• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: INDIA

చమురు పన్ను తగ్గింపు : శ్రీలంక దెబ్బతో నరేంద్రమోడీ అదిరి పడ్డారా !

23 Monday May 2022

Posted by raomk in Current Affairs, Political Parties, Economics, BJP, Prices, Opinion, NATIONAL NEWS, History, INDIA

≈ Leave a comment

Tags

Narendra Modi Failures, Fuel prices freezing, India fuel tax reduction, Petrol, Diesel Price


ఎం కోటేశ్వరరావు


తాజాగా లీటరు పెట్రోలు మీద రు.8, డీజిలు మీద రు.6 కేంద్ర ప్రభుత్వం పన్నులను తగ్గించింది. అసల్లేనిదాని కంటే ఏమాత్రం తగ్గినా తగ్గినట్లే కదా అని సంతృప్తి చెందుతున్నారు కొందరు. దీని వలన కేంద్ర ప్రభుత్వం మీద లక్ష కోట్ల భారం పడుతుందని మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు. అంటే ఏదో రూపంలో తిరిగి జనం మీదనే మోపుతారు. తమ మీద భారం భారం అంటూ మురిపిస్తూ జనం మీద మోపిన విపరీత భారాన్ని మరిపించాలని చూస్తున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల కారణంగా 137 రోజుల పాటు ధరలను స్ధంభింపచేశారు. తరువాత మార్చినెల 22 నుంచి ఏప్రిల్‌ ఆరు వరకు ధరలు పెంచారు. ఢిల్లీలో లీటరు పెట్రోలు రు.95.41 నుంచి 105.41వరకు, డీజిలు ధర రు.86.67 నుంచి 96.67వరకు పెరిగింది రాష్ట్రాల వాట్‌ను బట్టి అన్ని చోట్లా ఒకే రేట్లు ఉండవు.


ఏప్రిల్‌ ఆరు నుంచి ఇప్పటి వరకు (ఇది రాసిన మేనెల 23వరకు) సవరించలేదు. బహుశా దీనికి శ్రీలంకపరిణామాలతో పాటు, ఉక్రెయిన్‌ సంక్షోభం, ఇతర కారణాలతో దేశంలో పెరుగుతున్న ధరలు కారణం అన్నది స్పష్టం. అంతకు ముందు పెరుగుతున్న ధరలు, ద్రవ్యోల్బణాన్ని అరికట్టేందుకు చమురు మీద కేంద్రం భారీగా విధించిన పన్నులను తగ్గించాలని ఆర్‌బిఐతో సహా అనేక మంది ఆర్ధికవేత్తలు సూచించినా కేంద్రం పట్టించుకోలేదు. గత రెండు నెలల్లో పరిస్ధితి మరింతగా దిగజారింది. ఈ ధోరణి మరింతగా విషమించటం తప్ప మెరుగుపడే తీరు కనిపించకపోవటంతో కేంద్రం దిగివచ్చింది. త్వరలో మరికొన్ని రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలు కూడా దీనికి కారణం కావచ్చు. అప్పటి వరకు చమురు ధరల స్ధంభన కానసాగించి తరువాత మొత్తంగా వడ్డించవచ్చు. ఐదు రాష్ట్రాల ఎన్నికల కారణంగా 137 రోజుల పాటు ధరలను సవరించకుండా నిలిపి తరువాత మొత్తాన్ని వసూలు చేసిన సంగతి తెలిసిందే.


అచ్చేదిన్‌ సంగతి గోమాత కెరుక ఇప్పుడున్న ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం, రూపాయి పతనం వీటి పర్యవసానాలతో మనం ఇంకా శ్రీలంకకు ఎంతదూరంలో ఉన్నాం అని జనం ఆలోచించే పరిస్ధితి వస్తుందని బిజెపి పెద్దలు భయపడుతున్నట్లు కనిపిస్తోంది. అక్కడ సింహళ (మెజారిటీ బౌద్దులు) హృదయ సామ్రాట్టుగా నీరాజనాలు అందుకున్న మాజీ అధ్యక్షుడు, ప్రధానిగా పని చేసిన మహింద రాజపక్స ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? మహాభారతంలో రారాజుగా కీర్తి పొందిన ధుర్యోధనుడు చివరి రోజుల్లో ప్రాణాలు కాపాడుకొనేందుకు మడుగులో దాగినట్లుగా మేనెల 10వ తేదీ నుంచి ట్రింకోమలీలోని నౌకాదళ కేంద్రంలో రక్షణ పొందుతున్నాడు. మాజీ మంత్రి, ప్రస్తుతం ఎంపీగా ఉన్న కుమారుడు నామల్‌ రాజపక్సతో కలసి మే 18వ తేదీన భద్రత నడుమ పార్లమెంటు సమావేశాలకు మహీంద రాజపక్స హాజరయ్యాడు. అతగాడు దేశం విడిచి వెళ్లకూడదని కోర్టు ఆదేశించింది. సింహళ మెజారిటీ జాతీయవాదాన్ని తలకు ఎక్కించుకున్న ఆ జనమే ఆర్ధిక సంక్షోభంతో తమ జీవితాలు అతలాకుతలం కావటంతో అదే మహింద రాజపక్స కనిపిస్తే చంపేస్తామంటూ వీధులకు ఎక్కిన దృశ్యాలు మెజారిటీ హిందూ హృదయ సామ్రాట్టులకు కనిపిస్తున్నాయా ? ఏమో !
జనానికి ఎంత భారం తగ్గినా మంచిదే కనుక ప్రభుత్వ చర్య మంచిదే అనుకున్నా పన్నుల పెంపుదల పూర్వపు స్ధాయికి చేరితేనే మరింత ఊరట కలుగుతుంది. ఈ సందర్భంగా ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పన్నులు తగ్గింపు ప్రకటన చేసినదాని కంటే – ఏమాటకామాటే చెప్పుకోవాలి -వాటి గురించి ఇచ్చిన వివరణకు నిజంగా ఆమెను అభినందించకతప్పదు. గత ఎనిమిది సంవత్సరాలుగా కేంద్రం చమురు మీద పెంచిన పన్నుల నుంచి రాష్ట్రాలకు ఎలాంటి వాటా రాదు అని ఎందరు మొత్తుకున్నా బుకాయించి వాటి నుంచి 41శాతం వాటా కేంద్రం తిరిగి రాష్ట్రాలకు ఇస్తుందని వాట్సాప్‌ విశ్వవిద్యాలయం ద్వారా చేసిన కాషాయదళాలు చేసిన బోధనలను తలకు ఎక్కించుకున్న వారిని ఇప్పుడు తలలు దించుకోవటమే కాదు, ఎక్కడ పెట్టుకోవాలో తెలియని స్ధితిలోకి నిర్మలమ్మ నెట్టివేశారు. అలాంటి కనువిప్పు కలిగించినందుకు ఆమెకు నీరాజనాలు పలకాల్సిందే మరి. తాజా తగ్గింపు వలన రాష్ట్రాలకు వచ్చే వాటా ఏమాత్రం తగ్గదని, అవి వాటాలేని రోడ్డు, మౌలిక సదుపాయాల సెస్‌ ఖాతాకు చెందినవని ఆమె స్పష్టంగా చెప్పారు. సెస్‌లు దేనికోసం విధించారో అందుకోసమే ఖర్చు చేయాలి. సెస్‌ల విధింపును సమర్ధిస్తూ కాషాయదళాలు చేసిన వాదనలను ఒక్కసారి వారి బోధనలతో ప్రభావితమైన వారు గుర్తుకు తెచ్చుకోవాలి. గత మన్మోహన్‌ సింగ్‌ చేసిన చమురు(ఇరాన్‌కు) అప్పులు తీర్చేందుకు అని తొలుత చెప్పారు. తరువాత చమురు బాండ్లను తీర్చేందుకుఅన్నారు. గాల్వాన్‌ ఉదంతాల తరువాత సైనికులకు ఖర్చు చేసేందుకు చమురు పన్నువేశారంటే కాదన్న వారిని దేశద్రోహులుగా చిత్రించి జనాన్ని రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారు.తొలుత మొరాయించి తరువాత కరోనా వాక్సిన్‌ ఉచితంగా వేయాల్సి వచ్చే సరికి వీటన్నింటికీ పన్నులు వేయకుండా డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయంటూ ఎదురుదాడి చేశారు.ఎప్పటికెయ్యది అప్పటికా మాటలు చెప్పారు.


పెట్రోలు మీద 8, డీజిలు మీద ఆరు రూపాయల సెస్‌ తగ్గించినందుకు గాను కేంద్రం మీద ఏడాదికి లక్ష కోట్ల మేరకు భారం పడుతుందని, దాన్ని అప్పుల ద్వారా పూడ్చుతామని నిర్మలా సీతారామన్‌ చెప్పారు. దీనికి కూడా ఆమెను అభినందించాల్సిందే. చెంపదెబ్బ-గోడదెబ్బ మాదిరి చమురు పేరుతో రోడ్డు పన్ను మన నుంచి వసూలేగాక రోడ్ల మీద తిరిగినందుకు రోడ్డుపన్ను(టోల్‌టాక్సు) కూడా వసూలు చేశారని అనేక మంది ఆమె ప్రకటన తరువాత గ్రహించిన విద్యావంతులు గుండెలు బాదుకుంటున్నారు. గత ఎనిమిది సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం చమురు పన్నుల రూపంలో ఎంత మోపిందో ప్రతిపక్షాలు, విశ్లేషకులు చెబితే జనాలకు ఎక్కలేదు, ఇప్పుడు నిర్మలమ్మే చెప్పారు గనుక నమ్మకతప్పదు.మోడీ ఏలుబడి ప్రారంభంలో పెట్రోలు మీద లీటరుకు రు.9.48 గా ఉన్నదానిని రు.32.98కి, డీజిలు మీద రు.3.56గా ఉన్నదానిని రు.31.83కు పెంచారు. అంటే ఇన్నేండ్లుగా జనాల నుంచి కేంద్రం ఎంత పిండిందో, తమ జేబులకు ఎంత చిల్లిపడిందో ఎవరికి వారు లెక్కలు వేసుకోవచ్చు.


గతేడాది కేంద్రం, బిజెపి పాలిత రాష్ట్రాలు కొంతమేరకు తగ్గించినందుకు, ఆ మేరకు తగ్గించని రాష్ట్రాలు కూడా వెసులుబాటు కలిపించాలని ప్రధాని నరేంద్రమోడీ కొద్ది వారాల క్రితం రాష్ట్రాల మీదకు జనాన్ని ఉసికొల్పారు. నిజం ఏమిటి ? మే 23వ తేదీ హిందూ పత్రిక వార్త ప్రకారం 2015-2021 మధ్య కేంద్ర పన్నులు జిడిపిలో 0.79 నుంచి 1.88శాతానికి పెరిగితే ఇదే కాలంలో రాష్ట్రాల పన్నులు 1.1 నుంచి 1.02శాతానికి తగ్గాయి. ఈ కారణంగానే ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు పన్నులు తగ్గించేందుకు అంగీకరించలేదు. బిజెపి పాలిత రాష్ట్రాలకు ఇతరంగా ఏదో రీతిలో సర్దుబాటు చేస్తారు గనుక అవి మౌనంగా ఉన్నాయి. గతేడాది తగ్గించిన మొత్తాలను కూడా పరిగణనలోకి తీసుకుంటే కేంద్రం ఇప్పటి వరకు పెట్రోలు మీద రు.13, డీజిలు మీద రు.16 తగ్గించింది.దీని వలన కేంద్రానికి రు.2,20,000 కోట్ల రాబడి తగ్గుతుందని నిర్మలా సీతారామన్‌ చెప్పారు. ఇది నాణానికి ఒకవైపు చూపటమే. రెండోవైపు చూస్తే 2014-15లో కేంద్రానికి చమురు రంగం నుంచి వచ్చిన వివిధ రకాల రాబడి రు.1,26,025 కోట్లు కాగా 2020-21లో వచ్చిన మొత్తం రు.4,19,884 కోట్లకు పెరిగింది. అంటే జనాల నుంచి ఎంత గుంజారో వేరే చెప్పనవసరం లేదు. ఈ కాలంలోనే చమురు ధరలు గణనీయంగా తగ్గినా ఆమేరకు జనానికి తగ్గించకపోగా పన్నులు పెంచి చేసిన దోపిడీని ఈ అంకెలు వెల్లడిస్తున్నాయి. వంద పెంచి 50 తగ్గించి చూశారా మా ఘనత అని నమ్మించేందుకు పూనుకున్నారు.


తగ్గింపు మేరకు ఏర్పడిన లోటు పూడ్చుకొనేందుకు అప్పు చేస్తామని నిర్మలమ్మ చెప్పారు. దీనికి కూడా ఆమెను అభినందించాల్సిందే, కేంద్రమే భారం భరిస్తుందని చెప్పలేదు. గతంలో యుపిఏ సర్కార్‌ చమురు సంస్దలకు ఇవ్వాల్సిన సబ్సిడీ మొత్తాన్ని నగదుగా చెల్లించలేక కంపెనీలకు బాండ్ల రూపంలో ఇచ్చింది. ఆ మొత్తం రు.1.44లక్షల కోట్లు, దానికి వడ్డీ 70వేల కోట్లు. దాన్ని తప్పుపట్టటమే కాదు, ఆ బాండ్ల భారాన్ని తీర్చేందుకు అదనంగా పన్నులు వేయాల్సివచ్చిందని అప్పుడు చెప్పారు. ఇప్పుడు తగ్గించిన పన్ను మేరకు బాండ్ల ద్వారా అప్పులు చేస్తామని ఆర్దిక మంత్రి చెబుతున్నారు. రెండింటికీ తేడా ఏమిటో ఎవరైనా చెప్పగలరా ? పోనీ నరేంద్రమోడీ పలుకుబడిని చూసి ఇప్పుడు తీసుకొనే అప్పుకు ఎవరైనా వడ్డీ లేకుండా ఇస్తారా ? తాము చేస్తే సంసారం, అదేపని ఇతరులు చేస్తే మరొకటా ? రేపు మరోసారి ఇదే సర్కార్‌ అప్పు తీర్చే పేరుతో మరిన్ని భారాలు మోపదని హామీ ఏమిటి ? పన్ను తగ్గించిన కారణంగా అప్పుతీసుకుంటామని సాకు చెబుతున్నారు. గత ఎనిమిది సంవత్సరాల్లో పెద్ద మొత్తంలో రుణాలు ఎందుకు తీసుకున్నట్లు ? రుణభారాన్ని అదుపు చేసుకోవాలని మోడీ సర్కార్‌ రాష్ట్రాలను కోరుతున్నది. కానీ తాను చేసిన అప్పుల గురించి ప్రస్తావించటం లేదు. 2021 సెప్టెంబరులో రిజర్వుబాంకు విడుదల చేసిన వివరాల ప్రకారం నరేంద్రమోడీ అధికారం చేపట్టే నాటికి అంటే 2014 మార్చి ఆఖరుకు కేంద్ర ప్రభుత్వానికి ఉన్న దేశీయ రుణం రు.54,84,848కోట్లు, విదేశీ అప్పు రు.3,74,483 కోట్లు మొత్తం రు.58,59,331 కోట్లు. 2022-23 బడ్జెట్‌లో పేర్కొన్నదాని ప్రకారం 2023 మార్చినాటికి దేశీయ రుణం రు.147,48,875కోట్లు, విదేశీ అప్పు రు.4,69,034 కోట్లు మొత్తం రు.152,17,910 కోట్లు అవుతుందని అంచనా. కేంద్రం రాబడి తగ్గితే గతంలో తగ్గించిన కార్పొరేట్‌ పన్నును తిరిగి పెంచాలి. ఏటా పెరుగుతున్న కోటీశ్వరుల నుంచి అదనంగా రాబట్టాలి. వడ్డీ రేట్లు పెంచేందుకు బుర్రను పెద్దగా ఉపయోగించాల్సిన అవసరం లేదని ఆర్‌బిఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ చెప్పారు. అప్పుకూడా అంతేగా, లేకపోతే కొత్తగా నోట్లు ముద్రిస్తారు. దానికీ పెద్దగా ఆలోచించాల్సినపనిలేదు.


ఏప్రిల్‌ ఆరు నుంచి ధరలను స్ధంభింప చేసిన కారణంగా తమకు పెట్రోలు మీద లీటరుకు మే నెల 16వ తేదీ మార్కెట్‌ ప్రకారం రు.13, డీజిల్‌కు రు.24 నష్టం వస్తున్నదని రిలయన్స్‌-బిపి కంపెనీ ప్రతినిధులు తెలిపినట్లు మే 23వ తేదీ ఎకనమిక్స్‌ టైమ్స్‌ పత్రిక రాసింది. తమకు ప్రతినెలా ఏడువందల కోట్ల మేరకు నష్టం వస్తున్నదని సదరు కంపెనీ చెబుతోంది. వారు చెప్పే అంకెలతో ఏకీభవించటమా లేదా అన్నది పక్కన పెడితే అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పీపా ధర 110 డాలర్లకు అటూ ఇటూగా ఉంటున్నది. దేశంలో 83,027 పెట్రోలు బంకులుండగా రిలయన్స్‌-బిపికి 1,459, మరో ప్రయివేటు కంపెనీ నయారా ఎనర్జీకి 6,568 ఉన్నాయి.మిగిలినవన్నీ ప్రభుత్వ రంగ సంస్దలవే. ఏప్రిల్‌ ఆరు తరువాత మన దేశం కొనుగోలు చేసే చమురు ధరలో ఎగుడుదిగుడులున్నాయి. ఏరోజు ధరపెరిగితే ఆమరుసటి రోజు పెంచుతాము లేదా తగ్గితే తగ్గించే విధానం అమలు చేస్తున్నట్లు ప్రతి రోజూ ప్రకటించిన ధరల గురించి తెలిసిందే. మార్చినెల 28న మనం కొనే చమురు పీపా ధర 112 డాలర్లుంది. తరువాత అది వందకు పడిపోయింది, తరువాత పెరిగింది, తగ్గుతోంది, కానీ ఆ మేరకు సవరించకుండా ఏప్రిల్‌ ఆరవ తేదీ నుంచి ధరలను స్ధంభింపచేశారు. ఎందుకిలా చేశారో జనానికి చెప్పాలా లేదా ?నరేంద్రమోడీ అధికారానికి వచ్చినపుడు 58గా ఉన్న రూపాయి విలువ మే 23న 77.66గా దిగజారింది. అంటే ముడి చమురు ధరలు స్ధిరంగా ఉన్నా మన మీద భారం పెరుగుతూనే ఉంటుంది.


ఉజ్వల పధకం కింద గాస్‌ కనెక్షన్లు పొందిన తొమ్మిది కోట్ల మందికి ఏడాదికి గరిష్టంగా పన్నెండు సిలిండర్ల మీద రు.200 సబ్సిడీ ఇస్తున్నట్లు అందుకు గాను ఏడాదికి 6,100 కోట్లు కేంద్రంపై భారం పడుతుందని నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. అంటే ఒక్కొక్కరికి రు.2,400 అనుకున్నారు. కాని మంత్రి చెప్పిన దాన్ని సగటు లెక్కిస్తే రు.677 మాత్రమే. పెంచిన గాస్‌ ధరలు, గతంలో ఉన్న సబ్సిడీ కోతను చూస్తే ఇది పెద్ద లెక్కలోనిది కాదు. అసలు ఈ పధకం కింద కనెక్షన్‌ పొందిన వారు 2020-21లో 90లక్షల మంది అసలు గాసే తీసుకోలేదు. కోటీ ఎనిమిది లక్షల మంది ఒకసారి తీసుకున్నారని సమాచార హక్కు కింద అడిగిన ఒక ప్రశ్నకు తాము ఇచ్చిన కనెక్షన్ల గురించి ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ తెలిపింది. తమ వద్ద ఈ పధకం కింద 15.96శాతం మంది అసలు గాస్‌ తీసుకోలేదని భారత్‌ పెట్రోలియం,9.175లక్షల మంది తీసుకోలేదని హెచ్‌పి కంపెనీ తెలిపింది. గాస్‌ ధరలను భరించలేని కారణంగా ఉజ్వల పధకం కింద కనెక్షన్‌ పొందిన వారు అసలు తీసుకోవటానికే ముందుకు రావటం లేదు. లేదా బినామీలకు అప్పగిస్తున్నారు.శ్రీలంక పరిణామాల నుంచి మన జనం ఏమి గ్రహించారో తెలియదు గానీ ఆకాశవాణి బిజెపి నేతలను ప్రత్యేకించి నరేంద్రమోడీని హెచ్చరించినట్లుగా కనిపిస్తోంది.దాని పర్యవసానమే పరిమితంగా మరోసారి పన్ను తగ్గింపు అని ఎందుకు అనుకోకూడదు ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

ఉత్కంఠ రేపుతున్న కేరళ ఉప ఎన్నిక – సిపిఎం ఎంపీకి 2000 గొడుగుల బహుమతి !

12 Thursday May 2022

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion, Others, Political Parties

≈ Leave a comment

Tags

#Pinarayi Vijayan, CPI(M), Kerala LDF, Thrikkakara by-election, UDF Kerala


ఎం. కోటేశ్వరరావు


ఈ నెల 31వ తేదీన కేరళలోని త్రిక్కకర అసెంబ్లీ ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది. ఎర్నాకుళం జిల్లాలో కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గాన్ని ఎలాగైనా తిరిగి నిలుపుకోవాలని కాంగ్రెస్‌, అక్కడ పాగా వేసి ప్రతిష్టను పెంచుకోవాలని సిపిఎం చూస్తున్నాయి. ఎర్నాకుళం నగరంలో కొంత, కొచ్చి నగరంలో కొంత ప్రాంతం ఉన్న ఉన్న ఈ పట్టణ నియోజకవర్గం ఎర్నాకుళం లోక్‌సభ పరిధిలో ఉంది. హిందూ ఓటర్లు 50, క్రైస్తవ ఓటర్లు 35, ముస్లిం ఓటర్లు 15శాతం ఉన్నారని అంచనా. గతేడాది జరిగిన ఎన్నికలలో సిపిఎం బలపరిచిన స్వతంత్ర అభ్యర్ధిపై గెలిచిన కాంగ్రెస్‌ సభ్యుడు పిటి థామస్‌ మరణంతో ఉప ఎన్నిక అవసరమైంది. కాంగ్రెస్‌ తరఫున థామస్‌ సతీమణి ఉమ పోటీలో ఉండగా ఈ సారి సిపిఎం తన స్వంత గుర్తుపైనే ప్రముఖ కార్డియాలజిస్టు డాక్టర్‌ జో జోసెఫ్‌ను నిలిపింది. బిజెపి కూడా ఇక్కడ పోటీ చేస్తోంది.గత ఎన్నికల్లో ట్వంటీట్వంటీ పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్ధికి పదిశాతం ఓట్లు వచ్చాయి. ఉప ఎన్నికల్లో ఆ పార్టీతో కలసి ఆమ్‌ ఆద్మీ ఉమ్మడి అభ్యర్ధిని నిలుపుతామని, రెండు పార్టీలను విలీనం చేస్తామని చేసిన ప్రకటనలకు భిన్నంగా అసలు పోటీ చేయరాదని, విలీనమూ లేదని రెండు పార్టీలు ప్రకటించాయి. ట్వంటీట్వంటీ(2020) పార్టీని ప్రముఖ పారిశ్రామిక సంస్ధ కిటెక్స్‌ ఏర్పాటు చేసింది.తమ సంస్ధపై కార్మికశాఖ తనిఖీలు చేసిందంటూ దానికి నిరసనగా కేరళ నుంచి వెళ్లిపోతామని ఆ సంస్ధ బెదిరించిన సంగతి తెలిసిందే ఆ పేరుతో ఏ రాష్ట్రంలో ఎక్కువ రాయితీలు ఇస్తే, కాలుష్యం వంటి అంశాలను పట్టించుకోకుండా ఉండే చోట విస్తరిస్తామని చెప్పింది. ఆ పోటీలో తెలంగాణా సర్కార్‌ దానితో ఒప్పందం కుదుర్చుకొని వరంగల్‌లో ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది.ఈ సంస్ధకు కేరళ కాంగ్రెస్‌తో కూడా విబేధాలున్నాయి..


ఆమ్‌ ఆద్మీ పార్టీ కేరళలో అడుగుపెట్టేందుకు కిటెక్స్‌ యజమానులతో సంప్రదింపులు జరిపింది.దాని బలం ఏమిటో ఇంతవరకు ఎక్కడా రుజువు కాలేదు. కిటెక్స్‌ సంస్ధ తమ పరిశ్రమలు ఉన్న ప్రాంతంలో స్ధానిక సంస్ధల ఎన్నికల్లో పోటీ చేసి గ్రామపంచాయతీని గెలుచుకుంది. మరికొన్ని చోట్ల కూడా పోటీ చేసింది. ఆకస్మికంగా ఈ ఎన్నికల్లో పోటీ చేయరాదనే నిర్ణయం వెనుక కాంగ్రెస్‌ను బలపరిచి సిపిఎంను అడ్డుకోవాలనే ఎత్తుగడ ఉన్నట్లు భావిస్తున్నారు. బహిరంగంగా మద్దతు ఇస్తుందా పరోక్షంగా సహకరిస్తుందా అన్నది ఇంకా స్పష్టం కాలేదు. గత ఎన్నికల్లో దానికి వచ్చిన పదిశాతం ఓట్లలో ఎవరికి ఎన్ని పడతాయనే చర్చ సాగుతోంది.దివంగత ఎంఎల్‌ఏ పిటి థామస్‌ ఆ కంపెనీ కాలుష్యం గురించి తీవ్రంగా విమర్శించారు. ఐనప్పటికీ సిపిఎం వ్యతిరేక ఓటు చీలకూడదు, ఓడించాలనే లక్ష్యంతో కాంగ్రెస్‌ నేతలతో చర్చల తరువాత పోటీ నుంచి తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఈసారి సిపిఎం గెలిస్తే అసెంబ్లీలో ఎల్‌డిఎఫ్‌ బలం 140కి గాను వంద అవుతుంది. వరుసగా రెండవసారి చారిత్రాత్మక విజయం సాధించిన ఎల్‌డిఎఫ్‌ ఎదుర్కొంటున్న తొలి ఉప ఎన్నిక ఇది. సహజంగానే సిపిఎం కూడా ప్రతిష్టాత్మకంగానే తీసుకుంది.నిజానికి ఈ ఎన్నిక కాంగ్రెస్‌కు జీవన్మరణ సమస్యగా మారింది.2011లో కొత్తగా ఏర్పడిన ఈ నియోజకవర్గంలో గత మూడు ఎన్నికల్లో కాంగ్రెస్‌ సునాయాసంగా గెలిచింది. ప్రదేశ్‌ కాంగ్రెస్‌ నూతన అధ్యక్షుడు కె సుధాకరన్‌, నూతన ప్రతిపక్ష నేత సతీశన్‌కు ఇది ప్రతిష్టాత్మకంగా మారింది. పార్టీలో ఉన్న అంతర్గత కుమ్ములాటలు ముదరకుండా చూసుకొనేందుకు, సానుభూతిని సొమ్ము చేసుకోవటంతో పాటు నాయర్‌ సర్వీస్‌ సొసైటీ మద్దతును కూడ గట్టేందుకు ఉమను రంగంలోకి దింపినట్లు భావిస్తున్నారు.


సిపిఎం అభ్యర్ధి ఎంపికలో చర్చి అధికారుల ప్రమేయం ఉందంటూ కాంగ్రెస్‌ తప్పుడు ప్రచారం ప్రారంభించింది. సిరో మలబార్‌ చర్చ్‌ ప్రతినిధిగా జో జోసెఫ్‌ను నిలిపినట్లు ఆరోపించింది. ఆ ప్రకటనపై సంబంధిత చర్చి వర్గాల నుంచి నిరసన వెల్లడి కావటంతో తన ప్రకటనను వెనక్కు తీసుకుంది. కాంగ్రెస్‌ అభ్యర్ధి ఉమ ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారు. పిటి థామస్‌తో కెఎస్‌యులో కలసి పని చేసినపుడు ఏర్పడిన పరిచయంతో మతాంతర వివాహం చేసుకున్నారు. ఈ ఎన్నికల్లో నాయర్‌ సర్వీస్‌ సొసైటీ నేత సుకుమారన్‌ నాయర్‌ను కలసి ఆయన తనకు తండ్రితో సమానులంటూ తనను బలపరచాలని కోరారు. గత ఎన్నికలలో కూడా అక్కడ క్రైస్తవ సామాజిక తరగతికి చెందిన వారినే సిపిఎం బలపరిచింది. ఎర్నాకుళం నుంచి రెండు సార్లు లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించటంతో పాటు నాలుగు సంవత్సరాల పాటు కేంద్ర మంత్రిగా పని చేసిన కాంగ్రెస్‌ నేత కెవి థామస్‌ ఈ ఎన్నికల్లో సిపిఎంను బలపరిచేందుకు నిర్ణయించారు. కన్నూరులో సిపిఎం మహాసభల సందర్భంగా ఏర్పాటు చేసిన ఒక సెమినార్‌లో మాట్లాడేందుకు అంగీకరించిన థామస్‌పై ఆగ్రహించిన కాంగ్రెస్‌ అధిష్టానం అన్ని పదవుల నుంచి తొలగించినట్లు ప్రకటించింది తప్ప పార్టీ నుంచి బహిష్కరించలేదు. ఉప ఎన్నిక ముగిసే వరకు ఎలాంటి చర్యలు ఉండకపోవచ్చని చెబుతున్నారు. తాను కాంగ్రెస్‌వాదినేనని ఎల్‌డిఎఫ్‌ అమలు చేస్తున్న అభివృద్ధికార్యక్రమాలకు మద్దతు ఇస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్‌కు రాజీనామా ఇవ్వలేదు, మరొక పార్టీలో చేరలేదని కావాలంటే తనను పార్టీ నుంచి బహిష్కరించుకోవచ్చన్నారు. స్ధానిక కాంగ్రెస్‌ నేతలు తనను పార్టీ నుంచి వెళ్ళగొట్టేందుకు 2018 నుంచీ చూస్తున్నారని అన్నారు.కెవి థామస్‌కు మీడియా అనవసర ప్రాధాన్యత ఇస్తున్నదని కాంగ్రెస్‌ నేతలు మండిపడుతున్నారు.
2011 ఎన్నికల్లో 5.04శాతం ఓట్లు తెచ్చుకున్న బిజెపి 2016లో 15.7శాతానికి పెంచుకుంది, 2021లో 11.32శాతానికి తగ్గింది. ఈ సారి కొత్త అభ్యర్ధిని రంగంలోకి దింపింది.దాని మత అజెండాలో భాగంగా లౌజీహాద్‌, నార్కోటిక్‌ జీహాద్‌ నినాదాలతో క్రైస్తవ ఓటర్లను ఆకర్షించేందుకు పూనుకుంది. గత ఎన్నికల్లో కొత్తగా రంగంలోకి దిగిన ట్వంటీ ట్వంటీ 10.32శాతం ఓట్లు తెచ్చుకుంది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌, సిపిఎం, బిజెపి మూడు పార్టీలకు ఓట్లశాతాలు తగ్గినందున ఆ మేరకు ట్వంటీట్వంటీకి పడినట్లు భావిస్తున్నారు. ఆ ఓటర్లు ఈ సారి గతంలో మద్దతు ఇచ్చిన పార్టీలకే తిరిగి వేస్తారా లేదా అన్నది చర్చ.


ఎంపీకి గొడుగుల బహుమతి
డివైఎఫ్‌ఐ నేత, తాజాగా కేరళ నుంచి సిపిఎం తరఫున రాజ్యసభకు ఎన్నికైన ఎఎ రహీంకు అరుదైన బహుమతులు లభించాయి. వివిధ కార్యక్రమాలకు తనను ఆహ్వానించే వారు బంగారుశాలువలు, మెమెంటోలు, ఖరీదైన పుష్పగుచ్చాల వంటివి ఇవ్వవద్దని, అంతగా ఇవ్వాలనుకుంటే గొడుగులు ఇవ్వాలని రహీం సున్నితంగా చెప్పారు. తిరువనంతపురంలో జరిగిన ఒకసభలో ఆమేరకు వివిధ సంస్ధల వారు రహీంకు రెండువేల గొడుగులు కానుకగా ఇచ్చారు. వాటిని ప్రభుత్వ స్కూళ్ల పిల్లలకు అందచేస్తానని రహీం ప్రకటించారు. గతంలో మంత్రిగా పని చేసిన సిపిఎం నేత ఎంఏ బేబీ తనకు పుస్తకాలు కానుకగా ఇవ్వాలని చెప్పేవారు, వాటిని గ్రంధాలయాలుకు ఇచ్చేవారు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

అమెరికా, ఐరోపా చమురు రాజకీయం – బలవుతున్న భారతీయులు !

06 Friday May 2022

Posted by raomk in Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, Prices, RUSSIA, USA

≈ Leave a comment

Tags

fuel politics, Fuel Price in India, Narendra Modi, Narendra Modi Failures, OPEC+, Ukraine-Russia crisis


ఎం కోటేశ్వరరావు


మరోసారి అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర పెరిగింది. మే ఆరవ తేదీన ఇది రాసిన సమయంలో బ్రెంట్‌ రకం ధర 113.49 డాలర్లు ఉంది. ఈ ఏడాది ఆఖరు నాటికి రష్యానుంచి ఇంథన దిగుమతులపై పూర్తి ఆంక్షలు విధించాలని ఐరోపా సంఘం(ఇయు) అధికారికంగా ప్రతిపాదించటంతో చమురు ధర పెరిగింది. ఈలోగా సభ్యదేశాలు ప్రత్నామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని కోరింది. దీన్ని బట్టి అమెరికా, ఐరోపా దేశాలు రష్యాతో అమీ తుమీ తేల్చుకొనేందుకు సిద్దపడుతున్నాయని భావించాల్సి వస్తోంది. ఉక్రెయిన్‌-రష్యా వివాదాన్ని ఆరనివ్వకుండా చూస్తారని వేరే చెప్పాల్సిన అవసరం లేదు.దీని పర్యవసానాలు ఎలా ఉండేదీ చెప్పలేము. కేంద్రం పన్నులు తగ్గించకపోతే మన దేశంలో మరింతగా చమురు ధరలు, ఇతర వస్తువుల ధరలు పెరగటం ఖాయం.


కొన్ని దేశాలు పూర్తిగా దాని మీదే ఆధారపడి ఉన్నందున రష్యా ఇంథనంపై పూర్తి నిషేధం అంత సులభం కాదని తెలుసుకోవాలి, ఇదే తరుణంలో ప్రత్నామ్నాయం చూసుకోవాలని ఐరోపా కమిషన్‌ అధ్యక్షరాలు ఉజులా వాండర్‌ లెయన్‌ ఐరోపా పార్లమెంటులో చెప్పారు. సముద్రం ద్వారా, పైప్‌లైన్‌, ముడి లేదా శుద్ధి చేసినదీ ఏ రూపంలోనూ, ఏ విధంగానూ అక్కడి నుంచి దిగుమతి చేసుకోరాదని, ఆరునెలల్లో ముడి చమురు, ఏడాదికి చివరికి శుద్ది చేసిన సరకు దిగుమతులను పూర్తిగా నిలిపివేయాలని తద్వారా రష్యాపై గరిష్టంగా వత్తిడి తేగలమన్నారు. పుతిన్‌ భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుదన్నారు.ఐరోపా పార్లమెంటు నిర్ణయాన్ని సభ్యదేశాలు ఆమోదించాల్సి ఉంది. తమ వల్ల కాదని జపాన్‌ చెప్పేసింది. హంగరీ, స్లోవేకియా ఈ నిర్ణయాన్ని వీటో చేస్తామని చెప్పినట్లు వార్తలు వచ్చాయి. రష్యా నుంచి ఇంథన దిగుమతులను నిలిపివేసే అవకాశం లేదని జపాన్‌ పరిశ్రమల మంత్రి కొషి హగిఉదా తేల్చి చెప్పారు. అమెరికా ఇంథనశాఖ మంత్రితో భేటీలో దీనిప్రస్తావన వచ్చింది. ఇంథన భద్రత ఒక్కో దేశానికి ఒకో విధంగా ఉంటుందని, అమెరికాకు అనుగుణంగా తాము ఉండలేమని స్పష్టం చేశారు. ప్రస్తుతం తన అవసరాల్లో నాలుగుశాతం చమురు, తొమ్మిది శాతం ఎల్‌ఎన్‌జిని జపాన్‌ దిగుమతి చేసుకుంటున్నది.


జర్మనీలో పెద్ద మొత్తంలో గాస్‌ దిగుమతి చేసుకొనే యునిపర్‌ సంస్ధ రష్యాకు రూబుళ్లలో చెల్లించాలని నిర్ణయించింది. తమ నుంచి ఇంథనాన్ని కొనుగోలు చేసే వారు రూబుళ్లలోనే చెల్లించాలని గత నెలలో పుతిన్‌ చేసిన ప్రకటనను అంగీకరించరాదని ఐరోపా కమిషన్‌ ప్రకటించినప్పటికీ జర్మన్‌ సంస్ధ దానికి భిన్నంగా పోతున్నది. రష్యా నిర్ణయం ప్రకారం దాని స్నేహితులు కాని దేశాల సంస్ధలు గాజ్‌ప్రోమ్‌ బాంకులో రెండు ఖాతాలు తెరవాల్సి ఉంటుంది. ఒక ఖాతాలో తాము చెల్లించే విదేశీ కరెన్సీని జమచేస్తే దాన్ని బాంకు రూబుళ్లలోకి మార్చి బాంకు రూబుల్‌ ఖాతాకు బదిలీ చేస్తుంది. రూబుళ్లలో చెల్లించని పక్షంలో ఇంథన సరఫరా నిలిపివేస్తామని పోలాండ్‌, బల్గేరియాకు గాజ్‌ప్రోమ్‌ చెప్పేసింది.యునిపర్‌ చర్య ఆంక్షలను ఉల్లంఘించటమే అని ఐరోపా కమిషన్‌ చెప్పింది.
రష్యా నుంచి దిగుమతి చేసుకొనే చమురు,బొగ్గు నిమిత్తం తమ కరెన్సీ యువాన్లలో చెల్లిస్తామని చైనా పేర్కొన్నది. అమెరికా డాలరు ముప్పులో ఉందని చెప్పటమే దీని లక్ష్యం. సౌదీ అరేబియాతో కూడా తన కరెన్సీలో చెల్లింపుల గురించి సంప్రదింపులు జరుపుతోంది. ప్రస్తుతం అంతర్జాతీయ చెల్లింపుల్లో అమెరికా డాలరు వాటా 40శాతం ఉంది. 2021 డిసెంబరులో చైనా కరెన్సీ 2.7శాతం ఉండగా ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి అది 3.2శాతానికి పెరిగింది. జపాన్‌ ఎన్‌ను వెనక్కు నెట్టి నాలుగవ స్ధానానికి ఎదిగింది. ఈ ఏడాది జనవరిలో ఇతర కరెన్సీల చెల్లింపులు 6.48శాతం తగ్గితే చైనా కరెన్సీ 11శాతం పెరిగినట్లు స్విఫ్ట్‌ వెల్లడించింది.2030నాటికి ప్రపంచంలో రిజర్వు కరెన్సీలో చైనా మూడవ స్దానంలో ఉంటుంది.


ఉక్రెయిన్‌ పరిణామాలతో అమెరికా పెద్దగా ప్రభావితం కాలేదు. కానీ అక్కడ మే ఐదవ తేదీన సహజవాయువు ధర (ఎంఎంబిటియు) 8.32 డాలర్లకు పెరిగింది. ఇది పదమూడు సంవత్సరాల నాటి రికార్డును అధిగమించింది. రానున్న కొద్ది వారాల్లో పది డాలర్లకు చేరవచ్చని భావిస్తున్నారు. 2008లో గరిష్టంగా 14డాలర్లు దాటింది.2020లో కనిష్టంగా 2.10 డాలర్లు నమోదైంది. పీపా చమురును 70 డాలర్లకంటే తక్కువకు సరఫరా చేయాలని మన దేశం రష్యాతో బేరమాడుతోందని బ్లూమ్‌బెర్గ్‌ పేర్కొన్నది. రవాణా, ఆంక్షలు, నిధుల వంటి ఇబ్బందులను గమనంలో ఉంచుకొని రాయితీ ఇవ్వాలని కోరుతున్నట్లు తెలిపింది. ఒప్పందం కుదిరితే మే నెలలో 15మిలియన్‌ పీపాలు దిగుమతి చేసుకోవచ్చని, ఇది భారత్‌ దిగుమతుల్లో పదిశాతానికి సమానమని కూడా వెల్లడించింది.
ఒకవైపు అమెరికా బెదిరిస్తున్నప్పటికీ మన దేశం రష్యా చమురు కోసం బేరసారాలాడటంలో ఆర్ధికాంశంతో పాటు, అంతర్జాతీయ రాజకీయాలు కూడా ఉన్నాయి.2013-14లో మన దేశం దిగుమతి చేసుకున్న ముడి చమురు పీపా సగటు ధర 105.52 డాలర్లు. నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత గత ఎనిమిది సంవత్సరాలలో ఇలా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ పిపిఏసి సమాచారం మేరకు వర్తమాన ఆర్ధిక సంవత్సరం తొలి నెల ఏప్రిల్‌లో సగటు ధర 103.10 డాలర్లు ఉంది.
సంవత్సరం×××× డాలర్లలో ధర
2014-15××× 84.16
2015-16××× 46.17
2016-17××× 47.56
2017-18××× 56.43
2018-19××× 69.88
2019-20××× 60.47
2020-21××× 44.82
2021-22××× 79.18
పైన పేర్కొన్న వివరాలను చూసినపుడు మన్మోహన్‌ సింగ్‌ ఏలుబడి చివరి సంవత్సరంలో ఉన్న స్ధాయి కంటే ఇప్పటికీ తక్కువగానే ఉన్నా సరే నరేంద్రమోడీ సర్కార్‌ అంతర్జాతీయంగా తగ్గిన మేరకు జనాలకు ధరలను తగ్గించలేదు. భారీ ఎత్తున సుంకాలు పెంచి ఆ మొత్తాలను కార్పొరేట్లకు రాయితీలకు మళ్లించటం, ఇతర అంశాలే దీనికి కారణం. వాటికి తోడు రూపాయి విలువ పతనం కూడా తోడైంది. మన్మోహన్‌ సింగ్‌ సర్కార్‌ మన కరెన్సీ విలువ పతనాన్ని అరికట్టటంలో విఫలమైందని నరేంద్రమోడీ సహా అనేక మంది బిజెపి నేతలు గతంలో విమర్శించారు. అందువలన ఇప్పుడు వారి నిర్వాకం కూడా జనాలకు శాపంగా మారింది.


ఉక్రెయిన్‌పై సైనిక చర్య ప్రారంభమైన తరువాత ఇప్పటివరకు ఐరోపా సంఘ(ఇయు) దేశాలు చమురు,గాస్‌, బొగ్గు దిగుమతులకు గాను రష్యాకు 50బిలియన్‌ డాలర్లు చెల్లించాయి. ఒపెక్‌ మరియు దానితో అనుసంధానం ఉన్న మొత్తం 23దేశాలు ప్రతి నెలా సమావేశమై మార్కెట్‌ను సమీక్షిస్తాయి. ఇవి 40శాతం చమురును ఉత్పత్తి చేస్తున్నాయి. తాజాగా జరిపిన సమీక్షలో ఇంతకు ముందే నిర్ణయించిన మేరకు స్వల్పంగా తప్ప ఉత్పత్తిని పెంచరాదని తీర్మానించాయి. రోజుకు పది మిలియన్ల పీపాల చమురు ఉత్పత్తి చేసే రష్యా మీద ఆంక్షల కారణంగా సరఫరా తగ్గితే గిరాకీ మేరకు ధరలు పెరిగేందుకు అవకాశం ఉంది. ఇదే జరిగితే మన వంటి దేశాల మీద భారం పెరుగుతుంది. ఒపెక్‌ దేశాలు రోజుకు 28మిలియన్ల పీపాల చమురు ఉత్పత్తి చేస్తున్నాయి. ఇది మొత్తం ఉత్పత్తిలో 30శాతానికి సమానం.ఐరోపాలోని రష్యా మార్కెట్‌ను ఆక్రమించేందుకు అమెరికా పావులు కదుపుతున్నది. తన దగ్గర ఉన్న నిల్వల నుంచి ఇప్పుడు ఎగుమతులు చేస్తున్నది. అవి తగ్గిపోతున్నందున ఆమేరకు ఉత్పత్తిని పెంచాల్సి ఉంది.ఐరోపా అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తి పెంచాలంటే అందుకు పెట్టుబడులు, పరికరాలు, సిబ్బంది కూడా అవసరమే. తీరా ఆ మేరకు పెట్టుబడులు పెట్టిన తరువాత ఎగుమతి అవకాశాలు తగ్గితే ఎలా అన్న గుంజాటనలో అమెరికా కంపెనీలు ఉన్నాయి.


ఒపెక్‌, దానితో సమన్వయం చేసుకుంటున్న దేశాలు ఉత్పత్తి నియంత్రణ, ధరల పెంపుదలకు కుమ్మక్కు అవుతున్నాయని, అందువలన అలాంటి దేశాల మీద చట్టపరమైన చర్యలు తీసుకొనేందుకు వీలు కల్పిస్తూ ఒక బిల్లును అమెరికా సెనెట్‌ న్యాయ కమిటీ ఆమోదించింది. దీనికి నోపెక్‌ (నో ఆయిల్‌ ప్రొడ్యూసింగ్‌ ఆర్‌ ఎక్స్‌పోర్టింగ్‌ కార్టెల్స్‌) అని పేరు పెట్టారు. దీన్ని పార్లమెంటు ఆమోదిస్తే తప్ప చట్టం కాదు. ఇలాంటి బిల్లు గురించి గత రెండు దశాబ్దాలుగా ప్రతిపాదనలు వస్తున్నా పార్లమెంటులోల ప్రవేశపెట్టలేదు. అమెరికాలో కూడా చమురు ధరలు, ద్రవ్యోల్బణం పెరుగుదల నేపధ్యంలో దీనికి ప్రాధాన్యత ఏర్పడింది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

కాషాయదళాల ముస్లిం వ్యతిరేక ప్రచారం -నిందలూ, నిజాలు !

29 Friday Apr 2022

Posted by raomk in BJP, Communalism, Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion, RELIGION, Religious Intolarence, Uncategorized

≈ Leave a comment

Tags

BJP, Narendra Modi, RSS, Saffron gang


ఎం కోటేశ్వరరావు


” 2029 ఎన్నికలలో ఒక ముస్లిం దేశ ప్రధాని అవుతాడు ” హిందువులారా బహుపరాక్‌, జాగ్రత్త పడండి,హిందూమతాన్ని రక్షించుకోండి ఇలాంటి ప్రచారాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. వీటిని చేసేది సంఘపరివార్‌ లేదా హిందూత్వశక్తులు అన్నది స్పష్టం. వీరు ఇంకా చెప్పిందేమిటి ? హిందువులు విశాలదృక్పధం కలిగిన వారు కనుకనే ముస్లిం సామాజిక తరగతికి చెందిన వారు రాష్ట్రపతులుగా ఎన్నికయ్యారు, అదే పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌ల్లో హిందువులెవరైనా ఉన్నత పదవులు అధిరోహించారా చూడండి అని ప్రచారం చేశారు. మరి వీరే 2029లో ఒక ముస్లిం ప్రధాని అవుతారంటూ ఎందుకు రెచ్చగొడుతున్నట్లు ? ఈ ప్రచారానికి ప్రాతిపదిక, లక్ష్యం ఏమిటి ? ఇప్పటికి దేశంలో జకీర్‌ హుసేన్‌, ఫకృద్దీన్‌ అలీ అహమ్మద్‌, అబ్దుల్‌ కలామ్‌ అజాద్‌ రాష్ట్రపతులుగా పని చేసినపుడు అదే సామాజిక తరగతికి చెందిన వారు ప్రధాని అయితే వచ్చే ముప్పు ఏమిటి ? రాష్ట్రపతులుగా పని చేసిన వారు హిందూ మతానికి లేదా సమాజానికి చేసిన హాని ఏమిటో ఎవరైనా చెప్పగలరా ?


ఐరోపాలో, ఆసియాలో తలెత్తిన జాతీయవాదాలు భిన్నమైన నేపధ్యాలు, లక్ష్యాలతో ముందుకు వచ్చాయి. ప్రతి చోటా వినాశనానికే దారి తీశాయి. బ్రిటీష్‌ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా తలెత్తిన జాతీయవాదం కులాలు, మతాలు, భాషా, ప్రాంతీయతలకు అతీతంగా జరిగింది. కానీ ఆర్‌ఎస్‌ఎస్‌ సంఘపరివారం, హిందూమహాసభలు ముందుకు తెచ్చిన జాతీయవాదానికి ప్రాతిపదిక పరమత విద్వేషం – హిందూత్వ. జర్మనీలో జర్మన్‌ జాతి పవిత్రతను కాపాడేపేరుతో యూదు వ్యతిరేకతను రెచ్చగొట్టారు, అది ఐరోపా అంతటినీ ప్రభావితం చేసింది. అనేక దేశాల్లో యూదుల ఊచకోతకు దారి తీసింది. మన దేశంలో రెచ్చగొడుతున్న హిందూత్వ జాతీయవాదం ముస్లిం, క్రైస్తవ వ్యతిరేకతను, ఉన్మాదాన్ని రెచ్చగొడుతున్నది. దానిలో భాగమే 2029లో ముస్లిం ప్రధాని అనే ప్రచారం.


” ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వరల్డ్‌ డెమోగ్రాఫిక్‌ రిసర్చ్‌ ” అనే సంస్ధ సర్వే లేదా విశ్లేషణ వెల్లడించిన సమాచారం పేరుతో జరుగుతున్న ప్రచారాన్ని సామాజిక మాధ్యమంలో వీడియోలు, పోస్టుల రూపంలో గత కొద్ది సంవత్సరాలుగా చూస్తున్నాము. వాటి ప్రకారం 2041నాటికి దేశంలో ముస్లిం జనాభా 84శాతానికి పెరుగుతుందట. ముస్లిం జనాభా పెరుగుదల తీరుతెన్నులను పేర్కొంటూ 1948లో 6, 1951లో 9.8, 2011లో 22.6, 2017లో 27.1 ఉందని, 2021లో 32.8, 2031లో 38.1, 2037లో 43.6, 2040లో 66.9, 2041లో 84.5 శాతానికి పెరుగుతుందని, అప్పటికి హిందువుల జనాభా 11.2శాతంగా ఉంటుందని సదరు సంస్ధ అంచనా వేసినట్లు చెబుతూ ఇంకేముంది హిందువులు అంతరించిపోతారంటూ రెచ్చగొడుతూ ప్రచారం సాగుతోంది. గత వంద సంవత్సరాలుగా హిందూత్వ శక్తులు నాటుతున్న విషబీజాలు ఇప్పుడు మర్రి ఊడల్లా విస్తరిస్తున్నాయి. నిరంతరం అదే పనిగా ఇలాంటి ప్రచారం కొనసాగుతుండటంతో జనాల్లో ఏమో అనే అనుమానం తలెత్తి దాన్ని నివృత్తి చేసుకోకుండానే అనేక మంది నిజమే అని నమ్ముతున్నారు. దాంతో విద్వేష ముఠాలు తమ ఉత్పత్తులతో వాట్సప్‌, ఇతర సామాజిక మాధ్యమాలను ముంచి వేస్తున్నాయి.


వాస్తవం ఏమిటి ? మన జనాభాలెక్కల ప్రకారం 1951లో 84.1శాతంగా ఉన్న హిందువులు 2011లో 78.35శాతంగా ఉండగా ఇదే కాలంలో ముస్లింలు 9.8 నుంచి 14.2శాతానికి మాత్రమే పెరిగారు. నాలుగుదశాబ్దాల్లో పెరిగింది 5.4 కాగా, వచ్చే నాలుగు దశాబ్దాల్లో 70శాతం ఎలా పెరుగుతారు ? అమెరికా పరిశోధనా సంస్ధ ” పూ ” వేసిన అంచనా ప్రకారం 2050 నాటికి మన దేశంలో ముస్లిం జనాభా 18.4 శాతం ఉంటుంది. ఇంతకీ అసలు విషయం ఏమంటే గజం మిధ్య అన్నట్లుగా అసలు సదరు ” ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వరల్డ్‌ డెమోగ్రాఫిక్‌ రిసర్చ్‌ ” అనే సంస్ధ ఉనికిలోనే లేదని గూగుల్‌ తల్లి చెప్పినట్లు 2019లోనే ఫాక్ట్‌లీ డాట్‌ ఇన్‌ అనే సంస్ధ ప్రతినిధి వెల్లడించారు. అందువలన హిందూమతానికి వచ్చిన ముప్పు అన్నది కూడా అవాస్తవం, ఇలాంటి తప్పుడు సమాచారాన్ని పట్టుకొని ప్రచారం చేసే సాధ్వులు, యోగులు చెప్పేది పచ్చి అబద్దాలే. బిజెపి ఎంపీలు పార్లమెంటులో జనాభా నియంత్రణ బిల్లులను ప్రవేశపెట్టినా, వాటి గురించి ప్రచారం చేసినా ప్రచారదాడిలో భాగమే తప్ప మరొకటి కాదు. ఇద్దరు పిల్లలకు మించి ఉన్నవారికి ప్రభుత్వ సంక్షేమ పధకాలను వర్తింప చేయకూడదనే ప్రచారం, ఉత్తర ప్రదేశ్‌, అసోం బిజెపి ప్రభుత్వాల బిల్లులు ముస్లింలను లక్ష్యంగా చేసుకొనే అన్నది తెలిసిందే. ఒక వేళ అవి చట్టరూపం దాల్చితే 80శాతంగా ఉన్న హిందువులే ఎక్కువ నష్టపోతారు. సాధ్వి రితంబర వంటి వారు ప్రతి హిందువు నలుగురు పిల్లల్ని కని ఇద్దర్ని ఆర్‌ఎస్‌ఎస్‌ లేదా భజరంగదళ్‌కు ఇవ్వాలని చెప్పిన సంగతి తెలిసిందే. ఆ ఇద్దర్ని ఏం చేస్తారు, వారితో ఏమి చేయిస్తారు ? బిజెపి విధానాలను, హిందూత్వను వ్యతిరేకించే వామపక్ష, లౌకిక వాదులు, ఇతర మతాలవారి మీద దాడి చేసే మూకలుగా తయారు చేస్తారా ?


” బిజెపి ఇంకొక దశాబ్దం దేశాన్నేలితే ఏదో ఒక రోజు చంద్రుడిపై త్రివర్ణ పతాకం, కానీ కాంగ్రెస్‌ వచ్చిందా జెండాపై రంజాన్‌ చంద్రుడే గతి, ఎప్పటికీ గుర్తుంచుకో ! ” అంటూ మరొక ప్రచారం జరుగుతున్నది. ఇదీ ముస్లిం విద్వేష ప్రచారంలో భాగమే అన్నది స్పష్టం. ఒక వైపు దేశంలో ముస్లిం జనాభా పెరిగి హిందువులు మైనారిటీగా మారనున్నారనే ప్రచారం చేస్తూనే అదే శక్తులు మరోవైపు చేస్తున్న ప్రచారాన్ని చూద్దాం. ” కొన్ని దశాబ్దాలుగా ఎన్నో విష జంతువులు ఉన్న కాంగ్రెస్‌ అనే పెద్ద మర్రి చెట్టును మోడీ పెకలించి వేస్తున్నాడు ” మార్క్‌తులి అనే బిబిసి మాజీ విలేకరి ఈ ప్రకటన ఇచ్చాడు అని అదే పోస్టులో పేర్కొన్నారు. ఈ పోస్టు సారం ఏమంటే విషసర్పాలన్నింటికీ మోడీ పొగపెట్టారు గనుక అవి దేశం మీద పడ్డాయి. వాటిని జనాలకు చూపి మోడీ అప్రమత్తంగావించటం మంచిదైంది. లేకపోతే అవి ఈ భారత భూమిని, హిందువులను మింగివేసేవి. మోడీ భవిష్యత్‌ తరాల మతమార్పిడులకు అడ్డుకట్టవేశారు. మోడీగారు చాలా కష్టపడాలి, పడతారు కూడా. అయితే ఈ దేశ ప్రజలంతా ముఖ్యంగా హిందువులంతా నరేంద్రమోడీ గారికి అండగా నిలవాలి. అని పేర్కొన్నారు. ఒక పోస్టులోనేమో ముస్లింలు మెజారిటీగా మారనున్నారని భయపెడతారు, మరో పోస్టులో హిందూమత రక్షకుడు నరేంద్రమోడీ వచ్చినట్లు, ముప్పు తప్పించినందుకు మద్దతు ఇవ్వాలని చెబుతారు. ముస్లిం జనాభా పెరుగుదల గురించి ఉనికిలో లేని సంస్ధ పేరు చెప్పి జనాలను తప్పుదారి పట్టించినట్లుగానే మార్క్‌తులి పేరు చెప్పి మరో పచ్చి అబద్దం ప్రచారంలో పెట్టారు. నరేంద్రమోడీకి అనుకూలంగా కొన్ని అంశాలను రాసి అవి మార్క్‌తులి పుస్తకంలోనివిగా పేర్కొంటూ గత ఐదు సంవత్సరాలుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు.


ఇక దేశంలో ముస్లింల జనాభా పెరుగుతోందన్న ప్రచారం గురించి నిజానిజాలేమిటో చూద్దాం. 2002 గుజరాత్‌ మారణ కాండ సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్రమోడీ చేసిన వ్యాఖ్య ఏమిటి ? ” నేనేం చేయాలి ? వారికి సహాయ శిబిరాలు ఏర్పాటు చేయాలి, పిల్లల్ని కనాలని మనం కోరుకుందామా ? ” 2017లో బిజెపి ఎంపీ సాక్షి మహరాజ్‌ మీరట్‌ సభలో మాట్లాడుతూ ”నలుగురు భార్యలు, 40 మంది పిల్లలను కలిగి ఉండేవారే దేశంలో జనాభా పెరుగుదలకు కారకులు, హిందువులను నిందించకూడదు. మన మతాన్ని సంరక్షించుకొనేందుకు ప్రతి హిందూ మహిళ నలుగురు పిల్లల్ని కనాలి ” అని చెప్పారు.
విశ్వహిందూ పరిషత్‌ అంతర్జాతీయ అధ్యక్షుడిగా పని చేసిన ప్రవీణ్‌ తొగాడియ గుజరాత్‌లోని బహరుచ్‌ జిల్లా జంబుసర్‌లో మాట్లాడుతూ ఇలా సెలవిచ్చారు.” హిందూ పురుషులూ ఇంటికి వెళ్లి మీ పురుషత్వాన్ని ఆరాధించండి. అప్పుడు హిందువుల జనాభా పెరుగుతుంది. హిందువులందరూ ఎక్కువ మంది పిల్లల్ని కనండి.” ఆర్‌ఎస్‌ఎస్‌ సర్‌సంఫ్‌ుసంచాలక్‌ మోహన్‌ భగవత్‌ మాట్లాడుతూ ముస్లింలు, హిందూ డిఎన్‌ఎ ఒకటే అని చెప్పారు. కానీ అదే పెద్ద మనిషి అంతకు ముందు ఒకసారి ఏమన్నారు.” ఇతరుల జనాభా పెరుగుతున్నపుడు హిందువుల జనాభా పెరగ కూడదని ఏ చట్టం చెప్పింది ” అని ప్రశ్నించారు. ఆరెస్‌ఎస్‌ మరోనేత దత్తాత్రేయ హౌసబలే ” చిన్న కుటుంబం నియమాలు హిందువులకు పెద్ద ముప్పుగా ఉన్నాయి. కనుక ప్రతి కుటుంబం ముగ్గురు పిల్లలను కలిగి ఉండాలి. ఒక సమాజం గుడ్డిగా కుటుంబ నియంత్రణ పాటిస్తే దేశానికి జరిగే మంచేమీ ఉండదు. అది దేశంలో తీవ్ర అసమానతలకు దారితీస్తుంది.” అన్నారు. 2018లో రాజస్తాన్‌ బిజెపి ఎంఎల్‌ఏ బన్వారీలాల్‌ సింగ్‌ సింఘాల్‌ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ 2030 నాటికి ముస్లింల జనాభా పెరిగి హిందువులు ప్రమాదంలో పడతారని రెచ్చగొట్టారు. హిందువులు ఒకరిద్దరికి పరిమితం అవుతుంటే ముస్లింలు 12-14 మందిని కంటున్నారని ఆరోపించారు.


1992లో మిగతా సామాజిక తరగతులతో పోలిస్తే ముస్లిం మహిళలు సగటున ఒక బిడ్డను ఎక్కువగా కలిగి ఉన్నారు. 1992లో మొత్తం మహిళలకు సగటున 3.4గురు పిల్లలు ఉండగా 2015 నాటికి 2.2కు తగ్గారు. ఇదే కాలంలో 4.4గా ఉన్న ముస్లిం పిల్లలు 2.6కు, హిందూ పిల్లలు 3.3 నుంచి 2.1కి తగ్గారు. దీని అర్ధం ఏమిటి ? రెండు సామాజిక తరగతుల పిల్లల తేడా 1.1 నుంచి 0.5కు తగ్గింది. క్రైస్తవుల పిల్లలు 2.9 నుంచి రెండుకు తగ్గారు. మరి క్రైస్తవులు, ముస్లింలతో దేశాన్ని నింపివేసే కుట్ర జరుగుతోందని చేస్తున్న ప్రచారానికి ఆధారం ఏమిటి ? ముస్లింల్లో కూడా విద్య పెరిగితే పిల్లల సంఖ్య తగ్గుతుంది.


దేశంలో ఇప్పుడున్న స్ధితి ఏమిటి ? 35 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 29 చోట్ల హిందువులే మెజారిటీ. లక్షద్వీప్‌లో లక్ష మంది, జమ్ము-కాశ్మీరులో కోటీ 30లక్షల మంది ఉన్న ప్రాంతాల్లో మాత్రమే ముస్లింలు మెజారిటీగా ఉన్నారు.దేశ జనాభాలో వీరు ఐదుశాతమే, 95శాతం మిగతా రాష్ట్రాలలో ఉన్నారు. పంజాబులో సిక్కులు, నాగాలాండ్‌(20లక్షలు), మిజోరం(పది లక్షలు), మేఘాలయ(30లక్షలు)లో క్రైస్తవులు మెజారిటీగా ఉన్నారు. ముస్లింలు కుటుంబ నియంత్రణ పాటించరు అన్నదొక ప్రచారం. గణాంకాల ప్రకారం ముస్లింలలో 45.3, హిందువుల్లో 54శాతం మంది నియంత్రణ పాటిస్తున్నారు. .2011లెక్కల ప్రకారం హిందువుల్లో జననాల రేటు 1991-2001 కాలంలో 19.92 నుంచి 16.76కు తగ్గగా ముస్లింల్లో 29.52 నుంచి 24.6కు తగ్గింది. వీటి ఆధారంగా వేసిన అంచనా ఏమిటి ? 2011-21కాలంలో హిందువుల జననాల రేటు 15.7, ముస్లింలలో 18.2కు తగ్గనుందని అంచనా. దీని అర్ధం ఏమిటి కుటుంబనియంత్రణ పాటించటం ముస్లింలలో పెరిగిందనే కదా ? లెక్కలు తెలియని వారికి చెప్పవచ్చు, తెలియనట్లు నటించే వారికి చెప్పగలమా ? దేశంలో పురుషులు-స్త్రీల నిష్పత్తి 1000-940, అదే పిల్లల్లో చూస్తే 1000-916 మాత్రమే ఉంది. ఇలా ఉన్న దేశంలో బహుభార్యలను కలిగి ఉండటం సాధ్యమా ? ముస్లింలు ఎక్కువగా ఉన్న లక్షద్వీప్‌లో 946,911గానూ జమ్మూకాశ్మీరులో 889,862గా ఉన్నారు. దేశ సగటు కంటే తక్కువ ఉన్న చోట అది జరిగేదేనా ? చిత్రం ఏమంటే దేశంలో అనుమతి ఉన్న ముస్లింల్లో బహుభార్యాత్వం 5.7 శాతం ఉంటే నిషేధం ఉన్న హిందువుల్లో 5.8శాతం ఉంది. దీన్నేమంటారు ?


2035నాటికి ముస్లింల సంఖ్య పెరిగి పోనుందనే ప్రచార కథేమిటో చూద్దాం. అసలు ఇది ఎక్కడ పుట్టింది ? ఒకరాయి వేద్దాం మనల్ని అడగొచ్చేదెవరులే అనే ధైర్యంలో ముస్లిం వ్యతిరేక ప్రచారాన్ని చేస్తున్నారు. 2017ఏప్రిల్‌ ఐదవ తేదీన అమెరికాలోని న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక పూ సంస్ధ విశ్లేషణకు ” 2035 నాటికి ముస్లిం పిల్లల సంఖ్య ఇతరులను అధిగమించనుంది ” అనే శీర్షిక పెట్టింది. కానీ పూ సంస్ధ నివేదిక చెప్పిందేమిటి ? ప్రపంచంలో 2075నాటికి ఇస్లాం పెద్ద మతంగా అవతరిస్తుంది. 2035నాటికి స్వల్పంగా క్రైస్తవ తల్లుల కంటే ముస్లిం తల్లులు కనే పిల్లల సంఖ్య ఎక్కువ ఉంటుందని పేర్కొన్నది. దాన్ని మన దేశంలో హిందూత్వశక్తులు ఇక్కడి ముస్లింలకు వర్తింప చేసి ప్రచారం చేస్తున్నారు.


ఇక వాట్సాప్‌ను బిజెపి ఎలా ఉపయోగిస్తోందో అమిత్‌ షా మాటల్లోనే చెప్పాలంటే ” అది నిజమైనా కల్పితమైనా ఏ సందేశాన్నైనా మనం వైరల్‌(విపరీతంగా ప్రచారం) చేయగలం. సామాజిక మాధ్యమం ద్వారా మనం కేంద్రంలో, రాష్ట్రాలలో ప్రభుత్వాలను ఏర్పాటు చేయాల్సి ఉంది. వర్తమానాలను వైరల్‌ చేయాలి. ఉత్తర ప్రదేశ్‌లో మనం ఇప్పటికే 32లక్షల మందితో వాట్సాప్‌ గ్రూపులను ఏర్పాటు చేశాం. ప్రతి ఉదయం ఎనిమిది గంటలకు వారు ఒక వర్తమానాన్ని పంపుతారు. ” ఇది 2018లో రాజస్తాన్‌లోని కోట పట్టణంలో బిజెపి సామాజిక మాధ్యమ కార్యకర్తల సమావేశంలో చేసిన ప్రసంగం అంటూ హిందీ దినపత్రిక దైనిక్‌ భాస్కర్‌ రాసిన వార్త. దేశమంతటా దానికి అలాంటి వాట్సాప్‌ గ్రూపులు, వాటిలో పంపే సమాచారం ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. మేకిన్‌ ఇండియా(భారత్‌లో తయారీ), మేక్‌ ఇండియా(భారత్‌ తయారీ) పిలుపులతో ఇప్పటి వరకు ఎగుమతికి అవసరమైన వస్తువుల కంటే జనాన్ని చీకట్లో ఉంచేందుకు అవసరమైన అవివేకం పెద్ద ఎత్తున ఉత్పత్తి జరుగుతోంది. దాని వినియోగం విపరీతంగా పెరుగుతోంది. ” ఒక ప్రధానమైన అంశాన్ని మరోవైపు ఆలోచించకుండా జోరీగలా బుర్రల్లోకి ఎక్కించకుండా అత్యంత ప్రతిభావంతులైన ప్రచార నిపుణుల మెళకువలు కూడా విజయ వంతం కావు.ఆ ప్రచారం కొన్ని అంశాలకే పరిమితం కావాలి, దాన్ని పదే పదే పునశ్చరణ చేయాలి.ఈ ప్రపంచంలో విజయం సాధించాలంటే మొట్టమొదటిదీ, ముఖ్యమైనదీ దేనికైనా హఠం వేయటమే ” తన మీన్‌ కాంఫ్‌ గ్రంధంలో నరహంతకుడు నాజీ హిట్లర్‌ రాసిన అంశమిది. హిట్లర్‌ను, వాడి మంత్రి గోబెల్స్‌ను ఎవరు ఆదర్శంగా తీసుకున్నదీ వేరే చెప్పాలా !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

పెట్రోలు ధరలు : రావణదేశంలో 89, సీత పుట్టింట్లో 100, రామరాజ్యంలో 120 !

28 Thursday Apr 2022

Posted by raomk in BJP, Congress, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Prices, Uncategorized

≈ Leave a comment

Tags

BJP, fuel politics, Fuel Price in India, Narendra Modi, Narendra Modi Failures


ఎం కోటేశ్వరరావు


కేేంద్ర ప్రభుత్వం పెట్రోలు, డీజిలుపై పన్నులు తగ్గించినప్పటికీ ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు తగ్గించలేదని, ఇప్పటికైనా తగ్గించాలని ప్రధాని నరేంద్రమోడీ బుధవారం నాడు ముఖ్యమంత్రులను కోరారు. దేశంలో కరోనా పరిస్ధితి గురించి సమీక్ష సందర్భంగా మోడీ మాట్లాడుతూ ఈ ప్రస్తావన చేశారు. దేశ ప్రయోజనాల కోసం పన్ను తగ్గించాలన్నారు. ఇలాంటి సుభాషితాలు చెప్పటానికి మోడీ గారికి సర్వహక్కులూ ఉన్నాయి. నీతులెందుకు గురువా అంటే ఎదుటి వారికి చెప్పేటందుకే శిష్యా అన్నది తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం, బిజెపి పాలిత రాష్ట్రాలు నవంబరులో తగ్గించాయి.ఆమ్‌ ఆద్మీ ఢిల్లీ సర్కార్‌ కొద్ది రోజుల తరువాత తగ్గించింది. ఇతర రాష్ట్రాలను అడిగేందుకు ఆరు నెలలుగా ప్రధానికి అవకాశమే దొరకలేదా ? దేశ ప్రయోజనాల కోసం ఒక రోజు లేదా ఒక గంట తీరిక చేసుకోలేని పరిస్దితి ఉందా అన్న సందేహం రావటం సహజం. పన్ను తగ్గించని రాష్ట్రాలు ప్రజలకు అన్యాయం, పొరుగు రాష్ట్రాలకు హాని కలిగించటమే అని, ఆరునెలలు గడిచింది ఇప్పటికైనా తగ్గించండి అంటూ జనంలో ప్రతిపక్ష పార్టీలపై వ్యతిరేకతను రేకెత్తించేందుకు ఒక రాజకీయ నేతగా తన చాణక్యాన్ని ప్రదర్శించారు. ఎనిమిది సంవత్సరాలుగా ఏదో ఒకసాకుతో వీరబాదుడు కొనసాగిస్తున్న ప్రధాని రాష్ట్రాల మీద ఎదురుదాడికి దిగారు.


ఐదు రాష్ట్రాల ఎన్నికల ముందు కేంద్రం నామమాత్రంగా సెస్‌ను, కొన్ని రాష్ట్రాలు వాట్‌ తగ్గించటంతో పాటు చమురు కంపెనీలు 137 రోజులు చమురు ధరలను స్థంభింప చేశాయి. ఇవన్నీ దేశ లేదా ప్రజల కోసమే అనుకుందాం. ధరలు, ద్రవ్యోల్బణం పెరుగుతున్న స్ధితిలో అవి మరింతగా పెరిగేంతగా పెట్రోలు, డీజిల్‌ ధరలను పెంచినపుడు గుర్తులేని దేశ ప్రజలు ఇప్పుడు గుర్తుకు రావటం గమనించాల్సిన అంశం. ధరలు అదుపులోకి వచ్చేంత వరకు నెల నెలా ప్రభుత్వం విడుదల చేసే అశాస్త్రీయ గణాంకాలు కూడా పెరుగుదలను చూపుతున్నాయి. వాటిని కొంత మేరకైనా అదుపు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చమురుపై పన్నులను తగ్గించాలని ఆర్ధికవేత్తలు చెబుతున్న తరుణంలో నరేంద్రమోడీ దాన్ని ప్రస్తావించకుండా ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల మీద పడ్డారు. ఏప్రిల్‌ 27వ తేదీ ఎకనమిక్‌ టైమ్స్‌ పత్రిక సమాచారం ప్రకారం ఆ రోజు బిజెపి ఏలుబడిలోని భోపాల్‌లో లీటరు పెట్రోలు రు.118.14, పాట్నాలో రు.116.23, బెంగలూరులో రు.111.09, లక్నోలో రు.105.25 ఉంది. ఒకే పార్టీ పాలిత ప్రాంతాల్లో ఇంత తేడా ఎందుకున్నట్లు ? ముందు వాటిని సరి చేస్తారా లేదా ? గ్లోబల్‌ పెట్రోల్‌ ప్రైసెస్‌ డాట్‌కామ్‌ సమాచారం ప్రకారం పక్కనే ఉన్న రావణరాజ్యం శ్రీలంక ఆర్ధిక సంక్షోభంతో అతలాకుతలం అవుతున్నది. అక్కడ ఏప్రిల్‌ 25న పెట్రోలు రేటు రు.373, అదే మన కరెన్సీలోకిి మార్చితే రు.80.39.సీతాదేవి పుట్టిన నేపాల్లో రు.100 ఉంది.మన రామరాజ్యంలో రు.105 నుంచి 120 వరకు ఉంది. ఇక పాకిస్తాన్లో రు.61.41, బంగ్లాదేశ్‌లో రు.79.09 ఉందంటే ప్రజాప్రయోజనం గురించి మాట్లాడేవారికి ఆగ్రహం రావటం సహజం.


పన్నులు అసలే వద్దని ఎవరూ అనరు. గత ఎనిమిది సంవత్సరాల్లో కార్పొరేట్లకు పన్ను తగ్గింపు, రాయితీలు పెంపు. సామాన్యులకు సబ్సిడీల కోత-పన్నుల వాత తెలిసిందే. కాంగ్రెస్‌ ఏలుబడిలో చమురు సంస్ధలకు పెట్టిన బకాయిలను తీర్చేందుకు తాము పన్ను మొత్తాన్ని పెంచవలసి వచ్చిందని చెప్పారు. నిజం ఏమిటి ? ప్రభుత్వాలు బాండ్లను జారీ చేయటం ప్రపంచమంతటా జరుగుతున్నదే. వినియోగదారులకు ఎంత సబ్సిడీ ఇస్తే అంత మొత్తాన్ని చమురు కంపెనీలకు ప్రభుత్వం చెల్లించాలి. ఆ మొత్తాలను చెల్లించకుండా చమురు కంపెనీలకు ప్రభుత్వం ప్రామిసరీ నోట్లు రాసి ఇవ్వటాన్నే బాండ్లు అంటున్నారు. వడ్డీ కూడా చెల్లించాలి. ఈ మొత్తాలను పది నుంచి 20 సంవత్సరాల వ్యవధిలో చెల్లించే అవకాశం ఉంది. దాని వలన చమురు కంపెనీలకు నష్టం ఉండదు, ప్రభుత్వానికి వెసులుబాటు కలుగుతుంది.ఈ బాండ్లను చమురు కంపెనీలు తాకట్టు పెట్టి డబ్బు తీసుకోవచ్చు లేదా ఇతర సంస్ధలకు అమ్మి సొమ్ము చేసుకోవచ్చు. చమురు బాండ్లను వాజ్‌పేయి సర్కార్‌ కూడా జారీ చేసింది ? జనానికి ఇచ్చిన దానికి ఏడుపెందుకు ?


2002-03 సంవత్సర బడ్జెట్‌ ప్రసంగంలో నాడు వాజ్‌పారు సర్కార్‌ ఆర్ధిక మంత్రిగా ఉన్న యశ్వంత సిన్హా ప్రభుత్వం చమురు బాండ్లను జారీ చేయనున్నదని చెప్పారు. 2014-15 సంవత్సర బడ్జెట్‌ పత్రాలలో పేర్కొన్నదాని ప్రకారం 2013-14 సంవత్సరం నాటికి చెల్లించాల్సిన బాండ్ల విలువ మొత్తం రు.1,34,423 కోట్లు. 2018లో చమురు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ” కాంగ్రెస్‌ హయాంలో కొనుగోలు చేసిన రు.1.44లక్షల కోట్ల రూపాయల చమురు బాండ్లు మాకు వారసత్వంగా వచ్చాయి. ఈ మొత్తమే కాదు, వీటికి గాను కేవలం 70వేల కోట్ల రూపాయలు వడ్డీగా చెల్లించాము. రెండు లక్షల కోట్ల రూపాయలను చెల్లించటం ద్వారా మా ప్రభుత్వ బాధ్యతను నెరవేర్చాము. చమురు ధరలు ఎక్కువగా ఉండటానికి చెల్లించాల్సిన చమురు బాండ్లు దోహదం చేశాయి ” అని చెప్పుకున్నారు. వడ్డీతో సహా ఈ మొత్తం వినియోగదారులకు ఇచ్చిన రాయితీ తప్ప మరొకటి కాదు. జనానికి ఇచ్చిన ఈ మొత్తం గురించి బిజెపి మంత్రి చెప్పిన తీరు జనం నుంచి వసూలు చేసే పన్ను భారాన్ని సమర్ధించుకొనేందుకు ఆడిన నాటకం తప్ప మరొకటి కాదు.ఈ మొత్తాన్ని చెల్లించేశాము అని చెప్పటం పెద్ద అబద్దం. తొలుత కాంగ్రెస్‌ అప్పులను తీర్చటం కోసమే పన్నులు పెంచామన్నారు. తరువాత బాణీ మార్చి సరిహద్దులో చైనాతో వివాదం కారణంగా తలెత్తిన ఖర్చు జనం గాక ఎవరు భరించాలి ? అందుకే పన్నులను కొనసాగించక తప్పదు అని వాదించారు. ఇప్పుడు ఎందుకు కొనసాగిస్తున్నట్లు అంటే అభివృద్ది పనులకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుందని ఎదురు ప్రశ్నిస్తున్నారు. అందుకే ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడి తప్పించుకొనే వారని చెప్పాల్సి వస్తోంది. మన భూభాగాన్ని చైనీయులు ఆక్రమించలేదని స్వయంగా ప్రధాని నరేంద్రమోడీ చెప్పారు. అలాంటపుడు సరిహద్దుల్లో లక్షల కోట్లు ఖర్చు చేసి అమెరికా,ఇజ్రాయెల్‌, రష్యా తదితర దేశాల నుంచి ఆయుధాలు కొనుగోలు చేసి జనాన్ని ఎందుకు ఇబ్బంది పెట్టినట్లు ? ఇప్పటి వరకు చెల్లించింది పోగా 2023 నవంబరు, డిసెంబరు మాసాల్లో మరో 26,150 కోట్లు, 2024 ఫిబ్రవరి-డిసెంబరు మాసాల మధ్య 37,306.33 కోట్లు, 2025లో 20,553.84 కోట్లు, చివరిగా 2026లో 36,913 కోట్లు చెల్లించాల్సి ఉంది.


ఈ బాండ్ల పేరుతో పెంచిన పన్నులతో కేంద్రానికి వచ్చిన రాబడి ఎలా ఉందో చూడండి. 2014-15నుంచి 2021-22 వరకు కేంద్ర ప్రభుత్వానికి చమురు రంగం నుంచి వచ్చిన డివిడెండ్‌, ఆదాయపన్ను మొత్తం రు.4,07,190 కోట్లు. ఇవిగాక కేంద్ర ప్రభుత్వానికి చమురు రంగం నుంచి వచ్చిన ఇతర పన్ను ఆదాయం రు.21,82,198 కోట్లు, రెండింటినీ కలిపితే రు.25,89,388 కోట్లు ? కాంగ్రెస్‌ ఏలుబడిలో జారీ చేసిన బాండ్ల మొత్తం ఎంత ? అ పేరుతో జనాన్ని బాదింది ఎంత ? గుండెలు తీసే బంట్లకు తప్ప ఇది మరొకరికి సాధ్యమా ?


ఇక్కడ గమనించాల్సిన మరొక అంశం ఉంది.2014-15లో కేంద్ర ప్రభుత్వానికి చమురు రంగంలో వచ్చిన పన్ను ఆదాయం రు.1,26,025 కోట్లు కాగా 2020-21కి అది రు.4,19,884 కోట్లకు చేరింది. ఖరారు కాని వివరాల ప్రకారం 2021-22లో అది రు.3,10,155 కోట్లు. దీనికి కేంద్రం తగ్గించిన సెస్‌ కారణం కావచ్చు. ప్రధాని కాంగ్రెసేతర రాష్ట్రాలను పన్ను తగ్గించాలని కోరారు. ఇక్కడ రాష్ట్రాలు రాష్ట్రాలే, బిజెపివా, ఇతర పార్టీలవా అని కాదు. కేంద్రం తగ్గించిన స్వల్ప మొత్తాల గురించి చెబుతున్నది తప్ప పెంచిన భారాన్ని తెలివిగా తెరవెనక్కు నెట్టాలని చూస్తున్నది. ఇదే కాలంలో రాష్ట్రాలన్నింటికి చమురు మీద వచ్చిన వాట్‌ మొత్తం రు.13,70,295 కోట్లు, అంటే కేంద్రానికి వస్తున్నదానిలో సగం.2014-15లో రాష్ట్రాలకు చమురు రంగంలో వచ్చిన పన్ను ఆదాయం రు.1,60,526 కోట్లు కాగా కేంద్రానికి వచ్చింది రు.1,26,025 కోట్లు మాత్రమే. 2020-21కి రాష్ట్రాలకు రు.2,17, 221 కోట్లకు పెరగ్గా అదే కేంద్రానికి రు.4,19,884 కోట్లకు చేరింది. ఇవన్నీ ప్రతిపక్షాలు చెప్పిన అంకెలు కాదు, కేంద్ర ప్రభుత్వ పెట్రోలియం ప్లానింగ్‌ అండ్‌ ఎనాలసిస్‌ సెల్‌(పిపిఏసి) విడుదల చేసినవే. కేంద్ర పన్నులలో 41శాతం తిరిగి రాష్ట్రాలకు ఇస్తున్నాము కదా అని బిజెపి నేతలు వాదిస్తారు. అది గతంలోనూ 32శాతం వాటా ఉందిగా. ఇక్కడ అన్ని రాష్ట్రాలకు మోడీ సర్కారు పెట్టిన టోపీ ఏమిటంటే రాష్ట్రాలకు వాటా ఇవ్వాల్సిన పన్ను కాకుండా ఇవ్వనవసరం లేని సెస్సులను పెంచి అన్యాయం చేశారు. బిజెపి పాలిత నేతలు నోరు మూసుకున్నారు. ఏప్రిల్‌ 27 నాటి సిఎంల సమావేశంలో ప్రధాని మోడీ పన్ను తగ్గించిన తమ పార్టీ పాలిత కర్ణాటకకు ఐదువేల కోట్లు గుజరాత్‌లకు 3,500-4,000 కోట్ల మేరకు ఆదాయం తగ్గిందని చెప్పారు.బిజెపి ఏతర పాలిత రాష్ట్రాలు తగ్గించకపోవటం వలన ప్రజలకు అన్యాయం, ఇతర రాష్ట్రాలకు హాని జరుగుతున్నదని అన్నారు. అన్ని రాష్ట్రాలకు సెస్‌లో వాటా ఎగవేసి కేంద్రం కలిగించిన నష్టం గురించి కూడా చెబితే నిజాయితీగా ఉండేది. ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల మీద దాడి ప్రారంభించి అసలు అంశాన్ని మరుగుపరచారు.


ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేసే సంస్ధల నుంచి చిల్లర ధరల కంటే ఎక్కువ వసూలు గురించి కేరళ హైకోర్టులో కేసు నడుస్తున్నది. అక్కడి ఆర్టీసికీ చిల్లర ధరలకే డీజిల్‌ సరఫరా చేయాలని సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును చమురు మార్కెటింగ్‌ కంపెనీలు సవాలు చేశాయి. రెండు రకాల ధరలను వసూలు చేయటం వెనుక ఉన్న తర్కం, కారణాలను చెప్పాలని ఇద్దరు సభ్యులతో కూడిన డివిజన్‌ బెంచ్‌ ప్రశ్నించింది. ప్రపంచ మార్కెట్లో ధరలు పెరిగిన మేరకు సాధారణ జనానికి చిల్లర ధరలను పెంచితే అశాంతి ఏర్పడుతుందని తాము ఆ మేరకు పెంచలేదని, క్రమంగా పెంచుతామని చమురు కంపెనీలు పేర్కొన్నాయి. ఇక ధరల నిర్ణయానికి ప్రపంచ మార్కెట్‌ ధరలు, భవిష్యత్‌లో పెరిగే ముడి చమురు ధరలు,రవాణా ఖర్చులు, స్ధానిక పన్నుల వంటి వాటిని పరిగణనలోకి తీసుకుంటామని తెలిపాయి. ధరల నిర్ణయం విధానపరమైనదని దాన్ని ప్రశ్నించరాదని వాదించాయి. ఆర్టీసికి వారి వద్దకు తీసుకుపోయి అందచేస్తామని, చిల్లర వినియోగదారులకు అలా కాదని, ఆర్టీసికి 45 రోజుల తరువాత డబ్బు చెల్లించే వెసులు బాటు ఇచ్చామని, ఈ ఏడాది జనవరి వరకు వారికి చిల్లర ధరకంటే తక్కువకే సరఫరా చేశామని, అప్పుడు మౌనంగా ఉండి పెంచిన తరువాత వివాదం చేస్తున్నారని పేర్కొన్నాయి. కేరళ ఆర్టీసి లేదా మరొక రాష్ట్ర సంస్ధకైనా, రిటైల్‌ డీలర్లకైనా చమురు కంపెనీలు ఒప్పందం ప్రకారం వాని వద్దకే తీసుకుపోయి సరఫరా చేస్తాయి. ఏదో ఒక పేరుతో జనాన్ని బాదటం తప్ప వేరు కాదు. ఏదైనా ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదలకు దోహదం చేసేదే. పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తున్న తమకు ధరలు పెంచినందున రోజుకు 85లక్షల రూపాయలు అదనంగా చెల్లించాల్సి వస్తోందని,ప్రైవేటు బస్సులకు ఒక ధర, ఆర్‌టిసికి ఒక ధర వివక్ష చూపటమే అని కేరళ ఆర్‌టిసి వాదించింది. మిగతా రాష్ట్రాల ఆర్టీసిలకూ పెంచినప్పటికీ ఎక్కడా సవాలు చేయలేదు, డీజిలు పేరుతో ప్రయాణీకుల మీద అదనపు భారం మోపుతున్నారు. ఈ కేసులో చమురు సంస్ధలకు అనుకూల తీర్పు వస్తే అది ఆర్‌టిసీలన్నింటికీ పెనుభారమే.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

చైనాతో సఖ్యత కోరితే దేశద్రోహం – వాణిజ్యం చేస్తే దేశభక్తి ! ఏమి తర్కంరా బాబూ !!

17 Sunday Apr 2022

Posted by raomk in BJP, CHINA, Congress, Current Affairs, Economics, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, RUSSIA, UK, USA, WAR

≈ Leave a comment

Tags

2022 BRICS Summit, BJP, BRICS, China-India Relations, Indo-China trade, Narendra Modi Failures, RSS, Ukraine-Russia crisis


ఎం కోటేశ్వరరావు


మేకిన్‌ ఇండియా(భారత్‌లో తయారీ) అంటే చైనా నుంచి కొనుగోలు, బిజెపి అంటే బీజింగ్‌(చైనా రాజధాని నగరం పేరు) జనతా పార్టీ. జుమ్లా ఫర్‌ ఇండియా(భారత్‌కు మాటలు) జాబ్స్‌ ఫర్‌ చైనా (చైనాకు ఉద్యోగాలు) రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై పార్లమెంటు చర్చలో ఫిబ్రవరి నెలలో కాంగ్రెస్‌ నేతలు మల్లిఖార్జున ఖర్గే. రాహుల్‌ గాంధీ విసిరిన చెణుకులివి. ఎందుకీ పరిస్థితి అంటే నరేంద్రమోడీ సర్కార్‌ ఆచరణే అన్నది స్పష్టం. గతంలో కాంగ్రెస్‌ మీద బిజెపి విసిరిన వాటికి ఇప్పుడు బదులు తీర్చుకుంటున్నారు. అధికారంలో ఉన్నవారికి తప్పదివి. రెండు పార్టీలు అనుసరించే ఆర్ధిక విధానాలు ఒకటే గనుక దొందూ దొందే !!


చైనా విదేశంగ మంత్రి వాంగ్‌ ఇ మార్చి నెలాఖరులో ఢిల్లీ పర్యటన జరిపారు.ఈ ఏడాది సెప్టెంబరులో బీజింగ్‌లో జరిగే బ్రిక్స్‌(బ్రెజిల్‌,రష్యా,ఇండియా,చైనా, దక్షిణ ఆఫ్రికా) కూటమి పద్నాలుగవ సమావేశాలు, బ్రిక్స్‌ 15వ వార్షికోత్సవం కూడా జరపనున్నారు. లడఖ్‌ సరిహద్దులోని ఘర్షణాత్మక ప్రాంతాల నుంచి చైనా తన సేనలను ఉపసంహరించుకోని పక్షంలో తాను ఈ సమావేశాలకు వచ్చేది లేదని ప్రధాని నరేంద్రమోడీ ముందస్తు సందేశాలను పంపుతున్న పూర్వరంగంలో వాంగ్‌ పర్యటన జరిగింది. ప్రధాని ఉత్తర ప్రదేశ్‌ కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకార హడావుడిలో ఉన్నందున వాంగ్‌తో భేటీ కుదరలేదని చెప్పారు. సరిహద్దు సంగతి తేలకుండా తాను బీజింగ్‌ వచ్చేది లేదని స్పష్టం చేయటమే దీని అంతరార్దం అని విశ్లేషకులు పేర్కొన్నారు. సరిహద్దు వివాదం, సైనిక బలగాల ఉపసంహరణ, గతంలో కుదిరిన ఒప్పందాల అమలు వంటి అంశాలపై రెండుదేశాల మధ్య ఇప్పటి వరకు 15దఫాలుగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి.


బ్రిక్స్‌ శిఖరాగ్ర సభ భారత్‌-చైనాలకే పరిమితం కాదు. ఏ సంవత్సరం ఆ కూటమికి ఏ దేశం అధ్యక్షత వహిస్తుందో ఆ దేశంలో సభలు జరుపుతారు. ఈ సమావేశాలకు హాజరు కావటానికి సరిహద్దు వివాదానికి ముడి పెట్టటం ఏమిటన్నది ప్రశ్న. పోనీ చైనాతో లావాదేవీల్లో అన్ని అంశాల్లో ఇలాగే ముడిపెట్టి అడుగు ముందుకు వేయనని నరేంద్రమోడీ చెబుతున్నారా ? లేదే ! 2020 గాల్వన్‌ ఉదంతం తరువాత చైనా వస్తువులను బహిష్కరించాలంటూ సంఘపరివార్‌కు చెందిన వారు, వారి ప్రభావానికి లోనైన మీడియా, ఇతరులు కూడా పెద్ద హడావుడి, దేశభక్తి ప్రదర్శనలు చేశారు. చైనా యాప్‌లను నిషేధించారు, దీపావళికి చైనా టపాసులు వద్దన్నారు. చిత్రం ఏమిటంటే అలాంటి వారిని వెర్రి వెంగళప్పలను చేస్తూ ఆ ఏడాదితో పోల్చితే 2021లో చైనా నుంచి దిగుమతులను అనుమతించటంలో మోడీ సర్కార్‌ కొత్త రికార్డు నెలకొల్పింది.126 బిలియన్‌ డాలర్ల మేర దిగుమతి-ఎగుమతి లావాదేవీలు జరిగాయి. ఈ సంవత్సరం తొలి మూడు మాసాల్లో గత రికార్డులను బద్దలు కొట్టే దిశలో 31.9 బి.డాలర్ల లావాదేవీలు జరిగాయి. పోనీ మన దేశ ఎగుమతులు ఎక్కువగా ఉన్నందున చూసీ చూడనట్లు ఉన్నారని అనుకుందామా ? ఉభయ దేశాల మధ్య 2021లో 125.66 బి.డాలర్ల వాణిజ్యం జరిగితే చైనా నుంచి అంతకు ముందేడాదితో పోలిస్తే 46.2 శాతం దిగుమతులు పెరిగి 97.52 బి.డాలర్లకు చేరింది. మన ఎగుమతులు 34.2శాతం పెరిగి 28.14 బి.డాలర్ల మేరకు జరిగాయి.


ఇక ఈ ఏడాది జనవరి-మార్చి మాసాల్లో 31.96 బి.డాలర్ల లావాదేవీలు జరగ్గా మన దిగుమతులు 27.1 బి.డాలర్లు, ఎగుమతులు 4.87 బి.డాలర్లుగా ఉన్నాయి. మన దిగుమతులు 28.3 శాతం పెరగ్గా ఎగుమతులు 26.1శాతం తగ్గాయి. మన ఇనుపఖనిజం ఎగుమతులు పడిపోవటమే దీనికి ప్రధాన కారణం అంటున్నారు. దీన్ని మరోవిధంగా చెప్పాలంటే ఈ మూడు నెలల కాలంలో చైనాకు మనం 22బిలియన్‌ డాలర్లు సమర్పించుకున్నాం. చైనా నుంచి దిగుమతులు పెరగటం అన్నది కళ్ల ముందు కనిపిస్తున్న వాస్తవం. మోడీ సర్కార్‌ దీన్ని ఏ విధంగా చిత్రించ చూస్తున్నదో పార్లమెంటుకు ఇచ్చిన సమాధానం వెల్లడిస్తున్నది. డిజిసిఐ సమాచారం మేరకు 2006-07 నుంచి 2013-14 నాటికి చైనా నుంచి దిగుమతులు 17.47 నుంచి 51.03 బిలియన్‌ డాలర్లకు 192శాతం పెరిగిందని, తమ హయాంలో 2014-15 నుంచి 2020-21 వరకు 60.41 నుంచి 65.21 బి.డాలర్లకు అంటే ఎనిమిదిశాతం పెరిగిందని వాణిజ్యశాఖ మంత్రి లోక్‌సభకు ఇచ్చిన సమాధానంలో చెప్పారు. గత రికార్డులను బద్దలు కొట్టిన ఘనతను నరేంద్రమోడీ సర్కార్‌ ఇప్పటికే సాధించింది, తన రికార్డును తానే ఈ ఏడాది కూడా అధిగమించినా ఆశ్చర్యం లేదు. ఒక వైపు వ్యాపారులు, పారిశ్రామికవేత్తల లాభాల కోసం దిగుమతులను అనుమతిస్తూ తాను ప్రోత్సహించిన చైనా వ్యతిరేకులను సంతుష్టీకరించేందుకు ఇలాంటి అంకెల జిమ్మిక్కులకు మోడీ సర్కార్‌ పూనుకుందన్నది స్పష్టం.


మన పరిశ్రమలు కరోనా ముందు స్దాయికి చేరితే చైనా నుంచి దిగుమతులు ఇంకా పెరుగుతాయని ఆర్ధికవేత్తలు చెబుతున్నారు. అదే జరిగితే మరిన్ని మన డాలర్లతో చైనాను పటిష్టపరచటమే మరి. ఒక వైపు చైనాను కట్టడి చేయాలని చూస్తున్న అమెరికాతో మన దేశం చేతులు కలుపుతూ మరోవైపు చైనా ఆర్ధిక వ్యవస్దను మరింతగా బలోపేతం చేసే విధంగా మనం దిగుమతులు ఎందుకు చేసుకుంటున్నట్లు ? ఇక్కడ సరిహద్దు వివాదం, అక్కడ మోహరించిన మిలిటరీ గుర్తుకు రాదా అన్నది మోడీ మద్దతుదారులు తమను తాము ప్రశ్నించుకోవాలి. లేదూ వ్యాపారం వ్యాపారమే, దానికి సరిహద్దు వివాదాన్ని ముడిపెట్టకూడదు అని చెబుతారా ? అదే సూత్రం బ్రిక్స్‌ సమావేశంలో పాల్గొనటానికి ఎందుకు వర్తించదు. మన దేశంతో భూ సరిహద్దు కలిగిన దేశాల నుంచి వచ్చే పెట్టుబడులపై గాల్వన్‌ ఉదంతం తరువాత కేంద్రం ఆంక్షలు విధించింది, అది చైనా గురించే అన్నది చెప్పనవసరం లేదు. ఇక్కడ వాణిజ్య తర్కం వర్తించదా ? దాని పెట్టుబడులు వద్దు దిగుమతులు అంత ముద్దా ? 2018లో సిఐఐ భాగస్వామ్యంతో నిర్వహించిన ఒక సర్వే చైనాలో పెట్టుబడులు పెట్టిన 54 భారత కంపెనీల అభిప్రాయాలను వెల్లడించింది. గాల్వన్‌ ఉదంతం తరువాత ఆ ” దేశభక్త పెట్టుబడిదారు ”లెవరూ మన ప్రధానిని ఆదర్శంగా తీసుకొని నిరసనగా అక్కడి నుంచి కంపెనీలను ఎత్తివేసిన దాఖలా ఒక్కటీ కనపడదు.మన దేశం చైనా నుంచి దిగుమతులను నిలిపివేస్తే చైనాకు వచ్చే నష్టమేమీ లేదు. మన ఎగుమతులు లేకపోతే గడవని స్ధితీ లేదు. మన పరిశ్రమలు, మన వ్యవసాయ వస్తువుల ఎగుమతులే దెబ్బతింటాయి. మన దేశంతో పెద్ద మొత్తంలో వాణిజ్యమిగులు ఉంది కనుక వారికి అవసరం లేకున్నా కొన్నింటిని దిగుమతి చేసుకుంటున్నారు.చైనా వినియోగ మార్కెట్‌ విలువ ఆరులక్షల కోట్ల డాలర్లు. అందువలన చెరువు మీద అలిగితే….. అన్నట్లుగా చైనా మీద అలిగిన వారికే నష్టం.


చైనా పెద్ద ఎగుమతిదారే కాదు, వివిధ దేశాల వస్తువులకు పెద్ద మార్కెట్‌ కూడా అని గమనించాలి. కమ్యూనిస్టులు అధికారానికి వచ్చిన తరువాత చైనాను ఒక దేశంగా గుర్తించేందుకు రెండుదశాబ్దాల పాటు 1970దశకం వరకు నిరాకరించిన అమెరికా చివరకు దానితో కాళ్లబేరానికి వచ్చి ఐరాసలో గుర్తింపు, ప్రపంచ వాణిజ్య సంస్దలో ప్రవేశానికి అంగీకరించింది. దానితో పోలిస్తే ఎక్కడో ఉన్న మనం తాయత్తు కట్టుకొని బస్తీమే సవాల్‌ అంటూ బరిలోకి దిగే స్ధితిలో ఉన్నామా ? 1962లో సరిహద్దు వివాదంలో మన దేశం-చైనా యుద్దానికి దిగినప్పటికీ తరువాత కాలంలో రెండు దేశాల మధ్య సాధారణ సంబంధాలకు ఆ ఉదంతం అడ్డంకి కాలేదు. తమ సర్కారు మీద తిరుగుబాటు చేసిన దలైలామాకు ఆశ్రయం ఇచ్చినప్పటికీ మన దేశ పర్యటనకు వచ్చేందుకు చైనా నేతలు దాన్నొక సాకుగా ఎన్నడూ చూపలేదు. ఇప్పుడు బ్రిక్స్‌ సమావేశానికి హాజరుకావటానికి మిలిటరీ మోహరింపు గురించి ఎందుకు పట్టుబడుతున్నట్లు ? అలా చేయకపోతే చైనా వ్యతిరేక ఉన్మాదం ఎక్కిన వారు ఇప్పుడు మోడీకి పడుతున్న నీరాజనాల స్ధానంలో మరొకటి చేస్తారు.
గాల్వన్‌ ఉదంతాలు చూసినపుడు మన సోషల్‌ మీడియాలో కొందరు స్పందించిన తీరు చూస్తే మన దిగుమతులు కారణంగానే చైనా బతుకుతున్నదని, వాటిని ఆపివేస్తే మన కాళ్ల దగ్గరకు వస్తుందని నిజంగానే నమ్మినవారు లేకపోలేదు. ఆ ఉదంతానికి కారకులు మీరంటే మీరని పరస్పరం విమర్శలు చేసుకున్నాం. ఉదంతం జరిగింది వాస్తవాధీన రేఖ ఆవల చైనా ఆధీన ప్రాంతంలో అన్నది తెలిసిందే. చైనా మన భూభాగాలను ఆక్రమించలేదని స్వయంగా ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించారు. పరస్పర అవిశ్వాసంతో రెండు వైపులా మిలిటరీ సమీకరణలు జరిగాయి. ఎవరి జాగ్రత్తలు వారు తీసుకోవటం సహజం. ఎవరెన్ని చెప్పినా మిలిటరీని ఉపసంహరణ వెంటనే జరగదు. ఆర్ధికంగా ఎంతో బలంగా ఉన్న చైనాకు పెద్ద ఇబ్బందులేమీ ఉండవు కనుక మరికొంత కాలం కానసాగించినా వారికి నష్టం ఉండదు. కొద్ది వారాలు తక్కువగా రెండు సంవత్సరాలు కావస్తున్నది. మనం ఆ ఖర్చును తట్టుకోగలమా అన్నదే కీలకం. ఆ ఉదంతాల తరువాత చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ తొలిసారిగా మన దేశానికి వచ్చాడు. మనం పిలిస్తే వచ్చాడా, లేదా తనంతటతానే వచ్చాడా అన్నది వేరే అంశం.


ఉక్రెయిన్‌ వివాదం తరువాత అనేక దేశాల ప్రముఖులు మన దేశం వచ్చారు. వారందరినీ మనం ఆహ్వానించలేదు, ఎవరైనా వస్తామంటే వద్దని అనలేము.చైనా మంత్రి రాక గురించి ముందుగానే వార్తలు వచ్చినా చివరి క్షణం వరకు నిర్ధారణ కాలేదు. ఎందుకని ? చైనా మంత్రి రాకను స్వాగతిస్తే అమెరికాకు, ఇతర పశ్చిమ దేశాలకు ఎక్కడ ఆగ్రహం వస్తుందో లేదా అపార్ధం చేసుకుంటాయనే మల్లగుల్లాలు కావచ్చు, చివరి క్షణంలో అనుమతించాము. వచ్చిన విదేశీ ప్రముఖులందరూ తాజా ప్రపంచ పరిణామాలపై మన వైఖరిని తెలుసుకొనేందుకు, తమ అవగాహన లేదా వైఖరి గురించి మనకు వివరణ ఇవ్వటానికి, పనిలో పనిగా చరిత్రలో మీ స్ధానం ఎక్కడ ఉంటుందో ఆలోచించుకోండని అమెరికా మాదిరి బెదిరించటానికి అన్నది స్పష్టం. మరి చైనా మంత్రి మంత్రి వచ్చి ఏమి చేశారని ఎవరైనా సందేహించవచ్చు. నీ అమ్మ మొగుడున్నాడా అని పశ్చిమ దేశాలు అడిగితే బాబూ మీ నాన్న ఉన్నాడా అని చైనా అడిగింది. అదే తేడా ! మన దేశానికి ఎందుకీ ప్రాధాన్యత ఏర్పడిందంటే ప్రపంచ రాజకీయాలే కారణం. తమ ఎడమ చేతి చిటికెన వేలు పట్టుకొని తమ వెంట వస్తుందని, రష్యాను తిట్టేందుకు గొంతు కలుపుతుందని ఆశించిన వారి కోరిక నెరవేరలేదు. అనేక ఉదంతాల్లో అమెరికాను నమ్ముకున్న దేశాలు నట్టేట మునిగాయి. అమెరికాతో చేతులు కలిపితే ఎన్నో దశాబ్దాలుగా నమ్మకమైన మిత్రదేశంగా ఉన్న రష్యాను పోగొట్టుకుంటే మనకు మిగిలే మిత్రులెవరూ ఉండరు. ఇప్పటికే అనేక మందిని పోగొట్టుకున్నాం. అందుకే లాభనష్టాల బేరీజు వేసుకుంటూ అందరినీ సంతుష్టీకరించేందుకు కసరత్తు చేస్తున్నాం. అది కుదిరేనా ? అందుకే మన మీద అనేక దేశాల వత్తిడి, పర్యటనలు.


గతంలో కొంత మంది మన దేశంలో పాలకవర్గంగా ఉన్న పెట్టుబడిదారులను దళారీలుగా వర్ణించారు. ఇప్పటికీ వారి వారసులు మనకు కనిపిస్తారు.మన కార్పొరేట్లు దళారీలు కాదు, పశ్చిమ దేశాల్లో మాదిరే స్వదేశంలో బలమైన కార్పొరేట్లుగా, వీలైతే ప్రపంచ కార్పొరేట్లుగా ఎదిగేందుకు పోటీపడేస్ధితిలో ఉన్నారు. అమెజాన్‌-రిలయన్స్‌ వివాదం, మన కార్పొరేట్‌ సంస్ధలు విదేశాలకు విస్తరించటం దాన్నే సూచిస్తున్నది. మన తటస్ధ వైఖరి గురించి అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు మన మీద ప్రత్యక్షంగా, పరోక్షంగా దాడి చేస్తుంటే విశ్వగురుపీఠాన్ని మనకు మనమే ఇచ్చుకుని మౌనంగా ఉన్నాం.మన మీద జరుగుతున్న దాడికి సంజాయిషీ లేదా పరోక్ష సమాధానాలే తప్ప ఆత్మగౌరవాన్ని ప్రదర్శించే తీరు ఎక్కడా కనపడదు. తనకు వ్యక్తిగతం అంటూ ఏదీ లేదని ఏం చేసినా దేశానికే అని నరేంద్రమోడీ చెప్పారు.వివాదాలకు- క్రీడలకు ముడిపెట్టటం అమెరికా, ఇతర పశ్చిమ దేశాల సంస్కారం. మనం కూడా వాటి బాటలోనే నడిచాం. శీతాకాల బీజింగ్‌ ఒలింపిక్స్‌లో గాల్వన్‌లోయ దాడుల్లో పొల్గొన్న చైనా సైనికుడు ఒలింపిక్‌ జ్యోతి ప్రదర్శనలో పాల్గొంటున్నాడన్న కారణం చూపి వాటిని మన దేశం బహిష్కరించింది. చివరకు మన దూరదర్శన్‌ ఆ క్రీడలను చూపకుండా మూసుకుంది. మరి అదే చైనా పాల్గొనే ఇతర వేదికలకు మన దేశం దూరంగా ఉంటుందా ? గాల్వన్‌ ఉదంతాలకు బాధ్యులైన చైనా మిలిటరీ ప్రతినిధులతో మన వారు ఇప్పటికి 15సార్లు చర్చలు జరిపారు. ఎందుకు జరిపినట్లు ? లడఖ్‌లో మిలిటరీని ఉపసంహరించకపోతే బీజింగ్‌ బ్రిక్స్‌ సమావేశాలకు రానంటూ మంకు పట్టుపట్టం కొందరికి సంతోషంగానే ఉండవచ్చు, అది పైన చెప్పుకున్న మిగతా అంశాల్లో కూడా ఉంటే అదొక తీరు.బ్రిక్స్‌ ఒక అంతర్జాతీయవేదిక, దానికి వెళ్లకుండా మంకుపట్టుపడితే మిగతా దేశాల దృష్టిలో మన దేశం పలుచన కాదా ? రెచ్చిపోయి ఎగుమతి, దిగుమతి లావాదేవీలు జరపటానికి లేని బెట్టు దీనికి ఎందుకు అనుకోవా ? చైనాతో సఖ్యత కోరుకొనే వారిని దేశద్రోహులుగా చిత్రించటాన్ని చూస్తున్నాం. అక్కడి నుంచి దిగుమతులు చేసుకొనే వారు, అక్కడ పెట్టుబడులు పెట్టేవారు దేశద్రోహులా ? ఏమి తర్కరరా బాబూ ఇది !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

ఆత్మగౌరవం, అమెరికా వ్యతిరేకత ఇమ్రాన్‌ ఖాన్‌ కొత్త నినాదమా ?

13 Wednesday Apr 2022

Posted by raomk in Current Affairs, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Uncategorized, USA

≈ Leave a comment

Tags

imran khan, Narendra Modi, Pakistan political crisis, Shehbaz Sharif


ఎం కోటేశ్వరరావు


క్రికెట్‌లో కీలకమైన చివరి ఓవర్‌, బంతి మాదిరి తన ప్రభుత్వాన్ని కాపాడు కొనేందుకు మాజీ క్రికెటర్‌ ఇమ్రాన్‌ ఖాన్‌ తీవ్రంగా శ్రమించినా రాజకీయ క్రీడలో ఓడిపోయాడు. ఏప్రిల్‌ తొమ్మిదవ తేదీ రాత్రి పన్నెండు గంటల తరువాత అవిశ్వాస తీర్మానంపై జరిగిన ఓటింగ్‌లో ప్రతిపక్షం నెగ్గింది. పదకొండవ తేదీన నూతన ప్రధాని ఎన్నిక ఓటింగ్‌కు ముందే పాకిస్తాన్‌ తెహరిక్‌ ఏ ఇన్సాఫ్‌ (పిటిఐ) సభ్యులందరూ పార్లమెంట్‌ నుంచి వాకౌట్‌ చేశారు. సామూహికంగా రాజీనామా చేస్తామని ప్రకటించారు. పాకిస్తాన్‌ చరిత్రలో తొలిసారిగా అవిశ్వాస తీర్మానంతో ఒక సర్కార్‌ పతనమైంది. గత ఏడాది నవంబరు 28న ప్రారంభమైన ఉత్కంఠకు ఏప్రిల్‌ తొమ్మిదిన తెరపడింది. మరుసటి రోజు షెహబాజ్‌ షరీఫ్‌ ప్రధానిగా కొత్త సర్కార్‌ ఏర్పడింది. రాజ్యాంగ సంక్షోభం ముగిసినా రాజకీయ అనిశ్చితికి తెరలేచింది. తదుపరి ఎన్నికలు 2023 ఆగస్టు 13- అక్టోబరు 12 మధ్య జరగాల్సి ఉంది. అప్పటి వరకు ప్రతిపక్షం లేకుండా పార్లమెంట్‌ నడుస్తుందా ? కొత్త ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళుతుందా అన్నది త్వరలోనే తేలనుంది. ముస్లింలీగ్‌ నేత షెహబాజ్‌ షరీఫ్‌ ప్రధానిగా ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రాగా, ఇమ్రాన్‌ఖాన్‌ నేతృత్వంలోని పిటిఐ సభ్యుడు షా మహమ్మద్‌ ఖురేషీ కూడా నామినేషన్‌ వేసినప్పటికీ ఆ పార్టీ సభ్యులు రాజీనామా చేయటంతో షెహబాజ్‌ షరీఫ్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు.


జాతీయ అసెంబ్లీలోని 342 మందికి గాను పిటిఐకి 155 మంది సభ్యులుండగా వారిలో 135 మంది రాజీనామా చేశారు. తిరస్కరించిన 20 మందిని పార్టీ నుంచి బహిష్కరించారు. ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రభుత్వ పతనం మీద దేశ ప్రజల్లో మిశ్రమ స్పందన వెల్లడైనట్లు ఒక సర్వే వెల్లడించింది. సంతోషం వెలిబుచ్చిన వారు 57శాతం, ఆగ్రహించిన వారు 43శాతం ఉన్నట్లు గాలప్‌ పేర్కొన్నది.జనం ఆగ్రహిస్తున్నారని గ్రహించే పిటిఐ సభ్యులు రాజీనామాలకు సిద్దపడినట్లు వార్తలు వచ్చాయి. రాజీనామా లేఖను ఉపసభాపతి ఖాశింకు అందచేశామని ఆమోదించవచ్చని పిటిఐ నేతలు చెప్పారు గానీ ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. విదేశీ కుట్ర లేఖపై పార్లమెంటరీ కమిటీ విచారణను తాము అంగీకరించటం లేదని, సుప్రీం కోర్టు విచారణ జరపాలని పిటిఐ డిమాండ్‌ చేసింది.


జాతీయ అసెంబ్లీలోని 342 మందికి గాను 174 మంది అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు. అంతకు ముందు ఇమ్రాన్‌ఖాన్‌పై తిరుగుబాటును ప్రకటించిన పిటిఐ పార్టీ సభ్యులు ఓటింగ్‌ సమయంలో అధికాపక్షం వైపే కూర్చున్నారు. సాధారణ మెజారిటీకి అవసరమైన 172కు గాను అదనంగా మరో రెండు ఓట్లు మాత్రమే ప్రతిపక్షాలకు వచ్చాయి. అధికారపక్ష సభ్యులు ఓటింగ్‌ను బహిష్కరించారు. గతేడాది నవంబరు 28న పాకిస్తాన్‌ పీపుల్స్‌ పార్టీనేత ఖుర్షీద్‌ ఖాన్‌ ఒక ప్రకటన చేస్తూ ఇమ్రాన్‌ ఖానున్న పదవీచ్యుతుడ్ని చేసేందుకు ప్రతిపక్షాలకు మెజారిటీ ఉందని చెప్పాడు. డిసెంబరు 24న పాకిస్తాన్‌ ముస్లింలీగ్‌(ఎన్‌) నేత అయాజ్‌ సాదిక్‌ కూడా అదే చెప్పాడు. ప్రభుత్వానికి పార్లమెంటులో మెజారిటీ లేదని జనవరి 11న అదే పార్టీ నేత ఖ్వాజా అసిఫ్‌ ప్రకటించాడు. ఇమ్రాన్‌ ఖాన్ను ఇంటికి పంపేందుకు తాము సెనేట్‌ చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని పీపుల్స్‌ పార్టీ నేత బిలావల్‌ భుట్టో జరదారీ ప్రకటించాడు.అవిశ్వాస తీర్మానానికి ప్రతిపక్షాలు సిద్దమని జనవరి 21న అయాజ్‌ సాదిక్‌ చెప్పాడు. ఫిబ్రవరి ఏడున ముస్లింలీగ్‌-పీపుల్స్‌ పార్టీ అధికారికంగానే దీని గురించి చర్చించాయి. పదకొండున ప్రతిపక్షాల తరఫున అవిశ్వాస తీర్మానం గురించి పిడిఎం పార్టీ నేత మౌలానా ఫజులుర్‌ రహ్మాన్‌ ప్రకటించాడు. మార్చి ఎనిమిదిన పార్లమెంటులో అవిశ్వాస తీర్మాన నోటీసు ఇచ్చారు. మార్చి 12న అధికార పిటిఐ పార్టీ అసంతృప్త నేత అలీమ్‌ ఖాన్‌ లండన్‌లో మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌తో చర్చించాడు. విదేశీ నిధులతో జరిగిన కుట్ర తనపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వెనుక ఉందని మార్చి 27న ఇమ్రాన్‌ ఖాన్‌ ఒక బహిరంగ సభలో చెప్పాడు. మరుసటి రోజు ప్రతిపక్షం అవిశ్వాస తీర్మానం నోటీస్‌ ఇచ్చింది. ముప్పై ఒకటవ తేదీన దాన్ని చర్చకు తీసుకొని ఏప్రిల్‌ 3కు పార్లమెంటును వాయిదా వేశారు. ఆ రోజు డిప్యూటీ స్పీకర్‌ తీర్మానం చెల్లదని తిరస్కరించాడు. వెంటనే సభ రద్దు, అధ్యక్షుడి ఆమోద ముద్ర, సుమోటోగా సుప్రీం కోర్టు స్వీకరణ వెంటవెంటనే జరిగాయి.ఏడవ తేదీన స్పీకర్‌ చర్య, సభ రద్దు చెల్లదంటూ పునరుద్దరించిన సుప్రీం కోర్టు తొమ్మిదవ తేదీన అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌ జరపాలని ఆదేశించింది. విదేశీ ప్రభుత్వ ఏర్పాటును తాను సహించబోనని ఇమ్రాన్‌ ఖాన్‌ ఆమేరకు ఓటింగ్‌ జరిగి నెగ్గటంతో ఇమ్రాన్‌ ఖాన్‌ సర్కార్‌ పతనమైంది.


ఏప్రిల్‌ తొమ్మిది-పదవ తేదీ పార్లమెంట్‌ సమావేశంలో అనేక నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఉదయం 10.30 గంటలకు ప్రారంభమైన సమావేశంలో అడుగడుగునా ప్రభుత్వ ప్రతిపక్షాలు కత్తులు దూశాయి. అర్దరాత్రి పన్నెండు గంటలకు కొద్ది నిమిషాల ముందు పాలకపక్షం ఎన్నుకున్న స్పీకర్‌ అసాద్‌ ఖ్వైజర్‌ రాజీనామా చేశాడు,ప్రతిపక్ష సభ్యుడు అయాజ్‌ సాదిక్‌కు సభాధ్యక్ష బాధ్యతను అప్పగించాడు. సాదిక్‌ వెంటనే ఓటింగ్‌ జరిపాడు.ప్రతిపక్షాలకు చెందిన 174 మంది అనుకూలంగా ఓట్లు వేశారు. ప్రతికూలంగా ఎవరూ వేయలేదు.


పదవిలో ఉండగా తన ప్రభుత్వ పతనానికి అమెరికా, భారత్‌, ఇజ్రాయల్‌ ప్రతిపక్షాలతో కలసి కుట్రపన్నిట్లు ఇమ్రాన్‌ ఖాన్‌ విమర్శించాడు.దక్షిణాసియా వ్యవహారాల సహాయ మంత్రి డోనాల్డ్‌ లు తన ప్రభుత్వాన్ని బెదిరిస్తూ పంపిన లేఖ అంటూ బహిరంగసభలో ప్రదర్శించాడు. మన దేశ విదేశాంగ విధానాన్ని ప్రశంసించాడు, విదేశీ వత్తిళ్లకు భారత్‌ లొంగలేదని చెప్పాడు. మహమ్మదాలీ జిన్నా తరువాత తాను తప్ప పాక్‌ పాలకులుగా ఉన్నవారందరూ సిఐఏ ఏజంట్లు లేదా భారత్‌, ఇజ్రాయల్‌కు అమ్ముడు పోయిన బాపతేనని కూడా చెప్పాడు. స్వతంత్ర విదేశాంగ విధానం అవలంభించాలని పదే పదే చెప్పిన ఇమ్రాన్‌ ఖాన్‌ వివిధ సందర్భాల్లో చేసిన వ్యాఖ్యల సారాన్ని చూస్తే రానున్న రోజుల్లో ముందస్తు ఎన్నికలు వచ్చినా, గడువు ప్రకారమే జరిగినా విదేశాంగ విధాన ఆత్మగౌరవ అంశంతో జనం ముందుకు వెళ్లేందుకు నిర్ణయించుకున్నట్లు చెప్పవచ్చు. ఇది ప్రధాన ప్రత్యర్ధి పార్టీలను ఇరుకున పెట్టే అవకాశం ఉంది. భారత్‌ను తన అక్కున చేర్చుకొనే ఎత్తుగడలో భాగంగా అమెరికా తమ భుజాల మీద నుంచి తుపాకులు పేల్చిందని, ఇప్పుడు అది దగ్గర కాగానే తమను పట్టించుకోవటం లేదనే అభిప్రాయం పాకిస్తాన్‌ జనంలో రోజు రోజుకూ పెరుగుతున్నట్లు ఒక అభిప్రాయం.2018 జనవరి ఒకటిన నాటి అమెరికా అధినేత డోనాల్డ్‌ ట్రంప్‌ చేసిన ట్వీట్‌లో గత పదిహేను సంవత్సరాల్లో పాకిస్తాన్‌కు ఇచ్చిన 33 బిలియన్‌ డాలర్లకు ప్రతిగా అమెరికాకు దక్కింది అబద్దాలు, వంచన తప్ప మరొకటి కాదన్నాడు. పాకిస్తాన్‌లో ఏముంటాయంటే మూడు ”ఏ” లు (అల్లా, ఆర్మీ, అమెరికా) ఉంటాయని గతంలో కొందరు ఎద్దేవా చేశారు.
అగ్రరాజ్యమేదీ భారత్‌ను శాసించలేదని, ఆత్మగౌరవాన్ని అక్కడి నుంచి నేర్చుకోవాలని ఖాన్‌ అన్నాడు. అవిశ్వాస తీర్మానానికి ఒక రోజు ముందు దేశ ప్రజల నుద్దేశించి ప్రసంగిస్తూ ప్రజాప్రయోజనాలు తమకు ముఖ్యమంటూ భారత్‌ తీసుకున్న వైఖరిని ఏ దేశమూ నిరోధించలేకపోయిందన్నాడు.” రష్యాకు వ్యతిరేకంగా మాట్లాడాలని ఐరోపా దౌత్యవేత్తలు పాకిస్తాన్‌ మీద వత్తిడి చేస్తున్నారు కానీ భారత్‌ విషయంలో వారా ధైర్యం చేయలేరు.మరొక దేశం కోసం ప్రజల ప్రాణాలను ఫణంగా పెట్టలేను, మన విదేశాంగ విధానం సర్వసత్తాకమైనదిగా ఉండాలి. నా రష్యా పర్యటన పట్ల అమెరికా సంతోషంగా లేదు. మనది ఒక మిత్ర దేశంగా ఉన్నప్పటికీ నాలుగు వందల డ్రోన్‌ దాడులు చేసింది. నా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర చేసింది. ఇమ్రాన్‌ఖాన్ను పదవీచ్యుతుడిని చేసిన తరువాతే పాకిస్తాన్ను అమెరికా క్షమిస్తుందని ఒక అమెరికా ప్రతినిధి చెప్పాడు. దిగుమతి చేసుకున్న ప్రభుత్వాన్ని నేను అంగీకరించను. న్యాయవ్యవస్ధను నేను గౌరవిస్తాను, కానీ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో ఆశాభంగం చెందాను. విదేశీ కుట్ర సాక్ష్యాన్ని కనీసం చూసి ఉండాల్సింది, ఆరోపణలపై విచారణకు ఆదేశించి ఉండాల్సింది. పాకిస్తాన్ను విదేశాలు ఒక తుడుచుకొని పారవేసే కాగితపు ముక్కలా ఉపయోగించకూడదు. ” అన్నాడు.


దేశానికి 1947లో స్వాతంత్య్రం వచ్చింది, కానీ విదేశీ కుట్రలతో ప్రభుత్వమార్పిడికి వ్యతిరేకంగా మరోసారి స్వాతంత్య్ర పోరాటం ప్రారంభమైందని, దేశ ప్రజాస్వామ్యం,సార్వభౌమత్వాన్ని ఎల్లవేళలా ప్రజలే కాపాడుకుంటారు” అని పేర్కొన్నాడు. రాజీనామా చేసిన 135 మంది పిటిఐ సభ్యుల లేఖలను ఆమోదిస్తే ఆ స్ధానాలన్నింటికీ ఉప ఎన్నికలు జరపాల్సి ఉంటుంది. అది మరొక ఎన్నికల పోరాటంగా మారుతుంది. ఇది కొత్త ప్రభుత్వం మీద, పార్టీల మీద వత్తిడిని పెంచుతుంది. ఎన్నికలు జరిగే వరకు రాజకీయ మధనానికి దారి తీస్తుంది. ఉప ఎన్నికల్లో తిరిగి పిటిఐ అభ్యర్ధులు నెగ్గితే తదుపరి జరిగే ఎన్నికల మీద మరింత వత్తిడిని పెంచుతుంది. లేదా దానికి అవకాశం ఇవ్వకుండా, దేశంలో మరింతగా అమెరికా వ్యతిరేకత పెరగక ముందే ముందస్తు ఎన్నికలకు పోవటమా అన్నది కొత్త కూటమి ముందున్న ప్రశ్న.


పాకిస్తాన్‌లో అధికారం ప్రధానంగా మిలిటరీ కనుసన్నలలో నడవటం అందరికీ తెలిసిందే. గత ఎన్నికల్లో ఇమ్రాన్‌ ఖాన్‌కు సహకరించినట్లు భావించిన మిలిటరీ ఇప్పుడు వైరంతో ఉందని వార్తలు. కొత్త ప్రభుత్వం పట్ల ఎలా ఉంటుందో చెప్పలేము. ఇప్పటికీ పాక్‌ మిలిటరీ మీద అమెరికా ప్రభావం తీవ్రంగా ఉందన్నది స్పష్టం. ఇటీవలి కాలంలో అమెరికన్లు మన దేశానికి పెద్ద పీటవేస్తుండటంతో జనంలో అమెరికా పట్ల వ్యతిరేకత పెరుగుతున్నది. భారత్‌ తన ఒళ్లోవాలుతున్నందున మన దేశాన్ని సంతుష్టీకరించేందుకు, చైనాకు వ్యతిరేకంగా మనలను నిలబెట్టే ఎత్తుగడకు ప్రాధాన్యత ఇస్తున్నందున పాకిస్తాన్‌తో గతం మాదిరి అమెరికా ఉండటం లేదు. ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్న స్ధితిలో ఆదుకొనేందుకు ముందుకు రావటం లేదు. దీంతో రష్యా,చైనాల వైపు పాకిస్తాన్‌ మొగ్గుతున్నది. బహిరంగంగా అమెరికా వ్యతిరేక వైఖరిని తీసుకున్న ఇమ్రాన్‌ ఖాన్‌పై అమెరికా కక్షగట్టి ప్రభుత్వాన్ని కూలదోసేందుకు వివిధ శక్తులను ఏకం చేయవచ్చుగానీ దాని విదేశాంగ విధానంలో మార్పులను అమెరికా రుద్దగలదా అన్నది ప్రశ్న. గతం మాదిరి తిరిగి ఇస్లామాబాద్‌ను తన కౌగిలిలోకి అమెరికా తెచ్చుకోదలచుకుంటే, అందుకు పాక్‌ సమ్మతిస్తే పాక్‌ వ్యతిరేకతను రెచ్చగొట్టి రాజకీయ లబ్ది పొందుతున్న నరేంద్రమోడీ పరిస్ధితి ఏమిటి అన్నది ప్రశ్న. ఒకే వరలో పాక్‌-భారత్‌ అనే కత్తులను ఇమడ్చాలని అమెరికా చూస్తున్నది. కాశ్మీరు సమస్య కొనసాగినంతకాలం అది కుదరదు.


తనను నమ్ముకున్న దేశాలను అమెరికా నట్టేట ముంచుతుందని గతంలో అనేక మంది హెచ్చరించినా జనాలు పట్టించుకోలేదు. ఆప్ఘనిస్తాన్లో అమెరికాకు ఎదురైన పరాజయం, దానికంటే ఉక్రెయిన్ను ముందుకు తోసి చేతులెత్తేసిన తీరుతో మన దేశంలో అమెరికా భక్తులు జీర్ణించుకోలేకపోతున్నారు.చైనా బూచిని చూపినా జనం నమ్మే స్ధితి లేదు. ఐరోపాలో నాటో కూటమి పేరుతో తిష్టవేసిన తన సైన్యాలను రష్యాకు వ్యతిరేకంగా ఉక్రెయినుకు పంపటానికి కొన్ని గంటలు చాలు, అయినా అమెరికా లేదా ఇతర ఐరోపా దేశాలేవీ ఆపని చేయలేదు. పెద్ద మొత్తంలో ఆయుధాలు పంపుతున్నాయి. కొంత మంది చెబుతున్నట్లుగా(ఈ రచయిత కాదు) చైనా-భారత్‌ మధ్య యుద్దమే గనుక జరిగితే చతుష్టయ కూటమిలోని అమెరికా లేదా జపాన్‌, ఆస్ట్రేలియా తమ మిలిటరీని మన సరిహద్దులకు పంపుతాయా ? అది సాధ్యమేనా ! కాస్త బుర్రతో ఆలోచించేవారికి కాదని స్పష్టంగా తెలుసు. నేటి భారత్‌ 1962నాటి భారత్‌ కాదని మన నేతలు ప్రకటనలు చేస్తున్నారు. ఇదే సమయంలో చైనా 1962 నాటి మాదిరే ఉందని అనుకుంటున్నారా ? మనం ఇతర దేశాల దగ్గర ఆయుధాలు కొని పోరుకు దిగాలి. అదే చైనా ఇతర దేశాలకు ఆయుధ ఎగుమతులు చేసే స్ధితిలో ఉందని మరచిపోరాదు. ఆర్ధికంగా అమెరికానే సవాలు చేస్తోంది. ఇప్పటికే ఆప్ఘనిస్తాన్‌తో సహా భారత ఉపఖండంలోని దేశాలన్నీ చైనాకు దగ్గరగా ఉన్నాయి. అందువలన చైనాతో ఉన్న వివాదాలను పరిష్కరించుకొనేందుకు పూనుకోవాలే తప్ప అమెరికా ఇచ్చిన తాయత్తులు కట్టుకొని బస్తీమే సవాల్‌ అని రంగంలోకి దిగితే జరిగే ఏం జరుగుతుందో ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి.పాక్‌ మిలిటరీతో తమ సంబంధాలు కొనసాగుతాయని అమెరికా మిలిటరీ బుధవారం నాడు ప్రకటించింది.అధికారానిన స్వీకరించి రెండు రోజులు గడిచినా ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ మంత్రివర్గాన్ని ప్రకటించలేదు.భారత్‌ గనుక కాశ్మీరుకు 370 ఆర్టికల్‌ను రద్దు చేస్తే మనమేం చేయాల్సి ఉంటుందని ప్రధానిగా తన తొలి ప్రసంగంలో షెహబాజ్‌ ప్రశ్నించాడు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

శ్రీలంక సంక్షోభానికి చైనా కారణమా ! నిజానిజాలేమిటి !!

08 Friday Apr 2022

Posted by raomk in CHINA, Current Affairs, Economics, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, Prices, UK, Uncategorized, USA

≈ Leave a comment

Tags

‘China debt trap’, Disinformation campaign, Hambantota Port, Propaganda War, Sri Lanka debt, Sri Lanka economic crisis


ఎం కోటేశ్వరరావు


శ్రీలంక తీవ్రమైన విదేశీ రుణ చెల్లింపుల సంక్షోభంలో ఉంది. దాంతో జనజీవితం అతలాకుతలం అవుతున్నది. అధికారపక్షానికి మద్దతు ఇచ్చే కొన్ని పార్టీలు, అదే పార్టీకి చెందిన కొందరు ఎంపీలు కూడా మద్దతు ఉపసంహరించుకొని స్వతంత్రులుగా ఉంటామని ప్రకటించారు. ఇది రాసిన సమయానికి తమ ప్రభుత్వానికి పార్లమెంటులో మెజారిటీ ఉందని, అధ్యక్షుడు, ప్రధాని గానీ రాజీనామా చేసేది లేదని మంత్రులు ప్రకటిస్తున్నారు. మరోవైపు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని ప్రతిపక్షాలు చెబుతున్నాయి. ప్రభుత్వ అసమర్ధత పట్ల జనం తీవ్ర నిరసన తెలుపుతున్నారు. ఆర్ధిక సంక్షోభం కారణంగా తలెత్తిన రాజకీయ అశాంతి ఎలా పరిష్కారం అవుతుందో ఊహించలేము. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ధ(ఐఎంఎఫ్‌) నుంచి రుణం తీసుకొని చెల్లింపుల సమస్యనుంచి బయటపడేందుకు పూనుకుంది. అసలు లంకలో ఇలాంటి పరిస్ధితి తలెత్తటానికి కారణం ఏమిటి అనే చర్చ జరుగుతోంది. అమెరికా, బ్రిటన్‌, మన దేశంలోని మీడియా చైనా వైపు వేలెత్తి చూపుతోంది. ఎంతవరకు వాస్తవం, అసలు నిజానిజాలేమిటి ?


శ్రీలంకలోని హంబంటోటా రేవును చైనా నిధులతో అభివృద్ది చేశారు. రుణాన్ని లంక సర్కార్‌ చెల్లించకపోవటంతో ఆ రేవును 99 సంవత్సరాలకు చైనా కౌలుకు తీసుకోవటం ఆక్రమించటమే కదా, బిఆర్‌ఐ పేరుతో అనేక దేశాలను ఇలానే ఆక్రమిస్తున్నది అని చెబుతారు. ఇదంతా అమెరికా, ఇతర పశ్చిమదేశాల మీడియా కట్టుకధ. దున్న ఈనిందంటే గాటన కట్టేయమన్నట్లుగా మన పత్రికలు, టీవీలు వెంటనే అందుకుంటాయి. లంకలో చైనా నిర్మిస్తున్న విద్యుత్‌ పధకాలు మన దేశ భద్రతకు ముప్పు అని ముక్తాయింపు ఇస్తాయి. చైనా నిర్మిస్తున్నది కనుక ఇలా అంటున్నాయా లేక లంకలో నిర్మాణం జరుగుతున్నందుకా? అదే నిజమైతే తమిళనాడులో మనం నిర్మిస్తున్న పధకాలు కూడా తమ భద్రతకు ముప్పే అని లంక భావిస్తే తప్పుపడతామా ? ఇదే తర్కాన్ని ఇతర మన ఇరుగుపొరుగుదేశాలు కూడా ముందుకు తెస్తే ఏంచెబుతారు ?


శ్రీలంకకు రుణాలు ఇచ్చిన అంతర్జాతీయ సంస్ధలు దేశాల వరుసలో చైనా నాలుగవ స్ధానంలో ఉంది. హంబంటోటా రేవు నిర్మాణం తమ ప్రభుత్వ ఆలోచన తప్ప చైనాది కాదు అని 2020అక్టోబరులో అధ్యక్షుడు రాజపక్స ప్రకటించాడు. చైనా నిర్మిస్తున్న పధకాలు అజాగళ స్ధనాల వంటివి అలంకార ప్రాయం తప్ప వాటి నుంచి పెద్దగా ఆదాయం రాదని ఒక పాటపాడతారు.తొలుత దీన్ని బ్రిటీష్‌ గూఢచార సంస్ధ, బిబిసి ప్రచారంలోకి తెచ్చింది. అలాంటి పధకాల నిర్మాణాన్ని చైనా, మరొకదేశం ఏదైనా ఒక స్వతంత్ర దేశం మీద రుద్దగలవా ? చైనా నిర్మిస్తున్న పధకాలలో కొలంబో పోర్టు సిటీ ఒకటి. ఈ ప్రత్యేక ఆర్ధిక ప్రాంతంలో పెట్టే సంస్ధలకు నాలుగు దశాబ్దాల పాటు పన్ను రాయితీలుంటాయి. దీని గురించి ప్రైస్‌వాటర్‌హౌస్‌ కూపర్స్‌(పిడబ్ల్యుసి) చెప్పిందేమిటి ? రానున్న ఇరవై సంవత్సరాల్లో 12.7బిలియన్‌ డాలర్ల అదనపు పెట్టుబడులు వస్తాయి, లంక ఆర్ధిక వ్యవస్ధకు 13.8బి.డాలర్లు తోడవుతాయని ఏడాది క్రితం పేర్కొన్నది. ఇది లండన్‌ కేంద్రంగా పని చేసే బహుళజాతి సంస్ధ. అదేమీ చైనా సంస్ధ కాదు కదా !


ఈ ఏడాది విదేశీ అప్పులకు గాను లంక చెల్లించాల్సిన కిస్తీ 4.5బి.డాలర్లు.గడువులోగా చెల్లించకపోతే దివాలా తీసినట్లు భావిస్తారు. ఇదిగాక దిగుమతులు, ఇతర అవసరాలకు మరో 20బి.డాలర్లు అవసరం అని అంచనా. శ్రీలంక 2007 నుంచి విదేశీ బాండ్ల రూపంలో రూపంలో తీసుకున్నది 35బి.డాలర్ల (ఇది 51బి.డాలర్లని కొందరు చెప్పారు) మొత్తం విదేశీ అప్పులో 47శాతం ఉంది. దీనిలో ఎక్కువ భాగం డాలర్లుగా చెల్లించాల్సింది ఉంది. ఆసియన్‌ డెవలప్‌మెంట్‌ బాంకునుంచి 14.3శాతం, జపాన్నుంచి 10.9, చైనా నుంచి తీసుకున్నది 10.8శాతం ఉంది. మిగతా రుణాలను మన దేశం, ప్రపంచబాంకు, ఇతర సంస్ధలు, దేశాల నుంచి తీసుకున్నది.శ్రీలంక బాండ్ల రుణాల్లో ఎక్కువ మొత్తం అమెరికా సంబంధిత సంస్ధల నుంచి తీసుకున్నదే, అంటే వాటిలో మదుపు చేసే వారందరూ అమెరికన్లే, ఆ రీత్యా ఎక్కువ అప్పులిచ్చింది అమెరికానే కదా ! గతేడాది డిసెంబరు ఆఖరు నాటికి లంక వద్ద 3.1 బి.డాలర్ల విదేశీ మారక ద్రవ్యం ఉంటే దానిలో చైనా సర్దుబాటు చేసి మొత్తం 1.5బి.డాలర్లుంది.వాస్తవాలు ఇలా ఉంటే చైనా కారణంగా లంక ఇబ్బందులు పడుతున్నదని ఎలా చెబుతారు ?


చైనా నుంచి శ్రీలంక ఎందుకు రుణాలు తీసుకుంది అన్నది అసక్తికరం.హంబంటోటా రేవు నిర్మాణం కోసం భారత్‌, అమెరికాలతో పోలిస్తే చైనాతో లావాదేవీలు మెరుగైనవిగా ఉండటమే కారణమని అమెరికాకు చెందిన అట్లాంటిక్‌ పత్రిక పేర్కొన్నది.2007లో లంక తొలుత ఈ రెండు దేశాలనే పెట్టుబడులు, రుణాలను కోరగా అవి తిరస్కరించాయి.2009లో లంకలో అంతర్యుద్దం ముగిసింది, ఆర్ధిక రంగం ఇబ్బందుల్లో పడటంతో విదేశాల నుంచి రుణాలు తీసుకోవటం ప్రారంభించింది. పదిహేను సంవత్సరాల వ్యవధి ఉన్న 30.7కోట్ల డాలర్ల రుణాలను 6.3శాతం వడ్డీతో చైనా ఇచ్చింది. తరువాత చైనా నుంచే మరో 75.7 కోట్ల డాలర్లను రెండు శాతం వడ్డీతో లంక తీసుకుంది. విదేశీ చెల్లింపుల సమస్యను అధిగమించేందుకు 2018లో చైనా అభివృద్ది బాంకు నుంచి వందకోట్ల డాలర్లను ఎనిమిదేండ్లలో తిరిగి చెల్లించే ప్రాతిపదికన లండన్‌ ఇంటర్‌ బాంక్‌ రేటు(లిబోర్‌) ప్రకారం 2.56శాతానికి తీసుకుంది. తరువాత 2020మార్చినెలలో అంతకు ముందు కంటే తక్కువ వడ్డీకి అదే బాంకును మరో 50కోట్ల డాలర్లు తీసుకుంది. ఈ ఏడాది మరో 150కోట్ల డాలర్ల రుణం తీసుకుంది. చైనా మెరుగైన షరతులతో రుణాలు ఇవ్వటం వల్లనే దానివైపు లంక మొగ్గినట్లు ఈ లావాదేవీలు వెల్లడిస్తున్నాయని అట్లాంటిక్‌ పేర్కొన్నది.


హంబంటోటా రేవు ద్వారా ఆశించిన మేరకు ఆదాయం రాకపోవటం, 2015నాటికి రుణ కిస్తీ చెల్లించకలేకపోవటంతో 70శాతం వాటాలను చైనా కంపెనీకి విక్రయించింది. తరువాత రేవు, పరిసరాల్లో ఉన్న 15వేల ఎకరాల భూమిని 99 సంవత్సరాల కౌలుకు ఇచ్చింది. దీంతో ఆ రేవును హిందూమహాసముద్రంలో చైనా మిలిటరీ అవసరాల కోసం వినియోగించనుందనే ప్రచారాన్ని అమెరికా, మన దేశం ప్రారంభించాయి. అదే నిజమనుకుంటే ఆ రేవు నిర్మాణానికి మన దేశం, అమెరికా తొలుత ఎందుకు తిరస్కరించినట్లు ? నిర్మాణం తరువాత విదేశీ సంస్ధలకు ఇవ్వాలనుకున్నపుడైనా చైనా నుంచి ముప్పు ఉందనుకున్నపుడు మనం లేదా అమెరికా ఎందుకు తీసుకోలేదు ?


ఒకరి దగ్గర రుణం తీసుకొని దాన్ని తీర్చేందుకు తిరిగి వారి దగ్గరే రుణం తీసుకోవటాన్ని రుణవల అని చైనా విమర్శకులు వర్ణిస్తున్నారు. ఇచ్చేవారుంటే ఇతర దేశాల దగ్గర తీసుకొని రుణాలు తీరిస్తే ఇబ్బందేముంది. ఆదుకోని ఇతర దేశాలను వదలిపెట్టి సాయం చేస్తున్న చైనాను విమర్శించటం దురుద్ధేశ్యపూరితం తప్ప మరొకటి అవుతుందా ? గిట్టుబాటు గాని రేవు నిర్మాణానికి రుణమిచ్చి తీర్చలేదనే పేరుతో అక్కడ పాగావేసేందుకు చైనా ఆ పని చేసిందని, అన్ని పేద దేశాల్లో ఇదే చేస్తోందని చెప్పే అమెరికా ప్రబుద్దులు, దానికి వంతపాడేవారు పుట్టుకువచ్చారు. ఇది నిజమా ?


చైనాతో నిమిత్తం లేకుండానే హంబంటోటా రేవును అభివృద్ధి చేసేందుకు లంక సర్కార్‌ నిర్ణయించింది. దాన్ని తొలుత ప్రోత్సహించింది చైనా కాదు కెనడా. దశాబ్దాలుగా ఆ ప్రతిపాదన ఉంది. తాము అధికారానికి వస్తే రేవు నిర్మాణం చేస్తామని యునైటెడ్‌ నేషనల్‌ ఫ్రంట్‌ పార్టీ 2001 ఎన్నికల్లో వాగ్దానం చేసింది. ఆ మేరకు ప్రభుత్వం 2002లో కెనడియన్‌ ఇంటర్నేషనల్‌ డెవలప్‌మెంట్‌ ఏజన్సీకి సాధ్యాసాధ్యాల నివేదికను రూపొందించే బాధ్యతను అప్పగించగా అది తమ దేశానికే చెందిన ఎన్‌ఎన్‌సి-లావలిన్‌ కంపెనీకి ఇచ్చింది. 2003 నాటికి అది వెయ్యిపేజీల నివేదిక ఇచ్చింది. దాన్ని ప్రభుత్వ-ప్రయివేటు భాగస్వామ్యంతో నిర్మించాలని సిఫార్సు చేసింది. సదరు ప్రాజెక్టును ఐరోపా దేశాలు దక్కించుకోవచ్చనే ఆందోళనను కూడా వెలిబుచ్చింది. అప్పటి లంక పరిస్ధితుల కారణంగా కెనడా ముందుకు రాలేదు.మహింద రాజపక్స సోదరుల ఏలుబడిలో 2005-15 మధ్యదానికి ఒక రూపు ఇచ్చారు. కెనడా కంపెనీ తరువాత డెన్మార్క్‌ కంపెనీ రామ్‌బోల్‌ 2006లో రెండవ సాధ్యాసాధ్యాల నివేదికను రూపొందించింది. అది కూడా దాదాపుగా కెనడా కంపెనీ చెప్పిన అంశాలనే పేర్కొన్నది.దశలవారీ వృద్ధి చేయాలని చెప్పింది. ఏ నివేదిక కూడా ఆ రేవు నిర్మాణం గిట్టుబాటు కాదని చెప్పలేదు. రామ్‌బోల్‌ నివేదికను తీసుకొని లంక సర్కార్‌ అమెరికా, భారత్‌ల వద్దకు వెళ్లగా కుదరదని చెప్పిన తరువాతే దాని గురించి తెలుసుకొని చైనా కంపెనీ కంపెనీ రంగంలోకి దిగింది, కాంట్రాక్టును దక్కించుకుంది. జరిగింది ఇదైతే లంకను రుణ ఊబిలోకి దింపింది చైనా అని ఏ నోటితో చెబుతారు.


ఒప్పందం ప్రకారం మొదటి దశ మూడు సంవత్సరాల్లోనే పూర్తయింది.సాధ్యాసాధ్యాల నివేదికను రూపొందించే సమయానికి ఉన్న పరిస్ధితులు మారిపోయాయి. మొదటి దశలో ఆశించిన రాబడి రాక ముందే 2012లో లంక సర్కార్‌ రెండవ దశను ముందుకు తెచ్చింది. దానికి గాను రెండుశాతం వడ్డీతో చైనా ఎగ్జిమ్‌ బాంకు 75.7 కోట్ల డాలర్ల రుణం ఇచ్చింది. 2008లో ధనికదేశాల్లో తలెత్తిన ఆర్ధిక సంక్షోభం నేపధ్యంలో ప్రపంచంలో వడ్డీరేట్లు తగ్గాయి. తొలుత రేవు నిర్వహణ ప్రభుత్వ చేతుల్లోనే ఉంది. 2014లో అనుభవం ఉన్న కంపెనీతో కలసి ఉమ్మడిగా నిర్వహించాలని నిర్ణయించారు. చైనా మర్చంట్స్‌ గ్రూప్‌ కంపెనీ అప్పటికే కొలంబో రేవులో ఒక జట్టీ నిర్వహిస్తున్నది కనుక దానితోనే ఒప్పందం చేసుకున్నారు.


2015 మధ్యంతర ఎన్నికల్లో అధికారపక్షంలో తిరుగుబాటు చేసిన ఆర్ధిక మంత్రి మైత్రీపాల సిరిసేన అధ్యక్షపదవిని కైవసం చేసుకున్నాడు. ఆ ఎన్నికల ప్రచారంలో రేవు లావాదేవీల్లో అక్రమాలు జరిగాయని, అనవసరంగా ఖర్చు పెట్టి అప్పుల పాలు చేశారని ప్రచారం చేశాడు. సిరిసేన పదవి స్వీకరణ తరువాత విదేశీ అప్పుల చెల్లింపుల సమస్య ముందుకు వచ్చింది. మొత్తం విదేశీ అప్పులో 40శాతం బాండ్ల రూపంలో ఉంది. అప్పటికి విదేశీ అప్పులో జపాన్‌, ప్రపంచబాంకు, ఏడిబి ఇచ్చినవే ఎక్కువ.2017లో చెల్లించాల్సిన 450 కోట్ల డాలర్ల విదేశీ రుణంలో హంబంటోటా రేవుకు తెచ్చిన మొత్తం కేవలం ఐదుశాతమే. ఆ ఏడాదే ఆ రేవును చైనా కంపెనీకి అప్పగించారు. అది చెల్లించిన 120 కోట్ల డాలర్లను విదేశీ చెల్లింపులకు సర్కార్‌ వినియోగించింది. అజాగళ స్దనం వంటిది అని చెబుతున్న రేవును తీసుకున్న చైనా కంపెనీ దాని లాభనష్టాలను భరించేందుకు సిద్దపడినపుడు అది లంకకు ఉపశమనం కలిగించేదే కదా ? సర్కార్‌ చేతులెత్తేసిన తరువాత చైనా కంపెనీ తీసుకుంది, దానిలో బలవంతం ఎక్కడ ? చైనా మిలిటరీ దాడి చేసి రేవును ఆక్రమించలేదు కదా ! అప్పటి వరకు ఆ రేవు వ్యూహాత్మక ప్రాధాన్య గురించి ఎక్కడా ప్రస్తావించని అమెరికా ఒక్కసారిగా ఇంకేముంది చైనా మిలిటరీ కోసమే తీసుకున్నారంటూ మన దేశాన్ని రెచ్చగొట్టేందుకు దొంగేడుపులు ప్రారంభించింది.


2012-18 మధ్య చైనా ఎగ్జిమ్‌ బాంకు నుంచి తీసుకున్న 310 కోట్ల డాలర్ల రుణాలన్నీ రెండుశాతం వడ్డీ రేటువే. 2014లో చైనా డెవలప్‌మెంట్‌ బాంకు నుంచి తీసుకున్న 40కోట్ల డాలర్లకు మాత్రం మూడు నుంచి ఐదుశాతం వరకు ఉంది. ఇతరంగా విదేశాల నుంచి తీసుకున్న రుణాలన్నీ ఐదుశాతం కంటే ఎక్కువ రేటున్నవే. శ్రీలంకలో మన దేశం కూడా ఒక ప్రాజెక్టు నిర్మించింది.మెడెవాచచియా నుంచి మన్నార్‌ రైల్వేలైనుకు మన దేశం మూడు శాతం వడ్డీతో 16.4 కోట్ల డాలర్ల పెట్టుబడి పెట్టింది.ఆ మార్గంలో తిరిగే రైల్లో రోజుకు రెండు వందల మంది కూడా ప్రయాణించటం లేదని, పెట్టుబడి వృధా అయిందనే విమర్శలు వచ్చాయి. ఏ దేశంలో ఏ ప్రాజక్టు నిర్మించినా దాని బాగోగులకు అక్కడి ప్రభుత్వానిదే బాధ్యత తప్ప రుణమిచ్చిన వారు, నిర్మించిన సంస్దలది బాధ్యత ఎలా అవుతుంది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

రష్యా మీద ఆంక్షలు – అమెరికా అసలు లక్ష్యం ఇంధన మార్కెట్‌ కబ్జా !

05 Tuesday Apr 2022

Posted by raomk in Current Affairs, Economics, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Prices, RUSSIA, USA, WAR

≈ Leave a comment

Tags

fuel politics, Narendra Modi, oil, Sanctions on Russia, US crude to India, US imperialism


ఎం కోటేశ్వరరావు


” మన దేశానికి ముందు ఇంధన భద్రత ముఖ్యం, ఎక్కడైనా చౌకగా చమురు దొరికితే అక్కడ ఎందుకు కొనకూడదు ? రష్యా నుంచి కొనుగోలు చేస్తున్నాం, పెద్ద మొత్తంలో ఇప్పటికే వచ్చింది, మొత్తంగా దేశ ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుంటాం ” అని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు. నిజమే కదా ! అభ్యంతర పెడుతున్నది ఎవరు? అమెరికా ! దాన్ని ఒక్కమాట అనలేకపోవటం దేశ ప్రయోజనాలకోసమేనా అన్నది ప్రశ్న. 2021ఏడాది మొత్తంగా మన దేశం రష్యానుంచి కొనుగోలు చేసిన చమురు 16 మిలియన్ల పీపాలు, ఈ ఏడాది ఫిబ్రవరి చివరి వారం నుంచి ఇప్పటి వరకు కొనుగోలు చేసిన మొత్తం 13మి.పీపాలు. ఇది పెద్ద పెరుగుదలే ఐనా మన దిగుమతుల మొత్తంలో రెండుశాతం లోపే అన్నది గమనించాలి.


ఉక్రెయిన్‌-రష్యా వివాదం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరుగుతున్నందున మనం కూడా ధరలు పెంచకతప్పటం లేదని కేంద్ర మంత్రులు, బిజెపి నేతలు నమ్మబలుకుతున్నారు ఇది పూర్తిగా నిజమా ? నవంబరు నాలుగు నుంచి 137 రోజుల పాటు వినియోగదారుల చమురు ధరలను కేంద్ర ప్రభుత్వం( ప్రభుత్వరంగ సంస్ధల ద్వారా) స్ధంభింప చేసింది. మార్చినెల 21వ తేదీ నుంచి పెంపుదలకు శ్రీకారం చుట్టారు. గతంలో మనకు చెప్పిందేమిటి ? అంతర్జాతీయంగా ఎంత ధర పెరిగితే అంత మొత్తాన్ని జనాల నుంచి వసూలు చేస్తాము, ఎంత తగ్గితే అంత మేరకు రోజూ ఉదయాన్నే తగ్గిస్తామని, ఇది విధాన నిర్ణయం అన్నారు. మరి అది 137 రోజుల పాటు ఎందుకు అమల్లో లేదు.ఐదు రాష్ట్రాల ఎన్నికలకోసమే అని ప్రతిపక్షాలు అంటే కాదన్నారు తప్ప కారణం చెప్పలేదు. గట్టిగా అడిగితే దేశభక్తులతో గొడవెందుకని సర్దుకుపోదాం రండి అన్నట్లుగా జనం ఉన్నారు. చిత్రం ఏమిటంటే మార్చి 21 నుంచి మన దేశంలో చమురు ధరలు పెరుగుతుంటే అంతర్జాతీయంగా తగ్గుతున్నాయి. దీని భావమేమి గోమాతా !


మార్చినెల తొమ్మిదవ తేదీన మనం కొనుగోలు చేసే పీపా చమురు ధర 128.24 డాలర్లు. అది తరువాత క్రమంగా తగ్గుతూ ఏప్రిల్‌ ఒకటవ తేదీన 103.02 డాలర్లు(కేంద్ర ప్రభుత్వ పెట్రోలియం ప్లానింగ్‌ అండ్‌ అనాలసిస్‌ సెల్‌ ) ఉన్నట్లు నాలుగవ తేదీన ప్రకటించింది. మరి ఈలెక్కన పెంపుదల-తగ్గించటం ఉంటే జనాలకు ధరలు తగ్గాలి. మార్చి 22వ తేదీ ధరను ప్రామాణికంగా తీసుకున్నప్పటికీ అది 113.41 డాలర్లే, దాని ప్రకారం చూసినా తగ్గాల్సింది పోయి ” తగ్గేదేలే ” అన్నట్లుగా పెంచుతున్నారు. ఎందుకని ? ప్రజా ప్రయోజనాల కోసమే అనుకుందామా ? లక్షల కోట్లు ప్రజల కోసం కుమ్మరించామని ఒక నోటితో చెబుతారు, వాటితో పోలిస్తే 137 రోజులో చమురు సంస్ధలకు వచ్చినట్లు చెప్పిన నష్టమెంత కేవలం 19వేల కోట్ల రూపాయలు. ఇంత చిన్న మొత్తాన్ని భరించలేని దుస్ధితిలో కేంద్ర ప్రభుత్వం ఉందా ?


నిజానికి ఇది పాక్షిక అంచనాగానే భావించాలి. ఇది వచ్చిన నష్టం, కంపెనీలకు రావాల్సిన లాభాలు కూడా కలుపుకుంటే ఇంకా ఎక్కువ ఉండవచ్చు. ఈ కారణంగానే నిలిపివేసిన మొత్తాన్ని ఇప్పుడు వసూలు చేస్తున్నారు. మనం కొనుగోలు చేసిన ముడి చమురు సగటు ధర నవంబరు నెలలో 80.64డాలర్లు, డిసెంబరులో 73.30, జనవరిలో 84.67, ఫిబ్రవరిలో 94.07, మార్చినెలలో 112.87 డాలర్లుంది. తొలుత ఈ మొత్తాన్ని లెక్కించి వచ్చిన లోటును వసూలు చేస్తారు, అందుకే అంతర్జాతీయ మార్కెట్లో మార్పులతో నిమిత్తం లేకుండా వరుసగా పెంచుతున్నారు. పైసా వసూలు మొత్తం జరిగిన తరువాత పెరుగుదలను బట్టి వడ్డింపు ఉంటుంది.


ప్రస్తుత ధరల(మార్చిచివరి వారం) ప్రకారం చమురు కంపెనీలు లీటరుకు రు.15 తక్కువ ధరకు విక్రయిస్తున్నాయని, ఈ మేరకు ధరలు పెంచవచ్చన్నది ఒక అంచనా. ఏప్రిల్‌ 5వ తేదీ పెంపుతో లీటరు పెట్రోలు ధర ఢిల్లీలో రు.104.61 ఉంది, అంటే ఇప్పటికే రు.9.20 పెరిగింది. దీపావళి కానుక పేరుతో ఐదు రాష్ట్రాల ఎన్నికల కోసం కేంద్ర ప్రభుత్వం పెట్రోలు మీద ఐదు, డీజిలు మీద పది రూపాయల సెస్‌ తగ్గించింది. గోళ్లూడగొట్టి వసూలు చేస్తున్న దానిలో ఆ మేరకు తగ్గింపు మంచిదే కదా అనుకున్నాం. ఇప్పుడు పెంచిన ధరలతో అది కూడా హరించుకుపోయింది. ఒక లీటరు మీద ఒక రూపాయి సెస్‌ తగ్గిస్తే కేంద్రానికి ఏటా పదిహేనువేల కోట్ల ఆదాయలోటని అంచనా.దీన్నే జనం వైపు నుంచి చూస్తే ఒక రూపాయి పెంచితే అంతే మొత్తం భారం అవుతుంది. నరేంద్రమోడీ సర్కార్‌ అధికారానికి వచ్చిన తొలి ఏడాది కేంద్ర ప్రభుత్వానికి చమురు మీద ఎక్సైజ్‌ డ్యూటీ లేదా సెస్‌ ఖాతా కింద వచ్చిన రాబడి 2014-15లో రు.99,068 కోట్లు కాగా 2020-21లో వచ్చిన మొత్తం రు.4,19,884 కోట్లు.


ఇంధన ధరలు బాగా తగ్గినపుడు ఆ మేరకు వినియోగదారులకు తగ్గకుండా మన్మోహన్‌ సింగ్‌ గారి ” చెడు ” రోజులు చివరిలో లేదా నరేంద్రమోడీ గారి ” మంచి రోజుల ” ప్రారంభంలో లీటరు పెట్రోలు, డీజిలు మీద కేంద్ర ప్రభుత్వ పన్ను రూ.9.48, 3.56 చొప్పున ఉంటే దాన్ని పెంచారు. తాజా తగ్గింపునకు ముందు రూ.32.98, 31.83 చొప్పున ఉంది.పెట్రోలుపై లీటరుకు ఐదు, డీజిలుపై పది రూపాయల భారాన్ని తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు ఈ పెంచిన పన్ను, మరోసారి చమురు ధరల పెంపుదల ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదలకు దారి తీస్తుంది. అందువలన అది జరిగి జన జీవితాలు అతలాకుతలం కాకుండా ఉండాలంటే ఇంధనం మీద పన్నులను తగ్గించాలని ఆర్ధికవేత్తలందరూ మొత్తుకుంటున్నారు. కేంద్ర పాలకులు దాని గురించి మాట్లాడటం లేదు. రాష్ట్రాలు కూడా పన్నులు తగ్గించవచ్చు కదా అని ఎవరైనా సన్నాయి నొక్కులు నొక్కవచ్చు. కేంద్ర ప్రభుత్వం భారీగా పన్ను పెంచినపుడు బిజెపి అధికారంలో ఉన్న చోట్లతో సహా ఏ రాష్ట్రం కూడా ఈ రీతిలో పన్ను పెంచలేదు. ఒకటీ అరా రాష్ట్రాలు రూపాయో,రెండో ఇంకాస్త ఎక్కువో సెస్‌లు మాత్రమే పెంచాయి. కేంద్రం మాత్రం పన్నుల పెంపుదలతో పాటు అంతకు ముందు ఇస్తున్న రాయితీలను కూడా ఎత్తివేసి ఎంత పెరిగితే అంత మొత్తాన్ని వినియాగదారుల నుంచి వసూలు చేస్తున్నది. అందువలన కేంద్రం ముందుగా తాను పెంచిన వాటిని పూర్తిగా తగ్గించి రాష్ట్రాలను కూడా తగ్గించమనటం సమంజసం. లేదా చమురు ఉత్పత్తులను కూడా జిఎస్‌టి పరిధిలోకి తేవాలి. ఆ మేరకు రాష్ట్రాలకు తగ్గిన రాబడిని కేంద్రం భరిస్తే అదొకదారి. ఇప్పటికే పరిమిత ఆదాయ వనరులున్న రాష్ట్రాలను తగ్గించమనటం సబబు కాదు.


ఏప్రిల్‌ మూడుతో ముగిసిన వారంలో అంతర్జాతీయ చమురు ధరలు పదమూడుశాతం తగ్గాయి. ఒక వారంలో ఇంత పెద్ద మొత్తంలో గత రెండు సంవత్సరాల్లో జరగలేదు. ఈ తగ్గుదలకు కారణం సౌదీ అరేబియా – ఎమెన్‌లోని హౌతీ(షియా) తెగ తిరుగుబాటుదార్లతో కుదిరిన ఒప్పందం మేరకు చమురు సరఫరాలకు ఆటంకం తొలగటం ఒక కారణంగానూ, అమెరికా తన వ్యూహాత్మక నిల్వల నుంచి ఒక మిలియన్‌ పీపాల విడుదలకు బైడెన్‌ ప్రకటన దోహదం చేసిందని వార్తలు వచ్చాయి. ఈ పరిణామం జరిగినపుడు బ్రెంట్‌ రకం ధర 103.38డాలర్లుంటే ఏప్రిల్‌ ఐదున ఇది 109 డాలర్లుగా ఉంది అందువలన చమురు ధరల పెరుగుదలాపతనానికి ఏకైక కారణం ఏదీ కనిపించటం లేదు. ఎవరైనా ఉక్రెయిన్‌ – రష్యా వివాదాన్ని సాకుగా చూపితే కుదరదు.


రష్యా నుంచి చమురు కొనుగోలు వద్దని మన దేశాన్ని అమెరికా వత్తిడి చేస్తోంది. దాన్ని తెరవెనుక నుంచి చూస్తే తమ నుంచి ఇంకా ఎక్కువ మొత్తం కొనుగోలు చేసి తమ కార్పొరేట్లకు లబ్ది చేకూర్చాలన్న వత్తిడి కనిపిస్తుంది. రాయిటర్స్‌ వార్తా సంస్ద పేర్కొన్న సమాచారం ప్రకారం జనవరితో పోలిస్తే ఫిబ్రవరిలో అమెరికా నుంచి మన దేశం కొనుగోలు చేసే చమురు 48శాతం పెరిగింది. దీంతో మన దేశం దిగుమతి చేసుకొనే చమురువాటా అమెరికా నుంచి 14శాతానికి చేరింది. దశాబ్దాల తరబడి మనతో సత్సంబంధాలు కలిగి ఉన్న పశ్చిమాసియా దేశాల నుంచి చమురు కొనుగోలు తగ్గించి అమెరికా వైపు నరేంద్రమోడీ సర్కార్‌ మొగ్గటానికి రాజకీయ కారణాలు, అమెరికా చమురు కంపెనీల ప్రభావం ప్రధాన కారణం. మన దిగుమల్లో ఇరాక్‌ ప్రధమ స్ధానంలో ఉండగా ఇప్పటివరకు రెండవదిగా ఉన్న సౌదీ అరేబియాను ఇప్పుడు అమెరికా వెనక్కు నెట్టేసింది. గతంలో చమురు దిగుమతి దేశంగా ఉన్న అమెరికా ఇప్పుడు ఎగుమతిదారుగా మారింది. అందువలన అక్కడి కార్పొరేట్లకు మార్కెట్‌ను సంపాదించేందుకు వైట్‌హౌస్‌లో పాలకులు ఎవరున్నా ఒకేదెబ్బతో అనేక దేశాలను తమ ఖాతాదారులుగా మార్చుకొనేందుకు పూనుకున్నారు.


మన కంటే ఎక్కువ మొత్తం దిగుమతి చేసుకొనే చైనాకు అమెరికాతో ఉన్న వైరం కారణంగా అది దిగుమతి చేసుకోవటం లేదు. మన దేశం ఇప్పటికే అమెరికా వలలో పడింది. మధ్యప్రాచ్య లేదా పశ్చిమాసియా నుంచి మన దిగుమతుల్లో 52.7శాతం ఉండగా ఆఫ్రికా నుంచి 15, అమెరికా నుంచి 14శాతం ఉంది. వీటితో పోల్చుకుంటే రష్యానుంచి దిగుమతి చేసుకుంటున్నది 1-2శాతం మధ్యలో ఉంది. దీన్ని కూడా నిలిపివేయాలని మన నరేంద్రమోడీని అమెరికా ఆదేశిస్తున్నది. మన దేశ ఎగుమతుల్లో నాలుగో వంతు శుద్ది చేసిన చమురు లేదా చమురు ఉత్పత్తులు ఉన్నాయి. అందువలన చమురు శుద్ది కంపెనీలు రష్యానుంచి తక్కువ ధరలకు దిగుమతి చేసుకుంటే ఎగుమతులకు దాన్ని వినియోగిస్తే ఆ కంపెనీలకు లాభం. ఐరోపా దేశాలు రష్యా నుంచి ఇంధన కొనుగోళ్లను నిలిపివేస్తే ఐరోపా మార్కెట్లో పాగావేసేందుకు అమెరికా పూనుకుందన్నది స్పష్టం. ప్రపంచంలో చైనా తరువాత రెండో పెద్ద దిగుమతిదారుగా ఉన్న మన మార్కెట్‌ను కూడా కబళించేందుకు పూనుకుంది. బహుశా ఆ ఎత్తుగడతో కూడా రష్యాను మన నుంచి వేరే చేసేందుకు పూనుకున్నట్లు భావించవచ్చు. అమెరికా, ఇతర పశ్చిమ దేశాల పాటలకు(ఆంక్షలకు) అనుగుణంగా ఇప్పటికే మనదేశంతో నరేంద్రమోడీ డాన్స్‌ చేయిస్తున్నారు. దాన్లో óభాగంగానే ఇరాన్‌, వెనెజుల నుంచి చమురు కొనుగోళ్లను ఆపివేశారు. గతంలో వెనెజులా నుంచి మన అవసరాల్లో 12శాతం, ఇరాన్‌ నుంచి ఆరుశాతం దిగుమతి చేసుకున్న ఉదంతాలున్నాయి.ఇలా లొంగిపోయిన కారణంగానే ఇప్పుడు రష్యా నుంచి కొనుగోలు వద్దనే ధైర్యం అమెరికాకు వచ్చింది.


మరో వైపు అదే అమెరికా చేస్తున్నదేమిటి ? రాయిటర్స్‌ మార్చి ఎనిమిదవతేదీ వార్తా కథనం ప్రకారం అమెరికా 2021లో రోజుకు 6,72,000 పీపాల ముడి చమురు లేదా చమురు ఉత్పత్తులను రికార్డు స్దాయిలో రష్యానుంచి దిగుమతి చేసుకుంది. దీనిలో 1,99,000 పీపాల చమురు ఉంది. అమెరికా గల్ఫ్‌ తీరంలో వచ్చిన భారీ తుపాన్ల కారణంగా దిగుమతులను ఎక్కువగా చేసుకున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో ఆంక్షలతో నిమిత్తం లేకుండానే రోజుకు 57వేల పీపాలకు కొనుగోళ్లను తగ్గించి, తిరిగి లక్ష పీపాలకు పెంచినట్లు వార్తలు.ఈ నెల 22లోగా లావాదేవీలను నిలిపివేయాలని అమెరికా ఆర్ధికశాఖ కోరింది. మనం వెంటనే కొనుగోలు నిలిపివేయాలని చెబుతున్న పశ్చిమ దేశాల్లో ఒకటైన బ్రిటన్‌ తాను మాత్రం ఈ ఏడాది చివరి నాటికి దశలవారీగా రష్యా దిగుమతులను నిలిపివేస్తుందట.


తాజాగా అమెరికా తమ నుంచి కొనుగోళ్ల మొత్తాన్ని 43శాతం పెంచినట్లు రష్యా భద్రతామండలి ఉప కార్యదర్శి మిఖాయిల్‌ పొపోవ్‌ ఏప్రిల్‌ మూడున చెప్పాడు. రోజుకు లక్ష పీపాలు దిగుమతి చేసుకుంటున్నట్లు, అత్యవసర వస్తువుల కింద మినరల్‌ ఎరువులను దిగుమతి కూడా చేసుకోవచ్చని అమెరికా కంపెనీలకు అనుమతిచ్చినట్లు తెలిపాడు. అమెరికా వద్ద చమురు పెద్ద మొత్తంలో ఉన్నప్పటికీ అక్కడి చమురుశుద్ది సంస్ధలకు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకొనే ముడిచమురుతో లాభాలు ఎక్కువగా వస్తున్నందున దిగుమతి చేసుకొని దాన్ని ఇతర దేశాలకు అధిక ధరలకు అమ్ముకొని లబ్ది పొందుతున్నాయి. అందుకే 2014 నుంచి అమెరికా సర్కార్‌ రష్యా మీద అనేక ఆంక్షలను విధించినప్పటికీ చమురు జోలికి పోలేదు. బైడెన్‌ ప్రకటించినట్లు నిజంగానే అమెరికా పూర్తి నిషేధం అమల్లోకి వస్తే అక్కడి కార్పొరేట్‌ శక్తులు అంగీకరిస్తాయా ? తమ మార్కెట్‌ను అమెరికాకు అప్పగిస్తే వచ్చే పర్యవసానాలను ఐరోపా దేశాలు ఆలోచించుకోవా ? చూద్దాం !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

జాడలేని అపర జాతీయవాదులు – ఆచూకీ లేని ఆత్మగౌరవం !

02 Saturday Apr 2022

Posted by raomk in CHINA, Current Affairs, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, RUSSIA, USA, WAR

≈ 1 Comment

Tags

BJP, imran khan, Narendra Modi Failures, RSS, Russia-Ukraine War, US, US Coup-Pak, US imperialism, US Threatens India

నాడు సావర్కర్‌కు ఎత్తుగడ బొంకు – నేడు నరేంద్రమోడీకి దేశ హితం సాకు !



ఎం కోటేశ్వరరావు


పొరుగుదేశమైన పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ ప్రభుత్వం పతనపు అంచుల్లో ఉంది. ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొంటాను తప్ప రాజీనామా చేసేది లేదని ఇమ్రాన్‌ చెప్పాడు. ఆదివారం నాడు ఓటింగ్‌ జరిగేలోపల ఏమైనా జరగవచ్చు. అనూహ్య పరిణామాలు జరిగితే తప్ప ఇమ్రాన్‌ పదవి పోవటం ఖాయంగా కనిపిస్తోంది.2018 జూలై 25న జరిగిన ఎన్నికల్లో 31.82శాతం ఓట్లతో 342 స్ధానాలున్న జాతీయ అసెంబ్లీ (పార్లమెంటు)లో 149 స్ధానాలతో ఇమ్రాన్‌ఖాన్‌ నాయకత్వంలోని పాకిస్తాన్‌ తెహరిక్‌ ఏ ఇన్సాఫ్‌(పిటిఐ) పెద్ద పక్షంగా అవతరించింది. ప్రభుత్వ ఏర్పాటుకు 172 స్దానాలు అవసరం కాగా ఏడు చిన్న పార్టీలు, ఒక స్వతంత్రుడి మద్దతుతో 176 ఓట్లతో ఇమ్రాన్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. వాటిలో కొన్ని పార్టీలు మద్దతు ఉపసంహరించుకోవటంతో మద్దతు ప్రస్తుతం 164కు పడిపోయింది. స్వంత పార్టీవారే కొందరు తిరుగుబాటును ప్రకటించటంతో ఓటింగ్‌ సమయానికి ఇంకా తగ్గవచ్చు. గడువు ప్రకారం తదుపరి ఎన్నికలు 2023 అక్టోబరు 12లోగా జరగాల్సి ఉంది. అవిశ్వాస తీర్మానాన్ని ఉపసంహరించుకుంటే ఆగస్టునాటికి ఎన్నికలు జరుపుతానని ఇమ్రాన్‌ ప్రతిపక్షాలకు సందేశం పంపాడు. ఓటింగ్‌ జరిగేలోగా పార్లమెంటును రద్దు చేస్తే ఏం జరుగుతుందో చెప్పలేము.


ఇమ్రాన్‌ఖాన్‌పై ఆకస్మికంగా ఈ తిరుగుబాటు ఎందుకు వచ్చిందన్నది ప్రశ్న. ఎప్పటి నుంచో ఆర్ధికరంగంలో అనిశ్చితి కొనసాగుతోంది. కొత్తగా వచ్చిన వైఫల్యాలు లేవు.పోనీ కొత్త ప్రభుత్వం వస్తే తెల్లవారేసరికి పరిష్కారం అవుతాయా అంటే కావు. తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా పశ్చిమదేశాలు కుట్ర చేస్తున్నాయంటూ ఇమ్రాన్‌ ఒక లేఖను మంత్రులకు చూపాడు. దాన్నే ఒక బహిరంగసభలో కూడా ప్రదర్శించారు. కుట్రచేస్తున్న దేశం అమెరికా అని చెప్పి వెంటనే కాదు నోరు జారింది ఒక పశ్చిమ దేశం అని సవరించుకున్నాడు. జనానికి, ప్రపంచానికి వెళ్లాల్సిన సందేశాన్ని పంపి ఎత్తుగడగా నోరు జారిందని చెప్పాడన్నది వేరే చెప్పనవసరం లేదు. అంతకు ముందే మీడియాకు లీకు చేయటం అమెరికా ఖండించటం వంటి పరిణామాలు జరిగాయి.


సోవియట్‌ పతనం తరువాత మన దేశం క్రమంగా అమెరికా వైపు మొగ్గుచూపటం ప్రారంభమైంది. భారత ఉపఖండంలో భారత్‌ ఎంత కీలక స్ధానంలో ఉందో పాకిస్తాన్‌ కూడా వ్యూహాత్మకంగా అంతే ప్రాధాన్యత కలిగి ఉంది. అందుకే రెండు దేశాలను చెరోచంకన ఎక్కించుకొని తన పబ్బంగడుపుకోవాలన్నది అమెరికా ఎత్తుగడ. మారుతున్న పరిణామాల నేపధ్యంలో అది దానికి సాధ్యం కావటంలేదు. రష్యా, చైనాలవైపు ఇటీవలి కాలంలో పాక్‌ మొగ్గుదల ఉంది. ఇంతకాలం దాగుడుమూతలాడినా ఉక్రెయిన్‌-రష్యా వివాదం ఒక స్పష్టమైన వైఖరిని ప్రదర్శించాల్సిన అగత్యాన్ని ముందుకు తెచ్చింది. జోబైడెన్‌ అధికారం స్వీకరించిన తరువాత ఇంతవరకు ఇమ్రాన్‌తో మాటల్లేవు. వివాదం ముదురుతుండగా ఇమ్రాన్‌ ఖాన్‌ రష్యా పర్యటన జరిపి తాము పుతిన్‌వైపే ఉన్నట్లు చెప్పటం, ఐరాసలో తటస్ధ వైఖరి తీసుకోవటం వంటి పరిణామాలు అమెరికా అగ్రరాజ్య దురహంకారాన్ని రెచ్చగొట్టాయి. దాంతో తనకు వెన్నతో పెట్టి విద్యను ప్రయోగించి తనతో చేతులు కలపని వారికి ఏ గతి పడుతుందో చూడండనే సందేశాన్ని మిగతా దేశాలకు ఇస్తోంది. అదే పాక్‌ పరిణామాలకు కారణం. పది సంవత్సరాల క్రితం ఉక్రెయిన్‌ పాలకులు రష్యావైపు మొగ్గినపుడు అక్కడ సిఐఏతో కుట్రలు చేయించి ప్రభుత్వాన్ని కూలదోశారు. అనేక దేశాల్లో ఇదే జరిగింది. పాక్‌ మాదిరి మన దేశం, చైనాతో ఒకే గేమ్‌ ఆడాలంటే కుదరదు. అందుకే వేర్వేరు ఆటలు ఆడుతోంది.


రష్యాను ఖండించేందుకు తమతో గొంతుకలపాలన్న పశ్చిమ దేశాల మీద మార్చి ఆరవ తేదీన ఒక బహిరంగసభలో ఇమ్రాన్‌ ఖాన్‌ మాట్లాడుతూ మా గురించి ఏమనుకుంటున్నారు, మీరు చెప్పింది చేసేందుకు మీ బానిసలమా అని ప్రశ్నించాడు. మన దేశాన్ని అమెరికా బెదిరించినా, వణుకుతన్నదని ఎద్దేవా చేసినా ప్రధాని నరేంద్రమోడీ స్పందించలేదు. భారతీయ సంతతికి చెందిన అధికారి చేతనే మన దేశాన్ని బెదిరించటం తాజా ఉదంతం. చైనా గనుక వాస్తవాధీన రేఖను అతిక్రమించితే రష్యా సాయపడదని, ఎందుకంటే వారి మధ్య హద్దులు లేని భాగస్వామ్యం ఉందని అమెరికా జాతీయ భద్రతా ఉప సలహాదారు దలీప్‌ సింగ్‌ మన దేశాన్ని బెదిరించాడు. రష్యా మీద తాము విధించిన ఆంక్షలను ఎవరైనా అతిక్రమించినట్లైతే పర్యవసానాలను ఎదుర్కోవాల్సి ఉంటుందన్నాడు. అమెరికా, ఇతర దేశాలు అంతర్జాతీయంగా ఆంక్షలు విధించిన ఇంధనం, ఇతర వస్తువులను రష్యా నుంచి ఎక్కువగా భారత్‌ దిగుమతి చేసుకోవటాన్ని తాము కోరుకోవటం లేదన్నాడు.” స్నేహ స్ఫూర్తితో మా ఆంక్షల తీరుతెన్నుల గురించి వివరించేందుకు, ఉభయుల ప్రయోజనాలను మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు కట్టుబడి ఉన్నట్లు (భారత్‌) మాతో కలసి చెప్పాల్సిన ప్రాధాన్యతను స్పష్టం చేసేందుకు నేను ఇక్కడకు వచ్చాను. అవును ఆంక్షలకు తూట్లు పొడిచినా లేదా వమ్ము చేసినా అలాంటి దేశాలు పర్యవసానాలను అనుభవించాల్సి ఉంటుందని స్పష్టం చేస్తున్నా, ఆంక్షలకు ప్రత్నామ్నాయంగా చెల్లింపుల కోసం భారత్‌-రష్యా చేస్తున్న యత్నాలను కూడా గమనిస్తున్నామని ” అన్నాడు.


అంతేనా ! ” స్నేహితులు పరిమితులను విధించరాదు. డాలరు ప్రాతిపదికగా ఉన్న ద్రవ్య వ్యవస్ధను బేఖాతరు చేసి రూబుల్‌ను ముందుకు తెచ్చేందుకు చేస్తున్న మంత్రాంగాలు చేయవద్దు, మేము అన్ని దేశాలను ప్రత్యేకించి మా మిత్రదేశాలు, భాగస్వాములను చాలా సునిశితంగా పరిశీలిస్తున్నాం. చైనాతో సంబంధాల్లో రష్యా ఒక చిన్న భాగస్వామిగా మారబోతోంది. చైనా పైచేయి సాధిస్తుంది. అది భారత్‌కు అంతమంచిది కాదు.చైనా గనుక వాస్తవాధీన రేఖను మరోసారి అతిక్రమించితే భారత రక్షణకు రష్యా ముందుకు వస్తుందని ఎవరైనా అనుకుంటారని నేను భావించటం లేదు.” అన్నాడు.


దలీప్‌ సింగ్‌ మాటలు దౌత్య సాంప్రదాయాలకు లేదా ఇద్దరు స్నేహితుల సంబంధాలకూ విరుద్దమని ఐరాసలో భారత మాజీ రాయబారి సయ్యద్‌ అక్బరుద్దీన్‌ ఖండించారు. ఒక ట్వీట్‌తో పాటు ఇండియా టుడే టీవీతో కూడా మాట్లాడారు.” అమెరికా వంటి ఒక మిత్రదేశం ఇలాంటి మొరటు దౌత్యాన్ని ప్రదర్శిస్తుందని ఊహించలేదు. ప్రపంచం నేడు శాంతిగా లేదు, నిజానికి ముక్కలు కాబోతున్నది. ఇటువంటి స్ధితిలో ప్రతివారు తమ స్ధానాన్ని గరిష్టంగా పటిష్టపరచుకొనేందుకు పూనుకోవటం సహజం.ఉక్రెయిన్లో మిలిటరీ వివాదాలతో పాటు ఒక విధంగా అసాధారణ రీతిలో ఆయుధీకరణ వంటి వాటికి కూడా పూనుకుంటున్నారు.అసాధారణ రీతిలో ఒక జి20దేశం మీద ఆంక్షలు విధించారు. పరస్పర ఆధారితమైన ప్రపంచం మీద దీని ప్రభావాలు తప్పకుండా ఉంటాయి. ఒక ఆయుధంగా ఆంక్షలు విధించటం ఇదే తొలిసారి కాదు. అంతర్జాతీయచట్టం ముందు అవి నిలిచేవి కాదని ఈ కుర్రవాడికి(దలీప్‌ సింగ్‌) ఎవరో ఒకరు చెప్పాలి.తమ ప్రయోజనాల కోసం కొన్ని దేశాలు వీటిని ఉపయోస్తాయి. అమెరికా చేస్తున్నదాన్నే కొన్ని ఐరోపా దేశాలూ చేస్తున్నాయి. సంబంధం లేని భారత్‌ వంటి దేశాలకు అవి ఆందోళన కలిగిస్తాయి, దూరంగా ఉన్నా మనం ప్రభావితులం అవుతున్నాము. ఇలాంటి వాటి గురించి మనకు వివరించేందుకు అమెరికా ఒక రాయబారిని పంపటం బానే ఉంది. అయితే సదరు దలీప్‌ సింగ్‌ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరం, అవి దౌత్య సంప్రదాయాలు, స్నేహ సంబంధాలకు విరుద్దం. దౌత్యంలో, భారత్‌ వంటి దేశాలతో వ్యవహరించేటపుడు కాస్త లౌక్యంగా ఉండాలని ఆ కుర్రవాడికి చెబుతున్నాను. ఇది జులం తప్ప దౌత్యపరిభాష కాదు.” అని అక్బరుద్దీన్‌ స్పష్టం చేశారు. సంక్షోభ సమయాల్లో దేశాల ప్రభుత్వాలు తమ పౌరులకు ఏది మంచిదనే చూస్తాయి, ఐరోపా దేశాలు రష్యానుంచి ఇంధన కొనుగోలు చేస్తూనే ఉన్నాయని ఏ దేశం పేరూ ప్రస్తావించకుండా మన విదేశాంగ మంత్రి జైశంకర్‌ వ్యాఖ్యానించారు. ఇతరత్రా ఎలాంటి స్పందన లేదు.


అమెరికా బెదిరింపులు, మన దేశ అధికారిక స్పందన తీరు తెన్నులు చూస్తే జాతీయ వాదుల జాడ ఎక్కడా కనిపించటం లేదు, ఆత్మగౌరవం ఆచూకీ కనిపించటం లేదు. ఎవరి ఛాతీ పొంగటం లేదు. ఎందుకీ పరిస్ధితి ? దీన్ని చూస్తే విడి సావర్కర్‌ బ్రిటీష్‌ వారికి రాసిన ప్రేమ (లొంగుబాటు ) లేఖలు గుర్తుకు వస్తున్నాయి. అవి బయపడిన తరువాత అప్పటి వరకు వీరుడు శూరుడు అంటూ పొగిడిన వారు సమర్ధించుకోలేక జైలు నుంచి బయటకు వచ్చి తిరిగి స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనేందుకు ఒక ఎత్తుగడగా లేఖలు రాసినట్లు కొందరు టీకా తాత్పర్యం చెప్పారు. పోనీ అదే నిజమైతే తరువాత ఎక్కడా పాల్గొన్నదాఖలాలు లేవెందుకంటే నోట మాటలేదు. మన సర్కార్‌ను అమెరికా, దాని మిత్రదేశాలు బెదిరిస్తుంటే ఇప్పుడు నరేంద్రమోడీ మౌనం దాలుస్తున్నారు. ఏమిటంటే ప్రజల కోసం మౌనం తప్ప చేతకాక కాదని భక్తులు సమర్ధిస్తున్నారు.గతంలో కూడా అమెరికా చేసిన అవమానాన్ని నరేంద్రమోడీ భరించారు. పోనీ దానివలన మన జనానికి కలిగిన మేలు ఏమిటో ఎవరైనా చెప్పగలరా ? మలేరియా చికిత్సకు మనం తయారు చేసే హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ మాత్రలు కరోనా చికిత్సకు పనికి వస్తాయని కొందరు చెప్పారు. అది నిర్దారణ కాలేదు, వాటిని తమకు సరఫరా చేయకపోతే ప్రతికూల చర్యలు తీసుకుంటామని డోనాల్డ్‌ ట్రంప్‌ మన దేశాన్ని బెదిరించగానే నిషేధాన్ని సడలించిన నరేంద్రమోడీ తీరుతెన్నులను చూశాము.అదే అమెరికా మనకు కావాల్సిన కరోనా వాక్సిన్‌ తయారీకి అవసరమైన ముడిపదార్దాలు, పరికరాల ఎగుమతులపై నిషేధం విధించినపుడు మౌనం దాల్చటం తప్ప చేసిందేమీ లేదు. కనీస మద్దతు ధరలకు వ్యతిరేకంగా ప్రపంచ వాణిజ్య సంస్ధలో కేసు వేసింది. ఇలాంటి అనేక ఉదంతాలను చెప్పవచ్చు.అమెరికా, బెదిరింపులకు దిగుతున్న ఇతర దేశాలపై ఎదురుదాడికి దిగమని ఎవరూ చెప్పటం లేదు, కనీస నిరసన తెలపాల్సిన అవసరం లేదా ? ఆత్మగౌరవ ఆచూకీ లేదని, మన అపర జాతీయవాదుల జాడ ఎక్కడా కనిపించటం లేదంటే కాదని ఎవరైనా చెప్పగలరా !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...
← Older posts

Recent Posts

  • చమురు పన్ను తగ్గింపు : శ్రీలంక దెబ్బతో నరేంద్రమోడీ అదిరి పడ్డారా !
  • ప్రపంచాన్ని భయపెడుతున్న మంకీపాక్స్‌ వెనుక అమెరికా హస్తం ఉందా ?
  • హజ్‌ యాత్రీకుల కోసం నరేంద్రమోడీ పైరవీ – విజయన్‌పై నోరు పారవేసుకున్న పిసిసినేత !
  • ఇండోనేషియా కమ్యూనిస్టు ఊచకోత వెనుక బ్రిటన్‌ !
  • వందేళ్ల చైనా కమ్యూనిస్టు యూత్‌లీగ్‌ !

Recent Comments

raomk on రంగనాయకమ్మ గారూ”కుహనా మి…
యూహెచ్ ప్రీతమ్ on రంగనాయకమ్మ గారూ”కుహనా మి…
V.S.Srinivasa Babu on జాడలేని అపర జాతీయవాదులు…
K Seenaih on రష్యా – ఉక్రెయిన్‌ యుద్ధ…
K Seenaih on రష్యా – ఉక్రెయిన్‌ యుద్ధ…

Archives

  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • చమురు పన్ను తగ్గింపు : శ్రీలంక దెబ్బతో నరేంద్రమోడీ అదిరి పడ్డారా !
  • ప్రపంచాన్ని భయపెడుతున్న మంకీపాక్స్‌ వెనుక అమెరికా హస్తం ఉందా ?
  • హజ్‌ యాత్రీకుల కోసం నరేంద్రమోడీ పైరవీ – విజయన్‌పై నోరు పారవేసుకున్న పిసిసినేత !
  • ఇండోనేషియా కమ్యూనిస్టు ఊచకోత వెనుక బ్రిటన్‌ !
  • వందేళ్ల చైనా కమ్యూనిస్టు యూత్‌లీగ్‌ !

Recent Comments

raomk on రంగనాయకమ్మ గారూ”కుహనా మి…
యూహెచ్ ప్రీతమ్ on రంగనాయకమ్మ గారూ”కుహనా మి…
V.S.Srinivasa Babu on జాడలేని అపర జాతీయవాదులు…
K Seenaih on రష్యా – ఉక్రెయిన్‌ యుద్ధ…
K Seenaih on రష్యా – ఉక్రెయిన్‌ యుద్ధ…

Archives

  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • చమురు పన్ను తగ్గింపు : శ్రీలంక దెబ్బతో నరేంద్రమోడీ అదిరి పడ్డారా !
  • ప్రపంచాన్ని భయపెడుతున్న మంకీపాక్స్‌ వెనుక అమెరికా హస్తం ఉందా ?
  • హజ్‌ యాత్రీకుల కోసం నరేంద్రమోడీ పైరవీ – విజయన్‌పై నోరు పారవేసుకున్న పిసిసినేత !
  • ఇండోనేషియా కమ్యూనిస్టు ఊచకోత వెనుక బ్రిటన్‌ !
  • వందేళ్ల చైనా కమ్యూనిస్టు యూత్‌లీగ్‌ !

Recent Comments

raomk on రంగనాయకమ్మ గారూ”కుహనా మి…
యూహెచ్ ప్రీతమ్ on రంగనాయకమ్మ గారూ”కుహనా మి…
V.S.Srinivasa Babu on జాడలేని అపర జాతీయవాదులు…
K Seenaih on రష్యా – ఉక్రెయిన్‌ యుద్ధ…
K Seenaih on రష్యా – ఉక్రెయిన్‌ యుద్ధ…

Archives

  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Follow Following
    • vedika
    • Join 921 other followers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Customize
    • Follow Following
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d bloggers like this: