• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: catholic religion

కరోనా వైరస్‌ : కట్టడిలో కమ్యూనిస్టుల విజయం- జాడలేని మతాలు, యోగులు, యోగినులు !

11 Saturday Apr 2020

Posted by raomk in CHINA, COUNTRIES, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, RELIGION, RUSSIA, UK, USA

≈ 1 Comment

Tags

catholic religion, COVID- 19 pandemic, Good friday 2020, Pope Francis

Coronavirus

ఎం కోటేశ్వరరావు
బ్రహ్మాండం బద్దలు కాలేదు, సముద్రాలు ఇంకి పోలేదు, ఇటు సూర్యుడు అటు పొడవ లేదు. కరోనా కారణంగా వందల సంవత్సరాలుగా పాటిస్తున్న గుడ్‌ఫ్రైడే క్రతువును పోప్‌ స్వయంగా పక్కన పెట్టాల్సి వచ్చింది. తన నివాసంలోనే తంతును పూర్తి చేశారు. అనేక దేశాల్లో ఇదే జరిగింది.ఎక్కడైతే ఏసు క్రీస్తును శిలువ వేశారని భక్తులు నమ్ముతారో జరూసలెంలోని ఆ ప్రాంతంలో నిర్మించిన హౌలీ పుల్చెర్‌ చర్చ్‌లో అతి కొద్ది మంది ప్రార్ధనలు చేశారు. ఫిలిప్పైన్స్‌లో ఊరేగింపునే రద్దు చేశారు. కొందరు సామాజిక దూరం నిబంధనలను ఉల్లంఘించి కొన్ని చోట్ల ప్రార్ధనలు చేశారు. అందువలన మత చాదస్తులు, ఉన్మాదులు ఎవరైనా ఉంటే వారికి ఈ సమాచారాన్ని చేరవెయ్యాలి, కళ్లారా చూసేందుకు దృశ్యాలను వారి ముందు ప్రదర్శించాలి. అయినా మారకపోతే అలాంటి వారిని కరోనా క్వారంటైన్‌ మాదిరి ఎక్కడైనా పెట్టి తాళం వెయ్యాలి. ఇది ఒక్క క్రైస్తవుల గురించే వ్యాఖ్య అనుకుంటే పొరపాటు ఏ మతం వారికైనా జరగాల్సింది ఇదే.
ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ మతాల మూఢనమ్మకాల ఉక్కు గోడలను తుత్తునియలు చేస్తోంది. మతాలతో నిమిత్తం లేని దేవుడు, దేవతలు, దయ్యాలతో ప్రమేయం లేని కమ్యూనిస్టు చైనా కరోనాను కట్టడి చేసి సాధారణ జనజీవితాన్ని పునరుద్దరించింది. మరోవైపు దేవుడు,దేవతలు, దేవుడు, దేవుని కుమారుడు, దేవ దూతలు తమను రక్షిస్తారని కూర్చున్న మూర్ఖశిఖామణులను వారెవరూ కాపాడటం లేదు, దిక్కులేని చావు చస్తున్నారు, పూడ్చేందుకు కూడా ఎవరూ లేని వారిని అమెరికాలో గుట్టలుగా పడవేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ పరిణామం మత పునరుద్దరణ, మతోన్మాదశక్తులకు ఊహించని ఎదురుదెబ్బ. మూఢనమ్మకాలను నల్లేరు మీద బండిలా ముందుకు తీసుకుపోవచ్చన్న అజెండాతో ముందుకు పోతున్నవారికి పెద్ద కుదుపు. ఊగిసలాటతో ఉన్న అనేక మందికి ఈ పరిణామం దేవుడు, దేవతలు, మతాలు వాటి మహిమల మీద నమ్మకాలను వమ్ము చేస్తుంది.
ప్రపంచంలో ఏదైనా ఒక ప్రధాన ఘటన జరిగిన తరువాత జ్యోతిష్కులు అదిగో చూడండి మేము ముందే చెప్పాము అంటూ ముందుకు వస్తారు. కొంత మంది తమ మెదళ్లలో ఉన్న అశాస్త్రీయ సరుక్కు ఇదిగో నాసా(అమెరికా నేషనల్‌ ఏరోనాటిక్స్‌ అండ్‌ స్పేస్‌ అడ్మినిస్ట్రేషన్‌) చెప్పింది అని ముద్ర తగిలిస్తారు. మరికొందరు మన పోతులూరి వీరబ్రహ్మం, ఫ్రెంచి జ్యోతిష్కుడు మైఖేల్‌ డే నోస్ట్రాడామస్‌ పేరు ఉపయోగించి 1551లో ఇలా రాశాడు అంటూ ప్రచారం చేస్తారు. వాటిలో ఒకటి ఇప్పుడు కరోనా మీద తిరుగుతోంది. దానిలో ఇలా ఉంది.” ఒక జంట సంవత్సరం(2020) ఉంటుంది. దాన్నుంచి ఒక రాణి (కరోనా) తూర్పు దిక్కు(చైనా) నుంచి వస్తుంది.ఏడు కొండలు ఉన్న ఒకదేశం(ఇటలీ) మీద ఒక చీకటి రాత్రి ఒక ప్లేగ్‌(వైరస్‌)ను చల్లుతుంది.అది జీవిత చరమాంకంలో ఉన్న పురుషులలో ప్రవేశించి మట్టి(మరణం)గా మారుస్తుంది. ప్రపంచాన్ని నాశనం చేస్తుంది.అది ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధను అంతం చేస్తుంది”.

These photos show how coronavirus fears left religious sites empty ...
దీన్ని సృష్టించిన వారు, దాన్ని గుడ్డిగా నమ్మేవారు, సామాజిక మాధ్యమంలో ప్రచారం చేసే వారి గురించి చెప్పాలంటే ఏమాత్రం బుర్ర ఉపయోగించని వారే అన్నది స్పష్టం. నోస్ట్రోడామస్‌ ఒక జంట సంవత్సరం వస్తుంది, అది 2020 అని చెప్పటమే తెలివితక్కువ తనం. ప్రతి నూట ఒక్క సంవత్సరాలకు అలాంటి సంవత్సరాలు వస్తాయి. అవి నోస్ట్రోడామస్‌కు ముందు వచ్చాయి, తరువాత వస్తాయి. అతగాడు చెప్పింది 1551లో అంటున్నారు గనుక 1616,1717,1818,1919 వచ్చాయి. అవే కాదు మూడంకెల సంవత్సరాలు కూడా వచ్చాయి. మిగతా సంవత్సరాలలో ఈ సంవత్సరాలలో కూడా ప్రపంచాన్ని కుదిపివేసిన ఉదంతాలు ఎన్నో జరిగాయి. ఈ ప్రచార సృష్టి కర్తలకు బాక్టీరియాకు, వైరస్‌కు తేడా తెలియదు. అది ఇటలీలో ముసలి వారిని చంపేస్తుంది అన్నారు. ప్రపంచ వ్యాపితంగా అన్ని వయసుల వారినీ కబళిస్తోంది. ఇటలీతో పాటు అనేక ఐరోపా దేశాలలో విలయతాండవం చేస్తోంది. అన్నిదేశాల కంటే వ్యాధి అమెరికాలో ఎక్కువగా ఉంది.
గణేషా స్పీక్స్‌ డాట్‌ కామ్‌ పేరుతో జ్యోతిషాన్ని చెబుతున్నవారు మార్చి 30 తరువాత వైరస్‌ నుంచి కాస్త ఉపశమనం పొందుతారని పేర్కొన్నారు. ఇప్పుడు అనేక చోట్ల ఎంత వేగంగా విస్తరిస్తోందో, దేశ ఆర్ధిక వ్యవస్ధలు ఎలా అతలాకుతలం అవుతున్నాయో చూస్తున్నాము. ఇలాంటి చెత్త కబుర్లు చెప్పటంలో ఒక మతం అని లేదు. స్వాములు, బాబాలు, గురువులు, గురవమ్మలు, గంటల, దిన, వార పంచాంగాలు,రాసి ఫలాలను ప్రచురించి సొమ్ము చేసుకొనే మీడియా గురించి ఏం చెప్పాలి? హిందూ మహాసభ గోమూత్ర పార్టీలను ఏర్పాటు చేసింది, ఇంకే ముంది కొందరు బిజెపి నేతలూ అదే పాట అందుకున్నారు.
కరోనా వైరస్‌ మతశక్తులలో విబేధాలు తెచ్చినట్లు ప్రముఖ పత్రిక ”ఎకనోమిస్ట్‌ ” తాజాగా ఒక వార్తను ప్రచురించింది. గుడ్‌ ప్రైడే సందర్భంగా రోమ్‌లో ప్రతి ఏటా పోప్‌ భక్తులతో కలసి శిలువను మోస్తూ ఏసు క్రీస్తు జీవితంలోని పద్నాలుగు ఘట్టాలకు చిహ్నంగా (మహాభారత పర్వాలు, రామాయణ కాండల మాదిరి) 14చోట్ల ఆగుతూ నడుస్తారు. ఆ దారిలో వేలాది మంది అనుచరులు శిలువను ముద్దాడుతూ తమ భక్తిని ప్రదర్శిస్తారు. వాటన్నింటినీ పక్కన పెట్టారని, ఏ ఏదేశాల్లో ఏమి జరుగుతోంది ఆ పత్రిక ప్రకటించింది. తాను 51 సంవత్సరాలుగా బోధకుడిగా ఉన్నానని ఇప్పుడు జనాన్ని చర్చ్‌లకు రావద్దని చెప్పాల్సి రావటం తనకు ఎంత కష్టమో ఆలోచించాలని రష్యన్‌ ఆర్ధోడాక్స్‌ చర్చ్‌ ప్రధాన గురువు కిరిల్‌ ప్రకటించారు. అయితే కొందరు అమెరికన్‌ ఇవలాంజికల్స్‌ మూర్ఖంగా వ్యవహరించి కటకటాల పాలయ్యారు. ప్రార్ధన చేసి వైరస్‌ను నిర్మూలిస్తామంటూ జనాన్ని తరలించిన ఫ్లోరిడా బోధకుడు రోడ్నీ హౌవార్డ్‌ బ్రౌన్‌ వారిలో ఒకడు. మన తిరుపతి వేంకటేశ్వర స్వామి, ఇతర దేవాలయాల్లో మాదిరి భక్తులు లేకుండా తప్పనిసరి అనుకున్న మత క్రతువులను నిర్వహించవచ్చని ఫ్లోరిడా గవర్నర్‌ ప్రకటించాడు. గతంలో కమ్యూనిస్టులు అధికారంలో ఉన్నపుడు కూడా ఈస్టర్‌ పూజలను ఇలా పూర్తిగా అడ్డుకోలేదని తూర్పు ఐరోపా దేశాల్లో సామాన్యులు భావిస్తున్నారని ఎకనమిస్ట్‌ పేర్కొన్నది. యూదు మతంలో ఒక బహిరంగ మత క్రతువు నిర్వహించాలంటే కనీసం పది మంది హాజరు ఉండాలి, ఇప్పుడు సాధ్యం కాదు కానుక వాట్సాప్‌ లేదా మరొక పద్దతిలో పది మందిని చూపి దాన్ని పూర్తి చేస్తున్నారు.
ఇరాక్‌లో వైరస్‌ను వ్యాపింప చేసే వారు హంతకులతో సమానమని షియా మత పెద్ద గ్రాండ్‌ అయాతుల్లా అలీ అల్‌ సస్తానీ చేసిన వ్యాఖ్యలను ముక్తాదా అల్‌ సదర్‌ అనే మత పెద్ద వ్యతిరేకించాడు. నజఫ్‌ లోని ఇమామ్‌ అలీ మందిరాన్ని తెరవాల్సిందే అంటూ ప్రార్ధన ధర్నా చేశాడు. తలుపులు తెరిచిన తరువాత శవాలతో జనం దాని చుట్టూ ప్రదక్షిణలు చేశారు. కొందరు మతఛాందుసులైన క్రైస్తవులు, స్వలింగ వివాహాలకు మద్దతు ఇస్తున్న కారణంగా కరోనా వైరస్‌ శిక్షిస్తున్నదని ముక్తాదా ముక్తాయింపులు ఇస్తున్నాడు. ఈనెల 23న రంజాన్‌ మాసం ప్రారంభం కానుంది. ఆ సందర్భంగా ఇస్లామిక్‌ దేశాలలో ఏమి చేస్తారన్నది చూడాల్సి ఉంది. ఇరాన్‌లో అన్ని మత ప్రదేశాలకు భక్తులు రావటాన్ని గతనెల 16న ప్రభుత్వం నిషేధించింది. అప్పటికే పరిస్ధితి చేయిదాటి పోయిందని లౌకికవాదులు విమర్శిస్తే, ఇది తగని చర్య అని మతోన్మాదులు విరుచుకుపడ్డారు. అయోధ్యలో రామనవమి ఉత్సవాలను పరిమితం చేయాలని అధికారులు ప్రయత్నిస్తే హిందూ సంస్ధల వారు అయిష్టంగానే అంగీకరించారని ఎకనమిస్ట్‌ పేర్కొన్నది.
కరోనా వైరస్‌ బతికి ఉన్నవారి మధ్య దూరం పెంచటమే కాదు, మరణించిన వారి అంత్యక్రియలకు సైతం పరిమితులు విధించింది. సంప్రదాయాలను పక్కన పెట్టమంది. క్రైస్తవులు, ముస్లింలు అనేక దేశాల్లో మరణించిన వారికి అంత్యక్రియలు జరిపేందుకు మూడు రోజులు తీసుకుంటారు. ఇప్పుడు మరణించిన రోజే ఆపని చేయాలని అధికారులు ఆదేశిస్తున్నారు. కొన్ని చోట్ల రోజుల తరబడి శవాలను ఇచ్చే పరిస్ధితి లేదు. కరోనా వ్యాధి గ్రస్తులు మరణించిన తరువాత వైరస్‌ ఉండదని వైద్యులు చెబుతున్నారు. అయినా సరే అలాంటి వారిని అనుమతించేది లేదని అనేక శ్మశానవాటికలు నిరాకరిస్తున్నాయి. హాజరయ్యేవారి సంఖ్యపై పరిమితులు పెడుతున్నాయి. కొన్ని చోట్ల గుమికూడకుండా సామాజిక దూరం పాటిస్తూ రెండు కిలోమీటర్ల దూరం పైగా నిలబడి శ్రద్దాంజలి ఘటించిన ఉదంతాలు కూడా ఉన్నాయి.
మత మూర్ఖశిఖామణులే కాదు కొన్ని ప్రభుత్వాలు కూడా జనం ముఖ్యంగా లక్షలాది మంది మహిళల ప్రాణాల మీదకు తెస్తున్నాయి. అమెరికాలోని టెక్సాస్‌ రాష్ట్రం వైరస్‌ వ్యాప్తికి అబార్షన్లే కారణమని అనటమే కాదు, అబార్షన్లను నిషేధించింది. అసలే ఉద్యోగాలు పోయి, ఆదాయం లేని అనేక మంది ఇదేమి అదనపు భారంరా బాబూ అని గగ్గోలు పెడుతున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో అంతకు ముందు అప్పాయింట్‌మెంట్‌ ఇచ్చిన ఆసుపత్రులన్నీ వాటిని రద్దు చేశాయి. అతిక్రమించిన వారి మీద చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది. దాంతో ఇతర రాష్ట్రాల్లో అత్యవసరంగా గర్భవిచ్చిత్తి చేసే ఆసుపత్రుల కోసం పరుగులు తీస్తున్నారు.
కరోనా వైరస్‌ కారణంగా ఇది రాస్తున్న సమయానికి వ్యాధిగ్రస్తులైన వారు 17లక్షల 16వేలు, మరణించిన వారు లక్షా మూడువేల 848మంది. ఒక్క అమెరికాలోనే 30శాతం మంది వ్యాధి బారిన పడ్డారు. మానవాళితో పాటు వారిని నడిపిస్తున్న మతాలు కూడా దీని ప్రభావానికి గురయ్యాయి. దీని దెబ్బకు మతాలు బోధకుల మీదనే విశ్వాసం సన్నగిల్లే పరిస్ధితి వచ్చిందంటే అతిశయోక్తి కాదు. గత చరిత్రను చూసినపుడు ప్రళయాలు సంభవించినపుడు, వర్తమాన కాలంలో ఆర్ధిక సంక్షోభాలు వచ్చినపుడు జనం మరింతగా మతాలు, దేవుళ్లవైపు చూశారని స్పష్టమైంది. సమాజాన్ని వెనుక్కుతీసుకుపోయే మతశక్తులు మత, క్రతువుల పునరుద్దరణకు చేసే సంఘటిత ప్రయత్నాలు ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. వర్తమాన కాలంలో హిందూత్వ శక్తులు హిందూమతం కోసం ప్రయత్నిస్తుంటే తబ్లిగీ జమాత్‌ వంటి సంస్దలు ఇస్లామ్‌ పునరుద్దరణ ప్రయత్నంలో ఉన్నాయి. ఇలాగే ప్రతి మతంలోనూ తిరోగామి శక్తులు చెలరేగుతున్నాయి. మానవ ప్రవర్తన మీద మతాల ప్రభావం ఇప్పుడు పెరుగుతోందా తరుగుతోందా అనే చర్చ ఉండనే ఉంది. ఆర్ధిక పరిస్ధితులు బాగుంటే దేవుడ్ని పట్టించుకోరనే మాట తరచూ వినిపించటం అందరికీ తెలిసిందే.
1960 దశకంలో అమెరికాలో 40శాతం లోపే మతాన్ని నమ్మటం లేదా తమ జీవితాల మీద మత ప్రభావం ఉందని భావించగా న్యూయార్క్‌ ప్రపంచ వాణిజ్య కేంద్రంపై ఉగ్రవాదులు రెండు విమానాలతో దాడులు చేసిన తరువాత మతం మీద విశ్వాసం ఉండాలని భావించిన వారు 71శాతం ఉన్నట్లు గ్యాలప్‌ సర్వే పేర్కొన్నది.14వ శతాబ్దంలో ఐరోపాలో ప్లేగ్‌ వ్యాధి ప్రబలినపుడు జనజీవితంలో చేస్తున్న తప్పుల కారణంగానే శిక్షగా దేవుడు ప్లేగ్‌ను పంపాడని మత పెద్దలు చెప్పారు. హైదరాబాద్‌లోని చారిత్రక కట్టడం చార్మినార్‌ గురించి అందరికీ తెలిసిందే. ప్లేగు వ్యాధితో జనం మరణించకుండా నివారణ ప్రార్ధనలు జరిపేందుకు నాటి రాజు కులీ కుతుబ్‌ షా 1591లో నిర్మించిన కట్టడం అది. ప్రపంచంలో అనేక చోట్ల అలాంటివి వెలిశాయి. తరువాత హైదరాబాదు సంస్ధానంలో ప్లేగు వచ్చినపుడు పాలకులు భారం దానిమీదే వేసి ఊరుకోలేదు.ఐరోపాలో ప్లేగు కోట్లాది మందిని బలితీసుకుంది. ఊళ్లకు ఊళ్లు తుడిచిపెట్టుకుపోయాయి. ప్లేగు వ్యాధి పదే పదే రావటంతో జనాలకు మతం మీద నమ్మకం సన్నగిల్లింది. దేవుడు మంచి వాడే గానీ మత పెద్దలు కాదన్నట్లుగా ఆగ్రహం వారి మీదకు మళ్లింది. ఆ పరిణామం మత సంస్కరణ ఉద్యమానికి నాంది పలికింది.
కరోనా సందర్భంగా అక్కడా ఇక్కడ అని లేకుండా ప్రపంచ వ్యాపితంగా అన్ని మతాల ప్రార్ధనా మందిరాలను మూసుకోవాల్సి వచ్చింది. ఎవరైనా చాదస్తం, మూర్ఖత్వంతో వ్యవహరిస్తే ఆయా మతాల వారిలోనే ఆగ్రహం వ్యక్తం అవుతోంది. మలేసియా, పాకిస్దాన్‌, భారత్‌లలో తబ్లిగీ జమాత్‌ సమావేశాలు కరోనా వైరస్‌ వ్యాప్తి కేంద్రాలుగా, వాటిలో పాల్గొన్నవారు వైరస్‌ను మోసుకు వచ్చిన వారిగా పరిగణిస్తున్న విషయం తెలిసిందే. ఇక్కడ తప్పు ఇస్లాం మతానిది కాదు, ఆ మతాన్ని పునరుద్దరించే పేరుతో పనిచేస్తున్న సంస్ధలు, వ్యక్తులు కరోనా వ్యాప్తి గురించి తెలిసి కూడా మూర్ఖంగా సమావేశాలు నిర్వహించటం నేరపూరిత వ్యవహారం. దాని మీద ఆ మతంలోనే తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతున్నది. మతాన్ని పునరుద్దరిస్తాం అంటే సరి పెట్టుకున్నంత మాత్రాన అసలుకే ఎసరు తెస్తే ఎలా అంగీకరిస్తాం అనే ఆగ్రహం ఆ మతంలోని వారి నుంచే వ్యక్తం అవుతోంది. సరే ఈ ఉదంతాలను కూడా మతోన్మాదాన్ని, ఇస్లాం వ్యతిరేకతను రెచ్చగొట్టేందుకు పూనుకున్న వారి గురించి తెలిసిందే. వారికి సోకిన మత వైరస్‌ కరోనా కంటే ప్రమాదకరం.

In a test of faith, Christians mark Good Friday in isolation - The ...

మత శక్తులు వారు హిందువులైనా, ముస్లింలైనా, క్రైస్తవులైనా ఒకటే. ఇండోనేషియాలో మార్చి 19వ తేదీ నుంచి జరపతలపెట్టిన తబ్లిగీ జమాత్‌ ఐదు రోజుల ఆసియా వార్షిక మత సమావేశాలను రద్దు చేసుకోవాలని అక్కడి ప్రభుత్వం చెప్పినా నిర్వాహకులు పెడచెవిన పెట్టారు. ప్రభుత్వం కూడా గట్టిగా చెప్పలేకపోయింది. అల్లాకు తప్ప మరొకరెవరికీ భయపడాల్సిన పనిలేదని ప్రచారం చేశారు. సమావేశ రద్దు ప్రతిపాదన వెనుక నిషేధిత ఇండోనేషియా కమ్యూనిస్టు పార్టీ ఉందని కూడా రెచ్చగొట్టారు. చావు పుట్టుకలన్నీ దేవుడు ముందే నిర్ణయిస్తాడని, కనుక కరోనా గురించి భయపడాల్సిన పనిలేదన్నారు. దానికి భయపడితే ఇస్లాం నుంచి వైదొలిగినట్లే అని రెచ్చగొట్టారు. మసీదు నిర్వాహకులు అల్లా కంటే సమావేశాలను వాయిదా వేయాల్సిందే అన్న రాష్ట్ర గవర్నర్‌ రిదవాన్‌ కమిల్‌కే ఎక్కువ భయపడ్డారని జనం భావించారు. అనుమతి లేకపోయినా భక్తులు ప్రారంభానికి ముందే వేలాది మంది చేరుకున్నారు. చివరికి అధికార యంత్రాంగం కరకుగా వ్యవహరించటంతో రద్దు చేసుకున్నారు.
సరిగ్గా ఇదే సమయంలో మన దేశంలో అయోధ్యలో శ్రీరామ నవమి ఉత్సవాలను ఎట్టి పరిస్ధితుల్లోనూ జరిపి తీరాల్సిందే అని రామాలయ ట్రస్టు సభ్యుడు మహంత పరమహంస పట్టుబట్టిన విషయం తెలిసిందే. కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతింటాయని, భక్తుల మంచి చెడ్డలను రాముడే చూసుకుంటాడని వాదించారు.
ఇక మంత్రాలకు చింతకాయలను రాలుస్తాం అనే అన్ని మతాలకు చెందిన బాబాలు, యోగులు,యోగినులు దుకాణాలు మూసుకొని కరోనా దెబ్బకు ఎక్కడికి పోయారో తెలియదు. వారిని గుడ్డిగా నమ్మిన జనం కష్ట కాలంలో ఏమయ్యారు అని నిలదీయకుండా ఉంటారా ? అంత ధైర్యం చెయ్యకపోతే వారికి దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. కరోనా కథ ముగిసిన తరువాత వారంతా తిరిగి దుకాణాలు తెరుస్తారు, జనానికి ఎలాంటి సంజాయిషీ చెబుతారో చూద్దాం. అలాంటి వారందరి చేత తెల్లారగానే బోధలు చేయించే మీడియా పెద్దలు కూడా జనానికి సంజాయిషీ ఇచ్చుకోవాల్సిందే. ఈ సమయంలో అన్ని మతాల వారు ఇండ్లలో ఉండే ప్రార్ధనలు జరపండి అని చెప్పకతప్పటం లేదు. అదే పని సాధారణ సమయాల్లో సైతం ఎందుకు చేయకూడదు అని కొందరైనా ఆలోచించకుండా ఉంటారా ? దర్శనాల వేలం వెర్రి తగ్గుతుందా? అదే జరిగితే అత్యంత లాభదాయకంగా మారిన భక్తి వాణిజ్య కేంద్రాలు, వాటి నిర్వాహకుల ఆదాయాలు ఏమి అవుతాయి ? ప్రభుత్వాలకూ ఆదాయం పడిపోతుంది. గతంలో ప్రింటింగ్‌ ప్రెస్‌ మత ప్రచారంలో పెద్ద విప్లవాన్నే తెచ్చింది. మత గ్రంధాల ప్రచురణ, పంపకం ద్వారా భక్తి విపరీతంగా పెరిగిపోయింది. స్మార్ట్‌ ఫోన్‌ వాడకం బాగా పెరిగి పోయిన ఈ రోజుల్లో ఫోన్‌ భక్తి వెల్లువ వచ్చినా ఆశ్చర్యం లేదు. ఇష్టదైవాన్ని ఫోన్లో చూస్తూనే బస్సులు, రైళ్లు, కార్యాలయాల్లో పూజలు ప్రారంభం కావచ్చు. ఇవన్నీ మత వాణిజ్యం, మతశక్తులకు మంచి సూచనలు కావు.

Chinese President Xi Says He Was Leading COVID-19 Since Jan. 7 | Time
ప్రపంచమే ఒక గ్రామంగా మారిపోయిందని ప్రతివారూ చెబుతారు. కానీ ఆ గ్రామంలోనే ప్రతి వారూ తమ కులం, మతాలకే పరిమితమైన గోడలతో గృహ సముదాయాలను నిర్మించుకోవటాన్ని మనం చూస్తున్నాము. ప్రతి కులం, ప్రతి మతం తమ పవిత్రతను కాపాడుకొనేందుకు ఎంతకైనా తెగించే ధోరణులు నానాటికీ పెరిగిపోతున్నాయి. పాలు తాగుతూ తననెవరూ చూడటం లేదు అనుకునే పిల్లుల మాదిరి ప్రతి వారూ తమ కుళ్లును మూసిపెడుతూ ఎదుటి వారి దాని మీద దాడి చేస్తున్నారు. అంతరించి పోతున్న మత, కుల మడులను పునరుద్దరించేందుకు ప్రయత్నిస్తున్నారు.గతంలో మతాల పేరుతో అధికారాన్ని నిలుపుకొనేందుకు రాజులు,రంగప్పలు చేస్తే ఇప్పుడు వారి వారసులుగా కొన్ని పార్టీలు పుట్టుకు వస్తున్నాయి. మృత భాషగా మారిపోయిన సంస్కృత శ్లోకాలను తమ పిల్లలకు నేర్పుతూ అనేక మంది ముఖ్యంగా విదేశాలలో ఉంటూ తెలియకుండానే హిందూ మత ఉద్దారకులుగా మారిపోతున్నవారిని చూస్తున్నాము. అదే పద్దతిలో ఏ మతానికి ఆ మతం వారు పడరాని పాట్లు పడుతున్నారు.
ఏ దేశమేగినా ఎందు కాలిడినా
ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా
పొగడరా నీ తల్లి భూమి భారతిని
నిలుపరా నీ జాతి నిండు గౌరవము
అని రాయప్రోలు సుబ్బారావు గారు చెప్పారు. కానీ దానికి భిన్నంగా భారతీయులమని చెప్పుకోవాల్సింది పోయి ఫలానా కులం, ఫలానా మతం ప్రాంతాల వారీగా కొట్టుకు చస్తున్న ప్రవాస భారతీయలను చూసి సిగ్గుపడుతున్నాము. అయితే ఏ విత్తనాలు వేస్తే ఆ పండ్లు, కాయలే కాస్తాయి అన్నట్లుగా మన దేశంలో, రాష్ట్రాలలో కుల మతాల కంపుతో పెరిగిన మన వారు పరాయి ప్రాంతంలో కూడా దాన్నే వ్యాపింప చేయటంలో ఆశ్చర్యం ఏముంది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

కమ్యూనిస్టు చైనా – కాథలిక్‌ మతం !

19 Monday Feb 2018

Posted by raomk in CHINA, Current Affairs, History, INTERNATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

catholic religion, china communist party, pope, Pope Francis

Image result for china communist party-catholic religion

ఎం కోటేశ్వరరావు

మతం జనం పాలిట మత్తు వంటిదన్నది కమ్యూనిస్టుల అవగాహన. కమ్యూనిజం మతానికి వ్యతిరేకం అన్నది కాథలిక్‌ మతాధికారుల భాష్యం. అటువంటి రెండు పరస్పర విరుద్ధ శక్తులు కారణాలేమైతేనేం రాజీబాటలో వున్నాయంటే నమ్మబుద్ది కావటం లేదు కదూ ! ఈ పరిణామం గురించి వ్యాఖ్యానించటానికి ఎవరి స్వేచ్చ వారికి వుంది. అనుకూల, వ్యతిరేక తీర్పుల జోలికి పోకుండా అసలేం జరుగుతోందో ముందు చూద్దాం.గత కొద్ది వారాలుగా గతంలో ఎవరి మీదా లేని విధంగా క్రైస్తవులే పోప్‌ ఫ్రాన్సిస్‌పై పెద్ద ఎత్తున దుమ్మెత్తి పోస్తున్నారు. మతాన్ని మంటగలుపుతున్నారని శాపనార్ధాలు పెడుతున్నారు. పోప్‌ కూడా చివరికి కమ్యూనిస్టు చైనాకు లో0గిపోతున్నారని, ఆ దేశం చెప్పినట్లు నడుచుకుంటున్నారని ఆరోపణలు గుప్పిస్తున్నారు. అదే జరిగితే గత వెయ్యి సంవత్సరాలుగా పోప్‌ల నియామకంపై పెత్తనం చలాయియిస్తున్న వాటికన్‌ ఓడిపోయినట్లే అని కొందరు రెచ్చగొడుతున్నారు. అది జరిగితే కొందరైతే గొర్రెపిల్లలను తోడేళ్లకు అప్పగిస్తున్న వ్యక్తిగా పోప్‌ను నిందిస్తున్నారు. ఎందుకిలా జరుగుతోంది?

ప్రతి సమాజంలో ఎవరు సుప్రీం, అంతిమ అధికారం ఎవరిది అన్న అంశంపై మతం, రాజ్యాధికారం మధ్య ఏదో ఒక రూపంలో పోరు సాగింది. దోపిడీవర్గ జోక్యంతో రాజీలు, సర్దుబాట్లు జరిగాయి. తమ దోపిడీ సజావుగా సాగటానికి అటు రాజ్యాన్ని, మతాన్ని దోపిడీవర్గం కుడిఎడమల డాల్‌, కత్తుల మాదిరి సహజీవనం చేయిస్తున్నది. గత మూడు సంవత్సరాలుగా చైనా-వాటికన్‌ మధ్య సంబంధాల పునరుద్ధరణకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు వార్తలు వెలువడుతున్నా నిర్ధిష్టంగా ఎలాంటి పురోగతి లేదు. చైనాలో 1948లో కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో అధికారానికి వచ్చిన ప్రభుత్వాన్ని 1971 వరకు ఐక్యరాజ్యసమితి గుర్తించలేదు. అమెరికా నాయకత్వంలోని కూటమి చైనా తిరుగుబాటు రాష్ట్రమైన తైవాన్‌నే చైనాగా గుర్తిస్తూ వచ్చింది. బౌద్దమతాధిపతి దలైలామా అమెరికా అడుగుజాడల్లో నడుస్తూ చైనా కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని గుర్తించేందుకు నిరాకరించి టిబెట్‌ తన పాలనలోని రాజ్యమంటూ విఫల తిరుగుబాటు చేసి భారత్‌కు పారిపోయి వచ్చాడు. ఇక్కడ ప్రవాస ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి టిబెట్‌లో నిత్యం ప్రభుత్వ వ్యతిరేకులతో సంబంధాలు కలిగి వున్నాడు. గతేడాది నవంబరు 23న ఒక ప్రకటన చేస్తూ జరిగిందేదో జరిగిపోయింది, చైనాతో టిబెట్‌ కలసి వుండాలనుకొంటోంది, చైనా అంగీకరిస్తే టిబెట్‌కు తిరిగి వస్తాను అని దలైలామా ప్రకటన చేశారు. కమ్యూనిస్టులు, సోషలిస్టు దేశాలకు వ్యతిరేకంగా రెండవ ప్రపంచ యుద్ధం తరువాత అమెరికా ప్రారంభించిన ప్రచ్చన్న యుద్ధంలో భాగంగా కమ్యూనిస్టులు అధికారానికి వచ్చిన తరువాత చైనా నుంచి హాంకాంగ్‌ పారిపోయి తైవాన్‌, మకావుల్లో బిషప్పుగా పని చేసి రిటైరైన చైనాలోని కాధలిక్‌ మత కార్డినల్‌ జోసెఫ్‌ జెన్‌(86) మాత్రం ససేమిరా రాజీపడేది లేదు అంటున్నారు.

డిసెంబరులో వాటికన్‌ నుంచి చైనా వెళ్లిన ఒక ప్రతినిధి బృందం గ్వాంగ్‌డాంగ్‌ రాష్ట్రంలోని షాంటౌలో బిషప్పుగా పనిచేస్తున్న పీటర్‌ ఝువాంగ్‌ జియాన్‌ జియాన్‌(88)ను బీజింగ్‌లో కలసింది. బాధ్యతల నుంచి వైదొలగి చైనా ప్రభుత్వం నియమించిన పార్లమెంట్‌ సభ్యుడు, బిషప్పు హువాంగ్‌ బింగ్‌ఝాంగ్‌కు బాధ్యతలు అప్పగించేందుకు వీలు కల్పించాలని కోరింది. హువాంగ్‌ను 2011లో వాటికన్‌ అధికారులు మతం నుంచి బహిష్కరించారు. మరోబిషప్పు జోసెఫ్‌ గువో గ్జీజిన్‌ను కూడా తప్పుకోవాలని వాటికన్‌ బృందం కోరింది. 1999తో బ్రిటన్‌ కౌలు గడువు ముగిసిన హాంకాంగ్‌ చైనా ఆధీనంలోకి వచ్చినప్పటికీ విలీనం సందర్భంగా కుదురిన ఒప్పందం ప్రకారం 2050వరకు అక్కడ ప్రత్యేక పాలనా వ్యవస్ధ కొనసాగుతుంది. జోసెఫ్‌ జెన్‌ 2002లో అక్కడ బిషప్పు అయ్యాడు. తరువాత రిటైర్‌ అయిన ఈ మాజీ బిషప్పు చైనాలో హాంకాంగ్‌ విలీన వ్యతిరేక శక్తులతో చేతులు కలుపుతూ రాజకీయాలు చేస్తున్నాడు. దానిలో భాగంగానే సదరు జెన్‌ నాయకత్వంలోని ప్రతినిధి బృందం జనవరి పదిన వాటికన్‌ నగరానికి వెళ్లి అక్కడ పోప్‌ను కలిసింది. చైనా ప్రభుత్వానికి లంగిపోయి వాటికన్‌ గుర్తించిన ఇద్దరు బిషప్పుల స్ధానంలో కమ్యూనిస్టు పార్టీ ఆమోదం వున్న బిషప్పులను నియమించవద్దని వాదించింది. ఈ కలయిక, చర్చల గురించి పశ్చిమ దేశాలు, క్రైస్తవమత కేంద్రాలు, మీడియాలో రకరకాల వ్యాఖ్యానాలు వెలువడుతున్నాయి. వెయ్యి సంవత్సరాల తరువాత మరోసా రి మతం, రాజ్యం మధ్య ఆధిపత్యపోరు కొత్త రూపంలో ముందుకు వచ్చిందన్నది వాటిలో ఒకటి.

చైనాలో కమ్యూనిస్టులు అధికారానికి వచ్చిన తరువాత వాటికన్‌ నగరానికి చైనాకు పరస్పర గుర్తింపు, దౌత్య సంబంధాలు లేవు. అయినా వాటికన్‌ అక్కడ ఇంతకాలంగా మత పెద్దలను నియమిస్తూనే వుంది. వారిని చైనా గుర్తించటం లేదు. చట్టవిరుద్ధంగా పని చేస్తున్నవారిగానే భావిస్తున్నది. 1957లో చైనా ప్రభుత్వం కాథలిక్‌ పేట్రియాటిక్‌ అసోసియేషన్‌ పేరుతో ఒక సంస్ధను ఏర్పాటు చేసి దాని ద్వారా బిషప్పు, ఇతర మతాధికారుల నియమాకాన్ని చేపట్టింది. దీన్ని తాము గుర్తించటం లేదని అలాంటి మతాధికారులను బహిష్కరిస్తున్నట్లు 1958లో పోప్‌ 14వ బెండిక్ట్‌ ప్రకటించారు. అప్పటి నుంచి వివాదం కొనసాగుతున్నది. అప్పటి నుంచి అధికార, అనధికార బిషప్పుల నియామకాలు జరుగుతూనే వున్నాయి. అనధికార ప్రార్ధనలపై చైనా సర్కార్‌ క్రమంగా ఆంక్షలను పెంచటం ప్రారంభించింది. వాటికన్‌ అధికారాన్ని గుర్తించేందుకు చైనా ససేమిరా అంటోంది. మొత్తంగా చూసినపుడు ప్రతి మతం ప్రజల పాలిట మత్తు మందే అన్నది స్పష్టం. అయినప్పటికీ కొందరు మతాన్ని సంపూర్ణంగా సంస్కరించలేకపోయినా సమాజాన్ని ముందుకు తీసుకుపోవాలనే పురోగామివాదులు కొందరైతే మొరటుగా వెనక్కు నడిపించజూసే కొందరు అన్ని మతాల్లోనూ వుంటారు. తూర్పు ఐరోపా, సోవియట్‌ యూనియన్‌లలో సోషలిస్టు వ్యవస్ధల కూల్చివేతలో అమెరికా సామ్రాజ్యవాదులు, ఇతర ఐరోపా ధనిక దేశాలతో పాటు రెండవ పోప్‌ జాన్‌పాల్‌ కూడా పుణ్యం కట్టుకున్న రెండవ తెగకు చెందిన వ్యక్తిగా పేరు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుత పోప్‌ ఫ్రాన్సిస్‌పై చేస్తున్న విమర్శలు, వస్తున్న వూహాగానాలను బట్టి ఆయన జాన్‌పాల్‌ వంటి వ్యక్తి మాత్రం కాదని చెప్పవచ్చు.

తిరుగుబాటు మాజీ బిషప్‌ జెన్‌ బృందం రోమ్‌లో పోప్‌ను కలిసి చైనా ప్రభుత్వ వత్తిడికి లంగవద్దని కోరింది. దాని మీద పోప్‌ స్పందిస్తూ గతంలో హంగరీలో మాదిరి తిరుగుబాటు చేసి జైలు పాలయ్యే పరిస్ధితి తెచ్చుకోవద్దని చైనాలో రహస్యంగా పని చేస్తున్న బిషప్పులనుద్ధేశించి సలహా ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. జోసెఫ్‌ మైండ్‌జెంటీ అనే బిషప్పు కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని వ్యతిరేకించి జైలు పాలయ్యాడు.1956లో ప్రతీఘాతవిప్లవ సమయంలో తిరుగుబాటుదార్లు జైలుపై దాడి చేసి మైండ్‌ జెంటీని అమెరికా రాయబార కార్యాలయంలోకి పంపారు. హంగరీ ప్రభుత్వ వత్తిడి కారణంగా మైంట్‌జెంటీని దేశం వదలి వెళ్లాలని ఆదేశించిన వాటికన్‌ ఆయన స్ధానంలో ప్రభుత్వానికి ఆమోదయోగ్యుడైన మరొక బిషప్పును నియమించింది. అటువంటి స్ధితిని మరోమారు తెచ్చుకోవద్దని చైనా బిషప్పులకు పోప్‌ సలహాఇచ్చారన్నది వార్తల సారాంశం. ‘ చైనా కాథలిక్‌ చర్చిని వాటికన్‌ చర్చి(కమ్యూనిస్టులకు) ధారాదత్తం చేస్తున్నదని నేను ఎందుకు అనుకుంటున్నానంటే గత కొద్ది సంవత్సరాలుగా, నెలలుగా వారు నడిచినబాటనే కొనసాగిస్తే అదే జరుగుతుంది. వాటికన్‌-చైనా మధ్య ఒప్పందం కుదిరే క్రమంలో నేను ప్రధాన ఆటంకం వున్నానా? ఒక వేళ అది దుష్ట లావాదేవీ అనుకుంటే దానికి ఆటంకంగా వున్నందుకు నేను సంతోషపడతాను’ అని జెన్‌ తన బ్లాగ్‌లో పేర్కొట్లు వార్తలు వచ్చాయి. జెన్‌ వైఖరి చైనా సర్కార్‌తో ఘర్షణనే కోరుతున్నట్లు వెల్లడి కావటంతో ఒప్పందాన్ని ఖరారు చేసుకొనేందుకు వుభయపక్షాలు వేగంగా కదులుతాయని విశ్లేషకులు పేర్కొన్నారు. వాటికన్‌ విదేశాంగమంత్రి పిట్రో పారోలిన్‌ ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జెన్‌ పేరు ప్రస్తావించకుండా ‘ అవును, చైనా ప్రభుత్వ అధికారులతో ప్రస్తుత సంబంధాలను పోప్‌ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఆయన వైఖరికి అనుగుణంగానే ప్రతినిధులు వ్యవహరిస్తున్నారు. ఎవరూ అనధికార చొరవలు తీసుకోవటం లేదు. చేస్తున్న త్యాగం చైనా ప్రభుత్వం కోసం కాదు, క్రీస్తు చర్చికోసమే, అని చెప్పారు.

కమ్యూనిస్టు సిద్ధాంతం పుట్టి రెండు వందల సంవత్సరాలైతే క్రైస్తవం దాని కంటే రెండువేల సంవత్సరాల ముందు పుట్టింది. సోదరత్వాన్ని ప్రబోధించటమే తప్ప సోదరుల మధ్య అంతరాలు,దోపిడీ పెరగటాన్ని అది నిరోధించలేకపోయింది. దోపిడీకి వ్యతిరేకంగా నూతన సమాజాన్ని నిర్మించాలన్న కమ్యూనిజాన్ని దోపిడీదారులు, వారికి వత్తాసుగా వున్న మతపెద్దలు వ్యతిరేకించేందుకు నడుం కట్టారు. దోపిడీదార్లతో మత పెద్దలు చేతులు కలపాలంటే ఏదో ఒక సాకు కావాలి కనుక మతానికి కమ్యూనిజం వ్యతిరేకం అని అర్ధాలు తీశారు. దోపిడీ మతానికి వ్యతిరేకమని ఏనాడూ పెట్టుబడిదారీ వ్యవస్ధను, సిద్ధాంతాలను మతం చెప్పలేదు. సోవియట్‌, తూర్పు ఐరోపాదేశాలలో కమ్యూనిజాన్ని వ్యతిరేకించే సామ్రాజ్యవాదులతో పాటు వారితో చేతులు కలిపిన చర్చి అధికారుల పాత్రను చైనా కమ్యూనిస్టుపార్టీ గుర్తించి కనుకనే మతం ముసుగులో రహస్య సమావేశాలు నిర్వహిస్తున్న మతాధికారులను కట్టడి చేసేందుకు చైనా ప్రభుత్వం పూనుకుంది. మత స్వేచ్చను అనుమతిస్తున్నది కనుకనే దాన్ని ఇంటికి పరిమితం చేసుకోవాలని, పారదర్శకంగా వ్యవహరించాలని కోరుతోంది. ఒకసారి జనంలో మతోన్మాదాన్ని నింపితే అది ఎలాంటి పర్యవసానాలకు దారితీస్తుందో తాలిబాన్లు, ఐఎస్‌ తీవ్రవాదులను చూస్తున్న ప్రపంచానికి వేరే చెప్పనవసరం లేదు. ఆఫ్ఘనిస్తాన్‌లో కమ్యూనిస్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగానే అమెరికన్లు, వారితో చేతులు కలిపిన ఆ ప్రాంత కమ్యూనిస్టు వ్యతిరేకులు తాలిబాన్ల సృష్టికి తెరలేపారు. పశ్చిమాసియాలో రాజకీయంగా తమను వ్యతిరేకించే శక్తులకు వ్యతిరేకంగా తాలిబాన్లతో పాటు ఐఎస్‌ తీవ్రవాదులను కూడా పెంచి పోషించింది అమెరికా, దాని అనుయాయి దేశాలే అన్నది స్పష్టం. ఈ పరిణామాలను చూసిన తరువాత చైనా కమ్యూనిస్టుపార్టీ సోషలిస్టు వ్యవస్ధను కాపాడుకొనేందుకు తగిన చర్యలు తీసుకోకపోతే అది చారిత్రక తప్పిదం అవుతుంది. అందువలన చైనాలో అనధికార క్రైస్తవ, ఇస్లామిక్‌ మతకార్యకలాపాలను ఈ నేపధ్యం, దృష్టితోనే చూడాల్సి వుంది.

ఇక్కడ కమ్యూనిస్టులు, వామపక్ష అభిమానులకు ఒక సందేహం రావటం సహజం.మతం మత్తు మందు అని చెప్పే కమ్యూనిస్టులు మతాన్ని నిర్మూలించకుండా అధికారికంగా అనుమతించటం ఏమిటి అన్నదే అది. కమ్యూనిస్టు పార్టీ అంగీకారంతో నియమించే బిషప్పులు కూడా అదే క్రీస్తు, అదే బైబిల్‌నే ప్రచారం చేస్తారు కదా తేడా ఏముంది అని ప్రశ్నించ వచ్చు. మన సమాజంలో మతం అన్నది కొన్ని వేల సంవత్సరాల నుంచి వేళ్లూనుకుంది. చైనా కమ్యూనిస్టు పార్టీ లేదా మరో అధికార కమ్యూనిస్టు పార్టీ దాని ప్రభావాన్ని తగ్గించటానికి చర్యలు తీసుకుంటున్నదా, మతభావాలను పెంచేవిధంగా వ్యవహరిస్తున్నదా అన్నదే గీటురాయి. ఆ విధంగా చూసినపుడు చైనా ప్రభుత్వం మతంతో సహా అనేక అన్యవర్గధోరణులను అరికట్టేందుకు ఓపికతో పని చేయాలే తప్ప నిషేధాలతో కాదు. అక్కడ ఇంకా సోషలిస్టు వ్యవస్ధ నిర్మాణం ఇంకా ప్రాధమిక దశలోనే వుంది, ఎన్నో దశ లను అధిగమించాల్సి వుంది. అటువంటపుడు అన్యవర్గ ధోరణులు అంతమయ్యే అవకాశ ం లేదు. కనుక కొంత కాలం పాటు కుట్రలూ, కూహకాలకు అవకాశం లేని మత స్వేచ్చను అనుమతించటం తప్ప మరో మార్గం లేదు.జనం తమ అనుభవం ద్వారా మత ప్రభావం నుంచి బయటపడాల్సి వుంది.

విశ్లేషకులు చెబుతున్నదాని ప్రకారం చైనాలోని 140 కోట్ల జనాభాలో ఏడు కోట్ల మంది ప్రొటెస్టెంట్‌ క్రైస్తవులుంటే కోటి మంది కాథలిక్కులున్నారని అంచనా. చైనా కమ్యూనిస్టుపార్టీ చరిత్ర, ఏడు దశాబ్దాల ప్రభుత్వ తీరుతెన్నులను గమనిస్తే మతం రాజ్యానికి లోబడి వుండాలే తప్ప రాజ్యంపై మత పెత్తనాన్ని అంగీకరించేది లేదని రుజువైంది. కమ్యూనిస్టు పార్టీ అధికారానికి రాగానే బౌద్ద మతాధిపతి దలైలామా తాను సర్వస్వతంత్రుడనని, తన ఆధీనంలోని టిబెట్‌ తన రాజ్యమని ప్రకటించుకోవటమేగాక కమ్యూనిస్టు ప్రభుత్వంపై తిరుగుబాటు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ క్రమంలో తిరుగుబాటు విఫలమై మన దేశానికి పారిపోయి రావటం, మన ప్రభుత్వం ఆశ్రయం కల్పించటం, ప్రవాస ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన చరిత్ర తెలిసిందే. క్రైస్తవ మత చరిత్రలో బిషప్పులు, ఇతర మతాధికారులను నియమించే అధికారం రాజులదా, పోప్‌దా అనే ఆధిపత్యపోరు సాగింది.అది పదకొండవ శతాబ్దిలో తారాస్ధాయికి చేరింది. పోప్‌ ఏడవ గ్రెగరీ ఆధిపత్యాన్ని రోమన్‌ లేదా జర్మన్‌ చక్రవర్తి నాలుగవ హెన్రీ సవాలు చేయటంతో ముగ్గురు పోప్‌లు ఐదుసార్లు అతడిని మతం నుంచి బహిష్కరించారు. ఇటలీ, జర్మనీలలో అంతర్యుద్ధాలు సంభవించాయి. ఆ పోరులో బలహీనపడిన హెన్రీ 1076,77 సంవత్సరాలనాటికి చేతులెత్తేశాడు. ఈ పోరులోనే పోప్‌ ఏడవ గ్రెగరీని కిడ్నాప్‌ చేసి ఇటలీలోని కానోసా కోటలో బంధించారు. అయితే కొంత మంది ప్రభువుల అండతో తప్పించుకున్నాడు. కిడ్నాప్‌లో హెన్రీ హస్తం వుందని భావించారు. చివరకు హెన్రీ పోప్‌కు లంగిపోవాల్సి వచ్చింది. పోప్‌ నివాసానికి వెళ్లి మూడు రోజుల పాటు చెప్పుల్లేకుండా మంచులో బయట నిలబడి తన తప్పులను క్షమించాలని వేడుకున్నాడు. తరువాత పోప్‌ ఇతరులకు మద్దతు ఇచ్చి మరోసారి హెన్రీని మతం నుంచి బహిష్కరించాడు.

ఇది పదకొండవ శతాబ్దం కాదు, చైనా పాలకులకు నాలుగవ హెన్రీకి, ఏడవ పోప్‌ గ్రెగరీకి, ప్రస్తుత పోప్‌ ఫ్రాన్సిస్‌కు పోలికేలేదు. ఆయన స్ధానంలో మరొకరుండి పెత్తనం చెలాయించాలని చూసినా చైనాను కట్టడి చేసే శక్తివంతులెవరూ నేడు ప్రపంచంలో లేరు. పోప్‌దే సర్వాధికారం అని రుజువు చెయ్యటానికి పాలకులు యుద్ధాలు చేసే పరిస్ధితీ లేదు. వాటికన్‌ మొండిగా వ్యవహరించి చైనాలో రహస్యకార్యకలాపాలు నిర్వహిస్తున్న కాథలిక్కులను ప్రోత్సహించటమంటే ప్రభుత్వ వ్యతిరేకులుగా తయారు చేయటం, తద్వారా వారిని ఇబ్బందుల పాలు చేయటం తప్ప మరొకటి కాదు. గతంతో పోల్చితే ఒక్క క్రైస్తవమే కాదు అన్నిరకాల మతకార్యకలాపాలను అదుపు చేసేందుకు మరిన్ని చర్యలను తీసుకొనేందుకు చైనా నాయకత్వం నిర్ణయించింది. ఈ ఏడాది ఫిబ్రవరి ఒకటవ తేదీ నుంచి రహస్య ప్రార్ధనలను ఏమాత్రం సహించేది లేదని ప్రభుత్వం నిర్ణయించినట్లు చైనా తిరుగుబాటు బిషప్‌ జెన్‌ తన బ్లాగ్‌లో పేర్కొన్నాడు. ఆసియా న్యూస్‌ అనే పత్రిక 2015లో ప్రచురించిన ఒక వార్తను వుటంకిస్తూ దాని సంపాదకుడు వ్యాఖ్యానించారు. జైలు పాలైన మతాధికారుల గురించి చైనా ప్రభుత్వం అసలు చర్చలకే అంగీకరించలేదు, అప్పుడూ ఇప్పుడు తాము ప్రతిపాదించిన బిషప్పును గుర్తిస్తేనే వాటికన్‌ను గుర్తిస్తామని చైనా చెబుతోంది. ఆంక్షల పెంపుదలకు ఒకటే వుద్ధేశం. అదేమంటే కమ్యూనిస్టు పార్టీ అధికారాన్ని సుస్ధిరం చేసుకొనేందుకు, ఎవరైనా దాని వునికిని సవాలు చేస్తే అణచివేసేందుకు’ అన్నాడు. పదజాలం ఎలా వున్నప్పటికీ చైనా సోషలిస్టు వ్యవస్ధకు హాని తలపెట్టే ఏ పరిణామాన్ని కూడా అక్కడి నాయకత్వం తక్కువ చేసి చూడటం లేదని, దానిని రక్షించేందుకు అనేక చర్యలు తీసుకున్నట్లు ఇప్పటికే అనేక పరిణామాలు స్పష్టం చేశాయి. వాటికన్‌-చైనా సంబంధాల మెరుగుదలకు తీసుకుంటున్న చర్యలు ఏ రీత్యాచూసినా ఆహ్వానించదగినవే అని చెప్పవచ్చు. మతానికి కమ్యూనిజానికి మధ్య కట్టిన అడ్డుగోడల కూల్చివేతకు ఏ మాత్రం తోడ్పడినా మంచిదే !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

Recent Posts

  • నరేంద్రమోడీ పాలన : అంబానీకి ” మంచి యుద్ధం ” అదానీకి ”మంచి రోజులు ” !
  • కొలంబియాలో విరిసిన తొలి ఎర్రమందారం !
  • నరేంద్రమోడీకి వివరించేందుకు త్రివిధ దళాధిపతులు – ప్రధానికి తెలియకుండానే అగ్నిపథ్‌ను ప్రకటించారా ?
  • నాడు జైకిసాన్‌లపై దాడి నేడు అగ్నిపథ్‌ పేరుతో జై జవాన్లకు ఎసరు : నరేంద్రమోడీ తానాషాహీ నహీ చెలేగీ అంటున్న యువత !
  • అమెరికా దేశాల శిఖరాగ్ర సభ – జో బైడెన్‌కు భంగపాటు !

Recent Comments

మోడీ ఎనిమిదేండ్ల పాల… on మోడీ ఎనిమిదేండ్ల పాలన ( రెండవ…
మోడీ ఎనిమిదేండ్ల పాల… on మోడీ ఎనిమిదేండ్ల పాలన (మొదటి భ…
SHEIK ALI HUSSAIN on ప్రపంచాన్ని భయపెడుతున్న మంకీపా…
raomk on రంగనాయకమ్మ గారూ”కుహనా మి…
యూహెచ్ ప్రీతమ్ on రంగనాయకమ్మ గారూ”కుహనా మి…

Archives

  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • నరేంద్రమోడీ పాలన : అంబానీకి ” మంచి యుద్ధం ” అదానీకి ”మంచి రోజులు ” !
  • కొలంబియాలో విరిసిన తొలి ఎర్రమందారం !
  • నరేంద్రమోడీకి వివరించేందుకు త్రివిధ దళాధిపతులు – ప్రధానికి తెలియకుండానే అగ్నిపథ్‌ను ప్రకటించారా ?
  • నాడు జైకిసాన్‌లపై దాడి నేడు అగ్నిపథ్‌ పేరుతో జై జవాన్లకు ఎసరు : నరేంద్రమోడీ తానాషాహీ నహీ చెలేగీ అంటున్న యువత !
  • అమెరికా దేశాల శిఖరాగ్ర సభ – జో బైడెన్‌కు భంగపాటు !

Recent Comments

మోడీ ఎనిమిదేండ్ల పాల… on మోడీ ఎనిమిదేండ్ల పాలన ( రెండవ…
మోడీ ఎనిమిదేండ్ల పాల… on మోడీ ఎనిమిదేండ్ల పాలన (మొదటి భ…
SHEIK ALI HUSSAIN on ప్రపంచాన్ని భయపెడుతున్న మంకీపా…
raomk on రంగనాయకమ్మ గారూ”కుహనా మి…
యూహెచ్ ప్రీతమ్ on రంగనాయకమ్మ గారూ”కుహనా మి…

Archives

  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • నరేంద్రమోడీ పాలన : అంబానీకి ” మంచి యుద్ధం ” అదానీకి ”మంచి రోజులు ” !
  • కొలంబియాలో విరిసిన తొలి ఎర్రమందారం !
  • నరేంద్రమోడీకి వివరించేందుకు త్రివిధ దళాధిపతులు – ప్రధానికి తెలియకుండానే అగ్నిపథ్‌ను ప్రకటించారా ?
  • నాడు జైకిసాన్‌లపై దాడి నేడు అగ్నిపథ్‌ పేరుతో జై జవాన్లకు ఎసరు : నరేంద్రమోడీ తానాషాహీ నహీ చెలేగీ అంటున్న యువత !
  • అమెరికా దేశాల శిఖరాగ్ర సభ – జో బైడెన్‌కు భంగపాటు !

Recent Comments

మోడీ ఎనిమిదేండ్ల పాల… on మోడీ ఎనిమిదేండ్ల పాలన ( రెండవ…
మోడీ ఎనిమిదేండ్ల పాల… on మోడీ ఎనిమిదేండ్ల పాలన (మొదటి భ…
SHEIK ALI HUSSAIN on ప్రపంచాన్ని భయపెడుతున్న మంకీపా…
raomk on రంగనాయకమ్మ గారూ”కుహనా మి…
యూహెచ్ ప్రీతమ్ on రంగనాయకమ్మ గారూ”కుహనా మి…

Archives

  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Follow Following
    • vedika
    • Join 924 other followers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Customize
    • Follow Following
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d bloggers like this: