• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: INTERNATIONAL NEWS

రష్యా, చైనాలపై దాడే 48వ జి7 శిఖరాగ్ర సభ లక్ష్యం !

30 Thursday Jun 2022

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, RUSSIA, UK, USA

≈ Leave a comment

Tags

48th G7 summit, G7 summit 2022, Joe Biden, Narendra Modi


ఎం కోటేశ్వరరావు


జూన్‌ 26 నుంచి 28వ తేదీ వరకు జర్మనీలోని బవేరియా ఆల్ఫ్స్‌ ప్రాంతంలోని ఎలమౌ కాజిల్‌ రిసార్ట్‌లో 48వ జి7 శిఖరాగ్ర సమావేశం జరిగింది. ” ధర్మ బద్ధ ప్రపంచం వైపు పురోగమనం ” అనే ఇతివృత్తంతో దీన్ని నిర్వహించారు. ఈ సభ కొనసాగింపుగా 29-30 తేదీల్లో స్పెయిన్లోని మాడ్రిడ్‌ నగరంలో నాటో కూటమి సమావేశాలను ఏర్పాటు చేశారు. జి7 సమావేశానికి మన ప్రధాని నరేంద్రమోడీతో పాటు అర్జెంటీనా, దక్షిణ ఆఫ్రికా, ఇండోనేషియా, సెనెగల్‌ దేశాధినేతలను కూడా ఆహ్వానించారు. ఎడతెగని, ఎప్పుడూ ఉండే,ఎవరూ పాటించని పర్యావరణం, ఉగ్రవాద నిరోధం, ఆహార భద్రత వంటి అంశాల గురించి ఈ సమావేశంలో సుభాషితాలను పక్కన పెడితే రెండు కీలక అంశాల మీద అమెరికా పెత్తనంలోని ఈ కూటమి కేంద్రీకరించిందని చెప్పవచ్చు. అవి రష్యా మీద మరిన్ని ఆంక్షలు, చైనాను నిలువరించే పధకాలు. ఉక్రెయిన్‌ మీద రష్యా ప్రారంభించిన సైనిక చర్య ఐదవ నెలలో ప్రవేశించింది. ఇప్పటికే తూర్పున ఉన్న డాన్‌బాస్‌ ప్రాంతాన్ని, కీలక రేవులు, పారిశ్రామిక ప్రాంతాల నుంచి ఉక్రెయిన్‌ మిలిటరీ, దానితో కలసి ప్రతిఘటిస్తున్న కిరాయి మూకలను ఆ ప్రాంతం నుంచి రష్యా తరిమివేసింది. కొత్త ప్రాంతాలకు దాడులను విస్తరించింది.చమురు ఎగుమతులపై విధించిన ఆంక్షలు పెద్దగా ప్రభావం చూపకపోవటంతో బంగారం కొనుగోళ్లను నిలిపివేయాలని జి7 కూటమి పిలుపునిచ్చింది. దీంతో పాటు మరిన్ని ఆయుధాలను పంపాలని నిర్ణయించింది.


నవంబరులో జరిగే పార్లమెంటు ఎన్నికలలో అధికార డెమోక్రటిక్‌ పార్టీకి దెబ్బతగుల నుందన్న వార్తల నేపధ్యంలో లబ్దిపొందేందుకు జో బైడెన్‌ ఈ సమావేశాలను వినియోగించుకున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది ఒక అంశం మాత్రమే అని చెప్పవచ్చు. ఉక్రెయిన్‌ మిలిటరీ అనేక ప్రాంతాల నుంచి వెనుదిరుగుతున్న పూర్వరంగంలో అనేక దేశాలు పునరాలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నందున నాటో కూటమి, ఇతర దేశాలను నిలువరించేందుకు అమెరికా పూనుకుంది. రష్యా నుంచి బంగారం దిగుమతులపై నిషేధం కేవలం ఒక ప్రచార అస్త్రం తప్ప రష్యా మీద పెద్దగా ప్రభావం పడదని విశ్లేషకులు చెబుతున్నారు. గతేడాది 15.5బిలియన్‌ డాలర్ల మేరకు అక్కడి నుంచి ఎగుమతులు జరిగాయి. ప్రపంచంలో పదిశాతం( 2021లో 333.4 టన్నులు) బంగారాన్ని ఉత్పత్తి చేస్తూ రష్యా రెండవ స్థానంలో ఉండగా 370 టన్నులతో చైనా ప్రధమ స్థానంలో ఉంది.రష్యా నుంచి దిగుమతులు చేసుకొనే దేశాల్లో మనది కూడా ఒకటి. దాని ఎగుమతులపై నిషేధం వలన చమురు ధరలు పెరిగినట్లుగానే బంగారం ధరలు, వాటితో పాటు ద్రవ్యోల్బణం కూడా పెరగవచ్చు. చమురును ఇతర దేశాలకు ఎగుమతి చేసినట్లుగానే బంగారానికి కూడా మార్కెట్లను రష్యా చూసుకుంటుందని చెబుతున్నారు.


తాము సృష్టించిన ఉక్రెయిన్‌ సంక్షోభాన్ని మరింత ఎగదోసేందుకు తప్ప పరిష్కరించేందుకు జి7 సమావేశం ఎలాంటి చొరవ చూపలేదు. రానున్న ఐదు సంవత్సరాల కాలంలో లాభాలు వచ్చే పధకాలపై పెట్టుబడులకు 600బిలియన్‌ డాలర్లు సేకరించాలని ఈ సమావేశం పిలుపునిచ్చింది తప్ప అనేక దేశాల్లో తలెత్తిన ఆకలి మంటల గురించి ధనిక దేశాలు పట్టించుకోలేదు. ఆసాధారణ ప్రపంచ ఆకలి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నామని, ప్రపంచ ఆహార మార్కెట్‌ను స్థిరంగా ఉండేట్లు చూడాలని, ధరల ఒడిదుడుకులను నివారించాలని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుట్రెస్‌ జి7 కూటమిని కోరారు. ప్రపంచ గోధుమ ఎగుమతుల్లో 29శాతం వాటా కలిగిన ఉక్రెయిన్‌, రష్యాల నుంచి ఎగుమతుల పునరుద్దరణకు ప్రభావశీలమైన పరిష్కారాన్ని కనుగొనకపోతే ప్రయోజనం ఉండదని స్పష్టం చేశారు. నేతలు తమ ప్రసంగాల్లో ఆహార భద్రత గురించి ప్రస్తావించటం తప్ప నిర్దిష్ట చర్యలు లేవు. ఉక్రెయిన్‌ రేవుల్లో నిలిచిన రవాణా పునరుద్దరణ, తమ దేశం నుంచి ఎరువులు, ఆహార ధాన్యాల ఎగుమతులకు విధించిన ఆంక్షల ఎత్తివేతతో పాటు సముద్రాల్లో ఉక్రెయిన్‌ ఏర్పాటు చేసిన మందుపాతరలను తొలగించాలని రష్యా డిమాండ్‌ చేస్తోంది.


ప్రపంచంలో వివిధ దేశాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆరువందల బిలియన్‌ డాలర్లు సేకరించాలని జి7 కూటమి నిర్ణయింది. ఈ మొత్తం చైనాను అడ్డుకొనేందుకు అని ఎక్కడా చెప్పకపోయినా దాని బిఆర్‌ఐ పధకాన్ని అడ్డుకొనేందుకే అని మీడియా పేర్కొన్నది. ప్రపంచ మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల కోసం భాగస్వామ్యం(పిజిఐఐ) అనే పేరుతో ఒక పధకాన్ని అమలు జరపాలని గతేడాది లండన్‌ సమావేశంలోనే ఒక పధకాన్ని ఈ కూటమి ప్రకటించింది. ఇప్పుడు 2027నాటికి ఆరువందల బిలియన్లతో ఒక నిధిని ఏర్పాటు చేయాలని సంకల్పం చెప్పుకున్నారు. ఇది చైనా 2013 నుంచి అమలు చేస్తున్న బిఆర్‌ఐ పధకానికి పోటీగా పరిగణిస్తున్నారు. ఇదేదో దయా-ధర్మం కాదు దీనిలో పెట్టుబడులు పెట్టిన వారందరికీ అమెరికన్లతో సహా అందరికీ ఫలితాలు ఉండాల్సిందే అని స్పష్టం చేస్తున్నా అని జో బైడెన్‌ చెప్పారు.అభివృద్ధి చెందుతున్న దేశాలలో అవసరమైన మౌలిక, ఆధునిక వసతుల కల్పనకు 40లక్షల కోట్ల డాలర్లు అవసరమని అంచనా. తాము 200 బిలియన్‌ డాలర్లు ఇస్తామని అమెరికా చెబుతుండగా తాము 317బి.డాలర్లు సమకూర్చుతామని ఐరోపా సమ్యాఖ్య పేర్కొన్నది.


అసలు జి 7 అంటే ఏమిటన్న ప్రశ్న కొంతమందికైనా తలెత్తటం సహజం.అమెరికా,జపాన్‌, కెనడా, నెదర్లాండ్స్‌తో తలెత్తిన వివాదంలో ఆ దేశాలకు చమురు సరఫరాలపై నిషేధం విధిస్తున్నట్లు ఒపెక్‌ దేశాలు చేసిన ప్రకటన 1973లో చమురు సంక్షోభానికి దారి తీసింది. దాన్నుంచి బయడపడేందుకు ధనికదేశాల ఆలోచన నుంచి పుట్టిందే జి7. చమురు, విత్త సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ధనిక దేశాలు ఉమ్మడిగా చేసిన ఆలోచనకు ఒక రూపమే 1975లో ఏర్పడిన ఈ దేశాల బృందం. నాటి ఫ్రెంచి అధ్యక్షుడు వాలెరీ గిస్కార్డ్‌, జర్మన్‌ ఛాన్సలర్‌ హెల్మట్‌ స్మిత్‌ చొరవతో పారిస్‌లో అమెరికా,బ్రిటన్‌,ఫ్రాన్స్‌, జర్మనీ, ఇటలీ, జపాన్‌ నేతలు తొలి సమావేశం జరిపారు.మరుసటి ఏడాది కెనడా, 1998లో రష్యా చేరింది. దాంతో అది జి8గా మారింది. 2014లో ఉక్రెయిన్‌ ఏలుబడిలో ఉన్న క్రిమియా ప్రాంతాన్ని రష్యా స్వాధీనం చేసుకోవటంతో ఆ బృందం నుంచి తొలగించిన తరువాత తిరిగి జి7గా మారింది.1981 నుంచి ఐరోపా సమాఖ్య(ఇయు)ను శాశ్వత ఆహ్వానిత సంస్థగా మార్చారు. ప్రతి సంవత్సరం ఒక సభ్యదేశ ఆతిధ్యంలో శిఖరాగ్ర సమావేశాలు జరుగుతాయి.సహజంగా ఆ దేశాధినేతలే ఏడాది పాటు అధ్యక్ష స్థానంలో ఉంటారు. ఈ బృందానికి ఒక కేంద్ర స్థానం లేదా శాశ్వత సిబ్బందిగానీ ఉండరు. ఇప్పటి వరకు గత ఎనిమిది సంవత్సరాల్లో నరేంద్రమోడీ మూడు సమావేశాల్లో పాల్గొన్నారు. అంతకు ముందు మన్మోహన్‌ సింగ్‌ పదేండ్ల కాలంలో ఐదు సార్లు అతిధిగా వెళ్లారు. ఎవరు అధికారంలో ఉన్నప్పటికీ ప్రపంచ రాజకీయాలు, ఆర్ధిక రంగంలో మన దేశానికి ఉన్న ప్రాధాన్యత రీత్యా మన దేశానికి ప్రతిదేశం ఆహ్వానం పలుకుతోంది. గత ఎనిమిదేండ్లలో మూడు సార్లు ఆహ్వానించటం నరేంద్రమోడీ ఘనత అన్నట్లు కొందరు చిత్రిస్తున్నారు.


ఉక్రెయిన్‌ సంక్షోభం తలెత్తిన తరువాత రష్యా సైనిక చర్యను ఖండించటమా లేదా అన్న అంశంపై ప్రపంచ దేశాలు మూడు శిబిరాలుగా మారాయి. ఒకటి అమెరికా బాటలో ఖండించే, రెండవది రష్యాను సమర్ధించే, మూడవది తటస్థంగా ఉండే దేశాలు. మనది, చైనా మూడవ తరగతిలో ఉన్నాయి. ఖండించని దేశాలన్నీ రష్యాను సమర్ధించినట్లేనని అమెరికా కూటమి చిత్రిస్తోంది. జర్మనీ సభకు భారత్‌ను ఆహ్వానించటం గురించి అమెరికా జాతీయ భద్రతా మండలి సమన్వయకర్త జాన్‌ కిర్బీ మాట్లాడుతూ లోతైన, భిన్నమైన అజెండా ఉన్న కారణంగానే భారత్‌ను ఆహ్వానించారు తప్ప రష్యా నుంచి వేరు చేసేందుకు కాదన్నారు. ఆహ్వానించాలా లేదా అని జర్మనీ మల్లగుల్లాలు పడినట్లు వార్తలు వచ్చాయి తప్ప నిజానికి అందుకే పిలుస్తున్నట్లు ఎవరూ ఎక్కడా చెప్పలేదు. కానీ అమెరికా ప్రతినిధి కడుపు ఉబ్బరాన్ని ఆపుకోలేక అంతరంగాన్ని మరో రూపంలో వెల్లడించాడు. ఇతివృత్తం ఒకటైతే నిజానికి అక్కడ జరిగిన ప్రధాన చర్చ అంతా చైనా, రష్యాలను దెబ్బతీయటం ఎలా అన్నదాని చుట్టూనే తిరిగింది. ఆర్ధిక స్థిరత్వం, మార్పు, ప్రపంచ ఆరోగ్యమెరుగుదల, ప్రపంచ పర్యావరణ రక్షణ, నిరంతర పెట్టుబడుల వంటి వన్నీ మాయపుచ్చే అంశాలే. ప్రపంచ చట్టబద్ద సంస్థలు చేసిన నిర్ణయాలు, లక్ష్యాలనే ఈ దేశాలు ఖాతరు చేయటం లేదు. తొలి రోజు సమావేశంలో రష్యా చమురు ధరలను ఎలా అదుపు చేయాలన్న అంశం మీద, ఉక్రెయినుకు మరిన్ని ఆయుధాలిచ్చి ఎలా నిలబెట్టాలా అన్నదాని మీద కేంద్రీకరించారు తప్ప తమతో సహా అనేక దేశాలను అతలాకుతలం చేస్తున్న ద్రవ్యోల్బణాన్ని పట్టించుకోలేదు. గోధుమలపై మన దేశం నిషేధం విధించినపుడు పశ్చిమ దేశాలు విమర్శించాయి, తరువాత దాన్ని పంచదారకు పొడిగించారు. మోడీ జర్మనీ వెళుతుండగా బియ్యం ఎగుమతులపై నిషేధ ఆలోచన ఉన్నట్లు వార్తలొచ్చాయి.


ఇప్పటి వరకు జరిగిన సమావేశాల్లో మన ప్రధానులు తొమ్మిది సార్లు అతిధులుగా పాల్గొన్నారు.అతిధులుగా వెళ్లిన వారు ఎవరైనప్పటికీ ధర్మోపన్యాసాలు చేయటం, ఆతిధ్యాన్ని పుచ్చుకోవటం తప్ప అజెండాను నిర్ణయించే అవకాశం ఉండదు. హాజరైన దేశాధినేతలు, సంస్థల ప్రతినిధులతో తాను అభిప్రాయ మార్పిడి చేసుకుంటానని జర్మనీ వెళ్లే ముందు ప్రధాని నరేంద్రమోడీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కూటమి దేశాల నేతలు ఒక వైపు ఇలాంటి శిఖరాగ్ర సమావేశాల్లో గొప్ప ప్రకటనలు చేస్తూనే మరోవైపు తమ స్వంత అజెండాలతో వివిధ దేశాలతో వ్యవహరించటం తెలిసిందే. ఇతర దేశాల మీద దాడులు, ఆరోపణలు, తప్పుడు ప్రచారం చేయటంలో దాదాపు అన్నీ ఒక గూటి చిలుకలుగానే ఉంటాయి. ఉక్రెయిను సంక్షోభం గురించి ఈ బృందనేతలు మాట్లాడుతున్న సమయంలో మన ప్రధానిగా ఎవరున్నా మౌన ప్రేక్షుకుడిగా ఉండటం లేదా ఏదో ఒకమిషతో వెలుపలికి రావాల్సిందే తప్ప మన వైఖరిని వెల్లడించే లేదా సమర్ధించుకొనే అవకాశం ఉండదు. అమెరికా దేశాల శిఖరాగ్ర సమావేశానికి వెనెజులా, క్యూబాలను మినహాయించిన అమెరికా దుశ్చర్యను అర్జెంటీనా అధ్యక్షుడు అల్బర్టో ఫెర్నాండెజ్‌ ఆ సమావేశంలో సభ్య హౌదాలో ఉతికి ఆరేశారు. అదే జి7 సమావేశంలో ఆహ్వానితుడిగా ఉన్నందున ఆ విధంగా మాట్లాడలేరు. ఎవరికైనా ఈ పరిమితులు ఉంటాయి. ఉక్రెయిను వివాదంలో మన దేశాన్ని తమవైపు తిప్పుకొనేందుకు అమెరికా కూటమి ఎప్పటికప్పడు గాలాలు వేస్తూనే ఉంటుంది.చైనాను బూచిగా చూపి మనలను తమవైపు తిప్పుకొనేందుకు చేయని యత్నం లేదు. వర్తమాన రాజకీయ అంశం ఉక్రెయిన్‌ వివాదంలో పశ్చిమ దేశాలతో చేతులు కలపకపోయినా మిగతా అంశాలలో మీతోనే ఉంటామనే సందేశాన్ని ఇప్పటికే నరేంద్రమోడీ సర్కార్‌ ఇచ్చింది. దాని కొనసాగింపుగానే ఈ సమావేశానికి హాజరైనట్లు చెప్పవచ్చు.


జర్మనీ జి7 సమావేశాల్లో నరేంద్రమోడీని అమెరికా అధినేత జో బైడెన్‌ పలుకరించిన తీరును మీడియా ప్రత్యేకంగా చూపింది. కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రుడేవ్‌తో మాట్లాడుతుండగా వెనుక నుంచి వచ్చి నరేంద్రమోడీ భుజం తట్టి మరీ జో బైడెన్‌ పలుకరించారు. ఇది నరేంద్రమోడీ ఘనతగా చిత్రిస్తున్నారు.మన దేశాన్ని తమ కూటమిలో చేర్చుకొనేందుకు ఎలాంటి గాలం వేస్తారో డోనాల్డ్‌ ట్రంప్‌ తీరు తెన్నులు వెల్లడించాయి.జి 7 కూటమి కాలం చెల్లిన దేశాలతో ఉంది, దాన్ని విస్తరించాలని ట్రంప్‌ ఒకసారి చెప్పాడు.ఆస్ట్రేలియా,భారత్‌, దక్షిణ కొరియా, రష్యాలతో విస్తరించాలని అందుకే 2020 సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు చెప్పాడు. నరేంద్రమోడీకి ఫోన్‌ చేసి మరీ ఆహ్వానం పలికాడు. నిజమే అనుకొని మన దేశం జి7లో చేరినట్లుగానే కొందరు కలలు కన్నారు. అమెరికా తరువాత పెద్ద ఆర్ధికశక్తిగా ఉన్న చైనాను పక్కన పెట్టి ధనికదేశాల బృందాన్ని విస్తరించటం అంటే అది చైనాను కట్టడి చేసేందుకే అన్నది స్పష్టం. ఇప్పుడు జి7 సమావేశానికి వెళ్లి సాధించిందేమిటో నరేంద్రమోడీ దేశానికి చెప్పాల్సి ఉంటుంది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

కొలంబియాలో విరిసిన తొలి ఎర్రమందారం !

21 Tuesday Jun 2022

Posted by raomk in Current Affairs, History, imperialism, INTERNATIONAL NEWS, Latin America, Left politics, Opinion, Uncategorized, USA

≈ Leave a comment

Tags

Colombian presidential election 2022, first left-wing president in Colombia, Gustavo Petro, Latin American left


ఎం కోటేశ్వరరావు


లాటిన్‌ అమెరికాలో మరో వామపక్ష ప్రభుత్వ ఏర్పాటు కానుంది. కొలంబియాలో ఏడు దశాబ్దాల క్రితం 1948 ఎన్నికల్లో వామపక్ష అభ్యర్ధి జార్జి ఎలిసెర్‌ గైటెన్‌న్ను హత్య చేశారు. అప్పటి నుంచి అక్కడ జరిగిన అనేక పరిణామాల్లో వామపక్ష శక్తులను అణచివేశారు.తాజాగా ఆదివారం నాడు కొలంబియాలో జరిగిన అధ్యక్ష పదవి తుది విడత ఎన్నికలలో వామపక్ష, పురోగామి ” చారిత్రాత్మక ఒప్పంద ” కూటమి అభ్యర్ధి గుస్తావ్‌ పెట్రో విజయం సాధించారు. పెట్రోకు 50.5శాతం ఓట్లు రావటంతో విజేతగా ప్రకటించారు. అక్కడి రాజ్యాంగం ప్రకారం పోలైన ఓట్లలో సగానికిపైగా తెచ్చుకున్నవారినే విజేతగా గుర్తిస్తారు. తొలి విడత రెండు వారాల క్రితం జరిగిన ఎన్నికల్లో మొత్తం ఎనిమిది మంది పోటీ పడగా పెట్రోకు 40.33శాతం, స్వతంత్రుడిగా పోటీ చేసిన మితవాద వాణిజ్యవేత్త రుడాల్ఫో హెర్నాండెజ్‌కు 28.15శాతం ఓట్లు, మూడో పక్ష అభ్యర్ధి ఫెడరికో గూటిరెజ్‌కు 23.92శాతం రాగా మిగిలిన ఐదుగురికి 5.87శాతం వచ్చాయి. ఇప్పుడు రుడాల్ఫో హెర్నాండెజ్‌కు 47.3శాతం వచ్చాయి.


ఎన్నికల్లో పెట్రో విజయం లాటిన్‌ అమెరికాలోని ఇతర వామపక్ష పాలిత దేశాలు, ఇతర చోట్ల ఆనందాతిరేకాల వెల్లడి, ఆత్మవిశ్వాసాన్ని నింపింది. ఏ విధంగానైనా సరే పెట్రోను ఓడించాలని చూసిన అమెరికా, మితవాద శక్తులకు ఈ పరిణామం పెద్ద ఎదురుదెబ్బ. ఈ ఏడాది మార్చి 13న జరిగిన పార్లమెంటరీ ఎన్నికల్లో గుస్తావ్‌ పెట్రో నాయకత్వంలోని వామపక్ష కూటమి ఓట్ల రీత్యాపెద్ద పక్షంగా అవతరించినప్పటికీ ఉభయ సభల్లో మితవాదులు, ఇతర పార్టీల వారే ఎక్కువ మంది ఉన్నారు. దేశం మొత్తాన్ని 33 విభాగాలుగా చేసి జనాభాను బట్టి 168కి గాను 162 స్థానాలకు ఎన్నికలు జరిపారు. దామాషా ప్రాతిపదికన వచ్చిన ఓట్లను బట్టి సీట్లను కేటాయిస్తారు. మార్చి ఎన్నికల్లో దిగువ సభలో వామపక్ష కూటమికి 16.78శాతం ఓట్లు 27 సీట్లు రాగా సోషల్‌డెమోక్రటిక్‌ శక్తిగా వర్ణితమైన లిబరల్‌ పార్టీకి 14.27 శాతం ఓట్లు 32 సీట్లు వచ్చాయి. మిగిలిన సీట్లన్నింటిని మితవాదులు, ఇతరులు గెలుచుకున్నారు. ఎగువ సభలోని 100 స్థానాలకు గాను వామపక్ష కూటమి 20 సీట్లు తెచ్చుకుంది. పార్లమెంటులోని ఈ పొందిక రానున్న నాలుగు సంవత్సరాల్లో వామపక్ష ప్రభుత్వానికి ఎలాంటి సమస్యలను ముందుకు తెస్తుందో చూడాల్సి ఉంది. గుస్తావ్‌ పెట్రోను అభినందిస్తూ వామపక్షాలకు చెందిన అర్జెంటీనా అధ్యక్షుడు అల్బర్టో ఫెర్నాండెజ్‌, చిలీ అధ్యక్షుడు గాబ్రియల్‌ బోరిక్‌, పెరూ అధ్యక్షుడు పెరో కాజిలో, బొలీవియా అధినేత లూయిస్‌ ఆర్సీ, మెక్సికో అధినేత లోపెజ్‌ ఒబ్రాడోర్‌, వెనెజులా నేత నికొలస్‌ మదురో సందేశాలను పంపారు.


అనేక లాటిన్‌ అమెరికా దేశాల్లో మాదిరే కొలంబియాలో కూడా ఉదారవాద విధానాలతో లబ్దిపొందిన శక్తుల పలుకుబడి తక్కువేమీ కాదు. గుస్తావ్‌ పెట్రో గెలిచినప్పటికీ ఓట్లశాతం సగమే అన్నది గమనించాలి. అందుకే ఈ మార్పును కూడా కొందరు విప్లవంగా పిలుస్తున్నారు. రెండు వందల సంవత్సరాల క్రితమే దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటికీ ఇలాంటి పరిణామంతో చరిత్రను తిరగరాశామని అనేక మంది భావిస్తున్నారు. తొలిసారిగా దేశ చరిత్రలో ఆఫ్రికన్‌ సంతతికి చెందిన (ఆఫ్రో-కొలంబియన్‌) ఫ్రాన్సిమార్క్వెజ్‌ తొలిసారిగా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. ఆమె మానవహక్కుల, పర్యావరణ హక్కుల ఉధ్యమకారిణిగా ఉన్నారు. గుస్తావ్‌ పెట్రో ఎం 19 గెరిల్లాగా 1980దశకంలో రాజకీయాల్లోకి వచ్చారు. దేశ రాజధాని బగోటా మేయర్‌గా పనిచేసి ప్రజల మన్ననలందుకున్నారు. మంచి ఉపన్యాసకుడిగా పేరు తెచ్చుకున్నారు. కార్మికవర్గం, ఇతర సామాజిక తరగతులు పెట్రో మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కొలంబియా మితవాద శక్తులు దుర్మార్గాలకు మారుపేరు, వారికి అమెరికా, ఇతర దేశాల మితవాదుల అండదండలు, కార్పొరేట్ల మద్దతు పూర్తిగా ఉంది. ప్రస్తుతానికి విధిలేక పెట్రో గెలుపును అభినందించినప్పటికీ ఎలాంటి కుట్రలకు పాల్పడతారో చెప్పలేము. అనేక లాటిన్‌ అమెరికా దేశాల్లో అలాంటి పరిణామాలు జరినందున వామపక్ష శక్తులు ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలి. ఆర్ధికంగా, సామాజికంగా ఎన్నో సవాళ్లు ఉన్నాయి. 2016లో ఎఫ్‌ఏఆర్‌సి అనే గెరిల్లా సంస్థతో ప్రభుత్వం ఒక ఒప్పందం కుదుర్చుకొని ఐదు దశాబ్దాల అంతర్యుద్ధానికి స్వస్తి పలికినప్పటికీ ఒప్పంద అంశాలను సరిగా అమలు జరపలేదనే విమర్శలున్నాయి.రెండు లక్షల 60వేల మంది ప్రాణాలు కోల్పోగా 70లక్షల మంది అంతర్యుద్ధంలో కొలువులు, నెలవులు తప్పారు. అమెరికా చేతిలో కీలుబొమ్మలుగా ఇప్పటి వరకు ఉన్న పాలకులు పక్కనే ఉన్న వెనెజులాతో శత్రుపూరితంగా ఉన్నారు.తాను అధికారానికి వస్తే సంబంధాలు నెలకొల్పుకుంటానని పెట్రో ప్రకటించారు. ఆర్ధిక రంగానికి వస్తే చమురుపై ఆధారపడటాన్ని తగ్గిస్తానని చేసిన ప్రకటన ఇప్పటికే ఆ రంగంలో పెట్టుబడులు పెట్టిన వారిలో ఆందోళన కలిగిస్తున్నది.


ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన ఫ్రాన్సియా 1981లో ఒక కష్టజీవుల కుటుంబంలో జన్మించారు. ఆమె తండ్రి గని కార్మికుడు, తల్లి మంత్రసాని. ఫ్రాన్సియా కూడా బాలకార్మికురాలిగా బంగారు గనిలో పని చేశారు.తరువాత ఇంటిపని కార్మికురాలిగా ఉంది. పదహారేండ్లకే తల్లయింది. ఇద్దరు బిడ్డల తరువాత ఆమె శాంటియాగో విశ్వవిద్యాలయంలో చేరి లాయర్‌గా పట్టా పుచ్చుకుంది. బాల్యం నుంచీ గనుల వాతావరణంలో పెరగటం, గనుల కంపెనీలకు అప్పగించేందుకు అడవుల నుంచి సమీప గ్రామాల నుంచి వేలాది మందిని తొలగించటం, అడవుల నరికివేతను చూసి ఉద్యమకారిణిగా మారింది. గనుల వలన కాలుష్యంగా మారిన ఒక నదిని పరిరక్షించాలని సాగించిన ఆందోళనలో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. పర్యావరణ నోబెల్‌ బహుమతిగా ప్రసిద్ది చెందిన గోల్డ్‌మన్‌ ఎన్విరాన్‌మెంటల్‌ బహుమతిని పొందారు. స్థానిక తెగల ఆమోదం లేకుండా అక్రమంగా అనుమతించిన గనుల రద్దు కోరుతూ ఆమె ముందుకు రావటంతో గనుల యజమానుల అండతో ఏర్పడిన సాయుధ ముఠాలు ఆమెను బెదిరించాయి. దాంతో ఆమె 2014లో తన నివాసాన్ని మార్చుకోవాల్సి వచ్చింది. తనతో పాటు బలవంతంగా గెంటివేసిన ఆఫ్రో-కొలంబియన్లను సమీకరించి ఆరు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజధాని బగోటాకు వచ్చారు. అక్రమ గనుల నుంచి తమ సమస్యకు ఒక పరిష్కారాన్ని చూపాలని డిమాండ్‌ చేశారు. గెరిల్లా సంస్థతో శాంతి చర్చలకు ప్రభుత్వం పూనుకున్నపుడు నేతల ప్రాణాలకు రక్షణ కల్పించాలని ఆమె డిమాండ్‌ చేశారు. దాంతో మరొకసారి ఆమెను సాయుధ ముఠాలు బెదిరించటమే కాదు హత్యా ప్రయత్నం కూడా చేశాయి. ఆమె మంచి వక్త కూడా. పోరుబిడ్డగా గణుతికెక్కటం, విస్మరణకు గురైన ప్రతినిధిగా గుర్తింపు, ఆమె సామాజిక తరగతి వంటి అనేక అంశాలు వామపక్ష కూటమిలో ఉపాధ్యక్షపదవికి ఆమెను ముందుకు తెచ్చాయి.


ఎన్నికల ప్రచారంలో ఆమె అర్హత గురించి ప్రత్యర్ధులు ప్రశ్నించారు, ఎద్దేవా చేశారు. రాజకీయ అనుభవం ఎంత, గుస్తావ్‌ పెట్రోతో కలసి దేశాన్ని పాలించేందుకు ఉన్న అర్హత ఏమిటి వంటి ప్రశ్నలను తాను అనేక మంది నుంచి ఎదుర్కొన్నానని ఫ్రాన్సియా చెప్పారు. తమను గౌరవ ప్రదంగా బ్రతకనిచ్చేందుకు తనను ప్రశ్నించిన వారు ఎందుకు అనుమతించలేదు, ఎనభై లక్షల మందిమీద దశాబ్దాల తరబడి హింసకొనసాగేందుకు వారి అనుభవాన్ని ఎందుకు వినియోగించినట్లు , దేశ ప్రజలందరూ శాంతితో బతికేందుకు వారి అనుభవం ఎందుకు పనికిరాలేదని తనలో తాను ప్రశ్నించుకునేదాన్నని ఎన్నికల ప్రచారంలో ఆమె చెప్పారు. ఎన్నికల్లో విజయం ఖరారైన తరువాత అభిమానులనుద్దేశించి చేసిన తొలి ప్రసంగంలో తన విజయాన్ని సామాజిక, మైనారిటీ తరగతుల పోరాటానికి అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు.


ఒకవైపు మితవాద – పురోగామివాద శక్తుల రాజకీయ సమీకరణలు, మరోవైపు హింసాకాండ నేపధ్యంలో ఈ ఎన్నికలు జరిగాయి. ఎనిమిది సంవత్సరాల పాటు 2002-10 మధ్య అధికారంలో ఉన్న ఆల్వారో ఉరిబి కొలంబియా వామపక్షశక్తుల అణచివేతలో, మాదక ద్రవ్యాల మాఫియాలను ప్రోత్సహించటంలో పేరుమోశాడు. వేలాది మంది పౌరులను హతమార్చేందుకు కారకుడు. ప్లాన్‌ కొలంబియా పేరుతో అమెరికా అందచేసిన 280 కోట్ల డాలర్లతో ప్రయివేటు సాయుధ మూకలను తయారు చేసి మిలిటరీకి అనుసంధానించాడు. గతనాలుగు సంవత్సరాలుగా అధికారంలో ఉన్న ఇవాన్‌ డ్యూక్‌ ఉరుబి కీలుబొమ్మ. రాజ్యాంగం ప్రకారం ఎన్నికైన వారు మరోసారి పోటీ చేసేందుకు అవకాశం లేనందున ఇతగాడు ఎన్నికలకు దూరంగా ఉన్నాడు. రెండవది ఈ పార్టీ అనుసరించిన విధానాల కారణంగా జనాలకు దూరమైంది.


వామపక్ష విజయాన్ని తక్కువ చేసి చూపేందుకు కొందరు చూస్తున్నారు. లాటిన్‌ అమెరికాలో వామపక్షాల గెలుపు వాటి భావజాలం మీద ఉన్న అభిమానం కంటే అవి ముందుకు తెచ్చిన ప్రజాకర్షక విధానాల వల్లనే జనం వాటివైపు మొగ్గుతున్నట్లు సూత్రీకరిస్తున్నారు. ఉదారవాద ఆర్థిక విధానాల ప్రయోగశాలగా మారిన లాటిన్‌ అమెరికా దేశాల్లో ప్రపంచబాంకు, ఐఎంఎఫ్‌, అమెరికా ఆదేశించిన విధానాలను అమలు జరిపిన పాలకులు కార్పొరేట్లకు పెద్ద పీటవేసి జనాన్ని విస్మరించిన కారణంగా అక్కడ తలెత్తిన నిరసన, ప్రజా ఉద్యమాలను ఉక్కుపాదంతో అణచివేశారు. అందుకోసం అనేక దేశాల్లో నియంతలను రంగంలోకి తెచ్చారు. వారికి వ్యతిరేకంగా తలెత్తిన సాయుధ తిరుగుబాట్లకు వామపక్ష శక్తులు నాయకత్వం వహించాయి. ఈ ప్రాంత దేశాల్లో ఎంతగా అణచివేతకు పూనుకుంటే అంతగా తిరుగుబాట్లు ఉండటంతో పాలకవర్గాలు మిలిటరీ నియంతలకు బదులు పచ్చిమితవాద శక్తులను, వారికి అండగా కిరాయి మూకలను రంగంలోకి దింపాయి.ప్రహసన ప్రాయంగా పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని మార్చినప్పటికీ ఎన్నికలకు అవకాశం ఉండటంతో వామపక్ష శక్తులు ఆ అవకాశాన్ని వినియోగించుకొని అధికారాన్ని పొందుతున్నాయి. దశాబ్దాల తరబడి అణచివేత, దోపిడీకి గురైన సామాన్యులకు కావాల్సింది తక్షణ ఉపశమనం. లాటిన్‌ అమెరికా వామపక్ష శక్తులంటే ఆ తరగతికి కిందికి వచ్చేవన్నీ కమూ ్యనిస్టు పార్టీలు కాదు. సంస్కరణలతో దోపిడీ నుంచి విముక్తి కలిగించవచ్చని నమ్మేశక్తులు, అమెరికా సామ్రాజ్య వాదాన్ని వ్యతిరేకించే వారు, అణచివేత, దోపిడీ వ్యతిరేక పోరాటంలో వామపక్ష శక్తులకు దగ్గరైన ప్రజాతంత్ర శక్తులూ వాటిలో ఉన్నాయి. వాటన్నింటి మధ్య ఏకీభావం ఉన్న ఏకైక అంశం ప్రజాస్వామ్యం, కష్టజీవులకు తక్షణ ఉపశమనమే. అందువలన ప్రస్తుతం లాటిన్‌ అమెరికా వామపక్ష శక్తులు అనుసరిస్తున్న విధానాలు కార్మికులు, కర్షకులను దోపిడీ నుంచి విముక్తి చేసేవి కాదు. ప్రస్తుతం కొన్ని చోట్ల ఆ విధానాలకు ఉన్న పరిమితులు అర్ధం అవుతున్నాయి. దీన్ని మరోవిధంగా చెప్పాలంటే దోపిడీ శక్తులు తమ మౌలిక పునాదులకు ముప్పులేదని భావిస్తున్న కారణంగానే పరిమితంగానైనా సంక్షేమ చర్యలను ఆమోదిస్తున్నాయి. వాటిని కూడా సహించలేని దశ వస్తే లాటిన్‌ అమెరికా పరిణామాలు మరో మలుపు తిరుగుతాయి.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

అమెరికా దేశాల శిఖరాగ్ర సభ – జో బైడెన్‌కు భంగపాటు !

15 Wednesday Jun 2022

Posted by raomk in Current Affairs, History, imperialism, INTERNATIONAL NEWS, Latin America, Left politics, Opinion, Uncategorized, USA

≈ Leave a comment

Tags

Alberto Fernández, Joe Biden, Latin America, Latin American left, Mexican Lopez Obrador, Organization of American States (OAS), Summit of the Americas 2022, The People’s Summit for Democracy


ఎం కోటేశ్వరరావు


తనకు ఎదురులేదని ప్రపంచం ముందు కనిపించేందుకు అమెరికా పడుతున్న తాపత్రయం అంతా ఇంతా కాదు. అనేక చోట్ల తగులుతున్న ఎదురుదెబ్బలు అంతరంగంలో అమెరికా పాలకవర్గాన్ని ఉక్కిరిబిక్కిరి ఆడకుండా చేస్తున్నాయి. 2022 జూన్‌ ఆరు నుంచి పదవ తేదీ వరకు అమెరికాలోని లాస్‌ ఏంజల్స్‌ నగరంలో అమెరికా దేశాల తొమ్మిదవ శిఖరాగ్ర సమావేశం జరిగింది. ఈ సమావేశంలో దక్షిణ(లాటిన్‌) అమెరికా తన వెనుకే ఉందని చెప్పుకునేందుకు చూసిన బైడెన్‌ యంత్రాంగానికి చివరికి భంగపాటే మిగిలింది. శిఖరాగ్ర సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెజ్‌ మాన్యుయల్‌ లోపెజ్‌ ఒబ్రాడర్‌ చేసిన ప్రకటన అమెరికా ఒక చెంపను వాయిస్తే సమావేశానికి హాజరైన అర్జెంటీనా అధ్యక్షుడు మరో చెంప వాయించినట్లు మాట్లాడాడు.” కచ్చితంగా భిన్నమైన అమెరికా దేశాల శిఖరాగ్ర సమావేశం జరగాలని మనం కోరుకుంటాం.హాజరుగాని వారి మౌనం మనల్ని సవాలు చేస్తున్నది. కాబట్టి మరోసారి ఇలా జరగకూడదు. నేను ఒకటి స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. భవిష్యత్‌లో జరిగే సమావేశాలకు ఆతిధ్యం ఇచ్చే దేశాలకు మన ఖండంలోని సభ్య దేశాల హాజరుపై ఆంక్షలు విధించేే అధికారాన్ని ఇవ్వకూడదు.” అని అర్జెంటీనా అధ్యక్షుడు ఆల్బర్టో ఫెర్నాండెజ్‌ చెప్పారు. లాటిన్‌ అమెరికా కరీబియన్‌ దేశాల సంస్థ(సిఇఎల్‌ఏసి) ప్రోటెమ్‌ అధ్యక్షుడిగా కూడా ఫెర్నాండెజ్‌ పని చేస్తున్నాడు.లోపెజ్‌ బాటలో బొలీవియా, హొండురాస్‌, గౌతమాలా, సెంట్‌ విన్సెంట్‌, గ్రెనడా దేశాధినేతలు నడిచారు.ఎల్‌ సాల్వడార్‌, ఉరుగ్వే నేతలు కూడా ఇతర కారణాలతో పాల్గొనలేదు.


ఇదంతా లాస్‌ ఏంజల్స్‌ సమావేశానికి క్యూబా, వెనెజులా, నికరాగువా నియంతృత్వదేశాలంటూ వాటిని ఆహ్వానించరాదన్న అమెరికా నిర్ణయానికి నిరసనే. ఈ సమావేశం ద్వారా అమెరికా సాధించదలచుకున్న లక్ష్యం ఏదైనప్పటికీ సమావేశ వేదిక మీద, వెలుపలా జరిగిన పరిణామాలు మరోసారి అమెరికా నలుగురి నోళ్లలో నానింది. ప్రత్యేకించి అమెరికా ఖండ దేశాలలో పెద్ద చర్చకు దోహదం చేసింది. దాని ద్వంద్వనీతిని బయట పెట్టింది. ఇంకేమాత్రం తమ మీద అమెరికా ఆధిపత్యం చెల్లదని లాటిన్‌ అమెరికా దేశాలు చెప్పకనే చెప్పటమే. అమెరికా పలుకుబడి బండారం ఇతర చోట్ల కూడా మరింతగా జనానికి తెలియచేసే పరిణామమిది. నిన్న ఆఫ్ఘనిస్తాన్‌, నేటి ఉక్రెయిన్‌ సంక్షోభం అమెరికా బలహీనతలను, దాన్ని నమ్ముకుంటే నట్టేట మునగటమే అన్న పాఠం నేర్పింది.1994లో అమెరికాలోనే జరిగిన ఈ సంస్థ సమావేశాలతో పోల్చుకుంటే తాజా పరిణామాలు ఆ ప్రాంతంలో జరిగిన పెద్ద మార్పును సూచిస్తున్నాయి.


ఇటీవలి కాలంలో అమెరికా దేశాల సంస్థ(ఓఎఎస్‌) పని తీరు తీవ్ర విమర్శలకు గురువుతోంది. అది పశ్చిమార్ధగోళంలో కేవలం అమెరికా ప్రయోజనాలను కాపాడే ఒక పని ముట్టుగా మారిందన్నది స్పష్టం. అమెరికాతో పాటు ఈ సమావేశాల్లో ఓఎఎస్‌ కూడా తీవ్ర విమర్శలకు గురైంది. బొలీవియాలో ఎన్నికైన ఇవోమొరేల్స్‌ ప్రభుత్వాన్ని కూల్చివేసి, తిరుగుబాటునేత జెనీనె ఆనెజ్‌ను అధ్యక్షురాలిగా చేశారు.(ఇప్పుడు ఆమె నేరంపై విచారణ జరుగుతున్నది) దానికి ఆమెరికా దేశాల సంస్థ (ఓఎఎస్‌) మద్దతు ప్రకటించింది. ఈ దుర్మార్గానికి అండగా నిలవటంతో పాటు బొలీవియాలోని సంకేత, సకాబా ప్రాంతాల్లో ఆనెజ్‌ ఏలుబడిలో జరిగిన మారణకాండ గురించి మౌనం దాల్చిన సంస్థ ప్రధాన కార్యదర్శి లూయిస్‌ అలమగ్రో పదవిలో కొనసాగటం ఏమిటని కొందరు ప్రతినిధులు లేవనెత్తినపుడు అతగాడికి కంటిచూపు తప్ప నోట మాట లేదు. మూడు దేశాలను ప్రజాస్వామ్యం పేరుతో మినహాయించి హైతీలో మాజీ అధ్యక్షుడు జువనెల్‌ మోషే హత్య కుట్రలో భాగస్వామిగా ఉన్న ఏరియల్‌ హెన్రీ, కొలంబియాలో ప్రతిపక్షాలను ఊచకోత కోయిస్తున్న ఇవాన్‌ డూక్‌ను మానవహక్కుల పరిరక్షకులుగా ఫోజు పెడుతున్న అమెరికా ఎలా ఆహ్వానించిందని కొందరు ప్రశ్నించారు. క్యూబా, వెనెజులా, నికరాగువా దేశాల ప్రభుత్వ నేతలను మినహాయించిన అమెరికా ఆ దేశాల ప్రభుత్వాల మీద తిరుగుబాటు చేసిన వారిని, అమెరికా ఇచ్చిన నిధులతో వివిధ సంస్థల పేరుతో అమెరికా వ్యతిరేక ప్రభుత్వాల మీద ధ్వజమెత్తే వారిని ఈ సమావేశాలకు ఆహ్వానించింది. మరొక సభ్య దేశం గురించి తీర్పులు చెప్పే అధికారం ఏ దేశానికైనా ఎవరిచ్చారని అనేక దేశాల ప్రతినిధులు ప్రశ్నించారు. మూడు దేశాలను మినహాయించటాన్ని ఖండిస్తూ ఆంక్షలను ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. అమెరికా దేశాల సంస్థను సంస్కరించాలని కోరారు. అనేక మంది కరీబియన్‌ దేశాధినేతలతో పాటు బెల్జి, అర్జెంటీనా, చిలీ అధినేతలు కూడా ఇదే అభిప్రాయాలను ప్రతిధ్వనించారు.


మూడు దేశాలను ఆహ్వానించకపోవటానికి 2001లో లిమాలో జరిగిన అమెరికా ఖండ దేశాల సమావేశం ఆమోదించిన ఆర్టికల్‌ 19ని సాకుగా చూపారు. ప్రపంచ అర్ధగోళంలోని దేశాల్లో ఉన్న ప్రజాస్వామిక వ్యవస్థలకు ఆటంకం కలిగించటానికి లేదా రాజ్యాంగ వ్యతిరేకంగా మార్చేందుకు పూనుకున్న దేశాలకు భవిష్యత్‌లో జరిగే అమెరికా ఖండ దేశాల సమావేశాల్లో పాల్గొనేందుకు అర్హత ఉండదన్నది దాని సారం. బొలీవియాలో రాజ్యాంగబద్దంగా ఎన్నికైన ఇవోమొరేల్స్‌ ప్రభుత్వాన్ని కూల్చివేసింది అమెరికా. వెనెజులా ఎన్నికల్లో అక్రమాలు జరిగాయనే సాకుతో ప్రతిపక్ష నేత ప్రభుత్వాన్ని గుర్తించి అక్రమాలకు పాల్పడింది అమెరికా. ఇలా చెప్పుకుంటూ పోతే అసలు సమావేశాన్ని నిర్వహించేందుకే దానికి అర్హత లేదు. సరిగ్గా సమావేశానికి ఒక రోజు ముందు క్యూబా, వెనెజులా, నికరాగువాలను మినహాయించినట్లు ప్రకటించటం ఆమెరికాలో స్థిరపడిన ఆ దేశాలకు చెందిన, అమెరికా ఖండదేశాల్లోని వామపక్ష వ్యతిరేకశక్తులను సంతుష్టీకరించటం తప్ప మరొకటి కాదు.


అమెరికా ప్రస్తుతం ప్రపంచంలోని 42దేశాల్లో నివసించే మూడోవంతు జనాభాపై చట్టవిరుద్దమైన ఆంక్షలను అమలు జరుపుతున్న అపర ప్రజాస్వామిక వాది. తనకు నచ్చని ప్రభుత్వాలను ఆ దేశాల పౌరులతోనే కూల్చివేయించే ఎత్తుగడ దీని వెనుక ఉంది. కరోనా మహమ్మారి విస్తరిస్తున్న తరుణంలో వెనెజులా మీద, తాజాగా రష్యా మీద ఆంక్షలను మరింతగా పెంచటం దానిలో భాగమే. దశాబ్దాల తరబడి క్యూబాను దిగ్బంధనానికి గురిచేసినా,వెనెజులా, నికరాగువా వంటి చోట్ల ప్రతిరోజూ కుట్రలు చేసినా దాని ఎత్తుగడలు ఎక్కడా పారలేదన్నది కూడా వాస్తవం. గతంలో ఆఫ్ఘనిస్తాన్‌, వెనెజులా, ఇప్పుడు రష్యాలకు చెందిన విదేశాల్లోని ఆస్తులు, బంగారం వంటి వాటిని స్వాధీనం లేదా స్థంభింప చేసిన తరువాత అమెరికా ఆంక్షలకు గురైన దేశాలన్నీ అమెరికా డాలరుతో సంబంధం లేని లావాదేవీల కోసం చూడటం పెరుగుతోంది తప్ప అమెరికాకు లొంగటం లేదు. ఉక్రెయిన్‌పై దాడి చేస్తోందనే పేరుతో ఐరాస మానవహక్కుల సంస్థలో రష్యాకు స్థానం కల్పించకూడదనే అమెరికా తీర్మానానికి అనుకూలంగా 92 ఓట్లు వస్తే తటస్థం లేదా వ్యతిరేకంగా 13 అమెరికా దేశాలతో సహా 82 దేశాలున్నాయి. జనాభా రీత్యా చూస్తే అత్యధికులు ఈ దేశాల్లోనే ఉన్నారు.
లాస్‌ ఏంజల్స్‌ సమావేశానికి మూడు దేశాలను ఆహ్వానించకూడదన్న అమెరికా ఆలోచనలను ముందే పసిగట్టిన మెక్సికో అధినేత లోపెజ్‌ అదే జరిగితే తాను వచ్చేది లేదని ముందుగానే స్పష్టం చేశాడు. గత కొద్ది నెలలుగా బుజ్జగించేందుకు చేసిన యత్నాలు ఫలించలేదు. దీన్ని మరొక విధంగా చెప్పాలంటే లాటిన్‌ అమెరికాలో బలపడుతున్న పురోగామి శక్తుల బంధాన్ని వెల్లడించింది. లాటిన్‌ అమెరికాలో గత రెండు దశాబ్దాల్లో ఎగురుతున్న ఎర్రబావుటాల వాస్తవాన్ని గుర్తించేందుకు అమెరికా నిరాకరిస్తున్నది. గత మొరటు పద్దతులతోనే తన పెత్తనాన్ని సాగించాలని విఫలయత్నం చేస్తున్నది. వెనెజులాలో తన కుట్రలు విఫలమైన తరువాత ప్రతిపక్షనేత జువాన్‌ గుయిడో ఏర్పాటు చేసినట్లు ప్రకటించిన ప్రభుత్వాన్ని గుర్తించిన ట్రంప్‌ అవసరమైతే దాడులకు సైతం తెగబడతానన్న ప్రేలాపనలతో ఊగిపోయాడు. ప్రస్తుత బైడెన్‌ అలా నోరుపారవేసుకోకపోయినా అదేబాటలో నడుస్తున్నాడు. మదురోను తిరస్కరించినా గుర్తించిన జువాన్‌ గుయిడోను ఆహ్వానించే సాహసం చేయలేకపోయాడు.


వామపక్ష శక్తులు అనేక చోట్ల అధికారానికి వస్తుండటం, తాము బలపరిచిన మితవాద శక్తులను జనాలు తిరస్కరిస్తుండటాన్ని గమనించిన తరువాత అక్కడి పరిణామాలు అమెరికన్లకు మింగుడుపడటం లేదు,వామపక్షాలను ఎలా ఎదుర్కోవాలో దానికి తోచటం లేదు. తాజాగా కొలంబియా ఎన్నికల్లో కూడా మితవాదశక్తులకే అమెరికా మద్దతు ఇచ్చింది. అమెరికా-మెక్సికో సరిహద్దు నుంచి వలస వచ్చే వారిని అడ్డుకొనేందుకు అడ్డుగోడ నిర్మాణంతో సహా ట్రంప్‌ తీసుకున్న చర్యలన్నింటినీ బైడెన్‌ కూడా కొనసాగిస్తున్నాడు. అమెరికా ఖండదేశాల మధ్య వలసలు ఒక ప్రధాన సమస్యగా ఉంది. ఇలాంటి వాటిని చర్చించేందుకు ఏర్పాటు చేసిన శిఖరాగ్రసభకు అన్ని దేశాల నేతలు వచ్చినపుడే కొంతమేరకు పరిష్కారం దొరుకుతుంది. అమెరికాకు మెక్సికో, గౌతమాలా, ఎల్‌సాల్వడార్‌, హొండురాస్‌ నుంచి పెద్ద ఎత్తున వలసలు వస్తారు. ఈ దేశాలనేతలెవరూ లేకుండానే సమావేశాలు ముగిశాయి.


అమెరికా ఏకపక్ష, నిరంకుశ నిర్ణయాలు, వైఖరిని నిరసిస్తూ లాస్‌ ఏంజల్స్‌లో జరిగిన అమెరికా దేశాల తొమ్మిదవ శిఖరాగ్ర సమావేశానికి పోటీగా అదే తేదీల్లో అదే నగరంలో వివిధ దేశాలకు చెందిన పలు సంస్థలు, ఉద్యమాల ప్రతినిధులతో పోటీగా ” ప్రజాస్వామ్యం కోసం ప్రజాశిఖరాగ్ర సమావేశాలు ” జరిగాయి. వివిధ అంశాలను చర్చించటంతో పాటు అమెరికా వైఖరికి నిరసనగా ప్రదర్శనలు కూడా చేశారు. జూన్‌ 10 నుంచి 12వ తేదీ వరకు మెక్సికోలోని తిజువానాలో కార్మికుల శిఖరాగ్ర సమావేశాలు జరిగాయి. ఈ సమావేశంలో కూడా వివిధ దేశాలకు చెందిన వారితో పాటు అమెరికా వీసాలు నిరాకరించిన క్యూబా, వెనెజులా, నికరాగువా తదితర దేశాల ప్రతినిధులు ఇక్కడ పాల్గన్నారు. రెండు సమావేశాల్లో అమెరికా నిరంకుశ పోకడలతో పాటు వాటికి వ్యతిరేకంగా ప్రజలను ఎలా సమీకరించాలో కూడా చర్చించారు. అమెరికా ఖండాల ప్రజలందరూ ఐక్యం కావాలని పిలుపునిచ్చారు. లాస్‌ ఏంజల్స్‌ సమావేశాల్లో భౌతికంగా, ఆన్‌లైన్‌లో 250 సంస్థలకు చెందిన వారు భాగస్వాములైనారు. ఈ సమావేశాలకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. అధికారిక సమావేశం జరిగే ప్రాంతం చుట్టూ కంచెవేసి నిరసనకారులను అడ్డుకున్నారు. నగరంలోని ఒక కాలేజీలో వేదికను ఏర్పాటు చేసుకొని వివిధ అంశాలపై ప్రజాసంస్థలు చర్చలు జరిపాయి. అమెరికా పెత్తందారీ పోకడలకు గురవుతున్న దేశాలకు బాసటగా నిలుస్తామని దీక్ష పూనాయి.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

రష్యా మీద ఆంక్షల పర్యవసానాలను ఊహించని పశ్చిమ దేశాలు !

08 Wednesday Jun 2022

Posted by raomk in Current Affairs, Economics, History, imperialism, International, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, UK, USA, WAR

≈ Leave a comment

Tags

100 days Ukraine crisis, Ukraine war, Ukraine-Russia crisis, US imperialism


ఎం కోటేశ్వరరావు


ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య ప్రారంభమై బుధవారం నాటికి 105వ రోజుకు చేరింది. అమెరికా, ఇతర నాటో దేశాలు ప్రపంచం మీద రుద్దిన సంక్షోభ పర్యవసానాలను ఉక్రెేనియన్లు ప్రత్యక్షంగా అనుభవిస్తున్నారు. పరోక్షంగా మన దేశంతో సహా అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు. వందవ రోజు సందర్భంగా ఆ సంక్షోభం గురించి అనేక మంది పాఠాలు, గుణపాఠాలు అంటూ తమ వైఖరులను వెల్లడించారు. ఏ దాడి లేదా యుద్దంలోనైనా ముందుగా నిజాలు బలి అవుతాయి. వంద రోజులు దాటిన తరువాత కూడా ఉక్రెయిన్లో నిజంగా జరుగుతున్నదేమిటి? అమెరికా కూటమి దేశాలు చెబుతున్నట్లుగా రష్యాకు ఎదురు దెబ్బలు తగిలాయా ఏమిటి అన్నది స్పష్టంగా వెల్లడికావటం లేదు.అందుబాటులో ఉన్న సమాచారం మేరకు కొన్ని అంశాలను చూద్దాం.


ఇరవై శాతం భూభాగం తమ పట్టునుంచి తప్పిందని స్వయంగా ఉక్రెయిన్‌ నేత జెలెనెస్కీ ప్రకటించాడు. అది గత ఎనిమిది సంవత్సరాలుగా స్వాతంత్య్రం ప్రకటించుకున్న తిరుగుబాటుదారులది పైచేయిగా ఉన్న డాన్‌బాస్‌ ప్రాంతం. ఉక్రెయిన్‌ మిలిటరీ, దాని కనుసన్నలలో పని చేసే కిరాయి నాజీమూకలు ఒక వైపు, రష్యా మద్దతు ఉన్న తిరుగుబాటు దార్ల మధ్య అక్కడ అంతర్యుద్దం జరుగుతున్నది. రష్యా ప్రారంభించిన సైనిక చర్యలక్ష్యాలలో ఈ ప్రాంతంలోని నాజీ మూకలను అంతం చేయటం, నాటోలో చేరి తమ సరిహద్దులో అమెరికా, ఇతర దేశాల మిలిటరీ,ఆయుధాలను మోహరించేందుకు పూనుకున్న ఉక్రెయిన్‌ జీవనాడులను దెబ్బతీసి ఆ ప్రక్రియనుంచి వెనక్కు తగ్గేట్లు చేయటం ఉన్నాయి. ఈ ప్రక్రియ కొద్ది రోజుల్లోనే పూర్తవుతుందని వేసిన అంచనాలు తప్పాయి. పశ్చిమ దేశాలు అందించిన ఆధునిక ఆయుధాలే దానికి కారణం. నయా నాజీ మూకలు, మిలిటరీ దాడుల నుంచి డాన్‌బాస్‌ పౌరులను రక్షించాలన్న లక్ష్యం నెరవేరేందుకు వందరోజులు పట్టింది. ఇక్కడ గ్రహించాల్సిన అంశాలు రెండున్నాయి. ఒకనాడు రష్యాలో అంతర్భాగంగా ఉన్న క్రిమియా ప్రాంతాన్ని స్వాధీనం చేసుకొనేందుకు రష్యాను పురికొల్పిన కారణం కూడా ఉక్రెయినుకు నాటో తీర్ధం ఇవ్వాలన్న పశ్చిమ దేశాల ఎత్తుగడే.


క్రిమియాను తిరిగి స్వాధీనం చేసుకోవటం ఉక్రెయినుకు సాధ్యం కాలేదు, ఇప్పుడు తమ పట్టునుంచి జారిందని చెబుతున్న డాన్‌బాస్‌ ప్రాంతాన్ని కూడా నాటో కూటమి దేశాలు ఎన్ని ఆయుధాలు ఇచ్చినా తిరిగి ఉక్రెయిన్‌ ఆధిపత్యంలోకి వస్తుందా అన్నది అపూర్వచింతామణి ప్రశ్న.పూర్వపు సోవియట్‌ నుంచి విడిపోయి దేశంగా ఏర్పడిన వాటిలో జార్జియా ఒకటి. దీనిలో అబ్కాజియా, దక్షిణ ఒసెట్టి అనే ప్రాంతాలు ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసి స్వాతంత్య్రం ప్రకటించుకున్నాయి. వాటిని రష్యా గుర్తించటమే కాదు, అక్కడి ప్రభుత్వాలతో రక్షణ ఒప్పందాలను కూడా కుదుర్చుకొన్నది. జపాన్‌తో అమెరికా రక్షణ ఒప్పందం కుదుర్చుకొని అక్కడ తన సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేసి మిలిటరీని ఎలా దించిందో అదే పద్దతిలో ఇక్కడ రష్యా కూడా ఆ రిపబ్లిక్కులకు రక్షణ కల్పిస్తోంది.ఈ రెండు ప్రాంతాలు జార్జియాలో ఇరవైశాతం కలిగి ఉండేవి. అందువలన డాన్‌బాస్‌ ప్రాంతం కూడా వచ్చే రోజుల్లో ఇదే మాదిరి స్వతంత్ర రాజ్యం లేదా రెండు రాజ్యాలుగా ఏర్పడి రష్యాతో మిలిటరీ రక్షణ ఒప్పందాలను కుదుర్చుకొని విడిగా కొనసాగవచ్చు.


ఉక్రెయిన్‌ సంక్షోభం నేర్పిన ఒక పాఠం ఏమంటే అమెరికాను నమ్ముకుంటే తన ఎత్తుగడలో భాగంగా ఒక దేశాన్ని మరొక దేశం మీదకు ఉసిగొల్పుతుంది తప్ప తన మిలిటరీని పంపి ప్రత్యక్షంగా రంగంలోకి దిగదు అన్నది స్పష్టమైంది. కొరియా, వియత్నాంలపై జరిపిన దాడులు, ఉగ్రవాదులను ఎదుర్కొనే పేరుతో ఆఫ్ఘనిస్తాన్‌లో జోక్యం చేసుకొన్ని తిన్న చావుదెబ్బలే దీనికి కారణం అని వేరే చెప్పనవసరం లేదు. సిరియా ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కిరాయి మూకలను పశ్చిమదేశాలు సమీకరించినా అది సాధ్యం కాలేదు. ఉక్రెయిన్లో కూడా దాదాపు పాతిక వేలమందిని సమీకరించి జనం మీద దాడులు చేయించారు. మరియుపూల్‌ నగరంలోని ఉక్కు కర్మాగారాన్ని స్థావరంగా చేసుకొని మూడు నెలలపాటు రష్యన్లను ఎదిరించింది కూడా ఈ మూకలే. ఆ ఫ్యాక్టరీని ముట్టడించిన రష్యన్లు అక్కడి వారికి అవసరమైన సరఫరాలను అడ్డుకోవటంతో చివరికి వేలాది మంది లొంగిపోయిన సంగతి తెలిసిందే. నాలుగు కోట్ల నలభై లక్షల మంది జనాభాలో కోటీ నలభై లక్షల మంది విదేశాలకు శరణార్ధులుగా వెళ్లటం లేదా స్వదేశంలో నెలవులు తప్పటం గానీ జరిగింది. వారిని ఎంతకాలం అలా అనిశ్చితంగా పరాయిపంచల్లో కొనసాగిస్తారో తెలియటం లేదు. ఇరుగుపొరుగు దేశాలు వారిని దీర్ఘకాలం భరించటం అంతతేలిక కాదు. సంప్రదింపుల పేరుతో జెలెనెస్కీ నాటకం ఆడారు తప్ప చిత్తశుద్దిని ప్రదర్శించలేదు.తమకు నాటోలో చేరే ఉద్దేశ్యం లేదని చెప్పిన పెద్దమనిషి ఆ మాటమీద నిలిచి ఉంటే ఈ పాటికి సంక్షోభం సద్దుమణిగి ఉండేది. చావు దెబ్బలు తింటున్నా ఇంకా విదేశీఆయుధాలు తీసుకుంటూ మరింత నాశనానికి కారకుడు అవుతున్నాడు. పశ్చిమ దేశాలకు సమన్య పరిష్కారం కావటం సుతరామూ అంగీకారం కాదని తేలిపోయింది. రష్యన్‌ దాడుల్లో దెబ్బతిన్నవాటి పునరుద్దరణకు రుణాలిస్తామంటూ సంక్షోభం నుంచి కూడా లాభాలు పిండుకొనేందుకు పూనుకున్నారు.


ఈ వివాదాన్ని ఆసరా చేసుకొని రష్యాను బూచిగా చూపి ఐరోపాలో మరోసారి మిలిటరీ శక్తిగా మారేందుకు జర్మనీ పావులు కదుపుతున్నది. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత మిలిటరీ ఖర్చును తగ్గించి దాన్ని పరిశోధన-అభివృద్ధి, కార్పొరేట్లకు సబ్సిడీల వంటి వాటికి మళ్లించటంతో పారిశ్రామికంగా ఎదిగింది. ఇప్పుడు భారీ ఎత్తున మిలిటరీ ఖర్చుకు నిర్ణయించింది. ఆధునిక ఎఫ్‌35 రకం విమానాలను కొనుగోలు చేస్తానని ప్రకటించింది. ఐరోపాలో పెద్ద మిలిటరీ శక్తిగా ఎదిగేందుకే ఇది అన్నది చెప్పనవసరం లేదు. తటస్థదేశాలుగా ఉన్న స్వీడన్‌, ఫిన్లండ్‌తో పాటు డెన్మార్క్‌ కూడా నాటోలో చేరాలని నిర్ణయించింది. వీటి కదలికల వెనుక ఉన్న అసలు లక్ష్యాలు వెల్లడికావాల్సి ఉంది.


తమ ఆంక్షలతో రష్యా ఆర్ధికవ్యవస్థ కుప్పకూలి జనం పుతిన్‌ మీద తిరగబడతారని పశ్చిమ దేశాలు వేసిన అంచనాలు, పెట్టుకున్న ఆశలు ఫలించలేదు. మాస్కో స్టాక్‌ మార్కెట్‌ మూతపడింది. రష్యన్‌ కరెన్సీ విలువ తొలి వారాల్లో సగానికి సగం పతనమైనా తిరిగి సైనికచర్యపూర్వపు స్థితికి చేరుకుంది. తమతో కాళ్లబేరానికి వస్తాడని భావించిన పుతిన్‌లో అలాంటి సూచనలేమీ లేవు. దాదాపు 300 బిలియన్‌ డాలర్ల మేర విదేశీమారక ద్రవ్యాన్ని పశ్చిమ దేశాలు స్థంభింప చేశాయి. ఎగుమతులపై నిషేధం విధించి ఆధునిక పరికరాలు, యంత్రసామగ్రి, పరిజ్ఞానం అందకుండా కట్టడి చేశారు.అమెరికా, ఐరోపా దేశాలు చమురు దిగుమతులను నిలిపివేసినా రష్యా ఇప్పటివరకు నిలదొక్కుకుంది. తన ఎగుమతులకు వేరే మార్కెట్లను చూసుకుంది. అమెరికా వడ్డీరేట్లను పెంచుతుంటే రష్యా తగ్గిస్తున్నది. మార్చి నెలలో భారత్‌కు చమురు సరఫరా చేసే దేశాల్లో రష్యా పదవస్థానంలో ఉంటే అది ఏప్రిల్‌ నెలలో నాల్గోస్థానానికి ఎదిగింది. మరో ఆరునెలల పాటు చమురు కొనుగోలుకు మన దేశ సంస్థలు ఒప్పందాలు చేసుకున్నట్లు తాజా వార్తలు తెలిపాయి. మరోవైపు చైనా కూడా పెద్ద ఎత్తున చమురుతో పాటు ఇతర దిగుమతులను పెంచింది. రష్యా ఆర్థికవ్యస్థ నిలదొక్కుకొనేందుకు ఇదొక ప్రధాన కారణం. కొన్ని ఐరోపా దేశాలు కూడా ఆంక్షలను పక్కన పెట్టి అక్కడి నుంచి చమురు, గాస్‌ దిగుమతి చేసుకుంటున్నాయి. రష్యా వద్ద బంగారం, విదేశీకరెన్సీ గానీ 640 బిలియన్‌ డాలర్ల మేరకు ఉన్నట్లు చెబుతున్నారు. ఈ కారణంగానే విధించిన ఆంక్షలను అది తట్టుకోగలుగుతోందని చెప్పవచ్చు.


రష్యా మీద పశ్చిమ దేశాల ఆంక్షలు అంటే తమ కాళ్లను తామే తొక్కుకుంటున్నట్లని కొందరు వర్ణిస్తున్నారు. రష్యా నుంచి నిలిపివేసిన ఇంథనాన్ని ఇతర దేశాల నుంచి పొందాలంటే ఐరోపా దేశాలకు వెంటనే కుదిరేది కాదు.తమ నుంచి దిగుమతులు చేసుకోవాలంటే రూబుళ్లలోనే చెల్లించాలని లేకుంటే తామే నిలిపివేస్తామని పుతిన్‌ షరతులు విధించాడు. పశ్చిమ దేశాల ఆంక్షల కారణంగా చమురు ధరలు పెరగటం వలన ఎగుమతుల కారణంగా విదేశీ మారకద్రవ్యం పెద్ద ఎత్తున చెలామణిలోకి రావటం కూడా రూబుల్‌కు సానుకూల అంశంగా మారింది. రూబుల్‌ విలువ పెరగకుండా చూసేందుకు రష్యా రిజర్వుబాంకు వడ్డీ రేట్లను తగ్గించాల్సి వచ్చింది. తమ నుంచి దిగుమతులను నిలిపివేయటం అంటే ఐరోపా ఆర్ధిక ఆత్మహత్య చేసుకోవటమే అని పుతిన్‌ ఎద్దేవాచేశాడు. ఇంధన ధరలు,ద్రవ్యోల్బణం పెరుగుతాయని అన్నాడు. అయితే రష్యా ఇబ్బందులను ఎదుర్కొంటోందని కూడా చెబుతున్నారు. సైనిక చర్యకు ముందు బడ్జెట్‌లో చమురు ఎగుమతుల ఆదాయం 30శాతం ఉంటే ఇప్పుడు 65శాతానికి పెరిగిందంటున్నారు.
పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షలు రష్యాకు వరంగా మారాయి. మార్చి రెండవ తేదీన ముడి చమురు ధర 60 డాలర్లవరకు ఉంటే తరువాత 110 డాలర్లు దాటింది. అందువలన రష్యా తన ఖాతాదార్లకు పెరిగిన ధరమీద పెద్ద మొత్తంలో రాయితీ ఇచ్చినా గతంతో పోల్చుకుంటే నష్టం లేదు, మన వంటి దేశాలకు ఎంతగానో కలసి వస్తుంది.రష్యా మీద వత్తిడి తెచ్చేందుకు ఆంక్షల మార్గాన్ని ఎంచుకున్న పశ్చిమ దేశాలు వాటి వలన ఇతర దేశాలకు, చివరికి తమకూ కలిగే ప్రతికూల పర్యవసానాలను ఊహించలేకపోయాయి. కొన్ని ఐరోపా దేశాల వత్తిడికి లొంగి కొంత మేరకు చమురు దిగుమతులకు అనుమతించారు. వందరోజుల తరువాత అనేక దేశాల్లో తలెత్తిన పరిస్థితి అక్కడి పాలకులకు సమస్యలు తెస్తున్నది. 2014కు ముందు రష్యా ఆహారాన్ని దిగుమతి చేసుకోగా ఇప్పుడు ఎగుమతిదారుగా మారింది. అక్కడి నుంచి రవాణాపై ఆంక్షలున్న కారణంగా ప్రపంచంలో సరఫరా తగ్గి ఇప్పుడు ధరలు పెరిగాయి.


వంద రోజుల సైనిక చర్య తరువాత జరగనున్నదేమిటి అన్న ప్రశ్న సహజంగానే వస్తుంది. డాన్‌బాస్‌ ప్రాంతంపై పూర్తి పట్టు సాధించినందున ఇక ముందు రష్యా తూర్పు నుంచి భారీ దాడులకు సిద్దం అవుతుంది. ఉక్రేనియన్లు ఇంకేమాత్రం దాడులను తట్టుకోలేని స్థితిలోకి వెళుతున్నారు. తమకు ఇంకా ఆయుధాలు ఇమ్మని జెలెనెస్కీ కోరితే ముందు ముందు జనాగ్రహాన్ని ఎదుర్కోవచ్చు. ప్రస్తుత పోరులో ఉక్రెయిన్‌ గెలుస్తుందనే నమ్మకం రోజు రోజుకూ పశ్చిమ దేశాల్లో సడలుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇరవైశాతం ప్రాంతం మీద తమ పట్టులేదని జెలెనెస్కీ ప్రకటించిన తరువాత ఆ భావన ఇంకా పెరుగుతోంది. ఇప్పుడు పశ్చిమ దేశాలకు ఉక్రెయిన్‌ సంక్షోభాన్ని కొనసాగించాలా లేదా అన్న ప్రశ్న ఎదురుకానుంది. అమెరికా, ఐరోపా దేశాల్లో ఆర్ధిక పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది. ధనికదేశాల్లో మాంద్యం తలెత్తవచ్చనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. అలాంటపుడు రష్యామీద పోరు కొనసాగించి సాధించేదేమిటి అన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

కొలంబియా ఎన్నికల్లో వామపక్షం ముందంజ !

01 Wednesday Jun 2022

Posted by raomk in Current Affairs, History, imperialism, INTERNATIONAL NEWS, Latin America, Left politics, Opinion, USA

≈ Leave a comment

Tags

Colombian presidential election 2022, Latin American left, leftist Gustavo Petro


ఎం కోటేశ్వరరావు


లాటిన్‌ అమెరికాలో మరో వామపక్ష ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్దం అవుతోంది. ఆదివారం నాడు కొలంబియాలో జరిగిన అధ్యక్ష పదవి ఎన్నికలలో వామపక్ష, పురోగామి ” చారిత్రాత్మక ఒప్పంద ” కూటమి అభ్యర్ధి గుస్తావ్‌ పెట్రో ముందంజలో ఉన్నారు. అక్కడి రాజ్యాంగం ప్రకారం పోలైన ఓట్లలో సగానికిపైగా తెచ్చుకున్నవారినే విజేతగా గుర్తిస్తారు. మొత్తం ఎనిమిది మంది పోటీ పడగా పెట్రోకు 40.33శాతం, స్వతంత్రుడిగా పోటీ చేసిన మితవాద వాణిజ్యవేత్త రుడాల్ఫో హెర్నాండెజ్‌కు 28.15శాతం ఓట్లు, మూడో పక్ష అభ్యర్ధి ఫెడరికో గూటిరెజ్‌కు 23.92శాతం రాగా మిగిలిన ఐదుగురికి 5.87శాతం వచ్చాయి. తొలి దఫా ఎవరికీ సంపూర్ణ మెజారిటీ రాకపోవటంతో జూన్‌ 19 మొదటి రెండు స్థానాల్లో ఉన్న వారి మధ్యపోటీ జరగనుంది. రెండు, మూడు స్థానాల్లో వచ్చిన వారిద్దరూ మితవాద శక్తులే. తుది పోటీల్లో తాను హెర్నాండెజ్‌కు మద్దతు ఇవ్వనున్నట్లు గూటిరెజ్‌ ప్రకటించటంతో పోటీ ఆసక్తికరంగా మారింది.
ఎన్నికల్లో పెట్రో ముందంజ లాటిన్‌ అమెరికాను ఆశాభావంతో నింపిందని, జనాలు సంప్రదింపులు, సామాజిక సమానత్వం, ఏకీకరణ వంటి అంశాలతో కొత్త ఊపిరి పీల్చటం ప్రారంభించినట్లు పందొమ్మిది లాటిన్‌ అమెరికా దేశాలకు చెందిన వామపక్ష నేతలు, మేథావులతో కూడిన ప్యుబెలా బృందం ఒక ప్రకటనలో హర్షం వెలిబుచ్చింది.కొలంబియా వామపక్ష పురోగమన ఆశల వ్యక్తీకరణ అని కూడా పేర్కొన్నది.నూతన కొలంబియా గురించి కలలు గన్న యువత అసమాన కృషి ” చారిత్రాత్మక ఒప్పంద ” కూటమి అభ్యర్ధుల విజయం వెనుక ఉందని, విస్మరణకు గురైన స్త్రీ,పురుషులందరికీ గుర్తింపు ఇవ్వాలని పేర్కొన్నది. నిష్పాక్షికమైన, ప్రజాస్వామిక,శాంతియుత కొలంబియా నిర్మాణం జరగాలని ఆకాంక్షించింది. 2019 జూన్‌ 12-14 తేదీలలో మెక్సికోలోని ప్యుబెలా పట్టణంలో జరిగిన సమావేశంలో పది దేశాలకు చెందిన 30 మందితో ఈ బృందం ప్రారంభమైంది. దీనిలో ఇప్పుడు ఐరోపాలోని స్పెయిన్‌తో సహా19 లాటిన్‌ అమెరికా దేశాలకు చెందిన 200 మంది గతేడాది నవంబరు 29,30, డిసెంబరు ఒకటవ తేదీల్లో ఇంటర్నెట్‌ ద్వారా జరిగిన ఐదవ సమావేశంలో పాల్గొన్నారు. ఈ బృందంలో లూలా డ సిల్వా, దిల్మా రౌసెఫ్‌(బ్రెజిల్‌), ఆల్బర్టో ఫెర్నాండెజ్‌(అర్జెంటీనా) రాఫెల్‌ కొరెయా (ఈక్వెడోర్‌) ఇవో మొరేల్స్‌(బలీవియా) వంటి నేతలున్నారు.


ఒకవైపు మితవాద – పురోగామివాద శక్తుల రాజకీయ సమీకరణలు, మరోవైపు హింసాకాండ నేపధ్యంలో ఈ ఎన్నికలు జరిగాయి. ఎనిమిది సంవత్సరాల పాటు 2002-10 మధ్య అధికారంలో ఉన్న ఆల్వారో ఉరిబి కొలంబియా వామపక్షశక్తుల అణచివేతలో, మాదక ద్రవ్యాల మాఫియాలను ప్రోత్సహించటంలో పేరుమోశాడు. వేలాది మంది పౌరులను హతమార్చేందుకు కారకుడు. ప్లాన్‌ కొలంబియా పేరుతో అమెరికా అందచేసిన 280 కోట్ల డాలర్లతో ప్రయివేటు సాయుధ మూకలను తయారు చేసి మిలిటరీకి అనుసంధానించాడు. వామపక్ష గెరిల్లా ఉద్యమాలు నిర్వహించిన ఎఫ్‌ఏఆర్‌సి, ఇఎల్‌ఎన్‌ సంస్థలు,వాటి మద్దతుదార్లను హతమార్చటం, దాడులు చేయటమే వాటిపని. తాజా ఎన్నికల్లో కూడా ఆ మూకలు వామపక్ష కూటమి అభ్యర్ధులను హతమారుస్తామని ప్రకటనలు, కుట్రలు చేశాయి. గతనాలుగు సంవత్సరాలుగా అధికారంలో ఉన్న ఇవాన్‌ డ్యూక్‌ ఉరుబి కీలుబొమ్మ. రాజ్యాంగం ప్రకారం ఎన్నికైన వారు మరోసారి పోటీ చేసేందుకు అవకాశం లేనందున ఇతగాడు ఎన్నికలకు దూరంగా ఉన్నాడు. రెండవది ఈ పార్టీ అనుసరించిన విధానాల కారణంగా జనాలకు దూరమైంది. ఈ ఎన్నికల ప్రక్రియను అడ్డుకోకుండా చూసేందుకు మే 25 నుంచి జూన్‌ మూడు వరకు ఏకపక్షంగా కాల్పుల విరమణ పాటిస్తున్నట్లు వామపక్ష జాతీయ విముక్తి సైన్యం(ఇఎల్‌ఎన్‌) ప్రకటించింది.


కొలంబియా ఎన్నికల నిబంధనల ప్రకారం అధ్యక్ష అభ్యర్ధికి వచ్చిన ఓట్లనే ఉపాధ్యక్ష పదవికి పోటీ చేసిన వారికీ వర్తింప చేసి విజేతగా ప్రకటిస్తారు. అందువలన రెండు పదవులకూ పోటీచేసే వారి పేర్లు బాలట్‌లో ఉంటాయి.2010లో తొలి సారి పోటీ చేసి నాలుగవ స్థానంలో నిలిచి, తిరిగి 2018 ఎన్నికల్లో పోటీ చేసిన గుస్తావ్‌ పెట్రోకు తొలి రౌండులో 25.09, రెండవ రౌండ్‌లో 41.77శాతం వచ్చాయి.గత ఎన్నికల్లోనూ ఐదు పార్టీల కూటమి తరఫున పోటీ చేయగా ఈసారి ఆరు వామపక్ష, ప్రజాతంత్ర పార్టీల, ఉద్యమ సంస్థల కూటమి తరఫునే పోటీ చేశారు. గత ఎన్నికల కంటే తొలి రౌండులో పదిహేనుశాతం పైగా ఓట్లు అదనంగా వచ్చాయి. కమ్యూనిస్టు లేదా ఒక వామపక్ష పార్టీ పార్లమెంటరీ ఎన్నికల ప్రక్రియలో పాల్గొనాలని నిర్ణయించిన తరువాత ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీ వచ్చే అవకాశం లేనపుడు, తమ ఎన్నికల అజెండాకు అనుగుణంగా భావసారూప్యత కలిగిన పార్టీలతో కలసి పోటీ పడటం అనివార్యం.

కొలంబియాలో గత ఎన్నికల్లోని వామపక్ష కూటమి పార్టీల బదులు ఈ ఎన్నికల్లో కొత్తవి రంగంలోకి వచ్చాయి. గుస్తావ్‌ పెట్రో విషయానికే వస్తే 1970లో ఎన్నికల అక్రమాలను నిరససిస్తూ తలెత్తిన” ఏప్రిల్‌ 19 ఉద్యమం ” గెరిల్లా సంస్థలో 17 ఏండ్ల వయస్సులో (1977లో) చేరాడు. తరువాత దాని విధానాలు నచ్చక ఎం19 డెమోక్రటిక్‌ అలయన్స్‌ అనే పార్టీలో పని చేరాడు. ఇలా ఆరు పార్టీల్లో పని చేశాడు.2011లో హ్యూమన్‌ కొలంబియాపేరుతో తాను ఏర్పాటు చేసిన పార్టీలో అప్పటి నుంచి కొనసాగుతున్నారు. ఎన్ని పార్టీల్లో పనిచేసినా పురోగామి భావజాలాన్ని వదులుకోలేదు. సైద్దాంతిక, ఎత్తుగడల అంశంలో విబేధాలతో పార్టీలను వీడాడు.
ఎన్నికల్లో ఒక కూటమిగా కొన్ని పార్టీలు ఏర్పడిన తరువాత అభ్యర్ధి ఎవరనే ప్రశ్న తలెత్తవచ్చు. ఏకాభిప్రాయం లేనపుడు మద్దతుదారులతో జరిపే ఎన్నికల ద్వారా నిర్ణయిస్తారు. తాజా ఎన్నికల్లో ఆరుపార్టీల ” చారిత్రాత్మక ఒప్పంద ” కూటమి తరఫున ఆరుగురు పోటీ పడగా హ్యూమన్‌ కొలంబియా-పేట్రియాటిక్‌ పార్టీల తరఫున ఉన్న గుస్తావ్‌ పెట్రోకు పోలైన వాటిలో 80.55శాతం ఓట్లు వచ్చాయి. రెండవ స్థానంలో ” ప్రత్నామ్నాయ ప్రజాస్వామిక కేంద్రం” అభ్యర్ధి ఫ్రాన్సియా మార్కెజ్‌కు 14శాతం వచ్చాయి. ఆమె ఉపాధ్యక్ష అభ్యర్ధిగా ఉన్నారు.ఆమె ఆఫ్రో-కొలంబియన్‌ మానవహక్కుల, పర్యావరణ పరిరక్షణ ఉద్యమ కార్యకర్తగా కూడా ఉన్నారు. మాజీ అధ్యక్షుడు అల్వారో ఉరిబి వామపక్ష, ప్రజాతంత్ర శక్తులను రూపుమాపేందుకు ప్రయత్నించినశక్తులకు ప్రతిరూపంగా నిలిచాడు. ఆ బాటలో నడిచేవారిని ఉరిబిస్టులని, వ్యతిరేకిస్తున్న వారిని ఉరిబిజం వ్యతిరేకులని పిలుస్తున్నారు. వీరిలో వామపక్ష వాదులే ఉండనవసరం లేదు, ప్రజాతంత్ర విధానాలను కోరుకొనే వారు కూడా ఉంటారు. గుస్తావ్‌ పెట్రో ఇలాంటి శక్తులకు ప్రతినిధిగా పోటీ పడినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. పార్లమెంట్‌ సెనెటర్‌గా గుస్తావ్‌ ఉన్న సమయంలో ఉరిబి విధానాలను గట్టిగా ప్రతిఘటించాడు. అందువలన ఉరిబి మద్దతుదార్లు ఎన్నికల ప్రచారంలో గుస్తావ్‌ను వామపక్షవాదిగా పేర్కొంటూ పెట్రో గెలిస్తే వెనెజులాలో ఛావెజ్‌ అమలు జరిపిన విధానాలనే ఇక్కడ కూడా ప్రవేశపెడతారని తప్పుడు ప్రచారం చేశారు.


ఈ ఎన్నికల్లో గెలిస్తే తమ కూటమి హరిత ఇంథనాన్ని ప్రోత్సహించి చమురువాడకాన్ని తగ్గిస్తుందని పెట్రో చెప్పాడు. ఆర్ధిక అసమానతల తగ్గింపు, ధనికుల మీద పన్నుల పెంపుదల చేస్తామని, దేశాన్ని నాశనం చేసే నయా ఉదారవాద విధానాలనుంచి వైదొలుగుతామని చెప్పాడు. 2021లో జరిగిన నిరసనల మీద ప్రదర్శించిన పోలీసు జులుం గురించి దిగిపోనున్న అధ్యక్షుడు ఇవాన్‌ డ్యూక్‌ మీద విచారణ జరుపుతామని కూడా వాగ్దానం చేశాడు. మాదకద్రవ్యాల ఉత్పత్తి శక్తుల చేతుల్లో ఉన్న విస్తారమైన భూములన్నింటిలో ఆహార ఉత్పత్తుల పునరుద్దరణకు కోటిన్నర హెక్టార్లలో సంస్కరణలు చేపడతామని, కొత్తగా చమురు ఉత్పత్తి నిలిపివేస్తామని, ప్రయివేటీకరించిన ఆరోగ్యరంగంలో సంస్కరణలు తెస్తామని, ప్రభుత్వ విద్యారంగంలో పెట్టుబడులు పెంచుతామని, నీరు, రైలు సౌకర్యాలను మెరుగుపరుస్తామని, తమ ప్రభుత్వ తొలిచర్యగా ఆకలి నిరోధానికి ఆర్ధిక అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తామని వాగ్దానం చేశారు. మహిళల హక్కులను కాపాడతామని, వెనెజులాతో దౌత్య సంబంధాలను పునరుద్దరిస్తామని పేర్కొన్నారు.


ఎన్నికల ప్రచారంలో ఎదురైన కొన్ని అంశాల మీద గుస్తావ్‌ స్పందన ఎలా ఉందో చూద్దాం. వెనెజులాలో నియంతృత్వం ఉన్నందున దానితో సంబంధాలు ఎలా పెట్టుకుంటారని అడిగిన ప్రశ్నకు బదులిస్తూ సిద్దాంతం ప్రకారం వెనెజులా నియంతృత్వ దేశమైతే మనం దౌత్య సంబంధాలు పెట్టుకోకూడదు, మరి మన ప్రభుత్వం యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌తో సంబంధాలు కలిగి ఉంది, అక్కడ బహుశా మీరు చెబుతున్న వెనెజులా కంటే దిగజారిన నియంతృత్వం ఉంది, దాని సంగతేమిటి ? అని ప్రశ్నించాడు. దౌత్య సంబంధాలనేవి దేశాల మధ్య ఉంటాయి తప్ప వ్యక్తులతో కాదు అన్నాడు. సమానత్వ సాధనకు వెనెజులా నేత ఛావెజ్‌ తీసుకున్న చర్యలను పెట్రో ప్రశంసించాడు. సామాజిక కార్యక్రమాన్ని చమురు ఆదాయంతో ముడిపెట్టటం ఛావెజ్‌ తప్పిదమని ఫ్రెంచి పత్రిక లీమాండ్‌తో చెప్పాడు. గుస్తావ్‌ పెట్రో వెలిబుచ్చిన కొన్ని అంశాలపై విమర్శలు వెలువడినప్పటికీ వామపక్ష వాదిగానే ఎన్నికల్లో ప్రతిపక్షాలు చూశాయి.
గుస్తావ్‌ పెట్రో ఎన్నికైతే తమ ఆటలు సాగవని అక్కడి అమెరికా పాలకులు, కార్పొరేట్‌, ధనికశక్తులు భావిస్తున్నాయి.అందుకే వామపక్ష, ప్రజాతంత్రశక్తులను హతమార్చేందుకు నిరంతరం కుట్రలు చేస్తున్నాయి. పెట్రోతో పాటు ఫ్రాన్సియా మార్‌క్వెజ్‌ను హతమారుస్తామని ప్రభుత్వ మద్దతు ఉన్న మూకల నుంచి అనేక బెదిరింపులు ఎన్నికల ప్రచారంలో వచ్చాయి. ఆ కారణంగానే కాఫీ పండే ప్రాంతంలో పెట్రో ప్రచారం రద్దు చేసుకోవాల్సి వచ్చింది.ఈ నేపధ్యంలో వారి భద్రత గురించి 20దేశాలకు చెందిన 90 మంది ప్రముఖులు, ప్రజాప్రతినిధులు ఒక లేఖలో ఆందోళన వెల్లడించారు. కార్మిక, సామాజిక ఉద్యమ, పర్యావరణం, సామాజిక తరగతుల నేతలు 50 మందిని హతమారుస్తామంటూ బెదిరింపులు వచ్చినట్లు కూడా ఆ లేఖలో పేర్కొన్నారు.


ఇక తొలి రౌండులో రెండవ స్థానంలో ఉన్న రోడాల్ఫో హెర్నాండెజ్‌ హింసాత్మక, చౌకబారు స్వభావం కలిగిన ధనికుడిగా పేరుమోశాడు. కొందరు అతడిని కొలంబియా ట్రంప్‌ అని ఎద్దేవా చేశారు. ఉరిబిజంతో కొన్ని అంశాల్లో విబేధించినప్పటికీ పచ్చిమితవాది. అలాంటి వ్యక్తి నేరుగా వామపక్ష నేతతో పోటీ పడనున్నారు. అసాధారణ పరిణామాలు జరిగితే తప్ప రెండవ దఫా ఎన్నికల్లో గుస్తావ్‌ పెట్రో విజయం సాధించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అదే జరిగితే లాటిన్‌ అమెరికా ఎర్రపూల వనంలో మరో మందారం మొగ్గతొడగనుందని చెప్పవచ్చు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

మోడీ పన్ను తగ్గింపు ఆవిరి – మరోసారి చమురు ధరల మోత !

31 Tuesday May 2022

Posted by raomk in BJP, Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, RUSSIA, Uncategorized, USA

≈ Leave a comment

Tags

BJP, Fuel Price in India, Fuel prices freezing, Narendra Modi Failures


ఎం కోటేశ్వరరావు


మంగళవారం నాడు (మే 31వ తేదీ) అంతర్జాతీయ చమురు మార్కెట్లో బ్రెంట్‌ రకం ధర మరోసారి 124 డాలర్లు దాటింది. 2020-21లో మన దేశం దిగుమతి చేసుకున్న ముడిచమురు పీపా సగటు ధర 44.82 డాలర్లు కాగా 2021-22లో అది 79.18 డాలర్లకు పెరిగింది.వర్తమాన ఆర్ధిక సంవత్సరం తొలి నెల ఏప్రిల్‌లో సగటు ధర 103 డాలర్లుంది. మే నెలలో 108.61డాలర్లకు పెరిగింది. మన్మోహన్‌ సింగ్‌ పాలనా కాలంలో ఒక లీటరు పెట్రోలు, ఒక లీటరు డీజిలు కొనుగోలు చేస్తే జనం కేంద్ర ప్రభుత్వానికి చెల్లించిన పన్ను రు.9.48, రు.3.56 మొత్తం రు.13.04. నరేంద్రమోడీ అధికారానికి వచ్చి జనాలకు మంచి చేసేందుకు గాను దాన్ని రు.32.98, రు.31.83 మొత్తం రు.64.81కు పెంచారు. బిజెపికి చెడు రోజులు రాకుండా చూసుకొనేందుకు దీనిలో కేంద్ర ప్రభుత్వం 2021లో ఒకసారి, 2022లో తగ్గించిన మొత్తం రు.29. అంటే నిఖరంగా ” మంచిరోజుల కోసం ” ఇంకా రు.35.81 పిండుతూనే ఉన్నారు. నరేంద్రమోడీ ఏలుబడి మీద ఇంకా భ్రమలున్నవారికి, భజన చేస్తున్నవారికీ ఈ వివరణ కాస్త చిరాకు తెప్పించటం సహజమే. ఎందుకంటే శ్రీలంక పరిణామాలను గుర్తు చేస్తాయి మరి. గతంలో 137 రోజుల పాటు చమురు ధరలను స్థంభింపచేసిన మోడీ సర్కార్‌ ఏప్రిల్‌ ఆరవ తేదీ నుంచి మరోసారి ధరల సవరణ నిలిపివేసింది. దీనివలన తమకు పెట్రోలు మీద లీటరుకు రు.13, డీజిలుకు రు.24 నష్టం వస్తోందని ప్రైవేటు కంపెనీలు చెబుతున్నాయి. గతంలో వచ్చిన నష్టాన్ని ధరలు పెంచి పూడ్చారు. ఇప్పుడు మరోసారి కొంత కాలం తరువాత అదేపని చేస్తారు. జనాలకు ఒరిగేదేమీ ఉండదు. మార్చినెల 21 వరకు 137 రోజుల పాటు స్థిరంగా ఉంచి ఢిల్లీలో లీటరు పెట్రోలు రు.95.41 ధరను ఏప్రిల్‌ ఆరు నాటికి రు.105.41కి, డీజిలు ధరను రు.86.67 నుంచి రు.96.67కు పెంచారు. అంతకు ముందు రెండింటి మీద కేంద్రం రు.15 పన్ను తగ్గించి, మార్చి-ఏప్రిల్‌ నెలల్లో రు.20 ధర పెంచింది. ఇటీవల రు.14 తగ్గించారు, తరువాత ఎంత పెంచుతారో వేచి చూడాల్సిందే.


ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌ సంక్షోభం ప్రారంభమైన తరువాత అనేక పరిణామాలు సంభవించాయి. వాటిలో అమెరికా చమురు రాజకీయం కూడా ప్రధానమైనదే. ఆంక్షలు, అలకలు ఏదో ఒక కారణంతో ఐరోపా దేశాలు రష్యానుంచి ముడిచమురు కొనుగోలును తగ్గించేందుకు పూనుకున్నాయి. ఇదే సమయంలో చైనా, భారత్‌ రికార్డు స్థాయిలో దిగుమతులు పెంచాయని ఇంధన విశ్లేషణ సంస్థ కెప్లర్‌ పేర్కొన్నది. మే నెలలో సముద్రాల మీద ప్రయాణంలో లేదా లంగరు వేసి ఉన్న ఓడల్లో 79 మిలియన్ల పీపాల రష్యా చమురు ఉంది. ఫిబ్రవరి నెలలో 27మిలియన్ల పీపాలుంది.ఉక్రెయిన్‌ సంక్షోభానికి ముందు రష్యా ప్రధానంగా ఐరోపాకే చమురు ఎగుమతి చేసేది. పశ్చిమ దేశాల ఆంక్షలను ఖాతరు చేసేది లేదంటూ చైనా, మన దేశం ఇప్పుడు పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నాయి. మార్చినెలలో మన దేశానికి చమురు సరఫరా చేసిన దేశాలలో రష్యా పదవ స్థానంలో ఉండగా ఏప్రిల్లో నాలుగవ స్థానానికి చేరిందని చమురు టాంకర్ల సమాచారం వెల్లడించినట్లు రాయిటర్స్‌ పేర్కొన్నది. ఈ కారణంగానే ఆ దిగుమతులను నిలిపివేయాలంటూ మరోసారి మన మీద వత్తిడి తెచ్చేందుకు అమెరికా పూనుకుంది.ఆసియాలోని కొందర్ని రాజకీయవైఖరి కంటే ఆర్ధిక అంశాలే కొనుగోలుకు పురికొల్పినట్లు సింగపూర్‌లోని కెప్లర్‌ సీనియర్‌ విశ్లేషకుడు జేన్‌ షీ అన్నారు. గతంలో ఒకశాతంగా ఉన్న మన రష్యా దిగుమతులు ఇప్పుడు ఆరుశాతానికి చేరినట్లు, మార్చి నెలలో రోజుకు 66వేల పీపాల దిగుమతి మరుసటి నెలలో 2,77,000కు పెరిగినట్లు, మే నెలలో అది 4,87,500కు పెరుగుతుందని రాయిటర్స్‌ వార్త వెల్లడించింది. ఆఫ్రికా నుంచి మనదేశం చేసుకుంటున్న దిగుమతులు 14.5 నుంచి ఆరుశాతానికి తగ్గాయి, అమెరికా నుంచి మూడుశాతం తగ్గాయి.


రష్యాపై తాను విధించిన ఆంక్షలను అందరూ అనుసరించేట్లు చూడాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఆదేశించిన మేరకు మన దేశం మీద వత్తిడి తెచ్చేందుకు అమెరికా సహాయ మంత్రి ఎలిజబెత్‌ రోజెన్‌బర్గ్‌ ఢిల్లీ, ముంబాయి నగరాలకు రానున్నారు. రష్యామీద ఆంక్షలను మరింత కఠినతరంగావించనున్నారనే వార్తల నేపధ్యంలో అమెరికా వత్తిడి పెంచుతోంది. ఆసియా కొనుగోళ్లను అడ్డుకుంటే తప్ప ఆంక్షల వలన ఫలితం ఉండదని ఇప్పటికే తేలింది. ఈ ఏడాది ప్రారంభం నుంచి చూస్తే ఇప్పటికీ ఆసియా ఓడలద్వారా ఎగుమతులు 50శాతం పెరిగాయి. జనవరిలో రోజుకు 15లక్షల పీపాలు పంపితే ఇప్పుడు 23లక్షలకు చేరింది. మొత్తం మీద ఫిబ్రవరి 24కు ముందు స్ధాయికి ఎగుమతులు చేరుకుంటున్నట్లు చెబుతున్నారు.


అంతర్జాతీయ చమురు మార్కెట్లో వచ్చిన మార్పులు, తాజా పరిణామాలు ఇప్పుడు అమెరికాకు లాభదాయకంగా మారాయి. చమురు ధరలను డాలర్లలో నిర్ణయిస్తున్న సంగతి తెలిసిందే. ఇతర కరెన్సీలతో కొనుగోలు చేయాలంటే ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. గతంలో చూసినపుడు డాలరు విలువ ఎక్కువగా ఉంటే చమురు ధర తక్కువగానూ చమురు ధర పెరిగితే డాలరు విలువ తక్కువగానూ ఉండేది. అమెరికా గతంలో చమురును దిగుమతి చేసుకొనేది ఇప్పుడు షేల్‌ చమురు ఉత్పత్తితో ఎగుమతిదారుగా మారింది. ప్రపంచ ఉత్పత్తి దేశాల్లో ఒకటో స్ధానంలో ఉంది. గతంలో చమురు దిగుమతి చేసుకున్నపుడు ధర ఎక్కువగా ఉంటే ఎక్కువ డాలర్లు చెల్లించాల్సి వచ్చేది. ఇప్పుడు తానే ఎగుమతి చేస్తున్నందున ధర ఎక్కువగా ఉంటే ఆర్ధికంగా పెద్ద లబ్దిపొందుతోంది. చమురు ఉత్పత్తి మొత్తం ప్రయివేటు రంగంలోనే ఉన్నందున వారికి ఎంత ధర పెరిగితే అంతగా లాభాలు వస్తాయి. ఉక్రెయిన్‌ సంక్షోభాన్ని ఎగదోయటం ద్వారా రష్యాను దెబ్బతీసి ఐరోపా చమురు మార్కెట్‌ను తాను ఆక్రమించాలని చూస్తోంది. అది కొంత మేరకు ఇప్పటికే ఫలించింది. ఇటీవల ప్రపంచంలో చమురు ధరతో పాటు అమెరికా డాలరు విలువా పెరుగుతోంది. అమెరికా సరకులు కొనుగోలు చేయాలంటే దిగుమతి చేసుకొనే దేశాలకు భారం పెరుగుతుంది. కనుక నిత్యం ఎక్కడో ఒకచోట ఉద్రిక్తతలను రాజేసి ఆయుధాలను అమ్ముకొని లబ్దిపొందుతున్నది. అవి లేకపోతే దాని వాణిజ్యలోటు ఇంకా పెరుగుతుంది. చైనా, ఇతర దేశాల నుంచి తక్కువ ధరలకు ఇతర సరకులను దిగుమతి చేసుకొని వాటి ద్వారా కూడా లబ్ది పొందుతున్నది. ఇదే సమయంలో ఖరీదైన తన వస్తువులను అంటగట్టేందుకు బెదిరింపులకు దిగుతోంది. అమెరికా చెలగాటం మన వంటి దేశాల జనాలకు ప్రాణసంకటం కలిగిస్తోంది.


గతంలో చమురు సంక్షోభం, ద్రవ్యోల్బణం వంటి అంశాలు అమెరికా కేంద్రంగా ఉండేవి. ఇప్పుడు అమెరికా ఎత్తుగడ కారణంగా ఐరోపా సంక్షోభ కేంద్రంగా మారింది. ఇప్పుడున్న స్థితిని బట్టి రానున్న రోజుల్లో బొగ్గు, చమురు, గాస్‌ ధరలు ఇంకా పెరుగుతాయని, సరఫరా కొరత ఏర్పడుతుందని భావిస్తున్నారు. దీని వలన అమెరికా కంటే ప్రపంచ ఆర్ధికవృద్ది ఎక్కువగా దెబ్బతింటుందని భావిస్తున్నారు. మరోవైపు డాలరు విలువ పెరుగుతుందని కూడా జోశ్యం చెబుతున్నారు. అమెరికా ఫెడరల్‌ నిధుల నిల్వలను పెంచినపుడల్లా వడ్డీరేటు పెరుగుతుంది. డాలరును సురక్షితమైనదిగా భావిస్తున్నందున మిగతా కరెన్సీల కంటే డాలర్ల వైపే మొగ్గుచూపుతారు. మదుపుదార్లు అంతకు ముందు ప్రపంచంలో ఎక్కడ పెట్టుబడులు పెట్టినా అమెరికాలో వడ్డీ రేటు పెరుగుతుందని భావించగానే వాటిని అమెరికాకు తరలిస్తారు. అది అమెరికాకు లబ్ది చేకూరుస్తుంది. తనకు విదేశీ పెట్టుబడులు అవసరమైనపుడు కూడా వడ్డీ రేట్లను పెంచుతుంది. విదేశీ మదుపుదార్లు మన మార్కెట్‌ నుంచి తప్పుకుంటున్న కారణంగా రూపాయి విలువ పతనమైంది. దాన్ని నిలబెట్టేందుకు రిజర్వుబాంకు నానా కష్టాలు పడుతోంది. రూపాయి విలువ తగ్గితే ఎగుమతులు పెరుగుతాయి, చమురుతో సహా దిగుమతుల ధరలు పెరుగుతాయి.2021 మార్చినెలతో ముగిసిన ఏడాదిలో మన వాణిజ్యలోటు 12.75బిలియన్‌ డాలర్లు, అది 2022 మార్చినెలతో ముగిసిన ఏడాదిలో 87.79బి.డాలర్లకు పెరిగింది. వర్తమాన సంవత్సరంలో అది వంద బిలియన్‌ డాలర్లకు పెరగవచ్చని అంచనా. రూపాయి విలువ పతనం దీనికి ప్రధాన కారణంగా చెబుతున్నారు. ఇప్పుడున్నదానికంటే మరింతగా పడిపోతే పరిస్థితి మరింతగా దిగజారుతుంది. 2020-21లో మన చమురు దిగుమతి బిల్లు 62.2 బిలియన్‌ డాలర్లు కాగా 2021-22లో అది 119.2 బి.డాలర్లకు చేరింది.


ఇటీవల ఎడిపి(రిసర్చ్‌ ఇనిస్టిట్యూట్స్‌ పీపుల్‌ ఎట్‌ వర్క్‌ 2022 అనే సంస్థ నిర్వహించిన ఒక సర్వే ప్రకారం జీవన వ్యయం పెరుగుతున్న కారణంగా తమ వేతనాలను పెంచాలని తమ యజమానుల మీద వత్తిడి తెచ్చేందుకు 86శాతం మంది భారతీయ కార్మికులు సిద్దం అవుతున్నారని తేలింది. ఈ సంస్థ 17దేశాల్లో సర్వే చేసింది. ప్రపంచ వ్యాపితంగా వేతన పెంపుదలను కోరుతున్న వారు సగటున 76శాతం కాగా భారత్‌లో అది 86శాతం ఉంది.బిజెపి వారు పదే పదే చెబుతున్న ”80” శాతంలో ఉన్నవారు వీరిలో కూడా అదే దామాషాలో ఉంటారని, వారికి వేరే వెండి పళ్లాల్లో వడ్డించరని చెప్పనవసరం లేదు. కరోనా మహమ్మారి ముగిసిన తరువాత వేతనాలు పెంచుతారనే భావనలో ఉన్నారని ఎడిపి భారత విభాగం ఎండి రాహుల్‌ గోయల్‌ చెప్పారు.యజమానులు పట్టించుకోకపోతే కార్మికుల ఆగ్రహం ప్రభుత్వాల మీదకు మళ్లుతుందని వేరే చెప్పనవసరం లేదు. ఏదో ఒక పేరుతో ఎలాంటి వేతనం లేకుండా అదనపు గంటలు పని చేయించుకోవటం పెరిగింది. 2020లో మన దేశంలో వారానికి సగటున 7.3 గంటలు పని చేస్తే 2021లో అది 8.5గంటలకు పెరిగింది. ప్రపంచ సగటు 9.2 గంటలు. ఈ దోపిడీకి ధరల పెరుగుదల తోడైతే బతుకు దుర్భరమే. ధరల పెరుగుదలకు దోహదం చేస్తున్న కారణాల్లో చమురు ధర ఒకటి. అందువలన నరేంద్రమోడీ అచ్చేదిన్‌ ఏలుబడిలో ఉన్నామనే భ్రమలతో బతుకుతున్నవారు మేలుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది. కొసమెరుపు ఏమంటే రష్యా చమురు దిగుమతులపై ఆంక్షలను మరింతగా పెంచాలని ఐరోపా సమాఖ్య నిర్ణయించిన నేపధ్యంలో చమురు ధరలు 130 డాలర్లకు పెరగవచ్చని ఆ రంగ విశ్లేషకులు చెబుతున్నారు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

చైనా, రష్యాలను బూచిగా చూపేందుకే బైడెన్‌ ఆసియా పర్యటన !

26 Thursday May 2022

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, RUSSIA, UK, USA, WAR

≈ Leave a comment

Tags

Joe Biden, Joe Biden Asia tour, Narendra Modi, Quad, Quadrilateral Security Dialogue, Taiwan Matters, Xi Jinping


ఎం కోటేశ్వరరావు


వార్తలద్వారా ఎలా రెచ్చగొట్టవచ్చో ఒక మంచి ఉదాహరణను చూద్దాం.” ప్రధాని మోడీ పాల్గొన్న చతుష్టయ సమావేశానికి దగ్గరగా చైనా, రష్యా యుద్ద విమానాలు : జపాన్‌ మంత్రి ” అన్నది ఒక వార్త శీర్షిక. జపాన్‌ రాజధాని టోకియోలో జరిగిన ఆ సమావేశంలో అమెరికా,జపాన్‌,ఆస్ట్రేలియా దేశాధినేతలు కూడా ఉన్నారు. నరేంద్రమోడీ ఉన్నందున అనే అర్ధం వచ్చేట్లు శీర్షిక పెట్టటం చైనా, రష్యాలతో మన దేశానికి తంపులు పెట్టే లేదా పెంచే వ్యవహారం తప్ప మరొకటి కాదు. చతుష్టయ దేశాలను హెచ్చరించేందుకే ఈ చర్య అని మన దేశంలో కొన్ని పత్రికల సంపాదకీయాలు రాయటం సరేసరి.ఇది తీవ్ర ఆందోళన కలిగించేది అని జపాన్‌ రక్షణ మంత్రి నోబు కిషి గుండెలు బాదుకున్నాడు. ఇలా జపాన్‌ సరిహద్దుల వరకు చైనా-రష్యా విమానాలు రావటం గతేడాది నవంబరు నుంచి నాలుగవసారి అని కూడా కిషి చెప్పాడు. మరి అప్పుడే సమావేశాలు జరిగినట్లు ? ఎవరిని హెచ్చరించేందుకు వచ్చినట్లు ?వాటిలో నరేంద్రమోడీ గారు లేరు కదా ! మా మంత్రిగారు ఏం చెప్పారన్నది వేరే గానీ ఆ విమానాలు తమ గగనతలాన్ని అతిక్రమించలేదని జపాన్‌ రక్షణ మంత్రిత్వశాఖ చెప్పినట్లు ఎఎఫ్‌పి వార్తా సంస్ద పేర్కొన్నది. జపాన్‌ సముద్రం మీద రెండు చైనా విమానాలతో జత కలసిన మరో రెండు రష్యా విమానాలు తూర్పు చైనా సముద్రం నుంచి పసిఫిక్‌ సముద్రం వైపు వెళ్లినట్లు జపాన్‌ మంత్రి చెప్పాడు. గూఢచార సమాచారాన్ని సేకరించేందుకు రష్యా విమానం ఒకటి కూడా జపాన్‌ వైపు వచ్చినట్లు, ఈ చర్యలు రెచ్చగొట్టేందుకే అని ఆరోపించాడు. అంతర్జాతీయ నిబంధనలను పాటించి మరొక దేశ గగనతలాన్ని అతిక్రమించకుండా విమానాలు తిరగటం సర్వసాధారణం.


ఇలా తమ విమానాలు సంయుక్తంగా తిరగటం నిరంతర గస్తీలో భాగమే అని చైనా, రష్యా పేర్కొన్నాయి.వార్షిక మిలిటరీ సహకార ఒప్పందంలో భాగంగా తిరిగినట్లు చైనా రక్షణశాఖ నిర్ధారించింది.టోకియో చతుష్టయ సమావేశాల సందర్భంగా తన రెచ్చగొట్టుడు చర్యలను సమర్దించుకొనేందుకు జపాన్‌ ఇలాంటి ఆరోపణలను చేస్తోందని చైనా పేర్కొన్నది. అమెరికా, జపాన్‌ రెచ్చగొడుతున్న తరుణంలో రెండు యుద్ద నౌకలను జపాన్‌ సమీపంలోని రెండు జలసంధులకు చైనా పంపింది. పశ్చిమ పసిఫిక్‌ సముద్రంలోని చైనా విమానవాహక నౌక నుంచి గత ఇరవై రోజుల్లో కనీసం మూడువందల సార్లు విమానాలు చక్కర్లు కొట్టినట్లు, తైవాన్‌ విషయంలో జోక్యం చేసుకుంటే తమ సత్తా ఏమిటో చూపేందుకే ఇలా చేసినట్లు వార్తలు వచ్చాయి.


జపాన్‌ పార్లమెంటు వెలుపల చతుష్టయ సమావేశాలు జరిగే చోట ఏర్పాటు చేసిన బానర్లు, పోస్టర్లలో ” హాంకాంగ్‌ స్వాతంత్య్రం, విప్లవం, ఉఘిర్‌లో మారణకాండను ఆపండి ” అని రాయటం చైనాను రెచ్చగొట్టటమే అన్నది స్పష్టం. ఇక జపాన్‌ సంగతికొస్తే 2021లో ఇరుగు పొరుగు దేశాలు తన గగనతలాన్ని అతిక్రమిస్తున్నాయనే అనుమానంతో తానే రికార్డు స్ధాయిలో ఎగబడి పట్టుకొనేందుకు ప్రయత్నించటం లేదా తానే గస్తీ తిరగటం వంటి పనులు చేసింది.ఇది ఆప్రాంతంలో తలెత్తిన తీవ్ర పరిస్ధితికి అద్దం పడుతోంది. ఇదంతా చతుష్టయం పేరుతో చైనా వ్యతిరేక కూటమి చర్యలు ముమ్మరం అయిన తరువాతే అన్నది స్పష్టం. 2020లో 279లో సార్లు , 2021లో 1,004 సార్లు జపాన్‌ విమానాలు తిరిగాయి. అంతకు ముందు 2016లో గరిష్టంగా 1,168సార్లు వెంటపడినట్లు అధికారికంగా వెల్లడించారు. దానికి 2012లో జపాన్‌ జనావాసం లేని మూడు దీవులను ప్రయివేటు వారినుంచి కొనుగోలు చేసింది, అవి తమవని చైనా చెప్పటంతో వాటి చుట్టూ జపాన్‌ తన విమానాలను గస్తీ తిప్పింది. దక్షిణ, తూర్పు చైనా సముద్రాల్లో చైనా చర్యలు ఆందోళన కలిగిస్తున్నట్లు చైనా తన శ్వేతపత్రంలో ఆరోపించింది.

యధాతధ స్ధితిని బలవంతంగా మార్చేందుకు పూనుకుంటే సహించేది లేదని ఏ దేశం పేరు పెట్టకుండా టోకియో చతుష్టయ సమావేశం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నప్పటికీ అది చైనా, రష్యాల గురించే అన్నది స్పష్టం. పేరుకు తమది మిలిటరీ కూటమి కాదంటూనే ఆ దిశగా దాన్ని మార్చేందుకు పూనుకున్నారు.దానికి విరుగుడుగా చైనా కూడా జాగ్రత్తపడుతోంది.దానిలో భాగంగానే తన మిలిటరీని పటిష్టపరుస్తోంది.దక్షిణ పసిఫిక్‌ ప్రాంతంలోని అనేక చిన్న దేశాలతో సంబంధాలను పటిష్టపరుచుకుంటోంది. 2017వరకు ఒక భావనగానే ఉన్న ఈ కూటమి గడచిన రెండు సంవత్సరాలలో నాలుగు సార్లు సమావేశం కావటం గమనించాల్సిన అంశం. ఆ తరువాతే లడఖ్‌లోని గాల్వన్‌ లోయ ఉదంతం జరిగినట్లు అంతర్జాతీయ పరిశీలకులు చెప్పారు. ఆస్ట్రేలియా-చైనా మధ్య వాణిజ్యపోరు మొదలైంది. సోలోమన్‌ దీవుల ప్రభుత్వంతో చైనా కుదుర్చుకున్న భద్రతా ఒప్పందం తమకు వ్యతిరేకంగానే అని ఆస్ట్రేలియా ఆరోపిస్తోంది. చైనా నావలు ఆ దీవుల్లో లంగరువేసేందుకు వీలుకలుగుతుందని అంటోంది.దీనికి ప్రతిగా బ్రిటన్‌, అమెరికాతో కలసి అకుస్‌ పేరుతో మిలిటరీ ఒప్పందం చేసుకుంది. బ్రిటన్‌ నుంచి అణుశక్తితో నడిచే జలాంతర్గాముల కొనుగోలుకు ఒప్పందం చేసుకుంది. దాదాపు శతాబ్దికాలంగా జపాన్‌-చైనా మధ్య వివాదాస్పదంగా ఉన్న కొన్ని దీవుల అంశమై ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఒకవైపు తైవాన్‌ దీవిని చైనా అంతర్భాగంగా గుర్తిస్తున్నామని చెబుతూనే దాన్ని సైనికంగా బలపరిచేందుకు అమెరికా పూనుకుంది.ఒక వేళ చైనా గనుక బలవంతంగా విలీనం చేసుకోవాలని పూనుకుంటే తాము మిలిటరీతో రక్షణ కల్పిస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఆసియా పర్యటనలో బెదిరించిన అంశం తెలిసిందే.


చతుర్ముఖ భద్రతా మాటామంతీ( ద క్వాడ్రిలేటరల్‌ సెక్యూరిటీ డైలాగ్‌) పేరుతో 2007లో జపాన్‌ చొరవతో భారత్‌,ఆస్ట్రేలియా, అమెరికా చర్చలు ప్రారంభించాయి. దీన్నే క్వాడ్‌(చతుష్టయం) అంటున్నారు. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో చైనాను ఎదుర్కోవటమే దీని లక్ష్యం. అదే ఏడాది ఆస్ట్రేలియా వెనక్కు తగ్గటంతో ఆ కూటమి ముందుకు సాగలేదు.2017లో మనీలాలో జరిగిన ఆసియన్‌ కూటమి సమావేశాల సందర్భంగా ఈ కూటమిని పునరుద్దరించాలని నాలుగు దేశాలు నిర్ణయించాయి.ఆ ప్రాంతంలో నౌకలను అడ్డుకున్న ఉదంతం ఒక్కటీ లేకున్నా ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలోని తూర్పు, దక్షిణ చైనా సముద్రాల్లో స్వేచ్చగా నౌకా రవాణా ఉండే పరిస్ధితి కల్పించాలనే పేరుతో ఒక అజెండాను ముందుకు తెచ్చాయి.పైకి ఏమి చెప్పినా చైనాను అడ్డుకోవటమే అసలు ఎత్తుగడ. ఇండో-పసిఫిక్‌ ప్రాంతం గురించే తమ కేంద్రీకరణ అని చెప్పిన చతుష్టయ కూటమి క్రమంగా ఇతర అంశాల మీద కూడా దృష్టి సారిస్తోంది.టోకియో భేటీతో పాటు ఈ ఏడాది మార్చి నెలలో జరిగిన సమావేశంలో ఉక్రెయిన్‌ సంక్షోభం గురించి చర్చించింది.
ఉక్రెయిన్‌ మీద రష్యా దాడి చేసినపుడు వివిధ కారణాలతో మిలిటరీతో ఆదుకోలేదు, తైవాన్‌ విషయంలో కూడా చైనా దాడి చేస్తే అలాగే ఉంటారా లేక రక్షణకు వస్తారా అని టోకియోలో విలేకరి అడిగిన ప్రశ్నకు వెంటనే జో బైడెన్‌ అవసరమైతే తైవాన్‌లో మిలిటరీతో ఎదుర్కొంటామని చెప్పాడు. ఒకే చైనా విధానాన్ని అమెరికా అంగీకరించింది నిజం, ఆ మేరకు ఒప్పందంపై సంతకాలు కూడా చేశాము. దానిలో ఎలాంటి మార్పూ లేదు. కానీ తైవాన్ను బలవంతంగా స్వాధీనం చేసుకోవటం సబబు కాదు. అందుకు పూనుకుంటే మిలిటరీతో ఎదుర్కొంటాం అన్నాడు. బలప్రయోగం చేసే హక్కు చైనాకు లేదన్నాడు. బలవంతంగా ఆక్రమించేందుకు చైనా పూనుకుంటుందని తాను అనుకోవటం లేదని, అది ప్రపంచం ఎంత గట్టిగా స్పందస్తుంది అనేదానిపై ఆధారపడి ఉంటుందని, దురాక్రమణకు మూల్యం చెల్లించాల్సి ఉంటుందన్నాడు. అంతకు ముందు జపాన్‌ ప్రధాని కిషిడాతో కలసి మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడైనా ఏకపక్షంగా యధాతధ స్ధితిని మార్చేందుకు ఎవరైనా పూనుకుంటే సహించేది లేదని, రష్యా దాడి ప్రపంచ వ్యవస్ధ పునాదులను కదలించిందని బైడెన్‌ అన్నాడు.

బైడెన్‌ ప్రకటనల మీద చైనా తీవ్రంగా స్పందించింది. ఏదో అనుకోకుండా మాట్లాడినట్లుగా తాజా స్పందనను పరిగణించలేమని, అంగీకరించిన ఒకే చైనా విధానం నుంచి వెనక్కు తగ్గుతున్నదనేందుకు సూచిక, మరొక అడుగు ముందుకు వేసినట్లు చైనా భావిస్తోంది. ఉక్రెయిన్‌ ముసుగులో తైవాన్‌ స్వాతంత్య్రం గురించి అమెరికా, జపాన్‌ తమ పధకాలతో ముందుకు పోతే వాటిని గట్టిగా ఎదుర్కొంటామని స్పష్టం చేసింది. ఉక్రెయిన్లో మాదిరి బలప్రయోగంతో ఇండో పసిఫిక్‌ ప్రాంతంలో కూడా ఏకపక్షంగా యధాతధ స్దితిని మార్చితే చూస్తూ ఊరుకోబోమని జపాన్‌ ప్రధాని కిషిదా కూడా చెప్పటాన్ని చైనా పరిశీలకులు గుర్తు చేశారు. తైవాన్‌ తమ అంతర్గత అంశమని, దానిలో విదేశీ శక్తుల జోక్యాన్ని అనుమతించబోమని చైనా విదేశాంగశాఖ ప్రతినిధి వాంగ్‌ వెన్‌బిన్‌ విలేకర్లతో స్పష్టం చేశాడు. అమెరికా సైనికులను తైవాన్‌కు తరలించనప్పటికీ ఏదో ఒకముసుగులో ఆయుధాలను పెద్ద ఎత్తున అందచేస్తున్నది. అందువలన సైనికులను పంపటం ఒక్కటే మిలిటరీ జోక్యం కాదని ఆయుధాల అందచేత కూడా మిలిటరీ జోక్యమే అని చైనా పరిగణిస్తున్నప్పటికీ సంయమనం పాటిస్తున్నది. చైనా మీదకు పోవాలని బైడెన్‌ కోరుకున్నట్లయితే చైనా-అమెరికా సంబంధాలు టైటానిక్‌ ఓడ మంచుకొండను ఢకొీన్నపుడు జరిగిన మాదిరే జరుగుతుందని చైనా పరిశీలకులు వర్ణించారు. ఉక్రెయిన్‌ అంశాన్ని తైవాన్‌ సమస్యతో కలిపి చూపటం వెనుక తైవాన్‌ దీవిపై చైనా సార్వభౌమత్వాన్ని తిరస్కరించే ఎత్తుగడ ఉంది.అంతేకాదు తైవాన్ను చూపుతూ ఆసియా పసిఫిక్‌ ప్రాంతానికి చైనా ముప్పు ఉందని ఈ ప్రాంత దేశాలను నమ్మించటం,తప్పుదారి పట్టించటం కూడా తెలిసిందే.


జో బైడెన్‌ ఆసియా పర్యటనను మొత్తంగా చూసినట్లయితే ప్రధానంగా రెండు లక్ష్యాలతో సాగినట్లు చెప్పవచ్చు. గత రెండు దశాబ్దాలలో తొలిసారిగా ఆసియా పర్యటన జరిపిన అమెరికా నేతలందరూ చైనాను సందర్శించారు. తొలిసారిగా జోబైడెన్‌ చైనాలో అడుగుపెట్టలేదు. ప్రాంతీయ సమగ్ర ఆర్ధిక భాగస్వామ్యం (ఆర్‌సిఇపి) పేరుతో ఏర్పడిన అతి పెద్ద ఆర్ధిక కూటమిలో అమెరికా లేదు. దానికి పోటీగా ఇండో పసిఫిక్‌ ఎకనమిక్‌ ఫ్రేమ్‌వర్క్‌ (ఐపిఇఎఫ్‌) పేరుతో కొత్త కూటమిని ఉనికిలోకి తెచ్చి ఆ ప్రాంత దేశాలను ఆకర్షించటం, తద్వారా తనపెత్తనాన్ని నిలుపుకొనేందుకు పూనుకోవటం. దీని వలన మనకు కలిగే లబ్ది ఏమిటో తెలియకుండానే మన దేశం సిద్దం సుమతీ అన్నది. ఆర్‌సిఇపిలోని మరికొన్ని దేశాలు కూడా దీనిలో చేరుతున్నట్లు ప్రకటించాయి.ఈ కూటమిలో అమెరికా మార్కెట్లో ప్రవేశించే అవకాశాలు పరిమితమని ఇప్పటికే విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఇది కూడా చైనాను దూరంగా పెట్టే ఎత్తుగడే. రెండవదాని కొస్తే ఉక్రెయిన్‌ విషయంలో తాము మిలిటరీని పంపేది లేదని అమెరికా చెప్పటంతో దాన్ని నమ్ముకుంటే అంతే సంగతులని అనేక దేశాలు భావిస్తున్నాయి. ఇది అమెరికాకు రాజకీయంగా ఎంతో నష్టం కలిగించింది. తన ప్రయోజనాలకోసం రెచ్చగొట్టి ముందుకు తోసి తాను తప్పుకుంటుందనే భావం ఎల్లెడలా కలిగింది. దాన్ని పోగొట్టేందుకు, మద్దతుదార్లలో విశ్వాసాన్ని కల్పించేందుకు తైవాన్‌ అంశంలో తాము సైనికంగా జోక్యం చేసుకుంటామని బైడెన్‌ చెప్పాడు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

ప్రపంచాన్ని భయపెడుతున్న మంకీపాక్స్‌ వెనుక అమెరికా హస్తం ఉందా ?

22 Sunday May 2022

Posted by raomk in Current Affairs, Health, History, INTERNATIONAL NEWS, Opinion, Science, UK, Uncategorized, USA

≈ 1 Comment

Tags

BILL GATES, Monkeypox, Monkeypox Conspiracy Theory, Monkeypox goes global, Monkeypox Vaccines, Smallpox


ఎం కోటేశ్వరరావు


ఒకనాడు కేవలం ఆఫ్రికా ఖండానికే పరిమితం అనుకున్న మంకీపాక్స్‌ వైరస్‌ ఇప్పుడు ప్రపంచాన్ని ఆవరించనుందా ? కరోనా మాదిరి మహమ్మారిగా మారనుందా ? నివృత్తి జరిగేంతవరకు అనేక అనుమానాలు, సందేహాలు వెలువడుతూనే ఉంటాయి. తెలుగు నాట మసూచి, పెద్ద అమ్మోరు, స్ఫోటకంగా పిలిచిన వైరస్‌కు ఇది సోదరి. ప్రస్తుతానికి అలాంటి తీవ్ర హెచ్చరికలు వెలువడలేదుగానీ కరోనా నేపధ్యంలో అనేక వార్తలు భయపెడుతున్నాయి. ఇది పాక్స్‌ జాతికి చెందిన వైరస్‌గా కోతుల్లో గుర్తించినందుకు దానికి మంకీపాక్స్‌ అని పేరు పెట్టారు. ఇది మసూచికి సంబంధించిందైనప్పటికీ అంతటి ప్రమాదకారి కాదని కొందరు అంటున్నా ,అప్పుడే నిర్దారించలేమని మరికొందరు హెచ్చరిస్తున్నారు.వరియోలా మేజర్‌, వరియోలా మైనర్‌గా పిలిచిన వైరస్‌లు మసూచి కారకాలు, ఇది గతశతాబ్దిలో 30 కోట్ల మందిని, అంతకు ముందు మరో ఇరవై కోట్ల మందిని బలితీసుకుందని అంచనా.పదహారవ శతాబ్దిలో బ్రిటన్‌లో దీన్ని స్మాల్‌పాక్స్‌ అని పిలిచారు.1980లో ప్రపంచంలో పూర్తిగా నిర్మూలించినట్లు ప్రకటించి ఈ వైరస్‌ ఇప్పుడు అమెరికా, రష్యాల్లోని రెండు పరిశోధనా సంస్ధలలో మాత్రమే ఉంది.


ఐరోపా, ఉత్తర అమెరికా, ఆసియా ఖండాల్లోని 14 దేశాల్లో మే నెల మూడవ వారం వరకు 120 నిర్దారణ లేదా అనుమానాస్పద కేసులు నమోదైనాయి. ఒక ప్రాంతంలోని జనాభాతో మరొక ప్రాంత జనాభాకు సంబంధలేనప్పటికీ ఇన్ని చోట్ల వ్యాప్తి చెందటం ఆసక్తి కలిగిస్తున్నదని ఆఫ్రికాలోని కాంగోలో పదేండ్ల క్రితం ఈ వైరస్‌ మీద పరిశోధన చేసిన అమెరికా శాస్త్రవేత్త అనే రిమోయిన్‌ చెప్పారు. ఇది మసూచి సంబంధిత వైరస్‌ కనుక కరోనా మాదిరి వ్యాప్తి చెందదని మరోశాస్త్రవేత్త జే హూపర్‌ అన్నారు. ఇది సోకిన వ్యక్తులు దగ్గినపుడు అతి సమీపంలోని వారికి మాత్రమే సోకే అవకాశం ఉందన్నారు. ఇది సోకిన వారు ఎలాంటి చికిత్సలేకుండానే కొన్ని వారాల తరువాత ఎక్కువ మంది కోలుకుంటారని కూడా హూపర్‌ అంటున్నారు. ఇది ప్రాధమిక దశలో ఉన్నందున ఇప్పటికిప్పుడే నిర్ధారణగా దేన్నీ చెప్పలేమని మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉందని మరో వైరాలజిస్టు గుస్తావ్‌ పాలాసియో చెప్పారు. ఆఫ్రికా దేశాల్లో ఇది కనిపించినప్పటికీ ఐరోపా, అమెరికాల్లో వ్యాప్తి చెందటానికి ఉన్న సంబంధం ఇంకా తెలియలేదు.ప్రస్తుతానికి మన దేశంలో ఈ వైరస్‌ దాఖల్లాలేవు. సోకిన దేశాల నుంచి వచ్చిన వారి మీద నిఘావేసి, లక్షణాలున్నవారి నుంచి రక్త నమూనాలను సేకరించాలని ఆదేశించారు.స్త్రీ-పురుషుల సంపర్కం ద్వారా మంకీపాక్స్‌ వ్యాపించదని భావించిన ఈ వైరస్‌ ఇప్పుడు ఆ అభిప్రాయాన్ని మార్చుకొనేట్లు చేసింది. బ్రిటన్‌లో వెలువడిన కేసులలో ఎక్కువ మంది స్వలింగ, ద్విలింగ సంపర్క పురుషుల్లో కనిపించింది.


సంబంధం లేని దేశాల జనాభాలో ఇది కనిపించటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. మసూచి(స్మాల్‌పాక్స్‌)ను పూర్తిగా నిర్మూలించినందున దాని సోదరి మంకీపాక్స్‌ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఇంతకాలంగా భావిస్తున్నారు. బలహీనం, రోగనిరోధకశక్తి తక్కువగా ఉండేవారిలో మంకీపాక్స్‌ సోకవచ్చని భావిస్తున్నారు.కాంగోలో కనిపించిన తరువాత 39 ఏండ్లకు 2017 నుంచి నైజీరియాలో రెండువందల నిర్ధారిత, ఐదు వందల అనుమానాస్పద కేసులు నమోదయ్యాయి. 2003లో ఘనా నుంచి దిగుమతి చేసుకున్న ఎలుకల నుంచి అమెరికాలోని ఇల్లినాయిస్‌ కుక్కలకు తరువాత 70 మంది మనుషులకు సోకింది. తాజాగా వివిధ దేశాల్లో కనపడిన కేసుల వెనుక బిల్‌గేట్స్‌ హస్తం ఉందంటూ కొన్ని కుట్ర సిద్దాంతాలు ఇప్పుడు చక్కర్లు కొడుతున్నాయి. వాక్సిన్ల తయారీలో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెడుతున్న బిల్‌గేట్స్‌ వాటిని అమ్ముకొనేందుకు వైరస్‌లను కూడా సృష్టిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఏడాది క్రితం ఒక సభలో మాట్లాడిన బిల్‌గేట్స్‌ త్వరలో మరో పెద్ద మహమ్మారిని ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలని, దీని కోసం ప్రపంచ ఆరోగ్య సంస్ద కొత్త సంస్దను ఏర్పాటు చేయాలని, జీవాయుధాలుగా వైరస్‌లను ఉగ్రవాదులు వినియోగించవచ్చని హెచ్చరించాడు. ఆ మాటలకు ఇప్పుడు జరుగుతున్న వాటికి సంబంధం కలిపి వార్తలు వెలువడుతున్నాయి. అంతకు ముందు కూడా గేట్స్‌ ఇలాగే మాట్లాడిన ఉదంతాలున్నాయి. గతవారంలో పెద్ద మొత్తంలో మంకీపాక్స్‌ వాక్సిన్ను అమెరికా కొనుగోలు చేయటం వాటికి ఊతమిస్తున్నాయి.


బ్రిటన్‌లో తొలికేసు నైజీరియా వెళ్లి వచ్చిన పురుషుడిది కాగా తరువాత వారికి ఎలాంటి ప్రయాణ చరిత్ర లేదు. అమెరికాలోని మసాచుసెట్స్‌లో ఒకరికి నిర్దారణైంది. అతను ఇటీవలే కెనడా వెళ్లి వచ్చినట్లు తేలింది. దాంతో 119మిలియన్‌ డాలర్ల విలువగల మంకీపాక్స్‌ వాక్సిన్లు సరఫరా చేయాలని అమెరికా సర్కార్‌ కోరిందని బవేరియన్‌ నోర్డిక్‌ కంపెనీ ప్రకటించింది. అంతకు ముందే ఇచ్చిన ఆర్డర్‌తో కలిపితే 299 మిలియన్‌ డాలర్లని, కోటీ30లక్షల డోసులమేర కొనుగోలు చేసినట్లు వార్తలు వచ్చాయి. వీటిని 2024,25లో సరఫరా చేస్తారు. మంకీపాక్స్‌ సోకినవారిలో నూటికి పది మంది మరణించినట్లు గత సమాచారం వెల్లడిస్తున్నది.
మంకీపాక్స్‌ను పరిశోధనకు తెచ్చిన కోతుల్లో 1958లో కనిపించింది.మానవుల్లో తొలికేసు 1970లో నమోదైంది. ఇది వివిధ పద్దతుల్లో , రకరకాలుగా సోకే అవకాశం ఉంది. వైరస్‌ ఉన్న జంతువు మనిషిని కరచినా, దాని రక్తం, స్రవించిన ద్రవాలను ముట్టుకున్నా, ఈకలను తాకినా రావచ్చు. ఎలుకలు, ఉడుతలు, వైరస్‌ సోకిన జంతుమాంసాన్ని సరిగా ఉడికించకుండా తిన్నా ఈ వైరస్‌ సోకుతుంది. సంభోగం ద్వారా కూడ సంక్రమించవచ్చు. మనుషుల్లో జ్వరం, కండరాల నొప్పి,దద్దుర్లు, గాయాలుకావటం, చలి వంటి లక్షణాలుంటాయి. సాధారణంగా వైరస్‌ సోకిన తరువాత ఐదు నుంచి 21 రోజుల్లో లక్షణాలు కనిపించవచ్చు.


2003 అక్టోబరు 29న న్యూసైంటిస్టు డాట్‌కామ్‌లో డెబోరా మెకంజీ అనే విశ్లేషకుడు ” అమెరికా వృద్ధి చేసిన ప్రాణాంతక వైరస్‌లు ” అనే పేరుతో రాశారు. అమెరికా ప్రభుత్వ నిధులతో పరిశోధనలు చేసిన ఒక శాస్త్రవేత్త మసూచి వైరస్‌ నుంచి జన్యుమార్పిడితో ప్రమాదకర మౌస్‌పాక్స్‌ను తయారు చేసినట్లు పేర్కొన్నారు.యాంటీ వైరల్‌ వాక్సిన్లు ఇచ్చినప్పటికీ ఇది సోకిన ఎలుకలు మరణించాయి. తరువాత కౌపాక్స్‌(ఆవు) వైరస్‌ను కూడా రూపొందించారు. ఇలా రూపొందించిన వాటిని ప్రమాదకారులుగా మార్చేందుకు కూడా వీలుంది. మానవుల్లో కూడా వైరస్‌ను ప్రవేశపెట్టేవిధంగా మార్చ వచ్చని 2003నాటి ఆర్టికల్‌లో హెచ్చరించారు. లాభాల కోసం ఎంతకైనా తెగించే అమెరికన్లు దేనికైనా పాల్పడతారని చరిత్ర రుజువు చేసింది.


ఐరోపాలో స్మాల్‌పాక్స్‌, మంకీపాక్స్‌, కౌపాక్స్‌ చికిత్సకు ” టెకోవిరిమాట్‌” అనే ఔషధాన్ని అనుమతించారు.దాన్ని టిపాక్స్‌ పేరుతో విక్రయిస్తున్నారు. అమెరికాలో స్మాల్‌పాక్స్‌కు మాత్రమే అనుమతించారు.తాజాగా వ్యాపిస్తున్న మంకీపాక్స్‌ పాతదేనా కొత్త రకమా అన్నది ఇంకా నిర్దారణ కాలేదు. అనేక దేశాల్లో కనిపించిన తీరును చూస్తే వేగంగా వ్యాపించే అవకాశం ఉందని చెబుతున్నారు. దీని అర్ధం కరోనా మాదిరి వేగంగా విస్తరిస్తుందని కాదని కూడా అంటున్నారు.


మంకీపాక్స్‌ మరోరూపంలో వచ్చిన మసూచికం అని కొందరు చెబుతున్నారు.1999లో పరిశోధనా సంస్దల్లో ఉన్న మసూచి వైరన్‌సు నాశనం చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్ధ సూచించింది. ప్రస్తుతం ఆ సంస్ద వద్ద ఐదులక్షల డోసుల వాక్సిన్‌ ఉండగా ఇతర దేశాల్లో 60నుంచి 70 మిలియన్ల డోసులు ఉందని, అనేక నిల్వలు సక్రమంగా లేవని చెబుతున్నారు. అమెరికాలో 50 నుంచి వంద లక్షల మందికి వేసేందుకు సరిపడా ఉందని అంచనా.1980నాటికి వరియోలా వైరస్‌ 76 పరిశోధనా సంస్ధల్లో ఉంది. వైరస్‌ను నాశనం చేయాలన్న సూచన మేరకు తమ 74 కేంద్రాలు నాశనం చేయటం లేదా తమ వద్ద ఉన్న నిల్వలను ప్రపంచ ఆరోగ్య సంస్ధకు అంద చేశాయి. అమెరికాలోని అట్లాంటాలో సిడిసి, రష్యాలోని కోల్ట్‌సోవో వైరాలజీ సంస్ధలో మాత్రమే ఉంది. కొందరి అనుమానం ప్రకారం ప్రపంచ ఆరోగ్య సంస్ధకు తెలియ కుండా కొన్ని చోట్ల దాచారని, జీవాయుధంగా వాడేందుకుగాను కొత్త వైరస్‌ సృష్టికోసమే ఇలా చేశారనే ఆరోపణలున్నాయి గాని, నిర్ధారణ కాలేదు.


. ప్రపంచంలో వైరస్‌తో జీవాయుధాలను తయారు చేసి యుద్దాలలో వినియోగించే అంశాల గురించి కొందరు నిపుణులు వెలిబుచ్చిన అభిప్రాయాలను, అనేక అంశాలను పేర్కొంటూ చైనా మిలిటరీ వైద్యుడు గ్జు డెహౌంగ్‌ 2015లో ఒక పుస్తకాన్ని ప్రచురించారు. అదేమీ రహస్యం కాదు, అమెజాన్‌ ద్వారా ప్రపంచమంతా కొనుగోలు చేసింది. చైనాలో 2002,04 సంవత్సరాలలో బయటపడిన సార్స్‌ మహమ్మారి విదేశాల నుంచి అసహజ పద్దతిలో జన్యుమార్పిడి జరిగి వచ్చిన వైరస్‌ (ఇది కూడా కరోనా వైరస్‌ రకాలలో ఒకటి) అని చైనా పుస్తకంలో అభిప్రాయపడ్డారు. చైనాకు వ్యతిరేకంగా విదేశాల్లో ఉగ్రవాదుల జీవ ఆయుధాల తయారీని కూడా కాదనలేమని సంపాదకుడు గ్జు పేర్కొన్నారు. ప్రపంచంలో జీవ ఆయుధాల ప్రయోగాలు, యుద్దంలో వాటి వినియోగం గురించి కూడా దానిలో చర్చించారు. 1941లోనే అమెరికా జీవ ఆయుధాల పరిశోధన ప్రారంభించిందని, తరువాత వాటి తయారీకి ఫ్యాక్టరీలను ఏర్పాటు చేసిందని, 1940-45 సంవత్సరాల మధ్య జపాన్‌ జీవ ఆయుధాలను ఉపయోగించి తూర్పు చైనాలోని ఝెజియాంగ్‌, హునాన్‌ రాష్ట్రంలో ప్రయోగించి ప్లేగు వ్యాధి వ్యాపింప చేసిందని కూడా రచయిత దానిలో పేర్కొన్నారు.


బిల్‌ మరియు మెలిందా గేట్స్‌ ఫౌండేషన్‌ సారధి, మైక్రోసాఫ్ట్‌కు మారు పేరు అయిన బిల్‌ గేట్స్‌ చావులను కూడా సొమ్ము చేసుకొనేందుకు పూనుకున్నాడు. కరోనా వాక్సిన్‌ తయారీ వివరాలను భారత్‌కు మరొక దేశానికి ఇవ్వకూడదని ఆ పెద్దమనిషి చెప్పిన సంగతిని మరచిపోలేము. భద్రతా కారణాల రీత్యా ఇవ్వటం కుదరదన్నాడు. ఒకవేళ ఎక్కడైనా అలా ఇస్తే అది తమ సాయం మరియు నైపుణ్యం ఫలితమే అన్నాడు. 2015లో బిల్‌ గేట్స్‌ టెడ్‌ టాక్‌ అనే కార్యక్రమంలో మాట్లాడుతూ రానున్న దశాబ్దంలో ఒక పెద్ద మహమ్మారి రానున్నదని, అది ఐదు కోట్ల మందిని బలితీసుకున్న 1918నాటి మహమ్మారి మాదిరి ఉంటుందని, ఆరునెలల్లో మూడు కోట్ల మందిని చంపి వేస్తుందని చెప్పాడు. దాన్ని యుద్దం మాదిరి ఎదుర్కొనేందుకు ప్రపంచం తీవ్ర ప్రయత్నాలు చేయాలన్నాడు. బిల్‌ గేట్స్‌ మాటలను బట్టి గేట్స్‌ అప్పటికే మైక్రోచిప్‌ ద్వారా నియంత్రించే ఒక మహమ్మారి వైరస్‌ను ప్రయోగశాలలో రూపొందించి ఉన్నారని కొంత మంది అప్పుడే చెప్పారు. అవి బుద్దిలేని మాటలని తమ ఫౌండేషన్‌ ద్వారా వాక్సిన్లను కొనుగోలు చేస్తున్నామని అందువలన మహమ్మారుల ప్రమాదం గురించి హెచ్చరించేందుకే తాను చెప్పానన్నాడు.నియంత్రణలతో సురక్షితమైన వాక్సిన్లను తయారు చేయాలి గనుక భారత్‌ వంటి అభివద్ది చెందుతున్న దేశాలకు తయారీ విధానం గురించి చెప్పకూడదని ఒక ఇంటర్వ్యూలో బిల్‌గేట్స్‌ చెప్పాడు.


ప్రపంచంలోని 25 దేశాలలో అమెరికన్లు బయో ప్రయోగశాలలను ఏర్పాటు చేశారు. మధ్య ప్రాచ్యం, ఆఫ్రికా, ఆగేయ ఆసియా, మాజీ సోవియట్‌ రిపబ్లికులలో అవి ఉన్నాయి. ఒక్క ఉక్రెయిన్‌లోనే 16 ఉన్నాయంటే అమెరికా కుట్రలను అర్ధం చేసుకోవచ్చు. అమెరికాలోని మేరీలాండ్‌లోని ఫ్రెడరిక్‌ అనే ప్రాంతంలో ఫోర్డ్‌ డెట్రిక్‌ ప్రయోగశాలలో ఎబోలా వంటి వ్యాధుల కారకాల గురించి పరిశోధనలు చేశారు. దాని మీద వార్తలు రావటంతో 2019లో మూసివేశారు. గత రెండు దశాబ్దాలలో ఇంటా బయటా ఉన్న అమెరికన్‌ ప్రయోగశాలలో అనేక వందల ఉదంతాలలో ప్రమాదాలు జరిగి ప్రమాదకరమైన వైరస్‌, బాక్టీరియాలు బయటపడినట్లు యుఎస్‌ఏ టుడే పేర్కొన్నది అమెరికాలో ఇలాంటి సమస్యలున్న కారణంగా ఇతర దేశాలలో అసలు విషయాలను దాచి పరిశోధనలు నిర్వహిస్తున్నారు.


మానవ కల్యాణం కోసం ఒక ప్రమాదకర వైరస్‌ను హతమార్చేందుకు మరొక వైరస్‌ను రూపొందించేందుకు ప్రతి దేశానికీ అవకాశం, హక్కు ఉంది. అయితే ఆ ముసుగులో ఆయుధాలు తయారు చేసే దేశాలు మిగతా వాటి మీద బురద జల్లుతున్నాయి. చరిత్రను తిరగేస్తే క్రీస్తు పూర్వం ఆరువందల సంవత్సరంలో క్రిసాను ముట్టడి సమయంలో రాజు సోలోన్‌ కటుక రోహిణీ అనే పుష్పాల నుంచి తీసిన రసాన్ని ప్రయోగించి విరేచనాలు, ఇతర వ్యాధులు కలిగించినట్టు చరిత్రలో ఉంది. 1155లో రాజు బార్బోసా ఇటలీలోని టోరోంటానాలోని మంచి నీటి బావుల్లో శవాలను పడవేసి కలుషితం కావించాడు. 1495లో ఫ్రెంచి సైనికులను హతమార్చేందుకు స్పెయిన్‌ రాజులు ఇటలీలోని నేపుల్స్‌లో కుష్టువ్యాధి గ్రస్తుల రక్తం కలిపిన వైన్‌ సరఫరా అయ్యేట్టు చూశారు.1675లో విషంతో కూడిన బుల్లెట్లను వినియోగించరాదని జర్మనీ-ఫ్రెంచి సైన్యం అంగీకారానికి వచ్చాయి. 1710లో రష్యన్‌ చక్రవర్తి ప్లేగుతో మరణించిన శవాలను ఫిరంగులకు కట్టి స్వీడన్‌ పట్టణాలలో పడవేయించాడు. 1763లో అమెరికాలోని గిరిజనులను దెబ్బతీసేందుకు బ్రిటిష్‌ పాలకులు మసూచి వ్యాధిగ్రస్తులు వాడిన దుప్పట్లు పంపిణీ చేశారు.పర్యవసానంగా దాదాపు రెండువందల సంవత్సరాల పాటు అమెరికాలో మసూచి వ్యాప్తి చెందింది. నెపోలియన్‌ చక్రవర్తి 1797లో ఇటలీలోని మంటువాలో మలేరియా వ్యాధి వ్యాపింప చేసేందుకు మైదానాలను వరదలతో నింపించాడు. అంతర్యుద్ధ సమయంలో1863లో అమెరికాలోని బానిస వ్యవస్థను కోరుకొన్న తిరుగుబాటు రాష్ట్రాలు యూనియన్‌ సైనికులకు ఎల్లోఫీవర్‌, అమ్మోరు సోకిన రోగులు వాడిన వస్త్రాలను విక్రయించేట్టు చూశాయి.


1346లో జెనోయీస్‌-తార్తార్ల మధ్య నేటి ఉక్రెయిన్‌లో ఆధిపత్య పోరు సమయంలో ప్లేగు వ్యాధి వ్యాపించింది. ఓటమి దశలో ఉన్న తార్తార్లు ప్లేగువ్యాధి సోకిన, మరణించిన తమ వారిని ఫిరంగులకు కట్టి శత్రు ప్రాంతాల మీద పడేశారు. దాంతో జెనోయీస్‌ దళాలు వెనక్కు తగ్గాయి. ఈ పరిణామం గురించి గాబ్రియల్‌ డే ముసిస్‌ నమోదు చేశాడు. వెనక్కు తగ్గిన జెనోయీస్‌(ఇటాలియన్లు)లు తమతో పాటు ప్లేగు వ్యాధి కూడా తీసుకు వెళ్లారు. ప్లేగు వ్యాధిగ్రస్తులు, బహుశా దానిని వ్యాపింప చేసే ఎలుకలను కూడా తమ నౌకల్లో తీసుకుపోయి ఉంటారని పేర్కొన్నాడు. ఆ తరువాత అది ఐరోపా, ఆఫ్రికా, ఆసియాలో మన దేశంతో సహా అనేక దేశాలకు వ్యాపించింది. రెండున్నర కోట్ల మంది ఐరోపాలో దానికి బలయ్యారు. హైదరాబాదు సంస్థానంలో ప్లేగు వ్యాధి పదే పదే వస్తుండటంతో దాన్ని నివారించేందుకు 1591లో చార్మినార్‌ను నాటి నిజాం రాజు కట్టించిన విషయం తెలిసిందే.


మొదటి ప్రపంచ యుద్ధంలో గుర్రాలకు సెంబరోగం (చీమిడి కారటం) వచ్చే ఆంత్రాక్స్‌ పౌడర్‌ను జర్మనీ, ఫ్రెంచి గూఢచారులు ప్రయోగించారు. రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్‌ సైన్యాలు రష్యా, ఇతర అనేక దేశాలలో ప్లేగ్‌, అంతరాక్స్‌ వంటి వ్యాధులను వ్యాపింపచేసేందుకు ప్రయత్నించారు. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత 22సంవత్సరాలకు 179 దేశాలు జీవ ఆయుధాల నియంత్రణకు ఒప్పందంపై సంతకం చేశాయి. ఎట్టి పరిస్ధితుల్లోనూ వాటి తయారీ, సేకరణ, నిల్వ, వినియోగించబోమని ఆ దేశాలు అంగీకారం తెలిపాయి. అయితే వైద్య అవసరాలకు కొన్ని మినహాయింపులు ఇచ్చారు. ఇప్పుడు జీవ ఆయుధాలు తయారు చేస్తున్నవారు కూడా ఆ ముసుగుతోనే చేస్తున్నట్టు అనుమానాలు ఉన్నాయి. రసాయనిక, జీవ ఆయుధాలకు పెద్ద తేడా ఉండదు. ఉదాహరణకు వియత్నాంను ఆక్రమించుకొనేందుకు అమెరికా జరిపిన దాడుల సమయంలో కలుపు మొక్కలను నాశనం చేసే పేరుతో ఆరెంజ్‌ ఏజంట్‌ అనే రసాయనాన్ని పెద్ద ఎత్తున వియత్నాంలో చల్లారు. యాభై సంవత్సరాలు గడిచిన తరువాత కూడా అనేక చోట్ల కలుపు మొక్కలే కాదు అసలు ఏ మొక్కా బతకని పరిస్థితులు ఉన్నాయి. ఆ ప్రాంతాలలో పుట్టుకతో పిల్లల్లో లోపాలు, కాన్సర్‌, మధుమేహం వంటి వ్యాధులకు అమెరికా చిమ్మిన విషం కారణమని తేలింది.


మొదటి ప్రపంచ యుద్దం మీద విచారణ జరిపిన నానాజాతి సమితి కమిటీ జీవ ఆయుధాలను ఉపయోగించలేదు గానీ జర్మన్లు రసాయనిక ఆయుధాలు వాడినట్లు పేర్కొన్నది. రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్‌ సామ్రాజ్యవాదులు ఆపరేషన్‌ చెర్రీ బ్లూసమ్స్‌ పేరుతో జీవ ఆయుధాలతో అమెరికా సహా అనేక దేశాల మీద దాడి చేయాలనే పథక రచన చేశారు. తన ఆక్రమణలోని చైనాలోని హార్బిన్‌, కొరియా, మంచూరియా ప్రాంతంలో దాడి చేశారు. దానిలో కలరా, ప్లేగు, అంతరాక్స్‌, మసూచి వంటి ప్రమాదకర క్రిముల్ని వాడారు. 2002లో ఒక అంతర్జాతీయ సమావేశంలో జపాన్‌ మిలిటరీ జరిపిన బాక్టీరియా బాంబు దాడుల్లో మరణించిన వారు ఐదు లక్షల ఎనభైవేల మంది ఉన్నట్టు వక్తలు వెల్లడించారు. ఒక్క చైనాలోనే ప్లేగు, కలరా, ఆంత్రాక్స్‌ వంటి వాటితో నాలుగు లక్షలమంది మరణించారని అంచనా.


జపాన్‌ జీవ ఆయుధాల తయారీకి 150 భవనాలను, ఐదు శివారు ప్రాంతాలను ఉపయోగించి మూడువేల మంది శాస్త్రవేత్తలతో పని చేయించారు. వాటి తయారీ సమయంలో కనీసం పదివేల మంది ఖైదీలపై వాటిని ప్రయోగించగా మరణించినట్టు తేలింది. వారిలో మూడువేల మంది కొరియా, చైనా, సోవియట్‌, మంగోలియా, అమెరికన్‌, బ్రిటిష్‌, ఆస్ట్రేలియన్‌ యుద్ద ఖైదీలు ఉన్నట్టు బయట పడింది. జపాన్‌ జీవ ఆయుధాల విషయం బయటపడిన తరువాత అమెరికా పెద్ద ఎత్తున 1942నుంచి వాటిని రూపొందించేందుకు పూనుకుంది. తాను పెద్ద ఎత్తున జీవ ఆయుధాలను తయారు చేసినట్టుగానే ఇతరులు కూడా తయారు చేసి తమ మీద ప్రయోగిస్తారని అమెరికా భయపడుతోంది. దీనిలో భాగంగానే అనేక కుట్ర సిద్దాంతాలను అమెరికన్లు ప్రచారంలో పెట్టారు.ఏమైనా గత చరిత్రను బట్టి మంకీపాక్సు గురించి అమెరికా, పైన పేర్కొన్న ఇతర దేశాల గురించి వెలువడిన ప్రతి సమాచారాన్ని అనుమానంతో చూడాల్సిందే. తమ దేశాల్లో ఎందుకు విస్తరిస్తున్నదో అవి ప్రపంచానికి చెప్పాల్సి ఉంది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

ఇండోనేషియా కమ్యూనిస్టు ఊచకోత వెనుక బ్రిటన్‌ !

18 Wednesday May 2022

Posted by raomk in CHINA, History, imperialism, INTERNATIONAL NEWS, Opinion, UK, Uncategorized, USA

≈ Leave a comment

Tags

Britain IRD, fake news, Indonesian Communist Party (PKI)., Propaganda War, UK black propaganda


ఎం కోటేశ్వరరావు


భారీ ఆయుధాలు కావాలని ఉక్రెయిన్‌ కోరుకుంటున్నదనటం పశ్చిమ దేశాల ప్రచారంలో భాగమని ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు నోమ్‌ చోమ్‌ స్కీ చెప్పారు. ఉక్రెయిన్‌ నేత జెలెనెస్కీ పదే పదే రాజకీయ పరిష్కారం కావాలని చెప్పటం, నాటో సభ్యత్వ కోరికను వదులుకుంటామని, తటస్ధంగా ఉంటామని చెప్పిన అంశాలు అమెరికా-బ్రిటన్‌ ప్రచార వ్యవస్ధ నుంచి మనకు ఎక్కడా వినిపించవు అని చోమ్‌ స్కీ అన్నారు. ఉక్రెయిన్‌-రష్యా వివాదాన్ని పరిష్కరించేందుకు తోడ్పడే విధంగా పశ్చిమ దేశాల నుంచి ఎలాంటి ప్రోత్సాహం లేదా ప్రతిపాదనలు గానీ లేవు. దానికి బదులు తమ దగ్గర ఉన్న ఆధునిక ఆయుధాలను అందించి సొమ్ము చేసుకోవాలనే దుష్ట ఆలోచనను కనపడకుండా చేసేందుకు రష్యా గురించి అనేక తప్పుడు ప్రచారాలను వ్యాపింప చేస్తున్న అంశం తెలిసిందే.
అమెరికా, బ్రిటన్‌ వంటి దేశాలు భౌతికదాడుల్లో పాల్గొనటమే కాదు, వాటితో పాటు తప్పుడు ప్రచారదాడులు కూడా పెద్ద ఎత్తున చేస్తున్నాయి. అందుకోసం భారీ ఖర్చు, నిపుణులతో కూడిన ప్రత్యేక విభాగాలను కూడా ఏర్పాటు చేస్తాయి. వీటిని ఆదర్శంగా తీసుకొని అదే తరహాలో మన దేశంలో అనేక సంస్ధలు ప్రత్యేకించి- సంఘపరివార్‌ ఏర్పాటు చేసిన వివిధ సంస్ధలు, పలు ముస్లిం సంస్ధలకు చెందిన వారు పరస్పరం రెచ్చగొట్టేందుకు వాట్సాప్‌, ఇతర సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారాలు సాగిస్తున్నారనే విమర్శలు ఉన్న సంగతి తెలిసిందే. మెజారిటీ, మైనారిటీ మతోన్మాద ప్రచారం అనేక మంది మెదళ్లను విద్వేషానికి, భౌతికదాడులకు అనువైనదిగా మారుస్తున్నది.


కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా ముస్లింలను సమీకరించటం, కమ్యూనిజం, పూర్వపు సోవియట్‌కు వ్యతిరేకంగా రెచ్చగొట్టేందుకు, చైనా-సోవియట్‌ మధ్య విబేధాలను పెంచటంతో సహా పలు ఎత్తుగడలతో బ్రిటన్‌ విదేశాంగశాఖ ఏర్పాటు చేసిన ఇన్ఫర్మేషన్‌ రిసర్చ్‌ డిపార్ట్‌మెంట్‌(ఐఆర్‌డి) విభాగం సాగించిన దుర్మార్గాలకు సంబంధించిన పత్రాలను ఇటీవల బహిర్గతం చేశారు. వాటి నుంచి పరిశోధకులు తవ్వినకొద్దీ అనేక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి, గతవారంలో కొన్నింటిని విశ్లేషకులు వెల్లడించారు. 1960దశకంలో ఇండోనేషియాలో లక్షలాది మంది కమ్యూనిస్టులు, సానుభూతి పరులను ఊచకోత కోసేందుకు అక్కడి ముస్లిం మతోన్మాదులను రెచ్చగొట్టటంలో బ్రిటన్‌ ఐఆర్‌డి ప్రచార అంశాలు ప్రధానంగా దోహదం చేసినట్లు తేలింది. అధ్యక్షుడు సుకర్ణో, విదేశాంగ మంత్రి సుబాంద్రియో కమ్యూనిస్టుల పట్ల సానుకూలంగా ఉండటంతో పాటు బ్రిటీష్‌ వారు రూపొందించిన మలేషియా ఫెడరేషన్‌ ప్రతిపాదనను తిరస్కరించారు. వారిని కొనసాగనిస్తే ఇండోనేషియా కూడా సోషలిస్టు దేశంగా మారుతుందనే అంచనాతో అమెరికా, బ్రిటన్‌ కుట్ర చేసి తిరుగుబాటుకు మిలిటరీని ప్రోత్సహించాయి. దాన్ని సమర్ధించుకొనేందుకు అనువుగా తప్పుడు ప్రచారం సాగించాయి. సుకర్నో, సుబాంద్రియోలను, చైనా జాతీయులను బతకనిస్తే కమ్యూనిస్టు చైనా ఏ క్షణంలోనైనా ఇండోనేషియాను ఆక్రమిస్తుందని, మిలిటరీతో పాటు దేశంలోని కమ్యూనిస్టు వ్యతిరేకులను, మతశక్తులను రెచ్చగొట్టేందుకు వందలాది కరపత్రాలను పంపిణీ చేశారు.


సిఐఏ, బ్రిటీష్‌ ఎం16 ఏజంట్లు రూపొందించిన కుట్రలో భాగంగా ఆరుగురు మిలిటరీ అధికారులను కిడ్నాప్‌ చేసి వారిని హత్యగావించి ఆ పని చేసింది కమ్యూనిస్టులే అని ప్రచారం చేసి దాడులకు రంగాన్ని సిద్దం చేశారు. కమ్యూనిస్టుల మీద చర్యలు తీసుకుంటే అమాయక చైనీయులు కొందరు ఇబ్బందిపడినప్పటికీ, వారే కారకులని గుర్తించినందున అంతం చేయకతప్పదని రేడియో ప్రసారాలు, ఆ కరపత్రాల్లో రెచ్చగొట్టారు.ప్రవాసంలో ఉన్న జాతీయవాదులైన ఇండోనేషియన్ల పేరుతో సింగపూర్‌లో తిష్టవేసిన ఐఆర్‌డి నిపుణులు రాసిన సమాచారాన్ని ప్రచారంలో పెట్టారు.1965 అక్టోబరులో ఊచకోతలను ప్రారంభించే ముందు కమ్యూనిస్టులను అంతమొందించాలని ప్రేరేపించారు. ఈ దుర్మార్గంలో తమ పాత్ర లేదని బ్రిటన్‌ దశాబ్దాల తరబడి చెప్పుకున్నది, నాటి పత్రాలు వెల్లడి కావటంతో దాని దుర్మార్గం నిర్ధారితమైంది. కమ్యూనిస్టుల నుంచి దేశాన్ని కాపాడేపేరుతో మిలిటరీ అధికారి సుహార్తో అధికారాన్ని హస్తగతం చేసుకున్నాడు.అధ్యక్షుడు సుకర్ణోను బందీగా పట్టుకొని సుకర్ణో పేరుతోనే ఊచకోతకు పాల్పడ్డాడు. తరువాత 1967లో తనను తాను అధ్యక్షుడిగా ప్రకటించుకొని 32 సంవత్సరాలు నిరంకుశపాలన సాగించాడు.


రెండవ ప్రపంచ యుద్దం తరువాత కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారం కోసం 1948లో నాటి లేబర్‌ పార్టీ ప్రభుత్వం ఐఆర్‌డిని ఏర్పాటు చేసింది. అరబ్బు ప్రాంతం, ఆఫ్రికా, ఆసియాల మీద ప్రధానంగా ఇది కేంద్రీకరించింది.తప్పుడు వార్తలు,నకిలీ పత్రాలను ప్రచారంలో పెట్టటం వంటి పలు రూపాల్లో అది ప్రచారదాడులు చేసింది. తన ప్రచారాన్ని ఆకర్ణణీయంగా మార్చేందుకు యూదు వ్యతిరేకతను రెచ్చగొట్టటం, జాత్యహంకారం, ముస్లిం మనోభావాల వంటి వాటినన్నింటినీ అది ఉపయోగించుకుంది. ఐఆర్‌డి ఏజంట్లు తెరవెనుక ఉండి స్వతంత్ర సంస్ధల పేరుతో కొన్నింటిని సృష్టించి ఆ పేరుతో తాము రూపొందించిన తప్పుడు సమాచారాన్ని మీడియా, పశ్చిమ దేశాల ప్రభుత్వాలకు, అనేక సంస్ధలకు అందచేసేవారు. తాము బురద జల్లదలచుకున్న దేశాలు, సంస్ధల పేరుతో వాటిని రూపొందించేవారు. సోవియట్‌ వార్తా సంస్ధ నొవొస్తి విడుదల చేయాల్సిన సమాచారాన్ని ఫోర్జరీ చేసి పదకొండుసార్లు ఐఆర్‌డి ప్రచారంలో పెట్టినట్లు తేలింది. వాటిలో ఒకటి ఈజిప్టుకు మిలిటరీ సాయాన్ని వక్రీకరించటం. 1967లో ఇజ్రాయెల్‌తో ఈజిప్టు జరిపిన ఆరు రోజుల యుద్దంలో చేసిన సాయం వృధా అయినట్లు సోవియట్‌ నుంచి వెలువడిన వార్త పేర్కొన్నట్లు ప్రచారం చేశారు. ఇంతేకాదు అరబ్బు దేశాల్లో ప్రాచుర్యంలో ఉన్న ముస్లిం బ్రదర్‌హుడ్‌ సంస్ద పేరుతో కూడా నకిలీవార్తలను సృష్టించారు. ఈజిప్షియన్లను తిరోగామి ముస్లిం మూఢనమ్మకాలను పాటించేవారుగా చిత్రించి చెడు మాటలు మాట్లేడే నాస్తికులు, సోవియట్లు ప్రచారం చేస్తున్నారని బురదజల్లుతూ ముస్లిం బ్రదర్‌హుడ్‌ పేరుతో ప్రచారంలో పెట్టారు.ఇజ్రాయెల్‌తో పోరులో అరబ్బుల ఓటమికి విశ్వాసం లేకపోవటమే కారణమంటూ ఆ సంస్ధ పేరుతో రెచ్చగొట్టారు. యూదులకు మాతృదేశం పేరుతో ఇజ్రాయెల్‌ సృష్టికి బాటలు వేసిన, కుట్రలు చేసిన వారిలో బ్రిటన్‌ది ప్రధాన పాత్ర అన్న సంగతి తెలిసిందే. ఐఆర్‌డి తాను రూపొందించిన నకిలీవార్తలను నిజమని భావించేేందుకు, ఇజ్రాయెల్‌ను వ్యతిరేకించే వారే వాటిని ప్రచారంలో పెట్టినట్లు నమ్మించేందుకు ఈజిప్షియన్లు నేరుగా యూదుల మీద ఎందుకు దాడులకు దిగటం లేదని రెచ్చగొడుతూ రాసేవారు.


ఆఫ్రికా దేశాల్లో సోవియట్‌ వ్యతిరేకతను రెచ్చగొట్టేందుకు సోవియట్‌ అనుకూల సంస్దల పేర్లతోనే ప్రచారం చేశారు. ఆఫ్రికన్లు అనాగరికులని ప్రపంచ ప్రజాతంత్ర యువజన సమాఖ్య వర్ణించినట్లు ఒక వార్తను ఐఆర్‌డి ప్రచారంలో పెట్టింది.సోవియట్‌ విశ్వవిద్యాలయాల్లో చేరిన ఆఫ్రికన్‌ విద్యార్ధులకు చదువు సంధ్యలు రావని తూలనాడినట్లుగా కూడా ప్రచారం చేసింది. ఈ తప్పుడు ప్రచార సంస్ధను ఉపయోగించటంలో లేబర్‌, కన్సర్వేటివ్‌ పార్టీలు దేనికి ఏదీ తీసిపోలేదు. సోవియట్‌కు చేరువ అవుతున్న ఆఫ్రికా దేశమైన ఘనా సంగతి చూడాలని 1964లో కన్సర్వేటివ్‌ ప్రధాని అలెక్‌ డగ్లస్‌ ఆదేశించాడు. కొద్ది నెలల తరువాత చైనా – ఆఫ్రికన్ల మధ్య జాతులపరమైన ఉద్రిక్తతలను రెచ్చగొట్టాలని లేబర్‌ పార్టీ ప్రభుత్వ విదేశాంగ మంత్రి పాట్రిక్‌ గార్డన్‌ వాకర్‌ కోరాడు. 1977లో ఈ సంస్దను రద్దుచేసినట్లు ప్రకటించారు. మరొక పేరుతో అదే ప్రచారదాడులను కొనసాగిస్తున్నారు. తప్పుడు సమచారాన్ని ఎదుర్కొనేందుకు కొత్త సంస్దను ఏర్పాటు చేస్తున్నట్లు 2022 ఫిబ్రవరిలో బ్రిటన్‌ విదేశాంగ మంత్రి లిజ్‌ ట్రస్‌ ప్రకటించారు. ఆమె ప్రకటన తరువాత అదే నెలలో ఉక్రెయిన్‌పై రష్యా సైనికచర్య ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఆ పరిణామం గురించి పశ్చిమదేశాల సంస్ధలు ఎన్ని అసత్యాలను ప్రచారం చేస్తున్నదీ తెలిసిందే. వాటిలో బ్రిటన్‌ ఒక ప్రధాన పాత్రధారి.


సోవియట్‌ ప్రచారాన్ని అడ్డుకొనే పేరుతో అమెరికా , బ్రిటన్‌ తదితర సామ్రాజ్యవాద దేశాలు జరిపిన దుర్మార్గాలు, ప్రచారదాడి గురించి ప్రపంచానికి తెలిసింది స్వల్పమే. ఐఆర్‌డి సంస్ధలో 360 మంది పని చేశారు.వారి పని కమ్యూనిజం, సోవియట్‌ ముప్పు గురించి కల్పిత నివేదికలను తయారు చేసి వివిధ ప్రభుత్వాలకు, ఎంపిక చేసిన జర్నలిస్టులు, మేథావులకు పంపటం. వాటికి విశ్వసనీయత కల్పించేందుకు బ్రిటన్‌ గూఢచార, భద్రతా సంస్దలు అందచేసిన అంశాలను కూడా జోడించి స్వతంఐత్ర సంస్దల పేరుతో వాటిని పంపేవారు. అ సంస్ధలు కూడా ఐఆర్‌డి ఏర్పాటు చేసినవే. వాటిలో 1964లో ఏర్పాటు చేసిన ” కమ్యూనిస్టు అనుబంధ సంఘాల గురించి శోధించే అంతర్జాతీయ కమిటీ ” ఒకటి. ఇది మరొక సంస్దను ఏర్పాటు చేసింది. దాని పేరు విశ్వాసుల సభ (లీగ్‌ ఆఫ్‌ బిలీవర్స్‌). దీని పనేమిటంటే రష్యన్లకు దేవుడి మీద విశ్వాసం లేదు, అరబ్బుల ఓటమికి దేవుడి మీద సరైన విశ్వాసం లేకపోవటమే అంటూ పచ్చి మతోన్మాదాన్ని ప్రచారంలో పెట్టటం, అలాంటి వారి మన్నన పొందటం లక్ష్యంగా ఉండేది. అది ప్రచారంలో పెట్టినదానిలో ఒక అంశం ఇలా ఉంది.” ఈ తరుణంలో అరబ్‌ జాతి ఇంతగా ఎందుకు విచారంలో ఉంది ?విపత్తుకు గురైంది ? ధైర్యవంతులైన అరబ్బు శక్తులు జరిపిన జీహాద్‌లో దుష్ట యూదుల చేతిలో ఎందుకు ఓడిపోయారు ? సమాధానాలు కనుగొనటం సులభమే ! మనం గతంలో అనుసరించిన సరైన మార్గం నుంచి వైదొలుగుతున్నాము. మతం ఒక సామాజిక జబ్బు అని భావించే కమ్యూనిస్టులు-నాస్తికులు మనకు సూచించిన మార్గంలో మనం వెళుతున్నాము.” అని పేర్కొన్నారు, అంటే కమ్యూనిస్టులు, సోషలిస్టు దేశాలకు దూరంగా ఉండాలని ముస్లింలను రెచ్చగొట్టటమే ఇది. ఇలాంటి రాతల్లో ఇజ్రాయెల్‌ మీద వ్యతిరేకతను చొప్పిస్తారు. వాటిని చూసి సామాన్య అరబ్బులు సహజంగానే తమ హితం కోరేవారు చెబుతున్నట్లుగా భావించేవారు.


ఐఆర్‌డి సంస్ధ ఒక్క కమ్యూనిస్టుల మీదనే కాదు బ్రిటన్‌ ప్రయోజనాలు ఉన్న ప్రతి చోటా జోక్యం చేసుకుంది.ప్రస్తుతం జింబాబ్వేగా పిలుస్తున్న దేశం ఒకనాడు బ్రిటీష్‌ వలస ప్రాంతం. 1965లో ఇయాన్‌ స్మిత్‌ రొడీషియా పేరుతో స్వాతంత్య్రం ప్రకటించుకున్నాడు. స్మిత్‌ను వ్యతిరేకించే వారి పేరుతో ఐఆర్‌డి ఒక నకిలీ గ్రూపును ఏర్పాటు చేసింది. తాజా పరిస్ధితిని చూస్తే గతంలో సాగించిన మాదిరే ఇప్పుడూ ప్రచారం చేస్తున్నారు. చైనాలో ముస్లింలను అణచివేస్తున్నారని రోజూ వినిపిస్తున్న కట్టుకథలు అలాంటివే. రుణాల పేరుతో చైనా బలహీన దేశాలను ఆక్రమిస్తున్నదన్నదీ దానిలో భాగమే. కనుక వాట్సాప్‌, టీవీ, పత్రికల్లో వచ్చే వాటిని గుడ్డిగా నిజమని భావించరాదు !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

వందేళ్ల చైనా కమ్యూనిస్టు యూత్‌లీగ్‌ !

12 Thursday May 2022

Posted by raomk in CHINA, Current Affairs, imperialism, INTERNATIONAL NEWS, Left politics, Opinion

≈ Leave a comment

Tags

100 years Communist Youth League of China, Communist Youth League of China, Xi Jinping


ఎం కోటేశ్వరరావు


యువత దేశభక్తి, నవ ప్రవర్తకులుగా ముందుకు సాగాలని కష్టాలు వచ్చినపుడు తప్పుదారి పట్టటం, బెదిరిపోరాదని చైనా అధినేత షీ జింపింగ్‌ మేనెల పదిన పిలుపు నిచ్చారు. చైనా కమ్యూనిస్టు యూత్‌లీగ్‌ (సివైఎల్‌సి) శతవార్షికోత్సవం బీజింగ్‌లోని గ్రేట్‌హాల్లో ఘనంగా జరిగింది. ఆ సభలో జింపింగ్‌ పాల్గొని సందేశమిచ్చారు.చరిత్రను పరిశీలించినా, వాస్తవాన్ని చూసినా చైనా యువజనోద్యమంలో కమ్యూనిస్టు యూత్‌ లీగ్‌ ముందున్నదని, దేశం కోసం స్వార్దరహితంగా పని చేసి ముందుకు తీసుకుపోవాలని కోరారు. ప్రతి దేశానికి, ప్రపంచానికి యువతదే భవిష్యత్‌ అని తన కుటుంబం అనిగాక మానవాళి గురించి ప్రతి ఒక్కరూ ఆలోచించాలన్నారు.


మొదటి ప్రపంచ యుద్దం తరువాత కుదిరిన వర్సెయిల్స్‌ ఒప్పందంలో భాగంగా జర్మనీ ఆక్రమణలో ఉన్న తూర్పు చైనాలోని షాండోంగ్‌ ప్రాంతాన్ని జపాన్‌కు అప్పగించారు. ఈ ఒప్పందంపై చైనా పాలకుల లొంగుబాటును నిరసిస్తూ ప్రారంభమైన జాతీయోద్యమం నూతన చైనా ఆవిష్కరణకు నాంది పలికింది. 1919 మే నాలుగున పెద్ద ఎత్తున విద్యార్దులు బీజింగ్‌లోని తియనన్‌మెన్‌ మైదానంలో ప్రదర్శన జరిపారు. దీన్ని మే ఉద్యమంగా పిలిచారు. అప్పటికే జాతీయవాదులుగా ఉన్న వారు లొంగుబాటును నిరసిస్తూ కొత్త బాటలో పోరు సల్పేందుకు కమ్యూనిస్టు పార్టీని ఏర్పాటు చేశారు.ఆ ఉద్యమంలో పాల్గొన్నవారే చైనా యువజనోద్యమాన్ని ప్రారంభించారు. మే నాలుగు ఉద్యమం 1911 విప్లవం కంటే ఒక అడుగు ముందుకు వేసిందని,కమ్యూనిస్టు విప్లవంలో అది ఒక దశ అని దాని ప్రాముఖ్యత గురించి మావో చెప్పారు.1920లో ప్రారంభమైన చైనా సోషలిస్టు యూత్‌లీగ్‌ స్ధాపక కార్యదర్శి యు షీసాంగ్‌ 1922వరకు కొనసాగారు. బీజింగ్‌లో మొగ్గతొడిగిన ఈ సంస్ధను దేశమంతటా విస్తరిస్తూ 1921 జూలైలో అధికారికంగా ప్రకటించారు. తరువాత 1922లో తొలిమహాసభ మే 5-10 తేదీలలో జరిగింది. తరువాత కాలంలో మే ఐదవ తేదీని చైనా యువజన దినంగా ప్రకటించారు. తరువాత 1925లో జరిగిన మూడవ మహాసభలో సంస్ధ పేరును కమ్యూనిస్టు యూత్‌లీగ్‌గా మార్చారు.రెండవ ప్రపంచ యుద్దం తరువాత దేశంలో తలెత్తిన పరిస్ధితి, రాజకీయాల నేపధ్యంలో చైనీస్‌ న్యూ డెమోక్రసీ యూత్‌లీగ్‌గా కొత్త పేరు పెట్టారు. 1957 మే నెలలో తిరిగి కమ్యూనిస్టు యూత్‌లీగ్‌గా మార్చారు. ఈ ఉద్యమానికి నాయకత్వం వహించిన వారిలో హు యావోబాంగ్‌, హు జింటావో కమ్యూనిస్టు పార్టీ అధినేతలుగా, దేశాధ్యక్షులుగా పని చేశారు. గడచిన వంద సంవత్సరాల్లో ఇప్పటి వరకు మొత్తం 17 మంది జాతీయ కార్యదర్శులుగా పని చేశారు. వారిలో హు యావోబాంగ్‌ సుదీర్ఘకాలం 1953 నుంచి 1978వరకు ఉన్నారు. ఈ కాలంలోనే 1968 నుంచి 78వరకు సాంస్కృతిక విప్లవం పేరుతో తీసుకున్న వైఖరి కారణంగా సంస్ధ కార్యకలాపాలను రద్దు చేశారు. 1964 తరువాత మహాసభలు జరగలేదు. 1978 నుంచి తిరిగి క్రమంగా సభలు జరుపుతున్నారు. ప్రస్తుతం 2018లో ఎన్నికైన హి జంకే కార్యదర్మిగా ఉన్నారు.


కమ్యూనిస్టు యూత్‌లీగ్‌లో ప్రస్తుతం ఎనిమిది కోట్ల మందికి పైగా సభ్యులున్నారు.పద్నాలుగు సంవత్సరాలలోపు వారిని సంఘటితం చేసే బాధ్యతలను కూడా ఈ సంస్ధే నిర్వహిస్తున్నది. అనేక దేశాలలో యువత మాదిరి చైనాలో ఎందుకు యువతరం ఉద్యమాలు నిర్వహించటం లేదంటూ పశ్చిమ దేశాల వ్యాఖ్యాతలు వాపోతుంటారు. తామే తుమ్మి తామే తథాస్తు అనుకున్నట్లుగా చైనా గురించి ప్రత్యేకించి సంస్కరణలు అమలు చేస్తున్న 1978 నుంచి ఇప్పటి వరకు ఎప్పటికప్పుడు చైనా కుప్పకూలిపోతుందని జోశ్యాలు చెప్పిన వారందరూ బొక్కబోర్లా పడ్డారు.1989లో తియనన్‌మెన్‌ మైదానంలో కొందరు తప్పుదారి పట్టిన విద్యార్దులు చేపట్టిన ఆందోళనను తూర్పు ఐరోపా దేశాల్లో మాదిరి వినియోగించుకొనేందుకు పశ్చిమ దేశాలు చూసినప్పటికీ కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం విద్యార్దులతో సహనంగా వ్యవహరించి ముగింపు పలికింది. పశ్చిమ దేశాల కుట్రలను వమ్ముచేసింది.


ప్రతి సమాజంలో కొందరు అసంతృప్తవాదులు, భిన్న అభిప్రాయాలు, అవలక్షణాలు కలిగిన వారు ఉన్నట్లుగానే చైనాలో కూడా ఉండటం సహజం. వారికి తగిన అవకాశాలు కల్పిస్తే పక్కదారి పట్టరు, ఉద్యమాలతో పని ఉండదు. చైనా కొత్తతరంలో తలెత్తిన పశ్చిమ దేశాల క్షీణ సంస్కృతి విస్తరించకుండా అక్కడి సమాజం, ప్రభుత్వం చూస్తున్నది. మొత్తం మీద సంస్కరణల ఫలితాలను అనుభవిస్తున్న యువత సహకారం, భాగస్వామ్యం కారణంగానే అమెరికా, ఇతర దేశాలు అనేక ఆటంకాలను కలిగిస్తున్నప్పటికీ చైనా ముందుకు పోతోందన్నది స్పష్టం. పెట్టుబడిదారీ విధానం విఫలమైందని అమెరికా, ఇతర ఐరోపా ధనికదేశాల్లో యువత భావించటం రోజుకు రోజుకూ పెరగటం చూస్తున్నాం. పెరుగుతున్న ఆర్ధిక అసమానతల గురించి ఆ విధానాల సమర్ధకులే చెబుతున్నారు. చైనాలో కూడా అలాంటి అసమానతలు ఉన్నప్పటికీ తమ ముందు తరాల వారితో పోల్చి చూసినా, ఇతర దేశాలను చూసినా తమకు మెరుగైన అవకాశాలను చైనా ప్రభుత్వం కల్పిస్తున్నట్లు అక్కడి యువత భావిస్తోంది. ఒక సమాజం పురోగమిస్తోంది అని చెప్పేందుకు కొన్ని అంశాలను గీటురాళ్ళుగా తీసుకోవటం తెలిసిందే. ప్రస్తుతం చైనా సగటు ఆయుర్దాయం 77.3 సంవత్సరాలు. అమెరికాను అధిగమించింది. ఏడున్నరదశాబ్దాల క్రితం అది 43 సంవత్సరాలు మాత్రమే ఉండేది. ఒక నాడు పిల్లలను కనవద్దంటూ ఆంక్షలు పెట్టిన చైనా ప్రభుత్వం ఇప్పుడు వాటిని ఎత్తివేసి కనమని ప్రోత్సహిస్తోంది. అభివృద్ధి చెందిన దేశాలన్నింటా జననాల రేటు తగ్గటం తెలిసిందే.


1950కి ముందు చైనాలో పరిస్ధితి దారుణంగా ఉండేది. కమ్యూనిస్టులు 1949లో అధికారానికి వచ్చినా దాదాపు పది సంవత్సరాల పాటు అంతర్గత, బాహ్యశత్రువులు సృష్టించిన సమస్యలు ప్రభుత్వాన్ని ఊపిరి సలుపుకోనివ్వలేదు. తరువాత సాంస్కృతిక విప్లవం పేరుతో చేపట్టిన చర్యలతో యువత తీవ్రంగా ప్రభావితమైంది.1978లో సంస్కరణలకు తెరలేపిన తరువాత పదేండ్లపాటు ఆశించిన మేరకు అవి ఫలితాలను ఇవ్వకపోవటం,ఇతర అంశాల మీద యువతలో తలెత్తిన అసంతృప్తికి ప్రతిబింబమే పశ్చిమ దేశాలు చిత్రించినంత తీవ్రంగాకున్నా తియనన్‌మెన్‌ పరిణామాలు. తరువాత కాలంలో అభివృద్ధి ఊపందుకుంది.1989లో జిడిపి తలసరి సగటు ఐఎంఎఫ్‌ సిబ్బంది లెక్కల ప్రకారం 406 డాలర్లుండగా అది 2021నాటికి 11,891డాలర్లకు చేరింది.2026 నాటికి 17,493 డాలర్లకు పెరగవచ్చని అంచనా వేసింది.ఈ దశాబ్ది చివరికి అమెరికా జిడిపి మొత్తాన్ని అధిగమించనుందన్న అంచనాల గురించి తెలిసిందే. ఈ పరిణామాలు, పరిస్ధితి యువతను సానుకూలంగా ప్రభావితం చేసేవే.


తలసరి జిడిపిలో అమెరికా ఎంతో ముందున్నదని తెలిసిందే. ఆ స్ధాయికి చేరేందుకు చైనా ఇంకా కష్టపడాల్సి ఉంది. ఆదాయ అంతరాలున్నట్లు వారే స్వయంగా చెబుతున్నారు. అదే సమయంలో అవకాశాలను ఏ విధంగా కల్పిస్తున్నారో చూద్దాం.2000 సంవత్సరంలో పుట్టిన పిల్లలకు వస్తున్న అవకాశాలు వారి తలిదండ్రులకు రాలేదు. అమెరికాలో ఇదే సంవత్సరంలో పుట్టిన పిల్లలకు ఉన్నత విద్య అవకాశాలు 57శాతం మందికి ఉండగా చైనాలో 54శాతం. రెండు దేశాలను పోలిస్తే చైనాలో ఈ శాతం పెరుగుతుండగా అమెరికాలో పదేండ్లనాటికి ఇప్పటికి పదిశాతం తగ్గింది. అమెరికా విశ్వవిద్యాలయంలో ఏడాదికి ఫీజు 64వేల డాలర్లుండగా చైనాలో రెండువేల డాలర్లు మాత్రమే. పశ్చిమ దేశాలతో పోలిస్తే చైనాలో స్ధిరమైన ఉపాధి రేటు ఎక్కువగా ఉంది. చైనా పిల్లలకు చిన్నతనం నుంచే కమ్యూనిస్టు పార్టీ బుద్దిశుద్ధి చేసి తన చెప్పుచేతల్లో ఉంచుకుంటుందని పశ్చిమ దేశాల వారు ఆరోపిస్తుంటారు. పాలకులు ఎవరుంటే ఆ భావజాలాన్ని కలిగించటం అన్ని చోట్లా జరుగుతున్నదే. చైనా ప్రభుత్వం, పార్టీ కూడా సామాజిక బాధ్యతను గుర్తు చేయకుండా దాని లక్ష్యమైన సోషలిస్టు సమాజాన్ని నిర్మించటం ఎలా సాధ్యం అవుతుంది? గ్రామాల్లో ఉన్న పరిస్ధితిని తెలుసుకొనేందుకు, దారిద్య్రనిర్మూలన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు స్వచ్చందగా అనేక మంది ఇప్పటికీ గ్రామాలకు వెళుతున్నారు. మన దేశంలో కాలేజీల్లో ఎన్‌ఎస్‌ఎస్‌ పధకంలో భాగంగా విదార్ధులను సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వాములను చేస్తున్న సంగతి తెలిసిందే. అది సక్రమంగా జరగటం లేదు, అమల్లో చిత్తశుద్ది లేదనేది వేరే అంశం. మన దేశంలో ఈ స్వాతంత్య్రం మాకేమిచ్చిందని ప్రశ్నించే యువతరం గురించి తెలిసిందే. స్వాతంత్య్రం తరువాత దాని లక్ష్యాలను పాలకులు విస్మరించిన పర్యవసానమే ఇది. చైనాలో దీనికి భిన్నం తమ, తమ తలిదండ్రుల జీవితాల్లో పెను మార్పులు తెచ్చిన కమ్యూనిస్టు పార్టీ నిర్వహించిన పోరాటాలను పిల్లలకు చెబుతున్నారు. పోరాట కేంద్ర స్ధానాలుగా ఉన్న ఏనాన్‌ తదితర ప్రాంతాలను ఏటా కోట్ల మంది సందర్శించి గతాన్ని గుర్తుకు తెచ్చుకొని స్ఫూర్తి పొందుతున్నారు.


కమ్యూనిస్టు పార్టీ అధికారానికి వచ్చిన 1950 దశకాల్లో చైనా యువత తాము కూడా అమెరికా, ఇతర పశ్చిమ దేశాల్లో మాదిరి ఉండాలని కలలు కన్నది, దానిలో తప్పేముంది? తన పౌరులను విదేశాలకు వెళ్లకుండా కంచెలు ఏర్పాటు చేస్తారని చైనా మీద ఆరోపణలు చేసే వారి గురించి తెలిసిందే. అదే వాస్తవమైతే ఏటా పదిహేను కోట్ల మంది విదేశాల్లో ఎలా పర్యటిస్తున్నారు? వారికి అవసరమైన ఆదాయం లేకపోతే అలా తిరగ్గలరా ? అలాగే చైనా నుంచి ఏటా ఏడు లక్షల మంది విద్యార్దులు విదేశాలకు వెళుతున్నారు. మన దేశం నుంచి ఏటా ఎందరు వైద్య విద్య కోసం వెళుతున్నారో చూస్తున్నాము. ఇది పరస్పరం పరిస్ధితి ఎక్కడ ఎలా ఉందో తెలుసుకొనేందుకు తోడ్పడదా ? పోల్చుకోరా ? అడ్డుగోడలు ఎక్కడ ఉన్నట్లు ? అమెరికాలో రోజుకు 120 మంది మాదకద్రవ్యాలు లేదా మద్యం తాగి మరణిస్తున్నారు, రోజుకు తుపాకి తూటాలకు 106 మంది మరణిస్తుండగా 210 మంది గాయపడుతున్నారు. ఈ స్ధితిని తమ దేశంలో ఉన్న పరిస్ధితిని చైనా యువత పోల్చుకోదా ? తమ పరిస్ధితి మెరుగ్గా ఉన్నప్పటికీ ఇంకా మెరుగుపరచుకోవాలంటే సోషలిస్టు విధానం తప్ప దిగజారే పెట్టుబడిదారీ విధానం కాదని అర్ధం చేసుకోదా ? తమ తాతలు, తండ్రులు ఎలాంటి దారిద్య్రం అనుభవించారో తామెలా ఉన్నారో ప్రత్యక్షంగా చూస్తున్నారు గనుకనే కమ్యూపార్టీ పట్ల అచంచల విశ్వాసంతో ఉన్నారు. 2019లో ఏడు లక్షల మంది విద్యార్ధులు విదేశాలకు వెళ్లగా 5,80,000 మంది తిరిగి వచ్చారు. తమ దేశంలో పెరుగుతున్న అవకాశాలతో పాటు దేశానికి తోడ్పడాలన్న ఆకాంక్షకు ఇది నిదర్శనంగా చెప్పవచ్చు. పరిశోధన అభివృద్ధికి గాను చైనా తన జిడిపిలో రెండున్నశాతం ఖర్చు చేస్తున్నది. ఈ కారణంగానే గత నాలుగు దశాబ్దాల కాలంలో అది ఎన్నో రంగాల్లో అద్బుతాలను సృష్టిస్తున్నది.శ్రమశక్తిని ఉపయోగించి వస్తువులను ఉత్పత్తి చేయటే కాదు, ప్రభుత్వం ఇచ్చిన తోడ్పాటుతో శాస్త్ర, సాంకేతిక రంగాల్లో చైనా యువత దూసుకుపోతున్నది. ఒకప్పుడు నీలిమందు భాయిలని ఎద్దేవా చేసిన ప్రపంచం ఇప్పుడు అక్కడ జరుగుతున్న పరిణామాలను చూసి నివ్వెరపోతున్నది. యువతలో ఉత్సాహం, దీక్ష, పట్టుదల లేకుండా ఇది జరిగేదేనా !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...
← Older posts

Recent Posts

  • రాజస్తాన్‌ దర్జీ దారుణ హత్యలో నూపుర్‌ శర్మ నోటి దూల పాత్ర ఎంత !
  • రష్యా, చైనాలపై దాడే 48వ జి7 శిఖరాగ్ర సభ లక్ష్యం !
  • నరేంద్రమోడీ పాలన : అంబానీకి ” మంచి యుద్ధం ” అదానీకి ”మంచి రోజులు ” !
  • కొలంబియాలో విరిసిన తొలి ఎర్రమందారం !
  • నరేంద్రమోడీకి వివరించేందుకు త్రివిధ దళాధిపతులు – ప్రధానికి తెలియకుండానే అగ్నిపథ్‌ను ప్రకటించారా ?

Recent Comments

మోడీ ఎనిమిదేండ్ల పాల… on మోడీ ఎనిమిదేండ్ల పాలన ( రెండవ…
మోడీ ఎనిమిదేండ్ల పాల… on మోడీ ఎనిమిదేండ్ల పాలన (మొదటి భ…
SHEIK ALI HUSSAIN on ప్రపంచాన్ని భయపెడుతున్న మంకీపా…
raomk on రంగనాయకమ్మ గారూ”కుహనా మి…
యూహెచ్ ప్రీతమ్ on రంగనాయకమ్మ గారూ”కుహనా మి…

Archives

  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • రాజస్తాన్‌ దర్జీ దారుణ హత్యలో నూపుర్‌ శర్మ నోటి దూల పాత్ర ఎంత !
  • రష్యా, చైనాలపై దాడే 48వ జి7 శిఖరాగ్ర సభ లక్ష్యం !
  • నరేంద్రమోడీ పాలన : అంబానీకి ” మంచి యుద్ధం ” అదానీకి ”మంచి రోజులు ” !
  • కొలంబియాలో విరిసిన తొలి ఎర్రమందారం !
  • నరేంద్రమోడీకి వివరించేందుకు త్రివిధ దళాధిపతులు – ప్రధానికి తెలియకుండానే అగ్నిపథ్‌ను ప్రకటించారా ?

Recent Comments

మోడీ ఎనిమిదేండ్ల పాల… on మోడీ ఎనిమిదేండ్ల పాలన ( రెండవ…
మోడీ ఎనిమిదేండ్ల పాల… on మోడీ ఎనిమిదేండ్ల పాలన (మొదటి భ…
SHEIK ALI HUSSAIN on ప్రపంచాన్ని భయపెడుతున్న మంకీపా…
raomk on రంగనాయకమ్మ గారూ”కుహనా మి…
యూహెచ్ ప్రీతమ్ on రంగనాయకమ్మ గారూ”కుహనా మి…

Archives

  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • రాజస్తాన్‌ దర్జీ దారుణ హత్యలో నూపుర్‌ శర్మ నోటి దూల పాత్ర ఎంత !
  • రష్యా, చైనాలపై దాడే 48వ జి7 శిఖరాగ్ర సభ లక్ష్యం !
  • నరేంద్రమోడీ పాలన : అంబానీకి ” మంచి యుద్ధం ” అదానీకి ”మంచి రోజులు ” !
  • కొలంబియాలో విరిసిన తొలి ఎర్రమందారం !
  • నరేంద్రమోడీకి వివరించేందుకు త్రివిధ దళాధిపతులు – ప్రధానికి తెలియకుండానే అగ్నిపథ్‌ను ప్రకటించారా ?

Recent Comments

మోడీ ఎనిమిదేండ్ల పాల… on మోడీ ఎనిమిదేండ్ల పాలన ( రెండవ…
మోడీ ఎనిమిదేండ్ల పాల… on మోడీ ఎనిమిదేండ్ల పాలన (మొదటి భ…
SHEIK ALI HUSSAIN on ప్రపంచాన్ని భయపెడుతున్న మంకీపా…
raomk on రంగనాయకమ్మ గారూ”కుహనా మి…
యూహెచ్ ప్రీతమ్ on రంగనాయకమ్మ గారూ”కుహనా మి…

Archives

  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Follow Following
    • vedika
    • Join 925 other followers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Customize
    • Follow Following
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d bloggers like this: