• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: USA

ప్రపంచాన్ని భయపెడుతున్న మంకీపాక్స్‌ వెనుక అమెరికా హస్తం ఉందా ?

22 Sunday May 2022

Posted by raomk in Uncategorized, Current Affairs, Science, Health, Opinion, History, INTERNATIONAL NEWS, USA, UK

≈ Leave a comment

Tags

BILL GATES, Monkeypox, Monkeypox Conspiracy Theory, Monkeypox goes global, Monkeypox Vaccines, Smallpox


ఎం కోటేశ్వరరావు


ఒకనాడు కేవలం ఆఫ్రికా ఖండానికే పరిమితం అనుకున్న మంకీపాక్స్‌ వైరస్‌ ఇప్పుడు ప్రపంచాన్ని ఆవరించనుందా ? కరోనా మాదిరి మహమ్మారిగా మారనుందా ? నివృత్తి జరిగేంతవరకు అనేక అనుమానాలు, సందేహాలు వెలువడుతూనే ఉంటాయి. తెలుగు నాట మసూచి, పెద్ద అమ్మోరు, స్ఫోటకంగా పిలిచిన వైరస్‌కు ఇది సోదరి. ప్రస్తుతానికి అలాంటి తీవ్ర హెచ్చరికలు వెలువడలేదుగానీ కరోనా నేపధ్యంలో అనేక వార్తలు భయపెడుతున్నాయి. ఇది పాక్స్‌ జాతికి చెందిన వైరస్‌గా కోతుల్లో గుర్తించినందుకు దానికి మంకీపాక్స్‌ అని పేరు పెట్టారు. ఇది మసూచికి సంబంధించిందైనప్పటికీ అంతటి ప్రమాదకారి కాదని కొందరు అంటున్నా ,అప్పుడే నిర్దారించలేమని మరికొందరు హెచ్చరిస్తున్నారు.వరియోలా మేజర్‌, వరియోలా మైనర్‌గా పిలిచిన వైరస్‌లు మసూచి కారకాలు, ఇది గతశతాబ్దిలో 30 కోట్ల మందిని, అంతకు ముందు మరో ఇరవై కోట్ల మందిని బలితీసుకుందని అంచనా.పదహారవ శతాబ్దిలో బ్రిటన్‌లో దీన్ని స్మాల్‌పాక్స్‌ అని పిలిచారు.1980లో ప్రపంచంలో పూర్తిగా నిర్మూలించినట్లు ప్రకటించి ఈ వైరస్‌ ఇప్పుడు అమెరికా, రష్యాల్లోని రెండు పరిశోధనా సంస్ధలలో మాత్రమే ఉంది.


ఐరోపా, ఉత్తర అమెరికా, ఆసియా ఖండాల్లోని 14 దేశాల్లో మే నెల మూడవ వారం వరకు 120 నిర్దారణ లేదా అనుమానాస్పద కేసులు నమోదైనాయి. ఒక ప్రాంతంలోని జనాభాతో మరొక ప్రాంత జనాభాకు సంబంధలేనప్పటికీ ఇన్ని చోట్ల వ్యాప్తి చెందటం ఆసక్తి కలిగిస్తున్నదని ఆఫ్రికాలోని కాంగోలో పదేండ్ల క్రితం ఈ వైరస్‌ మీద పరిశోధన చేసిన అమెరికా శాస్త్రవేత్త అనే రిమోయిన్‌ చెప్పారు. ఇది మసూచి సంబంధిత వైరస్‌ కనుక కరోనా మాదిరి వ్యాప్తి చెందదని మరోశాస్త్రవేత్త జే హూపర్‌ అన్నారు. ఇది సోకిన వ్యక్తులు దగ్గినపుడు అతి సమీపంలోని వారికి మాత్రమే సోకే అవకాశం ఉందన్నారు. ఇది సోకిన వారు ఎలాంటి చికిత్సలేకుండానే కొన్ని వారాల తరువాత ఎక్కువ మంది కోలుకుంటారని కూడా హూపర్‌ అంటున్నారు. ఇది ప్రాధమిక దశలో ఉన్నందున ఇప్పటికిప్పుడే నిర్ధారణగా దేన్నీ చెప్పలేమని మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉందని మరో వైరాలజిస్టు గుస్తావ్‌ పాలాసియో చెప్పారు. ఆఫ్రికా దేశాల్లో ఇది కనిపించినప్పటికీ ఐరోపా, అమెరికాల్లో వ్యాప్తి చెందటానికి ఉన్న సంబంధం ఇంకా తెలియలేదు.ప్రస్తుతానికి మన దేశంలో ఈ వైరస్‌ దాఖల్లాలేవు. సోకిన దేశాల నుంచి వచ్చిన వారి మీద నిఘావేసి, లక్షణాలున్నవారి నుంచి రక్త నమూనాలను సేకరించాలని ఆదేశించారు.స్త్రీ-పురుషుల సంపర్కం ద్వారా మంకీపాక్స్‌ వ్యాపించదని భావించిన ఈ వైరస్‌ ఇప్పుడు ఆ అభిప్రాయాన్ని మార్చుకొనేట్లు చేసింది. బ్రిటన్‌లో వెలువడిన కేసులలో ఎక్కువ మంది స్వలింగ, ద్విలింగ సంపర్క పురుషుల్లో కనిపించింది.


సంబంధం లేని దేశాల జనాభాలో ఇది కనిపించటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. మసూచి(స్మాల్‌పాక్స్‌)ను పూర్తిగా నిర్మూలించినందున దాని సోదరి మంకీపాక్స్‌ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఇంతకాలంగా భావిస్తున్నారు. బలహీనం, రోగనిరోధకశక్తి తక్కువగా ఉండేవారిలో మంకీపాక్స్‌ సోకవచ్చని భావిస్తున్నారు.కాంగోలో కనిపించిన తరువాత 39 ఏండ్లకు 2017 నుంచి నైజీరియాలో రెండువందల నిర్ధారిత, ఐదు వందల అనుమానాస్పద కేసులు నమోదయ్యాయి. 2003లో ఘనా నుంచి దిగుమతి చేసుకున్న ఎలుకల నుంచి అమెరికాలోని ఇల్లినాయిస్‌ కుక్కలకు తరువాత 70 మంది మనుషులకు సోకింది. తాజాగా వివిధ దేశాల్లో కనపడిన కేసుల వెనుక బిల్‌గేట్స్‌ హస్తం ఉందంటూ కొన్ని కుట్ర సిద్దాంతాలు ఇప్పుడు చక్కర్లు కొడుతున్నాయి. వాక్సిన్ల తయారీలో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెడుతున్న బిల్‌గేట్స్‌ వాటిని అమ్ముకొనేందుకు వైరస్‌లను కూడా సృష్టిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఏడాది క్రితం ఒక సభలో మాట్లాడిన బిల్‌గేట్స్‌ త్వరలో మరో పెద్ద మహమ్మారిని ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలని, దీని కోసం ప్రపంచ ఆరోగ్య సంస్ద కొత్త సంస్దను ఏర్పాటు చేయాలని, జీవాయుధాలుగా వైరస్‌లను ఉగ్రవాదులు వినియోగించవచ్చని హెచ్చరించాడు. ఆ మాటలకు ఇప్పుడు జరుగుతున్న వాటికి సంబంధం కలిపి వార్తలు వెలువడుతున్నాయి. అంతకు ముందు కూడా గేట్స్‌ ఇలాగే మాట్లాడిన ఉదంతాలున్నాయి. గతవారంలో పెద్ద మొత్తంలో మంకీపాక్స్‌ వాక్సిన్ను అమెరికా కొనుగోలు చేయటం వాటికి ఊతమిస్తున్నాయి.


బ్రిటన్‌లో తొలికేసు నైజీరియా వెళ్లి వచ్చిన పురుషుడిది కాగా తరువాత వారికి ఎలాంటి ప్రయాణ చరిత్ర లేదు. అమెరికాలోని మసాచుసెట్స్‌లో ఒకరికి నిర్దారణైంది. అతను ఇటీవలే కెనడా వెళ్లి వచ్చినట్లు తేలింది. దాంతో 119మిలియన్‌ డాలర్ల విలువగల మంకీపాక్స్‌ వాక్సిన్లు సరఫరా చేయాలని అమెరికా సర్కార్‌ కోరిందని బవేరియన్‌ నోర్డిక్‌ కంపెనీ ప్రకటించింది. అంతకు ముందే ఇచ్చిన ఆర్డర్‌తో కలిపితే 299 మిలియన్‌ డాలర్లని, కోటీ30లక్షల డోసులమేర కొనుగోలు చేసినట్లు వార్తలు వచ్చాయి. వీటిని 2024,25లో సరఫరా చేస్తారు. మంకీపాక్స్‌ సోకినవారిలో నూటికి పది మంది మరణించినట్లు గత సమాచారం వెల్లడిస్తున్నది.
మంకీపాక్స్‌ను పరిశోధనకు తెచ్చిన కోతుల్లో 1958లో కనిపించింది.మానవుల్లో తొలికేసు 1970లో నమోదైంది. ఇది వివిధ పద్దతుల్లో , రకరకాలుగా సోకే అవకాశం ఉంది. వైరస్‌ ఉన్న జంతువు మనిషిని కరచినా, దాని రక్తం, స్రవించిన ద్రవాలను ముట్టుకున్నా, ఈకలను తాకినా రావచ్చు. ఎలుకలు, ఉడుతలు, వైరస్‌ సోకిన జంతుమాంసాన్ని సరిగా ఉడికించకుండా తిన్నా ఈ వైరస్‌ సోకుతుంది. సంభోగం ద్వారా కూడ సంక్రమించవచ్చు. మనుషుల్లో జ్వరం, కండరాల నొప్పి,దద్దుర్లు, గాయాలుకావటం, చలి వంటి లక్షణాలుంటాయి. సాధారణంగా వైరస్‌ సోకిన తరువాత ఐదు నుంచి 21 రోజుల్లో లక్షణాలు కనిపించవచ్చు.


2003 అక్టోబరు 29న న్యూసైంటిస్టు డాట్‌కామ్‌లో డెబోరా మెకంజీ అనే విశ్లేషకుడు ” అమెరికా వృద్ధి చేసిన ప్రాణాంతక వైరస్‌లు ” అనే పేరుతో రాశారు. అమెరికా ప్రభుత్వ నిధులతో పరిశోధనలు చేసిన ఒక శాస్త్రవేత్త మసూచి వైరస్‌ నుంచి జన్యుమార్పిడితో ప్రమాదకర మౌస్‌పాక్స్‌ను తయారు చేసినట్లు పేర్కొన్నారు.యాంటీ వైరల్‌ వాక్సిన్లు ఇచ్చినప్పటికీ ఇది సోకిన ఎలుకలు మరణించాయి. తరువాత కౌపాక్స్‌(ఆవు) వైరస్‌ను కూడా రూపొందించారు. ఇలా రూపొందించిన వాటిని ప్రమాదకారులుగా మార్చేందుకు కూడా వీలుంది. మానవుల్లో కూడా వైరస్‌ను ప్రవేశపెట్టేవిధంగా మార్చ వచ్చని 2003నాటి ఆర్టికల్‌లో హెచ్చరించారు. లాభాల కోసం ఎంతకైనా తెగించే అమెరికన్లు దేనికైనా పాల్పడతారని చరిత్ర రుజువు చేసింది.


ఐరోపాలో స్మాల్‌పాక్స్‌, మంకీపాక్స్‌, కౌపాక్స్‌ చికిత్సకు ” టెకోవిరిమాట్‌” అనే ఔషధాన్ని అనుమతించారు.దాన్ని టిపాక్స్‌ పేరుతో విక్రయిస్తున్నారు. అమెరికాలో స్మాల్‌పాక్స్‌కు మాత్రమే అనుమతించారు.తాజాగా వ్యాపిస్తున్న మంకీపాక్స్‌ పాతదేనా కొత్త రకమా అన్నది ఇంకా నిర్దారణ కాలేదు. అనేక దేశాల్లో కనిపించిన తీరును చూస్తే వేగంగా వ్యాపించే అవకాశం ఉందని చెబుతున్నారు. దీని అర్ధం కరోనా మాదిరి వేగంగా విస్తరిస్తుందని కాదని కూడా అంటున్నారు.


మంకీపాక్స్‌ మరోరూపంలో వచ్చిన మసూచికం అని కొందరు చెబుతున్నారు.1999లో పరిశోధనా సంస్దల్లో ఉన్న మసూచి వైరన్‌సు నాశనం చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్ధ సూచించింది. ప్రస్తుతం ఆ సంస్ద వద్ద ఐదులక్షల డోసుల వాక్సిన్‌ ఉండగా ఇతర దేశాల్లో 60నుంచి 70 మిలియన్ల డోసులు ఉందని, అనేక నిల్వలు సక్రమంగా లేవని చెబుతున్నారు. అమెరికాలో 50 నుంచి వంద లక్షల మందికి వేసేందుకు సరిపడా ఉందని అంచనా.1980నాటికి వరియోలా వైరస్‌ 76 పరిశోధనా సంస్ధల్లో ఉంది. వైరస్‌ను నాశనం చేయాలన్న సూచన మేరకు తమ 74 కేంద్రాలు నాశనం చేయటం లేదా తమ వద్ద ఉన్న నిల్వలను ప్రపంచ ఆరోగ్య సంస్ధకు అంద చేశాయి. అమెరికాలోని అట్లాంటాలో సిడిసి, రష్యాలోని కోల్ట్‌సోవో వైరాలజీ సంస్ధలో మాత్రమే ఉంది. కొందరి అనుమానం ప్రకారం ప్రపంచ ఆరోగ్య సంస్ధకు తెలియ కుండా కొన్ని చోట్ల దాచారని, జీవాయుధంగా వాడేందుకుగాను కొత్త వైరస్‌ సృష్టికోసమే ఇలా చేశారనే ఆరోపణలున్నాయి గాని, నిర్ధారణ కాలేదు.


. ప్రపంచంలో వైరస్‌తో జీవాయుధాలను తయారు చేసి యుద్దాలలో వినియోగించే అంశాల గురించి కొందరు నిపుణులు వెలిబుచ్చిన అభిప్రాయాలను, అనేక అంశాలను పేర్కొంటూ చైనా మిలిటరీ వైద్యుడు గ్జు డెహౌంగ్‌ 2015లో ఒక పుస్తకాన్ని ప్రచురించారు. అదేమీ రహస్యం కాదు, అమెజాన్‌ ద్వారా ప్రపంచమంతా కొనుగోలు చేసింది. చైనాలో 2002,04 సంవత్సరాలలో బయటపడిన సార్స్‌ మహమ్మారి విదేశాల నుంచి అసహజ పద్దతిలో జన్యుమార్పిడి జరిగి వచ్చిన వైరస్‌ (ఇది కూడా కరోనా వైరస్‌ రకాలలో ఒకటి) అని చైనా పుస్తకంలో అభిప్రాయపడ్డారు. చైనాకు వ్యతిరేకంగా విదేశాల్లో ఉగ్రవాదుల జీవ ఆయుధాల తయారీని కూడా కాదనలేమని సంపాదకుడు గ్జు పేర్కొన్నారు. ప్రపంచంలో జీవ ఆయుధాల ప్రయోగాలు, యుద్దంలో వాటి వినియోగం గురించి కూడా దానిలో చర్చించారు. 1941లోనే అమెరికా జీవ ఆయుధాల పరిశోధన ప్రారంభించిందని, తరువాత వాటి తయారీకి ఫ్యాక్టరీలను ఏర్పాటు చేసిందని, 1940-45 సంవత్సరాల మధ్య జపాన్‌ జీవ ఆయుధాలను ఉపయోగించి తూర్పు చైనాలోని ఝెజియాంగ్‌, హునాన్‌ రాష్ట్రంలో ప్రయోగించి ప్లేగు వ్యాధి వ్యాపింప చేసిందని కూడా రచయిత దానిలో పేర్కొన్నారు.


బిల్‌ మరియు మెలిందా గేట్స్‌ ఫౌండేషన్‌ సారధి, మైక్రోసాఫ్ట్‌కు మారు పేరు అయిన బిల్‌ గేట్స్‌ చావులను కూడా సొమ్ము చేసుకొనేందుకు పూనుకున్నాడు. కరోనా వాక్సిన్‌ తయారీ వివరాలను భారత్‌కు మరొక దేశానికి ఇవ్వకూడదని ఆ పెద్దమనిషి చెప్పిన సంగతిని మరచిపోలేము. భద్రతా కారణాల రీత్యా ఇవ్వటం కుదరదన్నాడు. ఒకవేళ ఎక్కడైనా అలా ఇస్తే అది తమ సాయం మరియు నైపుణ్యం ఫలితమే అన్నాడు. 2015లో బిల్‌ గేట్స్‌ టెడ్‌ టాక్‌ అనే కార్యక్రమంలో మాట్లాడుతూ రానున్న దశాబ్దంలో ఒక పెద్ద మహమ్మారి రానున్నదని, అది ఐదు కోట్ల మందిని బలితీసుకున్న 1918నాటి మహమ్మారి మాదిరి ఉంటుందని, ఆరునెలల్లో మూడు కోట్ల మందిని చంపి వేస్తుందని చెప్పాడు. దాన్ని యుద్దం మాదిరి ఎదుర్కొనేందుకు ప్రపంచం తీవ్ర ప్రయత్నాలు చేయాలన్నాడు. బిల్‌ గేట్స్‌ మాటలను బట్టి గేట్స్‌ అప్పటికే మైక్రోచిప్‌ ద్వారా నియంత్రించే ఒక మహమ్మారి వైరస్‌ను ప్రయోగశాలలో రూపొందించి ఉన్నారని కొంత మంది అప్పుడే చెప్పారు. అవి బుద్దిలేని మాటలని తమ ఫౌండేషన్‌ ద్వారా వాక్సిన్లను కొనుగోలు చేస్తున్నామని అందువలన మహమ్మారుల ప్రమాదం గురించి హెచ్చరించేందుకే తాను చెప్పానన్నాడు.నియంత్రణలతో సురక్షితమైన వాక్సిన్లను తయారు చేయాలి గనుక భారత్‌ వంటి అభివద్ది చెందుతున్న దేశాలకు తయారీ విధానం గురించి చెప్పకూడదని ఒక ఇంటర్వ్యూలో బిల్‌గేట్స్‌ చెప్పాడు.


ప్రపంచంలోని 25 దేశాలలో అమెరికన్లు బయో ప్రయోగశాలలను ఏర్పాటు చేశారు. మధ్య ప్రాచ్యం, ఆఫ్రికా, ఆగేయ ఆసియా, మాజీ సోవియట్‌ రిపబ్లికులలో అవి ఉన్నాయి. ఒక్క ఉక్రెయిన్‌లోనే 16 ఉన్నాయంటే అమెరికా కుట్రలను అర్ధం చేసుకోవచ్చు. అమెరికాలోని మేరీలాండ్‌లోని ఫ్రెడరిక్‌ అనే ప్రాంతంలో ఫోర్డ్‌ డెట్రిక్‌ ప్రయోగశాలలో ఎబోలా వంటి వ్యాధుల కారకాల గురించి పరిశోధనలు చేశారు. దాని మీద వార్తలు రావటంతో 2019లో మూసివేశారు. గత రెండు దశాబ్దాలలో ఇంటా బయటా ఉన్న అమెరికన్‌ ప్రయోగశాలలో అనేక వందల ఉదంతాలలో ప్రమాదాలు జరిగి ప్రమాదకరమైన వైరస్‌, బాక్టీరియాలు బయటపడినట్లు యుఎస్‌ఏ టుడే పేర్కొన్నది అమెరికాలో ఇలాంటి సమస్యలున్న కారణంగా ఇతర దేశాలలో అసలు విషయాలను దాచి పరిశోధనలు నిర్వహిస్తున్నారు.


మానవ కల్యాణం కోసం ఒక ప్రమాదకర వైరస్‌ను హతమార్చేందుకు మరొక వైరస్‌ను రూపొందించేందుకు ప్రతి దేశానికీ అవకాశం, హక్కు ఉంది. అయితే ఆ ముసుగులో ఆయుధాలు తయారు చేసే దేశాలు మిగతా వాటి మీద బురద జల్లుతున్నాయి. చరిత్రను తిరగేస్తే క్రీస్తు పూర్వం ఆరువందల సంవత్సరంలో క్రిసాను ముట్టడి సమయంలో రాజు సోలోన్‌ కటుక రోహిణీ అనే పుష్పాల నుంచి తీసిన రసాన్ని ప్రయోగించి విరేచనాలు, ఇతర వ్యాధులు కలిగించినట్టు చరిత్రలో ఉంది. 1155లో రాజు బార్బోసా ఇటలీలోని టోరోంటానాలోని మంచి నీటి బావుల్లో శవాలను పడవేసి కలుషితం కావించాడు. 1495లో ఫ్రెంచి సైనికులను హతమార్చేందుకు స్పెయిన్‌ రాజులు ఇటలీలోని నేపుల్స్‌లో కుష్టువ్యాధి గ్రస్తుల రక్తం కలిపిన వైన్‌ సరఫరా అయ్యేట్టు చూశారు.1675లో విషంతో కూడిన బుల్లెట్లను వినియోగించరాదని జర్మనీ-ఫ్రెంచి సైన్యం అంగీకారానికి వచ్చాయి. 1710లో రష్యన్‌ చక్రవర్తి ప్లేగుతో మరణించిన శవాలను ఫిరంగులకు కట్టి స్వీడన్‌ పట్టణాలలో పడవేయించాడు. 1763లో అమెరికాలోని గిరిజనులను దెబ్బతీసేందుకు బ్రిటిష్‌ పాలకులు మసూచి వ్యాధిగ్రస్తులు వాడిన దుప్పట్లు పంపిణీ చేశారు.పర్యవసానంగా దాదాపు రెండువందల సంవత్సరాల పాటు అమెరికాలో మసూచి వ్యాప్తి చెందింది. నెపోలియన్‌ చక్రవర్తి 1797లో ఇటలీలోని మంటువాలో మలేరియా వ్యాధి వ్యాపింప చేసేందుకు మైదానాలను వరదలతో నింపించాడు. అంతర్యుద్ధ సమయంలో1863లో అమెరికాలోని బానిస వ్యవస్థను కోరుకొన్న తిరుగుబాటు రాష్ట్రాలు యూనియన్‌ సైనికులకు ఎల్లోఫీవర్‌, అమ్మోరు సోకిన రోగులు వాడిన వస్త్రాలను విక్రయించేట్టు చూశాయి.


1346లో జెనోయీస్‌-తార్తార్ల మధ్య నేటి ఉక్రెయిన్‌లో ఆధిపత్య పోరు సమయంలో ప్లేగు వ్యాధి వ్యాపించింది. ఓటమి దశలో ఉన్న తార్తార్లు ప్లేగువ్యాధి సోకిన, మరణించిన తమ వారిని ఫిరంగులకు కట్టి శత్రు ప్రాంతాల మీద పడేశారు. దాంతో జెనోయీస్‌ దళాలు వెనక్కు తగ్గాయి. ఈ పరిణామం గురించి గాబ్రియల్‌ డే ముసిస్‌ నమోదు చేశాడు. వెనక్కు తగ్గిన జెనోయీస్‌(ఇటాలియన్లు)లు తమతో పాటు ప్లేగు వ్యాధి కూడా తీసుకు వెళ్లారు. ప్లేగు వ్యాధిగ్రస్తులు, బహుశా దానిని వ్యాపింప చేసే ఎలుకలను కూడా తమ నౌకల్లో తీసుకుపోయి ఉంటారని పేర్కొన్నాడు. ఆ తరువాత అది ఐరోపా, ఆఫ్రికా, ఆసియాలో మన దేశంతో సహా అనేక దేశాలకు వ్యాపించింది. రెండున్నర కోట్ల మంది ఐరోపాలో దానికి బలయ్యారు. హైదరాబాదు సంస్థానంలో ప్లేగు వ్యాధి పదే పదే వస్తుండటంతో దాన్ని నివారించేందుకు 1591లో చార్మినార్‌ను నాటి నిజాం రాజు కట్టించిన విషయం తెలిసిందే.


మొదటి ప్రపంచ యుద్ధంలో గుర్రాలకు సెంబరోగం (చీమిడి కారటం) వచ్చే ఆంత్రాక్స్‌ పౌడర్‌ను జర్మనీ, ఫ్రెంచి గూఢచారులు ప్రయోగించారు. రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్‌ సైన్యాలు రష్యా, ఇతర అనేక దేశాలలో ప్లేగ్‌, అంతరాక్స్‌ వంటి వ్యాధులను వ్యాపింపచేసేందుకు ప్రయత్నించారు. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత 22సంవత్సరాలకు 179 దేశాలు జీవ ఆయుధాల నియంత్రణకు ఒప్పందంపై సంతకం చేశాయి. ఎట్టి పరిస్ధితుల్లోనూ వాటి తయారీ, సేకరణ, నిల్వ, వినియోగించబోమని ఆ దేశాలు అంగీకారం తెలిపాయి. అయితే వైద్య అవసరాలకు కొన్ని మినహాయింపులు ఇచ్చారు. ఇప్పుడు జీవ ఆయుధాలు తయారు చేస్తున్నవారు కూడా ఆ ముసుగుతోనే చేస్తున్నట్టు అనుమానాలు ఉన్నాయి. రసాయనిక, జీవ ఆయుధాలకు పెద్ద తేడా ఉండదు. ఉదాహరణకు వియత్నాంను ఆక్రమించుకొనేందుకు అమెరికా జరిపిన దాడుల సమయంలో కలుపు మొక్కలను నాశనం చేసే పేరుతో ఆరెంజ్‌ ఏజంట్‌ అనే రసాయనాన్ని పెద్ద ఎత్తున వియత్నాంలో చల్లారు. యాభై సంవత్సరాలు గడిచిన తరువాత కూడా అనేక చోట్ల కలుపు మొక్కలే కాదు అసలు ఏ మొక్కా బతకని పరిస్థితులు ఉన్నాయి. ఆ ప్రాంతాలలో పుట్టుకతో పిల్లల్లో లోపాలు, కాన్సర్‌, మధుమేహం వంటి వ్యాధులకు అమెరికా చిమ్మిన విషం కారణమని తేలింది.


మొదటి ప్రపంచ యుద్దం మీద విచారణ జరిపిన నానాజాతి సమితి కమిటీ జీవ ఆయుధాలను ఉపయోగించలేదు గానీ జర్మన్లు రసాయనిక ఆయుధాలు వాడినట్లు పేర్కొన్నది. రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్‌ సామ్రాజ్యవాదులు ఆపరేషన్‌ చెర్రీ బ్లూసమ్స్‌ పేరుతో జీవ ఆయుధాలతో అమెరికా సహా అనేక దేశాల మీద దాడి చేయాలనే పథక రచన చేశారు. తన ఆక్రమణలోని చైనాలోని హార్బిన్‌, కొరియా, మంచూరియా ప్రాంతంలో దాడి చేశారు. దానిలో కలరా, ప్లేగు, అంతరాక్స్‌, మసూచి వంటి ప్రమాదకర క్రిముల్ని వాడారు. 2002లో ఒక అంతర్జాతీయ సమావేశంలో జపాన్‌ మిలిటరీ జరిపిన బాక్టీరియా బాంబు దాడుల్లో మరణించిన వారు ఐదు లక్షల ఎనభైవేల మంది ఉన్నట్టు వక్తలు వెల్లడించారు. ఒక్క చైనాలోనే ప్లేగు, కలరా, ఆంత్రాక్స్‌ వంటి వాటితో నాలుగు లక్షలమంది మరణించారని అంచనా.


జపాన్‌ జీవ ఆయుధాల తయారీకి 150 భవనాలను, ఐదు శివారు ప్రాంతాలను ఉపయోగించి మూడువేల మంది శాస్త్రవేత్తలతో పని చేయించారు. వాటి తయారీ సమయంలో కనీసం పదివేల మంది ఖైదీలపై వాటిని ప్రయోగించగా మరణించినట్టు తేలింది. వారిలో మూడువేల మంది కొరియా, చైనా, సోవియట్‌, మంగోలియా, అమెరికన్‌, బ్రిటిష్‌, ఆస్ట్రేలియన్‌ యుద్ద ఖైదీలు ఉన్నట్టు బయట పడింది. జపాన్‌ జీవ ఆయుధాల విషయం బయటపడిన తరువాత అమెరికా పెద్ద ఎత్తున 1942నుంచి వాటిని రూపొందించేందుకు పూనుకుంది. తాను పెద్ద ఎత్తున జీవ ఆయుధాలను తయారు చేసినట్టుగానే ఇతరులు కూడా తయారు చేసి తమ మీద ప్రయోగిస్తారని అమెరికా భయపడుతోంది. దీనిలో భాగంగానే అనేక కుట్ర సిద్దాంతాలను అమెరికన్లు ప్రచారంలో పెట్టారు.ఏమైనా గత చరిత్రను బట్టి మంకీపాక్సు గురించి అమెరికా, పైన పేర్కొన్న ఇతర దేశాల గురించి వెలువడిన ప్రతి సమాచారాన్ని అనుమానంతో చూడాల్సిందే. తమ దేశాల్లో ఎందుకు విస్తరిస్తున్నదో అవి ప్రపంచానికి చెప్పాల్సి ఉంది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

ఇండోనేషియా కమ్యూనిస్టు ఊచకోత వెనుక బ్రిటన్‌ !

18 Wednesday May 2022

Posted by raomk in CHINA, History, imperialism, INTERNATIONAL NEWS, Opinion, UK, Uncategorized, USA

≈ Leave a comment

Tags

Britain IRD, fake news, Indonesian Communist Party (PKI)., Propaganda War, UK black propaganda


ఎం కోటేశ్వరరావు


భారీ ఆయుధాలు కావాలని ఉక్రెయిన్‌ కోరుకుంటున్నదనటం పశ్చిమ దేశాల ప్రచారంలో భాగమని ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు నోమ్‌ చోమ్‌ స్కీ చెప్పారు. ఉక్రెయిన్‌ నేత జెలెనెస్కీ పదే పదే రాజకీయ పరిష్కారం కావాలని చెప్పటం, నాటో సభ్యత్వ కోరికను వదులుకుంటామని, తటస్ధంగా ఉంటామని చెప్పిన అంశాలు అమెరికా-బ్రిటన్‌ ప్రచార వ్యవస్ధ నుంచి మనకు ఎక్కడా వినిపించవు అని చోమ్‌ స్కీ అన్నారు. ఉక్రెయిన్‌-రష్యా వివాదాన్ని పరిష్కరించేందుకు తోడ్పడే విధంగా పశ్చిమ దేశాల నుంచి ఎలాంటి ప్రోత్సాహం లేదా ప్రతిపాదనలు గానీ లేవు. దానికి బదులు తమ దగ్గర ఉన్న ఆధునిక ఆయుధాలను అందించి సొమ్ము చేసుకోవాలనే దుష్ట ఆలోచనను కనపడకుండా చేసేందుకు రష్యా గురించి అనేక తప్పుడు ప్రచారాలను వ్యాపింప చేస్తున్న అంశం తెలిసిందే.
అమెరికా, బ్రిటన్‌ వంటి దేశాలు భౌతికదాడుల్లో పాల్గొనటమే కాదు, వాటితో పాటు తప్పుడు ప్రచారదాడులు కూడా పెద్ద ఎత్తున చేస్తున్నాయి. అందుకోసం భారీ ఖర్చు, నిపుణులతో కూడిన ప్రత్యేక విభాగాలను కూడా ఏర్పాటు చేస్తాయి. వీటిని ఆదర్శంగా తీసుకొని అదే తరహాలో మన దేశంలో అనేక సంస్ధలు ప్రత్యేకించి- సంఘపరివార్‌ ఏర్పాటు చేసిన వివిధ సంస్ధలు, పలు ముస్లిం సంస్ధలకు చెందిన వారు పరస్పరం రెచ్చగొట్టేందుకు వాట్సాప్‌, ఇతర సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారాలు సాగిస్తున్నారనే విమర్శలు ఉన్న సంగతి తెలిసిందే. మెజారిటీ, మైనారిటీ మతోన్మాద ప్రచారం అనేక మంది మెదళ్లను విద్వేషానికి, భౌతికదాడులకు అనువైనదిగా మారుస్తున్నది.


కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా ముస్లింలను సమీకరించటం, కమ్యూనిజం, పూర్వపు సోవియట్‌కు వ్యతిరేకంగా రెచ్చగొట్టేందుకు, చైనా-సోవియట్‌ మధ్య విబేధాలను పెంచటంతో సహా పలు ఎత్తుగడలతో బ్రిటన్‌ విదేశాంగశాఖ ఏర్పాటు చేసిన ఇన్ఫర్మేషన్‌ రిసర్చ్‌ డిపార్ట్‌మెంట్‌(ఐఆర్‌డి) విభాగం సాగించిన దుర్మార్గాలకు సంబంధించిన పత్రాలను ఇటీవల బహిర్గతం చేశారు. వాటి నుంచి పరిశోధకులు తవ్వినకొద్దీ అనేక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి, గతవారంలో కొన్నింటిని విశ్లేషకులు వెల్లడించారు. 1960దశకంలో ఇండోనేషియాలో లక్షలాది మంది కమ్యూనిస్టులు, సానుభూతి పరులను ఊచకోత కోసేందుకు అక్కడి ముస్లిం మతోన్మాదులను రెచ్చగొట్టటంలో బ్రిటన్‌ ఐఆర్‌డి ప్రచార అంశాలు ప్రధానంగా దోహదం చేసినట్లు తేలింది. అధ్యక్షుడు సుకర్ణో, విదేశాంగ మంత్రి సుబాంద్రియో కమ్యూనిస్టుల పట్ల సానుకూలంగా ఉండటంతో పాటు బ్రిటీష్‌ వారు రూపొందించిన మలేషియా ఫెడరేషన్‌ ప్రతిపాదనను తిరస్కరించారు. వారిని కొనసాగనిస్తే ఇండోనేషియా కూడా సోషలిస్టు దేశంగా మారుతుందనే అంచనాతో అమెరికా, బ్రిటన్‌ కుట్ర చేసి తిరుగుబాటుకు మిలిటరీని ప్రోత్సహించాయి. దాన్ని సమర్ధించుకొనేందుకు అనువుగా తప్పుడు ప్రచారం సాగించాయి. సుకర్నో, సుబాంద్రియోలను, చైనా జాతీయులను బతకనిస్తే కమ్యూనిస్టు చైనా ఏ క్షణంలోనైనా ఇండోనేషియాను ఆక్రమిస్తుందని, మిలిటరీతో పాటు దేశంలోని కమ్యూనిస్టు వ్యతిరేకులను, మతశక్తులను రెచ్చగొట్టేందుకు వందలాది కరపత్రాలను పంపిణీ చేశారు.


సిఐఏ, బ్రిటీష్‌ ఎం16 ఏజంట్లు రూపొందించిన కుట్రలో భాగంగా ఆరుగురు మిలిటరీ అధికారులను కిడ్నాప్‌ చేసి వారిని హత్యగావించి ఆ పని చేసింది కమ్యూనిస్టులే అని ప్రచారం చేసి దాడులకు రంగాన్ని సిద్దం చేశారు. కమ్యూనిస్టుల మీద చర్యలు తీసుకుంటే అమాయక చైనీయులు కొందరు ఇబ్బందిపడినప్పటికీ, వారే కారకులని గుర్తించినందున అంతం చేయకతప్పదని రేడియో ప్రసారాలు, ఆ కరపత్రాల్లో రెచ్చగొట్టారు.ప్రవాసంలో ఉన్న జాతీయవాదులైన ఇండోనేషియన్ల పేరుతో సింగపూర్‌లో తిష్టవేసిన ఐఆర్‌డి నిపుణులు రాసిన సమాచారాన్ని ప్రచారంలో పెట్టారు.1965 అక్టోబరులో ఊచకోతలను ప్రారంభించే ముందు కమ్యూనిస్టులను అంతమొందించాలని ప్రేరేపించారు. ఈ దుర్మార్గంలో తమ పాత్ర లేదని బ్రిటన్‌ దశాబ్దాల తరబడి చెప్పుకున్నది, నాటి పత్రాలు వెల్లడి కావటంతో దాని దుర్మార్గం నిర్ధారితమైంది. కమ్యూనిస్టుల నుంచి దేశాన్ని కాపాడేపేరుతో మిలిటరీ అధికారి సుహార్తో అధికారాన్ని హస్తగతం చేసుకున్నాడు.అధ్యక్షుడు సుకర్ణోను బందీగా పట్టుకొని సుకర్ణో పేరుతోనే ఊచకోతకు పాల్పడ్డాడు. తరువాత 1967లో తనను తాను అధ్యక్షుడిగా ప్రకటించుకొని 32 సంవత్సరాలు నిరంకుశపాలన సాగించాడు.


రెండవ ప్రపంచ యుద్దం తరువాత కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారం కోసం 1948లో నాటి లేబర్‌ పార్టీ ప్రభుత్వం ఐఆర్‌డిని ఏర్పాటు చేసింది. అరబ్బు ప్రాంతం, ఆఫ్రికా, ఆసియాల మీద ప్రధానంగా ఇది కేంద్రీకరించింది.తప్పుడు వార్తలు,నకిలీ పత్రాలను ప్రచారంలో పెట్టటం వంటి పలు రూపాల్లో అది ప్రచారదాడులు చేసింది. తన ప్రచారాన్ని ఆకర్ణణీయంగా మార్చేందుకు యూదు వ్యతిరేకతను రెచ్చగొట్టటం, జాత్యహంకారం, ముస్లిం మనోభావాల వంటి వాటినన్నింటినీ అది ఉపయోగించుకుంది. ఐఆర్‌డి ఏజంట్లు తెరవెనుక ఉండి స్వతంత్ర సంస్ధల పేరుతో కొన్నింటిని సృష్టించి ఆ పేరుతో తాము రూపొందించిన తప్పుడు సమాచారాన్ని మీడియా, పశ్చిమ దేశాల ప్రభుత్వాలకు, అనేక సంస్ధలకు అందచేసేవారు. తాము బురద జల్లదలచుకున్న దేశాలు, సంస్ధల పేరుతో వాటిని రూపొందించేవారు. సోవియట్‌ వార్తా సంస్ధ నొవొస్తి విడుదల చేయాల్సిన సమాచారాన్ని ఫోర్జరీ చేసి పదకొండుసార్లు ఐఆర్‌డి ప్రచారంలో పెట్టినట్లు తేలింది. వాటిలో ఒకటి ఈజిప్టుకు మిలిటరీ సాయాన్ని వక్రీకరించటం. 1967లో ఇజ్రాయెల్‌తో ఈజిప్టు జరిపిన ఆరు రోజుల యుద్దంలో చేసిన సాయం వృధా అయినట్లు సోవియట్‌ నుంచి వెలువడిన వార్త పేర్కొన్నట్లు ప్రచారం చేశారు. ఇంతేకాదు అరబ్బు దేశాల్లో ప్రాచుర్యంలో ఉన్న ముస్లిం బ్రదర్‌హుడ్‌ సంస్ద పేరుతో కూడా నకిలీవార్తలను సృష్టించారు. ఈజిప్షియన్లను తిరోగామి ముస్లిం మూఢనమ్మకాలను పాటించేవారుగా చిత్రించి చెడు మాటలు మాట్లేడే నాస్తికులు, సోవియట్లు ప్రచారం చేస్తున్నారని బురదజల్లుతూ ముస్లిం బ్రదర్‌హుడ్‌ పేరుతో ప్రచారంలో పెట్టారు.ఇజ్రాయెల్‌తో పోరులో అరబ్బుల ఓటమికి విశ్వాసం లేకపోవటమే కారణమంటూ ఆ సంస్ధ పేరుతో రెచ్చగొట్టారు. యూదులకు మాతృదేశం పేరుతో ఇజ్రాయెల్‌ సృష్టికి బాటలు వేసిన, కుట్రలు చేసిన వారిలో బ్రిటన్‌ది ప్రధాన పాత్ర అన్న సంగతి తెలిసిందే. ఐఆర్‌డి తాను రూపొందించిన నకిలీవార్తలను నిజమని భావించేేందుకు, ఇజ్రాయెల్‌ను వ్యతిరేకించే వారే వాటిని ప్రచారంలో పెట్టినట్లు నమ్మించేందుకు ఈజిప్షియన్లు నేరుగా యూదుల మీద ఎందుకు దాడులకు దిగటం లేదని రెచ్చగొడుతూ రాసేవారు.


ఆఫ్రికా దేశాల్లో సోవియట్‌ వ్యతిరేకతను రెచ్చగొట్టేందుకు సోవియట్‌ అనుకూల సంస్దల పేర్లతోనే ప్రచారం చేశారు. ఆఫ్రికన్లు అనాగరికులని ప్రపంచ ప్రజాతంత్ర యువజన సమాఖ్య వర్ణించినట్లు ఒక వార్తను ఐఆర్‌డి ప్రచారంలో పెట్టింది.సోవియట్‌ విశ్వవిద్యాలయాల్లో చేరిన ఆఫ్రికన్‌ విద్యార్ధులకు చదువు సంధ్యలు రావని తూలనాడినట్లుగా కూడా ప్రచారం చేసింది. ఈ తప్పుడు ప్రచార సంస్ధను ఉపయోగించటంలో లేబర్‌, కన్సర్వేటివ్‌ పార్టీలు దేనికి ఏదీ తీసిపోలేదు. సోవియట్‌కు చేరువ అవుతున్న ఆఫ్రికా దేశమైన ఘనా సంగతి చూడాలని 1964లో కన్సర్వేటివ్‌ ప్రధాని అలెక్‌ డగ్లస్‌ ఆదేశించాడు. కొద్ది నెలల తరువాత చైనా – ఆఫ్రికన్ల మధ్య జాతులపరమైన ఉద్రిక్తతలను రెచ్చగొట్టాలని లేబర్‌ పార్టీ ప్రభుత్వ విదేశాంగ మంత్రి పాట్రిక్‌ గార్డన్‌ వాకర్‌ కోరాడు. 1977లో ఈ సంస్దను రద్దుచేసినట్లు ప్రకటించారు. మరొక పేరుతో అదే ప్రచారదాడులను కొనసాగిస్తున్నారు. తప్పుడు సమచారాన్ని ఎదుర్కొనేందుకు కొత్త సంస్దను ఏర్పాటు చేస్తున్నట్లు 2022 ఫిబ్రవరిలో బ్రిటన్‌ విదేశాంగ మంత్రి లిజ్‌ ట్రస్‌ ప్రకటించారు. ఆమె ప్రకటన తరువాత అదే నెలలో ఉక్రెయిన్‌పై రష్యా సైనికచర్య ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఆ పరిణామం గురించి పశ్చిమదేశాల సంస్ధలు ఎన్ని అసత్యాలను ప్రచారం చేస్తున్నదీ తెలిసిందే. వాటిలో బ్రిటన్‌ ఒక ప్రధాన పాత్రధారి.


సోవియట్‌ ప్రచారాన్ని అడ్డుకొనే పేరుతో అమెరికా , బ్రిటన్‌ తదితర సామ్రాజ్యవాద దేశాలు జరిపిన దుర్మార్గాలు, ప్రచారదాడి గురించి ప్రపంచానికి తెలిసింది స్వల్పమే. ఐఆర్‌డి సంస్ధలో 360 మంది పని చేశారు.వారి పని కమ్యూనిజం, సోవియట్‌ ముప్పు గురించి కల్పిత నివేదికలను తయారు చేసి వివిధ ప్రభుత్వాలకు, ఎంపిక చేసిన జర్నలిస్టులు, మేథావులకు పంపటం. వాటికి విశ్వసనీయత కల్పించేందుకు బ్రిటన్‌ గూఢచార, భద్రతా సంస్దలు అందచేసిన అంశాలను కూడా జోడించి స్వతంఐత్ర సంస్దల పేరుతో వాటిని పంపేవారు. అ సంస్ధలు కూడా ఐఆర్‌డి ఏర్పాటు చేసినవే. వాటిలో 1964లో ఏర్పాటు చేసిన ” కమ్యూనిస్టు అనుబంధ సంఘాల గురించి శోధించే అంతర్జాతీయ కమిటీ ” ఒకటి. ఇది మరొక సంస్దను ఏర్పాటు చేసింది. దాని పేరు విశ్వాసుల సభ (లీగ్‌ ఆఫ్‌ బిలీవర్స్‌). దీని పనేమిటంటే రష్యన్లకు దేవుడి మీద విశ్వాసం లేదు, అరబ్బుల ఓటమికి దేవుడి మీద సరైన విశ్వాసం లేకపోవటమే అంటూ పచ్చి మతోన్మాదాన్ని ప్రచారంలో పెట్టటం, అలాంటి వారి మన్నన పొందటం లక్ష్యంగా ఉండేది. అది ప్రచారంలో పెట్టినదానిలో ఒక అంశం ఇలా ఉంది.” ఈ తరుణంలో అరబ్‌ జాతి ఇంతగా ఎందుకు విచారంలో ఉంది ?విపత్తుకు గురైంది ? ధైర్యవంతులైన అరబ్బు శక్తులు జరిపిన జీహాద్‌లో దుష్ట యూదుల చేతిలో ఎందుకు ఓడిపోయారు ? సమాధానాలు కనుగొనటం సులభమే ! మనం గతంలో అనుసరించిన సరైన మార్గం నుంచి వైదొలుగుతున్నాము. మతం ఒక సామాజిక జబ్బు అని భావించే కమ్యూనిస్టులు-నాస్తికులు మనకు సూచించిన మార్గంలో మనం వెళుతున్నాము.” అని పేర్కొన్నారు, అంటే కమ్యూనిస్టులు, సోషలిస్టు దేశాలకు దూరంగా ఉండాలని ముస్లింలను రెచ్చగొట్టటమే ఇది. ఇలాంటి రాతల్లో ఇజ్రాయెల్‌ మీద వ్యతిరేకతను చొప్పిస్తారు. వాటిని చూసి సామాన్య అరబ్బులు సహజంగానే తమ హితం కోరేవారు చెబుతున్నట్లుగా భావించేవారు.


ఐఆర్‌డి సంస్ధ ఒక్క కమ్యూనిస్టుల మీదనే కాదు బ్రిటన్‌ ప్రయోజనాలు ఉన్న ప్రతి చోటా జోక్యం చేసుకుంది.ప్రస్తుతం జింబాబ్వేగా పిలుస్తున్న దేశం ఒకనాడు బ్రిటీష్‌ వలస ప్రాంతం. 1965లో ఇయాన్‌ స్మిత్‌ రొడీషియా పేరుతో స్వాతంత్య్రం ప్రకటించుకున్నాడు. స్మిత్‌ను వ్యతిరేకించే వారి పేరుతో ఐఆర్‌డి ఒక నకిలీ గ్రూపును ఏర్పాటు చేసింది. తాజా పరిస్ధితిని చూస్తే గతంలో సాగించిన మాదిరే ఇప్పుడూ ప్రచారం చేస్తున్నారు. చైనాలో ముస్లింలను అణచివేస్తున్నారని రోజూ వినిపిస్తున్న కట్టుకథలు అలాంటివే. రుణాల పేరుతో చైనా బలహీన దేశాలను ఆక్రమిస్తున్నదన్నదీ దానిలో భాగమే. కనుక వాట్సాప్‌, టీవీ, పత్రికల్లో వచ్చే వాటిని గుడ్డిగా నిజమని భావించరాదు !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

అమెరికా, ఐరోపా చమురు రాజకీయం – బలవుతున్న భారతీయులు !

06 Friday May 2022

Posted by raomk in Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, Prices, RUSSIA, USA

≈ Leave a comment

Tags

fuel politics, Fuel Price in India, Narendra Modi, Narendra Modi Failures, OPEC+, Ukraine-Russia crisis


ఎం కోటేశ్వరరావు


మరోసారి అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర పెరిగింది. మే ఆరవ తేదీన ఇది రాసిన సమయంలో బ్రెంట్‌ రకం ధర 113.49 డాలర్లు ఉంది. ఈ ఏడాది ఆఖరు నాటికి రష్యానుంచి ఇంథన దిగుమతులపై పూర్తి ఆంక్షలు విధించాలని ఐరోపా సంఘం(ఇయు) అధికారికంగా ప్రతిపాదించటంతో చమురు ధర పెరిగింది. ఈలోగా సభ్యదేశాలు ప్రత్నామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని కోరింది. దీన్ని బట్టి అమెరికా, ఐరోపా దేశాలు రష్యాతో అమీ తుమీ తేల్చుకొనేందుకు సిద్దపడుతున్నాయని భావించాల్సి వస్తోంది. ఉక్రెయిన్‌-రష్యా వివాదాన్ని ఆరనివ్వకుండా చూస్తారని వేరే చెప్పాల్సిన అవసరం లేదు.దీని పర్యవసానాలు ఎలా ఉండేదీ చెప్పలేము. కేంద్రం పన్నులు తగ్గించకపోతే మన దేశంలో మరింతగా చమురు ధరలు, ఇతర వస్తువుల ధరలు పెరగటం ఖాయం.


కొన్ని దేశాలు పూర్తిగా దాని మీదే ఆధారపడి ఉన్నందున రష్యా ఇంథనంపై పూర్తి నిషేధం అంత సులభం కాదని తెలుసుకోవాలి, ఇదే తరుణంలో ప్రత్నామ్నాయం చూసుకోవాలని ఐరోపా కమిషన్‌ అధ్యక్షరాలు ఉజులా వాండర్‌ లెయన్‌ ఐరోపా పార్లమెంటులో చెప్పారు. సముద్రం ద్వారా, పైప్‌లైన్‌, ముడి లేదా శుద్ధి చేసినదీ ఏ రూపంలోనూ, ఏ విధంగానూ అక్కడి నుంచి దిగుమతి చేసుకోరాదని, ఆరునెలల్లో ముడి చమురు, ఏడాదికి చివరికి శుద్ది చేసిన సరకు దిగుమతులను పూర్తిగా నిలిపివేయాలని తద్వారా రష్యాపై గరిష్టంగా వత్తిడి తేగలమన్నారు. పుతిన్‌ భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుదన్నారు.ఐరోపా పార్లమెంటు నిర్ణయాన్ని సభ్యదేశాలు ఆమోదించాల్సి ఉంది. తమ వల్ల కాదని జపాన్‌ చెప్పేసింది. హంగరీ, స్లోవేకియా ఈ నిర్ణయాన్ని వీటో చేస్తామని చెప్పినట్లు వార్తలు వచ్చాయి. రష్యా నుంచి ఇంథన దిగుమతులను నిలిపివేసే అవకాశం లేదని జపాన్‌ పరిశ్రమల మంత్రి కొషి హగిఉదా తేల్చి చెప్పారు. అమెరికా ఇంథనశాఖ మంత్రితో భేటీలో దీనిప్రస్తావన వచ్చింది. ఇంథన భద్రత ఒక్కో దేశానికి ఒకో విధంగా ఉంటుందని, అమెరికాకు అనుగుణంగా తాము ఉండలేమని స్పష్టం చేశారు. ప్రస్తుతం తన అవసరాల్లో నాలుగుశాతం చమురు, తొమ్మిది శాతం ఎల్‌ఎన్‌జిని జపాన్‌ దిగుమతి చేసుకుంటున్నది.


జర్మనీలో పెద్ద మొత్తంలో గాస్‌ దిగుమతి చేసుకొనే యునిపర్‌ సంస్ధ రష్యాకు రూబుళ్లలో చెల్లించాలని నిర్ణయించింది. తమ నుంచి ఇంథనాన్ని కొనుగోలు చేసే వారు రూబుళ్లలోనే చెల్లించాలని గత నెలలో పుతిన్‌ చేసిన ప్రకటనను అంగీకరించరాదని ఐరోపా కమిషన్‌ ప్రకటించినప్పటికీ జర్మన్‌ సంస్ధ దానికి భిన్నంగా పోతున్నది. రష్యా నిర్ణయం ప్రకారం దాని స్నేహితులు కాని దేశాల సంస్ధలు గాజ్‌ప్రోమ్‌ బాంకులో రెండు ఖాతాలు తెరవాల్సి ఉంటుంది. ఒక ఖాతాలో తాము చెల్లించే విదేశీ కరెన్సీని జమచేస్తే దాన్ని బాంకు రూబుళ్లలోకి మార్చి బాంకు రూబుల్‌ ఖాతాకు బదిలీ చేస్తుంది. రూబుళ్లలో చెల్లించని పక్షంలో ఇంథన సరఫరా నిలిపివేస్తామని పోలాండ్‌, బల్గేరియాకు గాజ్‌ప్రోమ్‌ చెప్పేసింది.యునిపర్‌ చర్య ఆంక్షలను ఉల్లంఘించటమే అని ఐరోపా కమిషన్‌ చెప్పింది.
రష్యా నుంచి దిగుమతి చేసుకొనే చమురు,బొగ్గు నిమిత్తం తమ కరెన్సీ యువాన్లలో చెల్లిస్తామని చైనా పేర్కొన్నది. అమెరికా డాలరు ముప్పులో ఉందని చెప్పటమే దీని లక్ష్యం. సౌదీ అరేబియాతో కూడా తన కరెన్సీలో చెల్లింపుల గురించి సంప్రదింపులు జరుపుతోంది. ప్రస్తుతం అంతర్జాతీయ చెల్లింపుల్లో అమెరికా డాలరు వాటా 40శాతం ఉంది. 2021 డిసెంబరులో చైనా కరెన్సీ 2.7శాతం ఉండగా ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి అది 3.2శాతానికి పెరిగింది. జపాన్‌ ఎన్‌ను వెనక్కు నెట్టి నాలుగవ స్ధానానికి ఎదిగింది. ఈ ఏడాది జనవరిలో ఇతర కరెన్సీల చెల్లింపులు 6.48శాతం తగ్గితే చైనా కరెన్సీ 11శాతం పెరిగినట్లు స్విఫ్ట్‌ వెల్లడించింది.2030నాటికి ప్రపంచంలో రిజర్వు కరెన్సీలో చైనా మూడవ స్దానంలో ఉంటుంది.


ఉక్రెయిన్‌ పరిణామాలతో అమెరికా పెద్దగా ప్రభావితం కాలేదు. కానీ అక్కడ మే ఐదవ తేదీన సహజవాయువు ధర (ఎంఎంబిటియు) 8.32 డాలర్లకు పెరిగింది. ఇది పదమూడు సంవత్సరాల నాటి రికార్డును అధిగమించింది. రానున్న కొద్ది వారాల్లో పది డాలర్లకు చేరవచ్చని భావిస్తున్నారు. 2008లో గరిష్టంగా 14డాలర్లు దాటింది.2020లో కనిష్టంగా 2.10 డాలర్లు నమోదైంది. పీపా చమురును 70 డాలర్లకంటే తక్కువకు సరఫరా చేయాలని మన దేశం రష్యాతో బేరమాడుతోందని బ్లూమ్‌బెర్గ్‌ పేర్కొన్నది. రవాణా, ఆంక్షలు, నిధుల వంటి ఇబ్బందులను గమనంలో ఉంచుకొని రాయితీ ఇవ్వాలని కోరుతున్నట్లు తెలిపింది. ఒప్పందం కుదిరితే మే నెలలో 15మిలియన్‌ పీపాలు దిగుమతి చేసుకోవచ్చని, ఇది భారత్‌ దిగుమతుల్లో పదిశాతానికి సమానమని కూడా వెల్లడించింది.
ఒకవైపు అమెరికా బెదిరిస్తున్నప్పటికీ మన దేశం రష్యా చమురు కోసం బేరసారాలాడటంలో ఆర్ధికాంశంతో పాటు, అంతర్జాతీయ రాజకీయాలు కూడా ఉన్నాయి.2013-14లో మన దేశం దిగుమతి చేసుకున్న ముడి చమురు పీపా సగటు ధర 105.52 డాలర్లు. నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత గత ఎనిమిది సంవత్సరాలలో ఇలా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ పిపిఏసి సమాచారం మేరకు వర్తమాన ఆర్ధిక సంవత్సరం తొలి నెల ఏప్రిల్‌లో సగటు ధర 103.10 డాలర్లు ఉంది.
సంవత్సరం×××× డాలర్లలో ధర
2014-15××× 84.16
2015-16××× 46.17
2016-17××× 47.56
2017-18××× 56.43
2018-19××× 69.88
2019-20××× 60.47
2020-21××× 44.82
2021-22××× 79.18
పైన పేర్కొన్న వివరాలను చూసినపుడు మన్మోహన్‌ సింగ్‌ ఏలుబడి చివరి సంవత్సరంలో ఉన్న స్ధాయి కంటే ఇప్పటికీ తక్కువగానే ఉన్నా సరే నరేంద్రమోడీ సర్కార్‌ అంతర్జాతీయంగా తగ్గిన మేరకు జనాలకు ధరలను తగ్గించలేదు. భారీ ఎత్తున సుంకాలు పెంచి ఆ మొత్తాలను కార్పొరేట్లకు రాయితీలకు మళ్లించటం, ఇతర అంశాలే దీనికి కారణం. వాటికి తోడు రూపాయి విలువ పతనం కూడా తోడైంది. మన్మోహన్‌ సింగ్‌ సర్కార్‌ మన కరెన్సీ విలువ పతనాన్ని అరికట్టటంలో విఫలమైందని నరేంద్రమోడీ సహా అనేక మంది బిజెపి నేతలు గతంలో విమర్శించారు. అందువలన ఇప్పుడు వారి నిర్వాకం కూడా జనాలకు శాపంగా మారింది.


ఉక్రెయిన్‌పై సైనిక చర్య ప్రారంభమైన తరువాత ఇప్పటివరకు ఐరోపా సంఘ(ఇయు) దేశాలు చమురు,గాస్‌, బొగ్గు దిగుమతులకు గాను రష్యాకు 50బిలియన్‌ డాలర్లు చెల్లించాయి. ఒపెక్‌ మరియు దానితో అనుసంధానం ఉన్న మొత్తం 23దేశాలు ప్రతి నెలా సమావేశమై మార్కెట్‌ను సమీక్షిస్తాయి. ఇవి 40శాతం చమురును ఉత్పత్తి చేస్తున్నాయి. తాజాగా జరిపిన సమీక్షలో ఇంతకు ముందే నిర్ణయించిన మేరకు స్వల్పంగా తప్ప ఉత్పత్తిని పెంచరాదని తీర్మానించాయి. రోజుకు పది మిలియన్ల పీపాల చమురు ఉత్పత్తి చేసే రష్యా మీద ఆంక్షల కారణంగా సరఫరా తగ్గితే గిరాకీ మేరకు ధరలు పెరిగేందుకు అవకాశం ఉంది. ఇదే జరిగితే మన వంటి దేశాల మీద భారం పెరుగుతుంది. ఒపెక్‌ దేశాలు రోజుకు 28మిలియన్ల పీపాల చమురు ఉత్పత్తి చేస్తున్నాయి. ఇది మొత్తం ఉత్పత్తిలో 30శాతానికి సమానం.ఐరోపాలోని రష్యా మార్కెట్‌ను ఆక్రమించేందుకు అమెరికా పావులు కదుపుతున్నది. తన దగ్గర ఉన్న నిల్వల నుంచి ఇప్పుడు ఎగుమతులు చేస్తున్నది. అవి తగ్గిపోతున్నందున ఆమేరకు ఉత్పత్తిని పెంచాల్సి ఉంది.ఐరోపా అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తి పెంచాలంటే అందుకు పెట్టుబడులు, పరికరాలు, సిబ్బంది కూడా అవసరమే. తీరా ఆ మేరకు పెట్టుబడులు పెట్టిన తరువాత ఎగుమతి అవకాశాలు తగ్గితే ఎలా అన్న గుంజాటనలో అమెరికా కంపెనీలు ఉన్నాయి.


ఒపెక్‌, దానితో సమన్వయం చేసుకుంటున్న దేశాలు ఉత్పత్తి నియంత్రణ, ధరల పెంపుదలకు కుమ్మక్కు అవుతున్నాయని, అందువలన అలాంటి దేశాల మీద చట్టపరమైన చర్యలు తీసుకొనేందుకు వీలు కల్పిస్తూ ఒక బిల్లును అమెరికా సెనెట్‌ న్యాయ కమిటీ ఆమోదించింది. దీనికి నోపెక్‌ (నో ఆయిల్‌ ప్రొడ్యూసింగ్‌ ఆర్‌ ఎక్స్‌పోర్టింగ్‌ కార్టెల్స్‌) అని పేరు పెట్టారు. దీన్ని పార్లమెంటు ఆమోదిస్తే తప్ప చట్టం కాదు. ఇలాంటి బిల్లు గురించి గత రెండు దశాబ్దాలుగా ప్రతిపాదనలు వస్తున్నా పార్లమెంటులోల ప్రవేశపెట్టలేదు. అమెరికాలో కూడా చమురు ధరలు, ద్రవ్యోల్బణం పెరుగుదల నేపధ్యంలో దీనికి ప్రాధాన్యత ఏర్పడింది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

యువతరం శిరమెత్తితే, నవతరం గళమెత్తితే…..అమెరికా కార్మికోద్యమంలో కొత్త తరం !

04 Wednesday May 2022

Posted by raomk in Current Affairs, Economics, employees, Opinion, Uncategorized, USA

≈ Leave a comment

Tags

Amazon, Bernie Sanders, New American Union Movement, Starbucks, US labour movements, Young Workers


ఎం కోటేశ్వరరావు


ప్రపంచంలోని 80దేశాల్లో 40వేల వరకు కాఫీ దుకాణాలున్న అమెరికా కంపెనీ స్టార్‌బక్స్‌. అమెరికాలో పదిహేనువేలకుపైగా షాపులున్నాయి. కరడుగట్టిన యాజమాన్య ఆటంకాలను అధిగమించి వాటిలో కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేసేందుకు కార్మికులు ముందుకు రావటం ఒక పెద్ద పరిణామంగా చెబుతున్నారు. గత కొన్ని దశాబ్దాలుగా కార్మిక సంఘ ఉద్యమాలు తగ్గిపోతున్న నేపధ్యంలో స్టార్‌బక్స్‌ కార్మిక సంఘం ఏర్పాటు ఒక ఆశారేఖగా ఉంది. అమెజాన్‌ కంపెనీ కార్మిక సంఘానికి ఇక్కడి సంఘానికి ఎలాంటి సంబంధాలు గానీ అనుబంధాలుగానీ లేవు. రెండు చోట్లా సంఘాలను గుర్తించాలనే దరఖాస్తులు కార్మికశాఖకు అందచేశారు.2021 ఆగస్టులో బఫెలో, న్యూయార్క్‌లోని మూడు స్టార్‌బక్స్‌ దుకాణాల్లో కార్మిక సంఘాన్ని గుర్తించాలంటూ దరఖాస్తు చేశారు.డిసెంబరు తొమ్మిదవ తేదీన బఫెలోని దుకాణంలో జరిగిన ఎన్నికల్లో సంఘం తొలిసారిగా గుర్తింపు పొందింది. గత ఎనిమిది నెలల్లో 250 దుకాణాల నుంచి అలాంటి దరఖాస్తులు కార్మికశాఖకు వెళ్లాయి. ఇప్పటి వరకు 40 చోట్ల గుర్తింపు లభించింది. ఈ పరిణామం పెద్ద ఎత్తున అనేక వసతి, ఆహార, పానీయ సంస్ధల్లోని సిబ్బందిని కార్మిక సంఘాల వైపు ఆకర్షిస్తున్నది.అమెరికాలో కొత్త వరవడికి నాంది పలికిందంటే అతిశయోక్తి కాదు. 2008లో తలెత్తిన ఆర్ధిక సంక్షోభం కార్మికులను బాగా దెబ్బతీసింది. ఇప్పటికీ పూర్తిగా కోలుకోలేదు. ఇది కూడా కార్మికులను ఆలోచింప చేస్తున్నది.


అమెరికాలోని అమెజాన్‌ కంపెనీ కార్మిక సంఘంలో చేరాలా వద్దా అన్న ఎన్నికల్లో 28 ఏండ్ల కంపెనీ చరిత్రలో ఒక చోట విజయం, రెండు చోట్ల ఎదురు దెబ్బలు.మరో బహుళజాతి కంపెనీ స్టార్‌బక్స్‌లో పలు దుకాణాల్లో కార్మిక సంఘాల్లో చేరిక. ఈ రెండు పరిణామాలూ ఇప్పుడు చర్చనీయాంశాలుగా మారాయి. ఇరవై ఎనిమిది సంవత్సరాల అమెజాన్‌ కంపెనీ తన సిబ్బందిని ఏ కార్మికసంఘంలోనూ చేరకుండా అడ్డుకుంటున్నది. కొద్ది వారాల క్రితం అమెజాన్‌ కార్మిక సంఘం(ఏఎల్‌య)లో చేరాలా వద్దా అనే అంశంపై కార్మికశాఖ జరిపిన ఎన్నికల్లో న్యూయార్క్‌లోని ఒక గోదాములో సంఘం పట్ల మొగ్గుచూపారు. ఇది ప్రపంచవ్యాపితంగా సంచలనం కలిగించింది. అలబామాలో మరో కార్మిక సంఘంలో చేరిక గురించి జరిపిన ఓటింగ్‌లో మెజారిటీ వద్దని తీర్పు చెప్పారు. ఒక చోట తన పన్నాగాలు పారకపోవటాన్ని యాజమాన్యం జీర్ణించుకోలేకపోతున్నది. ఆ ఎన్నిక చెల్లదంటూ వివాద పిటీషన్‌ దాఖలు చేసింది. అది విచారణకు రానుండగా న్యూయార్క్‌లోని రెండవ గోదాములో ఏప్రిల్‌ చివరి వారంలో జరిగిన ఓటింగ్‌లో కార్మిక సంఘం వద్దని మెజారిటీ సిబ్బంది ఓటు చేశారు. స్టాటన్‌ ఐలాండ్‌లోని ఎల్‌డిజె5 గోదాములో 618 మంది సంఘానికి వ్యతిరేకంగా 380 మంది అనుకూలంగా ఓటు చేశారు. సిబ్బందిలో 61శాతం మంది పాల్గన్నారు.


స్టేటెన్‌ ఐలాండ్‌లోని జెఎఫ్‌కె8 అనే అమెజాన్‌ గోదాములో ఎన్నిక తీర్పును వమ్ముచేసేందుకు సంఘాన్ని గుర్తించకుండా అడ్డుకొనేందుకు యాజమాన్యం రంగంలోకి దిగింది. నేతలు కార్మికులను బలవంత పెట్టి అనుకూలంగా ఓట్లు వేయించారని యాజమాన్యం చేసిన ఫిర్యాదును జాతీయ కార్మిక సంబంధాల బోర్డు విచారణకు స్వీకరించింది. బ్రూక్లిన్‌లోని కార్మిక కార్యాలయం కార్మిక సంఘానికి మద్దతు ఇచ్చే విధంగా ఉందని అందువలన వేరే చోటుకు విచారణను మార్చాలని కోరగా ఫోనిక్స్‌ కేంద్రానికి బదిలీ చేశారు. సదరు కేంద్ర డైరెక్టర్‌ మాట్లాడుతూ అమెజాన్‌ కంపెనీ సమర్పించిన ఆధారాలను చూస్తే ఓటింగ్‌ చెల్లకపోవచ్చని చెప్పటం గమనించాల్సిన అంశం. జెఎఫ్‌కె8 గోదాము సిబ్బంది 58శాతం మంది పోలింగ్‌లో పాల్గనగా వారిలో 55శాతం మంది అనుకూలంగా ఓటు వేశారు.అమెజాన్‌ ఫిర్యాదుపై మే 23వ తేదీ నుంచి విచారణ ప్రారంభమౌతుంది. తమ సిబ్బంది వైఖరి ఏమిటో వినాలని తాము కోరుతున్నామని, ఎన్నికల్లో అలాంటి అవకాశం రాలేదని గోదాములోని సిబ్బందిలో మూడోవంతు మాత్రమే కార్మిక సంఘానికి ఓటు వేశారని అమెజాన్‌ వాదిస్తోంది. ఎక్కువ మంది పాల్గనకుండా లేబర్‌ బోర్డు అడ్డుకుందని, కార్మిక నేతలు గంజాయి పంచినట్లు ఆరోపించింది. కార్మిక సంఘం వీటిని తీవ్రంగా ఖండించింది. ఇక్కడ ఓటింగ్‌ తక్కువగా ఉందికనుక తాము అంగీకరించేది లేదని చెబుతున్న కంపెనీ అలబామాలో తక్కువ మంది పాల్గని కార్మిక సంఘం వద్దని వేసిన ఓట్లను ఎలా పరిగణనలోకి తీసుకున్నదని ప్రశ్నించింది. నిజానికి రెండు చోట్లా కంపెనీ కార్మికులను బెదిరించినట్లు తెలిపింది. అమెజాన్‌ దాఖలు చేసిన కేసులో తీర్పు ఎలా వస్తుందో చెప్పలేము.


కార్మిక సంఘనేతలకు ఇది ఆశాభంగం కలిగించవచ్చునేమో గానీ అమెజాన్‌ కంపెనీ తీరు తెన్నులు తెలిసిన వారికి ఆశ్చర్యం కలిగించలేదు.ఈ ఎన్నిక అమెజాన్‌ కార్మిక సంఘం(ఎఎల్‌యు) కంటే యాజమాన్యానికి, పరోక్షంగా అమెరికన్‌ కార్పొరేట్లన్నింటికీ ప్రతిష్టాత్మకంగా మారిందంటే అతిశయోక్తి కాదు. అందుకే రెండవ గోదాములో వారాల తరబడి సిబ్బందిని అనేక రకాలుగా బెదిరించి వత్తిళ్లకు గురిచేసింది. అనేక మంది రోజుకు కొన్ని గంటలు మాత్రమే పని చేసే పాక్షిక సిబ్బంది కావటం, గంటకు 30 డాలర్ల వేతనాన్ని తమకు ఇస్తారా లేదా అన్న అనుమానాల వంటివి, ఈ మాత్రం పని ఇక్కడగాకపోతే మరోచోట దొరకదా, మనమెందుకు ఈ వివాదంలో తలదూర్చటం అనే భావం కూడా కొందరిని సంఘానికి దూరంగా ఓటువేసేందుకు దోహదం చేసింది.యాజమాన్యనిరంకుశ వైఖరి తెలిసినప్పటికీ గత నెలలో వందకు పైగా అమెజాన్‌ దుకాణాల్లోని కార్మికులు సంఘంలో చేరటం గురించి ఎఎల్‌యు నేతలతో సంప్రదింపులు జరిపారు. ఇది యాజమాన్యాన్ని కలవపరుస్తున్న అంశమిది. అందుకే న్యూయార్కులోని రెండవ గోదాము మీద కేంద్రీకరించి కార్మికులను బెదిరించి తన పంతాన్ని నెగ్గించుకుంది. ఓడిపోయిన చోటనే కాదు అన్ని చోట్లా కార్మికులను సంఘటిత పరచేందుకు పూనుకుంటామని ఇది అంతం కాదు ఆరంభం మాత్రమే అని నేతలు ప్రకటించారు.


కార్మికులు సంఘాల్లో చేరటం తగ్గిపోతుండగా ఈ పరిణామం పునరుజ్జీవన చిగురు వంటిదని చెప్పవచ్చు. అమెరికాలో 1983లో 20శాతం మంది కార్మికులు సంఘాల్లో చేరగా ఇప్పుడు వారు 11శాతానికి తగ్గారు, 1940, 50దశకాల్లో 30శాతం వరకు ఉన్నట్లు పాత సమాచారం తెలుపుతోంది. అమెజాన్‌, స్టార్‌బక్స్‌, ఆపిల్‌ వంటి కంపెనీల్లో సంఘాల స్ధాపన అనేకమందిని ఆలోచింప చేస్తున్నది. దేశంలో 28.8 కోట్ల మంది కార్మికులుండగా వారిలో ఒక్కశాతం మంది సంఘాల్లో చేరినా 30లక్షల మంది పెరుగుతారు. కొన్ని చోట్ల చేరేందుకు సిద్దంగా ఉన్నా సంఘాలు లేవు. మరికొన్ని చోట్ల సంఘాలకు అనుకూలత లేదు. మొత్తంగా చూసినపుడు సంఘటితం కావటానికి అనువైన వాతావరణంఇప్పుడు ఉంది. ఇదే సమయంలో యజమానులు కూడా సంఘాలను లేకుండా చేసేందుకు తీవ్రంగా చూస్తున్నారు.


1936 గాలప్‌ సర్వేలో కార్మిక సంఘాలు ఉండాలా వద్దా అన్న ప్రశ్నకు 72శాతం మంది కావాలని చెప్పారు. 2021సెప్టెంబరులో అదే సంస్ధ అడిగిన అదే ప్రశ్నకు 68శాతం మంది కావాలని అన్నారు.1953, 57లో గరిష్టంగా 75శాతం మంది ఉన్నారు. ఈ అంకెలను చూసినపుడు పెద్ద మార్పులు లేవని చెప్పవచ్చు. మరోసారి కార్మిక సంఘాల ఏర్పాటు, వాటిలో చేరే వారు పెరిగేందుకు అనువైన పరిస్ధితి అమెరికాలో ఉందన్నది స్పష్టం. సంఘాల్లో కార్మికులు చేరకపోవటం దేశానికి మంచి కంటే చెడు చేస్తున్నదని అమెరికన్లు నమ్ముతున్నట్లు ఇటీవలి పూ సర్వే వెల్లడించింది. కార్మిక సంఘాలలో చేరాలా వద్దా అన్న అంశంలో రాజకీయ అనుబంధాలు కూడా పని చేస్తున్నాయి.2019 నుంచి 2021వరకు సర్వేల సమాచారాన్ని విశ్లేషించినపుడు 56శాతం మంది కార్మిక సంఘాల సభ్యులు డెమోక్రటిక్‌ పార్టీ అభిమానులు కాగా 39శాతం మంది రిపబ్లికన్‌ పార్టీ మద్దతుదార్లున్నారు. సంఘటిత పరచే హక్కును రక్షించేందుకు ప్రభుత్వం ఒక బిల్లును ప్రవేశపెట్టగా గతేడాది పార్లమెంటు దిగువ సభ ఆమోదించగా ఎగువ సభ సెనెట్‌ దాన్ని అడ్డుకుంది.


అమెజాన్‌లో కార్మిక సంఘం ఏర్పాటు జాతీయంగా ఒక విస్తృత ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిందని డెమొక్రటిక్‌ సోషలిస్టు నేత బెర్నీశాండర్స్‌ వర్ణించాడు. కార్పొరేట్ల పేరాశకు కార్మికులు అశక్తులుగా అలసిపోయారని చెప్పాడు. ఇటీవల అమెజాన్‌ కార్మిక సంఘనేతలతో మాట్లాడుతూ అమెజాన్‌ కంపెనీలో కుర్రకారు ఇంతటి విజయం సాధించారంటే మేమూ అదే మాదిరి మేమూ చేయగలం అని అనేక మంది చెప్పారని అన్నాడు. రాజ్యాంగ హక్కైన కార్మిక సంఘ ఏర్పాటును అడ్డుకొనేందుకు కోట్లాది డాలర్లను ఖర్చు చేయటానికి బదులు సమస్యల గురించి దానితో చర్చించేందుకు అమెజాన్‌ అధిపతి జెఫ్‌ బెజోస్‌ సిద్దం కావాలని డిమాండ్‌ చేశాడు.కార్మిక సంఘాలను లేకుండా చేయాలని చూస్తున్న అమెజాన్‌ కంపెనీ చట్టవిరుద్దమైన చర్యలను విరమించేంత వరకు సదరు కంపెనీకి ప్రభుత్వ కాంట్రాక్టులను రద్దు చేయాలని అధ్యక్షుడు జో బైడెన్‌కు శాండర్స్‌ లేఖ రాశాడు. కార్మిక సంఘాల వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడబోమని రాతపూర్వకంగా రాసి ఇచ్చిన కంపెనీలకే ప్రభుత్వ కాంట్రాక్టులు ఇస్తామన్న ఎన్నికల వాగ్దానాన్ని అమలు జరపాలని గుర్తు చేశాడు.


కరోనా మహమ్మారి నుంచి రక్షించేందుకు అవసరమైన నివారణ ఏర్పాట్లు తగినన్ని చేయాలంటూ జెఎఫ్‌కె8 గోదాములో కార్మికులను సమీకరించి ఆందోళన చేసినందుకు 2020లో క్రిస్టియన్‌ స్మాల్‌ అనే కార్మికుడిని కంపెనీ తొలగించింది. అతని చొరవతో ఏర్పడిన కార్మిక సంఘాన్ని అదే గోదాములో కార్మికులు గుర్తించారు. వెబ్‌సైట్‌లో సలహాలు, సమాచారాన్ని అందుబాటులో ఉంచటం కాకుండా ముఖాముఖీ కార్మికులతో సమావేశం కావటం ద్వారానే సంఘాల అవసరం ఏమిటో బాగా వివరించగలమని స్మాల్‌ చెప్పాడు. అవసరమైతే పదే పదే చర్చలు జరపాలన్నాడు. అమెజాన్‌లో విజయం తరువాత మరో పెద్ద కంపెనీ స్టార్‌బక్స్‌లో అనేక చోట్ల కార్మిక సంఘానికి మద్దతుగా కార్మికులు ఓటువేశారు. దాంతో ఆ సంస్ద కూడా ఈ పరిణామాన్ని అడ్డుకొనేందుకు పూనుకుంది. గంటకు ప్రస్తుతం ఇస్తున్న 18 డాలర్లను 30 డాలర్లకు పెంచాలని, పని మధ్యలో భోజన, ఇతర విరామాలకు వేతనం ఇవ్వాలని కార్మిక సంఘం కోరుతోంది.గంటకు ఇన్ని వస్తువులను విధిగా చేరవేయాలనే చెల్లింపు పద్దతి రద్దుకావాలని కోరుతున్నారు.ఈ నిబంధన కారణంగా జరుగుతున్న ప్రమాదాలు ఇతర చోట్లతో పోలిస్తే అమెజాన్‌లో ఎక్కువగా ఉన్నాయి.


అమెరికాలోని కాలేజీ విద్యావంతులైన కార్మికులు గత కొద్ది సంవత్సరాలుగా జరుగుతున్న పరిణామాలను జీర్ణించుకోలేకపోతున్నారు. వారు ఊహించినదానికి భిన్నంగా జీవితాలున్నాయి. గత తరాలు దిగువ నుంచి మధ్యతరగతిగా మారినట్లు తాము మారటం, ఆరంకెల ఆదాయానికి చేరటం ఎంతో కష్టమని వారు భావిస్తున్నారు. కార్మికోద్యమం పెరిగేందుకు ఈ పరిస్దితి దోహదం చేస్తోంది.1990దశకంలో కాలేజీ డిగ్రీలు ఉన్నవారు కార్మిక సంఘాలకు 55శాతం మంది మద్దతు ఇస్తే ఇప్పుడు వారి సంఖ్య 70శాతానికి పెరిగింది, తాజాగా డిగ్రీలు పొందిన వారిలో ఇంకా ఎక్కువ మంది ఉన్నట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి.
భౌతిక పరిస్ధితులను బట్టే కార్మికవర్గ ఆలోచనలు ఉంటాయి. ఇటీవల పెద్ద ఎత్తున ఉన్న ఉద్యోగాలకు రాజీనామా చేసి అంతకంటే మెరుగైనదాని కోసం చూసిన ధోరణి వెల్లడైంది. ఇది ఒకరకమైన కార్మిక నిరసనకు ప్రతీకగా భావిస్తున్నారు. ఈ తీరును చూసిన కార్పొరేట్‌లు సిబ్బందిని నిలుపుకొనేందుకు మెరుగైన వేతనాలు, పని పరిస్దితులను కల్పించాల్సి అవసరాన్ని గుర్తించాల్సి వచ్చింది. లేనట్లయితే కార్మిక సంఘాల ఏర్పాటు, పోరాటాలకు అనువైన పరిస్ధితికి దారి తీస్తుందనే ఆందోళన వెల్లడైంది. పెద్ద వారితో పోల్చితే యువత కార్మిక సంఘాలపట్ల సానుకూల వైఖరితో ఉంది. ఇతరులతో పోల్చితే ఆఫ్రో-అమెరికన్లు, పురుషులతో చూస్తే మహిళలు ఎక్కువగా అనుకూలంగా ఉన్నారు. బాగా తక్కువ లేదా ఎక్కువ ఆదాయాలు వస్తున్నవారి కంటే మధ్యస్ధంగా ఉన్నవారు సంఘాల పట్ల ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు. ఇది అక్కడి కార్మికోద్యమం మరింతగా పెరగటానికి దోహదం చేయనుంది. అది ప్రపంచాన్ని ప్రభావితం చేయకుండా ఉంటుందా !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

రంగనాయకమ్మ గారూ”కుహనా మిత్ర శత్రువు” లతోనే నష్టం ఎక్కువ !

23 Saturday Apr 2022

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, Left politics, NATIONAL NEWS, Political Parties, RUSSIA, USA, WAR

≈ 2 Comments

Tags

#Ranganayakmma, Ranganayakmma, Ukraine-Russia crisis, ultra – leftism


ఎం కోటేశ్వరరావు


రంగనాయకమ్మ గారి మహా రష్యన్‌ దురహం కారం అనే విశ్లేషణపై స్పందించిన నాకు ఆమె ఆత్మానందాన్ని ఆపాదించారు. దానికి పారమార్ధిక పదకోశంలో చెప్పిన ఒక వ్యాఖ్యానం లేదా భాష్యం ప్రకారం కలిమి,బలిమి మరెందులోనూ తనకు మించిన వారు లేరని సంబరపడటం. అలాంటి అంబర సంబరం నాకు లేదుగానీ పురోగామి వాదిగా ఉన్నా అనే సంతృప్తి పక్కాగా ఉంది. మార్క్స్‌కంటే మార్క్సిజాన్ని ఎక్కువగా ఔపోసనపట్టినట్లు భావిస్తూ అలాంటి స్ధితిలో రంగనాయకమ్మ గారు ఉన్నారేమో అన్న సందేహం కలుగుతోంది. ఆ స్పందనకు ప్రతిస్పందనగా కొన్ని అంశాలను పాఠకుల ముందుంచుతున్నాను. (ఆంధ్రజ్యోతిలో మార్చి రెండవ తేదీన రంగనాయకమ్మ గారి విశ్లేషణకు నా స్పందన మార్చి12న ప్రచురితం కాగా ఏప్రిల్‌20న రంగనాయకమ్మ గారి ప్రతిస్పందన ప్రచురితమైంది)


1. లెనిన్‌ నాయకత్వంలో వున్న పార్టీ ప్రభుత్వం ” రష్యన్‌ రిపబ్లిక్‌ ” అని నామకరణం చేసిందని నేను రాయలేదు.’రష్యన్‌ సోవియట్‌ ఫెడరేటివ్‌ సోషలిస్ట్‌ రిపబ్లిక్‌’ అనే రాశాను. ‘ఫెడరేటివ్‌’ అనే పదాన్ని వదలివేయ లేదు. తదుపరి పేరాలో దాన్ని పునశ్చరణ చేసిన సందర్భంలో పొట్టిగా రష్యన్‌ రిపబ్లిక్‌ అని రాశాను.(చైనా అసలు పేరు పీపుల్స్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ చైనా కానీ వాడుకలో చైనా అంటున్నాం తప్ప ప్రతిసారీ మొత్తం పేరును వాడటం లేదు, పీపుల్స్‌ రిపబ్లిక్‌ రిపబ్లిక్‌ను విస్మరించారు అంటే ఎలా, అలాంటిదే ఇది) ఆ పేరును అంతకు ముందు ప్రభుత్వ నేతగా ఉన్న కెరెన్‌స్కీ పెట్టారని రంగనాయకమ్మగారు రాశారు. కెరెన్‌స్కీ సర్కార్‌ పెట్టిన పేరు ” రష్యన్‌ డెమోక్రటిక్‌ ఫెడరల్‌ రిపబ్లిక్‌ ” అని తెలుసుకుంటే చాలు. లెనిన్‌ అధికారానికి వచ్చిన 1917 నవంబరు ఏడు నుంచి 1918 జనవరి 18న రాజ్యాంగ సభ ‘రష్యన్‌ సోవియట్‌ ఫెడరేటివ్‌ సోషలిస్ట్‌ రిపబ్లిక్‌’ అని పేరు మారుస్తూ డిక్రీ జారీ చేసే వరకు కెరెన్‌స్కీ పెట్టిన పాత పేరు కొనసాగింది. కెరెన్‌స్కీ-లెనిన్‌ ప్రభుత్వం పెట్టిన రెండు పేర్లలోనూ మధ్యలో పదాలు మారినప్పటికీ ” రష్యన్‌ ” అనే పదంతోనే ప్రారంభమైంది కనుక లెనిన్‌ కూడా రష్యన్‌ మహాదురహంకారానికి గురైనట్లు భావించాలా అని ప్రశ్నించాను తప్ప లెనిన్‌ గురైనట్లు నేను చెప్పలేదు. ” రష్యన్‌ ” పదం లేకుండా తరువాత 1924లో వివిధ రిపబ్లిక్‌ల మధ్య ఒప్పందం జరిగి ”యూనియన్‌ ఆఫ్‌ సోవియట్‌ సోషలిస్టు రిపబ్లిక్‌(యుఎస్‌ఎస్‌ఆర్‌)గా పేరు మార్చారు. స్టాలిన్‌ మీద ఉన్న గుడ్డి ద్వేషంతో ఉన్నవారిని ఏ విధంగానూ సంతుష్టీకరించలేము.యుఎస్‌ఎస్‌ఆర్‌లో ఉన్నది ఫెడరల్‌ ప్రభుత్వం తప్ప రంగనాయకమ్మగారు పేర్కొన్నట్లుగా రష్యాలోని కేంద్ర ప్రభుత్వం కాదు. అధికార కేంద్రం(రాజధాని) మాస్కోలో ఉన్నంత మాత్రాన అది రష్యన్‌ కేంద్ర ప్రభుత్వం కాదు.


2. ఒక దేశం మరొక దేశ ప్రభుత్వంతో కుదుర్చుకొనే ఒప్పందాలమీద దేశాధినేతల సంతకాలు, తరువాత వాటిని పార్లమెంటు ఆమోదించటాలు, పార్టీల విధాన రూపకల్పన పద్దతికి ఉన్న తేడా గురించి రంగనాయకమ్మగారికి తెలియదనుకోలేం. ప్రభుత్వ ఒప్పందాలను సులభతరంగా పాఠకులు అర్ధం చేసుకొనేందుకు అధినేతలు ఒప్పందాలు చేసుకున్నారని ఒక జర్నలిస్టుగా అనేక సార్లు స్వయంగా రాశాను. ఒక విధానాన్ని స్టాలిన్‌కు ఆపాదించి తాను చేసిన దాడిని సమర్ధించుకొనేందుకు నేను చేసిన ప్రస్తావనను ఉటంకిస్తూ నేను కూడా వ్యక్తులకు ఆపాదించినట్లు ఆమె చిత్రించారు. ఒప్పందాలపై సంతకాలు సాంకేతికంగా ప్రభుత్వాల తరఫు దేశాధిపతులు లేదా మంత్రులు కూడా చేస్తారు.ఒక పార్టీ లేదా ప్రభుత్వం ఆమోదించే,అనుసరించే విధానం అన్నది సమిష్టి నిర్ణయం. ఆమోదించిన తరువాత వాటి మీద లెనిన్‌, స్టాలిన్‌ లేదా ఒక వేళ రంగనాయకమ్మగారే ఏదైనా పార్టీ నేతగా ఉంటే ఆమె సంతకాలు, గెజెట్‌ నోటిఫికేషన్లు అవసరం లేదు. ప్రభుత్వాల ఒప్పందాలను లిఖించేది అధికారులు. పార్టీల విధాన రూపకల్పన పరిధి, అంశాలను కమిటీలు ఆవెెూదించిన తరువాత ముసాయిదా రాతపనిని ఒకరికో, ఒక బృందానికో అప్పగిస్తారు, వారు దాన్ని ప్రతిపాదిస్తారు, లేదా వివాదం తలెత్తినపుడు కొంత మంది కలసి ప్రత్నామ్నాయ ప్రతిపాదనలు చేస్తారు. వాటికి ఆమోదం లేదా తిరస్కారం తరువాత అది వ్యక్తులది కాదు ఉమ్మడి అభిప్రాయం మాత్రమే. లెనినిజం, స్టాలినిజం,మరొకయిజం అన్నది మార్క్సు-ఎంగెల్స్‌ల తరువాత సంభవించిన నూతన పరిణామాలు లేదా రంగనాయకమ్మగారి వంటి వారు ముందుకు తెచ్చిన భాష్యాల్లోని వక్రీకరణలను తిప్పికొట్టేందుకు లెనిన్‌ ఇచ్చిన వివరణలు మార్క్కిస్టు సిద్దాంతాన్ని పరిపుష్టం చేశాయి, వాటిని దాదాపుగా కమ్యూనిస్టులందరూ అంగీకరించారు గనుక తరువాత కాలంలో మార్క్సిజం-లెనినిజం అని పిలిచారు. స్టాలిన్‌ కూడా కొన్ని అంశాలకు వివరణ ఇచ్చినప్పటికీ వాటిని స్వీకరించినా దాన్ని స్టాలినిజంగా ఎవరూ పరిగణించటం లేదు. అలాగే మావో వివరణలు ఆమోదించిన వారు మార్క్సిజం-లెనినిజాలకు మావో ఆలోచనా విధానమనో, మావో ఇజమనో పెట్టుకుంటున్నారు. అలా పెట్టుకోని వారు కూడా చైనా పరిస్ధితులకు మావో అన్వయించిన సూత్రీకరణలను పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఇక రంగనాయకమ్మగారి భాష్యాలను ఆమోదించిన వారు మార్క్సు-లెనిన్‌ సరసన ఆమె ఇజాన్ని కూడా చేర్చి విప్లవాలను తేవచ్చేమో ? ఇంతకీ ఆమె ఇజాన్ని ఆమోదించే లేదా అమలు చేసే పార్టీ ఏదైనా ఉందా ? నిజంగా తెలుసుకొనేందుకే !

3) 1953లో స్టాలిన్‌ మరణం తర్వాత అధికారానికి వచ్చిన కశ్చెవ్‌ స్టాలిన్‌ మీద చేసిన దాడి గురించి చెప్పనవసరం లేదు. అదే పెద్ద మనిషి, బ్రెజ్నెవ్‌ కూడా స్టాలిన్‌ విధానాన్నే కొనసాగించాడని అందుకే ఇతర జాతుల వారు విడిపోవాలనే డిమాండ్‌ను ముందుకు తేలేదని రంగనాయకమ్మగారు చెప్పారు. అలాంటపుడు ఆమె దాడి ఒక్క స్టాలిన్‌ మీదనే ఎందుకు కేంద్రీకరించినట్లు ?


4. సోవియట్‌ యూనియన్‌ నించీ విడిపోయాక ఉక్రెయిన్‌లో రాజకీయ అనిశ్చితి ఉంది. వివిధ పార్టీల, ప్రభుత్వాల నేతలు అమెరికా లేదా రష్యా ప్రభావంలో ఉన్నప్పటికీ ఇతర దేశాలతో సాధారణ దౌత్య సంబంధాలు పెట్టుకున్నారు తప్ప ఏ కూటమిలోనూ చేరలేదు అని మరోసారి చెబుతున్నాను. తాము నాటోలో చేరాలనుకుంటున్నట్లు బుఖారెస్ట్‌ 2008 నాటో సభకు ఉక్రెయిన్‌, జార్జియా దరఖాస్తు చేశాయి. అమెరికా అంగీకరించగా ఐరోపా దేశాలు కొన్ని కాదన్నాయి, కానీ రాజీగా నిర్ధిష్ట గడువును పేర్కొనకుండా ఈ దేశాలు నాటో సభó్యదేశాలు అవుతాయి అని ప్రకటన చేశారు. తాజా సంక్షోభానికి ఆ విధంగా నాటో కూటమి నాంది పలికింది. తరువాత 2010 ఉక్రెయిన్‌ ఎన్నికల్లో గెలిచిన అధ్యక్షుడు విక్టర్‌ ఎన్‌కోవిచ్‌ వెంటనే సెవాస్తపూల్‌ రేవు కౌలు గడువును 2042వరకు పెంచుతూ రష్యాతో ఒప్పందం చేసుకున్నాడు. అదే పెద్ద మనిషి తరువాత పశ్చిమ దేశాల వత్తిడితో ఐరోపా యూనియన్‌ కూటమితో ఒప్పందానికి 2013 ఏప్రిల్‌లో సుముఖత తెలిపాడు. వెంటనే రష్యా రంగంలోకి దిగటంతో సంతకాలు చేసేందుకు కొద్ది రోజుల ముందు ఆ ఒప్పందాన్ని తిరస్కరిస్తున్నట్లు ఒక ప్రకటన చేశాడు. ఎవరు వత్తిడి చేస్తే అటు మొగ్గాడు.చివరకు పశ్చిమ దేశాలు నిరసనలను ఎగదోయటంతో దేశం విడిచి వెళ్లాడు. వాస్తవం ఇది కాగా ” అతనికి ముందు 1991 నించీ 2012 వరకూ వున్న వాళ్ళూ, అతని తర్వాత వాళ్ళూ అమెరికా కూటమికి అనుకూలురూ అన్నమాట! ” అంటూ రంగనాయకమ్మగారు చెప్పారు. రాజుగారి చిన్న భార్య అందగత్తె అంటే పెద్దామె అనాకారి అన్నట్లుగా ఉంది.


5) ” రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు సోషలిస్టు సోవియట్‌ యూనియన్‌ వుంది అని వ్యాసకర్త సమర్ధన. అసలు అక్కడ, అప్పుడు వున్నది ప్రభుత్వ పెట్టుబడిదారీ విధానం. ఇంకా సరిగా చెప్పాలంటే, పార్టీ పెట్టుబడిదారీ విధానం. ఉత్పత్తి సాధనాలు వ్యక్తుల స్వంత ఆస్తిగా లేనంత మాత్రాన, అది సోషలిజం కాదు. ” అన్నారు. అంటే సోవియట్‌ యూనియన్ను సోషలిస్టు దేశంగా గుర్తించలేదు. తత్వం తలకెక్కింది రోకలిని తలకు చుట్టమనటం తప్ప మరొకటి కాదు. సోషలిస్టు వ్యవస్దలో ప్రభుత్వం కార్మికవర్గ ఆధిపత్యంలో ఉంటుంది. అంటే ఉత్పత్తి సాధనాలు ఎవరి చేతిలో ఉన్నట్లు ? ఫలితాలను ఎవరు అనుభవిస్తారు ?

6) ” కొన్ని దేశాలు అమెరికా పెత్తనానికీ, దుర్మార్గానికీ బలయ్యాయనీ రష్యాకి అలాంటి దుర్మార్గ చరిత్ర లేదనీ వ్యాసకర్త కితాబు. మరి, 1956లో హంగరీ మీదకీ, 1968లో చెకొస్లవేకియా మీదకీ, 1979లో అఫ్గనిస్తాన్‌ మీదకీ యుద్ధ టాంకుల్ని పంపింది, రష్యాయా, అమెరికాయా? ” అని ప్రశ్నవేశారు. మొదటి రెండు ఉదంతాల్లో సోషలిస్టు వ్యవస్ధకు అమెరికా సిఐఏ కుట్రలతో ముప్పు తలపెట్టినపుడు వాటి రక్షణకు అక్కడి ప్రభుత్వాల కోరిక మేరకు సోవియట్‌ జోక్యం చేసుకుంది, ఆఫ్ఘనిస్తాన్‌లో అధికారానికి వచ్చిన వామపక్ష శక్తుల ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు అమెరికా చేసిన కుట్రను ఎదుర్కొనేందుకు అక్కడి ప్రభుత్వ కోరిక మేరకే అడుగు పెట్టింది. దానిలో ఇప్పుడు స్వతంత్ర దేశంగా ఉన్న ఉక్రెయిన్‌ కూడా భాగస్వామే. అంతర్జాతీయ కర్తవ్యంగా ఆపని చేసినందుకు సోషలిస్టు అభిమానులందరూ హర్షించారు. రంగనాయకమ్మ వంటి వారు పురోగామివాదులుగా చెప్పుకుంటూ శత్రువులతో గొంతు కలిపి ఖండించారు. సోషలిస్టు శత్రువులకూ-మిత్రులుగా చెప్పుకున్నవారికీ భలే కలిసింది. సోషలిజం, కమ్యూనిజం అంటే గిట్టదు అని సూటిగా వ్యతిరేకించే వారిని అర్దం చేసుకోగలం. వారి గురించి పురోగామి శక్తులకు స్పష్టత ఉంటుంది. కానీ మార్క్సిస్టు ముసుగులో ఉండి దాడి చేసే వారు ” కుహనా మిత్ర శత్రువులు ” తప్ప మరొకటి కాదు. అసలు శత్రువుల కంటే వీరు చేసే నష్టం ఎక్కువ. వారు సృష్టించిన గందరగోళంలో పడిన పురోగామి వాదులు ఎటూ తేల్చుకోలేక పడక కుర్చీలకు తప్ప దేనికీ పనికి రారు. అంతిమంగా వారు పాలకవర్గాలకు మేలు చేస్తున్నారు తప్ప కార్మికవర్గానికి కాదు.
7) ”ఉక్రెయిన్‌ మీద రష్యా దురాక్రమణని సమర్ధించడానికి, వ్యాసకర్త ఒక కొత్త సూత్రాన్ని తయారు చేశారు. ‘అన్ని పెట్టుబడిదారీ దేశాలూ దురాక్రమణదారులు కాదు’ అని ” అవును, అది మన కళ్ల ముందున్న ఒక వాస్తవం.శాశ్వతంగా అలాగే ఉంటాయని నేను చెప్పలేదు. పెట్టుబడిదారీ దేశాల స్వభావం గురించి మార్క్సూ- ఎంగెల్సులు చెప్పిన మాట నిజం. అది సాధారణ సూత్రీకరణ. పారిశ్రామిక విప్లవం తరువాత మార్కెట్ల ఆక్రమణకు వాటి మధ్య ఉన్న వైరుధ్యాల కారణంగానే యుద్దాలు జరిగాయి. తరువాత పెట్టుబడిదారీ విధానాన్ని అనుసరించిన దేశాలన్నీ మార్కెట్ల కోసం చూసినా దురాక్రమణదారులుగా మారలేదు. వలసలు అంతరించాయి. దాన్ని గుర్తించకపోతే మొరటుతనం అవుతుంది తప్ప మార్క్సిజం లెనినిజం కాదు. సోషలిస్టు చైనా మీద అమెరికా కుట్రలు చేస్తోంది. దాన్ని ఎదుర్కొనేందుకు ఎవరు తోడ్పడితే వారి సహకారం తీసుకోవాలి. దానిలో భాగమే రష్యా-చైనా మైత్రి. అది శాశ్వతం అని ఎవరైనా చెప్పారా ? అమెరికాను దెబ్బ తీసేందుకు చైనా, మరొక సోషలిస్టు దేశం గానీ అవకాశం వచ్చినపుడు అంతర్జాతీయ పరిణామాల్లో జోక్యం చేసుకోకపోతే శత్రువలలో చిక్కినట్లే ! అసలు ఇంతకూ రంగనాయకమ్మగారు చైనాను సోషలిస్టు దేశంగా గుర్తిస్తున్నారా లేక అది కూడా ప్రభుత్వ పెట్టుబడిదారీ విధానం అనుసరిస్తున్నది అనే వారితో యుగళ గీతం పాడుతున్నారా ?
8) దురాక్రమణ యుద్ధానికి నాజూకైన పేరే ‘ప్రత్యేక సైనిక చర్య’ అని రంగనాయకమ్మగారు అంటున్నారు. ఎవరు దేన్ని ముట్టుకుంటే దాన్ని అలా వర్ణిస్తారు అన్న అంధ వికలాంగులు- ఏనుగు కథ తెలిసిందే. దీని కంటే కళ్లుండీ చూడలేక మార్క్సిస్టు కబుర్లు చెబుతున్నవారు తమ వక్రీకరణలకు నాజూకైన పేర్లు పెట్టటమే పెద్ద నష్టం కలిగిస్తోంది. రష్యా తన లక్ష్యం ఏమిటో స్పష్టంగా చెప్పింది. ప్రజాస్వామ్యకబుర్లు చెప్పలేదు. ఉక్రెయిన్లో ప్రజాస్వామ్యఖూనీ జరిగిందనా లేదు. నాటో చేరాలనే ప్రతిపాదనను వదులు కుంటే అక్కడి ప్రభుత్వాన్ని గుర్తిస్తానని, ప్రాదేశిక సమగ్రతకు హామీ ఇస్తానని చెప్పింది.


9)” అమెరికా, రష్యా, రెండూ పెట్టుబడిదారీ దేశాలే అని ఒక పక్కన ఒప్పుకుంటూ, అమెరికాకు వ్యతిరేకంగా రష్యాని బలపరచాలని సలహా ఇస్తున్నారు వ్యాసకర్త” అన్నారు రంగనాయకమ్మగారు. మార్క్సిజంలో ఔపోసన పట్టటానికి ఇంకేమీ మిగిలినట్లు లేదు కనుక ఆమె చరిత్రను ఒక పట్టుపట్టాలి. చైనా విప్లవ చరిత్రలో జపాన్‌ సామ్రాజ్యవాదుల మీద పోరాడేందుకు అప్పటి వరకు తమను అణిచివేస్తున్నచాంగ్‌కై షేక్‌తోనే కమ్యూనిస్టులు చేతులు కలిపారు.” ఇద్దరు బందిపోటు ముఠాలున్నప్పుడు, ఆ ఇద్దరికీ వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాన్ని కూడగట్టాలి. అంతేగానీ, ‘ఈ బందిపోటుది న్యాయం, ఆ బందిపోటుది కుట్ర’ అని ఏదో ఒక పక్షాన నిలబడడం అంటే, రెండు దేశాల ప్రజలకూ ద్రోహం చెయ్యడమే.” అని చెప్పిన రంగనాయకమ్మగారి సూత్రీకరణలో చైనా పరిణామాన్ని ఎలా ఇముడ్చుతారు ? మావో నాయకత్వంలో అక్కడి పార్టీ ప్రజలకు ద్రోహం చేసిందని చెబుతారా, ఏమో !


10) ”వ్యాసకర్త… అమెరికా, పెట్టుబడిదారీ దేశాలనే కాదు, సోషలిస్టు దేశాలనూ వ్యతిరేకిస్తోందని అన్నారు. ఆ సోషలిస్టు దేశాలు ఎక్కడున్నాయో చెపితే బాగుండేది. చైనాలో మావో గ్రూపూ, చౌ ఎన్‌ లై గ్రూపూ, లిన్‌ పియావో గ్రూపూ అంటూ 3 పెద్ద గ్రూపుల మధ్య కమ్యూనిస్టు పార్టీలోనే వర్గ పోరాటం లాంటిది జరుగుతూ వుండేది. దాని ఫలితంగానే, అప్పటికి ఎన్నో ఏళ్ళుగా సంబంధం లేని అమెరికాతో చైనా సంబంధాలు మొదలైనాయి.” అని రంగనాయకమ్మగారు చెప్పారు. విస్సన్న చెప్పిందే వేదం – నేను చెప్పిందే అసలు సిసలు మార్క్సిజం అని ఆమె అనుకుంటున్నట్లున్నారు. చైనాతో సహా ఇతర సోషలిస్టు దేశాలను గుర్తించటం లేదు. చైనా కమ్యూనిస్టు పార్టీలో సైద్దాంతిక, విధానాల అమలు మీద అంతర్గత చర్చలు పెద్ద ఎత్తున జరిగాయి. దాన్ని ” వర్గపోరాటం ” అని ఏ మార్క్సిస్టు అవగాహన ప్రకారం వర్ణించినట్లు ? అందుకే పద ప్రయోగాలు, భాష్యాలు చెప్పేటపుడు రంగనాయకమ్మగారు జాగ్రత్తలు తీసుకోవాలి అని నా తొలి స్పందనలో మనవి చేశాను. మరోసారి అదే చేస్తున్నాను.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

” నాగరిక ” ఐరోపాలో ఉక్రెయిన్‌ మహిళల మాన మర్యాదలకు ముప్పు !

20 Wednesday Apr 2022

Posted by raomk in Current Affairs, imperialism, INTERNATIONAL NEWS, RUSSIA, UK, USA, WAR

≈ Leave a comment

Tags

sexual exploitation, Ukraine-Russia crisis, Ukrainian Refugees, UN refugee agency


ఎం కోటేశ్వరరావు


యుద్ధాన్ని ఎవరూ కోరుకోరు, వద్దే వద్దు ! దానిలో ముందుగా బాధితులుగా మారేది మహిళలు, పిల్లలే అన్నది ప్రపంచ అనుభవం. సామ్రాజ్యవాదులు తమ లబ్దికోసం యుద్దాలను రుద్దుతున్నారు. అమెరికా, ఐరోపా నాటో కూటమి రగిలించిన వివాదం కారణంగా జరుగుతున్నదే ఫిబ్రవరి 24న ఉక్రెయిను మీద రష్యా ప్రారంభించిన సైనిక చర్య. దశాబ్దాల తరబడి పశ్చిమ దేశాలు అనుసరించిన విస్తరణ వాదం చివరకు తన ముంగిట్లో ముప్పుకు దారితీస్తున్నదనే భయాన్ని రష్యా పదే పదే వెల్లడించినా ఐరాస పట్టించుకోలేదు. దుష్టవిధానాల కారణంగా ప్రారంభమైన దాడులను ఎందరు మరణించినా సరే, అతివల మాన మర్యాదలు మంట కలిసినా, పిల్లల జీవితాలు నాశనమైనా తగ్గేదేలే అన్నట్లుగా అమెరికా, కొన్ని పశ్చిమ దేశాలు మరింతగా ఎగదోస్తున్నాయి. ఫలితంగా ఏప్రిల్‌ 16వ తేదీ నాటికి 49లక్షల మంది ఇరుగు పొరుగు దేశాలకు కాందిశీకులుగా ఉక్రెయిన్‌ పౌరులు వలస వెళ్లారు. దేశంలో 71లక్షల మంది చెల్లాచెదురయ్యారు. కొన్ని అంచనాల ప్రకారం మరొక కోటీ ఇరవైలక్షల మంది ఎటూ పోలేని స్ధితిలో ఉన్నారని వార్తలు. మొత్తం జనాభా నాలుగున్నర కోట్ల మంది అంటే పరిస్ధితి ఎంత తీవ్రంగా ఉందో అర్దం చేసుకోవచ్చు. అయినా సరే నాటో కూటమి చేతిలో కీలుబొమ్మగా మారిన జెలెనెస్కీలో ఎలాంటి మార్పు లేదు. దేశ సార్వభౌమత్వానికి ఎలాంటి ముప్పు తమవైపు నుంచి ఉండదని రష్యా పదే పదే చెబుతున్నా నాటో దేశాలు ఇచ్చే ఆయుధాలను చూసుకొని మరింతగా పరిస్ధితిని దిగజార్చుతున్నాడు.


రష్యా దాడులతో విదేశాలకు కాందిశీకులుగా వెళ్లినవారిలో పిల్లలు, మహిళలు ఎక్కువ మంది ఉన్నారు.వారికి బాంబులు, బుల్లెట్లు,క్షిపణుల ముప్పు లేదు. ఆశ్రయం ఇచ్చిన వారి చేతుల్లో మరొక ఉపద్రవాన్ని ఎదుర్కొంటున్నారు. ఆడపిచ్చితో తపించేవారు, దేహాలతో వ్యాపారం చేసే తార్పుడుగాళ్ల వలలకు చిక్కుకుంటున్నారనే వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. మృతకళేబరాల కోసం వాలే రాబందుల మాదిరి కాందిశీక మహిళల కోసం సాయం చేసే స్వచ్చంద సేవకులు, ఇతర ముసుగులో పోర్నోగ్రాఫర్స్‌(బూతువ్యాపారులు) వాలిపోతున్నారు. కాందిశీకులకు భాష కూడా పెద్ద సమస్యగా మారి వేటగాండ్ల వలలో చిక్కుకుంటున్నారు. తీవ్ర గర్హనీయ అంశం ఏమంటే ఒంటరిగా ఉండే పురుషుల ఇండ్లకు శరణార్ధులైన మహిళలు, పిల్లలను బ్రిటన్‌ ప్రభుత్వం పంపుతున్నదని, ఇది వారిని లైంగికంగా దోపిడీ చేసేందుకు దోహదం చేస్తుందని సాక్షాత్తూ ఐరాస కాందిశీకుల కమిషనర్‌ తప్పుపట్టారంటే వారెంత నిస్సహాయ స్ధితిలో ఉన్నారో అర్ధం చేసుకోవచ్చు. ఇది ఒక్క బ్రిటన్‌కే పరిమితం కాదు. అనేక మంది తాము ఎక్కడ ఎలాంటి వారి చేతుల్లో ఇరుక్కున్నామో వెల్లడిస్తున్న గాధలు పత్రికల్లో వస్తున్నాయి.


ఐరోపా దేశాల బూతు వెబ్‌సైట్లలో ఇప్పుడు ఉక్రెయిన్‌ పేరు పెద్ద ఎత్తున ప్రాచుర్యంలోకి వచ్చింది.మహిళల దేహాలు మగతనపుదాడుల కేంద్రాలుగా మారుతున్నాయి.” మేము ఉక్రెయిన్‌పై బాంబులు వేశాము, అమ్మాయిలను అనుభవించాము.యుద్దానికి వెళ్లే ముందు రష్యన్‌ బాలికను అనుభవించిన ఉక్రెయిన్‌ సైనికుడు. ఉక్రెయిన్‌ యుద్దంలో శృంగారం ” వంటి అంశాలు బూతుసైట్లలో దర్శనమిస్తున్నాయి. ఇంకా ఇంతకంటే దారుణమైన భాష వాడుతున్నారు. ” ఉక్రెయిన్లో యుద్దం బూతుకు ప్రతిరూపంగా మారింది ” అని ఒక విశ్లేషణకు ఇచ్చిన శీర్షిక. ఇదంతా ఎక్కడో కాదు మానవహక్కుల గురించి నిత్యం కబుర్లు చెబుతూ నాగరికులం అని తమకు తామే కితాబునిచ్చుకుంటున్న ఐరోపాలో జరుగుతోంది. ప్రపంచంలో మానవహక్కుల పరిరక్షకులం తామే అని ఫోజు పెట్టే అమెరికా, ఐరోపా దేశాలకు ఈ దారుణాలు పెద్దగా పట్టినట్లు లేదు. ప్రతి మానవ విపత్తులోనూ సర్వం కోల్పోయినపుడు ఇలాంటి లైంగిక దాడులు లేదా దోపిడీకి మహిళలు గురికావటం, లాభాల కోసం ఉపయోగించుకోవటం సర్వసాధారణంగా మారింది.


” రుమేనియా సరిహద్దులో మాటువేసిన పురుషులు ఆకర్షణీయ వాగ్దానాలతో లోబరుచుకుంటున్నారు. మీ సెల్‌ఫోన్లకు చార్జిచేసుకోండి, మీరు ఏదైనా కారు ఎక్కితే వాటి నంబర్లు నమోదు చేసుకోండి అని హంగరీ అధికారులు చెబుతున్నారు. పాసుపోర్టులు తమకు స్వాధీనం చేస్తే ఆశ్రయం కల్పిస్తామని, డబ్బిస్తామని కొందరు చెబుతున్నారు” అని ఐరోపా కౌన్సిల్‌ అనే మానవహక్కుల సంస్ధ తన నివేదికలో పేర్కొన్న కొన్ని అంశాలివి. తీరా ఆశ్రయం కల్పించిన వారి ఇండ్లకు వెళ్లిన తరువాత వారి నిజస్వరూపాలు వెల్లడి కావటంతో అనేక మంది తప్పించుకొని తిరిగి సరిహద్దులకు చేరి కొత్తగా వస్తున్న కాందిశీకులను హెచ్చరిస్తున్నారు. పదిహేనులక్షల మంది పిల్లలు పెద్దవారి తోడు లేకుండా సరిహద్దులు దాటి వచ్చారని వారికి ముప్పు ఉందని యునిసెఫ్‌ ఆందోళన వ్యక్తం చేసింది.మానవ వ్యాపారులు వారిని ఐరోపా దేశాలకే కాదు, వెలుపలకు కూడా తరలించవచ్చని, ఇలాంటి వారితో జరిపే బూతు వ్యాపార విలువ ఏటా వంద బిలియన్‌ డాలర్లని అంచనా. అవయవవ్యాపారుల సంగతి సరేసరి. ఉక్రెయిన్‌ ఆర్ధిక దుస్ధితి కారణంగా మహిళలు చాలా కాలం నుంచి దోపిడీకి గురవుతున్నారు. అద్దెగర్భాలతో పిల్లల్ని కనటం ఇక్కడ చట్టబద్దం కావటంతో ఆ విధంగా కూడా వారు బాధితులే. కరోనా కారణంగా పరిస్ధితులు దిగజారటంతో యుద్ధానికి ముందే అనేక మంది ఉక్రెయిన్‌ మహిళలు విదేశాల్లో ఉపాధిపేరుతో మానవ వ్యాపారుల(తార్పుడు) వలలో చిక్కుకున్నారు. ఇది మరొక విపత్తు. తాజాగా పోలెండ్‌, తదితర దేశాల్లో అలాంటి వారి వలనుంచి తప్పించుకున్నవారి ఉదంతాలు కూడా ఉన్నాయి.


మార్చినెలలో స్వీడెన్‌ పోలీసులు 38 మంది పురుషులను వ్యభిచార నేరం కింద అరెస్టు చేశారు. వారిలో 31 మందితో ఉన్న మహిళలు ఉక్రెయినుకు చెందిన వారే, ఇటీవల వచ్చిన వారు అని పోలీసులు వెల్లడించారు. రవాణా, ఆశ్రయం వంటి ఇంటర్నెట్‌లో ప్రకటనలతో సంఘటితంగా లావాదేవీలు జరుగుతున్నట్లు తెలిపారు. ఉక్రెయిను కాందిశీకులు 40కిపైగా దేశాలకు వలస వెళ్లినట్లు ఇప్పటి వరకు వివరాలు చెబుతున్నాయి.ఐరాస పేర్కొన్న 49లక్షల మందిలో ఒక్క పోలెండులోనే 27,63,786 మంది ఉన్నారు. మూడు లక్షలకు పైబడి రుమేనియా,హంగరీ, మాల్డోవా, స్లోవేకియా, జర్మనీ ఉన్నాయి. ఉక్రెయిన్లోని డాన్‌బాస్‌ ప్రాంతంపై ఉక్రెయిన్‌ మిలిటరీ, కిరాయి నయానాజీలు జరుపుతున్నదాడులు, అత్యాచారాల నుంచి తప్పించుకొనేందుకు 4,84,725 మంది రష్యాకు కాందిశీకులుగా వెళ్లారని కూడా ఐరాస తెలిపింది. ఈప్రాంతం నుంచి జనాలు వెళ్లిపోవాలని ఉక్రెయిను ప్రభుత్వమే ఆదేశించింది.
ప్రభుత్వం రూపొందించిన పధకం ప్రకారం బ్రిటన్‌లోని కుటుంబాలు, ఒంటరి పురుషులు ఉక్రెయిన్‌ మహిళలకు తమ రూముల్లో లేదా ఇతరంగా ఆశ్రయం కల్పిస్తామని ప్రభుత్వం దగ్గర నమోదు చేసుకోవాలి. వారికి ప్రభుత్వం కాందిశీక మహిళలను కేటాయించి పంపుతుంది. ఈ కార్యక్రమం తార్పుడు గాళ్లకు చెకుముకి రాయి వంటిదని ఒక స్వచ్చంద సంస్ద తూర్పారబట్టింది. వేలాది మంది బ్రిటన్‌ పురుషులు వివిధ వెబ్‌సైట్లలో తమ పేర్లు నమోదు చేసుకున్నారు. తమతో శృంగారంలో పాల్గొంటేనే ఆశ్రయం కొనసాగుతుందని తేల్చి చెప్పటంతో వారి కారుణ్యం వెనుక ఉన్న వలేమిటో అర్ధమైంది. నిజానికి ఇది ఒక్క బ్రిటన్‌కే పరిమితం కాదు అనేక దేశాల్లో ఇలాంటి ఉదంతాలు కోకొల్లలు. ఉచితంగా జర్మనీ లేదా పోలెండ్‌ తీసుకుపోతామంటూ ముందుకు వచ్చిన వారెందరో లైంగికదోపిడీ గాళ్లని తేలింది. తమ ఆశ్రయం పొందాలన్నా, తాము చూపిన ఉపాధిలో చేరాలన్నా తమను లేదా తాము పంపేవారిని గాని లైంగికంగా తృప్తి పరచాలనే షరతులను ముందుకు తెస్తున్నారు.


ఉక్రెయిన్‌ మిలిటరీ లేదా నయా నాజీలకు ఆయుధాల అందచేతలో అమెరికా,బ్రిటన్‌ ముందున్నాయి. బ్రిటన్‌ పాలకుల మరొక దుర్మార్గం ఏమంటే వివిధ దేశాల కాందిశీకులకు తమ దేశంలో ఆశ్రయం కల్పించకుండా ఖర్చును తగ్గించుకొనేందుకు తూర్పు ఆఫ్రికాలోని ర్వాండా దేశానికి పంపుతున్నది.ఈ చర్యను ఐరాస కాందిశీకుల కమిషనర్‌ ఖండించినా బ్రిటన్‌ ఖాతరు చేయటం లేదు, అక్రమంగా ఇంగ్లీషు ఛానల్‌ దాటుతూ ప్రమాదాలపాలు కాకుండా నిరుత్సాహపరిచేందుకు ఇలా చేస్తున్నామని కుంటిసాకులు చెబుతున్నది. ఉక్రెయిన్‌ కాందిశీకులకూ దీన్నే అమలు జరుపుతున్నారు. తమ ఆర్ధిక వ్యవస్ధకు తోడ్పడని వారు ఎవరైనా బ్రిటన్‌ వస్తే వారిని వదిలించుకోవటం ఒక విధానంగా పెట్టుకున్నది. కొన్ని ఐరోపా దేశాలు ఉక్రెయిన్‌ కాందిశీకులను చౌకగా పని చేసే శ్రామికులుగా వినియోగిస్తూ గతంలో ఉన్నవారిని తొలగిస్తున్నట్లు వార్తలు వచ్చాయి.


లండన్‌ టైమ్స్‌ పత్రిక విలేకరి ఒకామె కాందిశీకుల దురవస్తలను తెలుసుకొనేందుకు ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ నుంచి వచ్చిన 22 ఏండ్ల నటలయ అని ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టింది. కొద్ది నిమిషాల్లోనే కుప్పలు తెప్పలుగా శృంగార సందేశాలు పంపుతూ బ్రిటన్‌ పురుషులు స్పందించారు. నా దగ్గర పెద్ద పరుపు ఉంది, ఇద్దరం ఇబ్బంది లేకుండా నిద్రించవచ్చని, నేను సాయం చేస్తా ప్రతిగా నీవు కూడా ఏదో చేయాలి, నీకు వివాహం కాకపోతే నేను చేసుకుంటా,నిన్ను మంచిగా చూసుకుంటా వంటి సందేశాలు వచ్చాయి. ఆమెకు రెండు రోజుల్లో వచ్చిన 75 ప్రయివేటు సందేశాలు పంపిన వారిలో 41 మంది ఒంటరి పురుషులే ఉన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన వడపోతలో నేర చరితులను నిరోధించటం సాధ్యం అవుతుంది తప్ప శృంగార వలవిసిరే వేటగాళ్లు దొరకరు. ఆ వలకు చిక్కిన వారి పరిస్ధితి ఏమిటి ?


ఏప్రిల్‌ 20 నాటికి రష్యా సైనిక చర్య ప్రారంభమై 57వ రోజుకు చేరుకుంది. తన యుద్ద నౌకను ముంచి వేసిన తరువాత రష్యాదాడులను ముమ్మరంగావించింది. కీలకమైన రేవు పట్టణం మరియుపూల్‌ను స్వాధీనం చేసుకున్న తరువాత తూర్పు ఉక్రెయిను మీద దాడి మరింత సులభం అవుతుంది. డాన్‌బాస్‌ ప్రాంతంలో స్ధానికంగా ఉన్న తన మద్దతుదారులతో కలసి పెద్ద ఎత్తునదాడులకు దిగనున్నట్లు తాజావార్తలు వెల్లడించాయి. రష్యా నౌకను ముంచామని, సైనికులకు నష్టం కలిగించామని ఉక్రెయిన్‌ పాలకులు ఆనందం వెల్లడించటం ఆయుధాలు అందిస్తున్న పశ్చిమ దేశాలకు ఆనందం, తృప్తి కలగవచ్చునేమో గానీ తన పౌరులకు, ఆర్ధికరంగానికి జరుగుతున్న నష్టం గురించి జెలెనెస్కీ, ఇతర విధాన నిర్ణేతలకు పట్టినట్లు లేదు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

చైనాతో సఖ్యత కోరితే దేశద్రోహం – వాణిజ్యం చేస్తే దేశభక్తి ! ఏమి తర్కంరా బాబూ !!

17 Sunday Apr 2022

Posted by raomk in BJP, CHINA, Congress, Current Affairs, Economics, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, RUSSIA, UK, USA, WAR

≈ Leave a comment

Tags

2022 BRICS Summit, BJP, BRICS, China-India Relations, Indo-China trade, Narendra Modi Failures, RSS, Ukraine-Russia crisis


ఎం కోటేశ్వరరావు


మేకిన్‌ ఇండియా(భారత్‌లో తయారీ) అంటే చైనా నుంచి కొనుగోలు, బిజెపి అంటే బీజింగ్‌(చైనా రాజధాని నగరం పేరు) జనతా పార్టీ. జుమ్లా ఫర్‌ ఇండియా(భారత్‌కు మాటలు) జాబ్స్‌ ఫర్‌ చైనా (చైనాకు ఉద్యోగాలు) రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై పార్లమెంటు చర్చలో ఫిబ్రవరి నెలలో కాంగ్రెస్‌ నేతలు మల్లిఖార్జున ఖర్గే. రాహుల్‌ గాంధీ విసిరిన చెణుకులివి. ఎందుకీ పరిస్థితి అంటే నరేంద్రమోడీ సర్కార్‌ ఆచరణే అన్నది స్పష్టం. గతంలో కాంగ్రెస్‌ మీద బిజెపి విసిరిన వాటికి ఇప్పుడు బదులు తీర్చుకుంటున్నారు. అధికారంలో ఉన్నవారికి తప్పదివి. రెండు పార్టీలు అనుసరించే ఆర్ధిక విధానాలు ఒకటే గనుక దొందూ దొందే !!


చైనా విదేశంగ మంత్రి వాంగ్‌ ఇ మార్చి నెలాఖరులో ఢిల్లీ పర్యటన జరిపారు.ఈ ఏడాది సెప్టెంబరులో బీజింగ్‌లో జరిగే బ్రిక్స్‌(బ్రెజిల్‌,రష్యా,ఇండియా,చైనా, దక్షిణ ఆఫ్రికా) కూటమి పద్నాలుగవ సమావేశాలు, బ్రిక్స్‌ 15వ వార్షికోత్సవం కూడా జరపనున్నారు. లడఖ్‌ సరిహద్దులోని ఘర్షణాత్మక ప్రాంతాల నుంచి చైనా తన సేనలను ఉపసంహరించుకోని పక్షంలో తాను ఈ సమావేశాలకు వచ్చేది లేదని ప్రధాని నరేంద్రమోడీ ముందస్తు సందేశాలను పంపుతున్న పూర్వరంగంలో వాంగ్‌ పర్యటన జరిగింది. ప్రధాని ఉత్తర ప్రదేశ్‌ కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకార హడావుడిలో ఉన్నందున వాంగ్‌తో భేటీ కుదరలేదని చెప్పారు. సరిహద్దు సంగతి తేలకుండా తాను బీజింగ్‌ వచ్చేది లేదని స్పష్టం చేయటమే దీని అంతరార్దం అని విశ్లేషకులు పేర్కొన్నారు. సరిహద్దు వివాదం, సైనిక బలగాల ఉపసంహరణ, గతంలో కుదిరిన ఒప్పందాల అమలు వంటి అంశాలపై రెండుదేశాల మధ్య ఇప్పటి వరకు 15దఫాలుగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి.


బ్రిక్స్‌ శిఖరాగ్ర సభ భారత్‌-చైనాలకే పరిమితం కాదు. ఏ సంవత్సరం ఆ కూటమికి ఏ దేశం అధ్యక్షత వహిస్తుందో ఆ దేశంలో సభలు జరుపుతారు. ఈ సమావేశాలకు హాజరు కావటానికి సరిహద్దు వివాదానికి ముడి పెట్టటం ఏమిటన్నది ప్రశ్న. పోనీ చైనాతో లావాదేవీల్లో అన్ని అంశాల్లో ఇలాగే ముడిపెట్టి అడుగు ముందుకు వేయనని నరేంద్రమోడీ చెబుతున్నారా ? లేదే ! 2020 గాల్వన్‌ ఉదంతం తరువాత చైనా వస్తువులను బహిష్కరించాలంటూ సంఘపరివార్‌కు చెందిన వారు, వారి ప్రభావానికి లోనైన మీడియా, ఇతరులు కూడా పెద్ద హడావుడి, దేశభక్తి ప్రదర్శనలు చేశారు. చైనా యాప్‌లను నిషేధించారు, దీపావళికి చైనా టపాసులు వద్దన్నారు. చిత్రం ఏమిటంటే అలాంటి వారిని వెర్రి వెంగళప్పలను చేస్తూ ఆ ఏడాదితో పోల్చితే 2021లో చైనా నుంచి దిగుమతులను అనుమతించటంలో మోడీ సర్కార్‌ కొత్త రికార్డు నెలకొల్పింది.126 బిలియన్‌ డాలర్ల మేర దిగుమతి-ఎగుమతి లావాదేవీలు జరిగాయి. ఈ సంవత్సరం తొలి మూడు మాసాల్లో గత రికార్డులను బద్దలు కొట్టే దిశలో 31.9 బి.డాలర్ల లావాదేవీలు జరిగాయి. పోనీ మన దేశ ఎగుమతులు ఎక్కువగా ఉన్నందున చూసీ చూడనట్లు ఉన్నారని అనుకుందామా ? ఉభయ దేశాల మధ్య 2021లో 125.66 బి.డాలర్ల వాణిజ్యం జరిగితే చైనా నుంచి అంతకు ముందేడాదితో పోలిస్తే 46.2 శాతం దిగుమతులు పెరిగి 97.52 బి.డాలర్లకు చేరింది. మన ఎగుమతులు 34.2శాతం పెరిగి 28.14 బి.డాలర్ల మేరకు జరిగాయి.


ఇక ఈ ఏడాది జనవరి-మార్చి మాసాల్లో 31.96 బి.డాలర్ల లావాదేవీలు జరగ్గా మన దిగుమతులు 27.1 బి.డాలర్లు, ఎగుమతులు 4.87 బి.డాలర్లుగా ఉన్నాయి. మన దిగుమతులు 28.3 శాతం పెరగ్గా ఎగుమతులు 26.1శాతం తగ్గాయి. మన ఇనుపఖనిజం ఎగుమతులు పడిపోవటమే దీనికి ప్రధాన కారణం అంటున్నారు. దీన్ని మరోవిధంగా చెప్పాలంటే ఈ మూడు నెలల కాలంలో చైనాకు మనం 22బిలియన్‌ డాలర్లు సమర్పించుకున్నాం. చైనా నుంచి దిగుమతులు పెరగటం అన్నది కళ్ల ముందు కనిపిస్తున్న వాస్తవం. మోడీ సర్కార్‌ దీన్ని ఏ విధంగా చిత్రించ చూస్తున్నదో పార్లమెంటుకు ఇచ్చిన సమాధానం వెల్లడిస్తున్నది. డిజిసిఐ సమాచారం మేరకు 2006-07 నుంచి 2013-14 నాటికి చైనా నుంచి దిగుమతులు 17.47 నుంచి 51.03 బిలియన్‌ డాలర్లకు 192శాతం పెరిగిందని, తమ హయాంలో 2014-15 నుంచి 2020-21 వరకు 60.41 నుంచి 65.21 బి.డాలర్లకు అంటే ఎనిమిదిశాతం పెరిగిందని వాణిజ్యశాఖ మంత్రి లోక్‌సభకు ఇచ్చిన సమాధానంలో చెప్పారు. గత రికార్డులను బద్దలు కొట్టిన ఘనతను నరేంద్రమోడీ సర్కార్‌ ఇప్పటికే సాధించింది, తన రికార్డును తానే ఈ ఏడాది కూడా అధిగమించినా ఆశ్చర్యం లేదు. ఒక వైపు వ్యాపారులు, పారిశ్రామికవేత్తల లాభాల కోసం దిగుమతులను అనుమతిస్తూ తాను ప్రోత్సహించిన చైనా వ్యతిరేకులను సంతుష్టీకరించేందుకు ఇలాంటి అంకెల జిమ్మిక్కులకు మోడీ సర్కార్‌ పూనుకుందన్నది స్పష్టం.


మన పరిశ్రమలు కరోనా ముందు స్దాయికి చేరితే చైనా నుంచి దిగుమతులు ఇంకా పెరుగుతాయని ఆర్ధికవేత్తలు చెబుతున్నారు. అదే జరిగితే మరిన్ని మన డాలర్లతో చైనాను పటిష్టపరచటమే మరి. ఒక వైపు చైనాను కట్టడి చేయాలని చూస్తున్న అమెరికాతో మన దేశం చేతులు కలుపుతూ మరోవైపు చైనా ఆర్ధిక వ్యవస్దను మరింతగా బలోపేతం చేసే విధంగా మనం దిగుమతులు ఎందుకు చేసుకుంటున్నట్లు ? ఇక్కడ సరిహద్దు వివాదం, అక్కడ మోహరించిన మిలిటరీ గుర్తుకు రాదా అన్నది మోడీ మద్దతుదారులు తమను తాము ప్రశ్నించుకోవాలి. లేదూ వ్యాపారం వ్యాపారమే, దానికి సరిహద్దు వివాదాన్ని ముడిపెట్టకూడదు అని చెబుతారా ? అదే సూత్రం బ్రిక్స్‌ సమావేశంలో పాల్గొనటానికి ఎందుకు వర్తించదు. మన దేశంతో భూ సరిహద్దు కలిగిన దేశాల నుంచి వచ్చే పెట్టుబడులపై గాల్వన్‌ ఉదంతం తరువాత కేంద్రం ఆంక్షలు విధించింది, అది చైనా గురించే అన్నది చెప్పనవసరం లేదు. ఇక్కడ వాణిజ్య తర్కం వర్తించదా ? దాని పెట్టుబడులు వద్దు దిగుమతులు అంత ముద్దా ? 2018లో సిఐఐ భాగస్వామ్యంతో నిర్వహించిన ఒక సర్వే చైనాలో పెట్టుబడులు పెట్టిన 54 భారత కంపెనీల అభిప్రాయాలను వెల్లడించింది. గాల్వన్‌ ఉదంతం తరువాత ఆ ” దేశభక్త పెట్టుబడిదారు ”లెవరూ మన ప్రధానిని ఆదర్శంగా తీసుకొని నిరసనగా అక్కడి నుంచి కంపెనీలను ఎత్తివేసిన దాఖలా ఒక్కటీ కనపడదు.మన దేశం చైనా నుంచి దిగుమతులను నిలిపివేస్తే చైనాకు వచ్చే నష్టమేమీ లేదు. మన ఎగుమతులు లేకపోతే గడవని స్ధితీ లేదు. మన పరిశ్రమలు, మన వ్యవసాయ వస్తువుల ఎగుమతులే దెబ్బతింటాయి. మన దేశంతో పెద్ద మొత్తంలో వాణిజ్యమిగులు ఉంది కనుక వారికి అవసరం లేకున్నా కొన్నింటిని దిగుమతి చేసుకుంటున్నారు.చైనా వినియోగ మార్కెట్‌ విలువ ఆరులక్షల కోట్ల డాలర్లు. అందువలన చెరువు మీద అలిగితే….. అన్నట్లుగా చైనా మీద అలిగిన వారికే నష్టం.


చైనా పెద్ద ఎగుమతిదారే కాదు, వివిధ దేశాల వస్తువులకు పెద్ద మార్కెట్‌ కూడా అని గమనించాలి. కమ్యూనిస్టులు అధికారానికి వచ్చిన తరువాత చైనాను ఒక దేశంగా గుర్తించేందుకు రెండుదశాబ్దాల పాటు 1970దశకం వరకు నిరాకరించిన అమెరికా చివరకు దానితో కాళ్లబేరానికి వచ్చి ఐరాసలో గుర్తింపు, ప్రపంచ వాణిజ్య సంస్దలో ప్రవేశానికి అంగీకరించింది. దానితో పోలిస్తే ఎక్కడో ఉన్న మనం తాయత్తు కట్టుకొని బస్తీమే సవాల్‌ అంటూ బరిలోకి దిగే స్ధితిలో ఉన్నామా ? 1962లో సరిహద్దు వివాదంలో మన దేశం-చైనా యుద్దానికి దిగినప్పటికీ తరువాత కాలంలో రెండు దేశాల మధ్య సాధారణ సంబంధాలకు ఆ ఉదంతం అడ్డంకి కాలేదు. తమ సర్కారు మీద తిరుగుబాటు చేసిన దలైలామాకు ఆశ్రయం ఇచ్చినప్పటికీ మన దేశ పర్యటనకు వచ్చేందుకు చైనా నేతలు దాన్నొక సాకుగా ఎన్నడూ చూపలేదు. ఇప్పుడు బ్రిక్స్‌ సమావేశానికి హాజరుకావటానికి మిలిటరీ మోహరింపు గురించి ఎందుకు పట్టుబడుతున్నట్లు ? అలా చేయకపోతే చైనా వ్యతిరేక ఉన్మాదం ఎక్కిన వారు ఇప్పుడు మోడీకి పడుతున్న నీరాజనాల స్ధానంలో మరొకటి చేస్తారు.
గాల్వన్‌ ఉదంతాలు చూసినపుడు మన సోషల్‌ మీడియాలో కొందరు స్పందించిన తీరు చూస్తే మన దిగుమతులు కారణంగానే చైనా బతుకుతున్నదని, వాటిని ఆపివేస్తే మన కాళ్ల దగ్గరకు వస్తుందని నిజంగానే నమ్మినవారు లేకపోలేదు. ఆ ఉదంతానికి కారకులు మీరంటే మీరని పరస్పరం విమర్శలు చేసుకున్నాం. ఉదంతం జరిగింది వాస్తవాధీన రేఖ ఆవల చైనా ఆధీన ప్రాంతంలో అన్నది తెలిసిందే. చైనా మన భూభాగాలను ఆక్రమించలేదని స్వయంగా ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించారు. పరస్పర అవిశ్వాసంతో రెండు వైపులా మిలిటరీ సమీకరణలు జరిగాయి. ఎవరి జాగ్రత్తలు వారు తీసుకోవటం సహజం. ఎవరెన్ని చెప్పినా మిలిటరీని ఉపసంహరణ వెంటనే జరగదు. ఆర్ధికంగా ఎంతో బలంగా ఉన్న చైనాకు పెద్ద ఇబ్బందులేమీ ఉండవు కనుక మరికొంత కాలం కానసాగించినా వారికి నష్టం ఉండదు. కొద్ది వారాలు తక్కువగా రెండు సంవత్సరాలు కావస్తున్నది. మనం ఆ ఖర్చును తట్టుకోగలమా అన్నదే కీలకం. ఆ ఉదంతాల తరువాత చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ తొలిసారిగా మన దేశానికి వచ్చాడు. మనం పిలిస్తే వచ్చాడా, లేదా తనంతటతానే వచ్చాడా అన్నది వేరే అంశం.


ఉక్రెయిన్‌ వివాదం తరువాత అనేక దేశాల ప్రముఖులు మన దేశం వచ్చారు. వారందరినీ మనం ఆహ్వానించలేదు, ఎవరైనా వస్తామంటే వద్దని అనలేము.చైనా మంత్రి రాక గురించి ముందుగానే వార్తలు వచ్చినా చివరి క్షణం వరకు నిర్ధారణ కాలేదు. ఎందుకని ? చైనా మంత్రి రాకను స్వాగతిస్తే అమెరికాకు, ఇతర పశ్చిమ దేశాలకు ఎక్కడ ఆగ్రహం వస్తుందో లేదా అపార్ధం చేసుకుంటాయనే మల్లగుల్లాలు కావచ్చు, చివరి క్షణంలో అనుమతించాము. వచ్చిన విదేశీ ప్రముఖులందరూ తాజా ప్రపంచ పరిణామాలపై మన వైఖరిని తెలుసుకొనేందుకు, తమ అవగాహన లేదా వైఖరి గురించి మనకు వివరణ ఇవ్వటానికి, పనిలో పనిగా చరిత్రలో మీ స్ధానం ఎక్కడ ఉంటుందో ఆలోచించుకోండని అమెరికా మాదిరి బెదిరించటానికి అన్నది స్పష్టం. మరి చైనా మంత్రి మంత్రి వచ్చి ఏమి చేశారని ఎవరైనా సందేహించవచ్చు. నీ అమ్మ మొగుడున్నాడా అని పశ్చిమ దేశాలు అడిగితే బాబూ మీ నాన్న ఉన్నాడా అని చైనా అడిగింది. అదే తేడా ! మన దేశానికి ఎందుకీ ప్రాధాన్యత ఏర్పడిందంటే ప్రపంచ రాజకీయాలే కారణం. తమ ఎడమ చేతి చిటికెన వేలు పట్టుకొని తమ వెంట వస్తుందని, రష్యాను తిట్టేందుకు గొంతు కలుపుతుందని ఆశించిన వారి కోరిక నెరవేరలేదు. అనేక ఉదంతాల్లో అమెరికాను నమ్ముకున్న దేశాలు నట్టేట మునిగాయి. అమెరికాతో చేతులు కలిపితే ఎన్నో దశాబ్దాలుగా నమ్మకమైన మిత్రదేశంగా ఉన్న రష్యాను పోగొట్టుకుంటే మనకు మిగిలే మిత్రులెవరూ ఉండరు. ఇప్పటికే అనేక మందిని పోగొట్టుకున్నాం. అందుకే లాభనష్టాల బేరీజు వేసుకుంటూ అందరినీ సంతుష్టీకరించేందుకు కసరత్తు చేస్తున్నాం. అది కుదిరేనా ? అందుకే మన మీద అనేక దేశాల వత్తిడి, పర్యటనలు.


గతంలో కొంత మంది మన దేశంలో పాలకవర్గంగా ఉన్న పెట్టుబడిదారులను దళారీలుగా వర్ణించారు. ఇప్పటికీ వారి వారసులు మనకు కనిపిస్తారు.మన కార్పొరేట్లు దళారీలు కాదు, పశ్చిమ దేశాల్లో మాదిరే స్వదేశంలో బలమైన కార్పొరేట్లుగా, వీలైతే ప్రపంచ కార్పొరేట్లుగా ఎదిగేందుకు పోటీపడేస్ధితిలో ఉన్నారు. అమెజాన్‌-రిలయన్స్‌ వివాదం, మన కార్పొరేట్‌ సంస్ధలు విదేశాలకు విస్తరించటం దాన్నే సూచిస్తున్నది. మన తటస్ధ వైఖరి గురించి అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు మన మీద ప్రత్యక్షంగా, పరోక్షంగా దాడి చేస్తుంటే విశ్వగురుపీఠాన్ని మనకు మనమే ఇచ్చుకుని మౌనంగా ఉన్నాం.మన మీద జరుగుతున్న దాడికి సంజాయిషీ లేదా పరోక్ష సమాధానాలే తప్ప ఆత్మగౌరవాన్ని ప్రదర్శించే తీరు ఎక్కడా కనపడదు. తనకు వ్యక్తిగతం అంటూ ఏదీ లేదని ఏం చేసినా దేశానికే అని నరేంద్రమోడీ చెప్పారు.వివాదాలకు- క్రీడలకు ముడిపెట్టటం అమెరికా, ఇతర పశ్చిమ దేశాల సంస్కారం. మనం కూడా వాటి బాటలోనే నడిచాం. శీతాకాల బీజింగ్‌ ఒలింపిక్స్‌లో గాల్వన్‌లోయ దాడుల్లో పొల్గొన్న చైనా సైనికుడు ఒలింపిక్‌ జ్యోతి ప్రదర్శనలో పాల్గొంటున్నాడన్న కారణం చూపి వాటిని మన దేశం బహిష్కరించింది. చివరకు మన దూరదర్శన్‌ ఆ క్రీడలను చూపకుండా మూసుకుంది. మరి అదే చైనా పాల్గొనే ఇతర వేదికలకు మన దేశం దూరంగా ఉంటుందా ? గాల్వన్‌ ఉదంతాలకు బాధ్యులైన చైనా మిలిటరీ ప్రతినిధులతో మన వారు ఇప్పటికి 15సార్లు చర్చలు జరిపారు. ఎందుకు జరిపినట్లు ? లడఖ్‌లో మిలిటరీని ఉపసంహరించకపోతే బీజింగ్‌ బ్రిక్స్‌ సమావేశాలకు రానంటూ మంకు పట్టుపట్టం కొందరికి సంతోషంగానే ఉండవచ్చు, అది పైన చెప్పుకున్న మిగతా అంశాల్లో కూడా ఉంటే అదొక తీరు.బ్రిక్స్‌ ఒక అంతర్జాతీయవేదిక, దానికి వెళ్లకుండా మంకుపట్టుపడితే మిగతా దేశాల దృష్టిలో మన దేశం పలుచన కాదా ? రెచ్చిపోయి ఎగుమతి, దిగుమతి లావాదేవీలు జరపటానికి లేని బెట్టు దీనికి ఎందుకు అనుకోవా ? చైనాతో సఖ్యత కోరుకొనే వారిని దేశద్రోహులుగా చిత్రించటాన్ని చూస్తున్నాం. అక్కడి నుంచి దిగుమతులు చేసుకొనే వారు, అక్కడ పెట్టుబడులు పెట్టేవారు దేశద్రోహులా ? ఏమి తర్కరరా బాబూ ఇది !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

ప్రతి ఘనతా నరేంద్రమోడీ ఖాతాకే, ఓకే ! ధరల పెరుగుదలను ఎవరి మెడకు చుడదాం ?

15 Friday Apr 2022

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, History, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, Uncategorized, USA

≈ Leave a comment

Tags

BJP, Inflation, Inflation in India, Narendra Modi Failures, price rise in india


ఎం కోటేశ్వరరావు


ధరల పెరుగుదలతో జనాల జేబులు గుల్లవుతున్నాయి. సిఎంఐఇ సమాచారం మేరకు 2022 మార్చి నెలలో నిరుద్యోగం 7.29శాతం ఉంది. ఏప్రిల్‌ మాసం తొలి పదిహేను రోజుల్లో అదింకా పెరిగినట్లు గణాంకాలు తెలిపాయి. ఉపాధి ఉన్న వారికి కూడా వేతనాల పెరుగుదల ఉండటం లేదు. 2004-05 నుంచి 2011-12 వరకు కాజువల్‌, రెగ్యుల కార్మికుల వేతన పెరుగుదల 5.2శాతం ఉంటే 2011-12 నుంచి 2018-18 వరకు 1.05శాతానికి తగ్గిందని(ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ హ్యూమన్‌ డెవలప్‌ మెంట్‌ వర్కింగ్‌ పేపర్‌ 1-2020) తేలింది. కరోనా కాలంలో పరిస్ధితి ఎలా దిగజారిందో, తరువాత ఎలా ఉందో తెలిసిందే. 2021 మార్చినెలతో పోలిస్తే 2022 మార్చినెలలో ఆహార ధరల పెరుగుదల రేటు రెట్టింపు అంటేే నమ్ముతారా ? ఇవి ఏప్రిల్‌ 12న ప్రకటించిన మోడీ ప్రభుత్వ లెక్కలే.గ్రామీణ ప్రాంతాల్లో వినియోగదారుల ఆహార ధరల ద్రవ్యోల్బణం 2021 మార్చినెలలో 3.94శాతం ఉంటే, ఈ ఏడాది 8.04శాతానికి పెరిగింది. ఇదే మాదిరి ధరల సూచిక 4.61 నుంచి 7.66శాతానికి పెరిగింది. ఈ ఏడాది ఫిబ్రవరి-మార్చినెలల్లో 5.81 నుంచి 8.04శాతానికి చేరింది. దేశం మొత్తంగా ఆహార ద్రవ్యోల్బణం ఏడాది కాలంలో 4.87 నుంచి 7.68శాతానికి, మొత్తంగా ధరల సూచిక గత పదిహేడు నెలల్లో గరిష్టంగా 6.95శాతానికి ఈ ఏడాది మార్చిలో పెరిగింది. ఆహార వస్తువుల్లో నూనెల ధరల సూచిక ఏడాది క్రితంతో పోలిస్తే 18.79 పెరిగింది.
ధరలు పెరిగితే ఏమౌతుంది ? ప్రతి ఒక శాతం ఆహార ధరల పెరుగుదల కోటి మందిని దుర్భర దారిద్య్రంలోకి నెడుతుందని ప్రపంచ బాంకు అధ్యక్షుడు డేవిడ్‌ మల్‌పాస్‌ చెప్పాడు. ధనికులు తట్టుకుంటారు, పేదలు ఓపలేరు, పోషకాహరలేమితో పిల్లలు గిడసబారతారు అని కూడా చెప్పాడు.

ద్రవ్యోల్బణ పెరుగుదల ఒక్క భారత్‌లోనే కాదు ప్రపంచమంతటా ఉంది, అమెరికా,బ్రిటన్‌, చైనా, శ్రీలంక, పాకిస్తాన్లో కూడా ఉంది అని కొంత మంది కేంద్ర ప్రభుత్వ వైఫల్యాన్ని వెనకేసుకు వచ్చేందుకు పూనుకున్నారు. అంటే మన ఏలికలు దేశాన్ని లంక, పాకిస్తాన్‌గా మార్చబోతున్నారా ? నరేంద్రమోడీ విధానాల ఘనత ఎక్కడికి పోయినట్లు ? దున్నబోతే దూడల్లో మెయ్యబోతే ఎద్దుల్లో అన్నట్లుగా ఇతర సందర్భాల్లో వాటితో మనలను పోల్చటం ఏమిటని అంటారు. బ్రిటన్‌లో గాస్‌, విద్యుత్‌ ఛార్జీలు ఇటీవలి కాలంలో 54శాతం పెంచిన కారణంగా అక్కడ ఏడుశాతం ద్రవ్యోల్బణం ఉంది. మరి మన దేశంలో కూడా అదే స్దాయిలో ఎందుకున్నట్లో మోడీ సమర్ధకులు చెప్పాలి. అమెరికాలో ధరల సూచిక 8.5శాతం పెరిగింది. చైనాలో ఫిబ్రవరి నెలలో 0.9శాతం వినియోగదారుల సూచి పెరగ్గా మార్చినెలలో 1.5శాతం ఉన్నట్లు రాయిటర్‌ వార్తా సంస్ధ పేర్కొన్నది.దక్షిణ కొరియాలో 4.1శాతం ఉంది. పాకిస్తాన్‌లో మార్చి నెలలో 12.7, శ్రీలంకలో 18.7 శాతం చొప్పున ఉంది. మనం ఎవరి బాటలో నడవబోతున్నాం ? చైనా మార్గమా ? ఇతర దేశాల వెంటా ? ఎవరి మార్గం అనుసరిస్తారో మనకు అనవసరం, ధరలు తగ్గకపోతేమానే పెరగకుండా చూడండి మహా ప్రభో అంటున్నారు జనం.


ప్రతిదానికీ ఉక్రెయిన్‌ యుద్ధాన్ని ఒక సాకుగా చూపటం, జనాన్ని వెర్రివాళ్లను గావించటం మామూలైంది. మనం కూడా గుడ్డిగా నమ్ముతున్నామనుకోండి ! సదరు యుద్దం ప్రారంభమైంది ఫిబ్రవరి 24న, కానీ ఆ నెలలో మన దేశ పారిశ్రామిక ఉత్పత్తి వార్షిక వృద్ధి 1.7శాతమే, కానీ అంతకు గతేడాది ఫిబ్రవరితో పోలిస్తే 4.7శాతం తగ్గింది. ఈ కాలంలో అంతా బాగుందన్నారు, నవంబరు నాలుగు నుంచి 137 రోజులు చమురు ధరలను మన సర్కారు పెంచలేదు. ఇతరంగా ప్రభావాలేమీ లేవు, ఈ కాలంలో కార్మికుల సమ్మెలు లేవు, అంతా ప్రశాంతంగా ఉంది.మరి ఉత్పత్తి ఎందుకు పడిపోయినట్లు ? ఎలక్ట్రానిక్స్‌ వంటి గృహౌపకరణాలు, ఇతర పరికరాల ఉత్పత్తి 8.2, 5.5శాతాల చొప్పున తిరోగమనంలో ఉంది. మార్చి నెల, తరువాత రోజుల్లో యుద్ద ప్రభావాల గురించి నిపుణులు చెబుతున్న అంశాలను చూస్తే పారిశ్రామిక ఉత్పత్తి వృద్ది మరింతగా పడిపోనుంది.


ప్రపంచ గోధుమ, మొక్కజొన్న ఎగుమతుల్లో రష్యా, ఉక్రెయిన్‌ వాటా 30,20శాతాల చొప్పున ఉంది. అక్కడి నుంచి దిగుమతి చేసుకొనే దేశాల్లో కొరత ఏర్పడి ధరలు పెరిగాయంటే అర్ధం చేసుకోవచ్చు, మన దేశంలో ఎందుకు పెరగాలి? ఆహార ధాన్యాలు అవసరానికి మించి ఉత్పత్తి అవుతున్నట్లు కొందరు చెబుతారు. అదే నిజమైతే ధరలెందుకు తగ్గటం లేదు. దేశంలో 23-25మిలియటన్నుల ఖాద్యతైలాల వినియోగం ఉండగా స్ధానికంగా ఉత్పత్తి పదిమిలియటన్నులు. మిగతాదంతా దిగుమతే. మన దేశం దిగుమతి చేసుకొనే ఖాద్య తైలాల్లో పామాయిల్‌ 62శాతం ఉంది. పొద్దుతిరుగుడు గింజల నూనె వాటా 14శాతమే. అది ఫిబ్రవరి వరకు సజావుగానే వచ్చింది. అక్టోబరుతో ముగిసిన ఏడాదిలో మనం 1.89మిలియన్‌ టన్నుల పొద్దుతిరుగుడు నూనె దిగుమతి చేసుకున్నాం. మన దిగుమతుల్లో ఉక్రెయిన్నుంచి 74, రష్యా, అర్జెంటీనాల నుంచి 12శాతాల చొప్పున జరుగుతోంది. ఉక్రెయిన్నుంచి మార్చినెలలో దిగుమతులు నిలిచినా ఇతర దేశాల నుంచి ఆ మేరకు పామాయిల్‌ దిగుమతులు పెరిగినట్లు వివరాలు వెల్లడిస్తున్నాయి. అలాంటపుడు నూనెల ధరలు ఇంత పెద్ద ఎత్తున పెరగాల్సిన అవసరం ఏముంది?


ధరల మీద పాలకుల నియంత్రణ కొరవడిందన్నదే అసలు కారణం. పర్యవసానంగా రు.120 నుంచి 190 వరకు నూనెల ధరలు పెరిగాయి. మన దేశం దిగుమతి చేసుకొనే నూనెల మీద విధించిన పన్నుల ద్వారా ఏటా రు.35వేల కోట్లు కేంద్రానికి రాబడి వస్తున్నది. నూనె గింజల సాగు గిట్టుబాటు కాని కారణంగానే రైతాంగం వరి, గోధుమల వైపు మొగ్గుతున్నారు. సగటున ఏటా పదిబిలియన్‌ డాలర్లను దిగుమతులకు వెచ్చిస్తున్నారు తప్ప రైతాంగాన్ని ప్రోత్సహించేందుకు ఎలాంటి చర్యలు లేవు. తొలి ఐదేండ్లలో అన్ని లోపాలను సరిదిద్దారు అని గతంలో నరేంద్రమోడీ గురించి చెప్పారు.మరి ఇప్పుడు ఎనిమేదేండ్లుగడచినా ఈ లోపాన్ని ఎందుకు సరిచేయలేదన్నది ప్రశ్న. 2013-14లో మన దేశం 11.82 మి.టన్నులు దిగుమతి చేసుకోగా ఇప్పుడు 15మి.టన్నులకు పెరిగిందే తప్ప తరగలేదు.


ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణంతో పాటు నిరుద్యోగం పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. ధరల పెరుగుదలకు అనుగుణంగా వేతన పెరుగుదల ఉండదు, దాంతో కొనుగోలు శక్తి పడిపోతుంది. అది వస్తువినిమయం తగ్గటానికి, ఉత్పత్తి తగ్గేందుకు. అది ఉపాధి కోల్పోవటానికి దారితీస్తుంది. ఇదంతా ఒక విషవలయం. పట్టణ ప్రాంతాల్లో గతేడాది ఏప్రిల్‌-జూన్‌లో నిరుద్యోగం12.6శాతానికి చేరింది. అంతకు ముందు మూడు నెలలతో పోలిస్తే ఉపాధి పొందుతున్న 15ఏండ్లకు పైబడిన వారి శాతం 43.1 నుంచి 40.9శాతానికి తగ్గింది.
కొంత మంది నమ్మిక ప్రకారం ఏ జన్మలో చేసుకున్న ఖర్మ ఫలితమో ఇప్పుడు జనం అనుభవిస్తున్నారు.ధరల పెరుగుదల గురించి బిజెపి నేతలేమంటున్నారో చూద్దాం. పిటిఐ వార్తా సంస్ధ 2021 ఆగస్టు ఒకటిన ఇచ్చిన కధనం ప్రకారం మధ్య ప్రదేశ్‌ వైద్య విద్యాశాఖ మంత్రి విశ్వాస్‌ సారంగ్‌ కాంగ్రెస్‌ నిరసన మీద మండిపడుతూ అసలు దేశంలో ద్రవ్యోల్బణ సమస్య ఒకటి రెండు రోజుల్లో వచ్చింది కాదని, 1947 ఆగస్టు 15న ఎర్రకోట దగ్గర ప్రధాని నెహ్రూ చేసిన ప్రసంగంతో ప్రారంభమైందని సెలవిచ్చారు. వాక్సిన్లు ఉచితంగా వేయటం ద్రవ్యోల్బణం పెరుగుదలకు దారి తీసిందని బిజెపి ఎంపీ మనోజ్‌ తివారీ చెప్పారు. 2014లో అధికారానికి రాక ముందు పార్టీ పెద్దలు పలికిన సుభాషితాలను చూద్దాం. పెట్రోలు ధరలు పెంచటం యుపిఏ సర్కార్‌ ప్రాధమిక వైఫల్యానికి నిదర్శనమని,సమావేశాలు ముగిసిన తరువాత చేయటం పార్లమెంటును అగౌరవ పరచటమే అని, పెంపుదల వలన గుజరాత్‌ జనాలపై వందల కోట్ల భారం పడుతుందని 2012 మే 23వ తేదీన గుజరాత్‌ సిఎంగా నరేంద్రమోడీ ట్వీట్‌ చేశారు. ఇప్పుడు అదే మోడీ ఏలుబడిలో ధరల పెంపుదలకు అసలు పార్లమెంటుతోనే పనిలేదు.


గాస్‌ సిలిండర్లు పట్టుకొని వీధుల్లో నిరసన ప్రదర్శనలు చేసిన బిజెపి నేత, ఇప్పుడు మంత్రిగా ఉన్న స్మృతి ఇరానీ గారేమన్నారంటే 2011 జూన్‌ 24న ఒక ట్వీట్‌ చేస్తూ ఆమ్‌ ఆద్మీ సర్కార్‌ అని చెప్పుకొనే యుపిఏ సర్కార్‌ గాస్‌ బండ మీద రు. 50 పెంపు ఎంత సిగ్గుచేటు అన్నారు.2012 డిసెంబరు 24న మరొక ట్వీట్‌లో యుపిఏ దృష్టిలో జిడిపి వృద్ది అంటే గాస్‌, డీజిల్‌, పెట్రోల్‌ ధరలు అని ఎద్దేవా చేశారు. ఇప్పుడు ప్రశ్నించిన వారి మీద ఆమె మండిపడుతున్నారు. ఎప్పటికప్పుడు అభిప్రాయాలు మార్చకపోతే పొలిటీషియన్లు కాదన్న గిరీశాన్ని బిజెపి నేతలు గుర్తుకు తెస్తున్నారు. ధరల పెరుగుదల ప్రభుత్వ వైఫల్యమని 2014కు ముందు చెప్పిన వారు ఇప్పుడు అంతర్జాతీయ పరిస్ధితుల మీద నెపాన్ని మోపుతున్నారు. మధ్య ప్రదేశ్‌ మంత్రి విశ్వాస్‌ సారంగ్‌ను ఆదర్శంగా తీసుకున్న ఆర్ధిక మంత్రి నిర్మలాసీతారామన్‌ గారు కూడా నెహ్రూను వదలిపెట్టలేదు. కాంగ్రెస్‌ వారిని ఎద్దేవా చేస్తూ ” చివరికి 1951లో కూడా పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ భారత ద్రవ్యోల్బణాన్ని కొరియా యుద్ధం ప్రభావితం చేసిందని చెప్పి ఉండేవారు….. కానీ ఇప్పుడు ప్రపంచం విశ్వవ్యాప్తంగా అనుసంధానమై ఉంది కనుక ఉక్రెయిన్‌ మనలను ప్రభావితం చేస్తోందని చెబుతున్నాం, అంగీకరించరా ” అన్నారు. పెట్రోలియం శాఖ సహాయ మంత్రి రామేశ్వర్‌ తెలి మాట్లాడుతూ మధ్యతరగతి వారు కష్టాలను భరించి కరోనా వాక్సిన్లు అందచేసేందుకు ప్రభుత్వానికి తోడ్పడాలని చెప్పారు. టాక్సులు లేకపోతే చమురు ధరలు ఎక్కువ కాదు. మీరు మాత్రం ఉచితంగా వాక్సిన్లు పొందాలి, మరి వాటికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది, మీరేమీ చెల్లించలేదు, అందుకే ఈ విధంగా వసూలు చేస్తున్నాం ” అన్నారు. జనానికి తెలివితేటలుంటాయని వారు గనుక భావించి ఉంటే ఇంతగా బరితెగించి అడ్డగోలు వాదనలు చేసే వారు.


గత ఎనిమిది సంవత్సరాలుగా దేశంలో ఏం జరిగినా ఆ ఘనత నరేంద్రమోడీదే, చివరికి పొద్దు పొడుస్తుందన్నా, చీకటి పడుతుందన్నా మోడీ అధికారానికి వచ్చిన నాటి నుంచే జరుగుతోందని చెప్పే వారు మనకు కనిపిస్తారు. నిజమైన స్వాతంత్య్రం 2014లోనే వచ్చిందని పద్మశ్రీ కంగన రనౌత్‌ సెలవిచ్చిన సంగతి తెలిసిందే. పోనీ భక్తుల కోరిక మేరకు జరిగిన వాటన్నింటినీ నరేంద్రమోడీ ఖాతాలోనే వేద్దాం. మరి ఇప్పుడు ధరల పెరుగుదలను ఎవరి మెడకు చుడదాం ? 1947 నుంచే ప్రారంభమైందని, గాంధీ, నెహ్రూలే కారణం అని బిజెపి పెద్దలు సెలవిచ్చినా జనం నమ్మక తప్పదు, కాదంటే తంటా కొని తెచ్చుకోవటమే. అచ్చేదిన్‌ కనుక మౌనంగా భరిస్తున్నారు, ఏడవలేక నవ్వుతున్నారు !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

ఆత్మగౌరవం, అమెరికా వ్యతిరేకత ఇమ్రాన్‌ ఖాన్‌ కొత్త నినాదమా ?

13 Wednesday Apr 2022

Posted by raomk in Current Affairs, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Uncategorized, USA

≈ Leave a comment

Tags

imran khan, Narendra Modi, Pakistan political crisis, Shehbaz Sharif


ఎం కోటేశ్వరరావు


క్రికెట్‌లో కీలకమైన చివరి ఓవర్‌, బంతి మాదిరి తన ప్రభుత్వాన్ని కాపాడు కొనేందుకు మాజీ క్రికెటర్‌ ఇమ్రాన్‌ ఖాన్‌ తీవ్రంగా శ్రమించినా రాజకీయ క్రీడలో ఓడిపోయాడు. ఏప్రిల్‌ తొమ్మిదవ తేదీ రాత్రి పన్నెండు గంటల తరువాత అవిశ్వాస తీర్మానంపై జరిగిన ఓటింగ్‌లో ప్రతిపక్షం నెగ్గింది. పదకొండవ తేదీన నూతన ప్రధాని ఎన్నిక ఓటింగ్‌కు ముందే పాకిస్తాన్‌ తెహరిక్‌ ఏ ఇన్సాఫ్‌ (పిటిఐ) సభ్యులందరూ పార్లమెంట్‌ నుంచి వాకౌట్‌ చేశారు. సామూహికంగా రాజీనామా చేస్తామని ప్రకటించారు. పాకిస్తాన్‌ చరిత్రలో తొలిసారిగా అవిశ్వాస తీర్మానంతో ఒక సర్కార్‌ పతనమైంది. గత ఏడాది నవంబరు 28న ప్రారంభమైన ఉత్కంఠకు ఏప్రిల్‌ తొమ్మిదిన తెరపడింది. మరుసటి రోజు షెహబాజ్‌ షరీఫ్‌ ప్రధానిగా కొత్త సర్కార్‌ ఏర్పడింది. రాజ్యాంగ సంక్షోభం ముగిసినా రాజకీయ అనిశ్చితికి తెరలేచింది. తదుపరి ఎన్నికలు 2023 ఆగస్టు 13- అక్టోబరు 12 మధ్య జరగాల్సి ఉంది. అప్పటి వరకు ప్రతిపక్షం లేకుండా పార్లమెంట్‌ నడుస్తుందా ? కొత్త ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళుతుందా అన్నది త్వరలోనే తేలనుంది. ముస్లింలీగ్‌ నేత షెహబాజ్‌ షరీఫ్‌ ప్రధానిగా ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రాగా, ఇమ్రాన్‌ఖాన్‌ నేతృత్వంలోని పిటిఐ సభ్యుడు షా మహమ్మద్‌ ఖురేషీ కూడా నామినేషన్‌ వేసినప్పటికీ ఆ పార్టీ సభ్యులు రాజీనామా చేయటంతో షెహబాజ్‌ షరీఫ్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు.


జాతీయ అసెంబ్లీలోని 342 మందికి గాను పిటిఐకి 155 మంది సభ్యులుండగా వారిలో 135 మంది రాజీనామా చేశారు. తిరస్కరించిన 20 మందిని పార్టీ నుంచి బహిష్కరించారు. ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రభుత్వ పతనం మీద దేశ ప్రజల్లో మిశ్రమ స్పందన వెల్లడైనట్లు ఒక సర్వే వెల్లడించింది. సంతోషం వెలిబుచ్చిన వారు 57శాతం, ఆగ్రహించిన వారు 43శాతం ఉన్నట్లు గాలప్‌ పేర్కొన్నది.జనం ఆగ్రహిస్తున్నారని గ్రహించే పిటిఐ సభ్యులు రాజీనామాలకు సిద్దపడినట్లు వార్తలు వచ్చాయి. రాజీనామా లేఖను ఉపసభాపతి ఖాశింకు అందచేశామని ఆమోదించవచ్చని పిటిఐ నేతలు చెప్పారు గానీ ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. విదేశీ కుట్ర లేఖపై పార్లమెంటరీ కమిటీ విచారణను తాము అంగీకరించటం లేదని, సుప్రీం కోర్టు విచారణ జరపాలని పిటిఐ డిమాండ్‌ చేసింది.


జాతీయ అసెంబ్లీలోని 342 మందికి గాను 174 మంది అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు. అంతకు ముందు ఇమ్రాన్‌ఖాన్‌పై తిరుగుబాటును ప్రకటించిన పిటిఐ పార్టీ సభ్యులు ఓటింగ్‌ సమయంలో అధికాపక్షం వైపే కూర్చున్నారు. సాధారణ మెజారిటీకి అవసరమైన 172కు గాను అదనంగా మరో రెండు ఓట్లు మాత్రమే ప్రతిపక్షాలకు వచ్చాయి. అధికారపక్ష సభ్యులు ఓటింగ్‌ను బహిష్కరించారు. గతేడాది నవంబరు 28న పాకిస్తాన్‌ పీపుల్స్‌ పార్టీనేత ఖుర్షీద్‌ ఖాన్‌ ఒక ప్రకటన చేస్తూ ఇమ్రాన్‌ ఖానున్న పదవీచ్యుతుడ్ని చేసేందుకు ప్రతిపక్షాలకు మెజారిటీ ఉందని చెప్పాడు. డిసెంబరు 24న పాకిస్తాన్‌ ముస్లింలీగ్‌(ఎన్‌) నేత అయాజ్‌ సాదిక్‌ కూడా అదే చెప్పాడు. ప్రభుత్వానికి పార్లమెంటులో మెజారిటీ లేదని జనవరి 11న అదే పార్టీ నేత ఖ్వాజా అసిఫ్‌ ప్రకటించాడు. ఇమ్రాన్‌ ఖాన్ను ఇంటికి పంపేందుకు తాము సెనేట్‌ చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని పీపుల్స్‌ పార్టీ నేత బిలావల్‌ భుట్టో జరదారీ ప్రకటించాడు.అవిశ్వాస తీర్మానానికి ప్రతిపక్షాలు సిద్దమని జనవరి 21న అయాజ్‌ సాదిక్‌ చెప్పాడు. ఫిబ్రవరి ఏడున ముస్లింలీగ్‌-పీపుల్స్‌ పార్టీ అధికారికంగానే దీని గురించి చర్చించాయి. పదకొండున ప్రతిపక్షాల తరఫున అవిశ్వాస తీర్మానం గురించి పిడిఎం పార్టీ నేత మౌలానా ఫజులుర్‌ రహ్మాన్‌ ప్రకటించాడు. మార్చి ఎనిమిదిన పార్లమెంటులో అవిశ్వాస తీర్మాన నోటీసు ఇచ్చారు. మార్చి 12న అధికార పిటిఐ పార్టీ అసంతృప్త నేత అలీమ్‌ ఖాన్‌ లండన్‌లో మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌తో చర్చించాడు. విదేశీ నిధులతో జరిగిన కుట్ర తనపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వెనుక ఉందని మార్చి 27న ఇమ్రాన్‌ ఖాన్‌ ఒక బహిరంగ సభలో చెప్పాడు. మరుసటి రోజు ప్రతిపక్షం అవిశ్వాస తీర్మానం నోటీస్‌ ఇచ్చింది. ముప్పై ఒకటవ తేదీన దాన్ని చర్చకు తీసుకొని ఏప్రిల్‌ 3కు పార్లమెంటును వాయిదా వేశారు. ఆ రోజు డిప్యూటీ స్పీకర్‌ తీర్మానం చెల్లదని తిరస్కరించాడు. వెంటనే సభ రద్దు, అధ్యక్షుడి ఆమోద ముద్ర, సుమోటోగా సుప్రీం కోర్టు స్వీకరణ వెంటవెంటనే జరిగాయి.ఏడవ తేదీన స్పీకర్‌ చర్య, సభ రద్దు చెల్లదంటూ పునరుద్దరించిన సుప్రీం కోర్టు తొమ్మిదవ తేదీన అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌ జరపాలని ఆదేశించింది. విదేశీ ప్రభుత్వ ఏర్పాటును తాను సహించబోనని ఇమ్రాన్‌ ఖాన్‌ ఆమేరకు ఓటింగ్‌ జరిగి నెగ్గటంతో ఇమ్రాన్‌ ఖాన్‌ సర్కార్‌ పతనమైంది.


ఏప్రిల్‌ తొమ్మిది-పదవ తేదీ పార్లమెంట్‌ సమావేశంలో అనేక నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఉదయం 10.30 గంటలకు ప్రారంభమైన సమావేశంలో అడుగడుగునా ప్రభుత్వ ప్రతిపక్షాలు కత్తులు దూశాయి. అర్దరాత్రి పన్నెండు గంటలకు కొద్ది నిమిషాల ముందు పాలకపక్షం ఎన్నుకున్న స్పీకర్‌ అసాద్‌ ఖ్వైజర్‌ రాజీనామా చేశాడు,ప్రతిపక్ష సభ్యుడు అయాజ్‌ సాదిక్‌కు సభాధ్యక్ష బాధ్యతను అప్పగించాడు. సాదిక్‌ వెంటనే ఓటింగ్‌ జరిపాడు.ప్రతిపక్షాలకు చెందిన 174 మంది అనుకూలంగా ఓట్లు వేశారు. ప్రతికూలంగా ఎవరూ వేయలేదు.


పదవిలో ఉండగా తన ప్రభుత్వ పతనానికి అమెరికా, భారత్‌, ఇజ్రాయల్‌ ప్రతిపక్షాలతో కలసి కుట్రపన్నిట్లు ఇమ్రాన్‌ ఖాన్‌ విమర్శించాడు.దక్షిణాసియా వ్యవహారాల సహాయ మంత్రి డోనాల్డ్‌ లు తన ప్రభుత్వాన్ని బెదిరిస్తూ పంపిన లేఖ అంటూ బహిరంగసభలో ప్రదర్శించాడు. మన దేశ విదేశాంగ విధానాన్ని ప్రశంసించాడు, విదేశీ వత్తిళ్లకు భారత్‌ లొంగలేదని చెప్పాడు. మహమ్మదాలీ జిన్నా తరువాత తాను తప్ప పాక్‌ పాలకులుగా ఉన్నవారందరూ సిఐఏ ఏజంట్లు లేదా భారత్‌, ఇజ్రాయల్‌కు అమ్ముడు పోయిన బాపతేనని కూడా చెప్పాడు. స్వతంత్ర విదేశాంగ విధానం అవలంభించాలని పదే పదే చెప్పిన ఇమ్రాన్‌ ఖాన్‌ వివిధ సందర్భాల్లో చేసిన వ్యాఖ్యల సారాన్ని చూస్తే రానున్న రోజుల్లో ముందస్తు ఎన్నికలు వచ్చినా, గడువు ప్రకారమే జరిగినా విదేశాంగ విధాన ఆత్మగౌరవ అంశంతో జనం ముందుకు వెళ్లేందుకు నిర్ణయించుకున్నట్లు చెప్పవచ్చు. ఇది ప్రధాన ప్రత్యర్ధి పార్టీలను ఇరుకున పెట్టే అవకాశం ఉంది. భారత్‌ను తన అక్కున చేర్చుకొనే ఎత్తుగడలో భాగంగా అమెరికా తమ భుజాల మీద నుంచి తుపాకులు పేల్చిందని, ఇప్పుడు అది దగ్గర కాగానే తమను పట్టించుకోవటం లేదనే అభిప్రాయం పాకిస్తాన్‌ జనంలో రోజు రోజుకూ పెరుగుతున్నట్లు ఒక అభిప్రాయం.2018 జనవరి ఒకటిన నాటి అమెరికా అధినేత డోనాల్డ్‌ ట్రంప్‌ చేసిన ట్వీట్‌లో గత పదిహేను సంవత్సరాల్లో పాకిస్తాన్‌కు ఇచ్చిన 33 బిలియన్‌ డాలర్లకు ప్రతిగా అమెరికాకు దక్కింది అబద్దాలు, వంచన తప్ప మరొకటి కాదన్నాడు. పాకిస్తాన్‌లో ఏముంటాయంటే మూడు ”ఏ” లు (అల్లా, ఆర్మీ, అమెరికా) ఉంటాయని గతంలో కొందరు ఎద్దేవా చేశారు.
అగ్రరాజ్యమేదీ భారత్‌ను శాసించలేదని, ఆత్మగౌరవాన్ని అక్కడి నుంచి నేర్చుకోవాలని ఖాన్‌ అన్నాడు. అవిశ్వాస తీర్మానానికి ఒక రోజు ముందు దేశ ప్రజల నుద్దేశించి ప్రసంగిస్తూ ప్రజాప్రయోజనాలు తమకు ముఖ్యమంటూ భారత్‌ తీసుకున్న వైఖరిని ఏ దేశమూ నిరోధించలేకపోయిందన్నాడు.” రష్యాకు వ్యతిరేకంగా మాట్లాడాలని ఐరోపా దౌత్యవేత్తలు పాకిస్తాన్‌ మీద వత్తిడి చేస్తున్నారు కానీ భారత్‌ విషయంలో వారా ధైర్యం చేయలేరు.మరొక దేశం కోసం ప్రజల ప్రాణాలను ఫణంగా పెట్టలేను, మన విదేశాంగ విధానం సర్వసత్తాకమైనదిగా ఉండాలి. నా రష్యా పర్యటన పట్ల అమెరికా సంతోషంగా లేదు. మనది ఒక మిత్ర దేశంగా ఉన్నప్పటికీ నాలుగు వందల డ్రోన్‌ దాడులు చేసింది. నా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర చేసింది. ఇమ్రాన్‌ఖాన్ను పదవీచ్యుతుడిని చేసిన తరువాతే పాకిస్తాన్ను అమెరికా క్షమిస్తుందని ఒక అమెరికా ప్రతినిధి చెప్పాడు. దిగుమతి చేసుకున్న ప్రభుత్వాన్ని నేను అంగీకరించను. న్యాయవ్యవస్ధను నేను గౌరవిస్తాను, కానీ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో ఆశాభంగం చెందాను. విదేశీ కుట్ర సాక్ష్యాన్ని కనీసం చూసి ఉండాల్సింది, ఆరోపణలపై విచారణకు ఆదేశించి ఉండాల్సింది. పాకిస్తాన్ను విదేశాలు ఒక తుడుచుకొని పారవేసే కాగితపు ముక్కలా ఉపయోగించకూడదు. ” అన్నాడు.


దేశానికి 1947లో స్వాతంత్య్రం వచ్చింది, కానీ విదేశీ కుట్రలతో ప్రభుత్వమార్పిడికి వ్యతిరేకంగా మరోసారి స్వాతంత్య్ర పోరాటం ప్రారంభమైందని, దేశ ప్రజాస్వామ్యం,సార్వభౌమత్వాన్ని ఎల్లవేళలా ప్రజలే కాపాడుకుంటారు” అని పేర్కొన్నాడు. రాజీనామా చేసిన 135 మంది పిటిఐ సభ్యుల లేఖలను ఆమోదిస్తే ఆ స్ధానాలన్నింటికీ ఉప ఎన్నికలు జరపాల్సి ఉంటుంది. అది మరొక ఎన్నికల పోరాటంగా మారుతుంది. ఇది కొత్త ప్రభుత్వం మీద, పార్టీల మీద వత్తిడిని పెంచుతుంది. ఎన్నికలు జరిగే వరకు రాజకీయ మధనానికి దారి తీస్తుంది. ఉప ఎన్నికల్లో తిరిగి పిటిఐ అభ్యర్ధులు నెగ్గితే తదుపరి జరిగే ఎన్నికల మీద మరింత వత్తిడిని పెంచుతుంది. లేదా దానికి అవకాశం ఇవ్వకుండా, దేశంలో మరింతగా అమెరికా వ్యతిరేకత పెరగక ముందే ముందస్తు ఎన్నికలకు పోవటమా అన్నది కొత్త కూటమి ముందున్న ప్రశ్న.


పాకిస్తాన్‌లో అధికారం ప్రధానంగా మిలిటరీ కనుసన్నలలో నడవటం అందరికీ తెలిసిందే. గత ఎన్నికల్లో ఇమ్రాన్‌ ఖాన్‌కు సహకరించినట్లు భావించిన మిలిటరీ ఇప్పుడు వైరంతో ఉందని వార్తలు. కొత్త ప్రభుత్వం పట్ల ఎలా ఉంటుందో చెప్పలేము. ఇప్పటికీ పాక్‌ మిలిటరీ మీద అమెరికా ప్రభావం తీవ్రంగా ఉందన్నది స్పష్టం. ఇటీవలి కాలంలో అమెరికన్లు మన దేశానికి పెద్ద పీటవేస్తుండటంతో జనంలో అమెరికా పట్ల వ్యతిరేకత పెరుగుతున్నది. భారత్‌ తన ఒళ్లోవాలుతున్నందున మన దేశాన్ని సంతుష్టీకరించేందుకు, చైనాకు వ్యతిరేకంగా మనలను నిలబెట్టే ఎత్తుగడకు ప్రాధాన్యత ఇస్తున్నందున పాకిస్తాన్‌తో గతం మాదిరి అమెరికా ఉండటం లేదు. ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్న స్ధితిలో ఆదుకొనేందుకు ముందుకు రావటం లేదు. దీంతో రష్యా,చైనాల వైపు పాకిస్తాన్‌ మొగ్గుతున్నది. బహిరంగంగా అమెరికా వ్యతిరేక వైఖరిని తీసుకున్న ఇమ్రాన్‌ ఖాన్‌పై అమెరికా కక్షగట్టి ప్రభుత్వాన్ని కూలదోసేందుకు వివిధ శక్తులను ఏకం చేయవచ్చుగానీ దాని విదేశాంగ విధానంలో మార్పులను అమెరికా రుద్దగలదా అన్నది ప్రశ్న. గతం మాదిరి తిరిగి ఇస్లామాబాద్‌ను తన కౌగిలిలోకి అమెరికా తెచ్చుకోదలచుకుంటే, అందుకు పాక్‌ సమ్మతిస్తే పాక్‌ వ్యతిరేకతను రెచ్చగొట్టి రాజకీయ లబ్ది పొందుతున్న నరేంద్రమోడీ పరిస్ధితి ఏమిటి అన్నది ప్రశ్న. ఒకే వరలో పాక్‌-భారత్‌ అనే కత్తులను ఇమడ్చాలని అమెరికా చూస్తున్నది. కాశ్మీరు సమస్య కొనసాగినంతకాలం అది కుదరదు.


తనను నమ్ముకున్న దేశాలను అమెరికా నట్టేట ముంచుతుందని గతంలో అనేక మంది హెచ్చరించినా జనాలు పట్టించుకోలేదు. ఆప్ఘనిస్తాన్లో అమెరికాకు ఎదురైన పరాజయం, దానికంటే ఉక్రెయిన్ను ముందుకు తోసి చేతులెత్తేసిన తీరుతో మన దేశంలో అమెరికా భక్తులు జీర్ణించుకోలేకపోతున్నారు.చైనా బూచిని చూపినా జనం నమ్మే స్ధితి లేదు. ఐరోపాలో నాటో కూటమి పేరుతో తిష్టవేసిన తన సైన్యాలను రష్యాకు వ్యతిరేకంగా ఉక్రెయినుకు పంపటానికి కొన్ని గంటలు చాలు, అయినా అమెరికా లేదా ఇతర ఐరోపా దేశాలేవీ ఆపని చేయలేదు. పెద్ద మొత్తంలో ఆయుధాలు పంపుతున్నాయి. కొంత మంది చెబుతున్నట్లుగా(ఈ రచయిత కాదు) చైనా-భారత్‌ మధ్య యుద్దమే గనుక జరిగితే చతుష్టయ కూటమిలోని అమెరికా లేదా జపాన్‌, ఆస్ట్రేలియా తమ మిలిటరీని మన సరిహద్దులకు పంపుతాయా ? అది సాధ్యమేనా ! కాస్త బుర్రతో ఆలోచించేవారికి కాదని స్పష్టంగా తెలుసు. నేటి భారత్‌ 1962నాటి భారత్‌ కాదని మన నేతలు ప్రకటనలు చేస్తున్నారు. ఇదే సమయంలో చైనా 1962 నాటి మాదిరే ఉందని అనుకుంటున్నారా ? మనం ఇతర దేశాల దగ్గర ఆయుధాలు కొని పోరుకు దిగాలి. అదే చైనా ఇతర దేశాలకు ఆయుధ ఎగుమతులు చేసే స్ధితిలో ఉందని మరచిపోరాదు. ఆర్ధికంగా అమెరికానే సవాలు చేస్తోంది. ఇప్పటికే ఆప్ఘనిస్తాన్‌తో సహా భారత ఉపఖండంలోని దేశాలన్నీ చైనాకు దగ్గరగా ఉన్నాయి. అందువలన చైనాతో ఉన్న వివాదాలను పరిష్కరించుకొనేందుకు పూనుకోవాలే తప్ప అమెరికా ఇచ్చిన తాయత్తులు కట్టుకొని బస్తీమే సవాల్‌ అని రంగంలోకి దిగితే జరిగే ఏం జరుగుతుందో ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి.పాక్‌ మిలిటరీతో తమ సంబంధాలు కొనసాగుతాయని అమెరికా మిలిటరీ బుధవారం నాడు ప్రకటించింది.అధికారానిన స్వీకరించి రెండు రోజులు గడిచినా ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ మంత్రివర్గాన్ని ప్రకటించలేదు.భారత్‌ గనుక కాశ్మీరుకు 370 ఆర్టికల్‌ను రద్దు చేస్తే మనమేం చేయాల్సి ఉంటుందని ప్రధానిగా తన తొలి ప్రసంగంలో షెహబాజ్‌ ప్రశ్నించాడు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

అతివలకు అగ్రాసనం వేసిన వామపక్ష నికరాగువా !

13 Wednesday Apr 2022

Posted by raomk in Current Affairs, History, imperialism, International, Latin America, Left politics, Opinion, USA, Women

≈ Leave a comment

Tags

Daniel Ortega, Nicaragua Women, Sandinista Revolution, US imperialism, Women’s Liberation


ఎం కోటేశ్వరరావు


ఒక వైపు నిరంతరం మితవాదశక్తులు, వాటికి మద్దతు ఇచ్చే అమెరికా కుట్రలు, వాటిని ఎదుర్కొంటూ ముందుకు పోతున్న నికరాగువా వామపక్ష ప్రభుత్వం. గత పదిహేను సంవత్సరాలలో అది సాధించిన ప్రధాన విజయాలలో మహిళా సాధికారత, సమానత్వానికి పెద్ద పీట వేయటం అంటే అతిశయోక్తి కాదు. గతేడాది జరిగిన ఎన్నికల్లో 76శాతం ఓట్లతో వామపక్షం గెలుపుకు తోడ్పడిన అంశాలలో ఇదొకటి. గెలిచింది వామపక్షం, అందునా అమెరికాకు బద్ద విరోధి కనుక ఆరోపణలు, వక్రీకరణలు సరేసరి. 2007 నుంచి రెండవ సారి అధికారంలో ఉన్న శాండినిస్టా నేత డేనియల్‌ ఓర్టేగా సర్కార్‌ తన వాగ్దానాలను అనేకం నెరవేర్చింది. తన అజెండాలోని అనేక అంశాలకు నాందీ వాచకం పలికింది అప్పటి నుంచే. పార్లమెంటులో కుటుంబ, మహిళా, శిశు,యువజన కమిషన్‌ అధ్యక్షురాలిగా ఉన్న ఇర్మా డావిలియా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పిన అంశాలు ఆసక్తికరంగా ఉన్నాయి. మంత్రివర్గంలో 50శాతం కంటే ఎక్కువ మంది మంత్రులున్న 14 దేశాల్లో స్పెయిన్‌ 66.7శాతంతో ప్రధమ స్ధానంలో ఉంటే ఫిన్లండ్‌ 61.1, నికరాగువా 58.8శాతంతో మూడవ స్ధానంలో ఉంది. ఇది లాటిన్‌ అమెరికాలో ప్రధమ స్ధానం. ఇదే విధంగా ఎక్కువ మంది మహిళలున్న పార్లమెంట్లు మూడు కాగా మూడవది నికరాగువా. ప్రపంచ ఆర్ధిక వేదిక రూపొందించిన లింగ భేదం సూచికలో ఐదవ స్దానంలో నికరాగువా ఉంది. 2007లో 90వ స్ధానంలో ఉంది. అంటే దీని అర్ధం పురుషులతో సమంగా అన్ని రంగాలలో మహిళలకు అవకాశాలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. పార్లమెంటులోని 91 స్ధానాల్లో 46 మంది మహిళలు, 45 మంది పురుషులు. దీనికి అనుగుణంగానే మెజారిటీ కమిటీలు, కమిషన్లకు మహిళలే అధిపతులుగా ఉన్నారు. అన్ని ఎన్నికల్లో సగం స్ధానాల్లో మహిళలకు రిజర్వేషన్లు ఉండటమే దీనికి కారణం.వామపక్ష ప్రభుత్వం నిజమైన సమాన భాగస్వామ్యాన్ని చట్టపరంగా కల్పించింది. న్యాయ వ్యవస్ధలో సగానికి పైగా కార్యనిర్వాహక వ్యవస్ధలో 58శాతం మహిళలే ఉన్నారు. చట్టాలు చేయటమే కాదు అమలు వల్లనే ఇది జరిగింది.


1961లో ఏర్పడిన శాండినిస్టా నేషనల్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌ (ఎఫ్‌ఎస్‌ఎల్‌ఎన్‌) 1979లో నియంత సోమోజా ప్రభుత్వాన్ని కూల్చివేసి అధికారాన్ని చేపట్టింది.1979 నుంచి 1990 వరకు పాలన సాగించింది. అమెరికా ఏర్పాటు చేసిన కాంట్రా తిరుగుబాటుదార్లతో పోరు తదితర కారణాలతో 1990 ఎన్నికల్లో ఫ్రంట్‌ ఓడిపోయింది.2006 వరకు ప్రతిపక్షాలు మితవాదశక్తులు అధికారంలో ఉన్నాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన మూడు ఎన్నికల్లో తిరిగి శాండినిస్టాలు గెలుస్తున్నారు.ఫ్రంట్‌లో చీలికలు, తిరుగుబాట్లు, విద్రోహాలు అనేకం జరిగాయి. లాటిన్‌ అమెరికాలో జరిగిన తిరుగుబాట్లలో మహిళలు పెద్ద ఎత్తున ఆయుధాలు చేపట్టిన పరిణామం నికరాగువాలో జరిగింది. విముక్తి పోరాటంలో పెద్ద పాత్ర పోషించటం ఒకటైతే ఆ పోరాటాన్ని ప్రభుత్వాన్ని దెబ్బతీసేందుకు అమెరికా ఏర్పాటు చేసిన కాంట్రా విద్రోహులలో కూడా మహిళలు ఉన్నారు. శాండినిస్టాలలో 30శాతం మంది ఉండగా కాంట్రాలలో ఏడుశాతం ఉన్నట్లు కొందరు అంచనా వేశారు.

శాండినిస్టాల పాలనలో పురోగతి గణనీయంగా ఉన్నప్పటికీ మితవాద, సామ్రాజ్యవాదశక్తులు వామపక్ష పాలన మీద బురద జల్లుతున్నాయి. తొలిసారి శాండినిస్టాల పాలనలో చేపట్టిన సంక్షేమ, ఇతర చర్యలను తరువాత సాగిన మితవాద పాలనలో పూర్తిగా ఎత్తివేయటం సాధ్యం కాలేదు. రెండవసారి 2007 నుంచి పాలన సాగిస్తున్న శాండినిస్టాలు అనేక వాగ్దానాలను అమలు జరిపారు. మహిళలకు భూమి పట్టాలను ఇవ్వటమే కాదు, వ్యవసాయ అనుబంధ రంగాల్లో కూడా వారు రాణించి ఆర్ధిక సాధికారతను పొందేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. దేశంలో 55శాతం మంది మహిళలు భూయజమానులుగా మారారు. దాంతో కుటుంబ ఆరోగ్యం మెరుగుపడింది, అన్నార్తులు లేకుండా పోయారు. దేశంలో 90శాతం ఆహార అవసరాలను తీర్చటంలో మహిళలు పెద్ద పాత్రను పోషించారు. ప్రపంచంలో మైక్రోఫైనాన్స్‌ వడ్డీ రేటు 35శాతం వరకు ఉండగా నికరాగువాలో అది కేవలం 0.5శాతమే ఉంది.2007 తరువాత 5,900 సహకార సంస్ధలను ఏర్పాటు చేశారు.దారిద్య్రనిర్మూలన 48 నుంచి 25శాతానికి తగ్గగా దుర్భర దారిద్య్రం 17.5 నుంచి ఏడు శాతానికి తగ్గింది. దీంతో మొత్తంగా ప్రత్యేకించి ఒంటరి మహిళలు ఎంతో లబ్దిపొందారు. గృహ హింసకూడా తగ్గింది. 2007 నాటికి పట్టణాల్లో 65శాతం మందికి మంచినీరు అందుబాటులో ఉండగా ఇప్పుడు 92శాతం మందికి, గ్రామీణ ప్రాంతాల్లో 28 నుంచి 55శాతానికి పెరిగింది. విద్యుత్‌ కనెక్షన్లు 54 నుంచి 99శాతానికి పెరిగిగాయి. విద్య పూర్తిగా ఉచితంగా అందిస్తున్నారు.


2018 ఏప్రిల్‌లో శాండినిస్టా ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన కుట్రలో భాగంగా శాంతి భద్రతల సమస్యను సృష్టించేందుకు అనేక శక్తులు చేతులు కలిపాయి. వీటిలో క్రైస్తవ మత సంస్ధలు, చర్చ్‌లు ప్రధాన పాత్రపోషించాయి. ఆందోళనకారులకు చర్చ్‌లలో ఆశ్రయం కల్పించటంతో సహా పలు రూపాల్లో ప్రభుత్వ వ్యతిరేకులకు సహకరించాయి. అప్పటి నుంచి ప్రభుత్వం స్వచ్చంద సంస్ధల ముసుగులో ఉన్న వారికి అందుతున్న నిధుల ఖర్చు తీరుతెన్నులను ప్రశ్నించటం, సరైన సమాధానం ఇవ్వని వాటి అదుపు వంటి చర్యలు తీసుకుంది. ఈ ఏడాది మార్చినెలలో వాటికన్‌ రాయబారిని దేశం నుంచి బహిష్కరించింది.


లాటిన్‌ అమెరికాను తన పెరటితోటగా చేసుకొనేందుకు అమెరికా మొదటి ప్రపంచ యుద్దానికి ఎంతో ముందుగానే చూసింది. దాని లక్ష్యాలలో నికరాగువా ఒకటి. కరిబియన్‌ సముద్రం ద్వారా అట్లాంటిక్‌-పసిఫిక్‌ సముద్రాలను కలుపుతూ ఓడల రవాణాకు ఒక కాలువ తవ్వాలనే ఆలోచన 1825 నుంచి ఉంది. పనామా కాలువ తవ్వకం తరువాత నికరాగువా కాలువను తవ్వేందుకు జపాన్‌ ముందుకు వచ్చింది. ఆ పధకం తనకు దక్కలేదనే కసితో దాన్ని ఎలాగైనా నిలిపివేయాలనే లక్ష్యంతో అమెరికా 1911 నుంచి అనేకసార్లు నికరాగువా మీద దాడి చేసింది. వాటిని గెరిల్లా నేత అగస్టో సీజర్‌ శాండినో నాయకత్వాన 1934వరకు తిరుగుబాటుదార్లు వాటిని ప్రతిఘటించారు. అమెరికా కుట్రలో భాగంగా శాండినోను శాంతి చర్చలకు పిలిచి నాడు మిలిటరీ కమాండర్‌గా ఉన్న అనాస్టాసియో సోమోజా గార్సియా అధికారాన్ని హస్తగతం చేసుకొని శాండినోను హత్యచేయించాడు. అమెరికా సామ్రాజ్యవాద ప్రతిఘటనకు మారుపేరుగా శాండినో మారారు. తరువాత సోమోజా ఇద్దరు కుమారులు నిరంకుశపాలన సాగించారు.రెండవ వాడైన సోమోజా డెబాయిల్‌ను 1979లో వామపక్ష శాండినిస్టా గెరిల్లాలు గద్దె దింపారు. సోమోజాలు ఏర్పాటు చేసిన నేషనల్‌ గార్డ్స్‌ మాజీలతో కాంట్రాలనే పేరుతో ఒక విద్రోహ సాయుధ సంస్ధను రూపొందించి శాండినిస్టా ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు అమెరికా కుట్రపన్నింది. పదేండ్లపాటు వారి అణచివేతలోనే శాండినిస్టాలు కేంద్రీకరించాల్సి వచ్చింది. దాంతో జనంలో తలెత్తిన అసంతృప్తిని ఆసరా చేసుకొని అమెరికా మద్దతుతో మితవాదశక్తులు ఎన్నికల్లో అధికారాన్ని స్వాధీనం చేసుకొని 1990 నుంచి 2006వరకు అధికారంలో ఉన్నాయి. 2007 నుంచి డేనియల్‌ ఓర్టేగా అధిపతిగా శాండినిస్టాలు తిరిగి అధికారంలో కొనసాగుతున్నారు.


2021లో జరిగిన ఎన్నికలలో అధ్యక్షుడిగా ఓర్టేగా ఐదవసారి భారీ మెజారిటీతో ఎన్నికయ్యాడు.లాటిన్‌ అమెరికాలో అమెరికా సామ్రాజ్యవాదులకు తగిలిన మరొక ఎదురుదెబ్బ ఇది.1985లో కమ్యూనిస్టు చైనాను గుర్తించి ఓర్టేగా సర్కార్‌ దౌత్య సంబంధాలు ఏర్పరచుకుంది. తరువాత 1990లో అధికారానికి వచ్చిన అమెరికా అనుకూలశక్తులు అంతకు ముందు మాదిరే తైవాన్నే అసలైన చైనాగా తిరిగి గుర్తించారు. 2021లో తిరిగి ఓర్టేగా తైవాన్ను తిరస్కరించి చైనాతో సంబంధాలను పునరుద్దరించాడు. స్వయంగా అమెరికా కమ్యూనిస్టు చైనాను గుర్తించినప్పటికీ తైవాన్ను ఉపయోగించి రాజకీయాలు చేసేందుకు లాటిన్‌ అమెరికాలో తనకు అనుకూలమైన దేశాల ద్వారా తైవాన్‌తో సంబంధాలతో కొనసాగించింది.2007లో కోస్టారికా, 2017లో పనామా, 2018లో ఎల్‌ సాల్వడార్‌ చైనాను గుర్తించాయి.హొండురాస్‌ కూడా అదే బాటలో ఉంది. ఇది లాటిన్‌ అమెరికాలో మారుతున్న పరిణామాలకు అద్దంపడుతున్నాయి. మితవాద, మిలిటరీలను ఉపయోగించుకొని అమెరికా తన లబ్ది తాను చూసుకోవటం తప్ప అభివృద్ధి గురించి పట్టించుకోలేదు. ఇటీవలి కాలంలో అనేక దేశాలు చైనా నుంచి పెట్టుబడులను ఆశించటంతో అమెరికన్‌ లాబీలకు దిక్కుతోచటం లేదు. చైనా పెట్టుబడులతో అభివృద్ధి పనులు జరిగితే తమ పట్టు మరింత సడలుతుందనే భయం అమెరికాకు పట్టుకుంది. దీంతో నికరాగువా, ఇతర దేశాల వామపక్షాల్లో ఉన్న విబేధాలను మరింత పెంచి కొంత మందిని చీల్చి తన పబ్బంగడుపుకోవాలని చూస్తున్నది. ఈ క్రమంలో అది మరిన్ని కుట్రలకు పాల్పడి వామపక్ష ప్రభుత్వాలను కూలదోసే యత్నాలను మరింత వేగిరం చేసేందుకు పూనుకుంది. నికరాగువా సర్కార్‌ ఎప్పటి కప్పుడు అలాంటి కుట్రలను ఛేదిస్తూ ముందుకు పోతున్నది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...
← Older posts

Recent Posts

  • చమురు పన్ను తగ్గింపు : శ్రీలంక దెబ్బతో నరేంద్రమోడీ అదిరి పడ్డారా !
  • ప్రపంచాన్ని భయపెడుతున్న మంకీపాక్స్‌ వెనుక అమెరికా హస్తం ఉందా ?
  • హజ్‌ యాత్రీకుల కోసం నరేంద్రమోడీ పైరవీ – విజయన్‌పై నోరు పారవేసుకున్న పిసిసినేత !
  • ఇండోనేషియా కమ్యూనిస్టు ఊచకోత వెనుక బ్రిటన్‌ !
  • వందేళ్ల చైనా కమ్యూనిస్టు యూత్‌లీగ్‌ !

Recent Comments

raomk on రంగనాయకమ్మ గారూ”కుహనా మి…
యూహెచ్ ప్రీతమ్ on రంగనాయకమ్మ గారూ”కుహనా మి…
V.S.Srinivasa Babu on జాడలేని అపర జాతీయవాదులు…
K Seenaih on రష్యా – ఉక్రెయిన్‌ యుద్ధ…
K Seenaih on రష్యా – ఉక్రెయిన్‌ యుద్ధ…

Archives

  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • చమురు పన్ను తగ్గింపు : శ్రీలంక దెబ్బతో నరేంద్రమోడీ అదిరి పడ్డారా !
  • ప్రపంచాన్ని భయపెడుతున్న మంకీపాక్స్‌ వెనుక అమెరికా హస్తం ఉందా ?
  • హజ్‌ యాత్రీకుల కోసం నరేంద్రమోడీ పైరవీ – విజయన్‌పై నోరు పారవేసుకున్న పిసిసినేత !
  • ఇండోనేషియా కమ్యూనిస్టు ఊచకోత వెనుక బ్రిటన్‌ !
  • వందేళ్ల చైనా కమ్యూనిస్టు యూత్‌లీగ్‌ !

Recent Comments

raomk on రంగనాయకమ్మ గారూ”కుహనా మి…
యూహెచ్ ప్రీతమ్ on రంగనాయకమ్మ గారూ”కుహనా మి…
V.S.Srinivasa Babu on జాడలేని అపర జాతీయవాదులు…
K Seenaih on రష్యా – ఉక్రెయిన్‌ యుద్ధ…
K Seenaih on రష్యా – ఉక్రెయిన్‌ యుద్ధ…

Archives

  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • చమురు పన్ను తగ్గింపు : శ్రీలంక దెబ్బతో నరేంద్రమోడీ అదిరి పడ్డారా !
  • ప్రపంచాన్ని భయపెడుతున్న మంకీపాక్స్‌ వెనుక అమెరికా హస్తం ఉందా ?
  • హజ్‌ యాత్రీకుల కోసం నరేంద్రమోడీ పైరవీ – విజయన్‌పై నోరు పారవేసుకున్న పిసిసినేత !
  • ఇండోనేషియా కమ్యూనిస్టు ఊచకోత వెనుక బ్రిటన్‌ !
  • వందేళ్ల చైనా కమ్యూనిస్టు యూత్‌లీగ్‌ !

Recent Comments

raomk on రంగనాయకమ్మ గారూ”కుహనా మి…
యూహెచ్ ప్రీతమ్ on రంగనాయకమ్మ గారూ”కుహనా మి…
V.S.Srinivasa Babu on జాడలేని అపర జాతీయవాదులు…
K Seenaih on రష్యా – ఉక్రెయిన్‌ యుద్ధ…
K Seenaih on రష్యా – ఉక్రెయిన్‌ యుద్ధ…

Archives

  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Follow Following
    • vedika
    • Join 921 other followers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Customize
    • Follow Following
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d bloggers like this: