Tags
BJP, caste discrimination, Caste Discrimination Ban in Seattle, Casteism in America, Hindu Fundamentalism, Hinduthwa, Kshama Sawant, RSS, Seattle
ఎం కోటేశ్వరరావు
ఎక్కడైతే కుల వివక్ష పాటించబడుతున్నదో దానికి భారతీయులు కారణం కావటం సిగ్గుతో తల దించుకోవాల్సిన అంశం. ఎక్కడైతే అంటరానితనం మీద గళమెత్తారో అక్కడ కమ్యూనిస్టులు ఉండటం గర్వంతో తల ఎత్తుకొనే పరిణామం.అమెరికాలో ఇప్పుడు జరిగింది అదే. కొద్ది రోజుల క్రితం కులవివక్షను నిషేధిస్తూ తీర్మానం చేసిన అమెరికాలోని ఏకైక నగరంలో సియాటిల్ కాగా అందుకు ఆద్యురాలు, కమ్యూనిస్టు కౌన్సిలర్ క్షమా సావంత్ అనే 49 సంవత్సరాల భారతీయ మహిళ.తొలిసారి ఎన్నికైనపుడు కనీస వేతనం గంటకు 15 డాలర్ల కంటే తక్కువ ఉండరాదంటూ ఆమె ప్రవేశపెట్టిన తీర్మానం నెగ్గింది. దాంతో అనేక నగరాల్లో అలాంటి తీర్మానాలకు తెరలేచింది. ఇప్పుడు కులవివక్షపై నిషేధం విధించాలంటూ ఆమె ప్రవేశపెట్టిన తీర్మానాన్ని కౌన్సిల్ ఆమోదించింది. ఒక కమ్యూనిస్టుగా బాధ్యతల నిర్వహణలో సహజంగానే ఆమె కార్పొరేట్ల ఆగ్రహానికి గురయ్యారు. కౌన్సిలర్గా వెనక్కు పిలవాలంటూ తప్పుడు ఆరోపణలు చేసి ఓటింగ్ నిర్వహించారు. దానిలో కూడా ఆమె మెజారిటీ సాధించి తన సత్తాను చాటుకున్నారు.రాజీపడని ఒక సోషలిస్టును పదవి నుంచి తొలగించేందుకు చేసిన యత్నాలంటూ బ్రిటన్కు చెందిన ఇండిపెండెంట్ పత్రిక ” అమెరికాకు మరింత మంది కమ్యూనిస్టుల అవసరం ఏమిటి ? ” అనే శీర్షికతో 2021 డిసెంబరు 14న ఒక విశ్లేషణ రాసింది. కరోనా ఆంక్షలు అమల్లో ఉన్నపుడు మేయర్ ఇంటి ముందు ఒక నిరసన ప్రదర్శనలో మాట్లాడినందుకు గాను ఆమెను కౌన్సిలర్గా తొలగించాలని చూశారు. బడా వాణిజ్యవేత్తలు, మితవాదులు, కార్పొరేట్ మీడియా, రాజకీయవేత్తలు, కోర్టులు ఆమెను వదిలించుకోవాలని చూసినట్లు ఆ పత్రిక రాసింది. అమెరికా రాజధాని వాషింగ్టన్డిసిలోని అమెరికా అధికార కేంద్రం కాపిటల్ హిల్ ప్రాంతం కొంత భాగం కూడా క్షమా సావంత్ ప్రాతినిధ్యం వహిస్తున్న మూడవ వార్డు(జిల్లా అని పిలుస్తారు) పరిధిలోకి వస్తుంది.
సియాటిల్ నగరపాలక సంస్థకు తొలిసారిగా 2013లో ఎన్నికైన క్షమా ఈ ఏడాది ఆఖరి వరకు కౌన్సిలర్గా ఉంటారు. ప్రస్తుతం ఉన్న మొత్తం తొమ్మిది మందిలో ఆమే సీనియర్. వచ్చే ఎన్నికలలో తాను పోటీలో ఉండనని, కార్మిక ఉద్యమాల నిర్మాణానికి అంకితమౌతానని ఆమె ప్రకటించారు. ఏ దేశమేగినా ఎందు కాలిడినా, ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండుగౌరవము అని అభినవ నన్నయ అని పేరు తెచ్చుకున్న రాయప్రోలు సుబ్బారావు తన దేశభక్తి గీతంలో ఉద్భోదించారు. అటువంటి శక్తులకు క్షమా సావంత్ ప్రతినిధి. కానీ ఎక్కడకు వెళ్లినా కులవివక్ష కంపును మోసుకుపోతున్న సంస్కారం లేని జనాలు అమెరికాలో కూడా ఆ జాఢ్యాన్ని వదిలించుకోకపోగా అమలు జరిపేందుకు పూనుకున్నారు. అమెరికాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం కోల్బి కాలేజీలో కులవివక్షపై నిషేధం విధించారు. ఈ చర్యతో మన కులం కంపును అంతర్జాతీయంగా వ్యాపింప చేస్తున్నామని మరోసారి లోకానికి వెల్లడైంది. పరాయి దేశాలకు పోయినా కులాల కుంపట్లు రాజేసుకొని రాజకీయాలు చేస్తున్న వారిని చూస్తున్నాం.చివరికి ఇటీవల సినిమా అభిమానులు కొట్టుకొని కేసుల్లో ఇరుక్కున్న సంగతి కూడా తెలిసిందే. అనేక మంది తాము కులవివక్ష పాటించటం లేదని చెబుతారు. అది అభినందనీయమే కానీ ఇతరులు పాటిస్తుంటే ప్రేక్షకులుగా, మౌనంగా ఉండటాన్ని ఎలా చూడాలి ? అమెరికా, ఐరోపా దేశాల్లో ఆఫ్రికన్లు, ఆసియన్లు, శ్వేతేతరులందరూ జాత్యహంకారానికి గురవుతున్నారు. భారతీయులు కూడా దానికి గురౌతున్నారు.కానీ వారిలో అగ్రకులం అనుకొనే వారు అక్కడ కూడా మిగతా వారి పట్ల కులవివక్షను పాటిస్తున్నారు. వీరిలో ఉద్యోగులు, విద్యార్ధులు కూడా ఉన్నారు. మొత్తం పాతికలక్షల మంది అమెరికాలో భారత సంతతికి చెందిన వారున్నారు.
సిస్కో కంపెనీలో పని చేస్తున్న దళిత సామాజిక తరగతికి చెందిన ఒక ఇంజనీరు అదే కంపెనీలో మేనేజర్లుగా పని చేస్తున్న మరో ఇద్దరు అగ్రకులాలుగా పరిగణించే వారు తన పట్ల వివక్ష చూపారన్న ఫిర్యాదు మీద సదరు కంపెనీ ఎలాంటి చర్యతీసుకోకపోగా తమ వద్ద అలాంటి వివక్ష లేదని చెప్పుకుంది. ఫిర్యాదు చేసిన దళితుడిని పక్కన పెట్టింది. ఈ వార్త వెల్లడికాగానే అమెరికాలో కులవివక్షకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఈక్వాలిటీ లాబ్స్కు ఫేస్బుక్, గూగుల్, మైక్రోసాఫ్ట్,ఐబిఎం వంటి కంపెనీలలో కూడా అలాంటి పరిస్ధితి ఉందంటూ అనేక ఫిరా ్యదులు అందాయి. వత్తిడి పెరగటంతో సిస్కో సంస్థ జరిపిన విచారణలో వివక్ష నిజమే అని తేలింది. అమెరికాలో ఉన్న చట్టాల ప్రకారం కులం, తెగలకు సంబంధించి ఎలాంటి రక్షణ చట్టాల్లో లేనందున ఈ కేసును కొట్టివేయాలని కోర్టును కోరింది. ఈ కేసులో ఒక పక్షంగా చేరిస ఒక హిందూత్వ సంస్థ హిందూయిజానికి వివక్షకు సంబంధం లేదంటూ వాదనలు చేస్తున్నది. ఈ కేసు ఇంకా విచారణలో ఉంది. కులాలు లేకపోతే హిందూత్వ వాదులకు ఉలుకెందుకు ? తాజాగా సియాటిల్ నగరపాలక సంస్థ చేసిన నిర్ణయం ఈ కేసును ఎలా ప్రభావితం చేస్తుందో చూడాల్సి ఉంది. సిలికాన్ వ్యాలీలో ” అగ్రహార వ్యాలీలు ” ఉన్నాయని ఈక్వాలిటీ లాబ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీమతి తనిమొళి సౌందర్రాజన్ చెప్పారు. (మన దేశంలో అగ్రహారాలు వివక్షకు ప్రతి రూపాలుగా ఉన్నందున ఆమె అలా వర్ణించారు. ఇప్పుడు అగ్రహారాలు లేని చోట్ల కూడా వివక్ష పాటించే వారందరికీ అది వర్తిస్తుంది ) ఐఐటి-మద్రాస్ను అయ్యర్ అయ్యరగార్ టెక్నాలజీ అని గుసగుసలాడుకుంటారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని చోట్ల ఇలాంటి వాటిని ఎవరైనా చూడవచ్చు. భుజం మీద చేయివేసి జంధ్యం ఉందా లేదా అని నిర్ధారించుకొనే టెక్నాలజీ మన సొంతం. కులపరమైన వివక్ష దేశంలో నిషేధించబడిందనే అంశం తెలిసినప్పటికీ ఖర్గపూర్ ఐఐటి ప్రొఫెసర్ సీమా సింగ్ ఎస్సి, ఎస్టి విద్యార్థులను బ్లడీ బాస్టర్డ్స్అంటూ తూలనాడిన దురహంకార ఉదంతం జరిగింది. అమెరికాలోని స్వామినారాయణ సంస్థ్ధ న్యూజెర్సీలో దేవాలయ నిర్మాణం కోసం రెండు వందల మంది బలహీనవర్గాలకు చెందిన వారిని అక్కడికి తీసుకుపోయి గంటకు కేవలం 1.2 డాలర్లు మాత్రమే ఇస్తూ సంవత్సరాల తరబడి పని చేయిస్తున్నట్లు అక్కడి మీడియా వెల్లడించింది. వారు కార్మికులు కాదని, దేవాలయ నిర్మాణంలో పాలు పంచుకుంటున్న నిపుణులైన చేతిపని స్వచ్చందసేవకులని, వారినెంతో గౌరవంగా చూస్తున్నామని సంస్ధ అధిపతి కాను పటేల్ సమర్ధించుకున్నారు. సిస్కో, ఈ దేవాలయ నిర్మాణంలో వెట్టి కార్మికుల కేసు ఇంకా పరిష్కారం కాలేదు.
ఈక్వాలిటీ లాబ్ 2016లో నిర్వహించిన ఒక సర్వేలో దిగువ కులాలుగా పరిగణించబడుతున్న తరగతులకు చెందిన వారిలో 41శాతం మంది వివక్షకు గురవుతున్నట్లు చెప్పినట్లు తేలింది. అమెరికా స్కూళ్లు, కాలేజీలు, విశ్వవిద్యాలయాలలో ఈ సర్వే జరిగింది. పని స్థలాల్లో వివక్షకు గురైనట్లు 67శాతం చెప్పారు. మొత్తంగా దక్షిణాసియా వారు వివక్షకు గురవుతున్నప్పటికీ వారిలో అగ్రకులాలకు చెందిన వారు నామమాత్రంగా ఉన్నారని సర్వే తెలిసింది. కార్నెగీ సంస్థ 2020లో జరిపిన సర్వేలో అమెరికాలో జన్మించిన వారితో పోలిస్తే వలస వచ్చిన వారిలో ఎక్కువ మంది తమ కుల గుర్తింపును గట్టిగా చెప్పినట్లు తేలిసింది. పదిలో ఎనిమిది మంది తాము అగ్రకుల హిందువులమని చెప్పుకున్నారట. వివక్ష గురించి అడిగిన ప్రశ్నకు అమెరికాలో శ్వేతజాతి వివక్ష అమెరికా ప్రజాస్వామ్యానికి ముప్పని భారత సంతతికి చెందిన వారిలో 73శాతం మంది చెప్పగా వారే భారత్లో హిందూత్వ మెజారిటీ వివక్ష ఇక్కడి ప్రజాస్వామ్యానికి ముప్పని 53శాతం మాత్రమే చెప్పారట.
అమెరికా, ఇతర దేశాలలో ఉన్న దళితులు తాము ఎదుర్కొంటున్న వివక్ష, అవమానాలకు వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. సామాజిక మాధ్యమ వేదికలను ఏర్పాటు చేసి ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నారు, బాధితులకు ఆసరాగా నిలుస్తున్నారు. అలాంటి వారిలో సెల్వీ రాజన్ ఒకరు. ఆమె ఆర్గనైజ్ పేరుతో కుల వివక్ష వ్యతిరేక శక్తులను సమీకరిస్తున్నారు. ఆమె తలిదండ్రులు కులవివక్షను తప్పించుకొనేందుకు అమెరికా వలస వెళ్లారు.తాము భారత్ నుంచి అమెరికా వచ్చినా అక్కడా కులముద్ర వెంటాడుతోందని సెల్వీ ఆవేదన చెందారు. తన అనుభవం గురించి చెబుతూ దళితులు అమెరికాకు రావటం అరుదుగా ఉంటున్న స్ధితిలో తనను అగ్రకులస్తురాలిగా భావించారన్నారు. ఒక ఆసియన్గా శ్వేతజాతి దురహంకారానికి గురైనట్లు చెప్పారు.తన రూమ్మేట్గా ఉన్న ఒక బ్రాహ్మణ యువతి తన వంట పాత్రల్లో మాంసం కాదు కదా గుడ్లు కూడా ఉడికించటానికి వీల్లేదని చెప్పినట్లు వెల్లడించారు. అమెరికాలో కూడా కులాన్ని పాటిస్తున్నందున ఇతరుల మాదిరే తోటి భారతీయుల ముందు కులాన్ని దాచుకోవాల్సి వచ్చిందన్నారు. కులతత్వానికి వ్యతిరేకంగా పోరాడకపోతే అమెరికాలో కూడా అది పాతుకుపోతుంది. అమెరికాలో జాత్యహంకారం, భారత్లో కులతత్వానికి దగ్గరి పోలికలు ఉన్నాయని రెండూ అణచివేతకు పాల్పడేవే అన్నారు. భారత హాకీ ఒలింపిక్ టీమ్లో ఎక్కువ మంది దళితులు ఉన్న కారణంగానే జట్టు ఓడిపోయిందని క్రీడాకారిణి వందనా కటారియా కుటుంబ సభ్యులను అగ్రకుల దురహంకారులు నిందించిన ఉదంతాన్ని సెల్వి గుర్తు చేసింది. కులదురహంకారం, జాత్యహంకారం ఒకదాని మీద ఒకటి ఆధారపడతాయంటూ 1959లో అమెరికా హక్కుల ఉద్యమ నేత మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ భారత పర్యటన అనుభవాన్ని సెల్వి ఉటంకించారు. తిరువనంతపురంలోని ఒక ఉన్నత పాఠశాలను కింగ్ దంపతులు సందర్శించారు. అక్కడి హెడ్మాస్టర్ దళిత విద్యార్థులకు వారిని పరిచయం చేస్తూ కింగ్ మీకులపు వారే అని పేర్కొన్నట్లు సెల్వి చెప్పారు.
మన దేశంలో రిజర్వేషన్ సౌకర్యం పొందుతున్న దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతుల వారు తెలివితేటలు, ప్రతిభాపాటవాల్లో ఇతర కులస్తులకంటే పుట్టుకతోనే తక్కువ అనే ఒక తప్పుడు అభిప్రాయం ఉంది. అమెరికాలోని శ్వేతజాతి వారితో పోలిస్తే ఆఫ్రో-అమెరికన్లలో జన్యుపరంగానే ఐక్యు (తెలివితేటలు) తక్కువ అంటూ 1994లో బెల్కర్వ్ సిద్దాంతాన్ని ముందుకు తెచ్చారు. 2018లో జరిపిన ఒక సర్వే ప్రకారం 26శాతం మంది దక్షిణాసియా వాసులు భౌతికదాడులకు గురైనట్లు , 59శాతం మంది కులపరమైన వివక్షకుగురైనట్లు, సగం మంది తాము దళితులమని వెల్లడైతే దూరంగా పెడతారని భయపడినట్లు తేలింది.2003లో పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలోని భారత అధ్యయన కేంద్ర సర్వే ప్రకారం భారత్ నుంచి వలస వచ్చిన వారిలో దళితులు కేవలం 1.5శాతమే అని 90శాతం మందికి పైగా తాము ఆధిపత్యకులాలకు చెందిన వారిగా చెప్పినట్లు తేలింది. అమెరికాలో జన్మించిన భారత సంతతివారితో పోలిస్తే వలస వచ్చిన వారితో కులవివక్ష సమస్య ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. ప్రీతి మేషరామ్ అనే దళితయువతి అమెరికాలో తన అనుభవం గురించి చెబుతూ పార్టీలు జరుపుకునే సమయంలో ప్రతి గదిలో ఉన్నవారిని పలుకరించి కులం గురించి తెలుసుకున్నవారు తన వద్దకు వచ్చేసరికి ఇబ్బంది పడేవారని, కారణం తాను దళితకులానికి చెందినట్లు తెలియటమే అన్నారు. తనపై జరిగిన అత్యాచారం గురించి ఆమె వివరిస్తూ గ్రామాల్లో పొలాల్లో పని చేసే దళిత స్త్రీల శరీరాలకు తామే యజమానులమన్నట్లు ప్రవర్తించే భూస్వాముల మాదిరి ఒక అగ్రకుల విద్యార్థి తన పట్ల ప్రవర్తించాడని, ఆ విషయాన్ని అగ్రకులానికి చెందిన తన రూమ్మేట్కు చెబితే నమ్మకుండా తిట్టిందని మేషరామ్ చెప్పింది. రుజువు చేసే అవకాశాలు లేనందున ఫిర్యాదు చేయ లేదని చెప్పింది.
అమెరికాలోని దళితుల గురించి ఈక్వాలిటీ లాబ్ జరిపిన సర్వే విశ్లేషణ ఫలితాలు ఇలా ఉన్నాయి. సర్వేలో పాల్గొన్నవారిలో 25శాతం మంది భౌతిక లేదా దూషణ దాడికి గురయ్యారు. చదువుకొనేటపుడు ప్రతి ముగ్గురిలో ఒకరు వివక్షను అనుభవించారు. పని స్థలాల్లో మూడింట రెండువంతుల మంది పట్ల అనుచితంగా వ్యవహరించారు. అరవైశాతం మంది కులపరమైన జోక్స్ లేదా మాటలను ఎదుర్కొన్నారు.నలభైశాతం మంది దళితులు, 14శాతం మంది శూద్రులను పని స్థలాల్లో ఎందుకు వచ్చారన్నట్లుగా చూశారు. తమ కులం కారణంగా వాణిజ్యంలో వివక్షకు గురైనట్లు 14శాతం మంది దళితులు చెప్పారు.తమ కులం కారణంగా అమ్మాయిలు తమతో రొమాంటిక్ రిలేషన్షిప్కు తిరస్కరించినట్లు 40శాతం మంది చెప్పారు.తమ కులాన్ని ఎక్కడ వెల్లడిస్తారో అనే భయం ప్రతి ఇద్దరు దళితుల్లో ఒకరు, ప్రతి నలుగురు శూద్రుల్లో ఒకరిలో ఉన్నట్లు వెల్లడైంది. అయితే అనేక మంది కులవివక్షను వ్యతిరేకిస్తూనే ఆత్మన్యూనతకు లోను కాకుండా తమ కులం గురించి గర్వంగా చెప్పుకొనే దళితులు కూడా గణనీయంగా ఉన్నారు. ప్రపంచీకరణలో దోపిడీకి వ్యతిరేకంగా పోరాటాలతో పాటు ప్రపంచవ్యాపితం అవుతున్న కులవివక్ష మహమ్మారికిి వ్యతిరేకంగా దాన్ని వ్యతిరేకించే అందరితో కలసి పోరాడాల్సి ఉంది.
మహారాష్ట్రకు చెందిన తమిళ కుటుంబానికి చెందిన క్షమా సావంత్ ముంబైలో చదువుకున్నారు. అక్కడ ఆమెకు వామపక్ష భావాలు వంటబట్టాయి.భర్త వివేక్ సావంత్తో కలసి సాఫ్ట్వేర్ ఇంజనీరుగా అమెరికా వెళ్లిన ఆమె అక్కడ అర్ధశాస్త్రం చదుకొని బోధనా వృత్తిని చేపట్టారు.సోషలిస్టు ప్రత్యామ్నాయం అనే ఒక కమ్యూనిస్టు పార్టీలో 2006లో చేరారు. ప్రస్తుతం ఆమె డెమోక్రటిక్ సోషలిస్టు పార్టీలో ఉన్నారు. సియాటిల్ నగరపాలక సంస్థకు తొలిసారిగా 2013లో ఎన్నికైన క్షమా ఈ ఏడాది ఆఖరి వరకు కౌన్సిలర్గా ఉంటారు. ప్రస్తుతం ఉన్న తొమ్మిది మందిలో ఆమే సీనియర్. వచ్చే ఎన్నికలలో తాను పోటీలో ఉండనని, కార్మిక ఉద్యమాల నిర్మాణానికి అంకితమౌతానని ఆమె ప్రకటించారు. మన దేశం నుంచి అనేక మంది అమెరికా వెళ్లారు. ఎంపీలు, మంత్రిపదవులు వెలగబెట్టారు. ఇప్పుడు ఏకంగా భారత సంతతికి చెందిన కమలా హారిస్ ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు. వారిలో ఏ ఒక్కరూ కష్మా సావంత్ మాదిరి ఎందుకు ఆలోచించలేదు ? మహిళలకు మాత్రమే వారి సమస్యలు అలాగే దళితులకు మాత్రమే దళితుల వారి సమస్యలు తెలుస్తాయని మిగతావారికి మాట్లాడే అర్హత లేదన్నట్లుగా మాట్లాడేవారికి దళితురాలు కాని క్షమా సావంత్ ఆచరణ ఆలోచింపచేస్తుందా ? ఎవరికైనా స్పందించే హృదయం, చిత్తశుద్ది కావాలి. అది ఉండబట్టే నాడు ఉన్నవ లక్ష్మీనారాయణను మాలపల్లి నవలా రచనకు పురికొల్పింది. లేనందునే అనేక మంది దళితులమని చెప్పేవారు మనువాదుల చంకనెక్కి అధికారం కోసం అర్రులు చాస్తున్నారు. నాడు దళితుల కోసం పోరాడిన ఇతరులు అనేక మంది వారి సామాజిక తరగతికి ద్రోహం చేసినట్లు విమర్శలు ఎదుర్కొన్నారు, మరి నేడు మనువాదుల వెంట తిరిగే దళితులు ఎవరికి ద్రోహం చేస్తున్నట్లు ?