• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: Congress

నరేంద్రమోడీ, బిజెపిని నీట ముంచిన కర్ణాటక పాల రైతులు !

19 Friday May 2023

Posted by raomk in BJP, Communalism, Congress, Current Affairs, Economics, Farmers, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Politics, Prices, RELIGION, Religious Intolarence, Women

≈ Leave a comment

Tags

BJP, Karnataka election 2023, Karnataka milk producers, Narendra Modi Failures


ఎం.కోటేశ్వరరావు


ఎవరమైనా ఏదో ఒక నాటికి పోవాల్సిన వాళ్లమే. ఒకరు ముందు ఇంకొకరు వెనుక అంతే తేడా ! అన్న శ్మశాన వైరాగ్యం గురించి అందరికీ తెలిసిందే. అమూల్‌ పాల కంపెనీ గుజరాత్‌ ప్రభుత్వ రంగ సంస్థ. ప్రభుత్వాలు చేయాల్సింది పాలన తప్ప పాలు, నీళ్లు,చింతపండు, ఉల్లిపాయల వంటి వాటిని అమ్మటం కాదు. కనుక గతంలో ఏం జరిగినా ప్రభుత్వ రంగంలో ఉన్న వీటికి సంబంధించిన సంస్థలన్నింటినీ అమ్మి సొమ్ము చేసుకోవాలన్నది కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కార్‌ విధానం. అఫ్‌ కోర్స్‌ ఇది, కాంగ్రెస్‌ విధానమే, కాకపోతే తాను జన్మించింది దాని కోసమే అన్నట్లుగా దాన్నే మరింత భక్తి శ్రద్దలతో మోడీ అమలు జరుపుతున్నారు. అందువలన అన్నింటినీ తెగనమ్మిన తరువాత అమూల్‌ను కూడా అమ్మకుండా మరోసారి అధికారం అప్పగిస్తే నరేంద్రమోడీ లేదా వారసులు ఊరుకుంటారా ? ఒకసారి అపని జరిగాక విదేశాల నుంచి చౌకగా దొరికే పాలు, పాలపదార్ధాలను మన మీద రుద్దుతారు. పాలతో కొంత రాబడి కోసం ఆవులు, గేదెలను మేపే రైతుల నోట్లో అప్పుడు మట్టే. కర్ణాటక నందిని పాల సంస్థను మూతపెట్టి అమూల్‌కు మార్కెట్‌ను కట్టబెట్టేందుకు కర్ణాటకలోని బిజెపి పాలకులు చూడటాన్ని అక్కడి రైతులు జీర్ణించుకోలేకపోయారు. పాల రైతులకు మేలు చేసేందుకు గాను తమకు తిరిగి అధికారం అప్పగిస్తే జనాలకు రోజుకు అరలీటరు పాలు సరఫరా చేస్తామని బిజెపి నమ్మబలికింది. మీ పాల సంగతి తరువాత అంటూ ఆ బిజెపిని పాల రైతులు కావేరీ, కృష్ణ నీళ్లలో ముంచి గుణపాఠం చెప్పారు.


అమూల్‌ పేరు చెబితే లేదా దాని మార్కెటింగ్‌ అవకాశాలు పెంచితే నరేంద్రమోడీ దృష్టిలో పడి ప్రశంసలు పొందవచ్చని బిజెపి నేతలు భావించి అందుకు తెగించినట్లు చెప్పవచ్చు. గతేడాది డిసెంబరులో పాల రైతులు ఎక్కువగా ఉన్న మాండ్య జిల్లా కేంద్రంలో జరిపిన సభలో కేంద్ర మంత్రి అమిత్‌ షా పాల వివాదానికి తెరతీశారు.పాల రైతుల సంక్షేమానికి కర్ణాటక నందిని, గుజరాత్‌ అమూల్‌ పాల సంస్థలు కలసి పని చేయాలని చెప్పారు. ప్రభుత్వ రంగ పాల కంపెనీలన్నీ సమన్వయంతో పని చేసి రైతులకు మేలు చేయాలని చెప్పి ఉంటే అదొక తీరు. కేవలం అమూల్‌ పేరే చెప్పటంతో నందిని పాలు కనుమరుగుకానున్నాయనే అనుమానం కర్ణాటక రైతుల్లో తలెత్తింది. అదేమీ కాదని 40శాతం కమిషన్‌ సిఎం బొమ్మై మొదలు ఎందరు బిజెపి పెద్దలు సంజాయిషీ ఇచ్చుకున్నా రైతులు నమ్మలేదు. అవకాశం కోసం ఎదురు చూశారు. చేయాల్సింది చేశారు. బెళగావి, హసన్‌, తుంకూరు, మైసూరు, మాండ్య జిల్లాలు పాల ఉత్పత్తికి ప్రసిద్ది. ఈ ఐదు జిల్లాల్లో 54 అసెంబ్లీ స్థానాలుండగా కాంగ్రెస్‌ 33 గెలుచుకుంది. గతంలో పదకొండు ఉన్నాయి. బిజెపి బలం 21 నుంచి 12కు తగ్గింది. జెడిఎస్‌ కూడా సీట్లను పొగొట్టుకుంది. గతంలో జరిగిన సర్వే ప్రకారం దేశంలోని 20 రాష్ట్రాల్లో పాల ఉత్పత్తిలో 9వ స్థానంలో ఉంది. గుజరాత్‌ తరువాత పాలను సహకార సంస్థలకు ఎక్కువగా అమ్మే రాష్ట్రంగా కర్ణాటక ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్‌ గతం కంటే ఏడుశాతం ఓట్లను అదనంగా పొందింది. రాష్ట్రమంతటా బిజెపి మద్దతుదారులుగా ఉన్న లింగాయత్‌ సామాజిక తరగతి ఓటర్లలో వచ్చిన మార్పు కూడా దీనికి దోహదం చేసింది.


జనాలకు పాలు సరఫరా చేస్తామని బిజెపి వాగ్దానం చేసింది. ఇతరులకు శుద్దులు చెప్పిందని తప్ప నిజానికి దానిలో తప్పు పట్టాల్సిందేమీ లేదు. అది ఉచితం కాదు, ఆరోగ్యాన్ని కాపాడేందుకు, పాల రైతులకు లబ్ది చేకూర్చేందుకు, మార్కెట్‌ను పెంచేందుకు అని బిజెపి నేతలు టీవీ చర్చల్లో సమర్ధించుకున్నారు. అదే పని గత మూడున్నర సంవత్సరాలుగా అధికారంలో ఉండగా కర్ణాటక బిజెపి గానీ, గుజరాత్‌తో సహా ఇతర బిజెపి పాలిత రాష్ట్రాల్లో గానీ ఎందుకు అమలు జరపటం లేదన్న ప్రశ్నకు సమాధానం లేదు. కర్ణాటక ఎన్నికల ప్రచారం మొదలైనపుడే ఏప్రిల్‌ నాలుగవ తేదీన రాయిటర్స్‌ వార్తా సంస్థ ఇచ్చిన ఒక వార్త ప్రకారం గత దశాబ్ది కాలంలో ఎన్నడూ లేని విధంగా గతేడాది కాలంలోనే 15శాతం పాలధరలు పెరిగాయి. ఇది ద్రవ్యోల్బణం పెరుగుదలకు కూడా దోహదం చేసింది. దాంతో ధరల తగ్గించే పేరుతో విదేశాల నుంచి దిగుమతి చేసుకొనే పాలు, పాల ఉత్పత్తుల మీద దిగుమతి పన్నులను రద్దు చేసింది. ఇది పాల వినియోగదారులకు కాస్త ఉపశమనం కలిగించినా అదే విధానాన్ని కొనసాగిస్తే మన పాడి పరిశ్రమ మూతపడుతుంది. డాలర్లు చెల్లించి చమురుతో పాటు పాలు, పెరుగు కూడా కొనుక్కోవాల్సి ఉంటుంది. రైతులకు తగిన గిట్టుబాటు ధర రాకపోతే పాడి తగ్గుతుంది. ధర పెరిగితే పోషకాహారం కొనుగోలూ తగ్గుతుంది. మాంసం కోసం ఆవులను వధించారని ఆరోపిస్తూ మూక దాడులు చేసి ప్రాణాలు తీసేందుకు వెనుకాడని గో వంశ రక్షక, గో రక్షక దళాలను చూశాము. ఈ కాషాయ దళాలు మేతలేక కృశించే, రోగాలతో మరణించే ఆవుల సంరక్షణ గురించి మాట్లాడవు. పాలు ఇవ్వని వాటిని, మేపలేక ఎవరైనా వధశాలలకు అమ్ముకోవటానికి వీల్లేకుండా చేశారు. రోడ్ల మీద వదలివేస్తే కొత్త సమస్యలను ముందుకు తెచ్చాయి. మెజారిటీ రాష్ట్రాలు, కేంద్రంలో తమ ప్రభుత్వమే అధికారంలో ఉన్నప్పటికీ ఆవులకు సోకిన లంపీ స్కిన్‌ వ్యాధి నివారణకు అవసరమైన చర్యలు లేవు. దాంతో 2022లోనే కనీసం మూడులక్షల ఆవులు మరణించటం లేదా ఈ రోగం కారణంగా వట్టిపోయినట్లు అంచనా. ఈ కారణంగా పాల ఉత్పత్తి తగ్గటంతో పాటు రైతాంగానికి ఆర్థికంగా విపరీత నష్టం వాటిల్లింది. ఆవు రాజకీయాలు చేసే వారికి ఇదేమీ పట్టలేదు.


ప్రపంచంలో అధికంగా పాల ఉత్పత్తి చేస్తున్న మన దేశంలో ఇటీవలి సంవత్సరాలలో తొలిసారిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా అవసరాలు-ఉత్పత్తికి జత కుదరటం లేదు. ఉత్పత్తి పెరుగుదల దిగజారింది. జాతీయపాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ సమాచారం మేరకు 2022-23లో మన దేశం 477 కోట్ల డాలర్ల విలువ గల పాల ఉత్పత్తులను దిగుమతి చేసుకుంది. ఇది వెయ్యి శాతం ఎక్కువ. ప్రపంచంలో పెరిగిన నెయ్యి గిరాకీ కారణంగా మన దేశం గతేడాది ఏప్రిల్‌-డిసెంబరు కాలంలో 47 కోట్ల డాలర్ల విలువగల ఎగుమతులు చేసింది. అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే గొప్పలు చెప్పుకొనేందుకు 19.45శాతం ఎక్కువే, కానీ భారీగా పెరిగిన దిగుమతుల మాటేమిటి ? దేశంలో నిల్వల పరిస్థితిని బట్టి పాలపొడి, వెన్న, నెయ్యితో సహా ఇతర పాల ఉత్పత్తులను దిగుమతి చేసుకొనేందుకు దిగుమతి పన్నులను సులభతరం చేసేందుకు కేంద్రం రంగంలోకి దిగవచ్చని కేంద్ర పశుసంవర్థకశాఖ అధికారి రాజేష్‌ కుమార్‌ ఏప్రిల్‌ 5న చెప్పారు. మార్చి 31 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి అంతకు ముందు ఏడాదితో పోలిస్తే పాల ఉత్పత్తి ఒక్క శాతమే పెరిగింది. గత దశాబ్దికాలంలో వార్షిక సగటు 5.6శాతం ఉంది. ఈ ఏడాది పాల ఉత్పత్తుల డిమాండ్‌ ఏడుశాతం పెరగవచ్చని అంచనా.గోధుమ గడ్డి, ఇతర మేత లభ్యత తగ్గిన కారణంగా వాటి టోకు ధరలు ఏడాది కాలంలో 25శాతం పెరిగింది. మార్కెట్లో ఆవులు తగ్గిన కారణంగా గేదెల ధరలు బాగా పెరిగాయి.


ఇక కన్నడిగుల ఆరోగ్యం కోసం పాల సరఫరా వాగ్దానం చేసినట్లు వాదిస్తున్న బిజెపి నేతలను జనం నిలదీయాల్సి ఉంది. దేశమంతటా తమదే పాలన అని గొప్పలు చెప్పుకుంటున్న బిజెపి జన ఆరోగ్యం గురించి పట్టించుకున్న తీరును ఒక్కసారి చూద్దాం. అజాగళ స్థనం వంటి నీతిఅయోగ్‌(ఎందుకంటే అది సూచించిన మేరకు కేంద్రం నిధులు ఇవ్వదు, కానీ కాగితాల మీద సిఫార్సులు మాత్రం అందంగా కనిపిస్తుంటాయి) నివేదికలను రూపొందించేందుకు మాత్రమే పనికి వస్తుంది. ప్రపంచ బాంకు, అది కలసి 2021 డిసెంబరులో మన దేశంలోని రాష్ట్రాల ఆరోగ్య సూచికలను విడుదల చేసింది.2019-20లో మొత్తంగా పందొమ్మిది పెద్ద రాష్ట్రాల పనితీరును మదింపు చేస్తూ రాంకులు ఇచ్చారు.దానిలో 82.2 మార్కులతో కేరళ మొదటి స్థానంలో ఉంది. దేశానికి నమూనాగా చెబుతూ ఆ విధానాన్ని దేశమంతటా అమలు జరుపుతామని మోడీ 2014లో చెప్పిన గుజరాత్‌ 63.59 మార్కులతో ఆరవ స్థానంలో ఉంది. అది రెండింజన్ల పాలనలో కూడా ఉందని వేరే చెప్పనవసరం లేదు. ఇక యోగి ఆదిత్యనాధ్‌ పాలనలో ఉన్న ఉత్తర ప్రదేశ్‌ 30.57 మార్కులతో 19వ(చివరి) స్థానంలో ఉంది. మధ్యప్రదేశ్‌ 36.72తో దిగువ నుంచి మూడవ స్థానం, చాలాకాలం బిజెపి ఏలుబడిలో ఉన్న బీహార్‌ 31మార్కులతో ఉత్తర ప్రదేశ్‌ కంటే ఎగువున ఉంది. అక్కడ ఎక్కడా జనాలకు బిజెపి పాల వాగ్దానం చేయలేదు. దీని గురించి ఒక చర్చలో బిజెపి ప్రతినిధి చెప్పిన హాస్యాస్పద కారణం ఏమింటే యోగి ఆదిత్యనాధ్‌ శాంతి భద్రతల మీద కేంద్రీకరిస్తున్నందున పాల గురించి పట్టించుకోలేదట. దానికీ దీనికి సంబంధం ఏమిటి, ఇతర పధకాలన్నింటినీ పక్కన పెట్టారా ? పోనీ గుజరాత్‌, ఎంపీ సంగతేమిటి ? రక్తహీనత తల్లీ,పిల్లల మరణాలకు దారి తీస్తోంది. రక్తహీనత ముక్త భారత్‌ అంటూ కేంద్ర ప్రభుత్వం 2018లో ప్రకటించిన పధకం తీరుతెన్నుల గురించి 2022 ఫిబ్రవరి నాలుగున ఒక ప్రకటన విడుదల చేసింది. దాని ప్రకారం జనాభాను ఆరు తరగతులుగా విభజించి 2019-20 సంవత్సరంలో నిర్వహించిన ఆరోగ్య సర్వే వివరాల ప్రకారం ఎవరిలో ఎంతశాతం రక్తహీనత ఉందో పేర్కొన్నారు. 19-49 సంవత్సరాల పురుషుల్లో 25, మహిళల్లో 57, గర్భవతుల్లో 52.2శాతం చొప్పున ఉంది. ఇక 15-19 సంవత్సరాల తరగతి బాలురలో 31.1, బాలికల్లో 59.1 శాతం ఐదేండ్లలోపు పిల్లల్లో 67.1 శాతం ఉంది. ఇవి దేశ సగటు అంకెలు. పిల్లలకు సంబంధించి ఉత్తర ప్రదేశ్‌లో 66.4, మహారాష్ట్రలో 68.9, బీహార్‌లో 69.4 హర్యానాలో 70.4, రాజస్తాన్‌లో 71.5, కాశ్మీరు, మధ్యప్రదేశ్‌లో 72.7, గుజరాత్‌లో79.7,లడఖ్‌లో 92.5 శాతాల చొప్పున రక్తహీనత ఉంది. ఇక్కడంతా బిజెపి ఏలుబడే సాగింది, సాగుతోంది. అక్కడెక్కడా లేని పాల ఊసు కర్ణాటకలో ఎందుకు తెచ్చారంటే అమూల్‌ కోసం నందిని బలిపెడుతున్నారని రైతాంగం భావించటం తప్ప జనం మీద శ్రద్దకాదంటే ఏమంటారు ? దేశ పాడి పరిశ్రమకు ఎదురవుతున్న సవాళ్లను కేంద్రం పట్టించుకుంటుందా ? ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో ప్రైవేటు డైరీలకు పెద్ద పీట వేస్తున్నారు. రేపు దిగుమతులకూ అంగీకరిస్తే మన రైతుల గతేంగాను ?


ప్రపంచంలో పాల రైతులు రెండు తరగతులుగా ఉన్నారు. ఒకటి ఎగుమతుల కోసం పాడిని అమ్ముకొని లాభాలు పొందే వారు, రెండవది జీవనోపాధికోసం పాడిని నమ్ముకొని బతికేవారు. రెండవ తరగతిని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది.న్యూజిలాండ్‌, అమెరికా, ఆస్ట్రేలియా, కొన్ని ఐరోపా దేశాలు పాడిని అమ్ముకొనేవి కాగా మన దేశం వంటి కొన్ని దేశాలు రెండవ తరగతిలో ఉన్నాయి. మన పాడి పరిశ్రమలోని రైతులు నిలదొక్కుకొనేందుకు జీవన పోరాటం చేస్తుండగా వారిని పడగొట్టి తమ ఉత్పత్తులను మన దేశంలో గుమ్మరించాలని పైన పేర్కొన్న దేశాలు చూస్తున్నాయి. మనది జీవనోపాధి, వారిది లాభాల వేట.ప్రపంచ వాణిజ్య సంస్థ ఉనికిలోకి వచ్చిన తరువాత మన మీద వత్తిడి పెరుగుతోంది. ఎగుమతులు చేస్తున్న దేశాలలో 2022లో న్యూజిలాండ్‌ 1,353 కోట్ల డాలర్ల మేర, అమెరికా 950, ఆస్ట్రేలియా(2021) 220, కెనడా 50, మన దేశం 2022లో 40 కోట్ల డాలర్ల మేర ఎగుమతులు చేసింది. ఆస్ట్రేలియా తన పాల ఉత్పత్తులకు మార్కెట్‌ తెరవాలని మన మీద వత్తిడి తెస్తున్నది. భారత్‌లో ఉత్పత్తిగాని ఆహార ఉత్పత్తులను మాత్రమే అక్కడి నుంచి దిగుమతులకు అనుమతిస్తామని చెబుతున్న మన ప్రభుత్వం ఆ వైఖరికి ఎంతకాలం కట్టుబడి ఉంటుందో చూడాల్సి ఉంది. అమెరికా వత్తిడి కూడా తక్కువగా లేదు. న్యూజిలాండ్‌ ఉత్పత్తిలో 95శాతం ఎగుమతులకే ఉంటోంది. అమెరికా పెద్ద ఎత్తున ఎగుమతిదార్లకు సబ్సిడీ ఇచ్చి తన ఉత్పత్తులకు మార్కెట్‌ కోసం చూస్తున్నది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

కర్ణాటకలో మోడీపై పోలీస్‌ స్టేషన్‌లో ”ఉగ్ర ” ఫిర్యాదు : ఆవు మొదలు ఎందెందు చూసినా అందందు దొరుకుతున్న ” దేశభక్త ఉగ్రవాదులు, విద్రోహులు ” !

15 Monday May 2023

Posted by raomk in BJP, Communalism, Congress, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, RELIGION, Religious Intolarence

≈ Leave a comment

Tags

BJP, Complaint against Narendra Modi, DRDO, Gau Rakshaks, Gouri lankesh, Narendra Modi, Narendra Modi Failures, RSS, terrorism


ఎం కోటేశ్వరరావు


కర్ణాటక ఎన్నికలు ముగిశాయి. దక్షిణ భారతంలో అడ్డదారిలో మూడున్నర సంవత్సరాల క్రితం అధికారం కైవశం చేసుకున్న ఏకౖౖెక రాష్ట్రాన్ని బిజెపి కోల్పోయింది. బిడ్డ పోయినా పురుటి వాసన పోదు అన్న సామెత తెలిసిందే. ఎన్నికల సందర్భంగా వివిధ పార్టీలు చేసిన వాగ్దానాలు, నేతల ప్రసంగాలు రానున్న రోజుల్లో చర్చనీయాంశాలుగా మారతాయి. వాటిలో ఒకటి ప్రధాని నరేంద్రమోడీ మీద కాంగ్రెస్‌ దాఖలు చేసిన ఒక కేసు కూడా ఉంటుందని వేరే చెప్పనవసరం లేదు.ఉగ్రవాదానికి-కాంగ్రెస్‌కు సంబంధాన్ని అంటగడుతూ చేసిన ప్రసంగాల మీద విస్తృత దర్యాప్తు జరిపి కేసు నమోదు చేయాలని కాంగ్రెస్‌ కర్ణాటక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రజాస్వామ్య పుట్టినిల్లు మన దేశమే అని నరేంద్రమోడీ స్వయంగా చెప్పినందున చట్టం ముందు అందరూ సమానులే కనుక తన మీద దాఖలైన కేసుకు సహకరిస్తారా లేదా అన్నది చూద్దాం.ఓట్‌ బాంక్‌ కోసం కాంగ్రెస్‌ పార్టీ ఉగ్రవాదాన్ని పోషించింది,ఆశ్రయం కల్పించింది, లొంగింది అని మోడీ ఒక ఎన్నికల సభలో ఆరోపించారు. తప్పుడు ఆరోపణలతో ప్రధాని పదవిని దుర్వినియోగం చేస్తూ ఓటర్లను ప్రభావితం చేసేందుకు చూశారని, ఇది ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని ఉల్లంఘించటమే గనుక చర్య తీసుకోవాలంటూ పోలింగ్‌కు ముందే బెంగలూరు నగరంలోని హై గ్రౌండ్స్‌ పోలీసు స్టేషన్లో కేసు పెట్టారు. అక్రమాలకు పాల్పడుతున్న మోడీ పేర్లున్న కొందరి గురించి రాహుల్‌ గాంధీ కర్ణాటకలో గత లోక్‌సభ ఎన్నికలపుడు చేసిన వ్యాఖ్యలు,వాటి మీద గుజరాత్‌లోని సూరత్‌లో కేసు, కోర్టు విచారణ, రెండేళ్ల జైలు శిక్ష, దాంతో రాహుల్‌ లోక్‌సభ సభ్యత్వంపై వెంటనే అనర్హత వేటు, సదరు తీర్పు చెప్పిన జడ్జికి పదోన్నతి, దాన్ని నిలిపివేసిన సుప్రీం కోర్టు ఆదేశం వంటి అంశాలన్నీ తెలిసినవే. ఈ పూర్వరంగంలో తమ ప్రభుత్వమే అధికారానికి వచ్చింది గనుక కాంగ్రెస్‌ తాను దాఖలు చేసిన కేసు పట్ల ఎంత శ్రద్ద చూపుతుంది అనే అంశం ఆసక్తికరంగా మారింది.


ఉగ్రవాదులు అనే అనుమానంతో మధ్య ప్రదేశ్‌ పోలీసులు హైదరాబాదు, శివారు ప్రాంతాలలో ఇటీవల ఆరుగురిని అరెస్టు చేసి భోపాల్‌ తరలించారు. అక్కడ దొరికిన పదకొండు మంది నుంచి రాబట్టిన సమాచారం మేరకు ఇక్కడ సోదాలు జరిపి పట్టుకున్నారు.అరెస్టైన వారిలో మజ్లిస్‌ నేత ఒవైసికి చెందిన మెడికాల్‌ కాలేజీలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న ఒకరు కూడా ఉన్నారు. వారు ఏ దుండగాలకు పాల్పడిందీ ఇంకా వెల్లడికాలేదు. ఇలా పట్టుబడినపుడల్లా మీడియాలో, బిజెపి నేతల నోళ్లలో హైదరాబాద్‌ ఉగ్రవాదుల అడ్డా అని ప్రచారం జరుగుతున్నది. ఢిల్లీ లిక్కర్‌ కుంభకోణంలో దర్యాప్తు సంస్థలు నిందితులు సౌత్‌ గ్రూప్‌కు చెందిన వారు అన్న పదజాలాన్ని చార్జి షీట్లలో పదే పదే ప్రస్తావించటాన్ని సుప్రీం కోర్టు తప్పు పట్టి మొత్తం దక్షిణ భారతాన్ని నిందించేవిధంగా ఉన్నట్లు చివాట్లు వేసిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ విధానాలను లండన్‌లో జరిగిన ఒక సభలో విమర్శించిన కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ విదేశాల్లో దేశ పరువు తీశారని ఊరూవాడా టాంటాం వేస్తున్న వారు హైదరాబాద్‌ను ఉగ్రవాదుల అడ్డాగా పేర్కొని అవమానిస్తున్నట్లు కాదా ? ఎక్కడ ఉగ్రవాదులు దొరికితే ఆ రాష్ట్రాన్ని వారి అడ్డాగా వర్ణిస్తే బిజెపి పాలనలో ఉన్న భోపాల్‌ను కూడా ఆ పార్టీ నేతలు అదే విధంగా పేర్కొంటున్నారా ? ముస్లింలందరూ ఉగ్రవాదులు, దేశ ద్రోహాలు కాదు గానీ దొరికినవారందరూ ముస్లింలే అనే ప్రచారం జరుగుతోంది.నిజమేనా ? అదే ప్రాతిపదికన మరి హిందువులు, క్రైస్తవులు, సిక్కుల సంగతేమిటి ?


డిఆర్‌డిఓ శాస్త్రవేత్త ప్రదీప్‌ ఎం కుల్కర్‌ను మహారాష్ట్ర ఉగ్రవాద నిరోధ పోలీసు దళం పూనేలో మే నెల మూడవ తేదీన అరెస్టు చేసింది, పదిహేనవ తేదీ వరకు కస్టడీకి పంపారు.యాభై తొమ్మిది సంవత్సరాల ఈ పెద్దమనిషి తన తండ్రి, తాతల నుంచి తాము ఆర్‌ఎస్‌ఎస్‌లో భాగస్వాములుగా ఉన్నట్లు గర్వంగా చెప్పుకున్న వీడియో కూడా అందరికీ అందుబాటులో ఉంది. కేంద్రంలో, మహారాష్ట్రలో కూడా అధికారంలో ఉన్నది రెండింజన్ల పార్టీ అన్నది తెలిసిందే. అందువలన కుట్రతోనో మరోరకంగానో అరెస్టు చేశారని చెప్పేందుకు లేదు. స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనకపోగా బ్రిటీష్‌ వారికి సేవ చేసిన పూర్వరంగం, మహాత్మా గాంధీ హంతకుడు గాడ్సే ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన వాడు కావటంతో నాడు కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. అందువలన ఆ సంస్థలో సభ్యులుగా ఉన్నవారు గానీ అభిమానించే వారు గానీ బహిరంగంగా ఆ అంశాన్ని చెప్పుకొనేందుకు సిగ్గుపడేవారు. గుట్టుగా దాచేవారు. రోజులు మారాయి. చరిత్ర మరుగునపడింది. స్వాతంత్య్ర ఉద్యమంతో సంబంధం లేని వారు, ద్రోహం చేసిన వారిని అసలు సిసలు సమరయోధులుగా పేర్కొంటూ నకిలీ చరిత్రను రాస్తున్నారు, ప్రచారం చేస్తున్నారు. కొత్త తరాలు అదే నిజమనుకుంటున్నాయి. కుల్కర్‌ లాంటి వారు పాకిస్తాన్‌కు మన రక్షణ రహస్యాలను ఎప్పటి నుంచి చేరవేస్తున్న జాతీయవాదో తెలియదు. తన ద్రోహాన్ని కప్పిపుచ్చుకొనేందుకు దేశపాలనలో చక్రం తిప్పుతున్న ఆర్‌ఎస్‌ఎస్‌తో అనుబంధం గురించి చెప్పుకుంటే తనవైపు చూడరని కుల్కర్‌ అనుకున్నాడేమో అన్న సందేహం కలుగుతోంది. ప్రతిష్టాత్మక పరిశోధనా సంస్థలో పని చేస్తూ ఒక మహిళ వలలో పడి సమాచారాన్ని చేరవేసినట్లు ప్రాధమిక సమాచారం. చార్జిషీటు దాఖలు చేస్తే మొత్తం వెల్లడిఅవుతుంది.


డిఆర్‌డిఓకు చెందిన బాబూరామ్‌ డే అనే మరో ఉద్యోగిని ఫిబ్రవరి 24న ఒడిషా పోలీసులు అరెస్టు చేశారు.బాలసోర్‌ జిల్లా చండీపూర్‌ క్షిపణి ప్రయోగ కేంద్రంలో పని చేస్తాడు. అన్ని పరీక్షలపుడు అతడు భాగస్వామి. ఆ సమాచారాన్ని, నిషేధిత ప్రాంతాల ఫొటోలను పాకిస్తాన్‌కు చేరేవేసేవాడని, అతను కూడా ఒక మహిళ వలలో చిక్కుకొని ఆమె ద్వారా కథ నడిపించేవాడని పోలీసులు చెప్పారు. ఉగ్రవాదులకు నిధులు అందచేస్తున్నారనే సమాచారంతో (2016లో పెద్ద నోట్ల రద్దు ద్వారా ఉగ్రవాదులకు నిధులు అందకుండా చేసినట్లు నరేంద్రమోడీ చెప్పుకున్న అంశాన్ని ఇక్కడ గుర్తుకు తెచ్చుకోవాలి, ఆ సలహా తానే ఇచ్చినట్లు చంద్రబాబు నాయుడు తాజాగా మరోసారి చెప్పుకున్నారు) 2019లో మధ్య ప్రదేశ్‌లోని సాత్నా జిల్లాలో ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వారిలో భజరంగ్‌ దళ్‌ నేత బలరామ్‌ సింగ్‌, సునీల్‌ సింగ్‌, శుభమ్‌ మిశ్రా ఉన్నారు. పంపిన సమాచారం ఎప్పటికప్పుడు కనిపించకుండా చేసే ఒక ఆప్‌ ద్వారా వారు ఉగ్రవాదులకు నిధుల సమాచారాన్ని చేరవేసేవారని పోలీసులు వెల్లడించారు. అంతకు రెండు సంవత్సరాల ముందు బిజెపి యువమోర్చా, బిజెపి ఐటి విభాగ నేత ధృవ సక్సేనా మరోపదిమందిని కూడా ఇదే ఆరోపణలతో అరెస్టు చేశారు. వీరంతా ఒక ముఠాగా పని చేస్తున్నట్లు వెల్లడైంది. అరెస్టుల గురించి రాష్ట్ర మంత్రి గోవింద్‌ సింగ్‌ మాట్లాడుతూ అనేక మంది బిజెపికి చెందిన వారు సంవత్సరాలుగా ఉగ్రవాద కార్యకలాపాల్లో ఉన్నారని, నిధులు, రహస్య సమాచారాన్ని చేరవేశారని చెప్పారు. బిజెపి నేతలు పాక్‌ ఐఎస్‌ఐ ఏజంట్లుగా మారారని, వారికి బెయిలు కోసం ప్రయత్నించినందుకు సిఎం శివరాజ్‌ సింగ్‌ సిగ్గుపడాలని, ఎవరు దేశద్రోహులో చెప్పాలని మాజీ సిఎం, కాంగ్రెస్‌ నేత దిగ్విజయ సింగ్‌ ట్వీట్‌ చేశారు. ఉగ్రవాద సంబంధిత కేసులతో రాజకీయం చేయకూడదని, కోర్టు వారికి బెయిలిచ్చిందని బిజెపి నేత దీపక్‌ విజయవర్గీయ సమర్ధించుకున్నారు. ఈ తర్కం తెలంగాణా బిజెపి నేత బండి సంజయకు అర్ధంగాక లేదా తెలియక తరచూ అదే రాజకీయం చేస్తున్నారా ? బిజెపి చేస్తే సంసారం, ఇతర పార్టీలు చేస్తే మరొకటా ?


కాశ్మీరులో ఉగ్రవాద సంస్థ లష్కరే తోయబాకు చెందిన వారిని గత సంవత్సరం పోలీసులు అరెస్టు చేశారు. వారిలో ఒకడు బిజెపి ప్రాంతీయనేత అని అతను అమిత్‌షాతో దిగిన ఫొటోలు ఉన్నట్లు, అమరనాధ్‌ యాత్రీకుల మీద దాడి చేసేందుకు కుట్రపన్నినట్లు 2022 జూలై 9న కాంగ్రెస్‌ నేతలు ఒకే రోజు దేశమంతటా 23 చోట్ల విలేకర్ల సమావేశాలు పెట్టి మరీ చెప్పారు. నూపుర్‌ శర్మ నోటి దురుసు మాటలకు ప్రభావితుడై మద్దతు తెలిపిన ఉదయపూర్‌ దర్జీ కనయలాల్‌ను హత్య చేసిన వారిలో బిజెపి మద్దతుదారులు ఉన్నట్లు, ఒక తీవ్రవాద బృందానికి ప్రభుత్వ నిధులను అందచేసినందుకు 2017లో అసోం బిజెపి నేత నిరంజన్‌ హజయికి ఎన్‌ఐఏ కోర్టు యావజ్జీవ శిక్ష విధించినట్లు కూడా కాంగ్రెస్‌ నేతలు చెప్పారు.శ్రీనగర్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో ఉగ్రవాది అజార్‌ మసూద్‌ శిష్యుడు మహమ్మద్‌ ఫరూక్‌ ఖాన్ను బిజెపి నిలిపిందని కూడా వెల్లడించారు.


హైదరాబాదులో దొరికిన ఉగ్రవాదులు ఇరుగుపొరుగువారితో ఎలాంటి వివాదాలు లేకుండా అసలు ఉన్నట్లే తెలియకుండా ఉన్నారని, అరెస్టులతో ఆ ప్రాంత వాసులు ఉలిక్కిపడినట్లు మీడియా వెల్లడించింది. ఉగ్రవాదులు ఎవరైనా మెడలో బిళ్ల వేసుకొని లేదా ఇంటికి బోర్డు పెట్టి తమ గుర్తింపును వెల్లడించుకుంటారా ? హైదరాబాదులో అరెస్టు చేసిన ఆరుగురిలో ముగ్గురు మతం మారి ఇస్లాం బోధనలు సాగిస్తున్నట్లు కూడా ఒక పత్రిక రాసింది. అదే వాస్తవమైతే కొందరు హిందువుల పధకం ప్రకారమే మతం మారి ముస్లింల పేరుతో ఉగ్రవాద విద్రోహులుగా పని చేస్తున్నట్లు భావించాలి. ఇదొక కొత్త కోణం. ఒక ఉగ్రవాద ముఠా కుట్రను భగం చేసినట్లు 2018 ఆగస్టులో మహారాష్ట్ర ఏటిఎస్‌ టీమ్‌ ప్రకటించింది.వారిలో ఒకడి అరెస్టు వార్తతో ఇరుగుపొరుగు వారు అవాక్కయ్యారట. ఇరుగుపొరుగువారితో ఎంతో సౌమ్యంగా ఉండేవాడని, సమాజంలో ఆ కుటుంబానికి ఎంతో మంచి పేరు ఉందని కూడా చెప్పారట. వారిలో వైభవ్‌ రౌత్‌ గో వంశ రక్ష సమితి నేతగా చెప్పుకున్నాడు. అతని అనుచరులుగా సుధాన్వ గోంధాల్కర్‌, శరద్‌ కలాస్కర్‌ ఉన్నారు. పోలీసులు వెల్లడించినదాని ప్రకారం వీరు మరికొందరు కలసి ఒక ఉగ్రవాద ముఠాగా ఏర్పడ్డారు. వారిలో రౌత్‌, కలాస్కర్‌ వద్ద 20 నాటుబాంబులు, వాటి తయారీకి అవసరమైన ముడి పదార్ధాలు, రెండు జిలిటెన్‌ స్టిక్స్‌, నాలుగు ఎలక్ట్రానిక్‌ డిటోనేటర్లు, 22 ఇతర డిటోనేటర్లు, రెండు సీసాల విషం, బాటరీలు, తదితరాలు దొరికాయి.సుధాన్వ గోంధాల్కర్‌ వద్ద పదకొండు నాటు తుపాకులు, తూటాలు, ఇతర విడిభాగాలు లభించాయి. ఇవన్నీ గోవులను సంరక్షించటానికే అని జనం నమ్మాలి. రౌత్‌ మతవిద్వేషాన్ని రెచ్చగొట్టటంలో దిట్ట. అతని నివాస ప్రాంతం పక్కనే ముస్లింలు ఎక్కువగా ఉండటంతో వారి పండుగులపుడు రౌత్‌ ఆ ప్రాంతం నుంచి వెళ్లిపోవాలని పోలీసులు ఆదేశిస్తారు.సనాతనతో సహా అనేక హిందూత్వ సంస్థలతో కలసి సభల్లో అతను పాల్గొంటాడు. కలాస్కర్‌ అరెస్టు వార్త వినగానే సోదరుడు, ఇతర బంధువులు నమ్మలేదు. కొల్లాపూర్‌లో ఏదో పని చేస్తున్నాడనే భావనలో వారు ఉన్నారు.వివిధ సందర్భాలలో హిందూత్వ సభలు, ప్రదర్శనల్లో కలుసుకున్న వీరు ఒక ముఠాగా ఏర్పడ్డారు.మాలెగావ్‌ పేలుడు కేసులో అరెస్టయిన హిందూ తీవ్రవాదుల గురించి తెలిసిందే.


హిందూమతానికి ప్రమాదం వచ్చిందని, హిందూత్వ పేరుతో సాగిస్తున్న విద్వేష ప్రచారంతో అనేక మంది అమాయకులు నమ్మి అలాంటి వారి వలలో చిక్కుకుంటున్నారు. తొలుత బోధలతో బుర్రలను చెడగొట్టి తరువాత నేరాలు చేయించి తమ వలలో బంధిస్తారు.మాఫియా, గూండా ముఠాలు, ఇస్లామిక్‌, ఇతర అన్ని రకాల తీవ్రవాద సంస్థలు చేస్తున్నది కూడా ఇదే. ఇలాంటి శక్తులకు ఒక ప్రాంతం, దేశం, ఖండం అనే తేడాలు ఉండవు. ఎక్కడబడితే అక్కడ విష బీజాలు నాటుతారు. ఇస్లాంకు ముప్పు వచ్చిందని, భారత్‌తో సహా ప్రపంచమంతా ఇస్లామిక్‌ రాజ్యాలను స్థాపించాలని ఆ మత ఉగ్రవాద, ఛాందస సంస్థలు ఎలా రెచ్చగొడతాయో మిగిలిన మతోన్మాదశక్తులూ అంతే. దానికి ఒక ఉదాహరణ కర్ణాటక రాష్ట్రానికి చెందిన ప్రముఖ జర్నలిస్టు గౌరీ లంకేష్‌ హత్య. ఆమెను కాషాయ ఉగ్రవాదులు చంపారన్న కేసు ఇంకా పరిష్కారం కావాల్సి ఉంది. పదివేల పేజీల చార్జిషీట్‌ను పోలీసులు దాఖలు చేశారు.మతం పేరుతో ఉగ్రవాద సంస్థలు ముస్లిం యువతను ఆకర్షించి ఉగ్రవాదులుగా మారుస్తున్న సంగతి తెలిసిందే. అదే విధంగా హిందూ యువతీ,యువకులను ఆకర్షించి ఉగ్రవాదులుగా మారుస్తున్నారు. అలా మారినవారే గౌరీ లంకేష్‌ను హతమార్చారు.వారిలో ఒకడు అమోల్‌ కాలే అనే మెకానికల్‌ ఇంజనీరు. బహుళజాతి గుత్త సంస్థలో ఉద్యోగం మానుకొని హిందూత్వకు అంకితం కావాలని నిర్ణయించుకున్నాడు.హిందూ మతానికి ముప్పు తలెత్తిందనే విష ప్రభావానికి లోనై ఒక ఉన్మాదిగా మారినట్లు అతని తీరుతెన్నులు స్పష్టం చేశాయి. ఎవరైనా హిందూమతాన్ని కించపరిచినట్లు అని పిస్తే వారి మీద హింసాత్మక దాడులకు పాల్పడాలని తనకు అనిపిస్తుందని విచారణలో పోలీసులకు చెప్పాడు. గౌరితో పాటు హేతువాదులు నరేంద్ర దబోల్కర్‌, గోవింద పన్సారేల హత్యల్లోనూ ఇతని హస్తం ఉంది. మరోహేతువాది కెఎస్‌ భగవాన్ను కూడా చంపేందుకు కుట్ర చేశాడు.


కెనడా హిందూ మహాసభ అనే సంస్థ డైరెక్టర్‌గా ఉన్న రాన్‌ బెనర్జీ బీట్‌ ఆఫ్‌ ద నార్త్‌ అనే ఒక ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడాడు. దీని గురించి 2022 జూన్‌ 25న వార్తలు వచ్చాయి.ముస్లింలు, సిక్కులను ఊచకోత కోయాలని చెప్పాడు. ” హిందూయిజం ఒక మార్గం. నేను తీవ్ర హిందూ జాతీయవాదిని.భారత్‌లో మాదిరి కెనడాలో కూడా నరేంద్రమోడీ పాలన రావాలని కోరుకుంటున్నాను. అతను ముస్లింలు, సిక్కు తీవ్రవాదులను హతమారుస్తాడు.దాన్ని నేను సమర్ధిస్తాను, ఎందుకంటే వారు చావాల్సిందే, మోడీ చేస్తున్నది అద్భుతంగా ఉంది.” అని చెప్పాడు. ఇలా మాట్లాడినందుకు ఒకసారి అరెస్టైనా తీరు మార్చుకోలేదు. అమెరికా, కెనడాల్లో ఉన్న ఇలాంటి వారు హిందూత్వ సంస్థలకు అందచేస్తున్న నిధుల వంటి అనేక అంశాలను చూస్తే ఇస్లామిక్‌ జీహాదీల మాదిరే హిందూ జీహాదీలను కూడా తయారు చేస్తున్నారు. ఏ మత జీహాదీలైనా అమెరికా ఉగ్రవాద పరిశ్రమకు లాభాలు తెచ్చిపెట్టే వారిగా మారుతున్నారు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

కాషాయ ముప్పు తొలగలేదన్న కర్ణాటక ఫలితాలు : హిట్లర్‌, ముస్సోలినీ అంతరించినా నాజీ, ఫాసిజం బతికే ఉంది, మతోన్మాదమూ అంతే !

14 Sunday May 2023

Posted by raomk in BJP, Communalism, Congress, Current Affairs, History, NATIONAL NEWS, Opinion, Political Parties, RELIGION, Religious Intolarence

≈ Leave a comment

Tags

Amith shah, BJP, Congress party, Karnataka assembly elections 2023, Narendra Modi Failures, RSS, Saffron gang


ఎం కోటేశ్వరరావు


మూడు ముక్కలాటలకు తెరదించి ఒక సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కర్ణాటక ఓటర్లు ఒక స్పష్టమైన తీర్పునిచ్చారు. మతతత్వ బిజెపి, అధికారమే పరమావధిగా ఉన్న అవకాశవాద జెడిఎస్‌కు గుణపాఠం చెప్పారు. మూడున్నర దశాబ్దాల తరువాత కాంగ్రెస్‌ ఓట్లు, సీట్లను కూడా భారీగా తెచ్చుకుంది. ప్రజాస్వామ్య వ్యవస్థలకు ముప్పుగా పరిణమిస్తున్న సంఘపరివార్‌ శక్తులను ఎదిరించేందుకు ముందుకు వస్తున్న ఒక ప్రధాన శక్తిగా కాంగ్రెస్‌ విజయాన్ని లౌకిక శక్తులన్నీ హర్షించాయి.అధికారికంగా ఫలితాలను నిర్ధారించక ముందే జరిగేదేమిటో స్పష్టమైనందున మీడియా పెద్దలు సిఎం గద్దెపై కూర్చొనేదెవరు అన్న చర్చకు తెరలేపారు. కాంగ్రెస్‌ గతాన్ని బట్టి అలాంటి విశ్లేషణలు చేసేవారిని తప్పుపట్టనవసరం లేదు. గెలిచిన కాంగ్రెస్‌ సంబరాల్లో ఉంది, నరేంద్రమోడీ ఓడినట్లుగా తాము భావించటం లేదని ఆపద్దర్మ సిఎం బసవరాజు బొమ్మై తనను తాను ఓదార్చుకున్నారు. ఒక ఎదురుదెబ్బ ఈ ఓటమి తమనేమీ కదిలించలేదని కమలనాధులు చెప్పుకుంటున్నారు. కాంగ్రెస్‌ గెలుపు కారణాలతో పాటు బిజెపి ఓటమి గురించి విశ్లేషణలు వెలువడుతున్నాయి.జెడిఎస్‌ భవితవ్యం ఎలా ఉంటుంది అన్నది కూడా చర్చనీయమే.విధాన సభలోని మొత్తం 224 స్థానాలకు గాను కాంగ్రెస్‌కు 135(80), బిజెపి 66(104), జెడిఎస్‌(32) 19, ఇతరులు నాలుగు స్థానాలు తెచ్చుకున్నారు.బ్రాకెట్లలోని అంకెలు గత ఎన్నికల్లో వచ్చిన సీట్లు. ఓట్లను చూస్తే మూడు పార్టీలకు వరుసగా 42.9,36,13.3 శాతం వచ్చాయి. గతంతో పోలిస్తే కాంగ్రెస్‌కు 4.9శాతం పెరగ్గా బిజెపికి 0.3, జెడిఎస్‌కు ఐదుశాతం చొప్పున తగ్గాయి. ఇతరుల ఓట్లు 0.4శాతం పెరిగాయి.


కర్ణాటక ఎన్నికల ఫలితాలు తెలంగాణా మీద ఎలాంటి ప్రభావం చూపవని బిఆర్‌ఎస్‌ నేత కెటిఆర్‌ స్పందించారు. అదే ఊపులో ఇక్కడా విజయం సాధిస్తామని కాంగ్రెస్‌ నేతలు చెప్పారు.గెలుపు పట్ల తమ పార్టీ ధీమాగా ఉందని బిజెపినేత బండి సంజయ చెప్పారు. కాంగ్రెస్‌ సంతుష్టీకరణ రాజకీయాల కారణంగా ముస్లింలు మొత్తంగా ఆ పార్టీకి ఓటు వేశారని, అలా వేయకపోతే బిజెపి తిరిగి అధికారంలోకి వస్తుందని జెడిఎస్‌ కర్ణాటక నేత ఇబ్రహీం బహిరంగంగానే చెప్పారని కూడా బండి చెప్పారు. తమకు సీట్లు తగ్గినా ఓట్లు తగ్గలేదన్నారు. ఫలితాలపై చర్చల్లో బిజెపి ప్రతినిధులందరూ దాదాపు ఇదే విధంగా మాట్లాడారు. టీవీలను వీక్షించేవారిని, పత్రికలు, సామాజిక మాధ్యమాల్లో చదివేవారిని తప్పుదారి పట్టించేందుకు చూశారు. తరువాత కూడా మొదలు పెట్టారు. కర్ణాటకలోనే కాదు, దేశమంతటా ముస్లింలు, క్రైస్తవుల మీద విద్వేషాలను రెచ్చగొట్టి మెజారిటీ ఓటు బాంకును ఏర్పాటు చేసుకొనేందుకు బిజెపి 80-20 నినాదాన్ని ముందుకు తెచ్చిన సంగతి తెలిసిందే.


హిందూత్వ సంస్థలు, నోటి తుత్తర నేతలు విద్వేష ప్రసంగాలను చేస్తున్న నేపధ్యంలో ఎవరూ ఫిర్యాదు చేయకున్నా పోలీసులు కేసులు నమోదు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. బిజెపి సబ్‌కా సాత్‌ -సబ్‌కా వికాస్‌ అని తీపి కబుర్లు చెబుతుంది. అందరం కలసి ఉంటే అందరి పురోభివృద్ధి అన్నది అర్ధం. ప్రపంచంలో మొత్తం ముస్లింలు వంద మంది ఉన్నారనుకుంటే ఒక్క మనదేశంలోనే 10.9 మంది ఉన్నారు. ఈ మాత్రాన్నే భరించలేని వారు ముస్లిం జనాభా శాతం ఇంకా పెరిగే అఖండ భారత్‌ను ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు.మన దేశ జనాభాలో తాజా అంచనా ప్రకారం 15.5శాతం ఉన్నారు. అంత పెద్ద సంఖ్యలో ఉన్న సామాజిక తరగతిని అభివృద్ధిలో, ప్రజా ప్రాతినిధ్యంలో విస్మరిస్తే అది ప్రజాస్వామ్యం కాదు. కర్ణాటకలో జాతీయ సగటు కంటే తక్కువే ఉన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం అక్కడ 12.92 శాతం ఉన్నారు.కొన్ని జిల్లాల్లో అంతకంటే ఎక్కువ ఉన్నారు. తాజా ఎన్నికల గురించి హిందూ పత్రిక చేసిన విశ్లేషణలో ముస్లిం సామాజిక తరగతి ఎక్కువగా (మొత్తం జనాభాలో కాదు) ఉన్న ఐదు జిల్లాల్లో బిజెపి ఓట్ల శాతం 2023 ఎన్నికల్లో గతంతో పోలిస్తే 0.3శాతం పెరుగుదలతో 44.5 శాతం కాగా కాంగ్రెస్‌కు 2.1శాతం పెరిగి 42.5శాతంగా ఉంది. జెడిఎస్‌ 3.9శాతం కోల్పోయి 5.5శాతానికి పరిమితమైంది. విద్వేషాన్ని ఎంతగానో ఎక్కించబట్టే బిజెపి తన ఓట్లశాతాన్ని స్వల్పంగానైనా గతం కంటే పెంచుకుంది. దాని ప్రమాదాన్ని నిరోధించాలని భావించబట్టే దాన్ని ఎదుర్కొనే పార్టీ కాంగ్రెసే గనుక అనేక మంది దానివైపు మొగ్గటంతో బిజెపి రాష్రమంతటా చావు దెబ్బతిన్నది.


ఒకవైపు ముస్లిం మత సంస్థలతో ఆర్‌ఎస్‌ఎస్‌ పెద్దలు తెరవెనుక సంప్రదింపులు జరుపుతారు.కేరళలో వామపక్షాలకు వ్యతిరేకంగా క్రైస్తవులను నిలిపేందుకు నరేంద్రమోడీ ఏకంగా చర్చ్‌కు వెళ్లారు, బిజెపి నేతలు బిషప్పులు, ఇతర మతాధికార్ల ఇళ్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. ఈస్టర్‌ సందర్భంగా క్రైస్తవులు, రంజాన్‌కు ముస్లింల ఇండ్లకు వెళ్లి కానుకలు ఇవ్వాలని, మళయాళ సంవత్సరాది సందర్భంగా వారిని ఇండ్లకు ఆహ్వానించాలని కేరళ బిజెపి ఏకంగా ఒక కార్యక్రమాన్నే ప్రకటించింది. తెలంగాణాలో హిందూ ఏక్తా యాత్రలు జరుపుతున్నారు. అందరినీ కలుపుకోవాలని చెప్పే బిజెపి తాజా కర్ణాటక ఎన్నికల్లో గతంలో జరిగిన లోక్‌సభ లేదా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో ఒక్కరంటే ఒక్క ముస్లింను కూడా పోటీకి ఎందుకు నిలపలేదు. ఇంతేనా మాజీ ఉప ముఖ్యమంత్రి, కెఎస్‌ ఈశ్వరప్ప గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉంటూ 40శాతం కమిషన్‌ ఇవ్వాలని వేధించినట్లు లేఖలు రాసిన బిజెపికి చెందిన కాంట్రాక్టర్‌, హిందూవాహిని సంస్థ నేత సంతోష్‌ పాటిల్‌ 2022 ఏప్రిల్‌ 12న ఒక హౌటల్లో ఉరివేసుకొని మరణించాడు. దాంతో ఈశ్వరప్ప ఉద్యోగం ఊడింది. అతగాడు మేనెల పదవ తేదీన జరిగిన ఎన్నికల్లో ముస్లింలు తమ పార్టీకి ఒక్క ఓటు కూడా వేయనవసరం లేదని బహిరంగంగా ప్రకటించాడు. అతన్ని ఏ ఒక్క బిజెపి నేత కూడా తప్పని ఖండించలేదు. మీ ఓట్లు వద్దన్న పార్టీకి వేసేందుకు ఏ సామాజిక తరగతికైనా ఆత్మగౌరవం అనుమతిస్తుందా ? తమ పార్టీ విద్వేషాన్ని పక్కన పెట్టి కాంగ్రెస్‌ సంతుష్టీకరించిన కారణంగానే ముస్లింలు కాంగ్రెస్‌కు ఓటు వేసినట్లు, అందువల్లనే తాము ఓడినట్లు మాట్లాడే బిజెపి నేతలవి నోళ్లా మరొకటా అని జనం అనుకుంటున్నారు. వారు చెప్పేదాని ప్రకారం ముస్లింలు వేస్తే వారికి లేదా ఇతర పార్టీలకు వేటికీ వేయకుండా దూరంగా ఉండాలి.


కర్ణాటక ఎన్నికల్లో ఓడిన తరువాత కూడా వాట్సాప్‌ యూనివర్సిటీ మత విద్వేషాన్ని రెచ్చగొట్టటం మానుకోలేదు.తొంభైశాతం మైనారిటీలు ఓటింగ్‌కు వచ్చారని, హిందువుల 60శాతం దాటలేదని ఇలా ఉంటే భవిష్యత్‌ ఉండదంటూ ఒక ప్రచారం మొదలైంది. ఒక వెయ్యి ఓట్లు కాంగ్రెస్‌కు బదులు బిజెపికి పడితే ఆ పార్టీకి 51 సీట్లు వచ్చేవంటూ దానిలో లెక్క చెప్పారు. రెండున్నరశాతం, అంతకంటే తక్కువ ఓట్ల మెజారిటీతో మూడు పార్టీలు గెలిచిన స్థానాలు 33, గత ఎన్నికల్లో 23 ఉన్నాయి. వాటిలో గత ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్‌కు ఒకటి పెరిగి 17, బిజెపికి ఎనిమిది పెరిగి 13, జెడిఎస్‌కు ఒకటి పెరిగి మూడు వచ్చాయి. అలాంటపుడు వెయ్యి ఓట్లు పడితే బిజెపికి 51 ఎలా వస్తాయి. చిన్న పిల్లలు, అమాయంగా ఉండే వారిని మోసపుచ్చటం తప్ప మరొకటి కాదు. కాబినెట్‌లోని 22 మందికి గాను 14 మంది మంత్రులు ఓడారు. ఇంకా ఓడిన ప్రముఖుల్లో ఎడియూరప్పను తీవ్రంగా వ్యతిరేకించిన ప్రముఖ నేత, బిజెపి జాతీయ కార్యదర్శి సిటి రవి ఒకరు. బాబాబుడాంగిరి దర్గా చుట్టూ విద్వేషాన్ని రెచ్చగొట్టిన వారిలో రవి పేరుమోసినట్లు విమర్శలున్నాయి. మాజీ సిఎం సిద్ద రామయ్య ఎన్నికలు వచ్చినపుడు హిందువు, తరువాత హిందువులను ద్వేషిస్తారు. సిద్దరాముల్లా ఖాన్‌ గనుక అధికారానికి వస్తే హిందువుల పని ఖతం అని రెచ్చగొట్టిన ప్రకటనల స్పెషలిస్టు. హాస్యనటుడు బ్రహ్మానందం వెళ్లి మంత్రి సుధాకర్‌కు మద్దతుగా ప్రచారం చేసి అపహాస్యం పాలైనారు. కిచ్చా సుదీప్‌ అనే కన్నడ సూపర్‌ స్టార్‌ బిజెపికి ప్రచారం చేసినా పరువుదక్కలేదు. అలాంటిది బ్రహ్మానందం ఒక లెక్కా. సుధాకర్‌ 2019లో కాంగ్రెస్‌ నుంచి బిజెపికి జంప్‌ చేశారు. కరోనాలో తన జిల్లావారిని తప్ప ఇతరులను పట్టించుకోలేదనే విమర్శలున్నాయి.ఓడినవారిలో హిజాబ్‌ మంత్రి నాగేష్‌ వంటి వారున్నారు.


ఇంకా అనేక అంశాల మీద సమాచారం వెల్లడి కావాల్సి ఉంది. ఈ ఎన్నికలను ప్రధాని నరేంద్రమోడీ ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎక్కడా లేని విధంగా రోడ్‌ షోలు, బహిరంగ సభలు నిర్వహించారు. ఇరవై స్థానాల్లో ప్రచారం చేస్తే 15 చోట్ల బిజెపి ఓడినట్లు వార్తలు. జై భజరంగ బలీ అని నినాదమిస్తూ ఓటు వేయాలని పిలుపునిచ్చి ప్రధాని పదవికి ఉన్న గౌరవాన్ని కూడా దిగజార్చినట్లు విమర్శలు వెల్లువెత్తాయి.తనను చూసి ఓటు వేయాలని కూడా కోరినందున బిజెపి కంటే నరేంద్రమోడీ ఓటమిగానే జనం చూస్తున్నారు. 1989లో కాంగ్రెస్‌ నేత వీరేంద్ర పాటిల్‌ ఏలుబడిలో ఆ పార్టీకి 43.76శాతం ఓట్లు, 178 సీట్లు వచ్చాయి. గత ఎన్నికల్లో బిజెపికి ఓట్లు తక్కువ వచ్చినప్పటికీ సీట్లు ఎక్కువ రావటానికి కాంగ్రెస్‌-జెడిఎస్‌ మధ్య ఓట్ల చీలికే ప్రధాన కారణం. ఈ సారి గణనీయంగా జెడిఎస్‌ ఓట్లు కాంగ్రెస్‌కు మళ్లటంతో బిజెపి బొక్కబోర్లా పడింది. దీన్ని దాచిపెట్టి తమ ఓటమి కంటే జెడిఎస్‌కు ఓట్లు తక్కువ రావటం గురించే బిజెపి నేతలు ఎక్కువగా చెబుతున్నారు. తమ ప్రభుత్వం మీద జనంలో వ్యతిరేకత ఉంటే తమకు గతం కంటే ఓట్లు కూడా తగ్గాలి కదా అని బిజెపి వాదిస్తోంది.


దక్షిణాదిన సంఘపరివార్‌ తమ హిందూత్వ ప్రయోగశాలగా కర్ణాటకను ఎంచుకోవటానికి అక్కడ అనువైన పరిస్థితులు ఉన్నాయి. ముస్లింలు, క్రైస్తవుల మీద విద్వేషాన్ని రెచ్చగొట్టటం, దాడులు, హిజాబ్‌, హలాల్‌ వివాదం వంటి వన్నీ ప్రయోగాల్లో భాగమే.కులం, మతం, ప్రాంతీయ విద్వేషాల పులుల మీద ఒకసారి జనాన్ని ఎక్కించిన తరువాత వారు వాటి నుంచి అంత తేలికంగా దిగలేరు. విష ప్రభావానికి గురైన కొన్ని తరాలు చివరి వరకు అలాగే కొనసాగుతాయి.ఐరోపాలో ఫాసిజం, నాజీజాలను, యూదుల మీద విద్వేషాన్ని రెచ్చగొట్టిన శక్తులు సృష్టించిన మారణహౌమం, రెండు ప్రపంచ యుద్ధాలను తెచ్చిన సంగతి తెలిసిందే. అవి అంతరించినా అవి ముందుకు తెచ్చిన దుర్మార్గ భావజాలాన్ని నయా నాజీలు, ఫాసిస్టులు అందిపుచ్చుకుంటున్న వర్తమానం మన కళ్ల ముందు ఉంది. అలాంటి శక్తుల స్ఫూర్తితో మన దేశంలో ఉనికిలోకి వచ్చిన కాషాయదళాలు కూడా అలాంటి విష బీజాలనే నాటాయి. గతంలో యూదులను బూచిగా చూపి విద్వేషాన్ని రెచ్చగొడితే ఇప్పుడు ఇస్లాం మతం వారిని ప్రపంచ శత్రువులుగా చూపి అదే చేస్తున్నారు.కసాయిని నమ్మి గొర్రె వెంట వెళ్లిన లోకోక్తి గురించి మన పెద్దలు చెప్పిన సంగతి తెలిసిందే. నాజీల నిజస్వరూపం తెలుసుకొనేందుకు జర్మన్లు, ఐరోపా వారికి చాలా కాలం పట్టింది. మన దేశంలో కూడా అలాంటి శక్తులను గుర్తించే క్రమం ప్రారంభమైంది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

మౌనమే నా భాష ఓ దేశ జనమా : నోరు విప్పేందుకు కాశ్మీరులో సైనికులు, మణిపూర్‌లో జనం ప్రాణాలు ఇంకా ఎన్ని పోవాలి విశ్వగురువా !

07 Sunday May 2023

Posted by raomk in BJP, Congress, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Political Parties, USA

≈ Leave a comment

Tags

BJP, Manipur deaths, Narendra Modi Failures, Terrorism In J&K, terrorists


ఎం కోటేశ్వరరావు


దేశం సురక్షితమైన చేతుల్లో ఉందన్నారు. పెద్ద నోట్ల రద్దు, ఆర్టికల్‌ 370 ఎత్తివేత, జమ్మూ – కాశ్మీర్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చటంతో ఉగ్రవాదుల వెన్ను విరిచినట్లు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. పెద్దన్న అమెరికాతో ఒప్పందం చేసుకొని కీలక సమాచారాన్ని మార్పిడి చేసుకొనేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్లు ఆర్భాటం చేశారు. నిజమే కామోసనుకొని జనం సంతోషించారు. కేంద్ర ప్రత్యక్ష పాలనలో ఉన్న కాశ్మీరులో గత పక్షం రోజుల్లోనే పది మంది సైనికుల ప్రాణాలు తీశారు ఉగ్రవాదులు. అరుణాచల్‌ ప్రదేశ్‌లో చైనా మిలిటరీ గ్రామాలను నిర్మిస్తోందంటూ అమెరికా ఇచ్చిన సమాచారంతో మీడియా పెద్ద ఎత్తున వార్తలు ఇచ్చింది. ఇప్పుడు పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదుల గురించి ఎలాంటి సమాచారమూ ఇచ్చినట్లు వార్తలు లేవు. మరో రాష్ట్రం మణిపూర్‌. ఇక్కడ బిజెపి పాలన ఉంది. ఇది రాసిన సమయానికి అక్కడ ఇటీవల జరిగిన హింసాకాండలో 55మంది మరణించినట్లు వార్తలు. వారెలా మరణించిందీ తెలియదు. రాష్ట్రమంతటా ఇంటర్నెట్‌ బంద్‌, కనిపిస్తే కాల్చివేత ఉత్తరువులు ఇచ్చి ఆర్టికల్‌ 355ను ప్రకటించి కేంద్ర బలగాలకు అప్పగించారు. శాంతి భద్రతలను కాపాడటంలో విఫలమైనా రాష్ట్రపతి పాలన పెట్టలేదు, స్వంత పార్టీ కదా !


చిత్రం ఏమిటంటే కర్ణాటక ఎన్నికల్లో ప్రచారంలో ఉన్న ప్రధాని నరేంద్రమోడీ ఇంత జరుగుతున్నా ఒక్క మాట మాట్లాడిన పాపాన పోలేదు. విలేకర్లతో మాట్లాడేందుకు ఎలాగూ ముందుకు రారు, కనీసం ఒక ప్రకటన లేదా బహిరంగ సభల్లో మాట్లాడితే నోటి ముత్యాలు రాలుతాయన్నట్లు ఉన్నారు. కల్పిత కట్టుకథలతో కేరళ సమాజాన్ని అవమానపరిచేందుకు తీసిన కేరళ స్టోరీ సినిమా గురించి మాట్లాడతారు, ప్రతిపక్షాలు ఉగ్రవాదులతో చేతులు కలిపినట్లు, మద్దతు ఇచ్చినట్లు రాళ్లు వేసేందుకు తీరిక దొరుకుతుంది గానీ కాశ్మీర్‌, మణిపూర్‌ గురించి ప్రస్తావించలేదు. ఢిల్లీలో రెజ్లర్ల మీద పోలీసు జులం గురించి మాట్లాడరు. స్వంత పార్టీ ఎంపీ మీద పోక్సో కేసు పెట్టినా అరెస్టు లేదు. కర్ణాటకలో ఎన్నికల ప్రచారానికి సంబంధించి ప్రధాని 30 ట్వీట్లు పెట్టారు వాటిలో సగం కాంగ్రెస్‌, జెడిఎస్‌ మీద దాడికి దిగారు. మణిపూర్‌, కాశ్మీరు, రెజ్లర్ల ఉదంతాలపై ట్వీట్ల ద్వారా కూడా స్పందించలేదు. జై భజరంగ బలీ అంటూ మతం పేరుతో ఓట్లడిగేందుకు నోరు వచ్చిందన్న విమర్శలు వచ్చినా సరే పదే పదే ప్రస్తావించారు. అడిగేవారెవరు, నిబంధనలను అమలు జరిపేదెవరు? ప్రపంచ నేతగా,విశ్వగురువుగా భక్తుల నుంచి నీరాజనాలు అందుకుంటున్న నరేంద్రమోడీ కాశ్మీరు, మణిపూర్‌లో జరుగుతున్న ఉదంతాలు అల్పమైనవని, వాటి మీద స్పందించటం తన స్థాయికి తగదని మౌన ముద్రదాలుస్తున్నారా ?


మణిపూర్‌ అగ్నిగుండంగా మారేందుకు హైకోర్టు ఇచ్చిన సలహా కారణమైంది.న్యాయమూర్తుల సలహాలు చిచ్చు రేపేవిగా ఉండకూడదు, వాటి పర్యవసానాలను కూడా గమనంలో ఉంచుకోవాలి.రాష్ట్ర జనాభాలో 53శాతంగా ఉన్న మెయితీ సామాజిక తరగతికి చెందిన వారు తమను షెడ్యూలు కులాల జాబితాలో చేర్చాలని చాలా కాలం నుంచి డిమాండ్‌ చేస్తున్నారు. అది వీలవుతుందో కాదో చట్టబద్దమో కాదో స్పష్టంగా చెప్పాల్సిన కోర్టు వారి కోర్కెను పరిశీలించాలని ఏప్రిల్‌ 20వ తేదీన రాష్ట్ర ప్రభుత్వానికి సలహా ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. దాన్ని గనుక అమలు జరిపితే గిరిజనులుగా ఉన్న కుకీలు, నాగాలు తమ భూములు కోల్పోతామని భయపడ్డారు. అక్కడి బిజెపి ప్రభుత్వం వారి అనుమానాలను తీర్చేందుకు పూనుకోలేదు.ఏప్రిల్‌ 28వ తేదీన సిఎం బిరేన్‌ సింగ్‌ చురుచందపూర్‌ అనే చోట ఒక జిమ్‌ను ప్రారంభించేందుకు రానుండగా ముందు రోజు నిరసనకారులు దాన్ని తగులబెట్టారు.గిరిజన-గిరిజనేతర ప్రాంతాలన్నింటా కనిపిస్తే కాల్చివేత ప్రకటించి ప్రభుత్వం మరింత రెచ్చగొట్టింది.గిరిజన విద్యార్ధి సంఘం మే మూడవ తేదీన చురుచందపూర్‌లో గిరిజన సంఘీభావ ప్రదర్శనకు పిలుపునిచ్చింది.ఆ సందర్భంగా హింసాకాండ చెలరేగింది. గిరిజనేతర ప్రాంతాల్లోని గిరిజనుల మీద, చర్చ్‌ల మీద దాడులు జరిపారు. అప్పటి నుంచి రాష్ట్రం అగ్నిగుండంగా మారింది.


మణిపూర్‌ భూ సంస్కరణల చట్టం ప్రకారం గిరిజనులు నివసించే కొండ ప్రాంతాల్లో గిరిజనేతరులు స్థిర నివాసం ఏర్పాటు చేసుకొనేందుకు, భూములు కొనేందుకు వీల్లేదు.గిరిజనేతరులు ఇంఫాల్‌ లోయ ప్రాంతానికే పరిమితం కావాలి. అక్కడ రాష్ట్రంలోని భూమిలో పదిశాతమే ఉంది. గిరిజనులు ఎక్కడైనా స్థిరనివాసం ఏర్పాటు చేసుకోవచ్చు. గిరిజనేతరుల్లో ఎక్కువ మంది హిందువులు, గిరిజనులంతా క్రైస్తవులు. అసెంబ్లీలోని 60 స్థానాలకు గాను 40 చోట్ల మెయితీలే గెలుపు ఓటములను ప్రభావితం చేస్తారు. వారి మద్దతు కోసమే రాష్ట్రాన్ని బిజెపి అగ్నిగుండంగా మార్చిందా ? విస్తారమైన భూమిని ఏదో ఒక పద్దతిలో స్వంతం చేసుకోవాలని ఈ సామాజిక తరగతి చూస్తున్నదనే ఆరోపణ ఉంది. అందుకు గాను అక్రమంగా పక్కనే ఉన్న మయన్మార్‌ నుంచి అక్రమంగా గిరిజనుల వలసలను ప్రోత్సహిస్తున్నట్లు ఆ తరగతి ఆరోపిస్తోంది. అక్రమవలసలన్నది ఒక సాకు మాత్రమే అని గిరిజనులు అంటున్నారు. వాస్తవాలను వివరించి రెండు సామాజిక తరగతుల్లో ఉన్న అనుమానాలు, అపోహలను తొలగించటంలో గతంలో ఉన్న ప్రభుత్వాలతో పాటు వర్తమాన బిజెపి కూడా విఫలమైంది, మతం పేరుతో ఓటు బాంకు ఏర్పాటుకు పూనుకుంది. తాజా పరిణామాలో మణిపూర్‌లో తిరిగి ఉగ్రవాదం తలెత్తితే బిజెపిదే బాధ్యత అవుతుంది.


కాశ్మీరులో నిజంగా ఉగ్రవాదులను, ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించారా ? అంకెలు చెబుతున్న వాస్తవాలేమిటి? బిజెపి చేసుకుంటున్న ప్రచారంలో నిజమెంత ? ఇక్కడ ఉగ్రవాదాన్ని ఐదు దశలుగా విభజించాలి. ఎప్పుడు ఎవరి పాలనలో ఏం జరిగిందో దక్షిణాసియా టెర్రరిజం పోర్టల్‌ వివరాలు అందరికీ అందుబాటులో ఉన్నాయి.1988 నుంచి 1997వరకు కాంగ్రెస్‌ పాలన.1998 నుంచి 2003 వరకు ఎన్‌డిఏ వాజ్‌పాయి ఏలుబడి, 2004 నుంచి 2013వరకు తిరిగి కాంగ్రెస్‌ పాలన. 2014 నుంచి ఇప్పటి వరకు నరేంద్రమోడీ అధికారం.2019 ఆగస్టు నుంచి కాశ్మీరు కేంద్రపాలిత ప్రాంతంగా మారింది. ఈ కాలంలో మరణించిన పౌరులు, భద్రతా సిబ్బంది, ఉగ్రవాదులు, చొరబాటుదార్ల సంఖ్యలు. బ్రాకెట్లలో ఉన్నవి వార్షిక సగటుగా గమనించాలి.
ఎవరు×××1988-97××××1998-03×××××2004-13××××× 2014-2023×× కేంద్ర పాలన
పౌరులు××7692(769.2)××5583(797.5)××1503(150.3) ××× 350(38.8)×××× 99(33)
భద్రతా ××1988(198.2)××3367(481)××1158(115.8) ××× 569(56.9)××××× 131(43.6)
ఉగ్రవాదు×11352(1621.7)××5583(797.5)××4221(424.1)××× 1485(148.5)×× 618(206)
పైన పేర్కొన్న అంకెలను చూసినపుడు కాశ్మీరులో ఆర్టికల్‌ 370 రద్దు,కొత్తగా భద్రతా దళాలకు అధికారం ఇచ్చినట్లు ప్రచారం చేసుకున్న కాలంలో జరిగిన పరిణామాలను చూసినపుడు అంతకు ముందు జరిగిన వాటితో కుడి ఎడమలుగా ఉన్నాయి తప్ప ఉగ్రవాదం పూర్తిగా నిర్మూలన కాలేదు. వాజ్‌పాయి పాలనతో పోల్చినపుడు అదే కాశ్మీరులో ఆర్టికల్‌ 370 ఉండగా కూడా కాంగ్రెస్‌ ఏలుబడిలో ఉగ్రవాదం తగ్గినట్లు అంకెలు చెబుతున్నాయి. పలు కారణాలతో ఉదంతాలు తగ్గినపుడు తమ ఘనతగాను లేనపుడు పాక్‌ కుట్రగానూ వర్ణిస్తే కుదురుతుందా ? తగ్గినపుడు పాక్‌ దూరంగా ఉందని చెబుతారా ?


పాకిస్తాన్‌ విదేశాంగ మంత్రి బిలావల్‌ భుట్టో గోవాలో జరిగిన షాంఘై సహకార సంస్థ(ఎస్‌సిఓ) సమావేశానికి హాజరైనపుడే ఉగ్రవాదులు మన పారా ఎస్‌ఎఫ్‌(స్పెషల్‌ ఫోర్సెస్‌) దళానికి చెందిన ఐదుగురు కమాండోలను చంపారు. అదే జమ్మూ ప్రాంతంలో ఏప్రిల్‌ 20న ఐదుగురు సైనికులను చంపారు. తాజా ఉదంతాలను చూసినపుడు ఉగ్రవాదులు కాశ్మీరు నుంచి జమ్మూకు తమ కుట్రలను విస్తరింప చేసినట్లు కనిపిస్తోంది. చిన్న బృందాలుగా దాడులు చేసేందుకు శిక్షణ పొందినట్లు కూడా చెబుతున్నారు. అది పాకిస్తాన్‌లో తప్ప మన గడ్డమీద సాధ్యం కాదు. వీటి గురించి మనకు అమెరికా ఎందుకు సమాచారం అందించటం లేదు అన్నది ప్రశ్న. పూంచ్‌లో ఏప్రిల్‌ 20న జరిపిన దాడిలో ఉపయోగించిన ఆయుధాలు, పేలుడు పదార్ధాలు ఆఫ్ఘనిస్తాన్‌లో అమెరికా మిలిటరీ వదలి వెళ్లినవని గుర్తించారు. వాటిని అక్కడి తాలిబాన్లు మన దేశంలోని ఉగ్రవాదులకు అందిస్తే తప్ప దొరికేవి కాదు. మరోవైపున ఉగ్రవాదులు స్థానికంగా, విదేశాల నుంచి నిధులు సేకరిస్తున్న ఇటీవల జాతీయ దర్యాప్తు సంస్థ జరిపిన సోదాల్లో దొరికిన సమాచారం వెల్లడించింది. పెద్ద నోట్ల రద్దుకు ఉగ్రవాదులకు నిధులు దొరక్కుండా చేయటం ఒకటని చెప్పారు. మరి ఇప్పుడు దీనికి ఏ సాకు చెబుతారు ? పాత నోట్లు రద్దు చేసి కొత్తగా రెండువేల నోట్లు ముద్రించి మరింత పెద్ద మొత్తాలను సులభంగా అందచేసేందుకు అదే మోడీ సర్కార్‌ వీలు కల్పించింది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

ఓట్లకోసం ఇన్ని పాట్లు, కుట్రలా : హనుమంతుడిని రోడ్డు మీదకు లాగిన మోడీ, కర్ణాటకలో పాలు తాగిస్తాం అన్న బిజెపి !

06 Saturday May 2023

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, RELIGION, Religious Intolarence

≈ Leave a comment

Tags

Bhajarangdal, BJP, Congress party, Freebies, Karnataka election 2023, Narendra Modi Failures, RSS, VHP


ఎం కోటేశ్వరరావు


అగ్గి పుల్లా సబ్బు బిళ్లా, కుక్క పిల్లా కాదేదీ కవిత కనర్హం అన్నాడు మహాకవి శ్రీశ్రీ. ఓట్ల కోసం ఏ గడ్డి కరచినా తప్పులేదన్నట్లు విశ్వగురువు నరేంద్రమోడీ నేతృత్వంలోని బిజెపి తీరుతెన్నులు ఉన్నాయి.ఈనెల పదవ తేదీన జరిగే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలన్నది బిజెపి లక్ష్యంగా కనిపిస్తున్నది.చట్టాన్ని వ్యక్తులు, నిషేధిత b పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా(పిఎఫ్‌ఐ), భజరంగ్‌ దళ్‌ వంటి సంస్థలు ఉల్లంఘిస్తే వాటి మీద నిషేధంతో సహా కఠిన చర్యలు తీసుకుంటామని కర్ణాటక కాంగ్రెస్‌ ఎన్నికల మానిఫెస్టోలో పేర్కొన్నారు. పదజాలం ఏదైనా నిషేధం విధిస్తామనే భావం దానిలో ఉంది. దీన్ని అవకాశంగా తీసుకొని ప్రధాని నరేంద్రమోడీ జై భజరంగ బలీ(జై హనుమాన్‌) అని నినాదమిస్తూ ఓటు వేయాలని ఎన్నికల సభల్లో పిలుపు ఇచ్చారు. మమ్మల్ని పిఎఫ్‌ఐ వంటి సంస్థలతో పోలుస్తారా, నిషేధిస్తామని అంటారా అంటూ సంఘపరివార్‌ సంస్థలు, బిజెపి దేశమంతటా వీధులకెక్కింది. కాంగ్రెస్‌ ఆఫీసుల మీదకు వెళ్లి శాంతి భద్రతల సమస్యలను సృష్టిస్తున్నారు.ప్రజాస్వామ్య పద్దతిలో ఎవరైనా నిరసన ప్రకటనలు లేదా వేరే చోట్ల ఆందోళనలు చేయటం వేరు, ఆఫీసుల మీదకు వెళ్లటం మూకస్వామ్యం, ఫాసిస్టు లక్షణమే. దీన్ని బట్టే వారి స్వభావం, ప్రమాదం ఏమిటో స్పష్టం అవుతున్నది. హనుమంతుడిని వీధుల్లోకి తేవటంతో ఓటర్ల మీద ప్రభావం పడుతుందేమో అన్న భయంతో కాంగ్రెస్‌ నష్ట నివారణకు పూనుకొని నిషేధం తమ ఉద్దేశ్యం కాదని, అలాంటి చర్యలు తీసుకొనే అధికారం రాష్ట్రాలకు లేదని ఆ పార్టీ నేతలు వివరణలు ఇచ్చారు. అయినప్పటికీ మత ఉద్రిక్తతలు, మనోభావాలను రెచ్చగొట్టటం ద్వారా లబ్ది పొందవచ్చనే ఎత్తుగడతో ఎన్నికల తేదీ వరకు బిజెపి రచ్చ చేసేందుకు పూనుకున్నట్లు కనిపిస్తోంది. మానిఫెస్టోలో పెట్టకపోయినా వారు చేసేది చేస్తారు. ఉచిత పథకాలను అమలు జరిపితే రాష్ట్రాలు రుణ ఊబిలో కూరుకుపోతాయంటూ సుభాషితాలు పలికిన నరేంద్రమోడీ కర్ణాటక బిజెపి ఎన్నికల ప్రణాళిక భేషుగ్గా ఉందని కితాబునిచ్చినట్లు వార్తలు. ఒక సంస్థ మీద ఒక రాష్ట్రం ఎలా నిషేధం విధించలేదో అలాంటిదే ఉమ్మడి పౌరస్మృతి. దాన్ని ఒక రాష్ట్రం అమలు జరిపేది కాదు. అయినప్పటికీ అమలు జరుపుతామని కర్ణాటక బిజెపి తన మానిఫెస్టోలో పెట్టింది. ఇది క్రైస్తవ, ముస్లిం, ఇతర మైనారిటీ మతాల వారిని రెచ్చగొట్టేందుకు, హిందూత్వ శక్తులను సంతుష్టీకరించేందుకు చేసిన కసరత్తు. బిజెపి ఇన్ని పాట్లు పడినా ఎన్నికల్లో గట్టెక్కుతుందా అన్నది శేష ప్రశ్న.


నిజానికి భజరంగదళ్‌, ఇతర హిందూత్వ సంస్థల మీద నిషేధంతో సహా చర్యలు తీసుకోవాలన్న డిమాండ్‌ ఈ నాటిది కాదు. విద్వేషాన్ని రెచ్చగొట్టే శక్తుల మీద ఫిర్యాదు లేకున్నా పోలీసులు కేసులు నమోదు చేయాలని ఉన్నత న్యాయ స్థానం సుప్రీం కోర్టు ఒకటికి రెండుసార్లు ఆదేశించిన సంగతి తెలిసిందే. అలాంటి నేరాలకు పాల్పడే వారు మెజారిటీ హిందూత్వ కావచ్చు మైనారిటీ మత శక్తులు కావచ్చు. భజరంగ్‌ దళ్‌ మీద నిషేధం విధించవచ్చు అని చెప్పిన కాంగ్రెస్‌ తనకు తానే హాని చేసుకుందని కొందరు విశ్లేషణల పేరుతో బిజెపి అనుకూల ప్రచారానికి దిగారు. ఈ అంశంతోనే కాంగ్రెస్‌ విజయావకాశాలు దెబ్బతింటాయా ? కర్ణాటక ఓటర్లు కాషాయ దళాల వలలో పడతారా ? నిషేధ ప్రతిపాదన లేదా డిమాండ్‌ లేకముందే హిజాబ్‌, లవ్‌ జీహాద్‌, ఇతర మతోన్మాద అజెండాతో మతవిద్వేషాన్ని రెచ్చగొట్టేందుకు, కర్ణాటకలో మెజారిటీ ఓటు బాంకు సృష్టికి బిజెపి ఎప్పటి నుంచో అనేక వివాదాలను ముందుకు తెచ్చింది. ఇప్పటి వరకు ఎక్కించిన మతోన్మాదం, కుల ఓటు బాంకు రాజకీయాలు తక్కువేమీ కాదు.వాటితో మతోన్మాద పులిని ఎక్కి వీరంగం వేస్తున్న వారు ఇప్పటికే ఉన్నారు. ఇన్ని తెచ్చిన తరువాత కూడా ఆ పార్టీ వచ్చే ఎన్నికల్లో ఓడిపోనుందనే వాతావరణం ఏర్పడిందని గమనించాలి.


కేరళలో శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశం గురించి సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పునే ఖాతరు చేయని అపర ప్రజాస్వామికశక్తులుగా కాషాయదళాలు రుజువు చేసుకున్నాయి. ఆ కేసుకు కమ్యూనిస్టులకు ఎలాంటి సంబంధమూ లేదు. కోర్టును తీర్పును అమలు జరుపుతామని అధికారంలో ఉన్న ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం చెప్పింది. దాంతో ఇంకేముంది హిందూమతానికి ముప్పు వచ్చింది అంటూ రెచ్చగొట్టారు. మహిళలను ముందు పెట్టి ఆగమాగం చేశారు.దాడులకు పాల్పడ్డారు.2021లో జరిగే ఎన్నికల్లో ఎల్‌డిఎఫ్‌ను దెబ్బతీసేందుకు చూశారు. చివరకు బొక్కబోర్లా పడి ఉన్న ఒక్క సీటునూ పోగొట్టుకున్నారు.శబరిమలతో సహా ప్రముఖ దేవాలయాలున్న ప్రతిచోటా అంతకు ముందు ఉన్న ఓట్లనూ తెచ్చుకోలేకపోయారు. హనుమంతుడు కర్ణాటకలోని హంపిలో పుట్టినట్లు కాషాయ దళాలు ఇప్పటికే ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే.


కర్ణాటకలో భజరంగదళ్‌ అంశం ఏమేరకు పని చేస్తుందో చూడాల్సి ఉంది. అక్కడ ఆ సంస్థ చరిత్రను చూసినపుడు అనేక ఉదంతాల్లో అది భాగస్వామిగా ఉంది. 2008లో బిజెపి అధికారానికి వచ్చిన తరువాత కర్ణాటక కోస్తా ప్రాంతంలో చర్చ్‌లు, క్రైస్తవ సంస్థల మీద చేసిన దాడుల గురించి సిఎంగా ఉన్న ఎడియూరప్ప జస్టిస్‌ బికె సోమశేఖర కమిషన్‌ ఏర్పాటు చేశారు. మరుసటి ఏడాది సమర్పించిన మధ్యంతర నివేదికలో ఆ దాడుల్లో భజరంగదళ్‌ వంటి మితవాద బృందాలున్నట్లు పేర్కొన్నారు. మంగుళూరు ప్రాంతంలో చర్చ్‌ల మీద దాడులు తామే చేసినట్లు భజరంగ్‌దళనేతలు పత్రికా గోష్టి పెట్టిమరీ చెప్పారు. గతేడాది షిమోగాలో హలాల్‌ మాంసం అమ్మాడంటూ ఒక ముస్లిం వ్యాపారి మీద దాడి చేసిన కేసులు ఆ సంస్థకు చెందిన వారిని అరెస్టు చేశారు. ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే.ఒడిషా, కర్ణాటకల్లో జరిపిన హింసాకాండకు గాను విశ్వహిందూపరిషత్‌, భజరంగ్‌ దళ్‌ మీద నిషేధం విధించాలని 2013లో కేంద్ర మంత్రిగా ఉన్న లోక్‌జనశక్తి పార్టీ నేత రామ్‌ విలాస్‌ పాశ్వాన్‌ డిమాండ్‌ చేశారు. తరువాత అదే పెద్ద మనిషి బిజెపి చంకనెక్కి మంత్రిగా పని చేశారు.చివరిగా బిజెపి మద్దతుతో రాజ్యసభకు ఎన్నికయ్యారు.


అల్లుడికి బుద్ది చెప్పిన మామ అదే తప్పు చేసినట్లు ఉచితాల గురించి రచ్చ చేస్తున్న ప్రధాని నరేంద్రమోడీ కర్ణాటకలో తమ పార్టీ ఉచితాలను సమర్ధించారు.కర్ణాటక కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలతో రాష్ట్రం అప్పుల వూబిలో మునుగుతుందన్నారు. ఉచితాల సంస్మృతి భవిష్యత్‌ తరాల వనరులను హరించి వేస్తుందని, తాము రానున్న పాతిక సంవత్సరాల గురించి ఆలోచిస్తాము తప్ప దగ్గరదారుల్లో వెళ్లం అన్నారు. ప్రతి రోజు బిపిఎల్‌ కుటుంబాలకు పాల సరఫరా హామీ కూడా ఇచ్చారు. ఎందుకు అంటే ఆ రాష్ట్ర పాలరైతులకు మార్కెటింగ్‌ కల్పించి ఆదుకొనేందుకు అని బిజెపి నేతలు చెబుతున్నారు. మరి అధికారంలో ఇప్పటికే ఉన్న చోట్ల ఎందుకు ఇవ్వటం లేదు, కర్ణాటకలో కూడా ఇప్పటి వరకు ఎందుకు పాలు సరఫరా చేయలేదు ? కుటుంబ పాలన, అవినీతి గురించి మోడీ పెద్దగా ప్రస్తావించటం లేదు. ఎందుకంటే 40శాతం అవినీతి పాలన అని బిజెపి సర్కార్‌ గబ్బుపట్టింది. ఇక ఎడియూరప్పను పక్కన పెట్టుకొని కుటుంబపాలన గురించి చెబితే కన్నడిగులు ముఖం మీదే జనం నవ్వుతారు. మోడీ చేతుల్లో దేశం సురక్షితంగా ఉంటుందన్నారు. కాశ్మీరులో భద్రతా దళాలకు అధికారం ఇవ్వలేదంటూ ఆర్టికల్‌ 370 రద్దు, ఏకంగా రాష్ట్రానే రద్దు చేసి కేంద్ర పాలన సాగిస్తోంది. అక్కడ ఒక వైపు ఉగ్రవాదులు భద్రతాదళాల ప్రాణాలు తీస్తుంటే మరోవైపు కర్ణాటకలో మోడీ ఉగ్రవాదం గురించి ఇతరుల మీద రాళ్లు వేస్తున్నారు. వారితో చేతులు కలిపిన వారి మీద చర్యలు తీసుకుంటే ఎవరు అడ్డుకున్నారు ? ఇంతవరకు ఎంత మందిని పట్టుకున్నారు, ఎన్నికేసులు పెట్టారు ?


ఉచితాలకు వ్యతిరేకంగా బిజెపి నేత అశ్వనీకుమార్‌ ఉపాధ్యాయ సుప్రీం కోర్టులో కేసు వేశారు. సంక్షేమ చర్యలు అంటే ప్రతిదాన్నీ ఉచితంగా ఇవ్వటం కాదని కేంద్రం తరఫున వాదించిన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా చెప్పారు.కర్ణాటకలో ఉచిత పాలు, ఉచిత సిలిండర్లు, ఉచిత ఆహార ధాన్యాల సంగతేమిటి ? గత ఏడాది(2022) ఫిబ్రవరిలో ఉత్తర ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్‌కు కేవలం రెండు రోజుల ముందు లోక కల్యాణ సంకల్ప పత్రం పేరుతో బిజెపి ఎన్నికల వాగ్దాన పత్రాన్ని మోడీలో సగంగా భావిస్తున్న కేంద్ర మంత్రి అమిత్‌ షా విడుదల చేశారు. ఐదు సంవత్సరాల పాటు రైతులకు ఉచిత విద్యుత్‌, ఆరుపదులు దాటిన మహిళలకు ఉచిత ప్రయాణం ( కరోనా పేరుతో రైళ్లలో వృద్ద స్త్రీ, పురుషులకు ఇస్తున్న రాయితీలను , పేదలకు అందుబాటులో ఉన్న పాసింజరు రైళ్లను మోడీ సర్కార్‌ రద్దు చేసిన సంగతిని ఇక్కడ గుర్తుకు తేవాలి), ప్రతిభ చూపిన విద్యార్థినులకు స్కూటీలు, విద్యార్థులందరికీ రెండు కోట్ల స్మార్ట్‌ ఫోన్లు, టాబ్లెట్ల పంపిణీ, పిఎం ఉజ్వల పధకం కింద హౌలి, దీపావళి పండుగలకు రెండు ఉచిత గాస్‌ సిలిండర్లు, అన్న పూర్ణ కాంటీన్లు వాటిలో ఉన్నాయి. ఇదే ఉత్తర ప్రదేశ్‌లో ముఖ్యమంత్రి కన్య సుమంగళ యోజన పేరుతో ఉచితంగా నిధులు ఇచ్చేందుకు 2022-23 బడ్జెట్‌లో పన్నెండు వందల కోట్ల రూపాయలు కేటాయించారు.


అమ్‌దానీ ఆఠాణీ, ఖర్చా రూపయా (రాబడి ఎనిమిదణాలు ఖర్చు పదహారణాలు) అని నరేంద్రమోడీ ఉచితాల గురించి ఎద్దేవా చేశారు. ” ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పధకం కింద 39లక్షల మందికి రెండు ఉచిత గాస్‌ సిలిండర్లు ఇవ్వనున్నట్లు అక్టోబరు 17న గుజరాత్‌ ప్రభుత్వం ప్రకటించింది.” (డెక్కన్‌ హెరాల్డ్‌ 2022 నవంబరు 13). ” బిజెపి ప్రకటించిన వాటిలో ఉచిత విద్య,ఉచిత వైద్యం, రెండు ఉచిత సిలిండర్లు, సబ్సిడీతో సెనగలు, వంట నూనె, కాలేజీలకు వెళ్లే బాలికలకు ఉచిత ఎలక్ట్రిక్‌ స్కూటీలు కూడా ఉన్నాయి. సరిగ్గా ఎన్నికలకు ముందు హిమచల్‌ ప్రదేశ్‌లోని బిజెపి సర్కార్‌ ఏప్రిల్‌ నెలలో ఇండ్ల అవసరాలకు గాను 125 యుూనిట్లకు చార్జీ ఎత్తివేసి రు.250 కోట్లు లబ్ది చేకూర్చుతున్నట్లు, గ్రామాలలో నీటి సరఫరా చార్జీలను మాఫీ చేస్తున్నట్లు, రాష్ట్ర ఆర్టీసి బస్సుల్లో మహిళలకు సగం చార్జీ రాయితీ ఇస్తున్నట్లు, 18-60 సంవత్సరాల మహిళలకు నెలకు రు.1,500 ఇవ్వనున్నట్లు ప్రకటించింది. బిజెపి చేస్తే సంసారం, ఇతరులు చేస్తే మరొకటా ?


ఉచితాలను పన్ను చెల్లింపుదార్లు నిరసిస్తున్నారని అంటూ వాటికి వ్యతిరేకమైన వాతావరణాన్ని సృష్టించేందుకు ఒకవైపు నరేంద్రమోడీ చూస్తున్నారు.మరోవైపు అధికారం కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. గడచిన ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వ రంగ బాంకులు రు.10,09,510 కోట్ల మేరకు నిరర్ధక ఆస్తులుగా ప్రకటించగా ఇదే కాలంలో అలాంటి ఖాతాల నుంచి వసూలు చేసిన మొత్తం రు.1,32,036 కోట్లని ప్రభుత్వం తాజాగా పార్లమెంటులో, సమాచార హక్కు కింద ఆర్‌బిఐ వెల్లడించింది.(2022, డిసెంబరు 13వ తేదీ వార్త). వారి మీద తీసుకున్న చర్యలేమిటో ఎవరికైనా తెలుసా ?


కార్పొరేట్‌లపై పన్ను ద్వారా ఖజానాకు వచ్చే మొత్తం కూడా ప్రజలదే. కానీ ఒక్క పైసాను కూడా జాగ్రత్తగా చూస్తానని చెప్పిన నరేంద్రమోడీ కార్పొరేట్‌ పన్నును 30 నుంచి 22కు, 15శాతానికి తగ్గించారు. దీన్ని హర్షించే పెద్దలు సబ్సిడీ ధరలకు ఆహార ధాన్యాలను ఇస్తే పేదలు వాటిని తినకుండా వేరే వారికి అమ్ముకుంటున్నారని దాడి చేస్తున్న సంగతి తెలిసిందే. మరి కార్పొరేట్లకు ఇస్తున్న సబ్సిడీ అంతా తిరిగి పెట్టుబడిగా వస్తున్నదా ? అది దేశానికి, జనానికి లబ్ది చేకూర్చుతున్నదా ? దీన్ని కార్పొరేట్లకు ఇస్తున్న ఉచితం అంటారా, దోచిపెడుతున్న సొమ్మంటారా ? ఇదే కాలంలో కార్పొరేట్ల నుంచి ఎన్నికల బాండ్ల రూపంలో బిజెపికి వస్తున్న సొమ్మెంతో కూడా చూస్తున్నాము. కార్పొరేట్లకు పన్ను తగ్గిస్తే వారు తిరిగి దాన్ని పెట్టుబడి పెట్టి ఉపాధి కల్పిస్తారని చెబుతున్నారు. జనమూ అంతేగా ! ఒక వస్తువు లేదా సేవను ఉచితంగా పొందితే దానికి వెచ్చించే సొమ్ముతో మరొకదాన్ని కొనుగోలు చేసి దేశానికి తోడ్పడుతున్నారు. ఉదాహరణకు నరేంద్రమోడీ 2019 ఎన్నికలకు ముందు ఓట్ల కోసం రైతులకు ఉచితంగా ఏడాదికి ఆరువేల రూపాయలను మూడు విడతలుగా బాంకుల్లో వేసే పథకాన్ని ప్రకటించారు. రైతులు ఆ సొమ్మును స్విస్‌ బాంకుల్లోకి, ఇతర దేశాలకేమీ తరలించి దాచుకోవటం లేదు, ఎరువులో, పురుగుమందులో మరొక వస్తువునో కొనుక్కుంటున్నారు. సాగు చేయని వారు ఇతర వస్తువులకు వెచ్చిస్తున్నారు. అదీ దేశానికి మేలు చేస్తున్నట్లే !


స్వేచ్చా మార్కెట్‌, ఏదీ ఉచితం ఇవ్వకూడదు అన్న నయా ఉదారవాదం పేరుతో కార్పొరేట్లకు సంపదలను కట్టబెట్టే విధానాలు వచ్చిన దగ్గర నుంచీ అసమానతల పెరుగుదలతో పాటు ఉచితాల మీద దాడి ప్రారంభమైంది. ఉచితంగా ఉన్న విద్య, వైద్యాలను అమ్మకపు సేవలుగా మార్చివేశారు. ఒకనాడు అపహాస్యం చేసిన పధకాలనే తరువాత జాతీయంగా అమలు చేశారు.తొలుత తమిళనాడు స్కూలు పిల్లలకు మధ్యాహ్నభోజన పథకాన్ని అమలు చేసినపుడు అదే జరిగింది. ఇప్పుడు దేశమంతటా అమలు చేస్తున్నారు. ఎన్టీర్‌ కిలో రెండు రూపాయల బియ్యం పథకాన్ని ఎద్దేవా చేసిన వారున్నారు. ఆహార భద్రతా పధకం కింద ఇప్పుడు దేశమంతటా అమలు చేస్తున్నారు. ఒడిషా, తెలంగాణాలో ముందుగా రైతు బంధును ప్రకటిస్తే తరువాత నరేంద్రమోడీ కిసాన్‌ సమ్మాన్‌ పేరుతో దేశమంతటా అమలు చేస్తున్నారు. అందువలన ఈ రోజున ఉచితాలన్న వాటిని రేపు ఏం చేస్తారో చెప్పలేము. రాష్ట్రాల వనరులు తగ్గుతున్నట్లు ఉచితాలకు డబ్బు ఎక్కడి నుంచి తెస్తారంటూ కేంద్ర పెద్దలు గుండెలు బాదుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌ పత్రాల ప్రకారం 2014లో కేంద్ర ప్రభుత్వ అప్పు 55 లక్షల కోట్లు, మోడీ పదేండ్ల పాలన గడిచే నాటికి అది 169లక్షల కోట్లకు చేరనుంది. ఇంత అప్పు దేనికి చేసినట్లు, ఎక్కడ నుంచి తెచ్చిందీ, దేనికెంత ఖర్చు చేసిందీ మోడీ చెబుతారా ? దోమలు దూరే కంతలను చూసి గుండెలు బాదుకొనే వారికి ఏనుగులు పోతున్న మహాద్వారాలు కనిపించవా ? పార్లమెంటులో 2017జూలై 21 నక్షత్ర గుర్తులేని ప్రశ్న 938కి ఇచ్చిన సమాధానం ప్రకారం 2004-05 కస్టమ్స్‌, ఎక్సైజ్‌, కార్పొరేట్‌, వ్యక్తిగత పన్ను రాయితీల వలన ప్రభుత్వం కోల్పోయిన రాబడి లక్షా 95వేల కోట్ల రూపాయలు. తరువాత అది ఏటేటా పెరుగుతూ వచ్చింది నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత జనానికి అర్ధంగాకుండా లెక్కలను తారుమారు చేసి సరికొత్త పద్దతుల్లో దోచి పెట్టటం ప్రారంభించారు.2014-15లో కస్టమ్స్‌, ఎక్సైజ్‌ పన్నుల రాబడిలో కోల్పోయిన మొత్తం రు.4,35,756 కోట్లుగా పేర్కొనగా మరుసటి ఏడాది నాటకీయంగా ఆ మొత్తాలను రు.1,48,442 కోట్లుగా చెప్పారు. దీని అర్ధం ఖజానాకు మోడీ గారు రు.2,87,314 కోట్లు మిగిల్చినట్లా ? నిజానికి అంత మిగిల్చి ఉంటే పెట్రోలు, డీజిలు మీద 2014-15లో ఎక్సైజ్‌ పన్ను ఖాతా కింద కేంద్రానికి వచ్చిన మొత్తం రు.99,068 కోట్ల మొత్తాన్ని మరుసటి ఏడాదికి రు.1,78,447 కోట్లకు, తరువాత క్రమంగా పెంచి 2020-21నాటికి రు.3,72,970 కోట్లకు చేర్చారు. ఇంత మొత్తం భారాన్ని మోపటంతో పాటు గాస్‌ సబ్సిడీని భారీగా తగ్గించి ముష్టి విదిల్చినట్లుగా మార్చివేశారు. పైన పేర్కొన్నట్లుగా అప్పు తడిచి మోపెడైంది ? ఎవరికోసం బిజెపి పని చేస్తున్నట్లు ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

కాషాయ దేశభక్తుల బండారం : కమ్యూనిస్టు,చైనా వ్యతిరేక నోటితుత్తర జనం కోసం- కార్పొరేట్ల లాభాల కోసం దిగుమతులు !

26 Wednesday Apr 2023

Posted by raomk in BJP, CHINA, Congress, COUNTRIES, CPI(M), Current Affairs, Economics, Europe, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, USA

≈ Leave a comment

Tags

ASEAN, BJP, Cross-border trade, India’s Imports From China, Indo - China trade, Narendra Modi Failures, RSS


ఎం కోటేశ్వరరావు


చైనా నుంచి తమ ఆర్థిక వ్యవస్థను విడగొట్టుకోవాలని కోరుకోవటం లేదని అమెరికా వాణిజ్య ప్రతినిధి కాథరీన్‌ తాయి 2023 ఏప్రిల్‌ 20న జపాన్‌ రాజధాని టోకియోలో చెప్పారు.2022-23లో చైనా నుంచి మన దిగుమతులు 4.16శాతం పెరగ్గా ఎగుమతులు 28శాతం తగ్గినట్లు వాణిజ్య మంత్రిత్వశాఖ ప్రాధమిక సమాచారం వెల్లడించింది.2022లో చైనా-భారత్‌ వాణిజ్య లావాదేవీలు 136 బిలియన్‌ డాలర్లు కాగా చైనా ఎగుమతులు 118, భారత్‌ ఎగుమతులు 18 బి.డాలర్ల చొప్పున ఉన్నట్లు ముంబైలోని చైనా కాన్సులేట్‌ జనరల్‌ కాంగ్‌ షియాన్‌ హువా ఏప్రిల్‌ 18న ముంబైలో చెప్పాడు. మరోవైపు మన దేశ ప్రధాన వాణిజ్య భాగస్వామిగా అమెరికా తయారైందని లావాదేవీల విలువ128 బి.డాలర్లని మరొక వార్త. ఆర్థిక రంగంలో భారత్‌ ఎలా చైనాను వెనక్కు నెడుతున్నదో చూడండి అంటూ ఒక విశ్లేషణ. మన ఇరుగుపొరుగు దేశాలతో 115 బి.డాలర్ల సరిహద్దు వాణిజ్య లావాదేవీలు జరిపేందుకు అవకాశం ఉన్నప్పటికీ 2021లో కేవలం 2.8 బి. డాలర్ల మేరకే జరిగిందని, పదిహేడు రాష్ట్రాలు సరిహద్దుల్లో ఉన్నప్పటికీ తొమ్మిది మాత్రమే చురుకుగా లావాదేవీలు జరిపినట్లు మరొక విశ్లేషణ. ఇవన్నీ వారం, పదిరోజుల్లో వచ్చినవే. గత తొమ్మిది సంవత్సరాలలో నరేంద్రమోడీ సర్కార్‌ సాధించినట్లు చెబుతున్న విజయాల మాలలో వీటిని ఎక్కడ అమర్చుతారో తెలియదు. ఉట్టికి ఎగరలేని వారు నేరుగా స్వర్గానికి ఎగురుతామని చెప్పినట్లుగా ఇరుగు పొరుగు దేశాలతో సరిహద్దు వాణిజ్యలావాదేవీలు జరపలేని స్థితిలో చైనాను వెనక్కు నెట్టేసి ప్రపంచ ఫ్యాక్టరీగా మన దేశాన్ని మార్చుతామంటే నమ్మేదెలా ? సరిహద్దు లావాదేవీలు భద్రతాపరమైన కారణాలతో జరపటం లేదని చెబుతున్నారు. ఇతర అంశాలతో పాటు విదేశాలు, స్వదేశంలో ఉన్న ఉగ్రవాదుల వెన్ను విరిచేందుకు పెద్ద నోట్ల రద్దుకు చెప్పిన కారణం ఒకటని గుర్తుకు తెచ్చుకోవాలి. అదే విధంగా దేశం సురక్షిత హస్తం చేతుల్లో ఉందని కూడా చెప్పుకున్న సంగతి తెలిసిందే. అలాంటపుడు తగిన జాగ్రత్తలు తీసుకొని లావాదేవీలను ఎందుకు జరపటం లేదు ? చైనాకు ఇరుగుపొరుగుదేశాలతో అన్నీ విబేధాలే అని చెబుతున్నవారు మన దేశం కూడా అదే స్థితిలో ఉన్నట్లు ఈ పరిస్థితి చెప్పటం లేదా ? చైనా నుంచి నేరుగా దిగుమతులు చేసుకొంటే లేని భద్రతా అంశం సరిహద్దుల్లో లావాదేవీలకు ఎందుకు చెబుతున్నట్లు ? సరిహద్దు లావాదేవీలు ఆ ప్రాంతంలో ఉన్న పౌరుల ఆర్థిక వృద్ధికి ఎంతగానో తోడ్పడతాయని తెలిసిందే.


ఇక్కడొక అంశాన్ని చెప్పాలి. లడక్‌ గాల్వన్‌ ఉదంతం తరువాత చైనా వస్తుబహిష్కరణ గురించి నానా యాగీ చేసిన కాషాయ దళాలు, వాటి సమర్ధకులు ఇప్పుడు కొత్త పాట పాడుతున్నారు.ఎగుమతులు-దిగుమతులను ఆయుధాలుగా మార్చుకోవాలన్న అమెరికా డోనాల్డ్‌ ట్రంప్‌ స్పూర్తి తప్ప ఈ తొలి ఉద్రేకం వెనుక మరేమీ లేదు. పోనీ దానికి కట్టుబడి ఉన్నారా అంటే అదీ లేదు, తన రికార్డులను తానే మోడీ బద్దలు కొడుతున్నారు. చైనా వస్తుబహిష్కరణ అని దుస్తులు చించుకున్న వారే సరిహద్దు వివాదాలకు-వాణిజ్య లావాదేవీలకు లంకె పెడతారేమిటని ఎదురుదాడికి దిగుతున్నారు.ఇదే దేశభక్తులు, వీరి పూర్వీకులు చైనాతో వివాదాలను సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాలన్న వైఖరిని చెప్పినందుకు సిపిఐ(ఎం) నేతలను దేశద్రోహులుగా చిత్రించారు. ఇప్పటికీ అదే దాడి చేస్తున్నారు. 1960దశకంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం వారిని జైళ్లలో పెట్టిన సంగతిని కూడా మరచి పోరాదు. నరేంద్రమోడీతో చెట్టపట్టాలు వేసుకొని కౌగిలింతలతో తిరిగిన డోనాల్డ్‌ ట్రంప్‌ 2018లో చైనాతో వాణిజ్యపోరుకు తెరతీశాడు. ఐదేండ్ల తరువాత వెనక్కు తిరిగి చూస్తే అమెరికా ఎన్ని బెదిరింపులకు దిగినా, మరొకటి చేసినా చైనా ఒక్క అంగుళం కూడా వెనక్కు తగ్గలేదు. పీటర్సన్‌ సంస్థ విశ్లేషకులు చెప్పిన అంశాలను చూస్తే చెరువు మీద అలిగినవాడి మాదిరి అమెరికా పరిస్థితి మారింది. దాని పరిస్థితే అలా ఉంటే మన నరేంద్రమోడీ ఏలుబడి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంతమంచిది. ఆత్మనిర్భరతలో భాగంగా ఓకల్‌ ఫర్‌ లోకల్‌ ( స్థానిక వస్తువులనే వాడండి ) మేకిన్‌ ఇండియా (భారత్‌లో ఉత్పత్తి చేయండి ) మేడిన్‌ ఇండియా (భారత తయారీ) ఇలా ఇచ్చిన పిలుపులు ఎంత మేరకు ఫలించిందీ ఎప్పుడైనా జనానికి చెప్పారా ?


అమెరికా తాజాగా విడుదల చేసిన సమాచారం ప్రకారం 2022లో అమెరికా ఎగుమతులు మరింతగా తగ్గినట్లు, దాని పోటీదారులు చైనా మార్కెట్లో వస్తువులను అమ్ముకుంటున్నట్లు తేలిందని, అమెరికా ఎగుమతులైన ఆటో మొబైల్స్‌, బోయింగ్‌ విమానాలు అదృశ్యమైనట్లు పీటర్సన్‌ విశ్లేషణ పేర్కొన్నది. సెమికండక్టర్ల ఎగుమతి విధానం కారణంగా వాటి ఎగుమతి తగ్గింది, కరోనా కాలంలో తగ్గిన సేవల ఎగుమతులు అంతకు పూర్వపు స్థాయికి ఇంకా చేరుకోలేదు. చైనాకు అమెరికా వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలు రికార్డు స్థాయిలో జరిగినా చైనా మార్కెట్‌ మీద ఎక్కువగా ఆధారపడిన అమెరికాకు ఆందోళనకర సూచనలు వెలువడ్డాయి. చైనా ఇతర దేశాల నుంచి దిగుమతులకు పూనుకున్నట్లు పీటర్సన్‌ పేర్కొన్నది.


ఎగుమతులు-దిగుమతులను ఆయుధాలుగా మార్చినందున ఎవరికి వారు జాగ్రత్తలు పడుతున్నారు.రాజీ మార్గంగా రెండు సంవత్సరాల్లో అమెరికా నుంచి 200 బి.డాలర్ల మేరకు అదనంగా కొనుగోలు చేస్తామని 2020జనవరిలో చైనా అంగీకరించినా వివిధ కారణాలతో ఆ మేరకు దిగుమతులు జరగలేదు.చైనా వస్తువులు నాశిరకమని, కరోనా నిరోధ వాక్సిన్లు పని చేయలేదని ప్రచారం చేసిన వారి గురించి తెలిసిందే.ఇప్పుడు అమెరికా గతం కంటే ఎక్కువగా చైనా ఔషధాల మీద ఆధారపడుతోంది. గడచిన ఐదు సంవత్సరాల్లో రెండు దేశాల మధ్య మొత్తం లావాదేవీల్లో ఔషధాల వాటా విలువ 0.6 నుంచి మూడు శాతానికి పెరిగింది. అమెరికా 10.2 బి.డాలర్ల విలువ గలవి దిగుమతి చేసుకుంటే చైనా కాన్సర్‌,యాంటీబయటిక్స్‌ వంటి ఆధునిక ఔషధాలను 9.3బి. డాలర్ల మేర దిగుమతి చేసుకుంది. అమెరికా చేసుకుంటున్న మొత్తం ఔషధ దిగుమతుల్లో ఐర్లండ్‌ 19.8, జర్మనీ 10.8, స్విడ్జర్లాండ్‌ 10.7 చైనా నుంచి ఆరుశాతం ఉన్నాయి.రెండు సంవత్సరాల్లో చైనా వాటా 2.5శాతం నుంచి పెరిగింది. అమెరికా నుంచి చైనా చేసుకుంటున్న ఔషధాల దిగుమతులు కూడా అదే విధంగా పెరిగాయి. ఇతర వస్తువులు, సేవల అంశంలో భద్రత అంశాన్ని ముందుకు తెస్తున్న అమెరికా ఔషధాల గురించి మౌనంగా ఉంది. ఇలాంటి కొన్ని అవసరాల రీత్యా చైనా నుంచి తాము పూర్తిగా ఆర్థిక సంబంధాలను విడగొట్టుకోవటం లేదని అమెరికా వాణిజ్య ప్రతినిధి కాథరీన్‌ తాయి చెప్పారన్నది స్పష్టం.


చైనా వస్తువులను బహిష్కరించి దానికి బుద్ది చెప్పాలన్న కాషాయదళాల గోడు నరేంద్రమోడీ పట్టించుకోవటం లేదు. ఎందుకంటే ఎన్నికల్లో ఖర్చు పెట్టేందుకు అవసరమైన నిధులు రావాలన్నా, అధికారాన్ని నిలుపుకోవాలన్నా కార్పొరేట్ల మద్దతు అవసరం. రాజకీయంగా బిజెపితో లడాయిలో ఉన్న ఢిల్లీ సిఎం కేజరీవాల్‌ కాషాయ దళాలు గతంలో లేవనెత్తి తరువాత నోరు మూసుకున్న ఈ అంశాన్నే ఇప్పుడు తవాంగ్‌ పేరుతో ముందుకు తెచ్చారు. చైనా వస్తువులను బహిష్కరించి దానికి ఎందుకు బుద్ది చెప్పరంటూ ప్రశ్నించారు. చైనా వస్త్తువులను మన దేశంలో కూడా తయారు చేస్తున్నారని, దిగుమతులకు బదులు ఇక్కడే తయారు చేసి మన కార్మికులకు ఎందుకు పని కల్పించరంటూ నిలదీశారు. కేజరీవాల్‌ చేసే అన్ని విమర్శలకు సమాధానం చెప్పే కమలనాధులు దీని గురించి మౌనంగా ఉన్నారు. చైనా నుంచి భారత్‌ దిగుమతులు ఉత్తి పుణ్యానికి లేదా చైనా కార్మికులకు పని కల్పించేందుకు, అక్కడి కంపెనీలకు లాభాలు కట్టిపెట్టేందుకు కాదు. ముంబైలోని చైనా కాన్సులేట్‌ జనరల్‌ కాంగ్‌ షియాన్‌ హువా మన దేశంలోని పెట్టుబడిదారులతో మాట్లాడుతూ రెండు దేశాల మధ్య జరుగుతున్న లావాదేవీల లెక్కలు డొక్కలు పూర్తి కథను వెల్లడించవంటూ అసలు సంగతి చెప్పారు. చైనా నుంచి భారత్‌ చేసుకుంటున్న దిగుమతులలో ఇంటర్‌మీడియట్‌లు (పూర్తిగా తయారు కాని, ముడిపదార్ధాలు, విడిభాగాల వంటివి. ఉదాహరణకు మనం వేసుకొనే ఔషధ గోళీలు మన దేశంలో తయారైనప్పటికీ వాటిలో నింపే పదార్ధాలను చైనా నుంచి దిగుమతి చేసుకోవటం) ఎక్కువగా ఉంటాయని, వాటితో వస్తువులను తయారు చేసి భారత్‌ ఇతర దేశాలకు ఎగుమతులు చేస్తున్నదని, అందువలన మేక్‌ ఇండియా, మేకిన్‌ ఇండియా సంపూర్ణం కావాలంటే చైనా మార్కెట్‌కు రావాలని మన పెట్టుబడిదారులను కోరాడు.ఐటి, సినిమా నిర్మాణ రంగాలలో ముందున్న భారతీయులు తమ మార్కెట్లోకి రావచ్చని కూడా చెప్పాడు. ఈ కారణంగానే సరిహద్దుల్లో ఘర్షణలు జరిగినా, ఏటా భారీ మొత్తంలో విదేశీ మారకద్రవ్యాన్ని చైనాకు సమర్పించుకోవాల్సి వచ్చినా మోడీ సర్కార్‌ కిమ్మనకుండా దిగుమతులలో రికార్డులను బద్దలు కొడుతున్నది.

మన దేశంతో 2022లో చైనా వాణిజ్య మిగులు 100 బి.డాలర్లు, 2021లో ఆ మొత్తం 69.38 బి.డాలర్లు. అంటే ఇంత మొత్తాన్ని డాలర్ల రూపంలో చైనాకు మనం సమర్పించుకున్నాం.ఇదంతా దేశభక్తి, సైనికుల త్యాగాల గురించి రోజూ జనాలకు మనోభావాలను గుర్తు చేస్తుండగానే, వారి కనుసన్నలలోనే జరుగుతోంది. చైనా చెప్పే లెక్కలు జనవరి నుంచి డిసెంబరు వరకు ఏడాదిగా పరిగణిస్తే మన ప్రభుత్వం ఏప్రిల్‌ నుంచి మార్చి వరకు ఆర్థిక సంవత్సరంగా తీసుకుంటున్నందున అంకెల్లో కొంత గందరగోళం తలెత్తవచ్చు, వాస్తవాలు మారవు. మన ప్రభుత్వం ప్రకటించిన లెక్కల ప్రకారం 2022-23లో మన చైనా దిగుమతులు 4.16శాతం పెరిగి 98.51 బి.డాలర్లకు చైనాకు మన ఎగుమతులు 28శాతం తగ్గి 15.32 బి.డాలర్లుగా ఉన్నాయి. మన వాణిజ్యలోటు అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే 72.91 నుంచి 83.2 బి.డాలర్లకు పెరిగింది. అమెరికాతో లావాదేవీలు 128.55 బి.డాలర్లకు చేరినందున చైనాను వెనక్కు నెట్టి అమెరికా ముందుకు వచ్చిందని చెబుతున్నారు. దాని వలన చైనాకు వచ్చే నష్టం లేదు. ఇక దేశభక్తులుగా చెలామణి అవుతున్న అదానీ వంటి కార్పొరేట్లు ఏ దేశం నుంచి దిగుమతి చేసుకున్నప్పటికీ దిగుమతి పన్ను ఎగవేసేందుకు తప్పుడు సమాచారం ఇస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.” దిగుమతి విలువ ఎక్కువ, ఎగుమతి విలువ తక్కువగా ఉండటం సాధారణ అంశం. కానీ భారత్‌లో అందుకు విరుద్దంగా చైనా-భారత్‌ లావాదేవీలు ఉన్నట్లు ” మింట్‌ పత్రిక పేర్కొన్నది.


ఆర్థిక రంగంలో చైనాను భారత్‌ ఎలా పక్కకు నెడుతున్నది అనే శీర్షికతో మేజర్‌ అమిత్‌ బన్సాల్‌ అనే రిటైర్డు అధికారి ఒక విశ్లేషణ చేశారు. ఏమిటి అంటే సింగపూర్‌కు చెందిన ఒక సంస్థ ఆసియన్‌ దేశాలలో ఇటీవల సింగపూర్‌కు చెందిన ఐఎస్‌ఇఏఎస్‌ అనే సంస్థ జరిపిన సర్వేలో భారత్‌ను ఆమోదించిన లేదా అంగీకరించిన వారు గత సర్వేతో పోల్చితే 5.1 నుంచి 11.3శాతానికి పెరిగారని తేలిందట.చైనా, అమెరికా తరువాత మూడో స్థానంలో ఉన్నాం గనుక ఇదే కొనసాగి చైనాను వెనక్కు నెట్టే దారిలో ఉన్నట్లు బన్సాల్‌ చెబుతున్నారు. ఎందుకటా అమెరికా-చైనా వివాదపడుతున్నాయి గనుక భారత్‌ దూరేందుకు అవకాశం వచ్చింది అంటున్నారు. మరోవైపున చైనా 700 బి.డాలర్ల మేరకు ఆసియన్‌ దేశాలతో లావాదేవీలు జరుపుతూ చైనా మొదటి స్థానంలో ఉందంటూనే మనం 2022లో 110 బి.డాలర్ల దగ్గర ఉన్నామని, అమెరికాను ఐదారు సంవత్సరాల్లో, పదేండ్లకు చైనాను వెనక్కు నెట్టేస్తామంటున్నారు.ఆసియన్‌ దేశాల లావాదేవీల్లో మన దిగుమతులు 68, ఎగుమతులు 42 బి.డాలర్లు అంటే మనం 26బి.డాలర్లు వారికి సమర్పించుకుంటున్నాం. వారికి లాభసాటిగా ఉంది గనుక మనతో లావాదేవీలకు మొగ్గుచూపుతున్నానర్నది స్పష్టం. అందమైన కలలు కనటాన్ని తప్పుపడతామా ? చైనాను వెనక్కు నెట్టే సంగతి తరువాత ముందు వారితో ఉన్న వాణిజ్యలోటును సమం చేస్తే అదే పదివేలు. 2021-22లో మన దేశం 612 బి.డాలర్ల మేర దిగుమతులు చేసుకుంటే చేసిన ఎగుమతుల విలువ 422బి.డాలర్లు. పెద్ద దేశాల్లో అమెరికా, బ్రిటన్‌తో మాత్రమే మన ఎగుమతులు ఎక్కువ, ఇక కొన్ని చిన్న దేశాలతో కూడా ఎక్కువే. మన మిగులు విలువ 59 బి.డాలర్లు పోను మన లోటు 192బి.డాలర్లు. అందువలన వచ్చే పదేండ్లలో దాన్ని సమం చేసినా ఘనవిజయమే. ప్రపంచ బాంకు సమాచారం ప్రకారం 2014 మన వస్తు ఎగుమతుల విలువ 322.69 బి.డాలర్లు కాగా 2021లో 395.43 బి.డాలర్లు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వివరాల మేరకు 2021-22లో 447బి.డాలర్లు. ద్రవ్యోల్బణం కారణంగా ఈ పెరుగుదల తప్ప గడచిన తొమ్మిదేండ్లలో పదే పదే విదేశాలు తిరిగిన నరేంద్రమోడీ మన సరకులకు సాధించిన మార్కెట్‌ ఏమిటి అన్నది ప్రశ్న. అదే ప్రపంచ బాంకు చైనా 2014లో 2.34లక్షల కోట్ల డాలర్ల మేర సరకులు ఎగుమతి చేస్తే 2021నాటికి 3.36లక్షల కోట్లకు పెరిగింది. ఇలాంటి అంకెలు మన కళ్ల ముందు ఉండగా చైనాను అధిగమిస్తామని ఎలా చెబుతారు ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

ఏకత, శీలము ఉన్నవారు చేసే పనేనా ఇది : షిరిడీ సాయి ట్రస్టు మసీదులకు విరాళమిచ్చిందా ?

21 Friday Apr 2023

Posted by raomk in BJP, Communalism, Congress, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, RELIGION, Religious Intolarence

≈ Leave a comment

Tags

BJP, Gobbles, Propaganda War, Ram Mandir, RSS, Shirdi Sai Baba, Shirdi Sai Trust


ఎం కోటేశ్వరరావు


” షిరిడీ సాయి ట్రస్టు మసీదులకు రు.96 కోట్లు విరాళమిచ్చింది. షిరిడీ సాయి ట్రస్టు హాజ్‌కు రు.35 కోట్లు విరాళమిచ్చింది.” ఈ రెండింటికీ జత చేసిన అంశాలేమిటంటే షిరిడీ దేవాలయానికి విరాళాలు ఎక్కువగా ఇచ్చేది హిందూ భక్తులు. అలాంటి సంస్థ అయోధ్య రామ మందిరానికి విరాళం ఇచ్చేందుకు తిరస్కరించింది. తాము హిందువులకు భిన్నమని చెప్పినట్లు కూడా వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ట్విటర్‌లో ప్రచారం జోరుగా సాగుతున్నది. ఇది నిజమేనా అంటూ దీన్నే సరికొత్త పద్దతుల్లో కూడా ప్రచారం చేస్తున్నారు. తన పేరుతో జరుగుతున్న ఇలాంటి ప్రచారాన్ని అడ్డుకొనేందుకు రాముడు పూనుకున్నట్లు మనకు ఎక్కడా దాఖలా లేదు. రామజన్మభూమి ట్రస్టు ఏదైనా వివరణ ప్రకటన చేసినట్లు గూగుల్‌ వెతుకులాటలో కనిపించలేదు. దొరికిన వారెవరైనా పంపితే ఈ విశ్లేషణకు జత చేస్తాను. కాగలపని గంధర్వులు తీర్చారు అన్నట్లుగా కాషాయ మరుగుజ్జులు చేస్తున్నదాన్ని చూసీ చూడనట్లు ఉందన్నది స్పష్టం. ఈ ప్రచారానికి సంబంధించి కొన్ని మీడియా సంస్థలు నిజనిర్దారణలు జరిపి షిరిడీ సాయి ట్రస్టు అలాంటి విరాళాలు ఇవ్వలేదని ప్రకటించినప్పటికీ ఇంకా ప్రచారం జరుగుతూనే ఉంది. పని గట్టుకు చేసేదే చేసే గోబెల్స్‌ ప్రచారం గనుక వారికి వాస్తవాలతో నిమిత్తం ఉండదు. సత్యమునే చెప్పవలెను-అబద్దమాడరాదు, సత్యహరిశ్చంద్రుడు పుట్టిన గడ్డ ఇది అని చెప్పుకొనే చోట ఇలాంటి ప్రచారం జరుగుతున్నదంటే నిజానికి అది రాముడికి, హరిశ్చంద్రుడికి ఘోర అవమానం, వారి పేర్లను స్మరిస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నది స్పష్టం.ఇలాంటి ప్రచారాలు చేసే చీకటి శక్తులేవో అందరికీ తెలిసిందే.ఏకత, శీలము ఉన్నవారు చేసే పనేనా ఇది ?


ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమంటే అయోధ్య రామాలయ నిర్మాణానికి విరాళం ఇమ్మని షిరిడీ సాయి ట్రస్టును అసలు అడగలేదని ది క్వింట్‌ అనే వెబ్‌ పత్రిక 2021 జనవరి 18న స్పష్టం చేసింది. ఈ ప్రచారం పచ్చి అవాస్తవమని, విరాళం కోరుతూ తమకు ఎలాంటి సమాచారం లేదని ట్రస్టు సిఇఓ కెహెచ్‌ బగాటే, విరాళం కోసం తామెలాంటి వినతి పంపలేదని రామాలయ ట్రస్టు సభ్యుడు మోహన ప్రతాప్‌ మిశ్రా చెప్పినట్లు పేర్కొన్నది. హిందూస్తాన్‌ టైమ్స్‌లో వచ్చిన ఒక వార్త ప్రకారం రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు విరాళాలు తీసుకోవటం 2021 జనవరి 15 నుంచి ప్రారంభించిందని, దాని కంటే ముందే ఐదవ తేదీ నుంచే షిరిడీ ట్రస్టు నిరాకరణ గురించి ప్రచారం జరుగుతున్నట్లు క్వింట్‌ పేర్కొన్నది.


ఈ ప్రచారాన్నే ” హార్డ్‌ కోర్‌ హిందూ సేన ఆఫ్‌ చీఫ్‌ మినిస్టర్‌ యోగి ఆదిత్య నాథ్‌ ” పేరుతో నడుపుతున్న ఒక గ్రూపులో, హిందూ రాష్ట్ర భారత్‌ వంటి గ్రూపుల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేసినట్లు ది లాలన్‌టాప్‌ అనే వెబ్‌సైట్‌ 2020 జూన్‌ 22న వెల్లడించింది. దీని గురించి శ్రీ సాయి బాబా సంస్థాన్‌ ట్రస్టు సిఇఓ అరుణ్‌ కిషోర్‌ డోంగ్రే మాట్లాడుతూ ఇక్కడికి అన్ని మతాలకు చెందిన వారు వస్తారని, ఒక చట్టం ప్రకారం పని చేస్తున్న ట్రస్టు రు.50లక్షలకు మించి అదనంగా ఎవరికైనా విరాళం ఇవ్వాలంటే హైకోర్టు అనుమతి తీసుకోవాలని, రామ మందిరానికి విరాళం ప్రతిపాదన ఎలాంటిదీ తమ వద్దకు రాలేదని, జరుగుతున్నదంతా తప్పుడు ప్రచారమని చెప్పినట్లు కూడా ఆ సైట్‌ పేర్కొన్నది. ఈ ప్రచారం 2019 డిసెంబరులో కూడా జరిగిందని, అప్పుడు షిరిడీ ట్రస్టు సిఇఓగా ఉన్న దీపక్‌ ముఘాలికర్‌ కూడా అది తప్పుడు ప్రచారమని చెప్పారు. మసీదుల మరమ్మతు, నిర్మాణాలకు రు.96 కోట్లను షిరిడీ ట్రస్టు విరాళంగా ఇచ్చినట్లు, రామ మందిరానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని జరుపుతున్న ప్రచారం వాస్తవం కాదని చెక్‌పోస్ట్‌ అనే మరాఠీ వెబ్‌సైట్‌ 2021అక్టోబరు 30న పేర్కొన్నది. ” బుద్దిలేని మన హిందువులు సాయి గుడికి వెళుతున్నారు. తలలు వంచి కానుకలు సమర్పిస్తున్నారు. ఒక కుట్ర ప్రకారం సాయి విగ్రహాలను హిందువుల గుళ్లలో పెడుతున్నారు.హిందువులారా జాగ్రత్తగా ఉండండి, నిజాలను తెలుసుకొనేందుకు ప్రయత్నించండి ” అంటూ కూడా వాట్సాప్‌లో ప్రచారం చేస్తున్నట్లు అది పేర్కొన్నది. షిరిడీ ట్రస్ట్‌ వెబ్‌సైట్‌లో ఉంచిన ఒక నివేదిక ప్రకారం 2019-20 ఆర్థిక సంవత్సరంలో ట్రస్టు ఇచ్చిన 58 విరాళాల జాబితా ప్రకారం వాటికి ఇచ్చిన మొత్తం రు. 101.48 కోట్లని, దానిలో కరోనా సమయంలో సిఎం సహాయ నిధికి 51 కోట్లు ఇచ్చినట్లు ఉంది తప్ప ఎలాంటి మసీదు పేరు లేదని చెక్‌పోస్ట్‌ పేర్కొన్నది.


విరాళాన్ని తిరస్కరించిన రామ మందిర ట్రస్టు !
రామ మందిర ట్రస్టు నిబంధనావళిని 2020 ఫిబ్రవరి ఐదున ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించినట్లుగా మనీకంట్రోల్‌ వెబ్‌సైట్‌ అదే ఏడాది ఫిబ్రవరి 20న ఒక వార్తలో పేర్కొన్నది. విరాళాలను స్వీకరించే వ్యవస్థను ఇంకా ఏర్పాటు చేయాల్సి ఉందని, పెద్ద మొత్తంలో వచ్చిన విరాళాన్ని ట్రస్టు తిరస్కరించినట్లు ద ప్రింట్‌ అనే వెబ్‌సైట్‌ వార్తను అది ఉటంకించింది. దాని ప్రకారం బీహార్‌కు చెందిన రిటైర్డ్‌ ఐపిఎస్‌ అధికారి కిషోర్‌ కునాల్‌ తాను రామ మందిరానికి పది కోట్ల మేరకు విరాళం ఇవ్వదలచుకున్నట్లు ప్రకటించారని, దానిలో భాగంగా రు. రెండు కోట్ల చెక్‌ తీసుకొని అయోధ్య రాగా విరాళాలను స్వీకరించే వ్యవస్థ లేనందున దాన్ని తిరస్కరిస్తున్నట్లు చెప్పారని ప్రింట్‌ పేర్కొన్నది. రామమందిర ట్రస్ట్‌లోని ఏకైక దళిత సభ్యుడు, విశ్వహిందూ పరిషత్‌ నేత కమలేష్‌ చౌపాల్‌ మాట్లాడుతూ దేశమంతటి నుంచి అనేక మంది విరాళాలు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నారని , మందిర నిర్మాణానికి నిధుల కొరత లేదని అన్నట్లు కూడా రాసింది.


షిరిడీ సాయి మందిరం గురించి తప్పుడు ప్రచారం కొత్త కాదు. షిరిడీ సాయిబాబా హిందూాముస్లిం ఐక్యతకు ప్రతీక కాదు, దేవుడూ కాదని మానవుడు కనుక పూజించ వద్దని ద్వారకా పీఠం శంకరాచార్య స్వామి స్వరూపానంద 2014 జూన్‌ 24న చెన్నైలో పిలుపునిచ్చారు. నిజంగా సాయిబాబా హిందూ-ముస్లిం ఐక్యతకు ప్రతీకైతే ముస్లింలు కూడా విశ్వాసం వెల్లడించేవారని అన్నారు. సాయిబాబా గంగలో మునిగేందుకు తిరస్కరించారని, అతని పేరుతో గుళ్లు కట్టటం డబ్బు సంపాదనకేనని, సనాతన ధర్మంలో విష్ణువు 24 అవతారాల గురించి చెప్పారని దానిలో సాయిబాబా లేరని, హిందువుల మధ్య విభజన కుట్రలో భాగంగా బాబాకు పూజలు చేస్తున్నారని ఆరోపించారు. బ్రిటీష్‌ వారు బాబాను ముందుకు తెచ్చారని కూడా ఆరోపించారు.


దేశంలో ఇప్పుడు తిరుపతి వెంకటేశ్వర ఆలయం, షిరిడీ మందిరం ఆదాయంలో పోటీ పడుతున్నాయి. భక్తులను అయోధ్య రామమందిరం వైపు మళ్లించేందుకు చూస్తున్నారు. దేశంలో భక్తి ముదరటంతో గుళ్లు, గోపురాలు, బాబాలకు డిమాండ్‌ బాగా పెరిగింది. అందుకే అనేక గుళ్లను నవీకరించి రాబడి పెంచేందుకు పూనుకున్నారు. హిందూత్వ రాతలకు ప్రతీకగా ఉన్న ఒపి ఇండియా వెబ్‌సైట్‌లో 2020జనవరి 23న ఒక విశ్లేషణ వెలువడింది. షిరిడీ సాయి బాబా జన్మ స్థలంగా భావిస్తున్న పత్రి అనే చోట బాబా ఆలయాన్ని వృద్ది చేసేందుకు (అప్పటి శివసేన-కాంగ్రెస్‌-ఎన్‌సిపి ) ప్రభుత్వం రు. వంద కోట్లు కేటాయించిందని షిరిడీకి పోటీగా దాన్ని రూపొందించాలని చూస్తున్నదని ఆరోపించారు. ఇప్పటికే పత్రిలో బాబా ఆలయం ఉన్నప్పటికీ దాని గురించి అంతగా ప్రచారం లేదని, దానికి వంద కోట్లు కేటాయించి అభివృద్ధి చేస్తే మతపరమైన టూరిజం మీద ఆధారపడిన షిరిడీలోని జనం ఆర్థికంగా నష్టపోతారని, అందువలన ఆ ప్రతిపాదనకు నిరసనగా షిరిడీలో బంద్‌ కూడా పాటించారని పేర్కొన్నారు. అహమ్మద్‌ నగర్‌ జిల్లాలో ఉన్న షిరిడీ ట్రస్టు మీద పెత్తనం చేస్తున్న ప్రముఖ కాంగ్రెస్‌ నేత రాధాకృష్ణ విఖీ పాటిల్‌ ఆ పార్టీని వదలి బిజెపిలో చేరినప్పటికీ ట్రస్టు మీద పట్టుకోల్పోలేదని, అందువలన దాన్ని దెబ్బతీసేందుకు పత్రి ఆలయ ట్రస్టు మీద పట్టు ఉన్న ఎన్‌సిపి-కాంగ్రెస్‌ దాని వృద్దికి కుట్ర చేశారని ఆ వెబ్‌సైట్‌ ఆరోపించింది.ద్వారకా పీఠం శంకరాచార్య స్వామి స్వరూపానంద అసలు షిరిడీ వెళ్లవద్దని, పూజలు జరపవద్దని ఇచ్చిన పిలుపులో దానికి జనాలకు వచ్చే అర్థిక నష్టకోణం కనిపించలేదు. ఈ రాజకీయాలను ఆ దేవుళ్లు, దేవతలు ఎలా భరిస్తున్నారో కదా !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

వీళ్లు పొట్టకూటి మాయలోళ్లు కాదు : కేరళలో మాదిరి ఈద్‌ రోజున హైదరాబాద్‌ ఇతర చోట్ల బిజెపి ముస్లింలను సంతుష్టీకరిస్తుందా !

14 Friday Apr 2023

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, RELIGION, Religious Intolarence

≈ Leave a comment

Tags

BJP, EID, Kerala BJP, Mohan Bhagwat, Muslims, Narendra Modi, Ramzan, RSS


ఎం కోటేశ్వరరావు


ఈస్టర్‌ రోజున ప్రధాని నరేంద్రమోడీ ఢిల్లీలో ఒక చర్చి ప్రార్ధనలకు వెళ్లగానే క్రైస్తవులందరూ తమ చంకనెక్కినట్లు, ఇదే ఊపులో ఈద్‌ రోజున ముస్లింలను సంతుష్టీకరించి వారిని మరో చంకనెక్కించుకుందామని కేరళలో బిజెపి నిర్ణయించింది. ఈ మేరకు కార్యకర్తలకు ఆదేశాలు కూడా జారీ చేసింది. వీర, శూర హిందూత్వ వాదులకు ఇది మింగుడు పడని అంశమే. వారు మైనారిటీ విద్వేషం అనే పులిని ఎక్కి ఉన్నారు. అధికారం కోసం దేనికైనా నరేంద్రమోడీ సిద్దపడేట్లు ఉన్నారు. ఉన్న ఒక్క అసెంబ్లీ సీటును పొగొట్టుకొని కొరకరాని కొయ్యగా ఉన్న కేరళలో పాగా వేసేందుకు చూస్తున్న బిజెపి ఆత్రం అంతా ఇంతా కాదు. అదే పని ఇతరులు చేస్తే వ్యభిచారం తాము చేస్తే సంసారం అన్నట్లుగా ఫోజు పెడుతోంది. ఒక రాజకీయపార్టీగా జనాభిమానం పొందాలన్న కోరిక ఉండటాన్ని తప్పు పట్టనవసరం లేదు. ఇంతకాలం తమనేతలు, మద్దతుదార్లు చేసిన క్రైస్తవ, ముస్లిం విద్వేష ప్రసంగాలు, ప్రచారాన్ని ఆ సామాజిక తరగతుల వారు మరిచినట్లు, మారుమనసు పుచ్చుకొని ఇతర పార్టీలను వదలి తమ వైపు వచ్చినట్లు బిజెపి భావిస్తున్నది. వారు మరీ అంత అమాయకంగా ఉన్నట్లు భావిస్తున్నారా ? అవకాశ వాదులు ఎక్కడ చూసినా కనిపిస్తున్న ఈ రోజుల్లో అన్ని సామాజిక తరగతుల్లో ఉన్నట్లుగానే వీరిలో కూడా ఉన్నారు. లేకుంటే చెట్టపట్టాలు వేసుకొని తిరగరు. అదే విధంగా మెజారిటీ మతోన్మాదం ఎంత ప్రమాదకరమో మైనారిటీ మతతత్వం కూడా దానికి తక్కువేమీ కాదు. రెండూ ఒకే నాణానికి బొమ్మ బొరుసు వంటివి. ఒకదాన్ని మరొకటి ఆలంబనగా చేసుకొని తమ అజెండాలను అమలు జరుపుతున్నాయి.


కేరళ రాష్ట్ర బిజెపికి మార్గదర్శకుడిగా ఉన్న ప్రకాష్‌ జవదేకర్‌ తాజాగా రీడిఫ్‌ డాట్‌ కామ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ(ఏప్రిల్‌ పన్నెండవ తేదీ)లో చెప్పిన అంశాల సారాంశం ఇలా ఉంది.కేరళలో ఓటు అనుబంధాలు మారతాయి. గత పార్లమెంటు ఎన్నికల తరువాత జన వైఖరి మారింది.నరేంద్రమోడీ సుపరిపాలన ఎలా ఉంటుందో ఇంతకు ముందు కేరళవాసులు చూడలేదు.2019 ఎన్నికల్లో జనం రెండు శిబిరాలుగా చీలారు. ఒకసారి గెలిచిన మోడీ తిరిగి గెలవరని, రాహుల్‌ గాంధీ ప్రధాని అవుతారని అప్పుడు భావించారు.అందుకే కాంగ్రెస్‌కు 20కి గాను పందొమ్మిది ఇచ్చారు.ఈ సారి బిజెపికి కనీసం ఐదు సీట్లు వస్తాయి. క్రైస్తవులు, ఇతర సామాజిక తరగతులు ఇతర ప్రత్యామ్నాయాలను చూస్తున్నారు.కాంగ్రెస్‌ ఓటు బాంకు బాగా పడిపోయింది. క్రిస్మస్‌ రోజు నుంచి వేలాది మంది బిజెపి కార్యకర్తలు వేలాది క్రైస్తవుల గృహాలను సందర్శించారు.వారి సంతోషంలో పాలుపంచుకున్నారు. వారికి కేకులు ఇచ్చారు, వారిని లంచ్‌, డిన్నర్లకు ఆహ్వానించారు.అందరూ సంతోషించారు. మరోలక్ష ఇండ్లను సందర్శించే పధకం ఉంది. మళయాళీ నూతన సంవత్సరం ఏప్రిల్‌ 15న ” విషు ” సందర్భంగా హిందూ కార్యకర్తలు క్రైస్తవులు, ముస్లింల ఇండ్లను సందర్శించి తమ ఇండ్లలో జరిగే ఉత్సవాల్లో పాలుపంచుకోవాలని ఆహ్వానిస్తారు. ఈద్‌ రోజున శుభాకాంక్షలు తెలుపుతారు.


ప్రధాని నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత క్రైస్తవులు సురక్షితంగా ఉన్నారని పొగిడిన సిరో మలబార్‌ కాథలిక్‌ చర్చి అధిపతి మార్‌ జార్జి అలంచెరీ తీరును కాథలిక్‌ పత్రిక ” సత్యదీపం” సంపాదకీయంలో కడిగిపారేసింది. ఒక పత్రిక ఇంటర్వ్యూలో అలంచెరీ మాట్లాడుతూ కేరళలో బిజెపి ప్రజల ఆమోదం పొందుతున్నదని కూడా చెప్పారు.చిన్న చిన్న ప్రయోజనాల కోసం అలా మాట్లాడితే చరిత్ర క్షమించదని హెచ్చరించింది. దేశంలో క్రైస్తవుల మీద పెరుగుతున్న దాడుల గురించి బాధ్యత కలిగిన కాథలిక్‌ చర్చ్‌ ఆఫ్‌ ఇండియా ఆర్చిబిషప్‌ ఒకరు (బెంగలూర్‌ మెట్రోపాలిటన్‌ ఆర్చిబిషప్‌ పీటర్‌ మచాడో) సుప్రీం కోర్టు ముందు ఒక పిటీషన్‌ దాఖలు చేసి ఉండగా అలంచెరీ ఇలా మాట్లాడటం ఏమిటని నిలదీసింది.క్రైస్తవులు, ముస్లింలు, కమ్యూనిస్టులు దేశ అంతర్గత శత్రువులని వర్ణించిన, ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతిగా పనిచేసిన ఎంఎస్‌ గోల్వాల్కర్‌ తన ”ఆలోచనల గుత్తి ” అనే పుస్తకంలో రాసినదాన్ని ఇప్పటికీ బోధిస్తున్నప్పటికీ చర్చి నాయకత్వం తమ బుర్రలను మార్చుకొనేందుకు దోహదం చేసిందేమిటని ప్రశ్నించింది. రాజకీయాలేమీ లేవంటూ బిషప్పులు, క్రైస్తవుల ఇండ్లకు తిరుగుతున్న బిజెపి నేతల రాజకీయం గురించి లౌకిక కేరళ సులభంగానే అర్ధం చేసుకోగలదని పేర్కొన్నది. స్టాన్‌ స్వామిని ఎలా చంపేశారు ? కందమాల్‌ బాధితులకు (2008లో ఒడిషాలోని కందమాల్‌ ప్రాంతంలో అనేక మంది క్రైస్తవులను చంపి, వందలాది చర్చ్‌లను ధ్వంసం చేసిన ఉదంతం) న్యాయాన్ని ఎందుకు నిరాకరిస్తున్నారో తమ వద్దకు వచ్చిన అతిధులను అడగకుండా బిషప్పులు ”రాజకీయ హుందాతనాన్ని ప్రదర్శించారని ” ఎద్దేవా చేసింది.


” హిందూ సమాజం యుద్దంలో ఉంది, అందువలన కలహశీలంగా ఉండటం సహజం.అంతర్గతంగా ఉన్న శత్రువుతోనే యుద్దం. కాబట్టి హిందూ ధర్మం, హిందూ సంస్కృతి, హిందూ సమాజాన్ని రక్షించుకొనేందుకు యుద్దం జరుపుతున్నది. విదేశీ దురాక్రమణలు, విదేశీ ప్రభావం, విదేశీ కుట్రలకు వ్యతిరేకంగా హిందూ సమాజం వెయ్యి సంవత్సరాలుగా పోరులో ఉంది. దీనికి సంఫ్‌ు మద్దతు ఇచ్చింది ”అని ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతి మోహన్‌ భగవత్‌ ఇటీవల తమ పత్రిక ” ఆర్గనైజర్‌ ” తో జరిపిన సంభాషణలో పేర్కొన్నారు. గోల్వాల్కర్‌ చెప్పినదే మరో రూపంలో చెప్పారు. అలాంటి సంస్థ ఏర్పాటు చేసిన బిజెపికి మద్దతు ప్రకటించేందుకు కేరళలోని చర్చి అధికారులు సాకులు చూపుతున్నారు. బంచ్‌ ఆఫ్‌ థాట్స్‌ (ఆలోచనల గుత్తి ) పేరుతో 1940,50 దశకాల్లో ఎంఎస్‌ గోల్వాల్కర్‌ చెప్పిన అంశాలు ఇప్పుడు పనికిరావని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంటి రమేష్‌ నమ్మబలుకుతున్నారు. అ పుస్తకంలోని అంశాలు ఆర్‌ఎస్‌ఎస్‌ నిబంధనావళి కాదని కేంద్ర మంత్రి వి మురళీధరన్‌ అన్నారు. క్రైస్తవులు భారత్‌ గాక తమ విదేశాల్లోని తమ పవిత్ర ప్రాంతానికే విధేయులుగా ఉంటారని, 1857 నుంచి బ్రిటీష్‌ వారితో కుమ్మక్కు అయ్యారని,బలవంతపు మత మార్పిళ్లకు పాల్పడుతున్నారని, క్రైస్తవ మిషనరీలు రక్తం తాగుతారని గోల్వాల్కర్‌ చెప్పిన అంశాలనే ఆర్‌ఎస్‌ఎస్‌ దాని అనుబంధ సంస్థలకు చెందిన వారు ఇప్పటికీ ప్రచారం చేస్తున్నారు. అనేక రాష్ట్రాలలో బిజెపి అధికారానికి వచ్చిన తరువాత ఆ పేరుతో మతమార్పిడి నిరోధ చట్టాలను చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతి మోహన్‌ భగవత్‌ గోల్వాల్కర్‌ భాషలోనే క్రైస్తవ మిషనరీల గురించి మాట్లాడారు. ఆర్‌ఎస్‌ఎస్‌ పత్రిక ఆర్గనైజర్‌ క్రిస్మస్‌, ఆంగ్ల సంవత్సరాదులను విమర్శించింది. రబ్బరు ధరలను పెంచితే కేరళలో బిజెపికి మద్దతు ఇస్తారని తెలిచ్చేరి ఆర్చిబిషప్‌ ఎంజె పంప్లానీ ప్రకటించారు. కొందరు చర్చి నేతలు భూమితో సహా కొన్ని కేసులను ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ సంస్థలను ఉపయోగించి కొందరిని తమకు అనుకూలంగా బిజెపి మార్చుకుంటున్న తీరు తెన్నులు మనకు తెలిసిందే అని మాజీ ఎంపీ సెబాస్టియన్‌ పాల్‌ అన్నారు. గుర్తు చేసుకుందాం అనే పేరుతో ఏప్రిల్‌ 17న ఆర్‌ఎస్‌ఎస్‌ మద్దతుదారులు క్రైస్తవులపై దాడులను వివరించేందుకు ఎగ్జిబిషన్లతో పాటు అన్ని జిల్లా కేంద్రాల్లో సభలు నిర్వహించనున్నట్లు డివైఎఫ్‌ఐ ప్రకటించింది.


తమ అజెండాను జనం మెదళ్లలోకి ఎక్కించేందుకు ఊహాజనితమైన అంశాలను ముందుకు తేవటం, వాటి ప్రాతిపదికగా విద్వేషాన్ని రెచ్చగొట్టటం సంఘపరివార్‌ ఎత్తుగడ అన్నది తెలిసిందే.” ఆర్గనైజర్‌ ” తో జరిపిన సంభాషణలో మోహన్‌ భగవత్‌ చెప్పింది అదే. ” కపటం లేని నిజం ఏమంటే హిందూస్తాన్‌ ఎప్పటికీ హిందూస్తాన్‌గానే ఉండిపోవాలి. నేటి భారత్‌లో నివశిస్తున్న ముస్లింలకు హాని ఉండదు.వారి విశ్వాసానికి వారు కట్టుబడి ఉండాలని కోరుకుంటే వారు ఉండవచ్చు. ఒక వేళ వారు తమ పూర్వీకుల విశ్వాసానికి తిరిగి రావాలంటే వారు రావచ్చు. అది పూర్తిగా వారిష్టం. హిందువుల్లో అలాంటి పంతం లేదు, ఇస్లాం భయపడాల్సిందేమీ లేదు. కానీ ఇదే సమయంలో ముస్లింలు తాము ఉన్నతులమనే ప్రచండమైన వాక్పటిమను వదులుకోవాలి…… జనాభా అసమతూకం అనేది ఒక ప్రధాన ప్రశ్న, దాని గురించి మనం ఆలోచించాలి…..అది ఒక్క జననాల రేటు గురించే కాదు. అసమతూకం ఏర్పడటానికి మతమార్పిడులు, అక్రమ చొరబాట్లు ప్రధాన కారణం. వీటిని నిరోధిస్తే సమతూకం పునరుద్దరణ అవుతుంది.మనం దీన్ని కూడా చూడాలి.” గురువుగా సంఘీయులు భావించే గోల్వాల్కర్‌ బోధనల సారం కూడా ఇదే. ఒక వైపు అవి ఇప్పుడు పనికి రావు అని అదే సంఘీయులు కొందరు మరోవైపు చెప్పటం ఎప్పటికా మాటలాడి అప్పటికి తప్పించుకోవటం తప్ప మరొకటి కాదు. రెండు నాలుకలతో మాట్లాడటం కొందరికి వెన్నతో పెట్టిన విద్య. మేకతోలు కప్పుకున్నప్పటికీ పులి స్వభావం మారదు. కుటుంబనియంత్రణ పాటించకుండా జనాభాను పెంచివేస్తున్నారని,హిందువులు మైనారిటీగా మారనున్నట్లు చేస్తున్న ప్రచారం ఎవరు చేస్తున్నదీ తెలిసిందే.


జనాలకు జ్ఞాపకశక్తి తక్కువ కాదు అసలు ఉండదు అన్నది కొందరి భావన అందుకే గతంలో ఎవరేం చెప్పారో, ఏం జరిగిందో ఒకసారి మననం చేసుకోవటం అవసరం.పాకిస్తాన్‌ జాతిపితగా పరిగణించే మహమ్మదాలీ జిన్నాను పొగిడినందుకు 2005లో ఎల్‌కె అద్వానీ పార్టీ అధ్యక్ష పదవిని పోగొట్టుకున్నారు. ఆ వ్యాఖ్యలకు ఆర్‌ఎస్‌ఎస్‌ తీవ్ర అభ్యంతరం తెలిపినట్లు వార్తలు వచ్చాయప్పుడు. కేంద్ర మంత్రిగా పని చేసిన జస్వంత సింగ్‌ రాసిన పుస్తకంలో జిన్నా గురించి చేసిన సానుకూల వ్యాఖ్యలకు గాను ఏకంగా పార్టీ నుంచే పంపేశారు. హిందువులు-ముస్లింల డిఎన్‌ఏ ఒకటే అని ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతి మోహన భగవత్‌ 2021 జూలై నాలుగున వ్యాఖ్యానించారు. ఘజియాబాద్‌లో ఆర్‌ఎస్‌ఎస్‌ కుదురులోని ముస్లిం రాష్ట్రీయ మంచ్‌ సమావేశంలో ఉపన్యసించారు. అలాంటపుడు జనాభా సమతూకం ఎలా ఉంటేనేం ?దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నట్లు ?
ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతిగా విరమించుకొనేందుకు మోహన్‌ భగవత్‌ తేదీని స్వయంగా ముందుకు జరిపారు అని మరుసటి రోజే మితవాద ప్రతీకగా ఉండే జర్నలిస్టు మధు కిష్వర్‌ ట్వీట్‌ చేశారు. ” హిందూ భావజాలాన్ని ప్రచారం చేసేందుకు ఆర్‌ఎస్‌ఎస్‌ చేస్తున్నదేమీ లేదు, వారు గాంధీ కంటే ఎక్కువ గాంధేయులుగా ఉన్నారు. స్వంత జనాలను, భావజాలాన్ని వారు రక్షించటం లేదు, హిందువులను రక్షించే చిత్తశుద్ది వారిలో లేదని కనుగొన్నాం. వారి కంటే కాంగ్రెస్‌ ఎంతో నిజాయితీగా ఉంది.” అన్నారు. సిబిఐ తాత్కాలిక ఉన్నతాధికారిగా పనిచేసిన సంఘపరివార్‌కు చెందిన రిటైర్డ్‌ ఐపిఎస్‌ అధికారి ఎం నాగేశ్వరరావు గౌహతిలో భగవతి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా విమర్శించారు. ” కేవలం జిన్నాను పొగిడినందుకే అద్వానీని అవమానకరంగా బిజెపి జాతీయ అధ్యక్ష పదవి నుంచి తొలగించారు. ఎంఆర్‌ఎం, సర్వధర్మ సంభవ్‌ లేదా సమాదరణ, ఒకే డిఎన్‌ఏ, రోటీ-బేటీ సంపర్క తదితరాల ప్రచారంతో హిందూ సమాజానికి అంత (అద్వానీ) కంటే పదిలక్షల రెట్ల హాని చేశారు.” అని ట్వీట్‌చేశారు.


ఒపిఇండియా వెబ్‌ సైట్‌ రాసిన వ్యాసంలో డిఎన్‌ఏ వ్యాఖ్యలు ఆర్‌ఎస్‌ఎస్‌ గాంధియన్‌ బలహీనత (దోషం) అని పేర్కొన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ ఎంతో గౌరవం పొందిన సంస్ధ. లౌకికవాదం అనే అబద్దం గురించి మేలుకున్న సామాన్య హిందువులను దూరం చేసుకొనే ప్రమాదాన్ని కొని తెచ్చుకొంటోంది అని హెచ్చరించారు. ”ఆర్‌ఎస్‌ఎస్‌ను స్ధాపించిన గురు గోల్వాల్కర్‌ దాన్ని ఒక హిందూ సంస్దగా ఏర్పాటు చేశారు తప్ప ముస్లింల కోసం కాదు. ముస్లింలు, క్రైస్తవులకు ఓటు హక్కు నిరాకరించాలని కూడా గోల్వాల్కర్‌ చెప్పారు. హిందువులు-ముస్లింలకు సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. ” అని నయా ఇండియా అనే పత్రికలో శంకర షరాన్‌ అనే జర్నలిస్టు పేర్కొన్నారు. ” భగవత్‌ ప్రతి ఒక్కరి సంరక్షకుడు కాదు. ఆయన తన డిఎన్‌ఏ గురించి ఎలా అయినా మాట్లాడవచ్చు. బహుశా ఆయన ఔరంగజేబు డిఎన్‌ఏ పంచుకొని ఉండవచ్చు, అది అందరి విషయంలో వాస్తవం కాదు ” అని ఘజియాబాద్‌లోని దర్శనదేవి దేవాలయ వివాదాస్పద పూజారి యతి నరసింహానంద సరస్వతి వ్యాఖ్యానించారు. ఇక విశ్వహిందూ పరిషత్‌ నేత సాధ్వి ప్రాచీ అయితే ” ఆవు మాంసాన్ని తినేవారెవరినీ ఎన్నడూ మనలో కనుగొనలేము” అన్నారు.

2009 డిసెంబరు నాలుగున ఢిల్లీలోని బాబా సాహెబ్‌ ఆప్టే స్మారక సమితి దేశ విభజన గురించి ఒక జాతీయ గోష్టిని ఏర్పాటు చేసింది. దానిలో మోహన భగవత్‌ ఒక వక్త.దేశంలో నివసిస్తున్న వారందరూ హిందూ వారసులే, ఈ ప్రాంతంలోని వారందరి డిఎన్‌ఏ ఒకటే అని సైన్సు కూడా నిరూపించింది. మనం కోరుకుంటే జాతీయ ఐక్యత మరియు ఏకత్వాన్ని పునరుద్దరించవచ్చు, మనల్ని విడదీస్తున్న విబేధాలను తొలగించుకోవచ్చు అని భగవత్‌ చెప్పారు. ఆర్‌ఎస్‌ఎస్‌ పత్రిక ఆర్గనైజర్‌ నివేదించినదాని ప్రకారం బిజెపి నేత విజయకుమార్‌ మల్హోత్ర చేసిన ప్రసంగం ఎలా ఉందో చూడండి.” హిందువుల జనాభా 90 నుంచి 80శాతానికి తగ్గింది. ముస్లింలు 13శాతానికి పెరిగారు. దేశంలోని అనేక ప్రాంతాలలో ముస్లింలు అధికులుగా ఉన్నారు. జాతీయ సంపదల మీద తొలి హక్కు ముస్లింలకే ఉందని చివరికి ప్రధాని కూడా బహిరంగంగా చెబుతున్నారు. ఇది సిగ్గు చేటు. పాకిస్తాన్‌, ఆప్ఘనిస్తాన్‌, బంగ్లాదేశ్‌ల్లోని ముస్లిం జనాభా ప్రస్తుతం దేశంలోని ముస్లింలను కలుపుకుంటే మొత్తం నలభైశాతానికి పెరుగుతారు, అప్పుడు హిందువుల పరిస్ధితి ఎలా ఉంటుందో సులభంగానే ఊహించుకోవచ్చు.” అన్నారు.


ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతుల్లో ఎంఎస్‌ గోల్వాల్కర్‌కు ప్రత్యేక స్దానం ఉంది. రెండవ అధిపతిగా దీర్ఘకాలం ఉన్నారు. బంచ్‌ ఆఫ్‌ థాట్స్‌(ఆలోచనల గుత్తి ) పేరుతో ఆయన హిందూత్వ గురించి రాసిన అంశాలు పరివార్‌కు ప్రామాణికాలుగా ఉన్నాయి. 2018 సెప్టెంబరులో విజ్ఞాన్‌ భవన్‌లో మూడు రోజుల పాటు ఆర్‌ఎస్‌ఎస్‌ ఉపన్యాసాల కార్యక్రమం జరిగింది. చివరి రోజు ప్రశ్నోత్తరాల సమయంలో మారిన పరిస్ధితులకు అనుగుణ్యంగా లేని గోల్వాల్కర్‌ చెప్పిన అంశాలను కొన్నింటిని తిరస్కరిస్తున్నట్లు భగవత్‌ చెప్పారు. ఇదేదో అనాలోచితంగా చెబుతున్నది కాదు, కొన్ని సంవత్సరాలుగా సంఫ్‌ు అంతర్గత మధనంలో ఉన్నదే, ఇప్పుడు బయటికి చెబుతున్నా, అందరికీ తెలియాల్సిన సమయం అసన్నమైందన్నారు. అదే భగవత్‌ ఏడాది తరువాత 2019 అక్టోబరు 2న ఒక పుస్తకాన్ని విడుదల చేస్తూ ఆర్‌ఎస్‌ఎస్‌కు హెడ్గేవార్‌ ప్రవచించిన హిందూ రాష్ట్ర తప్ప ప్రత్యేక సిద్దాంతం, సిద్దాంతకర్తలంటూ ఎవరు లేరు అని చెప్పారు. నిత్యం ముస్లింలు, ఇతర మైనారిటీల పట్ల విద్వేష ప్రసంగాలు, ప్రచారం చేసే వారందరూ ఆర్‌ఎస్‌ఎస్‌ అంశ నుంచి వచ్చిన వారు లేదా అది తయారు చేసిన ప్రచార వైరస్‌ బాధితులే. అలాంటి శక్తులకు మద్దతు ఇచ్చేందుకు ఇస్లాం, క్రైస్తవ మతాధికారులుగా ఉన్నవారు ముందుకు వస్తున్నారు. ఇక్కడ ప్రతి ఒక్కరూ బిజెపిని ఒక్క ప్రశ్న అడగాలి. కేరళలో ఈస్టర్‌ సందర్భంగా క్రైస్తవులకు కేకులిచ్చి మంచి చేసుకోవాలని చూశారు. ఈద్‌(రంజాన్‌) సందర్భంగా ముస్లింలను కూడా అదే విధంగా కలవాలని నిర్ణయించారు. కేరళ సిఎం పినరయి విజయన్‌ అన్నట్లు గతంలో చేసిన దానికి పశ్చాత్తాపంగా అలా చేస్తే మంచిదే.కేరళలో మాదిరి దేశంలోని ఇతర ప్రాంతాలు అంటే హైదరాబాద్‌ వంటి చోట్ల కూడా బిజెపి అలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తుందా, అసదుద్దీన్‌ ఒవైసి తదితరులను ఆలింగనం చేసుకొని శుభం పలుకుతుందా ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

ఏమి జిమ్మిక్కులురా బాబూ : ఓట్ల కోసం చర్చి ప్రార్ధనల్లో నరేంద్రమోడీ !

12 Wednesday Apr 2023

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, History, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, RELIGION, Religious Intolarence

≈ Leave a comment

Tags

BJP, Christians, Kerala CPI(M), LDF, Narendra Modi, Narendra Modi Failures, Pinarayi Vijayan, RSS, sangh parivar, UDF


ఎం కోటేశ్వరరావు


వెంపలి చెట్టుకు(నేల మీద పాకే ఒక మొక్క) నిచ్చెన వేసి ఎక్కే రోజులు వస్తాయని పోతులూరి వీరబ్రహ్మం చెప్పారన్న ప్రచారం గురించి తెలిసిందే. అల్లుడికి బుద్ది చెప్పిన మామ అదే తప్పు చేసినట్లు ఇంతకాలం మైనారిటీలను సంతుష్టీకరిస్తూ ఓటు బాంకుగా మార్చుకున్నట్లు ఇతర పార్టీలను మీద ధ్వజమెత్తిన బిజెపి, ప్రత్యేకించి నరేంద్రమోడీ ఇప్పుడు ఎంతవారలైనా అధికార కాంతదాసులే అని నిరూపించుకున్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా నరేంద్రమోడీ ప్రధానిగా ఉంటారని మోడీ అంతరంగం అమిత్‌ షా చెప్పారు. మోడీ వేస్తున్న పిల్లి మొగ్గల గురించి కేరళ సిఎం పినరయి విజయన్‌ ఎద్దేవా చేశారు. రక్తం రుచి మరిగిన పులి భిన్నమైన దానికి మొగ్గుచూపుతుందా అని ఒక సభలో అన్నారు. ఇంతకీ ఇదంతా ఎందుకు అంటే ఏప్రిల్‌ తొమ్మిదవ తేదీన ఈస్టర్‌ పండగనాడు ప్రధాని నరేంద్రమోడీ తన మద్దతుదారులైన యావత్‌ హిందూత్వశక్తుల మనోభావాలను దెబ్బతీస్తూ అధికారం తరువాతే అన్నీ అన్న సందేశమిస్తూ ఢిల్లీలోని శాక్రెడ్‌ హార్ట్‌ చర్చ్‌ను సందర్శించి ప్రార్ధనల్లో పాల్గొన్నారు.మామూలుగా అయితే ఎవరైనా ప్రార్ధనా స్థలాలకు వెళ్లటాన్ని తప్పు పట్టనవసరం లేదు. అది వారి వ్యక్తిగత అంశం. ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్దాంతవేత్త ఎంఎస్‌ గోల్వాల్కర్‌ తన ” బంచ్‌ ఆఫ్‌ థాట్స్‌ ” (ఆలోచనల గుత్తి ) అనే పుస్తకంలో దేశ అంతర్గత శత్రువులలో క్రైస్తవులు ఒకరు అని సెలవిచ్చారు. నరేంద్రమోడీ వంటి ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచారకులు అవసరమైతే భగవద్గీతను పక్కన పెట్టి గోల్వాల్కర్‌ రచనను ప్రమాణంగా తీసుకొని పాటిస్తారన్నది తెలిసిందే. మరి ఇప్పుడు తమ గురువును పక్కన పెట్టి మోడీ చర్చికి వెళ్లి సామరస్యత గురించి సుభాషితం పలకటాన్ని చూసి దెయ్యాలు వేదాలను వల్లించినట్లుగా భావిస్తున్నారు.


గతంలో చేసిన దానికి ప్రాయశ్చిత్తంగా చర్చికి వెళ్లి ఉంటే మంచిదే, ఇది అదేనా ? రక్తం రుచి మరిగిన పులి భిన్నమైన దానికి మొగ్గుచూపుతుందా, మరోదారిలో వెళుతుందా ? అని పినరయి విజయన్‌ ప్రశ్నించారు. బిజెపి నేతలు కేరళలోని బిషప్పుల ఇళ్లను సందర్శిస్తున్నారు. కేరళ వెలుపల క్రైస్తవుల మీద వేటసాగిస్తున్నారు. ఇక్కడ వారు అలాంటి వైఖరి తీసుకోలేరు, సంఘపరివార్‌కు ఇక్కడ మైనారిటీల మీద ఏదైనా ప్రత్యేక ప్రేమ ఉందా ? ఇక్కడ గనుక మతతత్వ వైఖరి తీసుకొని మతఘర్షణలను సృష్టిస్తే ప్రభుత్వం కఠిన వైఖరి తీసుకుంటుంది, దీనిలో ఎలాంటి రాజీలేదు అని స్పష్టం చేశారు. సంఘపరివార్‌ అసలు రంగేమిటో జనం చూస్తున్నారు, క్రైస్తవ సమాజానికి తాము దగ్గర అవుతున్నట్లు చూపేందుకు నానా తంటాలు పడుతున్నారు. కేరళలో పాగా వేసేందుకు తమ పుస్తకంలోని అని జిమ్మిక్కులను ప్రయోగిస్తున్నారు అన్నారు. కేరళ టూరిజం మంత్రి మహమ్మద్‌ రియాజ్‌ మాట్లాడుతూ ఆస్ట్రేలియన్‌ మిషినరీ గ్రాహమ్‌ స్టెయిన్‌, అతని కుమారులు ఫిలిప్‌,తిమోతీలను సజీవ దహనం చేయటాన్ని సంఘపరివార్‌ ఇప్పటికీ సమర్ధిస్తున్నది అన్నారు.భజరంగ్‌ దళ్‌కు చెందిన దారా సింగ్‌కు కోర్టు శిక్ష విధించింది. అతను బిజెపిలో కూడా పని చేశాడు.కనీసం 89 మంది పాస్టర్ల మీద దాడులు, 68 చర్చ్‌ల విధ్వంసం, ప్రార్ధనల మీద దాడులు జరిగినట్లు కూడా రియాజ్‌ చెప్పారు. ఇవన్నీ ఒక పథకం ప్రకారం బంచ్‌ ఆఫ్‌ థాట్స్‌ పుస్తకంలో చెప్పిన భావజాలం మేరకే జరిగాయన్నారు. గత రెండు సంవత్సరాల్లో క్రైస్తవుల మీద జరిగిన దాడులకు సంబంధించి వెయ్యికిపైగా కేసుల వివరాలను ఢిల్లీ కేంద్రంగా పని చేస్తున్న యునైటెడ్‌ క్రిస్టియన్‌ ఫోరమ్‌(యుసిఎఫ్‌) వెల్లడించింది. నరేంద్రమోడీ చర్చ్‌ సందర్శన తరువాత అలాంటి దాడులు ఆగిపోతాయనే ఆశ క్రైస్తవుల్లో కలిగిందని క్రైస్తవ వార్తా సంస్థ యుసిఏ పేర్కొన్నది.హిందూ అనుకూల భారతీయ జనతా పార్టీ నేత 2014లో ప్రధాని అయిన తరువాత తొలిసారి చర్చిని సందర్శించినట్లు కూడా పేర్కొన్నది. ఇరవై ఐదు నిమిషాల పాటు నరేంద్రమోడీ చర్చిలో గడిపారు.


ఈస్టర్‌ ఆదివారం నాడు భారత ప్రధాని నరేంద్రమోడీ ఢిల్లీలోని ఒక కాథలిక్‌ చర్చిని అసాధారణంగా సందర్శించారని క్రిస్టియన్‌ పోస్ట్‌ అనే పత్రిక పేర్కొన్నది. మైనారిటీ సామాజిక తరగతుల మీద దాడులకు పేరుమోసిన హిందూ జాతీయవాద పార్టీ నేత క్రైస్తవ ఓటర్లకు దగ్గరయేందుకు చూశారని అన్నది. ఢిల్లీ మైనారిటీ కమిషన్‌ మాజీ సభ్యుడు ఏసి మైఖేల్‌ మోడీ సందర్శన సందర్భంగా ఒక ప్రకటన విడుదల చేశారు. క్రైస్తవుల మీద హింసాత్మక దాడులు 2014లో వంద ఉంటే 2022 నాటికి ఆరువందలకు పెరిగినట్లు పేర్కొన్నారు.ఈ ఏడాది తొలి వంద రోజుల్లోనే 200 ఉదంతాలు జరిగినట్లు వెల్లడించారు. దేశమంతటా క్రైస్తవుల మీద జరుగుతున్న దాడుల వివరాలను సమర్పించాలని 2022 సెప్టెంబరు ఒకటవ తేదీ నుంచి సుప్రీం కోర్టు పదే అడిగినా ఇప్పటి వరకు మూడుసార్లు గడువును పెంచాలని కేంద్ర ప్రభుత్వం కోరిందని, బలవంతంగా మతమార్పిడులు చేస్తున్నారనే సాకుతో దాడులు జరుపుతున్నారని, బలవంతపు మతమార్పిడులకు తగిన ఆధారాలు దొరక్కపోవటమే దీనికి కారణమని అన్నారు. క్రైస్తవుల మీద దాడులు, వేధింపుల్లో భారత్‌ ప్రపంచంలోని అరవై దేశాల్లో పదవ స్థానంలో ఉందని అమెరికాకు చెందిన ఓపెన్‌ డోర్స్‌ అనే సంస్థ తన నివేదికలో పేర్కొన్నది.హిందూ ఉగ్రవాదులు దేశంలో క్రైస్తవులు, ఇతర మైనారిటీలను లేకుండా చేసి దేశాన్ని ప్రక్షాళన చేయాలని చూస్తున్నారని కూడా చెప్పింది.
సంఘపరివార్‌కు చెందిన వివిధ సంస్థలకు చెందిన వారు విద్వేష ప్రసంగాలు, ప్రకటనలు చేయటంలో పేరుమోశారు. మధ్యప్రదేశ్‌కు చెందిన బిజెపి ఎంఎల్‌ఏ రామేశ్వర శర్మ ఛాదర్‌ ముక్త్‌ – ఫాదర్‌ ముక్త్‌ (ముస్లిం, క్రైస్తవ పూజారులు) భారత్‌ కావాలని బహిరంగంగా చెప్పారు. దేశంలో చత్తీస్‌ఘర్‌ క్రైస్తవ విద్వేష ప్రయోగశాలగా మారింది. హిందువులు గొడ్డళ్లు ధరించి మతమార్పిడులకు పాల్పడుతున్న క్రైస్తవులకు బుద్ది చెప్పాలని ఆ రాష్ట్రానికి చెందిన పరమాత్మానంద మహరాజ్‌ పిలుపునిచ్చారు. ఆ సభలో బిజెపి నేతలు కూడా ఉన్నారు. ఇలాంటి వారిని అదుపు చేయకుండా తాము మారినట్లు మైనారిటీలను నమ్మించేందుకు, సంతుష్టీకరించేందుకు బిజెపి నానా పాట్లు పడుతున్నది. కేరళ, క్రైస్తవులు ఉన్న ఇతర ప్రాంతాల్లో బీఫ్‌కు అనుకూలంగా మాట్లాడటమే కాదు, నాణ్యమైన మాంసాన్ని అందిస్తామని కూడా వాగ్దానం చేసిన పెద్దలు ఉన్నారు. కేరళలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ సిఎం ఎకె ఆంటోని కుమారుడు అనిల్‌ ఆంటోనిని బిజెపి ఆకర్షించింది. కేరళ రాజకీయాల్లో ప్రస్తుతం ఏకె ఆంటోనీ ప్రభావమే పెద్దగా లేదు, అలాంటిది కొడుకు బిజెపిలో చేరి ఆ పార్టీని ఉద్దరిస్తారన్నది ఆ పార్టీ పేరాశతప్ప మరొకటి కాదు. తనకు 82 సంవత్సరాలని జీవితాంతం కాంగ్రెస్‌లోనే ఉంటానని ఆంటోని చెప్పారు. తన కుమారుడు బిజెపిలో చేరటం బాధాకరమన్నారు.రబ్బరు మద్దతు ధరలను పెంచితే కేరళ క్రైస్తవులు మొత్తం బిజెపికి మద్దతుదార్లుగా మారతారని ఒక మతాధికారి గతంలో ప్రకటించారు. కానీ కేంద్రం వైపు నుంచి అలాంటి సూచనలేమీ లేవు.


నరేంద్రమోడీ చర్చి సందర్శన ఆటతీరునే మార్చివేస్తుందని కేరళ బిజెపి నేతలు సంబరపడిపోతున్నారు. తిరువనంతపురంలో జరిగిన కోర్‌ కమిటీ సమావేశంలో జరిపిన సమీక్షలో ఒకప్పుడు కేరళ కాంగ్రెస్‌ పక్షాలు పొందిన ప్రజామద్దతు ఇంకే మాత్రం వాటికి ఉండదని భావించినట్లు వార్తలు. పినరయి విజయన్‌ ముస్లిం సామాజిక తరగతుల్లోకి చొచ్చుకుపోయినట్లుగా తాము క్రైస్తవుల్లో చోటు సంపాదించినట్లు ఇంటింటికి తిరిగినపుడు వెల్లడైందని, చర్చి పెద్దలు కూడా సానుకూల సంకేతాలను పంపినట్లు వారు భావిస్తున్నట్లు ఒక పత్రిక రాసింది. తిరువనంతపురం, త్రిసూర్‌ జిల్లాల్లో క్రైస్తవులు గణనీయంగా ఉన్నారని ఈ రెండు లోక్‌సభ నియోజకవర్గాలు తమకు అనుకూలంగా ఉన్నట్లు , క్రైస్తవులు ఎల్‌డిఎఫ్‌, యుడిఎఫ్‌లకు వ్యతిరేకంగా ఉన్నట్లు, వచ్చే రోజుల్లో కాంగ్రెస్‌కు భవిష్యత్‌ లేదని బిజెపి నేతలు అంచనా వేసుకుంటున్నారు. చర్చ్‌ల మీద దాడులు జరుపుతున్నది కొందరు వ్యక్తులని, వారికి ఆర్‌ఎస్‌ఎస్‌-బిజెపితో సంబంధం లేదని అనేక మంది గుర్తిస్తున్నారని, ఉగ్రవాద హిందూత్వ గ్రూపులకు చెందిన వారిని పార్టీ నుంచి బహిష్కరించినట్లు బిజెపి నేతలు చెప్పుకున్నారు.తమను కేవలం మైనారిటీ మోర్చాల్లో కాకుండా బిజెపి, ఇతర ప్రధాన సంస్థల్లో భాగస్వాములుగా చేయాలని క్రైస్తవులు కోరినట్లు, తిరువనంతపురంలో ఒక లక్ష ఈస్టర్‌ శుభాకాంక్షల కార్డులను ముద్రించగా డిమాండ్‌ పెరగటంతో మరో 50వేలు అదనంగా ముద్రించాల్సి వచ్చిందని బిజెపి నేతలు సమావేశంలో చెప్పుకున్నారు.


క్రైస్తవులతో పాటు పసమండా ముస్లింలను కూడా ఆకర్షించేందుకు బిజెపి పూనుకుంది. ఉత్తర ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో, లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క సీటులో కూడా ముస్లింలను నిలపని బిజెపి ఉత్తర ప్రదేశ్‌లో నలుగురు ప్రముఖులను శాసనమండలికి నామినేట్‌ చేసింది. హిందూత్వ పేరుతో జనాన్ని సమీకరించాలని చూసిన బిజెపి కొంత మేరకు సఫలీకృతమై కేంద్రంలో అధికారానికి వచ్చింది.ఇదే సమయంలో అటు సూర్యుడు ఇటు పొడిచినా మొత్తం హిందువులందరూ బిజెపి వెనుక సమీకృతులు కారని తేలిపోయింది. మరోవైపు తొమ్మిదేండ్ల బిజెపి పాలన వైఫల్యాలమయంగా మారింది. ఈ నేపధ్యంలో అధికారాన్ని నిలుపుకొనేందుకు మైనారిటీల సంతుష్టీకరణ తప్ప మరొక మార్గం లేదని భావించి లేదా ప్రపంచంలో హిందూమతోన్మాదశక్తిగా కనిపించకుండా మేకతోలు కప్పుకొనేందుకు గానీ బిజెపి కొత్త ఎత్తులు వేస్తోంది, కొత్త రాగాలు పలుకుతోంది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

కర్ణాటక ఎన్నికలు 2023 : కుమ్ములాటల్లో బిజెపి-కాంగ్రెస్‌లో ఉత్సాహం !

10 Monday Apr 2023

Posted by raomk in BJP, Communalism, Congress, Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Politics, Religious Intolarence

≈ Leave a comment

Tags

BJP, BL Santhosh, BS Yediyurappa, BY Vijayendra, CT Ravi, jds, Karnataka Congress, Narendra Modi



ఎం కోటేశ్వరరావు


అధికార బిజెపి-ప్రతిపక్ష కాంగ్రెస్‌కు ప్రతిష్టాత్మకంగా మారిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు దేశమంతటా ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఏ అంశాన్ని ఎన్నికల అస్త్రంగా ఏ పార్టీ ముందుకు తెస్తుంది అన్నది చూడాల్సి ఉంది.ఇప్పటి వరకు వెలువడిన వార్తలను చూస్తే కాంగ్రెస్‌ శిబిరంలో ఉత్సాహం, బిజెపి దొడ్లో కుమ్ములాటలు కనిపిస్తున్నాయి. ఆదివారం నాడు తమ జాబితాను ప్రకటిస్తామని సిఎం బసవరాజు బొమ్మై చెప్పారు. బిజెపి నేతలంతా ఢిల్లీలో జాబితా గురించి మల్లగుల్లాలు పడుతున్నారు. సోమవారం లేదా మంగళం వారం గానీ జాబితా వెలువడవచ్చని బొమ్మై చెప్పారు. గతంలో కాంగ్రెస్‌ పార్టీ కొన్ని చోట్ల నామినేషన్లు ప్రారంభమైన తరువాత జాబితాలను ప్రకటించిన ఉదంతాలు ఉన్నాయి. కాంగ్రెస్‌ ఇప్పటికే 142 మందితో జాబితాను ప్రకటించింది. బిజెపి జాబితాను బట్టి మిగతా సీట్లకు ప్రకటిస్తారని వార్తలు. బిజెపి అసంతృప్త నేతల కోసం కూడా ఎదురు చూస్తుండవచ్చు. క్రమశిక్షణకు మారుపేరు అని చెప్పుకుంటున్న బిజెపి ఇంతవరకు జాబితాను తేల్చుకోలేకపోవటం బలహీనత, కుమ్ముటాటలకు చిహ్నం.


మొత్తం 224 స్థానాలున్న అసెంబ్లీకి మే పదవ తేదీన ఎన్నికలు, పదమూడవ తేదీన ఫలితాలు వెలువడతాయి. ఈ నెల పదమూడున నోటిఫికేషన్‌, 20వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ,21న పరిశీలన, నామినేషన్ల ఉపసంహరణకు 24వ తేదీని గడువుగా నిర్ణయించారు. ప్రస్తుతం సభలో బిజెపికి 117, కాంగ్రెస్‌కు 75, జెడిఎస్‌కు 27 స్థానాలున్నాయి. ప్రస్తుత అసెంబ్లీ గడువు మే 24వ తేదీ వరకు ఉంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 38.14శాతం ఓట్లు 80 సీట్లు, బిజెపికి 36.85 శాతం ఓట్లు 104 సీట్లు, జెడిఎస్‌కు 18.35 శాతం ఓట్లు 37 సీట్లు వచ్చాయి.జెడిఎస్‌ నేత కుమార స్వామి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్‌ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఏడాది గడచిన తరువాత 2019 జూలైలో కాంగ్రెస్‌,జెడిఎస్‌ల నుంచి కొంత మందిని ఆకర్షించి వారితో రాజీనామాలు ఇప్పించిన బిజెపి సభలో తమకే మెజారిటీ ఉందంటూ ఆ ప్రభుత్వాన్ని కూలదోసి బిఎస్‌ ఎడియూరప్పను సిఎంగా కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఉప ఎన్నికల్లో గెలిచిన సీట్లతో పూర్తి మెజారిటీ సాధించింది. తరువాత బిజెపిలో కుమ్ములాటల కారణంగా 2021 జూలై 26న ఎడియూరప్పతో రాజీనామా చేయించి కొత్త సిఎంగా బసవరాజ్‌ బొమ్మైని గద్దె నెక్కించారు.


ఎన్నికల ప్రకటన వెలువడిన రోజునే బిజెపి ఓడిపోనుందని సర్వే సంస్థలు పేర్కొన్నాయి. కర్ణాటకలో1985 తరువాత ఇప్పటి వరకు ఒకసారి నెగ్గిన పార్టీ మరొకసారి వెంటనే అధికారానికి రాలేదు. ఈ సారి ఆచరిత్రను తిరగరాసి తమ పట్టును శాశ్వతం చేసుకోవాలని బిజెపి చూస్తున్నది. తిరిగి అధికారానికి రావటం ద్వారా వచ్చే లోక్‌సభ ఎన్నికల ముందు దేశమంతటా ఊపు తేవాలని కాంగ్రెస్‌ భావిస్తున్నది.దక్షిణాదిన హిందూత్వ ప్రయోగశాలగా పరిగణిస్తున్న కర్ణాటకలో మత ప్రాతిపాదికన ఓటర్లను చీల్చి లబ్ది పొందాలని బిజెపి, సంఘపరివారం అనేక వివాదాలను ముందుకు తెచ్చి చిచ్చుపెట్టింది. చిత్రం ఏమిటంటే అధికారం వస్తుందని భావిస్తున్న కాంగ్రెస్‌లో ఆశావహులు ఎక్కువగా ఉండి అసంతృప్తి తలెత్తటం సహజం కానీ ఓడిపోతుందని భావిస్తున్న బిజెపిలో కుమ్ములాటలు అంతకంటే ఎక్కువగా ఉండటం విశేషం. ఇప్పటి వరకు బిజెపి అభ్యర్ధులను ప్రకటించలేదు. కాంగ్రెస్‌, జెడిఎస్‌ ఎంతో ముందుగానే ఎక్కువ సీట్లకు అభ్యర్ధులను ప్రకటించాయి. అభ్యర్ధులను ఇంకా ఖరారు చేయకముందే దాదాపు నలభై సీట్లలో బిజెపి తిరుగుబాటును ఎదుర్కోనుందని డెక్కన్‌ హెరాల్డ్‌ పత్రిక ఏప్రిల్‌ ఎనిమిదవ తేదీన రాసింది. అభ్యర్ధుల ఎంపికలో తీవ్ర వత్తిడి ఉన్న మాట నిజమేనని, తాము గెలిచే సీట్లలో ముగ్గురి నుంచి ఐదుగురి వరకు ఆశావహులు ఉన్నారని, ఆ సంఖ్యను రెండు నుంచి మూడుకు తగ్గించి ఒక జాబితాను రూపొందించామని,గెలిచే అవకాశాలు, అధిష్టానం సలహాను బట్టి జాబితాను ఖరారు చేస్తామని ఎడియూరప్ప చెప్పారు. తమను ఎంపిక చేయకుంటే తిరుగుబాటు చేస్తామని అనేక మంది బాహాటంగానే చెబుతున్నారు. సిద్దాంతాలు తప్ప తమకు అధికారం ముఖ్యం కాదని, ఇతర పార్టీలతో పోలిస్తే తమది ఎంతో భిన్నమైనది, క్రమశిక్షణ కలిగిన పార్టీ అని చెప్పుకొనే బిజెపిలో ఇలాంటి ధోరణులు వెల్లడికావటం ఇదే ప్రధమం కాదు. కర్ణాటకతో సహా అనేక రాష్ట్రాలలో అధికారం కోసం ఇతర పార్టీల నుంచి ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న తీరుతెన్నులను చూస్తున్న తరువాత తమకు దక్కని అధికారం ఇతరులకూ దక్కనివ్వం అనే ధోరణి పెరిగి బిజెపి మరో కాంగ్రెస్‌గా మారటం కర్ణాటకలో స్పష్టంగా కనిపిస్తున్నది. దీని ప్రభావం ఎలా ఉండేది చూడాల్సి ఉంది.


2019 ఫిరాయింపుల్లో కీలక పాత్ర పోషించిన మాజీ మంత్రి రమేష్‌ జర్కిహౌలీ తాను కోరిన మూడు సీట్లను తన అనుచరులకు ఇవ్వకుంటే తాను పోటీలో ఉండనని బెదిరించారు. వారసత్వ రాజకీయాలంటూ ఇతర పార్టీల మీద ధ్వజమెత్తిన బిజెపి ఇప్పుడు కర్ణాటకలో అదే సమస్యతో సతమతం అవుతోంది. రాహుల్‌ గాంధీని అనర్హుడిగా ప్రకటించిన ఉదంతం కాంగ్రెస్‌కు ఒక ప్రచార అస్త్రంగా ఉంటుందని భావిస్తున్నారు. ఓబిసిలను అవమానించిందంటూ ప్రచారం చేస్తున్న బిజెపి కూడా దాన్నే ఇక్కడా కొనసాగించవచ్చు. కన్నడిగుల ఓట్ల కోసం మతాన్ని జోడించి ఎంతో ముందుగానే సమీకరణకు పూనుకుంది. ముఠా కుమ్ములాటలకు తోడు నలభైశాతం కమిషన్‌ ప్రభుత్వం అనే పేరు తెచ్చుకుంది. అవినీతి పట్ల కఠినంగా ఉండటంలో విఫలమైనట్లు, బలహీనమైన సింఎంగా బసవరాజ్‌ బొమ్మైని పరిగణిస్తున్నారు.గతంలో సామాజిక సమీకరణలను రెచ్చగొట్టి లబ్దిపొందిన బిజెపికి ఇప్పుడు అవే గుదిబండలుగా మారుతున్నట్లు చెబుతున్నారు. మరోవైపు ఎడియూరప్ప-బిఎల్‌ సంతోష్‌ వర్గాలుగా బిజెపి ఉంది.


ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రముఖుడిగా ఉన్న బిఎల్‌ సంతోష్‌ వర్గనేతలు విద్వేష ప్రచారానికి పెట్టింది పేరని అనేక ఉదంతాల్లో వెల్లడైంది. రాష్ట్ర అధ్యక్షుడు నళిని కుమార్‌ కటీల్‌, రాష్ట్ర మంత్రి సిటి.రవి, కేంద్ర మంత్రి అనంత కుమార్‌ హెగ్డే వంటి వారు హిందూత్వ రాజకీయాలకు కేంద్రంగా ఉండగా ఎడియూరప్ప వర్గం కులసమీకరణల మీద కేంద్రీకరిస్తుంది. బొమ్మై ఈ రెండు గ్రూపుల్లో ఎడియూరప్ప వర్గానికి చెందినట్లు చెబుతారు.హిజబ్‌, టిప్పు సుల్తాన్‌ వివాదాన్ని ముందుకు తెచ్చిన హిందూత్వశక్తుల అజెండాను అమలు జరిపి వారిని సంతుష్టీకరించినట్లు విమర్శలున్నాయి. ముస్లిం వ్యతిరేకతలో భాగంగా ఇప్పటి వరకు ఉన్న నాలుగుశాతం రిజర్వేషన్లను రద్దు చేశారు. వక్కళిగ-లింగాయత్‌ కులాలకు రిజర్వేషన్లను సమం చేసి వారిని సంతుష్టీకరించేందుకు చూశారు. బిజెపి కుమ్ములాటలతో ఉండగా అధికారం కళ్ల ముందు కనిపిస్తుండటంతో కాంగ్రెస్‌లోని ప్రధాన వర్గాలు తాత్కాలికంగా సర్దుబాటు చేసుకున్నట్లు వార్తలు. వక్కళిగ సామాజిక తరగతి మద్దతు ప్రధానంగా ఉన్న జెడిఎస్‌ కూడా పోటీ చేస్తున్నది. స్వంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకున్నా తన బలంతో ఒక నిర్ణాయక శక్తిగా ఉంటున్నది. అటు బిజెపి ఇటు కాంగ్రెస్‌ మద్దతుతో ఆ పార్టీ నేత కుమారస్వామి సిఎంగా పని చేశారు. త్రిముఖ పోటీగా కనిపిస్తున్నప్పటికీ మూడు పార్టీలు కొన్ని ప్రాంతాల్లో మాత్రమే బలంగా ఉండటంతో ఆచరణలో రెండు ప్రధాన పక్షాల సమీకరణే ఎక్కువగా ఉంటున్నది.గత అనుభవాలను చూసిన తరువాత ఈ సారి దానిలో మార్పు వస్తుందా అన్నది ప్రశ్న.


క్రైస్తవుల మీద విద్వేష పూరిత ప్రసంగం చేసి రెచ్చగొట్టినందుకు రాష్ట్ర మంత్రి మునిరత్నపై పోలీసులు కేసు నమోదు చేశారు. మార్చినెల 31న ఒక టీవీ ఛానల్లో మాట్లాడుతూ మురికి వాడల్లో ఉన్న వారిని మతమార్పిడి చేస్తున్న క్రైస్తవులను తన్ని తరిమి కొట్టాలని పిలుపు ఇచ్చినట్లు ఎన్నికల సంఘం బృంద అధికారి మనోజ్‌ కుమార్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మునిరత్న బెంగలూరులోని రాజరాజేశ్వరి నగర్‌నుంచి ప్రాతినిధ్యవహిస్తున్నారు.కన్నడిగులు-తమిళుల మధ్య విద్వేషాన్ని రెచ్చగొడుతున్నట్లు అదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్ధిగా ఉన్న హనుమంతరాయప్ప కూడా మునిరత్న మీద కేసుదాఖలు చేశారు. ఈ ప్రాంతంలో ఎవరైనా అడుగుపెడితే తన్ని పంపండి, నేను చూసుకుంటాను అన్న మంత్రి వీడియోను కూడా పోలీసులకు అందచేశారు. ఇతగాడు సినిమా నిర్మాత కూడా.” ఉరి గౌడ నంజె గౌడ ”అనే పేరుతో ఒక సినిమా పేరు నమోదు చేశారు. వక్కళిగ సామాజిక తరగతికి చెందిన ఆ పేర్లు గల వారు పద్దెనిమిదవ శతాబ్దిలో మైసూరు రాజు టిప్పు సుల్తాన్ను హత్య చేశారన్నది ఒక కథ. దాన్ని చరిత్రకారులు కొట్టిపారవేశారు. తరువాత అంతటితో నిలిపివేశారు.


మాజీ సిఎం ఎడియూరప్పను గద్దె దించటంలో ప్రత్యర్ధులు పై చేయి సాధించారు. ఇక అతని హవా నడవదు అని కొద్ది వారాల క్రితం బిఎల్‌ సంతోష్‌ వర్గానికి చెందిన సిటి రవి బహిరంగంగానే ప్రకటించారు.తాను ఎనిమిదిసార్లు గెలిచిన షికారిపుర స్థానం నుంచి తన కుమారుడు విజయేంద్ర పోటీ చేస్తాడని 2022 జూలైలోనే ఎడియూరప్ప ప్రకటించారు. షికారిపురతో సహా ఎవరు ఎక్కడ పోటీ చేయాలన్నది నిర్ణయించాల్సింది అధిష్టానం తప్ప ఎవరో ఒకరి వంటింట్లో కాదని సిటి రవి అన్నారు.బిఎల్‌ సంతోష్‌ ఎత్తుగడలో భాగంగానే ఈ ప్రకటన చేసి ఉంటారని భావిస్తున్నారు. విజయేంద్ర తండ్రి వారసుడిగా రంగంలోకి వచ్చి నాయకత్వస్థానం కోసం పోటీ పడతారని అనేక మంది బిజెపి నేతలు భావిస్తున్నారు.వారిలో తన కుమారుడిని రంగంలోకి తేవాలని చూస్తున్న అదే సామాజిక తరగతికి చెందిన మంత్రి సోమన్న కూడా చూస్తున్నారు. గతంలో ఇతగాడిని బిజెపికి ఆకర్షించటంలో ఎడియూరప్ప కీలకంగా ఉన్నారు. ఎప్పుడూ ఆ ఒక్క కుటుంబానిదేనా ఆధిపత్యం అన్నది సోమన్న వాదన.


ప్రభుత్వ రంగ కర్ణాటక మిల్క్‌ ఫెడరేషన్‌ విక్రయించే ” నందిని ” పాలను దెబ్బతీస్తూ రాష్ట్ర బిజెపి ప్రభుత్వం గుజరాత్‌కు చెందిన అమూల్‌ను ప్రోత్సహిస్తోందని కాంగ్రెస్‌ ధ్వజమెత్తింది. నందిని మీద ప్రేమ కంటే నరేంద్రమోడీ, అమిత్‌షా మీద ఉన్న ద్వేషాన్ని ఇది సూచిస్తున్నదని బిజెపి ఎంపీ తేజస్వి సూర్య ఆరోపించారు. వారిని ప్రసన్నం చేసుకొనేందుకు ఇదొక అడ్డదారి అని విమర్శకుల వాదన. రాష్ట్రంలో తమిళనాడుకు చెందిన ఆరోగ్య, హెరిటేజ్‌, ఆంధ్రప్రదేశ్‌ నుంచి దాడ్ల, తిరుమల పాలు విక్రయిస్తున్నపుడు అమూల్‌ను ఎందుకు వ్యతిరేకించాలని సూర్య ప్రశ్నించారు. ఇవన్నీ కూడా ప్రైవేటు సంస్థలకు చెందినవి. కర్ణాటక ప్రభుత్వ సంస్థను దెబ్బతీస్తూ మరో ప్రభుత్వ కంపెనీకి ఎర్రతీవాచీ పరవటం ఏమిటన్నది ప్రశ్న.దేశంలో అన్ని ప్రభుత్వ రంగ సంస్థలనూ దెబ్బతీస్తున్న నరేంద్రమోడీ గుజరాత్‌ సంస్థల జోలికి పోకుండా వాటిని రక్షిస్తున్నారన్న విమర్శ ఇప్పటికే ఉంది. కన్నడ సూపర్‌ స్టార్‌ కిచ్చా సుదీప్‌ బిజెపి తరఫున ప్రచారానికి దిగనున్నారు. దీని మీద మరోనటుడు ప్రకాష్‌ రాజ్‌ స్పందించారు. ఒక కళాకారుడిగా అందరి అభిమానం పొందే మీరు ప్రజల వాణిగా ఉంటారనుకున్నాను. కానీ స్వయంగా ఒక పార్టీ రంగు వేసుకున్నారు. మంచిది, ప్రతి పౌరుడు మిమ్మల్ని, మీ పార్టీని అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు సిద్దంగా ఉండండి అంటూ ట్వీట్‌ చేశారు. ఆదాయపన్ను శాఖ దాడుల బెదిరింపుతోనే సుదీప్‌ బిజెపికి ప్రచారం చేస్తున్నట్లు కాంగ్రెస్‌ ఆరోపించింది. మొత్తం మీద కన్నడ ఎన్నికల్లో సినిమా స్టార్ల ప్రచారం ఒక ఆకర్షణగా మారనుంది. జనం ఏదైనా ఒక పార్టీని ఓడించదలచుకున్నపుడు ఎంత పెద్ద స్టార్లు ప్రచారం చేసినా సదరు పార్టీని రక్షించలేదని గతంలో అనేక చోట్ల రుజువైంది. కర్ణాటక దానికి మినహాయింపుగా ఉంటుందా ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...
← Older posts

Recent Posts

  • సరిలేరు నీకెవ్వరూ మోడీ రాజా : మనోభావాలతో నాడు చైనా యాప్‌ నిషేధ ఆట, నేడు అంబానీ కోసం అనుమతి క్రీడ !
  • అబ్బబ్బబ్బ…. ఏమి స్తుతి, ఎన్ని పొగడ్తలు : నరేంద్రమోడీ మూడు దేశాల పర్యటన ఫలితాలేమిటి ?
  • రెండు సభలు – ఒకటి అభివృద్ధికి, రెండవది ఉద్రిక్తతలను పురికొల్పేది !
  • నరేంద్రమోడీ, బిజెపిని నీట ముంచిన కర్ణాటక పాల రైతులు !
  • పాలకవర్గాలను భయపెడుతున్న కమ్యూనిజం !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • సరిలేరు నీకెవ్వరూ మోడీ రాజా : మనోభావాలతో నాడు చైనా యాప్‌ నిషేధ ఆట, నేడు అంబానీ కోసం అనుమతి క్రీడ !
  • అబ్బబ్బబ్బ…. ఏమి స్తుతి, ఎన్ని పొగడ్తలు : నరేంద్రమోడీ మూడు దేశాల పర్యటన ఫలితాలేమిటి ?
  • రెండు సభలు – ఒకటి అభివృద్ధికి, రెండవది ఉద్రిక్తతలను పురికొల్పేది !
  • నరేంద్రమోడీ, బిజెపిని నీట ముంచిన కర్ణాటక పాల రైతులు !
  • పాలకవర్గాలను భయపెడుతున్న కమ్యూనిజం !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • సరిలేరు నీకెవ్వరూ మోడీ రాజా : మనోభావాలతో నాడు చైనా యాప్‌ నిషేధ ఆట, నేడు అంబానీ కోసం అనుమతి క్రీడ !
  • అబ్బబ్బబ్బ…. ఏమి స్తుతి, ఎన్ని పొగడ్తలు : నరేంద్రమోడీ మూడు దేశాల పర్యటన ఫలితాలేమిటి ?
  • రెండు సభలు – ఒకటి అభివృద్ధికి, రెండవది ఉద్రిక్తతలను పురికొల్పేది !
  • నరేంద్రమోడీ, బిజెపిని నీట ముంచిన కర్ణాటక పాల రైతులు !
  • పాలకవర్గాలను భయపెడుతున్న కమ్యూనిజం !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Follow Following
    • vedika
    • Join 236 other followers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Customize
    • Follow Following
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d bloggers like this: