• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: attacks on journalists

పాలకుల దాడి – ప్రశ్నార్ధకంగా మారిన మీడియా విశ్వసనీయత !

06 Friday Sep 2019

Posted by raomk in BJP, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion

≈ 1 Comment

Tags

attacks on journalists, BJP, BJP's social media, Indian media credibility, Journalism in India, Media, Narendra Modi

Image result for government attack and question of indian media credibility

ఎం కోటేశ్వరరావు

ఒకే దేశం ఒకే చట్టం అనే భావోద్వేగాల ముసుగులో దేశ చరిత్రలో తొలిసారిగా ఒక్క దెబ్బతో ఒక రాష్ట్రాన్ని ఏకంగా రద్దు చేశారు. జమ్మూ కాశ్మీర్‌ రాష్ట్రాన్ని రద్దు చేసి అక్కడి జనానికి దేశంతో సంబంధాలను తెంపివేసిన ఆగస్టు ఐదు, 2019 నాటి అత్యంత అప్రజాస్వామిక చర్య వారాలు గడిచినా సాధారణ పరిస్ధితులు ఏర్పడలేదు. దేశంలో ఎన్ని పత్రికలు, టీవీలు ఈ చర్యను విమర్శనాత్మకంగా చూశాయి అన్నది ఒక ప్రధానమైన అంశం. కేంద్ర ప్రభుత్వంతో ముడిపడి వున్న అనేక వివాదాస్పద అంశాలు, జనజీవితంతో పెనవేసుకున్న ఆర్ధిక వ్యవస్ధ దిగజారుడు పర్యవసానాల గురించి మీడియాలో ఎంత చోటు దక్కిందన్నది ఒక శేష ప్రశ్నగా మారింది.కాశ్మీరు గురించి మీడియా చర్చల్లో ఎక్కడో కొంత మంది చేసిన విమర్శనాత్మక వ్యాఖ్యలు తప్ప స్వంత కధనాలను జనం ముందుకు ఎన్ని తెచ్చాయంటే చెప్పలేని స్ధితి. అధికార పార్టీని చూసి నిజం చెప్పలేని స్ధితిలో మీడియా పడిపోయిందా ?ప్రస్తుతం భారత మీడియాలో వేళ్ల మీద లెక్కించదగిన సంస్ధలు తప్ప మొత్తం మీద విశ్వసనీయత సమస్యను ఎదుర్కొంటున్నది. అంతకు ముందు కూడా ఆ సమస్య వున్నప్పటికీ గత ఐదు సంవత్సరాలుగా వేగంగా దిగజారుతున్నది.

ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్ధగా చెప్పుకుంటున్న మన దేశంలో జర్నలిజం ఎదుర్కొంటున్న ఇబ్బందుల పర్యవసానాలు తీవ్రంగా వుంటాయి. వుత్తర ప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాధ్‌ సర్కార్‌ చర్య ఒక వుదాహరణ. మధ్యాహ్న భోజన పధకంలో రొట్టెలతో కూరలకు బదులు వుప్పు అందచేసిన అంశాన్ని వీడియో తీసి వెలుగులోకి తెచ్చిన జర్నలిస్టు మీద అక్కడి అధికార యంత్రాంగం కేసు పెట్టింది. మీరు కావాలంటే ఫొటోలు తీసుకోవచ్చు, మీకు తప్పుగా కనిపించినదాని గురించి ఏమైనా రాసుకోవచ్చు. కానీ వీడియో తీయటం అంటే అనుమానించాల్సి వస్తోంది. ఒక కుట్రలో భాగంగానే వీడియో తీశారంటూ జిల్లా కలెక్టర్‌ అనురాగ్‌ పటేల్‌ సదరు జర్నలిస్టు మీద పెట్టిన కేసును సమర్ధించారు. కేసు పెట్టాలి, దానికి ఒక సాకు చూపాలి అంతకు మించి దీనిలో మరొకటి కనిపించటం లేదు. ఫొటోలు తీయటానికి అర్హత వున్న ఒక జర్నలిస్టు వీడియో తీయకూడదని ఏ నిబంధనలు చెబుతున్నాయి. జర్నలిస్టుల పట్ల బిజెపి పాలకుల వైఖరికి ఇది చక్కటి నిదర్శనం. అధికారంలో వున్న వారికి వ్యతిరేకంగా నిజం చెప్పకూడదు, చూపకూడదు.

నరేంద్రమోడీ తొలిసారి ఎన్నికైనపుడు చమురు ధరలు భారీగా క్షీణించి జనానికి పెద్దగా వుపయోగపడకపోయినా దిగుమతి బిల్లు తగ్గించి కేంద్ర ప్రభుత్వానికి ఎంతో మేలు చేశాయి. అయినా ఎప్పుడైతే ఆర్ధికంగా దిగజారుడు ప్రారంభమైందో దాన్నుంచి దృష్టి మళ్లించేందుకు ఎన్నో జిమ్మిక్కులు చేశారు.1970దశకం తరువాత గత ఏడాది నిరుద్యోగ శాతం 6.1శాతానికి పెరిగి పాత రికార్డును బద్దలు కొడితే ఇప్పుడు మొత్తంగా 8.2శాతానికి, పట్టణ ప్రాంతాల్లో 9.4శాతానికి చేరిందని తాజా పరిశీలనలు వెల్లడించాయి. వుద్యోగాలు ఎంత మందికి కల్పించారు అని అడిగితే లెక్కలు సరిగా వేయటం లేదు అని ఒకసారి, పకోడీలు తయారు చేయటం కూడా వుపాధి కల్పనే వాటన్నింటినీ కూడి తరువాత చెబుతామంటూ మోడీ దాటవేశారు. ఇంతవరకు లెక్కలు చెప్పలేదు. కొత్త వుద్యోగాలు కల్పించకపోగా వున్న వుద్యోగాలు కూడా పోతున్నాయని, ఆర్ధిక వ్యవస్ధ మాంద్యంలోకి జారుతోందనే సూచనలు కనిపిస్తున్నాయి. పలుకే బంగారమాయెగా అన్నట్లు అసలేం జరుగుతోందో చెప్పటానికి మోడీ నోరు విప్పటం లేదు. బ్యాంకులకు పని గట్టుకొని రుణాలు ఎగవేసినట్లుగా ముఖ్య విషయాలపై మౌనం ఒక ప్రధాన సమస్యగా మారింది అంటే అతిశయోక్తి కాదు. ప్రజాస్వామ్యంలో ఒక దేశాధినేత లేదా ప్రభుత్వ తీరు తెన్నుల గురించి మీడియా శల్యపరీక్ష చేయాల్సి వుంది. జర్నలిస్టులు, మీడియా ఈ విషయంలో శక్తిహీనులైతే అది ప్రజాస్వామ్యాన్ని బలహీనపరచటం తప్ప మరొకటి కాదు. విమర్శనాత్మకంగా తమ కలాలు, గళాలను పని చేయించే జర్నలిస్టులు వున్నప్పటికీ మీడియా మొత్తంగా కార్పొరేట్ల చేతిలోకి పోవటంతో యాజమాన్యాలు తొక్కిపడుతున్నాయి. ఇది మరింత ప్రమాదకరం.

Image result for government attack and question of indian media credibility

మూడు సంవత్సరాల క్రితం దేశంలో నల్లధనాన్ని వెలికి తీసేందుకు, అవినీతిని అరికట్టేందుకు పెద్ద నోట్లను రద్దు చేసినట్లు ప్ర్రకటించారు. దాని ఫలితాలు వెంటనే కాదు, తరువాత వస్తాయని నరేంద్రమోడీ చెప్పారు. జిందా తిలిస్మాత్‌ సర్వరోగ నివారిణి అన్నట్లుగా తన చర్యతో అవినీతి మటుమాయం అవుతుందని బల్లగుద్దారు. ఆర్ధికవేత్తలుగా వున్న వారు కూడా ఖాళీ పత్రం మీద సంతకాలు చేసినట్లుగా సమర్ధించారు. ఆ సమయంలో ఒకటీ అరా తప్ప మొత్తంగా మీడియా నిజమే నిజమే అన్నట్లుగా వంత పాడి జనాల్లో భ్రమలను పెంచింది తప్ప ప్రపంచంలో ఎక్కడైనా ఇలాంటి చర్యలతో అవినీతి తగ్గిందా అనే చర్చకు తెరతీయలేదు. విషాదం ఏమిటంటే త్వరలో పెద్ద నోట్ల రద్దు మూడో వార్షికోత్సవానికి సిద్దం అవుతున్నాము. ఈ కాలంలో నరేంద్రమోడీ దాని గురించి ఒక్కసారి కూడా ఎందుకు నోరు విప్పలేదో ఏ మీడియా అయినా అడిగిందా, ఏ జర్నలిస్టు అయినా ధైర్యం చేశారా? ఏ ఆర్ధిక వేత్త అయినా తాము చెప్పింది తప్పని చెంపలు వేసుకున్నారా?

పుల్వామా వుగ్రదాడి తరువాత మన సైనిక దళాలు బాలాకోట్‌ పట్టణం మీద మెరుపుదాడి చేసి వందల మంది వుగ్రవాదులను మట్టుబెట్టినట్లు మీడియాకు చెప్పారు. అందుకు రుజువు ఏమిటని అడిగిన రాజకీయపార్టీలను దేశద్రోహులు, మన సైనిక సామర్ధ్యాన్ని అవమానిస్తున్నారంటూ మనోభావాలను రెచ్చగొట్టి బిజెపి, దాని సోదర సంస్ధలు జనాన్ని వుసిగొల్పాయి. అది రాజకీయ క్రీడలో భాగం అనుకోండి. మీడియా ఎలాంటి తటపటాయింపులు లేకుండా ఒకదానితో మరొకటి పోటీపడి ఆ ప్రచారాన్ని తలకెత్తుకొని యుద్దోన్మాదాన్ని, దాన్ని వ్యతిరేకించిన వారిపై వ్యతిరేకతను రెచ్చగొట్టటాన్ని చూశాము. అధికార రాజకీయ పక్షానికి, మీడియా వైఖరికి తేడా చెరిగిపోయింది. రాయిటర్స్‌, ఇతర అంతర్జాతీయ మీడియా సంస్ధలు మాత్రమే ప్రభుత్వ, అధికారపక్ష ప్రచారాన్ని సవాలు చేశాయి. ఫలితంగా దేశీయ మీడియా విశ్వసనీయత ప్రశ్నార్ధకంగా మారింది.

ఆర్ధిక వ్యవస్ధ అభివృద్ధి రేటు గురించి ఎన్నికలకు ముందు మార్చినెలలో వందకు పైగా ఆర్ధికవేత్తలు రాసిన ఒక బహిరంగలేఖను మీడియా విస్మరించిది. వార్త ముగింపులో ఫలానా వారు కూడా ప్రసంగించారు అని రాసినట్లుగా మోడీ సర్కార్‌ చెప్పుకుంటున్న అభివృద్ధిని తమ లేఖలో ప్రశ్నించారు అన్నట్లుగా వార్తలు ఇచ్చాయి. ఇప్పుడు ప్రభుత్వమే అసలు విషయాలను బయటపెట్టాల్సి వస్తోంది. మీడియా దాన్ని పాఠకులకు అందించే సమయంలో గతంలోనే ఫలానా ఆర్ధికవేత్తలు సర్కార్‌ ప్రచారాన్ని ప్రశ్నించారు అని రాయటానికి చేతులు, చెప్పటానికి నోరు రావటం లేదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే తమ మనుగడకోసం విధిలేక కొన్ని అంశాలను వెల్లడించాల్సి రావటం తప్ప ఎక్కువ భాగం జాతీయ, ప్రాంతీయ మీడియా సంస్ధలు పాలకపార్టీల బాకాలుగా మారాయి.

ఒక ప్రధానిగా ఇంతవరకు నరేంద్రమోడీ పత్రికా గోష్టి పెట్టలేదు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు కొద్ది రోజుల్లో వెలువడ నుండగా బిజెపి ప్రధాన కార్యాలయంలో ఒక పత్రికా గోష్టి నిర్వహించారు. ముందే తయారు చేయించిన ఒక ప్రకటన విడుదల చేసి పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా పక్కన చిరునవ్వులు చిందిస్తూ మోడీ కూర్చున్నారు, విలేకర్ల ప్రశ్నలకు అమిత్‌ షా సమాధానం చెప్పారు. చూశారా ప్రధాని అయ్యుండి కూడా పార్టీ అధ్యక్షుడికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో అంటూ దాన్ని కూడా మోడీ ఘనతగా మీడియా చిత్రించింది.ఎన్నికల సమయంలో మోడీతో ప్రత్యేక ఇంటర్వ్యూల పేరుతో జాతీయ మీడియా సంస్ధలు గంటల తరబడి ప్రత్యక్ష ప్రసారాలు నిర్వహించాయి. అలాంటి అవకాశం ప్రతిపక్ష పార్టీలకు ఇవ్వని కారణంగా అదంతా అధికారపక్ష ఆర్ధిక పాకేజీల్లో భాగమని జనం అనుకున్నారు. లాలూచీ కుస్తీ మాదిరి ఇంటర్వ్యూలు సాగాయి తప్ప విమర్శనాత్మక ప్రశ్నలు ఒక్కటీ వేయలేదు. ఎన్నికల సమయంలో విమర్శనాత్మకంగా వార్తలిచ్చిన హిందూ, టెలిగ్రాఫ్‌, టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా పత్రికలకు రెండోసారి అధికారానికి వచ్చిన తరువాత మోడీ సర్కార్‌ ప్రభుత్వ ప్రకటనల జారీలో కోత పెట్టిందని రాయిటర్స్‌ పేర్కొన్నది. 2002లో మీడియా స్వేచ్చలో 139దేశాల్లో మన స్ధానం 80వది, అలాంటిది తాజాగా సరిహద్దులు లేని విలేకర్ల సంస్ధ ప్రకటించిన 180 దేశాల్లో మనది 140వ స్ధానం. నిత్యం హింసా వాతావరణం వుండే దేశాలకంటే మనది దిగువన వుంది అని చెప్పుకోవాల్సి రావటం సిగ్గు చేటు.

1975లో నాటి కాంగ్రెస్‌ ప్రధాని ఇందిరా గాంధీ అత్యవసర పరిస్ధితిని ప్రకటించినపుడు దేశంలో ఏం జరుగుతోందో తెలుసుకోవాలంటే జనం బిబిసి రేడియో మీద ఆధారపడాల్సి వచ్చింది. ఎదిరించిన మీడియాను అణచివేస్తే లొంగిపోయిన మీడియా ప్రభుత్వ బాకాగా మారిపోయింది. ఇప్పుడు దేశంలో అత్యవసర పరిస్ధితి లేదు. అయినా కాశ్మీరులో ఏం జరుగుతోంది అని తెలుసుకోవాలంటే జాతీయా మీడియాతో ఫలితం లేదని తేలిపోయింది. నాటి అత్యవసర పరిస్ధితిలో మాదిరి తిరిగి నేడు కాశ్మీర్‌లో వేలాది మందిని అరెస్టు చేశారనే వార్తల కోసం విదేశీమీడియాను, ఇంటర్నెట్‌ను ఆశ్రయించాల్సి వస్తోంది. అలాంటి ఆసక్తి ఎందరికి , అందరిలో వుండే అవకాశం లేదు, అందువలన హిజ్‌మాస్టర్‌ వాయిస్‌ లేదా రాణీగారీ ప్రతిపక్షం మాదిరి మన మీడియా అందిస్తున్న అంతా బాగుంది వార్తలనే చదవటం, చూడాల్సి వస్తోంది. జమ్మూకాశ్మీర్‌ను మొత్తంగా మూసివేసిన మోడీ సర్కార్‌ చర్యను ఏ విదేశీ నేత కూడా ప్రశ్నించలేదు కదా అనే వాదనను మన మీడియా ముందుకు తెస్తోంది. నాణానికి రెండోవైపు చూస్తే ఏ నేత ఏ దేశం కూడా సమర్ధించిన దాఖలా కూడా లేదు. మన దేశంతో వున్న ఆర్ధిక సంబంధాలు, మార్కెట్‌ మీద ఆశతో విదేశాలేవీ మన సర్కార్‌తో ఘర్షణపడేందుకు సిద్దంగా లేవు.

భారత్‌లో పత్రికలు, టీవీ ఛానల్స్‌ పైకీ కిందికీ గంతులు వేస్తూ కేరింతలు కొడుతున్నాయని కాశ్మీర్‌లో పరిస్ధితి గురించి అంతర్జాతీయ పత్రిక ఎకానమిస్టు పేర్కొన్నది. విదేశీ మీడియా ఛానల్స్‌ కధనాల మీద దాడి చేయటంలో సామాజిక మాధ్యమంలో ప్రభుత్వ అనుకూల మరుగుజ్జుల(ట్రోల్స్‌)తో పాటు, సాంప్రదాయక మీడియాలో పని చేస్తున్న జర్నలిస్టులు కూడా తోడవుతున్నారు. ప్రతిపక్ష పార్టీల ప్రతినిధులను కాశ్మీర్‌లో ప్రవేశించకుండా ప్రభుత్వం అడ్డుకోవటాన్ని మీడియా దాదాపుగా సమర్దించిందని బ్లూమ్‌బెర్గ్‌ వ్యాఖ్యానించింది. ఆర్టికల్‌ 370ని రద్దు చేస్తామని తమ ఎన్నికల ప్రణాళికల్లో ఎప్పటి నుంచో చెబుతున్నామని బిజెపి చెబుతోంది. దాని మంచి చెడ్డల గురించి ఇప్పటికే ఎంతో చర్చ జరిగింది కనుక కాసేపు పక్కన పెడదాము. కాశ్మీర్‌ రాష్ట్రాన్ని రద్దు చేస్తామని, రెండుగా చేసి కేంద్ర పాలిత ప్రాంతాలుగా మారుస్తామని, ఆప్రక్రియకు ముందూ, తరువాత దాన్ని మొత్తంగా బహిరంగ జైలుగా మారుస్తామని, కమ్యూనికేషన్‌ వ్యవస్ధను మూలన పడేస్తామని బిజెపి ఎక్కడా ముందు చెప్పలేదు కదా ? దీన్ని గురించి మన మీడియా ఎన్నడైనా ప్రశ్నించిందా ? ప్రభుత్వ చర్యలను ప్రశ్నించే గళాలకు చోటు ఇస్తోందా ? కాశ్మీర్‌పై తీసుకున్న చర్యలకు మద్దతుగా మీడియాలో ఇచ్చిన కవరేజి, దేశవ్యాపితంగా దిగజారుతున్న ఆర్ధిక వ్యవస్ధ మంచి చెడ్డల గురించి వివరించేందుకు కేటాయిస్తున్న సమయం, స్ధలం ఎంత ?.

కాశ్మీరు ఒక పంజరం అనే ఒక డాక్యుమెంటరీని ప్రదర్శించేందుకు ఢిల్లీ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వం వత్తిడి తీసుకురావటంతో క్లబ్‌ నిర్వాహకులు ఆ కార్యక్రమాన్ని రద్దుచేశారు. అదే విధంగా సంత్‌ రవిదాస్‌ దేవాలయ కూల్చివేతకు నిరసనగా కొన్ని సంస్ధల వారు ఢిల్లీలోని మహిళా జర్నలిస్టుల క్లబ్బులో పత్రికా గోష్టి నిర్వహించేందుకు హాలును అద్దెకు తీసుకున్నారు. ప్రభుత్వం క్లబ్‌ నిర్వాహకుల మీద వత్తిడి తీసుకువచ్చి అనుమతిని రద్దు చేయించింది.1992లో బాబరీ మసీదును కూల్చివేయటాన్ని ఖండిస్తూ అనేక మంది పారిశ్రామికవేత్తలు పత్రికలకు ఇచ్చిన యాడ్స్‌లో తమ పేర్లను నమోదు చేసుకున్నారని, ఇప్పుడు కాశ్మీర్‌ విషయంలో అలా బహిరంగంగా వ్యతిరేకతను వ్యక్తం చేసేందుకు భయపడుతున్నారని చరిత్రకారుడు రామచంద్ర గుహ వ్యాఖ్యానించారు. 2015లో అద్వానీ, ఆయనేమీ మోడీ అభిమాని కాదు, వెంటనే గాకపోయినా త్వరలో దేశంలో మరో అత్యవసర పరిస్ధితిని ప్రకటిస్తే తాను ఆశ్చర్యపోనని చెప్పారు.అది తీవ్రమైన అనుమానంగానే వుంటుంది, అయితే ఒక విషయం ఖాయం, దాన్ని సమర్ధించేందుకు మీడియా సిద్దంగా వుంటుంది అని ఎకానమిస్ట్‌ పేర్కొన్నది.

డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ను మౌన మునిగా వర్ణించిన నరేంద్రమోడీ అండ్‌ కో ఆయన మాదిరిగా కూడా నోరు విప్పిన పాపాన పోలేదు. సామాజిక మాధ్యమం గురించి జరిపిన పరిశీలనలో 201-18 మధ్య సోషల్‌ నెట్‌వర్క్‌ల సంఖ్య 16.8 కోట్ల నుంచి 32.6 కోట్లకు పెరిగింది. వీటి ద్వారా పాలక బిజెపి అర్ధసత్యాలు, అసత్యాలను పెద్ద ఎత్తున ప్రచారంలోకి తెచ్చింది. వాటికి సమాధానం చెప్పేందుకు ప్రయత్నించిన జర్నలిస్టుల మీద ప్రచారదాడులు జరుగుతున్నాయి. భారత సంస్కృతి పరిరక్షణ, వున్నతి గురించి సుద్దులు చెప్పిన నోళ్లతోనే మహిళా జర్నలిస్టులను నోరు బట్టని బూతులు తిట్టటం, మానభంగాలు చేస్తామని బెదిరింపులు కూడా సాగించిన, సాగిస్తున్న వుదంతాలు తెలిసిందే. విమర్శకుల నోరు మూయించే ఆయుధాలుగా సామాజిక మాధ్యమాలను ప్రయోగిస్తున్నారు. ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకించిన, విమర్శించిన వారిని దేశద్రోహులుగా, పాకిస్ధాన్‌, చైనా ఏజంట్లుగా, వుగ్రవాదుల మద్దతుదారులుగా ముద్రవేశారు. స్వాతి చతుర్వేది అనే జర్నలిస్టు బిజెపికి చెందిన వారు ఎలా ఈ ప్రచార దాడిని సాగిస్తున్నారో ఒక పుస్తకంలో వివరించారు. తమ పట్ల విమర్శనాత్మకంగా వ్యవహరించే ఛానల్స్‌,పత్రికల యాజమాన్యాల మీద సిబిఐ, ఇడి వంటి సంస్ధలతో దాడులు చేయించటం, ప్రభుత్వ ప్రకటనలు నిలిపివేయటం, అధికారపక్షం నుంచి చర్చలను బహిష్కరించటం వంటి చర్యలు సర్వసాధారణం అయ్యాయి.

తమ ప్రభుత్వం సాధించిన విజయాల గురించి గొప్పలు చెప్పుకొనేందుకు మీడియాను నరేంద్రమోడీ ఎలా వుపయోగించుకున్నారో 2018లో ఒక వుదంతం వెల్లడించింది. చత్తీస్‌ఘర్‌కు చెందిన ఒక గిరిజన మహిళా రైతుతో నరేంద్రమోడీ మాట్లాడినదానిని ప్రత్యక్ష ప్రసారం చేశారు. ధాన్యం బదులు సీతాఫలాలను పండించటం ద్వారా తన ఆదాయం రెట్టింపు అయిందని ఆ మహిళ చెప్పింది. అయితే దాని గురించి అనుమానం వచ్చిన ఎబిపి ఛానల్‌ ప్రతినిధులు ఆ మహిళ వద్దకు వెళ్లి విచారించగా అలా చెప్పాలని బిజెపి నేతలకు తనకు చెప్పినట్లు ఆమె వెల్లడించింది. ఈ వార్తను మాస్టర్‌ స్ట్రోక్‌ కార్యక్రమాన్ని నిర్వహించే పుణ్య ప్రసూన్‌ వాజ్‌పేయి ప్రసారం చేయటంతో ప్రధాని పరువుపోయింది. దాంతో కక్ష గట్టిన ప్రభుత్వం రామ్‌దేవ్‌ బాబా కంపెనీ పతంజలితో సహా దాదాపు వంద కోట్ల రూపాయల విలువగల అనేక ప్రయివేటు కంపెనీల వాణిజ్య ప్రకటనలను ఆ ఛానల్‌కు నిలిపివేయాలని వత్తిడి తెచ్చింది. దాంతో యాజమాన్యం ఆ జర్నలిస్టును బలవంతంగా రాజీనామా చేయించి ప్రభుత్వాన్ని తృప్తి పరచింది. తన కార్యక్రమంలో మోడీ ప్రస్తావన రాకుండా చూడాలని యాజమాన్యం ఆదేశించిందని, మీడియాలో మోడీ గురించి వస్తున్న వార్తల తీరుతెన్నులను విశ్లేషించేందుకు రెండు వందల మందితో ప్రభుత్వం ఒక విభాగాన్ని ఏర్పాటు చేసిందని, అక్కడి నుంచి మోడీ గురించి ఏమి చెప్పాలో, ఎలా చెప్పాలో సంపాదకులకు ఆదేశాలు వెళతాయని ప్రసూన్‌ వాజ్‌పేయి వెల్లడించారు. దేశంలో విద్వేష నేరాలు ఎలా పెరుగుతున్నాయో తెలిపేందుకు హిందూస్ధాన్‌ టైమ్స్‌లో ఒక పర్యవేక్షణ ప్రారంభించిన బాబీ ఘోష్‌ అనే జర్నలిస్టు పని తీరు ప్రభుత్వానికి నచ్చలేదంటూ యాజమాన్యంపై వత్తిడి తేవటంతో అతను రాజీనామా చేసి ఇంటికిపోవాల్సి వచ్చింది. ఆ తరువాత ఆ పత్రిక ఆ పర్యవేక్షణను నిలిపివేసింది. లైసన్సు రాజ్యం అంటూ కాంగ్రెస్‌ను తీవ్రంగా విమర్శించే బిజెపి ఆ విషయంలో తక్కువేమీ తినలేదు. టీవీ ఛానల్స్‌ ప్రారంభానికి కేంద్ర ప్రభుత్వ అనుమతి అవసరం. బిజెపి ఎంపీ యాజమాన్యంలో, బిజెపి అనుకూల ఆర్నాబ్‌ గోస్వామి నిర్వహణలో రిపబ్లిక్‌ టీవీకి అలా దరఖాస్తు చేయగానే ఇలా అనుమతి ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. అయితే మోడీ సర్కార్‌ పట్ల విమర్శనాత్మకంగా వుండే రాజీవ్‌ బహాల్‌ నిర్వహణలో బ్లూమ్‌బెర్గ్‌ క్వింట్‌ సంస్ధ దరఖాస్తు చేసి రెండు సంవత్సరాలు గడిచినా ఎటూ తేల్చలేదు.

Image result for government attack and question of indian media credibility

దేశంలో అతి పెద్ద పారిశ్రామిక సంస్ధ రిలయన్స్‌, దాని యజమాని ముకేష్‌ అంబానీ పెద్ద సంఖ్యలో అన్ని భాషలల్లో ఛానళ్లను ప్రారంభించటం లేదా కొనుగోలు చేసి పెద్ద మీడియా అధిపతిగా మారిన విషయం తెలిసిందే. తన వ్యాపారాలకు ఎలాంటి నష్టం జరగకుండా అధికారంలో ఎవరుంటే వారికి మద్దతుగా పెద్ద ఎత్తున ప్రచార అవకాశాలు కల్పించటం, విమర్శలకు దూరంగా వాటిని నిర్వహిస్తారు. కోబ్రాపోస్ట్‌ నిర్వహించిన ఒక శూల శోధనలో టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా, ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌, ఇండియా టుడే వంటి బడా సంస్ధలతో పాటు 25 మీడియా సంస్ధల ప్రతినిధులు మాట్లాడుతూ ఇచ్చే సొమ్మును బట్టి బిజెపికి ప్రచారంతో పాటు మతపరమైన విద్వేషాన్ని కూడా రెచ్చగొట్టేందుకు సిద్దం అని చెప్పిన విషయాలు వెల్లడయ్యాయి. అంటే మన మీడియా సంస్ధలు డబ్బుకోసం ఎంతకైనా తెగించటానికి సిద్దపడుతున్నాయి.అయితే అన్నీ ఇలాంటి సంస్ధలే లేవు. హిందూ పత్రిక, ఎన్‌డిటివీ వంటి న్యూస్‌ ఛానల్స్‌, వైర్‌, స్క్రోల్‌, బూమ్‌లైవ్‌, న్యూస్‌ మినిట్‌, ఆల్ట్‌న్యూస్‌ వంటి వెబ్‌ మీడియా సంస్ధలు వాస్తవాలను వెల్లడించటానికి వెనుకాడటం లేదు. అలాంటి సంస్ధలు వెల్లడించిన కుంభకోణాలు, అక్రమాల మీద వందల కోట్ల రూపాయల మేర నేరపూరిత పరువు నష్టదావాలను వేస్తూ వాటి నోరు మూయించే ప్రయత్నం జరుగుతున్నది. అలాంటి సంస్ధలకు ఆదాయాలు పరిమితం, ప్రభుత్వ దాడులను తట్టుకొని అవి ఎంత కాలం నిలబడగలవు అన్నది శేష ప్రశ్న.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

పరువు నష్టం కేసులతో మీడియా నోరు నొక్కే దుష్టయత్నం !

15 Tuesday Aug 2017

Posted by raomk in Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS

≈ Leave a comment

Tags

Attack on media, attacks on journalists, bully, defamation cases on media, EPW, free speech, journalism, Media, Samiksha trust, silence, SLAP

ఎం కోటేశ్వరరావు

భావ ప్రకటనా స్వేచ్చ మానవులకు పుట్టుకతో వచ్చిన హక్కు. భూమ్మీద పడగానే గాలి పీల్చుకోవటంతో కేరు మంటూ ప్రారంభమయ్యే స్వేచ్చా గళం తిరిగి అంతిమంగా శ్వాస తీసుకోవటం ఆగినపుడే మూతపడుతుంది. అలాంటి పుట్టుకతో వచ్చిన హక్కును హరించేందుకు మధ్యలో ఎవరు ప్రయత్నించినా దానిని ఏదో ఒక రూపంలో ప్రతిఘటించటమే సజీవ మానవ లక్షణం.

కుక్క పిల్లా, సబ్బు బిళ్లా, తలుపు గొళ్లెం, హారతి పళ్లెం కాదేదీ కవిత కనర్హం……… హీనంగా చూడకు దేన్నీ కవితామయమేనోయ్‌ అన్నీ అని మహాకవి శ్రీశ్రీ చెప్పారు. అలాగే భావ ప్రకటనా స్వేచ్చను హరించటానికి నియంతలు,పోలీసులు, గూండాలు, కార్పొరేట్లు కావేవీ మినహాయింపు, ఏదీ తక్కువ కాదు అని చెప్పుకోవాల్సిన రోజులచ్చాయి. నియంతలు ఏదో ఒకసాకుతో లంగని మీడియా సంస్ధలను పూర్తిగా మూతవేయించటానికి ప్రయత్నిస్తారు. గూండాలు పశుబలాన్ని వుపయోగిస్తే, పోలీసులు, కార్పొరేట్లు చట్టాలను రక్షణగా తీసుకొని స్వేచ్చ, ప్రజాస్వామ్యాన్ని హరించటానికి ప్రయత్నిస్తాయి.

ఇటీవలి కాలంలో అధికార రాజకీయాలు నడిపే శక్తులు తమకు లంగని రాజకీయ ప్రత్యర్ధుల ఆర్ధిక మూలాలను దెబ్బతీయటం ద్వారా వారిని తమ దారికి దారికి తెచ్చుకోవటం ఒక ముఖ్యపరిణామం. దాని ఫలితమే ఎవరు ఏ పార్టీ తరఫున ఎన్నికవుతారో, ఏక్షణంలో పార్టీ మారతారో తెలియని స్ధితి. కార్పొరేట్‌ సంస్ధలు ఒక దశలో స్వయంగా మీడియా సంస్ధలను ప్రారంభించటం ఒక పరిణామమైతే, తమ ప్రయోజనాలకు సహకరించని ఇతర వాటిని ఆర్ధికంగా దెబ్బతీయటం రాజకీయాలలో మాదిరి మరో సరికొత్త కొత్త ధోరణి. అది సంస్ధలకే పరిమితం కాలేదు, వ్యక్తులకు, శక్తులకు, మీడియాయేతర సంస్ధలను కూడా తమ దారికి తెచ్చుకొనేందుకు పైన పేర్కొన్న శక్తులన్నీ పూనుకున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా తుందుర్రులో వుపాధి,వ్యవసాయం, ఆరోగ్యం, పర్యావరణాన్ని దెబ్బతీసే రొయ్యల ఫ్యాక్టరీ ఏర్పాటుకు వ్యతిరేకంగా ఆ గ్రామం, పరిసర ప్రాంతాల జనం వుద్యమిస్తే వారిని అణచివేసేందుకు సంబంధిత పారిశ్రామికవేత్తలు గూండాలు, పోలీసులు, అధికారయంత్రాంగం, మంత్రులు, వాణిజ్యమీడియాను ఎలా వుపయోగించుకున్నదీ ప్రత్యక్షంగా చూశాము. వారి కుమ్మక్కును బహిర్గతం చేసేందుకు కొందరు జర్నలిస్టులు సిద్ధంగా వున్నా మీడియా యాజమాన్యాలు వారి నోరు నొక్కుతున్నాయి. వాస్తవాలకు మీడియాలో చోటు కల్పించటం లేదు.

వాణిజ్య, పారిశ్రామికవేత్తలకు లాభం కలిగించేందుకుాతద్వారా తాము లబ్ది పొందేందుకు అధికారంలో వున్న పార్టీలు, వారి చెప్పుచేతల్లో పనిచేసే అధికార గణం నిబంధనలను ఎలా కావాలనుకుంటే అలా మార్చటం, తమకు అనువైన టీకాతాత్పర్యాలు చెప్పటం చూశాము. ప్రకాశం జిల్లా దేవరపల్లిలో చెరువులు తవ్వాలనే పేరుతో తమకు ఓటు వేయని దళితుల భూములను ఆక్రమించేందుకు, వ్యవసాయానికి పనికిరాకుండా చేసేందుకు రాత్రికి రాత్రి ఒక శత్రుదేశంపై దాడి మాదిరి జనాన్ని బయటకు రానివ్వకుండా చేసి, పెద్ద సంఖ్యలో యంత్రాలను ప్రయోగించి ఎలా తవ్వించిందీ లోకం చూసింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో !

ప్రధాని నరేంద్రమోడీ, బిజెపికి అత్యంత సన్నిహితుడైన వాణిజ్య, పారిశ్రామికవేత్త అదానీ. అతని గ్రూపు కంపెనీలకు లబ్ది చేకూర్చేందుకు మార్చిన నిబంధనలు, పన్నుఎగవేత తీరుతెన్నుల గురించి ఎకనమిక్‌ అండ్‌ పొలిటికల్‌ వీక్లీ (ఇపిడబ్ల్యు) జూన్‌ నెలలో రెండు పరిశోధనాత్మక విశ్లేషణలను ప్రచురించింది. వాటిని వెబ్‌ నుంచి వెంటనే వుపసంహరించని పక్షంలో తాము పరువు నష్టం దావా వేస్తామని అదానీ గ్రూపు లాయర్‌ నోటీసులు జారీ చేసింది. దానికి సమాధానంగా సంపాదకుడు పరంజయ గుహ థాకూర్దా ఒక లాయర్‌ను ఏర్పాటు చేసి సమాధానం పంపారు. ఈలోగా ఆ పత్రికను నడుపుతున్న సమీక్షా ట్రస్టు పాలకవర్గం వెంటనే ఆవిశ్లేషణలను తొలగించాలని ఆదేశించటంతో దానికి నిరసనగా పరంజయ్‌ రాజీనామా చేశారు. ఈ పరిణామంతో ఆ పత్రిక యాజమాన్య ట్రస్టు గురించి ఎంతో వున్నతంగా వూహించుకున్న అనేక మంది హతాశులై పత్రిక ప్రతిష్టను పునరుద్దరించాలని ఒక బహిరంగ లేఖ రాశారు. భారతీయ మీడియాలో ఇలాంటి పరిణామం బహుశా ఇదే ప్రధమం. అనేక సంస్ధల యాజమాన్యాలు పాలేర్లను మార్చినట్లు సంపాదకులను మార్చటం చూశాము. అయితే అవన్నీ తెరవెనుక పరిణామాలకే పరిమితం అయ్యాయి. కానీ ఇపిడబ్ల్యు వుదంతం అలాంటి కాదు, అలా జరగలేదు.

కార్పొరేట్ల అక్రమాలు, అన్యాయాలకు వ్యతిరేకంగా వుద్యమించిన సంస్ధలు, వ్యక్తులు, శక్తులు, వాటిని బయట పెట్టిన జర్నలిస్టులను కేసులు ముఖ్యంగా భారీ మొత్తాల ప్రమేయం వున్న పరువు నష్టం, తదితర కేసులతో వేధించటం ప్రపంచవ్యాపితంగా జరుగుతోంది. కార్పొరేట్‌ సంస్ధలు ఎప్పుడైతే దేశ రాజకీయాలను శాసించేంత బలంగా తయారయ్యాయో ఆ పరిణామం మన దేశంలో కూడా వేగవంతమైంది. ఆంగ్లంలో స్ట్రాటజిక్‌ లా సూట్‌ ఎగైనెస్ట్‌ పబ్లిక్‌ పార్టిసిపేషన్‌ అనేదాన్ని పొట్టిగా ‘స్లాప్‌’ అంటున్నారు. జన భాగస్వామ్యానికి వ్యతిరేకంగా వ్యూహాత్మక న్యాయపరమైన దావా అని తెలుగులో చెప్పవచ్చు. ఇలాంటి దావాలు కోర్టు విచారణలో నిలుస్తాయా లేదా అన్నదానిని కార్పొరేట్‌ సంస్ధలు పట్టించుకోవు. తమను వుతికి ఆరవేస్తున్నవారిని ముందుకు పోకుండా చేయటమే ప్రధాన లక్ష్యం. అందుకు గాను పెద్ద మొత్తం పరువు పరిహారాన్ని కోరటం, క్రిమినల్‌ కేసులు పెట్టటం ప్రధానంగా జరుగుతుంది. వాటిని ఎదుర్కొనేందుకు పెద్ద మొత్తంలో న్యాయవాదులకు డబ్బులిచ్చి కోర్టులలో పోరాడటం సామాన్యులకు సాధ్యమయ్యేది కాదు కనుక ఇలాంటి బెదిరింపులు ప్రతి దేశంలో సర్వసాధారణమయ్యాయి. గ్రీన్‌పీస్‌ అనే సంస్ధ నోరు మూయించటానికి ఒక కేసులో 30కోట్లు, మరోకేసులో 70లక్షల డాలర్ల పరిహారానికి కేసులు నమోదు చేశారు. ‘స్లాప్‌’ కేసులు బనాయించకుండా చూసేందుకు పరిమిత దేశాలు మాత్రమే ప్రయత్నిస్తున్నాయి. ఇదే సమయంలో ఈ కేసులు పెరిగిపోతూనే వున్నాయి.

పశ్చిమ గోదావరిలో ఒక నాడు ఒక సన్నకారు రైతుగా వుండి తరువాత కాలంలో ఆఫ్రికాలో, మన దేశంలోని బెంగళూరులో ఒక పెద్ద వ్యాపార సంస్ధగా ఎదిగిన కరుటూరి గ్లోబల్‌ యాజమాన్య కార్యకలాపాల గురించి కేయ ఆచార్య అనే ఒక పర్యావరణ జర్నలిస్టు రాసిన వ్యాసాన్ని ఇంటర్‌ ప్రెస్‌ సర్వీసు(ఐపిఎస్‌) ప్రచురించింది. దాని వలన కలిగిన తమ పరువు నష్టంగా వందకోట్ల రూపాయలు చెల్లించాలని 2014 ఆగస్టు ఐదున ఆ సంస్ధ ఎండీ శాయి రామకృష్ణ కరటూరి ఒక నోటీసు పంపారు. కంపెనీ తూర్పు ఆఫ్రికాలో నిర్వహిస్తున్న కార్యకలాపాలు భారత్‌లోని గులాబి సాగుపై ఎలాంటి ప్రభావం చూపిందో ఆ జర్నలిస్టు తన విశ్లేషణలో పేర్కొన్నారు. ఆమెకు నోటీసు అందగానే ఆ విశ్లేషణను తన వెబ్‌సైట్‌లో ప్రచురించిన ఐపిఎస్‌ సంస్ధ వెంటనే ఒక ప్రకటన చేసింది. జర్నలిస్టు రాసిన విశ్లేషణలోని అంశాలను, వార్తా వనరు గురించి నిర్ధారించుకొనేందుకు గాను ఆ వ్యాసాన్ని పక్కన పెడుతున్నామని, తమ సంస్ధ నుంచి వార్తలను కొనుగోలు చేస్తున్న ఖాతాదారులు దానిని ఏ రూపంలోనూ తిరిగి ప్రచురించవద్దని దానిలో పేర్కొన్నది. ఈ నోటీసు తనను బెదిరించేందుకు మాత్రమే కాదని భవిష్యత్‌లో ఆఫ్రికాలో కరుటూరి కంపెనీ కార్యకలాపాల జోలికి పోకుండా మౌనం వహించేందుకు కూడా వుద్దేశించిందని శ్రేయ ఆచార్య పేర్కొన్నారు.

కాలం చెల్లిన పరువు నష్టం చట్టాలను ఇంకా మన దేశంలో కొనసాగించటం స్వేచ్చా గళాలను అణచివేయటానికి సాధనాలుగా చేసుకొనేందుకు అనుమతించటం దారుణం. పరువు నష్టం కేసుల వివరాలను పరిశీలిస్తే బెదిరించటానికే వాటిని వుపయోగిస్తున్నట్లు వెల్లడి అయింది. పెద్ద మొత్తం పరిహారం కోరుతూ జర్నలిస్టులకు నోటీసు పంపితే రాసిన వాటిని వెనక్కు తీసుకోవటమో లేదా తదుపరి రాయకుండా చేయటమో జరుగుతోందని తేలింది. తాజా వుదంతం ఇపిడబ్ల్యు సంపాదకుడు పరంజయ గుహ థాకూర్ధా విషయంలో కూడా దీన్ని గమనించవచ్చు. పరంజయ్‌ గుహ, సుబీర్‌ ఘోష్‌, జ్యోతిర్మయ్‌ చౌదరి ‘గ్యాస్‌ వార్స్‌-క్రోనీ కాపిటలిజం అండ్‌ అంబానీస్‌’ అనే పేరుతో పుస్తకం రాశారు. దానిలో సహజవాయు ధర నిర్ణయంలో జరిగిన అక్రమాలను వివరించారు. ఆ పుస్తకం వెలువడగానే ఆ పుస్తకాన్ని రాసినందుకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని, దానిని వెబ్‌సైట్‌నుంచి తొలగించాలని, విక్రయాలు, ముద్రణలను నిలిపివేయాలని లేకుంటే సివిల్‌, క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామని అంబానీ సోదరులు నోటీసులు జారీ చేశారు. రచయితలు కూడా వాటికి లీగల్‌గానే సమాధానాలు పంపారు. తరువాత అంబానీల వైపు నుంచి ఎలాంటి కదలికలు లేవు. ఇలాంటి వాటికి తాము భయపడలేదని రచయితలలో ఒకరైన ఘోష్‌ వ్యాఖ్యానించారు.తమను బెదిరించటానికి, వేధించటానికే ఈ నోటీసులు జారీ చేశారని థాకూర్ధా వ్యాఖ్యానించారు.

సహారా గ్రూపు అధిపతి సుబ్రతారాయ్‌ కూడా సహారా: అన్‌ టోల్డ్‌ స్టోరీ పేరుతో మింట్‌ పత్రిక డిప్యూటీ మేనేజింగ్‌ ఎడిటర్‌గా వున్న తమల్‌ బందోపాధ్యాయ, పుస్తక ప్రచురణ సంస్ధ జైకో పబ్లిషింగ్‌ హౌస్‌పై రెండువందల కోట్ల రూపాయల మేరకు పరువు నష్టం దావా వేశాడు. సహారా సంస్ధ లావాదేవీలు, అది ఎదుర్కొంటున్న చట్టపరమైన సమస్యల గురించి దానిలో వివరించారు. దాని విడుదలపై కొల్‌కతా హైకోర్టు స్టే విధించింది. తరువాత వుభయ పక్షాలూ కోర్టు వెలుపల వివాదాన్ని పరిష్కరించుకున్నాయి. ఆపుస్తకంలో పరువుకు భంగం కలిగించే అంశాలున్నాయని, సహారా సంస్ధ వాటి గురించి సంతోషంగా లేదనే ప్రకటన కూడా పుస్తకంలో ప్రచురించేట్లు, పుస్తక ప్రచురణ, విడుదలకు అంగీకరిస్తూ ఒప్పందం కుదిరింది. ఒక వ్యక్తిగా అలాంటి పెద్ద సంస్ధలతో పోరాడటం కష్టమని, తనకు మింట్‌ యాజమాన్య మద్దతు వున్న కారణంగానే పోరాడగలిగానని, అన్నింటికంటే తనకు మీడియా ఎంతగానో మద్దతు ఇచ్చిందని, అయినా తన ఆరోగ్యం దెబ్బతిన్నదని రచయిత తమల్‌ బందోపాధ్యాయ చెప్పారు. ఇలాంటి నోటీసులు నిజాయితీగా వార్తలు అందించటాన్ని అడ్డుకొనేందుకే అన్నది వాస్తవం అన్నారు. మింట్‌ పత్రికను ప్రచురిస్తున్న హిందుస్తాన్‌ టైమ్స్‌ సంస్ధపై రిలయన్స్‌ పవర్‌ కూడా మింట్‌ ప్రచురించిన వార్తపై దావా వేసింది. సెబీతో సహారా కంపెనీ వివాదంపై వార్తలు రాసినందుకు మింట్‌ పత్రిక సంపాదకుడిపై ఆ కంపెనీ పాట్నాలో ఒక పరువు నష్టం దావా వేసింది.

ఒక సంస్ధ లేదా ఒక వ్యక్తికి సంబంధించిన వార్త లేదా వ్యాఖ్య ప్రచురితం లేదా ప్రసారమైనపుడు అభ్యంతరకరమైన అంశాలుంటే ముందుగా వాటికి సంబంధించిన వివరణలు లేదా ఖండనలు ఇవ్వాలి. వాటిని మీడియా విస్మరించినపుడు ప్రెస్‌ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేయాలి అక్కడ కూడా న్యాయం జరగలేదని అనిపిస్తే తదుపరి న్యాయపరమైన చర్యలకు పూనుకొనేందుకు ఎవరికైనా హక్కుంటుంది. అయితే దేశంలో జరుగుతున్న పరిణామాలను చూస్తే అందుకు భిన్నంగా జరుగుతోంది. గూండాలు, మాఫియా, ప్రజాప్రతినిధులు లేదా వారి అనుయాయులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని భౌతికదాడులకు పాల్పడుతున్నారు. హత్యలకు కూడా వెనుతీయటం లేదు. పోలీసులు కూడా అత్యధిక సందర్భాలలో వారితో కుమ్మక్కయి జర్నలిస్టులపై ప్రతి కేసులు బనాయించటం లేదా కొన్ని సందర్భాలలో అయితే రౌడీషీట్లను కూడా తెరిచే విపరీత చర్యలకు పాల్పడుతున్నారు. కార్పొరేట్‌ శక్తులు తమ డబ్బు మదంతో భారీ మొత్తాలకు పరువు నష్టం కేసులు వేస్తూ మీడియా సంస్ధలు, జర్నలిస్టుల నోరు నొక్కేందుకు పూనుకోవటం ఏడుపదుల మన ప్రజాస్వామ్య వ్యవస్ధకు పట్టిన దుర్గతి. ఈ స్ధితిలో ఏం చెయ్యాలి అనే సమస్య ఒక్క జర్నలిస్టులకే కాదు యావత్‌ సమాజం ముందున్నది.

ఇపిడబ్ల్యు వుదంతానికి వస్తే అసలు వాస్తవాలేమిటన్నది బయటకు రావాల్సి వుంది. కేవలం ఒక లాయర్‌ నోటీసుకే యాజమాన్యం ఇలాంటి చర్యలకు పూనుకోవటం అనూహ్యం. ఇప్పటి వరకు వెల్లడైన అభిప్రాయాలు, చేసిన ప్రకటనలు అనేక కొత్త సందేహాలను రేకెత్తిస్తున్నాయి. అదానీ లీగల్‌ నోటీసు ట్రస్టును వుద్ధేశించిందని అయితే దాని గురించి తమకు తెలపకుండానే ట్రస్టు తరఫున సమాధానం ఇస్తున్నట్లు పేర్కొన్నారని, అది ఏకపక్షంగా నిర్ణయమని విశ్వాసాన్ని వుల్లంఘించారని సమీక్ష ట్రస్టు ప్రకటించింది. జరిగిందేమిటో తమకు తెలపకుండానే లీగల్‌ నోటీసు, సమాధాన వివరాలన్నీ వెబ్‌సైట్‌లో పెట్టారని తెలిపింది. వాటితో పాటు అదానీ కంపెనీల గురించిన రాసిన ఆర్టికల్‌ను వెబ్‌సైట్‌ నుంచి తొలగించాలని కోరినట్లు తెలిపింది. ఆ తరువాత పరంజయ్‌ రాజీనామా చేశారని, దానిని ట్రస్టు సమావేశం అంగీకరించినట్లు తెలిపారు. లీగల్‌ నోటీసు గురించి అనుమతి తీసుకోకుండా సమాధానం ఇవ్వటం తన పొరపాటేనని అంగీకరించానని, జరిగిందానిని పూర్తిగా ట్రస్టు సభ్యులు వెల్లడించటం లేదని రాజీనామా చేసిన పరంజయ్‌ చెబుతున్నారు.

జరిగిందాని గురించి అనేక ఊహాగానాలు వెలువడ్డాయి. అదానీ గ్రూపు లాయర్లు పేర్కొన్న వ్యాసాన్ని తొలగించాలని ట్రస్టు కోరిందీ లేనిదీ స్పష్టం కావాల్సి వుంది. అదానీ కంపెనీ వెయ్యి కోట్ల రూపాయల పన్ను ఎగవేసిందా అన్నదొక వ్యాసం, అదానీ కంపెనీకి ఐదువందల కోట్ల రూపాయలను అప్పనంగా ప్రభుత్వం కట్టబెట్టిన విధాన లోపం గురించి మరొక వ్యాసంలో పేర్కొన్నారు.రెండవ వ్యాసాన్ని వెబ్‌సైట్‌ నుంచి తొలగించాలని ట్రస్టు సభ్యులు కోరారన్న అంశంపై తీవ్ర విమర్శలు వెలువడ్డాయి. తొలగించమని కోరటానికి గల కారణాలను ట్రస్టు వెల్లడించలేదు.అదే సమయంలో తామెవరి వత్తిడికి ఎన్నడూ లంగలేదని పేర్కొన్నారు. పరంజయ్‌ రాసిన వ్యాసంలో గుర్తుతెలియని వనరులు చెప్పిన ఆధారాలు లేని అనేక కట్టుకథలు వున్నాయని, వాటి ఆధారంగా నిర్ధారణలు చేశారని ట్రస్టు సభ్యులు ఆరోపించారు. కొద్ది రోజుల తరువాత ట్రస్టు సభ్యుల పేరుతో వెలువడిన ప్రకటనలో ఇపిడబ్ల్యు ప్రమాణాలకు అనుగుణ్యంగా ఆ వ్యాసాలు లేవని, వాటిపై సమీక్ష కూడా సవ్యంగా జరగలేదని పేర్కొనటం గమనించాల్సిన అంశం.

ట్రస్టు సభ్యులతో జరిగిన సమావేశంలో లీగల్‌ నోటీసు అంటే ఒక లాయర్‌ నుంచి వచ్చిందే తప్ప కోర్టులో క్రిమినల్‌ కేసు నుంచి కాదని తాను వివరించానని, దానికి కూడా ట్రస్టు అనుమతి తీసుకోకుండా ఏకపక్షంగా లీగల్‌ నోటీసుకు సమాధానం పంపటం పొరపాటేనని గ్రహించానని అందుకు క్షమాపణ కూడా చెప్పానని పరంజయ్‌ చెప్పారు. అయితే ఆ రోజు జరిగిన దానిని పూర్తిగా వెల్లడించలేదని పేర్కొన్నారు. తన పేరుతో వ్యాసాలు రాయవద్దని ట్రస్టీ సభ్యులు చెప్పారని, ఏవైతే సంపాదకుడి విధులు, పాత్ర వుంటుందో అవే వుండే విధంగా ఒక సహసంపాదకుడిని కూడా నియమిస్తామని చెప్పారని, తక్షణమే వెబ్‌సైట్‌ నుంచి ఆర్టికల్స్‌ తొలగించి వెళ్లాలని కోరినట్లు చెప్పారు. తాను ఇతరులతో కలసి రాసిన విశ్లేషణలో ప్రతి వ్యాక్యానికి కట్టుబడి వుంటానని, అందుకు తగిన ఆధార పత్రాలు తన వద్ద వున్నాయని చెప్పానని, తాను రాసిన దానికి సాక్ష్యాల గురించి ట్రస్టీలు అసలు అడగలేదనిఅయినప్పటికీ వెబ్‌సైట్‌ నుంచి తొలగించాల్సిందేనంటూ తాను చెప్పిందానిని పట్టించుకోలేదన్నారు. ట్రస్టీలకు ఆధారాలపై ఆసక్తి లేదన్నారు. ఒక ట్రస్టీ అయితే ఆ వ్యాసాన్ని తానింకా చదవలేదని కూడా చెప్పారని, వెబ్‌సైట్‌ నుంచి ఆర్టికల్స్‌ను తొలగించిన తరువాతే బయటకు వెళ్లాలని తనతో చెప్పారని కూడా పరంజయ్‌ చెబుతున్నారు. దాంతో తాను ు రాజీనామా చేస్తానని చెప్పానని, ముంబైలో సంపాదకుడికి ఇచ్చే ఫ్లాట్‌ను ఖాళీ చేయటానికి కొద్ది రోజులు గడువిస్తారా అని అడగ్గా జూలై ఆఖరు నుంచి రాజీనామా అమలులోకి వస్తున్నట్లు పరిగణిస్తామని ట్రస్టు సభ్యులు చెప్పారని అయితే తక్షణమే తాను రాజీనామా చేసినట్లు పరిగణించాలని కోరినట్లు తెలిపారు.

ఇప్పటి వరకు ఆ పత్రిక తీరు తెన్నులను పరిశీలించినపుడు దాని సంపాదకుడి ఎన్నిక మిగతా వాణిజ్య పత్రికల మాదిరిగా జరగదని తెలిసిందే. వివిధ రంగాలలో పరిణితులైన ట్రస్టు సభ్యులు పూర్వపరాలను ఒకటికి రెండుమార్లు పరిశీలించి నిపుణులు, నిబద్ధత కలిగిన వారినే సంపాదకులుగా ఎంపిక చేశారు. గతంలో పని చేసిన వారందరూ వున్నంతలో వున్నత ప్రమాణాలు, విలువలను కాపాడారు కనుకనే ఆ పత్రికకు ఒక విస్వసనీయత ఏర్పడింది.ఆ రీత్యా చూసినపుడు పరంజయ్‌ గుహ థాకూర్ధాను కూడా ఆ ప్రమాణాల మేరకే ఎంపిక చేశారు. పరిశోధనాత్మక జర్నలిజంలో ముందే చెప్పుకున్నట్లు రిలయన్స్‌ వంటి దిగ్గజ సంస్ధకు సైతం వెరవ కుండా దాని అక్రమాలను బయట పెట్టిన చరిత్ర వుంది. అలాంటి వ్యక్తి అదానీ సంస్ధల గురించి అదీ అదానీకి నరేంద్రమోడీతో వున్న సంబంధాలు తెలిసి కూడా ఆషామాషీగా గాలి వార్తలను పోగేసి కధనాలు రాశారని, తమ విశ్వాసాన్ని వమ్ము చేశారని అంటే నమ్మటం కష్టం. ఒక అంశంపై పరిశోధన చేసిన జర్నలిస్టుకు కొన్ని సందర్భాలలో తప్పుడు సమాచారం కూడా వచ్చి వుండవచ్చు. ఇపిడబ్ల్యు పత్రికలో అటువంటి వార్తలు రాశారంటే ఎవరూ నమ్మటం లేదు. అసలు ఆ వార్తల గురించి అదానీ సంస్ధ లేదా ప్రభుత్వ ప్రమేయం కూడా వుంది కనుక ఆయా శాఖల స్పందన ఏమిటన్నది కూడా పరిశీలించకుండానే పరంజయ్‌ ఇతరులతో కలసి రాసిన వార్తలను వెబ్‌సైట్‌ నుంచి తొలగించాలని పేర్కొనటం ట్రస్టు సభ్యులపై అనుమానాలను పెంచేదే తప్ప వేరు కాదు. ప్రజల ఖజానాకు చేరవలసిన వందల కోట్ల రూపాయలను ఒక సంస్ధ అక్రమపద్దతుల్లో ఎగవేసిందని రాస్తే దానికి తగిన ఆధారాలను చూపాల్సిన బాధ్యత ఆ జర్నలిస్టుకు వుంటుంది. అది వాస్తవం కాదని అనే వారు సంస్ధ అయినా ప్రభుత్వశాఖలైనా అది ఎలా అవాస్తవమో జనానికి తెలియచేయాల్సిన బాధ్యత వారిపై కూడా వుంది. పరంజయ్‌, ఆయన సహరచయితలు రాసిన అంశాలు ప్రయివేటు లావాదేవీలకు సంబంధించినవి కావు. చట్ట సమీక్షకు లోబడినవే.

చట్ట సభలలో ప్రత్యక్ష ప్రసారం జరుగుతున్నందున ఒకసారి జనంలోకి వెళ్లిన అంశాన్ని స్పీకర్‌ తన విచక్షణాధికారాన్ని వుపయోగించి రికార్డుల నుంచి తొలగించవచ్చు. అంతే తప్ప దాన్ని జనంలో ప్రచారం చేయకుండా నిరోధించలేరు.అలాగే ఇపిడబ్ల్యు పత్రికలో ఆ వ్యాసాలు ప్రచురితమై పాఠకులకు చేరాయి. వెబ్‌సైట్‌లో తొలగించినంత మాత్రాన జనానికి అందకుండా పోవు. వైర్‌ వంటి వెబ్‌సైట్లు వెంటనే ఆ వ్యాసాలను పునర్ముద్రించాయి. వాటికి కూడా ఇపిడబ్ల్యుకు ఇచ్చిన మాదిరే నోటీసులు జారీ చేశారు. అయినప్పటికీ వాటిని చట్టపరంగా ఎదుర్కొంటామంటూ సదరు వెబ్‌సైట్‌ ఆ రెండు విశ్లేషణలను ఇప్పటికీ పాఠకులకు అందుబాటులో వుంచింది. సమీక్ష ట్రస్టు చర్యతో ఆ వ్యాసాల్లో అసలేమి వున్నదనే ఆసక్తి పాఠకుల్లో మరింతగా పెరిగి వాటికి ప్రాచుర్యాన్ని పెంచాయి. అనేక మీడియా సంస్ధలు అదానీకి భయపడుతూనే రేఖా మాత్రంగా అయినా వాటిల్లో ఏముందో చెప్పకుండా వార్తలను ఇవ్వలేవు. జరిగిన అక్రమాల సారాన్ని కొద్ది వాక్యాలలో అయినా చెప్పాల్సి వుంటుంది. ఒక వేళ తమ ఆదాయానికి ఎక్కడ గండిపడుతుందో అని ఆ వార్తలను నిషేధించినా సామాజిక మాధ్యమంలో అందుబాటులో వున్నాయి. ఫేస్‌బుక్‌, గూగుల్‌ కంపెనీలను కూడా ఆదాని మేనేజ్‌ చేసి వారిని సంతృప్తి పరిస్తే తప్ప చర్చించేందుకు అవకాశాలు ఎన్నో వున్నాయి.

ఈ పరిణామం నిస్సందేహంగా దేశంలోని జర్నలిస్టుల ముందు ఒక సవాలు విసురుతోంది. ఎంతో శ్రమకోర్చి పరిశోధన చేసి వెలుగులోకి తెచ్చిన అంశాలు జనానికి తెలియకుండా అడ్డుకోవటాన్ని సహిస్తే అసలు జర్నలిజానికి అర్ధం ఏమిటి? అలాంటి వాటిని ఎలా జనానికి తెలియచెప్పాలి. బ్రిటీష్‌ వారి కాలంలో వారికి వ్యతిరేకంగా పని చేసిన పత్రికలను ఎలా అణచివేసిందీ, ఒక పేరుతో వున్న దానిని అచ్చుకాకుండా చేస్తే మరొక పేరుతో ఎలా జనంలోకి తెచ్చిందీ మనకు తెలిసిందే. ఇప్పుడు కూడా అదే పరిస్ధితులు పునరావృతం కానున్నాయా అనిపిస్తోంది. ఇప్పటికే వాణిజ్య మీడియాపై జనంలో విశ్వాసం క్రమంగా సన్నగిల్లుతున్నప్పటికీ నిజం కాకపోతే ఎలా అచ్చువేస్తారులే అనుకునే జనం ఇంకా వున్నారు. అందుకే వాస్తవాలను మరుగుపరచి కట్టుకథలు పిట్టకధలతో జనాన్ని నమ్మించగలుగుతున్నాయి.

ఇపిడబ్ల్యు వంటి ట్రస్టు మీద మేధావి వర్గంలో ఇప్పటి వరకు వున్న అభిప్రాయం వేరు ఇక ముందు అలాంటిది వుండదనే విషయాన్ని సమీక్ష ట్రస్టు గుర్తించాలి. పూర్వపు విశ్వాసాన్ని తిరిగి పొందాలంటే అసలు వాస్తవాలేమిటనే విషయాన్ని అది జనం ముందుంచాలి. తన సంపాదకుడు రాసిన విశ్లేషణకు ఆధారాలు చూపలేకపోతే అప్పుడు అతన్ని రాజీనామా చేయమనటమో లేకపోతే ఏకపక్షంగా తొలగించటమో చేసి తమ పత్రిక చేసిన తప్పిదాన్ని నిజాయితీగా అంగీకరించి వుంటే ఇపిడబ్ల్యు గౌరవం మరింత పెరిగి వుండేది. సంపాదకుడు చెప్పిన అంశాలపై ముందుగా ట్రస్టు అంతర్గత విచారణ జరిపి, పరి శోధనాత్మక వార్తకు వున్న ఆధారాలేమిటో అంతర్గతంగా పరిశీలించిన తరువాత చర్య తీసుకోవటం ఒక పద్దతి అదేమీ లేదు, ఆ వ్యాసాలను ఎందుకు వుపసంహరించారో అధికారికంగా వివరణ లేదు కనుకనే యాజమాన్యం బయటివారి వత్తిడికి లంగిపోయినట్లు భావించాల్సి వస్తోంది. ఇప్పటికీ మించిపోయింది లేదు. అనేక మంది మేధావుల అభిప్రాయాలు, మనోభావాలను మన్నించి పారదర్శకంగా వ్యవహరిస్తే నీలినీడలు పటాపంచలవుతాయి. ఒక విస్వసనీయ పత్రికగా ఇపిడబ్ల్యు ముందుకు పోతుంది. లేకుంటే ఏం జరిగేది చెప్పాల్సిన పని లేదు. అమెరికాలో బడా మీడియా పాలవర్గతొత్తుగా మారి వాటి భజన చేస్తున్న సమయంలో వికీలీక్స్‌ వునికిలోకి వచ్చిన అమెరికా సామ్రాజ్యవాదుల బండారాన్ని వుతికి ఆరేస్తుందని, దాని గుట్టుమట్టులన్నీ బయటపెడుతుందని ఎవరైనా వూహించారా? ఆ సంస్ధ నిర్వాహకులకు అమెరికా ప్రభుత్వంలో ఎవరో ఒకరు ఆధారాలు అందించబట్టే అది సాధ్యమైంది. అలాంటి వారు ప్రతి దేశంలోనూ వుంటారు. చరిత్రలో హేతుబద్దంగా ప్రశ్నించిన చార్వాకులను నాటి పాలకవర్గం నాశనం చేసింది. వారిని భౌతికంగా అంతమొందించారు తప్ప వారి భావజాలాన్ని అణచివేయలేకపోయారు. అలాగే ఇప్పటి వరకు ఇపిడబ్ల్యు నిర్వహించిన పాత్రను కొనసాగించేందుకు మరొక పత్రిక ఆవిర్భవించకుండా వుంటుందా ? ఏటికి ఎదురీదటమే బతికి వున్న చేపల స్వభావం. చచ్చిన చేపలే వాలునబడి కొట్టుకుపోతాయి. దేశంలో జర్నలిజం, జర్నలిస్టుల కర్తవ్యం కూడా బతికిన చేపల మాదిరి ఎదురీదటమే !

 

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

శిక్షలేని నేరం జర్నలిస్టుల హత్యలు

13 Tuesday Sep 2016

Posted by raomk in BJP, Congress, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others

≈ 1 Comment

Tags

attacks on journalists, Journalist Murders, Journalist Murders in India, journalists

Image result for stop attacks on journalists in india

ఎం కోటేశ్వరరావు

     మీరు ఎవరినైనా మట్టు పెట్టదలచుకున్నారా ? మన దేశంలో చాలా సులభం ! ఎలాంటి శిక్షలు వుండవు !! వాణిజ్య ప్రకటనలలో షరతులు వర్తిసాయని నక్షత్ర గుర్తులు వేసినట్లే దీనికి కూడా ఒక షరతు వుంది. అదేమంటే అలాంటి వారు మీడియా వ్యక్తులై వుండాలి. ఈ రోజుల్లో వారు దొరకటం చాలా సులభం. పత్రికలు, టీవీలు, రేడియో, అంతర్జాతల మీడియాలో చాలీ చాలని లేదా అసలు వేతనం లేకుండా పని చేసే వారే కాదు, ఎలాంటి జీతం, భత్యాలు, పగలనకా, రాత్రనకా తేడా లేకుండా పని చేస్తూ , యజమానులకు విపరీత లాభాలు సమకూర్చి పెడుతున్న సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టే ప్రతి ఒక్కరూ జర్నలిస్టులే. అనుమానమా ? అక్కర లేదు మీ పోస్టులను సాక్ష్యంగా చూపి ఎవరైనా నా మనోభావాన్ని దెబ్బతీశారు అని ఫిర్యాదు చేస్తే కేసులు పెడుతున్నారు. సాంప్రదాయ మీడియాలో పని చేసే వారి మీద కూడా అలాంటి కేసులే పెట్ట వచ్చు. కానీ అలా చేయటం లేదే, భౌతికంగా మట్టు పెడుతున్నారు. అలాంటి పరిస్థితి రేపు సామాజిక మీడియా జర్నలిస్టులకు ఎదురు కాదని ఎవరైనా చెప్పగలరా ?

     చట్టం తన పని తాను చేసుకు పోతుందన్నది అధికారంలో వున్న పెద్దల వువాచలలో ఒకటి. వంద మంది నేరగాళ్లు తప్పించుకుపోవచ్చుగాని ఒక్క నిరపరాధికి కూడా శిక్ష పడకూడదన్నది న్యాయ సూక్తి. అంతర్జాతీయ సంస్ధ జర్నలిస్టుల రక్షణ కమిటి( కమిటీ టు ప్రొటెక్ట్‌ జర్నలిస్ట్స్‌-సిపిజె) తాజా నివేదిక ప్రకారం 1992 నుంచి 2016 జూలై వరకు 27 మంది జర్నలిస్టుల హత్య కేసులలో ఒక్కటంటే ఒక్క దానిలో కూడా నేరగాళ్లకు శిక్ష పడలేదు. నిజంగా చట్టం తనపని తాను చేస్తే ఇలాగే జరుగుతుందా ? ఒక్క కేసులో ఒక్కరికి కూడా శిక్ష పడలేదంటే నిందితులందరూ నిరపరాధులేనా ?అనేక మంది చెబుతున్నట్లు, వాటిని అనేక మంది నమ్ముతున్నట్లు మనది ప్రపంచంలో ఎంతో బాగా పనిచేస్తున్న అతి పెద్ద ప్రజాస్వామిక సంస్ధ, దర్యాప్తు చేయాల్సిన పోలీసులూ సమర్ధులే, విచారించాల్సిన న్యాయమూర్తులనూ తప్పు పట్టలేము. తిమ్మినిబమ్మిని చేసే న్యాయవాదులూ తమ వృత్తి ధర్మాన్ని సక్రమంగా నిర్వరిస్తున్నట్లే. మనది బూటపు ప్రజాస్వామ్యమా లేక ప్రజాస్వామ్యాన్ని బూటకంగా మార్చివేశారా ? లేక వ్యవస్ధలోనే లోపమున్నదా ? ఎవరు దీనికి బాధ్యులు ? ఎందుకిలా జరుగుతోంది? ఏం జరిగినా అన్నీ మన మంచికే అన్నట్లుగా అన్నింటినీ గుడ్లప్పగించి చూస్తున్న సమాజం ? ఏమిటీ వైపరీత్యం, ఎంతకాలమిలా ? వీటన్నింటిని చూసి అరుదుగా వున్న సున్నిత మనస్కులలో ఏ ఒక్కరైనా ఈ ప్రజాస్వామ్యం, ఈ వ్యవస్ధ మీద నమ్మకం కోల్పోయినట్లు ప్రకటిస్తే ఆ ఘోరానికి బాధ్యులెవరు ?

    భారత రాజ్యాంగం ఆర్టికల్‌ పందొమ్మిది ప్రకారం హామీ ఇచ్చిన భావ ప్రకటనా స్వేచ్ఛను హరించే నేరాలకు పాల్పడుతున్న వారి నుంచి జర్నలిస్టులను కాపాడేందుకు జాతీయ స్ధాయిలో అవసరమైన ఒక యంత్రాంగాన్ని, పద్దతిని రూపొందించేందుకు అవసరమైన ముసాయితా ప్రతిపాదనలను తయారు చేసేందుకు అనుభవమున్న న్యాయమూర్తులు, జర్నలిస్టులు, పండితులు, భావ ప్రకటనా స్వేచ్చ విషయాలలో నిపుణులైన ఒక బృందాన్ని ఏర్పాటు చేయాలని సిపిజె తన నివేదికలో కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.

    ఈ నివేదికను సిపిజె ఆసియా కార్యక్రమ సీనియర్‌ పరిశోధకులు సుమిత్‌ గల్‌హోత్రా,స్వతంత్ర పాత్రికేయులు రక్షా కుమార్‌ సిపిజె తరఫున ఈ నివేదికను తయారు చేశారు. మీడియా తీరుతెన్నులను వీక్షించే వెబ్‌సైట్‌ ది హూట్‌ సలహా సంపాదకురాలు ముంబైకి చెందిన గీతా శేషు కేసుల వివరాలను అందచేయగా దేశంలోని పరిస్థితుల గురించి స్వతంత్ర జర్నలిస్టు ఆయుష్‌ సోనీ రాశారు.(గీతా శేషు సేకరించిన కొన్ని వివరాలను వర్కింగ్‌ జర్నలిస్టు జూన్‌ సంచికలో ఇచ్చాము). ఈ నివేదిక ముందు మాటను ప్రముఖ జర్నలిస్టు పి శాయినాధ్‌ రాశారు. నివేదిక పూర్తి పాఠం కావాల్సిన వారు దిగువ లింక్‌లో పొంద వచ్చు.https://cpj.org/reports/2016/08/dangerous-pursuit-india-corruption-journalists-killed-impunity.php పెద్ద పట్టణాలలో వున్నవారి కంటే గ్రామీణ, చిన్న పట్టణాలలో వున్న జర్నలిస్టులకు తాము రాసిన రాతలపై దాడులు జరిగే ముప్పు ఎక్కువగా వుందని అయితే ఈ నివేదికను పరిశీలించిన తరువాత దానికి తోడు జర్నలిస్టు పని చేస్తున్న స్థలం, సంస్ధ, వృత్తిలో స్థాయి, సామాజిక పూర్వరంగం కూడా ఆ ముప్పుకు అదనంగా తోడవుతున్నట్లు వెల్లడైందని శాయినాధ్‌ చెప్పారు. ప్రాంతీయ భాషలలో వార్తలు రాసే వారికి ముఖ్యంగా ఆ రాసింది శక్తివంతులైన వారిని సవాలు చేసేదిగా వుంటే విలేకర్లకు ముప్పు ఇంకా ఎక్కువగా వుంటుందని వ్యాఖ్యానించారు. జాతీయ మీడియాలో పని చేసేవారు ఇలాంటి ఘోరమైన దాడుల నుంచి తప్పించుకుంటున్నారని కారణం జాతీయ మీడియాలోని వున్నత తరగతులు, ప్రత్యేకించి ఆంగ్ల మీడియా సంస్ధలలో వున్నవారికి మెరుగైన రక్షణ కలిగి వున్నారని, పలుకబడి కలిగిన జాతీయ మీడియా సంస్ధలు ప్రభుత్వానికి అందుబాటులో వుండటంతో వాటిలో పనిచేసే వారికి అంతర్గతంగానే వ్యవస్ధా పరరక్షణ వుంటుందని శాయినాధ్‌ పేర్కొన్నారు.

     అవినీతి గురించి రాసిన కారణంగానే జర్నలిస్టులు హత్యకు గురైనట్లు నివేదికలోని 27 వుదంతాలు వివరాలు వెల్లడిస్తున్నాయి. ఏ ఒక్క కేసులోనూ ఎవరికీ శిక్షలు పడలేదు. ఈ పరిస్థితి మీడియాకు ఒక సవాలు వంటి పరిస్థితిని ముందుకు తెచ్చింది. ముఖ్యంగా చిన్న పట్టణాలలోని జర్నలిస్టులు అవినీతిని గురించి నివేదించినపుడు వారు ఎక్కువగా బెదిరింపులు, హత్యలకు గురవుతున్నారని సిపిజె నివేదిక తెలిపింది. జర్నలిస్టులు ఏమాత్రం రక్షణలేని స్ధితిలో పని చేస్తున్నారని, మీడియా సౌహార్ద్రతలేమి, న్యాయ వ్యవస్ధలో పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి వుందని, మరణించిన తరువాత బాధితులను అప్రతిష్టపాలు చేస్తున్నారని పేర్కొన్నది. 2015లో తీవ్ర కాలిన గాయాలతో మరణవాగ్ఞూలం ఇచ్చిన స్వతంత్ర జర్నలిస్టు జోగేంద్ర సింగ్‌ ఒక పోలీసు అధికారే తనను సజీవ దహనం చేసేందుకు మంటల్లోకి నెట్టారని చెప్పాడు. అతను చెప్పిన దానిని తిరస్కరించిన స్దానిక పోలీసులు అసలు అతను జర్నలిస్టే కాదని బుకాయించారు. ఒక ఏడాది గడిచినప్పటికీ రాష్ట్ర స్ధాయిలో ఇంకా దర్యాప్తు సాగుతూనే వుంది, అరెస్టులు లేవు. 2011 జనవరిలో తన ఇంటి ముందే కాల్పుల్లో హత్యకు గురైన నయా దునియా హిందీ పత్రిక జర్నలిస్టు రాజపుట్‌ కేసులో దర్యాప్తును సాగదీసి కీలక సాక్ష్యాలను కనుమరుగు చేసే యత్నం చేశారు. చివరికి ఇప్పుడు ఆ కేసును సిబిఐకి అప్పగించారు. భారత్‌లోని అతి పెద్ద కుంభకోణాలలో ఒకదానిపై పరిశోధనలో భాగంగా ఒక ఇంటర్వ్యూ సమయంలో అనుమానాస్పద స్ధితిలో మరణించి ఇండియా టుడే గ్రూప్‌ పత్రికలకు చెందిన అక్షయ్‌ సింగ్‌ కేసు మిగతా కేసులతో పోల్చితే త్వరగా సిబిఐకి అప్పగించారంటే దానికి కారణం ఒక పెద్ద సంస్థలో పని చేస్తూ వుండటమే అని నివేదిక పేర్కొన్నది.

     పైన పేర్కొన్న మూడు వుదంతాల గురించి ఈ ఏడాది మార్చినెలలో సిపిజె బృందం పరిశోధనలో భాగంగా వారి కుటుంబ సభ్యులు, బంధువులు, న్యాయవాదులు, జర్నలిస్టులను కలసి వారి అభిప్రాయాలను సేకరించింది. స్వతంత్ర జర్నలిస్టు జగేంద్ర సింగ్‌ పోలీసుల చేతిలో కాలిన గాయాలతో మరణించాడని విమర్శలు వచ్చాయి. వుత్తర ప్రదేశ్‌కు చెందిన ఒక మంత్రి భూ కబ్జా, అత్యాచారాల గురించి వార్తలు రాయటమే అతను చేసిన నేరం.ఒక రాజకీయనేత కుమారుడు అక్రమంగా జూదం నిర్వహణలో వున్నట్లు రాసిన వుమేష్‌ రాజపుట్‌ను ఇంటి ముందే కాల్చి చంపారు. మధ్య ప్రదేశ్‌లో వ్యాపం కుంభకోణంగా ప్రసిద్ధి చెందిన అవినీతి అక్రమాలపై శోధన చేస్తుండగా అక్షయ సింగ్‌ ఆకస్మికంగా మరణించాడు. ఇలాంటి పరిశోధనలను అధికార యంత్రాంగం సహించటం లేదు.దాడులు, హత్యలు జరిగిన వుదంతాలలో పోలీసులు సరిగా దర్యాప్తు జరిపి దోషులను గుర్తించటం,అరెస్టు చేయటం జరగటంలేదు. కామన్‌వెల్త్‌ గేమ్స్‌, 2జి స్కామ్‌ వంటి వాటిలో జరిగిన అక్రమాల గురించి సమాచార హక్కు చట్టం కింద వెలుగులోకి తేవటంలో కార్యకర్తలు, జర్నలిస్టులు ఎంతో ముందున్నారు.గత లోక్‌సభ ఎన్నికల సందర్భంగా అవినీతిని ఒక కేంద్రీయ అంశంగా చేసిన నరేంద్రమోడీ అధికారంలోకి వచ్చిన తరువాత అవినీతిపై చర్యలు తీసుకోకపోవటంతో పాటు వాటిని వెలుగులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న జర్నలిస్టులకు తగిన రక్షణ చర్యలు తీసుకోవటం లేదు. భారత్‌లో ఏ ఒక్క ప్రభుత్వం కూడా పత్రికా స్వేచ్చ గురించి తీవ్రంగా పట్టించుకోలేదు. కేంద్రంలో, రాష్ట్రాలలో అధికారంలో వున్న కాంగ్రెస్‌,బిజెపి లేదా ప్రాంతీయ పార్టీలుగానీ ఎవరున్నా మౌనం వహిస్తున్నారు. శిక్షలు లేని సంస్కృతిని మాత్రమే పెంచి పోషిస్తున్నారని నివేదికలో పేర్కొన్నారు.

    సిపిజె ఇంతవరకు విధులలో భాగంగా హత్యలు జరిగిన 27 కేసులను పరిశీలించగా ఒక్కదానిలో కూడా శిక్షలు పడలేదని తేలింది. మరో 25 అనుమానిత మరణాలను కూడా ఏ కారణంతో జరిగాయనే విషయమై దర్యాప్తు జరుపుతోంది.

    ఒక జర్నలిస్టుపై దాడి లేదా హత్య జరిగిందనే ఫిర్యాదు చేయగానే పోలీసులు ముందుగా అతను జర్నలిస్టు కాదు, ఆ ఘటనకు జర్నలిజానికి సంబంధం లేదంటున్నారని గీతా శేషు పేర్కొన్నారు.దర్యాప్తులో కూడా అదే ప్రతిబింబిస్తోంది. ‘ దేశంలో గట్టి ప్రజాస్వామిక సంస్ధలు, చురుకుగా వుండే స్వతంత్ర న్యాయవ్యవస్ధ వున్నప్పటికీ జర్నలిస్టులను హత్యలు చేసిన వారు శిక్ష పడకుండా తప్పించుకుంటున్నారు. పరిస్థితి చాలా ఆందోళనకరంగా వుంది, అది దేశంలోని ప్రజాస్వామిక సంస్ధల పనితీరుపై ప్రభావం చూపుతుందని’ 2015లో ప్రెస్‌ కౌన్సిల్‌ పేర్కొన్న అంశాన్ని సిపిజె నివేదిక వుటంకించింది.

     నాణానికి ఒకవైపు బొమ్మ ఇదైతే రెండోవైపు బొరుసు గురించి కూడా సిపిజె నివేదిక పేర్కొన్నది. భౌతికంగా అదే విధంగా సామాజిక మాధ్యమాలలో మొత్తం జర్నలిస్టు సమాజం దాడులకు గురవుతుంటే దాడులు, హత్యలకు గురైనా మీడియాలోని తోటి జర్నలిస్టులలో, మొత్తం మీద సమాజంలో నిరసన వ్యక్తం కావటం లేదని కూడా సిపిజె ఆందోళన వ్యక్తం చేసింది. దాడికి గురైన జర్నలిస్టు ఎవరా అన్నదానితో నిమిత్తం లేకుండా మీడియాపై దాడులకు సంబంధించిన అంశాలపై మెరుగ్గా శోధించి వెలుగులోకి తీసుకురావాలని భారత మీడియా సంస్ధలను సిపిజె కోరింది. జర్నలిస్టులు ప్రతికూల పరిస్ధితులలో వున్న వెలుగులో సిపిజె నివేదిక అనేక సిఫార్సులు చేసింది. జర్నలిస్టులకు రక్షణ కల్పించేందుకు ఇతర దేశాలలో వున్న వుత్తమ ఆచరణలను అధ్యయనం చేసి జాతీయ స్ధాయిలో ఒక యంగ్రాంగాన్ని ఏర్పాటు చేయటం అందులో ఒకటి.మీడియాపై దాడులు చేసి శిక్షలు పడకుండా తప్పించుకున్న వుదంతాలపై పార్లమెంటరీ కమిటీ విచారణ నిర్వహించి న్యాయం చేసేందుకు, శిక్షలు వేయటానికి ఎదురువుతున్న సవాళ్లను గుర్తించాలి. దాడులు, హత్యలు జరిగినపుడల్లా నిర్ద్వంద్వంగా బహిరంగ ప్రకటనలు చేసి కేంద్రం వాటిని ఖండించి గట్టి సందేశం పంపాలి. సిబిఐ తన దర్యాప్తులో వున్న కేసులను త్వరగా పూర్తి చేయాలని, చత్తీస్‌ఘర్‌ ప్రభుత్వం జర్నలిస్టులపై పోలీసుల వేధింపులను ఆపాలని, ఇతర సంస్ధలను కూడా నిరోధించాలని, జైళ్లలో వున్నవారిని విడుదల చేయాలని కోరింది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

మీడియా స్చేచ్చకు ముంచుకు వస్తున్న ముప్పు

14 Saturday May 2016

Posted by raomk in AP NEWS, Current Affairs, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS

≈ Leave a comment

Tags

attacks on journalists, journalist, journalistic independence, press, press freedom, Reporters Without Borders

ఎం కోటేశ్వరరావు

    మేనెల మూడవ తేదీన ప్రపంచ పత్రికా స్వేచ్చా దినాన్ని పాటించారు. మీడియా స్వేచ్చ ప్రాధాన్యతను తెలియ చేసేందుకు ప్రతి ఏటా ఈ దినాన్ని పాటిస్తున్నారు. 1991 ఏప్రిల్‌ 29 నుంచి మే మూడవ తేదీ వరకు ఆఫ్రికా ఖండం నైరోబీ దేశంలోని విండ్‌హాక్‌ పట్టణంలో ఆఫ్రికా ఖండ జర్నలిస్టుల సమావేశం పత్రికా స్వేచ్చ సూత్రాల గురించి ఒక ప్రకటనను ఆమోదించింది. తరువాత ఐక్యరాజ్యసమితి ఆ తీర్మానాన్ని తనదిగా స్వీకరించి ఆమోదం పొందిన మూడవ తేదీని ప్రపంచ పత్రికా దినోత్సవంగా ప్రకటించింది.ఈ ఏడాది ఈ ప్రకటనకు పాతికేండ్లు నిండటంతో పాటు ప్రపంచంలో తొలిసారిగా 1776లో స్వీడన్‌ ఆమోదించిన పత్రికా స్వేచ్చ చట్టానికి 250 సంవత్సరాలు నిండటం కూడా ఈ ఏడాదే కావటం విశేషం. ఇంతవరకు 95దేశాలు పత్రికా స్వేచ్చకు సంబంధించి ఏదో ఒక చట్టాన్ని ఆమోదించాయి. ప్రతి ఏటా ఒక దేశంలో మీడియాకు సంబంధించి ఒక ఇతివృత్తంపై ఐరాస మే మూడవ తేదీన ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. కొలంబియాలో 1986లో తన కార్యాలయం ఎదుటనే మాదక ద్రవ్యాల మాఫియా చేతిలో గ్యూ లెర్మో కనో అనే జర్నలిస్టు హత్యకు గురయ్యాడు. అతని సంస్మరణంగా ప్రతి సంవత్సరం ఆ కార్యక్రమంలో మీడియా స్వేచ్ఛకోసం పోరాడిన జర్నలిస్టుకు బహుమతి ఇస్తోంది. ఈ ఏడాది అజర్‌బైజాన్‌ జర్నలిస్టు ఖతీజా ఇస్మాయిలోవాకు ప్రకటించారు. ఈ సందర్బంగా వివిధ దేశాలలో వున్న పరిస్థితుల గురించి చర్చలు జరుగుతాయి. ఈ ఏడాది ఫిన్లండ్‌ రాజధాని హెల్సింకీలో ‘అందుబాటులో సమాచారం మరియు ప్రాధమిక స్వేచ్ఛలు ‘ అనే అంశంపై కార్యక్రమం నిర్వహించారు. వెయ్యిమందికిపైగా పాల్గొన్న జర్నలిస్టులు విధి నిర్వహణలో హత్యకు గురైన వారికి నివాళులు అర్పించారు. అనేక దేశాలలో ఇదే రోజున పలు కార్యక్రమాలు జరిగాయి.

     పత్రికలు లేదా టీవీ ఛానల్స్‌, ఇంటర్నెట్‌ ఏ మీడియా రంగంలో పని చేస్తున్నప్పటికీ జర్నలిస్టు జీవితం అంత సులభం కాదు. కత్తిమీద సాము వంటిది. నిత్యం ప్రమాదాలు పొంచి వుంటాయి. అవి ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధాలు, అవినీతి,అక్రమాలు ఏవైనా సరే జర్నలిస్టులను ప్రమాదపు అంచుల వరకు తీసుకు వెళుతున్నాయి. అయినా సరే ఈ వృత్తిని ఎంచుకొనేందుకు నిబద్దులై వుండే యువతీ యువకులు ముందుకు వస్తూనే వున్నారని ఈ సందర్బంగా ప్రపంచ వ్యాపితంగా మరోసారి వెల్లడైంది.

   జర్నలిస్టులు కనిపించగానే నమస్తే చెప్పటం, పక్కకు తిరిగి నోరు బట్టని బూతులు తిట్టటం సర్వసాధారణం. అక్రమాలకు పాల్పడే శక్తులే కాదు, రాజకీయ వేత్తలు, అధికారయంత్రాంగం ఇలా ఒకరని కాదు, తమ ప్రయోజనాలకు భంగం కలిగిందని భావించే ప్రతి వారూ చివరకు భౌతిక దాడులకు పాల్పడుతూ ప్రాణాలు తీసేందుకు కూడా సిద్ధం అవుతున్నారు. జెఎన్‌యు ఘటనల సందర్బంగా భారతమాతాకు జై అంటూ ఒకవైపు నినదిస్తూనే అదే నోటితో మరోవైపు ఆ వార్తలను కవర్‌ చేసేందుకు వెళ్లిన, ఆ ఘటనల పట్ల విమర్శనాత్మక కధనాలు వెలువరించిన, చర్చలు నిర్వహించిన మహిళా జర్నలిస్టులను మాన భంగం చేస్తామని కూడా బెదిరించటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఇవన్నీ ఒక ఎత్తయితే వుద్యోగ భద్రలేమి మరొక ప్రధాన అంశం. అధికారంలో వున్నవారికి నచ్చకపోయినా, యాజమాన్యం ఇచ్చగించకపోయినా బలౌతున్నది జర్నలిస్టులు. మీడియా స్వేచ్చ అన్నది రోజు రోజుకూ పరిమితం కావటంతో పాటు దుర్వినియోగం అవుతున్నది. యాజమాన్యాలు తమ లాభాల కోసం అనుసరిస్తున్న అక్రమ పద్దతుల కారణంగా జర్నలిస్టులు సమిధలుగా మారుతున్నారు.

    సరిహద్దులు లేని విలేకర్ల సంస్ధ(రిపోర్టర్స్‌ వితౌట్‌ బోర్డర్స్‌(ఆర్‌ఎస్‌ఎఫ్‌) గతనెలలో విడుదల చేసిన నివేదిక మీడియా స్వేచ్చ అన్ని ప్రాంతాలలో మొత్తం మీద దిగజారుతున్నది. ఈ సంస్ధ 2002 నుంచి ప్రతిఏటా నివేదికలను ప్రకటిస్తూ సూచికలను వెల్లడిస్తున్నది. దాని ప్రకారం గత ఏడు సంవత్సరాలుగా ఫిన్లండ్‌ మీడియా స్వేచ్చలో అగ్రస్ధానంలో వుంటున్నది. రెండు వందల యాభై సంవత్సరాల క్రితం స్విడ్జర్లండ్‌లో భాగంగా ఫిన్లండ్‌ వుండేది. స్వేచ్ఛాయుత ప్రభుత్వానికి సంబంధించిన అంశాలపై రాయటం, ప్రచురించటం మూలస్థంభాలుగా వుండాలని వుదారవాది అయిన ఫిన్నిష్‌ మతాధికారి ఆండెర్స్‌ చైడెనియస్‌ 1765లో ఒక రచనలో తన అభిప్రాయం వెల్లడించారు. జర్నలిజం మంచి చట్టాలు రూపొందించటానికి, అధికార యంత్రాంగ బాధ్యతలు, పరిమితుల గురించి సమాచారాన్ని అందించటంలో రాజ్యానికి సహాయపడుతుందని, దానినే ఒక చట్టంగా రూపొందించాలని పార్లమెంట్‌కు నివేదించాడు. అది లేకపోతే అధ్యయనం, వినయ విధేయతలు అణచివేయబడతాయని, ఆలోచనలో మొరటుతనం చోటు చేసుకుంటుందని ఆయన పేర్కొన్నారు. ఆ మేరకు అది చట్టమైంది. అంతకు ముందు ఎక్కడా అలాంటి చట్టాలు వున్నట్లు దాఖలాలు లేకపోవటంతో ప్రపంచంలో తొలి చట్టంగా పరిగణిస్తున్నారు. ప్రభుత్వ పత్రాలు అందరికీ అందుబాటులో వుంచటం ప్రజల హక్కుగా గుర్తించటం దానిలోని ముఖ్యాంశం.ఇది జరిగి రెండువందల యాభై సంవత్సరాలు గడుస్తున్నా ఇంతవరకు పత్రికా స్వేచ్ఛ పూర్తిగా అన్ని దేశాలలో అమలులోకి రాలేదు.

    గత పన్నెండు సంవత్సరాలలో గతేడాది మీడియా స్వేచ్చకు అత్యంత చెడ్డదిగా వుందని ఆర్‌ఎస్‌ఎఫ్‌ సూచిక వెల్లడించింది. ప్రపంచ వ్యాపితంగా మీడియా స్వేచ్ఛ ఆందోళనకరంగా వుందని, అనేక మంది ప్రపంచ నేతలు నిజమైన జర్నలిజం పట్ల ఒక విధమైన మానసిక రుగ్మతకు గురి అవుతున్నారని, భయ పూరిత వాతావరణం చర్చలు జరిపేందుకు, భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసేందుకు విముఖులను చేస్తోంది. గతం కంటే ఎక్కువగా ప్రభుత్వాలు మీడియా అణచివేతకు పాల్పడుతున్నాయి. ప్రయివేటు వ్యక్తుల యాజమాన్యాలలో వున్న మీడియాలలో రిపోర్టింగ్‌ వ్యక్తుల ప్రయోజనాలకు అనుగుణంగా మలచబడుతున్నది.’ అని ఆర్‌ఎస్‌ఎఫ్‌ సెక్రటరీ జనరల్‌ క్రిస్టోఫీ డెలోయిర్‌ వ్యాఖ్యానించారు. తాజా సూచికలో ప్రధమ స్ధానంలో ఫిన్లండ్‌, నెదర్లాండ్‌, నార్వే తదుపరి స్ధానాలలో వున్నాయి.

     ఖండాల వారీగా చూస్తే ఐరోపా సూచిక 19.8,ఆఫ్రికా 36.9, వుత్తర, దక్షిణ అమెరికా ఖండాలు 37.1, ఆసియా 43.8గా వుంది. ప్రాంతాల వారీగా చూస్తే తూర్పు ఐరోపా, మధ్య ఆసియా 48.4, వుత్తర ఆఫ్రికా , మధ్యప్రాచ్యం 50.8 పాయింట్లతో అధమ స్ధానంలో వుంది. 2013తో పోల్చితే మొత్తం మీద సూచిక 13.6శాతం పతనమైంది. గతేడాది 3,857 పాయింట్లు వుంటే తాజాగా 3,719కి పడిపోయింది. మతపరమైన అంశాలతో సహా దీనికి అనేక కారణాలు వున్నాయి. ప్రపంచ వ్యాపితంగా కార్పొరేట్‌ శక్తులు మీడియా రంగంలో ప్రవేశిస్తూ ప్రభుత్వాలపై వత్తిడిని పెంచుతున్నాయి. కొన్ని దేశాలలో ఇంటర్నెట్‌ను అందుబాటులో లేకుండా చేయటానికి, పత్రికా ముద్రణను అడ్డుకోవటానికి కూడా వెనుకాడటం లేదు. గత మూడు సంవత్సరాలలో ఈ సూచిక 16శాతం దిగజారింది. స్వల్ప కారణాలను సాకుగా చూపి జర్నలిస్టులను శిక్షించటానికి వీలుగా చట్ట సవరణలు కూడా ఈ కాలంలో పెరిగాయి. అధ్యక్షుడు, ప్రధానిని అమానించారనో, మత వ్యతిరేక ప్రచారానికి పాల్పడ్డారని, వుగ్రవాదులకు తోడ్పడటం వంటి కారణాలను వాటిలో పొందుపరుస్తున్నారు.

      మిగతా ప్రాంతాలతో పోల్చితే ఐరోపా జర్నలిస్టులు ఎక్కువ స్వేచ్చాయుత వాతావరణంలోనే పని చేస్తున్నారు, అయితే అక్కడ కూడా పరిస్థితి దిగజారుతోంది. పోలాండ్‌లో కొత్త ప్రభుత్వానికి విధేయులుగా లేరనే సాకుతో ప్రభుత్వ రేడియో, టీవీ సర్వీసులనుంచి 135 మంది జర్నలిస్టులకు వుద్వాసన పలికారు. జర్నలిస్టుల వార్తా వనరుల విషయంలో పోలీసులు నిబంధనలను వుల్లంఘించిన కారణంగా బ్రిటన్‌ రేటింగ్స్‌ పడిపోతున్నాయి. టర్కీ అధ్యక్షుడిపై ఒక వ్యంగ్య పద్యాన్ని ప్రచురించినందుకు ఆదేశం కోరిక మేరకు ఒక కమెడియన్‌పై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాల్సిందిగా జర్మన్‌ ఛాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్‌ ఆదేశించారు. మీడియా స్వేచ్చ సూచికలో 180 దేశాలలో టర్కీ స్ధానం 151 అంటే అక్కడి పరిస్థితులు ఎంత దారుణంగా వున్నాయో వూహించుకోవచ్చు. పత్రికా స్చేచ్చలో అగ్రగాములుగా వున్న దేశాలలో ఒకటైన స్వీడన్‌లో జర్నలిస్టులపై బెదిరింపుల కారణంగా దాని సూచిక ఐదు నుంచి ఎనిమిదికి పడిపోయింది. ‘ఇది ప్రజాస్వామ్యానికి నిజమైన ముప్పు, ఇంటర్నెట్‌ మీడియాలో వ్యాఖ్యల విభాగాలను ఎత్తివేస్తున్నాయి.అనేక మంది జర్నలిస్టులు స్వయం సెన్సార్‌ విధించుకుంటున్నట్లు చెబుతున్నారని స్వీడిష్‌ జర్నలిజం ప్రొఫెసర్‌ ఇంగెలా వాడ్‌ బ్రింగ్‌ తెలిపారు. పనామా పత్రాలతో సంబంధం వున్న సమాచారాన్ని పన్నులు, పోలీసు అధికారులకు అందచేయాలని ఫిన్లండ్‌ ఆర్ధిక మంత్రి హుకుం జారీ చేశారు. ఇది ప్రమాదకర సంప్రదాయం అవుతుందంటూ ప్రభుత్వ మీడియా సంపాదకులు తిరస్కరించారు. హెల్సింకీలో ప్రపంచ మీడియా స్వేచ్చా పరిరక్షణ దిన సదస్సు జరుగుతుండటంతో మంత్రి తాత్కాలికంగా వెనక్కు తగ్గాడు.

    మన దేశం విషయానికి వస్తే తాజా సూచికలో 133వ స్థానంలో వున్నందుకు తల దించుకోవాలి. గతేడాది కంటే మూడు ర్యాంకులు తగ్గిందన్న మాటే గానీ ఇదేమీ గౌరవ ప్రదమైంది కాదు. వుగ్రవాదులనుంచి జర్నలిస్టులకు ఎదురవుతున్న బెదిరింపుల పట్ల ప్రధాని నరేంద్రమోడీ నిర్లిప్తంగా వున్నారని, జర్నలిస్టులను రక్షించేందుకు క్రియా విధానం లేదని,ఎప్పుడు అవకాశం వచ్చినా మీడియాను అదుపు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని ఆర్‌ఎస్‌ఎఫ్‌ నివేదిక పేర్కొన్నది. మన పొరుగు దేశాల సూచికలు ఇలా వున్నాయి. చైనా 176, పాకిస్థాన్‌ 147, బంగ్లాదేశ్‌ 144, శ్రీలంక 141, ఆఫ్ఘనిస్తాన్‌ 120, నేపాల్‌ 105, భూటాన్‌ 94. ఇదే సమయంలో స్వేచ్చా ప్రపంచంగా చెప్పుకొనే అమెరికా 44, కమ్యూనిస్టు ఇనుప తెరలను బద్దలు కొట్టామని చెప్పుకుంటున్న రష్యా 148వ స్థానంలో వుంది. ఈ నివేదికలో లోపాలు వున్నాయని అభిప్రాయం కూడా వుంది.

     అక్రమ గనుల తవ్వకాల గురించి పరిశోధించిన సందీప్‌ కొథారి అనే జర్నలిస్టును మధ్యప్రదేశ్‌లో హత్య చేశారు.ఈ సంబంధిత కార్యకలాపాలకు పాల్పడుతున్న శక్తులు కొద్ది వారాలలోనే చేసిన రెండవ హత్య ఇది. ఇసుక, మాంగనీస్‌ మాఫియా గురించి రాయటమే ఆ జర్నలిస్టు చేసిన ‘తప్పిదం’. స్నేహితుడితో కలిసి మోటార్‌ సైకిల్‌పై వెళుతున్న అతనిని కారుతో ఢీకొట్టించి తరువాత కిడ్నాప్‌ చేసి హత్య చేశారు. అంతకు ముందు వుత్తర ప్రదేశ్‌లో జగేంద్ర సింగ్‌ అనే జర్నలిస్టును అతని ఇంటి వద్దే పోలీసులు సజీవ దహనం చేశారు. దేశంలో వుత్తర ప్రదేశ్‌ అత్యంత ప్రమాదకర రాష్ట్రాలలో ఒకటని ఆర్‌ఎస్‌ఎఫ్‌ పేర్కొన్నది. జర్నలిస్టుల హత్యలను నేర సమాచారంలో ప్రత్యేకంగా పరిగణించటం లేదని హోంమంత్రి తెలిపారని, 2014లో దేశంలో ప్రతి మూడు రోజులకు ఒక జర్నలిస్టు దాడులకు గురైనట్లు పేర్కొన్నది.

    ఆర్‌ఎస్‌ఎఫ్‌ ప్రపంచ వ్యాపితంగా అన్ని ప్రాంతాలకు, అన్ని భాషలకు చెందిన మీడియా నుంచి సమాచారాన్ని సేకరించటం లేదు. ముఖ్యంగా మన వంటి ప్రాంతీయ భాషల మీడియా రంగంలో జరుగుతున్న దాడులను కూడా నివేదికలలో చేరిస్తే సమగ్రంగా వుంటుంది. మన రాష్ట్రంలో ఇటీవలి కాలంలో పలు చోట్ల జర్నలిస్టులపై బెదిరింపులు, దాడులు జరుగుతున్నాయి. ప్రాణాలు తీసేందుకు కూడా వెనుకాడటం లేదు. పోలీసులు జర్నలిస్టులపై అక్రమ కేసులు బనాయించటం కొత్త పరిణామం. దీనిపై మీడియాలో పనిచేస్తున్న వారు మేల్కొనకపోతే మరొక మెక్సికో, లాటిన్‌ అమెరికా, ఆఫ్రికా ఖండ దేశాల మాదిరి పరిస్థితులు తయారయ్యే రోజులు ఎంతో దూరంలో లేవు.

జర్నలిస్టులపై జరుగుతున్న దాడుల తీరు తెన్నులు

    ప్రపంచ పత్రికా స్వేచ్చా దినం సందర్బంగా అమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ సంస్ధ కొన్ని వుదంతాలలో జర్నలిస్టులు ఎలా దాడులకు గురైందీ తెలిపింది. జర్నలిస్టులు తమ విధులను నిర్వహించినందుకు తప్ప వారిని వేధించటానికి మరొక కారణాలేమీ లేవని పేర్కొన్నది.’ ప్రపంచ వ్యాపితంగా జర్నలిస్టులను ఏకపక్షంగా అరెస్టు చేస్తున్నారు. పార్టీ విధానాలకు అనుగుణం లేకుండా అధికారంలో వున్న వారిని ఇబ్బంది పెట్టే ప్రశ్నలు అడిగినందుకు గాను వారిని జైలు పాలు చేస్తున్నారు, చివరకు చంపేందుకు కూడా వెనుకాడటం లేదని సంస్ధ పరిశోధనా విభాగపు సీనియర్‌ డైరెక్టర్‌ అన్నా నెయిస్టాట్‌ వ్యాఖ్యానించారు. అమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ సేకరించిన వందలాది కేసులలో కొన్నింటి వివరాలు సంక్షిప్తంగా ఇలా వున్నాయి.

1.మహమ్మద్‌ అబు జైద్‌ అలియాస్‌ షకవాన్‌ ఓ ఫొటో జర్నలిస్టు. కైరోలో నిరసనల సందర్బంగా భద్రతా దళాలు సాగించిన హింసాకాండను చిత్రాలలో బంధించినందుకు మూడు సంవత్సరాల పాటు జైలులో వున్నాడు.అతనిని చిత్రహింసలు కూడా పెట్టారు.మరణశిక్ష పడటానికి వీలు కలిగించే సెక్షన్లతో బనాయించిన కేసులను అతను ఇప్పుడు ఎదుర్కొంటున్నాడు.ఈజిప్టులో నిర్బంధించిన 20 మంది జర్నలిస్టులలో అతను ఒకడు.

2.ఆఫ్రికాలోని కామెరూన్‌లో బాబా వామె, రోడ్రిగ్‌ టోంగ్‌, ఫెలిక్స్‌ ఎబోల్‌ బోలా అనే ముగ్గురు జర్నలిస్టులు భద్రతా దళాలు- ఒక సాయుధ బృందం కుమ్మక్కై ఒక పట్టణంపై చేసిన దాడి గురించి వారు పరిశోధించారు.వారు సేకరించిన సమాచారం దేశ భద్రతకు ముప్పుతెచ్చే దంటూ వారికి అది ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాలంటూ ప్రభుత్వం వారిపై కేసులు బనాయించింది. వార్త వనరులను చెప్పేందుకు వారు నిరాకరించారు.

3.ఖతీజా ఇస్మాయిలోవా అజర్‌బైజాన్‌లో దేశాధ్యక్షుడి కుటుంబంతో సహా అనేక మంది అక్రమాల చిట్టాను బయట పెట్టిన జర్నలిస్టు. ఆమె నోరు మూయించేందుకు అన్ని రకాలుగా బెదిరించినా ఆమె లొంగలేదు. చివరకు తప్పుడు అభియోగాలు మోపి విచారణను బూటకంగా మార్చివేసి ఏడున్నర సంవత్సరాల శిక్ష వేసి జైలులో పెట్టారు.

4. ఆఫ్రికాలోని బురుండీలో ఒక వున్నత సైనికాధికారిని హత్య చేసిన వుదంతంలో ఫొటోలు తీసినందుకు గాను ఎడ్రాస్‌ దికుమానా అనే జర్నలిస్టును అరెస్టు చేశారు.చిత్రహింసల పాలు చేశారు. ప్రస్తుతం అతను ప్రవాసంలో వున్నాడు. తమ పట్ల విమర్శనాత్మకంగా వున్నారనే దుగ్దతో పాలకపార్టీ జర్నలిస్టులు,ప్రతిపక్ష నేతలపై విరుచుకుపడింది. గతేడాది ఒక తిరుగుబాటు సందర్బంగా నాలుగు ప్రయివేటు రేడియోస్టేషన్లను పోలీసులు ధ్వంసం చేశారు.

5. అనాబెల్‌ ఫ్లోరెస్‌ సలజార్‌, మెక్సికోలో ఒక పత్రిక క్రైమ్‌ రిపోర్టర్‌.ఆమెను ఈ ఏడాది ఫిబ్రవరిలో హత్యచేశారు. సాయుధులైన వ్యక్తులు ఆమెను ఇంటి నుంచి తీసుకు వెళ్లి చంపివేశారు. గత ఆరు సంవత్సరాలలో మెక్సికోలో 17 మంది జర్నలిస్టులు హత్యకు గురయ్యారు.

6. అంగోలాలో సెడ్రిక్‌ కార్‌వాలో, డోమింగోస్‌ డా క్రజ్‌ అనే ఇద్దరు జర్నలిస్టులను మరో 15 మందితో కలిపి అరెస్టు చేశారు. వారు చేసిందేమీ లేదు ప్రజాస్వామ్యం, స్వేచ్చ గురించి చర్చించుకోవటమే. తిరుగుబాటుకు సన్నాహంగా కుట్ర చేస్తున్నారనే అభియోగం మోపి నాలుగున్నర సంవత్సరాల జైలు శిక్ష వేశారు.

7.థాయ్‌లాండ్‌లో రాజకుటుంబాన్ని విమర్శించే రెండు వ్యాసాలను ప్రచురించినందుకు సోమయోట్‌ అనే సంపాదకుడికి పది సంవత్సరాల జైలు శిక్ష వేశారు.

8. పత్రికలో వచ్చిన రెండు వార్తాకధనాల ద్వారా అధికారిక రహస్యాలను వెల్లడించారనే పేరుతో కంహరియత్‌ పత్రిక సంపాదకుడు కన్‌ దుండర్‌, ఒక విలేకరిని టర్కీ ప్రభుత్వం అరెస్టు చేసింది. సిరియాలోని సాయుధ ముఠాలకు టర్కీ సైన్యం మానవతా పూర్వక సాయం ముసుగులో ఆయుధాలను ఎలా అందించిందన్నదే వాటి సారాంశం.

ఈ వ్యాసం ఆంధ్రప్రదేశ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్సు ఫెడరేషన్‌ ఆధ్వర్యాన వెలువడే ‘వర్కింగ్‌ జర్నలిస్టు సమాచార స్రవంతి’ మాసపత్రిక మే నెల సంచిక నిమిత్తం రాసినది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

Recent Posts

  • మంచి కంటే హాని ఎక్కువ చేస్తున్న మతం : మెజారిటీ భారతీయుల మనోగతమిది ! మార్కెట్‌ సరకుగా హిందూత్వ !!
  • చైనా వస్తువులను బహిష్కరించగలమా ! అమ్మా భారత మాతా మా చిన్నప్పటి కాకమ్మ కతలే ఇంకా చెప్పొద్దని మోడీ తాతకు చెప్పమ్మా !
  • తమిళ తంబిల ఓట్ల కోసం రాజదండం సరే, కిరీటం, పట్టపు రాణి, రాజ గురువు, రాజ నర్తకి… సంప్రదాయాల సంగతేమిటి !
  • ఏకపక్ష ఆంక్షలతో లొంగని దేశాలను సాధిస్తున్న సామ్రాజ్యవాదం !
  • సరిలేరు నీకెవ్వరూ మోడీ రాజా : మనోభావాలతో నాడు చైనా యాప్‌ నిషేధ ఆట, నేడు అంబానీ కోసం అనుమతి క్రీడ !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • మంచి కంటే హాని ఎక్కువ చేస్తున్న మతం : మెజారిటీ భారతీయుల మనోగతమిది ! మార్కెట్‌ సరకుగా హిందూత్వ !!
  • చైనా వస్తువులను బహిష్కరించగలమా ! అమ్మా భారత మాతా మా చిన్నప్పటి కాకమ్మ కతలే ఇంకా చెప్పొద్దని మోడీ తాతకు చెప్పమ్మా !
  • తమిళ తంబిల ఓట్ల కోసం రాజదండం సరే, కిరీటం, పట్టపు రాణి, రాజ గురువు, రాజ నర్తకి… సంప్రదాయాల సంగతేమిటి !
  • ఏకపక్ష ఆంక్షలతో లొంగని దేశాలను సాధిస్తున్న సామ్రాజ్యవాదం !
  • సరిలేరు నీకెవ్వరూ మోడీ రాజా : మనోభావాలతో నాడు చైనా యాప్‌ నిషేధ ఆట, నేడు అంబానీ కోసం అనుమతి క్రీడ !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • మంచి కంటే హాని ఎక్కువ చేస్తున్న మతం : మెజారిటీ భారతీయుల మనోగతమిది ! మార్కెట్‌ సరకుగా హిందూత్వ !!
  • చైనా వస్తువులను బహిష్కరించగలమా ! అమ్మా భారత మాతా మా చిన్నప్పటి కాకమ్మ కతలే ఇంకా చెప్పొద్దని మోడీ తాతకు చెప్పమ్మా !
  • తమిళ తంబిల ఓట్ల కోసం రాజదండం సరే, కిరీటం, పట్టపు రాణి, రాజ గురువు, రాజ నర్తకి… సంప్రదాయాల సంగతేమిటి !
  • ఏకపక్ష ఆంక్షలతో లొంగని దేశాలను సాధిస్తున్న సామ్రాజ్యవాదం !
  • సరిలేరు నీకెవ్వరూ మోడీ రాజా : మనోభావాలతో నాడు చైనా యాప్‌ నిషేధ ఆట, నేడు అంబానీ కోసం అనుమతి క్రీడ !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Follow Following
    • vedika
    • Join 236 other followers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Customize
    • Follow Following
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d bloggers like this: