• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: BJP u turn on Fuel prices

పెట్రోలు ధరలపై బిజెపి నేతల నోటి తుత్తర – సామాన్య జనానికి విషాదం !

22 Friday Oct 2021

Posted by raomk in BJP, Current Affairs, Economics, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Prices, Uncategorized, USA

≈ Leave a comment

Tags

BJP, BJP motormouth, BJP u turn on Fuel prices, crude oil price, Fuel Price in India, Narendra Modi

ఎం కోటేశ్వరరావు


పెట్రోలు ధరలు లీటరుకు వంద రూపాయలు దాటగానే వచ్చిన విమర్శలను తట్టుకోలేని నరేంద్రమోడీ-బిజెపి అభిమానులు సామాజిక మాధ్యమాల్లో రెచ్చిపోయారు. వంద కాదు రెండు వందలైనా చెల్లిస్తాం, దేశం కోసం తప్ప నరేంద్రమోడీకి ఇస్తున్నారా అంటూ ఎదురుదాడులకు దిగారు. వారిలో ఏ దుష్ట క్షణంలో అలాంటి భావం కలిగిందో గానీ తధాస్తు దేవతలు వారి కోరికను తీర్చనున్నట్లు పరిణామాలు ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు పీపా ధర త్వరలో వంద డాలర్లు కానుంది ఎవరైనా పందెం కాస్తారా అని సవాలు చేసే వారిని మరికొందరు పందెం రాయుళ్లు వందేంటి వచ్చే ఏడాది చివరికి రెండువందల డాలర్లు చూసుకుందామా అంటున్నారు.


శుక్రవారం నాడు ఢిల్లీలో పెట్రోలు ధర రు.106.89, హైదరాబాదులో రు. 111.18 ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో ఇది రాసిన సమయానికి పీపా ముడి చమురు ధర 85.24 డాలర్లుంది. కొద్ది రోజుల క్రితం 86డాలర్లు దాటింది. పెరుగుతున్న ధరల గురించి ఏం చెప్పాలో తెలియక బిజెపి నేతలు నోటి తుత్తర వినోదం పండిస్తుంటే అది జనాలకు విషాదాన్ని నింపుతోంది. మద్దతు ఇచ్చిన మోజో లేక తగ్గకపోతాయా అన్న ఆశ, రోడ్లమీదకొస్తే నీకు దేశభక్తి లేదా, నువ్వు భారతీయుడివి కాదా ? వేయించుకున్న వాక్సినుకు డబ్బు ఇచ్చావా అని కాషాయదళాలు నిలదీస్తాయన్న భయం, ఏదైనా కావచ్చు, వినియోగదారుల నుంచి స్పందన లేదు. దీన్ని అవకాశంగా తీసుకొని ధరల పెరుగుదల గురించి బిజెపి నేతలు అపహాస్యంగా మాట్లాడుతున్నా అది ప్రతిపక్ష నేతలను అనుకుంటున్నారు తప్ప తమను కూడా వెర్రివెంగళప్పలను చేస్తున్నారని అనుకోవటం లేదు. గుర్తించటం లేదు.


తాజాగా ఉపేంద్ర తివారీ అనే ఉత్తర ప్రదేశ్‌ మంత్రిగారు ” కార్లున్న కేవలం కొద్ది మందికి మాత్రమే పెట్రోలు అవసరం, 95శాతం మందికి అవసరం లేదు. వందకోట్ల కరోనా వాక్సిన్లు ఉచితంగా వేశారు.తలసరి ఆదాయంతో పోల్చితే పెట్రోలు ధరలు ఇప్పుడు చాలా తక్కువ.” అని చెప్పారు. గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి రామేశ్వర్‌ తెలి గారేమన్నారంటే ” మన ప్రభుత్వం దేశంలోని 130 కోట్ల మందికి ఉచితంగా వాక్సిన్లు వేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. వాటికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది. చమురు మీద వేసే పన్నుల నుంచే వస్తుంది. కరోనాను ఎదుర్కొనేందుకు మా మంత్రిత్వశాఖ నుంచి ఆరోగ్యశాఖకు నిధులు మళ్లించాము. మీరు గనుక హిమాలయ బ్రాండ్‌ మంచినీరు తాగాలంటే సీసాకు వంద రూపాయలు పెట్టాలి.” కర్ణాటక మంత్రి ఉమేష్‌ విశ్వనాధ్‌ కత్తి ఏం చెప్పారంటే ” కరోనాను కట్టడి చేయాలంటే ఖర్చు అవుతుంది. మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రభుత్వానికి డబ్బు అవసరం గనుక చమురు ధరలు పెరిగాయి.త్వరలో వీటిని పరిష్కరిస్తారు.” అన్నారు. మధ్యప్రదేశ్‌ మంత్రి ప్రద్యుమ్న సింగ్‌ తోమర్‌ ఏమని సెలవిచ్చారంటే ” కూరగాయల మార్కెట్‌కు పోవాలంటే సైకిలును ఉపయోగిస్తామా ? అలా చేస్తే మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది, కాలుష్యమూ ఉండదు. ధరలు ఎక్కువే కానీ దీని ద్వారా పేదలకు లబ్ది సమకూర్చేందుకు డబ్బులు వస్తాయి. మనకు దేశ ఆరోగ్య సేవలు ముఖ్యమా పెట్రోలు, డీజిలు ధరలు ముఖ్యమా ? ” అని ఎదురుదాడికి దిగారు. అదే రాష్ట్రానికి చెందిన మరొక మంత్రి ఓమ్‌ ప్రకాష్‌ సక్లేచా జనాన్ని వెర్రివెంగళప్పలను ఎలా చేశారో చూడండి.” కష్టాలు వచ్చినపుడే మంచి రోజుల్లో ఉన్న సంతోషం ఏమిటో మీరు గుర్తిస్తారు, ఇబ్బందుల్లేవనుకోండి మీరు సంతోషాన్ని అనుభవించలేరు. ” అన్నారు. ఆఫ్ఘనిస్తాన్‌లో చమురు రేట్లు తక్కువంట అక్కడకు వెళ్లండి అన్న పెద్ద మనుషుల గురించి తెలిసిందే, ఇలాంటి వారు మీకు రోజూ చాలా మంది తగులుతూనే ఉంటారు.


గతేడాది ఏప్రిల్‌ 22న పీపా ముడిచమురు 16డాలర్లకు తగ్గింది. మనకు పైసా కూడా తగ్గించలేదు. ఇప్పుడు ఒక డాలరు పెరిగినా తెల్లవారే సరికి పెంచేస్తున్నారు. 2019-20లో మన దేశం దిగుమతి చేసుకున్న చమురు విలువ 130బి.డాలర్లు, మరుసటి ఏడాది కరోనా కారణంగా 82.4 బి.డాలర్లకు తగ్గింది. వర్తమాన సంవత్సరం మొదటి ఆరునెలల్లోనే బిల్లు 70.5బి. డాలర్లుగా ఉంది. పెరుగుతున్న ధరల కారణంగా మిగిలిన ఆరునెలల్లో ఏమేరకు పెరుగుతుందో తెలియదు. ఎంత పెరిగితే అంత మన జేబుల నుంచి తీసుకుంటారు, పన్ను తగ్గించరు, పైసా సబ్సిడీ ఇవ్వరు. గతంలో రుపాయి విలువ పడిపోతే మన్మోహన్‌ సింగ్‌ అసమర్దత అని బిజెపి నేతలు సెలవిచ్చారు. గత ఏడు సంవత్సరాల్లో 58 నుంచి 75కు పతనమైంది. ఇది మోడీగారి సామర్ధ్యానికి నిదర్శనం, దేశం కోసమే అని మనం అంగీకరించాలి. ఇది కూడా చమురు ధరలను పెంచుతోంది. 2020 జూన్‌తో ముగిసిన మూడు మాసాల్లో మన చమురు దిగుమతి బిల్లు 8.5బి.డాలర్లు కాగా ఈ ఏడాది అదే కాలంలో 24.7 బి.డాలర్లకు పెరిగింది. ఈ మొత్తాన్ని జనం నుంచి పిండారు. ఈ కారణంగా ధరల పెరుగుదలతో మరెంత భారం పెరిగిందో లెక్కలు లేవు. పీపా ధర పది డాలర్లు పెరిగితే ద్రవ్యోల్బణం ప్రాతిపదిక సూచి పది పెరుగుతుంది.


బ్రెంట్‌ రకం ముడి చమురు ధర 2018లో 85 డాలర్లు ఉంది. ఇప్పుడు దాన్ని దాటింది. ఏడాది క్రితం దీనిలో సగం ధర ఉంది. దానికి ఒకటి రెండు డాలర్లు తక్కువగా మనం వాడే చమురు ధర ఉంటుంది. సహజంగా ఆర్ధిక రంగం కోలుకుంటే సంతోషంగా ఉంటుంది, కానీ పెరుగుతున్న చమురు ధరలను చూస్తుంటే భయమేస్తోంది. గతేడాది ఏప్రిల్‌లో అమెరికాలో పరిస్ధితి ఎలా ఉందంటే ముందస్తు ఒప్పందం ప్రకారం చమురు తీసుకొనేందుకు కంపెనీలు తిరస్కరించాయి, సరఫరాదార్లకు ఎదురు డబ్బిచ్చి చమురొద్దురా బాబూ నిలవకు జాగా లేదు అన్నాయి. ఇప్పుడు దానికి విరుద్దంగా ఎక్కడ చూసినా ఖాళీ టాంకులే ఉన్నాయట. అంతకు ముందుతో పోలిస్తే నాలుగోవంతు మాత్రమే ఉందట.ఐరోపాలో కూడా నిల్వలు తగ్గాయి. చమురు ధరల పెరుగుదలకు ఇది ఒక కారణంగా చెబుతున్నారు. వచ్చే ఏడాది జనవరి-మార్చి మాసాల్లో 95డాలర్లకు పెరగవచ్చని జెపిమోర్గాన్‌ సంస్ధ జోశ్యం చెప్పింది.


కొందరి అంచనాల ప్రకారం ప్రస్తుతం 83 డాలర్లకు పైగా ఉన్న అమెరికన్‌ రకం ముడి చమురు డిసెంబరు నాటికి వంద డాలర్లకు, వచ్చే ఏడాది డిసెంబరుకు 200 డాలర్లకు చేరవచ్చని చెబుతున్నారు. స్టాక్‌ మార్కెట్లో ఈ మేరకు బ్రెంట్‌ రకం 200 డాలర్లకు కాల్‌ ఆప్షన్‌ లావాదేవీలు జరిగాయి.2022 డిసెంబరులో 200 డాలర్లు ఉంటుందని ఒకరు పది పీపాల మీద రెండు డాలర్ల చొప్పున 20డాలర్ల ప్రీమియం చెల్లించాడనుకుందాం. గడువు నాటికి చమురు ధర అంతకంటే తక్కువ ఉంటే ఆ మొత్తాన్ని కోల్పోతాడు. లేదు 210 డాలర్లకు పెరిగిందనుకోండి. ఒక్కొక్క పీపాకు ప్రీమియం పోను ఎనిమిది డాలర్లు అతనికి లాభం వస్తుంది. ఇలా ఎన్ని పీపాల మీద పందెం కాస్తే నష్టం లేదా లాభం దాన్ని బట్టి ఉంటుంది. అమెరికా, ఐరోపాల్లో ఉన్న స్ధితి, ఆర్ధిక రంగం కోలుకుంటున్నది కనుక డిమాండ్‌ పెరిగి చమురు ధరలు పెరుగుతాయనే అంచనాలు దీన్ని సూచిస్తున్నాయి. ఇదొక జూదం, దీన్ని ప్రమాణంగా తీసుకోవాల్సిన అవసరం లేదు గానీ విస్మరించకూడదు. అమెరికా ముడిచమురు వచ్చే ఫిబ్రవరిలో వంద డాలర్లకు చేరనుందని పందాలు పెరుగుతున్నాయి. 95 నుంచి 180 డాలర్ల వరకు రకరకాల పందాలను కాస్తున్నారు. పెట్రోలు, డీజిలును వాడేది కార్ల యజమానులు మాత్రమే కాదని, వివిధ పరిశ్రమలు కూడా వాడతాయని తద్వారా వస్తువుల ధరలు పెరుగుతాయని బిజెపి మంత్రులకు ఎవరు చెప్పాలి ? కరోనాతో నిమిత్తం లేకుండానే పన్నులు పెంచారని బిజెపి నేతలకు ఎలా చెప్పాలో జనానికే వదిలేద్దాం !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

చమురు మంత్రి ప్రధాన్‌ తీరు తెన్నులు : డాంబికాలు పోవద్దురో డింగరీ డంగై పోతావు !

27 Sunday Jun 2021

Posted by raomk in BJP, Congress, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

BJP u turn on Fuel prices, Fuel Price in India, Fuel tax hike in India, narendra modi bhakts, Narendra Modi Failures


ఎం కోటేశ్వరరావు


చాలా మందికి అశ్చర్యం కలిగిస్తున్నదీ, అర్ధం గాని విషయం ఏమంటే బిజెపి జనాలు ఏ ధైర్యంతో పచ్చి అవాస్తవాలను, వక్రీకరణలను ఇంకా ప్రచారం చేయగలుగుతున్నారు అన్నది. జనానికి చమురు వదిలిస్తున్న కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ పెట్రోలు, డీజిలు ధరల పెరుగుదలకు దిగుమతుల మీద ఆధారపడటం, గత కాంగ్రెస్‌ ప్రభుత్వం జారీ చేసిన చమురు బాండ్లే అని మరోసారి చెప్పారు. కాంగ్రెస్‌ యాభై సంవత్సరాలలో చేయలేని వాటిని తాము ఐదు సంవత్సరాల్లోనే చేశామని చెప్పుకున్న పార్టీకి చెందిన వ్యక్తి ఇలా మాట్లాడటం ఏమిటి అని ఎవరికైనా తట్టిందా ? ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడి తప్పించుకు తిరగటం కదా !


ఇంతకీ గత ఏడు సంవత్సరాలలో ” దేశభక్తులు ” భారతీయ చమురు ఉత్పిత్తిని ఎంత పెంచారో చెప్పగలరా ? 2022 నాటికి దేశం చమురు దిగుమతులను పదిశాతం తగ్గించాలని 2015లో ప్రధాని నరేంద్రమోడీ లక్ష్య నిర్ధేశం చేశారు.2014-15లో మన దేశం వినియోగించే చమురులో 78.6శాతం దిగుమతులపై ఆధారపడి ఉంది.యుపిఏ పాలన చివరి ఏడాది 2013-14లో మన దేశీయ ముడిచమురు ఉత్పత్తి 37,788 మిలియన్‌ టన్నులు.అది 2019-20 నాటికి 32.173 మి. టన్నులకు పడిపోయింది. ఇది పద్దెనిమిది సంవత్సరాలలో కనిష్ట రికార్డు, 2020-21లో మోడీ సర్కార్‌ తన రికార్డును తానే తుత్తునియలు గావించి 30,5 మిలియన్‌ టన్నులకు తగ్గించేసింది. 2019-20 ఏప్రిల్‌-ఫివ్రబరి మాసాల వరకు ఉన్న సమాచారం ప్రకారం విదేశీ దిగుమతుల మీద ఆధారపడింది 86.7శాతం.( కరోనా కారణంగా వినియోగం పడిపోయింది కనుక దిగుమతులు కూడా తగ్గి ఇప్పుడు 85శాతానికి పైగా ఉంది.) దీనికి కూడా నెహ్రూ, కాంగ్రెసే కారణమా, బండబడ చెవుల్లో పూలు పెట్టుకొని వినేవాళ్లుండాలే గానీ ఎన్ని పిట్ట కథలైనా వినిపించేట్టున్నారుగా !

ఇదే ధర్మేంద్ర ప్రధాన్‌ గారి తీరుతెన్నులను చూస్తే లేస్తే మనిషిని గాను అని బెదిరించే కాళ్లు లేని మల్లయ్య కథను గుర్తుకు తెస్తున్నారు. చలి కాలంలో చమురు డిమాండ్‌ ఎక్కువ ఉంటుంది, వేసవి వచ్చిన తరువాత ధరలు తగ్గుతాయని కూడా మంత్రి సెలవిచ్చారు. తగ్గకపోగా రోజూ పెరుగుతున్నాయి. ఇన్నేండ్లుగా ఉన్న కేంద్ర మంత్రికి మార్కెట్‌ తీరుతెన్నులు ఆ మాత్రం తెలియదా లేక తెలిసి కూడా జనాన్ని జోకొట్టేందుకు అలా చెబుతున్నారా ? ఆదివారం ఉదయం (జూన్‌ 27) బ్రెంట్‌ రకం ముడి చమురు పీపా ధర 76.18 డాలర్లు ఉంది, అమెరికా రకం 74.05, మనం కొనుగోలు చేసేది 74.24 డాలర్లు ఉంది. ఇరాన్‌తో ముదురుతున్న అణువివాద నేపధ్యంలో ఎప్పుడైనా 80 డాలర్లు దాట వచ్చన్నది వార్త.


చమురు ఉత్పత్తి దేశాలు ముఖ్యంగా పశ్చిమాసియా దేశాలు ధరలను తగ్గించని పక్షంలో ” చమురు ఆయుధాన్ని ” వినియోగిస్తామని 2015 నుంచీ మంత్రి ప్రధాన్‌ బెదిరిస్తూనే ఉన్నారు. తాజాగా ఏప్రిల్‌ నెలలో మాట్లాడుతూ మధ్యప్రాచ్య దేశాల మీద ఆధారపడటాన్ని తగ్గించాలని చమురుశుద్ధి సంస్ధలను కోరారు. ” చమురు అమ్ముకొనే వారికి భారత్‌ పెద్ద మార్కెట్‌, వారు మా గిరాకీని, అదే విధంగా దీర్ఘకాలిక సంబంధాలను గమనంలో ఉంచుకోవాలని ” బెదిరించారు. సౌదీ తదితర దేశాలను దారికి తెచ్చే పేరుతో ఇప్పటికే అమెరికా చమురు కంపెనీల ప్రలోభాలకు లొంగిపోయి అక్కడి నుంచి చమురు కొనుగోలు చేయటం ప్రారంభించారు. నాలుగు సంవత్సరాల క్రితం ట్రంప్‌ అధికారంలోకి రాక ముందు మన చమురు దిగుమతుల్లో అమెరికా వాటా కేవలం 1.2శాతం మాత్రమే ఉండేది. అలాంటిది ట్రంప్‌తో నరేంద్రమోడీ కౌగిలింతల స్నేహం కుదిరాక ట్రంప్‌ దిగిపోయే సమయానికి 4.5శాతానికి పెరిగింది. మన డాలర్ల సమర్పయామీ, ఆయాసం మిగిలింది తప్ప మనకు ఒరిగిందేమీ లేదనుకోండి. అందుకే మన ప్రధాన్‌ గారు ఎన్ని హెచ్చరికలు చేసినా ఆ పెద్ద మనిషి మాటలకు అంత సీన్‌లేదులే, అయినా మా మీద అలిగితే ఎండేది ఎవరికో మాకు తెలుసు అన్నట్లుగా సౌదీ అరేబియా మంత్రిగానీ, అధికారులు గానీ ఖాతరు చేయలేదు. మిగతా దేశాలూ అంతే.

తాజాగా జూన్‌ 24న ఈ పెద్దమనిషే చమురు ధరలతో తట్టుకోలేకపోతున్నాం, మా ఆర్ధిక పరిస్ధితి కోలుకోవటం కష్టంగా ఉంది కనికరించండి అన్నట్లుగా చమురు ఉత్పత్తి-ఎగుమతి(ఒపెక్‌) దేశాల సంస్ధకు వేడుకోళ్లు పంపారు. ధరలు సరసంగా ఉంటే మీకూ మాకూ ఉపయోగం ఉంటుంది అని అర్ధం చేసుకోండీ అన్నారు. లీటరు రెండు వందలైనా సరే చెల్లిస్తాం-దేశభక్తిని నిరూపించుకుంటాం అంటున్న మోడీ వీరాభిమానుల మనోభావాలను దెబ్బతీయటం తప్ప ఏమిటంటారు.( వీరి కోసం కాషాయ పెట్రోలు బంకులను తెరిచి ఆ ధరలకు విక్రయించే ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి లేదా ప్రతి చోటా కొన్ని ప్రత్యేక బంకులను బిజెపి కార్యకర్తలకే కేటాయించాలి) బెదిరింపులనే ఖాతరు చేయని వారు సుభాషితాలను పట్టించుకుంటారా ? నరేంద్రమోడీ గారూ మీరైనా నోరు విప్పండి లేకపోతే ప్రధాన్‌ నోరైనా మూయించండి ! బడాయి మాటలతో చమురు మంత్రి దేశం పరువు గంగలో కలుపుతున్నారు, జనంలో నవ్వులాటలు ప్రారంభమయ్యాయి. వంద రూపాయలు దాటినా నిరసనగా వీధుల్లోకి వచ్చేందుకు సిగ్గుపడుతున్నారు గానీ అంతిమంగా నష్టపోయేది మీరే, ఆపైన మీ ఇష్టం !

సామాజిక మాధ్యమంలో సంఘపరివార్‌ మరుగుజ్జులు(ట్రోల్స్‌) తిప్పుతున్న ఒక పోస్టర్‌లో మన్మోహన్‌ సింగ్‌ సర్కార్‌ జారీ చేసిన 1.3లక్షల కోట్ల చమురు బాండ్ల అప్పుడు మోడీ సర్కార్‌ను అప్పుల ఊబిలో దింపిందని గుండెలు బాదుకున్నారు. దానిలో చెప్పిందేమిటి ?2005 నుంచి 2010వరకు పెట్రోలు ధరలను తక్కువగా ఉంచేందుకు నాటి ప్రభుత్వం చమురుబాండ్లు జారీ చేసింది. ఆ బాండ్లతో చమురు కంపెనీలు రుణాలు తీసుకొనే వీలు కలిగినందున చమురు ధరలను తక్కువగా ఉంచాయి. యుపిఏ కాలం నాటి 20వేల కోట్ల రూపాయల చమురు బాండ్లను ఇప్పుడు మోడీ ప్రభుత్వం చెల్లించాల్సి వస్తోంది. రానున్న ఐదు సంవత్సరాలలో యుపిఏ ప్రభుత్వ బాండ్లకు గాను 1.3లక్షల కోట్ల రూపాయలను చెల్లించాల్సి ఉంది. నిరర్దక ఆస్తులు, యుపిఏ అవకతవకలకు ఇప్పుడు మోడీ ప్రభుత్వం, పన్ను చెల్లింపుదార్లు మూల్యం చెల్లించాల్సి వస్తోంది. ఈ వాదన ఎంతో వీనుల విందుగా ఉంది కదూ !


ఇందులో చెప్పని, మూసిపెట్టిన అంశం ఏమంటే వాజ్‌పారు నాయకత్వంలోని ఎన్‌డియే ప్రభుత్వం కూడా చమురు బాండ్లను జారీ చేసింది. చమురు వినియోగదారులకు ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీ మొత్తాన్ని చమురు కంపెనీలకు చెల్లించాలి. గతంలో అలాంటి సబ్సిడీల సొమ్మునే చెల్లించలేక సమర్ధ వాజ్‌పాయి, అసమర్ద మన్మోహన్‌ సింగ్‌ సర్కార్‌లు బాండ్ల రూపంలో(జనం ఎవరికైనా అప్పుపడితే ప్రామిసరీ నోట్లు రాసిస్తారు కదా ) ఇచ్చారు. వారందరినీ తలదన్ని 56 అంగుళాల ఛాతీ గలిగిన నరేంద్రమోడీ ఎవడొస్తాడో రండి అంటూ పూర్తిగా సబ్సిడీ ఎత్తివేశారు. మన్మోహన్‌ సింగ్‌ గారి ” చెడు ” రోజులు చివరిలో లేదా నరేంద్రమోడీ గారి ” మంచి రోజుల ” ప్రారంభంలో లీటరు పెట్రోలు, డీజిలు మీద కేంద్ర ప్రభుత్వ పన్ను రూ.9.48, 3.56 చొప్పున ఉంటే తరువాత ఇప్పుడు రూ.32.98, 31.83 చొప్పున వసూలు చేస్తున్నారు. లీటరు మీద ఒక రూపాయి పన్ను లేదా ధర పెంచినా కేంద్రానికి ఏటా పదిహేను వేల కోట్ల రూపాయల అదనపు ఆదాయం వస్తుంది. నరేంద్రమోడీ ఎంత గొప్పవ్యక్తో ఇతర ప్రపంచ నేతలతో పోల్చితే అది దేశభక్తి, ప్రజలపై భారాలను పోల్చితే అది దేశద్రోహం. సరే బిజెపి వారు చెబుతున్నట్లుగా గతంలో ఇచ్చిన సబ్సిడీలను జనం నుంచి వసూలు చేసేందుకే పన్ను విధించారని అంగీకరిద్దాం. రాబోయే ఐదు సంవత్సరాలలో వడ్డీతో సహా 1.3లక్షల కోట్ల మేరకు అదనపు భారం పడింది కనుక, నరేంద్రమోడీ అంతమొత్తాన్ని సర్దుబాటు చేయలేని అసమర్ధతతో ఉన్నారు కనుక మనం తీసుకున్నదాన్ని మనమే చెల్లిద్దాం.


కానీ మన నుంచి వసూలు చేస్తున్నది ఎంత ? జేబులను పూర్తిగా ప్రభుత్వానికి అప్పగిద్దామా ? మన తేల్‌ మంత్రి మహౌదరు ధర్మేంద్ర ప్రధాన్‌ పార్లమెంట్‌ సాక్షిగా చెప్పిన సమాచారం ప్రకారం 2013లో పెట్రోలు, డీజిలు మీద యుపిఏ సర్కార్‌ వసూలు చేసిన పన్ను మొత్తం రు.52,537 కోట్లు, అది 2019-20 నాటికి 2.13లక్షల కోట్లకు చేరింది. ఆ మొత్తం 2020-21 ఆర్ధిక సంవత్సరంలో పదకొండు నెలలకు రు.2.94లక్షల కోట్లకు పెరిగింది. ఈ లెక్కన రాబోయే 1.3లక్షల కోట్ల మన్మోహన్‌ సింగ్‌ అప్పు చెల్లించటానికిగాను మన నరేంద్రమోడీ గారు ఇప్పటికి వసూలు చేసిన కొన్ని లక్షల కోట్లను పక్కన పెడితే, పన్నులేమీ తగ్గించేది లేదని కరాఖండిగా చెబుతున్నారు కనుక ఏటా మూడు లక్షల కోట్ల వంతున వచ్చే ఐదేండ్లలో పదిహేను లక్షల కోట్ల రూపాయలు వసూలు చేయబోతున్నారు. ఇదే విషయాన్ని ” దేశద్రోహులు ” ప్రశ్నిస్తే లడఖ్‌ సరిహద్దుల్లో మిలిటరీ ఖర్చుకు, చైనాతో యుద్ద సన్నాహాలకు మనం చెల్లించకపోతే డబ్బు ఎక్కడి నుంచి వస్తుందంటూ మరుగుజ్జులు వెంటనే కొత్త పల్లవి అందుకుంటారు. పోనీ ఆపేరుతోనే పన్ను వేయమనండి ! బిజెపి వారి ఆదర్శం ఔరంగజేబు విధించాడని చెబుతున్నట్లు జట్టు పెంచితే పన్ను తీస్తే పన్ను అన్నట్లుగా ఏదో ఒక పేరుతో వేయమనండి. మధ్యలో మన్మోహనెందుకు, కాంగ్రెస్‌ ఎందుకు ? చిత్తశుద్ది, నిజాయితీలేని బతుకులు ! జనం పట్టించుకోకపోతే ఇవే కబుర్లు పునరావృతం అవుతాయి మరి !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

చమురు ధరలు : పండుగాడి దెబ్బతో బిజెపి నేతల మైండ్‌ బ్లాక్‌ – జనానికి దరిద్రంగా మారిన నరేంద్రమోడీ అదృష్టం !

28 Sunday Feb 2021

Posted by raomk in BJP, Congress, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, Uncategorized

≈ Leave a comment

Tags

#Fuel Prices India, #narendra modi, BJP u turn on Fuel prices, India fuel tax


ఎం కోటేశ్వరరావు
” ఎవడు కొడితే దిమ్మతిరిగి మైండ్‌ బ్లాక్‌ అయిపోద్దో వాడే పండు గాడు ” దీని గురించి వేరే చెప్పనవసరం లేదు కదా ! బిజెపి నేతలు, వారి అనుయాయులకు చమురు పండుగాడి దెబ్బ తగిలినట్లుంది. లేకపోతే చమురు ధరల మీద గతంలో ఒక మాట ఇప్పుడు ఒక మాట, ప్రధాని, ఆర్ధిక మంత్రి, చమురు మంత్రి ఇలా ఢిల్లీ నుంచి గల్లీ వరకు తలా ఒక మాట ఎలా మాట్లాడతారు ? రాజకీయ పార్టీల నేతలు (వామపక్షాలు దీనికి మినహాయింపు-వారు కూడా అలాంటివి పెట్టినట్లు ఎవరైనా నిరూపిస్తే సవరించుకుంటానని మనవి) జనానికి చెవుల్లో పూలు పెట్టాలను కోవటం నిత్యకృత్యం. అందులోనూ కమలం పువ్వు బిజెపిదే కనుక వారికి మేథోపరమైన, ప్రత్యేక హక్కులు కూడా ఉంటాయి.
” చమురు బంకుల దగ్గర బోర్డులు పెట్టాలి. కేంద్రం, రాష్ట్రాలు ఎంతెంత పన్ను విధిస్తున్నాయో, కేంద్రం విధించే పన్నుల్లో తిరిగి రాష్ట్రాలకు ఎంత వస్తున్నదో వాస్తవ భారం ఎంతో వివరిస్తూ ఆ బోర్డుల్లో రాస్తే జనానికి అసలు విషయాలు తెలుస్తాయి.” అని కొంతకాలం క్రితం మోడీ భక్తులు ప్రచారం చేశారు. బారు గడ్డంతో చిదానంద స్వామిలా ఎలాంటి తొణుకూ బెణుకూ లేకుండా ఉన్న నిలువెత్తు నరేంద్రమోడీ చిత్రంతో ప్రతి బంకు వద్ద ఇప్పటికైనా భక్తులు స్వచ్చందంగా పెట్టినా ఇబ్బంది లేదు.లేదా జియోకు ఎలాగూ బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉన్నారు గనుక ముకేష్‌ అంబానీ లేదా అదానీ అయినా తమ ప్రచార అంశాన్ని కిందో పైనో పెట్టి చమురు గురించి బోర్డులు పెట్టి రుణం తీర్చుకోవాలి.జనానికి వాస్తవాలను తెలియపరచాలి.

చమురు ధర వందడాలర్ల గురించి చర్చ ప్రారంభం !

ఇక పండుగాడి దెబ్బ గురించి చూద్దాం.కొద్ది రోజుల క్రితం బ్రెంట్‌ ముడి చమురు ధర 67-68 డాలర్ల వరకు ఊగిసలాడి ఆదివారం సాయంత్రం 66.13డాలర్ల దగ్గర, మన చమురు 65.70 డాలర్ల వద్ద ఉంది. మరోవైపున 2022 నాటికి వందడాలర్ల గురించి వ్యాపారులు ఆలోచిస్తున్నారు. త్వరలో 75-80 డాలర్ల వరకు పెరగవచ్చని కొందరి జోశ్యం. పిల్లి చెలగాటం ఎలుకకు ప్రాణ సంకటం అన్నది తెలిసిందే. చమురు ధరల చెలగాటం జనానికి అలవాటైపోయింది. ఎంత చెబితే అంత చెల్లించటం దేశభక్తిగా భావిస్తున్నారు.తాము చెల్లించేది కార్పొరేట్లకు రాయితీల రూపంలో సమర్పిస్తున్నారనేది తెలియటం లేదు. నరేంద్రమోడీ గారికి ఇప్పుడిప్పుడే అనుభవంలోకి వస్తోంది. ఎందుకంటే ఆయన అధికారానికి వచ్చిన నాటి నుంచి బహుశా ఎలాంటి ప్రచార ఆర్భాటం లేకుండానే అంతర్జాతీయ మార్కెట్‌ను నియంత్రించి ఉండాలి. లేకపోతే రికార్డు స్దాయిలో సంవత్సరాల తరబడి ధరలు ఎందుకు తగ్గి ఉంటాయి. ఇప్పుడు కాక మొదలైంది కనుక చమురు పండు గాడు గుర్తుకు వస్తున్నట్లుంది.

ఎవరేం మాట్లాడుతున్నారో తెలుస్తోందా ! సమన్వయం ఉండదా !

ఫిబ్రవరి 17వ తేదీన ప్రధాని నరేంద్రమోడీ మాట్లాడుతూ చమురు ధరలు వందరూపాయలు(బ్రాండెడ్‌) దాటాయన్న వార్తలను పరోక్షంగా ప్రస్తావిస్తూ ధరలు ఆకాశాన్ని తాకటానికి గత పాలకులే కారణమంటూ గడ్డాన్ని సవరించుకున్నారు. వారు గనుక (తమ నేత వాజ్‌పాయి గారు కూడా ఆరేండ్లు అధికారంలో ఉన్న విషయం గుర్తు లేనట్లుంది) దిగుమతుల మీద ఆధారపడటాన్ని తగ్గించేందుకు కేంద్రీకరించి ఉంటే మధ్యతరగతికి ఈ భారం ఉండేది కాదు అంటూనే అబ్బే నేను ఎవరినీ విమర్శించటానికి కాదు గానీ ఈ విషయం చెప్పక తప్పదు అన్నారు. ఏ స్కూలు విద్యార్ధిని అడిగినా గత ఏడు సంవత్సరాల కాలంలో చమురు దిగుమతులు పెరిగాయో తరిగాయో, స్వదేశీ ఉత్పత్తి ఎలా దిగజారిందో మోడీ గారికి పాఠంగా చెబుతారు.
ప్రధాన మంత్రి నరేంద్రమోడీ కబుర్లు ఆయన గడ్డం పెరుగుదల కంటే ఎక్కువగా ఉన్నాయి.పెట్రోల్లో ఇథనాల్‌ను ప్రస్తుతం 8.5శాతం కలుపుతున్నామని, 2025 నాటికి దాన్ని 20శాతానికి పెంచాలని లక్ష్యంగా నిర్ణయించామని అది జరిగితే దిగుమతులు తగ్గుతాయి, రైతులకు ప్రత్యామ్నాయ ఆదాయాలు పెరుగుతాయి. మధ్యతరగతి గురించి తాము ఎంతో సున్నితంగా వున్నామన్నారు. అసలు విషయం ఏమంటే చక్కెర పరిశ్రమలు ఇథనాల్‌ సరఫరా చేస్తుంటే వాటిని నిల్వచేసే ట్యాంకులను కూడా చమురు సంస్దలు ఏర్పాటు చేయలేదు. మోడీ గారు ఏమి చేస్తున్నారో తెలియదు.


చలికాలం తరువాత చమురు ధరలు తగ్గుతాయని ఆ శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ఫిబ్రవరి 26న చెప్పారు.అయినా ఇది అంతర్జాతీయ వ్యవహారం, గిరాకీ పెరిగిన కారణంగా ధరలు పెరిగాయని సెలవిచ్చారు. చలికాలంలో ధరలు పెరగటం తరువాత తగ్గటం మామూలే అన్నారు. గత ఏడు సంవత్సరాల కాలంలో అలా ఎప్పుడైనా జరిగిందా ? ఒక దేశంలో చలికాలం అయితే మరో దేశంలో మరో వాతావరణం ఉంటుందని జనానికి తెలియదా అని అడిగితే దేశద్రోహం కేసు బనాయిస్తారు. కరోనా లాక్‌డౌన్‌ సమయంలో చమురు ధరలు అత్యంత కనిష్టానికి పడిపోయిన సమయంలో దానికి అనుగుణ్యంగా 86 రోజుల పాటు ధరలను ఎందుకు తగ్గించలేదో మంత్రిగారు చెబుతారా ? చమురేమైనా టమాటాల్లాంటివా ! సీజన్‌లో కొనేవారు లేక రైతులు పారపోస్తారు లేదా కిలో రూపాయికి లోపే అమ్ముకుంటారు. చమురు అలాంటిది కాదే.


మరోవైపున ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చమురు ధరలు తగ్గుతాయని తాను చెప్పలేనని,అదొక ధర్మ సంకటమని చెప్పారు. ఉల్లిధరల గురించి అడిగినపుడు నేను వాటిని తినను కనుక తెలియదని, జిఎస్‌టి నష్టాలకు దేవుడి విధి అని కేంద్రం ఏమీ చేయలేదని గతంలో చెప్పిన ఆమె నుంచి అంతకు మించి ఏమి ఆశించగలదు దేశం. ఇదే సమయంలో రిజర్వుబ్యాంకు గవర్నర్‌ శక్తికాంత దాస్‌ మాట్లాడుతూ చమురుపై పన్నులు తగ్గించేందుకు కేంద్రం, రాష్ట్రాలు సమన్వయంతో పని చేయాలని కోరారు.ఎవరేం మాట్లాడుతున్నారో గమనించే స్ధితిలో ఉన్నారా ? పెట్రోలియం మంత్రి ఫిబ్రవరి పదవ తేదీన రాజ్యసభలో మాట్లాడుతూ గత మూడు వందల రోజుల్లో కేవలం 60 రోజులు మాత్రమే ధరలు పెంచామని పెట్రోలు ఏడు, డీజిలు 21 రోజులు తగ్గించామని, 250 రోజులు, పెంచలేదు తగ్గించలేదు అన్నారు. అంటే ఆ రోజుల్లో అంతర్జాతీయ ధరల్లో ఎలాంటి మార్పు లేదా ? ఎవరిని మభ్యపెట్టేందుకు ఇలాంటి మాటలు చెబుతారు.

మతిమరపు నటిస్తున్న బిజెపి పెద్దలు ! చంద్రబాబుకు మోకాళ్ల నొప్పులు !

ఇప్పుడు జనానికి సుభాషితాలు చెబుతున్న బిజెపి నేతలు గతంలో చమురు ధరలు పెరిగి నపుడు ఏమి సెలవిచ్చారో మతిమరపు నటిస్తున్న కారణంగా వారేమీ చెప్పలేరు గాని వారిని అభిమానించే వారు తెలుసుకోవాలి. వీధుల్లో వేసిన వేషాలు, చేసిన ప్రదర్శనలు, అన్నట్లు మరిచాను చంద్రబాబు నాయుడు కూడా బిజెపితో జతకట్టిన కారణంగా యుపిఏకు వ్యతిరేకంగా సైకిలు తొక్కి నిరసన తెలియచేశారు. ఇప్పుడు బహుశా మోకాళ్ల నొప్పులు వచ్చి ఉంటాయి అనుకుంటే కుర్రవాడైన కొడుకు లోకేష్‌ ఎందుకు తొక్కటం లేదు ?


2006లో ముడిచమురు ధర పీపా 55 నుంచి 70 డాలర్లకు పెరిగినపడు బిజెపి డ్రామాలను జనం చూశారు.లీటరుకు 4,2 రూపాయల చొప్పున పెట్రోలు, డీజిలు మీద పెంచిన యుపిఏ సర్కార్‌ దానికి చెప్పిన కారణం అలా పెంచకపోతే చమురు కంపెనీలు కుప్పకూలిపోతాయని.గత సంవత్సరం చమురు ధర 20 డాలర్లకు పడిపోయినపుడు తరువాత 40 డాలర్లయినపుడు కూడా అంతకు ముందు ఉన్న ధరలను తగ్గించలేదు. ఎందుకంటే కరోనా సమయంలో చమురు వినియోగం పడిపోయింది తప్ప కంపెనీల, పెట్రోలు బంకుల ఖర్చులు తగ్గలేదు కనుక తగ్గిన మేరకు ధరలు తగ్గించలేదని బిజెపి నేతలు చెప్పటం తెలిసిందే. మరి సామాన్య జన ఆదాయాలు తగ్గకుండా ఏం చేశారంటే మాత్రం నోరు పెగలదు. నాడు మాజీ ప్రధాని వాజ్‌పాయి గారు యుపిఏ సర్కార్‌ క్రూరమైన పరిహాస మాడుతోందన్నారు.కేంద్రం, రాష్ట్రాలు పన్నులు తగ్గించాలన్నారు. గుజరాత్‌లో మారణకాండ సమయంలో నరేంద్రమోడీ రాజధర్మం పాటించాలని వాజ్‌పాయి చెప్పారు. ఆయన బతికి ఉండగానే ఆ మాటల మీద చల్‌ అన్నట్లుగా పట్టించుకోని నరేంద్రమోడీ ఇప్పుడు దివంగత నేతకు ప్రమాణాలు చేయటం తప్ప ఆయన మాటలను పట్టించుకుంటారా, పాటిస్తారా !


ఇప్పుడు బిజెపిఏతర పాలిత రాష్ట్రాలు పన్నులు తగ్గించవచ్చు కదా అంటున్న బిజెపి వారు అప్పుడు తమ ఏలుబడిలో ఎంత మేరకు తగ్గించారో చెప్పగలరా ? అప్పుడు పెట్రోలు లీటరు ధర 47.51, డీజిలు ధర 23.52 ఉండేది. నిజంగా క్రూరమైన పరిహాసం ఏమంటే వాజ్‌పారు నాయకత్వంలోని ఎన్‌డిఏ సర్కార్‌ ఆరు సంవత్సరాలలో 33 సార్లు ధరలను పెంచింది. 2002-06 మధ్య అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధర 24 నుంచి 75 డాలర్లకు పెరిగింది. చమురు ధరలపై నియంత్రణ ఎత్తివేసి మార్కెట్‌ ధరలను వసూలు చేయాలని నిర్ణయించింది. అధికారం పోగానే మర్యాదస్తుడని అనేక మంది భావించే వాజ్‌పేయి నాయకత్వంలోనే బిజెపి ధరల పెరుగుదల వ్యతిరేక నిరసన నాటకాలాడింది నిజం కాదా ?

పన్నుల విధింపులో ఔరంగజేబు ఆదర్శమా !


2020 ఏప్రిల్‌-నవంబరు మాసాల్లో (లాక్‌డౌన్‌ సమయం) కేంద్ర ఎక్సయిజు పన్ను చమురు ఖాతా నుంచి 1,96,342 కోట్లు వస్తే అంతకు ముందు సంవత్సరంలో అదే వ్యవధిలో వచ్చిన మొత్తం 1,32,899 కోట్లు మాత్రమే.చమురు కంపెనీలతో పాటు మోడీ సర్కార్‌ జనం నుంచి పిండిన తీరు ఇది. అంతకు ముందుతో పోల్చితే వినియోగం తగ్గినప్పటికీ ఔరంగజేబు మాదిరి పన్నులతో పీల్చిన ఫలితమిది.ఇదే సమయంలో జిఎస్‌టి ఆదాయం గణనీయంగా తగ్గి రాష్ట్రాలు ఎంతో ఇబ్బంది పడ్డాయి. నిద్రపోయే వారిని లేపి ఈ విషయాలన్నీ చెప్పగలం తప్ప నటించేవారికి చెప్పలేము.


జనానికి బుర్రలుండవని, ఉన్నా ఉపయోగించలేని బద్దకం బలిసిపోయిందని బిజెపికి అనుకుంటున్నట్లుగా మరొక పార్టీ భావించదని అంగీకరించకతప్పదు. లేకపోతే పెరిగిన ధరలను సమర్ధించేందుకు ఎంత ధైర్యం ఉండాలి. స్మృతి ఇరానీ పెద్ద నటి అన్న విషయం తెలిసిందే. ఆమె బిజెపి నేతగా 2011 జూన్‌ 24న గ్యాస్‌ బండ మీద 50 రూపాయల పెంపుదల మీద చేసిన ట్వీట్‌లో ఏమన్నారో తెలుసా ? మాది సామాన్యుల ప్రభుత్వం అని చెప్పుకుంటారు, గ్యాస్‌ ధర 50 పెంపా, ఎంత సిగ్గు చేటు అన్నారు. ఇప్పుడు ఆమె గౌరవనీయమైన కేంద్ర మంత్రి. డిసెంబరు నుంచి ఇప్పటి వరకు 150 రూపాయలు పెంచారు. మంత్రిగారు గనుక ఆమె వంటశాలకు దూరంగా ఉంటారు గనుక తెలిసి ఉండదు. లేకపోతే గతంలో మాదిరి వీధుల్లో వచ్చి ఉండేవారు. బిజెపి ఐటి విభాగ అధిపతి అమిత్‌ మాలవీయ జగమెరిగిన ఫేకిస్టు.2012 అక్టోబరు ఆరున ఒక ట్వీట్‌ చేశారు. అదేమంటే అప్పటి యుపిఏ సర్కార్‌ గ్యాస్‌ బండమీద రు.11.42పైసలు పెంచింది. దానికి వ్యతిరేకంగా సామాన్యులు, మహిళల మీద కాంగ్రెస్‌ బ్యాండ్‌ మోత మోగించింది అన్నారు. ఇప్పుడు జరిగిందేమిటి ? లెక్కలు చెప్పాలా ?ఒక సంఖ్య చెబితే మరుసటి రోజుకో వారానికో మారిపోతున్నందున ఎవరికి వారు బండను బుక్‌ చేసినపుడు ఎంత ఉందో తెలుసుకొని మోడీ సర్కార్‌కు భజన చేయాలో బ్యాండ్‌ బజాయించాలో నిర్ణయించుకోవచ్చు.


సిఎంగా మోడీ నాడేమన్నారు-ప్రధానిగా నేడేం చేస్తున్నారు !


2012 మే నెలలో పెట్రోలు ధరను లీటరుకు రూ.7.54 పెంచారు. దాంతో ఢిల్లీలో రు.73.18కి పెరిగింది. దాని మీద నాటి గుజరాత్‌ ముఖ్యమంత్రిగా నరేంద్రమోడీ మండిపడ్డారు.అది కాంగ్రెస్‌ నాయకత్వంలోని యుపిఏ ప్రభుత్వ వైఫల్యానికి ఒక ముఖ్య ఉదాహరణ అన్నారు.తొమ్మిది సంవత్సరాల తప్పుడు ఆర్ధిక విధానాల పర్యవసానం అన్నారు బిజెపి నేతలు. ఆర్ధిక వ్యవస్ధను బలంగా ఉంచే విధంగా సరైన విధానాలను యుపిఏ అనుసరించి ఉంటే అది చమురు సబ్సిడీలను ఇచ్చే స్ధితిలో ఉండేది అన్నారు. తరువాత వామపక్షాలతో పాటు బిజెపి కూడా చమురు ధరలకు వ్యతిరేకంగా భారత్‌ బంద్‌లో పాల్గొన్నది. ఇప్పుడు బిజెపి నేతలు ఏం చేస్తున్నారు ? సబ్సిడీలన్నీ ఎత్తివేశారు. మోడీ అధికారానికి రాక ముందు మే 2014లో 113 డాలర్లు ఉన్న ముడిచమురు ధర మరుసటి ఏడాది జనవరి నాటికి 50 డాలర్లకు పడిపోయింది.


2015లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆయనేమన్నారు. నిజమే నేను అదృష్టవంతుడనే, కానీ మీకు డబ్బు ఆదాఅవుతోంది. మోడీ అదృష్టం జనానికి లబ్ది చేకూర్చుతుంటే అంతకంటే కావాల్సిందేముంది ? నా అదృష్టం కారణంగా పెట్రోలు, డీజిలు ధరలు తగ్గితే సామాన్యుల పొదుపు ఎక్కువ అవుతుంది. అందువలన అదృష్టవంతులు కాని వారిని తీసుకురావాల్సిన(ఎన్నుకోవాల్సిన) అవసరం ఏముంది అంటూ కాంగ్రెస్‌ మీద వ్యాఖ్యానించారు. ఆ అదృష్టం ఇంకా పెరిగి 2016లో ఒక దశలో ముడిచమురు ధర 29 డాలర్లకు పడిపోయింది. సదరు అదృష్టవంతుడు చేసిందేమిటి ? వినియోగదారులకు దరిద్రాన్ని పట్టించటం కాదా ? 2014 మే నుంచి ఇప్పటి వరకు వరకు వంద రూపాయలు పెంచి ఒక్క రూపాయి తగ్గించిన మాదిరి ఉదారత్వాలను పరిగణనలోకి తీసుకుంటే భారం ఎలా ఉందో చూద్దాం.
సం ××సరకు ×× ఎక్సయిజ్‌×××డీలరు ధర××వినియోగదారు ధర
2014 ×× పెట్రోల్‌ ×××× 9.48 ××× 49.50 ××××× 73.20
2021 ×× పెట్రోల్‌ ×××× 32.98 ××× 27.75 ××××× 83.71
2014 ×× డీజిలు ×××× 3.56 ××× 52.68 ××××× 55.48
2021 ×× డీజిలు ×××× 31.80 ××× 33.74 ××××× 79.74
(గమనిక 2014డీజిలు, పెట్రోలు ధరలు మార్చి ఒకటవ తేదీ ఢిల్లీ, 2021 డీజిలు ధర ఫిబ్రవరి 16, పెట్రోలు ధర జనవరి ఒకటవ తేదీ ఢిల్లీకి చెందినవి, హిందూస్దాన్‌ పెట్రోలియం కంపెనీ ధరలుగా గమనించాలి.2014 మార్చిలో పెట్రోలు మీద సబ్సిడీ లేదు, డీజిలు మీద లీటరుకు రూ.8.37 సబ్సిడీ ఉంది.)

అమెజాన్‌ ”టూల్‌ కిట్‌ ” లో ప్రధాని నరేంద్రమోడీ గురించి ఉన్నది ఏమిటి ?


విదేశీయులు లేదా స్వదేశీయులు ఒక ప్రధాని లేదా ముఖ్యమంత్రులను పొగడుతున్నారు అంటే వారిలో రెండు రకాల అభిప్రాయాలు ఉంటాయి. దానికి ఎవరూ మినహాయింపు కాదు. ఒకటి ప్రయోజనం కోసం చెప్పే మెరమెచ్చు మాటలు, రెండోది అంతర్గతంగా ఉన్న అభిప్రాయం.2012 ఫిబ్రవరి 18వ తేదీన బిజినెస్‌ టుడే అనే పత్రిక రాయిటర్‌ సంస్ధ ఇచ్చిన వార్తను ప్రచురించింది. ” మోడీ ఒక మేథావి కాదు: ప్రధాని గురించి అంతర్గత పత్రాల్లో అమెజాన్‌ వర్ణణ ” అన్నది దాని శీర్షిక. ప్రముఖులు ఇతరులతో సంభాషించే సమయంలో మాట్లాడాల్సినవి ఏవి, మాట్లాడకూడనివి ఏవి, బలం ఏమిటి బలహీనతలు ఏమిటి అని కంపెనీ సిబ్బంది ఒక నోట్‌ తయారు చేస్తారు. దానికి అనుగుణ్యంగానే అమెరికాలోని భారత రాయబారితో 2019లో అమెజాన్‌ డాట్‌కామ్‌ మాజీ ఎగ్జిక్యూటివ్‌ జే కార్నే మాట్లాడేందుకు వెళ్లినపుడు సిబ్బంది ఒక పత్రంలో కొన్ని విషయాలు రాశారు.అప్పుడు కార్నే మోడీని బహిరంగంగా ఇలా వర్ణించాడు ” సీదా సాదాగా, తర్కబద్దంగా, ముక్కుసూటిగా ఉంటారు” అని పేర్కొన్నాడు. అమెజాన్‌ కంపెనీ 2012 నుంచి 2019వరకు రూపొందించిన ఇలాంటి పత్రాలు రాయిటర్‌ వార్తా సంస్దకు దొరికాయి. ఒకదానిలో మోడీ ముక్కుసూటి తనం, ఆలోచించే తీరు ఆయన ఒక మేథావి స్దాయికి తగినదిగా ఉండదు అని పేర్కొన్నారు. ఒక మేథావీకాదు, ఒక పండితుడు కాదు గానీ బలమైన పాలనా, యంత్రాంగంతో విజయవంతమైన ప్రభుత్వాన్ని నడుపుతున్నారని పేర్కొన్నారు.అలాంటి పత్రాలను రూపొందించిన వారిలో మన దేశానికి చెందిన అమెజాన్‌ కంపెనీ ప్రతినిధి అమిత్‌ అగర్వాల్‌ వంటి స్వదేశీయులే ఉన్నారు. టూల్‌కిట్‌తో మన పరువు పోయిందని గగ్గోలు పెడుతున్నవారు ఇలాంటి టూల్‌కిట్ల గురించి కూడా తెలుసుకుంటే మంచిదేమో ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

Recent Posts

  • చమురు పన్ను తగ్గింపు : శ్రీలంక దెబ్బతో నరేంద్రమోడీ అదిరి పడ్డారా !
  • ప్రపంచాన్ని భయపెడుతున్న మంకీపాక్స్‌ వెనుక అమెరికా హస్తం ఉందా ?
  • హజ్‌ యాత్రీకుల కోసం నరేంద్రమోడీ పైరవీ – విజయన్‌పై నోరు పారవేసుకున్న పిసిసినేత !
  • ఇండోనేషియా కమ్యూనిస్టు ఊచకోత వెనుక బ్రిటన్‌ !
  • వందేళ్ల చైనా కమ్యూనిస్టు యూత్‌లీగ్‌ !

Recent Comments

SHEIK ALI HUSSAIN on ప్రపంచాన్ని భయపెడుతున్న మంకీపా…
raomk on రంగనాయకమ్మ గారూ”కుహనా మి…
యూహెచ్ ప్రీతమ్ on రంగనాయకమ్మ గారూ”కుహనా మి…
V.S.Srinivasa Babu on జాడలేని అపర జాతీయవాదులు…
K Seenaih on రష్యా – ఉక్రెయిన్‌ యుద్ధ…

Archives

  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • చమురు పన్ను తగ్గింపు : శ్రీలంక దెబ్బతో నరేంద్రమోడీ అదిరి పడ్డారా !
  • ప్రపంచాన్ని భయపెడుతున్న మంకీపాక్స్‌ వెనుక అమెరికా హస్తం ఉందా ?
  • హజ్‌ యాత్రీకుల కోసం నరేంద్రమోడీ పైరవీ – విజయన్‌పై నోరు పారవేసుకున్న పిసిసినేత !
  • ఇండోనేషియా కమ్యూనిస్టు ఊచకోత వెనుక బ్రిటన్‌ !
  • వందేళ్ల చైనా కమ్యూనిస్టు యూత్‌లీగ్‌ !

Recent Comments

SHEIK ALI HUSSAIN on ప్రపంచాన్ని భయపెడుతున్న మంకీపా…
raomk on రంగనాయకమ్మ గారూ”కుహనా మి…
యూహెచ్ ప్రీతమ్ on రంగనాయకమ్మ గారూ”కుహనా మి…
V.S.Srinivasa Babu on జాడలేని అపర జాతీయవాదులు…
K Seenaih on రష్యా – ఉక్రెయిన్‌ యుద్ధ…

Archives

  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • చమురు పన్ను తగ్గింపు : శ్రీలంక దెబ్బతో నరేంద్రమోడీ అదిరి పడ్డారా !
  • ప్రపంచాన్ని భయపెడుతున్న మంకీపాక్స్‌ వెనుక అమెరికా హస్తం ఉందా ?
  • హజ్‌ యాత్రీకుల కోసం నరేంద్రమోడీ పైరవీ – విజయన్‌పై నోరు పారవేసుకున్న పిసిసినేత !
  • ఇండోనేషియా కమ్యూనిస్టు ఊచకోత వెనుక బ్రిటన్‌ !
  • వందేళ్ల చైనా కమ్యూనిస్టు యూత్‌లీగ్‌ !

Recent Comments

SHEIK ALI HUSSAIN on ప్రపంచాన్ని భయపెడుతున్న మంకీపా…
raomk on రంగనాయకమ్మ గారూ”కుహనా మి…
యూహెచ్ ప్రీతమ్ on రంగనాయకమ్మ గారూ”కుహనా మి…
V.S.Srinivasa Babu on జాడలేని అపర జాతీయవాదులు…
K Seenaih on రష్యా – ఉక్రెయిన్‌ యుద్ధ…

Archives

  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Follow Following
    • vedika
    • Join 921 other followers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Customize
    • Follow Following
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d bloggers like this: