• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: RELIGION

కాషాయదళాల ముస్లిం వ్యతిరేక ప్రచారం -నిందలూ, నిజాలు !

29 Friday Apr 2022

Posted by raomk in BJP, Communalism, Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion, RELIGION, Religious Intolarence, Uncategorized

≈ Leave a comment

Tags

BJP, Narendra Modi, RSS, Saffron gang


ఎం కోటేశ్వరరావు


” 2029 ఎన్నికలలో ఒక ముస్లిం దేశ ప్రధాని అవుతాడు ” హిందువులారా బహుపరాక్‌, జాగ్రత్త పడండి,హిందూమతాన్ని రక్షించుకోండి ఇలాంటి ప్రచారాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. వీటిని చేసేది సంఘపరివార్‌ లేదా హిందూత్వశక్తులు అన్నది స్పష్టం. వీరు ఇంకా చెప్పిందేమిటి ? హిందువులు విశాలదృక్పధం కలిగిన వారు కనుకనే ముస్లిం సామాజిక తరగతికి చెందిన వారు రాష్ట్రపతులుగా ఎన్నికయ్యారు, అదే పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌ల్లో హిందువులెవరైనా ఉన్నత పదవులు అధిరోహించారా చూడండి అని ప్రచారం చేశారు. మరి వీరే 2029లో ఒక ముస్లిం ప్రధాని అవుతారంటూ ఎందుకు రెచ్చగొడుతున్నట్లు ? ఈ ప్రచారానికి ప్రాతిపదిక, లక్ష్యం ఏమిటి ? ఇప్పటికి దేశంలో జకీర్‌ హుసేన్‌, ఫకృద్దీన్‌ అలీ అహమ్మద్‌, అబ్దుల్‌ కలామ్‌ అజాద్‌ రాష్ట్రపతులుగా పని చేసినపుడు అదే సామాజిక తరగతికి చెందిన వారు ప్రధాని అయితే వచ్చే ముప్పు ఏమిటి ? రాష్ట్రపతులుగా పని చేసిన వారు హిందూ మతానికి లేదా సమాజానికి చేసిన హాని ఏమిటో ఎవరైనా చెప్పగలరా ?


ఐరోపాలో, ఆసియాలో తలెత్తిన జాతీయవాదాలు భిన్నమైన నేపధ్యాలు, లక్ష్యాలతో ముందుకు వచ్చాయి. ప్రతి చోటా వినాశనానికే దారి తీశాయి. బ్రిటీష్‌ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా తలెత్తిన జాతీయవాదం కులాలు, మతాలు, భాషా, ప్రాంతీయతలకు అతీతంగా జరిగింది. కానీ ఆర్‌ఎస్‌ఎస్‌ సంఘపరివారం, హిందూమహాసభలు ముందుకు తెచ్చిన జాతీయవాదానికి ప్రాతిపదిక పరమత విద్వేషం – హిందూత్వ. జర్మనీలో జర్మన్‌ జాతి పవిత్రతను కాపాడేపేరుతో యూదు వ్యతిరేకతను రెచ్చగొట్టారు, అది ఐరోపా అంతటినీ ప్రభావితం చేసింది. అనేక దేశాల్లో యూదుల ఊచకోతకు దారి తీసింది. మన దేశంలో రెచ్చగొడుతున్న హిందూత్వ జాతీయవాదం ముస్లిం, క్రైస్తవ వ్యతిరేకతను, ఉన్మాదాన్ని రెచ్చగొడుతున్నది. దానిలో భాగమే 2029లో ముస్లిం ప్రధాని అనే ప్రచారం.


” ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వరల్డ్‌ డెమోగ్రాఫిక్‌ రిసర్చ్‌ ” అనే సంస్ధ సర్వే లేదా విశ్లేషణ వెల్లడించిన సమాచారం పేరుతో జరుగుతున్న ప్రచారాన్ని సామాజిక మాధ్యమంలో వీడియోలు, పోస్టుల రూపంలో గత కొద్ది సంవత్సరాలుగా చూస్తున్నాము. వాటి ప్రకారం 2041నాటికి దేశంలో ముస్లిం జనాభా 84శాతానికి పెరుగుతుందట. ముస్లిం జనాభా పెరుగుదల తీరుతెన్నులను పేర్కొంటూ 1948లో 6, 1951లో 9.8, 2011లో 22.6, 2017లో 27.1 ఉందని, 2021లో 32.8, 2031లో 38.1, 2037లో 43.6, 2040లో 66.9, 2041లో 84.5 శాతానికి పెరుగుతుందని, అప్పటికి హిందువుల జనాభా 11.2శాతంగా ఉంటుందని సదరు సంస్ధ అంచనా వేసినట్లు చెబుతూ ఇంకేముంది హిందువులు అంతరించిపోతారంటూ రెచ్చగొడుతూ ప్రచారం సాగుతోంది. గత వంద సంవత్సరాలుగా హిందూత్వ శక్తులు నాటుతున్న విషబీజాలు ఇప్పుడు మర్రి ఊడల్లా విస్తరిస్తున్నాయి. నిరంతరం అదే పనిగా ఇలాంటి ప్రచారం కొనసాగుతుండటంతో జనాల్లో ఏమో అనే అనుమానం తలెత్తి దాన్ని నివృత్తి చేసుకోకుండానే అనేక మంది నిజమే అని నమ్ముతున్నారు. దాంతో విద్వేష ముఠాలు తమ ఉత్పత్తులతో వాట్సప్‌, ఇతర సామాజిక మాధ్యమాలను ముంచి వేస్తున్నాయి.


వాస్తవం ఏమిటి ? మన జనాభాలెక్కల ప్రకారం 1951లో 84.1శాతంగా ఉన్న హిందువులు 2011లో 78.35శాతంగా ఉండగా ఇదే కాలంలో ముస్లింలు 9.8 నుంచి 14.2శాతానికి మాత్రమే పెరిగారు. నాలుగుదశాబ్దాల్లో పెరిగింది 5.4 కాగా, వచ్చే నాలుగు దశాబ్దాల్లో 70శాతం ఎలా పెరుగుతారు ? అమెరికా పరిశోధనా సంస్ధ ” పూ ” వేసిన అంచనా ప్రకారం 2050 నాటికి మన దేశంలో ముస్లిం జనాభా 18.4 శాతం ఉంటుంది. ఇంతకీ అసలు విషయం ఏమంటే గజం మిధ్య అన్నట్లుగా అసలు సదరు ” ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వరల్డ్‌ డెమోగ్రాఫిక్‌ రిసర్చ్‌ ” అనే సంస్ధ ఉనికిలోనే లేదని గూగుల్‌ తల్లి చెప్పినట్లు 2019లోనే ఫాక్ట్‌లీ డాట్‌ ఇన్‌ అనే సంస్ధ ప్రతినిధి వెల్లడించారు. అందువలన హిందూమతానికి వచ్చిన ముప్పు అన్నది కూడా అవాస్తవం, ఇలాంటి తప్పుడు సమాచారాన్ని పట్టుకొని ప్రచారం చేసే సాధ్వులు, యోగులు చెప్పేది పచ్చి అబద్దాలే. బిజెపి ఎంపీలు పార్లమెంటులో జనాభా నియంత్రణ బిల్లులను ప్రవేశపెట్టినా, వాటి గురించి ప్రచారం చేసినా ప్రచారదాడిలో భాగమే తప్ప మరొకటి కాదు. ఇద్దరు పిల్లలకు మించి ఉన్నవారికి ప్రభుత్వ సంక్షేమ పధకాలను వర్తింప చేయకూడదనే ప్రచారం, ఉత్తర ప్రదేశ్‌, అసోం బిజెపి ప్రభుత్వాల బిల్లులు ముస్లింలను లక్ష్యంగా చేసుకొనే అన్నది తెలిసిందే. ఒక వేళ అవి చట్టరూపం దాల్చితే 80శాతంగా ఉన్న హిందువులే ఎక్కువ నష్టపోతారు. సాధ్వి రితంబర వంటి వారు ప్రతి హిందువు నలుగురు పిల్లల్ని కని ఇద్దర్ని ఆర్‌ఎస్‌ఎస్‌ లేదా భజరంగదళ్‌కు ఇవ్వాలని చెప్పిన సంగతి తెలిసిందే. ఆ ఇద్దర్ని ఏం చేస్తారు, వారితో ఏమి చేయిస్తారు ? బిజెపి విధానాలను, హిందూత్వను వ్యతిరేకించే వామపక్ష, లౌకిక వాదులు, ఇతర మతాలవారి మీద దాడి చేసే మూకలుగా తయారు చేస్తారా ?


” బిజెపి ఇంకొక దశాబ్దం దేశాన్నేలితే ఏదో ఒక రోజు చంద్రుడిపై త్రివర్ణ పతాకం, కానీ కాంగ్రెస్‌ వచ్చిందా జెండాపై రంజాన్‌ చంద్రుడే గతి, ఎప్పటికీ గుర్తుంచుకో ! ” అంటూ మరొక ప్రచారం జరుగుతున్నది. ఇదీ ముస్లిం విద్వేష ప్రచారంలో భాగమే అన్నది స్పష్టం. ఒక వైపు దేశంలో ముస్లిం జనాభా పెరిగి హిందువులు మైనారిటీగా మారనున్నారనే ప్రచారం చేస్తూనే అదే శక్తులు మరోవైపు చేస్తున్న ప్రచారాన్ని చూద్దాం. ” కొన్ని దశాబ్దాలుగా ఎన్నో విష జంతువులు ఉన్న కాంగ్రెస్‌ అనే పెద్ద మర్రి చెట్టును మోడీ పెకలించి వేస్తున్నాడు ” మార్క్‌తులి అనే బిబిసి మాజీ విలేకరి ఈ ప్రకటన ఇచ్చాడు అని అదే పోస్టులో పేర్కొన్నారు. ఈ పోస్టు సారం ఏమంటే విషసర్పాలన్నింటికీ మోడీ పొగపెట్టారు గనుక అవి దేశం మీద పడ్డాయి. వాటిని జనాలకు చూపి మోడీ అప్రమత్తంగావించటం మంచిదైంది. లేకపోతే అవి ఈ భారత భూమిని, హిందువులను మింగివేసేవి. మోడీ భవిష్యత్‌ తరాల మతమార్పిడులకు అడ్డుకట్టవేశారు. మోడీగారు చాలా కష్టపడాలి, పడతారు కూడా. అయితే ఈ దేశ ప్రజలంతా ముఖ్యంగా హిందువులంతా నరేంద్రమోడీ గారికి అండగా నిలవాలి. అని పేర్కొన్నారు. ఒక పోస్టులోనేమో ముస్లింలు మెజారిటీగా మారనున్నారని భయపెడతారు, మరో పోస్టులో హిందూమత రక్షకుడు నరేంద్రమోడీ వచ్చినట్లు, ముప్పు తప్పించినందుకు మద్దతు ఇవ్వాలని చెబుతారు. ముస్లిం జనాభా పెరుగుదల గురించి ఉనికిలో లేని సంస్ధ పేరు చెప్పి జనాలను తప్పుదారి పట్టించినట్లుగానే మార్క్‌తులి పేరు చెప్పి మరో పచ్చి అబద్దం ప్రచారంలో పెట్టారు. నరేంద్రమోడీకి అనుకూలంగా కొన్ని అంశాలను రాసి అవి మార్క్‌తులి పుస్తకంలోనివిగా పేర్కొంటూ గత ఐదు సంవత్సరాలుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు.


ఇక దేశంలో ముస్లింల జనాభా పెరుగుతోందన్న ప్రచారం గురించి నిజానిజాలేమిటో చూద్దాం. 2002 గుజరాత్‌ మారణ కాండ సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్రమోడీ చేసిన వ్యాఖ్య ఏమిటి ? ” నేనేం చేయాలి ? వారికి సహాయ శిబిరాలు ఏర్పాటు చేయాలి, పిల్లల్ని కనాలని మనం కోరుకుందామా ? ” 2017లో బిజెపి ఎంపీ సాక్షి మహరాజ్‌ మీరట్‌ సభలో మాట్లాడుతూ ”నలుగురు భార్యలు, 40 మంది పిల్లలను కలిగి ఉండేవారే దేశంలో జనాభా పెరుగుదలకు కారకులు, హిందువులను నిందించకూడదు. మన మతాన్ని సంరక్షించుకొనేందుకు ప్రతి హిందూ మహిళ నలుగురు పిల్లల్ని కనాలి ” అని చెప్పారు.
విశ్వహిందూ పరిషత్‌ అంతర్జాతీయ అధ్యక్షుడిగా పని చేసిన ప్రవీణ్‌ తొగాడియ గుజరాత్‌లోని బహరుచ్‌ జిల్లా జంబుసర్‌లో మాట్లాడుతూ ఇలా సెలవిచ్చారు.” హిందూ పురుషులూ ఇంటికి వెళ్లి మీ పురుషత్వాన్ని ఆరాధించండి. అప్పుడు హిందువుల జనాభా పెరుగుతుంది. హిందువులందరూ ఎక్కువ మంది పిల్లల్ని కనండి.” ఆర్‌ఎస్‌ఎస్‌ సర్‌సంఫ్‌ుసంచాలక్‌ మోహన్‌ భగవత్‌ మాట్లాడుతూ ముస్లింలు, హిందూ డిఎన్‌ఎ ఒకటే అని చెప్పారు. కానీ అదే పెద్ద మనిషి అంతకు ముందు ఒకసారి ఏమన్నారు.” ఇతరుల జనాభా పెరుగుతున్నపుడు హిందువుల జనాభా పెరగ కూడదని ఏ చట్టం చెప్పింది ” అని ప్రశ్నించారు. ఆరెస్‌ఎస్‌ మరోనేత దత్తాత్రేయ హౌసబలే ” చిన్న కుటుంబం నియమాలు హిందువులకు పెద్ద ముప్పుగా ఉన్నాయి. కనుక ప్రతి కుటుంబం ముగ్గురు పిల్లలను కలిగి ఉండాలి. ఒక సమాజం గుడ్డిగా కుటుంబ నియంత్రణ పాటిస్తే దేశానికి జరిగే మంచేమీ ఉండదు. అది దేశంలో తీవ్ర అసమానతలకు దారితీస్తుంది.” అన్నారు. 2018లో రాజస్తాన్‌ బిజెపి ఎంఎల్‌ఏ బన్వారీలాల్‌ సింగ్‌ సింఘాల్‌ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ 2030 నాటికి ముస్లింల జనాభా పెరిగి హిందువులు ప్రమాదంలో పడతారని రెచ్చగొట్టారు. హిందువులు ఒకరిద్దరికి పరిమితం అవుతుంటే ముస్లింలు 12-14 మందిని కంటున్నారని ఆరోపించారు.


1992లో మిగతా సామాజిక తరగతులతో పోలిస్తే ముస్లిం మహిళలు సగటున ఒక బిడ్డను ఎక్కువగా కలిగి ఉన్నారు. 1992లో మొత్తం మహిళలకు సగటున 3.4గురు పిల్లలు ఉండగా 2015 నాటికి 2.2కు తగ్గారు. ఇదే కాలంలో 4.4గా ఉన్న ముస్లిం పిల్లలు 2.6కు, హిందూ పిల్లలు 3.3 నుంచి 2.1కి తగ్గారు. దీని అర్ధం ఏమిటి ? రెండు సామాజిక తరగతుల పిల్లల తేడా 1.1 నుంచి 0.5కు తగ్గింది. క్రైస్తవుల పిల్లలు 2.9 నుంచి రెండుకు తగ్గారు. మరి క్రైస్తవులు, ముస్లింలతో దేశాన్ని నింపివేసే కుట్ర జరుగుతోందని చేస్తున్న ప్రచారానికి ఆధారం ఏమిటి ? ముస్లింల్లో కూడా విద్య పెరిగితే పిల్లల సంఖ్య తగ్గుతుంది.


దేశంలో ఇప్పుడున్న స్ధితి ఏమిటి ? 35 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 29 చోట్ల హిందువులే మెజారిటీ. లక్షద్వీప్‌లో లక్ష మంది, జమ్ము-కాశ్మీరులో కోటీ 30లక్షల మంది ఉన్న ప్రాంతాల్లో మాత్రమే ముస్లింలు మెజారిటీగా ఉన్నారు.దేశ జనాభాలో వీరు ఐదుశాతమే, 95శాతం మిగతా రాష్ట్రాలలో ఉన్నారు. పంజాబులో సిక్కులు, నాగాలాండ్‌(20లక్షలు), మిజోరం(పది లక్షలు), మేఘాలయ(30లక్షలు)లో క్రైస్తవులు మెజారిటీగా ఉన్నారు. ముస్లింలు కుటుంబ నియంత్రణ పాటించరు అన్నదొక ప్రచారం. గణాంకాల ప్రకారం ముస్లింలలో 45.3, హిందువుల్లో 54శాతం మంది నియంత్రణ పాటిస్తున్నారు. .2011లెక్కల ప్రకారం హిందువుల్లో జననాల రేటు 1991-2001 కాలంలో 19.92 నుంచి 16.76కు తగ్గగా ముస్లింల్లో 29.52 నుంచి 24.6కు తగ్గింది. వీటి ఆధారంగా వేసిన అంచనా ఏమిటి ? 2011-21కాలంలో హిందువుల జననాల రేటు 15.7, ముస్లింలలో 18.2కు తగ్గనుందని అంచనా. దీని అర్ధం ఏమిటి కుటుంబనియంత్రణ పాటించటం ముస్లింలలో పెరిగిందనే కదా ? లెక్కలు తెలియని వారికి చెప్పవచ్చు, తెలియనట్లు నటించే వారికి చెప్పగలమా ? దేశంలో పురుషులు-స్త్రీల నిష్పత్తి 1000-940, అదే పిల్లల్లో చూస్తే 1000-916 మాత్రమే ఉంది. ఇలా ఉన్న దేశంలో బహుభార్యలను కలిగి ఉండటం సాధ్యమా ? ముస్లింలు ఎక్కువగా ఉన్న లక్షద్వీప్‌లో 946,911గానూ జమ్మూకాశ్మీరులో 889,862గా ఉన్నారు. దేశ సగటు కంటే తక్కువ ఉన్న చోట అది జరిగేదేనా ? చిత్రం ఏమంటే దేశంలో అనుమతి ఉన్న ముస్లింల్లో బహుభార్యాత్వం 5.7 శాతం ఉంటే నిషేధం ఉన్న హిందువుల్లో 5.8శాతం ఉంది. దీన్నేమంటారు ?


2035నాటికి ముస్లింల సంఖ్య పెరిగి పోనుందనే ప్రచార కథేమిటో చూద్దాం. అసలు ఇది ఎక్కడ పుట్టింది ? ఒకరాయి వేద్దాం మనల్ని అడగొచ్చేదెవరులే అనే ధైర్యంలో ముస్లిం వ్యతిరేక ప్రచారాన్ని చేస్తున్నారు. 2017ఏప్రిల్‌ ఐదవ తేదీన అమెరికాలోని న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక పూ సంస్ధ విశ్లేషణకు ” 2035 నాటికి ముస్లిం పిల్లల సంఖ్య ఇతరులను అధిగమించనుంది ” అనే శీర్షిక పెట్టింది. కానీ పూ సంస్ధ నివేదిక చెప్పిందేమిటి ? ప్రపంచంలో 2075నాటికి ఇస్లాం పెద్ద మతంగా అవతరిస్తుంది. 2035నాటికి స్వల్పంగా క్రైస్తవ తల్లుల కంటే ముస్లిం తల్లులు కనే పిల్లల సంఖ్య ఎక్కువ ఉంటుందని పేర్కొన్నది. దాన్ని మన దేశంలో హిందూత్వశక్తులు ఇక్కడి ముస్లింలకు వర్తింప చేసి ప్రచారం చేస్తున్నారు.


ఇక వాట్సాప్‌ను బిజెపి ఎలా ఉపయోగిస్తోందో అమిత్‌ షా మాటల్లోనే చెప్పాలంటే ” అది నిజమైనా కల్పితమైనా ఏ సందేశాన్నైనా మనం వైరల్‌(విపరీతంగా ప్రచారం) చేయగలం. సామాజిక మాధ్యమం ద్వారా మనం కేంద్రంలో, రాష్ట్రాలలో ప్రభుత్వాలను ఏర్పాటు చేయాల్సి ఉంది. వర్తమానాలను వైరల్‌ చేయాలి. ఉత్తర ప్రదేశ్‌లో మనం ఇప్పటికే 32లక్షల మందితో వాట్సాప్‌ గ్రూపులను ఏర్పాటు చేశాం. ప్రతి ఉదయం ఎనిమిది గంటలకు వారు ఒక వర్తమానాన్ని పంపుతారు. ” ఇది 2018లో రాజస్తాన్‌లోని కోట పట్టణంలో బిజెపి సామాజిక మాధ్యమ కార్యకర్తల సమావేశంలో చేసిన ప్రసంగం అంటూ హిందీ దినపత్రిక దైనిక్‌ భాస్కర్‌ రాసిన వార్త. దేశమంతటా దానికి అలాంటి వాట్సాప్‌ గ్రూపులు, వాటిలో పంపే సమాచారం ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. మేకిన్‌ ఇండియా(భారత్‌లో తయారీ), మేక్‌ ఇండియా(భారత్‌ తయారీ) పిలుపులతో ఇప్పటి వరకు ఎగుమతికి అవసరమైన వస్తువుల కంటే జనాన్ని చీకట్లో ఉంచేందుకు అవసరమైన అవివేకం పెద్ద ఎత్తున ఉత్పత్తి జరుగుతోంది. దాని వినియోగం విపరీతంగా పెరుగుతోంది. ” ఒక ప్రధానమైన అంశాన్ని మరోవైపు ఆలోచించకుండా జోరీగలా బుర్రల్లోకి ఎక్కించకుండా అత్యంత ప్రతిభావంతులైన ప్రచార నిపుణుల మెళకువలు కూడా విజయ వంతం కావు.ఆ ప్రచారం కొన్ని అంశాలకే పరిమితం కావాలి, దాన్ని పదే పదే పునశ్చరణ చేయాలి.ఈ ప్రపంచంలో విజయం సాధించాలంటే మొట్టమొదటిదీ, ముఖ్యమైనదీ దేనికైనా హఠం వేయటమే ” తన మీన్‌ కాంఫ్‌ గ్రంధంలో నరహంతకుడు నాజీ హిట్లర్‌ రాసిన అంశమిది. హిట్లర్‌ను, వాడి మంత్రి గోబెల్స్‌ను ఎవరు ఆదర్శంగా తీసుకున్నదీ వేరే చెప్పాలా !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

ఉత్తర ప్రదేశ్‌లో బిజెపి బుకాయింపులు – అసలు రంగు !

15 Tuesday Mar 2022

Posted by raomk in BJP, Communalism, Congress, Current Affairs, Farmers, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Politics, RELIGION, Uncategorized, Women

≈ Leave a comment

Tags

BJP, BSP, Narendra Modi, RSS, Samajwadi Party, UP election 2022


ఎం కోటేశ్వరరావు


ఎంతో ఆసక్తి కలిగించిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చాయి. తమకు ఇంక 2024లో కూడా తిరుగులేదని బిజెపి ఢంకా బజాయిస్తోంది. కాంగ్రెస్‌, ఇతర పార్టీలు ఆత్మశోధనలో పడ్డాయి. ఎవరి సూత్రీకరణలు వారు చేసుకుంటున్నారు. ఇంకా కొత్త ప్రభుత్వాలు కొలువు తీరలేదు. పలు కోణాల్లో విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఇవన్నీ సహజం.వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక అన్నట్లుగా రాజకీయ పార్టీలు చెప్పిన వాటికి ప్రతిదానికీ తలూపాల్సిన అవసరంలేదు. జనం ఇచ్చిన తీర్పును గౌరవించటం వేరు. చరిత్రలో ఇచ్చిన తీర్పులన్నీ సరైనవే అని ఆమోదించాల్సిన అవసరం లేదు. హిట్లర్‌ వంటి నియంతలకు కూడా జనమే ఓట్లు వేసి గెలిపించారు. అంతమాత్రాన వారి తీర్పు సరైనదే అంటామా ? ఉత్తర ప్రదేశ్‌కు సంబంధించి కొన్ని అంశాల తీరు తెన్నులను చూద్దాం.


యోగి ఆదిత్యనాధ్‌ అభివృద్దిని చూసి తిరిగి గెలిపించి చరిత్ర సృష్టించారు. ఇటీవలి సంవత్సరాల్లో వరుసగా రెండవసారి పార్టీ అధికారానికి రాని చరిత్రను బిజెపి తిరగరాసింది.రెండవది నిజమే. ఇక మొదటి అంశం, అభివృద్ధి అంటే ఏమిటి ? అందునా యోగి చిన్న ఇంజనైతే పెద్ద ఇంజను నరేంద్రమోడీ కూడా తోడయ్యారు అన్నారు. జరిగిందేమిటి ? 2016-21 కాలంలో ఉత్తర ప్రదేశ్‌లో ఉపాధి రేటు 38.5 నుంచి 32.79(2021 సెప్టెంబరు-డిసెంబరు)శాతానికి పడిపోయింది.కార్మికశక్తి భాగస్వామ్యం కూడా ఇదే కాలంలో 46.32 నుంచి 34.45 శాతానికి తగ్గింది. నీతిఆయోగ్‌ సంస్ధ వెల్లడించిన వివరాల ప్రకారం దారిద్య్రంలో బీహార్‌, ఝార్ఖండ్‌ తరువాత ఉత్తర ప్రదేశ్‌ మూడవ స్ధానంలో ఉంది. అందుకే బిజెపి చెప్పే అభివృద్ధి అంటే ఏమిటి అన్న ప్రశ్న వస్తోంది. అయినా జనం ఎందుకు ఓట్లు వేశారనే ప్రశ్న తలెత్తుతుంది. గతంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నపుడు మరొక ప్రత్నామ్నాయం లేక జనం పదే పదే ఓట్లు వేశారు, దానినేమందాం ?ఉత్తర ప్రదేశ్‌లో ప్రతిపక్ష సమాజవాది మీద తగినంత విశ్వాసం లేకపోవటం ఒకటిగా కనిపిస్తోంది. రెండవది బిజెపి బి టీమ్‌లుగా పేరు తెచ్చుకున్న బిఎస్‌పి, మజ్లిస్‌ పార్టీలు చీల్చిన ఓట్లు బిజెపికి తోడ్పడ్డాయి. పోటీ 80-20శాతాల(హిందూ-ముస్లిం) మధ్య అనే బిజెపి మత సమీకరణల నినాదం కూడా పని చేసింది.


2019లోక్‌సభ ఎన్నికల్లో బిజెపికి 49.98, దాని మిత్రపక్షానికి 1.21శాతం కలుపుకుంటే ఉత్తర ప్రదేశ్‌లో రెండు ఇంజన్లకు కలిపి వచ్చిన ఓట్లు 51.19 శాతం. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ కూటమిలోని మూడు పార్టీలకు వచ్చిన ఓట్లు 43.82శాతమే, మోడీ మంత్రం పని చేయనట్లేనా ? 2019లో సమాజవాది పార్టీ-బిఎస్‌పి-ఆర్‌ఎల్‌డి ఒక కూటమిగా పోటీ చేస్తే 39.23శాతం వచ్చాయి. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో సమాజవాదీ కూటమికి 36.32శాతం వచ్చాయి. విడిగా పోటీచేసిన బిఎస్‌పి 12.88శాతం తెచ్చుకుంది.దీని అర్ధం ఏమిటి గతంలో బిజెపి, బిఎస్‌పి, కాంగ్రెస్‌కు పడిన ఓట్లలో కొన్ని సమాజవాది కూటమికి రాబట్టే ఓట్లశాతం పెరిగింది. బిజెపి సర్కార్‌ మీద ఉన్న వ్యతిరేకతే తమను గద్దె నెక్కిస్తుందని సమాజవాది అతి అంచనా వేసుకొని చేయాల్సిన కృషి లేకపోవటం ఓటమికి ఒక ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఎన్నికల సర్వేలు చేసిన వాటిలో ఒకటైన ఏబిపి-సి ఓటర్‌ సంస్ధ 2021 మార్చి నెల నుంచి 2022 జనవరి వరకు చేసిన ఆరు సర్వేల్లో బిజెపి కూటమి సగటు ఓట్ల శాతం 41.11శాతం కాగా చివరి సర్వేలో 41.5శాతంగా పేర్కొన్నది. ఇదే సంస్ద సమాజవాది కూటమి సగటు ఓట్లశాతాన్ని 30.8గానూ, తొలి సర్వేలో 24.4శాతంగానూ చివరి సర్వేలో 33.3శాతంగా పేర్కొన్నది.


యోగి సర్కార్‌ గూండాయిజాన్ని, నేరగాండ్లను బుల్‌డోజర్లతో అణచివేసింది, రెండవ సారి గద్దె నెక్కితే మిగతావారిని కూడా తొక్కివేస్తుంది. మంచిదే. వాస్తవ అలా ఉందా ? ఇదే ఉత్తర ప్రదేశ్‌ను గతంలో బిజెపి, బిఎస్‌పి, ఎస్‌పి పార్టీలు ఏలాయి, గూండాయిజం, మాఫియా ముఠాల పెరుగుదలకు ఎవరివంతు తోడ్పాటు వారు ఇచ్చారన్నది తిరుగులేని నిజం.ఇక 2022 ఎన్నికల్లో గెలిచిన నేరచరిత గలిగిన వారి మీద బుల్డోజర్లను ఎలా నడిపిస్తారో తరువాత చూద్దాం.


2022లో అసెంబ్లీకి ఎన్నికైన 403 మందిలో 205 మంది మీద క్రిమినల్‌ కేసులు ఉన్నాయి. గత అసెంబ్లీలో అలాంటి వారు 143 మంది మాత్రమే ఉన్నారు. ప్రజాస్వామిక సంస్కరణల సంస్ధ(ఏడిఆర్‌) వెల్లడించిన నివేదిక ప్రకారం తీవ్రమైన క్రిమినల్‌ కేసులు ఉన్నవారు అంటే హత్య, హత్యాయత్నం, కిడ్నాప్‌, మహిళల మీద నేరాలకు పాల్పడినట్లు అభియోగాలున్నవారు 158 మంది, వీరిలో ఒకరి మీద అత్యాచారయత్నం కేసు కూడా ఉంది. గతంలో ఇలాంటి ఘనులు 117 మాత్రమే. పార్టీల వారీగా చూస్తే తమ పార్టీ ప్రత్యేకం అని చెప్పుకొనే బిజెపి అగ్రస్దానంలో అంటే 255కు గాను 111 మందిని కలిగి ఉంది. సమాజవాది పార్టీలో 111 మందికిగాను 71 మంది ఉన్నారు. ఐదేండ్ల తరువాత అభివృద్ధిని చూపి ఓట్లడిగామని చెప్పుకొనే వారు మరింత మంది నేర చరితులను ఎందుకు రంగంలోకి దింపినట్లు ? ఎన్నికైన ఎంఎల్‌ఏల్లో గతంలో 322 మంది కోటీశ్వరులుంటే ఇప్పుడు వారి వృద్ది 366కు పెరిగింది. బిజెపి తరఫున గెలిచిన 255 మంది సగటు 8.14 కోట్లు, అదే సమాజవాది సగటు రు.7.39 కోట్లు ? ఎవరిది డబ్బు, కండబలం ఉన్న పార్టీ ? గెలిచిన ఇద్దరు కాంగ్రెస్‌ వారి ఆస్తి రు.19.71 కోట్లు.


ఉత్తర ప్రదేశ్‌ చట్టసభలో మెజారిటీ 205 మంది నేర చరితులు ఉన్న తరువాత వారి అనుచరులు, అభిమానులు వేరే దారిలో నడుస్తారా ? చట్టాలను అమలు జరిపే యంత్రాంగాన్ని సక్రమంగా నడవనిస్తారా ? చరిత్రలో ఎక్కడా అలాంటి ఉదంతాలు లేవు. హత్రాస్‌ దుర్మార్గం జరిగింది, లఖింపూర్‌ ఖేరీ దారుణం తెలిసిందే. ఇప్పుడు బిజెపి ఎన్నికల్లో గెలిచినంత మాత్రాన అవసలు జరగలేదు, ప్రతిపక్షాల కుట్ర లేదా ప్రచారమని చెబుతారా ? చెప్పండి ! మహిళలు పెద్ద ఎత్తున ఓట్లు వేసినట్లు చెబుతున్నారు.నిజం కూడా కావచ్చు, దీని అర్ధం ఉత్తర ప్రదేశ్‌ మహిళలకు స్వర్గంగా ఉన్నట్లా ? 2015-19(రెండు సంవత్సరాలు అఖిలేష్‌, రెండు సంవత్సరాలు యోగి ఏలుబడి) సంవత్సరాలలో అక్కడ మహిళలపై నేరాలు 66.7శాతం పెరిగాయి. దేశ సగటు 23శాతం మాత్రమే.2019లో దేశంలో నమోదైన కేసుల్లో 15శాతం యోగి ఖాతాలో పడ్డాయి. సామూహిక మానభంగాలలో 2019లో రాజస్తాన్‌ 902 కేసులతో ముందుంటే ఉత్తర ప్రదేశ్‌ 301, మధ్యప్రదేశ్‌ 162తో రెండు, మూడు స్ధానాల్లో ఉన్నాయి. ఉన్నత విలువలు నేర్పుతామని చెప్పే ఆర్‌ఎస్‌ఎస్‌, హిందూత్వ సంస్ధలకు ఈ మూడు రాష్ట్రాల్లో ఎంతో పట్టు ఉందన్నది తెలిసిందే. వారు తెచ్చిన సామాజిక మార్పు ఏమిటి ?


పైన చెప్పుకున్న నాలుగు సంవత్సరాల్లో దళితులపై జరిగిన దారుణాల కేసుల్లోనూ ఉత్తర ప్రదేశ్‌ అగ్రస్ధానంలో ఉంది. తరువాత స్ధానాల్లో సంఘపరివారం బలంగా ఉన్న రాజస్తాన్‌, బీహార్‌, మధ్య ప్రదేశ్‌ ఉన్నాయి. ఉత్తర ప్రదేశ్‌లో 2015లో 8,357 నమోదు కాగా 2019లో 11,829కి చేరాయి.2018 – 2020 (పూర్తిగా యోగి స్వర్ణయుగంలో) మూడు సంవత్సరాల్లో 36,467 కేసులు నమోదయ్యాయి, అంటే సగటున ఏడాదికి 12,155, వేద గణితం ప్రకారం లెక్కలు వేసినా యోగి ఏలుబడిలో తగ్గినట్లు ఎవరైనా చెప్పగలరా ? 2019లో దేశంలో పదిహేను శాతం కేసులు ఉత్తరప్రదేశ్‌లో ఉంటే అవి 2020నాటికి 26శాతానికి పెరిగాయి.
సబ్‌కాసాత్‌, సబ్‌కా వికాస్‌, సబ్‌కా విశ్వాస్‌ అంటే అందరినీ కలుపుకుపోతాం, అందరి వృద్ధి, అందరి విశ్వాసం అన్నది బిజెపి నినాదం. బిజెపికి మింగుడుపడినా పడకున్నా ఉత్తర ప్రదేశ్‌ జనాభాలో 20శాతం ముస్లింలు ఉన్నారు. ఆ సామాజిక తరగతికి చెందిన వారికి ఒక్కటంటే ఒక్క సీటూ ఇవ్వలేదు. అంటే బిజెపి ఇచ్చే నినాదం మోసపూరితం కాదా ?మత ప్రాతిపదికన ఓటర్లను సమీకరించేందుకు వేసిన ఎత్తుగడకాదా ? హిందూ పత్రిక-సిఎస్‌డిఎస్‌-లోక్‌నీతి సంస్ధలు సంయుక్తంగా ఎన్నికల అనంతర సర్వే వివరాల ప్రకారం బిజెపి ముందుకు తెచ్చిన మతపరమైన రెచ్చగొట్టుడు పని చేసింది.2017 బిజెపికి హిందువులు 47శాతం ఓటు వేస్తే 2022లో 54శాతానికి పెరిగింది. అదే సమాజవాది పార్టీకి 19 నుంచి 26శాతానికి పెరిగింది. బిఎస్‌పికి 23 నుంచి 14శాతానికి, కాంగ్రెస్‌కు నాలుగు నుంచి రెండుశాతానికి తగ్గింది. ఈ ఓట్లు బిజెపి-సమాజవాది పార్టీలకు వెళ్లాయి. ఇక సమాజవాది పార్టీ కూటమి సీట్ల సంఖ్యపెరగటానికి బిజెపి చేసిన విద్వేష ప్రచారంతో ముస్లింలు ఆ వైపు మొగ్గటమే అన్నది స్పష్టం.గత ఎన్నికల్లో 46శాతంగా ఉన్నవి ఈసారి 79శాతం మంది ఎస్‌పి కూటమివైపు మొగ్గారు. బిఎస్‌పి ఓట్లు 19 నుంచి ఆరు, కాంగ్రెస్‌ ఓట్లు 23 నుంచి మూడు, ఇతరుల ఓట్లు పది నుంచి నాలుగుశాతానికి తగ్గాయి. ఇదే సమయంలో ముస్లిం ఓట్లు బిజెపికి ఐదు నుంచి ఎనిమిదిశాతానికి పెరిగాయి.


యోగి సర్కార్‌ అభివృద్దే గెలిపిస్తుందని చెప్పుకుంటూనే బిజెపి173 మంది కొత్త ముఖాలను రంగంలోకి దించి పాత వారి మీద జనంలో ఉన్న అసంతృప్తిని చల్లార్చేందుకు చూసింది. వారిలో 99 మాత్రమే గెలిచారు.గత ఎన్నికల్లో బిజెపి కూటమి ఓడిన 85 స్దానాల్లో ఈసారి 69 మంది కొత్తవారిని రంగంలోకి దించినా గెలిచింది 19 మాత్రమే. పాతవారిలో 104 మంది సిట్టింగులకు సీట్లు ఇవ్వలేదు. అక్కడ కొత్తవారిని పెట్టగా 80 మంది గెలిచారు. గత ఎన్నికల్లో ఓడిన 16 మందిని ఈ సారి కూడా పోటీకి నిలిపితే కేవలం నలుగురు మాత్రమే గెలిచారు.


మజ్లిస్‌ పార్టీ ఓట్లు చీల్చిన కారణంగా సమాజవాది ఓడింది అన్నది ఒక అభిప్రాయం.ఆ పార్టీ బిజెపికి బిటీమ్‌ అన్నది, దాని అధినేత మీద జరిగిన దాడి బూటకం అన్నది నిజం. కానీ ఇక్కడ ఆ పార్టీ పోటీచేసిన 94 స్ధానాల్లో వచ్చిన ఓట్లు 4,50,929(0.49శాతం) మాత్రమే అయినా అనేక చోట్ల బిజెపికి తోడ్పడింది. మొత్తంగా చూసినపుడు మూడవ స్దానంలో ఉన్న బిఎస్‌పి పోటీ బిజెపికి తోడ్పడిందన్నది గమనించాలి. తిరుగులేదు అని చెప్పుకున్న బిజెపికి ఉత్తర ప్రదేశ్‌లో మూడు చోట్ల డిపాజిట్లు రాలేదు.399 చోట్ల పోటీ పడిన కాంగ్రెస్‌ 387 చోట్ల డిపాజిట్లు కోల్పోయింది. రెండు చోట్ల గెలవగా నాలుగు చోట్ల రెండవ స్ధానంలో ఉంది. తనబలాన్ని అతిగా అంచనా వేసుకొని పోటీ చేసిన కాంగ్రెస్‌ సగటున ఒక్కో చోట 5,391 ఓట్లు తెచ్చుకొంది, ఆ విధంగా కూడా బిజెపికి తోడ్పడినట్లే. బిఎస్‌పి పోటీ చేసిన 403 స్ధానాల్లో 290 చోట్ల డిపాజిట్లు పోగొట్టుకుంది.ఒక చోట గెలవగా 14చోట్ల రెండవ స్దానంలో ఉంది.


నువ్వానేనా అన్నట్లుగా అధికారం కోసం పోటీపడిన సమాజవాది పార్టీ 376 చోట్ల పోటీ చేసింది, ఆరు చోట్ల డిపాజిట్లు కోల్పోయింది. నూటపదకొండు సీట్లు గెలిచి 231 చోట్ల రెండవ స్దానంలో ఉంది. ఆ పార్టీతో జట్టు కట్టిన ఆర్‌ఎల్‌డి 33 చోట్ల పోటీ చేసి మూడు డిపాజిట్లు కోల్పోయి ఎనిమిది చోట్ల గెలిచింది.చెల్లిన ఓట్లలో 16.66శాతం తెచ్చుకుంటే డిపాజిట్‌ దక్కుతుంది. పురుషుల్లో కేవలం నాలుగుశాతం మాత్రమే సమాజవాది కంటే బిజెపికి ఎక్కువగా ఓట్లు వేయగా మహిళల్లో బిజెపికి 16శాతం మంది అధికంగా ఓటు వేసినట్లు సర్వేలు పేర్కొన్నాయి. ఇది కూడా బిజెపికి తోడ్పడిన అంశంగా భావిస్తున్నారు. కొన్ని సంక్షేమ పధకాలు వీరిని ఆకర్షించినట్లు చెబుతున్నారు. ఇక రైతులు కూడా బిజెపికి గణనీయంగా ఓటు చేశారు. ఏడాదికి ఆరువేల చొప్పున కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న కిసాన్‌ సమ్మాన్‌ యోజనం పధకం, ఎన్నికలలో బిజెపి చేసిన కొన్ని వాగ్దానాలు ముఖ్యంగా చిన్న, సన్నకారు రైతాంగాన్ని ఆకర్షించినట్లు వెల్లడైంది.లఖింపూర్‌ ఖేరీ, పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌లో కూడా తాము గణనీయంగా రైతుల మద్దతు పొందినట్లు బిజెపి చెప్పుకొంటోంది. అంగీకరిద్దాం, క్షమాపణలు చెప్పి రద్దు చేసిన మూడు సాగు చట్టాలను తిరిగి నరేంద్రమోడీ ప్రవేశపెడతారా ? కనీస మద్దతు ధరలకు చట్టబద్దత కల్పించే అంశాన్ని పరిశీలించేందుకు వేస్తామన్న కమిటీని ఉత్తిదే అంటారా ? చూద్దాం !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

ఉత్తర ప్రదేశ్‌ బిజెపికి తాళం కప్ప బహుమతి – ఒక మంత్రి, 15 మంది ఎంఎల్‌ఏలు రాం రాం !

12 Wednesday Jan 2022

Posted by raomk in BJP, Communalism, Congress, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Politics, RELIGION

≈ Leave a comment

Tags

#Akhilesh Yadav, BJP, Hinduthwa, Narendra Modi, OBC, Swami Prasad Maurya, UP BJP poll fate, UP poll 2022, Yogi Adityanath


ఎం కోటేశ్వరరావు


మంగళవారం నాడు ఉత్తర ప్రదేశ్‌ బిజెపికి అనూహ్య బహుమతి లభించగా, ఊహించని దెబ్బ తగిలింది. దాదాపు 60 మంది ఎంఎల్‌ఏలను తప్పించి కొత్త ముఖాలతో బరిలోకి దిగేందుకు ఢిల్లీలో మంతనాలు జరుపుతున్నట్లు వార్తలు. కార్మిక శాఖ మంత్రి స్వామి ప్రసాద్‌ మౌర్య పదవికి రాజీనామా చేసి సమాజవాది పార్టీ నేతతో ఫొటోకు ఫోజిచ్చారు. మరో ముగ్గురు ఎంఎల్‌ఏలు కూడా అదే బాట పట్టారు. పదమూడు మంది బిజెపి ఎంఎల్‌ఏలు రాజీనామా చేయనున్నట్లు ఎన్‌సిపి అధినేత శరద్‌ పవార్‌ ప్రకటించారు. తన బాటలో నడిచే వారు 15 మంది వరకు ఉన్నట్లు మౌర్య చెబుతున్నారు. మరో మంత్రి ధరమ్‌ సింగ్‌ సయానీ కూడా ఇదే బాటపట్టనున్నట్లు వార్తలు వచ్చాయి. సీట్లు రాని వారు, బిజెపి గెలిచే అవకాశాలు లేవని గ్రహించిన వారు ఎందరు రాం రాం చెబుతారో తెలియదు. మార్చి పదవ తేదీ తరువాత పార్టీ కార్యాలయాన్ని మూసుకోవాల్సి వస్తుంది కనుక బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు స్వతంత్రదేవ్‌ సింగ్‌కు తాళం కప్పను బహుమతిగా పంపినట్లు సమాజవాది పార్టీ నేత ఐపి సింగ్‌ ప్రకటించారు. ” ఓం ప్రకాష్‌ రాజభర్‌, జయంత్‌ చౌదరి, రాజమాత కృష్ణపటేల్‌, సంజయ చౌహాన్‌, ఇప్పుడు స్వామి ప్రసాద్‌ మౌర్య మాతో ఉన్నారు. బిజెపి ప్రధాన కార్యాలయానికి తాళం కప్పను బహుమతిగా పంపాను. మార్చి పదవ తేదీ(ఎన్నికల ఫలితాలు వెలువడే రోజు) తరువాత తాళం వేసి ఇంటికి వెళ్లి పోండి. ఇది అలకాదు, ఎస్‌పి తుపాను ” అని ట్వీట్‌ చేశారు.


యోగి సర్కార్‌ ఒబిసిలు, దళితులు, రైతులు,చిన్న సన్నకారు వ్యాపారులు, నిరుద్యోగులను నిర్లక్ష్యం చేస్తోందని మంత్రి స్వామి ప్రసాద్‌ మౌర్య ట్వీట్‌ ద్వారా రాజీనామా లేఖ పంపారు. ఇది వెలువడిన కొన్ని నిమిషాల్లోనే మౌర్య సమాజవాది నేత అఖిలేష్‌ యాదవ్‌ను కలిసిన ఫొటో దర్శనమిచ్చింది.స్వామి ప్రసాద్‌ను పార్టీలోకి ఆహ్వానించినట్లు అఖిలేష్‌ ప్రకటించారు. ఐదు సార్లు ఎంఎల్‌ఏగా, మంత్రిగా పనిచేసి మాయావతి తరువాత నేతగా పేరున్న మౌర్య 2016లో బిఎస్‌పి నుంచి బిజెపిలో చేరారు. ఇప్పుడు సమాజవాదిలో నేరుగా చేరతారా లేక గతంలో ఏర్పాటు చేసిన వేదికను పునరుద్దరించి మిత్రపక్షంగా బరిలోకి దిగుతారా అన్నది ఇంకా స్పష్టం కాలేదు.
ఉత్తర ప్రదేశ్‌ ఎన్నికల గురించి వివిధ సర్వేలు వెలువడుతున్నాయి. ఏబిపి-సి ఓటర్‌ 2021 మార్చి 18న ఒక సర్వే, తాజాగా జనవరి 10న సర్వే వివరాలను ప్రకటించింది.మధ్యలో మరోనాలుగు సర్వేలను నిర్వహించింది.తొలి, తాజా సర్వేల అంచనా సీట్లు, ఓట్లశాతాలు ఇలా ఉన్నాయి.తొమ్మిది నెలల కాలంలో బిజెపి పలుకుబడి ఎలా పడిపోతోందో ఈ వివరాలు సూచిస్తున్నాయి. నామినేషన్లు, ఉపసంహరణల లోగా జరిగే పరిణామాలు పార్టీ ప్రభావాన్ని మరింతగా దిగజార్చేవే తప్ప పెంచేవిగా లేవు.


తేదీ××××××ఎన్‌డిఏ ×××××××ఎస్‌పి×××××××బిఎస్‌పి×××××××కాంగ్రెస్‌×× ఇతరులు
18.3.21××284-294(41)×××54-64(24.4)×××33-43(20.8)××1-7(5.9)××10-16(7.9)
10.1.22××223-235(41.5)××145-157(33.3)××8-16(12.9)××3-7(7.1)××4-8(5.3)
గతఫలితాలు××312(41.4)××47(23.6)××××19(22.2)××××××× 7(6.3)××××ు(6.5)


తన వంటి ఉదారవాదులు బిజెపి ఓడిపోవాలని కోరుకుంటున్నప్పటికీ ఉత్తర ప్రదేశ్‌లో అదే జరిగితే దేశంలో సంస్కరణలు వెనుకపట్టు పడతాయని కార్పొరేట్లకు కొమ్ముకాసే ప్రముఖ జర్నలిస్టు స్వామినాధన్‌ అంక్లేశ్వరియా అయ్యర్‌ పేర్కొన్నారు. ఎకనమిక్స్‌ టైమ్స్‌ ప్రతినిధితో మాట్లాడుతూ సాగు చట్టాల ప్రహసనంతో ఇప్పటికే సంస్కరణలు వెనుకపట్టు పట్టాయి.మానిటైజేషన్‌, కార్మిక సంస్కరణలు కూడా అదే విధంగా మారతాయన్నారు. ఉత్తర ప్రదేశ్‌ నుంచి వెలువడుతున్న చెడు సంకేతాల కారణంగా మానిటైజేషన్‌ మందగించిందన్నారు. బిజెపి గెలిస్తే సంస్కరణలు వేగంగా అమలు జరుగుతాయని, ఓడితే మిగతా రాష్ట్రాల సంస్కరణల మీద కూడా ప్రభావం ఉంటుందన్నారు. దేశ ఆర్ధిక రంగం ఏ బాటలో నడుస్తుందన్నది వచ్చే బడ్జెట్‌ మీదగాక ఉత్తర ప్రదేశ్‌ ఎన్నికల ఫలితాల మీద ఆధారపడి ఉంటుందని చెప్పారు. బిజెపి మతతత్వ వైఖరిని అయ్యర్‌ వంటి వారు ఆమోదించనప్పటికీ సమాజం ఏమైనా ఫరవాలేదు కార్పొరేట్ల ప్రయోజనాల కోసం గెలవాలని కోరుకుంటున్నారు. కార్పొరేట్ల అంతరంగానికి ఇది ప్రతిబింబం.


సీట్ల సంఖ్య తగ్గినా తిరిగి అధికారం ఖాయం అనే ముక్తాయింపులు తప్ప గత ఎన్నికల కంటే ఈ ఎన్నికల్లో బిజెపికి ఓట్లశాతం పెరుగుతుందని ఏ సర్వే కూడా చెప్పటం లేదు. ప్రభుత్వ వ్యతిరేకత ఉందని చెబుతున్నపుడు ఓట్లు తగ్గకుండా ఎలా ఉంటాయన్న ప్రశ్న తలెత్తుతోంది.తన ఓటు బాంకును నిలుపుకొనేందుకు యోగి ఆదిత్యనాధ్‌ రాష్ట్ర ఎన్నికలు 80-20శాతాల మధ్య జరగనున్నాయంటూ మతాన్ని ముందుకు తెచ్చారు. ఉత్తర ప్రదేశ్‌ జనాభాలో 80శాతం హిందువులు, 20శాతం ముస్లింలు ఉన్నారన్న సంగతి తెలిసిందే.403కు గాను 140 నియోజకవర్గాలలో 70 చోట్ల ఓటర్లలో 30శాతం, మిగిలిన చోట్ల 25-30శాతం వరకు ముస్లిం సామాజిక తరగతికి చెందిన వారున్నారని అంచనా. బిజెపి బీ టీమ్‌గా భావిస్తున్న మజ్లిస్‌ పార్టీ కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించింది, ఐనప్పటికీ అత్యధిక ఓటర్లు ఎస్‌పి వైపు మొగ్గు చూపనున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. బిఎస్‌పిలో మాయావతి తరువాత స్ధానంలో ఉన్న మౌర్య తమ పార్టీలో చేరినపుడు గొప్ప పరిణామంగా చిత్రించిన బిజెపి ఇప్పుడు అందని ద్రాక్ష పుల్లన అన్నట్లుగా ఒక రోజు సంచలన వార్త తప్ప ఏదో ఒక రోజు ఇలా చేస్తారని తమకు తెలుసు అని బిజెపి చెబుతోంది. కుమార్తె సంఘమిత్ర ఎంపీగా ఉన్నారని, తన కుమారుడికి సీటు ఇవ్వాలన్న కోర్కెను పార్టీ తిరస్కరించినందున ఇలా చేశారని ఆరోపించింది.(గత ఎన్నికల్లో సీటు ఇచ్చారు, సమాజవాదీ చేతిలో ఓడారు) బిజెపి విధానానికి వ్యతిరేకంగా ఓబిసి జన గణన చేయాలని కోరిన వారిలో మౌర్యఒకరు.


సమాజవాదితో మౌర్య చేతులు కలిపితే యాదవేతర ఓబిసిల్లో కొంత శాతం బిజెపికి దూరమైనా ఫలితాలు చాలా చోట్ల తారుమారౌతాయి. వెనుకబడిన తరగతుల్లో మౌర్య, కుష్వాహ సామాజిక తరగతికి చెందిన వారిలో స్వామి ప్రసాద్‌ మౌర్య పలుకుబడి కలిగిన నేత. ఇదే సామాజికి తరగతికి చెందిన కేశవ ప్రసాద్‌ మౌర్య ఉపముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ అంతపలుకుబడి కలిగిన వారని కాదని చెబుతారు. ఇప్పటికే బిజెపి కూటమి నుంచి మరో రెండు బిసి సామాజిక తరగతుల నేతలు సమాజవాది పార్టీతో చేతులు కలిపారు.యాదవులు మినహా మిగిలిన ఓబిసిలందరూ తమతో ఉన్నారని బిజెపి చెప్పుకొనేందుకు ఇప్పుడు అవకాశం లేదు. కాంగ్రెస్‌కు చెందిన బలమైన నేత ఇమ్రాన్‌ మసూద్‌ కూడా తాను ఎస్‌పిలో చేరుతున్నట్లు ప్రకటించారు. గణనీయ సంఖ్యలో ఉన్న ముస్లింలు ఎస్‌పి, బిఎస్‌పి, కాంగ్రెస్‌ పార్టీల వెనుక చీలి ఉన్నారు. గత ఎనిమిది సంవత్సరాలుగా జరుగుతున్న పరిణామాల నేపధ్యంలో మెజారిటీ ఇప్పుడు ఎస్‌పి వెనుక సమీకృతులౌతున్నట్లు చెబుతున్నారు. గతంలో ముజఫర్‌ నగర్‌ ప్రాంతంలో మతఘర్షణల్లో జాట్లు-ముస్లింలు మతాల వారీ చీలినప్పటికీ ఇటీవలి రైతు ఉద్యమం వారిని సన్నిహితం చేసిందని వార్తలు వచ్చాయి. ఏడు దశలుగా జరిగే ఎన్నికల్లో తొలి రెండు దశలకు జనవరి 14న నామినేషన్లు ప్రారంభమౌతాయి. ఈ దశల్లోని 113 సీట్లకు ముందుగా బిజెపి అభ్యర్దులను ఖరారు చేయనుంది. సమాజవాది కూడా అదే పద్దతిని పాటించవచ్చు. తాను పోటీ చేయటం లేదని ప్రకటించిన మాయావతి బిఎస్‌పి తరఫున అన్ని చోట్లా పోటీ పెట్టనున్నట్లు ప్రకటించారు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

హరిద్వార్‌ ధర్మ సంసద్‌ : పరస్పర అవగాహనతోనే హిందూ- ముస్లిం మతోన్మాదుల ప్రసంగాలు !

25 Saturday Dec 2021

Posted by raomk in BJP, Communalism, Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, RELIGION, Religious Intolarence, Women

≈ Leave a comment

Tags

#Haridwar hate speeches, AIMIM, ‘Hate’ speeches at Dharma Sansad, BJP, Haridwar hate speeches, Hinduthwa, RSS


ఎం కోటేశ్వరరావు


ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో డిసెంబరు 17-19 తేదీల్లో ధర్మ సంసద్‌ పేరుతో ధర్మవిరుద్ద, పరమత విద్వేష సభ జరిగింది. హిందూమత నేతలుగా చెప్పుకొనే యోగులు, యోగినులు అక్కడ చేరారు. వారు హిందూమతం మంచి చెడ్డల గురించి ఏమి చర్చించారో తీర్మానించారో తెలియదు. ముస్లింలు, ఇతర మైనారిటీ మతాల వారి మీద మారణకాండ జరపాలని పిలుపు ఇస్తూ చేసిన ప్రసంగాల వీడియోలు సామాజిక మాధ్యమంలో తిరుగుతూ మరింత విద్వేషాన్ని జనాల బుర్రల్లో నింపుతున్నాయి. ఈ సమావేశాల్లో మాట్లాడిన వారు తమను సమర్ధించుకున్నారు, తప్పు చేశామనే భావన ఏ కోశానా కనిపించలేదు. పోలీసులు తమనేమీ చేయలేరనే ధీమా వ్యక్తం చేశారు. ఎవరి అండ చూసుకొని ఇలా బరితెగించినట్లు ? కొందరి ప్రసంగాంశాలు ఇలా ఉన్నాయి.


”ముస్లింలను చంపటానికి కత్తులు చాలవు, దిమ్మిసలాంటి ఆయుధాలు కావాలి” అన్న యతి నరసింగానంద, నాగరికత (సంస్కృతి) యుద్దంలో హిందువులను రక్షించేవి ఎక్కువ సంఖ్యలో పిల్లల్ని కనటం, మెరుగైన ఆయుధాలు మాత్రమే అని కూడా సెలవిచ్చారు. ఎవరైనా హిందూ ప్రభాకరన్‌(శ్రీలంక ఎల్‌టిటిఇ నేత)గా మారితే వారికి ఒక కోటి రూపాయల అవార్డు ఇస్తామని ప్రకటించారు.బహిరంగ ప్రదేశాల్లో నమాజులు చేయటాన్ని వ్యతిరేకిస్తూ ఒక వక్త మాట్లాడుతుండగా నరసింగానంద జోక్యం చేసుకొని ” మనకు అవసరమైనపుడు హిందూ సమాజం సాయం చేయదు, ఎవరైనా యువకార్యకర్త ముందుకు వచ్చి హిందూ ప్రభాకరన్‌ (శ్రీలంక ఎల్‌టిటిఇ నేత)గా మారేందుకు సిద్దమైతే నేను కోటి రూపాయలు ఇస్తాను, ఒక ఏడాది కొనసాగితే కనీసం వంద కోట్లు సేకరిస్తానని” చెప్పారు.


స్వామి సాగర్‌ సింధు మహరాజ్‌ మాట్లాడుతూ హిందువులు కనీసంగా కత్తులను కలిగి ఉండాలి అన్నారు. మనం ఉపయోగించే సెల్‌ఫోన్‌ విలువ ఐదువేల రూపాయలు మాత్రమే ఉంటుంది. కానీ హిందువులు ప్రతి ఒక్కరు కనీసం ఒక లక్ష రూపాయల విలువగల ఆయుధాలు కొనుగోలు చేయాలి. ఎవరైనా ఎప్పుడైనా ఇంట్లో ప్రవేశిస్తే సజీవంగా బయటకు పోలేరు అన్నారు. స్వామి ధర్మదాస్‌ మహరాజ్‌ మాట్లాడుతూ తన దగ్గర గనుక తుపాకి ఉండి ఉంటే నాధూరామ్‌ గాడ్సేగా మారి ఉండేవాడిని.మన్మోహన్‌ సింగ్‌ ప్రధానిగా ఉన్నపుడు జాతీయ వనరుల మీద తొలి హక్కు మైనారిటీలకే తొలి హక్కు ఉండేది, నేను గనుక పార్లమెంటులో ఉండి ఉంటే నాధూరామ్‌ గాడ్సేను అనుసరించి తుపాకితో ఆరుసార్లు మన్మోహన్‌ సింగ్‌ గుండెల మీద కాల్చివుండేవాడిని అన్నారు. స్వామి ప్రబోధానంద మాట్లాడుతూ మయన్మార్‌లో మాదిరి మన పోలీసు, మన రాజకీయవేత్తలు, మన మిలిటరీ, ప్రతి హిందువు ఆయుధాలు తీసుకొని తుడిచిపెట్టే కార్యక్రమాన్ని నిర్వహించాలి, అంతకు మించి మరొక మార్గం లేదు అన్నారు. (ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్‌ ధామి(బిజెపి) వేరే సందర్భంగా ఈ స్వామీజీ కాళ్లకు మొక్కిన చిత్రాలు ఈ సందర్భంగా దర్శనమిచ్చాయి.)


ప్రతి మతానికి చెందిన వారు తమ మంచి చెడ్డల గురించి సభలు జరుపుకోవచ్చు, ఉపన్యాసాలు చెప్పుకోవచ్చు. కానీ ఈ విద్వేషం, రెచ్చగొట్టే పనులేమిటి ? ఐతే ఇలా రెచ్చగొట్టే ఇతర మతాలవారి సంగతేమిటని వెంటనే కొందరు ప్రశ్నిస్తారు. ఎవరు రెచ్చగొట్టినా అది మైనారిటీ-మెజారిటీ ఎవరైనా కావచ్చు. అలాంటి వారిని నోరెత్తకుండా జైళ్లలో పెట్టాల్సిందే. వారి ఉపన్యాసాల వలన విద్వేషం తప్ప ప్రధాని నరేంద్రమోడీ మేకిన్‌ లేదా మేడిన్‌ ఇండియా పధకాల్లో ఒక్క వస్తువైనా ఉత్పత్తి అవుతుందా ? మనం మతంపేరుతో కుత్తుకలు ఉత్తరించిన మధ్యయుగాల్లో ఉన్నామా నాగరిక సమాజంలో బతుకుతున్నామా ?


విద్వేషపూరిత ప్రసంగాలు చేయటం, రెచ్చగొట్టటంలో మజ్లిస్‌ లేదా కొందరు ఇతర పార్టీల ముస్లిం నేతలు, మత పెద్దలు కూడా తక్కువేమీ కాదు.వారి రెచ్చగొట్టే మాటలు, నమోదైన కేసుల గురించి చూద్దాం. కొద్ది నెలల క్రితం 2021లో ఉత్తర ప్రదేశ్‌లోని బారాబంకీలో మజ్లిస్‌ నేత అసదుద్దీన్‌ ఒవైసీ విద్వేష ప్రసంగంతో పాటు నరేంద్రమోడీ మీద అనుచిత భాషను ఉపయోగించారని, కరోనా నిబంధనలను ఉల్లంఘించారంటూ పోలీసులు కేసు పెట్టారు.2020లో కర్ణాటకలో సిఎఎ వ్యతిరేక సభలో ముంబై మజ్లిస్‌ పార్టీ నేత వార్సి పఠాన్‌ విద్వేష పూరిత ప్రచారం చేశారని కేసు పెట్టారు. పదిహేను కోట్ల మంది ముస్లింలకు వందకోట్ల మంది హిందువులు సరితూగరంటూ రెచ్చగొట్టినట్లు పేర్కొన్నారు.సిఎఎ, ఎన్‌ఆర్‌సికి వ్యతిరేకంగా మా ఆడవారు ముందుకు వస్తేనే చెమటలు పడుతున్నాయి, అదే పురుషులు వస్తే అంటూ రెచ్చగొట్టినట్లు ఆరోపణ.తన మాటలను వక్రీకరించారని, ఎవరినైనా బాధిస్తే వెనక్కు తీసుకుంటానని అతగాడు తరువాత చెప్పినట్లు వార్తలు వచ్చాయి.అతని ప్రసంగ తీరుతెన్నులను తాము సమర్ధించటం లేదని మజ్లిస్‌ నేత ఒవైసీ, మహారాష్ట్ర మజ్లిస్‌ అధ్యక్షుడు, ఔరంగాబాద్‌ ఎంపీ జలీల్‌ ప్రకటించారు. మజ్లిస్‌ నేతల మాదిరి హిందూత్వశక్తులు లేరు. దీని అర్ధం మజ్లిస్‌ నేతలు నిజాయితీతో ఆ ప్రకటనలు చేశారని కాదు.


టైమ్స్‌ నౌ టీవీ ఛానల్‌ చర్చలో ఇరవైలక్షల మందిని హతమార్చాలని పిలుపు ఇవ్వటం మతాలు చేసే పనేనా అన్న యాంకర్‌ ప్రశ్నకు అవును ఇది మా విధి అని సాధ్వి అన్నపూర్ణ చెప్పారు.మా మతాన్ని వ్యతిరేకించే వారిని ఎవరినైనా హతమారుస్తాం అన్నారు. అన్నపూర్ణ మాతగా పిలిపించుకొనే ఈమె హిందూ మహాసభ ప్రధాన కార్యదర్శిగానూ, నిరంజనీ అఖారా మహామండలేశ్వర్‌గానూ ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఈమె నోటి వెంట వెలువడిందేమిటి ? ” మీరు వారిని(ముస్లింలను) అంతం చేయ దలచుకొంటే వారిని హతమార్చండి.వారిలో ఒక ఇరవై లక్షల మందిని చంపటానికి మనకు వంద మంది సైనికులు చాలు ” అన్నారు. హరిద్వార్‌లో తాము చేసిన ప్రసంగాలకు కట్టుబడి ఉన్నామని స్వామి ఆనంద స్వరూప్‌ తదితరులు పునరుద్ఘాటించారు, సమర్దించుకున్నారు.
ప్రబోధానంద ఎన్‌డిటివీతో మాట్లాడుతూ నేను చెప్పిన మాటలకు సిగ్గుపడటం లేదు, పోలీసులను చూసి భయ పడటమూలేదు. చెప్పిన మాటలకు కట్టుబడి ఉన్నా. మీ ఆలోచనకు నాకూ తేడా ఉంది. రాజ్యాంగాన్ని చదవండి, నా మాటలు ఏ విధంగానూ రెచ్చగొట్టేవి కాదు. ఎవరైనా నన్ను చంపేందుకు పూనుకుంటే నేను పోరాడతాను. నేను చట్టానికి భయ పడటం లేదు. ” అన్నారు. ప్రబోధానంద ముస్లిం వ్యతిరేకత కొత్తదేమీ కాదు.హిందూత్వను, సమాజాన్ని రక్షించుకొనేందుకు ప్రతి ఒక్కరూ ఎనిమిది మంది పిల్లల్ని కనాలని 2017లో పిలుపిచ్చారు. ముస్లింలు మాత్రమే హిందూ మహిళల మీద అత్యాచారాలు చేస్తారని రెచ్చగొట్టారు. జీహాదీలను తుడిచిపెట్టాలని 2021జూన్‌లో ఇతరులతో కలసి రెచ్చగొట్టారు. అన్నపూర్ణ మాత ఎన్‌డిటీవితో మాట్లాడుతూ తన మాటలను మరింతగా సమర్ధించుకున్నారు.” భారత రాజ్యాంగం తప్పు, భారతీయులు నాధూరామ్‌ గాడ్సే(మహాత్మాగాంధీ హంతకుడు) కోసం ప్రార్ధనలు జరపాలి, నేను పోలీసుల గురించి భయపడను ” అన్నారు.


ముస్లిం వ్యతిరేక, బిజెపి అనుకూల ప్రచారానికి పేరు మోసిన సుదర్శన ఛానల్‌తో మాట్లాడుతూ దేశం వేగంగా ముస్లిం రాజ్యంగా మారుతోంది దాన్ని నిరోధించి సనాతన వేద దేశంగా మార్చాలని నరసింగానంద చెప్పారు. అదే ఇంటర్వ్యూలో మాట్లాడిన స్వామి దర్శన భారతి ఉత్తరాఖండ్‌లో ముస్లింలు భూమి కొనుగోలు చేయ కుండా లాండ్‌ జీహాద్‌ను పాటించాలని సెలవిచ్చారు.( ఇలాంటి వారంతా కాశ్మీరులో స్ధానికేతరులు భూముల కొనుగోలుకు వీలు కల్పించాలని డిమాండ్‌ చేసిన సంగతి తెలిసిందే. ఇక్కడ మతాన్ని ముందుకు తెచ్చారు) నరసింగానంద మాట్లాడుతూ స్వామి దర్శన భారతి గొప్పతనం అంటూ గత ఐదు సంవత్సరాలుగా ఉత్తరాఖండ్‌లో మసీదు, మదార్సాలు ఏర్పాటు చేయకుండా అడ్డుకున్నారని, అలాంటి యోధుడికి మనం మద్దతు ఇవ్వాలన్నారు. ధర్మ సంసద్‌లో హఠ యోగి మహరాజ్‌ మనకు ఒక ప్రభాకరన్‌ కావాలని చెప్పారు.నేను అన్నాను ఒక ప్రభాకరన్‌, ఒక భింద్రన్‌వాలే( పంజాబ్‌ తీవ్రవాది), ఒక జనరల్‌ సాహెబ్‌ సింగ్‌ (భింద్రన్‌వాలేకు సలహదారు, శిక్షకుడు) కావాలి. ప్రతి హిందూ దేవాలయానికి అలాంటి ఒకరు కావాలి, లేనట్లైతే హిందూమతానికి రక్షణ ఉండదు, రక్షించేవారు ఎవరూ ఉండరు.” అన్నారు. సత్యమేవ జయతే (సత్యమే ఎప్పటికీ జయిస్తుంది) అన్న సూక్తిని ఈ పెద్దమనిషి శస్త్రమేవ జయతే (ఆయుధమే జయిస్తుంది) అంటూ ముస్లింల మీద దాడులకు పురికొల్పారు.


తాటి చెట్టు ఎందుకు ఎక్కావంటే (కల్లు కోసం అని చెప్పకుండా ) దూడగడ్డి ఎక్కడ దొరుకుతుందో చూద్దామని ఎవరో చెప్పారట. స్వామీజీలకు బిజెపికి ఉన్న బంధం కొత్తదేమీ కాదు. హరిద్వార్‌ సభకు మీరెందుకు వెళ్లారు అన్న ప్రశ్నకు వారికి హిందీలో దేశ రాజ్యాంగ ప్రతులను సేకరించటం కష్టం కనుక వారికి వాటిని అందచేసేందుకు, వివరించేందుకు తాను పాల్గొన్నట్లు బిజెపి నేత అశ్వనీ ఉపాధ్యాయ చెప్పారు. ” అది మూడు రోజుల సభ, నేను ఒక రోజు ఉన్నాను.నేను అక్కడ ఉన్న సమయంలో 30నిమిషాలు వేదిక మీద ఉన్నాను. రాజ్యాంగం గురించి మాట్లాడాను. నాకంటే ముందు, తరువాత ఇతరులు మాట్లాడినదానికి నేను బాధ్యుడిని కాదు” అని కూడా అన్నారు. తరువాత తానే ఒక వీడియో ప్రకటన చేస్తూ తాను హరిద్వార్‌ సభలో చివరి రోజు పదినిమిషాలు ఉన్నానని, రాజ్యాంగంలో అసంపూర్ణంగా ఉన్న జనాభా అదుపు, అక్రమ వలసదార్ల అదుపు, మతమార్పిడుల అదుపు వంటి గురించి ప్రసంగించానని వివరణ ఇచ్చారు. రాజ్యాంగ ప్రతులు పంచటం, దాని గురించి మాట్లాడటం నేరమే అయితే నేను ఆ నేరం చేశాను అని చెప్పుకున్నారు. రోగి కోరుకున్నదే వైద్యుడు రాసి ఇచ్చాడన్నట్లుగా ఇవన్నీ ముస్లింల గురించే అన్నది వేరే చెప్పనవసరం లేదు.అశ్వనీ ఉపాధ్యాయ విద్వేష పూరిత ప్రసంగం చేసిన ఒక కేసులో ప్రస్తుతం బెయిలు మీద ఉన్నారు. బిజెపి మహిళానేత ఉదితా త్యాగి మరికొందరు పార్టీనేతలు కూడా పాల్గొన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ సభలో పాల్గొన్న అనేక మందికి బిజెపి నేతలతో సంబంధాలున్నాయి.2029 నాటికి ఈ దేశానికి ఒక ముస్లిం ప్రధాని కాకుండా అడ్డుకోవాలని, ముస్లిం జనాభాకు పోటీగా హిందువులు ఎక్కువ మంది పిల్లల్ని కనాలని యోగులు, సాధ్వులు చేస్తున్న ప్రసంగాలు తెలిసిందే.


మజ్లిస్‌ నేత అసదుద్దీన్‌ ఒవైసీ 2014లో ఢిల్లీలో విద్వేషపూరిత ప్రసంగం చేసినట్లుగా అక్కడి పోలీసులు ఒక కేసు నమోదు చేశారు.దాని మీద మరింతగా దర్యాప్దు జరపాలని ఢిల్లీలోని కరకార్‌దూమా కోర్టు 2019జనవరిలో ఉత్తరువులు జారీ చేసింది. ఈ కేసులో ఏమీ దొరకనందున కేసును మూసివేయాలని 2018లో పోలీసులు కోర్టుకు దరఖాస్తు చేశారు.కేసు దాఖలు చేసిన అజయ గౌతమ్‌ దీన్ని సవాలు చేశారు. గత మూడు సంవత్సరాలుగా ఏ పోలీసూ తన వివరణ కోరలేదని, విచారణా జరపలేదని, దీనికి ఉన్నత స్ధాయిలో ఉన్న రాజకీయ పలుకుబడే కారణమని కూడా పేర్కొన్నారు. దీనికి అనుగుణంగా మరింతగా విచారణ జరపాలని కోర్టు ఆదేశించింది.2015లో ఇదే పోలీసులు కోర్డు ఆదేశాలతోనే ఒవైసీ మీద కేసు దాఖలు చేశారు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమంటే బిజెపి నేతలు పొద్దున లేస్తే మజ్లిస్‌నేత అసదుద్దీన్‌ ఒవైసీ పారాయణం చేస్తారు. ఢిల్లీ పోలీసులు సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వ -అదీ అమిత్‌ షా-ఆధీనంలో పని చేస్తారు. వారి మీద రాజకీీయ పలుకుబడి లేదా వత్తిడి తేగలిగింది బిజెపి తప్ప మరొక పార్టీకి లేదు. అందుకే అనేక మంది బిజెపి-మజ్లిస్‌ పార్టీల మధ్య పరస్పర ప్రయోజనదాయకమైన మౌఖిక ఒప్పందం ఉందని అనుమానిస్తున్నారు.లేనట్లైతే నిజంగా ఢిల్లీ పోలీసులు తలచుకుంటే ఆధారాలు సంపాదించటం అసాధ్యమా ?బిజెపి బి టీమ్‌గా మజ్లిస్‌ పని చేస్తున్నట్లు వచ్చిన విమర్శల సంగతి తెలిసిందే. రెండు పార్టీలకు చెందిన వారు పరస్పరం అవగాహనతో విద్వేషాన్ని రెచ్చగొట్టి తమ ఓటు బాంకును ఏర్పాటు చేసుకుంటున్నారనే భావన నానాటికీ బలపడుతోంది.


హరిద్వార్‌ సభలో విద్వేష పూరిత ప్రసంగాలు చేశారంటూ తృణమూల్‌ కాంగ్రెస్‌ నేత సాకేత్‌ గోఖలే ఉత్తరాఖండ్‌లోని జ్వాలాపూర్‌ పోలీసు స్టేషన్‌లో కేసు దాఖలు చేశారు. ఇరవై నాలుగు గంటల్లో కేసు నమోదు చేయని పక్షంలో జుడీషియల్‌ మెజిస్ట్రేట్‌కు ఫిర్యాదు చేస్తానని కూడా హెచ్చరించారు. ఆ మేరకు విధిలేక కేసు దాఖలు చేశారు. హరిద్వార్‌లో రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినప్పటికీ వాటి కారణంగా ఎలాంటి హింసాకాండ జరగనందున ఉగ్రవాద చట్టం(ఉపా) కింద కేసులు నమోదు చేయలేదని ఉత్తరాఖండ్‌ డిజిపి అశోక్‌ కుమార్‌ చెప్పారు. ఇది తప్పించుకోవటం తప్ప వేరు కాదు. నరసింగానంద నాయకత్వంలో 2020 జనవరిలో ధర్మ సంసద్‌ జరిగింది. సరిగ్గా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ముందు జరగ్గా మరుసటి నెలలోనే ఈశాన్య ఢిల్లీలో మతఘర్షణలు జరిగాయి. ఇప్పుడు హరిద్వార్‌ సమావేశం ఉత్తరాఖండ్‌, ఉత్తర ప్రదేశ్‌ ఎన్నికల ముందే జరిగింది. అక్కడ చేసిన ప్రతిజ్ఞలేమిటి ?


డిసెంబరు 19న సభ చివరి రోజు నరసింగానంద సభకు వచ్చిన వారితో ఒక ప్రతిజ్ఞ చేయించారు. …. అను నేను నా కుటుంబ సనాతన ధర్మం కోసం, నా సోదరీమణులు, కుమార్తెల రక్షణ కోసం గంగానది తీరాన ప్రతిజ్ఞ చేస్తున్నాను. నా మతం, నా కుటుంబం, నా పిల్లలు, మహిళలకు ఈ ప్రపంచంలో ఏమి జరిగినా, ఏ సమస్యలు వచ్చినా, ఏ వ్యక్తి హాని తలపెట్టినా అతన్ని ప్రాణాలతో వదలను. మా మతం కోసం మేము జీవిస్తాము. మా మతం కోసం మేము మరణిస్తాము. ఇస్లామ్‌ జీహాద్‌ను అంతం చేస్తాను. సనాతన ధర్మం చిరకాలం ఉండాలి. సనాతన శత్రువులనందరినీ నాశనం చేయాలి. ” హిందూమతానికి ముప్పు వచ్చినట్లు గోబెల్స్‌ ప్రచారం చేయటం, దేశం ముస్లిం రాజ్యంగా మారుతుందనే ప్రచారంతో జనాల బుర్రలను ఖరారు చేస్తున్నారు. వందల సంవత్సరాలు ముస్లిం పాలకులు, బ్రిటీష్‌ వారు పాలించినప్పటికీ 80శాతం మంది జనం హిందువులుగానే ఉన్నారు. ఆ పాలకులకే సాధ్యం కానిది ఇప్పుడు కేంద్రంలోనూ, మెజారిటీ రాష్ట్రాల్లో హిందూత్వ బిజెపి అధికారంలో ఉండగా ఎవరో మతమార్పిడి చేసి జనాన్ని హిందూమతానికి దూరం చేస్తున్నారనే ప్రచారం చిన్న మెదడు చితికిన వారు చేసేది తప్ప మరొకటి కాదు. గత ఎనిమిది సంవత్సరాల్లో వచ్చిన మార్పేమిటో చెప్పమనండి అసలు సంగతి బయటపడుతుంది.


సరిగ్గా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు అందరూ సిద్దం అవుతున్న సమయంలో జరిపిన ఈ సమావేశంలో చేసిన విద్వేష పూరిత ప్రసంగాలు ఓట్ల రాజకీయంలో భాగం కాదని ఎవరైనా చెప్పగలరా ? మతం పేరుతో ఉన్మాదాన్ని రెచ్చగొడితే అది వెంటనే దిగదు. హిందూత్వ శక్తులుగా ఛాతీవిరుచుకొని చెప్పే బిజెపికి ఎన్నికల్లో ఓట్లు సంపాదించి పెట్టటమే దీని వెనుక ఉన్న ఎత్తుగడ. అది నెరవేరుతుందా ? గతంలో కూడా ఇలాంటి పనులు చేశారు. కొన్ని ప్రాంతాల్లో లబ్దిపొందారు. సరిగ్గా ఎన్నికల ముందే ఉగ్రవాద చర్యలు జరగటం వాటిని ప్రచార అస్త్రాలుగా చేసుకోవటాన్ని గమనిస్తున్న జనం క్రమంగా వాటి గురించి కూడా ఆలోచిస్తున్నారు. కొందరిని కొంతకాలం మభ్యపెట్టవచ్చు, మోసం చేయవచ్చు. అందరినీ ఎల్లకాలం అలా చేయలేరు.జనాలు వెర్రివాళ్లు కాదు, బుర్రలను వాట్సాప్‌ పండితుల ప్రచారానికి తాకట్టు పెట్టలేదు.

.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

కూలుతున్న హిందూత్వ గోడలు :ఆర్‌ఎస్‌ఎస్‌ను ఠారెత్తిస్తున్న సిక్కు-ముస్లిం-జాట్‌ల ఐక్యత !

26 Friday Nov 2021

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, Economics, Farmers, History, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Politics, Prices, RELIGION, Religious Intolarence, Social Inclusion

≈ Leave a comment

Tags

#Hindutva, BJP, farm acts repeal, farm laws, Farmers agitations, Hindutva groups, Jats, Muslims, Narendra Modi, Narendra Modi Failures, RSS, Sikhs


ఎం కోటేశ్వరరావు


ప్రధాని నరేంద్రమోడీ సాగు చట్టాలను వెనక్కు తీసుకొని రైతులకు క్షమాపణలు చెప్పారు. సాధించిన మహత్తర విజయం తో యావత్‌ కష్టజీవులు విజయోత్సవాలు జరుపుకుంటున్నారు.దీనిలో భాగస్వాములు కాని వారు కార్పొరేట్‌లు, వారికి మద్దతు ఇస్తున్న స్వదేశీ జాగరణ మంచ్‌ వంటి సంస్ధలను పుట్టించిన సంఘపరివారం, దాని ఇతర ప్రత్యక్ష -పరోక్ష సంతతి, సాగు చట్టాలకు మద్దతు ఇచ్చిన వారు మాత్రమే. ఈ మద్దతుదార్ల పరిస్ధితి మరీ ఘోరం. చట్టాల రద్దు గురించి నోరెత్తలేరు. తప్పు తెలుసుకున్నా సంతోషంలో భాగస్వాములు కాలేరు.ఇంకా సాధించాల్సిన డిమాండ్ల గురించి తదుపరి కార్యాచరణ గురించి రైతులు ఆలోచిస్తున్నారు. కరవమంటే కప్పకు కోపం-విడవమంటే పాముకు ఆగ్రహం అన్నట్లుగా రైతులు, ఇతర తరగతుల డిమాండ్లకు మద్దతు ఇవ్వకపోతే వారికి దూరం, సంఘీభావం తెలిపితే నరేంద్రమోడీ ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది కనుక రాజకీయ మేథోమద్దతుదారులు దిక్కుతోచని స్ధితిలో పడ్డారు. ఇక నరేంద్రమోడీ వెనుకడుగుకు కారణాలు ఏమిటి అన్న చర్చ పరిపరివిధాలుగా సాగుతోంది. వాటిలో ఒకటి ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చింది అన్నట్లుగా సంఘపరివారం(ఆర్‌ఎస్‌ఎస్‌) మీదకు మళ్లింది. ఒక నాటకం లేదా సినిమాలో మనకు తెర మీద తైతక్కలాడే నటీ నటులు మాత్రమే కనిపిస్తారు.దర్శకత్వం, మాటలు, పాటలు, నేపధó్య నిపుణులు మనకు దర్శనమివ్వరు. బిజెపి నేతలు అగ్ర నటులైతే, ఇతరులు సహాయ, జూనియర్‌ ఆర్టిస్టులు కాగా తెరవెనుక నిపుణులు ఆర్‌ఎస్‌ఎస్‌ వారు అన్నది తెలిసిందే. హిట్‌ అనుకున్న ” సాగు చట్టాలు – నరేంద్రమోడీ క్షమాపణ ” అనే మహా ప్రదర్శన ఫట్‌ మంది.


ఏడాది కాలంలో జరిగిన పరిణామాలు సంఘపరివారానికి చెమటలు పట్టిస్తున్నట్లు చెప్పవచ్చు. అది రైతులు, దేశం గురించి అనుకుంటే తప్పులో కాలేసినట్లే. పలువురు ముందుకు తెచ్చిన అంశాలను చూస్తే వారికి తమ హిందూత్వ పధకానికి ఎసరు వస్తోందన్నదే అసలైన ఆందోళన కారణంగా చెప్పవచ్చు. ఇండియా టుడే హిందీ పత్రిక మాజీ మేనేజింగ్‌ ఎడిటర్‌ దిలీప్‌ మండల్‌ అభిప్రాయం ప్రకారం సాగు చట్టాల రద్దు ఎందుకు అన్నదానికి సమాధానం ఉత్తర ప్రదేశ్‌, పంజాబ్‌ ఎన్నికల కంటే సావర్కర్‌ రాసిన అంశాల్లో దాగుంది. దిలీప్‌ మండల్‌ రాసినదాని సారాంశం ఇలా ఉంది. సాగు చట్టాల రద్దు ప్రకటనకు మోడీ సిక్కులు పవిత్రంగా పరిగణించే గురుపూర్ణిమ రోజును ఎంచుకుంటే అదే రోజు ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతి మోహన్‌ భగవత్‌ చత్తీస్‌ఘర్‌ రాజధాని రాయపూర్‌ లోని ఒక గురుద్వారాలో ప్రణమిల్లారు. పంజాబ్‌ ఎన్నడూ ఎన్నికల రంగంలో బిజెపికి ముఖ్యం కాదు, దేశ విభజన సమయంలో ఉత్తర ప్రదేశ్‌లోని తెరాయి, పశ్చిమ ప్రాంతంలోని అరడజను జిల్లాలో భూములు పొందిన సిక్కులు పరిమిత ప్రభావమే చూపుతారు. ఎన్నికల కంటే వి.డి. సావర్కర్‌ ఊహించిన హిందూత్వ భావనే హిందూత్వ దళానికి ముఖ్యం. మిమ్మల్ని మేము(ఆర్‌ఎస్‌ఎస్‌) మరో ముస్లింగా చూడటం లేదని సిక్కులకు చెప్పటమే సాగు చట్టాల రద్దు సందేశం. హిందూత్వలో ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపికి సిక్కుల అవసరం తప్పనిసరి. ” హిందూత్వ అనివార్యతలు ” అనే తన పుస్తకంలో భారత్‌లో విమర్శకు అతీతులైన సామాజిక తరగతి హిందువుల తరువాత ఏదైనా ఉందంటే వారు పంజాబ్‌లోని మన సిక్కు సోదరులు మాత్రమే. సప్త సింధు ప్రాంతంలోని సింధు లేదా హిందువుల ప్రత్యక్ష వారసులు సిక్కులు మాత్రమే అని రాశారు. నేటి సిక్కులు నిన్నటి హిందువులు, నేటి హిందువులు రేపటి సిక్కులు కావచ్చు. దుస్తులు, సంప్రదాయాలు, రోజువారీ జీవనంలో మార్పులుండవచ్చు తప్ప వారి రక్తం, జన్యువులు మారవని చెప్పారు. తన పుస్తకంలో అరవైసార్లు సిక్కులను సావర్కర్‌ ప్రస్తావించారు.


దిలీప్‌ ఇంకా ఇలా చెప్పారు. ” అన్ని మతాలకు చెందిన రైతులు ఈ ఉద్యమంలో భాగస్వాములు, వారి డిమాండ్లన్నీ ఆర్ధికపరమైనవి, ప్రభుత్వ విధానాలతో సంబంధం కలిగినవే.హిందూ, ముస్లిం నేతలను అన్ని ప్రతినిధి వర్గాలు, పత్రికా సమావేశాలలో భాగస్వాములను చేయటం ద్వారా రైతుల ఆందోళన మతపరమైనదిగా కనిపించకుండా చూసేందుకు అదనపు జాగ్రత్తలు తీసుకున్నారు. ఒక అభిప్రాయాన్ని సృష్టించారు-ఉద్ధేశ్యపూర్వకంగా చేసిన దానిలో భాగం కావచ్చు – అదేమంటే ప్రభుత్వం సిక్కులను అణచివేస్తున్నది. బిజెపి దీన్ని ఎన్నడూ కోరుకోలేదు.ఒక పరిమితిని దాటి సిక్కులు దూరం కావటం హిందుత్వ భావం, ఆర్‌ఎస్‌ఎస్‌కు విరుద్దమైనది కనుక బిజెపి అంతిమంగా సన్నిహితం కావటానికి నిర్ణయించింది.ఈ నిర్ణయం తీసుకొనేందుకు బిజెపి ఎందుకు ఇంత సమయం తీసుకుందని ఎవరైనా అడగవచ్చు. అర్ధిక అజెండా-భావజాలం మధ్య వైరుధ్యం ఉంది కనుకనే బిజెపి నిర్ణయం చేసేందుకు వ్యవధి తీసుకుంది. కచ్చితంగా చెప్పలేము గానీ గురుగ్రామ్‌లో జరిగిన ఒక చిన్న సంఘటన నిర్ణయాత్మకం గావించి ఉండవచ్చు. అక్కడ శుక్రవారం నాడు బహిరంగ స్ధలంలో నమాజు చేయటం గురించి వివాదం ఉంది. పట్టణంలోని సాదర్‌ బజార్‌ గురుద్వారా కమిటీ తమ ప్రాంగణంలో నమాజ్‌ చేసుకోవచ్చని స్వాగతం పలికింది. ఆ మేరకు నమాజైతే జరగలేదు గానీ సిక్కులు-ముస్లింలు దగ్గర అవుతున్నారనే భావన బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ను వణికించి ఉండవచ్చు. 2020 ప్రారంభంలో అలాంటి సౌహార్ధ్రత ఢిల్లీలోని షహీన్‌ బాగ్‌లో జరిగిన సిఎఎ-ఎన్‌ఆర్‌సి వ్యతిరేక నిరసన సందర్భంగా స్పష్టంగా వ్యక్తమైంది. నిరసనకారులకు వండిన ఆహారాన్ని తాజాగా అందించేందుకు సిక్కులు ఒక వంటశాలను అక్కడ ఏర్పాటు చేశారు. రైతు ఉద్యమంలో ప్రధానమైన సిక్కులు తమకు దూరం కావటం బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌లను గడగడలాడించింది.” అని దిలీప్‌ పేర్కొన్నారు.


పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌లో జాట్‌ – ముస్లిం మతపరమైన విభజన గోడ కూలిపోతుండటాన్ని బిజెపి గమనించటం మోడీ సాగు చట్టాలను వెనక్కు తీసుకొనేట్లు చేసిందని మానవహక్కుల కార్యకర్త విద్యాభూషణ్‌ రావత్‌ తన విశ్లేషణలో పేర్కొన్నారు. దానిలోని కొన్ని అంశాలు ఇలా ఉన్నాయి. సాగు చట్టాల రద్దుకు సాగిన ఆందోళనతో బిజెపి తన దీర్ఘకాల మిత్రపక్షాలలో ఒకటైన అకాలీదళ్‌ను కోల్పోయింది. రైతుల్లో కనిపించిన రాజకీయ అవగాహన పట్టణాల్లో ఆంగ్లం మాట్లాడే మధ్యతరగతి వారికంటే ఎంతో ఉన్నతంగా ఉంది.2013లో తెచ్చిన భూసేకరణ చట్టంలో సహేతుకమైన పరిహారంతో పాటు, కఠిన నిబంధనలు, రైతుల సమ్మతి వంటి అంశాలు ఆ తరువాత దేశంలో రైతుల నిరసనలు తగ్గటానికి ఒక కారణంగా విశ్లేషణలు వెల్లడించాయి.గత రెండు సంవత్సరాల్లో అనేక జాతీయ సమ్మెలు, రైల్‌, రోడ్డు రోకో, బందులు జరిగాయి. పోలీసులు అణచివేతకు పాల్పడినా కూడా శాంతియుతంగా జరిగాయి.లఖింపూర్‌ ఖేరీలో మోటారు వాహనాలను ఎక్కించి రైతులను చంపిన ఉదంతంలో సుప్రీం కోర్టు జోక్యం చేసుకున్న తరువాతే నిందితుడైన కేంద్ర మంత్రి కుమారుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ప్రభుత్వం ప్రజాభిప్రాయానికి ఎంత విలువ ఇస్తుందో ఈ ఉదంతం వెల్లడించింది.


సాగు చట్టాల రద్దు ప్రకటన చేసిన తీరు తీవ్ర అభ్యంతరకరం, రాజ్యాంగ వ్యతిరేకం. ప్రధాని లేదా ఏ మంత్రైనా విధానపరమైన అంశాలను పార్లమెంట్‌ వెలుపల ప్రకటించకూడదు.( ప్రధాని ప్రకటన నాటికే పార్లమెంటు సమావేశాల నోటిఫికేషన్‌ వెలువడింది. కాబినెట్‌ ఆమోదమూ లేదు) మోడీ, బిజెపి ప్రతిదాన్నీ తమ రాజకీయ లాభనష్టాల అంకెల మేరకు చేస్తారు. సాగు చట్టాల రద్దు రైతులపై ప్రేమతో తీసుకున్న చర్య కాదని, ఎన్నికలకోసం చేసిందని ఎవరూ మరిచి పోకూడదు.పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌లో ప్రత్యేకించి జాట్లు గత రెండు దశాబ్దాలలో బిజెపి మద్దతుదార్లుగా మారారు. దేశ రాజకీయాలను మండలీకరణ గావించిన తరువాత జాట్లు మరింతగా అగ్రకుల పార్టీల వైపు మొగ్గారు, బిజెపి వారికి సహజమైనదిగా కనిపించింది. 2013 ముజఫర్‌నగర్‌ ఘర్షణల ద్వారా వ్యవసాయ ప్రాంతంలో బిజెపి హిందూత్వ అజెండాను ముందుకు తీసుకుపోయింది. ఆ ఉదంతంలో ఆప్రాంతంలో ముస్లింలను వేరు చేశారు, అవాంఛనీయమైన వారిగా చేశారు. ఈ సమీకరణను బిజెపి తన అధికార క్రీడలో ఎల్లవేళలా ఉపయోగించుకుంది. అయితే ఈక్రమంలో జాట్‌లు రాజకీయంగా ఆరోవేలుగా మారిపోయారు.దానికి తోడు జాట్‌లు బిజెపికి ఓటు చేసిన హర్యానాలో ఖత్రి సామాజిక తరగతికి చెందిన నేతను ముఖ్యమంత్రిగా చేశారు. రైతు ఉద్యమం జాట్‌ల పూర్వపు ఔన్నత్యం, ముస్లింతో మమేకం కావటాన్ని ముందుకు తెచ్చింది.వాస్తవానికి జాట్‌-ముస్లిం ఐక్యత బిజెపి ఆలోచనలో ఆఖరాంశం. అది పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌లో పార్టీకి తీవ్ర విపత్కర పరిస్ధితిని సృష్టిస్తుంది, అక్కడ పార్టీనేతలు తమ నియోజకవర్గాలకు వెళ్లలేనిదిగా మారింది.


మోడీ నిర్ణయం వెనుక ఆర్‌ఎస్‌ఎస్‌ దాగుందని అవుట్‌లుక్‌ పత్రిక విశ్లేషకుడు స్నిగ్దేందు భట్టాచార్య పేర్కొన్నారు. సారాంశం ఇలా ఉంది.” సాగు చట్టాలపై సిక్కు సామాజిక తరగతిలో తలెత్తిన వేదన వారిని ముస్లింలకు సన్నిహితం చేసినట్లు ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలు గమనించారు. ఉత్తర ప్రదేశ్‌ ఎన్నికలే సాగు చట్టాలు వెనక్కు తీసుకొనేందుకు కారణం అనుకుంటే గురునానక్‌ జయంతి రోజునే ప్రకటనకు ఎందుకు ఎంచుకుంటారు ? బిజెపి సైద్దాంతిక మాతృక ఆర్‌ఎస్‌ఎస్‌ హిందుత్వ లేదా హిందూ సాంస్కృతిక జాతీయవాదంలో సిక్కిజం అంతర్భాగం కనుక ఈ పని చేశారని ఆర్‌ఎస్‌ఎస్‌ సీనియర్‌ సిద్దాంతవేత్త ఒకరు తన గుర్తింపును వెల్లడించవద్దనే షరతుతో అవుట్‌లుక్‌ ప్రతినిధికి చెప్పారు. సాగు చట్టాలపై సిక్కుల వేదన వారిని ముస్లింలకు సన్నిహితులను చేస్తోంది.పౌరసత్వ సవరణ చట్టాన్ని(సిఎఎ) వ్యతిరేకించే ఆందోళన నిర్వాహకులు సాగు చట్టాల నిరసనకారులకు ఎలా దగ్గర అవుతున్నారనే అంశంపై మాకు నిర్దిష్ట సమాచారం ఉంది. గురుగ్రామ్‌లోని గురుద్వారా నిర్వాహకులు తమ ప్రాంగణంలో నమాజు చేసుకోవచ్చన్న ఇటీవలి ఉదంతాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్నాము.దేశంలో ఉద్భవించిన అన్ని రకాల విశ్వాసులను ఏకం చేయాలన్న మా దీర్ఘకాలిక ప్రణాళికకు ఇవి ఆందోళన కలిగించే ధోరణులు ‘ అని సిద్దాంతవేత్త చెప్పారు.

ఆర్‌ఎస్‌ఎస్‌, దాని అనుబంధ విశ్వహిందూపరిషత్‌తో సహా ఇతర సంస్ధలన్నీ భారత్‌లో జన్మించిన మతాలు అంటే బౌద్దం, జైనం, సిక్కు అన్నీ హిందూ సాంస్కృతిక గుర్తింపులో భాగమే అని, దురాక్రమణదారుల మతమైన ఇస్లాం దానికి విరుద్దమని భావిస్తున్నాయి. బిజెపి సారధ్యంలోని ప్రభుత్వ విధానాలపై తన ప్రభావం ఏమీ ఉండదని లాంఛనంగా ఆర్‌ఎస్‌ఎస్‌ చెబుతుంది. విష్ణుమూర్తి పదవ అవతారమే బుద్దుడని, ముస్లిందురాక్రమణదారుల మీద సిక్కులు తమ శౌర్యాన్ని ప్రదర్శించారన్నట్లుగా ఆర్‌ఎస్‌ఎస్‌ సాహిత్యంలో చిత్రించారు. సిక్కులతో వైరానికి ముగింపు పలికేందుకు వెనక్కు తగ్గుతున్నాము, సిక్కులు ముస్లింలతో సన్నిహితం కావటంలో ఆర్ధిక ప్రయోజనం తప్ప మరొకటి లేదని ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ రైతు సంఘనేత చెప్పినట్లు అవుట్‌లుక్‌ పేర్కొన్నది.ఆర్‌ఎస్‌ఎస్‌ నేపధ్యం కలిగిన బిజెపి నేత ఒకరు మాట్లాడుతూ రైతు ఉద్యమ సమయంలో ప్రభుత్వ విధానాలను సమర్ధించేవారిలో కొందరు అత్యుత్సాహపరులు నిరసనకారులను ఖలిస్తానీలని చిత్రించారు. అది సిక్కులలో ఒక పెద్ద భాగాన్ని హిందూత్వను ప్రబోధించే వారికి వ్యతిరేకులను చేసింది. మా హిందూ భావజాలంలో సిక్కులు కూడా ఉన్నారు. ప్రతి నిజమైన సిక్కు హృదయంలో చూస్తే హిందువే అని గురూజీ గోల్వాల్కర్‌ చెప్పేవారు. ఈ ఆందోళన హిందువులందరినీ ఏకం చేయాలన్న మా ముఖóó్య అజెండాకు ఈ నిరసన హాని చేసింది. సంస్ధల ఉన్నతనేతలు ఈ అంశాన్ని చూస్తున్నందున తాము బహిరంగంగా అభిప్రాయాలను చెప్పలేమని ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి నేతలు చెప్పినట్లు ఆవుట్‌లుక్‌ పేర్కొన్నది.


సాగు చట్టాలపై రైతుల ఆగ్రహం కేవలం ఉత్తర ప్రదేశ్‌లో బిజెపికి సవాలు మాత్రమే కాదని ది ఫెడరల్‌ డాట్‌ కామ్‌ ప్రతినిధి పునీత్‌ నికోలస్‌ యాదవ్‌ తన విశ్లేషణలో పేర్కొన్నారు. ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్‌ను వికాస పురుషుడిగా చిత్రిస్తూ ప్రచారం ప్రారంభమైంది. సాగు చట్టాల రద్దుపై మోడీ ప్రకటనకు కొద్ది రోజుల ముందు రెండు భిన్న బృందాలు సర్వేలు నిర్వహించాయి. సిఓటర్‌-ఎబిపి సర్వే ప్రకారం 403 స్ధానాల్లో 2017లో బిజెపి తెచ్చుకున్న 312లో వంద సీట్లు తగ్గుతాయి చెప్పగా పోల్‌స్టార్ట్‌-టైమ్స్‌ నౌ సర్వే ప్రకారం 213-245 మధ్యవస్తాయని పేర్కొన్నారు.1989 తరువాత ఒకసారి అధికారంలోకి వచ్చిన పార్టీ మరోసారి నెగ్గని ఉత్తర ప్రదేశ్‌లో బిజెపి తిరిగి అధికారంలోకి రావటం పెద్ద అసాధారణ కృత్యమే. ఇప్పటి వరకు మోడీ విధానాలు, రాజకీయాలను ఎవరూ మార్చలేరని అనుకొనే వారు, సాగు చట్టాలను రద్దు చేసిన తరువాత రోడ్ల మీద జనం ఇప్పుడు మోడీ భయపడ్డారని అనుకుంటున్నారు, కొద్ది నెలలో ఎన్నికలు జరగనుండగా ఇది మాకు మంచిది కాదని ఉత్తర ప్రదేశ్‌ మంత్రి ఒకరు చెప్పారు. లోక్‌సభ సభ్యుడు సాక్షి మహరాజ్‌ వంటి మా నోటి తుత్తర నేతలు ఉత్తర ప్రదేశ్‌ ఎన్నికలు ముగిసిన తరువాత సాగు చట్టాలను తిరిగి తీసుకువస్తారని బహిరంగంగా ప్రకటించారు, ఇప్పటికే ఉత్తర ప్రదేశ్‌ ఎన్నికల కోసమే వెనక్కు తీసుకున్నారని అనుకుంటుండగా మేము రైతుల విశ్వాసాన్ని తిరిగి పొందగలమని మీరెలా అనుకుంటారని ఒక ఎంఎల్‌ఏ ప్రశ్నించినట్లు ఫెడరల్‌ పేర్కొన్నది. . ఈ దిగజారిన పరిస్దితిలో రైతుల మీద కార్లను తోలి నలుగురు రైతులను చంపిన లఖింపూర్‌ ఖేరీ ఉదంతానికి బాధ్యుడిని చేస్తూ కేంద్ర మంత్రి అజయ మిశ్రాను తొలగించాలన్న డిమాండును నెరవేర్చకపోవచ్చు.అదే జరిగితే ఆదిత్యనాధ్‌ ఠాకూర్లకు ప్రాధాన్యత ఇచ్చి తమను నిర్లక్ష్యం చేస్తున్నారని భావిస్తున్న బ్రాహ్మణులను మరింతగా కలవర పెట్టవచ్చు.(తొలగించకపోతే రైతులు తేల్చుకుంటారు) ఏడాది క్రితం వరకు బిజెపి, యోగి నడక నల్లేరు మీద బండిలా ఉంటుందని మొత్తం మీద అందరూ అనుకున్నారు.రైతుల ఆందోళన, హత్రాస్‌లో దళిత యువతిపై అత్యాచారం, హత్య,కరోనా రెండవ తరంగం,బిజెపి 2014లో ఏర్పాటు చేసిన కులాల కుంపటిలో కుమ్ములాటలు పరిస్ధితిని మార్చివేశాయని ఫెడరల్‌ పేర్కొన్నది.


సంఘపరివార్‌ బహిరంగంగా ఎన్నడూ సాగు చట్టాలను వ్యతిరేకించటం లేదా చట్టాల రద్దును సమర్ధించటం గానీ చేయ లేదని ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ పత్రికలో దీప్తిమన్‌ తివారీ పేర్కొన్నారు.హిందువు-సిక్కుల మధ్య గండి ఏర్పడుతుందని ఆర్‌ఎస్‌ఎస్‌ భయపడిందని, సమస్యను పరిష్కరించలేని కేంద్ర అసమర్ధత గురించి హెచ్చరిస్తూ ఇబ్బందికి గురైందని కూడా పేర్కొన్నారు. ఫిబ్రవరిలో ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి సురేష్‌ భయ్యాజీ జోషి మాట్లాడుతూ సామాజిక ఐక్యత మీద చూపుతున్న ప్రభావం గురించి ఆందోళన చెందారు. ఇలాంటి చట్టాలను ఏ దేశంలోనూ వెనక్కు తీసుకోలేదని అన్నారు. గతేడాది దసరా ఉపన్యాసంలో ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతి మోహన భగవత్‌ సాగు చట్టాలను సమర్ధించారు.


భిన్నమైన సామాజిక తరగతులు ఐక్యంగా ఉద్యమాన్ని విస్తరించేందుకు పూనుకోవటం సర్వాంగీకార స్వభావాన్ని సంతరించుకోవటం ఆర్‌ఎస్‌ఎస్‌-బిజెపి కూటమికి మనస్తాపాన్ని కలిగించిందని జర్నలిజం ప్రొఫెసర్‌ నళిన్‌ వర్మ పేర్కొన్నారు. రైతుల నిరసన బిజెపి హిందూత్వ రాజకీయాలకు సవాలుగా మారిందని, నిరసనకారులు ఇతర జీవన్మరణ సమస్యలపై సామాజిక న్యాయం నుంచి పౌరహక్కుల వరకు ఉద్యమాన్ని విస్తరించేందుకు అంగీకరించారని పేర్కొన్నారు. ప్రభుత్వం మీద ఇప్పటికీ రైతుల్లో అనుమానాలు పెద్ద ఎత్తున ఉండగా వాటిని మరింతగా పెంచేరీతిలో రాజస్తాన్‌ గవర్నర్‌ కల్‌రాజ్‌ మిశ్రా, ఎంపీ సాక్షి మహరాజ్‌ మాట్లాడుతూ ఈ చట్టాలను తిరిగి చేస్తారని చెప్పారు. రైతులు కోరుతున్న డిమాండ్లను ఆచరణ సాధ్యం కానివని, అరాచకాన్ని పెంచుతాయని ఇప్పుడు అమితాసక్తిగల ఆర్‌ఎస్‌ఎస్‌-బిజెపి మద్దతుదారులు చిత్రించుతున్నారు. నిజానికి వారు కొత్తగా జతచేసిన డిమాండ్లేవి లేవు. ఎంఎస్‌పి డిమాండు మూడు చట్టాలకంటే పాతదే, దానికి చట్టబద్దత కల్పించాలన్న కోరిక 2011లో నాటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ముఖ్యమంత్రిగా నరేంద్రమోడీ సంతకం చేసి అందచేసిన మెమోరాండంలో ఉన్న అంశమే. 2014లో ఓట్ల కోసం అనేక సభల్లో మోడీ చెప్పినదే.


1974నాటి జయప్రకాష్‌ నారాయణ సంపూర్ణ విప్లవానికి, ఇప్పుడు రైతు ఉద్యమానికి కొన్ని పోలికలు ఉన్నాయి. గుజరాత్‌లో ఒక హాస్టల్లో ఫీజుల పెంపునకు వ్యతిరేకంగా తలెత్తిన నిరసన జెపి ఉద్యమానికి నాంది. రైతులు తొలుత పంజాబ్‌లోనే ఆందోళనకు దిగారు. విద్యార్ది ఆందోళన ఉత్తరాదిన అనేక ప్రాంతాలకు విస్తరించినట్లుగానే రైతు ఉద్యమం హర్యానా,హిమచల ప్రదేశ్‌, ఉత్తర ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, రాజస్తాన్‌,మధ్యప్రదేశ్‌లకు విస్తరించి దక్షిణాదిన మద్దతు పొందింది. జెపి ఉద్యమం తొలుత విద్యార్దులతో ఉన్నప్పటికీ తరువాత జనసంఫ్‌ు(బిజెపి పూర్వరూపం) లోక్‌దళ్‌, డిఎంకెపి, ఇతర సోషలిస్టు, మితవాద పార్టీలన్నీ చేరాయి. చివరకు అవన్నీ జనతా పార్టీగా ఏర్పడ్డాయి.


జాగ్రత్తగా రూపొందించిన హిందూత్వ భావజాలానికి తగిన సామాజిక విభజనపై మోడీ-అమిత్‌షా రాజకీయాలు వృద్ది చెందాయి. హర్యానాలో జాట్‌-జాటేతర కులాల ప్రాతిపదికన బిజెపి రాజకీయాలు చేసింది, పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌లో కొట్లాటలతో జాట్లకు పోటీగా ముస్లింలను నిలిపారు.ములాయం సింగు యాదవ్‌ కుటుంబాన్ని చీల్చారు. లాలూ యాదవ్‌ ఇంట్లో తగాదాలు పెట్టారు అని రాకేష్‌ తికాయత్‌ దీని గురించి వక్కాణించారు. హిందూత్వ ఆధిపత్య రాజకీయాలకు సవాలుగా జీవన సమస్యలపై చివరికి రాజకీయ పార్టీలు ఏకమౌతాయా అన్నది చూడాల్సి ఉంది. సాగు చట్టాల రద్దు తరువాత నవంబరు 22న గోరఖ్‌పూర్‌లో జరిపిన సభలో బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా మాట్లాడుతూ ఉత్తర ప్రదేశ్‌లో మహమ్మదాలీ జిన్నా (పాకిస్తాన్‌) మద్దతుదార్లను వ్యతిరేకించాల్సిన బాధ్యత జాతీయవాదుల మీద ఉందని పిలుపునిచ్చారని నళిన్‌ వర్మ తన విశ్లేషణలో పేర్కొన్నారు.


నరేంద్రమోడీ సర్కార్‌ చర్య పర్యవసానాలు పరిణామాల గురించి వెలువడిన మరికొన్నింటిని స్ధలాభావం వలన సృజించటం లేదు. రానున్న రోజుల్లో మరిన్ని విశ్లేషణలు వెలువడుతాయి. బిజెపి కనుసన్నలలో నడిచే మీడియా వాటికి తగిన చోటు కల్పించినా కల్పించకపోయినా అవి జనంలో ఏదో ఒక రూపంలో వెళతాయి. హిందూత్వ రాజకీయాలు, ఎత్తుగడలను మరింతగా బట్టబయలు చేస్తాయి. నీవు జనాలందరినీ కొంతకాలం వాజమ్మలుగా చేయవచ్చు,కొందరిని ఎల్లకాలం చేయవచ్చు గానీ, అందరినీ అన్ని వేళలా చేయలేవన్న అబ్రహాం లింకన్‌ మాటలను, ఏ పదజాలం వెనుక ఏ ప్రయోజనం దాగుందో తెలుసుకోనంత కాలం జనం మోసపోతూనే ఉంటారు అన్న లెనిన్‌ బోధను ప్రతి ఒక్కరూ ఎల్లవేళలా సదా గుర్తుంచుకోవాలి.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

మతోన్మాదం దేన్నీ వదలదు : రామాయణ ఎక్స్‌ప్రెస్‌ సిబ్బంది దుస్తులు – శబరిమల హలాల్‌ బెల్లం !

23 Tuesday Nov 2021

Posted by raomk in BJP, Communalism, CPI(M), Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, RELIGION, Religious Intolarence, Social Inclusion

≈ Leave a comment

Tags

BJP, halal issue in Kerala, RSS, supremacism, uniform of Ramayan Express staff


ఎం కోటేశ్వరరావు


ఉజ్జయని పీఠాధిపతులకు కోపం వచ్చింది. ఢిల్లీలో రామాయణ ఎక్స్‌ప్రెస్‌ను అడ్డుకుంటామని హెచ్చరిక జారీ చేశారు. వెంటనే రైల్వే అధికారులు వారి డిమాండ్‌కు తలొగ్గారు. రైతులు కూడా మూడు సాగు చట్టాలను వెనక్కు తీసుకోవాలనే ముందు కేంద్రాన్ని కోరారు. వినలా, తరువాతే ఢిల్లీ సరిహద్దులకు చేరుకున్నారు. బిజెపి పాలకులు ఏడాది పాటు వారిని నానా ఇబ్బందులకు గురిచేశారు. దేశంలో అనేక మంది పీఠాధిపతులు, లక్షలాది మంది సాధువులున్నారు. కానీ ఉజ్జయని వారికే ఆగ్రహం వచ్చింది. కొద్ది గంటల్లోనే కేంద్ర ప్రభుత్వం వెనక్కు తగ్గింది.లక్షలాది మంది రైతులకు లేని బలం, పలుకుబడి కొద్ది మంది పీఠాధిపతులకు ఉందంటే దేశాన్ని నడిపిస్తున్నది మతశక్తులే అన్నది మరోసారి రుజువైంది.


ఇంతకీ వారికి కోపం ఎందుకు వచ్చింది ? రామాయణ ఎక్స్‌ప్రెస్‌ పేరుతో రైల్వే ఒక ప్రత్యేపాకేజ్‌తో పుణ్యక్షేత్రాలను కలుపుతూ రైళ్లు నడుపుతున్నది. దానిలో ప్రయాణించే వారికి అవసరమైన భోజన సదుపాయాలను సమకూర్చే సిబ్బందికి సాధువుల మాదిరి కాషాయ రంగు బట్టలు,రుద్రాక్షలతో ఏకరూప దుస్తులను ఇచ్చారు. ఇలా దుస్తులు వేసి సేవలందించటం హిందూమతాన్ని అవమానించటమే అని ఉజ్జయని పీఠాధిపతులకు ఆగ్రహం వచ్చింది. వాటిని విప్పించకపోతే డిసెంబరు 12న ఢిల్లీలో రైలును ఆపివేస్తామని చెప్పారు. రెండురోజుల్లో అధికారులు మార్చివేశారు. సాధువుల మాదిరి ఏకరూప దుస్తులు మతాన్ని, పీఠాధిపతులను అవమానించటమే అని ఉజ్జయని అఖారా పరిషత్‌ మాజీ ప్రధాన కార్యదర్శి అవదేష్‌ పూరీ చెప్పారు.హిందూమతాన్ని రక్షించుకొనేందుకు రైలు మార్గంపై బైఠాయిస్తామన్నారు.


ఇక్కడ కొసమెరుపు ఏమిటంటే ఢిల్లీ అధికారపెద్దలకు కాషాయ రంగంటే ప్రీతి కనుక వారి మనసెరిగి రైల్వే అధికారులు సాధువుల మాదిరి సిబ్బందికి దుస్తులను నిర్ణయించారు. కొత్తగా రూపొందిచిన వాటిలో నల్లపాంట్లు, తెల్ల షర్టులతో పాటు కాషాయ రంగు మాస్కులు, చేతులకు అదే రంగు తొడుగులను ఏర్పాటు చేసి సగం హిందూత్వను కాపాడామన్నట్లుగా అధికారులు పెద్దలను సంతుష్టీకరించారు. ఒక సారి ఉన్మాదాన్ని ఎక్కించిన తరువాత అది మెజారిటీ – మైనారిటీ, జాతీయవాదం ఏదైనా సరే ఎక్కించిన వారు కూడా దాన్ని అదుపు చేయలేరు. ఒకసారి వెర్రితలలు వేసిన తరువాత వారు చేసేదేమీ లేదు. అదుపు చేసేందుకు పూనుకుంటే వారు కూడా దానికి బలైనా ఆశ్చర్యం లేదు. వారి చేతిలో ఉండదు.


కేరళలో అధికారానికి అవసరమైన సీట్లను తెచ్చుకుంటామని ప్రగల్భాలు పలికి, మెట్రోమాన్‌ శ్రీధరన్‌ తమ ముఖ్యమంత్రి అభ్యర్ధి అని కూడా ప్రకటించుకున్న బిజెపి పొందిన పరాభవం తెలిసిందే. అంతకు ముందున్న ఒక్కసీటును, ఓట్లను కూడా గణనీయంగా పోగొట్టుకుంది. గతంలో శబరిమల ఆందోళనపేరుతో శాంతిభద్రతల సమస్యను సృష్టించారు. ఎన్నికల్లో లబ్దిపొందాలని చూశారు, రెచ్చగొట్టారు, విపరీతంగా డబ్బు ఖర్చు పెట్టారు.చివరికి దొంగడబ్బు పంపిణీలో వాటాలు కుదరక దొరికిపోయి కేసులను ఎదుర్కొంటున్నారు. చేసేందుకు పనేమీ లేక ఇప్పుడు కొత్త వివాదంతో జనాల మనోభావాలను రెచ్చగొట్టేందుకు పూనుకున్నారు. అదేమంటే శబరిమల ఆలయానికి హలాల్‌ చేసిన బెల్లాన్ని సరఫరా చేస్తున్నారంటూ ప్రచారం చేస్తున్నారు. మాంసానికి కోసే కోడి,మేక వంటిది కాదు బెల్లం, దానికి హలాల్‌ ఏమిటి ? బోడి గుండుకు మోకాలికి ముడిపెట్టి మతోన్మాదాన్ని రెచ్చగొట్టగల సమర్దులు. శబరిమలకు బెల్లం సరఫరా చేసే వ్యాపారికి హలాల్‌ సర్టిఫికెట్‌ ఉన్నట్లు కనుగొన్నారట. మన దేశం నుంచి గల్ఫ్‌దేశాలకు ఎగుమతి చేసే వాటిలో మాంసంతో సహా అనేక ఉత్పత్తులు ఉంటాయి. వాటిని దిగుమతి చేసుకొనే దేశాల వ్యాపారులు హలాల్‌ ధృవీకరణ పత్రం ఉందా లేదా అని అడుగుతారు. ఉంటేనే కొనుగోలు చేస్తారు.


అందువలన అలాంటి లావాదేవీలు నిర్వహించేవారు ముస్లింలైనా మరొక మతం వారైనా హలాల్‌ సర్టిఫికెట్‌ తీసుకోవాల్సిందే. దాన్ని కూడా రాజకీయం చేసి పోగొట్టుకున్న మద్దతునైనా తిరిగి తెచ్చుకోవాలని బిజెపి పూనుకున్నట్లు కనిపిస్తోంది. హలాల్‌ చేసేందుకు ముస్లిం మతపెద్దలు ఆహారం మీద ఉమ్మివేస్తారంటూ సామాజికమాధ్యమంలో రెచ్చగొడుతున్నారు.శబరిమల ఆలయంలో తయారు చేసే ప్రసాదానికి హలాల్‌ సర్టిఫికెట్‌ ఉన్న బెల్లాన్ని వాడుతున్నారంటూ విశ్వహిందూ పరిషత్‌ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఎస్‌జెఆర్‌ కుమార్‌ హైకోర్టులో ఒక పిటీషన్‌ వేశారు.వివరాల్లోకి వెళితే గతేడాది బెల్లం సరఫరా టెండరు పొందిన మహారాష్ట్ర కంపెనీల యజమానులెవరూ అసలు ముస్లింలు కాదు. ప్రస్తుతం ఏప్రిల్‌ నుంచి సరఫరా చేస్తున్న ఎస్‌పి ఆగ్రోప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ డైరెక్టర్లు సమీర్‌ సురేష్‌ పాటిల్‌, సురేష్‌ సాహెబ్‌రావు పాటిల్‌,సరితా సురేష్‌ పాటిల్‌, మతి ఉండి చేసే ఫిర్యాదులేనా ఇవి. ఆ కంపెనీ గల్ఫ్‌ దేశాలకూ బెల్లం ఎగుమతులు చేస్తోంది. వారికి హలాల్‌ సర్టిఫికెట్‌ అవసరం కనుక తీసుకున్నారు. ప్రతి సంచిమీద దాని నంబరు ముద్రించారు. దాన్ని పట్టుకొని బిజెపి రాద్దాంతం చేస్తోంది. ఈ వివాదం ద్వారా దేవస్ధానానికి నష్టం కలిగించే కుట్రవుందని అయ్యప్పతో సహా అనేక దేవాలయాలను పర్యవేక్షించే తిరువాన్కూర్‌ దేవస్ధానం బోర్డు హైకోర్టుకు తెలిపింది.


ఇదిలా ఉండగా కేరళ అంతటా పలుదుకాణాల ముందు హలాల్‌ బోర్డులు కొత్తగా వెలిశాయంటూ వాటిని నిషేధించాలని బిజెపి డిమాండ్‌ చేసింది. ఈ మేరకు నవంబరు 25న ప్రదర్శనలు జరుపుతామని ప్రకటించింది. ఇదిసాంఘిక దురాచారమని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి సుధీర్‌ వర్ణించారు.హలాల్‌ ఒక మతాచారమని తాము భావించటం లేదని ఇస్లామిక్‌ పండితులు కూడా సమర్ధిస్తారని తాను అనుకోవటం లేదని, ఉగ్రవాద సంస్ధలు కేరళ సమాజంలో మతపరమైన అజెండాను అమలు జరిపేందుకు పూనుకున్నాయని, మతపరంగా చేస్తే పెద్దలు పూనుకొని సరి చేయాలన్నారు. బిజెపి నేతలు మత అజెండా గురించి మాట్లాడటం దొంగేదొంగ అనటమే. సుధీర్‌కు మద్దతుగా రాష్ట్ర అధ్యక్షుడు కె. సురేంద్రన్‌ మాట్లాడుతూ హలాల్‌ బోర్డులు అమాయకంగా, అనుకోకుండా పెట్టినవి కాదన్నారు. జనాన్ని చీల్చేందుకు చేస్తున్నారన్నారు. హిందూత్వ బిజెపితో కేరళ కాంగ్రెస్‌(ఎం) అనే క్రైస్తవ పార్టీ నేత పిసి జార్జి కూడా గొంతుకలిపారు.హలాల్‌ ఆహారం మతఛాందసంలో భాగమే అన్నారు. ఆహారం మీద ఉమ్మటం ముస్లింలకు ఒక విధి, మూడుసార్లు ఉమ్ముతారని, శబరిమల ప్రసాదానికి హలాల్‌ బెల్లాన్ని వినియోగించరాదని క్రైస్తవమత టీవీ ఛానల్‌ ఒకదానిలో చెప్పారు.

బెల్లానికి హలాల్‌తో ముడిపెట్టటాన్ని బిజెపి అధికార ప్రతినిధి సందీప్‌ వారియర్‌ ఫేస్‌బుక్‌లో రాస్తూ తప్పుపట్టారు. మతాల వారు ఒకరి మీద ఒకరు ఆర్ధికపరమైన ఆంక్షలతో జీవించలేరని పేర్కొన్నారు. కోజికోడ్‌లోని పారగాన్‌ హౌటల్‌ మీద సామాజిక మాధ్యమంలో చేస్తున్న దాడిని తాను ఖండించానని అయితే దానిని మీడియా పార్టీ వ్యతిరేఖ వైఖరిగా వక్రీకరించిందని, దాంతో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా పార్టీ ఆదేశం మేరకు పోస్టును వెనక్కు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. నిజానికి సందీప్‌ స్పందన తరువాత బిజెపి ఇరకాటంలో పడి అతని మీద వత్తిడి తెచ్చిందన్నది స్పష్టం. ఇతర మతాల మీద విశ్వాసం ఉన్నవారు కూడా హలాల్‌ హౌటళ్లలో తినేందుకు, పని చేసేందుకు వస్తారని, సేవారంగం దెబ్బతింటే ఎన్నోకుటుంబాలు దారిద్య్రంలోకి కూరుకుపోతాయని, ఇలాంటి అంశాలపై చర్చలో ఉండాల్సింది హేతువు తప్ప ఉద్రేకం కాదన్నారు సందీప్‌.


వివిధ సామాజిక తరగతుల మధ్య లౌకిక వారధిగా ఉన్న ఆహారం మీద సంఘపరివార్‌ దాడిని కేంద్రీకరించిందని సిపిఎం తాత్కాలిక రాష్ట్ర కార్యదర్శి ఏ విజయ రాఘవన్‌ విమర్శించారు. సమాజంలోని మత సామరస్యతను దెబ్బతీసేందుకు ఈ వివాదాన్ని ముందుకు తెచ్చారని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు ఎంఏ బేబీ, కొడియరి బాలకృష్ణన్‌ పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల్లో మత సామరస్యతను దెబ్బతీసేందుకు ఇలాంటి ప్రచారం చేసినా మొత్తం మీద కేరళలో ఫలించలేదని బాలకృష్ణన్‌ అన్నారు.హలాల్‌ చర్చ అనవసరమని తెలిసి కూడా ఇక్కడ వివాదాన్ని సృష్టించేందుకు పూనుకున్నారని అన్నారు.


హలాల్‌ ఆహారంపై విష ప్రచారం చేస్తున్న శక్తుల మీద చర్య తీసుకోవాలని రాష్ట్ర రెస్టారెంట్లు, హౌటల్స్‌ సంఘం ముఖ్యమంత్రి విజయన్ను కోరింది. గుజరాత్‌లో సంఘపరివార్‌ ఇలాంటి తప్పుడు ప్రచారం చేసి విభజన తేవటంలో విజయం సాధించిందని, అక్కడ ముస్లిం సామాజిక తరగతికి చెందిన వారు నిర్వహించే వాటిని పాకిస్తాన్‌ హౌటల్స్‌ అని పిలుస్తారని ఎంఏ బేబీ చెప్పారు. ఆర్‌ఎస్‌ఎస్‌లోని శక్తులకు పోటీగా ఇతర మతాలకు చెందిన ఛాందసవాదులు కొత్త డిమాండ్లను ముందుకు తేవచ్చని స్వచ్చమైన శాఖాహారం వంటి బోర్డులకు వ్యతిరేకంగా డిమాండ్లు ముందుకు రావచ్చని అన్నారు.నిజానికి ఇలాంటి బోర్డుల వలన వినియోగదారులు తాము కోరుకుంటున్న ఆహారం, పానీయాలు దొరికేదీ లేనిదీ తెలుసుకుంటారని అన్నారు.ఇలాంటి ఛాందసడిమాండ్లకు ప్రభుత్వం లొంగదని స్పష్టం చేశారు. సంఘపరివార్‌ ముందుకు తెచ్చిన హలాల్‌ డిమాండ్‌ సమాజ-జాతీయ-రాజ్యాంగ వ్యతిరేక వైఖరని, కేరళలో అది కుదరదని బేబీ చెప్పారు.
తెలుగునాట ఇప్పటికీ అనేక ప్రాంతాలలో హౌటళ్లు, మెస్‌లకు బ్రాహ్మణ, ఆర్య-వైశ్య, రెడ్డి, క్షత్రియ, చౌదరి అని కులాలు, విజయవాడ, ఏలూరు, గుంటూరు భోజనం అనీ, హైదరాబాద్‌ బిర్యాని, ఉడిపి, కల్కూర ఇలా అనేక రకాల పేర్లను తగిలించటం తెలిసిందే. రంజాన్‌ మాసంలో అనేక పట్టణాలలో ప్రత్యేక వంటకంగా ముస్లింలు నిర్వహించే హౌటళ్లలో విక్రయించే హలీంను కుల,మతాలతో నిమిత్తం లేకుండా అందరూ లొట్టలు వేసుకుంటూ తినే అంశం తెలిసిందే. ఇక బిర్యాని సంగతి చెప్పనవసరం లేదు.అక్కడ హలాల్‌ క్రతువు నిర్వహిస్తారని తెలిసిందే.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

మేడిన్‌ ఇండియా : అమెరికాకు ” అగ్రహారాలు ” ఎగుమతి !

08 Monday Nov 2021

Posted by raomk in Communalism, Current Affairs, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, RELIGION, USA

≈ Leave a comment

Tags

Agraharam Valley, caste discrimination, caste system, dalits, Equality Labs


ఎం కోటేశ్వరరావు


ఏ దేశమేగినా ఎందు కాలిడినా, ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండుగౌరవము అని అభినవ నన్నయ అని పేరు తెచ్చుకున్న రాయప్రోలు సుబ్బారావు తన దేశభక్తి గీతంలో ఉద్భోదించారు. తాజాగా అమెరికాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం, డేవిస్‌ వివక్ష వ్యతిరేక చర్యల్లో భాగంగా కుల వివక్షను గుర్తించేందుకు పూనుకుంది. కోల్బి కాలేజీలో కులవివక్షపై నిషేధం విధించారు. ఈ చర్యతో మన కులం కంపును అంతర్జాతీయంగా వ్యాపింప చేస్తున్నామని మరోసారి లోకానికి వెల్లడైంది. ఇప్పటి వరకు దీని తెలియని వారు కూడా తెలుసుకొని ముక్కుమీద వేలేసుకుంటున్నారు. పరాయి దేశాలకు పోయినా కులాల కుంపట్లు రాజేసుకొని రాజకీయాలు చేస్తున్న వారిని చూస్తున్నాం.ప్రస్తుతం నడుస్తున్న జైభీమ్‌ సినిమా దర్శకుడు జ్ఞానవేల్‌ తన సినిమాలో గిరిజనులపై పోలీసు కస్టడీలో చిత్ర హింసల గురించి చెబుతూ అవి పదే పదే జరగటం కంటే వాటి మీద సమాజం మౌనం పాటించటం తీవ్ర అంశమని చెప్పారు. కులవివక్ష కూడా అలాంటిదే. అనేక మంది తాము పాటించటం లేదని చెబుతారు. అది అభినందనీయమే కానీ ఇతరులు పాటిస్తుంటే ప్రేక్షకులుగా, మౌనంగా ఉండటాన్ని ఏమనాలి ? అమెరికా, ఐరోపా దేశాల్లో ఆఫ్రికన్లు, ఆసియన్లు, శ్వేతేతరులందరూ జాత్యహంకారానికి గురవుతున్నారు. భారతీయులు కూడా దానికి గురౌతున్నారు.కానీ వారిలో అగ్రకులం అనుకొనే వారు మిగతా వారి పట్ల కులవివక్షను పాటిస్తున్నారు. వీరిలో ఉద్యోగులు, విద్యార్ధులు కూడా ఉన్నారు. మొత్తం పాతికలక్షల మంది అమెరికాలో భారత సంతతికి చెందిన వారున్నారు. రెండు లక్షల మంది దక్షిణాసియా దేశాలకు చెందిన విద్యార్దులు అమెరికాలో ఉన్నట్లు అంచనా.


గతేడాది జూన్‌లో అమెరికాలో వివక్ష కేసు ఒకటి దాఖలైంది. సిస్కో కంపెనీలో పని చేస్తున్న దళిత సామాజిక తరగతికి చెందిన ఒక ఇంజనీరు అదే కంపెనీలో మేనేజర్లుగా పని చేస్తున్న మరో ఇద్దరు అగ్రకులాలుగా పరిగణించే వారు తన పట్ల వివక్ష చూపారన్నది ఫిర్యాదు. సదరు కంపెనీ ఎలాంటి చర్యతీసుకోకపోగా తమ వద్ద అలాంటి వివక్ష లేదని చెప్పుకుంది. ఫిర్యాదు చేసిన దళితుడిని పక్కన పెట్టింది. ఈ వార్త వెలువడిన తరువాత అమెరికాలో కులవివక్షకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఈక్వాలిటీ లాబ్స్‌కు ఫేస్‌బుక్‌, గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌,ఐబిఎం వంటి కంపెనీలలో కూడా అలాంటి పరిస్ధితి ఉందంటూ అనేక ఫిరా ్యదులు అందాయి. సిలికాన్‌ వ్యాలీలో ” అగ్రహార వ్యాలీలు ” ఉన్నాయని ఈక్వాలిటీ లాబ్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ శ్రీమతి తనిమొళి సౌందర్‌రాజన్‌ చెప్పారు. (మన దేశంలో అగ్రహారాలు వివక్షకు ప్రతి రూపాలుగా ఉన్నందున వివక్ష పాటించే వారందరికీ అది వర్తిస్తుంది తప్ప కేవలం బ్రాహ్మణ సామాజిక తరగతిని లేదా అగ్రకులాలు అని భావిస్తున్న సామాజిక తరగతులందరినీ తప్పు పట్టటంగా భావించకూడదు)

తమిళనాడులోని ఐఐటి-మద్రాస్‌ను అయ్యర్‌ అయ్యరగార్‌ టెక్నాలజీ అని గుసగుసలాడుకుంటారు. కులపరమైన వివక్ష దేశంలో నిషేధించబడిందనే అంశం తెలిసినప్పటికీ ఖర్గపూర్‌ ఐఐటి ప్రొఫెసర్‌ సీమా సింగ్‌ ఎస్‌సి, ఎస్‌టి విద్యార్దులను బ్లడీ బాస్టర్డ్‌ అంటూ తూలనాడిన దురహంకార ఉదంతం తెలిసిందే. అమెరికాలోని హిందూమతానికి చెందిన స్వామినారాయణ సంస్ధ న్యూజెర్సీలో దేవాలయ నిర్మాణం కోసం రెండు వందల మంది బలహీనవర్గాలకు చెందిన వారిని అక్కడికి తీసుకుపోయి గంటకు కేవలం 1.2 డాలర్లు మాత్రమే ఇస్తూ సంవత్సరాల తరబడి పని చేయిస్తున్నట్లు అక్కడి మీడియా వెల్లడించింది. వారు కార్మికులు కాదని, దేవాలయ నిర్మాణంలో పాలు పంచుకుంటున్న నిపుణులైన చేతిపని స్వచ్చందసేవకులని, వారినెంతో గౌరవంగా చూస్తున్నామని సంస్ధ అధిపతి కాను పటేల్‌ సమర్ధించుకున్నారు. సిస్కో, ఈ దేవాలయ నిర్మాణంలో వెట్టి కార్మికుల కేసు ఇంకా పరిష్కారం కాలేదు.


ఈక్వాలిటీ లాబ్‌ 2016లో నిర్వహించిన ఒక సర్వేలో దిగువ కులాలుగా పరిగణించబడుతున్న తరగతులకు చెందిన వారిలో 41శాతం మంది వివక్షకు గురవుతున్నట్లు చెప్పినట్లు తేలింది. అమెరికా స్కూళ్లు, కాలేజీలు, విశ్వవిద్యాలయాలలో ఈ సర్వే జరిగింది. పని స్ధలాల్లో వివక్షకు గురైనట్లు 67శాతం చెప్పారు. మొత్తంగా దక్షిణాసియా వారు వివక్షకు గురవుతున్నప్పటికీ వారిలో అగ్రకులాలకు చెందిన వారు నామమాత్రంగా ఉన్నారని సర్వే తెలిసింది. కార్నెగీ సంస్ధ 2020లో జరిపిన సర్వేలో అమెరికాలో జన్మించిన వారితో పోలిస్తే వలస వచ్చిన వారిలో ఎక్కువ మంది తమ కుల గుర్తింపును గట్టిగా చెప్పినట్లు తేలిసింది. పది మందిలో ఎనిమిది మంది తాము అగ్రకుల హిందువులమని చెప్పుకున్నారట. వివక్ష గురించి అడిగిన ప్రశ్నకు అమెరికాలో శ్వేతజాతి వివక్ష అమెరికా ప్రజాస్వామ్యానికి ముప్పని భారత సంతతికి చెందిన వారిలో 73శాతం మంది చెప్పగా భారత్‌లో హిందూత్వ మెజారిటీ వివక్ష ఇక్కడి ప్రజాస్వామ్యానికి ముప్పని 53శాతం మాత్రమే చెప్పారట.


ఇటీవలి కాలంలో అమెరికా, ఇతర దేశాలలో ఉన్న దళితులు తాము ఎదుర్కొంటున్న వివక్ష, అవమానాలకు వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. సామాజిక మాధ్యమ వేదికలను ఏర్పాటు చేసి ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నారు, బాధితులకు ఆసరాగా నిలుస్తున్నారు. అలాంటి వారిలో సెల్వీ రాజన్‌ ఒకరు. ఆమె ఆర్గనైజ్‌ పేరుతో కుల వివక్ష వ్యతిరేక శక్తులను సమీకరిస్తున్నారు. ఆమె తలిదండ్రులు కులవివక్షను తప్పించుకొనేందుకు అమెరికా వలస వెళ్లారు.తాము భారత్‌ నుంచి అమెరికా వచ్చినా అక్కడా కులముద్ర వెంటాడుతోందని సెల్వీ ఆవేదన చెందారు. తన అనుభవం గురించి చెబుతూ దళితులు అమెరికాకు రావటం అరుదుగా ఉంటున్న స్ధితిలో తనను అగ్రకులస్తురాలిగా అనేక మంది భావించారన్నారు. ఒక ఆసియన్‌గా శ్వేతజాతి దురహంకారానికి గురైనట్లు చెప్పారు.తన రూమ్మేట్‌గా ఉన్న ఒక బ్రాహ్మణ యువతి తన వంట పాత్రల్లో మాంసం కాదు కదా గుడ్లు కూడా ఉడికించటానికి వీల్లేదని కరాఖండితగా చెప్పినట్లు వెల్లడించారు. అమెరికాలో కూడా కులాన్ని పాటిస్తున్నందున ఇతరుల మాదిరే తోటి భారతీయుల ముందు కులాన్ని దాచుకోవాల్సి వచ్చిందన్నారు. కులతత్వానికి వ్యతిరేకంగా పోరాడకపోతే అమెరికాలో కూడా అది పాతుకుపోతుంది కనుక ఏదో ఒకటి చేయాలనే తపనతో ఆర్గనైజ్‌ వేదికను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అమెరికాలో జాత్యహంకారం, భారత్‌లో కులతత్వానికి దగ్గరి పోలికలు ఉన్నాయని రెండూ అణచివేతకు పాల్పడేవే అన్నారు. ముందుగా వాటి గురించి మాట్లాడుకోవాలి, అర్ధం చేసుకోవాలని సెల్వి చెప్పారు. భారత హాకీ ఒలింపిక్‌ టీమ్‌లో ఎక్కువ మంది దళితులు ఉన్న కారణంగానే జట్టు ఓడిపోయిందని క్రీడాకారిణి వందనా కటారియా కుటుంబ సభ్యులను అగ్రకుల దురహంకారులు నిందించిన ఉదంతాన్ని సెల్వి గుర్తు చేసింది. కులదురహంకారం, జాత్యహంకారం ఒకదాని మీద ఒకటి ఆధారపడతాయంటూ 1959లో అమెరికా హక్కుల ఉద్యమ నేత మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ జూనియర్‌ భారత పర్యటన అనుభవాన్ని సెల్వి ఉటంకించారు. తిరువనంతపురంలోని ఒక ఉన్నత పాఠశాలను కింగ్‌ దంపతులు సందర్శించారు. అక్కడి హెడ్‌మాస్టర్‌ దళిత విద్యార్దులకు వారిని పరిచయం చేస్తూ కింగ్‌ మీకులపు వారే అని పేర్కొన్నట్లు సెల్వి చెప్పారు.


మన దేశంలో రిజర్వేషన్‌ సౌకర్యం పొందుతున్న దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతుల వారు తెలివితేటలు, ప్రతిభాపాటవాల్లో ఇతర కులస్తులకంటే పుట్టుకతోనే తక్కువ అనే ఒక తప్పుడు అభిప్రాయం ఉంది. అమెరికాలోని శ్వేతజాతి వారితో పోలిస్తే ఆఫ్రో-అమెరికన్లలో జన్యుపరంగానే ఐక్యు (తెలివితేటలు) తక్కువ అంటూ 1994లో బెల్‌కర్వ్‌ సిద్దాంతాన్ని ముందుకు తెచ్చిన అంశం తెలిసినదే. 2018లో జరిపిన ఒక సర్వే ప్రకారం 26శాతం మంది దక్షిణాసియా వాసులు భౌతికదాడులకు గురైనట్లు , 59శాతం మంది కులపరమైన వివక్షకుగురైనట్లు, సగం మంది తాము దళితులమని వెల్లడైతే దూరంగా పెడతారని భయపడినట్లు తేలింది.2003లో పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలోని భారత అధ్యయన కేంద్ర సర్వే ప్రకారం భారత్‌ నుంచి వలస వచ్చిన వారిలో దళితులు కేవలం 1.5శాతమే అని 90శాతం మందికి పైగా తాము ఆధిపత్యకులాలకు చెందిన వారిగా చెప్పినట్లు తేలింది. అమెరికాలో జన్మించిన భారత సంతతివారితో పోలిస్తే వలస వచ్చిన వారితో కులవివక్ష సమస్య ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. ప్రీతి మేషరామ్‌ అనే దళితయువతి అమెరికాలో తన అనుభవం గురించి చెబుతూ పార్టీలు జరుపుకునే సమయంలో ప్రతి గదిలో ఉన్నవారిని పలుకరించి కులం గురించి తెలుసుకున్నవారు తన వద్దకు వచ్చేసరికి ఇబ్బంది పడేవారని, కారణం తాను దళితకులానికి చెందినట్లు తెలియటమే అన్నారు. తనపై జరిగిన అత్యాచారం గురించి ఆమె వివరిస్తూ గ్రామాల్లో పొలాల్లో పని చేసే దళిత స్త్రీల శరీరాలకు తామే యజమానులమన్నట్లు ప్రవర్తించే భూస్వాముల మాదిరి ఒక అగ్రకుల విద్యార్ధి తన పట్ల ప్రవర్తించాడని, ఆ విషయాన్ని అగ్రకులానికి చెందిన తన రూమ్మేట్‌కు చెబితే నమ్మకుండా తిట్టిందని మేషరామ్‌ చెప్పింది. రుజువు చేసే అవకాశాలు లేనందున ఫిర్యాదు చేయ లేదని చెప్పింది.


అమెరికాలోని దళితుల గురించి ఈక్వాలిటీ లాబ్‌ జరిపిన సర్వే విశ్లేషణ ఫలితాలు ఇలా ఉన్నాయి. సర్వేలో పాల్గన్నవారిలో 25శాతం మంది భౌతిక లేదా దూషణ దాడికి గురయ్యారు. చదువుకొనేటపుడు ప్రతి ముగ్గురిలో ఒకరు వివక్షను అనుభవించారు. పని స్ధలాల్లో మూడింట రెండువంతుల మంది పట్ల అనుచితంగా వ్యవహరించారు. అరవైశాతం మంది కులపరమైన జోక్స్‌ లేదా మాటలను ఎదుర్కొన్నారు.నలభైశాతం మంది దళితులు, 14శాతం మంది శూద్రులను పని స్ధలాల్లో ఎందుకు వచ్చారన్నట్లుగా చూశారు. తమ కులం కారణంగా వాణిజ్యంలో వివక్షకు గురైనట్లు 14శాతం మంది దళితులు చెప్పారు.తమ కులం కారణంగా అమ్మాయిలు తమతో రొమాంటిక్‌ రిలేషన్‌షిప్‌కు తిరస్కరించినట్లు 40శాతం మంది చెప్పారు.తమ కులాన్ని ఎక్కడ వెల్లడిస్తారో అనే భయం ప్రతి ఇద్దరు దళితుల్లో ఒకరు, ప్రతి నలుగురు శూద్రుల్లో ఒకరిలో ఉన్నట్లు వెల్లడైంది. అయితే అనేక మంది కులవివక్షను వ్యతిరేకిస్తూనే ఆత్మన్యూనతకు లోను కాకుండా తమ కులం గురించి గర్వంగా చెప్పుకొనే దళితులు కూడా గణనీయంగా ఉన్నారు. ప్రపంచీకరణలో దోపిడీకి వ్యతిరేకంగా పోరాటాలతో పాటు ప్రపంచవ్యాపితం అవుతున్న కులవివక్ష మహమ్మారికిి వ్యతిరేకంగా దాన్ని వ్యతిరేకించే అందరితో కలసి పోరాడాల్సి ఉంది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

ఆడపిల్లలే తక్కువ, ముస్లింలకు బహు భార్య లు- వారి నుంచి ముప్పా ? నిజాలేమిటి ?

26 Tuesday Oct 2021

Posted by raomk in BJP, Communalism, Current Affairs, INDIA, Literature., NATIONAL NEWS, Opinion, Political Parties, RELIGION, Uncategorized, Women

≈ Leave a comment

Tags

BJP, Hindu Population, Hindutva groups, Muslim women, myth of Muslim population explosion, Narendra Modi, RSS

ఎం కోటేశ్వరరావు

మన వాళ్లు వొట్టి వెధవాయలోయి(తెల్లవారు) చుట్టకాల్చటం నేర్పినందుకు థాంకు చెయ్యక అన్నాడు మహాకవి గురజాడ గిరీశం. ఆ పెద్దమనిషి ఇప్పుడు ఉండి ఉంటేనా అసలు సిసలు భారతీయులం అనుకొనే మన వాట్సాప్‌ పండితుల భాష్యాలు, వక్రీకరణలు, వారి జ్ఞానాన్ని జనానికి ఉచితంగా పంచుతున్న మహాదాతృత్వం గురించి ఎలాంటి పదజాలం ఉపయోగించి ఉండేవారో కదా ! వాట్సాప్‌ పండితులు, కాషాయ దళాల ప్రచారంలో భాగంగా ముస్లింల నుంచి ముప్పు లేదా మన దేశంలో మెజారిటీగా మారేందుకు కుట్ర చేస్తున్నారనే ప్రచారం నిరంతరం జరుగుతున్న సంగతి తెలిసిందే. అక్టోబరు 24వ తేదీ ఆర్‌ఎస్‌ఎస్‌ పత్రిక ఆర్గనైజర్‌ వెబ్‌సైట్‌లో ఒక వార్తకు పెట్టిన శీర్షిక ” భారత్‌లో హిందూ జనాభా వృద్ది రేటు తగ్గుదల, ముస్లింలో గర్భధారణ శక్తి (ప్రజనన) ఎక్కువ : పూ సర్వే సంస్ధ నివేదిక” అనే పేరుతో కొన్ని వివరాలు ఇచ్చారు. నిజానికి ఈ నివేదిక గురించి సెప్టెంబరు 21నే పూ సంస్ధ సర్వే వివరాలను ఇచ్చింది. ఈ శీర్షిక తప్పుదారి పట్టించేదిగా, తప్పుడు ప్రచారం చేసే వారిని సంతుష్టీకరించేదిగా ఉంది.


ఇంతకాలంగా ఆర్‌ఎస్‌ఎస్‌ పరివారం బిజెపితో సహా దాని సంస్ధలు, వారి ప్రచారదాడి మహమ్మారి సోకిన వారు చేస్తున్న ప్రచారం ఏమిటి ? 2035 నాటికి( సంవత్సరాలు మారిపోతూ ఉంటాయి గాని సారాంశం ఒక్కటే) మన దేశంలో ముస్లిం జనాభా హిందువుల కంటే ఎక్కువ అవుతుంది. హమ్‌ పాంచ్‌, హమారే పచ్చీస్‌ (మనం ఐదుగురం మనకు ఇరవై ఐదు) దీని అర్దం ఏమిటి ? ప్రతి ముస్లిం పురుషుడు నలుగురు భార్యలను కలిగి ఉండవచ్చు, వారికి ఐదుగురి చొప్పున పిల్లలు పుడతారు అని చెప్పటమే.2002 గుజరాత్‌ మారణ కాండ సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్రమోడీ చేసిన వ్యాఖ్య ఏమిటి ? ” నేనేం చేయాలి ? వారికి సహాయ శిబిరాలు ఏర్పాటు చేయాలి, పిల్లల్ని కనాలని మనం కోరుకుందామా ? ” అనేకదా ! ఆర్‌ఎస్‌ఎస్‌ వారి ఈ వైఖరిలో మార్పు వచ్చిందా ?2017లో బిజెపి ఎంపీ సాక్షి మహరాజ్‌ మీరట్‌ సభలో మాట్లాడుతూ ”నలుగురు భార్యలు, 40 మంది పిల్లలను కలిగి ఉండేవారే దేశంలో జనాభా పెరుగుదలకు కారకులు, హిందువులను నిందించకూడదు. మన మతాన్ని సంరక్షించుకొనేందుకు ప్రతి హిందూ మహిళ నలుగురు పిల్లల్ని కనాలి ” అని చెప్పారు.


విశ్వహిందూ పరిషత్‌ అంతర్జాతీయ అధ్యక్షుడిగా పని చేసిన ప్రవీణ్‌ తొగాడియ గుజరాత్‌లోని బహరుచ్‌ జిల్లా జంబుసర్‌లో మాట్లాడుతూ ఇలా సెలవిచ్చారు.” హిందూ పురుషలూ ఇంటికి వెళ్లి మీ పురుషత్వాన్ని ఆరాధించండి. అప్పుడు హిందువుల జనాభా పెరుగుతుంది. మతమార్పిడి వద్దనండి, ఘర్‌వాపసికి అవునని చెప్పండి. లవ్‌ జీహాద్‌ వద్దు, ఉమ్మడి పౌరస్మృతి కావాలనండి, బంగ్లా ముస్లింలు వద్దనండి..హిందువులందరూ ఎక్కువ మంది పిల్లల్ని కనండి.” ఇటీవల ఆర్‌ఎస్‌ఎస్‌ సర్‌సంఫ్‌ుసంచాలక్‌ మోహన్‌ భగవత్‌ మాట్లాడుతూ ముస్లింలు, హిందూ డిఎన్‌ఎ ఒకటే అని చెప్పారు. కానీ అదే పెద్ద మనిషి అంతకు ముందు ఒకసారి ఏమన్నారు.” ఇతరుల జనాభా పెరుగుతున్నపుడు హిందువుల జనాభా పెరగ కూడదని ఏ చట్టం చెప్పింది ” అని ప్రశ్నించారు. ఆరెస్‌ఎస్‌ మరోనేత దత్తాత్రేయ హౌసబలే అంతకు ముందు చెప్పిందేమిటి ?చిన్న కుటుంబం నియమాలు హిందువులకు పెద్ద ముప్పుగా ఉన్నాయి. కనుక ప్రతి కుటుంబం ముగ్గురు పిల్లలను కలిగి ఉండాలి. ఒక సమాజం గుడ్డిగా కుటుంబ నియంత్రణ పాటిస్తే దేశానికి జరిగే మంచేమీ ఉండదు. అది దేశంలో తీవ్ర అసమానతలకు దారితీస్తుంది.” 2018లో రాజస్తాన్‌ బిజెపి ఎంఎల్‌ఏ బన్వారీలాల్‌ సింగ్‌ సింఘాల్‌ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ 2030 నాటికి ముస్లింల జనాభా పెరిగి హిందువులు ప్రమాదంలో పడతారని రెచ్చగొట్టారు. ముస్లింలు ఒకరిద్దరికి పరిమితం అవుతుంటే ముస్లింలు 12-14 మందిని కంటున్నారని ఆరోపించారు. ముస్లింలు పాలకులైతే హిందువులు రెండోతరగతి పౌరులౌతారన్నారు. ముస్లిం జనాభా పెరుగుతోందనే ప్రచారం కొనసాగింపుగా ఫలానా సామాజిక తరగతి అనే పేరు లేకుండా ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వం జనాభా నియంత్రణ బిల్లును ముందుకు తెచ్చింది. అసోం కూడా అదే దారిలో ఉంది. రెండు చోట్లా ముస్లింల మీద తప్పుడు ప్రచారం ఎన్నికల లబ్దే అసలు కథ.


పూ సంస్ధ కనుగొన్న ముఖ్యఅంశాలంటూ ఆర్గనైజర్‌ రాసిన కొన్ని అంశాలూ, అది చేసిన వ్యాఖ్యానం ఎలా ఉన్నప్పటికీ వాటి నిజానిజాలేమిటో చూద్దాం. కాషాయ దళాలు చేస్తున్నది గోబెల్స్‌ ప్రచారం, వక్రీకరణ అని అనేక వివరాలు వెల్లడించినా ఆప్రచారం కొనసాగుతూనే ఉంది. ఒక అబద్దాన్ని వందసార్లు ప్రచారం చేస్తే 101వ సారి నిజం అవుతుందన్నది గోబెల్స్‌ సిద్దాంతం. మనకూ బ్రాహ్మణుడు, మేక, నలుగురు దొంగల కథ తెలిసిందే.మన జనాభా వివరాలు 2011లో సేకరించినవి మాత్రమే అధికారికంగా ఉన్నాయి. ఆ తరువాత పెరిగిన జనాభా సంఖ్య అంచనా మాత్రమే. 1951-2011 మధ్య మొత్తం జనాభా 36.1 కోట్ల నుంచి 120 కోట్లకు పెరిగింది. ఇదే కాలంలో హిందువులు 30.4 కోట్ల నుంచి 96.6కోట్లకు పెరిగింది. ముస్లింలు 3.5 నుంచి 17.2 కోట్లకు, క్రైస్తవులు 0.8 నుంచి 2.8 కోట్లకు, సిక్కులు 0.68 నుంచి 2.08 కోట్లకు, బౌద్దులు 0.27 నుంచి 84లక్షలకు, జైనులు 17 నుంచి 45లక్షలకు పెరిగారు. పార్సీలు 1.2లక్షల నుంచి 60వేలకు తగ్గారు.


1990దశకకానికి ముందు మొత్తం జనాభా పెరుగుదల రేటు 22శాతం ఉండగా 2000నాటికి 18శాతానికి తగ్గింది. ఇదే కాలంలో హిందువుల పెరుగుదల రేటు 24 నుంచి 17శాతానికి తగ్గగా ముస్లింల రేటు తగ్గుముఖం పట్టి 25శాతం వద్ద, క్రైస్తవుల రేటు 16శాతం వద్ద ఉంది. ముస్లింల రేటును చూపే కాషాయ దళాలు కుట్ర సిద్దాంతాన్ని ప్రచారం చేస్తున్నాయి.ప్రస్తుతం హిందువులు 79.8శాతం, ముస్లింలు 14.2, క్రైస్తవులు ఆరుశాతం ఉన్నారు.1951-2011కాలంలో హిందువులు నాలుగుశాతం తగ్గగా ముస్లింలు నాలుగుశాతం పెరిగారు. అలాంటపుడు 2035 నాటికి ముస్లింలు హిందువులను మించి పోతారని ఏ గణాంకాలు లేదా వాస్తవాలను బట్టి ఎలా చెబుతున్నారు ? నమ్మేవారు ఎలా చెవులప్పగిస్తున్నారు ? దేశంలో జరుగుతున్నదేమిటి ? 1992లో మిగతా సామాజిక తరగతులతో పోలిస్తే ముస్లిం మహిళలు సగటున ఒక బిడ్డను ఎక్కువగా కలిగి ఉన్నారు. 1992లో మొత్తం మహిళలకు సగటున 3.4గురు పిల్లలు ఉండగా 2015 నాటికి 2.2కు తగ్గారు. ఇదే కాలంలో 4.4గా ఉన్న ముస్లిం పిల్లలు 2.6కు, హిందూ పిల్లలు 3.3 నుంచి 2.1కి తగ్గారు. దీని అర్ధం ఏమిటి ? రెండు సామాజిక తరగతుల పిల్లల తేడా 1.1 నుంచి 0.5కు తగ్గింది. క్రైస్తవుల పిల్లలు 2.9 నుంచి రెండుకు తగ్గారు. మరి క్రైస్తవులు, ముస్లింలతో దేశాన్ని నింపివేసే కుట్ర జరుగుతోందని చేస్తున్న ప్రచారానికి ఆధారం ఏమిటి ?ప్రజనన లేదా గర్భధారణకు మహిళల్లో విద్యకు సంబంధం ఉంటుందనేది అంతర్జాతీయంగా రుజువైన అంశం.2015 సమాచారం ప్రకారం క్రైస్తవుల్లో మహిళలు సగటున ఏడున్నర సంవత్సరాలు, హిందువుల్లో 4.2, ముస్లింల్లో 3.2సంవత్సరాలు ఉంది. అందువలన ముస్లింల్లో కూడా విద్య పెరిగితే పిల్లల సంఖ్య తగ్గుతుంది. విద్యతో పాటు మత విశ్వాసాలు, పరిసరాలు, సంపద, ఆదాయం వంటి అనేక అంశాలు కూడా ప్రభావం చూపుతాయి.

2019లో ఐక్యరాజ్య సమితి వెల్లడించిన సమాచారం ప్రకారం భారత్‌లో జన్మించిన వారు విదేశాల్లో 1.75లక్షల మంది నివసిస్తుండగా విదేశీయులు 52లక్షల మంది నివసిస్తున్నారు. ఇది ఆ ఏడాది మన జనాభాలో కేవలం 0.4శాతం మాత్రమే. అందువలన వలసవలన మతపరంగా పెద్దగా ఎలాంటి మార్పు లేదని కూడా తేలింది.కొన్ని వార్తల ప్రకారం మరికొన్ని లక్షల మంది ముస్లిం మెజారిటీ దేశాల నుంచి వచ్చి అనధికారికంగా భారత్‌లో నివసిస్తున్నారని చెబుతున్నారని అయితే దానికి తగిన రుజువులు లేవని పూ సంస్ధ పేర్కొన్నది.2012 పూ సంస్ధ అంచనా ప్రకారం భారత్‌ను వదలి వెళుతున్నవారిలో ముస్లింలు, క్రైస్తవులే ఎక్కువ ఉంటారని, భారత్‌కు వలస వచ్చే వారిలో మూడింట రెండువంతుల మంది హిందువులని పేర్కొన్నది. మతమార్పిడి ప్రచార బండారాన్ని కూడా పూ సంస్ధ వెల్లడించింది. ఇటీవల జరిపిన తమ సర్వే ప్రకారం 99శాతం హిందువులు,97శాతం ముస్లింలు, 94శాతం క్రైస్తవులు తాము పుట్టినప్పటి నుంచి అలాగే ఉన్నామని చెప్పారని, 0.7శాతం మంది హిందువులుగా పెరిగిన వారు తాము హిందువులుగా ఉండదలచుకోలేదని చెప్పగా హిందూమతానికి వెలుపల పెరిగిన 0.8శాతం మంది తాము ఇప్పుడు హిందువులుగా ఉన్నట్లు చెప్పారు.

దేశంలో ఇప్పుడున్న స్ధితి ఏమిటి ? 35 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 29 చోట్ల హిందువులే మెజారిటీ. లక్షద్వీప్‌లో లక్ష మంది, జమ్ము-కాశ్మీరులో కోటీ 30లక్షల మంది ఉన్న ప్రాంతాల్లో మాత్రమే ముస్లింలు మెజారిటీగా ఉన్నారు.దేశ జనాభాలో వీరు ఐదుశాతమే, 95శాతం మిగతా రాష్ట్రాలలో ఉన్నారు. పంజాబులో సిక్కులు, నాగాలాండ్‌(20లక్షలు), మిజోరం(పది లక్షలు), మేఘాలయ(30లక్షలు)లో క్రైస్తవులు మెజారిటీగా ఉన్నారు. ముస్లింలు కుటుంబ నియంత్రణ పాటించరు అన్నదొక ప్రచారం. మరి హిందువులు ? అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం ముస్లింలలో 45.3, హిందువుల్లో 54శాతం మంది నియంత్రణ పాటిస్తున్నారు. కాషాయ దళాల వేదగణిత లెక్కలు కాకుండా దీనికి భిన్నమైన అధికారిక తాజా సమాచారం ఉంటే సరిచేసుకుందాం.2011లెక్కల ప్రకారం వహిందువుల్లో జననాల రేటు 1991-2001 కాలంలో 19.92 నుంచి 16.76కు తగ్గగా ముస్లింల్లో 29.52 నుంచి 24.6కు తగ్గింది. వీటి ఆధారంగా వేసిన అంచనా ఏమిటి ? 2011-21కాలంలో హిందువుల జననాల రేటు 15.7, ముస్లింలలో 18.2కు తగ్గనుందని అంచనా. దీని అర్ధం ఏమిటి కుటుంబనియంత్రణ పాటించటం ముస్లింలలో పెరిగిందనే కదా ? లెక్కలు తెలియని వారికి చెప్పవచ్చు, తెలియనట్లు నటించే వారికి చెప్పగలమా ? దేశంలో పురుషులు-స్త్రీల నిష్పత్తి 1000-940, అదే పిల్లల్లో చూస్తే 1000-916 మాత్రమే ఉంది. ఇలా ఉన్న దేశంలో బహుభార్యలను కలిగి ఉండటం సాధ్యమా ? ముస్లింలు ఎక్కువగా ఉన్న లక్షద్వీప్‌లో 946,911గానూ జమ్మూకాశ్మీరులో 889,862గా ఉన్నారు. దేశ సగటు కంటే తక్కువ ఉన్న చోట అది జరిగేదేనా ? అనేక మంది పేదరికం కారణంగా హైదరాబాద్‌ వంటి చోట్ల ముస్లింలు అరబ్‌ షేకులకు తమ పిల్లలను కట్టబెడుతున్నారనే అంశం పలుసార్లు వెలుగులోకి వచ్చింది.


అయితే దేశంలో బహుభార్యాత్వం లేదా ? ఘనమైనదిగా కొందరు చెప్పుకొనే మన చరిత్ర, సంస్కృతిలో ఎక్కువ మంది దేవుళ్లకు, రాజులు, రంగప్పలకు ఒకరి కంటే ఎక్కువ మంది ఉండటాన్ని లొట్టలు వేసుకుంటూ రంజుగా చెప్పుకుంటాం కదా. ఇక వర్తమానానికి వస్తే దేశమంతటా ముస్లింలకు, గోవాలో హిందువులు ఒకరి కంటే ఎక్కువ మందిని కలిగి ఉండవచ్చు. మరికొన్ని ప్రాంతాల్లో సాంప్రదాయం పేరుతో కొనసాగిస్తున్నారు. చిత్రం ఏమంటే అనుమతి ఉన్న ముస్లింల్లో బహుభార్యాత్వం 5.7 శాతం ఉంటే నిషేధం ఉన్న హిందువుల్లో 5.8శాతం ఉంది. దీన్నేమంటారు ?
2035నాటికి ముస్లింల సంఖ్య పెరిగి పోనుందనే ప్రచార కథేమిటో చూద్దాం. అసలు ఇది ఎక్కడ పుట్టింది ? ఒకరాయి వేద్దాం మనల్ని అడగొచ్చేదెవరులే అనే ధైర్యంలో ముస్లిం వ్యతిరేక ప్రచారాన్ని చేస్తున్నారు. 2017ఏప్రిల్‌ ఐదవ తేదీన అమెరికాలోని న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక పూ సంస్ధ విశ్లేషణకు ” 2035 నాటికి ముస్లింల పిల్లల సంఖ్య ఇతరులను అధిగమించనుంది ” అనే శీర్షిక పెట్టింది. కానీ పూ సంస్ధ నివేదిక చెప్పిందేమిటి ? ప్రపంచంలో 2075నాటికి ఇస్లాం పెద్ద మతంగా అవతరిస్తుంది. 2015 -2060 మధó్య ముస్లింలు, క్రైస్తవులు ఎక్కువ మంది పిల్లలను కంటారు. ఆ రెండు మతాల మధ్య 2055-60లో తేడా 60లక్షలు. ముస్లింలు 23.2 కోట్లు, క్రైస్తవులు 22.6కోట్లు అని, 2035నాటికి స్వల్పంగా క్రైస్తవ తల్లుల కంటే ముస్లిం తల్లులు కనే పిల్లల సంఖ్య ఎక్కువ ఉంటుందని పేర్కొన్నది. దాన్ని మన దేశంలో హిందూత్వశక్తులు హిందూమతానికి వర్తింప చేసి ప్రచారం చేస్తున్నారు. ఇదే కాలంలో మన దేశంలో హిందువుల సంఖ్య తగ్గనుందని అంచనా. 2050నాటికి ముస్లింలు ఇప్పుడున్న 14.4 నుంచి 18.4శాతానికి పెరుగుతారని అంచనా వేస్తున్నారు.ఇప్పుడున్న మాదిరి వారిలో కూడా కుటుంబనియంత్రణ వేగం పెరిగితే తగ్గనూ వచ్చు.

ఇక వాట్సాప్‌ను బిజెపి ఎలా ఉపయోగిస్తోందో అమిత్‌ షా మాటల్లోనే చెప్పాలంటే ” అది నిజమైనా కల్పితమైనా ఏ సందేశాన్నైనా మనం వైరల్‌(విపరీతంగా ప్రచారం) చేయగలం. సామాజిక మాధ్యమం ద్వారా మనం కేంద్రంలో, రాష్ట్రాలలో ప్రభుత్వాలను ఏర్పాటు చేయాల్సి ఉంది. వర్తమానాలను వైరల్‌ చేయాలి. ఉత్తర ప్రదేశ్‌లో మనం ఇప్పటికే 32లక్షల మందితో వాట్సాప్‌ గ్రూపులను ఏర్పాటు చేశాం. ప్రతి ఉదయం ఎనిమిది గంటలకు వారు ఒక వర్తమానాన్ని పంపుతారు. ” ఇది 2018లో రాజస్తాన్‌లోని కోట పట్టణంలో బిజెపి సామాజిక మాధ్యమ కార్యకర్తల సమావేశంలో చేసిన ప్రసంగం అంటూ హిందీ దినపత్రిక దైనిక్‌ భాస్కర్‌ రాసిన వార్త. దేశమంతటా దానికి అలాంటి వాట్సాప్‌ గ్రూపులు, వాటిలో పంపే సమాచారం ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.


భక్తుల నీరాజనాలు, విశ్వగురువు అంటూ ప్రశంసలు అందుకుంటున్న బిజెపి నేత నరేంద్రమోడీ ఏ క్షణాన జాతీయ రాజకీయ రంగంలోకి అడుగు పెట్టారో అది ఎలాంటి ముహూర్తమో తెలియదు. మేకిన్‌ ఇండియా(భారత్‌లో తయారీ), మేక్‌ ఇండియా(భారత్‌ తయారీ) పేరు ఏదైతనేం గానీ ఇచ్చిన పిలుపులతో ఇప్పటి వరకు ఎగుమతికి అవసరమైన వస్తువుల కంటే మన జనాన్ని చీకట్లో ఉంచేందుకు అవసరమైన అవివేకం పెద్ద ఎత్తున ఉత్పత్తి జరుగుతోంది. దానికి అవరమైన సాంకేతిక పరిజ్ఞానం ఇజ్రాయెల్‌, అమెరికా వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకున్నారు లేదా అక్కడ నైపుణ్య శిక్షణ పొందారు. పుంఖాను పుంఖాలుగా అవివేకం, కుహనావార్తల ఉత్పత్తి జరుగుతోంది, దాని వినియోగం విపరీతంగా పెరుగుతోంది. ” ఒక ప్రధానమైన అంశాన్ని మరోవైపు ఆలోచించకుండా జోరీగలా బుర్రల్లోకి ఎక్కించకుండా అత్యంత ప్రతిభావంతులైన ప్రచార నిపుణుల మెళకువలు కూడా విజయ వంతం కావు.ఆ ప్రచారం కొన్ని అంశాలకే పరిమితం కావాలి, దాన్ని పదే పదే పునశ్చరణ చేయాలి.ఈ ప్రపంచంలో విజయం సాధించాలంటే మొట్టమొదటిదీ, ముఖ్యమైనదీ దేనికైనా హఠం వేయటమే ” తన మీన్‌ కాంఫ్‌ గ్రంధంలో నరహంతకుడు నాజీ హిట్లర్‌ రాసిన అంశమిది. ఈ నేపధ్యంలో ఇప్పుడు దేశంలో కాషాయ దళాల ప్రచారాల తీరు ఎలా ఉందో కాస్త ఆలోచించేవారికి ఎవరికైనా అవగతం అవుతుంది.

” ఒక ప్రధానమైన అంశాన్ని మరోవైపు ఆలోచించకుండా జోరీగలా బుర్రల్లోకి ఎక్కించకుండా అత్యంత ప్రతిభావంతులైన ప్రచార నిపుణుల మెళకువలు కూడా విజయ వంతం కావు.ఆ ప్రచారం కొన్ని అంశాలకే పరిమితం కావాలి, దాన్ని పదే పదే పునశ్చరణ చేయాలి.ఈ ప్రపంచంలో విజయం సాధించాలంటే మొట్టమొదటిదీ, ముఖ్యమైనదీ దేనికైనా హఠం వేయటమే ” తన మీన్‌ కాంఫ్‌ గ్రంధంలో నరహంతకుడు నాజీ హిట్లర్‌ రాసిన అంశమింది. ఈ నేపధ్యంలో ఇప్పుడు దేశంలో కాషాయ దళాల ప్రచారాల తీరు ఎలా ఉందో కాస్త ఆలోచించేవారికి ఎవరికైనా అవగతం అవుతుంది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

వియత్నాం,ఆఫ్ఘనిస్తాన్‌ – కమ్యూనిస్టులు, కానివారికీ తేడా !!

24 Tuesday Aug 2021

Posted by raomk in Current Affairs, History, imperialism, INTERNATIONAL NEWS, Japan, Opinion, RELIGION, USA, WAR

≈ Leave a comment

Tags

Communists, Taliban, Vietnam and Afghanistan


ఎం కోటేశ్వరరావు


తనకు ఎదురు లేదని విర్రవీగిన అగ్రరాజ్యం అమెరికాకు, దాని తోకపట్టుకు తిరిగిన వారికి ఆఫ్ఘనిస్తాన్లో చెప్పుకోలేని చోటదెబ్బలు తగిలాయి. తమ సైనికులు, పౌరులకు ఎలాంటి హాని లేకుండా దేశం విడిచి పోనివ్వాలనేదే తాలిబాన్లతో అమెరికా చేసుకున్న ఒప్పందం. అయినా అనేక మంది అమెరికన్‌ సైనికులను తాలిబాన్లు చావుదెబ్బలు కొట్టినట్లు వచ్చిన వార్తలను మిలిటరీ అధికారులు పరోక్షంగా అయినా అంగీకరించకతప్పలేదు.అధ్యక్షుడు జో బైడెన్‌ నిస్సహాయ స్ధితిలో తాను దేనికీ హామీ ఇవ్వలేను అని చేతులెత్తేశాడు. అంగీకరించిన గడువు ఆగస్టు 31లోగా దేశం విడిచి పోవాల్సిందే లేకపోతే జరిగే పరిణామాలకు తమది బాధ్యత కాదని తాలిబాన్లు హెచ్చరించారు. దాంతో ఎన్నడూ లేని విధంగా తరలింపు ప్రక్రియను చేపట్టారని వార్తలు వస్తున్నాయి. అక్కడేం జరగనుంది. నల్లేరు మీద బండిలా తాలిబాన్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారా ? అంతర్యుద్దం జరుగుతుందా ? సెప్టెంబరు ఒకటవ తేదీ తరువాత స్పష్టత వస్తుందా ? ఏం జరగనుంది అనేది ఎవరూ చెప్పలేని స్ధితి ఉంది.


తాలిబాన్లు కాబూల్‌ను వశం చేసుకొనేందుకు కనీసం తొంభై రోజులు పడుతుందని అమెరికా సిఐఏ వేసిన అంచనాను మీడియాకు అందించారు. అయితే తొమ్మిది రోజుల్లోపలే పతనమైంది. సిఐఏ పప్పులో కాలేసింది. ఆ సందర్భంగా వచ్చిన వార్తలు, ఫొటోలను పేర్కొంటూ సరిగ్గా వియత్నాం నుంచి అమెరికా సైనికులు పారిపోతున్న మాదిరే దృశ్యాలు ఉన్నట్లు కొందరు వర్ణించారు. ఆ పోలిక సరైనదేనా ? అంతకు మించి ఏమీ లేదా ?
నాలుగున్నర దశాబ్దాల క్రితం అమెరికన్ల దాడిలో వియత్నాంలో సర్వనాశనమైన నాటి సైగాన్‌ పట్టణం మన ముంబయి వంటిది. తరువాత హౌచిమిన్‌ సిటీగా మారి ఇప్పుడు ప్రపంచంలోని పెద్ద వాణిజ్య కేంద్రాలలో ఒకటిగా ఉంది. దేశ జిడిపిలో కోటి మంది జనాభాతో ఆ నగరం పరిసరాల నుంచి 22శాతం వస్తున్నదంటే దాని ప్రాధాన్యతను అర్దం చేసుకోవచ్చు.

ఇండో చైనా అంటే ఇప్పటి వియత్నాం, లావోస్‌, కంపూచియా, మయన్మార్‌, థాయిలాండ్‌, చైనాలోని గ్వాంగ్‌జూ ప్రాంతాలు. వీటిలో మొదటి మూడు దేశాలను ఫ్రాన్సు తన వలసలుగా చేసుకుంది. మనం ఇప్పుడు వాడుకలో ఇండోచైనా అని పిలుస్తున్నవి ఈ మూడింటినే. వలసవాదులకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాల్లో భాగంగా ఇండోచైనా కమ్యూనిస్టు పార్టీ ఆయుధాలు చేపట్టింది. రెండవ ప్రపంచ యుద్దంలో జపాన్‌ మిలిటరీ ఫ్రెంచి దళాలపై దాడులు చేసింది. అదే సమయంలో కమ్యూనిస్టులు కూడా ఫ్రాన్స్‌కు వ్యతిరేకంగా పోరాడారు. ఫ్రాన్స్‌ ఓడిపోవటంతో వియత్నాంను 1945లో స్వాతంత్య్ర దేశంగా కమ్యూనిస్టు నేత హౌచిమిన్‌ ప్రకటించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఉత్తర వియత్నాం మాత్రమే పూర్తిగా కమ్యూనిస్టులు, జాతీయవాదుల ఆధీనంలోకి వచ్చింది. రాజు తన అధికారాన్ని వదులుకున్నాడు. అయితే ఆ యుద్దంలో జపాన్‌ ఓడిపోయి తన సైన్యాన్ని ఉపసంహరించుకున్న తరువాత ఫ్రాన్స్‌ తిరిగి వియత్నాంను ఆక్రమించుకుంది.దానికి వ్యతిరేకంగా కమ్యూనిస్టులు ఆయుధాలు పట్టారు. కమ్యూనిస్టులు విజయం సాధించే అవకాశాలు కనిపించటంతో 1949లో ఫ్రెంచి పాలకులు మాజీ వియత్నాం రాజును రంగంలోకి దించి దక్షిణ వియత్నాంలో సైగాన్‌ రాజధానిగా ఇదే అసలైన ప్రభుత్వం అని తొత్తు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.1953లో లావోస్‌, కంపూచియా స్వాతంత్య్రం ప్రకటించుకున్నాయి. ఆరు సంవత్సరాల పాటు అమెరికా మద్దతుతో జరిపిన యుద్దంలో పరాజయం పాలైన ఫ్రాన్స్‌ జెనివా ఒప్పందం చేసుకొని 1954 ఆ ప్రాంతం నుంచి వైదొలిగింది.

1956లో ఎన్నికలు జరిపి విలీన ప్రక్రియను పూర్తి చేయాలన్నది ఒప్పందంలోని ప్రధాన అంశం.ఆ దశలో రంగంలోకి వచ్చిన అమెరికా దక్షిణ వియత్నాం ప్రభుత్వానికి మద్దతు ఇచ్చింది. జెనివా ఒప్పందాన్ని తాము అంగీకరించటం లేదని, ఎన్నికలు జరిపేది లేదని ప్రభుత్వం అడ్డం తిరిగింది. అమెరికా, తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దక్షిణ వియత్నాంలోని కమ్యూనిస్టులు, జాతీయ వాదులు ఆయుధాలు చేపట్టారు. దీన్ని అవకాశంగా తీసుకొని ఉత్తర వియత్నాం మీద, దక్షిణ వియత్నాం యోధుల మీద అమెరికా యుద్దాన్ని ప్రకటించింది. పెద్ద సంఖ్యలో అమెరికన్‌ సైనికులు మరణిస్తుండటంతో వియత్నాం యుద్దానికి వ్యతిరేకంగా అమెరికాలో పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. దాంతో 1968లోనే నాటి అమెరికా అధ్యక్షుడు లిండన్‌ జాన్సన్‌ శాంతి ప్రతిపాదనలు చేశాడు. మరోవైపున దాడులు కొనసాగించాడు. దశలవారీ సైన్యాన్ని ఉపసంహరించుకున్నారు. యుద్దం జరుగుతుండగానే 1969 సెప్టెంబరు రెండున 79 సంవత్సరాల వయస్సులో హౌచిమిన్‌ మరణించారు. అయినా కమ్యూనిస్టులు ముందుకు సాగిపోయారు. శాంతి గురించి మాట్లాడిన తరువాత ఏడు సంవత్సరాలు దాడులు చేసి 1975లో అమెరికా పారిపోయింది. అఏడాది ఏప్రిల్‌ 29న సైగాన్‌ విమానాశ్రయం నుంచి ఒక్కరోజే ఏడువేల మంది చివరి అమెరికన్‌ సైనికులు, వారి తొత్తులను తరలించారు.

సరిగ్గా ఇటీవల కాబూల్‌లో కనిపించిన దృశ్యాలే అప్పుడూ దర్శనమిచ్చాయి. అందుకే కొందరు నాటి నేటి ఉదంతాలను పోల్చారు. మరుసటి రోజు సైగాన్‌ కమ్యూనిస్టుల వశమైంది. అదే రోజు సైగాన్‌ నగరాన్ని హౌచిమిన్‌ పేరుతో తిరిగి నామకరణం చేశారు. ఈ యుద్దంలో అమెరికన్లు ఇరవై లక్షల మంది వియత్నాం మిలిటరీ, సామాన్య పౌరుల ప్రాణాలు తీశారు. వేల టన్నుల రసాయనిక బాంబులు వేసి ఇప్పటికీ కొన్ని ప్రాంతాలను సాగుకు , నీరు తాగేందుకు పనికిరాకుండా చేశారు. అమెరికా యుద్ద చరిత్రలో అత్యధికంగా 58వేల మంది తన సైనికులను కోల్పోయింది. లక్షలాది మంది మానసిక రోగులుగా తయారయ్యారు. తమకు తొత్తులుగా పనిచేసిన వేలాది మంది వియత్నామీయులకు అమెరికా ఆశ్రయం కల్పించింది. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్‌ నుంచి పారిపోతున్నారని చెబుతున్నవారు కూడా అలాంటి వారే. తాలిబాన్లకు వ్యతిరేకంగా, ప్రభుత్వానికి, అమెరికా సేనలకు అనుకూలంగా వ్యవహరించిన వారిని తాలిబాన్లు వదలివేసే అవకాశం లేదు. అలాంటి వారందరూ ఇప్పుడు ఎక్కడికి వీలైతే అక్కడికి పోవాలని చూస్తున్నారు. అమెరికా, దానితో పాటు యుద్దంలో పాల్గొన్న ఐరోపా దేశాలు తప్ప మిగిలిన దేశాలేవీ వారికి ఆశ్రయం కల్పించే లేదా శరణార్ధులుగా అంగీకరించే అవకాశం లేదు.


పరాభవం పాలైన అమెరికా తరువాత కాలం ఇతర కమ్యూనిస్టు వ్యతిరేక ఐరోపా దేశాలతో కలసి వియత్నాం మీద ఆర్ధికదాడిని ప్రారంభించింది. వాణిజ్య ఆంక్షలతో పాటు పెట్టుబడులు రాకుండా అడ్డుకుంది. చివరికి ఫోన్‌, మెయిల్‌ సౌకర్యాలను కూడా అందుబాటులో లేకుండా చేసింది.1986లో వియత్నాం సంస్కరణల బాట పట్టి విదేశీ, ప్రయివేటు పెట్టుబడులను ఆహ్వానించింది. కార్పొరేట్ల వత్తిడి మేరకు అనివార్య పరిస్ధితిలో 1994లో ఆంక్షలు ఎత్తివేసిన అమెరికా సాధారణ సంబంధాలను ఏర్పాటు చేసుకుంది. 2000 సంవత్సరంలో బిల్‌క్లింటన్‌ వియత్నాంను సందర్శించిన తొలి అమెరికా అధ్యక్షుడికా చరిత్రకెక్కాడు.


అమెరికా విదేశాంగ , మిలిటరీ విధానాలు ఎంత లోపభూయిష్టమైనవో, అదెంత సంక్షోభంలో ఉందో తాజా ఆప్ఘన్‌ ఉదంతం కూడా నిర్ధారించింది. మూడులక్షల కోట్ల డాలర్లను ఖర్చు చేసి తనకు అనుకూలమైన అవినీతి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది తప్ప మరొకటి కాదు. ఇంతా చేసి పరువు పోగొట్టుకొని తమ ప్రభుత్వం సాధించింది ఏమిటనే ప్రశ్న ఇప్పుడు అమెరికా సమాజంలో తలెత్తింది. అసలు అమెరికన్లు ఆఫ్ఘనిస్తాన్‌లో ఎందుకు జోక్యం చేసుకున్నారు. పాకిస్తాన్‌ ఎందుకు ముజాహిదీన్లు, తాలిబాన్లకు మద్దతు ఇచ్చింది ? మీడియాలో ఇరవై సంవత్సరాల గురించే చెబుతున్నారు.1970దశకంలో ఆఫ్ఘనిస్తాన్‌లో ఏర్పడిన వామపక్ష ప్రభుత్వాన్ని దెబ్బతీసేందుకు ముజాహిదీన్ల పేరుతో అక్కడి భాషా, తెగల నేతలను రెచ్చగొట్టటంలో అమెరికా పాత్రను మూసిపెడుతున్నారు. ఆ సమయంలో అమెరికన్ల చేతిలో పాకిస్తాన్‌ కీలుబొమ్మగా ఉంది. ఆ కారణంగా అఫ్ఘన్‌ ప్రభుత్వానికి మద్దతుగా వచ్చిన సోవియట్‌ యూనియన్‌ అక్కడ స్ధిరపడిన తరువాత తమ దేశంపై కూడా దాడి చేయవచ్చనే తప్పుడు అంచనాకు పాక్‌ నాయకత్వం వచ్చింది. ఆ కారణంగానే పెద్ద ఎత్తున జోక్యం చేసుకొని ప్రభుత్వ వ్యతిరేక శక్తులను చేరదీసి శిక్షణ ఇచ్చింది.

సోవియట్‌ నాయకత్వంలో వచ్చిన మార్పుల కారణంగా వారు ఉపసంహరించుకున్న తరువాత కర్ర ఉన్నవాడిదే గొర్రె అన్నట్లుగా అంతకు ముందు వామపక్ష ప్రభుత్వాలకు వ్యతిరేకంగా దాడులు చేసిన వారందరూ ఎవరికి వారు తమదే అక్షయ పాత్ర అన్నట్లుగా కీచులాడుకున్నారు. ఈ స్ధితిలో తాము స్వచ్చమైన పాలన అందిస్తామని తాలిబాన్లు పుట్టుకు వచ్చారు. కుమ్ములాటలు లేని సమాజాన్ని ఏర్పాటు చేస్తామని వారు ప్రారంభమయ్యారు. తమ అవసరాల కోసం, అమెరికా ఎత్తుగడల ప్రకారం తాలిబాన్లకు శిక్షణ ఇవ్వటమే కాదు, ముజాహిదీన్‌ నేతలు ఏర్పాటు చేసిన ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడేందుకు పాకిస్దాన్‌ వేల మంది కిరాయి మూకలను కూడా అఫ్ఘనిస్తాన్‌లోకి పంపింది. అదే విధంగా వారు సృష్టించిన ఐఎస్‌ తీవ్రవాదులు తరువాత ఏకు మేకయ్యారు.ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్‌లోని పెంజేష్వర్‌ లోయలో తాలిబాన్లను ప్రతిఘటిస్తున్న దేశ ఉపాధ్యక్షుడు సాలేV్‌ా వెనుక ముజాహిదిన్ల ఒక ముఠానేత అహమ్మద్‌ షా మసూద్‌ సోదరులు, కుమారులు ఉన్నారు. ఇతర ముుఠాలతో రాజీచేసుకొని అధికారానికి వచ్చిన మసూద్‌ను 2001 సెప్టెంబరు తొమ్మిదిన విషమిచ్చి చంపారు. తరువాత రెండు రోజులకే న్యూయార్క్‌లోని ప్రపంచ వాణిజ్య కేంద్రం మీద ఆల్‌ఖైదా ఆత్మాహుతి విమానదాడికి పాల్పడింది. మసూద్‌ హత్యకు దీనికి సంబంధం ఉందని చెబుతారు. ఆ దాడిని ఆసరా చేసుకొని తాలిబాన్లు, ఆల్‌ఖైదాను అంతమొందించాలనే పేరుతో అమెరికా అదే ఏడాది జోక్యం చేసుకొని రెండు దశాబ్దాలు దాడులు చేసింది.ఆల్‌ఖైదా నేత బిన్‌ లాడెన్‌కు ఆశ్రయమిచ్చింది, అతని అనుపానులు తెలియచేసి హతమార్చేందుకు సహకరించింది పాకిస్తాన్‌ అన్నది బహిరంగ రహస్యమే. ఇప్పుడు మసూద్‌ అనుచరులకు నాయకత్వం వహిస్తున్న సాలేV్‌ాకు గతంలో అమెరికా సిఐఏ శిక్షణ ఇచ్చి ఆఫ్ఘన్‌ గూఢచార వ్యవస్ధ అధిపతిగా ఏర్పాటు చేసింది.తరువాత ఉపాధ్యక్షుడయ్యాడు. ఇప్పుడు తానే తాత్కాలిక అధ్యక్షుడిని అని ప్రకటించుకున్న ఆ ముఠాకు అమెరికా మద్దతు ఉందనే వార్తలు వస్తున్నాయి.


వియత్నాం-ఆఫ్ఘన్‌ పరిణామాలను చూసినపుడు అమెరికా ఆయుధ శక్తి ఆదేశాల మీద పని చేయలేదు. ఒక చోట కమ్యూనిస్టులు ప్రతిఘటిస్తే మరొక చోట మతవాదులు ఆపని చేశారు. అమెరికాను తరిమివేసిన తరువాత కమ్యూనిస్టుల నాయకత్వంలోని వియత్నాం వినాశనం నుంచి దేశాన్ని తిరిగి నిర్మించి నేడు అభివృద్ది బాటలో ఎలా నడుస్తున్నదో చూస్తున్నాము. ఆప్ఘనిస్తాన్‌లో వామపక్ష ప్రభుత్వాన్ని కూలదోసిన తరువాత ఏర్పడిన ముజాహిదీన్ల,తాలిబాన్ల ప్రభుత్వం, గత రెండు దశాబ్దాలుగా అమెరికా కనుసన్నలలో నడుస్తున్న ప్రభుత్వం గానీ దేశ ఆర్ధిక, సామాజిక వ్యవస్ధలను మెరుగుపరిచేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. గత నాలుగు దశాబ్దాలలో పరిస్ధితి దిగజారింది. ఆఫ్ఘనిస్తాన్‌లో 2,400 మంది అమెరికన్‌ సైనికులు మరణించినప్పటికీ దానికి నాలుగు రెట్లు ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతున్నారు. ఆఫ్ఘన్‌ మిలిటరీ, పోలీసుల శిక్షణకు 90బిలియన్‌ డాలర్లు ఖర్చుచేసినా ఫలితం లేదని స్పష్టమైంది. మాదక ద్రవ్యాల వ్యాపారాన్ని అదుపు చేసేందుకు పది బిలియన్‌ డాలర్లు ఖర్చుచేసిన తరువాత నల్లమందు సాగు పెరిగింది. ఆర్ధిక వృద్ధికి 24బి.డాలర్లు ఖర్చు చేసినట్లు చెప్పినా ఫలితం లేకుండా పోయింది. మొత్తం మూడులక్షల కోట్ల డాలర్లు ఖర్చు చేస్తే లాభపడింది అమెరికన్‌ కంపెనీలు, ఆఫ్ఘనిస్తాన్‌లో అవినీతి పరులు తప్ప మరొకరు కాదు. ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్లు గత రెండు దశాబ్దాలలో 104 బిలియన్‌ డాలర్లు తీసుకున్నారు. ఆఫ్ఘన్‌ పార్లమెంటులో తొలి మహిళా సభ్యురాలు మలాలై జోయా అమెరికా సేనల ఉపసంహరణకు ముందు రాసిన ఒక వ్యాసంలో తమకు ముగ్గురు శత్రువులున్నారని పేర్కొన్నారు. తాలిబన్లు, ప్రభుత్వ ముసుగులో ఉన్న యుద్ద ప్రభువులు, అమెరికా మిలిటరీ అని పేర్కొన్నారు. ఇప్పుడు తాలిబాన్లు తప్ప మిగిలిన ఇద్దరు శత్రువులు లేరు.తాలిబాన్లు దేశాన్ని బాగు చేస్తారా ? గతంలో అలాంటి ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు చేసే అవకాశమూ కనిపించటం లేదు. అమెరికాను తరిమివేయటంలో వియత్నాంతో పోలిక ఉండవచ్చు గానీ అభివృద్ది, జనం విషయంలో తాలిబాన్లకు అలాంటి లక్షణాలు, లక్ష్యమూ లేదు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

తాలిబాన్లు వద్దు – తాలిబానిజం ముద్దు ! మరోసారి ముందుకు వచ్చిన మనువాద చర్చ !!

22 Sunday Aug 2021

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, RELIGION, Women

≈ Leave a comment

Tags

Afghanistan Talibans, BJP, Hindu Fundamentalism, Hinduism, Manu Statue, Manusmriti, RSS, saffron talibans


ఎం కోటేశ్వరరావు


అమెరికా వాడు ఆఫ్ఘనిస్తాన్నుంచి పారిపోవటాన్ని ఎవరి కోణంలో వారు చూస్తున్నారు. మిగతా అంశాల గురించి రాబోయే రోజుల్లో ఎలాగూ చర్చించుకుంటాం. మన దేశానికి చేసిన ఒక మంచి గురించి చెప్పకతప్పదు. తమకు ఏది మంచి అయితే దాన్ని చేయటం తప్ప నమ్మిన వారిని పట్టించుకొనే అవసరం మాకు లేదు అని మన దేశంలో వారి మీద మరులు గొన్నవారికి చెంపచెళ్లు మనిపించి మరీ చెప్పాడు. మతశక్తుల మంచి చెడ్డల గురించి చర్చ, విశ్లేషణలు జరిగేందుకు దోహదం చేశాడు. ఇప్పుడు అదే జరుగుతోంది.అనేక మంది తాలిబాన్లు-ఆర్‌ఎస్‌ఎస్‌ పోలికలను ముందుకు తెస్తున్నారు. గతంలో ఏదైనా అడిగితే పాకిస్తాన్‌ వెళ్లండి అని చెప్పే బిజెపి నేతలు ఇప్పుడు బాణీ మార్చి ఆప్ఘనిస్తాన్‌ వెళ్లమని సలహా ఇస్తున్నారు. తమ ప్రత్యర్ధులను తాలిబాన్ల మాదిరి తన్నాలని పిలుపులు ఇస్తున్నారు.


మధ్య ప్రదేశ్‌లోని కట్ని జిల్లా బిజెపి అధ్యక్షుడు రామ్‌రతన్‌ పాయల్‌ను ద్రవ్యోల్బణం, పెట్రోలు ధరల గురించి ఒక విలేకరి అడిగితే దురదగొండి ఆకు పూసుకున్నట్లుగా ప్రవర్తించారు. ఆఫ్ఘనిస్తాన్‌లో పెట్రోలు లీటరు 50రూపాయలైనా కొనేవారు లేరంట అక్కడికి వెళ్లి కొనుక్కోండి అంటూ మండిపడ్డారు. కరోనా మూడవ తరంగం వస్తుందని అందరూ అనుకుంటుంటే పెట్రోలు గురించి మాట్లాడుతున్నావు, కరోనా కనిపించటం లేదా అని ఎదురుదాడికి దిగిన వీడియో తెగ ప్రచారం అయింది. బీహార్‌లోని బిస్‌ఫీ నియోజకవర్గ బిజెపి ఎంఎల్‌ఏ హరిభూషన్‌ ఠాకూర్‌ను ఒక విలేకరి తాలిబాన్లు అధికారానికి వచ్చిన ప్రభావం భారత్‌ మీద ఎలా ఉంటుంది అని అడిగారు. ఆ పాపానికి ఇక్కడ భయపడేవారంతా అక్కడికి పోవచ్చు, పెట్రోలు, డీజిలు ధరలు చౌక అని ఎద్దేవా చేశారు. ఒకసారి అక్కడికి వెళితే ఇక్కడి ప్రత్యేకత తెలుస్తుంది అన్నారు. మతమేదైనా ఆప్ఘన్‌ శరణార్దులను అందరినీ అనుమతించాలన్న జెడియు నేత వ్యాఖ్యను గేలిచేస్తూ అప్పుడు మన దేశం కూడా తాలిబాన్లతో నిండిపోతుందన్నారు. తాలిబాన్లు మన దేశంలో స్వాతంత్య్ర సమర యోధుల వంటి వారు అని ఉత్తర ప్రదేశ్‌లోని సమాజవాది పార్టీ ఎంపీ షఫికుర్‌ రహమాన్‌ వ్యాఖ్యానించినందుకు యుపి బిజెపి ప్రభుత్వం దేశద్రోహ కేసు బనాయించింది. ఇటీవలనే కేంద్ర మంత్రిగా నియమితులైన ప్రతిమా భౌమిక్‌ గారిని సన్మానించేందుకు త్రిపురలోని బెలోనియా పట్టణంలో బిజెపి వారు ఒక సభను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో తృణమూల్‌ కాంగ్రెస్‌ నేతలు అడుగుపెడితే తాలిబాన్ల పద్దతుల్లో వారిని తరిమివేయాలని పార్టీ ఎంఎల్‌ఏ అరుణ్‌ చంద్ర భౌమిక్‌ బిజెపి కార్యకర్తలకు పిలుపునిచ్చారు.


తాలిబాన్లను ఎవరూ సమర్ధించటం లేదు. ఆప్ఘనిస్తాన్‌ నుంచి అమెరికా పారిపోయినందుకు సంతోషం తప్ప మతఛాందసులు వచ్చినందుకు కాదు. అయినా మన దేశంలో తాము తప్ప మిగిలిన వారందరూ తాలిబాన్లకు మద్దతు ఇస్తున్నారన్నట్లుగా బిజెపి నేతలు ప్రచారం చేస్తున్నారు. తాలిబాన్లకు అధికారాన్ని అప్పగించేందుకు ఒప్పందం చేసుకున్నది అమెరికా, దాని సంతకాల కార్యక్రమానికి హాజరై సంతోషాన్ని వెలిబుచ్చింది నరేంద్రమోడీ సర్కార్‌. అమెరికా తప్పుకున్న తరువాత దేశం తాలిబాన్ల వశం అవుతుందన్న కనీస పరిజ్ఞానం మన ప్రభుత్వానికి లేదా ? ఎందుకు సమర్ధించినట్లు ? జనానికి బుర్రల్లేవనుకుంటున్నారా ? తాలిబాన్‌ షరియా చట్టాల గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్న బిజెపి వారు ఇప్పటికే అమల్లో ఉన్న దేశాల్లో మహిళల గురించి ఎప్పుడైనా ఈ మాదిరి గుండెలు బాదుకున్నారా ? ముస్లింలు ఉన్న ప్రతి చోట దేశ రాజ్యాంగాలతో నిమిత్తం లేకుండా మత పెద్దలు అనధికారికంగా ఆ చట్టాలను అమలు జరుపుతున్నారు. ఇక పూర్తిగా లేదా పాక్షికంగా అధికారిక గుర్తింపు ఇచ్చిన దేశాలలో ఆఫ్ఘనిస్తాన్‌, ఇండోనేషియా, పాకిస్తాన్‌, ఈజిప్టు, ఎమెన్‌, ఇరాన్‌, ఇరాక్‌, మలేషియా, మాల్దీవులు, మారుటేనియా, కతార్‌, సౌదీ అరేబియా,నైజీరియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ ఉన్నాయి.


ఇక మనుస్మృతి విషయానికి వస్తే ఇస్లాంలో షరియత్‌ను ముస్లింలు అందరూ ఆమోదించారని, ఆ మాదిరి మనుస్మృతిని హిందువులందరూ ఆమోదించాలనే బలవంతం ఏమీ లేదని కొందరు సన్నాయి నొక్కులు నొక్కుతారు. ఇస్లామిక్‌ రాజ్యాలుగా ప్రకటించుకున్నవి బలవంతంగా అమలు జరపటం తప్ప షరియత్‌ను పాటించటమా లేదా అన్నది ఎవరికి వారు నిర్ణయించుకొనే స్వేచ్చ ఇస్తే అప్పుడు తెలుస్తుంది. మన దేశాన్ని హిందూ రాజ్యంగా మార్చాలని, సమాజాన్ని వేల సంవత్సరాల వెనక్కు తీసుకుపోవాలని చూస్తున్న మనువాదుల లక్ష్యం నెరవేరితే జరిగితే సంభవించే పరిణామం ఏమిటి ? మరో పాకిస్తాన్‌గా మారిపోతుంది. అవకాశం లేకగానీ లేకుంటే ఈ పాటికి దేశాన్ని ఎప్పుడో మతరాజ్యంగా మార్చి ఉండేవారు. అప్పుడు రాజ్యాంగం స్దానంలో మనుస్మృతిని అమలు చేసేవారు.ఇదేమీ నిరాధార ఆరోపణ కాదు. అనేక మంది ఈ దేశంలో ఇప్పుడు భయపడుతున్నది ఇదే.


ఆర్‌ఎస్‌ఎస్‌ వాణి ఆర్గనైజర్‌ పత్రిక 1949 నవంబరు 30వ తేదీ సంచికలో రాసిందేమిటి ? ” భారత నూతన రాజ్యాంగం గురించి చెప్పాలంటే అత్యంత చెడు ఏమంటే దానిలో భారతీయం లేకపోవటమే.రాజ్యాంగాన్ని రాసిన వారు బ్రిటీష్‌, అమెరికా, కెనడా, స్విస్‌ మరియు ఇతర రాజ్యాంగాలలోని అంశాలను చేర్చారు. పురాతన భారతీయ చట్టాల ఆనవాళ్లు, వ్యవస్ధలు, నామావళి,శబ్ద-శైలీ విన్యాసాలుగానీ లేవు. పురాతన భారత్‌లో జరిగిన అపూర్వమైన రాజ్యాంగ అభివృద్ది ప్రస్తావన గానీ లేదు. పురాతన గ్రీకు, పర్షియా చట్టాల కంటే ఎంతో ముందుగా రాసినవి మను చట్టాలు.మనుస్మృతిలో ఉద్ఘోషించిన చట్టాలు ప్రపంచవ్యాపితంగా ఉద్వేగ పరిచే, ఆరాధించేవి, అనుసరణకు పురికొల్పేవి, కానీ మన రాజ్యాంగ పండితులకు అర్ధం లేనివి.” కాశ్మీరు రాష్ట్రాన్ని , రాజ్యాంగంలోని మౌలిక అంశమైన ఆర్టికల్‌ 370 ఒక్క రోజులో ఎలాంటి చర్చ లేకుండా రద్దు చేసిన పెద్దలు రాబోయే రోజుల్లో మనుస్మృతి, పురాణాలు, వేదాలతో రాజ్యాంగాన్ని నింపివేయరనేే హామీ ఏముంది ?


మనుస్మృతిలో ఏముంది ? రెండున్నరవేల శ్లోకాలు ఉంటే వాటిలో బ్రాహ్మలు, క్షత్రియుల విధులు, కర్తవ్యాలు, పాలన,హక్కులకు సంబంధించి రెండువేలకు పైగా ఉంటే, వైశ్యులు, శూద్రుల బాధ్యతలు, మహిళల కట్టుబాట్లు, పరిమితుల గురించి మిగిలినవి ఉన్నాయి. పాలక – పురోహిత పెత్తనం తప్ప సామాన్యుల హక్కుల గురించి ఉన్నదేమిటో ఎవరైనా చెబితే సంతోషం. అలాంటి దాని ప్రాతిపదికన రాజ్యాంగ రచన అంటే కాషాయ తాలిబానిజం తప్ప మరొకటి ఏముంది? మనువాదం అంత గొప్పది, పురాతనమూ, ఆదర్శమూ అయితే ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అంటరానితనం, పిల్లలను కనటానికి, వంట, ఇంటికి మహిళలను ఎందుకు పరిమితం చేసినట్లు ?
మనుస్మృతిలో పరస్పర విరుద్ద అంశాలు కూడా ఉన్నాయి. ఎవరికి వారు తమకు అనుకూలమైన వాటిని తీసుకొని వాదనలను సమర్ధించుకుంటున్నారు. అయితే ఆచరణను గీటురాయిగా తీసుకుంటే వ్యతిరేకమైనవే అమల్లో ఉన్నాయి.ఉదాహరణకు మహిళల హక్కులకు సంబంధించి ఒక దగ్గర స్త్రీ పురుషులెవరూ వివాహాన్ని రద్దు చేసుకోరాదని ఉంది. మరికొన్ని చోట్ల చేసుకోవచ్చని ఉంది. కానీ హిందూకోడ్‌ బిల్లు వచ్చేంత వరకు అలాంటి హక్కులు అమలు జరుపుకున్నవారెంత మంది ? తన కులం గాని వారిని వివాహం చేసుకోవటాన్ని నిషేధించింది. ఇప్పుడు జరుగుతున్న అనేక హత్యలు, కులపంచాయతీలకు ప్రాతిపదిక అదే కదా ! బాల్యంలో తండ్రి, యవ్వనంలో భర్త, అవసానదశలో మగపిల్లల రక్షణలో ఉండాలని, భర్తను దేవుడిగా పూజించాలని చెప్పారు. మహిళలను ఎక్కడ గౌరవిస్తారో అక్కడ దేవతలు సంతోషిస్తారని ఒక చోట చెబుతారు. స్వంతంత్ర జీవనం కోరుకోరాదని మరోచోట అదేశిస్తారు. పురుషులను భ్రష్టు పట్టించటం మహిళల సహజలక్షణ మని చెబుతారు.ఇలా స్త్రీని కించపరిచే, ఆంక్షలు విధించే అంశాలు ఎన్నో ఉన్నాయి.


కొన్ని కులాల వారు ” గుట్టలు, చెట్లు, శ్మశానాల దగ్గర, కొండలు, తోపుల్లో ఉండాలి.జన్మసిద్దమైన కార్యకలాపాల జీవనంతో గుర్తు పట్టేవిధంగా ఉండాలి.” ” భరించలేని అంటరాని వారు,కుల భ్రష్ట జనితులు గ్రామాల వెలుపల ఉండాలి, పారవేసిన పాత్రలు, కుక్కలు, గాడిదలను తమ సంపదలుగా పరిగణించాలి. వారు మరణించిన వారి దుస్తులను ధరించాలి, పగిలిపోయిన పాత్రల్లో వారి ఆహారం ఉండాలి, ఆభరణాలు ఇనుముతో చేసినవిగా ఉండాలి, ఎప్పుడూ దూరంగానే తిరుగుతుండాలి. తన విధులు నిర్వర్తిస్తున్న పురుషుడు వారితో సంబంధాన్ని కోరుకోకూడదు, ఒకరి తరువాత ఒకరితో కార్యకలాపాలు నిర్వహించాలి.వారి మాదిరి ఉండేవారితోనే వివాహం చేసుకోవాలి. ఆహారం కోసం వారు ఇతరుల మీద ఆధారపడాలి.వారికి పగిలిపోయిన పాత్రల్లోనే ఆహారం పెట్టాలి. వారు పట్టణాలు,గ్రామాల్లో రాత్రుళ్లు నడవ కూడదు. పగలు తమ పనికోసం వారు తిరగవచ్చు. రాజు జారీ చేసిన ఆజ్ఞల ప్రకారం ప్రత్యేకమైన గుర్తులతో గుర్తుపట్టేవిధంగా వారు ఉండాలి. బంధువులు లేని వారి శవాలను వారు మోయాలి, ఇది తిరుగులేని నిబంధన. రాజాజ్ఞ ప్రకారం మరణశిక్షలను అమలు జరపాలి. మరణశిక్షకు గురైనవారి దుస్తులు, పక్కలు, ఆభరణాలను తమ కోసం తీసుకోవాలి.” ఈ మనుచట్టాలను రాజ్యాంగం రచనలో పరిగణనకు తీసుకోలేదనే వైఖరిని ఆర్‌ఎస్‌ఎస్‌ లేదా ఆర్గనైజర్‌ మార్చుకున్నదా ? నాకు ఎలాంటి ఆధారాలు దొరకలేదు, ఎవరైనా చెబితే అంగీకరిద్దాం ! అంతేనా ? ” పూజారి పేరు శుభప్రదమైన, సౌకర్యవంతమైన పదంతో ఉండాలి, పాలకుడి పేరు బలాన్ని, రక్షణను సూచించాలి, సాధారణ జనానికి ఆస్తి సంబంధమైనవి, సేవకుడి పేరు సేవను సూచించే, చిరాకు పుట్టించేదిగా ఉండాలి.” ఇవి కూడా మనుధర్మంలో చెప్పినవే సుమా ! సినిమాల్లో అలాంటి ఉదంతాలను ఎవరైనా గుర్తు పట్టవచ్చు.

ముస్లిం మహిళల రక్షణకు ఎవరూ తీసుకురాని చట్టాన్ని తీసుకు వచ్చామని బిజెపి ఊరూ వాడా ప్రచారం చేసుకుంటున్నది. ఎప్పటికెయ్యది అప్పటికా అవసరాలు, అజెండాకు అనుగుణ్యంగా ఎత్తుగడలను మార్చుకోవటాన్ని చూసి ఊసరవెల్లులే సిగ్గుపడతాయి. హిందూ మహిళలకు ఆస్తి , వివాహ, విడాకుల హక్కులు ఇచ్చేందుకు, బహు భార్యాత్వాన్ని నిషేధించేందుకు ఉద్దేశించిన హిందూకోడ్‌ బిల్లు పట్ల అనుసరించిన వైఖరి ఏమిటి ? కేంద్ర మంత్రిగా అంబేద్కర్‌ ప్రతిపాదించిన బిల్లులను వ్యతిరేకిస్తూ 1949 డిసెంబరు 11న ఢిల్లీ రామలీలా మైదానంలో ఆర్‌ఎస్‌ఎస్‌ సభ నిర్వహించింది. హిందూ సమాజం మీద ఆటంబాంబు వంటిది ఈ బిల్లు అని ఒక వక్త సెలవిచ్చారు. అవి పార్లమెంట్‌ ముందుకు వచ్చినపుడు బెంగాల్‌ నుంచి స్వతంత్య్ర అభ్యర్ధిగా ఎన్నికైన హిందూమహాసభ నేత నిర్మల్‌ ఛటర్జీ( సిపిఎం నేత, లోక్‌సభ స్పీకర్‌గా పని చేసిన సోమనాధ్‌ చటర్జీ తండ్రి) వాటిని తీవ్రంగా వ్యతిరేకించారు. సంఘపరివార్‌, హిందూత్వశక్తులే కాదు, కాంగ్రెస్‌లోని మితవాదులు కూడా వాటికి వ్యతిరేకమే. తొలి రాష్ట్రపతి బాబూ రాజేంద్ర ప్రసాద్‌ కూడా వారిలో ఒకరు. ఇలాంటి ప్రతిపాదనలను ముందు పార్టీల ఎన్నికల ప్రణాళికల్లో పెట్టి ఓటర్ల ముందు చర్చ తరువాత పార్లమెంట్‌కు తీసుకురావాలన్నారు. ఎందుకని మనుధర్మం వాటికి వ్యతిరేకం గనుక ! చివరికి నెహ్రూ అనేక రాజీలతో చట్టానికి ఆమోదం పొందారు.


మన రాజ్యాంగం ప్రకారం మనువు, మహమ్మద్‌, ఏసుక్రీస్తు మరొక మత బోధనలకు స్ధానం లేదు. అయినప్పటికీ రాజస్తాన్‌ హైకోర్టు ముందు 1989లో రాజస్తాన్‌ జుడీషియల్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ మను పేరుతో ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి దానికి వ్యతిరేకంగా అనుకూలంగా నిరనసలు-సమర్ధనలు జరుగుతున్నాయి. అదే ఏడాది ఆ విగ్రహాన్ని తొలగించాలని ఆదేశిస్తూ హైకోర్టు ఒక పాలనాపరమైన ఉత్తరువు జారీ చేసింది. దాన్ని సవాలు చేస్తూ విశ్వహిందూపరిషత్‌ నేతలు, ఇతరులు ఒక ప్రజాప్రయోజన వ్యాజ్యం వేశారు. దాని మీద ఆదేశాన్ని నిలుపు చేస్తూ హైకోర్టు ఆదేశించింది. ప్రదాన న్యాయమూర్తి ఆధ్వర్యాన ఏర్పడిన డివిజన్‌ బెంచ్‌ వాజ్యవిచారణ చేపట్టింది. గత మూడు దశాబ్దాలుగా ఆ కేసులో ఎలాంటి పురోగతి లేదు. కొంత మంది దళిత సంఘకార్యకర్తలు ఆ కేసులో ప్రతివాదులుగా చేరారు. చివరి విచారణ 2015లో జరిగింది. బ్రాహ్మణ న్యాయవాదుల నిరసనల కారణంగా కేసు ముందుకు పోలేదు. ప్రతి ఏటా మను విగ్రహాన్ని తొలగించాలని కోరుతూ నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఈ ఏడాది కూడా జరిగాయి. కేసు తేలేవరకు విగ్రహం కనపడకుండా ముసుగు కప్పాలని అధికారులు ఆపని చేయకపోతే తామే అందుకు పూనుకుంటామని కార్యకర్తలు హెచ్చరించారు.మనుధర్మం పేరుతో అమలు చేసిన అంశాలు దళితులు, మహిళలను అణచివేశాయని కొందరు చెబుతున్నారు. వాటికీ మను ధర్మానికి సంబంధం లేదు అని మరికొందరు అంటున్నారు. మరోనోటితో మను ధర్మాలు అమలు జరిగాయంటారు. ఏది నిజం ? మరి స్వేచ్చ లేకపోవటానికి, అణచివేత, అంటరానితనం, కులాలవారీ చీలిపోవటానికి కారణాలు ఏమిటి ? మనువాదుల నుంచి సరైన సమాధానం లేదు.వారు చెప్పేవి తర్కానికి నిలిచేవి కాదు. ఇదే సూత్రం షరియ చట్టాలకూ వర్తిస్తుంది.అదీ తర్కానికి నిలవదు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...
← Older posts

Recent Posts

  • చమురు పన్ను తగ్గింపు : శ్రీలంక దెబ్బతో నరేంద్రమోడీ అదిరి పడ్డారా !
  • ప్రపంచాన్ని భయపెడుతున్న మంకీపాక్స్‌ వెనుక అమెరికా హస్తం ఉందా ?
  • హజ్‌ యాత్రీకుల కోసం నరేంద్రమోడీ పైరవీ – విజయన్‌పై నోరు పారవేసుకున్న పిసిసినేత !
  • ఇండోనేషియా కమ్యూనిస్టు ఊచకోత వెనుక బ్రిటన్‌ !
  • వందేళ్ల చైనా కమ్యూనిస్టు యూత్‌లీగ్‌ !

Recent Comments

raomk on రంగనాయకమ్మ గారూ”కుహనా మి…
యూహెచ్ ప్రీతమ్ on రంగనాయకమ్మ గారూ”కుహనా మి…
V.S.Srinivasa Babu on జాడలేని అపర జాతీయవాదులు…
K Seenaih on రష్యా – ఉక్రెయిన్‌ యుద్ధ…
K Seenaih on రష్యా – ఉక్రెయిన్‌ యుద్ధ…

Archives

  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • చమురు పన్ను తగ్గింపు : శ్రీలంక దెబ్బతో నరేంద్రమోడీ అదిరి పడ్డారా !
  • ప్రపంచాన్ని భయపెడుతున్న మంకీపాక్స్‌ వెనుక అమెరికా హస్తం ఉందా ?
  • హజ్‌ యాత్రీకుల కోసం నరేంద్రమోడీ పైరవీ – విజయన్‌పై నోరు పారవేసుకున్న పిసిసినేత !
  • ఇండోనేషియా కమ్యూనిస్టు ఊచకోత వెనుక బ్రిటన్‌ !
  • వందేళ్ల చైనా కమ్యూనిస్టు యూత్‌లీగ్‌ !

Recent Comments

raomk on రంగనాయకమ్మ గారూ”కుహనా మి…
యూహెచ్ ప్రీతమ్ on రంగనాయకమ్మ గారూ”కుహనా మి…
V.S.Srinivasa Babu on జాడలేని అపర జాతీయవాదులు…
K Seenaih on రష్యా – ఉక్రెయిన్‌ యుద్ధ…
K Seenaih on రష్యా – ఉక్రెయిన్‌ యుద్ధ…

Archives

  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • చమురు పన్ను తగ్గింపు : శ్రీలంక దెబ్బతో నరేంద్రమోడీ అదిరి పడ్డారా !
  • ప్రపంచాన్ని భయపెడుతున్న మంకీపాక్స్‌ వెనుక అమెరికా హస్తం ఉందా ?
  • హజ్‌ యాత్రీకుల కోసం నరేంద్రమోడీ పైరవీ – విజయన్‌పై నోరు పారవేసుకున్న పిసిసినేత !
  • ఇండోనేషియా కమ్యూనిస్టు ఊచకోత వెనుక బ్రిటన్‌ !
  • వందేళ్ల చైనా కమ్యూనిస్టు యూత్‌లీగ్‌ !

Recent Comments

raomk on రంగనాయకమ్మ గారూ”కుహనా మి…
యూహెచ్ ప్రీతమ్ on రంగనాయకమ్మ గారూ”కుహనా మి…
V.S.Srinivasa Babu on జాడలేని అపర జాతీయవాదులు…
K Seenaih on రష్యా – ఉక్రెయిన్‌ యుద్ధ…
K Seenaih on రష్యా – ఉక్రెయిన్‌ యుద్ధ…

Archives

  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Follow Following
    • vedika
    • Join 921 other followers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Customize
    • Follow Following
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d bloggers like this: