• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: BSP

ఉత్తర ప్రదేశ్‌లో బిజెపి బుకాయింపులు – అసలు రంగు !

15 Tuesday Mar 2022

Posted by raomk in BJP, Communalism, Congress, Current Affairs, Farmers, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Politics, RELIGION, Uncategorized, Women

≈ Leave a comment

Tags

BJP, BSP, Narendra Modi, RSS, Samajwadi Party, UP election 2022


ఎం కోటేశ్వరరావు


ఎంతో ఆసక్తి కలిగించిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చాయి. తమకు ఇంక 2024లో కూడా తిరుగులేదని బిజెపి ఢంకా బజాయిస్తోంది. కాంగ్రెస్‌, ఇతర పార్టీలు ఆత్మశోధనలో పడ్డాయి. ఎవరి సూత్రీకరణలు వారు చేసుకుంటున్నారు. ఇంకా కొత్త ప్రభుత్వాలు కొలువు తీరలేదు. పలు కోణాల్లో విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఇవన్నీ సహజం.వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక అన్నట్లుగా రాజకీయ పార్టీలు చెప్పిన వాటికి ప్రతిదానికీ తలూపాల్సిన అవసరంలేదు. జనం ఇచ్చిన తీర్పును గౌరవించటం వేరు. చరిత్రలో ఇచ్చిన తీర్పులన్నీ సరైనవే అని ఆమోదించాల్సిన అవసరం లేదు. హిట్లర్‌ వంటి నియంతలకు కూడా జనమే ఓట్లు వేసి గెలిపించారు. అంతమాత్రాన వారి తీర్పు సరైనదే అంటామా ? ఉత్తర ప్రదేశ్‌కు సంబంధించి కొన్ని అంశాల తీరు తెన్నులను చూద్దాం.


యోగి ఆదిత్యనాధ్‌ అభివృద్దిని చూసి తిరిగి గెలిపించి చరిత్ర సృష్టించారు. ఇటీవలి సంవత్సరాల్లో వరుసగా రెండవసారి పార్టీ అధికారానికి రాని చరిత్రను బిజెపి తిరగరాసింది.రెండవది నిజమే. ఇక మొదటి అంశం, అభివృద్ధి అంటే ఏమిటి ? అందునా యోగి చిన్న ఇంజనైతే పెద్ద ఇంజను నరేంద్రమోడీ కూడా తోడయ్యారు అన్నారు. జరిగిందేమిటి ? 2016-21 కాలంలో ఉత్తర ప్రదేశ్‌లో ఉపాధి రేటు 38.5 నుంచి 32.79(2021 సెప్టెంబరు-డిసెంబరు)శాతానికి పడిపోయింది.కార్మికశక్తి భాగస్వామ్యం కూడా ఇదే కాలంలో 46.32 నుంచి 34.45 శాతానికి తగ్గింది. నీతిఆయోగ్‌ సంస్ధ వెల్లడించిన వివరాల ప్రకారం దారిద్య్రంలో బీహార్‌, ఝార్ఖండ్‌ తరువాత ఉత్తర ప్రదేశ్‌ మూడవ స్ధానంలో ఉంది. అందుకే బిజెపి చెప్పే అభివృద్ధి అంటే ఏమిటి అన్న ప్రశ్న వస్తోంది. అయినా జనం ఎందుకు ఓట్లు వేశారనే ప్రశ్న తలెత్తుతుంది. గతంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నపుడు మరొక ప్రత్నామ్నాయం లేక జనం పదే పదే ఓట్లు వేశారు, దానినేమందాం ?ఉత్తర ప్రదేశ్‌లో ప్రతిపక్ష సమాజవాది మీద తగినంత విశ్వాసం లేకపోవటం ఒకటిగా కనిపిస్తోంది. రెండవది బిజెపి బి టీమ్‌లుగా పేరు తెచ్చుకున్న బిఎస్‌పి, మజ్లిస్‌ పార్టీలు చీల్చిన ఓట్లు బిజెపికి తోడ్పడ్డాయి. పోటీ 80-20శాతాల(హిందూ-ముస్లిం) మధ్య అనే బిజెపి మత సమీకరణల నినాదం కూడా పని చేసింది.


2019లోక్‌సభ ఎన్నికల్లో బిజెపికి 49.98, దాని మిత్రపక్షానికి 1.21శాతం కలుపుకుంటే ఉత్తర ప్రదేశ్‌లో రెండు ఇంజన్లకు కలిపి వచ్చిన ఓట్లు 51.19 శాతం. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ కూటమిలోని మూడు పార్టీలకు వచ్చిన ఓట్లు 43.82శాతమే, మోడీ మంత్రం పని చేయనట్లేనా ? 2019లో సమాజవాది పార్టీ-బిఎస్‌పి-ఆర్‌ఎల్‌డి ఒక కూటమిగా పోటీ చేస్తే 39.23శాతం వచ్చాయి. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో సమాజవాదీ కూటమికి 36.32శాతం వచ్చాయి. విడిగా పోటీచేసిన బిఎస్‌పి 12.88శాతం తెచ్చుకుంది.దీని అర్ధం ఏమిటి గతంలో బిజెపి, బిఎస్‌పి, కాంగ్రెస్‌కు పడిన ఓట్లలో కొన్ని సమాజవాది కూటమికి రాబట్టే ఓట్లశాతం పెరిగింది. బిజెపి సర్కార్‌ మీద ఉన్న వ్యతిరేకతే తమను గద్దె నెక్కిస్తుందని సమాజవాది అతి అంచనా వేసుకొని చేయాల్సిన కృషి లేకపోవటం ఓటమికి ఒక ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఎన్నికల సర్వేలు చేసిన వాటిలో ఒకటైన ఏబిపి-సి ఓటర్‌ సంస్ధ 2021 మార్చి నెల నుంచి 2022 జనవరి వరకు చేసిన ఆరు సర్వేల్లో బిజెపి కూటమి సగటు ఓట్ల శాతం 41.11శాతం కాగా చివరి సర్వేలో 41.5శాతంగా పేర్కొన్నది. ఇదే సంస్ద సమాజవాది కూటమి సగటు ఓట్లశాతాన్ని 30.8గానూ, తొలి సర్వేలో 24.4శాతంగానూ చివరి సర్వేలో 33.3శాతంగా పేర్కొన్నది.


యోగి సర్కార్‌ గూండాయిజాన్ని, నేరగాండ్లను బుల్‌డోజర్లతో అణచివేసింది, రెండవ సారి గద్దె నెక్కితే మిగతావారిని కూడా తొక్కివేస్తుంది. మంచిదే. వాస్తవ అలా ఉందా ? ఇదే ఉత్తర ప్రదేశ్‌ను గతంలో బిజెపి, బిఎస్‌పి, ఎస్‌పి పార్టీలు ఏలాయి, గూండాయిజం, మాఫియా ముఠాల పెరుగుదలకు ఎవరివంతు తోడ్పాటు వారు ఇచ్చారన్నది తిరుగులేని నిజం.ఇక 2022 ఎన్నికల్లో గెలిచిన నేరచరిత గలిగిన వారి మీద బుల్డోజర్లను ఎలా నడిపిస్తారో తరువాత చూద్దాం.


2022లో అసెంబ్లీకి ఎన్నికైన 403 మందిలో 205 మంది మీద క్రిమినల్‌ కేసులు ఉన్నాయి. గత అసెంబ్లీలో అలాంటి వారు 143 మంది మాత్రమే ఉన్నారు. ప్రజాస్వామిక సంస్కరణల సంస్ధ(ఏడిఆర్‌) వెల్లడించిన నివేదిక ప్రకారం తీవ్రమైన క్రిమినల్‌ కేసులు ఉన్నవారు అంటే హత్య, హత్యాయత్నం, కిడ్నాప్‌, మహిళల మీద నేరాలకు పాల్పడినట్లు అభియోగాలున్నవారు 158 మంది, వీరిలో ఒకరి మీద అత్యాచారయత్నం కేసు కూడా ఉంది. గతంలో ఇలాంటి ఘనులు 117 మాత్రమే. పార్టీల వారీగా చూస్తే తమ పార్టీ ప్రత్యేకం అని చెప్పుకొనే బిజెపి అగ్రస్దానంలో అంటే 255కు గాను 111 మందిని కలిగి ఉంది. సమాజవాది పార్టీలో 111 మందికిగాను 71 మంది ఉన్నారు. ఐదేండ్ల తరువాత అభివృద్ధిని చూపి ఓట్లడిగామని చెప్పుకొనే వారు మరింత మంది నేర చరితులను ఎందుకు రంగంలోకి దింపినట్లు ? ఎన్నికైన ఎంఎల్‌ఏల్లో గతంలో 322 మంది కోటీశ్వరులుంటే ఇప్పుడు వారి వృద్ది 366కు పెరిగింది. బిజెపి తరఫున గెలిచిన 255 మంది సగటు 8.14 కోట్లు, అదే సమాజవాది సగటు రు.7.39 కోట్లు ? ఎవరిది డబ్బు, కండబలం ఉన్న పార్టీ ? గెలిచిన ఇద్దరు కాంగ్రెస్‌ వారి ఆస్తి రు.19.71 కోట్లు.


ఉత్తర ప్రదేశ్‌ చట్టసభలో మెజారిటీ 205 మంది నేర చరితులు ఉన్న తరువాత వారి అనుచరులు, అభిమానులు వేరే దారిలో నడుస్తారా ? చట్టాలను అమలు జరిపే యంత్రాంగాన్ని సక్రమంగా నడవనిస్తారా ? చరిత్రలో ఎక్కడా అలాంటి ఉదంతాలు లేవు. హత్రాస్‌ దుర్మార్గం జరిగింది, లఖింపూర్‌ ఖేరీ దారుణం తెలిసిందే. ఇప్పుడు బిజెపి ఎన్నికల్లో గెలిచినంత మాత్రాన అవసలు జరగలేదు, ప్రతిపక్షాల కుట్ర లేదా ప్రచారమని చెబుతారా ? చెప్పండి ! మహిళలు పెద్ద ఎత్తున ఓట్లు వేసినట్లు చెబుతున్నారు.నిజం కూడా కావచ్చు, దీని అర్ధం ఉత్తర ప్రదేశ్‌ మహిళలకు స్వర్గంగా ఉన్నట్లా ? 2015-19(రెండు సంవత్సరాలు అఖిలేష్‌, రెండు సంవత్సరాలు యోగి ఏలుబడి) సంవత్సరాలలో అక్కడ మహిళలపై నేరాలు 66.7శాతం పెరిగాయి. దేశ సగటు 23శాతం మాత్రమే.2019లో దేశంలో నమోదైన కేసుల్లో 15శాతం యోగి ఖాతాలో పడ్డాయి. సామూహిక మానభంగాలలో 2019లో రాజస్తాన్‌ 902 కేసులతో ముందుంటే ఉత్తర ప్రదేశ్‌ 301, మధ్యప్రదేశ్‌ 162తో రెండు, మూడు స్ధానాల్లో ఉన్నాయి. ఉన్నత విలువలు నేర్పుతామని చెప్పే ఆర్‌ఎస్‌ఎస్‌, హిందూత్వ సంస్ధలకు ఈ మూడు రాష్ట్రాల్లో ఎంతో పట్టు ఉందన్నది తెలిసిందే. వారు తెచ్చిన సామాజిక మార్పు ఏమిటి ?


పైన చెప్పుకున్న నాలుగు సంవత్సరాల్లో దళితులపై జరిగిన దారుణాల కేసుల్లోనూ ఉత్తర ప్రదేశ్‌ అగ్రస్ధానంలో ఉంది. తరువాత స్ధానాల్లో సంఘపరివారం బలంగా ఉన్న రాజస్తాన్‌, బీహార్‌, మధ్య ప్రదేశ్‌ ఉన్నాయి. ఉత్తర ప్రదేశ్‌లో 2015లో 8,357 నమోదు కాగా 2019లో 11,829కి చేరాయి.2018 – 2020 (పూర్తిగా యోగి స్వర్ణయుగంలో) మూడు సంవత్సరాల్లో 36,467 కేసులు నమోదయ్యాయి, అంటే సగటున ఏడాదికి 12,155, వేద గణితం ప్రకారం లెక్కలు వేసినా యోగి ఏలుబడిలో తగ్గినట్లు ఎవరైనా చెప్పగలరా ? 2019లో దేశంలో పదిహేను శాతం కేసులు ఉత్తరప్రదేశ్‌లో ఉంటే అవి 2020నాటికి 26శాతానికి పెరిగాయి.
సబ్‌కాసాత్‌, సబ్‌కా వికాస్‌, సబ్‌కా విశ్వాస్‌ అంటే అందరినీ కలుపుకుపోతాం, అందరి వృద్ధి, అందరి విశ్వాసం అన్నది బిజెపి నినాదం. బిజెపికి మింగుడుపడినా పడకున్నా ఉత్తర ప్రదేశ్‌ జనాభాలో 20శాతం ముస్లింలు ఉన్నారు. ఆ సామాజిక తరగతికి చెందిన వారికి ఒక్కటంటే ఒక్క సీటూ ఇవ్వలేదు. అంటే బిజెపి ఇచ్చే నినాదం మోసపూరితం కాదా ?మత ప్రాతిపదికన ఓటర్లను సమీకరించేందుకు వేసిన ఎత్తుగడకాదా ? హిందూ పత్రిక-సిఎస్‌డిఎస్‌-లోక్‌నీతి సంస్ధలు సంయుక్తంగా ఎన్నికల అనంతర సర్వే వివరాల ప్రకారం బిజెపి ముందుకు తెచ్చిన మతపరమైన రెచ్చగొట్టుడు పని చేసింది.2017 బిజెపికి హిందువులు 47శాతం ఓటు వేస్తే 2022లో 54శాతానికి పెరిగింది. అదే సమాజవాది పార్టీకి 19 నుంచి 26శాతానికి పెరిగింది. బిఎస్‌పికి 23 నుంచి 14శాతానికి, కాంగ్రెస్‌కు నాలుగు నుంచి రెండుశాతానికి తగ్గింది. ఈ ఓట్లు బిజెపి-సమాజవాది పార్టీలకు వెళ్లాయి. ఇక సమాజవాది పార్టీ కూటమి సీట్ల సంఖ్యపెరగటానికి బిజెపి చేసిన విద్వేష ప్రచారంతో ముస్లింలు ఆ వైపు మొగ్గటమే అన్నది స్పష్టం.గత ఎన్నికల్లో 46శాతంగా ఉన్నవి ఈసారి 79శాతం మంది ఎస్‌పి కూటమివైపు మొగ్గారు. బిఎస్‌పి ఓట్లు 19 నుంచి ఆరు, కాంగ్రెస్‌ ఓట్లు 23 నుంచి మూడు, ఇతరుల ఓట్లు పది నుంచి నాలుగుశాతానికి తగ్గాయి. ఇదే సమయంలో ముస్లిం ఓట్లు బిజెపికి ఐదు నుంచి ఎనిమిదిశాతానికి పెరిగాయి.


యోగి సర్కార్‌ అభివృద్దే గెలిపిస్తుందని చెప్పుకుంటూనే బిజెపి173 మంది కొత్త ముఖాలను రంగంలోకి దించి పాత వారి మీద జనంలో ఉన్న అసంతృప్తిని చల్లార్చేందుకు చూసింది. వారిలో 99 మాత్రమే గెలిచారు.గత ఎన్నికల్లో బిజెపి కూటమి ఓడిన 85 స్దానాల్లో ఈసారి 69 మంది కొత్తవారిని రంగంలోకి దించినా గెలిచింది 19 మాత్రమే. పాతవారిలో 104 మంది సిట్టింగులకు సీట్లు ఇవ్వలేదు. అక్కడ కొత్తవారిని పెట్టగా 80 మంది గెలిచారు. గత ఎన్నికల్లో ఓడిన 16 మందిని ఈ సారి కూడా పోటీకి నిలిపితే కేవలం నలుగురు మాత్రమే గెలిచారు.


మజ్లిస్‌ పార్టీ ఓట్లు చీల్చిన కారణంగా సమాజవాది ఓడింది అన్నది ఒక అభిప్రాయం.ఆ పార్టీ బిజెపికి బిటీమ్‌ అన్నది, దాని అధినేత మీద జరిగిన దాడి బూటకం అన్నది నిజం. కానీ ఇక్కడ ఆ పార్టీ పోటీచేసిన 94 స్ధానాల్లో వచ్చిన ఓట్లు 4,50,929(0.49శాతం) మాత్రమే అయినా అనేక చోట్ల బిజెపికి తోడ్పడింది. మొత్తంగా చూసినపుడు మూడవ స్దానంలో ఉన్న బిఎస్‌పి పోటీ బిజెపికి తోడ్పడిందన్నది గమనించాలి. తిరుగులేదు అని చెప్పుకున్న బిజెపికి ఉత్తర ప్రదేశ్‌లో మూడు చోట్ల డిపాజిట్లు రాలేదు.399 చోట్ల పోటీ పడిన కాంగ్రెస్‌ 387 చోట్ల డిపాజిట్లు కోల్పోయింది. రెండు చోట్ల గెలవగా నాలుగు చోట్ల రెండవ స్ధానంలో ఉంది. తనబలాన్ని అతిగా అంచనా వేసుకొని పోటీ చేసిన కాంగ్రెస్‌ సగటున ఒక్కో చోట 5,391 ఓట్లు తెచ్చుకొంది, ఆ విధంగా కూడా బిజెపికి తోడ్పడినట్లే. బిఎస్‌పి పోటీ చేసిన 403 స్ధానాల్లో 290 చోట్ల డిపాజిట్లు పోగొట్టుకుంది.ఒక చోట గెలవగా 14చోట్ల రెండవ స్దానంలో ఉంది.


నువ్వానేనా అన్నట్లుగా అధికారం కోసం పోటీపడిన సమాజవాది పార్టీ 376 చోట్ల పోటీ చేసింది, ఆరు చోట్ల డిపాజిట్లు కోల్పోయింది. నూటపదకొండు సీట్లు గెలిచి 231 చోట్ల రెండవ స్దానంలో ఉంది. ఆ పార్టీతో జట్టు కట్టిన ఆర్‌ఎల్‌డి 33 చోట్ల పోటీ చేసి మూడు డిపాజిట్లు కోల్పోయి ఎనిమిది చోట్ల గెలిచింది.చెల్లిన ఓట్లలో 16.66శాతం తెచ్చుకుంటే డిపాజిట్‌ దక్కుతుంది. పురుషుల్లో కేవలం నాలుగుశాతం మాత్రమే సమాజవాది కంటే బిజెపికి ఎక్కువగా ఓట్లు వేయగా మహిళల్లో బిజెపికి 16శాతం మంది అధికంగా ఓటు వేసినట్లు సర్వేలు పేర్కొన్నాయి. ఇది కూడా బిజెపికి తోడ్పడిన అంశంగా భావిస్తున్నారు. కొన్ని సంక్షేమ పధకాలు వీరిని ఆకర్షించినట్లు చెబుతున్నారు. ఇక రైతులు కూడా బిజెపికి గణనీయంగా ఓటు చేశారు. ఏడాదికి ఆరువేల చొప్పున కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న కిసాన్‌ సమ్మాన్‌ యోజనం పధకం, ఎన్నికలలో బిజెపి చేసిన కొన్ని వాగ్దానాలు ముఖ్యంగా చిన్న, సన్నకారు రైతాంగాన్ని ఆకర్షించినట్లు వెల్లడైంది.లఖింపూర్‌ ఖేరీ, పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌లో కూడా తాము గణనీయంగా రైతుల మద్దతు పొందినట్లు బిజెపి చెప్పుకొంటోంది. అంగీకరిద్దాం, క్షమాపణలు చెప్పి రద్దు చేసిన మూడు సాగు చట్టాలను తిరిగి నరేంద్రమోడీ ప్రవేశపెడతారా ? కనీస మద్దతు ధరలకు చట్టబద్దత కల్పించే అంశాన్ని పరిశీలించేందుకు వేస్తామన్న కమిటీని ఉత్తిదే అంటారా ? చూద్దాం !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

2022 ఉత్తర ప్రదేశ్‌ ఎన్నికలు : నరేంద్రమోడీ,యోగి ఓదార్పు – లఖింపూర్‌ ఖేరీ నేరం మధ్య నలుగుతున్న బిజెపి విధి రాత !

04 Tuesday Jan 2022

Posted by raomk in BJP, Communalism, Congress, Current Affairs, Farmers, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Politics

≈ Leave a comment

Tags

#Akhilesh Yadav, 2022 UP polls, BJP, BSP, Lakhimpur Kheri killings, Narendra Modi Failures, Samajavadi party, UP BJP poll fate, Yogi Adityanath


ఎం కోటేశ్వరరావు


ఉత్తర ప్రదేశ్‌ విధాన సభ ఎన్నికల్లో చరిత్రను తిరగరాసేందుకు బిజెపి నేతలు గంగకు ఎదురీదుతున్నారు.కరోనా శవాలను తనలోకి నెట్టిన వారిని గంగామాత ఏం చేస్తుందో చెప్పలేము. గడచిన నాలుగు దశాబ్దాలలో 1985 తరువాత ఇక్కడ ఒకసారి అధికారానికి వచ్చిన పార్టీ వరుసగా రెండవసారి గద్దెనెక్కలేదు.దాన్ని చరిత్రలోకి నెట్టివేసేందుకు నరేంద్రమోడీ ఆపసోపాలు పడుతున్నారు. రాష్ట్రాన్ని ఒకేసారి రెండు ఇంజన్లు (కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో యోగి) లాగుతూ అభివృద్ది పరుగుపెట్టిస్తున్నామని చెప్పుకొనే బిజెపి నేతలు కొత్త రికార్డు నెలకొల్పుతారా ? ఎన్నికల ముందు అనేకం అంటాం, అనుకుంటాంగానీ గానీ సంప్రదాయం కొనసాగింది తప్ప ఇది మా ఓటమి కాదు అని చెప్పే పరిస్ధితి వస్తుందా లేక చూశారా మా తడాఖా మల్లయోధుడి పార్టీ(సమాజవాది- ములాయం సింగ్‌ యాదవ్‌ రాజకీయాల్లోకి రాక ముందు మల్లయోధుడు, ఆయన కుమారుడే ప్రస్తుత పార్టీ నేత, మాజీ సిఎం అఖిలేష్‌ యాదవ్‌ )ని మట్టి కరిపించాం అని జబ్బలు చరుచుకుంటారా ? చూద్దాం, తినబోతూ రుచెందుకు ?


ఉత్తర ప్రదేశ్‌ ఎన్నికల ముందు బిజెపిని ఇరుకున పెడుతుందని భావిస్తున్న లఖింపూర్‌ ఖేరీ కేసులో పోలీసులు చార్జిషీట్‌ దాఖలు చేశారు. అక్టోబరు మూడవ తేదీన లఖింపూర్‌ ఖేరీ వద్ద సాగు చట్టాలకు నిరసన తెలుపుతున్న రైతులపై మోటారు వాహనాలను తోలి రైతులను హత్యచేసిన ఉదంతంలో నలుగురు రైతులు మరణించారు. ఒక జర్నలిస్టు ప్రాణాలు కూడా తీశారు. ఆగ్రహించిన రైతుల చేతిలో వాహనాల్లో ఉన్న ముగ్గురు బిజెపి కార్యకర్తలు కూడా మరణించారు. రైతుల మీదకు కార్లను తోలిన వారిలో కేంద్ర మంత్రి అజయ మిశ్రా కుమారుడు ఆషిష్‌ మిశ్రా తదితరులు ఉన్నారని వచ్చిన వార్తలను అప్పుడు బిజెపి తోసి పుచ్చింది. అప్పుడు అతగాడు వేరే చోట ఉన్నట్లు కతలు చెప్పింది. కేసును నీరు కార్చేందుకు పూనుకోవటంతో సుప్రీం కోర్టు జోక్యం చేసుకుంది. మూడు నెలల తరువాత పోలీసులు దాఖలు చేసిన ఐదువేల పేజీల ఛార్జి షీట్‌లో మంత్రి కుమారుడు ఆషిష్‌ మిశ్రా ప్రధాన నిందితుడని పేర్కొన్నారు. నిరసన తెలుపుతున్న రైతులను హత్యచేసేందుకు పధకం ప్రకారం కుట్రపన్నారని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) పేర్కొన్నది. ఉదంతం జరిగిన సమయంలో ఆషిష్‌ మిశ్రా ఘటనా స్ధలిలో ఉన్నట్లు తమ దర్యాప్తులో తేలిందని, ఆషిష్‌ బంధువు కూడా సహనిందుడని పేర్కొన్నారు. తాను ఆ సమయంలో అక్కడ లేనంటూ కొన్ని వీడియోలు, పది మందితో అఫిడవిట్‌లను పోలీసులకు అంద చేశారు. ఘటన జరిగినపుడు ధీరేంద్ర శుక్లా అనే అతను ఉన్నాడని, అతని కారు ఆషిష్‌ మిశ్రా కారువెనుకే ఉందని ఈ వాస్తవాన్ని ధీరేంద్ర దాచినట్లు సిట్‌ పేర్కొన్నది. ఈ కేసు తరువాత ఏమౌతుందో చెప్పలేము గానీ కేంద్ర మంత్రి అజయ మిశ్రాను మంత్రి వర్గం నుంచి తొలగించాలనే డిమాండ్‌ మరింత ఊపందుకోవటంతో పాటు ఎన్నికల్లో ప్రచార అంశంగా మారనుంది. కొద్ది రోజుల క్రితం ఉత్తర ప్రదేశ్‌ నుంచి ఎంపిక చేసిన పార్టీ ఎంపీలతో ప్రధాని నరేంద్రమోడీ జరిపిన సమావేశానికి అజయ మిశ్రాను దూరంగా ఉంచినట్లు వార్తలు వచ్చాయి.


ఉత్తర ప్రదేశ్‌ ఎన్నికలకు సంబంధించి తాజాగా టైమ్స్‌ నౌ నవభారత్‌కు వీటో సంస్ధ నిర్వహించిన సర్వేలో 403 స్ధానాలకు గాను బిజెపి 230-249 మధ్య తెచ్చుకొని సునాయాసంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నందని తేలినట్లు ప్రకటించారు. సమీప సమాజవాది పార్టీకి 137-152, బిఎస్‌పికి 9-14, కాంగ్రెస్‌కు 4-7 మధ్య రావచ్చని పేర్కొన్నారు. బిజెపి ఏడు పార్టీలతో కూటమిగా పోటీలోకి దిగుతోంది. సమాజవాది , కాంగ్రెస్‌, బిఎస్‌పి, ఆప్‌ పార్టీ విడివిడిగా పోటీచేస్తున్నట్లు ప్రకటించాయి. వాటితో ఏ పార్టీలు జత కట్టేది చూడాల్సి ఉంది. టైమ్స్‌ నౌ సర్వే ప్రకారం బిజెపి కూటమికి 38.6శాతం, సమాజవాదికి 34.4, బిఎస్‌పికి 14.1 శాతం ఓట్లు రావచ్చని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో వచ్చిన సీట్లు, ఓట్లు, వచ్చే ఎన్నికల్లో అంచనాల పోలిక ఇలా ఉంది.2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్‌పి 311, మిత్రపక్షం కాంగ్రెస్‌ 114 చోట్ల పోటీ చేసింది. 2019లో ఎస్‌పి, బిఎస్‌పి ఒక కూటమిగా, కాంగ్రెస్‌ విడిగా పోటీ చేసింది.
పార్టీ××××××× 2017×× శాతం×× 2019××శాతం ×× 2022××శాతం
బిజెపి కూటమి×× 325 ×× 40.78× 64 ××× 51.19×× 230-49×× 38.6
ఎస్‌పి కూటమి×× 48 ××× 21.82× 5 ×××18.11 ××137-152×× 34.4
బిఎస్‌పి×××××× 19 ××× 22.23× 10 ××× 19.43 ×× 9-14 ××× 14.4
కాంగ్రెస్‌ ××××× 7 ××× 6.25 × 1 ××× 6.41 ×× 4-7 ×××× 5
ఈ అంకెలను చూసినపుడు బిజెపి ఓటింగ్‌ 2017-2019 మధ్య పదిశాతంపైగా పెరిగింది. వచ్చే ఎన్నికల్లో 2017 కంటే తగ్గవచ్చని సర్వేలు చెబుతున్నాయి. సమాజవాది పార్టీ ఓటింగ్‌ 2017, 2019లో పెద్దగా మారలేదు. కానీ వచ్చే ఎన్నికల్లో పార్లమెంటుతో పోలిస్తే రెట్టింపు కావచ్చని సర్వేలు చెబుతున్నాయి. ఈ సర్వే లఖింపూర్‌ ఖేరీ కేసులో చార్జిషీటు దాఖలు చేయక ముందు చేసినది. ప్రధాన సవాలు సమాజవాది నుంచే అనే వాతావరణం వచ్చిన తరువాత బిజెపి వ్యతిరేక ఓటర్లు సహజంగానే కొన్ని ఓట్లు ఎస్‌పికే పడతాయి.బిజెపిని ఓడించాలని కోరుకొనే బిఎస్‌పి, కాంగ్రెస్‌ అభిమానులు కూడా ఎస్‌పి వైపే మొగ్గవచ్చు. ఈ ఎన్నికల్లో ఎదురు దెబ్బ తగలవచ్చనే వాతావరణం ఉన్నందున బిజెపి తన మత, కుల అజెండాను మరింతగా ముందుకు తీసుకురావచ్చని భావిస్తున్నారు. కరోనా రెండవ తరంగం నివారణలో వైఫల్యం, శవాలను గంగలోకి నెట్టివేసిన నిర్వాకం, లఖింపూర్‌ ఖేరీ ఉదంతం, రైతు ఉద్యమ ప్రతికూలతలన్నింటినీ అధిగమించి రామాలయ నిర్మాణం వంటి అంశాలు తమను గట్టెక్కిస్తాయని ఆ పార్టీ నమ్ముతోంది.
ఎన్నికల నోటిఫికేషన్‌తో నిమిత్తం లేకుండానే బిజెపి మాదిరి సమాజవాది కూడా జరుపుతున్న సభలకు పెద్ద ఎత్తున జనాలు వస్తున్నారు.తాము అధికారంలోకి వస్తే 300యునిట్ల వరకు విద్యుత్‌ ఉచితంగా ఇస్తామని ఎస్‌పి, కాంగ్రెస్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రకటించాయి. రైతులకు ఉచితంగా ఇస్తామని ఎస్‌పి పేర్కొన్నది. ప్రస్తుతం రాష్ట్రంలో రెండు రకాల రేట్లు వసూలు చేస్తున్నారు. గ్రామాలలో వంద యూనిట్లకు రు. 3.35, 101నుంచి 150కి రు.3.85, 151 నుంచి 300కు రు.5, ఆ పైన రు. 6 కాగా పట్టణాల్లో 150 వరకు రు.5.50, 151 నుంచి 300 వరకు రు.6, 301 నుంచి 500వరకు రు.6.50, ఆ పైన రు.7 ఉంది.


పార్టీని బూత్‌ స్ధాయివరకు విస్తరించి ఉంటే వచ్చే ఎన్నికల్లో 325కు మించి గెలుస్తామని సిఎం యోగి ఆదిత్యనాధ్‌ చెబుతున్నారు. సోదరి మాయావతి ఎన్నికలంటే భయపడుతున్న కారణంగానే ప్రచారం ప్రారంభించలేదని,చలిని వదిలించుకోవాలని కేంద్ర మంత్రి అమిత్‌ షా చేసిన వ్యాఖ్యను ఆమె ఖండించారు. ప్రభుత్వ సొమ్ముతో బిజెపి నేతలు జనాన్ని చలికాలంలో కూడా వెచ్చగా ఉంచుతున్నారని తిప్పికొట్టారు. తాము ఇతర పార్టీలను అనుకరించబోమని, తమ శైలి తమకు ఉందన్నారు. ఎన్నికల ముందు అధికారంలో ఉన్న వారు శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాల పేరు చెప్పి ప్రభుత్వ సొమ్ముతో సభలు పెడతారని, తమ వంటి వారికి సాధ్యం కాదన్నారు.తమను అపహాస్యం చేసినా తమ వైఖరి మారదని, ఇతర పార్టీలు తమ గురించి ఆందోళన చెందాల్సినపని లేదన్నారు.


కులాల సమీకరణలు,మత ధోరణుల ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో ఉత్తర ప్రదేశ్‌ ఒకటి. ముస్లిం వ్యతిరేకతను రెచ్చగొట్టి మెజారిటీ ఓటు బాంకును ఏర్పాటు చేసుకొనేందుకు బిజెపి చేయని పని లేదు. రామ మందిర సమస్యను ముందుకు తెచ్చి గతంలో లబ్ది పొందిన ఆ పార్టీకి ఒక సర్వే అంశాలు ఆందోళన కలిగించక మానవు. కుల, మత ప్రాతిపదికన ఓటు వేస్తున్నామని 24శాతం మంది చెప్పగా వచ్చే ఎన్నికల్లో రామ మందిరం ఓటర్లను ప్రభావితం చేస్తుందని చెప్పిన వారు ఒక్కశాతమే అని ఇండియా న్యూస్‌ జన్‌కీ బాత్‌ సర్వే పేర్కొన్నది. బిజెపికి వస్తాయని చెబుతున్న ఓట్లలో యాదవేతర బిసి, బ్రాహ్మణ ఓట్లలో ఎక్కువ భాగం ఉంటాయని, ఎస్‌పికి ముస్లింలు, యాదవుల ఓట్లు గణనీయంగా వస్తాయని చెబుతున్నారు.


గో రక్షణ, గొడ్డుమాంసం పేరుతో బిజెపి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో రైతులు ఆగ్రహంతో ఉన్నారు. వట్టిపోయిన వాటిని అమ్ముకొనే వీలు లేకపోవటంతో యజమానులు వాటిని వదలి వేయటంతో పంటలను కాపాడుకొనేందుకు రైతులు కాపలాలు కాయాల్సి వస్తోంది.పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌లో పెద్ద ఎత్తున చెరకు బకాయిలు పేరుకు పోయాయి. అత్యంత వెనుకబడిన తరగతుల వారిని యాదవులు పైకి రానివ్వటం లేదనే పేరుతో బిజెపి ఇతర వెనుకబడిన తరగతుల వారిని ఆకట్టుకుంది. అయితే ఇప్పుడు తమకు ఒరిగిందేమీ లేదని యాదవుల బదులు ఠాకూర్ల పెత్తనం కిందికి వచ్చామని వారు ఇప్పుడు భావిస్తున్నారు. మత ప్రాతిపదికన బిజెపి పరివారం జనాన్ని చీల్చితే, రైతు ఉద్యమం ఐక్యం చేసేందుకు బాటలు వేసిందని వార్తలు వచ్చాయి. నామినేషన్లు వేసి, ఎవరెటో తేలిన తరువాత ఎన్నికల తీరు తెన్నులపై మరింత స్పష్టత వస్తుంది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

ఉత్తర ప్రదేశ్‌ సంతుష్ట రాజకీయాలు : బహుజనుల నుంచి బ్రాహ్మలపై మాయావతి దృష్టి !

21 Wednesday Jul 2021

Posted by raomk in BJP, Communalism, Congress, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, RELIGION, STATES NEWS

≈ Leave a comment

Tags

BJP, BSP, Mayawati, SP, UP Appeasement matters, UP Assembly Elections 2022


ఎం కోటేశ్వరరావు


వసుదేవుడు అంతటి వాడు అవసరార్దం గాడిద కాళ్లు పట్టుకున్నాడన్న కథ తెలిసిందే.ఉత్తర ప్రదేశ్‌లో అధికారం కోసం అక్కడ పన్నెండు నుంచి పదిహేను శాతం వరకు ఓట్లున్న బ్రాహ్మణులను సంతుష్టీకరించేందుకు ఇప్పుడు ప్రధాన పార్టీలన్నీ పాట్లు పడుతున్నాయి. వచ్చే ఏడాది మార్చి నెలలోగా అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి వుంది. దేశ రాజకీయాలను ప్రభావితం చేసే ఆ రాష్ట్ర అధికారం కోసం రాబోయే రోజుల్లో ఇంకా ఏమేమి చూడాల్సి వస్తుందో తెలియదు. దేశవ్యాపితంగా ఐదుశాతం మంది (ఆరు ఏడు కోట్ల మధ్య) బ్రాహ్మణ సామాజిక తరగతి ఓటర్లు ఉంటారని అంచనా. ఉత్తరాదిన అత్యధిక మంది ఉన్నారు. జనాభాలో శాతాల రీత్యా ఉత్తరాఖండ్‌లో 20, హిమచల్‌ ప్రదేశ్‌ 14, ఢిల్లీ 12, జమ్మూ-కాశ్మీరు 11, ఉత్తర ప్రదేశ్‌ 10, ఒడిషా 9, రాజస్ధాన్‌, గోవా 7, హర్యానా, అరుణాచల్‌ ప్రదేశ్‌ 6, పశ్చిమ బెంగాల్‌, సిక్కిం, పంజాబ్‌, బీహార్‌, మధ్య ప్రదేశ్‌, గుజరాత్‌, కర్ణాటక ఐదు, మహారాష్ట్ర, అసోం నాలుగు, ఝార్ఖండ్‌, త్రిపుర మూడు, చత్తీస్‌ఘర్‌ రెండు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కేరళ ఒకశాతం చొప్పున ఈ సామాజిక తరగతిని కలిగి ఉన్నాయి. ఇవి పాత అంచనాలు, 2021లో శాతాలు స్వల్పంగా మారవచ్చు. ఉత్తర ప్రదేశ్‌లో సంఖ్య రీత్యా రెండున్నర కోట్ల మంది వరకు ఉంటారు. తెలుగు రాష్ట్రాల్లో బ్రాహ్మణులు అంటే పూజా పునస్కారాలు, ఇతర క్రతువులు నిర్వహించేవారిగా మాత్రమే తెలుసు. ఉత్తరాదిన వారు వీటితో పాటు వ్యవసాయం చేస్తారు. వీరిలో కూడా శాఖాబేధాలు, ఎక్కువ తక్కువ నిచ్చెనమెట్లు ఉన్నాయి. కొందరిని కొందరు బ్రాహ్మణులుగా గుర్తించని వంటి అంశాలూ ఉన్నాయి. ఉదాహరణకు భూమిహార్‌లను బ్రాహ్మణులుగా గుర్తించరు. వారిని కూడా కలిపితే ఉత్తర ప్రదేశ్‌లో వారి శాతం 14-15కు పెరుగుతుంది. మనువాదానికి ప్రతీకగా బ్రాహ్మణులను చూస్తున్నప్పటికీ అందరినీ ఆ గాటన కట్టలేము. నిజానికి మనువాదం ఇప్పుడు మిగతా కులాల్లోనే ఎక్కువగా ప్రబలింది. బిజెపి పెరుగుదలకు అది కూడా ఒక కారణం. ఇటీవలి బిజెపి చర్యలను చూసినపుడు ఉత్తర భారత్‌లోని కొన్ని రాష్ట్రాల్లో గణనీయంగా ఉన్న ఈ సామాజిక తరగతిని సంతుష్టీకరించేందుకు ఎంతకైనా తెగిస్తుందని తేలిపోయింది. కాశ్మీరీ పండిట్ల సమస్యను పెద్ద ఎత్తున ప్రచారం చేయటం, ఆర్టికల్‌ 370తో పాటు అసలు కాశ్మీరు రాష్ట్రాన్నే రద్దు చేయటం దానిలో భాగమే అని చెప్పవచ్చు.


మనువాద వ్యతిరేక భావజాల ప్రాతిపదికన ఏర్పడిన బహుజన సమాజవాది పార్టీ అధినేత్రి మాయావతి మరోసారి ఉత్తర ప్రదేశ్‌లో బ్రాహ్మణ సంతుష్టీకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఎనిమిది సంవత్సరాలు ఏలుబడి సాగించిన ఆమెకు అధికార రుచి, అది రంజుగా ఉండాలంటే బ్రాహ్మణ ఓట్ల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తొలిసారి 2007లో ఆమెకు అధికారం రావటంలో వారి మద్దతు ప్రధాన పాత్ర పోషించింది. దేశమంతటా దళితులు, గిరిజనులు, ఇతర సామాజిక బలహీనవర్గాల మీద దాడులు, అత్యాచారాల గురించి పార్టీలు చెప్పటం సాధారణ విషయం. కానీ దానికి భిన్నంగా ఉత్తర ప్రదేశ్‌లో బ్రాహ్మణుల మీద అవి జరుగుతున్నాయని మాయావతి చెప్పటమే గమనించాల్సిన అంశం.ఆమె ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దళితుల మీద అత్యాచారాలు, హత్యలు, దాడులు తగ్గిందేమీ లేదని, తక్కువ ఉన్నట్లు చూపేందుకు నమోదు చేయవద్దని పోలీసు శాఖను అదేశించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. తాను అధికారాన్ని చేపట్టిన తరువాత బ్రాహ్మల గౌరవం, ప్రయోజనాలను కాపాడతానని ఆమె ప్రకటించారు. జూలై 23న అయోధ్యలో పార్టీ ప్రధాన కార్యదర్శి సతీష్‌ చంద్ర మిశ్రా బ్రాహ్మణ మేలుకొలుపు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. 2007 అసెంబ్లీ ఎన్నికలలో బిఎస్‌పి విజయానికి బ్రాహ్మణ ఓటర్ల మద్దతు ఒక ప్రధాన కారణమనే అంశం మరోసారి మాయావతికి గుర్తుకు వచ్చింది. 2017లో బ్రాహ్మణ ఓటర్ల మద్దతు పొంది అధికారానికి వచ్చిన బిజెపి వారి సంక్షేమానికి పాల్పడకుండా వేధించిందని, వారిని దోచుకుందని, బిజెపికి మద్దతు ఇచ్చినందుకు వారు ఇప్పుడు పశ్చాత్తాపపడుతున్నారని మాయావతి చెప్పారు.


మాయావతి 2007 నుంచి 2012వరకు అధికారంలో ఉన్న సమయంలో సంతుష్టీకరణ రాజకీయాలకు పాల్పడ్డారని, అగ్రకులాల వారిని పక్కన పెట్టి ఇప్పుడు ఎన్నికల కారణంగా బ్రాహ్మణులను ఆకర్షించేందుకు పూనుకున్నారని బిజెపి ప్రతినిధి రాకేష్‌ త్రిపాఠీ విమర్శించారు. అయితే వారి గౌరవ మర్యాదలు, సంక్షేమానికి పాటు పడేది బిజెపి అని తెలుసు గనుక వచ్చే ఏడాది ఎన్నికల్లో తమకే ఓటు చేస్తారని చెప్పుకున్నారు. మద్దతు తగ్గిపోతున్న కారణంగా మాయావతి కుల రాజకీయాలకు పాల్పడుతున్నారని, తాము అన్ని కులాల వారి సంక్షేమానికి కృషి చేస్తామని కాంగ్రెస్‌ ప్రతినిధి నసీముద్దీన్‌ సిద్దికీ, తాము అన్ని కులావారినీ సమంగా చూస్తామని, మాయావతి ప్రతిపక్షాల మీద చేస్తున్న దాడిని చూస్తే బిజెపితో లోపాయి కారీ ఒప్పందం ఉందన్నది వెల్లడైందని సమాజవాది పార్టీ ప్రతినిధి అబ్దుల్‌ హఫీజ్‌ గాంధీ అన్నారు.


ఉత్తర ప్రదేశ్‌లో సామాజిక సమీకరణాలను చూసినపుడు బ్రాహ్మణులు సంఖ్యరీత్యా ఎక్కువ కానప్పటికీ విజయావకాశాలను ప్రభావితం చేసే స్ధితిలో ఉన్నారు.దళితులు 20.8, ముస్లింలు 19, ఓబిసి 40 అగ్రకులాలు 20 శాతం ఉంటారని అంచనా. కుల రాజకీయాలు ప్రభావం చూపే ఈ రాష్ట్రంలో గత మూడు దశాబ్దాలలో మొత్తంగా బ్రాహ్మణులు బిజెపితోనే ఉన్నారు. అయితే రాజపుత్రుల ప్రాబల్యం ముఖ్యంగా యోగి ఆదిత్యనాధ్‌ హయాంలో పెరిగిపోయి తమను నిర్లక్ష్యం చేస్తున్నారనే అభిప్రాయం పెరుగుతోంది. వికాస్‌ దూబే అనే గూండానేతను, ఐదుగురు సహచరులను పోలీసులు కాల్చిచంపారు. ఆ ఉదంతంలో దూబే గ్యాంగు చేతిలో ఎనిమిది మంది పోలీసులు మరణించారు. దూబే ఉదంతాన్ని చూపి బ్రాహ్మణ వ్యతిరేక చర్యగా చిత్రించే ప్రయత్నం ఆ సమయంలో జరిగింది.నిజానికి అది కులపరంగా జరిగిన ఉదంతం కాదు.బ్రాహ్మణులు బిజెపికి గట్టి మద్దతుదారులుగా ఉన్నట్లు సర్వేలు వెల్లడిస్తున్నప్పటికీ బిజెపికి ఎక్కడో అనుమానాలు ఉన్నాయన్నది స్పష్టం. అయినా ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులు కోకూడదని బిజెపి అనుకుంటోంది. అందుకే ప్రముఖ బ్రాహ్మణ నేతగా పేరున్న జితిన్‌ ప్రసాదను ఇటీవల కాంగ్రెస్‌ నుంచి ఆకర్షించింది. బ్రాహ్మణ చేతన పరిషత్‌ పేరుతో ప్రసాద ఒక సంస్దను ఏర్పాటు చేశారు. ఆ రాష్ట్రానికి చెందిన ఐఏఎస్‌ అధికారి ఎకె శర్మను ఉద్యోగానికి రాజీనామా చేయించి పార్టీలో చేర్చుకున్నారు. అంతే కాదు, ఎంఎల్‌సి పదవి ఇచ్చి మంత్రివర్గంలో చేర్చుకోవాలన్న అధిష్టాన వర్గ ఆదేశాన్ని యోగి ఖాతరు చేయలేదు. ఆయను ఎంఎల్‌సి చేసి రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షుడిగా నియమించారు. శర్మను కలుసుకొనేందుకు యోగి నిరాకరించారని కూడా వార్తలు వచ్చాయి. అయోధ్య రామాలయ నిర్మాణాన్ని కూడా సంతుష్టీకరణలో భాగంగా చూపుతున్నది. ఆర్ధికంగా బలహీనవర్గాలకు పదిశాతం ఉద్యోగ రిజర్వేషన్లు ఏర్పాటు చేసినందున వారే ఎక్కువ లబ్ది పొందుతారని ప్రచారం చేసింది. తాము పరశురాముడి అంశకు చెందిన వారమని బ్రాహ్మలు భావిస్తున్న కారణంగానే తాము అధికారానికి వస్తే భారీ పరుశురాముడి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని బిఎస్‌పి, సమాజవాది పార్టీ ప్రకటించాయి.


బిఎస్‌పి విషయానికి వస్తే 2002లో ఆ పార్టీకి బ్రాహ్మణులు ఆరుశాతం ఓటు వేయగా 2007నాటికి 17శాతానికి పెరిగింది. ఇదే సమయంలో బిజెపికి 50 నుంచి 42శాతానికి తగ్గాయి. తరువాత 2012లో 38శాతానికి పడిపోయినా 2014లోక్‌ సభ ఎన్నికల్లో 72, 2107 అసెంబ్లీలో 80శాతం, 2019లోక్‌సభ ఎన్నికల్లో 82శాతానికి పెరిగాయి. రాజపుత్రుల ఓట్లు కూడా అదేస్ధాయిలో బిజెపికి పడ్డాయి. నరేంద్రమోడీ కారణంగా పన్నెండుశాతం ఓట్లు బిజెపికి అదనంగా వచ్చినట్లు సర్వేలు తెలిపాయి. అగ్రకులాల, బిసిల్లోని కుర్మీల ఓట్లు ఈ ఎన్నికల్లో బిజెపికి ఐదింట నాలుగు వంతులు పడగా, ఓబిసీల్లోని దిగువ తరగతి వారు నాలుగింట మూడు వంతులు వేశారు. బిసిల్లో ముందుపడిన వారు సమాజవాది పార్టీతో ఉన్నందున దిగువ తరగతులను చేరదీసేందుకు బిజెపి ఎరవేసింది. బిజెపి ఎత్తుగడలో భాగంగా ముస్లింలను దూరంగా పెట్టి మెజారిటీ హిందువుల ఓటు బ్యాంకు సృష్టికి పూనుకుంది. అది సహజంగానే బ్రాహ్మణులకు సంతృప్తి నిస్తుంది.


బ్రాహ్మణ సంతుష్టీకరణకు రాహుల్‌ గాంధీ కూడా ప్రయత్నించారు. తాను కౌల్‌ బ్రాహ్మణ పూర్వీకుల వారసుడనని, తనది దత్తాత్రేయ గోత్రమని చెప్పుకున్నారు. గతంలో బ్రాహ్మణులు కాంగ్రెస్‌కు తిరుగులేని మద్దతుదారులుగా ఉండేవారు. బిఎస్‌పి పార్లమెంట్‌ ఉభయ సభల్లోనూ బ్రాహ్మణ సామాజిక తరగతికి చెందిన వారినే ఇప్పుడు నాయకులుగా నియమించారు. మాయావతి మంత్రివర్గంలో గరిష్ట స్ధాయిలో వారున్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో గరిష్ట సంఖ్యలో అభ్యర్దులుగా వారిని నిలిపారు. నామమాత్రంగా బ్రాహ్మణులు, నాలుగోవంతు దళితులు ఉన్న అంబేద్కర్‌ నగర్‌ లోక్‌ సభ స్ధానంలో పోటీ చేసిన రితేష్‌ పాండే తప్ప మిగిలిన బ్రాహ్మణ అభ్యర్ధులందరూ ఓడిపోయారు.


ఉత్తర ప్రదేశ్‌ మరికొన్ని ఉత్తరాది రాష్ట్రాలను ” ఆవు ప్రాంతం ” అని పిలుస్తారు. బిజెపి ముందుకు తెచ్చిన మతపరమైన అజెండాలో ఆవు కూడా ఒకటి. సాధారణంగానే తమ కారణంగానే హిందూమతం ఇంకా ఉనికిలో ఉందని బ్రాహ్మణులు అనుకుంటారనే అభిప్రాయం ఉంది. ఇలాంటి అనేక కారణాలతో వారు కాంగ్రెస్‌ నుంచి బిజెపి అభిమానులుగా మారారు.
ఉత్తర ప్రదేశ్‌ ఇప్పుడు కులాలు, మతాల రాజకీయం నడుస్తోంది. బిజెపి హిందూత్వ తన గుత్త సొమ్మని భావిస్తోంది. మాకూ వాటా ఉందని మేమూ హిందుత్వశక్తులమే అని ఓటర్ల ముందు నాలుగు ప్రధాన పార్టీలూ ఓట్ల జోలె పట్టుకొని నిలుచోబోతున్నాయి. ఆయోధ్య రామమందిరాన్ని చూపి ఓట్లడిగేందుకు బిజెపి పూనుకుంటే బిఎస్‌పి అక్కడే తన బ్రాహ్మణ సమ్మేళనాలకు శ్రీకారం చుట్టబోతున్నది. శ్రీరాముడి దర్శనం చేసుకొని కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. తరువాత మిగతా దేవుళ్ల పట్టణాల్లో సభలు జరుపుతారు. ప్రతిచోటా దేవుడి దర్శనంతోనే ప్రారంభం. గత ఎన్నికల్లో బిజెపికి ఓట్లు వేసిన వారిలో అగ్రకులాల వారే కాదు, దళితులు కూడా గణనీయంగా మొగ్గారు. అందువలన వారి హిందూత్వను సంతుష్టీకరించేందుకు బిఎస్‌పి ఎలాంటి కార్యక్రమాలను చేపడుతుందో చూడాల్సి ఉంది. గుళ్లు గోపురాలను సందర్శించి తామూ హిందువులమే అని కనిపించేందుకు బిఎస్‌పి, ఎస్‌పి, కాంగ్రెస్‌ నేతలు బారులు తీరుతున్నారు. స్ధానిక మనోభావాలను అర్ధం చేసుకోవాలీ అని ఎవరికి వారు సమర్ధించుకుంటున్నారు. అందరూ తమకు పోటీ వస్తున్నందున మత కిక్కు ఎక్కించేందుకు బిజెపి ఏం చేయనుందో చూద్దాం !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

ఉత్తర ప్రదేశ్‌ గ్రామీణ ఎన్నికల్లో బిజెపికి ఎదురు దెబ్బ – పర్యవసానాలు !

07 Friday May 2021

Posted by raomk in BJP, Communalism, Congress, Current Affairs, History, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, RELIGION

≈ Leave a comment

Tags

BJP, BSP, CM Yogi Adityanath, Samajwadi Party, UP panchayat poll


ఎం కోటేశ్వరరావు


వచ్చే ఏడాది జరిగే ఎన్నికలలో తమ విజయం నల్లేర మీద బండి నడక మాదిరి అనుకుంటున్న బిజెపికి స్ధానిక సంస్దల ఎన్నికలు పెద్ద షాకిచ్చాయి.ప్రధాని ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి, హిందూత్వకు ప్రతీకగా చూపుతూ కూల్చివేసిన మసీదు స్ధానంలో నిర్మిస్తున్న రామాలయం ఉన్న అయోధ్య, ముఖ్యమంత్రి కోట అని చెబుతున్న గోరఖ్‌పూర్‌ వంటి చోట్ల బిజెపికి చావు దెబ్బలు తగలటం గమనించాల్సిన అంశం. రామాలయ నిర్మాణం కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు, వారణాసి అభివృద్దికి పెద్ద పీటవేసినట్లు పెద్ద ఎత్తున ప్రచారం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అన్నింటికీ మించి ఇదే పరిస్దితి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పునరావృతం అయితే భవిష్యత్‌లో ప్రధాని పదవి అభ్యర్ధిగా ప్రచారంలో ఉన్న ఆదిత్యనాధ్‌ పరిస్దితి ఎలా ఉంటుందో తెలియదు.


మార్చి 14వ తేదీ నాటికి ఉత్తర ప్రదేశ్‌ ప్రస్తుత విధాన సభ గడువు ముగియ నుంది. అందువలన ఆ లోగా ఎన్నికల జరగాల్సి ఉంది. గత నెలలో జరిగిన గ్రామీణ స్ధానిక సంస్ధల ఎన్నికలలో యోగి ఆదిత్యనాధ్‌ నాయకత్వానికి ఎదురుదెబ్బ తగలటం కమలనాధులకు కంటి మీద కునుకు లేకుండా చేయటం ఖాయం. పార్టీ రహితంగా జరిగినప్పటికీ రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించిన అభ్యర్ధుల తీరుతెన్నులు చూస్తే పార్టీల వారీగా జిల్లా పరిషత్‌ స్ధానాలలో సమాజవాద పార్టీ పెద్ద పార్టీగా వచ్చింది. పార్టీల కంటే స్వతంత్రులు ఎక్కువ మంది గెలిచారు. దీంతో సహజంగానే అధికార బిజెపి వారిని టోకుగా లేదా విడివిడిగా కొనుగోలు చేసి జిల్లా పరిషత్‌లలో తమకే మెజారిటీ అని చూపించుకొనే యత్నంలో ఉంది. దాని కంటే
7.32 లక్షల గ్రామ పంచాయతీల వార్డులు, 826 సమితులలో 75,852 స్ధానాలు, 75 జిల్లాల్లోని 3,121 జిల్లా పరిషత్‌ స్ధానాలు అంటే మొత్తం ఎనిమిది లక్షల స్దానాలకు 13లక్షల మంది అభ్యర్దులు పోటీ చేశారు. మిగిలిన పార్టీలకు భిన్నంగా బిజెపి ఏ ఏ స్దానాలలో ఎవరిని బలపరుస్తున్నదో జాబితా ప్రకటించింది. దాని ప్రకారం రెండువేలకు పైగా స్ధానాలలో అది ఓడిపోయింది. ఈ ఎన్నికలలో తమ సత్తా చాటేందుకు గాను జనవరిలోనే బిజెపి ఆరు ప్రాంతీయ కమిటీలను ఏర్పాటు చేసింది. ఒక మంత్రి, ఒక సీనియర్‌ నేతలను అధిపతులుగా నియమించింది. ముఖ్యమంత్రి యోగి, కేంద్ర పార్టీ పరిశీలకుడు రాధామోహన్‌ సింగ్‌ అనేక సమీక్షా సమావేశాలు జరిపారు. ఈ ఎన్నికలలో గెలిచిన వారు పార్టీ పదవులకు రాజీనామా చేయాలన్న షరతును పార్టీ విధించింది. ఇప్పుడు గెలిస్తే అసెంబ్లీ ఎన్నికల్లో తమకు ప్రాధాన్యత ఉంటుందనే ఆశతో అనేక మంది ముందే రాజీనామాలు కూడా చేసినట్లు వార్తలు వచ్చాయి.


రాష్ట్రంలోని 75 జిల్లా పరిషత్‌లలో మొత్తం 3,121 స్ధానాలకు ఎన్నికలు జరిగాయి. పార్టీల వారీ సమాజవాద పార్టీ 1000,బిజెపి 900, బిఎస్‌పి 320, కాంగ్రెస్‌ 270, ఆమ్‌ ఆద్మీ 70 మిగిలిన స్ధానాల్లో స్వతంత్రులు గెలిచినట్లు ఆ పార్టీలు ప్రకటించుకున్నాయి ( ఆయా పార్టీలు ప్రకటించుకున్న వివరాల మేరకు వివిధ పత్రికలలో వచ్చిన సంఖ్యలలో తేడాలు ఉన్నాయి. ఉదా కొన్ని పత్రికల్లో కాంగ్రెస్‌కు 72 మాత్రమే). గతంలో గ్రామీణ స్ధానిక సంస్దల ఎన్నికలలో బిజెపి పెద్ద శక్తి కాదు కనుక గత ఎన్నికలలో దాని తీరుతెన్నులు ఇతర పార్టీలతో పోల్చలేము. 2017 అసెంబ్లీ, 2019 లోక్‌సభ ఎన్నికల బిజెపి ఫలితాలతో బిజెపి 2021 పనితీరును పోల్చాల్సి ఉంది. ప్రధాని నరేంద్రమోడీ ఆధ్వర్యంలో రామాలయ భూమి పూజ జరిగిన ప్రాంతం అయోధ్య ఉన్న ఫైజాబాద్‌ జిల్లాలో 43 సీట్లకు గాను సమాజవాది పార్టీ 24, బిజెపి 8, బిఎస్‌పి 4, స్వతంత్రులు ఆరుగురు గెలిచారు. అయోధ్య తరువాత దేశంలో చిచ్చుపెట్టేందుకు ఎంచుకున్న మధుర కృష్ణ జన్మభూమి వివాద జిల్లాలో 33కు గాను బిఎస్‌పి 13, బిజెపి 8 సీట్లు గెలుచుకుంది. రెండు సార్లు ప్రధాని నరేంద్రమోడీని గెలిపించిన వారణాసి జిల్లాలో 48 స్దానాలకు గాను సమాజవాద పార్టీ 15, బిఎస్‌పి, అది బలపరచిన స్వతంత్రులు 17, బిజెపికి 8 వచ్చాయి.


సమాజవాది పార్టీ విషయానికి వస్తే తమకు ఇన్ని సీట్లు వచ్చాయని చెప్పటం తప్ప జాబితాను ప్రకటించలేదు. ఇతరులు ఎవరైనా తమతో కలసి వస్తే అవసరమైతే వారికి పార్టీ ముద్రవేసి బలపరిచేందుకు వీలుగా వ్యవహరిస్తున్నది. ఎన్ని సమితి, జిల్లా పరిషత్‌లను కైవశం చేసుకోవాలన్నదే ఇప్పుడు దాని లక్ష్యంగా ఉంది. తాము అధికారికంగా ప్రకటించిన అభ్యర్ధులతో పాటు గెలిచిన వారిలో తమ పార్టీకి చెందిన తిరుగుబాటుదారులు పెద్ద సంఖ్యలో ఉన్నట్లు బిజెపి చెప్పుకుంటోంది. పార్టీ రహితంగా గెలిచినందున ఫిరాయింపుల సమస్య ఉండదు కనుక ఎవరు వచ్చినా పార్టీలో చేర్చుకొనేందుకు ద్వారాలు తెరిచింది. బిఎస్‌పి, కాంగ్రెస్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎవరికి మద్దతు ఇస్తాయనేది రాజకీయంగా కీలకంగా మారింది.
వివిధ పత్రికలలో వస్తున్న వార్తల ప్రకారం గ్రామీణ ప్రాంతాలలో పెద్ద ఎత్తున కరోనా వ్యాపిస్తున్నది. మరణాలు కూడా ఎక్కువగానే ఉన్నా నమోదు కావటం లేదు. దక్కన్‌ హెరాల్డ్‌ పత్రిక సమాచారం ప్రకారం మే 7వ తేదీ నాటికి ఉత్తర ప్రదేశ్‌లో మొత్తం కేసులు 14,25,916 కాగా, మరణాలు 14,501 అంటే వందకు ఒక మరణం జరుగుతోంది. ఆదిత్యనాధ్‌ ఇటీవల కేరళ వెళ్లి తమ అభివృద్దిని చూసి నేర్చుకోవాలని హితవు పలికిన విషయం తెలిసిందే. అక్కడ ఇటీవల కేసులు గణనీయంగా పెరిగినప్పటికీ మే 7 నాటికి వందకు మరణాలు 0.3 మాత్రమే. యోగి ఆదిత్యనాధ్‌ పలుకుబడి బాగా ఉన్న తూర్పు ఉత్తర ప్రదేశ్‌ గ్రామీణ ప్రాంతాలలో పరిస్ధితి దారుణంగా ఉందని వార్తలు వస్తున్నాయి.


ఇక రాజకీయాల విషయానికి వస్తే 2017 అసెంబ్లీ ఎన్నికలలో బిఎస్‌పి ఒంటరిగా అన్ని స్ధానాలకు పోటీ చేయగా సమాజవాది పార్టీ 298, దానితో కలసిన కాంగ్రెస్‌ 105 చోట్ల పోటీ చేసింది. రెండేళ్ల తరువాత జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఎస్‌పి, బిఎస్‌పి, ఆర్‌ఎల్‌డి ఒక కూటమిగా కాంగ్రెస్‌ విడిగా పోటీ చేశాయి.ఓటింగ్‌ను చూస్తే ఎస్‌పి-బిఎస్‌పి కుడి ఎడమలుగా ఉన్నాయి. లోక్‌సభ ఎన్నికల తరువాత బిఎస్‌పి అనేక కీలక సమస్యల మీద బిజెపికి మద్దతు ఇచ్చి దానికి దగ్గరైందనే అభిప్రాయం కలిగే విధంగా వ్యవహరించింది. అందుకే బిజెపి బీ టీమ్‌ బిఎస్‌పి అని ప్రియాంక గాంధీ వర్ణించారు. పంచాయతీ ఎన్నికల్లో సమాజవాది పార్టీతో పోలిస్తే బిఎస్‌పికి తక్కువ సీట్లు వచ్చినప్పటికీ రాబోయే రోజుల్లో రాజకీయ అవసరాల కోసం ఫలితాల గురించి ఎస్‌పి ఆచితూచి వ్యాఖ్యానిస్తోంది.


వివిధ పార్టీల బలాబలాలకు సంబంధించి గత అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల వివరాలను చూద్దాం. 2017అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి 384 స్ధానాల్లో దాని మిత్ర పక్షాలు 19 స్ధానాల్లో పోటీ చేశాయి.బిజెపికి 39.67శాతం, మిత్రపక్షాలకు 1.7శాతం వచ్చాయి. సమాజవాది పార్టీ పోటీ చేసిన 298 స్దానాల్లో 21.82, బిఎస్‌పి అన్ని చోట్లా 403 పోటీ చేసి 22.23శాతం తెచ్చుకుంది. సమాజవాది పార్టీతో సర్దుబాటు చేసుకున్న కాంగ్రెస్‌కు 105 స్దానాల్లో 6.25శాతం వచ్చాయి. ప్రతిపక్ష పార్టీల ఓట్ల చీలిక బిజెపికి 312 సీట్లు తెచ్చిపెట్టింది.యాభైశాతం పైగా ఓట్లు తెచ్చుకున్న పార్టీలకు వచ్చింది 73 మాత్రమే. తరువాత 2019లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి కూటమికి 51.19శాతం ఓట్లు 80కి గాను 69 సీట్లు వచ్చాయి. ఓట్లు పెరిగినా అంతకు ముందుతో పోలిస్తే 9 సీట్లు తగ్గాయి. ఎస్‌పి-బిఎస్‌పి కూటమికి 39.23శాతం ఓట్లు 15 సీట్లు వచ్చాయి, కాంగ్రెస్‌కు 6.41శాతం ఓట్లు ఒక సీటు వచ్చింది.


అయోధ్యలో రామాలయ నిర్మాణ వాగ్దానం నెరవేర్చామని చెప్పుకుంటూ యోగి మరోసారి పార్టీని అధికారంలోకి తెస్తారని కలలు కంటున్నవారికి స్ధానిక సంస్ధల ఫలితాలు షాక్‌ వంటివే. ఢిల్లీ శివార్లలో జరుగుతున్న రైతు ఉద్యమ ప్రభావం పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌లో పడిన కారణంగానే తాజా ఎన్నికలలో బిజెపి అనేక చోట్ల ఓడిపోయిందని వార్తలు వచ్చాయి. కరోనా నిర్లక్ష్యంతో జరిగే పరిణామాలు రాబోయే రోజుల్లో ఎన్నికలను ప్రభావితం చేస్తాయని పరిశీలకులు భావిస్తున్నారు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

Recent Posts

  • మనవాళ్లు వట్టి వెధవాయి లోయి అన్న గిరీశాన్ని గుర్తుకు తెస్తున్న వాట్సాప్‌ పండితులు !
  • బిజెపి మిత్రోం అదానీ, బికినీలను కాదు సామాన్య జనాన్ని చూడండి !
  • వైవిధ్య సమస్యలతో ప్రపంచ వ్యవసాయ రంగం !
  • రష్యా – జర్మనీలను శాశ్వత శత్రు దేశాలుగా మార్చే అమెరికా కుటిల పన్నాగం !
  • అక్రమం జరిగిందా లేదా విచారణకు ఆదేశిస్తారా లేదా : అదానీ కంపెనీలపై నోరు విప్పని ప్రధాని నరేంద్రమోడీ !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • మనవాళ్లు వట్టి వెధవాయి లోయి అన్న గిరీశాన్ని గుర్తుకు తెస్తున్న వాట్సాప్‌ పండితులు !
  • బిజెపి మిత్రోం అదానీ, బికినీలను కాదు సామాన్య జనాన్ని చూడండి !
  • వైవిధ్య సమస్యలతో ప్రపంచ వ్యవసాయ రంగం !
  • రష్యా – జర్మనీలను శాశ్వత శత్రు దేశాలుగా మార్చే అమెరికా కుటిల పన్నాగం !
  • అక్రమం జరిగిందా లేదా విచారణకు ఆదేశిస్తారా లేదా : అదానీ కంపెనీలపై నోరు విప్పని ప్రధాని నరేంద్రమోడీ !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • మనవాళ్లు వట్టి వెధవాయి లోయి అన్న గిరీశాన్ని గుర్తుకు తెస్తున్న వాట్సాప్‌ పండితులు !
  • బిజెపి మిత్రోం అదానీ, బికినీలను కాదు సామాన్య జనాన్ని చూడండి !
  • వైవిధ్య సమస్యలతో ప్రపంచ వ్యవసాయ రంగం !
  • రష్యా – జర్మనీలను శాశ్వత శత్రు దేశాలుగా మార్చే అమెరికా కుటిల పన్నాగం !
  • అక్రమం జరిగిందా లేదా విచారణకు ఆదేశిస్తారా లేదా : అదానీ కంపెనీలపై నోరు విప్పని ప్రధాని నరేంద్రమోడీ !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Follow Following
    • vedika
    • Join 234 other followers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Customize
    • Follow Following
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d bloggers like this: