• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: Health

బిజెపి మిత్రోం అదానీ, బికినీలను కాదు సామాన్య జనాన్ని చూడండి !

04 Saturday Feb 2023

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, Economics, Farmers, Filims, Health, History, INDIA, Loksabha Elections, NATIONAL NEWS, Opinion, Others, Prices, RELIGION, Women

≈ Leave a comment

Tags

BJP, Budget-2023-24, Farmers, Fertilizers subsidies, Food Subsidy, india debt, Narendra Modi, Narendra Modi Failures, RSS


ఎం కోటేశ్వరరావు


కేంద్ర ప్రభుత్వం 2023-24 సంవత్సరానికి బడ్జెట్‌ ప్రతిపాదనలు చేసింది. మేం చెప్పాల్సింది చెప్పాం ఇక మీ ఇష్టం అని మంత్రి నిర్మలా సీతారామన్‌ సెలవిచ్చారు. రెండవ సారి తిరుగులేని మెజారిటీతో అధికారానికి వచ్చిన నరేంద్రమోడీ 2.0కు ఇది చివరి బడ్జెట్‌. మూడో సారి 2024లో తిరిగి వస్తారా, ఇంతటితో సరిపెట్టుకుంటారా అన్నది తరువాత చూద్దాం. వివిధ రాష్ట్రాలలో ఈ ఏడాది, వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు గనుక ఇప్పటి వరకు మోడీ సర్కార్‌ సాధించిన ఘనత, తాజా బడ్జెట్‌ గురించి బిజెపి శ్రేణులు ప్రచారం చేసేందుకు జనం ముందుకు రానున్నారు. ఈ తీరు తెన్నులన్నింటినీ ఒక్క విశ్లేషణలో వివరించలేం గనుక కొన్ని ముఖ్య అంశాలను చూద్దాం.


” మోడీ హయాంలో కేంద్ర ప్రభుత్వ మొత్తం అప్పులు రు.169లక్షల 46వేల 666 కోట్లు. ఈ ఏడాది కొత్తగా చేస్తున్న అప్పులు రు.16 లక్షల 85వేల కోట్లు. కడుతున్న వడ్డీలు రు.10లక్షల 79వేల కోట్లు.1947 నుంచి 2014వరకు 67 ఏండ్లలో 14 మంది ప్రధానులు చేసిన అప్పు 56లక్షల కోట్లు. ఎనిమిదేండ్లలో మోడీ చేసిన అప్పు 114లక్షల కోట్లు. దీనికి గబ్బర్‌సింగ్‌ టాక్సు, ప్రభుత్వ ఆస్తులు అమ్మేస్తే వచ్చిన డబ్బు అదనం. ఇంత అప్పుతో దేశంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కానీ, పేదరిక నిర్మూలన అనేది ఎక్కడా జరగలేదు. మరి ఈ డబ్బు ఎక్కడికి పోయింది ? ” అంటూ ఒక పోస్టు వాట్సాప్‌లో తిరుగుతోంది. ఈ వివరాలు మింగుడుపడని మోడీ వీర భక్తులు నిజమేనా అని ప్రశ్నిస్తున్నారు. స్వల్ప సవరణలతో అవి తిరుగులేని వివరాలు, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2023-24 బడ్జెట్‌లో చెప్పిన అంశాలే అని గమనించాలి. 2023 మార్చి 31నాటికి కేంద్ర ప్రభుత్వ అప్పు మొత్తం రు.152,61,122 కోట్ల 12లక్షలకు చేరుతుందని, అది 2024 మార్చి 31కి రు.169,46,666 కోట్ల 85లక్షల కోట్లుగా ఉంటుందని నిర్మలమ్మగారి బడ్జెట్‌ పత్రాల్లో ఉంది.


అచ్చేదిన్‌, తనకు అధికారం ఇస్తే కాంగ్రెస్‌ ఏలుబడిలో తూర్పున పొడిచిన సూర్యుడిని పశ్చిమానికి మారుస్తాను అన్నట్లుగా జనాన్ని నమ్మించిన నరేంద్రమోడీ 2014లో అధికారానికి వచ్చిన నాటికి ఉన్న అప్పు 56లక్షల కోట్లు కాదు. కాగ్‌ ఖరారు చేసిన గణాంకాల ప్రకారం 2014 మార్చి 31నాటికి కేంద్ర ప్రభుత్వ విదేశీ, స్వదేశీ అప్పు మొత్తం రు.50,68,235 కోట్లు కాగా 2015 మార్చి నాటికి అంటే తొలి ఏడాది దాన్ని రు.56,07,315 కోట్లకు పెంచారు. దాని ప్రకారం ఇప్పటి వరకు మోడీ ఒక్కరే చేసిన అప్పు రు.101,92,887 కోట్లను 2024 మార్చి నాటికి 118,78,431కోట్లకు పెంచుతామని ప్రతిపాదించారు. అందువలన ఇంత అప్పుచేసి సాధించిన ప్రగతి ఏమిటి అని అడగటం తప్పంటారా ? కానేకాదు. కాంగ్రెస్‌ పాలకులు 50 ఏండ్లలో సాధించలేని దానిని తాను తొలి ఐదు సంవత్సరాల్లోనే సాధించానని చెప్పుకున్న నరేంద్రమోడీ ఎలాగూ దీని గురించి నోరు విప్పరు.


గ్రామీణ ప్రాంతాలలో కొనుగోలు శక్తి తగ్గినట్లు అనేక నివేదికలు చెబుతున్నాయి. వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ పెరుగుదల వలన రోజు రోజుకూ మానవ శ్రమ పని దినాలు తగ్గుతున్నాయి.వివిధ రాష్ట్రాల నుంచి కోట్లాది మంది వలసలే అందుకు పక్కా నిదర్శనం.కనీసం వంద రోజులు పని కల్పించేందుకు ప్రవేశపెట్టిన ఉపాధి పధకానికి 2021-22లో రు.98,468 కోట్లు ఖర్చు చేస్తే 2022-23లో 89,400 కోట్లకు దాన్ని 2023-24లో రు.60వేల కోట్లకు(32.9శాతం) తగ్గించారు. అంటే గ్రామాల్లో ఇబ్బడి ముబ్బడిగా పని పెరిగింది అనుకోవాలి. ఈ పధకం కింద ఏడాదికి కుటుంబానికి వంద రోజులు పని కల్పించాలని నిర్దేశించారు. గతేడాది సగటున 40 రోజులకు మించలేదు. అందువలన కనీసం లక్షా 40 నుంచి రెండు లక్షల 20వేల కోట్లకు బడ్జెట్‌ను పెంచాలని అనేక మంది డిమాండ్‌ చేశారు. ఏడాది పాటు సాగిన రైతుల ఆందోళనతో దిగి వచ్చి క్షమాపణ చెప్పి మరీ మూడు సాగు చట్టాలను వెనక్కు తీసుకొంటూ కనీస మద్దతు ధరకు హామీ కల్పించాలన్న డిమాండ్‌ను పరిశీలించేందుకు చర్యలు తీసుకుంటామని నరేంద్రమోడీ చెప్పారు. అది ఏమైందో మోడీకే ఎరుక. క్షమాపణ చెప్పే స్థితికి రైతులు తనను నెట్టారన్న కోపమో, పగసాధింపో మరొకటో తెలియదు గానీ 2022-23లో ఎరువులకు ఖర్చు చేసిన రు.2,27,681 కోట్లను రు.1,78,482 కోట్లకు(21.6శాతం) తగ్గించారు.


అదే విధంగా ఆహార సబ్సిడీ రు.2,87,194 నుంచి రు.1,97,350 కోట్లకు(31.3) శాతం కోత పెట్టారు. మొత్తంగా సబ్సిడీలను రు. 5,62,080 నుంచి 4,03,084 కోట్లకు(28.3) శాతం కోత పెట్టారు. వ్యవసాయం-రైతు సంక్షేమ పద్దు కింద 2021-22లో రు.1,22,836 కోట్లు ఖర్చు చేశారు.దాన్ని 2022-23 బడ్జెట్‌లో రు.1,32,14 కోట్లకు పెంచినట్లు గొప్పలు చెప్పారు. ఆచరణలో రు.1,18,913 కోట్లకు కోత పెట్టారు. తాజా బడ్జెట్‌లో దాన్ని రు.1,25,036 కోట్లకు పెంచామని చంకలు కొట్టుకుంటున్నారు. దేశంలో కార్పొరేట్‌ విద్యాసంస్థలు, ఆసుపత్రుల్లో చేరి అప్పుల పాలై తిప్పలు తెచ్చుకున్న కుటుంబాలు మనకు ప్రతి చోటా కనిపిస్తాయి. అలాంటి స్థితిలో కేటాయించిన మొత్తాలను కూడా కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేయకపోవటాన్ని ఏమనాలి ? 2022-23లో విద్యా రంగానికి రు.1,04,278 కోట్లు కేటాయించి రు.99,881 కోట్లు ఖర్చు చూపారు, వర్తమాన బడ్జెట్‌లో రు.1,12,899 కోట్లు ఖర్చు చేస్తామని ప్రతిపాదిస్తే నమ్మేదెలా ? ఇదే పరిస్థితి ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలో ఉంది. గతేడాది రు.86,201 కోట్లని చెప్పి రు.79,145 కోట్లకు కోత పెట్టారు, ఇప్పుడు 89,155 కోట్లు ఖర్చు పెడతామని మనల్ని నమ్మించేందుకు చూస్తున్నారు.


పైన చెప్పుకున్నట్లుగా ఈ ఏడాది కొత్తగా తీసుకోనున్న 16.85లక్షల కోట్ల అప్పును రైతులు, గ్రామీణ కార్మికులు, జనం కోసం గాక ఎవరికోసం ఖర్చు చేయనున్నట్లు ? పారిశ్రామికవేత్తలకు ఉత్పత్తితో ముడిపెట్టి బోనస్‌ ఇస్తామని చెబుతున్నవారు పంట పండించే రైతులను ఎందుకు విస్మరిస్తున్నట్లు ? ఏమిటీ వివక్ష – ఎందుకీ కక్ష ? పఠాన్‌ సినిమాలో హీరోయిన్‌ ధరించిన బికినీ కాషాయ రంగులో ఉన్నందున హిందూ మతానికి ముప్పు వచ్చిందని, సినిమా హాళ్లు తగులబెడతామని నానా రచ్చ చేసిన వారే ఇప్పుడు అదానీ దేశభక్తి గురించి అతని కంపెనీల మీద మన శత్రువులు దాడి చేస్తున్నట్లు గుండెలు బాదుకుంటున్నారు. ఆ పెద్ద మనుషులకు కోట్లాది మంది గ్రామీణులున్న రంగాలు, సబ్సిడీల తగ్గింపు ఎందుకు పట్టలేదు, ఒక్కరు కూడా ఎందుకు నోరు విప్పలేదు, ఏ టీవీ ఛానల్‌ కూడా వీటి మీద ప్రత్యేక చర్చలు ఎందుకు పెట్టలేదు. జనం ఆలోచించాలి, దేవదూతగా భావిస్తున్న మోడీ నోట సినిమాల గురించి అనవసరంగా మాట్లాడవద్దని నేరుగా వెలువడింది, హిండెన్‌బర్గ్‌ నివేదిక వివాదంలో అదానీ కంపెనీల గురించి గాక బడ్జెట్‌ గురించి జనంలో మాట్లాడండని బిజెపి అధిష్టానం నేతలను కోరినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.కనుక మోడీ భక్తులు గతంలో ఉద్రేకంలో ఏ మాట్లాడినా ఇప్పుడు దాన్ని తగ్గించుకొని పునరాలోచించాలి. ఎవరూ మాట మార్చినట్లు అనుకోరు.


ఇటీవలనే ఆక్స్‌ఫామ్‌ సంస్థ కొంత మంది చేతుల్లో పోగుపడుతున్న సంపదలు, ఏటేటా పెరుగుతున్న శత కోటీశ్వరుల గురించి చెప్పింది. కొత్తగా వస్తున్న పరిశ్రమలు, నరేంద్రమోడీ తన పలుకుబడితో తెచ్చిన విదేశీ పెట్టుబడులు, కార్మికుల పిఎఫ్‌ ఖాతాల పెరుగుదల అంకెలను చూడండని ఊదరగొట్టిన అంశాన్ని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవాలి.పరిశ్రమలు పెరిగితే, వాటి నుంచి ఖజానాకు తగినంత పన్ను రావటం లేదు, పోనీ ప్రయివేటు కంపెనీలు తాము పొందిన రాయితీలను తిరిగి పెట్టుబడులు పెట్టిన దేశభక్తికి నిదర్శనంగా ఉపాధి పెరగక పోగా నిరుద్యోగ రేటు ఎందుకు పెరుగుతున్నట్లు ? నరేంద్రమోడీ అధికారానికి రాక ముందు కేంద్ర ప్రభుత్వానికి వివిధ రంగాల నుంచి వస్తున్న పన్నులు, మోడీ ఏలుబడిలో వస్తున్న పన్నుల వసూలు తేడాల గురించి చూద్దాం. అంకెలను కోట్ల రూపాయలుగా గమనించాలి.
వనరు×××× 2014-15 ××× 2022-23××× 2023-24అంచనా
కార్పొరేట్‌×× 4,28,925 ××× 8,35,000 ××× 9,22,675
ఆదాయ ×× 2,65,733 ××× 8,15,000 ××× 9,00,575
కస్టమ్స్‌ ×× 1,88,016 ××× 2,10,000 ××× 2,33,100
ఎక్సైజ్‌ ×× 1,89,953 ××× 3,20,000 ××× 3,39,000
జిఎస్‌టి ×× 1,67,969 ××× 8,54,000 ××× 9,56,600
మొత్తంపన్ను××13,64,524×× 30,43,067×× 33,60,858
రాష్ట్రాలకు ×× 3,82,216××× 9,48,405 ×× 10,21,448
ఎగువ అంకెల్లో గమనించాల్సిన అంశాలు 2014-15లో కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు దక్కిన వాటా 28శాతం కాగా 2020-21లో అది 33.16 శాతం, 2022-23లో31.16శాతం, 2023-24లో 30.3 శాతంగా ఉండనుంది.గత ప్రభుత్వం రాష్ట్రాలకు 32శాతం ఇస్తే తాము 41శాతం ఇచ్చినట్లు బిజెపి చెప్పుకుంది. మరి ఈ అంకెల మతలబు ఏమిటి ? ఈ అంకెలను ఎవరైనా కాదనగలరా ? కార్పొరేట్‌ పన్ను క్రమంగా తగ్గిస్తున్న కారణంగానే గత తొమ్మిది సంవత్సరాల్లో రెండు రెట్లు పెరగ్గా జనాన్ని బాదుతున్న జిఎస్‌టి మాత్రం ఐదు రెట్లు పెరిగింది. ఈ కారణంగానే కార్పొరేట్ల సంపదల పెరుగుదల జన సంపదల తరుగుదల.


కేంద్రం వసూలు చేస్తున్న పన్నుల్లో రాష్ట్రాలకు బదలాయిస్తున్న తీరు తెన్నులు ఎలా ఉన్నదీ చూద్దాం. దీనిలో రాష్ట్రాలకు కేటాయిస్తున్నది పోను మిగిలిందంతా కేంద్రం వద్దనే ఉంటుంది.
వనరు ××× ఏడాది×××× కేంద్రం ×××× రాష్ట్రాలకు ఇస్తున్నది, శాతం
కార్పొరేట్‌×× 2014-15 ×× 4,28,925 ××× 1,18,235 (27.56)
కార్పొరేట్‌×× 2020-21 ×× 5,57,719 ××× 1,79,716 (32.22)
ఆదాయ ×× 2014-15 ×× 2,65,733 ××× 84.431(31.77)
ఆదాయ ×× 2020-21 ×× 4,70,719 ××× 184.271(39.14)
కస్టమ్స్‌ ×× 2014-15 ×× 1,88,016 ××× 54,759 (29.1)
కస్టమ్స్‌ ×× 2020-21 ×× 1,34,750××× 31,529 (23.39)
ఎక్సైజ్‌ ××2014-15 ×× 1,89,953 ××× 30,920 (16.3)
ఎక్సైజ్‌ ××2020-21 ×× 3,89,667 ××× 19,793 (5.07)
జిఎస్‌టి ××2014-15 ×× 1,67,969 ××× 49,142 (29.25)
జిఎస్‌టి ××2020-21 ×× 5,48,778 ××× 1,76,451 (32.15)
ఎగువ అంకెలను చూసినపుడు మోడీ పాలన తొలి సంవత్సరం ఎక్సైజ్‌ మొత్తంలో రాష్ట్రాలకు కేటాయించిన మొత్తానికి, ఏడు సంవత్సరాల తరువాత మొత్తానికి చాలా తేడా ఉన్నది. కారణం ఏమంటే పెట్రోలు, డీజిలు, ఇతర పెట్రో ఉత్పత్తుల మీద ఎక్సైజ్‌ పన్ను తగ్గించి, సెస్‌లను భారీ మొత్తంలో పెంచారు. సెస్‌లో రాష్ట్రాలకు వాటా ఉండదు కనుక కేంద్రానికి అది కామధేనువుగా మారింది. ఇక్కడ గమనించాల్సిందేమంటే రోడ్డు సెస్‌ వసూలు చేస్తారు, అదే రోడ్లకు టోల్‌ టాక్సు వసూలు చేస్తారు, వ్యవసాయ సెస్‌ వేస్తారు ఆ రంగానికి కేటాయింపులు తగ్గిస్తారు, స్వచ్చభారత్‌ సెస్‌ వేస్తారు, పట్టణాల్లో, గ్రామాల్లో కూడా చెత్త పన్ను జనం నుంచి వసూలు చేస్తారు. ఈ తీరు తెన్నుల గురించి ఆలోచించాలా లేదా ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

నరేంద్రమోడీ కనికట్టు గుజరాత్‌ వైఫల్యాలను దాచగలదా !

25 Sunday Dec 2022

Posted by raomk in BJP, Current Affairs, Economics, Health, History, NATIONAL NEWS, Opinion, Political Parties, Uncategorized, Women

≈ Leave a comment

Tags

BJP, Gujarat model, Narendra Modi, Narendra Modi Failures, RSS, Rural daily wages


ఎం కోటేశ్వరరావు


మన జనాలకు జ్ఞాపక శక్తి తక్కువ అని భావిస్తున్నారో లేక పాలకులు చేయించిన సర్వేలలో అలాంటి ఫలితం వచ్చిందేమో తెలియదు గానీ జ్ఞాపకశక్తి తక్కువ అన్న నిర్ధారణకు వచ్చినట్లు కనిపిస్తోంది. ఎందుకంటే సత్య హరిశ్చంద్రుడికి అసలు సిసలు వారసులం, శీలవంతులం అని చెప్పుకుంటున్న వారు కూడా అదే విధంగా ఉన్నారా ? 2022 డిసెంబరు 20న రాష్ట్రాలు, జిల్లాల సామాజిక ప్రగతి సూచికలను విడుదల చేశారు.మౌలిక మానవ అవసరాల ప్రాతిపదికన పోటీ తత్వం, సామాజిక ప్రగతి అవసరం గురించి అధ్యయనం చేసిన ఒక సంస్థ ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలికి సూచికలను అందచేసింది. దాన్ని మండలి అధó్యక్షుడు డాక్టర్‌ వివేక్‌ దేవరాయి అధికారికంగా విడుదల చేశారు. ఉచితాలు-అనుచితాల గురించి దేశంలో ఇంకా చర్చ జరుగుతూనే ఉంది. ఒక వైపు ప్రతిపక్షాల మీద అనుచిత దాడి చేస్తూనే మరోవైపు ఉచితాలను చూపి 2024 లోక్‌సభ ఎన్నికలకు బిజెపి సిద్దం అవుతోంది.దానిలో భాగంగానే మరో ఏడాది పాటు ఉచితంగా ఆహార ధాన్యాలు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని వేరే చెప్పనవసరం లేదు.


ఈ పధకం గురించి గతంలో బిజెపి ఏమి చెప్పింది, ఇప్పుడు ఎలా ప్రచారం చేసుకుంటోంది ? 2013లో నాటి మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం జాతీయ ఆహార భద్రతా చట్టాన్ని తెచ్చేందుకు ఆర్డినెన్స్‌ జారీ చేసింది. పార్లమెంటు సమావేశాలకు ముందు అదెందుకు అని నాడు ప్రతిపక్ష బిజెపి ప్రశ్నించింది. దాని మీద పార్లమెంటు చర్చలో బిజెపి నేత మురళీ మనోహర జోషి ఆ బిల్లు ఆహారం కాదు, కాంగ్రెస్‌ ఓట్ల భద్రత కోసం తెచ్చిందని సెలవిచ్చారు. ఇక బిజెపి మాజీ కేంద్ర మంత్రి శాంతకుమార్‌ పార్టీ అంతరంగాన్ని వెల్లడిస్తూ బహిరంగంగా చెప్పిన అంశాల మీద 2015 జనవరి 23న ఇచ్చిన వార్తకు టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా పత్రిక పెట్టిన శీర్షిక ” జాతీయ ఆహార భద్రతా చట్టాన్ని బిజెపి వ్యతిరేకించిందని చెప్పిన మాజీ ఆహార శాఖ మంత్రి శాంతకుమార్‌ ”, కావాలంటే విదేశీ గూగుల్‌ దేవతను అడిగితే మన స్వదేశీ సమాచారాన్ని కూడా చూపిస్తుంది. ఎందుకంటే వేదాల్లో అన్నీ ఉన్నప్పటికీ మనకు అలాంటి దేవత లేదు మరి. అదే బిజెపి నేతలు ఆహార భద్రత చట్టం కింద ఇస్తున్న వాటి గురించి ఇప్పుడు ఎంతగా ప్రచారం చేసుకుంటున్నదీ తెలిసిందే. కరోనా సాయం పేరుతో 2020 నుంచి 2022 డిసెంబరు వరకు ఉచితంగా ఆహార ధాన్యాలు ఇచ్చే పధకం ముగిసింది. దాన్ని 2023 ఆఖరు వరకు పొడిగించాలని తాజాగా కేంద్ర మంత్రి వర్గం నిర్ణయించింది. ఇది 2024 ప్రారంభంలో జరిగే లోక్‌సభ ఎన్నికల కోసమని ఎవరైనా అంటే అవునో కాదో ఎవరికి వారు నిర్ణయించుకోవచ్చు. జనాలకు తాము ఇప్పటికే నాలుగు లక్షల కోట్ల విలువగల ఆహార ధాన్యాలు సరఫరా చేశామని మరో రెండులక్షల కోట్లు వచ్చే ఏడాది ఖర్చు చేస్తామనే ప్రచారాన్ని బిజెపి ఊదరగొట్టనుంది.


శాంత కుమార్‌ (88) బిజెపిలో వెనుకటి తరానికి చెందిన వారు. అలాంటి వారిలో కొంత మంది పార్టీ ఏదైనా కొన్ని సందర్భాలలో సూటిగా మాట్లాడతారు. ఆహార భద్రతా చట్టాన్ని ప్రారంభం నుంచీ బిజెపి వ్యతిరేకించినప్పటికీ ఎన్నికల ముందు జనంలో చెడుగా చూపే అవకాశం ఉన్నందున సమర్ధించినట్లు చెప్పారు. పార్లమెంటులో చర్చకు వచ్చినపుడు 67శాతం మందిని ఆ చట్టపరిధిలోకి తేవటం చాలా ఎక్కువని చాలా మంది భావించారు, ఎన్నికలే గనుక లేకపోతే అదే చెప్పేవారు. ఎలాగూ తమ ప్రభుత్వం వస్తుందని, దాన్ని సవరిస్తాం గనుక మేము కూడా ఆమోదించామన్నారు. ఇక నరేంద్రమోడీ గుజరాత్‌ సిఎంగా కేంద్రానికి ప్రతిపాదిత ఆ బిల్లు మీద ఒక లేఖ రాశారు. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ఇచ్చే ఆహార ధాన్యాలను నెలకు 35 నుంచి 25 కిలోలకు తగ్గించటం ఏమిటని మండిపడుతూ భద్రత సంగతి సరే ఆ మొత్తంతో అవసరమైన కాలరీల వక్తిని ఎలా సమకూర్చుకోగలరని ప్రశ్నిస్తూ ఆ బిల్లు ఒక మనిషికి రెండు పూటలా తిండికి హామీ ఇవ్వటం లేదన్నారు. నిజంగా ఎంత చక్కగా చెప్పారు. చిత్రం ఏమిటంటే ఆ తరువాత మూడోసారి లోక్‌ సభ ఎన్నికలకు పోతున్నప్పటికీ సరఫరాను ఒక్క కిలో కూడా పెంచలేదు. బిజెపి నేత మురళీ మనోహర జోషి బిల్లుకు ప్రతిపాదించిన సవరణల్లో ఆహార ధాన్యాలతో పాటు పప్పులు, నూనె కూడా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సదరు జోషి ఇప్పుడు బిజెపి మార్గదర్శక మండలి సభ్యుడిగా ఉన్నారు.తన ప్రతిపాదన గురించి మోడీకి చెప్పారో లేదో లేక చెప్పినా ఊడగొట్టిన నాగటి దుంపలతో మనకు పనేమిటని, ఎన్నికలకు ముందు అనేకం చెబుతాం అన్నింటినీ అమలు జరుపుతామా అని మోడీ పట్టించుకోలేదో మనకు తెలియదు.


ప్రపంచ ఆకలి సూచికలో మన దేశ స్థానం పడిపోతున్నది తప్ప మెరుగుపడటం లేదు. 2022లో అంతకు ముందున్న 101 నుంచి 107కు దిగజారింది. మదింపు సరిగా జరగటం లేదని ప్రతిసారీ బిజెపి, కేంద్ర ప్రభుత్వం కూడా చెబుతున్నది. దాని సంగతి పక్కన పెడితే ప్రపంచ సంస్థలు మన సూచికను పెంచే వరకు లేదా అసలు అన్నార్తులు లేరు అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించే వరకు ఉచితంగా ఆహార ధాన్యాలను ఇవ్వాల్సి ఉంటుంది. అంత మాత్రాన బిజెపి రాజకీయాన్ని జనం దృష్టికి తేకుండా ఉండాల్సిన అవసరం లేదు. తాజాగా కేంద్ర ఆహార మంత్రి పియుూష్‌ గోయల్‌ గారు తమ ప్రధాని చారిత్రాత్మక నిర్ణయం తీసుకొని ఏడాది పాటు 81.35 కోట్ల మందికి ఉచితంగా ఆహార పంపిణీ జరపనున్నట్లు జేజేలు పలికారు. ఈ పధకాన్ని దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారికి అమలు జరపాలి. 2014 నుంచి మూడేండ్ల వరకు అమలు జరపాలని 2013లో నిర్ణయించారు. తరువాత అవసరాన్ని బట్టి అమలు చేస్తున్నారు. కానీ ఇంతవరకు దారిద్య్రరేఖకు ప్రాతిపదికను కేంద్ర ప్రభుత్వం తేల్చలేకపోతోంది. కొన్ని అంచనాల ప్రకారం 22శాతం మంది అంటున్నారు. ఎనభై ఒక్క కోట్ల మందికి ఉచితంగా ఆహార ధాన్యాలంటే ఈ లెక్కన దేశంలో దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారు 58శాతంగా చెప్పాలి. మోడీ సర్కార్‌ తొమ్మిది సంవత్సరాల్లో సాధించిన ప్రగతిగా దీన్ని చెప్పుకుంటారా ? లేక పాలక పార్టీకి ఓట్ల కోసం ప్రజల సొమ్ముతో అర్హత లేని వారికి కూడా ఇస్తున్నారా ? సమాధానం చెప్పేవారెవరు ? పరిస్థితి ఇలా ఉంటే పేదలకు అనుచితంగా ఉచితాలను ఇస్తున్నారని, గుజరాత్‌లో అలాంటి పధకాలు, ప్రలోభాలను తిరస్కరించారని ప్రధాని నరేంద్రమోడీ చెప్పారు. ఇది నిజమేనా ?


వివిధ రాష్ట్రాల్లో ఇస్తున్న ఉచితాల మంచి చెడ్డల గురించి భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఉచితాలు వస్తు, ధన, సేవలు ఏ రూపంలో ఉన్నా వాటిని పొందిన వారు ఆమేరకు వాటికోసం ఖర్చు చేయాల్సిన మొత్తాలను ఇతర వాటికి వినియోగదారుల రూపంలో వెచ్చిస్తే ఆ మేరకు మార్కెట్‌ పెరిగి అది దేశాభివృద్దికే తోడ్పడుతుందన్నది ఒక వాదన, కనిపించే వాస్తవం. కానీ పరిశ్రమలను పెట్టక ముందే ఏటా లక్షల కోట్ల మేరకు రాయితీల రూపంలో లబ్ది చేకూర్చుతున్న కార్పొరేట్లకు ఉత్పాదకతతో ముడిపెట్టిన ప్రోత్సాహకాల పేరుతో కేంద్రం మరికొన్ని రాయితీలను ఇస్తున్నది. లబ్ది పొందిన కంపెనీలు ఆ మేరకు పెట్టుబడులు పెట్టి ఉంటే మన పారిశ్రామిక ఉత్పాదకత, ఉపాధి ఎందుకు పెరగటం లేదు ?


ప్రపంచ ఆహార, వ్యవసాయ సంస్థ(ఎఫ్‌ఏఓ) 2020లో వేసిన అంచనా ప్రకారం మన దేశంలో తీవ్ర ఆహార కొరతతో 22 కోట్ల మంది, ఒక మోస్తరు నుంచి తీవ్రంగా ఉన్న వారు 62 కోట్ల మంది ఉన్నట్లు పేర్కొన్నది. ప్రపంచానికి ఆహార ఎగుమతులు చేస్తున్న మన దేశంలో ఆకలి ఏమిటని కొందరు అడుగుతారు. లేదని నమ్మించ చూస్తారు. ఆఫ్రికాలో వజ్రాలు, బంగారు గనులున్నా అక్కడ ఎంత మంది చేతిలో అవి ఉన్నాయి ? అలాగే మన జనాల్లో రెండు పూటలా తిండి తినేందుకు అవసరమైన వాటిని కొనుగోలు చేసే శక్తి ఎందరికి ఉంది? నిజానికి అలాంటి శక్తే ఉంటే పిల్లలు, మహిళల్లో రక్తహీనత ఎందుకు ఉన్నట్లు ? ఆరు నెలల నుంచి ఐదు సంవత్సరాల మధ్య వయసులో ఉన్న పిల్లల్లో రక్తహీనత ఉన్నవారు 2015-16తో పోలిస్తే 2019-21 కాలంలో 58.6 నుంచి 67.1శాతానికి పెరిగినట్లు 2022 ఆగస్టు 5న కేంద్ర ఆరోగ్య మంత్రి మాండవీయ పార్లమెంటులో ప్రకటించారు. ఇది మన ప్రభుత్వ సర్వే ప్రకారమే తేలింది. దీనికి కారణం ఏమిటి ? మెజారిటీ రాష్ట్రాల్లో రెండింజన్ల సర్కార్లే ఉన్నాయి. గుజరాత్‌లో పరిస్థితి మరీ దారుణం. జాతీయ సగటు కంటే ఎక్కువగా గడచిన ఐదు సంవత్సరాల్లో పిల్లల్లో రక్తహీనత 62.6 నుంచి 79.7శాతానికి పెరిగింది, తీవ్ర పరిస్థితిలో ఉన్నవారు 1.7 నుంచి 3.1శాతానికి పెరిగారు. పిల్లలే కాదు,స్త్రీ, పురుషులందరిలో రక్తహీనత పెరిగింది. ప్రతివారం పండ్లు తీసుకొనే వారు దేశంలో సగటున 56.1శాతం ఉంటే అభివృద్ధి చెందిన గుజరాత్‌లో 39.8 శాతమే.(2022 మే 23 టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా ). దీనికి ఏమంటారు ?జాతీయ వినియోగ ఖర్చు గురించి 2017-18 సర్వే వివరాలను మోడీ ప్రభుత్వం తొక్కి పెట్టింది. తరువాత అసలు సర్వే ఊసే లేదు.


సమగ్ర జాతీయ పోషకాహార సర్వే (సిఎన్‌ఎన్‌ఎస్‌ ) 2016-18 ఆధారంగా 2022 ఏప్రిల్‌లో రక్తహీనత ముక్త భారత్‌ సంస్థ విడుదల చేసిన వాస్తవాల పత్రం ప్రకారం దేశంలో ఉన్న పరిస్థితితో కేరళను పోల్చితే పరిస్థితి ఇలా ఉంది. (అంకెలు శాతాల్లో )
వయసు సంవత్సరాలు ××× దేశ సగటు ××× కేరళ
1 నుంచి 4 బాలికలు ××× 40.5 ×××××× 13.1
1 నుంచి 4 బాలురు ××× 40.6 ×××××× 12
5 నుంచి 9 బాలికలు ××× 24.7 ×××××× 2.8
5 నుంచి 9 బాలురు ××× 22.3 ×××××× 3.3
10 నుంచి19 బాలికలు××× 39.6 ×××××× 13.7
10నుంచి 19 బాలురు ××× 17.6 ×××××× 4.1
రెండింజన్ల బిజెపి పాలిత రాష్ట్రాలు, సంక్షేమ పధకాల అమలు గురించి గొప్పలు చెప్పుకుంటున్న ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణా వంటి రాష్ట్రాల్లోనూ పరిస్థితి దారుణంగా ఉంది. ఐదవ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 2019-21 ప్రకారం చూసినా కేరళలో పరిస్థితి మెరుగ్గా ఉంది. నాలుగవ సర్వేతో పోలిస్తే ఐదవ సర్వేలో దేశంలో దేశం మొత్తంలో రక్తహీనత సమస్య పెరిగింది.


ఇక 2022 సామాజిక ప్రగతి సూచికను చూస్తే బిజెపి రెండింజన్ల ప్రభుత్వాల వైఫల్యం గురించి చెప్పుకుంటే సిగ్గు చేటు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల సూచికలను చూస్తే 36కు గాను బిజెపి ఏలుబడిలోని అసోం 34, మధ్య ప్రదేశ్‌ 33, ఉత్తర ప్రదేశ్‌ 31, గుజరాత్‌ 22, హర్యానా 21, వైసిపి పాలనలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ 23, తెలంగాణా 26వ స్థానంలో ఉంది.తమిళనాడు, కేరళ 6,9 స్థానాల్లో ఉన్నాయి.తొలి ఐదు స్థానాల్లో పుదుచ్చేరి,లక్ష ద్వీప్‌, గోవా, సిక్కిం, మణిపూర్‌ ఉన్నాయి.


ఉచితాల గురించి ఆర్‌బిఐ విడుదల చేసిన ఒక నివేదికలో 2022-23 బడ్జెట్లలో కేరళలో సున్నా కేటాయింపులున్నట్లు పేర్కొన్నది.తొలి రెండు స్థానాల్లో పంజాబ్‌, ఆంధ్రప్రదేశ్‌ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వివరాల ప్రకారం 2022 మార్చి ఆఖరుకు మధ్య ప్రదేశ్‌, గుజరాత్‌ రాష్ట్రాలలో పురుష వ్యవసాయ కార్మికులకు అతి తక్కువగా రోజువారీ సగటు వేతనం రు,217.8, 220.3 చొప్పున ఉండగా కేరళలో రు.726.8 ఉంది. నిర్మాణ రంగంలో రు.837.7 కాగా గుజరాత్‌లో రు.373 ఇస్తున్నారు. దేశ కార్మిక శాఖ విడుదల చేసిన సమాచారం ప్రకారం దేశంలోని గ్రామీణ ప్రాంతాలో వ్యవసాయెతర పనులకు 2020-21లో సగటు వేతనం రు.315.3 కాగా ఆంధ్రప్రదేశ్‌లో రు.305.3 ఉండగా కేరళలలో అది రు.677.6 ఉంది. అందుకే అంటారు, జనాలకు చేపలను తెచ్చి పెట్టటం ఉచితం అదే చేపలను పట్టటం నేర్పితే సాధికారత. ఏడాదికి వంద రోజులు సగటున పని దొరికిందనుకుంటే ఆంధ్రప్రదేశ్‌లో రు.30,530 రాబడి ఉంటుంది. అదే కేరళలో రు.67,776 వస్తుంది. అందుకే అక్కడ ఉచితాలతో పని లేదు, ఉచితాలు ఇచ్చిన చోట, ఇవ్వని చోటా మానవాభివృద్ది లేదు. దేశమంటే అదానీ, అంబానీలు కాదు, మనుషులు అన్నపుడు గుజరాత్‌లో మనుషులెందుకు అంతగా అధ్వాన్న జీవితం గడుపుతున్నారో వేరే చెప్పాలా ? కనికట్టుతో గుజరాత్‌లో అంతా బాగుంది అంతా బాగుంది అని నరేంద్రమోడీ గారడీ చేస్తే కుదరదు, తన పాలన వైఫల్యాలు దాస్తే దాగేవి కాదు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

ప్రపంచాన్ని భయపెడుతున్న మంకీపాక్స్‌ వెనుక అమెరికా హస్తం ఉందా ?

22 Sunday May 2022

Posted by raomk in Current Affairs, Health, History, INTERNATIONAL NEWS, Opinion, Science, UK, Uncategorized, USA

≈ 1 Comment

Tags

BILL GATES, Monkeypox, Monkeypox Conspiracy Theory, Monkeypox goes global, Monkeypox Vaccines, Smallpox


ఎం కోటేశ్వరరావు


ఒకనాడు కేవలం ఆఫ్రికా ఖండానికే పరిమితం అనుకున్న మంకీపాక్స్‌ వైరస్‌ ఇప్పుడు ప్రపంచాన్ని ఆవరించనుందా ? కరోనా మాదిరి మహమ్మారిగా మారనుందా ? నివృత్తి జరిగేంతవరకు అనేక అనుమానాలు, సందేహాలు వెలువడుతూనే ఉంటాయి. తెలుగు నాట మసూచి, పెద్ద అమ్మోరు, స్ఫోటకంగా పిలిచిన వైరస్‌కు ఇది సోదరి. ప్రస్తుతానికి అలాంటి తీవ్ర హెచ్చరికలు వెలువడలేదుగానీ కరోనా నేపధ్యంలో అనేక వార్తలు భయపెడుతున్నాయి. ఇది పాక్స్‌ జాతికి చెందిన వైరస్‌గా కోతుల్లో గుర్తించినందుకు దానికి మంకీపాక్స్‌ అని పేరు పెట్టారు. ఇది మసూచికి సంబంధించిందైనప్పటికీ అంతటి ప్రమాదకారి కాదని కొందరు అంటున్నా ,అప్పుడే నిర్దారించలేమని మరికొందరు హెచ్చరిస్తున్నారు.వరియోలా మేజర్‌, వరియోలా మైనర్‌గా పిలిచిన వైరస్‌లు మసూచి కారకాలు, ఇది గతశతాబ్దిలో 30 కోట్ల మందిని, అంతకు ముందు మరో ఇరవై కోట్ల మందిని బలితీసుకుందని అంచనా.పదహారవ శతాబ్దిలో బ్రిటన్‌లో దీన్ని స్మాల్‌పాక్స్‌ అని పిలిచారు.1980లో ప్రపంచంలో పూర్తిగా నిర్మూలించినట్లు ప్రకటించి ఈ వైరస్‌ ఇప్పుడు అమెరికా, రష్యాల్లోని రెండు పరిశోధనా సంస్ధలలో మాత్రమే ఉంది.


ఐరోపా, ఉత్తర అమెరికా, ఆసియా ఖండాల్లోని 14 దేశాల్లో మే నెల మూడవ వారం వరకు 120 నిర్దారణ లేదా అనుమానాస్పద కేసులు నమోదైనాయి. ఒక ప్రాంతంలోని జనాభాతో మరొక ప్రాంత జనాభాకు సంబంధలేనప్పటికీ ఇన్ని చోట్ల వ్యాప్తి చెందటం ఆసక్తి కలిగిస్తున్నదని ఆఫ్రికాలోని కాంగోలో పదేండ్ల క్రితం ఈ వైరస్‌ మీద పరిశోధన చేసిన అమెరికా శాస్త్రవేత్త అనే రిమోయిన్‌ చెప్పారు. ఇది మసూచి సంబంధిత వైరస్‌ కనుక కరోనా మాదిరి వ్యాప్తి చెందదని మరోశాస్త్రవేత్త జే హూపర్‌ అన్నారు. ఇది సోకిన వ్యక్తులు దగ్గినపుడు అతి సమీపంలోని వారికి మాత్రమే సోకే అవకాశం ఉందన్నారు. ఇది సోకిన వారు ఎలాంటి చికిత్సలేకుండానే కొన్ని వారాల తరువాత ఎక్కువ మంది కోలుకుంటారని కూడా హూపర్‌ అంటున్నారు. ఇది ప్రాధమిక దశలో ఉన్నందున ఇప్పటికిప్పుడే నిర్ధారణగా దేన్నీ చెప్పలేమని మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉందని మరో వైరాలజిస్టు గుస్తావ్‌ పాలాసియో చెప్పారు. ఆఫ్రికా దేశాల్లో ఇది కనిపించినప్పటికీ ఐరోపా, అమెరికాల్లో వ్యాప్తి చెందటానికి ఉన్న సంబంధం ఇంకా తెలియలేదు.ప్రస్తుతానికి మన దేశంలో ఈ వైరస్‌ దాఖల్లాలేవు. సోకిన దేశాల నుంచి వచ్చిన వారి మీద నిఘావేసి, లక్షణాలున్నవారి నుంచి రక్త నమూనాలను సేకరించాలని ఆదేశించారు.స్త్రీ-పురుషుల సంపర్కం ద్వారా మంకీపాక్స్‌ వ్యాపించదని భావించిన ఈ వైరస్‌ ఇప్పుడు ఆ అభిప్రాయాన్ని మార్చుకొనేట్లు చేసింది. బ్రిటన్‌లో వెలువడిన కేసులలో ఎక్కువ మంది స్వలింగ, ద్విలింగ సంపర్క పురుషుల్లో కనిపించింది.


సంబంధం లేని దేశాల జనాభాలో ఇది కనిపించటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. మసూచి(స్మాల్‌పాక్స్‌)ను పూర్తిగా నిర్మూలించినందున దాని సోదరి మంకీపాక్స్‌ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఇంతకాలంగా భావిస్తున్నారు. బలహీనం, రోగనిరోధకశక్తి తక్కువగా ఉండేవారిలో మంకీపాక్స్‌ సోకవచ్చని భావిస్తున్నారు.కాంగోలో కనిపించిన తరువాత 39 ఏండ్లకు 2017 నుంచి నైజీరియాలో రెండువందల నిర్ధారిత, ఐదు వందల అనుమానాస్పద కేసులు నమోదయ్యాయి. 2003లో ఘనా నుంచి దిగుమతి చేసుకున్న ఎలుకల నుంచి అమెరికాలోని ఇల్లినాయిస్‌ కుక్కలకు తరువాత 70 మంది మనుషులకు సోకింది. తాజాగా వివిధ దేశాల్లో కనపడిన కేసుల వెనుక బిల్‌గేట్స్‌ హస్తం ఉందంటూ కొన్ని కుట్ర సిద్దాంతాలు ఇప్పుడు చక్కర్లు కొడుతున్నాయి. వాక్సిన్ల తయారీలో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెడుతున్న బిల్‌గేట్స్‌ వాటిని అమ్ముకొనేందుకు వైరస్‌లను కూడా సృష్టిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఏడాది క్రితం ఒక సభలో మాట్లాడిన బిల్‌గేట్స్‌ త్వరలో మరో పెద్ద మహమ్మారిని ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలని, దీని కోసం ప్రపంచ ఆరోగ్య సంస్ద కొత్త సంస్దను ఏర్పాటు చేయాలని, జీవాయుధాలుగా వైరస్‌లను ఉగ్రవాదులు వినియోగించవచ్చని హెచ్చరించాడు. ఆ మాటలకు ఇప్పుడు జరుగుతున్న వాటికి సంబంధం కలిపి వార్తలు వెలువడుతున్నాయి. అంతకు ముందు కూడా గేట్స్‌ ఇలాగే మాట్లాడిన ఉదంతాలున్నాయి. గతవారంలో పెద్ద మొత్తంలో మంకీపాక్స్‌ వాక్సిన్ను అమెరికా కొనుగోలు చేయటం వాటికి ఊతమిస్తున్నాయి.


బ్రిటన్‌లో తొలికేసు నైజీరియా వెళ్లి వచ్చిన పురుషుడిది కాగా తరువాత వారికి ఎలాంటి ప్రయాణ చరిత్ర లేదు. అమెరికాలోని మసాచుసెట్స్‌లో ఒకరికి నిర్దారణైంది. అతను ఇటీవలే కెనడా వెళ్లి వచ్చినట్లు తేలింది. దాంతో 119మిలియన్‌ డాలర్ల విలువగల మంకీపాక్స్‌ వాక్సిన్లు సరఫరా చేయాలని అమెరికా సర్కార్‌ కోరిందని బవేరియన్‌ నోర్డిక్‌ కంపెనీ ప్రకటించింది. అంతకు ముందే ఇచ్చిన ఆర్డర్‌తో కలిపితే 299 మిలియన్‌ డాలర్లని, కోటీ30లక్షల డోసులమేర కొనుగోలు చేసినట్లు వార్తలు వచ్చాయి. వీటిని 2024,25లో సరఫరా చేస్తారు. మంకీపాక్స్‌ సోకినవారిలో నూటికి పది మంది మరణించినట్లు గత సమాచారం వెల్లడిస్తున్నది.
మంకీపాక్స్‌ను పరిశోధనకు తెచ్చిన కోతుల్లో 1958లో కనిపించింది.మానవుల్లో తొలికేసు 1970లో నమోదైంది. ఇది వివిధ పద్దతుల్లో , రకరకాలుగా సోకే అవకాశం ఉంది. వైరస్‌ ఉన్న జంతువు మనిషిని కరచినా, దాని రక్తం, స్రవించిన ద్రవాలను ముట్టుకున్నా, ఈకలను తాకినా రావచ్చు. ఎలుకలు, ఉడుతలు, వైరస్‌ సోకిన జంతుమాంసాన్ని సరిగా ఉడికించకుండా తిన్నా ఈ వైరస్‌ సోకుతుంది. సంభోగం ద్వారా కూడ సంక్రమించవచ్చు. మనుషుల్లో జ్వరం, కండరాల నొప్పి,దద్దుర్లు, గాయాలుకావటం, చలి వంటి లక్షణాలుంటాయి. సాధారణంగా వైరస్‌ సోకిన తరువాత ఐదు నుంచి 21 రోజుల్లో లక్షణాలు కనిపించవచ్చు.


2003 అక్టోబరు 29న న్యూసైంటిస్టు డాట్‌కామ్‌లో డెబోరా మెకంజీ అనే విశ్లేషకుడు ” అమెరికా వృద్ధి చేసిన ప్రాణాంతక వైరస్‌లు ” అనే పేరుతో రాశారు. అమెరికా ప్రభుత్వ నిధులతో పరిశోధనలు చేసిన ఒక శాస్త్రవేత్త మసూచి వైరస్‌ నుంచి జన్యుమార్పిడితో ప్రమాదకర మౌస్‌పాక్స్‌ను తయారు చేసినట్లు పేర్కొన్నారు.యాంటీ వైరల్‌ వాక్సిన్లు ఇచ్చినప్పటికీ ఇది సోకిన ఎలుకలు మరణించాయి. తరువాత కౌపాక్స్‌(ఆవు) వైరస్‌ను కూడా రూపొందించారు. ఇలా రూపొందించిన వాటిని ప్రమాదకారులుగా మార్చేందుకు కూడా వీలుంది. మానవుల్లో కూడా వైరస్‌ను ప్రవేశపెట్టేవిధంగా మార్చ వచ్చని 2003నాటి ఆర్టికల్‌లో హెచ్చరించారు. లాభాల కోసం ఎంతకైనా తెగించే అమెరికన్లు దేనికైనా పాల్పడతారని చరిత్ర రుజువు చేసింది.


ఐరోపాలో స్మాల్‌పాక్స్‌, మంకీపాక్స్‌, కౌపాక్స్‌ చికిత్సకు ” టెకోవిరిమాట్‌” అనే ఔషధాన్ని అనుమతించారు.దాన్ని టిపాక్స్‌ పేరుతో విక్రయిస్తున్నారు. అమెరికాలో స్మాల్‌పాక్స్‌కు మాత్రమే అనుమతించారు.తాజాగా వ్యాపిస్తున్న మంకీపాక్స్‌ పాతదేనా కొత్త రకమా అన్నది ఇంకా నిర్దారణ కాలేదు. అనేక దేశాల్లో కనిపించిన తీరును చూస్తే వేగంగా వ్యాపించే అవకాశం ఉందని చెబుతున్నారు. దీని అర్ధం కరోనా మాదిరి వేగంగా విస్తరిస్తుందని కాదని కూడా అంటున్నారు.


మంకీపాక్స్‌ మరోరూపంలో వచ్చిన మసూచికం అని కొందరు చెబుతున్నారు.1999లో పరిశోధనా సంస్దల్లో ఉన్న మసూచి వైరన్‌సు నాశనం చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్ధ సూచించింది. ప్రస్తుతం ఆ సంస్ద వద్ద ఐదులక్షల డోసుల వాక్సిన్‌ ఉండగా ఇతర దేశాల్లో 60నుంచి 70 మిలియన్ల డోసులు ఉందని, అనేక నిల్వలు సక్రమంగా లేవని చెబుతున్నారు. అమెరికాలో 50 నుంచి వంద లక్షల మందికి వేసేందుకు సరిపడా ఉందని అంచనా.1980నాటికి వరియోలా వైరస్‌ 76 పరిశోధనా సంస్ధల్లో ఉంది. వైరస్‌ను నాశనం చేయాలన్న సూచన మేరకు తమ 74 కేంద్రాలు నాశనం చేయటం లేదా తమ వద్ద ఉన్న నిల్వలను ప్రపంచ ఆరోగ్య సంస్ధకు అంద చేశాయి. అమెరికాలోని అట్లాంటాలో సిడిసి, రష్యాలోని కోల్ట్‌సోవో వైరాలజీ సంస్ధలో మాత్రమే ఉంది. కొందరి అనుమానం ప్రకారం ప్రపంచ ఆరోగ్య సంస్ధకు తెలియ కుండా కొన్ని చోట్ల దాచారని, జీవాయుధంగా వాడేందుకుగాను కొత్త వైరస్‌ సృష్టికోసమే ఇలా చేశారనే ఆరోపణలున్నాయి గాని, నిర్ధారణ కాలేదు.


. ప్రపంచంలో వైరస్‌తో జీవాయుధాలను తయారు చేసి యుద్దాలలో వినియోగించే అంశాల గురించి కొందరు నిపుణులు వెలిబుచ్చిన అభిప్రాయాలను, అనేక అంశాలను పేర్కొంటూ చైనా మిలిటరీ వైద్యుడు గ్జు డెహౌంగ్‌ 2015లో ఒక పుస్తకాన్ని ప్రచురించారు. అదేమీ రహస్యం కాదు, అమెజాన్‌ ద్వారా ప్రపంచమంతా కొనుగోలు చేసింది. చైనాలో 2002,04 సంవత్సరాలలో బయటపడిన సార్స్‌ మహమ్మారి విదేశాల నుంచి అసహజ పద్దతిలో జన్యుమార్పిడి జరిగి వచ్చిన వైరస్‌ (ఇది కూడా కరోనా వైరస్‌ రకాలలో ఒకటి) అని చైనా పుస్తకంలో అభిప్రాయపడ్డారు. చైనాకు వ్యతిరేకంగా విదేశాల్లో ఉగ్రవాదుల జీవ ఆయుధాల తయారీని కూడా కాదనలేమని సంపాదకుడు గ్జు పేర్కొన్నారు. ప్రపంచంలో జీవ ఆయుధాల ప్రయోగాలు, యుద్దంలో వాటి వినియోగం గురించి కూడా దానిలో చర్చించారు. 1941లోనే అమెరికా జీవ ఆయుధాల పరిశోధన ప్రారంభించిందని, తరువాత వాటి తయారీకి ఫ్యాక్టరీలను ఏర్పాటు చేసిందని, 1940-45 సంవత్సరాల మధ్య జపాన్‌ జీవ ఆయుధాలను ఉపయోగించి తూర్పు చైనాలోని ఝెజియాంగ్‌, హునాన్‌ రాష్ట్రంలో ప్రయోగించి ప్లేగు వ్యాధి వ్యాపింప చేసిందని కూడా రచయిత దానిలో పేర్కొన్నారు.


బిల్‌ మరియు మెలిందా గేట్స్‌ ఫౌండేషన్‌ సారధి, మైక్రోసాఫ్ట్‌కు మారు పేరు అయిన బిల్‌ గేట్స్‌ చావులను కూడా సొమ్ము చేసుకొనేందుకు పూనుకున్నాడు. కరోనా వాక్సిన్‌ తయారీ వివరాలను భారత్‌కు మరొక దేశానికి ఇవ్వకూడదని ఆ పెద్దమనిషి చెప్పిన సంగతిని మరచిపోలేము. భద్రతా కారణాల రీత్యా ఇవ్వటం కుదరదన్నాడు. ఒకవేళ ఎక్కడైనా అలా ఇస్తే అది తమ సాయం మరియు నైపుణ్యం ఫలితమే అన్నాడు. 2015లో బిల్‌ గేట్స్‌ టెడ్‌ టాక్‌ అనే కార్యక్రమంలో మాట్లాడుతూ రానున్న దశాబ్దంలో ఒక పెద్ద మహమ్మారి రానున్నదని, అది ఐదు కోట్ల మందిని బలితీసుకున్న 1918నాటి మహమ్మారి మాదిరి ఉంటుందని, ఆరునెలల్లో మూడు కోట్ల మందిని చంపి వేస్తుందని చెప్పాడు. దాన్ని యుద్దం మాదిరి ఎదుర్కొనేందుకు ప్రపంచం తీవ్ర ప్రయత్నాలు చేయాలన్నాడు. బిల్‌ గేట్స్‌ మాటలను బట్టి గేట్స్‌ అప్పటికే మైక్రోచిప్‌ ద్వారా నియంత్రించే ఒక మహమ్మారి వైరస్‌ను ప్రయోగశాలలో రూపొందించి ఉన్నారని కొంత మంది అప్పుడే చెప్పారు. అవి బుద్దిలేని మాటలని తమ ఫౌండేషన్‌ ద్వారా వాక్సిన్లను కొనుగోలు చేస్తున్నామని అందువలన మహమ్మారుల ప్రమాదం గురించి హెచ్చరించేందుకే తాను చెప్పానన్నాడు.నియంత్రణలతో సురక్షితమైన వాక్సిన్లను తయారు చేయాలి గనుక భారత్‌ వంటి అభివద్ది చెందుతున్న దేశాలకు తయారీ విధానం గురించి చెప్పకూడదని ఒక ఇంటర్వ్యూలో బిల్‌గేట్స్‌ చెప్పాడు.


ప్రపంచంలోని 25 దేశాలలో అమెరికన్లు బయో ప్రయోగశాలలను ఏర్పాటు చేశారు. మధ్య ప్రాచ్యం, ఆఫ్రికా, ఆగేయ ఆసియా, మాజీ సోవియట్‌ రిపబ్లికులలో అవి ఉన్నాయి. ఒక్క ఉక్రెయిన్‌లోనే 16 ఉన్నాయంటే అమెరికా కుట్రలను అర్ధం చేసుకోవచ్చు. అమెరికాలోని మేరీలాండ్‌లోని ఫ్రెడరిక్‌ అనే ప్రాంతంలో ఫోర్డ్‌ డెట్రిక్‌ ప్రయోగశాలలో ఎబోలా వంటి వ్యాధుల కారకాల గురించి పరిశోధనలు చేశారు. దాని మీద వార్తలు రావటంతో 2019లో మూసివేశారు. గత రెండు దశాబ్దాలలో ఇంటా బయటా ఉన్న అమెరికన్‌ ప్రయోగశాలలో అనేక వందల ఉదంతాలలో ప్రమాదాలు జరిగి ప్రమాదకరమైన వైరస్‌, బాక్టీరియాలు బయటపడినట్లు యుఎస్‌ఏ టుడే పేర్కొన్నది అమెరికాలో ఇలాంటి సమస్యలున్న కారణంగా ఇతర దేశాలలో అసలు విషయాలను దాచి పరిశోధనలు నిర్వహిస్తున్నారు.


మానవ కల్యాణం కోసం ఒక ప్రమాదకర వైరస్‌ను హతమార్చేందుకు మరొక వైరస్‌ను రూపొందించేందుకు ప్రతి దేశానికీ అవకాశం, హక్కు ఉంది. అయితే ఆ ముసుగులో ఆయుధాలు తయారు చేసే దేశాలు మిగతా వాటి మీద బురద జల్లుతున్నాయి. చరిత్రను తిరగేస్తే క్రీస్తు పూర్వం ఆరువందల సంవత్సరంలో క్రిసాను ముట్టడి సమయంలో రాజు సోలోన్‌ కటుక రోహిణీ అనే పుష్పాల నుంచి తీసిన రసాన్ని ప్రయోగించి విరేచనాలు, ఇతర వ్యాధులు కలిగించినట్టు చరిత్రలో ఉంది. 1155లో రాజు బార్బోసా ఇటలీలోని టోరోంటానాలోని మంచి నీటి బావుల్లో శవాలను పడవేసి కలుషితం కావించాడు. 1495లో ఫ్రెంచి సైనికులను హతమార్చేందుకు స్పెయిన్‌ రాజులు ఇటలీలోని నేపుల్స్‌లో కుష్టువ్యాధి గ్రస్తుల రక్తం కలిపిన వైన్‌ సరఫరా అయ్యేట్టు చూశారు.1675లో విషంతో కూడిన బుల్లెట్లను వినియోగించరాదని జర్మనీ-ఫ్రెంచి సైన్యం అంగీకారానికి వచ్చాయి. 1710లో రష్యన్‌ చక్రవర్తి ప్లేగుతో మరణించిన శవాలను ఫిరంగులకు కట్టి స్వీడన్‌ పట్టణాలలో పడవేయించాడు. 1763లో అమెరికాలోని గిరిజనులను దెబ్బతీసేందుకు బ్రిటిష్‌ పాలకులు మసూచి వ్యాధిగ్రస్తులు వాడిన దుప్పట్లు పంపిణీ చేశారు.పర్యవసానంగా దాదాపు రెండువందల సంవత్సరాల పాటు అమెరికాలో మసూచి వ్యాప్తి చెందింది. నెపోలియన్‌ చక్రవర్తి 1797లో ఇటలీలోని మంటువాలో మలేరియా వ్యాధి వ్యాపింప చేసేందుకు మైదానాలను వరదలతో నింపించాడు. అంతర్యుద్ధ సమయంలో1863లో అమెరికాలోని బానిస వ్యవస్థను కోరుకొన్న తిరుగుబాటు రాష్ట్రాలు యూనియన్‌ సైనికులకు ఎల్లోఫీవర్‌, అమ్మోరు సోకిన రోగులు వాడిన వస్త్రాలను విక్రయించేట్టు చూశాయి.


1346లో జెనోయీస్‌-తార్తార్ల మధ్య నేటి ఉక్రెయిన్‌లో ఆధిపత్య పోరు సమయంలో ప్లేగు వ్యాధి వ్యాపించింది. ఓటమి దశలో ఉన్న తార్తార్లు ప్లేగువ్యాధి సోకిన, మరణించిన తమ వారిని ఫిరంగులకు కట్టి శత్రు ప్రాంతాల మీద పడేశారు. దాంతో జెనోయీస్‌ దళాలు వెనక్కు తగ్గాయి. ఈ పరిణామం గురించి గాబ్రియల్‌ డే ముసిస్‌ నమోదు చేశాడు. వెనక్కు తగ్గిన జెనోయీస్‌(ఇటాలియన్లు)లు తమతో పాటు ప్లేగు వ్యాధి కూడా తీసుకు వెళ్లారు. ప్లేగు వ్యాధిగ్రస్తులు, బహుశా దానిని వ్యాపింప చేసే ఎలుకలను కూడా తమ నౌకల్లో తీసుకుపోయి ఉంటారని పేర్కొన్నాడు. ఆ తరువాత అది ఐరోపా, ఆఫ్రికా, ఆసియాలో మన దేశంతో సహా అనేక దేశాలకు వ్యాపించింది. రెండున్నర కోట్ల మంది ఐరోపాలో దానికి బలయ్యారు. హైదరాబాదు సంస్థానంలో ప్లేగు వ్యాధి పదే పదే వస్తుండటంతో దాన్ని నివారించేందుకు 1591లో చార్మినార్‌ను నాటి నిజాం రాజు కట్టించిన విషయం తెలిసిందే.


మొదటి ప్రపంచ యుద్ధంలో గుర్రాలకు సెంబరోగం (చీమిడి కారటం) వచ్చే ఆంత్రాక్స్‌ పౌడర్‌ను జర్మనీ, ఫ్రెంచి గూఢచారులు ప్రయోగించారు. రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్‌ సైన్యాలు రష్యా, ఇతర అనేక దేశాలలో ప్లేగ్‌, అంతరాక్స్‌ వంటి వ్యాధులను వ్యాపింపచేసేందుకు ప్రయత్నించారు. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత 22సంవత్సరాలకు 179 దేశాలు జీవ ఆయుధాల నియంత్రణకు ఒప్పందంపై సంతకం చేశాయి. ఎట్టి పరిస్ధితుల్లోనూ వాటి తయారీ, సేకరణ, నిల్వ, వినియోగించబోమని ఆ దేశాలు అంగీకారం తెలిపాయి. అయితే వైద్య అవసరాలకు కొన్ని మినహాయింపులు ఇచ్చారు. ఇప్పుడు జీవ ఆయుధాలు తయారు చేస్తున్నవారు కూడా ఆ ముసుగుతోనే చేస్తున్నట్టు అనుమానాలు ఉన్నాయి. రసాయనిక, జీవ ఆయుధాలకు పెద్ద తేడా ఉండదు. ఉదాహరణకు వియత్నాంను ఆక్రమించుకొనేందుకు అమెరికా జరిపిన దాడుల సమయంలో కలుపు మొక్కలను నాశనం చేసే పేరుతో ఆరెంజ్‌ ఏజంట్‌ అనే రసాయనాన్ని పెద్ద ఎత్తున వియత్నాంలో చల్లారు. యాభై సంవత్సరాలు గడిచిన తరువాత కూడా అనేక చోట్ల కలుపు మొక్కలే కాదు అసలు ఏ మొక్కా బతకని పరిస్థితులు ఉన్నాయి. ఆ ప్రాంతాలలో పుట్టుకతో పిల్లల్లో లోపాలు, కాన్సర్‌, మధుమేహం వంటి వ్యాధులకు అమెరికా చిమ్మిన విషం కారణమని తేలింది.


మొదటి ప్రపంచ యుద్దం మీద విచారణ జరిపిన నానాజాతి సమితి కమిటీ జీవ ఆయుధాలను ఉపయోగించలేదు గానీ జర్మన్లు రసాయనిక ఆయుధాలు వాడినట్లు పేర్కొన్నది. రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్‌ సామ్రాజ్యవాదులు ఆపరేషన్‌ చెర్రీ బ్లూసమ్స్‌ పేరుతో జీవ ఆయుధాలతో అమెరికా సహా అనేక దేశాల మీద దాడి చేయాలనే పథక రచన చేశారు. తన ఆక్రమణలోని చైనాలోని హార్బిన్‌, కొరియా, మంచూరియా ప్రాంతంలో దాడి చేశారు. దానిలో కలరా, ప్లేగు, అంతరాక్స్‌, మసూచి వంటి ప్రమాదకర క్రిముల్ని వాడారు. 2002లో ఒక అంతర్జాతీయ సమావేశంలో జపాన్‌ మిలిటరీ జరిపిన బాక్టీరియా బాంబు దాడుల్లో మరణించిన వారు ఐదు లక్షల ఎనభైవేల మంది ఉన్నట్టు వక్తలు వెల్లడించారు. ఒక్క చైనాలోనే ప్లేగు, కలరా, ఆంత్రాక్స్‌ వంటి వాటితో నాలుగు లక్షలమంది మరణించారని అంచనా.


జపాన్‌ జీవ ఆయుధాల తయారీకి 150 భవనాలను, ఐదు శివారు ప్రాంతాలను ఉపయోగించి మూడువేల మంది శాస్త్రవేత్తలతో పని చేయించారు. వాటి తయారీ సమయంలో కనీసం పదివేల మంది ఖైదీలపై వాటిని ప్రయోగించగా మరణించినట్టు తేలింది. వారిలో మూడువేల మంది కొరియా, చైనా, సోవియట్‌, మంగోలియా, అమెరికన్‌, బ్రిటిష్‌, ఆస్ట్రేలియన్‌ యుద్ద ఖైదీలు ఉన్నట్టు బయట పడింది. జపాన్‌ జీవ ఆయుధాల విషయం బయటపడిన తరువాత అమెరికా పెద్ద ఎత్తున 1942నుంచి వాటిని రూపొందించేందుకు పూనుకుంది. తాను పెద్ద ఎత్తున జీవ ఆయుధాలను తయారు చేసినట్టుగానే ఇతరులు కూడా తయారు చేసి తమ మీద ప్రయోగిస్తారని అమెరికా భయపడుతోంది. దీనిలో భాగంగానే అనేక కుట్ర సిద్దాంతాలను అమెరికన్లు ప్రచారంలో పెట్టారు.ఏమైనా గత చరిత్రను బట్టి మంకీపాక్సు గురించి అమెరికా, పైన పేర్కొన్న ఇతర దేశాల గురించి వెలువడిన ప్రతి సమాచారాన్ని అనుమానంతో చూడాల్సిందే. తమ దేశాల్లో ఎందుకు విస్తరిస్తున్నదో అవి ప్రపంచానికి చెప్పాల్సి ఉంది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

అచ్చేదిన్‌ నరేంద్రమోడీ కాపీ నినాదం ! ఎనిమిదేండ్ల ఏలుబడిలో ఆవిరైన సంతోషం !!

22 Tuesday Mar 2022

Posted by raomk in Current Affairs, Economics, Health, INDIA, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

Narendra Modi Failures, World Happiness Index 2022, World Happiness India Index


ఎం కోటేశ్వరరావు
సంతోషం అంటే ఏమిటి అంటే ప్రపంచంలో ఒక నిర్ణీత నిర్వచనం లేదా నిర్దిష్ట అర్ధం లేని పదాల్లో ఒకటి. చిత్రం ఏమిటంటే ప్రతివారూ సంతోషాన్ని కోరుకుంటారు. అదానీ రోజుకు రు.1002 కోట్లు సంపాదిస్తున్నదాన్ని రెట్టింపు చేసుకోవటం సంతోషాన్ని కలిగిస్తుంది. నిత్యం ఏదో ఒక సమస్యతో కొట్టుమిట్టాడే అభాగ్యులకు ఆరోజు పని దొరికి వచ్చిన సొమ్ముతో పెళ్లాంబిడ్డల కడుపునింపితే ఎనలేని సంతోషం. ఇహలోకంలో నీతులు, రీతులు చెబుతూ స్వర్గంలో అవేవీ లేకుండా మనతాత, ముత్తాతలు, తండ్రులకు సేవలందించిన రంభ ఊర్వశి, మేనకలతో సౌఖ్యం పొందాలని ఉవ్విళ్లూరే వారికి కలిగే సంతోషం గురించి చెప్పేదేముంది. ఒకరికి మోదం అనుకున్నది మరొకరికి ఖేదం కలిగిస్తుంది. ఉక్రెయిన్లో రష్యా సైనిక చర్య, అంతకు ముందు కొన్ని సంవత్సరాలుగా కొన్ని దేశాల మీద జరుగుతున్న పెత్తందారీ దేశాల దాడులు ఆగిపోతే అక్కడి జనాలకే కాదు, ప్రపంచవ్యాపితంగా సంతోషమే. కానీ జనాలు సంతోషంగా ఉంటే తాము తయారు చేస్తున్న మారణాయుధాలకు మార్కెట్‌ ఉండదని వాటిని తయారు చేస్తూ నిత్యం ఎక్కడో ఒక చోట తంపులు పెట్టే అమెరికా,బ్రిటన్‌ వంటి బడాదేశాల కార్పొరేట్‌లకు సంతోషం కరవు. రక్తం తాగే ఇలాంటి వారిని వదలివేస్తే మిగతా జనాలకు సంతోషమే సగము బలము అన్నది తిరుగులేని సత్యం. దాన్ని కొలిచే సాధనాలేవీ లేవు. సంతోషంగా ఉండాలన్నది ప్రతి ఒక్కరి వాంఛ.దాన్ని గనుక ప్రాధమిక రాజ్యాంగహక్కుగా చేసి ఉంటేనా !


ఐక్యరాజ్యసమితి నిరంతర అభివృద్ధి లక్ష్యాల సాధనకు ఆమోదించిన వాటిని ఏమేరకు అమలు చేస్తున్నారో కొలిచేందుకు రూపొందిస్తున్నదే ప్రపంచ సంతోష సూచిక. ప్రతి ఏటా ప్రచురించే దీని వివరాల మేరకు 2022 సూచికలో 146 దేశాలకు గాను మనం 136వ స్ధానంలో ఉన్నాము. గతేడాది కంటే 0.236 పాయింట్లు పెంచుకొని 139 నుంచి 136కు ఎగబాకాము. ఇది నిజంగా మోడీ భక్తులు పండగచేసుకొనే అంశమే. ఆగండి అప్పుడే రంగులు చల్లుకోవద్దు.2013లో 111వ స్ధానంలో ఉన్నది, 2015లో 117కు తరువాత 2020లో 144వ స్ధానానికి దిగజారింది. తిరిగి పూర్వపు స్ధానానికి ఎప్పుడు చేరుకుంటామో, జనాలకు మంచి రోజులు ఎప్పుడు వస్తాయో చెప్పి మరీ పండగ చేసుకోవాలి. నూటపదకొండులో ఉన్నపుడే మన్మోహన్‌ సింగ్‌ పాలనను జనం భరించలేకపోయారు. తరువాత దిగజారినా మోడీకి మరొక అవకాశం ఇచ్చి చూద్దామని జనం భావించారు, భరిస్తున్నారు. గొర్రె కసాయిని నమ్ముతుందని ఎందుకు మన పెద్దలు అనుభవసారంగా చెప్పారో ఆలోచిద్దాం.


జనం ఆశించిన సంతోషానికి కారణమైన నరేంద్రమోడీ అచ్చేదిన్‌ నినాదం అసలు కథ తెలుసా ? నరేంద్రమోడీ, బిజెపి 2014 ఎన్నికలకు ముందు ఓం శ్రీరామతో పాటు అచ్చేదిన్‌ అనే నినాదాన్ని కూడా తారకమంత్రంగా జపిÄంచారు. తరువాత ఎక్కడా మాట్లాడటం లేదు. నినాదాలను కాపీ కొట్టటంలో నరేంద్రమోడీ పెద్ద మాస్టర్‌. కొందరికిది ఆగ్రహం కల్పించినా నిజం నిజమే కదా ! కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ స్వయంగా ఈ సంగతి చెప్పినట్లు 2016 సెప్టెంబరు 20 తేదీ టైమ్స్‌ఆఫ్‌ ఇండియా ప్రతినిధి వెల్లడించారు. 2012 జనవరి ఎనిమిదిన జైపూర్‌లో జరిగిన ప్రవాస భారతీయ దినం సభలో నాటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ మాట్లాడారు. అంతకు ముందు తలెత్తిన ప్రపంచ మాంద్యం నుంచి భారత్‌ తప్పించుకున్నప్పటికీ తరువాత తలెత్తిన ఇబ్బందులను అధిగమిస్తామని ఎన్‌ఆర్‌ఐలకు భరోసా ఇచ్చారు. దేశంలో తలెత్తిన ద్రవ్యోల్బణం తమ ప్రభుత్వ ప్రతిష్టకు ఎలా మచ్చతెచ్చిందో చెబుతూ ఆరు సంవత్సరాల తరువాత ద్రవ్యోల్బణం తొలిసారిగా తిరోగమనంలో ఉందంటూ అబ్‌ అచ్చేదిన్‌ ఆనేవాలే హై ( ఇప్పుడు మంచి రోజులు రానున్నాయి) అన్నారు. వెంటనే నరేంద్రమోడీ ఆ మాటలను తనవిగా చేసుకొని మరుసటి రోజే దాడికి దిగారు. అదే సభలో జనవరి తొమ్మిదిన గుజరాత్‌ సిఎంగా మాట్లాడారు. ఆ సభలో ఉక్కు పరిశ్రమ దిగ్గజం ఎల్‌న్‌ మిట్టల్‌ కూడా ఉన్నారు. మిట్టల్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ మీరు లండన్‌లో తినే టమాటాలు, బెండకాయలు కూడా గుజరాత్‌లో పండించినవే అని అతిశయోక్తులను చెప్పారు. తరువాత 2014 ఎన్నికల ప్రచారంలో అచ్చేదిన్‌ నినాదాన్ని ముందుకు తెచ్చారు. మన్మోహన్‌ సింగ్‌ రెండు సంవత్సరాలకు ముందు చెప్పిందాన్ని ప్రస్తావిస్తూ ” హా మైనే భీ కహతా హుం కి అబ్‌ జల్దీ హై అచ్చేదిన్‌ ఆనే వాలే హై ” ( అవును నేను కూడా చెబుతున్నా ఇప్పుడు త్వరగా మంచి రోజులు రానున్నాయి) అని చెప్పారు. ఇప్పుడు ఆ నినాదమే తమ గొంతుల్లో పచ్చివెలక్కాయ మాదిరి ఇరుక్కుపోయిందని గడ్కరీ అన్నట్లు టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా ప్రతినిధి రాశారు. మంచి రోజులు రావని తెలిసీ జనాలు చప్పట్లు కొడుతున్నారని ఇచ్చిన నినాదాన్ని అవసరం తీరింతరువాత పక్కన పెట్టేశారు. ఓట్ల కోసం కొత్త నినాదాలు, మనోభావాలను ముందుకు తెచ్చే కొత్త అవకాశాల కోసం చూస్తున్నారు.


ఇక సంతోష సూచికల గురించి చూద్దాం. వరుసగా గత ఐదు సంవత్సరాల పాటు ఫిన్లండ్‌ సంతోష సూచికలో మొదటి స్ధానంలో వచ్చింది. మన దేశం చివరి పది స్దానాల్లో నిలిచింది. మనం ప్రతిదానికీ ఇరుగుపొరుగు దేశాలతో పోల్చుకుంటూ మన గొప్పలను చెప్పుకుంటున్నాము. సంతోష సూచికల్లో 2012 నుంచి(2014మినహా) 2022 వరకు తొమ్మిది సంవత్సరాల సగటు 128.8 కాగా కనిష్టం 111, గరిష్టం 144 ఉంది. ఇదే చైనా సగటు 85.6 కాగా కనిష్ట-గరిష్టాలు 2015-2022 ఎనిమిది సంవత్సరాలలో 79-94గా ఉన్నాయి. ఇక బ్రిక్స్‌, మన ఇరుగుపొరుగుదేశాల సంతోష సూచికలు ఇలా ఉన్నాయి.


దేశం××××××× 2022 సూచిక
బ్రెజిల్‌××××××× 34
రష్యా ××××××× 74
ఇండియా ××××× 136
చైనా ××××××× 82
ద.ఆఫ్రికా ××××× 101
నేపాల్‌ ××××××× 85
బంగ్లాదేశ్‌ ××××× 99
పాకిస్తాన్‌×××××× 103
మయన్మార్‌××××× 123
శ్రీలంక ××××××× 126
ఆఫ్‌ఘనిస్తాన్‌××××× 146
వివిధ దేశాలు అనుసరిస్తున్న విధానాల కారణంగా సంతోష సూచికల్లో ప్రతి ఏటా మార్పులు ఉంటాయి.తలసరి జిడిపి, ఆరోగ్య జీవితప్రమాణం, సామాజిక మద్దతు, జీవన విధాన ఎంపిక అవకాశం, ఉదారత, అవినీతి వంటి అంశాలను పరిగణనలోకీ తీసుకొని ఇచ్చే మార్కుల ఆధారంగా సూచిక నిర్ణయిస్తారు. కొన్ని సందర్భాలలో కొత్త అంశాలను కూడా చేరుస్తారు. కొన్ని దేశాలను పరిగణనలోకి తీసుకోకపోవచ్చు. అందువలన ప్రతి ఏడాదీ మార్కులు మారినా ఒక్కోసారి సూచికల్లో స్ధానం మారకపోవచ్చు. మన జనాల్లో ఉన్న ఒక అవాంఛనీయ వైఖరి ఏమంటే మన కంటే దిగువన ఉన్నవారిని ఎద్దేవా చేయటం, మనం మరికొందరి కంటే చాలా దిగువన ఉన్నామని మరచిపోవటం.


నరేంద్రమోడీ నాయకత్వంలోని బిజెపి ఎప్పటికప్పుడు కొత్త నినాదాలను ముందుకు తెచ్చి జనాన్ని ఆకర్షించటంలో, మభ్యపరచటంలో ఎంతో ముందుందనటం అతిశయోక్తి కాదు. చెప్పిన కథ చెప్పకుండా కొత్త కథలు చెబుతోంది. అచ్చేదిన్‌, గుజరాత్‌ నమూనా వృద్ది, నల్లధనం వెలికితీత, 2022 నాటికి నవభారతం, 2024నాటికి ఐదులక్షల కోట్ల డాలర్ల జిడిపి సాధన.2022 ఆగస్టు పదిహేను నాటికి లేదా ఏడాది ఆఖరుకు సాధిస్తామని చెప్పిన అంశాల గురించి చెప్పుకొని ఒక్కసారి సంతోషిద్దాం.
1.జిడిపి వృద్ది రేటు 9-10శాతంగా ఉంటుంది. పెట్టుబడుల రేటు 2022ా23 నాటికి 36శాతానికి పెంపుదల, పది నూతన కల్పనల జిల్లాల ఏర్పాటు.దాతలతో నైపుణ్యాల పెంపుదల, ఆరవ తరగతి నుంచి నైపుణ్య శిక్షణకు స్కూళ్లు. ప్రస్తుతం 5.4శాతంగా ఉన్న నైపుణ్య కార్మికులను కనీసం 15శాతానికి పెంచటం, మహిళాశ్రామిక శక్తి భాగస్వామ్యం 30శాతానికి పెంపు,ఆరోగ్య సంరక్షణ రంగంలో ఇరవై నుంచి 30లక్షలు, పర్యాటక రంగంలో నాలుగు కోట్లు, ఉద్యోగాలు, గనుల రంగంలో 50లక్షల కొత్త ఉద్యోగాల కల్పన. 2. ప్రతి పౌరుడికి బాంకు ఖాతా, జీవిత, ప్రమాద బీమా, పెన్షన్‌, ఉద్యోగానంతర ప్రణాళికల సేవలు అందచేత,3.రైతుల ఆదాయాలు రెట్టింపు, పొలాలన్నింటికీ జలాల సరఫరా, పొలాల్లో వదలివేసిన గడ్డిని తగులబెట్టకుండా చూడటం, దేశంలో గాలికాలుష్యాన్ని సగానికి తగ్గించటం, ప్లాస్టిక్‌ వాడకంపై నిషేధం. 4. ప్రతి కుటుంబానికి గాస్‌ సిలిండర్‌, రైలు ప్రమాదాల్లో ఒక్కరు కూడా మరణించకుండా చూడటం, ముంబై-అహమ్మదాబాద్‌ బుల్లెట్‌ రైలు పరుగులు(ఇప్పుడు దీనికి ఒక తుది గడువు అంటూ లేదు గానీ 2023డిసెంబరుకు పూర్తి అని చెబుతున్నారు). కేరళలొ బిజెపి వేగంగా పరుగెత్తే కె రైల్‌ పధకాన్ని మాత్రం వద్దంటుంది. 5. ప్రతి ఒక్క కుటుంబానికి ఇల్లు, ఇళ్లలో మరుగుదొడ్లు, చేతులతో మలమూత్రాల ఎత్తివేత నివారణ, రోజంతా విద్యుత్‌ సరఫరా.6.2012-13లో ఉన్న 7.7శాతం పారిశ్రామిక ఉత్పాదకత రెట్టింపు.ప్రతిగ్రామానికి ఇంటర్నెట్‌, ప్రతివారూ దాన్ని ఉపయోగించేలా చర్యలు, ప్రతి ఇంటికి మంచినీటి సరఫరా, పోషకాహారలేమి నివారణ. ప్రస్తుతం 21శాతంగా ఉన్న అడవులను 33శాతానికి పెంపు, పదవ తరగతి పూర్తి గాకుండా ఏ ఒక్క విద్యార్దీ మధ్యలో బడి మానకుండా చూడటం. ఉన్నత విద్యలో 25శాతంగా ఉన్న చేరికలను 35శాతానికి పెంచటం 7. ఏడువందల జిల్లా కేంద్ర ఆసుపత్రులు వైద్య కేంద్రాలుగా వృద్ది. ప్రాధమిక ఆరోగ్యకేంద్రాలలో ఆరోగ్యనిపుణులకు ప్రయివేటు పరిశ్రమలవారితో శిక్షణ, మెడికల్‌ టూరిస్టులను ఆకర్షించేందుకు ఇరవై స్వేచ్చా జోన్ల ఏర్పాటు., దేశంలో 11,082 మందికి ఒక అలోపతి వైద్యుడు ఉన్న స్ధితిని ప్రతి పద్నాలుగు వందల మందికి ఒకరుండేట్లు చూడటం.వెనుకబడిన ప్రాంతాల్లో వంద చోట్ల కొత్త విహార కేంద్రాల ఏర్పాటు. మన దేశానికి వచ్చే విదేశీ పర్యాటకుల సంఖ్యను 88 లక్షల నుంచి కోటీ 20లక్షలకు పెంచటం, స్వదేశీపర్యాటకుల సంఖ్యను 1,614 నుంచి 3,200 మిలియన్లకు పెంచటం.8. చమురు, గాస్‌ దిగుమతులను పదిశాతం తగ్గింపు(2022-2023).80 గిగావాట్లుగా ఉన్న పునరుత్పాదక ఇంధనాన్ని 175 గిగావాట్లకు పెంచటం. 9. 1.22లక్షల కిలోమీటర్లుగా ఉన్న జాతీయ రహదారులను రెండులక్షల కిలోమీటర్లకు పెంచటం. దశాబ్దాల తరబడి 2017 నాటికి పూర్తిగాకుండా ఉన్న ప్రాజెక్టుల పూర్తి. ఇలాంటి కబుర్లతో గతంలో కాంగ్రెస్‌ కాలక్షేపం చేసింది. ఇపుడు బిజెపి బిజెపి చేస్తున్నది.


ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ది చెందుతున్న దేశమని త్వరలో చైనాను అధిగమిస్తామని చెబుతున్నవారి ఏలుబడిలో సంతోష సూచిక ఇలా తగులడుతోందేం అని ఎవరైనా ప్రశ్నించరా ? జిడిపి మొత్తం పెరగటం వేరు, జనాభా పెరుగుతున్నపుడు దానికి అనుగుణంగా తలసరి పెరగటం వేరు.2014లో జిడిపి తలసరి సగటు 1,574 డాలర్లు, 2020లో 1,901 డాలర్లు, ఇదే కాలంలో చైనాలో 7,679 నుంచి 10,500 డాలర్లకు పెరిగింది. ప్రపంచంలో మొత్తం జిడిపిలో చైనా రెండవ స్దానంలో ఉన్నా తలసరిలో ప్రపంచ సగటు కంటే తక్కువే, ఇక మన దేశం గురించి చెప్పుకోవాల్సిందేముంది. సంతోష సూచిక లెక్కింపులోకి తీసుకొనే జిడిపి తలసరి సగటు సూచికలో గత నాలుగు సంవత్సరాలుగా మనది 102-103 స్దానాల్లో , ఆరోగ్యజీవిత సూచికలో 104-107, సామాజిక మద్దతులో 141-145 స్ధానాల్లో ఉన్నపుడు జనాల్లో ఆనందం ఎక్కడ ఉంటుంది. నేపాల్‌ పేదరికంలో కూడా తన స్ధానాన్ని 48 స్ధానాలు ఎగువకు గణనీయంగా మెరుగుపరుచుకోగా మన దేశం 28 స్ధానాలు కోల్పోయింది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

తీవ్ర సంస్కరణల అమలు : నరేంద్రమోడీకి ముందు నుయ్యి వెనుక గొయ్యి ?

28 Wednesday Jul 2021

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, Economics, Farmers, Health, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices

≈ Leave a comment

Tags

India Reforms @ 30, India reforms matters, Narendra Modi Failures


ఎం కోటేశ ్వరరావు
మన్మోహన్‌ సింగ్‌ నూతన ఆర్ధిక విధానాలను ప్రవేశపెట్టి మూడు దశాబ్దాలు గడచింది. 1991 జూలై 24న పివి నరసింహారావు ప్రధాన మంత్రిగా ఉండగా మన్మోహన్‌సింగ్‌ సంస్కరణలతో కూడిన తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.ఈ సందర్భాన్ని పురస్కరించుకొని వాటికి ఆద్యులం మేమే అని గతంలో ఛాతీలు విరుచుకున్న కాంగ్రెస్‌, వాటిని పొగిడి అమలు జరిపేందుకు పోటీ పడిన తెలుగుదేశం వంటి ప్రాంతీయ పార్టీలు, అదే సంస్కరణలను మరింత గట్టిగా అమలు చేస్తున్న బిజెపిలోగానీ ఎక్కడా సంతోషం కాదు గదా కనీస చిరు హాసం కూడా కనిపించటం లేదు. ఎందుకు ?


సంస్కరణలను గతంలో సమర్ధించిన వారు గానీ ఇప్పుడు భజన చేస్తున్న పెద్దలు గానీ చెప్పేది ఏమిటి ? అంతకు ముందు టెలిఫోను కావాలంటే పార్లమెంట్‌ సభ్యుడి సిఫార్సు కావాలి, ఎక్కువ సేపు మాట్లాడితే జేబులు ఖాళీ, స్కూటర్‌ కొనుక్కోవాలంటే సంవత్సరాలు ఆగాలి, గ్యాస్‌ కావాలన్నా ఏండ్లు పూండ్లు గడిచేవి. ఇప్పుడు వద్దన్నా సరే తీసుకోండి బాబూ అంటూ జనాన్ని వదల – కదలకుండా సతాయిస్తున్నాయి. పరిస్ధితి మరింత మెరుగుపడాలి, ఇంకా అందుబాటులోకి రావాలంటే మరిన్ని సంస్కరణలు అవసరం అన్నది కొందరి వాదన. ప్రపంచ వ్యాపితంగా 2019లో వంద మంది జనాభాకు సగటున 104 ఫోన్‌ కనెక్షన్లు ఉన్నాయి. మన దగ్గర 2020లో 110.18, చైనాలో 113.38, క్యూబాలో 11.6(2011) ఉన్నాయి. అంటే మనం చైనాకు దగ్గరగా ఉన్నాం, ఎంత అభివృద్ది ? క్యూబా అందనంత దూరంలో వెనుకబడి ఉంది చూడండి అని అంకెలను చూసి ఎవరైనా చెబుతారు. మరి దీనిలో వాస్తవం లేదా ? కంటికి కనిపిస్తుంటే లేదని ఎలా చెప్పగలం !

గతి తార్కిక సూత్రాల ప్రకారం ప్రతిదీ నిరంతరం మారుతూ ఉంటుంది. అందువలన సంస్కరణలు, మరొకదానిని వద్దని చెప్పటం అంటే రివర్స్‌ గేర్‌లో నడపాలని చూడటమే. పురోగమనం ఏ దారిలో నడవాలన్న దగ్గరే అసలు సమస్య. దాన్ని తమవైపు మళ్లించుకోవాలని కార్పొరేట్‌ సంస్దలు చూస్తాయి. తమ వైపు రావాలని సామాన్య జనం కోరుకుంటారు. ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయద్రవ్యనిధి సంస్దలు(ఐఎంఎఫ్‌) ఏం చెబుతాయి ? వాటిని రూపొందించింది ధనిక దేశాలు గనుక వాటి ప్రయోజనాలకు అనుగుణ్యమైన సిఫార్సులే చేస్తాయి. దాని అర్ధం సమాజంలో ఒక తరగతి ఆ సంస్కరణలతో లబ్దిపొందుతుంది. భిన్నమైన ఆచరణ అయితే మరో తరగతికి ప్రయోజనం.


ఐక్యరాజ్యసమితి 2020 మానవాభివృద్ది సూచికలో 189 దేశాలకు గాను క్యూబా 70వ స్ధానంలో, చైనా 85, మన దేశం 131, బంగ్లాదేశ్‌ 133లో ఉంది. సంస్కరణల లక్ష్యం సెల్‌ఫోన్ల కనెక్షన్ల పెరుగుదలా లేక మానవాభివృద్దిగా ఉండాలా ? మూడు దశాబ్దాల సంస్కరణల తరువాత కరోనా సమయంలో ఆక్సిజన్‌ కోసం విదేశీ దానం, దిగుమతుల మీద ఆధారపడాల్సిన దుస్ధితిని ఎలా వర్ణించాలి ? అందుకే సంస్కరణల లక్ష్యం ఏమిటి అన్నది గీటురాయిగా ఉండాలి. మన దేశం స్వంతంగా ఒక వాక్సిన్‌ తయారు చేసినందుకే మన జబ్బలను మనం చరుచుకుంటున్నాం. నరేంద్రమోడీ ఉండబట్టే అది సాధ్యమైందన్న భజన తెలిసిందే. సున్నా కంటే ఒకటి విలువ అపారం. సెల్‌ఫోన్ల కనెక్షన్లలో త్వరలో మనం చైనాను అధిగమించినా ఆశ్చర్యం లేదు. ఒక వాక్సిన్‌కే మనం తబ్బిబ్బు అవుతుంటే చైనా 20వాక్సిన్ల ప్రయోగాలు జరుపుతోంది. అమెరికా ఆర్ధిక దిగ్బంధనం ఉన్నా, ఇబ్బందులు పడుతూ ఉన్నంతలోనే పెద్ద మొత్తం వెచ్చించి క్యూబా ఐదు కరోనా వాక్సిన్లను అభివృద్ధి చేస్తోంది. కావాలంటే ఇతర దేశాలు ఉత్పత్తి చేస్తామంటే ఫార్ములా ఇస్తామని ప్రకటించింది. ఇలా ఉదహరించుకుంటూ పోతుంటే విదేశాలను పొగిడే దేశద్రోహులుగా ముద్రవేస్తారు. టూల్‌కిట్ల కేసులు బనాయిస్తారు. పెగాసస్‌ను ప్రయోగిస్తారు.


మూడు దశాబ్దాల క్రితం మన్మోహన్‌ సింగ్‌ ఆర్ధిక మంత్రిగా సంస్కరణల బడ్జెట్‌ను ప్రతిపాదిస్తూ పదిహేను రోజులకు సరిపడా మాత్రమే విదేశీ మారక ద్రవ్యం ఉందని చెప్పారు. ఇప్పుడు మన దేశం దగ్గర పదిహేను నెలలకు సరిపడా ఉన్నాయి. చిత్రం ఏమిటంటే అప్పుడూ పెట్టుబడిదారీ విధానాన్ని సమర్ధించేవారు సంస్కరణలు కావాలని కోరారు. మూడు దశాబ్దాల తరువాత ఇప్పుడూ మరిన్ని సంస్కరణలు కావాలని కోరుతున్నది వారే. సామాన్య జనంలో నాడున్నంత మోజు, క్రేజు ఇప్పుడు లేదు. ఎందుకని ? స్వాతంత్య్రం వచ్చిన పద్నాలుగు సంవత్సరాలకు వెలుగు నీడలు(1961) అనే సినిమా వచ్చింది. మహాకవి శ్రీశ్రీ పాడవోయి భారతీయుడా అంటూ రాసిన పాట ఎంతో ప్రాచుర్యం పొందింది. స్వాతంత్య్రం వచ్చెనని సంబరపడబోకోయి, స్వాతంత్య్రం వచ్చెనని సభలే చేసి సంబరపడగానే సరిపోదోయీ, సాధించిన దానికి సంతృప్తిని పొంది అదే విజయమనుకుంటే పొరపాటోయి.. ఆకామందుకొనే ధరలకవైపు అదుపులేని నిరుద్యోగమింకొకవైపు, అవినీతి బంధుప్రీతి చీకటి బజారూ అలుముకున్న నీ దేశమెటు దిగజారూ, కాంచవోయి నేటి దుస్ధితీ ఎదిరించవోయి ఈ పరిస్ధితీ, పదవీ వ్యామోహాలు కులమత బేధాలూ భాషా ద్వేషాలూ చెలరేగేనేడు ప్రతి మనిషి మరియొకనీ దోచుకునే వాడే, తన సౌఖ్యం తన భాగ్యం చూసుకొనే వాడే అంటూ ఆరుదశాబ్దాల క్రితమే పరిస్ధితిని ఎదిరించమని సందేశమిచ్చాడు శ్రీశ్రీ . మూడు దశాబ్దాల సంస్కరణల తరువాత అవన్నీ మరింత పెరిగాయి.


1991నాటి సంస్కరణలకు విదేశీ చెల్లింపుల సమస్య తలెత్తటం ఒక ప్రధాన కారణం. నరేంద్రమోడీ హయాంలో విదేశీమారక ద్య్రవ్యం పెరుగుదలను ఒక ఘన విజయంగా ఊరూ వాడా ఊదరగొడుతున్నారు. ఇది నాణానికి ఒకవైపు మాత్రమే. మొత్తం మీద మన దేశ ఎగుమతుల కంటే దిగుమతులు ఎక్కువగా ఉన్నాయి. అంటే మనకు అవసరమైన విదేశీమారక ద్రవ్యం లోటులోనే ఉంది. ఎవరి ఘనత అయినా మిగులు సాధించినపుడే. ఇప్పుడు 612 బిలియన్‌ డాలర్లు (జూలై 16నాటి ఆర్‌బిఐ సమాచారం) దాటినప్పటికీ ప్రముఖ ఆర్ధికవేత్తలు హెచ్చరికలు చేస్తున్నారు. మరోసారి చెల్లింపుల సంక్షోభం తలెత్తవచ్చని, జాగ్రత్తపడాలని చెప్పేవారు కొందరు, ఐఎంఎఫ్‌ను ఆశ్రయించవచ్చని కొందరు హెచ్చరిస్తున్నారు.” ఊహించని విదేశీ అఘాతాల(షాక్‌లు)లను తట్టుకొనే శక్తిని విదేశీమారక ద్రవ్య స్ధాయిలు కల్పిస్తాయని చెప్పటం మోసకారితనం ” అని రిజర్వుబ్యాంకు డిప్యూటీ గవర్నర్‌ మైఖేల్‌ దేవవ్రత పాత్ర రిజర్వుబ్యాంకు బులిటెన్‌లో రాశారు. జూన్‌ నాలుగవ తేదీ నాటికి 605 బిలియన్‌ డాలర్లకు చేరాయి. ప్రధమ స్ధానంలో ఉన్న చైనా, జపాన్‌, స్విడ్జర్లాండ్‌, రష్యా తరువాత అధిక విదేశీమారక డాలర్ల ద్రవ్యం ఉన్న దేశంగా ఐదవ స్ధానానికి చేరింది. ఈ మొత్తం పదిహేను నెలల పాటు మనం దిగుమతులు చేసుకొనేందుకు సరిపోతాయని చెబుతున్నారు. వారం వారం ఇవి పెరగటానికి ప్రత్యక్ష పెట్టుబడులు రావటం, దేశ ఆర్ధిక వ్యవస్ధ సరిగా లేనప్పటికీ కంపెనీల వాటాల కొనుగోలుకు విదేశీ మదుపుదార్లు ఎగబడటం కారణాలు అన్నది స్పష్టం. స్విడ్జర్లాండ్‌ దగ్గర ఉన్న నిధులు 39 నెలలు, జపాన్‌ 22, రష్యా 20, చైనా 16నెలల పాటు దిగుమతులు చేసుకొనేందుకు సరిపోతాయని మన దేశం దగ్గర పదిహేను నెలలకు సరిపడా ఉన్నందున మన పరిస్ధితి మెరుగ్గా ఉందని కొందరు నమ్మబలుకుతున్నారు.చైనా వాణిజ్య మిగులులో ఉంది తప్ప తరుగులో లేదు. అందువలన మన పరిస్ధితిని ఇతరులతో పోల్చుకుంటే ప్రయోజనం ఏముంది ? మన దేశ అంతర్జాతీయ నిఖర పెట్టుబడులను విశ్లేషిస్తే సంపదలకంటే అప్పులు 12.9శాతం ఎక్కువగా ఉన్నాయి. అందువలన ఆచరణాత్మక విశ్లేషణలు చేయటం అవసరం. మనకంటే వేరే దేశాల్లో లాభం అనుకుంటే పొలో మంటూ ఆ పెట్టుబడులన్నీ తెల్లవారే సరికి మాయాబజార్‌లా మాయం అవుతాయి. అప్పుడు పరిస్ధితి ఏమిటన్నది సమస్య.


విదేశీ మదుపుదారులు తమ దేశాల్లో కంటే తక్కువ ప్రతిఫలం వస్తున్న కారణంగానే మన మార్కెట్లోకి వస్తున్నారు. అందువలన వారికి ఎక్కడ వాటంగా ఉంటే అక్కడికి ఎప్పుడైనా తమ పెట్టుబడులను వెనక్కు తీసుకోవచ్చు. మన్మోహన్‌ సింగు చెప్పినట్లు పదిహేను రోజులకు సరిపడా విదేశీమారక ద్రవ్య నిల్వలున్నపుడు ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయద్రవ్యనిధి సంస్ధ ఆదేశాల మేరకు సంస్కరణలు తీసుకువచ్చారు. అందువలన సహజంగానే అవి కొన్ని తరగతులను సంతృప్తి పరచాయి, సంపదలను పెంచాయి. వాటిని చూసి అనేక మంది తాము కూడా ఆ జాబితాలో చేరేందుకు మహదావకాశం వచ్చిందనే ఆశతో వెనుకా ముందూ చూడకుండా వాటిని సమర్ధించారు. యుపిఏ పాలనలో దేశంలో ఆర్ధిక పరిస్దితి దిగజారటం, కొత్త పద్దతుల్లో దేశ సంపదలను దోచుకొనే క్రమంలో జరిగిన అక్రమాల కారణంగా జనంలో అసంతృప్తి తలెత్తింది. దాన్ని ఉపయోగించుకొని నరేంద్రమోడీ రంగంలోకి వచ్చారు.


ఏడు సంవత్సరాల తరువాత అనేక వైఫల్యాలు కళ్లెదుట కనిపిస్తున్నా ప్రధాని మోడీ పలుకుబడి తగ్గలేదని కొందరు చెబుతున్నారు. అంగీకరిద్దాం. ఐదులక్షల కోట్ల డాలర్ల జిడిపి లక్ష్యం గురించి ఎవరూ ఇప్పుడు మాట్లాడటం లేదు. నాడు పివి నరసింహారావు, మన్మోహన్‌ సింగులు చేసిన మాదిరి కరోనాతో కుదేలైన ఆర్ధిక వ్యవస్ధను గాడిలో పెట్టేందుకు నరేంద్రమోడీ అద్భుతాలు చేయగలరా లేదా అని కొందరు పోల్చి చూస్తున్నారు. కొందరు పండితులు, విధాన నిర్ణేతలు ఆశపడుతున్నారు గానీ అంత సీన్‌ లేదు, ఆశాభంగం చెందుతారు అని కొందరు హెచ్చరిస్తున్నారు. వారు చెబుతున్న కారణాల సారాంశం ఇలా ఉంది. 1991 నాటి ఏకీభావం ఇప్పుడు లేదు. అవి ఆకస్మికంగా ఆకాశం నుంచి ఊడిపడలేదు. సంస్కరణలతో చైనా పురోగమనం, ఆసియాలో మరికొన్ని దేశాల పురోగమన ప్రభావం, అన్నింటికీ మించి సోవియట్‌ యూనియన్‌ పతనం వంటి అంశాలన్నీ ప్రభావితం చేశాయి.

ఇందిరా గాంధీ హయాంలోనే ప్రపంచబ్యాకు,ఐఎంఎఫ్‌ చెప్పిన వాటిని అమలు చేయటం ప్రారంభించారు, దాని వలన ప్రయోజనం లేదని అరకొర అవీ పైపైన గాక కచ్చితంగా వాటిని అమలు జరపటం, రక్షణాత్మక విధానాల బదులు స్వేచ్చా మార్కెట్‌, ఉదారవాదవిధానాలు తప్ప మరొక మార్గం లేదనే అభిప్రాయాలు బలపడటం వంటి అంశాలున్నాయి. ప్రభుత్వ రంగ విస్తరణ, పెట్టుబడుల విధానాన్ని పక్కన పెట్టి సర్వం ప్రయివేటుకే అప్పగించారు. అయినా సేవారంగంలో వచ్చిన మార్పులు తప్ప పారిశ్రామిక, వ్యవసాయ రంగాలలో సాధారణ పెరుగుదల తప్ప సంస్కరణల ప్రభావం ప్రత్యేకంగా కనిపించటం లేదు. మన దిగుమతులు తప్ప ఎగుమతులు పెరటం లేదు. సంస్కరణలను మరింతగా అమలు జరపాలని అందుకు కఠిన నిర్ణయాలు తీసుకోవాలనే వాదనలు మన్మోహన్‌ సింగ్‌ హయాంలోనే ఇంటా బయటి నుంచి వత్తిళ్లు ప్రారంభమయ్యాయి. యుపిఏ ఒకటి హయాంలో వామపక్షాల మద్దతుతో ప్రభుత్వం నడవటం వలన కార్పొరేట్ల కోరికలు తీర్చటం సాధ్యం కాలేదు. యుపిఏ 2 హయాంలో వామపక్షాలతో నిమిత్తం లేకుండానే పాలన సాగినా ధరల పెరుగుదల, అవినీతి అక్రమాల కుంభకోణాలతో పరువు పోయిన సమయంలో వెనకడుగు వేయక తప్పలేదు.

గుజరాత్‌-గోద్రా-మారణకాండ నేపధ్యంలో అవసరమైతే జనాన్ని అణచి తమ అజెండాను అమలు జరిపే సాహసవంతుడు కార్పొరేట్లకు నరేంద్రమోడీలో కనిపించారు. అంతకంటే కావాల్సింది ఏముంది.అవసరమైన ప్రచారం, హంగు, అర్భాటాలతో కొత్త దేవుడు వచ్చాడన్నట్లుగా పరిస్ధితిని తయారు చేశారు. ఒక అజెండాను కూడా రూపొందించారు. పారిశ్రామికవేత్తలు కోరిన విధంగా భూమి పొందేట్లు నిర్ణయాలు తీసుకోవాలి, కార్మిక చట్టాలను నీరు గార్చాలి, పన్ను సంస్కరణలను అమలు జరపాలి, బ్యాంకులు, బీమా రంగం నుంచి తప్పు కోవాలి.మిగిలిన ప్రభుత్వ రంగ సంస్దలను ప్రయివేటీకరించాలి, వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు అప్పగించాలి. ఇందుకు అవసరమైన ఇతర అనుబంధ చర్యలు తీసుకోవాలి. దానిలో భాగంగానే అంతకు ముందు తాము వ్యతిరేకించిన జిఎస్‌టిని మోడీ అమలు చేశారు. మిగతావాటికీ రంగం సిద్దం చేశారు. అయితే పెద్ద నోట్ల రద్దు వంటి పిచ్చిపనితో తలెత్తిన ఇబ్బందులు, జిఎస్‌టితో వచ్చిన సమస్యలు, ఆర్ధిక రంగంలో వృద్ధి రేటు ఎనిమిది నుంచి నాలుగుశాతానికి పడిపోవటం, దాదాపు అన్ని రంగాలలో వైఫల్యం కారణంగా మిగతా అంశాల అమలును వేగం చేస్తే జనం నుంచి ప్రతిఘటన ఎదురవుతుందనే భయమే ఇప్పుడు నరేంద్రమోడీని పీడిస్తోంది. మొరటుగా ముందుకు పోతే అధికారానికే మోసం వస్తుందనే బెరుకు మొదలైంది.


అన్ని వ్యవస్ధలను దిగజార్చుతున్న మాదిరే మోడీ హయాంలో ఏకాభిప్రాయ సాధన, భిన్నాభిప్రాయాల వెల్లడి లేదా చర్చకు అవకాశాలు ఇవ్వని నిరంకుశ ధోరణి పెరుగుతోంది. గతంలో పార్లమెంటులో ప్రవేశ పెట్టిన బిల్లుల్లో 60-70శాతం కమిటీల చర్చకు పంపేవారు ఇప్పుడు అవి పదిశాతానికి పడిపోయాయి. ప్రవేశపెట్టే బిల్లుల గురించి ముందుగా చర్చించటం కూడా తగ్గిపోయింది. తొలి ఐదు సంవత్సరాలలో 186 బిల్లులను ప్రవేశపెడితే వాటిలో 44 మీదే ముందుగా సంప్రదింపులు జరిపారు. కరోనా సమయంలో వ్యవసాయ సంస్కరణల్లో భాగంగా సరైన సంప్రదింపులు, చర్చలు లేకుండా మూడు బిల్లులను ఆమోదించుకున్న తీరు, వాటికి వ్యతిరేకంగా రైతాంగం ఎనిమిది నెలలుగా జరుపుతున్న ఉద్యమం గురించి తెలిసిందే. ఆ చట్టాల అమలును సుప్రీం కోర్టు తాత్కాలికంగా పక్కన పెట్టింది. వ్యవసాయ చట్టాల తరువాత కార్మిక చట్టాలకు రంగం సిద్దం చేశారు. అయితే అనూహ్యంగా కరోనా వచ్చింది. సహాయక చర్యలు, దాన్ని గుర్తించటంలో నిర్లక్ష్యం, వైఫల్యం ఒకటైతే ఆర్ధికంగా దేశం కుదేలు కావటం వలన సంస్కరణల కిక్కు జనానికి ఎక్కించటం సాధ్యం కాదు. ఏ చమురు ధరలైతే మోడీ అధికారానికి రాగానే గణనీయంగా పడిపోయి ప్రభుత్వం మీద భారం తగ్గించటంతో పాటు ఆమేరకు జనం మీద భారం మోపి అదనపు వనరులను సమకూర్చుకొనేందుకు దోహదం చేశాయో ఇప్పుడు అవే రాబోయే రోజుల్లో మెడకు చుట్టుకోనున్నాయి. ఇప్పుడు మోడీ తలపెట్టిన సంస్కరణల అజెండా యుపిఏ హయాంలోనే ఉంది.వాటి అమలు, తటపటాయింపు మన్మోహనసింగు ఇష్ట అయిష్టాల కారణంగా వాయిదా పడలేదు. ధరల పెరుగుదల వంటి అంశాలతో పాటు అవినీతి అక్రమాలు ఆ ప్రభుత్వాన్ని కుదిపివేసిన కారణంగా తగ్గారు. అందుకే కార్పొరేట్లు సింగును పక్కన పెట్టి మోడీకి జై కొట్టారు.


ఏడు సంవత్సరాల తరువాత ఆర్ధిక వ్యవస్ధ కుదేలు కావటం, పన్నుల కారణంగా చమురు ధరలు రికార్డు స్ధాయికి చేరటం, వాక్సిన్‌పై పిల్లిమొగ్గలు, ఆక్సిజను కూడా అందించలేని కరోనా వైఫ్యల్య నేపధ్యం అన్నింటికీ మించి రైతుల ప్రతిఘటన వంటి అంశాల నేపధ్యంలో మోడీ మీద ఇంకా మోజు ఉన్నప్పటికీ మరిన్ని సంస్కరణల గురించి కబుర్లు చెబితే నమ్మే స్ధితిలో జనం లేరు. అదే అసలు సమస్య. చెప్పిన మాట, చేసిన వాగ్దానాలను మరోసారి చెప్పటం, మాట్లాడే అలవాటులేని మోడీ గారికి పరిస్ధితి ముందు నుయ్యి వెనుక గొయ్యిగా ఉంది. మొరటుగా ముందుకు పోతే జనంలో ప్రతిఘటన, కోరిక తీర్చకపోతే కార్పొరేట్లు చేయాల్సింది చేస్తారు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

ప్రాణాలు తీస్తున్న అధిక పని గంటలు -పనిలేక నిరుద్యోగుల ఆత్మహత్యలు !

18 Sunday Jul 2021

Posted by raomk in Current Affairs, Economics, employees, Health, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, UK, Uncategorized, USA, Women

≈ Leave a comment

Tags

#workers Health, extreme work weeks, ILO, Long working hours, Occupational diseases, overwork in India, WHO


ఎం కోటేశ్వరరావు


పని సందర్భంగా వడదెబ్బ సంబంధిత అత్యధిక గాయాలు, సమస్యలు పరిగణనలోకి రావటం లేదని న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక జూలై 15న ఒక విశ్లేషణ ప్రచురించింది. వడగాలులు శ్రమ జీవులను ప్రత్యేకించి పేదవారిని అనూహ్య పద్దతులలో ఎలా గాయపరుస్తాయో తాజా సమాచారం వెల్లడించిందని పేర్కొన్నది. దాని సారాంశం ఇలా ఉంది. తీవ్ర వడగాడ్పులు సంభవించినపుడు పెద్ద సంఖ్యలో వడదెబ్బలే కాదు పడిపోవటం, యంత్రాలను సరిగా పనిచేయించలేకపోవటం, వాహనాల మధ్య ఇరుక్కుపోవటం వంటివి కూడా గణనీయంగా ఉంటున్నాయి. పని స్ధలాల్లో ఇతర కారణాలతో తగిలే గాయాలకు కాలిఫోర్నియాలోనే అదనంగా ప్రతి సంవత్సరం వడదెబ్బ గాయాలు ఇరవై వేలు తోడవుతున్నాయి. వీటి వలన పని మీద కేంద్రీకరించటం కష్టం అవుతోంది. పశ్చిమ అమెరికా, బ్రిటీష్‌ కొలంబియాలో ఇటీవలి వడగాడ్పులకు 800 మంది మరణించారు. బహిరంగ ప్రదేశాల్లోనే కాదు ఉత్పాదక యంత్రాలు, గోడవున్లలో పని చేసే వారికి కూడా వడగాడ్పులు ముప్పు తెస్తున్నాయి. వడగాడ్పు గాయాల వలన వేతనాలను కోల్పోవటం, వైద్య ఖర్చు పెరగటం, ఉష్ట్రోగ్రతలు పెరిగే కొద్దీ వేతన వ్యత్యాసం కూడా పెరుగుతోంది. 2001 నుంచి 2018వరకు కాలిఫోర్నియాలో గాయాలకు పరిహారం చెల్లించిన కోటీ పదిలక్షల నివేదికలను పరిశోధకులు విశ్లేషించారు. తేదీలు, పని ప్రాంతాలు, వడగాడ్పుల తీవ్రత, గాయాల సంఖ్య తీరుతెన్నులను విశ్లేషించగా వేడి ఎక్కువగా ఉన్నపుడు గాయాలు ఎక్కువగా నమోదైనట్లు తేలింది. అధికారికంగా సగటున 850 గాయాలైనట్లు నివేదికలు చూపాయి. అయితే వాస్తవ గాయాలతో పోల్చితే ఇవి చాలా తక్కువ. అరవై డిగ్రీల ఫారన్‌హీట్‌ ఉన్నపుడు తగిలిన గాయాలతో పోల్చితే 85-90 డిగ్రీలు ఉన్నపుడు ఐదు నుంచి ఏడుశాతం, వంద డిగ్రీలకు పెరిగినపుడు పది నుంచి 15శాతం పెరిగాయి. వడ దెబ్బ గాయాలు గరిష్ట వేతనాలు పొందే వారితో పోల్చితే కనిష్ట వేతనాలు పొందే కార్మికులకు ఐదు రెట్లు ఎక్కువ ఉన్నాయి.వడదెబ్బ తగల కుండా కొన్ని చర్యలు తీసుకున్న తరువాత కేసులు సంఖ్య తగ్గింది తప్ప తీరుతెన్నులు మాత్రం అలాగే ఉన్నాయి.


మనది ఉష్టమండల ప్రాంతం. ఉష్ణోగ్రతలు అమెరికా కంటే ఎక్కువ నమోదౌతున్నాయి.వేసవిలో 110-115 మధ్య ఉన్న సందర్భాలు ఎన్నో. రికార్డు స్ధాయిలో రాజస్దాన్‌లో 124 కూడా నమోదైంది. అధిక ఉష్ణోగ్రత నమోదైనపుడు వడదెబ్బ తగలకుండా నివారణ చర్యలు తీసుకున్న సంస్దలు ఎన్ని ఉన్నాయన్నది ప్రశ్నార్దకం. అమెరికా మాదిరి మన దేశంలో కూడా పరిశోధన చేస్తే తప్ప తీవ్రత బయటకు రాదు. వడదెబ్బ ఒక్కటే కాదు కష్టజీవుల జీవితాలను దెబ్బతీస్తున్న వృత్తి రుగ్మత అంశాలు అనేకం ఉన్నాయి. వాటిలో ఓవర్‌టైమ్‌ కూడా ఒకటి.ప్రపంచ ఆరోగ్య సంస్ధ (డబ్ల్యుహెచ్‌ఓ) తొలిసారిగా అంతర్జాతీయ కార్మిక సంస్ధ(ఐఎల్‌ఓ)తో కలసి దీర్ఘపని గంటల మీద నిర్వహించిన సర్వే ప్రకారం ఏడాదికి ఆ కారణంగా మరణిస్తున్నవారు 7,45,000 మంది(ఇది 2016 సంఖ్య) ఉన్నారట. గుండెపోటు, హృదయ సంబంధ వ్యాధులు దీనికి కారణం. ఆగేయ ఆసియా, పశ్చిమ పసిఫిక్‌ ప్రాంత దేశాలలోని కార్మికులు ఎక్కువగా ప్రభావితులౌతున్నారు.ఆసియాలో గుండెపోటు ముప్పు మామూలుగానే ఎక్కువ, దీనికి అధిక పని గంటల సమస్య మరింత పెంచుతోంది. వారానికి 35-40 గంటల పాటు పని చేసేవారితో పోల్చితే 55 గంటలు, అంతకు మించి పని చేసే వారిలో గుండెపోటు వచ్చే అవకాశాలు 35శాతం, గుండె సంబంధ వ్యాధులతో ప్రాణాలు కోల్పోయే ముప్పు 17శాతం ఎక్కువగా ఉంది. ఈ కారణంగా మరణిస్తున్న వారిలో నాలుగింట మూడు వంతులు మధ్యవయస్కులు లేదా వృద్దులు ఎక్కువగా ఉన్నారు. రోజుకు ఎక్కువ గంటలు పని చేసిన వారిలో ఇది పని మానేసిన తదుపరి జీవితంలో, కొన్ని సందర్భాలలో దశాబ్దాల తరువాత కూడా ప్రభావం చూపుతోంది. అధిక పని గంటలు అంటే భౌతిక శ్రమే చేయనవసరం లేదు, ఇతరత్రా పనిలో ఎక్కువ గంటలు ఉన్నా ముప్పు ఉంటుంది.పిల్లలతో సహా అధిక గంటలు పని చేస్తున్నవారు ప్రపంచ జనాభాలో తొమ్మిదిశాతం ఉన్నారు.2000 సంవత్సరం తరువాత వీరి సంఖ్య పెరుగుతోంది.


వృత్తిపరంగా తలెత్తే రుగ్మతలకు కారణాలు అనేక వాటిలో సింహభాగం అధిక పని గంటలే అని తేలింది. ఎక్కువ సేపు భౌతిక శ్రమ చేయటం ముప్పు కారణమైతే, అది లేకుండా ఇతరంగా ఎక్కువ గంటలు పని చేసే వారు మద్యం, పొగాకు వినియోగం, తక్కువ సేపు నిద్రపోవటం, వ్యాయామం లేకపోవటం, అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవటం వంటి అంశాలు కూడా ముప్పును పెంచుతున్నాయి. దీర్ఘకాలం పనిచేసే వారి సంఖ్య ప్రపంచ వ్యాపితంగా పెరుగుతోంది. కరోనా మహమ్మారి సమయంలో అది మరింత పెరిగింది. అధికపని చేసినందుకు ప్రతిఫలం కూడా అన్ని సందర్భాలలో ఉండటం లేదు. ఇంటి నుంచి పని చేసే వారు సగటున 3.6 గంటలు ఎక్కువ సేపు విధి నిర్వహణలో ఉంటున్నారని తేలింది. యజమానులు వృత్తి రుగ్మతలను పరిగణనలోకి తీసుకోవాలని, తక్కువ పని గంటలు ఉంటే ఉత్పత్తి ఎక్కువ వస్తుందని గ్రహించాలని ప్రపంచ ఆరోగ్య సంస్ద పేర్కొన్నది. అప్పగించిన ప్రాజెక్టు పనులు నిర్ణీత గడువులోగా పూర్తికావాలనే లక్ష్యాలు నిర్ణయిస్తున్నందున వాటికోసం ఇంట్లో లేదా పని స్ధలాల్లో ఎక్కువ సేపు పని చేయటంతో పాటు వత్తిడి సమస్య కూడా తలెత్తుతోంది. అధిక పని గంటల కారణంగా గుండెపోటు, హృదయ సంబంధ వ్యాధులతో మరణిస్తున్న వారిలో నాలుగింట మూడు వంతుల మందికి గుండెకు రక్త ప్రసరణ తగ్గిన కారణంగా తలెత్తే ఇస్కీమిక్‌ హృదయ వ్యాధి మూలం అని తేలింది. దీనికి వత్తిడి, అధికరక్తపోటు కారణం.ప్రస్తుతం ప్రపంచంలో కేవలం 15శాతం మంది కార్మికులకు మాత్రమే వృత్తిపరమైన రుగ్మతల చికిత్స ప్రత్యేక సేవలు అందుబాటులో ఉన్నాయి. తమిళనాడులోని తిర్పూరు-కోయంబత్తూరు ప్రాంతంలోని నూలు, వస్త్ర, దుస్తుల పరిశ్రమలో వెలువడే పత్తి ధూళి కారణంగా కార్మికుల్లో బ్రోంకైటిస్‌, టీవి, బరువు తగ్గటం, వినికిడి శక్తి నష్టపోవటం వంటి రుగ్మతలు తలెత్తుతున్నాయని విశ్లేషణలో తేలింది. ఈ పరిశ్రమల్లో పని చేసే వారి జీవిత కాలం కూడా తగ్గిపోతోంది. ఎన్‌ఎస్‌ఎస్‌ 2018 సర్వే ప్రకారం 83శాతం మంది కార్మికులకు ఆరోగ్య బీమా లేదు.


అధిక గంటలు పని చేస్తున్న వారు ఆసియాలో ఎక్కువగానూ ఐరోపాలో తక్కువగానూ ఉన్నారు. తగిన ప్రతిఫలం లేదా ఆదాయం లేని కారణంగా ఆసియాలోని అనేక ప్రాంతాలలో రోజుకు ఒకటి కంటే ఎక్కువ పనులు చేస్తున్నవారెందరో. పని గంటల పరిమితులు ఉన్నప్పటికీ వాటికి వక్రభాష్యాలు, మరొక కారణమో చెప్పి ఎక్కువ పని గంటలు చేయిస్తున్నారు. అదొక లాభసాటి వ్యవహారంగా కూడా ఉంటోంది. ఒకరిని అదనంగా నియమించుకొని పని చేయించుకోవటం కంటే ఆ మేరకు ఇద్దరో ముగ్గురి చేతో ఓవర్‌ టైమ్‌ చేయించుకోవటం యజమానికి లాభం కనుకనే ఆ పని చేస్తున్నారు.


పని చేయటంలో జపనీయులను ఆదర్శంగా తీసుకోవాలని కొంత మంది చెబుతారు. అక్కడి కార్మికులు నిరసన తెలియచేయాలంటే సమ్మెల కంటే అదనంగా ఉత్పత్తి చేసి యజమానుల మీద వత్తిడి చేస్తారనే కథలు కూడా బాగానే వినిపిస్తారు.సెలవులు తీసుకోవాలంటే సిగ్గుపడతారని ఆకాశానికి ఎత్తుతారు. 1970దశకంలో చమురు సంక్షోభం తలెత్తినపుడు అక్కడి కార్మికవర్గం మీద పెట్టుబడిదారులు 70గంటల పనిని రుద్దారు.అలా పని చేయటం గర్వకారణం, జపనీయుల దేశభక్తికి నిదర్శనం అన్నట్లు ప్రచారం చేసి సాధారణం కావించారు. ఇప్పుడు అనేక దేశాల్లో పెట్టుబడిదారీ వర్గం అదే చేసేందుకు ప్రయత్నిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్ధ, ప్రపంచ కార్మిక సంస్ధ చేసిన సర్వే అంశాలవే. అయితే జపాన్‌లో 70గంటల పని రుద్దుడు పర్యవసానం ఏమిటి ? అక్కడి పని సంస్కృతికి మరోపేరు ” కరోషి ” అంటే అధికపనితో చావు. ఇలాంటి చావులు పెరిగిన కారణంగా పని గంటల గురించి అక్కడ పునరాలోచన ప్రారంభమైంది. అనేక మంది కార్మికులు పని వత్తిడి తట్టుకోలేక కార్యాలయాల మీద నుంచి దూకి ఆత్మహత్యలు చేసుకున్నవారున్నారు. ఇదొక సామాజిక సమస్యగా మారింది. ప్రతి ఏటా కరోషీ బాధితులు పెరుగుతున్నారు. ఏటా పదివేల మంది మరణిస్తున్నారని అంచనా. కానీ ప్రభుత్వ లెక్కల్లో రెండు వందలు మాత్రమే ఉంటున్నాయి. మరీ ఎక్కువ వత్తిడి చేస్తే మొదటికే మోసం వస్తుందని లేదా పరిహారం చెల్లించాల్సిన కారణాల వలన గానీ ఇటీవలి కాలంలో కొందరు యజమానులు తమ సిబ్బందికి బలవంతంగా సెలవులను ఇస్తున్నారు. ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తోంది. సెలవులకు వేతనాలు పొందుతున్న కార్మికులు 2018లో 52.4శాతం మందే ఉన్నారు. సెలవు తీసుకుంటే వేతనం ఇవ్వరు గనుక అనేక మంది వాటి జోలికి పోరు. చూశారా జపాను వారు సెలవులు కూడా తీసుకోకుండా పని చేస్తారని బయటి ప్రపంచం సుద్దులు చెబుతుంది.


ఆర్ధిక సహకార మరియు అభివృద్ది సంస్ధ (ఓయిసిడి) సభ్య దేశాలలో పదకొండు చోట్ల వారానికి 50 గంటల కంటే ఎక్కువే పని చేస్తున్నారు.నాలుగు దేశాల్లో అధిక గంటలు పని చేసే వారు టర్కీలో 33, మెక్సికోలో 29, కొలంబియాలో 26.6, దక్షిణ కొరియాలో 25.2, జపాన్‌లో 17.9శాతం మంది ఉన్నారని ఓయిసిడి చెబుతోంది.పని-కుటుంబం, వ్యక్తిగత జీవితాలను సమన్యయ పరచుకోవటంలో తీవ్ర సమస్యలు తలెత్తుతున్నాయి. ఇది లాభాలు తప్ప మరొకటి పట్టని పెట్టుబడిదారీ వ్యవస్ధ సృష్టించిన సమస్య తప్ప మరొకటి కాదు.


తాజాగా మాన్‌పవర్‌ గ్రూప్‌ సంస్ధ జరిపిన సర్వే ప్రకారం అధిక గంటలు పని చేసే దేశాల్లో మనం ప్రధమ స్దానంలో ఉన్నాం.1981-1996 మధ్య కాలంలో పుట్టిన వారిని మిలీనియల్స్‌ అంటున్నారు.వీరు మన దేశంలో 52, చైనాలో 48, అమెరికాలో 45, బ్రిటన్‌లో 41 గంటలు పని చేస్తున్నారని సర్వేలో తేలింది. తీవ్ర పోటీ, పని చేయకపోతే ఉద్యోగం ఊడుతుందన్న భయం వంటి అంశాలు రోజుకు పది గంటల కంటే ఎక్కువ సేపు పనిలో ఉండేట్లు చేస్తున్నాయి. ఫోర్డ్‌ కంపెనీ చేసిన సర్వే ప్రకారం వారానికి 12 గంటలు ఉద్యోగులు వాహనాలు నడపటానికి వెచ్చిస్తున్నారు. అంటే పని గంటలకు ఇది అదనం. ఉదాహరణకు 52 పని గంటలైతే అందుకోసం మరోపన్నెండు గంటల పాటు ప్రయాణంలో వెచ్చించాల్సి వస్తోంది.


మన దేశంలో సంభవిస్తున్న ఆత్మహత్యలలో పదిశాతం నిరుద్యోగం, దారిద్య్రం, దివాలా వంటి కారణాలతో జరుగుతున్నాయి. ఒకవైపు అధిక గంటలు పని చేసే వారు అత్యధికులుండగా మరో వైపు అసలు పనే లేని నిరుద్యోగులు కనిపిస్తారు. అధిక గంటలు పనిచేసే దేశాలలో మనది ఐదవ స్ధానమని ఐఎల్‌ఓ తెలిపింది. 2020-21 ప్రపంచ వేతన నివేదికలో అతి తక్కువ కనీస వేతనాలు చెల్లిస్తున్న దేశాల్లో మనది ఒకటని కూడా వెల్లడించింది. 2019 మన జాతీయ గణాంక సంస్ద సర్వే ప్రకారం రోజులో పదో వంతు కూడా దేశ ప్రజలు తీరుబడి కార్యక్రమాల్లో పాల్గొనటం లేదు. కార్మికశక్తిలో మహిళల శాతం తగ్గిపోతున్నదని ప్రపంచబ్యాంకు పేర్కొన్నది, గత సంవత్సరం 20.3శాతమే ఉన్నారని, అంతకు ముందుకంటే గణనీయంగా తగ్గినట్లు తెలిపింది. మన దేశంలో వారానికి నాలుగు దినాలు, రోజుకు పన్నెండు గంటల పని విధానాన్ని ప్రవేశపెట్టాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది యజమానుల లబ్ది కోసం తప్ప మరొకటి కాదు. ఓవర్‌టైమ్‌కు అదనంగా చెల్లించాల్సిన అవసరం లేకుండా చేయటమే ఇది. అధిక పని గంటలు, వృత్తి రుగ్మతల కారణంగా తలెత్తే పర్యవసానాల గురించి మన దేశంలో సమగ్రమైన చట్టాలు చేయాల్సి ఉంది. ఉన్న చట్టాలనే నీరుగార్చేందుకు పూనుకుంటున్న పాలకుల హయాంలో అది జరిగేనా !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

నిర్మలమ్మ తాయిల పొట్లంలో ఏముంది ? ఎంత మేరకు ప్రయోజనం !

29 Tuesday Jun 2021

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, Economics, Health, History, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, Uncategorized

≈ Leave a comment

Tags

CPI(M), Narendra Modi Failures, Nirmala Sitaraman stimulus package, SITARAM YECHURY


ఎం కోటేశ్వరరావు


కరోనా ప్రభావాన్ని తగ్గించేందుకు మన ప్రధాని నరేంద్రమోడీ గారు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ గారితో ఒక తాయిల పొట్లాన్ని పంపారు. దాని విలువ 6.29లక్షల కోట్ల రూపాయలని చేసిన ప్రకటనపై మిశ్రమ స్పందన వెలువడింది. వాణిజ్య, పారిశ్రామికవేత్తలు స్వాగతించారు.గతంలో ప్రకటించిన అంశాలనే కొత్త రంగు కాగితాల్లో చుట్టి చూపటం తప్ప కేంద్ర ప్రభుత్వం చేసే అదనపు ఖర్చేమీ లేదని సిపిఎంనేత సీతారామ్‌ ఏచూరి వ్యాఖ్యానించారు. ఇంకా మరికొన్ని వ్యాఖ్యలు కూడా వెలువడ్డాయి. గత ఏడాది ప్రకటించిన 20లక్షల కోట్ల ఆత్మనిర్భర పాకేజ్‌ వలన జనానికి, పారిశ్రామిక వాణిజ్య రంగాలకు జరిగిన మంచేమిటో ఇంతవరకు చెప్పిన వారెవరూ లేరు. ఇప్పుడు ఇది కూడా అలాంటి వట్టి విస్తరి మంచినీళ్లేనా ?


నిర్మలమ్మ దేశం ముందుంచిన పొట్లంలో ఏముందో విప్పి చూద్దాం. 1.కరోనా ప్రభావిత రంగాలకు రుణ హామీ నిమిత్తం రు.1.10లక్షల కోట్లు.2.అత్యవసర రుణాల హామీగా రు.1.5లక్షల కోట్లు. 3. విద్యుత్‌ పంపిణీదార్లకు ఆర్ధిక సాయం రు.97,631 కోట్లు, 4. ఉచిత ఆహార ధాన్యాలకు రు.93,869 కోట్లు, 5.ఎగుమతి బీమా నిమిత్తం రు.88,000 కోట్లు, 6.ఎగుమతుల ప్రోత్సాహం కోసం రు.33,000 కోట్లు, 7. అదనపు ఎరువుల సబ్సిడీ రు.14,775 కోట్లు, 8.నూతన ఆరోగ్య పధకం రు.15,000 కోట్లు, 9. గ్రామీణ ఇంటర్నెట్‌కోసం రు.19,041 కోట్లు,10. విదేశీ పర్యాటకులకు ఉచిత వీసాల నిమిత్తం రు.100 కోట్లు, 11.ఈశాన్య ప్రాంత వ్యవసాయ కార్పొరేషన్‌కు రు.77 కోట్లు దీనిలో ఉన్నాయి. వీటిలో గతంలో ప్రకటించిన ఆహార సబ్సిడీ, ఎరువుల సబ్సిడీ రు.1,08,644 కోట్లు పోతే ఐదు లక్షల 21వేల కోట్లే కొత్తవి.


మహమ్మారి అయినా మాంద్యం వచ్చినా రెండు రకాల పనులు చేయాల్సి ఉంటుందని అనేక దేశాల అనుభవాలు వెల్లడించాయి. మన ప్రభుత్వానికి అవేమైనా పట్టాయా అన్నదే అర్ధంగాని విషయం. తక్షణమే ఉపశమనం కలిగించేవి, దీర్ఘకాలంలో ఉపయోగపడే వృద్ధికి అవసరమైనవి. జనానికి నగదు అందచేస్తే తక్షణ గిరాకీ పెరుగుతుంది. ఉచిత నగదు అంటే దాని అర్దం అది వస్తు డిమాండ్‌ను పెంచేదే తప్ప సోంబేరులను తయారు చేసేది కాదు. అత్మనిర్భర, తాజా తాయిలంలో అవి ఉన్నాయా అంటే లేవు. జనాలకు ఉచితంగా కొన్ని కిలోల బియ్యం లేదా గోధుమలు ఇస్తే చాలదు. కేరళలో మాదిరి బియ్యంతో పాటు వంటకు అవసరమైన పప్పులు, నూనెలు, ఇతర వస్తువులను కూడా అందచేసినపుడే ప్రయోజనం ఉంటుంది.


విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు ఐదు లక్షల మందికి వీసాలు ఉచితంగా ఇస్తాం రమ్మంటున్నారు. వీసా ఉచితంగా వచ్చింది కదా అని ఎవరైనా వచ్చి ఖరీదైన కరోనాను తగిలించుకుంటారా ? అనేక రాష్ట్రాలు పరీక్షలను సమగ్రంగా లేదా పెద్ద సంఖ్యలో చేయటం లేదు. వ్యాధిగ్రస్తులు, మరణాలను లెక్కల్లో చూపటం లేదు. కొత్త రకం వైరస్‌ వ్యాప్తి జరుగుతున్న నేపధ్యం. పోనీ వాక్సిన్లు వేసి వ్యాధి నిరోధక చర్యలు తీసుకున్నారా అంటే అదీ లేదు. మన దేశంలోని జనాలే మరో చోటుకు పోవాలంటే భయపడుతున్న స్ధితిలో పొలో మంటూ విదేశీయులు వస్తారా ? అందువలన పర్యాటక రంగానికి 60వేల కోట్లు అప్పులిప్పిస్తామంటున్నారు. ఇప్పటికే కుదేలైన ఈ రంగం వాటిని తీసుకొని ఏమి చెయ్యాలి అన్నది సమస్య.


మన ప్రజారోగ్య వ్యవస్ధను ఎంత పటిష్టం గావించాలో కరోనా మహమ్మారి వెల్లడించింది. దానికి అవసరమైన చర్యలు తీసుకోవటం ద్వారా జనాల జేబులు గుల్లకాకుండా చూడవచ్చు. రాష్ట్రాలకు ఆమేరకు నిర్ధిష్టంగా సాయం ప్రకటించి ఉంటే అది వేరు. మూడవ తరంగం, అది పిల్లలను ప్రభావితం చేయనుందనే భయాల నేపధ్యంలో అత్యవసర ఏర్పాట్లకు ప్రకటించింది కేవలం పదిహేను వేల కోట్ల రూపాయలే అవి ఏమూలకు వస్తాయి. వైద్య రంగంలో పెట్టుబడులకు వడ్డీ రేటు తక్కువకు 50వేల కోట్ల రూపాయలను చిన్న పట్టణాలలో ఆసుపత్రుల ఏర్పాటుకు అప్పులిప్పిస్తామని నిర్మలమ్మ హామీ ఇచ్చారు. దాని వలన జనానికి ఆరోగ్య ఖర్చు పెరుగుతుంది తప్ప తగ్గేదేమీ ఉండదు. అనేక కార్పొరేట్‌ ఆసుపత్రులు కొంత శాతం పేదలకు ఉచితంగా సేవలు అందిస్తామని చెప్పి రాయితీలు పొంది వాటిని ఎగనామం పెట్టటమే గాకుండా వారు కొనుగోలు చేసిన వైద్య యంత్రాలకు అవసరమైన సమిధలుగా రోగులను మార్చటాన్ని, లాభాలు పిండటాన్ని చూస్తున్నాము.


మన ఆర్ధిక వ్యవస్ధలో ఎంఎస్‌ఎంఇల ప్రాధాన్యత గురించి చెప్పనవసరం లేదు. గతేడాది ఆత్మనిర్భర పధకం ప్రకటించే సమయానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వాటి దగ్గర కొనుగోలు చేసిన వస్తువులకే లక్షల కోట్ల రూపాయల బకాయిలు ఉన్నట్లు వెల్లడైంది. ఇప్పటికీ వాటికి ఎంత బకాయి ఉన్నదీ, ఏడాది కాలంలో ఎంత చెల్లించిందీ స్పష్టత లేదు. రెండు నుండి మూడులక్షల కోట్ల మేరకు బకాయి ఉన్నట్లు చెబుతుంటే కేంద్ర ప్రభుత్వం చెల్లించినట్లు చెబుతున్న మొత్తం పదిశాతం కూడా లేదు. ఇంకా బకాయిలు పన్నెండువేల కోట్లకు మించి లేవని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ఇప్పుడు ప్రకటించిన పాకేజ్‌ కూడా ఇప్పటికే రుణాలు తీసుకొని సకాలంలో చెల్లించిన రికార్డు ఉన్నవారికే హమీ అనే వ్యాఖ్యలు వెలువడ్డాయి. మరోవైపు కొనుగోలు శక్తి పడిపోయిన స్దితిలో గిరాకీయే లేదంటుంటు రుణాలు ఎవరు తీసుకుంటారు, ఉత్పత్తి చేసిన సరకులను ఎక్కడ అమ్ముకుంటారు ?

రుణ హామీ పధకాల గత ఏడాది ప్రకటించిన పరిమితుల విస్తరణే తప్ప కొత్తవేమీ లేవు. అదే విధంగా కొత్తగా ఉపాధి కల్పించే సంస్ధలకు ప్రభుత్వమే రెండు సంవత్సరాల పాటు పిఎఫ్‌ చెల్లించే పధకాన్ని మరో తొమ్మిది నెలలు పాడిగించారు. రానున్న ఐదు సంవత్సరాలలో ఎగుమతుల ప్రోత్సాహకానికి 88వేల కోట్లు ప్రకటించారు. ఉత్పత్తి, ఎగుమతులతో ముడిపడిన ఎలక్ట్రానిక్‌ వస్తువుల కోసం ప్రవేశపెట్టిన ఈ పధకం కొత్తదేమీ కాదు. దాని వలన ఇప్పటి వరకు నిర్ధిష్టంగా పెరిగిన ఎగుమతులేమిటో తెలియదు.


ఎంఎస్‌ఎంఇ రంగం పన్నెండు కోట్ల మందికి ఉపాధి కల్పిస్తున్నట్లు లెక్కలు చెబుతున్నాయి.జిడిపిలో 30శాతం, ఎగుమతుల్లో 40శాతం ఈ రంగం నుంచే ఉన్నాయి. ఈ రంగంలోని కన్సార్టియం ఆఫ్‌ ఇండియన్‌ అసోసియేషన్స్‌(సిఐఏ) జూన్‌ 24న ప్రకటించిన సర్వే ప్రకారం 88శాతం మైక్రో లేదా చిన్న సంస్ధలు గతేడాది ప్రకటించిన పాకేజ్‌ను ఉపయోగించుకోలేదని తేలింది. ఈ రంగంలో ఉపాధి పొందుతున్న వారు నాలుగు కోట్ల మంది ఉన్నారు.వారికి భవిష్యత్‌ మీద ఆశలేదు.ప్రపంచ బ్యాంకు చెప్పిన దాని ప్రకారం 6.3 కోట్ల ఎంఎస్‌ఎంఇ సంస్దలుంటే వాటిలో కేవలం 50లక్షలు మాత్రమే ప్రభుత్వ పధకాల నుంచి ఆర్ధిక సాయం పొందాయి.పొందాయి.కరోనా రెండవ తరంగంలో కేవలం ఐదోవంతు సంస్దలు మాత్రమే బతికి బట్టకడతాయని లోకల్‌ సర్కిల్స్‌ సర్వే వెల్లడించింది. నలభైశాతం సంస్దలు నెల రోజుల కంటే బతకలేవని తేలింది.

కరోనా మహమ్మారి విలయతాండవం కొనసాగుతున్న ఈ కాలమంతా లక్షలాది ప్రజలు తమ ఆదాయాలను, జీవనోపాధిని కోల్పోయారు. ఈ సమయంలో ప్రపంచంలోని చాలా ప్రభుత్వాలు తమ దేశాల్లో సార్వత్రిక నగదు బదిలీ ద్వారా ప్రజలను ఆదుకున్నాయి. అమెరికా ప్రభుత్వం తాజాగా ఆరులక్షల కోట్ల డాలర్ల పాకేజ్‌ను అమలు జరపాలని ప్రతిపాదించింది. దానిలో నగదు బదిలీతో పాటు శాశ్వత ఆస్ధుల కల్పన వంటి చర్యలున్నాయి. నరేంద్రమోడీ సర్కార్‌ అలాంటి ఆలోచనలో లేదు.


ద్రవ్యలోటును అదుపులో ఉంచే పేరుతో ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు,ఐఎంఎఫ్‌ ఆదేశించిన మేరకు కొన్ని స్వయం పరిమితులు విధించుకుంది. అయినా మే 2021లో టోకుధరలు 12.94 శాతం, రిటైల్‌ ధరలు 6.3 శాతం పెరిగాయి. జనానికి నగదు బదులు ఆ మొత్తాన్ని కార్పొరేట్‌ రంగానికి పన్ను రాయితీగా ఇస్తే లాక్‌డౌన్‌ అనంతర కాలంలో ఆర్థిక వ్యవస్థ పుంజుకోడానికి ఆస్కారం కలుగుతుందని గతేడాది ప్రభుత్వం చెప్పింది. కాని ఏప్రిల్‌ నెలలో 4.3 శాతం వ ద్ధి రేటు ఉన్న పారిశ్రామిక వస్తూత్పత్తి రంగం మే నెల వచ్చేసరికి 3.1 శాతానికి పడిపోయింది. ఈ కాలంలో రూపాయి మారకపు రేటు మరింత తగ్గిపోయింది. ప్రభుత్వం చెప్పిందో, దానికి పూర్తి వ్యతిరేక దిశలో ఫలితాలు వస్తున్నాయి.

నగదు బదిలీ వామపక్షాలో, లేదా ఇతర మేథావులో చెబుతున్నదే కాదు, సిఐఐ చైర్మన్‌ నరేంద్రన్‌ రూ.3 లక్షల కోట్ల ఉద్దీపన పథకాన్ని ప్రభుత్వానికి ప్రతిపాదించారు. అందులో నగదుబదిలీ కూడా ఒక అంశం. కాబట్టి నగదు బదిలీ అనేది ఇప్పుడు ఆర్థికవేత్తలు, ప్రతిపక్షపార్టీలు, పౌర సంఘాలు మాత్రమే గాక పెట్టుబడిదారులు కూడా సమర్ధిస్తున్న ప్రతిపాదన. దీని వలన వస్తు డిమాండ్‌ పెరిగితేనే వారి ఉత్పత్తులకు మార్కెట్‌ ఉంటుందన్నది దీని వెనుక ఉన్న భావం. కొటాక్‌ మహింద్రా బ్యాంక్‌ యజమాని ఉదయ కొటాక్‌ ద్రవ్యలోటు పెంచాలని గట్టిగా చెప్పడమే గాక, అందుకోసం అదనంగా కరెన్సీని కూడా ముద్రించాలని సూచించారు. కోవిడ్‌-19 కారణంగా చనిపోయినవారి కుటుంబాలకు పరిహారం చెల్లించేది లేదని ప్రభుత్వం సుప్రీం కోర్టుకు ఇచ్చిన అఫిడవిట్‌లో పేర్కొంది. ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన లెక్కలనే ప్రమాణంగా తీసుకుంటే కోవిడ్‌ మరణాలు దేశంలో 4 లక్షలకు మించవు. ఒక్కొక్క మరణానికి రు. 4 లక్షల పరిహారం చెల్లించాలంటే రూ.16,000 కోట్లు అవుతుంది.ఈ మాత్రం సొమ్ము కేంద్రం దగ్గర లేదా ?


సిఎంఐఇ అధ్యయనం ప్రకారం, జూన్‌ 13తో ముగిసిన వారంలో నిరుద్యోగిత రేటు 12 శాతానికి చేరుకుంది. పట్టణ ప్రాంతాల్లో, రేటు చాలా అధికంగా దాదాపు 15 శాతంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇది దాదాపు 11 శాతంగా ఉంది. జనవరిలో ఉద్యోగుల సంఖ్య 40.1 కోట్లుగా అంచనా. మే నాటికి 36.6 కోట్లకు తగ్గింది. 2021లో లాక్‌డౌన్ల వల్ల ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయిన వారిలో అత్యధికులు రోజువారీ ఆదాయంపై ఆధారపడిన పేదలే. ఈ ఏడాది ఏప్రిల్‌-మే నెలలో రోజువారీ వేతన కార్మికులు 1.72 కోట్లకు పైగా ఉద్యోగాలు, ఆదాయాలు కోల్పోయారు. వేతనాలు, వ్యాపారరంగంపై ఆధారపడిన వారు ఈ రెండు నెలల్లో 90 లక్షల మంది తీవ్రంగా నష్టపోయారు. ఇవన్నీ ప్రధానంగా పట్టణ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు.


గత ఏడాది మాదిరిగానే వ్యవసాయ రంగంలోనూ ఉద్యోగావకాశాలు కుంచించుకుపోయాయి. నిర్మాణ రంగంపై ఆధారపడిన తక్కువ వేతనంతో పనిచేసే అసంఘటితరంగ కార్మికులు గత రెండు నెలల్లో 88 లక్షల మంది ఉపాధి కోల్పోయారని సిఎంఐఇ అంచనా వేసింది. దీంతోపాటు తీవ్రంగా ప్రభావితమైన తయారీరంగంలో 42 లక్షల ఉద్యోగాలు పోయాయి. ఆతిథ్య రంగంలో 40 లక్షలు, వాణిజ్య రంగంలో 36 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు.


ప్రజల కోసం ప్రభుత్వ నిధులను ఖర్చు చేయాలని వామపక్షాలు, కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, అనేక ప్రజా సంఘాలు, కాంగ్రెస్‌ కూడా డిమాండ్‌ చేసింది. పన్ను చెల్లించని అన్ని కుటుంబాలకు ప్రతి నెలా కనీసం రూ.7,500 చెల్లించాలని డిమాండ్‌ చేశాయి. ఇది ప్రస్తుతం అందజేస్తున్న రేషన్‌కు అదనంగా ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా కనీసం 10 కిలోల ఆహార ధాన్యం, పప్పుధాన్యాలు, ఇతర సరకులు ఇవ్వటం ద్వారా జనాలు తక్షణం ఉపశమనం పొందుతారు, కొనుగోలు శక్తి పెరుగుతుంది. నిర్మలమ్మ తాయిలాల పొట్లంలో అలాంటివేమీ లేవు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

కరోనా మరణాలను దాచని రాష్ట్రం కేరళ ఒక్కటే !

25 Friday Jun 2021

Posted by raomk in BJP, CPI(M), Current Affairs, Health, History, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion, Uncategorized

≈ Leave a comment

Tags

#Pinarayi Vijayan, COVID- 19 pandemic, excess corona death trends, Kerala Corona Deaths, Kerala LDF


ఎం కోటేశ్వరరావు


కేరళలో సిపిఎం నాయకత్వంలోని ఎల్‌డిఎఫ్‌ కూటమి ప్రభుత్వం అనేక అంశాలలో ముఖ్యంగా కరోనా నిరోధంలో చేస్తున్న కృషికి ప్రశంసలు వస్తున్న సంగతి తెలిసిందే. రెండవ తరంగంలో అక్కడ పెద్ద ఎత్తున కేసులు పెరిగిన నేపధ్యంలో సామాజిక మాధ్యమాల్లో సంఘపరివార్‌ మరుగుజ్జులు రెచ్చిపోయారు. కేరళ ఆదర్శం అన్నారు, కేసులు ఎందుకు పెరిగాయంటూ తమదైన పద్దతిలో ప్రచార దాడి చేశారు. దానికి కొందరు బలైపోయి ఉంటారు. అక్కడి ప్రభుత్వం పట్ల సానుకూలంగా వ్యవహరించే వారిలో కూడా ఎందుకిలా పెరుగుతున్నాయనే ఆందోళన వ్యక్తమైన మాట నిజం. శత్రువులు ఎలా చూసినా మిత్రులు ఎలా ఆవేదన చెందినప్పటికీ కేరళ జనం వాటిని పట్టించుకోలేదు. పాలకులు, ప్రభుత్వ చిత్తశుద్దిని విశ్వసించి చరిత్రను తిరగరాస్తూ రెండో సారి అధికారాన్ని కట్టబెట్టారన్నది తెలిసిందే. ఆ రాష్ట్రముఖ్యమంత్రి పినరయి విజయన్‌ కరోనా గురించి విలేకర్లతో మాట్లాడినన్ని రోజులు, నిర్వహించిన పత్రికా సమావేశాలు దేశంలో మరొకరెవరూ చేయలేదు. దేన్నీ దాచుకోలేదు,కేసులు ఎలా పెరగబోయేదీ ఆయనే చెప్పారు.


అన్నింటికంటే ముఖ్యవిషయం ఏమంటే దేశంలో మిగతా రాష్ట్రాలలో మాదిరి కరోనా మరణాలను, కేసులను కేరళ ప్రభుత్వం మూసిపెట్టలేదు. అలాచేసిన రాష్ట్రాలలో పరిస్ధితి ఎలా పాచిపోయిందో చూస్తున్నాము. సమాచార హక్కు కింద హిందూ పత్రిక సేకరించిన అధికారిక వివరాలు మరణాలను తక్కువ చేసి చూపిన రాష్ట్రాల బండారాన్ని బయటపెట్టాయి. కేరళ గురించి కూడా ఆ పత్రిక రాసిన విశ్లేషణ మరోసారి పినరయి ప్రభుత్వ నిజాయితీని నిర్ధారించింది. ఎక్కడైనా సాధారణ మరణాల రేటుకు ఒక ఏడాది ఒకటో రెండు శాతాలో ఎక్కువో తక్కువ ఉండవచ్చు. కరోనా మహమ్మారి కారణంగా జరిగిన మరణాలు అధికారిక లెక్కలకు ఎక్కినా వాటిని కరోనా ఖాతాలో చూపలేదన్నదే అసలు సమస్య. తెలంగాణా వంటి చోట్ల అలాంటివి పది రెట్లు ఎక్కువగా ఉన్నాయి. అయితే కేరళలో నూటికి నూరుశాతం మరణాలు నమోదవుతున్నాయా అంటే లాక్‌డౌన్‌,తదితర అనేక కారణాలతో సహజమరణాలు కూడా కొన్ని సకాలంలో నమోదు కావటం లేదనే అభిప్రాయం ఉంది.
కేరళ విషయానికి వస్తే ఏటా నమోదౌతున్న సాధారణ మరణాల కంటే కరోనా సమయంలో మరణాల సంఖ్య తగ్గింది.

రాజధాని తిరువనంతపురంలో 2020 ఏప్రిల్‌ నుంచి 2021 మేనెల వరకు కరోనా మరణాలు 765 కాగా ఇదే కాలంలో సాధారణ మరణాలతో సహా మొత్తం మీద 646 తగ్గాయి. 2015 నుంచి 2019 వరకు సగటున ఏటా నగరంలో మరణాలు 16,652 కాగా 2020లో కరోనా ఉన్నప్పటికీ 14,734 మాత్రమే నమోదయ్యాయి. కరోనాను పక్కన పెట్టి మరణాల పెరుగుదల రేటును పరిగణనలోకి తీసుకున్నప్పటికీ 18,340 వరకు పెరగాల్సింది, తగ్గాయి. ఒక్క రాజధాని నగరమే కాదు, మొత్తం రాష్ట్రంలో 2019తో పోల్చితే 2020లో 11.1శాతం తగ్గాయి. అయితే తాజా వివరాల ప్రకారం ఆ తగ్గుదల 7.9శాతంగా ఉంది. అంటే ఈ ఏడాది మరణాలు కొద్దిగా పెరిగాయి. అవి కరోనా మరణాలన్నది అధికారిక అంకెలే చెబుతున్నాయి. కేరళ మరణాల నమోదు నిబంధనల ప్రకారం మరణించిన 21 రోజుల్లోపల స్ధానిక సంస్ధలలో నమోదు చేసుకోవాలి. లేనట్లయితే ఆ ప్రక్రియ సంక్లిష్టం అవుతుంది. అందువలన ఆస్ధి, ఇతర వివాదాలు లేని మరణాలు నమోదు కాకపోవచ్చు. 2020లో లాక్‌డౌన్‌ కారణంగా సకాలంలో నమోదు ప్రక్రియ ఉండే శ్మశానాలలో తప్ప బయటివి నమోదు కానందున అధికారికంగా మరణాలు తగ్గినట్లు కనిపించవచ్చన్నది కూడా కొందరి అభిప్రాయం. దానిలో వాస్తవం కూడా ఉండవచ్చు.


కేరళలో మరణాల రేటు తగ్గటం అనేది ఇప్పుడే జరిగింది కాదు. గతంలో కూడా అలాంటి ధోరణి వ్యక్తమైంది. 2013లో రాష్ట్రంలో 2,53లక్షలు నమోదు కాగా 2014లో 12,621, 2015లో 3,920 తక్కువగా నమోదయ్యాయి. దీనికి రాష్ట్రంలో ఆరోగ్య సూచికల మెరుగుదల వలన సగటు జీవిత కాలం ఏడాదికేడాది పెరుగుతున్నది.అందువలన మరణాలు తగ్గుతాయి. 2021 జనవరి నుంచి మేనెలాఖరు వరకు పౌర నమోదు వ్యవస్ధ(సిఆర్‌ఎస్‌)లో ఉన్న సమాచారం మేరకు మొత్తం మరణాలు 1,13,372గా ఉన్నాయి. ఒక సంస్ధ చేసిన విశ్లేషణ ప్రకారం 2015 నుంచి 2019వరకు ఉన్న వివరాల ప్రకారం ప్రతి ఏటా జనవరి-మే మాసాల మధ్య మరణించిన సగటు సంఖ్య 98,387. దీని ప్రాతిపదికన చూస్తే ఈ ఏడాది ఐదు నెలల్లో నమోదైన అధిక మరణాలు 14,535 అని, ఇదే సమయంలో ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన కరోనా మరణాలు 6,700గా ఉన్నందున 8,867 నమోదు గాని కరోనా మరణాలు అని, అయితే అవి ఇతర రాష్ట్రాలతో పోల్చితే చాలా తక్కువ అని సదరు సంస్ధ పేర్కొన్నది. పైన పేర్కొన్న సంవత్సరాలలో మేనెల సగటు మరణాలు 19,600 అని ఈ ఏడాది మేనెలలో 28వేలుగా ఉన్నాయని వ్యాఖ్యానించింది.కేంద్ర ప్రభుత్వ సిఆర్‌ఎస్‌ సమాచారం ప్రకారం 2015-19 సంవత్సరాల మధ్య సగటు మరణాలు 1,08,425 మాత్రమే. దీని ప్రకారం చూస్తే అదనపు మరణాలు 4,950 మాత్రమే.

వివిధ మీడియా సంస్ధల విశ్లేషణ ప్రకారం కర్ణాటకలో 2021 జనవరి – జూన్‌ 15వ తేదీ మధ్య 1.02లక్షల మరణాలు నమోదయ్యాయి. అవి అధికారిక లెక్కల కంటే ఐదు రెట్లు ఎక్కువ. ఆంధ్రప్రదేశ్‌లో జనవరి-మే మాసాల మధ్య 1.3లక్షలు నమోదు కాగా అవి అధికారికంగా ప్రకటించిన వాటి కంటే 34 రెట్లు ఎక్కువ. తమిళనాడులో 1.29లక్షలు అదనం, అధికారిక లెక్కల కంటే 7.5 రెట్లు అదనం, తెలంగాణాలోని హైదరాబాదులో అధికంగా నమోదైనవి 14,332. కేరళలో అనేక మంది మరణించిన కుటుంబ సభ్యులను గృహ ప్రాంగణాలలోనే సమాధి చేస్తారని, అలాంటి వారు నమోదు చేయటం, ధృవీకరణ పత్రాలు తీసుకోవటం గానీ చేయరని, 2020లో లాక్‌డౌన్‌ కారణంగా నమోదు గణనీయంగా తగ్గి ఉండవచ్చన్నది ఒక అభిప్రాయం. 2018లో సాధారణ పరిస్ధితిలోనే సకాలంలో మరణ నమోదుశాతం 62శాతమే ఉంది.

రాజధానుల వివరాలను మాత్రమే చూస్తే కర్ణాటక రాజధాని బెంగళూరులో ప్రభుత్వం ప్రకటించిన కరోనా మరణాలు 13,346 కాగా అక్కడ సాధారణం కంటే ఎక్కువగా నమోదైనవి 31,029 ఉన్నాయి. అలాగే చెన్నయిలో 7,091కిగాను 29,910 ఉన్నాయి. హైదరాబాదులో సాధారణం కంటే 32,751 ఎక్కువ ఉన్నాయి. పైన చెప్పుకున్నట్లుగా తిరువనంతపురంలో 765 కరోనా మరణాలు ఉన్నా మొత్తంగా 645 తగ్గాయి. ఈ ఏడాది జనవరి నుంచి కరోనా మరణాలు గణనీయంగా పెరిగినట్లు కార్పొరేషన్‌ వివరాలు వెల్లడించాయి. వీటిలో పొరుగునే ఉన్న గ్రామాలు, కొల్లం జిల్లా, తమిళనాడు నుంచి చికిత్సకోసం వచ్చి మరణించిన వారు కూడా ఉన్నారు. అలాంటి ఉదంతాలు మిగతా రాష్ట్రాలలో కూడా ఉండవచ్చు.


సహజమరణాలు తగ్గటానికి జనాలు ఇండ్లకే పరిమితం కావటంతో రోడ్డు ప్రమాదాలు, మరణాలు తగ్గటం, న్యుమోనియా, ఫ్లూ, నీరు, బయటి ఆహార సంబంధ వ్యాధులు పరిమితం కావటం దోహదం చేశాయని భావిస్తున్నారు. అన్నింటి కంటే వెంటనే స్పందించే ప్రజారోగ్య సౌకర్యాలు, ప్రభుత్వ ఆసుపత్రుల వ్యవస్ధ, వాటిని పని చేయించే, పట్టించుకొనే రాజకీయ నాయకత్వం ప్రధాన కారణం. అక్షరాస్యత, విద్యావంతులు ఎక్కువగా ఉండటం వెంటనే స్పందించటం, పరీక్షలు, గుర్తించటం కూడా మిగతా చోట్లతో పోలిస్తే ఎక్కువే.కరోనా కారణంగా కేరళలో రోడ్డు ప్రమాద మరణాలు గణనీయంగా తగ్గాయి. మిగతా రాష్ట్రాలలో కూడా అదే జరిగి ఉండవచ్చు.2016-19 సంవత్సరాల మధ్య ఏడాదికి సగటున 4,290 మంది మరణించగా 2020లో 2,979, ఈ ఏడాది జూన్‌ 21వరకు 1,423 నమోదయ్యాయి.


అనేక రాష్ట్రాలలో జరుగుతున్న మాదిరే కేరళలో కూడా కొన్ని తేడాలు ఉండవచ్చు. ఉదాహరణకు కరోనా వచ్చి తగ్గిపోయిన తరువాత ఇతర కారణాలతో మరణిస్తే లేదా కరోనా లక్షణాలు లేనందున గుర్తించటంలో పొరపాటు గావచ్చు, మరణించిన తరువాత కరోనా అని తేలితే దాన్ని ఏ తరగతి కింద నమోదు చేయాలి అన్నది అందరికీ అవగాహన కూడా లేకపోవచ్చు. ఇటీవల సుప్రీం కోర్టు కరోనా మరణ ధృవీకరణ పత్రాల జారీని సులభతరం చేయాలని సూచించింది. ఆమేరకు అనేక రాష్ట్రాలలో కరోనా మరణాల సంఖ్యలను సవరిస్తున్నారు. కేరళలో కూడా అదే జరగవచ్చు, అయితే కేసులు స్వల్పంగా పెరుగుతాయి తప్ప మిగతా రాష్ట్రాలలో మాదిరి అసాధారణంగా ఉండవు. కేసులు, మరణాలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలతో పోల్చితే వాటిని దాచని రాష్ట్రం కేరళ ఒక్కటే అన్నది స్పష్టం.

కరోనా మరణాల విషయానికి వస్తే ప్రస్తుతం దేశంలో 1.3శాతం ఉండగా కేరళలో అది 0.44శాతమే ఉంది. దేశంలో వాస్తవ మరణాలను లెక్కిస్తే దేశ సగటు గణనీయంగా పెరుగుతుంది.కేరళలో తొలి దశలో కేసులు, మరణాలు తక్కువగా ఉన్నప్పటికీ రెండవ దశలో ఎక్కువగా ఎందుకు పెరిగాయన్నది పరిశీలించాల్సిన అంశం అయితే, దేశంతో పోల్చినపుడు మరణాలు తక్కువగా ఉండటం గమనించాల్సిన అంశం. తొలి దశలో మాదిరే రెండవ దశలో కూడా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కేసులు పెరిగాయి. ఆ దామాషాలో మరణాలు పెరగలేదు. రెండవ దశలో వేగంగా విస్తరించే డెల్టా రకం వైరస్‌ వ్యాప్తి ఒక కారణం అని కొందరు నిపుణులు చెబుతున్నారు. మరణాలు ఎక్కువగా ఉండటానికి ఆరోగ్య వ్యవస్ధ మీద వత్తిడి పెరగటం అన్నవారు కొందరు. కేవలం నలభై రోజుల్లోనే రెండవ దశలో మరణాలు గణనీయంగా ఉన్నాయి. ఇతర ఆరోగ్య సమస్యలతో ఇండ్ల దగ్గరే మరణించిన వారి వివరాలు కొన్ని ప్రభుత్వ వ్యవస్ధలో ఇంకా చేరాల్సి ఉండవచ్చని, అయినప్పటికీ సగటు, వాస్తవ మరణాల మధ్య తేడా తగ్గుతుందే తప్ప పెరిగే అవకాశం లేదన్నది కొందరి అభిప్రాయం. మిగతా రాష్ట్రాలలో మాదిరి కేరళ ప్రభుత్వం కూడా వివరాలను మూసి పెట్టి ఉంటే అక్కడి ప్రభుత్వాన్ని నిరంతరం స్కాన్‌ చేసి చూసే మీడియా ఈ పాటికి రచ్చ రచ్చచేసి ఉండేది. దేశంలో మిగతా రాష్ట్రాలతో పోల్చి కేరళలో కూడా వాస్తవ మరణాలు ఎక్కువ ఉండవచ్చని అమెరికా సంస్ద చేసిన విశ్లేషణను అక్కడి పత్రికలు ప్రకటించాయి తప్ప స్వంత కథనాలు లేవు.


కరోనా అనాధలకు ప్రభుత్వ ఆదరణ !


కరోనా కారణంగా తలిదండ్రులిద్దరినీ కోల్పోయి అనాధలైన పిల్లలను ఆదుకొనేందుకు కేరళ ప్రభుత్వం మూడు రకాలుగా ఆదుకోవాలని నిర్ణయించింది. ప్రతి ఒక్కరి పేరు మీద మూడు లక్షల రూపాయల ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేస్తారు. డిగ్రీ వరకు చదువుకు అయ్యే ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుంది. అప్పటి వరకు నెలకు రెండు వేల రూపాయల చొప్పున గుర్తింపు పొందిన సంరక్షకులు-పిల్లల సంయుక్త బ్యాంకు ఖాతాలో జమ చేస్తారని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జి చెప్పారు. ఈ వివరాలను ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలియచేసింది. కరోనాతో నిమిత్తం లేకుండా తలిదండ్రులలో ఒకరు మరణించినా, కరోనాతో మరొకరు మరణించి అనాధలైన పిల్లలకు కూడా ఈ పధకం వర్తిస్తుంది. ప్రస్తుతం ఇద్దరూ మరణించిన పిల్లలు 74 మంది ఉండగా, ఎవరో ఒకరు మరణించిన వారు వెయ్యి మంది ఉన్నారు.


కన్నూరులో సిపిఎం వినూత్న ప్రచార కార్యక్రమం !


కన్నూరు జిల్లాలో సిపిఎం వినూత్న కార్యక్రమం చేపట్టింది.” కొటేషన్‌ మాఫియా ”, సామాజిక రుగ్మతలకు వ్యతిరేకంగా జూలై ఐదున 3801 కేంద్రాలలో సాయంత్రం ఐదు గంటలకు పెద్ద ప్రచార కార్యక్రమం నిర్వహించనున్నట్లు పార్టీ జిల్లా కార్యదర్శి ఎంవి జయరాజన్‌ ప్రకటించారు. కేరళకు చెందిన వారు గల్ఫ్‌, ఇతర దేశాలలో ఉపాధి కోసం వెళ్లే వారు పెద్ద సంఖ్యలో ఉన్న విషయం తెలిసిందే. వారు తాము మిగుల్చుకున్న పొదుపుతో బంగారం, హవాలా పద్దతిలో నల్లధనాన్ని కేరళకు తీసుకువస్తారు. అలాంటి వాటిని విదేశాల నుంచి పంపి విమానాశ్రయాలు, ఇతర చోట్ల నుంచి తీసుకొని సంబంధిత వ్యక్తులకు చేర్చేందుకు ప్రయివేటు వారిని వినియోగించుకుంటారు. వీరినే కొటేషన్‌ గ్యాంగ్‌ అంటారు. ఇవి లెక్కల్లో చూపనివి కనుక అంతా నమ్మకం, రహస్య పద్దతుల్లో జరుగుతుంది. ఈ బలహీనతలను సొమ్ము చేసుకొనేందుకు ఇవే కొటేషన్‌ గ్యాంగులు ప్రయత్నిస్తాయి. ఉదాహరణకు ఒక కొటేషన్‌ గ్యాంగ్‌ మనుషులు బంగారం, డబ్బు తీసుకు వస్తున్న విషయాన్ని మరో గ్యాంగు పసికట్టిందనుకోండి. దారి మధ్యలో మొదటి గ్యాంగు నుంచి వాటిని కొట్టివేస్తారు. ఇలాంటి వారు నేరగాండ్లుగా, ముఠానేతలుగా మారి పెద్ద ఎత్తున సంపాదించి ఆస్తులు సమకూర్చుకున్నవారున్నారు. బాధితులు ఆ విషయాన్ని బయటకు చెప్పుకోలేరు. ఈ వ్యవహారాల్లో ముఠాల మధ్య వివాదాలు చెలరేగి హింసాత్మక చర్యలకు పాల్పడటం, కొందరు మధ్యవర్తులుగా రంగంలోకి దిగటం, దుండగులు రాజకీయ పార్టీలను ఆశ్రయించటం పరిపాటిగా మారింంది.


అసెంబ్లీ ఎన్నికల సమయంలో బిజెపి నేతలు పెద్ద ఎత్తున కర్ణాటక, ఇతర ప్రాంతాల నుంచి తెచ్చిన కోట్ల రూపాయలు ఈ మార్గాన ఇలాంటి కొటేషన్‌ గ్యాంగుల ద్వారా తెచ్చినవే. రాష్ట్రబిజెపి నేతలు గిలగిల్లాడిపోతున్న కొడక్కర హవాలా సొమ్ము దోపిడీ ఉదంతం దీనిలో భాగమే. ఒక ముఠా తెస్తున్న సొమ్మును మధ్యలో ఒక ముఠా అడ్డగించి సొమ్మును అపహరించింది. మూడున్నర కోట్ల రూపాయల వరకు పోగొట్టుకున్నవారు కేవలం ఇరవై అయిదు లక్షల రూపాయల దోపిడీ జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ కేసు తీగలాగటంతో డొంకంతా కదిలి ఇంకా పెద్ద మొత్తంలోనే చేతులు మారినట్లు, ఎన్నికల్లో ఖర్చు చేసినట్లు బయటపడుతోంది. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడి మీదే ఈ సంబంధిత కేసు నమోదైంది. అనేక మంది యువకులు ఇలాంటి ముఠాల్లో చేరి నేరపూరిత చర్యల ద్వారా సులభంగా డబ్బు సంపాదించి తెల్లవారే సరికి పెద్దవారై పోవాలని చూస్తున్నారు. అందువలన తలిదండ్రులు తమ బిడ్డలు ఏమి చేస్తున్నారు, నేరగాండ్ల చేతుల్లో చిక్కుతున్నారా, విలాస వంతమైన జీవితం లేదా విచ్చల విడిగా ఖర్చు చేస్తుంటే వారికి ఆ సొమ్ము ఎలా వస్తున్నదీ చూసుకోవాల్సిన, జాగ్రత్త పడాల్సిన అవసరాన్ని వివరిస్తూ సిపిఎం జిల్లాలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమం నిర్వహించనుంది. కొటేషన్‌ మాఫియా నిర్వాహకులు సమాజంలో గౌరవనీయ వ్యక్తులుగా కనిపించేందుకు ప్రయత్నిస్తూ తమ లావాదేవీలను పెంచుకొనేందుకు కుటుంబాలతో సంబంధాలను పెట్టుకుంటారు. వివాహాల వంటి సామాజిక, కుటుంబ కార్యక్రమాలకు, ధార్మిక కార్యక్రమాల్లో భాగస్వాములౌతారు. వాటి మాటున తమ నేరాలను కప్పి పుచ్చుకొనేందుకు ప్రయత్నిస్తున్నారని ఇలాంటి వారందరినీ సమాజం నుంచి వేరు చేయాలని సిపిఎం కోరింది.


మహిళా కమిషన్‌ అధ్యక్షురాలి రాజీనామా !


కేరళ మహిళా కమిషన్‌ అధ్యక్షురాలు ఎంసి జోసఫిన్‌ రాజీనామా చేశారు. ఒక న్యూస్‌ ఛానల్‌ నిర్వహించిన ప్రత్యక్ష ప్రసారంలో అత్తింటి వేధింపులకు గురైన ఒక యువతి చేసిన ఫిర్యాదు సందర్భంగా స్పందించిన తీరు రాష్ట్రంలో తీవ్ర విమర్శలు, నిరసనలకు గురైంది. వేధింపుల గురించి పోలీసులకు ఫిర్యాదు చేశావా అని జోసఫిన్‌ అడిగినపుడు లేదు అని యువతి సమాధానం చెప్పింది. అయితే అనుభవించు అని జోసఫిన్‌ చేసిన వ్యాఖ్య వివాదాస్పదమైంది. ఒక తల్లి మాదిరి అలా అన్నానే తప్ప మరొక విధంగా కాదని, తన వ్యాఖ్యకు విచారిస్తున్నానని ఆమె ప్రకటించారు. అయినా నిరసనలు ఆగలేదు, ఈ లోగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గం ఈ అంశాన్ని చర్చించి పదవికి రాజీనామా చేయాలని ఆదేశించటంతో శుక్రవారం నాడు ఆ మేరకు ప్రకటన చేశారు. జోసఫిన్‌ సిపిఎం కేంద్ర కమిటీ సభ్యురాలిగా ఉన్నారు. రాష్ట్రంలో చాలా కాలం తరువాత వరకట్న వేధింపులకు విస్మయి అనే యువతి బలైన ఉదంతం ఇదే సమయంలో రాష్ట్రంలో తీవ్ర సంచలనం కలిగించి, నిరసనలు వెల్లడవుతున్న సమయంలో ఆమె చేసిన వ్యాఖ్య సామాజిక మాధ్యమం, రాజకీయ, మహిళా సంఘాల నుంచి తీవ్ర విమర్శలకు గురైంది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

చమురు ధరల పెరుగుదల : బిజెపికి ముందుంది ముసళ్ల పండగ !

21 Monday Jun 2021

Posted by raomk in BJP, Current Affairs, Economics, Farmers, Health, History, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, Uncategorized

≈ Leave a comment

Tags

BJP double standards, Fuel Price in India, Fuel tax hike in India, Narendra Modi Failures


ఎం కోటేశ్వరరావు


నాలుగు నెలల క్రితం లోకల్‌ సర్కిల్స్‌ అనే సంస్ధ ఒక సర్వే జరిపింది. దాని ప్రకారం పెరుగుతున్న చమురు ధరల ఖర్చును సర్దుబాటు చేసుకొనేందుకు ఇతర ఖర్చులను తగ్గించుకుంటున్నామని 51శాతం మంది చెప్పారు. అత్యవసర వస్తువుల మీద ఖర్చు తగ్గించుకోవటం బాధాకరంగా ఉందని 21శాతం మంది అన్నారు. ఆ సర్వే రోజు ఢిల్లీలో పెట్రోలు ధర 90.93, డీజిలు ధర రూ.81.32 ఉంది. జూన్‌ 21న 97.22, 87.97కు పెరిగాయి. అంటే పైన పేర్కొన్న జనాలు ఇంకా పెరుగుతారని వేరే చెప్పనవసరం లేదు. అచ్చేదినాలలో ఉన్నాం కనుక దేశభక్తితో ఇతర ఖర్చులు తగ్గించుకొని దేశం కోసం త్యాగం చేస్తున్నాం. జూన్‌ 21న చమురు మార్కెట్లో బ్రెంట్‌ రకం ముడిచమురు పీపాధర 73.50కు అటూ ఇటూగా, మన దేశం కొనుగోలు చేసే రకం ధర.72.39 డాలర్లుగా ఉంది. సాధారణంగా బ్రెంట్‌ కంటే ఒక డాలరు తక్కువగా ఉంటుంది.
కొంత మంది పాలకులకు, కొన్ని పార్టీలకు చరిత్ర అంటే మహాచిరాకు. ఎందుకంటే జనాలు వాటి పేజీలను తిరగేస్తే బండారం బయట పడుతుంది. గతంలో ఏమి చెప్పారో ఇప్పుడేమి చెబుతున్నారో జనం చర్చించుకుంటారు. ప్రతిఘటనకు ఆలోచనలే నాంది కనుక, జనాన్ని ఏదో ఒక మత్తులో చేతనా రహితంగా ఉంచాలని చూస్తారు. చమురు ధరల గురించి గుజరాత్‌ ముఖ్యమంత్రిగా నరేంద్రమోడీ ఏమి చెప్పారో, ప్రధానిగా ఉంటూ ఆయనేమి చేస్తున్నారో, సచివులేమి మాట్లాడుతున్నారో తెలుసుకోవటం అవసరం.


మరోవైపున చమురు ధరలు పెంచటం వలన సామాన్యులకు ఎలాంటి ఇబ్బంది లేదని చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ గతేడాది జూన్‌30న చెప్పారు. ధరల పెంపుదలను నిరసిస్తూ కాంగ్రెస్‌ చేసిన ఆందోళనను ప్రస్తావించి ఈ వ్యాఖ్య చేశారు.కుటుంబంలో సమస్య తలెత్తినపుడు భవిష్యత్‌ అవసరాలను చూసుకొని జనాలు సొమ్మును జాగ్రత్తగా ఖర్చు పెడతారు. చమురు ధరల పెంపును కూడా ఇదే విధంగా చూడాలి. చమురు పన్నుల ద్వారా వసూలు చేస్తున్న డబ్బును ఆరోగ్యం, ఉపాధి, ఆర్ధిక భద్రత చేకూరే ఇతర వాటి మీద ఖర్చు చేస్తున్నాం. ప్రధాన మంత్రి గరీబ్‌ కల్యాణ యోజన పధకం కింద పేదలు, రైతులకు అనేక పధకాల కింది 1,70,000 కోట్ల రూపాయలు కేటాయించాం. జనాల ఖాతాల్లో సొమ్ము జమ చేస్తున్నాం. ఆరునెలల పాటు ఉచితంగా రేషన్‌ మరియు మూడు నెలల పాటు ఉచితంగా గ్యాస్‌ సిలిండర్లు ఇస్తున్నాం. పేదలకు సంక్షేమ పధకాలను అమలు జరుపుతుంటే సోనియా గాంధీ, కాంగ్రెస్‌ భరించలేకపోతున్నాయి.” అన్నారు. ఏడాది తరువాత కూడా ఇదే పద్దతిలో సమర్ధించుకున్నారు.


సంక్షేమ పధకాలకు ఖర్చు చేస్తున్నాం కనుక చమురు ధరలను తగ్గించేది లేదని మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ జూన్‌ 13న కరాఖండిగా చెప్పేశారు. ధరలు జనానికి సమస్యగా ఉందని తెలిసినప్పటికీ చేసేదేమీ లేదన్నారు. వాక్సిన్ల కోసం 35వేల కోట్లు, ఎనిమిది నెలల పాటు పేదలకు ఉచిత ఆహార ధాన్యాలు ఇవ్వటానికి ప్రధాని మంత్రి గరీబ్‌ కల్యాణయోజన పధకం కింద లక్ష కోట్ల రూపాయలు కేటాయించారు.వేలాది కోట్ల రూపాయలను కిసాన్‌ సమ్మాన్‌ యోజన కింద బ్యాంకుల్లో జమచేశాము, రైతులకు కనీస మద్దతు ధరలను పెంచాము కనుక ఈ ఏడాది ఇవన్నీ ఉన్నందున చేయగలిగిందేమీ లేదన్నారు.


ఇవన్నీ ఇప్పుడు చెబుతున్న సాకులు మాత్రమే. ఆరు సంవత్సరాల క్రితం నుంచి క్రమంగా పెంచటంతో పాటు గతేడాది బడ్జెట్‌ సమయంలోనే చమురు పన్నులు భారీగా పెంచారు. గత మూడు సంవత్సరాలలో చమురు పన్ను ద్వారా వచ్చిన ఆదాయ సంఖ్యలే అందుకు సాక్షి. ఈ ఏడాది మార్చి ఎనిమిదవ తేదీన లోక్‌సభకు మంత్రి ప్రధాన్‌ ఇచ్చిన సమాధానం ప్రకారం గత మూడు సంవత్సరాలలో వచ్చిన ఆదాయం ఇలా ఉంది.2018-19లో 2.13లక్షల కోట్లు, 2019-20లో 1.78లక్షల కోట్లు, 2020-21లో ఏప్రిల్‌ నుంచి జనవరి వరకు (పది నెలలకు) 2.94లక్షల కోట్లు వచ్చింది. కరోనా రెండవ తరంగం వస్తుందని ముందే ఊహించి ఇంత భారీ ఎత్తునపన్నులు విధించినట్లు భావించాలా ? ఇన్ని కబుర్లు చెబుతున్నవారు వాక్సిన్ల భారాన్ని రాష్ట్రాల మీద వేసేందుకు ఎందుకు ప్రయత్నించినట్లు ? 2014-15లో అంటే నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తొలి ఏడాది కేంద్రం పెట్రోలు మీద రు.29,279 కోట్లు, డీజిలు మీద 42,881 కోట్లు వసూలు చేయగా ఆర్ధికశాఖ సహాయ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ ఈ ఏడాది మార్చి 22న లోక్‌సభలో చెప్పినదాని ప్రకారం 2020 ఏప్రిల్‌ నుంచి 2021 జనవరి వరకు పెట్రోలు మీద రు.89,575 కోట్లు, డీజిలు మీద రు.2,04,906 కోట్లు ఎక్సయిజ్‌ పన్ను వసూలైంది. ఇంత పెంపుదల రైతులు, కరోనా కోసమే చేశారా ? కరోనా నిరోధ పరికరాలు, ఔషధాల మీద జిఎస్‌టి తగ్గించటానికి ససేమిరా అని వత్తిడి తట్టుకోలేక నామ మాత్ర రాయితీ ఇచ్చిన పెద్దలు చెబుతున్నమాటలివి. బిజెపి పెద్దలు ప్రతిపక్షంలో ఉండగా ఏమి చెప్పారు ? ఏమి చేశారు ?


కాంగ్రెస్‌ నాయకత్వంలోని యుపిఏ ప్రభుత్వ వైఫల్యానికి చమురు ధరల పెరుగుదల గొప్ప తార్కాణం అని 2012 మే 23న ఒక ట్వీట్‌ ద్వారా నరేంద్రమోడీ విమర్శించారు.బహుశా అప్పటికి ప్రధాని పదవి ఆలోచన లేదా లేక ఎప్పటికెయ్యది అప్పటికామాటలాడి తప్పించుకొనే ఎత్తుగడలో భాగంగా చెప్పారా ? ధరల పెంపుదల వలన గుజరాత్‌ పౌరుల మీద వందల కోట్ల భారం పడుతుందని కూడా నాడు ముఖ్యమంత్రిగా మోడీ చెప్పి ఉంటారు. 2012లో రైలు ఛార్జీల పెంపు పేదలు, రైతులకు వ్యతిరేకం అని నిరసన తెలుపుతూ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా నరేంద్రమోడీ కేంద్రానికి లేఖ రాశారు.అల్లుడికి బుద్ది చెప్పిన మామ అదే తప్పు చేశాడన్నట్లుగా 2014లో అధికారానికి వచ్చిన తొలి నెలలోనే ప్రధాని నరేంద్రమోడీ తన వాగ్దానాల్లో ఒకటైన ధరల పెరుగుదల అరికట్టటం, అచ్చేదిన్‌ అమల్లో భాగంగా రైలు ప్రయాణీకుల ఛార్జీలు 14.2శాతం, సరకు రవాణా 6.5శాతం పెంచారు. దివంగత సుష్మా స్వరాజ్‌, అరుణ్‌ జైట్లీ మాటలను పక్కన పెడితే ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్న స్కృతి ఇరానీ తీరుతెన్నులు తెలిసిందే. బిజెపి కనుక కేరళలో అధికారానికి వస్తే లీటరు పెట్రోలు, డీజిల్‌ అరవై రూపాయలకే అందిస్తామని ఆ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కుమనమ్‌ రాజశేఖరన్‌ ఏప్రిల్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో వాగ్దానం చేశారు. వాటిని జిఎస్‌టి పరిధిలోకి తెస్తే ఆధరకు ఇవ్వవచ్చని చెప్పారు. చమురును జిఎస్‌టి పరిధిలోకి తెచ్చేందుకు ఎల్‌డిఎఫ్‌ అంగీకరించటం లేదని ఆరోపించారు. ఇంతకు ముందు ధర్మేంద్ర ప్రధాన్‌ గారు రోజువారీ ధరల పెంపుదల వినియోగదారులకే మంచిదని, తమ ప్రభుత్వం ధరలపై నియంత్రణ విధించదని చెప్పారు.
ఒక అబద్దాన్ని వందసార్లు చెబితే చివరికి అదే నిజమై కూర్చుంటుందన్న జర్మన్‌ నాజీ మంత్రి గోబెల్స్‌ను బిజెపి పెద్దలు, పిన్నలు ఆదర్శంగా తీసుకున్నారు. కేంద్రం విధించే ఎక్సయిజ్‌ పన్నులో 41శాతం తిరిగి రాష్ట్రాలకే పోతుందని, అందువలన రాష్ట్రాలు పన్ను తగ్గించాలని నిరంతరం చెబుతుంటారు. అదే వాస్తవం అయితే బిజెపి పాలిత రాష్ట్రాలు ముందుగా ఆ పని చేసి ఆదర్శంగా నిలిచి ఇతర పార్టీల పాలిత రాష్ట్రాల మీద ఎందుకు వత్తిడి తేవటం లేదు ? ఒక్కటంటే ఒక్క రాష్ట్రమైనా ఆపని ఎందుకు చేయలేదు?


యుపిఏ పాలనా కాలంలో వార్షిక సగటు ముడిచమురు పీపా ధర డాలర్లలో ఎలా ఉందో, నరేంద్రమోడీ హయాంలో ఎలా ఉందో దిగువ చూడవచ్చు.
సంవత్సరం××× ధర డాలర్లలో
2010-11××× 85.09
2011-12××× 111.89
2012-13××× 107.97
2013-14××× 105.52
2014-15××× 84.16
2015-16××× 46.17
2016-17××× 47.57
2017-18××× 56.43
2018-19××× 69.88
2019-20××× 60.57
2020-21××× 44.82


2021-22 సంవత్సరం ఏప్రిల్‌ మాసంలో 66.61, మే నెలలో 72.08 డాలర్లు ఉంది. ఈ సంవత్సరాలలో ధరలు తగ్గితే వినియోగదారులకు ధరలు తగ్గాలి, పెరిగితే పెరగాలి అని చెప్పారు. అదే తర్కాన్ని వర్తింప చేస్తే ప్రభుత్వాలకు కూడా ఆదాయం తగ్గాలి. జరిగిందేమిటి ? ఎలా పెరిగిందో ముందే చూశాము. అంతర్జాతీయంగా ధరలు తగ్గినా వినియోగదారుల జేబులు గుల్ల అయ్యాయి. చమురు ధర 72 డాలర్లు ఉంటేనే మోడీ ఏలుబడిలో పెట్రోలు ధర వంద రూపాయలు దాటింది. అదే పూర్వపు స్ధాయికి చేరితే…… మోత మోగుతుందని వేరే చెప్పాలా ?


సామాజిక మాధ్యమాల్లో, మీడియాలో బిజెపి చేస్తున్న ప్రచారం పని చేస్తున్న కారణంగానే అనేక మంది పన్ను తగ్గించాల్సింది రాష్ట్రాలే అనుకుంటున్నారు. ఇక్కడ గమనించాల్సిందేమంటే పెట్రోలు మీద యూపిఏ హయాంలో లీటరుకు విధించిన రూ.9.48 నుంచి 32.98కి డీజిలు మీద రు.3.56 నుంచి 31.80కి పెంచాలని ఏ రాష్ట్రం కోరిందో చెప్పాలని బిజెపి పెద్దలను నిలదీయండి, సమాధానం ఉండదు. ఈ మొత్తాలలో రాష్ట్రాలకు వాటా లేని సెస్‌లు, డ్యూటీలే ఎక్కువ ఉన్నాయి. అందువలన ఈ మొత్తాల నుంచి 41శాతం లెక్కవేసి దానికి, రాష్ట్రాలు విధించే వాట్‌ను కలిపి చూడండి రాష్ట్రాలకు వచ్చే ఆదాయమే ఎక్కువ కదా, కనుక రాష్ట్రాలే తగ్గించాలని బిజెపి పెద్దలు వాదిస్తారు. అందుకే మెజారిటీ రాష్ట్రాలు మీవే కదా ఆ పని ముందు అక్కడ ఎందుకు చేయలేదు అంటే అసలు విషయాలు బయటకు వస్తాయి. ఉదాహరణకు ఈ ఏడాది బడ్జెట్‌లో వ్యవసాయ రంగం కోసం చమురు మీద లీటరు పెట్రోల మీద రెండున్నర, డీజిలు మీద నాలుగు రూపాయల సెస్‌ విధించినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆ మేరకు వినియోగదారులకు పెంచలేదు. మరి ఆ సొమ్మును ఎలా వసూలు చేస్తారు ? పైన చెప్పుకున్న ఎక్సయిజు పన్ను నుంచి ఈ మొత్తాన్ని సెస్‌ ఖాతాకు మార్చారు. ఈ మొత్తాలనుంచి రాష్ట్రాలకు వచ్చేదేమీ ఉండదు. అలాగే లీటరుకు వసూలు చేస్తున్న రు.18 రోడ్డు మరియు మౌలిక సదుపాయాల సెస్‌. వీటి నుంచే చమురు, గ్యాస్‌ పైప్‌లైన్లు, జాతీయ రహదారులు, రాష్ట్రాలకు రహదారులకు నిధులు ఇస్తున్నారు. మరోవైపు వినియోగదారుల చార్జీల పేరుతో వాటిని వినియోగించుకున్నందుకు జనాల నుంచి వసూలు చేస్తున్నారు. సూటిగా చెప్పాలంటే మన డబ్బులతో మనమే రోడ్లు వేసుకొని వాటికి టోల్‌టాక్సు మనమే కడుతున్నాం. ఇవన్నీ పోను మిగిలిన మొత్తాల నుంచే రాష్ట్రాలకు 41శాతం వాటా ఇస్తారు. అసలు మోసం ఇక్కడే ఉంది.

కిసాన్‌ సమ్మాన్‌ యోజన పేరుతో ఏడాదికి ఒక్కో రైతుకు ఆరువేల రూపాయలు ఇస్తున్నట్లు ఎన్నికల కోసం ఒక పధకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. మరోవైపున ఈ ఏడాది ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో పెట్రోలు,డీజిలు మీద వ్యవసాయ సెస్‌ పేరుతో ప్రతిపాదించిన మొత్తాల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి ఏటా 49వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. జనమంతా చమురు కొంటారా అని వాదించే వారు ఒక ప్రశ్నకు సమాధానం చెప్పాలి. వాహనాలు నడిపేవారందరూ వ్యవసాయం చేయరు కదా ? వారి కోసం అందరిదగ్గర నుంచి ఎందుకు వసూలు చేయాలి ? కరోనా కారణంగా చమురు వాడకం తగ్గింది గానీ, ప్రభుత్వాలకు గణనీయంగా ఆదాయం పెరగటం వెనుక మతలబు పెంచిన పన్నులే. మంచి జరిగితే తమ ఖాతాలో, చెడు జరిగితే రాష్ట్రాల ఖాతాలో వేయటం కరోనా విషయంలో చూశాము. కరోనా మీద విజయం సాధించామని చెప్పుకొన్నపుడు నరేంద్రమోడీ అండ్‌కోకు రాష్ట్రాలు గుర్తుకు రాలేదు, తీరా రెండవ తరంగంలో పరిస్ధితి చేజారటంతో ఆరోగ్యం, వైద్యం రాష్ట్రాల బాధ్యత అంటూ ప్రచారానికి దిగారు.


2014 మే నెలలో ఢిల్లీలో ఒక లీటరు పెట్రోలు ధర రు.71.41. దీనిలో చమురు ధర 63శాతం, కేంద్ర పన్నులు 16శాతం, రాష్ట్ర పన్ను 18శాతం, డీలరు కమిషన్‌ మూడు శాతం ఉంది. అదే 2021 ఫిబ్రవరిలో లీటరు ధర రూ.86.30. దీనిలో కేంద్ర పన్ను 37శాతం, చమురు ధర 36శాతం రాష్ట్ర పన్ను 23శాతం, డీలరు కమిషన్‌ నాలుగుశాతం ఉంది. ఇప్పుడు చమురు ధరలు పెరుగుతున్నందున ఈ శాతాల్లో మార్పులు ఉంటాయి. దీన్ని రూపాయల్లో చెప్పుకుంటే రు.86.30లో కేంద్రానికి రు.32.98, చమురు కంపెనీలకు రు.29.71, రాష్ట్ర ప్రభుత్వానికి రూ.19.92, డీలరు కమిషన్‌ రు.3.69 వస్తాయి.


పేదలందరూ పెట్రోలు కొంటారా ? వాహనాలు లేని వారు కూడ కొని తాగుతారా అంటూ వితండవాదనలు చేసే వారిని చూస్తాము. అవన్నీ జనాన్ని తప్పుదారి పట్టించేందుకు ముందుకు తెచ్చిన ప్రచార అస్త్రాలు. ప్రతి వస్తువు ధర పెరుగుదల, పన్నుల పెంపు మొత్తంగా ధరల పెరుగుదలకు దారి తీస్తుంది. ఆ సూచికలను నిర్ణయించేందుకు అన్ని రకాల వినియోగ వస్తువుల ధరలను పరిగణనలోకి తీసుకొని ప్రతి నెలా సూచిక తగ్గిందా లేదా అని నిర్ధారిస్తారు. ఉద్యోగులకు, కార్మికులకు, ఇతర వేతన జీవులకు ఆ ప్రాతిపదికనే కరువు భత్యాన్ని నిర్ణయిస్తారు.ద్రవ్యోల్బణాన్ని ఖరారు చేస్తారు. డీజిలు ధరలు పెరిగితే ప్రజారవాణాకు వినియోగించే బస్సుల నిర్వహణ, సరకు రవాణా లారీ, వ్యవసాయదారుల ట్రాక్టర్లు, పంపుసెట్ల ఖర్చు పెరుగుతుంది. పరిశ్రమల్లో జనరేటర్లను వాడితే అక్కడ తయారయ్యే వస్తువుల ధరలు పెరుగుతాయి. ఇలా పరోక్షంగా యావత్‌ జనజీవనం మీద చమురు ధరల పెరుగుదల ప్రభావం ఉంటుంది.


రానున్న కొద్ది వారాల్లో పీపా చమురు 80డాలర్లకు చేరవచ్చని జోశ్యం చెబుతున్నారు. గత రెండు నెలల్లో మార్కెట్‌ తీరుతెన్నులను చూసినపుడు ముందుగానే పెరిగినా ఆశ్చర్యం లేదు. వివిధ దేశాల్లో కరోనా తీవ్రత తగ్గి ఆర్ధిక కార్యకలాపాల పెరుగుదల దానికి ఒక కారణంగా చెబుతున్నారు. జోశ్యాలు నిజమౌతాయా లేదా అన్నది పక్కన పెడితే 70-80 డాలర్ల మధ్య చమురు ధరలు ఉన్నప్పటికీ మన వినియోగదారులకు మూలిగే నక్కమీద తాటిపండు పడిన చందంగానే ఉంటుంది. ఇదే జరిగితే వినియోగదారులకు, ముందే చెప్పుకున్నట్లు యావత్‌ జనానికి ధరల సెగ, అది పాలకులకు రాజకీయ సెగగా తగలటం అనివార్యం. యుపిఏ చివరి మూడు సంవత్సరాలలో జరిగింది అదే. అదే నరేంద్రమోడీ సర్కార్‌కూ పునరావృతం అవుతుందా ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

కనిపించిన కేసు ఒక్కటే, పరీక్షలు కోటీ 80లక్షలు – కరోనా కట్టడిలో చైనా రహస్యం అదే !

11 Friday Jun 2021

Posted by raomk in CHINA, Current Affairs, Economics, Health, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Prices, Science

≈ 1 Comment

Tags

china communists action to fight against covid-19, China Covid-19, COVID- 19 pandemic, Guangzhou tests 18m people, Narendra Modi Failures, nucleic acid test


ఎం కోటేశ్వరరావు


ఏ రోజు, ఏ నెలలో చైనా ఎలా ప్రవర్తిస్తుందో అర్ధం చేసుకోవటం ఎంతో కష్టంగా మారిందంటూ ఒక విశ్లేషకుడు కొద్ది రోజుల క్రితం ఒక వ్యాఖ్యానం రాశాడు. ఇది నిజమే. అది అతని వ్యక్తిగతం కాదు, చైనా వారు చెప్పే అంశాలపై నమ్మకం కోల్పోయిన వారందరి తీవ్ర మానసిక సమస్య ఇది. వారికి పూర్తిగా తెలియదు, ఇతరులు చెబితే వినరు. చైనా వారు చెప్పేవన్నీ అతిశయోక్తులే, అంత అభివృద్ది, పురోగమనం లేదూ, పాడూ లేదు, అన్నీ నాశిరకరం అని కొట్టి పారవేసిన వారు ఇప్పుడు నమ్మలేని అంశాలతో బిత్తరపోతున్నారు. అది నేల నుంచి నింగి విజయాల వరకు దూసుకుపోతున్నది. త్వరలో ఆర్ధికంగా అమెరికాను అధిగమించనుంది. సాంకేతిక రంగంలో కొన్ని అంశాలలో అమెరికా, పశ్చిమ ఐరోపా దేశాలదే పైచేయిగా ఉన్నప్పటికీ వాటికి ధీటుగా ముందుకు వస్తోంది.


అనేక మంది చైనా గురించి సరైన సమాచారం తెలుసుకోవటం కష్టం అంటూనే రకరకాల చెత్తకథనాలు రాయటం, చూపటం, వినిపించటం చూస్తున్నాము. ఎంతో స్వేచ్చ, దేన్ని గురించైనా మాట్లాడుకోవచ్చు, తెలుసుకోవచ్చు, బయట పెట్టవచ్చు అడ్డూ అదుపు ఉండదు అని చెప్పుకొనే అమెరికా వంటి దేశాలలో కూడా అక్కడి పాలకుల కనుసన్నలలో వారికి పనికిరానిదాన్ని, వారి ప్రయోజనాలకు పనికి వచ్చే సమాచారాన్నే బయటికి వదులుతారు తప్ప ప్రతిదాన్నీ బహిరంగపరచరు. చైనా దానికి మినహాయింపు కాదు. చైనా విలేకర్ల పేరుతో వ్యవహరించే వారిలో అత్యధికులు తైవాన్‌, హాంకాంగ్‌, దక్షిణకొరియా, జపాన్‌లో ఉండి వార్తలు రాస్తారు. వారికి సిఐఏ ఏజంట్లు, చైనా వ్యతిరేకులు అందించే అంశాలే ఆధారం. చైనా ప్రధాన భూభాగంలో ఉండేవారు కూడా ఎక్కువ మంది అసత్య, అర్ధసత్య వార్తలనే వండి వడ్డిస్తారు. వీరిలో చాలా మంది జర్నలిస్టుల ముసుగులో విదేశీ గూఢచార ఏజంట్లు ఉంటారని వేరే చెప్పనవసరం లేదు. రెండు పనులూ చేస్తారు. మరి చైనా జర్నలిస్టులు ఇతర దేశాల్లో ఎలా ఉంటారు ? వ్యతిరేకులు బాంబులు వేస్తుంటే చైనా వారు రసగుల్లాలు విసురుతూ ఉంటారా ? అయితే ఎవరూ నిజాన్ని అంగీకరించరు.

విదేశీ జర్నలిస్టులు ప్రశ్నించినపుడు సహజంగానే జనాలు ఏ దేశంలో అయినా సందేహిస్తారు. దానికి చైనా మినహాయింపు కాదు, ఇంకా ఎక్కువ ఉంటుంది. ఎవరైనా పార్టీ కార్యకర్తలను విదేశీ జర్నలిస్టులు కలిసినపుడు వారు చెప్పదలచుకున్న అంశాలను వక్రీకరించకుండా ఉండేందుకు రాతపూర్వకంగా అందచేస్తారు. ప్రభుత్వ వైఖరి గురించి జనాలు స్వేచ్చగా అభిప్రాయాలు వెల్లడించేందుకు అవకాశం, వేదికలు ఉండవు అని చాలా మంది చెబుతారు. కానీ చైనా పేరుతో విశ్లేషణలు రాసే అనేక మంది అక్కడి సామాజిక మాధ్యమాల్లో వెల్లడయ్యే వైఖరుల ఆధారంగా, వాటిని ఉటంకిస్తూ, భిన్నఅభిప్రాయాలను తీసుకొని కాళిదాసు కవిత్వానికి తమపైత్యం జోడించి అన్నట్లుగా రాస్తారు.


కరోనా వైరస్‌ గురించి చేసిన తప్పుడు ప్రచారాల్లో వెయ్యోవంతు ఆ వైరస్‌ నివారణ, అంతానికి చైనా సర్కార్‌ తీసుకుంటున్న చర్యల గురించి రాసినా ప్రపంచానికి ప్రయోజనం ( అది చైనాకు కాదు ) ఉండి ఉండేది. అక్కడ అనుసరిస్తున్న పద్దతులను ఎందుకు అమలు చేయరంటూ ఆయా దేశాల జనాలు పాలకుల మీద వత్తిడి తెచ్చేందుకు అవకాశం ఉండేది. వరల్డో మీటర్‌ వెబ్‌సైట్‌ సమాచారం ప్రకారం ఇది రాసిన సమయానికి ప్రపంచలో మొత్తం కరోనా కేసులు 17కోట్ల 56లక్షల 79వేల 912. మరణించిన వారు 37లక్షల 90వేల 392 మంది. మన దేశానికి సంబంధించి మొత్తం కేసులు రెండు కోట్ల 92లక్షల 74,823, మరణాలు 3,63,097. కేసుల సంఖ్యలో అమెరికా తరువాత రెండవ స్ధానంలో ఉంది, మరణాల్లో అమెరికా,బ్రెజిల్‌ తరువాత మూడవ స్ధానం. మొత్తం 222 దేశాలు, ప్రాంతాలలో చైనా 98వ స్ధానంలో ఉంది. అక్కడ నమోదైన కేసులు 91,359, మరణాలు 4636.చైనాలో కరోనా కేసులు, మరణాలు అంత తక్కువ ఎందుకున్నాయని ఇప్పటికీ సందేహించే వారున్నారు. వారిని ఎవరూ ఒప్పించలేరు,మెప్పించలేరు.ఇంకా మరికొన్ని దేశాల్లో కూడా కేసులు, మరణాలు తక్కువే ఉన్నాయని వారికి తెలిస్తే తట్టుకోలేరేమో !

తాజాగా ప్రపంచ మీడియాలో వచ్చిన ఒక వార్త మరోసారి చైనా కరోనా కట్టడి గురించి ఆసక్తిరేపింది. దేశీయంగా ఒక వాక్సిన్‌ తయారు చేసినందుకు మన ప్రధాని నరేంద్రమోడీ తన భుజాలను తానే చరుచుకొని అభినందించుకున్నారు. పొగడ్తలకు అలవాటు పడ్డ ప్రాణం కదా, పోనీయండి అని అనేక మంది సమర్ధిస్తున్నారు. దక్షిణ చైనాలోని గ్వాంగ్‌ఝౌ అనే పట్టణం, పరిసరాల జనాభా కోటీ 86లక్షలు. ఒక మహిళ (75) ఒక హౌటల్‌కు వెళ్లినపుడు కరోనా లక్షణాలు కనిపించాయి. దాంతో అప్రమత్తమైన అధికారులు మేనెల 21 నుంచి జూన్‌ 8వ తేదీ వరకు నగరంలో కోటీ 80లక్షల మందికి పరీక్షలు నిర్వహించారు. వారిలో 115 మందికి కరోనా లక్షణాలు కనిపించాయి, 106 మందికి నిర్ధారణ అయింది. ఈ కేసులన్నింటిలో భారత్‌లో బయటపడిన డెల్టా రకం కనిపించింది. ఇది వేగంగా వ్యాపించే లక్షణం కలిగినదని చైనా అధికారులు చెప్పారు. ఒక గంటలోపే ఫలితాన్ని వెల్లడించే న్యూక్లియక్‌ యాసిడ్‌ టెస్టులు చేశారు. రక్తం,కండరాలు,మూత్రంలో ఏవైనా వైరస్‌, బాక్టీరియాలు ఉంటే వెంటనే పసిగట్టే ఆధునిక పరిజ్ఞానంతో ఆ పరీక్షను చేస్తారు. ప్రపంచంలో పెద్ద సంఖ్యలో పరీక్షలు నిర్వహించిన పట్టణంగా రికార్డులకెక్కింది. గతంలో చైనాలోనే మరికొన్ని పట్టణాల్లో కూడా ఈ పరీక్షలు పెద్ద సంఖ్యలో నిర్వహించినా సంఖ్యరీత్యా ఇదే అత్యధికం. వాన్‌ఫు బయోటెక్నాలజీ అభివృద్ది చేసిన విధానం ప్రకారం బ్రిటన్‌, దక్షిణాఫ్రికా, బ్రెజిల్‌ దేశాలలో బయటపడిన కరోనా వైరస్‌ లక్షణాలను ఈ పరీక్ష వెల్లడిస్తుంది. గ్వాంగఝౌ పట్టణం, పరిసరాలలో 5,500 బయో, ఫార్మాస్యూటికల్‌ పరిశ్రమలు, ఈ రంగంలోనే వెయ్యి ఆధునిక పరిజ్ఞాన సంస్ధలు ఉన్నాయి. కింగ్‌మెడ్‌ డయాగస్టిక్స్‌ గ్రూప్‌ రోజుకు మూడున్నరలక్షల పరీక్షలు చేయగల సామర్ధ్యం కలిగినది ఇక్కడ ఉంది, ఇలాంటివి ఇంకా ఎన్నో ఉన్నాయి. తమకు కరోనా వచ్చిన విషయాన్ని దాచినందుకు లేదా తెలియచేయనందుకు, పరీక్షకు నిరాకరించినందుకు కొందరిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఒక హౌటల్‌లో ఉన్న వ్యక్తి పరీక్షకు నిరాకరించి పోలీసులతో వాగ్వాదానికి దిగటమేగాకుండా భోజనానికి ఉపయోగించే ఫోర్క్‌తో పోలీసు మీద దాడి చేశాడు.

చైనాలో కరోనా కట్టడికి ఇప్పటివరకు మూడు రకాల వ్యూహాలను అనుసరించారు. వైరస్‌ బయటపడగానే దానికి చికిత్స ఏమిటో తెలియలేదు గనుక తొలి దశలో ప్రజారోగ్య నిరోధం మరియు అదుపు పద్దతులను అమలు జరిపారు. రెండవ దశలో వాక్సిన్లను ఉపయోగించారు. ఇప్పుడు మూడవ దశలో నిరోధం మరియు అదుపు పద్దతులను కూడా పాటిస్తున్నట్లు చైనా సిడిసి అధిపతిగా గతంలో పని చేసిన జెంగ్‌ గ్వాంగ్‌ చెప్పారు.ఈ చర్యలతో పాటు వాటిని అమలు జరిపే క్రమంలో చైనీయుల సామాజిక అలవాట్లను, అంశాలను కూడా పరిగణనలోకి తీసుకొన్నారు. గ్వాంగ్‌ఝౌ నగరంలో కేసులు 115 మాత్రమే బయటపడినప్పటికీ కొన్ని ప్రాంతాలలో లాక్‌డౌన్‌ ప్రకటించి జన సంచారాన్ని పరిమితం చేశారు.చైనాలో అనేక సంస్ధలు వాక్సిన్ల తయారీకి పరిశోధనలు, పరీక్షలు చేస్తున్నాయి. వాటిలో ఇప్పటి వరకు ఏడు రకాలకు చైనా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇప్పటి వరకు 80 కోట్ల మందికి తొలి, రెండవ డోసు వాక్సిన్లు వేసినట్లు చైనా ప్రకటించింది.


గత ఏడాది ఊహాన్‌ నగరంలో కరోనాను కట్టడి చేయటం అనేక అనుభవాలను ముందుకు తెచ్చింది. తరువాత కాలంలో చెదురుమదురుగా వివిధ నగరాల్లో చాలా పరిమితంగా అయినా కేసులు బయటపడ్డాయి. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలన్నట్లుగా వైరస్‌ విస్తరించకుండా చూసేందుకు నూక్లియక్‌ యాసిడ్‌ పరీక్షలు చేసి జల్లెడ పట్టాలని నిర్ణయించారు. దీనికి కూడా ఊహాన్‌ అనుభమేతోడ్పడింది. అక్కడ ప్రారంభంలో యాభైవేల పరీక్షలు చేసి సమాచారాన్ని విశ్లేషించారు. తరువాత గతేడాది మేనెల ప్రారంభంలో అక్కడి కోటి మంది జనాభాకు పది రోజుల్లో ఈ పరీక్షలు చేసి దాగున్న వైరస్‌ను వెలికి తీసే యత్నం చేశారు.లక్షణాలు బయటకు కనిపించకుండా వైరస్‌ ఉన్న మూడు వందల కేసులు వెల్లడయ్యాయి.తరువాత బీజింగ్‌లోని కోటి ఇరవైలక్షల మందికి పరీక్షలు చేశారు, 174కేసులు బయటపడ్డాయి.


చైనాలో ప్రయాణాలు చేసే వారు గణనీయ సంఖ్యలో ఉంటారు. ప్రతివారినీ ప్రతి చోటా పరీక్షించటం సాధ్యంకాదు, అవసరమైన సిబ్బంది లభ్యత కూడా పెద్ద సమస్యే. అందువలన చైనా ప్రయాణ ఆరోగ్య సూచిక (కోడ్‌)లను రూపొందించాలని ఐటి కంపెనీలను కోరారు. ఆమేరకు తయారు చేసి ప్రతి ఒక్కరికీ ఒక సూచికను కేటాయించారు. వారి సెల్‌ఫోన్లలో యాప్‌ ఏర్పాటు చేశారు. దానిలో మూడు రంగుల సూచికలను పొందుపరిచారు.దానిలో సదరు వ్యక్తి చిరునామా వంటి ప్రాధమిక సమాచారంతో పాటు అనుమతించిన ఆరోగ్య వివరాలు, సందర్శించిన ఆసుపత్రులు, వాడిన మందుల వంటి వాటిని పొందుపరిచారు.అంతే కాదు, వారు పర్యటించిన ప్రాంతాలు, హౌటల్స్‌, మాల్స్‌, రైలు, విమానం, బస్‌, స్వంత వాహనం వంటి వివరాలు కూడా ఉంటాయి. ఎక్కడైనా తనిఖీ సిబ్బంది ఫోన్లలో వారి కోడ్‌ను స్కాన్‌ చేస్తే ఆ వివరాలన్నీ కనిపిస్తాయి. ఉదాహరణకు ఆకుపచ్చ సూచిక ఉన్నవారి వివరాలను చూస్తే వారు, వారి కుటుంబ సభ్యులకు ఎలాంటి సమస్యలు లేవని, కరోనా ప్రాంతాల్లో సంచరించలేదని అర్ధం. పసుపు పచ్చ కోడ్‌ వస్తే వారు శ్వాస సంబంధ సమస్యలను ఎదుర్కొన్నారని, కరోనా ముప్పు ప్రాంతాలను సందర్శించటం, వైరస్‌ సోకిన వారితో కలిసినట్లు అర్ధం. ఎరుపు సూచిక ఉంటే ప్రమాదం ఉందని అర్ధం. వారికి లేదా కుటుంబ సభ్యులకు వైరస్‌ సోకటం, సోకినవారిని కలిసినందున విడిగా ఉంచాల్సిన అవసరం ఉందని అర్ధం. కరోనాను మహమ్మారిగా ప్రభుత్వం ప్రకటించినందున పసుపు, ఎరుపు సూచికలు ఉన్న వారికి ప్రయాణించేందుకు అవసరమైన టిక్కెట్లను తిరస్కరించే, ప్రయాణ అనుమతి నిరాకరించే అధికారం యంత్రాంగానికి ఉంటుంది. ఆకుపచ్చ సూచిక ఉన్నవారు మాత్రమే ప్రయాణించేందుకు వీలుంటుంది.

కరోనా నివారణకు వాక్సిన్‌ రూపొందించే వరకు ఫలానా ఔషధంతో నివారించవచ్చనే హామీ ఎక్కడా లేదు. అనేక రకాలతో ప్రయోగాలు చేశారు. . రెమిడెసివర్‌ కరోనా చికిత్సకు పనికిరాదని గతేడాది ఏప్రిల్‌ 15 నుంచే చైనాలో దాన్ని పక్కన పెట్టారు. అయినా మన నిపుణులు దాని గురించి జనంలో పెద్ద ఎత్తున ఆశలు కల్పించేందుకు కారకులయ్యారు. దాంతో మన జనాన్ని ఎలా పిండుకున్నారో చూశాము. ఫార్మా మాఫియాల పీకనులిమే కొత్త దేవుడు మోడీ అంటూ ప్రచారం చేసినప్పటికీ ఇది జరిగింది. తరువాత ప్రపంచ ఆరోగ్య సంస్ధ పరిశోధనలో కూడా అదే తేలింది. చైనాలో మన ఆయుర్వేదం మాదిరే స్ధానిక వైద్య పద్దతిలో వాడుతున్న ఔషధాలను కూడా చికిత్సలో ఉపశమనానికి వినియోగించారు. ఆ రంగ నిపుణులను కూడా అల్లోపతి ఆసుపత్రుల్లో నియమించారు, పర్యవేక్షించే ఏర్పాట్లు చేశారు. అయితే ఆ వైద్యపద్దతి, ఔషధం వైరస్‌ను అంతం చేస్తుందనే భ్రమలు కల్పించలేదు. కనుకనే అక్కడ బాబా రామ్‌దేవ్‌ వంటి వారు వాటితో సొమ్ము చేసుకోవటం గానీ, ఆనందయ్య పచ్చడి వంటివి రంగంలోకి రావటం గానీ జరగలేదు.


ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకున్న కారణంగానే చైనాలో వైరస్‌ అదుపులో ఉంది. అయితే ఇందుకయ్యే ఖర్చు కూడా తక్కువేమీ కాదు. అయినప్పటికీ కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వం అక్కడ ఉంది కనుక దేశ సంపదలను జనం కోసం ఖర్చు చేసేందుకు వెనుకాడలేదు.లాభ నష్టాల లెక్కలు వేసుకోలేదు. ముందు ప్రాణాలను రక్షించటమే ప్రధమ కర్తవ్యంగా పెట్టుకున్నారు. మన వంటి దేశాలలో పెట్టుబడిదారులు దేని మీద ఎంత ఖర్చు చేస్తే ఎంత లాభం వస్తుందనే లెక్కలు ముందే వేసుకుంటారు. కొత్తదాని మీద ఖర్చు పెడితే ఒకవేళ ప్రయోజనం లేకపోతే మొత్తం దండగే అని భావిస్తే అసలు ముందుకు రారు. పాలకులు కూడా వారినే అనుసరిస్తారు గనుక అంబానీ, అదానీ అండ్‌కోకు ఆత్మనిర్భర అనో మరొక పేరుతోనే రాయితీలు ఇచ్చేందుకు చూపే శ్రద్ద జనం మీద చూపరు. ఆ కారణంగానే కేవలం రెండు వందల కోట్ల ఖర్చుతో జనానికి అవసరమైన ఆక్సిజన్‌ అందించే యంత్రాల ఏర్పాటు టెండర్లను ఎనిమిది నెలల పాటు కేంద్రం ఖరారు చేయలేదు. తీరా ముప్పు ముంచుకు వచ్చిన తరువాత, సుప్రీం కోర్టు మందలింపులతో చేయటాన్ని చూశాము. వాక్సిన్లు కూడా అంతే కదా ! అందుకోసం కేటాయించినట్లు చెప్పిన 35వేల కోట్లకు లెక్కలు చెబుతారా లేదా అని నిలదీసిన తరువాత విధిలేక మేమే వాక్సిన్లు వేయిస్తాం అనే ప్రకటన వెలువడింది. కేసులు తక్కువే అయినప్పటికీ చైనాలో ఖర్చు తక్కువేమీ కాలేదు. దాని కంటే ఆర్ధిక కార్యకలాపాలు నిలిచిపోవటం పెద్ద దెబ్బ అని వెంటనే గ్రహించింది. అందుకే ప్రపంచంలో పెద్ద ఆర్ధిక వ్యవస్ధలున్న దేశాల్లో ఎక్కడా లేనిóంగా వైరస్‌ కనిపించిన నాలుగు నెలల్లోనే దాన్ని అదుపులో ఉంచి ఆర్ధిక కార్యకలాపాలన్నింటినీ పునరుద్దరించింది. అది ఖర్చు కంటే లబ్దే ఎక్కువ చేకూర్చిందని రుజువైంది. దాన్నుంచి మనం పాఠాలు నేర్చుకుంటామా ? మన భుజాలను మనమే చరుచుకుంటామా ?
అనువుగాని చోట అధికులమన రాదు,
కొంచెమైన నదియు కొదువగాదు,
కొండ అద్దమందు కొంచెమై ఉండదా,
విశ్వదాభిరామ వినుర వేమా !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...
← Older posts

Recent Posts

  • మనవాళ్లు వట్టి వెధవాయి లోయి అన్న గిరీశాన్ని గుర్తుకు తెస్తున్న వాట్సాప్‌ పండితులు !
  • బిజెపి మిత్రోం అదానీ, బికినీలను కాదు సామాన్య జనాన్ని చూడండి !
  • వైవిధ్య సమస్యలతో ప్రపంచ వ్యవసాయ రంగం !
  • రష్యా – జర్మనీలను శాశ్వత శత్రు దేశాలుగా మార్చే అమెరికా కుటిల పన్నాగం !
  • అక్రమం జరిగిందా లేదా విచారణకు ఆదేశిస్తారా లేదా : అదానీ కంపెనీలపై నోరు విప్పని ప్రధాని నరేంద్రమోడీ !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • మనవాళ్లు వట్టి వెధవాయి లోయి అన్న గిరీశాన్ని గుర్తుకు తెస్తున్న వాట్సాప్‌ పండితులు !
  • బిజెపి మిత్రోం అదానీ, బికినీలను కాదు సామాన్య జనాన్ని చూడండి !
  • వైవిధ్య సమస్యలతో ప్రపంచ వ్యవసాయ రంగం !
  • రష్యా – జర్మనీలను శాశ్వత శత్రు దేశాలుగా మార్చే అమెరికా కుటిల పన్నాగం !
  • అక్రమం జరిగిందా లేదా విచారణకు ఆదేశిస్తారా లేదా : అదానీ కంపెనీలపై నోరు విప్పని ప్రధాని నరేంద్రమోడీ !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • మనవాళ్లు వట్టి వెధవాయి లోయి అన్న గిరీశాన్ని గుర్తుకు తెస్తున్న వాట్సాప్‌ పండితులు !
  • బిజెపి మిత్రోం అదానీ, బికినీలను కాదు సామాన్య జనాన్ని చూడండి !
  • వైవిధ్య సమస్యలతో ప్రపంచ వ్యవసాయ రంగం !
  • రష్యా – జర్మనీలను శాశ్వత శత్రు దేశాలుగా మార్చే అమెరికా కుటిల పన్నాగం !
  • అక్రమం జరిగిందా లేదా విచారణకు ఆదేశిస్తారా లేదా : అదానీ కంపెనీలపై నోరు విప్పని ప్రధాని నరేంద్రమోడీ !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Follow Following
    • vedika
    • Join 234 other followers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Customize
    • Follow Following
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d bloggers like this: