మొత్తం గత ఏడాది రు.4,810 కోట్లయితే ఈ ఏడాది 11,042 కోట్లుగా అంచనా వేశారు. ఇదిగాక రోడ్డు సెస్‌ పేరుతో పెట్రోల, డీజిలు మీద వసూలు చేస్తున్న మొత్తం 245 నుంచి 662 కోట్లకు చేరనుంది. వీటన్నింటినీ కలుపుకుంటే గత ఏడాదితో పోలిస్తే వర్తమాన సంవత్సరంలో ఈ ఖాతాలో బాదుడు రు.6,298 కోట్ల నుంచి రు.14,352 కోట్లకు చేర నుంది.


ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక కార్మికుల వినియోగధరల సూచి కంటే గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ కార్మికుల ధరల సూచి ఎక్కువగా ఉన్నట్లు సామాజిక, ఆర్ధిక సర్వే తెలిపింది. దేశవ్యాపితంగా పారిశ్రామిక కార్మికుల ధరల సూచికలో పెరుగుదల 4.98శాతం ఉంటే ఆంధ్రప్రదేశ్‌లో అది 6.03గాను, వ్యవసాయ కార్మికుల సూచి దేశంలో 5.51శాతం ఉంటే ఏపిలో 6.15శాతంగా నమోదైంది. పెద్ద ప్రచార అస్త్రంగా ఉన్న రైతు భరోసా పధకంలో ఏడాదికి రు.13,500 ఇస్తున్నారు. దీనిలో కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఆరువేల రూపాయలు కూడా కలసి ఉన్నాయి. ఇందుకు గాను కేంద్రం ఇచ్చే దానితో సహా ఇస్తున్న రు. 2,966 కోట్లతో సహా మొత్తం రు.6,928 కోట్లు. రాష్ట్రంలో 2019-20 సంవత్సరంలో (కరోనా లేదు) మధ్య,చిన్న, సన్నకారు పరిశ్రమల రంగంలో రు.2,980 కోట్ల పెట్టుబడితో ఏర్పడిన సంస్ధలలో 76,716 మందికి ఉపాధి కలిగింది.2020-21లో 2,154 కోట్లతో 3,710 సంస్ధలలో 35,029 మందికి ఉపాధి దొరికినట్లు తెలిపారు. 2019-20లో భారీ మరియు మెగా ప్రాజెక్టుల తరగతిలో 44 పారిశ్రామిక ప్రాజెక్టులలో రు.22,282 కోట్లతో 18,385 మందికి ఉపాధి కల్పించగా 2020-21లో అవి పన్నెండుకు తగ్గిపోయి రు.3,656 కోట్లతో 8,114 మందికి ఉపాధి కల్పించినట్లు సామాజిక సర్వేలో పేర్కొన్నారు.


ఒక రోజు అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన తెలుగుదేశం సభ్యులు, వీడియో ద్వారా విడిగా సమావేశం నిర్వహించి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. అయితే రెండు పార్టీలూ అనుసరిస్తున్న విధానాలలో పెద్ద తేడా లేదు. సంక్షేమం పేరుతో ప్రజాకర్షక పధకాలకు పెద్ద పీట వేస్తున్నందున అభివృద్ది గురించి నువ్వు మూస్కో నేను మూస్కుంటా అన్నట్లుగా ఎవరూ మాట్లాడరు. రాష్ట్రంలోని మేథావులకు సైతం ఈ అంశం పెద్దగా పట్టినట్లు లేదు, ఎవరికైనా పడితే వారికి మీడియాలో చోటు దొరకదు. పోనీ మీడియా అయినా విమర్శనాత్మకంగా వ్యవహరిస్తుందా అదీ లేదు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

జడ్‌పి ఎన్నికలపై జగన్‌కు పెద్ద షాక్‌ – తిరుపతి ఎన్నిక పర్యవసానాలు !

06 Tuesday Apr 2021

Posted by raomk in AP NEWS, BJP, Congress, CPI(M), Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Uncategorized

≈ Leave a comment

Tags

AP BJP, AP ZP elections, chandrababu naidu, Jana Sena, pavan kalyan, Tirupati lok sabha by election, YS jagan


ఎం కోటేశ్వరరావు


మామూలుగా ఒక ఉప ఎన్నిక సాధారణ ఎన్నికల మాదిరి ప్రాధాన్యతను సంతరించుకోదు. అధికారంలో ఉన్న పార్టీకే ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అసాధారణ పరిస్ధితులు ఏర్పడితే, లేదా అంతకు ముందు ఎన్నికలో మెజారిటీ స్వల్పంగా ఉంటే తప్ప ప్రతిపక్షం గెలిచే పరిస్ధితి ఉండదు. ఈ నేపధ్యంలో తిరుపతి లోక్‌సభ నియోజకవర్గ ఉప ఎన్నికను ఎలా చూడాలి ? దాని పర్యవసానాలు ఏమిటి ? ఏప్రిల్‌ 8న జరగాల్సిన జిల్లా, మండల పరిషత్‌ ఎన్నికల మీద రాష్ట్ర హైకోర్టు స్టే విధించటంతో తిరుపతి ఎన్నిక జరిగే 17వ తేదీ లోగా జరిగే అవకాశం లేదనే చెప్పవచ్చు. తిరుపతి ఎన్నికలోపు జరపాలనే అధికారపక్షానికి ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్‌మోనరెడ్డి, నూతన ఎన్నికల కమిషనర్‌ నీలం సాహ్నికి కోర్టులో పెద్ద ఎదురు దెబ్బతగిలింది. ఎన్నికల నిర్వహణ గురించి సవాలు చేస్తూ తెలుగుదేశం, జనసేన,బిజెపి, ఇతరులు దాఖలు చేసిన పిటీషన్లపై విచారించిన కోర్టు ఎన్నికలను వాయిదా వేసింది. కరోనా వైరస్‌ కారణంగా వారం రోజుల్లో ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలంటూ ఎన్నికల కమిషనర్‌ తీసుకున్న నిర్ణయాన్ని ఈ పార్టీలు సవాలు చేశాయి. కమిషనర్‌ ప్రకటనకు ముందే ఎన్నికల తేదీల గురించి వార్తలు వచ్చాయని, సుప్రీం కోర్టు చెప్పినట్లుగా నాలుగు వారాల ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పట్టించుకోలేదని అభ్యంతరం తెలిపాయి. దీన్ని విచారించిన కోర్టు ఈనెల 15వ తేదీన ఎన్నికల కమిషనరు కోర్టుకు అఫిడవిట్‌ సమర్పించాలని ఆదేశించింది. పిటీషన్లు దాఖలు చేసిన పార్టీలు కోరుతున్నట్లు కొత్త నోటిఫికేషన్‌కు హైకోర్టు అదేశించే అవకాశం లేదు. ఒకవేళ అదే జరిగితే ఇప్పటికే ఏకగ్రీవంగా ఎన్నికైన వారు, నామినేషన్లు వేసిన వారు కోర్టుకు ఎక్కుతారు. మున్సిపల్‌ ఎన్నికలకు కొత్త నోటిఫికేషన్‌ ఇవ్వాలన్న పిటిషన్లను తిరస్కరించిన విషయం తెలిసిందే. ఒకవేళ ఎన్నికల కమిషనరు, వైసిపి లేదా మరొకరు ఎవరైనా సుప్రీం కోర్టుకు వెళ్లినా ఈ నెల 8న ఎన్నికలు జరిగే అవకాశాలు ఉండవు. కోర్టు స్టే ఎత్తివేసి ఎన్నికలకు దారి సుగమం చేసినా నెల రోజుల పాటు ప్రవర్తనా నియమావళిని అమలుకు ఆదేశిస్తే మే నెలలో మాత్రమే జరిగే అవకాశం ఉంది.అప్పటికి తిరుపతి ఎన్నికల ఫలితాలు కూడా వెలువడుతాయి.


తిరుపతి నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను నాలుగు నెల్లూరు జిల్లాలో, మూడు చిత్తూరు జిల్లాలో ఉన్నాయి. ప్రస్తుతం అన్ని చోట్లా వైసిపి వారే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఏడింటిలో మూడు షెడ్యూలు కులాల రిజర్వుడు నియోజకవర్గాలు. మొత్తం ఓటర్లు 15,74,161. గత(2019) ఎన్నికలలో 13,16,473(79.76శాతం) పోలయ్యాయి. వివిధ పార్టీలకు వచ్చిన ఓట్లు, శాతాలు ఇలా ఉన్నాయి.
పార్టీ ×××× ఓట్లు ×××× శాతం
వైసిపి ××× 7,22,877 ×× 55.03
టిడిపి ××× 4,94,501 ×× 37.65
నోటా ××× 25,781 ×× 1.96
కాంగ్రెస్‌ ×× 24,039 ×× 1.83
బిఎస్‌పి ×× 20,971 ×× 1.60
బిజెపి ×× 16,125 ×× 1.22
వైసిపి మెజారిటీ 2,28,376 కాగా, బిఎస్‌పిని జనసేన బలపరించింది. తాజా ఎన్నికలలో మొత్తం 28 మంది అభ్యర్ధులు పోటీలో ఉండగా గుర్తింపు పొందిన పార్టీలలో వైసిపి, తెదే, కాంగ్రెస్‌, బిజెపి, సిపిఎం పోటీచేస్తున్నాయి. మిగిలిన వారందరూ గుర్తింపు లేని పార్టీ, స్వతంత్ర అభ్యర్దులు.


గ్రామ పంచాయతీ, మున్సిపల్‌, కార్పొరేషన్‌ ఎన్నికలలో వైసిపి సాధించిన విజయం, దానికి వచ్చిన ఓట్ల ప్రాతిపదికన చూస్తే అసాధారణ పరిణామాలు సంభవిస్తే తప్ప తిరుపతి లోక్‌సభ స్ధానాన్ని తిరిగి అది గెలుచుకొనే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గ్రామ పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితంగా జరిగినందున ఏ పార్టీ ఎంత శాతం ఓటింగ్‌ వచ్చిందని చెప్పుకున్నా ప్రయోజనం లేదు. మున్సిపల్‌ ఎన్నికలలో వైసిపికి 52.63, తెలుగుదేశం పార్టీకి 30.73, జనసేనకు 4.67, బిజెపికి 2.41శాతం ఓట్లు వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికలలో వచ్చిన 49.95 శాతంతో పోలిస్తే ఓటింగ్‌ పెద్దగా పెరిగినట్లు భావించలేము. నవరత్నాల గురించి ఆ పార్టీ చేసుకుంటున్న ప్రచారానికి ఓట్ల పెరుగుదలకు పొంతన కుదరటం లేదు. తిరుపతి ఎన్నికలో విజయావకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నా వైసిపి తన యావత్‌ శక్తిని ఉపయోగించి ఈ ఎన్నికలలో పోటీ చేస్తున్నది. గతం కంటే మెజారిటీ తెచ్చుకొని తమకు రాజకీయంగా రాష్ట్రంలో ఎదురు లేదని ప్రదర్శించుకోవటం, తద్వారా ప్రతిపక్ష తెలుగుదేశం శ్రేణులను నిరుత్సాహపరచటం, మతం పేరుతో ఎన్ని జిమ్మిక్కులు చేసినా, కుట్రలు పన్నినా మీ ఆటలను సాగనివ్వం అని కేంద్రంలోని బిజెపి అగ్రనేతలకు సందేశం ఇవ్వటం కూడా ఈ ప్రయత్నాల వెనుక ఉంది.2019 ఎన్నికలలో వచ్చిన మెజారిటీకి రెట్టింపు తీసుకు రావాలని మంత్రులు, ఎంఎల్‌ఏలను జగన్‌మోహనరెడ్డి ఆదేశించినట్లు వార్తలు వచ్చాయి. అందువలన ఓటింగ్‌ శాతం , మెజారిటీ తగ్గినా ఆ పార్టీ మీద వత్తిడి పెరగటం ఖాయం.


ఇక తెలుగు దేశం పార్టీ విషయానికి వస్తే పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికలలో దానికి తీవ్ర ఎదురు దెబ్బలు తగిలినా ఓటింగ్‌ శాతం గణనీయంగానే ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తంగా 39.17శాతం వస్తే మున్సిపల్‌ ఎన్నికలలో 30.73శాతం వచ్చాయి. గ్రామీణ ప్రాంతాలలో అనేక చోట్ల వైసిపికి ఏకగ్రీవాలు అత్యధికంగా ఉన్నప్పటికీ ఆ మేరకు ఓట్ల శాతం ఉండే అవకాశం లేదు. తెలుగుదేశం పార్టీకి గ్రామీణ ప్రాంతాలలో కూడా ఇదే బలం ఉంటుందని చెప్పవచ్చు. తిరుపతి ఎన్నిక ఆ పార్టీకి, ముఖ్యంగా అధినేత చంద్రబాబు నాయుడి ప్రతిష్టకు ప్రతీకగా భావించవచ్చు. విజయం సాధిస్తుందా లేదా అన్నది పక్కన పెడితే గత ఎన్నికలలో వచ్చిన ఓట్లను నిలుపుకున్నా కార్యకర్తలను నిలుపుకోవచ్చు. రాజకీయ పోరు కొనసాగించవచ్చు. జిల్లా పరిషత్‌ ఎన్నికలను బహిష్కరించాలని తెలుగుదేశం అధినేత చేసిన నిర్ణయం దిగువ స్దాయిలో అంతగా జీర్ణం కాలేదు. తాజాగా హైకోర్టు స్టే ఇచ్చినందున ఏదో ఒకసాకుతో కార్యకర్తలను సంతృప్తి పరచేందుకు పునరాలోచన చేసినా ఆశ్చర్యం లేదు. తిరుపతి ఉప ఎన్నికల్లో వచ్చే ఓట్లను బట్టి కూడా ఆ నిర్ణయం ఉండవచ్చు.


జనసేన-బిజెపి కూటమి విషయానికి వస్తే బిజెపి కంటే జనసేనాని పవన్‌ కల్యాణ్‌ ప్రతిష్టచుట్టూ ఈ ఎన్నికలు తిరుగుతాయి. మున్సిపల్‌ ఎన్నికల ఓటింగ్‌ తీరు తెన్నుల ప్రకారం రెండు పార్టీలకు వచ్చిన 7.18 శాతం కంటే తిరుపతిలో ఎక్కువ వస్తేనే ఆ రెండు పార్టీల పరువు నిలుస్తుంది. లేనట్లయితే బిజెపికి కొత్తగా పోయే పరువేమీ ఉండదు కనుక పవన్‌ కల్యాణ్‌ ఏ విధంగా సమర్ధించుకుంటారన్న ప్రశ్న ముందుకు రానుంది. ప్రశ్నిస్తా అంటూ బయలు దేరిన పవన్‌ కల్యాణ్‌కు ప్రశ్నలేమీ లేకపోగా ఎదురు ప్రశ్నలు ఎదురయ్యే అవకాశం ఉంది. ప్రత్యేక హౌదా, ఇతర అన్యాయాల గురించి మోసం చేసిన కేంద్రాన్ని ప్రశ్నించకుడా ఏమి చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ప్రయోజనం ఉండదు.


ఇక బిజెపి విషయానికి వస్తే పర్యవసానాలు తక్కువేమీ కాదు. పవన్‌ కల్యాణ్‌ మద్దతు ఉన్నా ఓట్ల సంఖ్య పెరగపోతే దాని పరువు పోవటమే కాదు, జనసేనాని మద్దతు చిత్తశుద్ది గురించి అది సందేహాలను లేవనెత్తవచ్చు. తిరుపతి ఆపద మొక్కుల్లో భాగంగా జనసేనాని తమ ముఖ్యమంత్రి అభ్యర్ధి అని ప్రకటించింది. అంతే కాదు భగవద్దీత పార్టీ కావాలా బైబిల్‌ పార్టీ కావాలా అనే ప్రచారాన్ని ముందుకు తెచ్చింది. ఎవరికి ఎలాంటి అభిప్రాయం ఉన్నా తిరుపతి వెంకటేశ్వరుడు అంతర్జాతీయ దేవుళ్లలో ఒకరు. అక్కడ హిందూమతానికి అపచారం, అన్యాయం జరుగుతోందని ఇప్పటికే ప్రచారం పెద్ద ఎత్తున చేసింది. ఇక్కడ డిపాజిట్లు రాకపోయినా, గణనీయంగా ఓట్లు సంపాదించకపోయినా ఆంధ్రప్రదేశ్‌ ఓటర్లు దాని మత రాజకీయాలకు గోరీ కట్టారనే అభిప్రాయం కలుగుతుంది. ఇది దేశ వ్యాపితంగా కూడా బిజెపి వ్యతిరేక పార్టీలకు ప్రచార అస్త్రంగా మారుతుందని వేరే చెప్పనవసరం లేదు.ఇప్పటికే కేరళలో శబరిమల వివాదంతో ఓట్లు పొందాలని చూసి గత లోక్‌సభ ఎన్నికల్లో భంగపడిన బిజెపికి తాజా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అదే జరగనుందనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

మిగిలిన అభ్యర్దులలో నవతరం పార్టీ పేరుతో పోటీ చేస్తున్న అభ్యర్ధికి గతంలో జనసేనకు కేటాయించిన గ్లాసు గుర్తును ఎన్నికల సంఘం కేటాయించింది. ఈ గుర్తు ఉన్న కారణంగా జనసేన మద్దతుదారులు సదరు అభ్యర్ధికి ఓటు చేసే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. బిజెపి-జనసేనలకు పోలింగ్‌ ముందకు వరకు ఇది ఒక సాకుగా ఉపయోగపడవచ్చు తప్ప ఓటర్ల విజ్ఞతను ప్ర శ్నించటమే అవుతుంది. నిజంగా జనసేన మద్దతుదారులు బిజెపికి మద్దతు ఇవ్వాలనుకుంటే అలాంటి ప్రశ్న ఉదయించదు. ఇష్టం లేని వారు గ్లాసు గుర్తుకు ఓటేయవచ్చు. ఇక్కడ సిపిఎం పోటీలో ఉన్నప్పటికీ పెద్దగా ప్రభావం చూపుతుందని చెప్పలేము. తమ విధానాల ప్రచారం కోసమే ఈ పోటీ అని చెప్పవచ్చు. అనేక దళిత సంఘాలు మద్దతు ప్రకటించినప్పటికీ నైతికంగా ప్రచారం చేసుకొనేందుకు ఉపయోగపడుతుంది.2014 ఎన్నికలలో ఈ స్ధానంలో పోటీ చేసిన సిపిఎంకు 11,168 ఓట్లు వచ్చాయి. మొత్తం మీద తిరుపతి ఉప ఎన్నిక అన్ని పార్టీలకూ ఏదో విధంగా పరీక్ష పెడుతోంది, పర్యవసానాలకు సిద్దం కావాలని చెబుతోంది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

జిల్లా పరిషత్‌ ఎన్నికలను బహిష్కరిస్తున్న తెలుగు దేశం – పుదుచ్చేరి తరహా పాకేజ్‌ కోసమైనా పవన్‌ తాట తీస్తారా !

02 Friday Apr 2021

Posted by raomk in AP, AP NEWS, BJP, Congress, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, STATES NEWS, Telangana

≈ Leave a comment

Tags

chandrababu naidu, jana sena party, Pawan kalyan, special status to Puducherry, tdp, ycp jagan


ఎం కోటేశ్వరరావు


పుదుచ్చేరిలో పాగా వేసేందుకు బిజెపి చేసిన వాగ్దానం ఆ పార్టీకి ఆంధ్రప్రదేశలో ఎదురు తన్నిందా ? జరిగిన పరిణామాలను చూస్తే పెద్ద ఇరకాటంలో పడిందనే చెప్పాలి. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గుర్తు చేయాలి. ఐదు సంవత్సరాల క్రితం బీహార్‌ ఎన్నికల సమయంలో నరేంద్రమోడీ స్వయంగా ప్రత్యేక పాకేజ్‌లను ప్రకటించారు. తరువాత వాటికి అతీగతీ లేదు. ఇప్పుడు అమిత్‌ షా మాటల్లో చెప్పాలంటే పుదుచ్చేరి వాసుల విషయంలో జుమ్లా (అవసరార్దం అనేకం చెబుతుంటాం) కూడా కావచ్చు. తరువాత నిబంధనలు అంగీకరించటం లేదు, ఇతర రాష్ట్రాలు అభ్యంతర పెడుతున్నాయంటే చేసేదేమీ లేదు. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హౌదాను డిమాండ్‌ చేసిన పార్టీగా గొప్పలు చెప్పుకున్న బిజెపి తరువాత ఆ విషయంలో చేసిన వాగ్దానాన్ని తుంగలో తొక్కి రాష్ట్ర ద్రోహిగా ప్రజల ముందు తన స్వరూపాన్ని వెల్లడించుకుంది. ప్రత్యేక హౌదా ముగిసిన అధ్యాయంగా, కొత్తగా ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హౌదాలేమీ ఉండవు అని చెప్పి ఓట్లు వేసినా వేయకపోయినా దానికే తాము కట్టుబడి ఉంటామని అది కూడా తమ ఘనతే అన్నట్లుగా వ్యవహరించింది. ఇప్పుడు పుదుచ్చేరిలో పాగా వేసేందుకు అక్కడి ప్రజలకు ప్రత్యేక హౌదా ఎరవేసింది. తమకు అధికారం అప్పగిస్తే ప్రత్యేక కేంద్ర పాలిత ప్రాంత హౌదా కల్పించి జమ్మూకాశ్మీరుకు ఇచ్చిన మాదిరి కేంద్ర పన్నుల వాటాను 25 నుంచి 40శాతానికి పెంచేందుకు ప్రయత్నిస్తామని పేర్కొన్నది. అదే విధంగా కేంద్ర పధకాలకు గాను ప్రస్తుతం 70శాతం కేంద్ర పాలిత ప్రాంతం, 30శాతం కేంద్ర వాటాగా ఉన్నదానిని 30:70శాతాలుగా మారుస్తామని ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్నది. దీని మీద తెలుగుదేశం నేత లోకేష్‌ ట్వీట్లు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక హౌదాకోసం పోరాడుతుందా అని ప్రశ్నించారు. ప్రత్యేక హౌదాకోసం ఒక్క ప్రభుత్వం, అధికారపక్షమే కాదు, ఎవరైనా పోరాడవచ్చు. అయితే తెలుగుదేశం పార్టీ అలాంటి నైతిక హక్కును కోల్పోయింది. ఆంధ్రప్రదేశ్‌కు కావాలని కోరిన ప్రత్యేక హౌదాకు, పుదుచ్చేరికి ఇస్తామంటున్న హౌదాకు సంబంధం లేదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సమర్దించుకున్నారు.
కాశ్మీరు రాష్ట్రాన్ని రద్దు చేసిన కేంద్రం దానికి నలభైశాతం నిధులు ఇవ్వకపోతే అక్కడ దాని పరువు దక్కదు, తిరిగి రాష్ట్ర హౌదా ఇస్తామని చెబుతున్నారు. కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్న మరొక రాష్ట్రం ఢిల్లీ. అక్కడ ప్రభుత్వానికి అధికారాలను తగ్గించి, లెప్టినెంట్‌ గవర్నరకు ఎక్కువ అధికారాలు కట్టబెట్టేందుకు పూనుకున్న విషయం తెలిసిందే. అలాంటిది పుదుచ్చేరికి అధికారాలు, నిధులను ఎలా పెంచుతారు ? ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి ఒక ప్రాతిపదిక మరొక రాష్ట్రానికి మరొక ప్రాతిపదికా అన్న ప్రశ్న ముందుకు రానుంది. పుదుచ్చేరికి ఇలాంటి ప్రత్యేక హౌదా ఇచ్చేందుకు ప్రాతిపదిక ఏమిటి అన్నది ప్రశ్న. ఏ కమిటీ లేదా ఏ ఆర్ధిక సంఘం సిఫార్సులు దీనికి అవకాశం కల్పిస్తున్నాయి ? ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హౌదాకు బదులు ప్రత్యేక పాకేజి ఇస్తామని చెప్పిన కేంద్రం ఇలాంటిదానినే ఎందుకు అమలు జరపకూడదు ? ఇప్పటికే ఇరకాటంలో ఉన్న పవన్‌ కల్యాణ్‌ పుదుశ్చేరి తరహా హౌదాకోసమైనా కేంద్ర తాట తీసేందుకు, తోలు వలిచేందుకు తన పవర్‌ను చూపుతారా ? పులిలా గాండ్రిస్తారా, పిల్లిలా మ్యావ్‌ అంటారా ?

ఏపిలో ముద్దులాట – తెలంగాణాలో దెబ్బలాట : నాగార్జున సాగర్‌లో పవన్‌ కల్యాణ్‌ మద్దతు ఎవరికి ?

ఆంధ్రప్రదేశ్‌లో తమ కూటమి అధినేత, ముఖ్యమంత్రి అభ్యర్ధిగా జనసేనాని పవన్‌ కల్యాణ్‌ అని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన ప్రకటన రాష్ట్రంలో కొత్త రాజకీయ అంకానికి తెరలేపింది. దాని మీద పవన్‌ కల్యాణ్‌ వైపు నుంచి ఇంతవరకు ఎలాంటి స్పందన రాకపోవటం ఆశ్చర్యం కలిగిస్తున్నది. మరో మూడు సంవత్సరాల వరకు ఎన్నికలు లేకపోయినా ఇప్పుడే ప్రకటించటం గురించి చర్చ జరుగుతున్నది. స్ధానిక సంస్దల ఎన్నికలలో ఫలితాలు, విశాఖ ఉక్కు వంటి ఇతర అంశాలను చూసిన తరువాత బిజెపితో తెగతెంపులు చేసుకుంటామని కొద్ది రోజుల క్రితం పవన్‌ కల్యాణ్‌ చేసినట్లు చెబుతున్న హెచ్చరికల నేపధ్యంలో సోము వీర్రాజు తిరుపతి ఎన్నికల ఆపద మొక్కుగా ఈ ప్రకటన చేశారు తప్ప మరొకటి కాదన్నది ఒక అభిప్రాయం. పవన్‌ కల్యాణ్‌ అంటే ప్రధాని నరేంద్రమోడీ, అమిత్‌ షాలకు సైతం ఎంతో ఇష్టమని, పవన్‌ కల్యాణ్‌ను ఎంతో గౌరవంగా చూడాలని వారు చెప్పారని వీర్రాజు చెప్పారు. బిజెపి ఎక్కడా ఇంత వరకు ఇంత ముందుగా లేదా ఎన్నికల సమయంలో గానీ ముఖ్యమంత్రి అభ్యర్దులను ప్రకటించలేదు, దానికి భిన్నంగా ఈప్రకటన చేయటం రాజకీయ అవకాశవాదం అంటున్నవారు లేకపోలేదు. తిరుపతిలో తమ అభ్యర్దిని రంగంలోకి దించకపోతే బిజెపికి మద్దతు ఇచ్చేది లేదని కాపు సామాజిక తరగతికి చెందిన కొన్ని సంఘాల నేతలు హెచ్చరించిన నేపధ్యంలో వారిని బుజ్జగించి ఏమార్చేందుకు ఈ ప్రకటన చేసి ఉండవచ్చని కూడా భావిస్తున్నారు. రామాయణంలో పిడకల వేట మాదిరి సోము వీర్రాజు ప్రకటనకు వైసిపి అసంతృప్త ఎంపీ రఘురామ కృష్టం రాజు మరో వ్యాఖ్యానం చెప్పారు. తమ పార్టీలో ఏదైనా జరుగుతోందా అన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. జోగీ జోగీ రాసుకుంటే బూడిద రాలుతుందన్నట్లుగా ఈ ప్రకటనతో జరిగేదేమీ లేదని, తిరుపతి ఎన్నికల నేపధ్యంలో సోము వీర్రాజు ఒక బిస్కెట్‌ వేశారని వైసిపి నేత విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. మొత్తం మీద వీర్రాజు ప్రకటన నవ్వుల పాలైందని, పవర్‌ స్టార్‌ పరువు తీసిందని కొందరి అభిప్రాయం. అసలు తమది పెద్ద పార్టీ అయితే ముఖ్యమంత్రి అభ్యర్దిగా పవన్‌ కల్యాణ్‌ అని ప్రకటించటానికి వీర్రాజు ఎవరని కొందరు జనసైనికులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
బిజెపి-పవన్‌ కల్యాణ్‌ సంబంధాలు సజావుగా లేవన్నది స్పష్టం. తెలంగాణా ఎమ్మెల్సీ ఎన్నికల రోజున పోలింగ్‌ జరుగుతుండగా తెరాస అభ్యర్ది సురభి వాణీ దేవికి మద్దతు ప్రకటిస్తూ పవన్‌ కల్యాణ్‌ చేసి ప్రకటనే అందుకు నిదర్శనం. ఎన్ని ఓట్లు ఉన్నాయి లేవు అన్నది పక్కన పెడితే నాగార్జున సాగర్‌ ఉప ఎన్నికలో పవన్‌ కల్యాణ్‌ ఏమి చేస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తెలంగాణా బిజెపి నేతలు తనను అవమానించారనే ఆగ్రహంతో పవన్‌ కల్యాణ్‌ ఉన్నారు.

రుణ ఊబిలో జగనాంధ్ర ప్రదేశ్‌ – నిజాలను ఎంతకాలం దాస్తారు ?

కొన్ని సంక్షేమ పధకాలకు ఏదో ఒక సాకుతో కోత పెట్టక తప్పని స్ధితి, అది ఇంకా పూర్తి కావాల్సిన మండల, జిల్లా పరిషత్‌, అదే విధంగా తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల మీద పడకుండా చూసుకోవాల్సిన అగత్యం ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీకి ఏర్పడింది. ఈ నేపధ్యంలోనే ఓట్‌ఆన్‌ అకౌంట్‌తో అవన్నీ పూర్తయ్యేంత వరకు కాలక్షేపం చేద్దామనే ఆలోచనతో బడ్జెట్‌ను వాయిదా వేశారన్నది కాదనలేని సత్యం. దానికి అధికార పార్టీ ఏ సాకులు చెప్పినా అవి అతికేవి కాదు. అప్పుల గురించి కాగ్‌ చేసిన హెచ్చరిక, అది మీడియాలో చర్చకు దారి తీయటంతో ప్రభుత్వం తాజాగా సమాచార శాఖ ద్వారా ఒక పెద్ద వివరణ విడుదల చేసింది. దాన్ని రాసిన వారు ప్రభుత్వాన్ని సమర్ధించేందుకు ఎన్నో సాము గరిడీలు చేశారు. కేంద్ర ప్రభుత్వమే రికార్డు స్ధాయిలో అప్పులు చేసింది, మేమెంత అన్నట్లుగా చివరకు అప్పులు తీసుకురాక తప్పటం లేదు, సమర్ధనీయమే అని సమర్ధనకు పూనుకుంది. పోనీ దీనిలో అయినా నిజాయితీ ఉందా ?

అల్లుడికి బుద్ది చెప్పిన మామ అదే తప్పుచేశాడన్నట్లు !


సమాచార శాఖ వివరణలోని కొన్ని అంశాలు ఇలా ఉన్నాయి. కరోనా కారణంగా తలెత్తిన ఆర్ధిక పరిస్దితి కారణంగా కేంద్ర ప్రభుత్వమే 2020-21 ఆర్ధిక సంవత్సరంలో 18,48,655 కోట్లు అప్పు చేసింది. దేశ చరిత్రలో ఇంత మొత్తం అప్పు ఎన్నడూ చేయలేదు.కేంద్ర ప్రభుత్వ పని తీరు మొత్తం దేశానికి ఒక సూచిక.2014-19 సంవత్సరాలలో కేంద్ర ప్రభుత్వ అప్పు 56,48,471 కోట్ల నుంచి 84,68,085 కోట్లకు పెరిగింది. వృద్ది 49.92శాతం, వార్షిక వృద్ది రేటు 8.44శాతం. అదే రాష్ట్ర విషయంలో పైన చెప్పుకున్న కాలంలోనే 1,11,528 నుంచి 2,59,087 కోట్లకు పెరిగింది, వృద్ది 132.31శాతం, వార్షిక వృద్ది రేటు 18.36శాతం. ఇదంతా తెలుగు దేశం పాలనా కాలంలో జరిగింది.
కేంద్రంలో మోడీ 2.0, రాష్ట్రంలో వైసిపి 1.0 పాలనా కాలంలో అంటే 2019 మార్చి నుంచి 2021 మార్చినెల వరకు కేంద్ర అప్పులు 84,48,085 కోట్ల నుంచి 1,12,50,391 కోట్లకు, వృద్ది రేటు 32.86, వార్షిక వృద్ది రేటు 15.26శాతం ఉండగా రాష్ట్ర అప్పులు 2,59,087 నుంచి 3,48,998 కోట్లకు, వృద్ది రేటు 34.70, వార్షిక వృద్ది రేటు 16.06 శాతం ఉంది.
ఈ అంకెలతో ఎవరికీ పేచీ లేదు. వాటికి చెప్పే వ్యాఖ్యానాలే వివాదాస్పదం. సమాచార శాఖ విడుదల చేసిన అంకెలు వాస్తవమేనా ? ముఖ్యంగా వైసిపి రెండు సంవత్సరాల పాలనలో అప్పుగా పేర్కొన్న 3,48,998 కోట్ల రూపాయల అంకెలను ఏడాది క్రితం బడ్జెట్‌లోనే పేర్కొన్నారు. వాటిలో మార్పులేమీ లేవా ? సమర్ధనీయంగా పాలన ఉంటే అప్పులు తగ్గాలి, లేకపోతే పెరగాలి, పదిహేను నెలల నాటి అంకెలనే వల్లెవేస్తే కుదరదు. తెలుగుదేశం సర్కార్‌ చివరి ఏడాది రూ. 38,151 కోట్ల మేర అప్పులు తెచ్చింది. దాన్ని తీవ్రంగా విమర్శించిన జగన్‌ తొలి ఏడాది ఆ మొత్తాన్ని 52వేల కోట్లకు పెంచారు. వర్తమాన సంవత్సరానికి 48,295 కోట్లకు పెంచుతామని ప్రతిపాదించారు. కాగ్‌ చెప్పిన అంశాల ప్రకారం నవంబరు చివరి నాటికే రాష్ట్రం 73,811 కోట్లకు పైగా అప్పులు తెచ్చారు. నెలకు 9,226 కోట్ల రూపాయల చొప్పున ఉంది, మొత్తం అప్పు 3,73,140 కోట్లుగా ఉంది,డిసెంబరు-మార్చినెలల మధ్య ఇదే తీరున అప్పులు తెస్తే మరో 37 వేల కోట్ల రూపాయలు అప్పులు చేయవచ్చని అంచనా వేసింది. అంటే అప్పు నాలుగు లక్షల పదివేల కోట్ల చేరువలో ఉంటుంది. ఈ మొత్తంగాక వివిధ ప్రభుత్వ సంస్దలు తీసుకున్న అప్పులకు రాష్ట్ర ప్రభుత్వమే హామీదారుగా ఉంటుంది. అది కూడా రాష్ట్ర ప్రభుత్వ అప్పుగానే పరిగణించాలి. అయితే ఎఫ్‌ఆర్‌బిఎం చట్టం విధించిన జిఎస్‌డిపిలో మూడుశాతం రుణ పరిమితి దాటలేదు అని లెక్కల్లో చూపేందుకు ఆ మొత్తాలను విడిగా చూపుతున్నారు. చంద్రబాబు నాయుడి సర్కార్‌ చేసిన పనినే జగన్‌ ప్రభుత్వం కూడా చేస్తోంది. అందువలన అప్పు నాలుగున్నరలక్షల కోట్ల వరకు ఉన్నా ఆశ్చర్యం లేదు. ఇప్పుడు వెల్లడించకపోయినా మూడు నెలల్లో ప్రవేశ పెట్టే బడ్జెట్‌లో వాటిని వెల్లడించకతప్పదు. అందుకే పాత అంకెలను వల్లెవేస్తే తరువాత విమర్శకులకు మరో అవకాశం ఇచ్చినట్లు అవుతుంది.
రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌ వాటాగా వచ్చిన అప్పు 97వేల కోట్ల రూపాయలు. చంద్రబాబు ఏలుబడిలో అది 2018-19 నాటికి రెండులక్షల 57వేల 509 కోట్ల రూపాయలకు చేరింది. ఇవి గాక రాష్ట్ర ప్రభుత్వశాఖలు తీసుకున్న మరో 54వేల 250 కోట్ల రూపాయల అప్పులకు ప్రభుత్వం హామీ ఇచ్చింది. అంటే మొత్తం అప్పు మూడు లక్షల 11వేల కోట్లకు చేరింది. ఆ మొత్తాన్ని జగన్‌ సర్కార్‌, 3,02,202, 67,171 చొప్పున మొత్తం 3,69,373 కోట్లకు పెంచింది. 2021 మార్చి నాటికి 3,48,998 అప్పు పెరుగుతుందని పేర్కొన్నది, వీటికి అదనంగా హామీగా ఉన్న అప్పును కలుపుకోవాల్సి ఉంది. లక్ష్యానికి మించి అదనంగా చేసిన అప్పు, ప్రభుత్వం హామీ ఇచ్చిన అప్పులు మొత్తం నాలుగున్నర లక్షల కోట్లు దాటటం ఖాయం. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 2020వరకు నాలుగు సంవత్సరాలలో 27.92శాతంగా ఉన్న అప్పు 2021 మార్చి నాటికి 34.55 శాతానికి పెరుగుతుందని ఆర్ధిక మంత్రి బడ్జెట్‌ పత్రాల్లో వెల్లడించారు. వాస్తవానికి ఇది ఇంకా పెరగవచ్చు.
సమాచారశాఖ విడుదల చేసిన వివరణ పత్రంలో చెప్పినదాని ప్రకారం 2014-19 మధ్య రుణాల చెల్లింపు మొత్తం రు.25వేల కోట్లకు పెరిగింది. తెచ్చిన అప్పులను ఉత్పాదక ఖర్చుగా చేసి ఉంటే అనేక రంగాలు గణనీయంగా అభివృద్ది చెంది ఉండేవి, కాని అలా జరగలేదు అని పేర్కొన్నారు. తెలుగుదేశం అలా చేయలేదు సరే తమ రెండు సంవత్సరాల పాలనలో వైసిపి తెచ్చిన అప్పులను నవరత్న అనుత్పాదక సంక్షేమ పధకాలకు తప్ప ఇతరంగా ఏ ఉత్పాదక కార్యకలాపాల మీద ఖర్చు చేశారు, ఏమి సాధించారు అన్నదే ప్రశ్న.

నూతన ఎన్నికల కమిషనర్‌-పాత సవాళ్లు !


ఆంధ్రప్రదేశ్‌ నూతన ఎన్నికల కమిషనరుగా మాజీ ప్రధాన కార్యదర్శి, తరువాత రాష్ట్రప్రభుత్వ సలహాదారుగా ఉన్న నీలం సాహ్ని పదవీ బాధ్యతలు స్వీకరించారు.సాధారణంగా అయితే రాష్ట్ర ఎన్నికల కమిషనరు నియామకం పెద్ద చర్చనీయాంశం కాదు. అనేక మంది కమిషనర్ల నియామకం-పదవీ బాధ్యతల విరమణ వార్తలు కూడా గతంలో తెలిసేవి కాదు. కేంద్రంలో టిఎన్‌ శేషన్‌, రాష్ట్రంలో నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ ఎన్నికల కమిషన్లకు ఉన్న అధికారాలు ఎలాంటివో దేశానికి చూపించారు. గత ఏడాది కాలంలో రాష్ట్ర ప్రభుత్వమూ-రాష్ట్ర ఎన్నికల సంఘం మధ్య జరిగిన ప్రచ్చన్న, ప్రత్యక్ష యుద్దంలో మొత్తం మీద ఎన్నికల కమిషనర్‌దే పై చేయి అన్నది స్పష్టం. కింద పడినా గెలుపు మాదే అన్నట్లుగా అధికార పార్టీ నేతలు ఎంతగా, ఎలా సమర్దించుకున్నా వాస్తవాలు, కోర్టు తీర్పులు దానినే నిర్ధారిస్తాయి. తమ ఇష్టాను సారంగా ఒక ఎన్నికల కమిషనరును తొలగించటం సాధ్యం కాదని తెలిసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరించి ముక్కు పగల కొట్టించుకుంది. కొత్త ఎన్నికల కమిషనరు ముందు అధికారపక్షం వైపు నుంచి గతం మాదిరి ఎలాంటి సమస్యలు తలెత్తకపోవచ్చు. అయితే ప్రతిపక్షాల నుంచి అలాంటి పరిస్దితిని ఆశించలేము. మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికలు పూర్తయిన తరువాత మధ్యలో మధ్యంతర ఎన్నికలు వస్తే తప్ప లోక్‌సభ, అసెంబ్లీ గడువు ప్రకారం మూడు సంవత్సరాల పాటు అసలు ఎన్నికల కమిషనరు గురించి వార్తలే ఉండకపోవచ్చు.
స్వేచ్చగా ఎన్నికలు జరిగే అవకాశం లేకపోవటంతో జిల్లాపరిషత్‌ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు తెలుగుదేశం నేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు. దీని మీద పార్టీలో తీవ్ర భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. తెలుగుదేశం కార్యకర్తలు మరింత నీరుగారి పోతారని భయపడుతున్నారు. ఎన్నికలలో పాల్గొనాలా ? బహిష్కరించాలా అన్న తర్జన భర్జనలో బహిష్కరించాలని మెజారిటీ తెలుగుదేశం నేతలు అభిప్రాయపడినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ ముగిసినందున బహిష్కరించినా పోటీలో ఉన్న కారణంగా ఎన్నికలైతే జరుగుతాయి. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఎదురైన పరాజయాల నేపధ్యంలో తమకు అంతకు మించి భిన్నమైన ఫలితాలు రావన్నది తెలుగుదేశం అభిప్రాయం అన్నది స్పష్టం.
ఇక ఎన్నికల కమిషనరు విషయానికి వస్తే గతేడాది నామినేషన్ల సమయంలో అధికారపార్టీ ప్రత్యర్ధుల మీద దాడి చేసి నామినేషన్లు వేయనివ్వకుండా బలవంతపు ఏకగ్రీవాలు చేయించిందనే ఆరోపణలు, విమర్శల మీద ఏం చేస్తారన్నది చూడాల్సి ఉంది. గత ఎన్నికల కమిషనరు కొందరు పోలీసు, జిల్లా కలెక్టర్ల మీద చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేశారు. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఖాతరు చేయలేదు. ఒక వేళ గత కమిషనరు నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటే నూతన కమిషనరు విమర్శల పాలవుతారు, చర్యలకు ఉపక్రమిస్తే మరోమారు ప్రభుత్వంతో కయ్యం పెట్టుకోవాల్సి వస్తుంది. కేంద్రానికి గత కమిషనరు రాసిన లేఖలో తన రక్షణ విషయాలతో పాటు ఎన్నికల్లో అక్రమాల గురించిన ప్రస్తావన కూడా ఉన్నందున ఆ లేఖను వెనక్కు తీసుకుంటారా లేదా అన్నది ప్రశ్న.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...
← Older posts

Recent Posts

  • మనవాళ్లు వట్టి వెధవాయి లోయి అన్న గిరీశాన్ని గుర్తుకు తెస్తున్న వాట్సాప్‌ పండితులు !
  • బిజెపి మిత్రోం అదానీ, బికినీలను కాదు సామాన్య జనాన్ని చూడండి !
  • వైవిధ్య సమస్యలతో ప్రపంచ వ్యవసాయ రంగం !
  • రష్యా – జర్మనీలను శాశ్వత శత్రు దేశాలుగా మార్చే అమెరికా కుటిల పన్నాగం !
  • అక్రమం జరిగిందా లేదా విచారణకు ఆదేశిస్తారా లేదా : అదానీ కంపెనీలపై నోరు విప్పని ప్రధాని నరేంద్రమోడీ !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • మనవాళ్లు వట్టి వెధవాయి లోయి అన్న గిరీశాన్ని గుర్తుకు తెస్తున్న వాట్సాప్‌ పండితులు !
  • బిజెపి మిత్రోం అదానీ, బికినీలను కాదు సామాన్య జనాన్ని చూడండి !
  • వైవిధ్య సమస్యలతో ప్రపంచ వ్యవసాయ రంగం !
  • రష్యా – జర్మనీలను శాశ్వత శత్రు దేశాలుగా మార్చే అమెరికా కుటిల పన్నాగం !
  • అక్రమం జరిగిందా లేదా విచారణకు ఆదేశిస్తారా లేదా : అదానీ కంపెనీలపై నోరు విప్పని ప్రధాని నరేంద్రమోడీ !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • మనవాళ్లు వట్టి వెధవాయి లోయి అన్న గిరీశాన్ని గుర్తుకు తెస్తున్న వాట్సాప్‌ పండితులు !
  • బిజెపి మిత్రోం అదానీ, బికినీలను కాదు సామాన్య జనాన్ని చూడండి !
  • వైవిధ్య సమస్యలతో ప్రపంచ వ్యవసాయ రంగం !
  • రష్యా – జర్మనీలను శాశ్వత శత్రు దేశాలుగా మార్చే అమెరికా కుటిల పన్నాగం !
  • అక్రమం జరిగిందా లేదా విచారణకు ఆదేశిస్తారా లేదా : అదానీ కంపెనీలపై నోరు విప్పని ప్రధాని నరేంద్రమోడీ !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Follow Following
    • vedika
    • Join 234 other followers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Customize
    • Follow Following
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d bloggers like this: