• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: CHANDRABABU

అమరావతి మూడు ముక్కలాట మరో మలుపు ?

01 Saturday Aug 2020

Posted by raomk in AP NEWS, BJP, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Politics

≈ Leave a comment

Tags

Aandhra Pradesh three Capitals, BJP, CHANDRABABU, Ycp, YS jagan


ఎం కోటేశ్వరరావు
మొండి వాడు రాజుకంటే బలవంతుడు అన్నది బాగా ప్రాచుర్యంలో ఉన్న సామెత. ఏకంగా రాజే మొండి అయితే ….గతంలో అలాంటి చరిత్ర మనకు తెలియదు, మన పెద్దలూ చెప్పలేదు. ఇప్పుడు రాజరికం లేదు గానీ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డి గురించి అలాంటి అభిప్రాయం అయితే ఉంది. ఆయన ఏమి చేసినా ప్రత్యర్ధులు దాన్ని వేరే విధంగా చూస్తే మద్దతుదారులు సానుకూలంగా చూస్తూ మురిసిపోతున్నారు.
మూడు రాజధానుల ఏర్పాటుకు రూపొందించిన బిల్లులకు గవర్నర్‌ ఆమోద ముద్ర వేయటంతో ఇతర ప్రాంతాల్లోని జగన్‌ మద్దతుదారులు ఫెళ్లున నవ్వారు. గవర్నర్‌ మీద దింపుడు కల్లం ఆశలు పెట్టుకున్నవారు, బిజెపి-జనసేన, తెలుగుదేశం పార్టీ నేతల మీద భ్రమలు పెంచుకున్నవారు గొల్లుమంటున్నారు. ఇంత ద్రోహమా అని గుండెలు బాదుకుంటున్నారు. ఇల్లు అలకగానే పండగ కాదు అన్నట్లుగా ఈ బిల్లులకు గవర్నర్‌ ఆమోద ముద్రవేయగానే అంతా అయిపోలేదు కోర్టులు ఉన్నాయి అనే వారు కూడా ఉన్నారు. ఊహించినట్లుగానే గవర్నర్‌ చర్య మీద రాజధాని గ్రామాల్లో ఆగ్రహం వ్యక్తమైనా మిగతా చోట్ల లోలోపల ఉడికి పోయినా, గ్రామాల్లో, పట్టణాల్లో కరోనా పెద్ద ఎత్తున వ్యాపిస్తున్న కారణంగా పెద్ద స్పందన వెల్లడి కాలేదు. అమరావతి కారణంగా తమ ఆస్ధుల విలువ పెరిగిందని సంతోషించిన వైసిపి మద్దతుదారులు తక్కువేమీ కాదు. రాజధాని, పరిసర ప్రాంతాల్లో గెలిచిన ఎంఎల్‌ఏలందరూ ఆ పార్టీకి చెందిన వారే. ఇప్పుడు సచివాలయం తరలింపు గురించి పైకి బింకంగా ఏమి మాట్లాడినా తమ ఆస్ధుల విలువ కూడా హరించుకుపోతున్నపుడు వైసిపి మద్దతుదారుల్లో అంతర్గతంగా సంతోషం ఏమీ ఉండదు. తమ నేతకు చెప్పలేకపోయినా గవర్నర్‌ అడ్డుకుంటే బాగుండు అని కోరుకున్న వారు లేకపోలేదు.
సుప్రీం కోర్టు, రాష్ట్రపతి ఆమోదంతో హైకోర్టు ఏర్పడింది కనుక, ఆ వ్యవస్ధల పాత ఆమోదాన్ని చెత్తబుట్టలో వేసి కొత్త ప్రతిపాదన చేస్తే దానికి కూడా ఆమోదం పొందవచ్చని కొందరు న్యాయవాదులు చెబుతున్నారు. ఇలాంటి సలహాలను నమ్మే జగన్‌ సర్కార్‌ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ విషయంలో చేతులు కాల్చుకుంది అని గమనించాలి. లేదూ హైకోర్టు మార్పు విషయంలో హక్కుల అంశం లేదు కనుక ఎవరైనా కోర్టులకు ఎక్కినా విధాన పర నిర్ణయంగా భావించి కోర్టులు అభ్యంతర పెట్టవు అన్నది ఒక అభిప్రాయం. హైకోర్టును కర్నూలులో పెట్టాలని బిజెపి కూడా కోరుతున్నది, దానికి రాష్ట్రపతి ఆమోద ముద్ర అవసరం అయితే కేంద్ర అధికారంలో ఉన్న తాము దాని సంగతి చూసుకుంటామని, సాయం చేస్తామని బిజెపి నేతలు బహిరంగంగానే చెబుతున్నారు. ఈ నేపధ్యంలో రాష్ట్రపతి అంటే రబ్బరు స్టాంపు గనుక ఎక్కడ ముద్రవేయమంటే అక్కడ వేస్తారు అని చెప్పేవారూ ఉన్నారు. తనకు లాభం అని బిజెపి భావించినా- వైసిపితో తెరవెనుక ముడి గట్టిగా పడినా అది కూడా జరిగినా ఆశ్చర్యం లేదు. పాలన వికేంద్రీకరణలో భాగంగా సచివాలయంతో సహా కార్యాలయాల తరలింపును కోర్టులు అడ్డుకోలేవు.
ముందు అమరావతి నుంచి సచివాలయాన్ని తరలించి తమ పంతం నెగ్గించుకోవాలన్నది వైసిపి పట్టుదల కనుక దాని కోసం బిజెపితో ఎలాంటి రాజీకైనా అంగీకరించే అవకాశం ఉంది. ఒక వేళ హైకోర్టు తరలింపులో అనుకోని అవాంతరాలు ఎదురై ఆగిపోయినా వైసిపికి పోయేదేమీ లేదు. ఆ సాకును చూపి న్యాయ రాజధానిని సీమలో ఏర్పాటు చేయలేక పోయామని చెప్పుకోవచ్చు. తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే రాజధాని ప్రాంత రైతుల్లో భూ సమీకరణ దగ్గర నుంచి అధికారంలో ఉన్నంత కాలం అది కల్పించిన ఆశలు, భ్రమలు, మునగచెట్టు ఎక్కించిన తీరు ఒకటైతే, జగన్‌ అధికారంలోకి వచ్చి అమరావతికి మంగళం పాడటానికి నిర్ణయించుకున్న తరువాత కూడా కేంద్రంలో తమకు ఉన్న పలుకుబడితో చక్రం అడ్డువేస్తామని తెలుగుదేశం నమ్మించింది. రైతులు కూడా నమ్మారు. ఇప్పుడు చంద్రబాబు నిజంగానే భావోద్వేగానికి గురైనా అదంతా నటన అనుకొనే వారే ఎక్కువగా ఉంటారు. ఎవరైనా ఒకసారి విశ్వసనీయత కోల్పోతే నిజం చెప్పినా నమ్మరు !
బిజెపి విషయానికి వస్తే అది నమ్మించి మోసం చేసిన తీరును జనం మరచిపోరు. అందువలన కన్నా లక్ష్మీనారాయణ అనే బొమ్మను పక్కన పెట్టి సోము వీర్రాజు అనే మరో బొమ్మను జనం ముందు పెట్టినా దానికి ఉన్నది పోయేదేమీ లేదు కొత్తగా వచ్చేదేమీ కనిపించటం లేదు. జనసేనాని పవన్‌ కల్యాణ్‌ పరిస్ధితి ఏమిటో అర్దం కాకుండా ఉంది. నటుడు కనుక తిరిగి సినిమాల్లోకి పూర్తిగా వెళ్లవచ్చు, లేదా కాల్షీట్లు తీసుకొని బిజెపి రాజకీయ సినిమాలో పాత్రపోషించవచ్చు, నమ్ముకున్న కార్యకర్తలేమౌతారు ?
రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్‌-బిజెపి రెండూ తమ వంతు పాత్రలను ఎలా పోషించాయో పదే పదే చెప్పుకోవనవసరం లేదు. కాంగ్రెస్‌కు రాష్ట్రంలో ప్రాతినిధ్యం కూడా లేకుండా పోయింది. బిజెపి నాటకాలు ఇంకా ఆడుతూనే ఉంది. రాష్ట్ర రాజధాని విషయంలో కేంద్ర పాత్ర ఉండదని, 2015 నోటిఫికేషన్‌ ప్రకారం రాజధాని అమరావతే అని, మూడు రాజధానుల విషయం పత్రికల్లో మాత్రమే చూస్తున్నామని కేంద్ర ప్రభుత్వం గతంలో పార్లమెంటులో ప్రకటించింది. వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానుల ఏర్పాటుకు అవసరమైన బిల్లులను రూపొందించటం, వాటిని గవర్నర్‌ ఆమోదించటంతో చట్టాలు కావటం తెలిసిందే. ఇప్పుడు గతంలో మాదిరి చెబితే కుదరదు. తన వైఖరి ఏమిటో చెప్పకతప్పదు.
ఆంధ్రప్రదేశ్‌కు కొత్త రాజధాని విషయమై శివరామకృష్ణన్‌ కమిటీని ఏర్పాటు చేసింది కేంద్రమే. రాజధాని ఖరారు అయ్యేంత వరకు పదేండ్ల పాటు హైదరాబాదులో రాజధాని కొనసాగవచ్చనే అవకాశం ఇచ్చిందీ కేంద్రమే. శివరామకృష్ణన్‌ కమిటీ సిఫార్సులపై తెలుగుదేశం-బిజెపి సంకీర్ణ రాష్ట్ర ప్రభుత్వం నారాయణ కమిటీని వేసి అది చేసిన సిఫార్సుల ప్రకారం రాజధానిని ప్రతిపాదించింది. అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం ప్రకారం అమరావతిని ఖరారు చేయటాన్ని కేంద్రం అంగీకరించింది. తాము నియమించిన శివరామకృష్ణన్‌ కమిటీ నివేదిక స్ఫూర్తి లేదా సిఫార్సులకు అనుగుణ్యంగా అమరావతి ఎంపిక లేదని కేంద్రం నాడు ఎలాంటి వివరణా కోరలేదు, అభ్యంతరమూ వ్యక్తం చేయలేదు. అక్కడ సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు నిర్మాణాలకు నిధులు కూడా మంజూరు చేసి విడుదల చేసింది. ప్రధాన మంత్రి నరేంద్రమోడీ స్వయంగా వచ్చి రాజధానికి శంకుస్ధాపన చేశారు. చంద్రబాబు రమ్మంటే వచ్చి రాయి వేసి వెళ్లారు తప్ప దానితో బిజెకి సంబంధం లేదని ఇప్పుడు ఆ పార్టీ వారు చెబుతున్నారు. రేపు మరి విశాఖలో కార్యనిర్వాహక రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని శంకుస్ధాపనలకు కూడా పిలిస్తే వస్తారా ? వైసిపి ప్రభుత్వం అసలు పిలుస్తుందా ? ఏం జరుగుతుందో ఎలా కథ నడిపిస్తారో చూడాలి. ఈ మూడు రాజధానుల గురించి కేంద్రానికి రాష్ట్రం ఏ రూపంలో నివేదిస్తుందో కూడా ఆసక్తి కలిగించే అంశమే.
రాజధాని ఏర్పాటులో కేంద్రం జోక్యం చేసుకోదని బిజెపి కొత్త నేత సోము వీర్రాజు చెప్పారు. దీనిలో కొత్తదనం ఏముంది. గతం నుంచీ చెబుతున్నదే. బిజెపి నేతలు పార్టీగా మూడు రాజధానులను వ్యతిరేకిస్తున్నాం తప్ప కేంద్ర ప్రభుత్వ పరంగా జోక్యం చేసుకొనే అవకాశం లేదని చెబుతున్నారు, దీనిలో అవకాశవాదం తప్ప పెద్ద తెలివితేటలేమీ లేవు. ఇప్పుడు మూడు రాజధానుల బిల్లులకు గవర్నర్‌ ఆమోద ముద్రవేయటాన్ని కూడా సమర్ధిస్తున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ నియామకం విషయంలో గవర్నర్‌ తీసుకున్న చర్య సరైనది అయినపుడు రాజధానుల బిల్లుల విషయంలో గవర్నర్‌ చర్య తప్పిదం ఎలా అవుతుందని చెట్టుకింది ప్లీడర్‌ వాదనలు చేస్తున్నారు. మేము గవర్నర్ల వ్యవహారాల్లో జోక్యం చేసుకోబోమని పత్తిత్తు కబుర్లు చెబుతున్నారు.
ఎన్నికల కమిషనర్‌ నియామకం గవర్నర్‌ చేయాలనే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తెచ్చింది, కొత్త కమిషనర్‌ పదవీకాలం గురించి తెచ్చిన ఆర్డినెన్స్‌, కొత్త కమిషనర్‌ నియామకం తప్పని హైకోర్టు తీర్పు చెప్పింది. సుప్రీం కోర్టు దాని మీద ఎలాంటి స్టే ఇవ్వలేదు కనుక తన పదవి గురించి రమేష్‌ కుమార్‌ తిరిగి హైకోర్టును ఆశ్రయించారు. గవర్నర్‌ను కలవండన్న కోర్టు సూచన మేరకే కలిశారు. కానీ మూడు రాజధానుల బిల్లుల విషయం వేరు. వాటిని ఆమోదించవద్దని గవర్నర్‌కు లేఖ రాసిన పార్టీలలో బిజెపి కూడా ఉందని వారు మరచిపోతే ఎలా ? గవర్నర్‌ వ్యవస్ధలో జోక్యం చేసుకోము అని చెబుతున్నవారు లేఖ ఎందుకు రాసినట్లు ? లేఖ రాసినందుకే కన్నా లక్ష్మీ నారాయణను పదవి నుంచి తప్పించారా ? పోనీ లేఖ రాయటం తప్పని కొత్త అధ్యక్షుడు పశ్చాత్తాపం ఏమైనా ప్రకటిస్తారా ?
అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను శాసనమండలి ఆమోదించలేదు, సెలెక్టు కమిటీకి నివేదిస్తున్నట్లు మండలి అధ్యక్షుడు ప్రకటించారు.సిఆర్‌డిఏ రద్దు బిల్లు, రాజధానికి సంబంధించి ఇతర అంశాల గురించి కోర్టులలో కొన్ని కేసులు దాఖలై ఉన్నాయి. ఈ నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ద చర్యలకు పాల్పడుతున్నట్లు భావిస్తున్న వారు రాజ్యాంగ ప్రతినిధి గవర్నర్‌ గనుక వాటిని ఆమోదించవద్దని లేదా న్యాయసలహాలు తీసుకోవాలని బిజెపితో పాటు ఇతర పార్టీలు కోరాయి. వాటన్నింటినీ పక్కన పెట్టి గవర్నర్‌ ఆమోద ముద్ర వేశారు. కేంద్ర హౌం మంత్రి అమిత్‌ షా లేదా ఆయన కార్యాలయం నుంచి ఫోన్‌ వచ్చిన తరువాతే గవర్నర్‌ ఈ చర్య తీసుకున్నారనే విమర్శలు వున్నాయి.వాటికి సమాధానం చెప్పకుండా దాటవేస్తున్నారు లేదా లేదని నిరాకరిస్తున్నారు. ఎవరు అవునన్నా కాదన్నా మూడు రాజధానుల గురించి బిజెపిలో ఏకాభిప్రాయం లేదు. ఈ వివాదం ప్రారంభమైనప్పటి నుంచి భిన్న వాదనలు వినిపిస్తున్న లేదా ప్రకటనలు చేస్తున్న వారిని ఆ పార్టీ ఇంతవరకు కట్టడి చేయలేకపోయింది.
ఇక హైకోర్టు గురించి గతంలో చేసిన వాదనలనే బిజెపి నేతలు చేస్తున్నారు. భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడక ముందే ప్రావిన్సులలో హైకోర్టులు ఉన్నాయి. రాష్ట్ర రాజధానిలోనే హైకోర్టు ఉండాలన్న అంశం రాజ్యాంగంలో స్పష్టంగా లేదు. అందువలన రాష్ట్రాల ఏర్పాటు, సంస్దానాల విలీనాల సమయంలో జరిగిన ఒప్పందాల ప్రకారం రాజధాని ఒక చోట హైకోర్టు ఒక చోట ఏర్పాటు చేశారు. తిరువాన్కూరు-కొచ్చిన్‌ సంస్ధానాల విలీనం సమయంలో రాజధాని తిరువనంతపురం, హైకోర్టు కొచ్చిన్‌లో ఉండాలన్నది ఒప్పందం. అలాగే మద్రాసు ప్రావిన్సు నుంచి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినపుడు రాజధాని కర్నూల్లో, హైకోర్టు గుంటూరులో ఉండాలన్నది పెద్ద మనుషుల ఒప్పందం. ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడినపుడు ఈ సమస్యకు బదులు ఇతరంగా ముల్కీ వంటి ఒప్పందాలు జరిగాయి. రాజధానిని విజయవాడలో పెట్టాలని కొందరు కోరినా హైకోర్టుతో సహా చివరకు హైదరాబాద్‌ను ఖరారు చేశారు. రాజధానులలో కాకుండా ఇతర చోట్ల హైకోర్టులు ఉన్న ప్రాంతాలన్నింటికీ ఇలాంటి ఏదో ఒక నేపధ్యం ఉన్నది. తరువాత కొత్తగా ఏర్పడిన రాష్ట్రాలలో ఉత్తరాఖండ్‌లో హైకోర్టు నైనిటాల్‌ నగరంలో ఉంది. రాజధాని చలికాలంలో డెహ్రాడూన్‌లో, వేసవి కాలంలో దానికి 250కిలోమీటర్ల దూరంలోని గైరాసియన్‌ పట్టణంలో ఉంటుంది. ఇవేవీ వివాదం కాలేదు, ఒక సారి ఖరారు అయిన తరువాత మార్పులు జరగలేదు. ఆంధ్రప్రదేశ్‌లోనే ఖరారైన రాజధాని విషయంలో రాజకీయం మొదలైంది.
న్యాయమూర్తుల నియామకం, హైకోర్టు బెంచ్‌ల ఏర్పాటు వంటివి సుప్రీం కోర్టు, కేంద్ర ప్రభుత్వ వ్యవహారం కనుక హైకోర్టు తరలింపు ప్రతిపాదనపై నిర్ణయం తీసుకోవాల్సింది సుప్రీం కోర్టు, కేంద్రమే. సచివాలయాన్ని తరలిస్తే కేంద్రం చేయగలిగిందేమీ లేదు. కాగల కార్యాన్ని గంధర్వులే తీర్చారు లేదా తీరుస్తారు అన్నట్లుగా హైకోర్టు తరలింపును సుప్రీం కోర్టు ఆమోదించకపోతే, అది జరగకుండా కేవలం సచివాలయాన్నే తరలిస్తే జగన్‌ సర్కార్‌ రాజకీయంగా చిక్కుల్లో పడుతుంది. దాన్ని సొమ్ము చేసుకొనేందుకు బిజెపి రంగంలోకి దిగవచ్చు. అనేక రాష్ట్రాలు హైకోర్టు బెంచ్‌లను ఇతర ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని కోరుతూ కేంద్రాన్ని ఇప్పటికే అనేక సార్లు కోరి ఉన్నాయి. వాటిలో దేనినీ కేంద్రం పట్టించుకోలేదు. ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర హైకోర్టు తరలింపుకు ఆమోదం తెలిపితే కొత్త సమస్యలకు తెరలేపినట్లవుతుంది.
ఇక 2015లో వెలువరించిన గజెట్‌ నోటిఫికేషన్‌ లేదా రాజధానిగా అమరావతి ఉత్తర్వు మార్చటానికి వీలు లేని శిలాశాసనమో, చంద్రబాబు చెక్కిన శిలాఫలకమో కాదని, కొత్త ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా మరొకదానిని జారీ చేయవచ్చని బిజెపి నేత జివిఎల్‌ నరసింహారావు గతంలోనే చెప్పారు. 2015లో అప్పటి ప్రభుత్వం జీవో ద్వారా నోటిఫై చేసింది కనుక ప్రస్తుతానికి అమరావతే రాజధాని అని లోక్‌సభకు ఇచ్చిన సమాధానంలో కేంద్రం పేర్కొందని ప్రస్తుత ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని మార్చుకొని భవిష్యత్తులో రాజధానిని మరోచోటుకి మార్చి, ఆ విషయాన్ని తెలియజేస్తే కేంద్రం గుర్తిస్తుందని కూడా నరసింహారావు చెప్పారు. అదే ముక్క పార్లమెంటు సమాధానంలో బిజెపి సర్కార్‌ ఎందుకు చెప్పలేదు అని అడిగినవారు లేకపోలేదు.
ఏదీ శిలాఫలకం, శాసనం కానపుడు, మార్చుకోవటానికి అవకాశం ఉన్నపుడు స్వయంగా బిజెపి నేతలు కోరిన పదేండ్ల పాటు రాష్ట్రానికి ప్రత్యేక హౌదాకు విధానాలను మార్చటానికి, ఉత్తర్వులు జారీ చేసేందుకు కేంద్రానికి ఉన్న అడ్డంకి, అభ్యంతరం ఏమిటి? ఎందుకు హౌదా ఇవ్వరు. పోనీ ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దేందుకు తీసుకున్న ఇతర చర్యలేమైనా ఉన్నాయా అంటే లేవు.
చంద్రబాబు నాయుడు అమరావతిని ఒక భ్రమరావతిగా చూపుతూ సింగపూర్‌, కౌలాలంపూర్‌, మరొకటో మరొక దాని పేరో చెప్పి రైతులకు, జనాలకు భ్రమలు కల్పించారు. రాజధాని తరలింపు జరిగితే రైతులకు ఎలా న్యాయం చేస్తారనే ప్రశ్న ముందుకు వచ్చింది. రాజధాని తమ ప్రాంతంలో పెడతామని చెప్పారు గనుకనే మేము భూములను ఇచ్చామని, ఇప్పుడు రాజధాని తరలిపోయి, తాము ఇచ్చిన భూములు దేనికీ పనికి రాకుండా పోతే తామేమి కావాలని వారు అడుగుతున్నారు. దానిలో తప్పు లేదు. ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి. వారు ప్రభుత్వంతో ఒక ఒప్పందం చేసుకొని భూములు ఇచ్చారు. దానికి ప్రతిఫలంగా కొన్ని సంవత్సరాల పాటు కౌలు చెల్లింపు, వారు ఇచ్చిన భూమి విస్తీర్ణాన్ని బట్టి అభివృద్ధి చేసిన రాజధాని ప్రాంతంలో కొంత స్ధలాన్ని వారికి అందచేయాల్సి ఉంది. చట్టపరంగా ప్రభుత్వం ఆ పని చేయకపోతే కోర్టులకు వెళ్లి దాన్ని సాధించుకోవచ్చు, ఎలాంటి అభ్యంతరమూ లేదు. ఇక్కడ సమస్య అది కాదు. రాజధాని ఏర్పడితే ఆ ప్రాంతంలో తమ వాటాగా వచ్చిన స్ధలాలకు మంచి రేట్లు వస్తాయని, అవి మొత్తం భూముల విలువ కంటే కొన్ని రెట్లు ఎక్కువ ఉంటాయని ఆశించారు. ప్రభుత్వం అభివృద్ధి చేసిన ప్లాట్లు అంటే రోడ్లు, డ్రైనేజి వంటి మౌలిక సదుపాయాలు కల్పించి అందచేయటం. అలా ఇచ్చినా తాము ఆశించిన మేరకు ధరలు రావన్నది రైతుల అసలు ఆందోళన. దీనికి తోడు పేదలకు ఇండ్ల స్ధలాలు ఇచ్చే పేరుతో ఇతర ప్రాంతాల వారికి ఇక్కడ స్ధలాలు కేటాయిస్తే తమ భూములకు డిమాండ్‌ పడిపోతుందని, ఇలాంటి ఎన్నో అనుమానాలు ఆ ప్రాంత వాసుల్లో ఉన్నాయి.
ఇప్పటికీ బిజెపి నేతలు రాజధాని ప్రాంత రైతులకు న్యాయం చేస్తామని, చేయాలనే తాము కోరుతున్నట్లు చెబుతుంటారు. మరోవైపు మూడు రాజధానుల విషయంలో తాము చేయగలిగిందేమీ లేదంటారు. వారితో కలసిన లేదా గత ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు తెచ్చుకున్నందున వారిని కలుపుకు ఉద్యమిస్తానని ప్రకటించిన పవన్‌ కల్యాణ్‌ ఏమి చేస్తారో, ఏమి చెబుతారో చూద్దాం. వైసిపి నాయకులు కూడా రాజధాని రైతులకు న్యాయం చేస్తామనే చెబుతున్నారు. వారి ఆచరణ ఏమిటో చూడాల్సి ఉంది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

వెంట తిరిగే హచ్‌ కుక్కలు – చంకనెక్కే బొచ్చు కుక్కలు !

05 Thursday Dec 2019

Posted by raomk in BJP, Communalism, Current Affairs, History, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Politics

≈ Leave a comment

Tags

ANDHRA PRADESH Politics, BJP, CHANDRABABU, Janasena, P&K, pavan kalyan, tdp, Ycp, YS jagan

Image result for pawan kalyan chandrababu naidu jagan

ఎం కోటేశ్వరరావు
కొత్త సర్కార్‌కు ఈ మధ్యనే ఆరు నెలలు నిండాయి. అసాధారణ పరిస్ధితులు ఏర్పడితే తప్ప ఇప్పుడప్పుడే ఎన్నికలు రావు. అయినా ఆంధ్రప్రదేశ్‌ రాజకీయ రంగంలో వేడి పుడుతోంది. ఇది ప్రకటనలకు ఆవేశ, కావేషాలకే పరిమితం అవుతుందా ? అంతకు మించుతుందా ? ఆంధ్రప్రదేశ్‌ రాజకీయ చదరంగంలో ఎలా గెలవాలా అని ప్రతిపక్షాలు చూస్తుంటే ప్రత్యర్ధులను ఎలా కట్టడి చేయాలా అని సహజంగానే అధికారపక్షం ప్రయత్నిస్తుంది.ఈ క్రమంలో ఎత్తులు పై ఎత్తులు సహజం.
ఆరునెలల క్రితం జరిగిన ఎన్నికలకు ముందు వైసిపి-బిజెపి బంధం గురించి తెలుగుదేశం మైండ్‌ గేమ్‌ ఆడింది. ఇప్పుడు వైసిపి నాయకత్వం ఆడుతున్న ప్రతి క్రీడలో భాగంగా బిజెపి-తెలుగుదేశం-జనసేన బంధాన్ని ముందుకు తెస్తోంది. గత ఎన్నికల్లో జనసేన-వామపక్షాలు సర్దుబాట్లతో ఐక్యంగా పోటీ చేశాయి. ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత ఏ పార్టీతోనూ కలసి కార్యాచరణ చేపట్టకూడదని జనసేన నాయకత్వం నిర్ణయించినపుడే ఆ పార్టీ వామపక్షాలకు దూరంగా ఉండదలచుకున్నదని తేలిపోయింది. ఇప్పుడు రాష్ట్రంలో ఏమి జరగనున్నది అనే చర్చకు తెరలేచింది. వైసిపికి తామే అసలైన ప్రతిపక్షమని బిజెపి నేతలు ప్రకటించారు.బిజెపితో తెలుగుదేశం పార్టీ సంబంధాల గురించి రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. వాటి ఆధారంగా నిర్ధారణలకు రావటం, జోశ్యాలు చెప్పాల్సిన అవసరం లేదు.అవి కలసినా, విడిగా వున్నా సంఖ్యా పరంగా వైసిపికి వచ్చే ప్రమాదం ఏమీ లేదు. ఇక బిజెపితో పవన్‌ కల్యాణ్‌ నాయకత్వంలోని జనసేన పార్టీ సంబంధాల గురించి ఇప్పటి వరకు ఎలాంటి ఊహాగానాలు వచ్చినా వారే చెబుతున్నారు గనుక తలలు బద్దలు కొట్టుకోవాల్సిన పనిలేదు.
‘బిజెపికి నేను ఎప్పుడు దూరమయ్యాను? దగ్గరగానే ఉన్నా. రాష్ట్రానికి ప్రత్యేక హౌదా కోసం కేండ్రంతో విభేదించాను. అమిత్‌షా అంటే నాకు అమితమైన గౌరవం. వైసిపి వాళ్లకు ఆయనంటే భయం.’ అని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ తిరుపతి విలేకర్ల సమావేశంలో చెప్పారు. దేశ ప్రజలు బిజెపిని మంచి మోజార్టీతో రెండోసారి అధికారంలో కూర్చోబెట్టారు. మోడీ అమిత్‌షా దేశ ప్రయోజనాలు, దేశ రక్షణ కోసం పాటుపడుతున్నారు. నేను సెక్యులరిస్టును. ఓట్లు వచ్చినా, రాకపోయినా నేను నమ్మే హిందూ సిద్ధాంతం గురించి మాట్లాడుతున్నాను. జగన్‌ నివాసానికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న కృష్ణా పుష్కర ఘాట్‌లో సామూహిక మత మార్పిడి చేస్తుంటే ఆయనకు తెలియదా? ఎవరి అండ చూసుకొని 40 మందిని సామూహిక మతమార్పిడి చేశారో చెప్పాలన్నారు. హిందూధర్మ పరిరక్షణ గురించి నేను మాట్లాడితే, దాన్ని వక్రీకరించి వైసిపి అసత్య ప్రచారం చేసింది. ఎవరైనా సరే మత విశ్వాసాలను గౌరవించి తీరాల్సిందే అన్నారు. ‘మీరు టిడిపి, బిజెపితో పొత్తు పెట్టుకుంటారా?’ అని విలేకర్లు అడిగిన ప్రశ్నకు ‘చెప్పలేం… ఉండొచ్చు ఏమో…’ అంటూ సమాధానం దాటవేశారు. ఉత్తరప్రదేశ్‌లో మాయావతి దళిత, బలహీన వర్గాల కోసం పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చారని, రెండోసారి అధికారం కోసం ఎవరిని పక్కన పెట్టి పార్టీని స్థాపించించారో ఆ బ్రాహ్మణులను అక్కున చేర్చుకున్నారని. రాజకీయాలు ఇలా ఉంటాయంటూ సమాధానం చెప్పారు.
జనసేనను బీజేపీలో విలీనం చేయమని ఎన్నికలకు ముందే పవన్‌ కల్యాణ్‌ని అడిగామని, అప్పుడు ఆయన ఒప్పుకోలేదని భారతీయ జనతా పార్టీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు గుర్తుచేశారు. ఇప్పుడు ఏమైనా పవన్‌ కల్యాణ్‌ మనసు మారి ‘జనసేన’ను భారతీయ జనతా పార్టీలో విలీనం చేసే ఆలోచన ఉంటే తప్పనిసరిగా స్వాగతిస్తామని చెప్పారు.’మా నాయకత్వం కొత్త ఒరవడిని తీసుకురావడానికి ఇష్టపడుతోంది. కేవలం రాజకీయ కారణాలతో ఆరడుగుల బుల్లెట్‌ (పవన్‌ కల్యాణ్‌)ను మా భుజాలపై నుంచి సంధించాలని వేరే వారు అనుకుంటే పొరపాటే అవుతుంది. ఎందుకంటే, పొత్తులు పెట్టుకునే సమయం కాదు ఇది. ఆంధ్రప్రదేశ్‌ లో ఎన్నికలు జరగడానికి ఇంకా నాలుగున్నర సంవత్సరాల వ్యవధి వుంది. మాతో కలిసి పనిచేయదలచుకున్న పార్టీలు ఏవైనా విలీనం కాదలచుకుంటే స్వాగతిస్తాం.లేదా కలిసి పనిచేసేలా ప్రయత్నిస్తాం’ అని జీవీఎల్‌ పేర్కొన్నారు.

Image result for pawan kalyan chandrababu naidu jagan
తిరుపతి వెంకన్న సాక్షిగా పవన్‌ చెప్పిన మాటలు, బిజెపి నేత జివిఎల్‌ నరసింహారావు స్పందన గురించి వేరే వ్యాఖ్యానాలు అవసరం లేదు. గతంలో సినిమా సమీక్షలు రాసేవారు కథంతా వివరించి చిత్ర ముగింపు ఎలా ఉంటుందో చెప్పకుండా ఆసక్తిని కలిగించేందుకు ప్రయత్నించేవారు. ఇప్పుడు బిజెపి-జనసేన మధ్యలో తెలుగుదేశం అన్నట్లుగా ఉంటుందా ? బిజెపి-జనసేన విలీనం అవుతాయా, మిత్రపక్షాలుగా ఉంటాయా అన్నది కూడా త్వరలోనే స్పష్టం అవుతుంది. అనేక రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌-బిజెపిలతో సఖ్యతను చూస్తే కాంగ్రెస్‌ నుంచి విడిపోయిన శక్తులు తిరిగి దానితో సర్దుబాటు చేసుకున్నా ప్రత్యేక పార్టీలుగానే కొనసాగి బేరసారాలు జరుపుతున్నాయి.
చిన్న పార్టీలను కాంగ్రెస్‌ ఎలా మింగివేసిందో గత అనుభవం ఉంది గనుక బిజెపి విషయానికి వస్తే ప్రాంతీయ పార్టీలు ముందు నుంచి తగుజాగ్రత్తలతో వ్యహరిస్తున్నాయి. రెండు పెద్ద జాతీయ పార్టీలతో ప్రాంతీయ పార్టీలు విలీనం అయితే ముద్రవేయించుకొని మందలో కలవటం తప్ప చేసేదేమీ ఉండదని ప్రజారాజ్యం నేత చిరంజీవి అనుభవం తెలిసిందే. అన్నింటికీ మించి విడిగా ఉంటేనే ప్రాంతీయ పార్టీలకు బేరసారాలాడే శక్తి ఎక్కువగా ఉంటుంది. అంతకు మించి ఎప్పుడు ఎటుకావాలంటే అటు సులభంగా దూకే సౌలభ్యం ఉంటుంది. అందుకు మహారాష్ట్ర శివసేన చక్కటి ఉదాహరణ. హిందూత్వ విషయంలో విడదీయలేని బిజెపితో పోటీ పడిన ఆ పార్టీ అధికారం విషయంలో పేచీకి దిగి ఎన్‌సిపి-కాంగ్రెస్‌ కూటమితో ఎలా చేతులు కలిపిందో చూశాము. దీన్ని చూసిన తరువాత ఏ పార్టీ ఎప్పుడు దేనితో చేతులు కలుపుతుందో చెప్పలేని స్ధితి ఏర్పడింది. ఎవరి తురుపు ముక్కలను వారు తమ దగ్గరే పెట్టుకొని జూదం ఆడతారు.
తాజాగా ఆంధ్రప్రదేశ్‌ నీటి పారుదల శాఖ మంత్రి అనిల్‌ కుమార్‌ జనసేన నేత పవన్‌ కల్యాణ్‌ను తెలుగుదేశం పార్టీనేత చంద్రబాబు నాయుడు వెనుక తిరిగే హచ్‌ కుక్క వంటి వాడని వ్యాఖ్యానించారు. అంతకు ముందు మరో మంత్రి కొడాలి నాని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని లుచ్చాగాడు అని సంబోధించారు. గతంలోకి వెళితే 2016 రైతు భరోసా యాత్రలో వైఎస్‌జగన్మోహన్‌ రెడ్డి మాట్లాడుతూ నవనిర్మాణ దీక్షల గురించి చంద్రబాబు చెప్పింది నిజంగా జరగాలంటే చంద్రబాబు నాయుడిని ఎక్కడ కనపడితే అక్కడ చెప్పులతో కొట్టాలన్నారు. చంద్రబాబు సిగ్గుమాలిన మనిషి, నారాసురుడు అని జగన్‌ అంటే, వైఎస్‌ఆర్‌ దొంగలు అని చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర ప్రజలంతా విన్నారు, కన్నారు. ఇవన్నీ చూసినపుడు రాష్ట్ర రాజీకీయాల్లో నోరుబట్టని బూతులు, కూతలు నిత్యకృత్యమయ్యాయి.రాబోయే రోజుల్లో బూతులతో పాటు మత,కులాల అంశాలను మరింతగా ముందుకు తెచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.
బూతులు ఎవరు మొదలు పెట్టారు, ఎవరు ఎంత సమర్ధవంతంగా తిప్పికొడుతున్నారు అన్నది నేడు గ్రామాలలో రచ్చబండ చర్చల్లో రచ్చ అవుతోంది. ఏ పార్టీ అభిమానులు ఆ పార్టీ నేతల బూతులను నిస్సిగ్గుగా సమర్ధిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే కొన్ని చోట్ల ఉన్మాదంతో ఊగిపోతున్నారు. దాన్నింకా పెంచేందుకు నేతలు బూతుల పంచాంగాలను మరింత శ్రావ్యంగా వినిపిస్తున్నారు. ఇలా బూతులు మాట్లాడటం తప్పనే జ్ఞానం ఎక్కడా కనిపించటం లేదు. గతంలో చంద్రబాబు నాయుడు వైఎస్‌ జగన్‌మోహనరెడ్డి, ఆయన అనుయాయుల మీద తమ అనుచరుల నోటి దురుసుతనాన్ని విని ఆనందిస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్‌ కల్యాణ్‌ మీద తన మంత్రులు, ఇతర నేతల బూతులు, కూతలను చూసి వైఎస్‌ జగన్‌మోహనరెడ్డి మహదానందం పొందుతున్నట్లు కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రంలో ఇలాంటి వాతావరణం ఉందంటే మన నేతలకు ఇరుగుపొరుగు రాష్ట్రాల్లో ఎలాంటి గౌరవం దక్కుతుందో చెప్పనవసరం లేదు. తెలుగు సమాజం ఇలాంటి వారిని ఎలా భరిస్తున్నదని ప్రశ్నించే రోజులు రాబోతున్నాయి. ఎవ్వరేమనుకుంటేనేమి నాకేటి సిగ్గు అనుకుంటే చేసేదేముంది.
ఆంధ్రప్రదేశ్‌లో ఎందుకీ పరిస్ధితి, ఎందుకీ దిగజారుడు ? గతంలో కాంగ్రెస్‌, కమ్యూనిస్టులు, స్వతంత్రపార్టీ వంటివి అధికార, ప్రతిపక్షాలుగా ఉన్నపుడు ఇలాంటి దిగజారుడుతనం లేదు. రాజకీయ వైరం తీవ్రంగా ఉన్నప్పటికీ పరస్పర నిందలు లేవు. ఎన్‌టి రామారావు రాజకీయ రంగంలోకి వచ్చినపుడు కుక్కమూతి పిందెలు అని చేసిన విమర్శకు మమ్మల్ని ఇంతలా నిందిస్తారా అని కాంగ్రెస్‌ వారు నొచ్చుకున్నారు. ఇప్పుడు వెలువడుతున్న పదజాలంతో పోల్చితే నిజానికి ఆ విమర్శ పార్లమెంటరీ సంప్రదాయాలకులోబడిందే తప్ప నింద కాదు.
1991 నుంచి అమల్లోకి వచ్చిన నయావుదారవాద విధానాలను అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న జాతీయ, ప్రాంతీయ పార్టీలు(కొన్ని అంశాలలో పరిమితంగా వామపక్షాలు మినహా) ఒకే రకమైన ఆర్ధిక విధానాలను అమలు జరుపుతున్నాయి. అందువలన తెలుగుదేశం, వైసిపి, కాంగ్రెస్‌, జనసేన, బిజెపి వంటి పార్టీలేవీ విధానాల గురించి చట్ట సభల్లో లేదా వెలుపలా ఎక్కడా ప్రస్తావించవు, ఘర్షణ పడవు. వాటి పంచాయతీ అల్లా అధికారం, దాన్ని అడ్డం పెట్టుకొని ఆస్ధులు కూడబెట్టుకోవటం గురించి మాత్రమే. అందువల్లనే అధికారం కోసం ఎంత ఖర్చు పెట్టటానికైనా వెనుదీయరు, ఏమి చేయటానికైనా సిద్దం అవుతారు.
గతంలో అంటే నూతన ఆర్ధిక విధానాలు రాకముందు భూమి దాని మీద పట్టు, గ్రామీణ ప్రాంతాలలోని వనరుల మీద ఆధిపత్యం కోసం పాలెగాళ్లు, భూస్వాములు, ధనిక రైతులు వెంపర్లాడేవారు. గడచిన మూడు దశాబ్దాలుగా వ్యవసాయం గిట్టుబాటు గాకపోవటం, దాని మీద వచ్చేదాని కంటే పరిశ్రమలు, వ్యాపారాలు, రియలెస్టేట్‌ మీద వచ్చే ఆదాయం ఆకర్షణీయంగా మారటంతో రాయలసీమ ఫ్యాక్షనిస్టులు, ఇతర ప్రాంతాల్లోని భూస్వాములు, ధనిక రైతులు వాటి వైపు మొగ్గుచూపారు. రాయలసీమలో ఇప్పటికీ ఫ్యాక్షనిజం ఉన్నప్పటికీ వాటి నేతలకు గ్రామీణ ప్రాంతాలలో వచ్చే ఆదాయాల కంటే పట్టణాలు ఆకర్షణీయంగా ఉండటంతో వారి మధ్య సర్దుబాట్లకు తెరలేచింది. ఒకరి సంపాదనకు మరొకరు అడ్డుపడకుండా ఎవరి సంపాదన వారు చూసుకుందామనే పెట్టుబడిదారీ ఆలోచనలు అందుకు దోహదం చేస్తున్నాయి.అందువల్లనే పేరు మోసిన వైరి ఫ్యాక్షనిస్టులు అటు తెలుగుదేశం పార్టీలో ఇటు వైసిపిలో ఒకేవరలో ఇమిడిపోగలుగుతున్నారు.
నయావుదారవాద విధానాలు ఆశ్రిత పెట్టుబడిదారీ విధానానికి తెరలేపాయి.ప్రపంచ బ్యాంకు విధానాల అమలు ప్రయోగశాలగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మారింది. దీనిలో ప్రభుత్వరంగ సంస్ధల ఆస్ధులను ఆశ్రితులకు అయినకాడికి తెగనమ్మటం ద్వారా లబ్ది చేకూర్చటం. విలువైన భూములను కారు చౌకగా పారిశ్రామిక, వాణిజ్యవేత్తలకు కట్టబెట్టి వారి నుంచి రాజకీయనేతలు లబ్ది పొందటం తెలిసిందే. అది అపరిమిత లాభాలు చేకూర్చటంతో ఎన్నికలు వ్యాపారంగా మారాయి. పదుల కోట్ల రూపాయలు అసెంబ్లీ, పార్లమెంటరీ ఎన్నికలలో ఖర్చు చేయటానికి కారణమిదే. దీనికి అనుగుణ్యంగానే స్ధానిక సంస్ధల ఎన్నికలు కూడా డబ్బుమయంగా మారాయి.
ఇదే సమయంలో రాజకీయ వైరం తీవ్రంగా ఉన్న సందర్భాలలో ఎదుటి వారికి ఆర్ధిక మూలాలను దెబ్బతీయటం చేస్తున్నారు. అది కేంద్రంలోనూ, రాష్ట్రాల్లో అధికారాల్లో ఉన్నవారూ చేస్తున్నారు. కాంట్ట్రాక్టర్లుగా ఉన్నవారికి దీర్ఘకాలం పాటు బిల్లులు నిలిపివేయటం, కొర్రీలు వేయటం, గనులు పొందిన వారి మీద దాడులు చేయించటం. గతంలో పొందిన కాంట్రాక్టులను రద్దు చేస్తామని బెదిరించటం ఇలా రకరకాల పద్దతులను రంగంలోకి తీసుకువస్తున్నారు. తెలుగుదేశం హయాంలో గ్రామాల్లో కాంట్రాక్టులు పొంది పనులు చేసిన వారు పార్టీ మారి వైసిపిలోకి వెళితే వెంటనే బిల్లులు మంజూరు చేయటం, మారని వారిని సతాయించటం గురించి వస్తున్న ఫిర్యాదుల సారమిదే.

Image result for pawan kalyan chandrababu naidu jagan

ఎన్నికల్లో డబ్బు ప్రమేయం పెరుగుదల రాష్ట్రంలో సరికొత్త రాజకీయ సర్దుబాట్లకు-కక్షలకు తెరలేపింది. ఎవరు బిస్కెట్‌ వేస్తే లేదా కర్ర చూపితే వారి వైపు తోకాడించుకుంటూ వెళ్లి చంకనెక్కే బొచ్చుకుక్కల మాదిరి వెళుతున్న వాణిజ్య రాజకీయనేతలను చూస్తున్నాము. డబ్బు, ఓట్లను రాబట్టగలిగిగే సామాజిక తరగతిని బట్టి నిన్నటి వరకు అధికారంలో ఉన్న పార్టీలో పదవులు వెలగబెట్టిన వారు తెల్లవారే సరికి వాటంగా ఉంటుందనుకొంటే మరొక పార్టీలోకి సులభంగా మారిపోతున్నారు. చేర్చుకొనే వారికి, చేరేవారికి ఎలాంటి విలువలు, వలువలు ఉండటం లేదు. ఒక పార్టీలో గెలిచి ప్రజాప్రతినిధిగా ప్రమాణ స్వీకారం కూడా చేయక ముందే మరో పార్టీలో చేరిన వారిని చూశాము. ఫిరాయింపుదార్లను కాపాడేందుకు స్పీకర్ల వ్యవస్ధను దుర్వినియోగం చేస్తున్నారు.
ఈ నేపధ్యంలో ఎవరు అధికారంలో వుంటే వారికి వ్యతిరేకంగా వచ్చిన అవకాశాన్ని వినియోగించుకొనేందుకు ప్రతిపక్షంగా ఉన్న ప్రతి పార్టీ ప్రయత్నిస్తుంది.దానిలో తప్పులేదు. ఇప్పుడు ప్రతిపార్టీ అధికారంలోకి వచ్చేందుకు సంక్షేమ చర్యల విషయంలో పోటీపడుతున్నది తప్ప వేరే అంశాలే లేవు. సంక్షేమ చర్యలను విమర్శించేందుకు ఎవరూ ముందుకు రారు. రాజకీయంగా వేడి పుట్టించాలంటే వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని బూతులతో రక్తి కట్టిస్తే తప్ప జనానికి కిక్కు ఎక్కటం లేదు. ఇప్పుడు బిజెపితో స్నేహం కారణంగా మతాన్ని కూడా ముందుకు తెస్తున్నారు. ఆరు నెలల క్రితం బిజెపికి వ్యతిరేకంగా పని చేస్తా అని చెప్పిన పవన్‌ కల్యాణ్‌ అప్పటికీ ఇప్పటికీ ఆ బిజెపిలో వచ్చిన మార్పేమిటో, రాష్ట్రానికి చేసిన మేలు ఏమిటో, ఎందుకు తన వైఖరిని మార్చుకున్నారో జనసేనాని జనానికి చెప్పాలి.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

తొలిసారి ముఖ్యమంత్రిగా జగన్‌, మూడోసారి ప్రతిపక్ష నేతగా చంద్రబాబుకు వంద రోజులు !

12 Thursday Sep 2019

Posted by raomk in AP NEWS, Current Affairs, History, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

100 days : ys jagan as cm- chandrababu as opposition leader, CHANDRABABU, CM YS Jagan, tdp, Ycp

Image result for ys jagan vs chandrababu naidu

ఎం కోటేశ్వరరావు

ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారి ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన రెడ్డి పాలనకు, మూడోసారి ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడికి వంద రోజులు పూర్తయింది. ఈ సందర్భంగా టీవీల్లో జరిగిన చర్చల్లో యాంకర్లు మీరు జగన్‌ తొలి వంద రోజుల పాలనకు ఎన్ని మార్కులు వేస్తారు అన్నది ఒకటి. ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు తొలి ఆందోళనగా చేపట్టిన చలో ఆత్మకూరు యాత్ర గురించి కూడా మీడియాలో చర్చ జరిగింది.

జగన్‌ పాలన విషయానికి వస్తే నవరత్నాల సంక్షేమ చర్యల అమలుకు తొలి ప్రాధాన్యత ఇచ్చారు. గత పాలనలో జరిగిన అవినీతి అక్రమాలను వెలికి తీసేందుకు కొన్ని చర్యలను ప్రకటించారు. కొండంత రాగం తీసిన విద్యుత్‌ ఒప్పందాల విషయంలో ఎదురుదెబ్బలు తగిలాయి. సంప్రదాయేతర విద్యుత్‌ వుత్పత్తి సంస్ధలు విద్యుత్‌ పంపిణీ సంస్ధలతో కాకుండా రాష్ట్ర ప్రభుత్వంతో గతంలో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. వాటన్నింటిలో కేంద్రంలో బిజెపి సర్కార్‌లో భాగస్వామి అయిన తెలుగుదేశం, రాష్ట్రంలోని తెలుగుదేశం సర్కార్‌లో చేరిన బిజెపి నేతలు, వారి లాబీయిస్టులు, ప్రభుత్వాలు భాగస్వాములు. ఆ విద్యుత్‌ కంపెనీలన్నీ విదేశీ బడా సంస్ధలకు చెందినవి. వాటి వత్తిడి మామాలుగా వుండదు. తాజాగా అందిన సమాచారం ప్రకారం తాము అన్ని ఒప్పందాలను తిరగదోడబోమని, అక్రమాలు జరిగిన వాటికే పరిమితం అవుతామని జగన్‌ సర్కార్‌ కేంద్ర ప్రభుత్వానికి వివరణ ఇచ్చింది. అందువలన పంచపాండవులంటే మంచం కోళ్ల మాదిరి మూడనుకొని రెండంకె వేసి తప్పని కొట్టేసి ఒకటిగా చివరికి సున్నాగా మారుస్తారా అన్నది చూడాల్సి వుంది. నవయుక కంపెనీ ఒప్పందం రద్దు కోర్టులో వుంది. రివర్స్‌ టెండర్ల ప్రక్రియ ఏమౌతుందో చూడాల్సి వుంది. టెండర్ల జారీకి ముందే పరిశీలనకు ఒక రిటైర్డ్‌ న్యాయమూర్తితో పరిశీలనకు ఏర్పాటు చేశారు. భవిష్యత్‌లో అన్నీ రివర్స్‌ టెండర్లే వుంటాయని ప్రకటించిన సర్కార్‌ మరో వైపు ఈ కమిటీని ఏర్పాటు చేసింది.

ఎన్నికల ప్రణాళికలో వాగ్దానం చేసిన నవరత్నాల గురించి జనం మరచిపోయే విధంగా రాజధాని వివాదాన్ని తలకు చుట్టుకోవటంలో వైసిపి జయప్రదమైంది. రాజధాని నిర్మాణం గురించి అనవసర చర్చకు తెరలేపింది, దాన్ని సమర్ధించుకొనేందుకు ఆ ప్రాంతంలో భూముల కొనుగోలులో తెలుగుదేశం నేతలు అక్రమాలకు పాల్పడ్డారని చెప్పింది. ఇది ఒక ఎత్తుగడగా ముందుకు తీసుకు వచ్చారా? అది తప్పుడు ఎత్తుగడా అన్నది పక్కన పెడితే వైసిపి కొత్త సమస్యలను కొని తెచ్చుకున్నది. మార్కుల భాషలో చెప్పుకోవాలంటే ఆ పార్టీ తన సిలబస్‌లో లేని అంశాలను తానే ముందుకు తెచ్చి తలెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, రాయలేక ఇబ్బందులకు గురి అవుతోంది. అందువలన దానికి అత్తెసరు తప్ప పెద్దగా మార్కులు రాలేదు. రాజధాని సమస్యపై రగడ సృష్టించిన మంత్రి బొత్స సత్యనారాయణకు, ఆయనను సమర్ధించిన పార్టీ వారిని చుట్టుముట్టిన ప్రశ్నలకు వుక్కిరి బిక్కిరై రాజధాని మారుస్తామని మేము చెప్పామా అంటున్నారు. అభివృద్ది మొత్తం ఒక్క రాజధాని ప్రాంతంలోనే చేస్తే ఎలా మిగతా ప్రాంతాలలో జరగనవసరం లేదా అనే ఎదురుదాడికి దిగారు. ఇక రాజధాని ప్రాంతంలో భూములు కొనుగోలులో అక్రమాలకు పాల్పడ్డారు అనే ఆరోపణ ఒక ప్రతిపక్ష పార్టీగా చేయటం వేరు. అధికారానికి వచ్చిన తరువాత కూడా అదే ఆరోపణలు చేస్తే ఫలితం లేదు. వాటిని నిగ్గుతేల్చాల్సిన బాధ్యత తమదే అని మర్చిపోరాదు. తగు సమయంలో బయట పెడతాం అంటే కుదరదు.

ప్రజాకర్షక సంక్షేమ పధకాలకు సంబంధించి తప్ప వైసిపి వద్ద అభివృద్ధి ఆలోచనలు లేదా పధకాలు గానీ లేవు. వర్షాధారిత రైతు మాదిరి ప్రయివేటు పెట్టుబడుల కోసం ఎదురు చూడటం తప్ప, ప్రభుత్వంగా పెట్టుబడులు పెట్టి వుపాధి కల్పించటానికి ఎలాంటి ఆలోచనా లేదు. చర్చల్లో నిలదీస్తే మా నాయకుడు త్వరలో వెల్లడిస్తారు అని చెప్పటం తప్ప మరొక మాట లేదు. దేశంలోనూ, ప్రపంచ వ్యాపితంగా ఆర్ధిక మాంద్యం సూచనలు కనిపిస్తున్న తరుణంలో ప్రధాని నరేంద్రమోడీ మౌన ముద్ర వహించినట్లుగానే మూలవిరాట్టు ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి రాజధాని గురించి, అన్ని ప్రాంతాల అభివృద్ధి గురించి ఇంతవరకు నోరు విప్పలేదు. వైసిపి వుత్స విగ్రహాలే మాట్లాడుతున్నాయి. రైతాంగానికి గిట్టుబాటు ధరలు, వ్యవసాయానికి ప్రోత్సాహం, నిరుద్యోగ యువతకు వుపాధి కలిగించకుండా ఎన్ని కబుర్లు చెప్పినా ఫలితం లేదు. సర్వరోగ నివారిణి జిందా తిలిస్మాత్‌ అన్నట్లుగా గ్రామ సచివాలయాల ఏర్పాటు గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వం చెబుతున్నట్లుగా గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా జనానికి 237 సేవలను అందిస్తామంటున్నారు. లక్ష్యం మంచిదే, ఇవి కార్యరూపం దాల్చితే తప్ప వాటి గురించి చెప్పలేము. అయితే ఇదే అభివృద్ధి, నాలుగు లక్షల మంది వలంటీర్లనియామకాన్ని నాలుగు లక్షల వుద్యోగాల కల్పనగా చిత్రిస్తే ఎదురు దెబ్బలు తగలటం ఖాయం.

ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు చలో ఆత్మకూరు పేరుతో తొలి ఆందోళనా యాత్రకు తెరతీశారు. గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలోని ముఠా కక్షలకు నిలయమైన గ్రామాల్లో అదొకటి. అక్కడ ఎక్కువ మంది జనాభా దళితులే. అయినా తెలుగుదేశం, వైసిపి పెత్తందార్ల మధ్య చీలిపోయి వున్నారు. పరస్పర దాడులు, కేసుల్లో బాధితులుగా కూడా వారే వుంటారు. గ్రామాల్లో ముఠా కక్షలకు ఎవరు తెరతీసినా, వాటిని ఎవరు కొనసాగించినా గర్హనీయమే. ఎక్కువ సందర్భాలలో ఎక్కడైనా బాధితులుగా వెనుకబడిన తరగతులు, దళితులే ఎక్కువగా వుంటారు. పెత్తందార్లు రెండు పార్టీల మద్దతుదార్లుగా మోహరించినపుడు ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ పెత్తందార్లదే ఆ గ్రామంలో పెత్తనం. వారికి అదొక ఆదాయ మార్గం కూడా, అందుకే అధికారం లేనపుడు పెట్టుబడులు పెడతారు, ముఠాలను నిర్వహిస్తారు. అధికారం రాగానే వడ్డీతో సహా రాబట్టుకుంటారు.

తమ చలో ఆత్మకూరు పిలుపును సాగనివ్వలేదని, మరోసారి అలాంటి ప్రయత్నం చేస్తామని చంద్రబాబుతో సహా తెలుగుదేశం నాయకత్వం గుండెలు బాదుకొని ప్రజాస్వామ్యం గురించి కడవల కొద్దీ కన్నీరు కార్చింది. నిజానికి వారికి నైతికంగా వున్న హక్కు వున్నదా ? తెలుగు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా వున్న సమయంలో అధికారికంగా, పార్టీగా తెలుగుదేశం కూడా ప్రతిపక్ష పార్టీలు ఇచ్చిన ప్రతి చలో పిలుపును పోలీసు యంత్రాంగంతో, పార్టీ పరంగా సాగకుండా చేసేందుకు చేయాల్సిందంతా చేశారు. అంతే కాదు, చంద్రబాబు ఎక్కడ పర్యటనకు పోతే అక్కడి సిపిఎం, సిపిఐ పార్టీలు, ఇతర ప్రజాసంఘాల నేతలను ముందుగానే అదుపులోకి తీసుకోవటం, దూర ప్రాంత పోలీసు స్టేషన్లకు తరలించటం అందరికీ తెలిసిన అంశమే. కొన్ని సందర్భాలలో వైసిపి నేతలను కూడా అక్కడక్కడా అలా ముందుస్తుగా నిర్బంధించిన వుదంతాలు కొన్ని లేకపోలేదు. అదే గుంటూరు జిల్లా పెద్ద గొట్టిపాడులో దళితులమీద జరిగిన దాడిని ఖండించేందుకు సిపిఎం, ఇతర పార్టీలు, సంస్ధలు ఇచ్చిన పిలుపును తెలుగుదేశం సర్కార్‌ సాగనివ్వలేదు. ప్రకాశం జిల్లా దేవరపల్లిలో దళితుల భూ సమస్య మీద కూడా అదే చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా గరికపర్రులో అంబేద్కర్‌ విగ్రహం, సామాజిక బహిష్కరణ వివాదంలో ఒక్క ఆగ్రామానికి రానివ్వకపోవటమే కాదు పది కిలోమీటర్ల దూరంలో వున్న భీమవరంలో కూడా నిరసన తెలిపేందుకు అవకాశం ఇవ్వలేదు. ఈ మూడూ దళితుల ప్రమేయం వున్న సామాజిక న్యాయ వుదంతాలు, ఆత్మకూరు మాదిరి పెత్తందార్ల ముఠాకక్షల సమస్య కాదు. మరొకటి పశ్చిమ గోదావరి జిల్లాలోని కాలుష్యకారక తుందుర్రు ఆక్వా ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా జరిగిన ఆందోళన సమయంలోనూ తప్పుడు కేసులు పెట్టి మహిళలతో సహా ఎందరినో జైలు పాలు చేసింది చంద్రబాబు సర్కార్‌. అక్కడ కూడా అంతే పరిసర పట్టణాల్లో కూడా నిరసన తెలిపేందుకు అవకాశం ఇవ్వలేదు. అలాంటి పార్టీ తమ పెత్తందార్లకు మద్దతుగా ఆత్మకూరు యాత్ర జరపాలని ప్రయత్నించింది. అంగన్‌ వాడీలు, ఆశావర్కర్లు,ఇతర అనేక చిరుద్యోగ సంఘాలు చలో అమరావతి పిలుపు ఇస్తే (వారేమీ సచివాలయం దగ్గరకు వెళ్లేందుకు కాదు) విజయవాడకు రాకుండా చేసేందుకు రైళ్లలో,బస్సులో బయలు దేరిన వారిని ఎక్కడికక్కడ దింపివేసి అడ్డుకున్న చరిత్రను చెరిపేస్తే చెరగదు. తాను రెండు కాళ్లతో నడుస్తూ వెళుతున్నా అడ్డగించారని అసెంబ్లీలో తెలుగుదేశం వుపనేత కె అచ్చన్నాయుడు వాపోయారు. ఆయన మంత్రిగా వున్న సమయంలో వివిధ చలో పిలుపులు ఇచ్చిన వారు కూడా కాలినడకనే వెళ్లేందుకు ప్రయత్నించారు. వారేమీ అనుమతి లేని ఆయుధాలు తీసుకొని రాలేదు. అంగన్‌ వాడీలు, ఆశాలు అందరూ మహిళలు కూడా. అధికారంలో వుంటే ఒక పాట ప్రతిపక్షంలో వుంటే మరొక పల్లవి.

Image result for ys jagan vs chandrababu naidu

అయితే చలో ఆత్మకూరు విషయంలో అధికార వైసిపి లేదా ప్రభుత్వ వైఖరిని ఎలా చూడాలి. పైన పేర్కొన్న పెదగొట్టిపాడు, గరికపర్రు, తుందుర్రు వుదంతాల్లో వైసిపి జనం తరఫున నిలబడేందుకు ముందుకు రాలేదు. గరికపర్రు దళితులను ఓదార్చాలనే ఆలోచనే జగన్‌కు రాలేదు. అంటే ఆ ప్రాంతాల్లో వున్న పెత్తందార్లు వారికి ముఖ్యంగా కనిపించారు తప్ప జనం కాదు. ఆత్మకూరు విషయంలో కూడా పెత్తందారీ పోకడలనే వైసిపి ప్రదర్శించింది. చంద్రబాబు నాయుడు వైసిపి బాధితుల శిబిరం పేరుతో గుంటూరులో హడావుడి చేస్తే, దానికి పోటీగా తెలుగుదేశం బాధితుల పేరుతో తాను కూడా సమీకరించింది. చలో ఆత్మకూరుకు పోటీగా తమ మద్దతుదార్లకు అనుకూలంగా పోటీగా అదే చలో ఆత్మకూరు పిలుపు ఇచ్చింది. ఒక అధికార పార్టీ ఇలా వ్యవహరించటం సమస్యను పరిష్కరించటంగాక తమ శిబిరాన్ని నిలబెట్టుకొనే యత్నం తప్ప మరొకటి కాదు. ఇలాంటి పార్టీ రేపు మరొక సామాజిక న్యాయ సమస్య మీదో, ప్రజాసమస్యల మీదో వామపక్షాలో, ప్రజా సంస్ధలో ఇచ్చిన పిలుపును కూడా సాగనిస్తారనే గ్యారంటీ లేదు. ఇప్పటికే అలాంటి కొన్ని సూచనలు వున్నాయి. తెలుగుదేశం చలో ఆత్మకూరు పిలుపు ఇచ్చేంత వరకు గుంటూరు శిబిరంలో వున్న ఆత్మకూరు, ఇతర గ్రామాల వారికి భరోసా కల్పించి వారిని గ్రామాలకు పంపించి తగు రక్షణ కల్పించేందుకు జిల్లా అధికార యంత్రాంగం ముందుకు రాలేదు. తీరా ఆందోళన రోజు ఆ పని చేసింది? అదే ముందు ఎందుకు చేయలేదు ? చంద్రబాబు హయాంలో అధికార యంత్రాంగం తెలుగుదేశం కనుసన్నలలో పని చేస్తే జగన్‌ ఏలుబడిలో వైసిపికి అనుకూలంగా వ్యవహరించనుందని ఈ వుదంతం వెల్లడించింది.

తెలుగుదేశం వైఖరిని సమర్ధించటమా, దెబ్బకు దెబ్బ, వారి పాఠం వారికే తిరిగి చెప్పారు అనుకుంటే పొరపాటు. గత ఐదేండ్ల చంద్రబాబు పాలనలో లెక్కలు తీస్తే ముందస్తు అరెస్టులు, నిరసనలను అడ్డుకోవటాలు ప్రధాన ప్రతిపక్షంగా వున్న వైసిపి పట్లకాదు, బలం పరిమితంగానే వున్నా, అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేకపోయినా ప్రజల సమస్యల మీద నిరంతరం పోరాడిన వామపక్షాలు, ప్రజాసంఘాలు, సామాన్య జనం మీదనే దాడిని ఎక్కు పెట్టారు. ఇది న్యాయమైన ప్రజాస్వామ్య లేదా ఆర్ధిక హక్కుల మీదనే దాడి అన్నది గ్రహించాలి. అందువలన గత ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటు వేసినా ఇలాంటి అప్రజాస్వామిక చర్యలకు ఏ ప్రభుత్వం పాల్పడినా ప్రశ్నించాలి. లేకపోతే అంతిమంగా నష్టపోయేది మనమే అని జనం గ్రహించాలి.

గమనిక : చంద్రబాబు నాయుడు 2004,2009లో రెండు సార్లు ప్రతిపక్ష నేతగా పదేండ్లు కొనసాగటాన్ని ఒక విడతగా, తాజాగా నిర్వహిస్తున్న పాత్రను రెండోదిగా పరిగణించి ఈ విశ్లేషణలో రెండుసార్లు అని పేర్కొన్నాను. సాంకేతికంగా చూస్తే మూడవ సారి, అందువలన ఆ మేరకు శీర్షికను, విశ్లేషణ అంశంలో ఆ మేరకు సవరించాను.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

తెలుగుదేశం మీద బిజెపి మెరుపుదాడి: నలుగురు ఎంపీల పట్టివేత !

21 Friday Jun 2019

Posted by raomk in AP, AP NEWS, BJP, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Telangana, Telugu

≈ Leave a comment

Tags

BJP, bjp surgical strike on tdp, CHANDRABABU, Defections from TDP, tdp

Image result for bjp surgical strike on tdp four mps captured

ఎం కోటేశ్వరరావు

బాలకోట్‌ మీద రాత్రిపూట జరిపిన మెరుపుదాడిలో ఎందరు వుగ్రవాదులను మట్టుబెట్టారో చెప్పలేరు గానీ, పట్టపగలు అందరి ఎదుటే గురువారం సాయంత్రం తెలుగుదేశం మీద జరిపిన మెరుపుదాడిలో బిజెపి నలుగురు రాజ్యసభ సభ్యులను చేజిక్కించుకుంది. ఇరవై నాలుగు గంటలు కూడా గడవక ముందే రాజ్యసభ అధ్యక్షుడు వెంకయ్య నాయుడు విలీనాన్ని ఆమోదించటం, బిజెపి తన సభ్యుల జాబితాలో నలుగురు సభ్యులైన వై సుజనా చౌదరి, సిఎం రమేష్‌, టిజి వెంకటేష్‌, గరికపాటి మోహనరావు పేర్లను చేర్చటం జరిగిపోయాయి. రాబోయే రోజుల్లో ఇతర రాష్ట్రాల్లో కూడా అలాంటి దాడులకే సన్నద్దం అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. గురువారం నాడు పార్లమెంట్‌లో రాష్ట్రపతి ప్రసంగం తరువాత వెంటవెంటనే జరిగిన పరిణామాల్లో వూహకు అందని రీతిలో పనికానిచ్చి తమ తీరే వేరని బిజెపి నిరూపించుకుంది. వీరితో పాటు మరి కొందరు ఎంపీలు, ఎంఎల్‌ఏల కోసం కూడా బిజెపి మాటువేసిందని వార్తలు కొద్ది రోజుల క్రితమే వచ్చినప్పటికీ మరీ ఇంత త్వరలో పని పూర్తి చేస్తారని వూహించి వుండరు. ఒక నిర్ణయం జరిగిన తరువాత నలుగురి నోళ్లలో నానటం ఎందుకు వచ్చే చెడ్డపేరు ఎలాగూ వస్తుంది, ఈ మాత్రం దానికి సిగ్గు ఎందుకు అన్నట్లుగా జరిపించేశారు. కాంగ్రెస్‌ పార్టీ అన్ని రకాల అక్రమాలకు, అత్యవసర పరిస్ధితి వంటి ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలకు పాల్పడటానికి మూడు దశాబ్దాలు పడితే పూవు పుట్టగానే పరిమళించినట్లుగా వాటిలో ఒకటైన ఫిరాయింపుల ప్రోత్సాహం, కేంద్ర దర్యాప్తు సంస్ధలను వుపయోగించుకొని బెదిరించటానికి రెండవసారి సంపూర్ణ మెజారిటీతో అధికారానికి వచ్చిన నాటి నుంచి బిజెపి ప్రారంభించి తమది భిన్నమైన పార్టీ అని నిజంగానే నిరూపించుకుంది.

తమ నేత చంద్రబాబు నాయుడు విదేశాలకు వెళ్లటాన్ని చూసి నలుగురు రాజ్యసభ సభ్యులు పార్టీ ఫిరాయించారని తెలుగుదేశం నేతలు కార్యకర్తల్లో మనోభావాన్ని రెచ్చగొట్టేందుకు, ఒక సాకును చొప్పించేందుకు ప్రయత్నించారు. ఫిరాయించే వారు అధినేత వుంటే కాళ్లకు మొక్కి ఆశీస్సులు తీసుకొని సకల లాంఛనాలతో పోతారా ? అదే ప్రమాణం అనుకుంటే వైస్రాయ్‌ వుదంతాలలో ఎన్‌టిఆర్‌కు తెలుగు తమ్ముళ్లు ఇచ్చిన గౌరవం ఏమిటో యావత్‌ దేశం సచిత్రంగా చూసింది. ఎవరూ ఎన్‌టిఆర్‌ ఆశీస్సులు తీసుకోలేదు, ఆయన వుండగానే తిరుగుబాటు చేశారు కదా ! పార్టీ ఎంపీలు, మరికొందరు నేతలు ఏక్షణంలో అయినా పార్టీ మారేందుకు సిద్ధంగా వున్నారని వార్తలు వచ్చినప్పటికీ పార్టీని కాపాడుకోవటానికి ప్రయత్నించకుండా చంద్రబాబు నాయుడు విదేశాలకు విహారయాత్రలకు వెళ్లటం ఏమిటి? అన్న ప్రశ్నకు సమాధానం వుండదు. తమ సభ్యుల పట్ల మితిమీరిన విశ్వాసమా ?

ఒకటి స్పష్టమైంది. కేంద్ర ప్రభుత్వ సిబిఐ, ఇడి అనే వేట సంస్ధల వేటు నుంచి తప్పించుకోవటానికి వ్యాపారులందరూ కేంద్రంలో, రాష్ట్రాలలో వారికి మిత్రపక్షాలుగా ఎవరు అధికారంలో వుంటే వారితో సయోధ్యగా వుండటమో లేక జతకట్టటమో చేస్తుంటారు. అది గత ఎన్నికల్లోనే వైసిపి ఎంపీల విషయంలో రుజువైంది. ప్రత్యర్ధుల ఆర్ధిక మూలాలను దెబ్బతీసి లొంగదీసుకొనేందుకు అసమర్ధ కాంగ్రెస్‌కు ఐదు దశాబ్దాలు పడితే సమర్ధ బిజెపి కేవలం ఐదు సంవత్సరాలలోనే ఆ విజయాన్ని సాధించింది. సమావేశం లేదు, తీర్మానాలు లేవు, సుజనా చౌదరి బహిరంగంగా చెప్పినట్లు నలుగురూ ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకోలేదు కూడా. ఫిరాయించిన ఎంపీలు అనర్హత వేటును తప్పించుకొనేందుకు పార్టీని విలీనం చేసినట్లు అవసరమైన పత్రాలను తయారు చేయటం, దాన్ని ఏకంగా రాజ్యసభ అధ్యక్షుడు, వుపరాష్ట్రపతి వెంకయ్య నాయుడికి అందచేయటం అంతా నాటకీయంగా జరిగిపోయాయి. రాజకీయ నీతులు చెప్పే వెంకయ్య నాయుడు వారి పత్రాన్ని స్వీకరిస్తూ ఫొటోలకు ఇచ్చిన ఫోజును చూసి ఏమనుకోవాలో జనానికే వదలివేద్దాం. రానున్న రోజుల్లో మిగిలిన తెలుగుదేశం ఎంపీల్లో ఎందరు మిగులుతారనేది శేష ప్రశ్న. ఎంపీల ఫిరాయింపు తెలుగుదేశం ఎంఎల్‌ఏల ఫిరాయింపులను వేగవంతం చేసిందనే వార్తలు వచ్చాయి. తమ నేత విదేశాల నుంచి వచ్చేంతవరకు ఆగుతారా లేక వచ్చిన తరువాతే తాము ఫిరాయిస్తే ఏం చేస్తారో చూస్తాం అంటూ వేచి చూస్తారా అన్నది చూడాలి. జరగనున్నది జరగక మానదు, ముందుగా నిర్ణయించుకున్న యాత్ర పూర్తి చేసి కనీసం కుటుంబసభ్యులనైనా సంతోష పెడితే మంచిదేమో చంద్రబాబు ఆలోచించుకోవాలి.అదే నేను ఇక్కడ వుంటేనా అని చెప్పుకొనేందుకైనా అక్కడే వుండి అంతా పూర్తయిన తరువాత తిరిగి వస్తే కాస్త పరువు దక్కుతుంది. ఫేక్‌ ప్రచారాలను చేయించటంలో తెలుగుదేశంతో సహా ఏ ఒక్క పార్టీ తక్కువ తినలేదు. ఇప్పుడు స్వయంగా తెలుగుదేశం నేత, వారి రాజగురువు రామోజీరావు, ఇతర కుల పెద్దలే ఎంపీలను బిజెపిలోకి పంపారనే సామాజిక మాధ్య ప్రచారానికి వారే సమాధానం చెప్పుకోవాలి.

బిజెపి విషయానికి వస్తే ఆ పార్టీలో మత విద్వేషాలను రెచ్చగొట్టేవారు, గో సంరక్షణ పేరుతో దాడులు చేసే వారు, ఇతర అవాంఛనీయ శక్తులు పుష్కలంగా వున్నాయి. ఇతర పార్టీల నుంచి అవినీతి, అక్రమాల ముద్రపడిన వారు, పార్టీకి పెట్టుబడులు పెట్టగలిగిన వారు కొన్ని రాష్ట్రాలలో దానికి కొరతగా వున్నందున దాన్ని పూడ్చుకొనేందుకు ఎంతగా ఆత్రత పడుతోందో తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌ పరిణామాలు వెల్లడిస్తున్నాయి. తాము అవినీతి ఆరోపణలు చేసిన వారు, తమపై రాజకీయంగా దాడి చేసిన వారిని ఇప్పుడు బిజెపి చేర్చుకుంది. గతంలో సిబిఐ, ఇడి దాడులకు, బిజెపి ఆరోపణలకు గురైన వారిని తెలుగుదేశం పార్టీ సమర్ధించింది. ఇదే అదే పార్టీ వారు ఎంపీలు స్వార్ధ ప్రయోజనాల కోసం పార్టీని వీడారని చెబుతున్నారు, వారివి నాలికలా మరొకటా అన్న అనుమానం వస్తోంది. బిజెపి నేతలకు కూడా ఇదే వర్తిస్తుంది. ఆయారామ్‌ గయారామ్‌ టిజి వెంకటేష్‌ ఏ ప్రయోజనం కోసం తెలుగుదేశం పార్టీలో చేరారో అదే ప్రయోజనం కోసం బిజెపి పంచన చేరారు. మిగిలిన ముగ్గురిదీ అదే దారి.

Image result for bjp surgical strike on tdp four mps captured

కేసులు, ఆరోపణలు వున్నంత మాత్రాన నిర్ధారణ అయ్యేంత వరకు ఎంపీలు నేరం చేసినట్లు కాదని అందువలన తెలుగుదేశం ఎంపీలను తమ పార్టీలో చేర్చుకోవటం తప్పుకాదని బిజెపి నేతలు కుంటిసాకు చెబుతున్నారు. గతంలో డేరాబాబా, ఆశారాంబాపు వంటి నేరగాండ్ల గురించి కూడా బిజెపి నేతలు ఇదే వాదనలు చేసి వారితో అంటకాగిన విషయం తెలిసిందే. బిజెపి ఇలాంటి నేర చరిత్ర, కేసులు వున్నవారిని ఇదే వాదనలతో పెద్ద సంఖ్యలో అభ్యర్ధులుగా నిలిపి మద్దతు పలికింది, తర తమ స్ధాయిలో మిగతా పార్టీలు కూడా అదే బాట పట్టాయి. గతంలో పార్టీల నేతలు తాము ఎంత పరిశుద్ధమో చెప్పుకొనేందుకు తమ రక్తాల గురించి చెప్పేవారు. ఇప్పుడు తెలుగుదేశం లేదా బిజెపి, కాంగ్రెస్‌, టిఆర్‌ఎస్‌ ఇలా ఏ పార్టీని చూసినా వాటి రక్తాలన్నీ లుషితమే. జన్యువుల్లోనే మార్పులు జరిగాయి. కనుకనే ఏ పార్టీ నుంచి ఎవరు చేరినా వారిని తమలో ఇముడ్చుకోవటానికి వాటికి ఎలాంటి ఇబ్బంది కలగటం లేదు. ఎన్నికల ముందు, నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన తరువాత కూడా ఫిరాయింపుదార్లను చేర్చుకుంటున్నపుడు వారు ఎన్నికలైన తరువాత ప్రమాణస్వీకారం కూడా చేయకముందే వేరే పార్టీ వైపు చూస్తే, ఫిరాయిస్తే తప్పు పట్టాల్సిన పనేముంది? నీవు నేర్పిన విద్యయే కదా ! అసలు తప్పు ఎవరిది అని చెప్పాల్సి వస్తే అలాంటి వారిని గుడ్డిగా ఎన్నుకుంటున్న జనానిదే అనక తప్పదు. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం నేతలను బిజెపిలో చేర్చుకోవటం అంటే త్వరలోనే వైసిపి మీద రాజకీయ దాడికి నాందిపలకటమే అన్నది ఒక అభిప్రాయం.అదే జరిగితే జగన్‌, ఇతరుల మీద వున్న కేసులను, తెలుగుదేశం నుంచి కాషాయ తీర్ధం పుచ్చుకున్న నేతల దాడిని వైసిపి ఎలా ఎదుర్కొంటుంది అనేదే ఆసక్తికరం. గతంలో ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం, ఇప్పుడు తెలంగాణాలో తెరాస మాదిరి ప్రతిపక్ష ప్రజాప్రతినిధుల ఆర్ధిక మూలాలను దెబ్బతీసేందుకు తెలుగుదేశం ఫిరాయింపుదార్ల పట్ల, బిజెపినేతల పట్ల వైసిపి వ్యవహరిస్తే కేంద్రం తన వద్ద వున్న పెద్ద కత్తిని వైసిపి మెడమీద ప్రయోగించటానికి వెనుకాడదు. ఇదొక ప్రత్యేక పరిస్ధితి అనవచ్చు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ ప్రసంగం 2 – జగన్‌ నవరత్నాలు జిందా తిలిస్మాత్‌ కాదు !

19 Wednesday Jun 2019

Posted by raomk in AP NEWS, Current Affairs, History, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

AP Agriculture, AP Governor Speech, CHANDRABABU, CM YS Jagan, Jaythi Ghosh Committe, Navarthnalu, Ycp, YS jagan, ys jagan vs chandrababu

Image result for YS Jagan Navaratnalu

ఎం కోటేశ్వరరావు

వైఎస్‌ జగన్‌ నవరత్నాలతో ఎవరికీ పేచీ లేదు. అసలేమీ లేనిదాని కంటే ఎంతో కొంత ఏదో ఒక రూపంలో జనానికి ప్రభుత్వం నుంచి సంక్షేమం రూపంలో అందటం మంచిదే. సంక్షేమ పధకాల గురించి యండమూరి వీరేంద్రనాధ్‌ వంటి పేరు మోసిన రచయితల మొదలు, సామాజిక మాధ్యమాల్లో ఎలాంటి విమర్శలు చేశారో, ఎంత చులకనగా వ్యాఖ్యానిస్తున్నారో తెలిసిందే. అవన్నీ బడుగు, బలహీన వర్గాల గురించే అన్నది వేరే చెప్పనవసరం లేదు. వారు వినియోగిస్తున్న వస్తువులు, సేవలకు మిగతావారితో పాటు జిఎస్‌టి చెల్లిస్తున్నారు. విదేశీ, స్వదేశీ విమానాలకు సరఫరా చేసే ఇంధనానికి ఇచ్చే రాయితీలకు చెల్లిస్తున్న సొమ్ములో సామాన్యుల వాటా వుంది. విదేశాల నుంచి ధనికులు దిగుమతి చేసుకొనే సౌందర్యసాధనాలకు, చివరికి దోసకాయలు, యాపిల్‌ పండ్లకు, బంగారానికి, నగలు, వజ్ర వైఢూర్యాలకు, విదేశీ మద్యం వంటి వాటికి ప్రభుత్వాలు కేటాయిస్తున్న విలువైన విదేశీ మారకద్రవ్యంలో కూడా పేదల వాటా వుందని తెలుసా? కనుక పేదలు ప్రభుత్వం నుంచి సంక్షేమ పధకాలను అందుకోవటానికి సంకోచించనవసరం లేదు గానీ వారు చేయనితప్పుకు అవమానాలు పడాల్సిన అవసరం వుందా అన్నది సమస్య. వారు సంక్షేమం పేరుతో తీసుకున్న మొత్తాలతో తిరిగి సరకుల కొనుగోలు, సేవలకే కదా వెచ్చిస్తున్నది. అంటే తిరిగి ప్రభుత్వాలకు, పారిశ్రామిక, వాణిజ్య సంస్ధలకు చెల్లిస్తున్నారు. ఆ విధంగా వస్తు, సేవల డిమాండ్‌ను పెంచటానికే తోడ్పడుతున్నారు తప్ప విదేశీ బ్యాంకుల్లో ఆ సొమ్మును దాచుకోవటం లేదు.

ప్రభుత్వ వుద్యోగులు, టీచర్లకు 27శాతం మధ్యంతర భృతి ప్రకటించటం హర్షణీయమే, వారికి ఐదు సంవత్సరాల క్రితం 47శాతం వేతనాలు పెంచారు. ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి వేతన పెంపుదల చేస్తున్నందున మరోసారి వేతన పెంపుదల బకాయి వుంది, దాన్ని ఖరారు చేసే లోగా మధ్యంతర భృతి చెల్లించటం హర్షణీయమే. చంద్రబాబు వాగ్దానం చేసినదాని కంటే ఎక్కువే ఇస్తామనటం మంచిదే. వైఎస్‌ జగన్‌ గత తొమ్మిది సంవత్సరాలుగా ఏదో ఒక పేరుతో జనంలో వున్నారు. యాత్రలు చేశారు, జనం సమస్యలు తెలుసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కోటిన్నర మంది వరకు అసంఘటిత రంగ కార్మికులు వున్నారని అంచనా. వారిలో ఏ ఒక్కరూ, ఏ గ్రామం లేదా పట్టణంలోగానీ, లేదా వైసిపి కార్మిక నేతలు గానీ వారి వేతనాల పెంపుదల గురించి ఎలాంటి వినతి పత్రాలు ఇవ్వలేదా అన్నది ఒక ముఖ్యాంశం. ఇవ్వలేదు అనేందుకు ఆస్కారం లేదు. గవర్నర్‌ ప్రసంగంలో ఎక్కడా వారి సమస్యల ప్రస్తావన లేదు. ఎందుకన్నది ప్రభుత్వంతో పాటు జనం గూడా ఆలోచించాలి. ఎన్నికల మధ్యలో అంటే ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ముగిసిన తరువాత 2019ఏప్రిల్‌ 16న రాష్ట్ర కార్మిక శాఖ ఒక గజెట్‌ నోటిఫికేషన్‌ ప్రకటించింది. దానిలో అసంఘటితరంగ కార్మికులకు చెల్లించాల్సిన కరువు భత్యం గురించి పేర్కొన్నది. దాని వివరాల్లోకి వెళితే 2014 తరువాత ఎవరికీ వేతనాలను సవరించలేదు. 2006 నుంచి సవరించని వారు వున్నారు. ఎక్కువ తరగతులకు 2006-2009 మధ్య సవరించిన వేతనాలే ఇప్పటికీ అమలు జరుగుతున్నాయని వైసిపి నాయకులకు, గవర్నర్‌ ప్రసంగం రాసిన సీనియర్‌ అధికారులకు తెలియనిదా ? అంటే చివరి తరగతిని తీసుకుంటే పదమూడు సంవత్సరాలుగా ఒకే వేతనం తీసుకుంటూ, దాని మీద కరువు భత్యం పొందుతున్నారని అనుకోవాలి. నిజంగా ఎన్ని యాజమాన్యాలు కరువు భత్యం చెల్లిస్తున్నాయన్నది పెద్ద బేతాళ సందేహం.

Image result for YS Jagan Navaratnalu

వుదాహరణకు పబ్లిక్‌ మోటార్స్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్మికులకు 2006 డిసెంబరు నాలుగవ తేదీన నిర్ణయించిన వేతనాలలో అనాటికి వున్న కరువు భత్యం 502 పాయింట్లను కలిపి నిర్ణయించారు. అప్పటి నుంచి ఇప్పటికి కరువు భత్యం పాయింట్లు 1306కు పెరిగాయి. అంటే మూలవేతనంలో పదమూడు సంవత్సరాలుగా ఎలాంటి పెరుగుదల లేకుండా 502 పాయింట్లు పోను మిగిలి ఒక్కో పాయింట్‌కు ఆరున్నర రూపాయల చొప్పున 804 పాయింట్లకు, మూలవేతాన్ని కలిపి చెల్లిస్తారు. మన ఇండ్లకు గ్యాస్‌ సిలిండర్లను తీసుకు వచ్చే వారికి మొదటి జోన్‌లో 3,700, రెండవ జోన్‌లో 3,370 రూపాయల వేతనాన్ని 2007 డిసెంబరు 19న 525పాయింట్ల కరువు భత్యాన్ని విలీనం చేసి నిర్ణయించారు. ఇప్పుడు మోటార్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్మికులకు రూ 5,226, గ్యాస్‌ సిలిండర్‌ తెచ్చే వారికి రూ.5,076 కరువు భత్యం మొత్తాన్ని మూలవేతనానికి కలిపి చెల్లించాలి.అసలు కంటే కరువు భత్యం అధికం. ఇది ఏ విధంగా సమర్ధనీయం. ప్రభుత్వ సిబ్బందికి ఒక న్యాయం అసంఘటిత రంగ కార్మికులకు ఒక న్యాయమా? ప్రభుత్వం అంటే ప్రజల పక్షమా, యజమానుల పక్షమా ? ఈ విషయాలను జగన్‌ పట్టించుకోరా? ప్రభుత్వ వుద్యోగులకు వేతన సవరణ చేసినపుడు డిఏను కలిపి మూలవేతనం మీద కొంతశాతం పెంచి కొత్తవేతనాలను నిర్ణయిస్తారు. అసంఘటిత రంగ కార్మికులకు పదమూడేండ్లు అంటే ఇప్పటికి రెండుసార్లు మూలవేతనం పెంచాల్సి వుండగా ఒక్కసారి కూడా పెంచలేదు. ఇది సామాజిక న్యాయమా? అన్యాయమా ? ఇంత పెద్ద సంఖ్యలో వున్న వారి సమస్య ప్రభుత్వ విధానాన్ని తెలిపే ప్రసంగంలో చోటు చేసుకోలేదంటే కావాలని విస్మరించినట్లా, నవరత్నాలే జిందా తిలిస్మాత్‌ కాదని గ్రహించాలి.

ఆశావర్కర్లకు నెలవేతనాన్ని మూడు నుంచి ఒక్కసారిగా పదివేలకు పెంచినట్లు ముఖ్యమంత్రి జగన్‌ ప్రకటించారు. అనేక మందికి ఇంత వుదారమా అనిపించింది. ఇది వేతనమా లేక ప్రోత్సాహకాలతో కలిపి ఇచ్చే మొత్తమా ? ప్రస్తుతం వున్న విధానం ప్రకారం మూడువేల రూపాయల వేతనానికి తోడు చేసిన పనిని బట్టి ప్రోత్సాహకాలను జత చేసి రూ.8,600 వరకు చెల్లిస్తామని గత పాలకులు వాగ్దానం చేశారు. ఆచరణలో గరిష్ట ప్రోత్సాహకాన్ని మూడువేల రూపాయలకు పరిమితం చేశారు. అంటే అంతకంటే తక్కువ పని చేస్తే కోత పెడతారు, ఎంత ఎక్కువ చేసినా ఇచ్చేది పెంచరు. దీని వలన అత్యధిక ఆశావర్కర్లకు ఇప్పుడు అన్నీ కలిపి నాలుగున్నర-ఐదున్నరవేల మధ్య వస్తుండగా ఒక పదిశాతం మందికి గరిష్టంగా ఆరువేలు వస్తున్నాయని ఆశా సంఘాలు చెబుతున్నాయి. ఆశావర్కర్లకు చెల్లించే పారితోషికంలో 60శాతం కేంద్రం, నలభైశాతం రాష్ట్రం చెల్లిస్తున్నాయి. ఈ పారితోషికాల మొత్తాన్ని ఇటీవల పెంచింది. అయితే అవి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఇస్తున్న మొత్తం కంటే తక్కువే కనుక కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి అదనంగా కొంత సొమ్ము జమ అవుతుంది తప్ప ఆశావర్కర్లకు ఒరిగేది, పెరిగేదేమీ వుండదు. జగన్‌ ప్రకటించినది వేతనమే అనుకుంటే పదివేలు, దానికి ప్రోత్సాహంగా మూడువేలు, సీలింగ్‌ను ఎత్తివేస్తే అంతకంటే ఎక్కువ వస్తాయి, అలా జరిగితే అభినందనీయమే, అలాగాక కిరికిరి చేసి అన్నీ కలిపి పదివేలే అని అన్యాయం చేస్తే పరిస్ధితి ఏమిటి?

వ్యవసాయ రంగం ప్రధానంగా వున్న రాష్ట్ర ఆర్ధిక వ్యవస్ధ గురించి ఇంతకు ముందు చెప్పుకున్నాం. గతంలో రాజన్న రాజ్యంలో వ్యవసాయ విస్తరణ సిబ్బంది నియామకం గాకుండా ఆదర్శరైతుల పేరుతో కాంగ్రెస్‌ కార్యకర్తలను ఎంపిక చేశారు. వారిలో వ్యవసాయం తెలియని వారు, మానుకున్నవారు కూడా వున్నారు. నియమించిన తరువాత వారు కాంగ్రెస్‌ సేవకులుగా మారారు తప్ప రైతులకు అందించిన సేవల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ప్రభుత్వం ఏటా వారికి 28 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఇలాంటి జిమ్మిక్కులన్నీ సేవలను అందించే బాధ్యతల నుంచి ప్రభుత్వాలు తప్పుకోవాలని, పొరుగుసేవల ద్వారా వాటిని అందించాలని ప్రపంచబ్యాంకు మన మీద రుద్దిన ఆదేశాల ఫలితమే. రైతు భరోసా పేరుతో ఏటా ప్రతి రైతు కుటుంబానికి రు.12,500 చెల్లించాలని జగన్‌ నిర్ణయించటం హర్షణీయమే. ఈ మొత్తం కేంద్రం ప్రకటించిన ఆరువేలకు అదనమా అది పోను మరో ఆరున్నరవేలు ఇస్తారా ? స్పష్టత ఇవ్వాలి.

కాంప్లెక్స్‌ ఎరువుల ధరలపై సబ్సిడీ మొత్తాలను గణనీయంగా తగ్గించిన కారణంగా రైతులు వాటిని కొనలేక సబ్సిడీ వున్న యూరియాను అవసరానికి మించి వాడుతున్నారని, అది భూ ఆరోగ్యానికి హానికరమని శాస్త్రవేత్తలు మొత్తుకుంటున్నారు.ఎరువుల ధరల పెరుగుదల,సబ్సిడీ గణనీయంగా తగ్గింపు కారణంగా 2010లో 41లక్షల టన్నులుగా వున్న వినియోగం 2017 నాటికి 32లక్షల టన్నులకు పడిపోయింది. సగటు వాడకం కూడా బాగా తగ్గింది. ఎరువుల సబ్సిడీ నామమాత్రం అవుతున్న కారణంగా రైతులపై ఏటా పడుతున్న అదనపు భారాలను రైతు భరోసా పధకం పూడ్చుతుందని అనుకుందాం. మరి గిట్టుబాటు ధరల మాటేమిటి? కనీస మద్దతు ధరలకంటే మార్కెట్లో ధరలు పడిపోయినపుడు రైతులను ఆదుకొనే మార్గాలేమిటి? ఇలాంటి సమస్యలు అనేక వున్నాయి. వాటి గురించి రైతులు, నిపుణులు, రైతు సంఘాలతో సమగ్ర చర్చలు జరిపితే ప్రయోజనం వుంటుంది. అలాగాక చంద్రబాబు నాయుడి మాదిరి సహజ వ్యవసాయం పేరుతో కాలక్షేపం చేయటం వలన ప్రజాధనం దండగ తప్ప రైతులకు ఒరిగేదేమీ వుండదు. అనేక పంటల దిగుబడులు అంతర్జాతీయ పరిస్ధితితో పోల్చితే మన దేశంలో, ఆంధ్రప్రదేశ్‌లో కూడా బాగా తక్కువగా వున్నాయి. పప్పుధాన్యాల సగటు దిగుబడులు ఏడాదికేడాది పెరగాల్సింది పోయి తగ్గుతున్నాయి. వ్యవసాయం గిట్టుబాటు కాక పోవటానికి ఇది కూడా ఒక కారణం.

2014-17 మథ్య మినుముల దిగుబడి హెక్టారుకు(రెండున్నర ఎకరాలు) 946 కిలోల నుంచి 920కు పడిపోగా నాలుగేండ్ల సగటు 856 కిలోలుగా వుంది.పెసల దిగుబడి ఇదే కాలంలో 825 నుంచి 662కు పడిపోగా సగటు దిగుబడి 656 కిలోలు. కందుల విషయానికి వస్తే 503 నుంచి 430కి పడిపోయింది. నాలుగేండ్ల సగటు 478కిలోలు, శనగల దిగుబడి 1143 నుంచి 1132కు తగ్గిపోగా నాలుగేండ్ల సగటు 1074 కిలోలు. ఇక పత్తి సంగతి చూస్తే 588 నుంచి 549కి తగ్గిపోయింది, నాలుగేండ్ల సగటు 545కిలోలు. వీటి తీరుతెన్నులను చూస్తే ప్రకృతి అనుకూలతలు, ప్రతికూలతల మీద రైతులు ఆధారపడటం తప్ప దిగుబడులను పెంచేందుకు ప్రభుత్వ కృషి కనిపించదు. ప్రధాన ఆహార పంటల విషయానికి వస్తే ధాన్య దిగుబడి 3022 నుంచి 3815కిలోలకు పెరిగింది. నాలుగేండ్ల సగటు 3460కిలోలు. చంద్రబాబు నాయుడు తొలిసారి అధికారంలో వున్నంత కాలం ఇజ్రాయెల్‌ వ్యవసాయమని, గత ఐదేండ్లు పాలేకర్‌ సహజ సాగు అంటూ కాలక్షేపం చేశారు.

Image result for YS Jagan Navaratnalu

2004లో వైఎస్‌ రాజశేఖరరెడ్డి తొలిసారి అధికారంలోకి రాగానే ప్రముఖ ఆర్ధికవేత్త జయతిఘోష్‌తో ఒక కమిషన్‌ వేసి వ్యవసాయ రంగం మీద సిఫార్సులను తీసుకున్నారు. అనేక కమిషన్లకు పట్టిన దుమ్ము మాదిరే దానికీ పట్టింది.ఆ కమిషన్‌ సిఫార్సులలో అనేక మౌలిక అంశాలున్నాయి. వాటిని రాజశేఖరరెడ్డి, తరువాత ఆయనవారసులుగా వచ్చిన కాంగ్రెస్‌ ముఖ్యమంత్రులు గానీ, గత ఐదు సంవత్సరాలు అధికారంలో వున్న చంద్రబాబు నాయుడు గానీ పట్టించుకున్న దాఖలాలు లేవు. వ్యవసాయ రంగంలో నెలకొన్న సంక్షోభ పూర్వరంగంలో వైఎస్‌ జగన్‌ ఆ కమిషన్‌ సిఫార్సులను తిరిగి పరిశీలిస్తారా ? ప్రముఖ జర్నలిస్టు పి శాయినాధ్‌ను రైతాంగ కమిషన్‌లో పనిచేయవలసిందిగా జగన్‌ ఆహ్వానించినట్లు, కమిషన్ల సిఫార్సులను అమలు జరుపుతారనే విశ్వాసం తనకు లేదంటూ శాయినాధ్‌ సున్నితంగా తిరస్కరించినట్లు, కమిషన్‌ కాదు, కార్యక్రమానికి తోడ్పడమని జగన్‌ కోరినట్లు వార్తలు వచ్చాయి. అలాంటి వారి సలహాలను తీసుకోవాలని ప్రయత్నించటం మంచిదే. అయితే జయతీ ఘోష్‌ సిఫార్సుల అమలు తీరుతెన్నులను చూసిన తరువాత మరొకరెవరూ అలాంటి వృధా ప్రయాసకు పూనుకోరు. పదిహేను సంవత్సరాల నాటి పరిస్ధితుల మీద జయతీఘోష్‌ చేసిన సిఫార్సులు, వుమ్మడి రాష్ట్రానికి చెందినవి కనుక కొన్ని ఆంధ్రప్రదేశ్‌ వర్తమానానికి వర్తించకపోవచ్చు. కానీ వ్యవసాయ విస్తరణ సిబ్బంది నియామకం, వ్యవసాయానికి అవసరమైన వాటన్నింటినీ సరఫరా బాధ్యతను ప్రభుత్వమే చేెపట్టాలనేటువంటి సిఫార్సులు వున్నాయి, వాటికి కాలదోషం పట్టదు. రాజన్న రాజ్యం తిరిగి తీసుకువస్తామని చెబుతున్నవారు, ఆ రాజన్న ప్రభుత్వం నియమించిన కమిషన్‌ సిఫార్సులు, పరిస్ధితులను అధ్యయనం చేసి పనికి వచ్చేవాటిని అమలు జరుపుతారా? చంద్రబాబు మాదిరి మభ్యపెట్టి కాలం గడుపుతారా ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ ప్రసంగం 1: జగన్‌ సర్కార్‌ విస్మరించిందేమిటి? చేయాల్సిందేమిటి?

16 Sunday Jun 2019

Posted by raomk in AP, BJP, Current Affairs, Farmers, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Telugu

≈ Leave a comment

Tags

AP Governor Speech, CHANDRABABU, CM YS Jagan, Narendra Modi 2.0, YS jagan, ys jagan vs chandrababu

https://s3.ap-south-1.amazonaws.com/hansindia-bucket/2975_YS-jagan-Mohan-Reddy.jpg

ఎం కోటేశ్వరరావు

ఎన్నికలు ముగిశాయి, మంత్రివర్గ ముచ్చట కూడా తీరింది. మరో అయిదు సంవత్సరాల వరకు ఢోకాలేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో వైసిపి సీట్లు తెచ్చుకుంది. రాజకీయాల్లో ఈక్షణంలో మిత్రులుగా వున్న వారు మరుక్షణం శత్రువులౌతుండటాన్ని చూస్తున్నాం, అందువలన ఆంధ్రప్రదేశ్‌లో ఈ స్ధిరత్వం కేంద్రంలోని బిజెపి నాయకత్వం వైసిపిని మింగేయనంత వరకే అని గుర్తు పెట్టుకోవాలి.శుభం పలకవయ్యా అంటే ఈ జోశ్యం ఏమిటి అని ఎవరికైనా కాస్త కటువుగా అనిపించవచ్చు.” ప్రత్యేక హోదా మాత్రమే రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని కొంతమేర పూడ్చగలదు. ప్రత్యేక హోదా వల్ల మాకు గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌గా వచ్చే మొత్తం పెరుగుతుంది. దానికి తోడు పారిశ్రామిక రాయితీలు, పన్ను రాయితీలు ఇతర మినహాయింపులు, జీఎస్టీ ఇతర అంశాల్లో పెట్టుబడిదార్లకు ప్రోత్సాహకాన్ని ఇస్తాయి. తద్వారా ఉద్యోగ కల్పన పెరిగి నిరుద్యోగ సమస్యను పరిష్కరించే అవకాశం ఏర్పడుతుంది. ప్రత్యేక హోదా ద్వారానే మా రాష్ట్రానికి సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులు, స్టార్‌ హోటళ్లు, పరిశ్రమలు, సేవా రంగాల అభివ అద్ధి జరుగుతుంది.ఇందుమూలంగా మనవి చేయునది ఏమనగా. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు పార్లమెంట్‌ ఇచ్చిన వాగ్దానాన్ని నెరవెర్చే ఉదార స్వభావం చూపాల్సిందిగా ప్రధానిని కోరుకుంటున్నాను’ అని సీఎం వైఎస్‌ జగన్‌ విజ్ఞప్తి చేశారు. ఎక్కడ అంటే శనివారం నాడు(జూన్‌15న) న్యూఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్‌ సమావేశంలో అని వేరే చెప్పనవసరం లేదు.

గతంలో ప్రత్యేక హోదా వాగ్దానాన్ని అమలు జరపమని నరేంద్రమోడీకి చంద్రబాబు నాయుడు నాలుగు సంవత్సరాల పాటు ఎంత వినయంగా ఎన్నిలేఖలు రాశారో, ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్లినపుడు విజ్ఞాపనలు చేశారో, ఎన్ని పిల్లి మొగ్గలు వేశారో మనం చూశాము, చంద్రబాబు నాయుడు కూడా జనానికి చెప్పారు. ఇప్పుడు ప్రత్యేక హోదా ఇచ్చేది లేదు, దాన్ని గురించి మరచిపోండి అని అదే ప్రధాని నరేంద్రమోడీ స్పష్టం చేసిన తరువాత నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి అన్నట్లుగా మోడీ మనసు కరిగేట్లు చూడండి సార్‌ అని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాకు ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ చెబుతున్నారు. మనం చూస్తున్నాము. జగన్‌ పదే పదే దేవుడి ప్రస్తావన తీసుకువస్తున్నారు. సందర్భం వచ్చిన ప్రతిసారీ తాను అడుగుతూనే వుంటానని ప్రకటించారు. అటు ప్రధాని నరేంద్రమోడీ, ఇటు వైఎస్‌ జగన్‌ ఇద్దరూ దేవుడిని నమ్మినవారే. ఇద్దరు దేవుని భక్తులూ కలసి ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను ముంచుతారా తేల్చుతారా, మోడీ మారుమనసు పుచ్చుకొని జగన్‌ ఆశిస్తున్నట్లు ప్రత్యేక హోదా ఇస్తారా అన్నది చూడాల్సిందే.

రాజు తలచుకోవాలేగాని దెబ్బలకు కొదవా అన్నారు తప్ప జనానికి మేళ్ల గురించి ఎలాంటి సామెతలు, లోకోక్తులు, సరస సంభాషణలు లేవు. ఇది తెలిసి కూడా అనేక మంది విశ్లేషకులు, ఆశాజీవులు ఏదీ అసాధ్యం కాదు, అలాంటపుడు ప్రత్యేక హోదా ఎందుకు రాదు అంటున్నారు. ఇప్పటికే ఎన్నో భ్రమలు కల్పించిన వారిని గుడ్డిగా నమ్మిన జనం మరికొన్నింటిని నమ్మలేరా ! కర్మ సిద్ధాంతం మాదిరి ఈ మధ్య బి పాజిటివ్‌ (సానుకూలంగా వుండండి) అన్నదానిని కూడా జనానికి బాగా ఎక్కించారు. ఒక చెంప కొడితే మరో చెంప ఖాళీగా వుందని అందించే మనం దీన్ని కూడా అలాగే చూద్దాం. పదే పదే అడక్కపోతే జనానికి కోపం, అడిగితే…… చెయ్యి ఖాళీలేదని చెబితే అర్ధం కాదా మీకు, విసిగించకుండా చెప్పదలచుకున్నదానిని ఫిర్యాదులు, సలహాల బాక్సు పెట్టాం, దానిలో వేసి వెళ్లండి అన్నట్లుగా బిజెపి చెప్పకపోతుందా ! ఒక్కటి మాత్రం ఖాయం, ప్రతి సందర్భంలోనూ, ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి సందర్భోచితంగా ప్రత్యేక హోదా గురించి అడుగుతూనే వుంటామని జగన్‌ చెప్పారు కనుక వాటిని వినలేక బోరు కొట్టి బాబూ మరోసారి అడక్కండి అని జనం వేడుకొనే పరిస్ధితిని తీసుకు వచ్చే తీరు కనిపిస్తోంది. ఎవరి తరహా వారిది మరి ! ఈ నాటకం ఇలా కొనసాగాల్సిందేనా ?

శాసనమండలి మరియు నూతన శాసనసభ సభ్యుల నుద్దేశించి జూన్‌ 14 రాష్ట్ర గవర్నర్‌ ఇఎస్‌ఎల్‌ నరసింహం చేసిన ప్రసంగం మీద చర్చించి లాంఛనంగా ధన్యవాదాల తీర్మానం ఆమోదిస్తారు. వాస్తవానికి గవర్నర్‌ పేరుతో అది జరిగినా తమ ప్రభుత్వానికి తామే ధన్యవాదాలు తెలుపుకోవటం తప్ప మరేమీ కాదు. ఎందుకంటే ప్రభుత్వాలు తయారు చేసి ఇచ్చిన ప్రసంగాన్నే గవర్నర్‌ చదవటం ఒక రాజ్యాంగ విధి. ఇప్పుడున్న స్ధితిలో దీని మీద వుభయ సభల్లో ఏదైనా చర్చిస్తారో లేక వివాదాలతో చర్చలేకుండా ముగిస్తారో వూహించలేము. అలాగాకుండా సజావుగా జరగాలని కోరుకుందాం. గవర్నర్‌ ప్రసంగం అంటే ప్రభుత్వ విధానాలను సూచించే వైఖరి అందుకే నా ప్రభుత్వం అని సంబోధిస్తారు. ఆ ప్రసంగ మంచి చెడ్డలను ఒక్కసారి అవలోకిద్దాం. దీనిలో నవరత్నాల గురించి వివరణ తప్ప ప్రత్యేక హోదా సాధన గురించి ఎలాంటి ప్రస్తావనా లేదు. ప్రత్యేక హోదాలోనే పుట్టి ,ప్రత్యేక హోదా గాలినే పీల్చుతున్న జగన్‌ దాని గురించి వివరణ ఇవ్వాల్సిన అవసరం ఏముంది అని ఎవరైనా అడగవచ్చు. దాని మీద అవగాహనను పైన పేర్కొన్న నీతి ఆయోగ్‌ సమావేశంలో చెప్పారు గనక దాన్నే ప్రమాణంగా తీసుకుందాం.

2014లో చంద్రబాబు నాయుడు అధికారానికి వచ్చాక గవర్నర్‌ ప్రసంగంలో చెప్పిన అంశాలేమిటో చూద్దాం.” 1995-96లో రెండవ తరం సంస్కరణలు ప్రారంభించబడిన సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో ఆర్ధికాభివృద్ధిని పెంచి దారిద్య్రాన్ని నిర్మూలించటం కోసం దాదాపు ఒక దశాబ్దం పాటు కఠినంగా సంస్కరణలు అమలయ్యాయి.1990దశాబ్దం మధ్యలో సమాచార, సాంకేతిక రంగాల్లో మార్పు వచ్చింది. ఈ కాలంలో భూమి, నీరు, అటవీ వనరుల భాగస్వామ్య నిర్వహణ విషయంలో గణనీయమైన మార్పులు చేయటం జరిగింది. మునుపటి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని మహిళా, స్వయం సహాయక బృందాలు మరియు డ్వాక్రా గ్రూపులు ప్రపంచ విజయగాధగా నిలిచాయి. వీటి ద్వారా సామాజిక సమీకరణ,సామాజిక సాధికారత, సామర్ధ్య నిర్మాణం పేదరిక నిర్మూలన విధానంలో కీలకంగా మారాయి. ఈ చర్యలు ఆర్ధిక సంస్కరణలలో అగ్రగామిగా ఆంధ్రప్రదేశ్‌కు మంచి పేరు తెచ్చి పెట్టాయి. దేశ విదేశాలలో అంచనాలు పెరగటానికి దారితీశాయి. అయితే ప్రభుత్వం నుంచి తగినంత ఆర్ధిక మద్దతు లేకపోవటం వల్ల ఈ బృహత్తర వుద్యమం 2004 నుంచి వేగంగా క్షీణించటం ప్రారంభమైంది.దురదృష్ట వశాత్తూ గత దశాబ్దంలో రాష్ట్ర ఆర్ధిక విషయంలో ముఖ్యంగా సహజ వనరుల కేటాయింపు అంశంలో అనేక అవకాశాలను కోల్పోవటం జరిగింది.” ఇలా సాగిన ప్రసంగంలో అవినీతి తదితర అంశాల గురించి ప్రస్తావన వుంది.

ఐదు సంవత్సరాల తరువాత అధికారానికి వచ్చిన జగన్‌ గవర్నర్‌ ద్వారా ఏం చెప్పించారు? ” నూతన ప్రభుత్వానికి తక్షణ సమస్యలపై దృష్టి పెట్టాల్సిన సమయం ఆసన్న మైంది. వాటిలో కొన్ని రాష్ట్ర విభజన పర్యవసానంగా ఏర్పడినవి. మిగిలినవి విభజనానంతరం తలెత్తిన సవాళ్ల అసంగత నిర్వహణకు పర్యవసానాలుగా వున్నాయి. మానవ మరియు భౌతిక వనరులు రెండింటినీ దుర్వినియోగ పరచటం రాష్ట్రం యొక్క దుస్ధితిని మరింత తీవ్రతరం చేసింది. నా ప్రభుత్వానికి దాదాపు ఖాళీ ఖజానా సంక్రమించినందున ప్రజాధనాన్ని మరియు అన్ని సహాయకవనరులను పూర్తి జవాబుదారీగా, సమర్ధవంతంగా ఖర్చు చేయాల్సిన అవసరం ఏర్పడింది……పేదలు, నిరుపేదలు, అభాగ్యులకు సహాయపడే మార్గాలను అన్వేషిస్తూ తప్పనిసరిగా కేంద్రీకృత పరిపాలన అంతటా దృష్టి సారించాలనేది మునుపటి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి గారి భావజాలం ప్రస్తుత సందర్భంలో ప్రతి ఒక్కరూ గ్రహిస్తారు. ఇది బహుశా ఏ సమయంలో వున్నదాని కంటే ఇప్పుడు సంగతంగా వుంటుంది. దీనిని దృష్టిలో వుంచుకొని ప్రస్తుత ప్రభుత్వం తొమ్మిది ఇతి వృత్తాలతో కూడి వున్న నవరత్నాలు అనే ఒక ఏకీకృత సంక్షేమ అజెండాను రూపొందిస్తున్నది,” అని పేర్కొన్నారు.

Image result for YS Jagan

దీనిని బట్టి మనం అర్ధం చేసుకోవాల్సింది ఏమిటి? ఎవరు కొత్తగా అధికారానికి వచ్చినా గత పాలకులు తమకు ఖాళీ ఖజనా అప్పగించి వెళ్లారనో, ఆర్ధిక వ్యవస్ధను అస్తవ్యస్తం చేశారనో చెబుతారు. పోనీ వీరికి ముందుగా తెలియదా అంటే ఎన్నికలకు ముందువరకు ప్రతిపక్షంలో వుండి చేసే పని పాలకుల లోపాలను ఎండగట్టటమే కదా, మరి తెలియకుండా ఎలా వుంటుంది, తెలిసి కూడా వాగ్దానాలు చేయటమెందుకు, అమలు విషయానికి వచ్చే సరికి ఖజానా గురించి సొల్లు కబుర్లెందుకు? పార్టీ కార్యకర్తలూ, సామాన్యజనమూ, మీడియా విసిగిపోయేంత వరకు ప్రపంచ బ్యాంకు ఆదేశిత విజయగాధలను వినిపించటం, ఆ విధానాలను అమలు జరపిన కారణంగానే తెలుగుదేశం పార్టీని 2004లో, 2014లో జనం తిరస్కరించారు. వాటిని మరింత ముమ్మరంగా అమలు జరిపిన కారణంగానే వైఎస్‌ రాజశేఖరరెడ్డి సర్కార్‌ను జనం ఓడించేందుకు నిర్ణయించుకున్న తరుణంలో ప్రత్యామ్నాయం అంటూ ప్రజారాజ్యం పార్టీ వచ్చి ప్రభుత్వ వ్యతిరేక ఓటుకు గండి కొట్టటంతో వైఎస్‌ఆర్‌ రెండవ సారి మైనారిటీ ఓట్లతో బొటాబొటి సీట్లతో అధికారానికి వచ్చారు. తన పాత విధానాల అమలు వల్లనే తాము పది సంవత్సరాల పాటు ప్రతిపక్షంలో వుండాల్సి వచ్చిందని 2014లో అధికారానికి వచ్చిన తెలుగుదేశం పార్టీ గుణపాఠం తీసుకోలేదు, తిరిగి అదే విధానాలను అమలు జరుపుతూ జనాన్ని మభ్యపెట్టిన కారణంగానే జనం నిర్ణయాత్మకంగా ఓటు వేసి మరోసారి సాగనంపారు. దీన్ని గుర్తించకుండా తమపై జరిగిన తప్పుడు ప్రచారం ఓటమికి కారణం అనే తీరులో తెలుగుదేశం నేతలు మాట్లాడుతున్నారు. తన తండ్రి రెండవసారి ఓటమి అంచుదాకా ఎందుకు పోయారో జగన్‌ కూడా గుణపాఠంగా తీసుకోలేదు. అంతకంటే ఎక్కువగా సంక్షేమ పధకాల గురించి చెబుతున్నారు. విధానాలను మార్చుకోకపోతే, సంక్షేమ పధకాల బాటలోనే నడిస్తే ఐదేండ్ల తరువాత ఏమౌతుందో వూహించుకోవటం కష్టం కాదు.

సంక్షేమ పధకాలు, వాటి గురించి వూదరగొట్టుకున్నంత మాత్రాన ప్రయోజనం లేదు. ఏ ప్రభుత్వం అధికారంలో వున్నా కొంత కాలం వరకు సంక్షేమ పధకాలకు ఎలాంటి ఆటంకం కలగదు, కొనసాగుతాయి. వృద్దాప్య, ఇతర, అభాగ్య జీవుల పెన్షన్లను రద్దు చేసే అవకాశం లేదు. కొన్నింటిని రద్దు చేస్తారు. ఎన్ని పధకాలను అమలు చేసినా జనంలో అసంతృప్తి తగ్గటం లేదు అంటే అసలు సమస్యను ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదనే అర్ధం. అయినప్పటికీ వాటినే మరింత ఎక్కువగా అమలు జరపనున్నట్లు జగన్‌ చెబుతున్నారు.

అవిభక్త ఆంధ్రప్రదేశ్‌ నుంచి తెలంగాణా విడిపోయిన తరువాత మిగిలి వున్న ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన మార్పులేమిటి? విభజనకు ముందు రాష్ట్ర జిడిపిలో వ్యవసాయ రంగ వాటా 23శాతం. విభజన తరువాత ఆంధ్రప్రదేశ్‌లో అది 30.2శాతం అయింది. తరువాత 2017-18 ముందస్తు అంచనా ప్రకారం 34.4శాతం వుంది. ఇదే సయమంలో పారిశ్రామిక రంగం వాటా 25.5శాతం నుంచి 22.1శాతానికి,సేవారంగం వాటా 44.6 నుంచి 43.5శాతానికి పడిపోయింది. దేశంలో ఈ మూడు రంగాల వాటా వరుసగా 17.09, 29.06, 53.85 శాతాలుగా వున్నాయి. అంటే ఆంధ్రప్రదేశ్‌ జాతీయ సగటు కంటే బాగా వెనుక బడి వుంది. ఇదే సమయంలో మిగిలిన నాలుగు దక్షిణాది రాష్ట్రాలలో తెలంగాణా, కర్ణాటక, కేరళ జిడిపిలో సేవారంగం వాటా 64శాతానికి పైగా వుంది. తమిళనాడులో 53.7శాతం సేవారంగం నుంచి గరిష్టంగా, 34.05శాతం పారిశ్రామికరంగం నుంచి వస్తున్నది. వ్యవసాయ రంగ వాటా కర్ణాటకలో 10.82, కేరళలో 12.51, తమిళనాడులో 12.58, తెలంగాణాలో 14.28 శాతం వుంది. ప్రస్తుత ఆర్ధిక వ్యవస్ధలో ఆంధ్రప్రదేశ్‌ పరిస్ధితి ఆందోళనకరంగా వుందన్నది స్పష్టం. గణనీయంగా పెరిగిన ఎరువుల ధరలతో సహా వ్యవసాయ పెట్టుబడులు పెరిగి రైతాంగ నిజ ఆదాయాలు గణనీయంగా పడిపోయాయి. వ్యవసాయం గిట్టుబాటు కాని స్ధితి ఏర్పడింది. బాబొస్తే జాబొస్తుందని చేసిన తెలుగుదేశం పార్టీ నినాదం విఫలం కావటానికి, ఎదురు దెబ్బలు తగలటానికి కారణం దీని పర్యవసానాలే. పని చేసే వారిలో 58శాతం మంది వ్యవసాయ రంగంలో వున్నారు. ఈ కారణంగా రుతుపవనాలు విఫలమైనా, జలాశయాలు నిండకపోయినా, ఇతర ఏ కారణాల వల్ల అయినా వ్యవసాయం కుంటుపడితే దానిలో పని చేసే వారంతా వుపాధికోసం రోడ్డెక్కవలసిందే, దీనికి తోడు చేతుల వృత్తులు నానాటికీ దెబ్బతింటున్నందున ఆ రంగం నుంచి వచ్చేవారు కూడా నిరుద్యోగ సైన్యంలో చేరతారు.

భ్రమలు కల్పించటం ప్రజాకర్షక నినాదాలు ఇచ్చే నేతల లక్షణాలలో ఒకటి. వైఫల్యాలను ప్రశ్నించే లేదా తమ సమస్యలను పరిష్కరించాలని గళమెత్తేవారిని సహించకపోవటం, అణచివేయటం కూడా వారి లక్షణాలలో భాగమే. చంద్రబాబు నాయుడిలో ఈ లక్షణాలు అడుగడుగునా మనకు కనిపిస్తాయి. ప్రపంచ స్ధాయి రాజధాని నిర్మాణం చేస్తా, సింగపూర్‌, వాషింగ్టన్‌లా చేస్తా అని వూదరొట్టటం దానిలో భాగమే. అలా అనుకుంటే ప్రపంచంలో ఒక్కోదేశంలోనే అలాంటి నగరాలు అనేకం వున్నాయి. అయినప్పటికీ ఆర్ధిక సంక్షోభాలతో కొట్టుమిట్టాడుతున్నాయి. రెండో లక్షణానికి వస్తే ఆయన ఎక్కడ పర్యటనకు వెళితే అక్కడ వామపక్ష పార్టీలు, ప్రజాసంఘాలు, ఇతర పార్టీల కార్యకర్తలు, నేతలను అరెస్టు చేయించటం తెలిసిందే. పరిశ్రమలకు పెట్టుబడులను ఆకర్షించే పేరుతో చంద్రబాబు నాయుడు సదస్సులతో కాలక్షేపం చేస్తే ఐటి మంత్రిగా ఆయన తనయుడు ఒప్పందాల పేరుతో అదే బాటలో నడచి హడావుడి చేయటం తప్ప సాధించింది లేదు. నాలుగున్నర సంవత్సరాల పాలన తరువాత చంద్రబాబు నాయుడు సర్కార్‌ ప్రవేశ పెట్టిన శ్వేత పత్రాల గురించి మీడియాలో లేదా బయటగానీ పెద్దగా చర్చ, ప్రస్తావనలు లేవు.

Image result for YS Jagan

వాటిలో పరిశ్రమలు, వుపాధి, నైపుణ్య శిక్షణ పేరుతో ఒక పత్రం వుంది. దానిలో వున్న కొన్ని అంశాలు ఇలా వున్నాయి. 201,17,18 సంవత్సరాలలో పెద్ద ఎత్తున హడావుడి చేసి విశాఖలో పెట్టుబడి భాగస్వామ్య సదస్సులంటూ జరిపారు.2,622 ప్రాజక్టులకు ఒప్పందాలు కుదిరాయని వాటిలో పెట్టుబడులు 15,48,743 కోట్ల రూపాయలని, 32,35,916 మందికి వుద్యోగాలు వస్తాయని పేర్కొన్నారు. ఆచరణలో వుత్పాదనలోకి వెళ్లిన ప్రాజక్టులు 810, వాటిలో పెట్టుబడి 1.77లక్షల కోట్లు, వుపాధి కల్పించామని చెప్పింది 2.51లక్షల మందికి. కాగితాల మీద వున్న అంకెలకు వాస్తవాలకు ఎంత తేడా వుంటుందో తెలిసిందే. ఆరోగ్యశ్రీ పధకం కింద రోగులు ఆసుపత్రులకు వెళితే ఎంత ఎక్కువ బిల్లులు వేసి ప్రభుత్వాల నుంచి తెలుగు రాష్ట్రాలలో కార్పొరేట్‌ ఆసుపత్రులు గుంజుతున్నాయో తెలిసిందే. అలాగే పెట్టుబడులు, వుపాధిని ఎక్కువగా చూపి రాయితీలు పొందేందుకు పెట్టుబడిదారులు కూడా అలాంటి పనులే చేస్తారు. శ్వేత పత్రంలో వున్న అంశాల ప్రకారం మరో 1211 ప్రాజెక్టులకు సివిల్‌ పనులు జరుగుతున్నాయట, వాటిలో పెట్టుబడి 5.27లక్షల కోట్లు, వుపాధి అంచనా 7.66 లక్షలు. ఇవిగాక అసలు ప్రారంభమే కానివి ఆరువందల ప్రాజెక్టులు, వాటిలో వుంటాయనుకునే పెట్టుబడులు వాటిలో పెట్టుబడులు 8.45లక్షల కోట్ల రూపాయలైతే వుపాధి 22,18,916 మందికి వస్తుందా ? వీటిని కాకి లెక్కలను కోవాలా, నిజమనుకోవాలా ?

ఎలక్ట్రానిక్స్‌ రంగంలో ఐదు బిలియన్‌ డాలర్ల పెట్టుబడులతో( సుమారుగా 35వేల కోట్ల రూపాయలకు సమానం) రెండు లక్షల మందికి, రెండు బిలియన్‌ డాలర్లతో(14వేల కోట్ల రూపాయలకు సమానం)తో లక్ష మంది ఐటి లేదా ఐటి అనుబంధ వుద్యోగాలు కల్పించే లక్ష్యం గురించి వూదరగొట్టారు. నాలుగున్నర సంవత్సరాల తరువాత ఎలక్ట్రాన్స్‌ రంగంలో ఐదు కంపెనీలు 927 కోట్ల రూపాయలతో వుత్పత్తి ప్రారంభించాయని, 21,850 మందికి వుపాధి కల్పించినట్లు పేర్కొన్నారు.హైదరాబాదులో ఐటి పరిశ్రమను తానే నెలకొల్పానని చెప్పుకున్న చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్‌లో ఎంత మందికి ఐటి రంగంలో వుపాధి కల్పించారో శ్వేతపత్రంలో పేర్కొనలేదు. ఈ పూర్వరంగంలో ఏ ప్రభుత్వం ముందైనా పెద్ద సవాలే వుంటుంది. మొత్తంగా వుపాధి గురించి జగన్‌ నవరత్నాలలో గానీ, గవర్నర్‌ ప్రసంగంలోగానీ పేర్కొన్నదేమీ లేదు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

వైసిపి ‘అనకొండ’ తెలుగు దేశాన్ని మింగు విధంబెట్టిదనిన !

14 Friday Jun 2019

Posted by raomk in Current Affairs, History, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

ANDHRA PRADESH CM, Anti defection law, CHANDRABABU, CM YS Jagan, tdp, Ycp, ys jagan vs chandrababu, ysrcp

Image result for jagan chandrababu

ఎం కోటేశ్వరరావు

‘ఇక్కడ ఒక్క విషయం అందరికీ చెప్పదలిచా. నాకు కొంతమంది ఏం చెప్పారంటే.. చంద్రబాబుకు 23 మంది శాసనసభ్యులున్నారు. వారిలో ఐదుగురిని లాగేస్తే ఆయనకు 18 మందో, 17 మందో ఉంటారు. ఫలితంగా ఆయనకు ప్రతిపక్ష నాయకుడి హోదా కూడా దక్కదు, విపక్ష ఎమ్మెల్యేలను లాగేద్దామన్నారు. అయితే అలా చేస్తే నాకూ, ఆయనకూ తేడా లేకుండా పోతుందని చెప్పా. ఇక్కడ నేను ఇంకొకటి కూడా చెప్పదలిచా. ఆ పార్టీ (టీడీపీ) నుంచి మేమెవరినైనా తీసుకుంటే వారిని తొలుత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించిన తర్వాతే తీసుకుంటాం. అలా కాకుండా ఏదైనా పొరపాటున జరిగితే వెంటనే అనర్హత వేటు వేయాలని కూడా మీకే విన్నవిస్తున్నా. ఇలాంటి గొప్ప విధానాలు మళ్లీ ఈ శాసనసభకు వస్తాయని ఆశిస్తూ, మీరు ఆ పని చేయగలరని పూర్తిగా విశ్వసిస్తూ మరోసారి అభినందనలు తెలియజేస్తున్నా’ ఇది ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డి అసెంబ్లీలో స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌ను వుద్దేశించి చెప్పిన మాట. దీనికి వైఎస్‌ఆర్‌సిపి కట్టుబడి వుంటుందని, వుండాలని ఆశిద్దాం. నిజానికి కట్టుబడి వుండటం పెద్ద సమస్య కూడా కాదు.

సీన్‌ తిరగేస్తే ఒక్కటి మాత్రం స్పష్టం. వైసిపి అనే తోడేలు మేకపిల్లగా మారిన తెలుగుదేశాన్ని ఎలాగైనా సరే తినదలచుకున్నదనే సంకేతాలు తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే వెలువడ్డాయి. మరీ పాత కథ చెప్పినట్లు వుందా, అయితే వైసిపి అనకొండ తెలుగుదేశాన్ని మింగదలచుకుంది అందాం. అయితే అది ఎలా ఎప్పుడు అన్నదే కిక్కునిచ్చే అంశం. ఇక్కడ కొన్ని ఆల్జీబ్రా లెక్కలు పరిష్కారం కావాల్సివుంది. ఇటీవలి రాజకీయాలను గమనించినపుడు ఒక ధోరణి స్పష్టం. ఏదైనా ఒక పార్టీ అధికారానికి వస్తే జనానికి ఏమి చేస్తారో తెలియదు గానీ ప్రత్యర్ధి పార్టీని తొక్కివేయటం లేదా విలీనం చేసుకోవటం తక్షణ కర్తవ్యంగా వుంటోంది. అందువలన పైకి ఎవరెన్ని సుభాషితాలు పలికినా జరిగేదేమిటో అందరూ వూహించుకుంటున్నదే. ఆ సినిమా ఎలా వుంటుందో చూడబోయే ముందు కొన్ని అంశాలను చూద్దాం.

ఏదైనా ఒక చట్టం చేస్తే దానిలో వున్న లోపాలను ఎలా తొలగించాలా అనిగాక దానికి ఎలా తూట్లు పొడవాలా అని మన దేశంలో వామపక్షాలు మినహా అన్ని రాజకీయ పార్టీలు చూస్తున్నాయి. ఇలాంటి పార్టీలు ఆమోదించిన రాజ్యాంగాలు, వాటికి అనుగుణ్యంగా చేసిన చట్టాల మీద కమ్యూనిస్టులకు అంతగా విశ్వాసం లేకపోయినా, పార్లమెంటరీ పార్టీ వ్యవస్ధను ఆమోదించి చట్టబద్దంగా పని చేస్తున్న కమ్యూనిస్టు పార్టీలు మాత్రమే వాటికి కట్టుబడి వుంటున్నాయి తప్ప మిగతాపార్టీలేవీ అలా లేవు. ఫిరాయింపుల నిరోధక చట్టం అమలులోకి వచ్చిన గత మూడున్నర దశాబ్దాలు లేదా అంతకు ముందు కూడా కమ్యూనిస్టులు ఫిరాయింపులను ప్రోత్సహించలేదు. అసలా ఫిరాయింపుల చట్టం గురించి నాలుగు ముక్కలు.

హర్యానా మన దేశానికి ఇచ్చిన ఒక బహుమతి ఆయారామ్‌ గయారామ్‌ అంటే అతిశయోక్తి కాదు. 1967లో హర్యానాలో కాంగ్రెస్‌, దానికి వ్యతిరేకంగా రూపొందిన పలు పార్టీల కూటమి యునైటెడ్‌ ఫ్రంట్‌ మధ్య ఫిరాయింపుల పర్వం నడిచింది. పంజాబ్‌ నుంచి విడివడి 1966 నవంబరు ఒకటిన హర్యానా ఏర్పడింది. మరుసటి ఏడాది జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఎన్నికైన గయాలాల్‌ అనే ఎంఎల్‌ఏ ఒకే రోజు తొమ్మిది గంటల వ్యవధిలో మూడు సార్లు పార్టీ మారాడు.కాంగ్రెస్‌ నుంచి యునైటెడ్‌ ఫ్రంట్‌కు మారిన తరువాత తిరిగి కాంగ్రెస్‌కు వచ్చాడు. అప్పుడు కాంగ్రెస్‌ నేత రావు బీరేంద్ర సింగ్‌ గయాలాల్‌ను చండీఘర్‌ ప్రెస్‌క్లబ్‌లో విలేకర్లకు చూపుతూ గయారామ్‌ ఇప్పుడు ఆయారామ్‌ అయ్యాడు అని ప్రకటించారు. ఆయారామ్‌ తరువాత వెంటనే తిరిగి గయారామ్‌గా మారి తిరిగి యునైటెడ్‌ ఫ్రంట్‌కు ఫిరాయించాడు.( తండ్రి గయాలాల్‌ బాటలో నడిచిన కుమారుడు వుదయ్‌ భాను 2004లో స్వతంత్ర అభ్యర్ధిగా గెలిచి కాంగ్రెస్‌కు ఫిరాయించారు.) అలాంటి ఫిరాయింపులను ప్రోత్సహించేందుకు ఎన్నికైన వారు గోడదూకకుండా చూసేందుకు కాంగ్రెస్‌ నేత రాజీవ్‌ గాంధీ ఆలోచనగా 1985లో 52వ రాజ్యాంగ సవరణ ద్వారా ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని తీసుకు వచ్చారు. పార్టీ నుంచి విడిపోతామనే బెదిరింపులను ఎదుర్కొనే భాగంగానే ఇది జరిగిందన్నది స్పష్టం.

దీని ప్రకారం ఒక సభ్యుడు తనంతట తాను పార్టీకి రాజీనామా చేసినా, లేక పార్టీ విప్‌ను ధిక్కరించి ఓటింగ్‌లో పాల్గొన్నా ,వుద్దేశ్యపూర్వకంగా సభకు గైర్‌హాజరైనా చట్టసభల సభ్యత్వాన్ని కోల్పోతారు. అయితే ఒక పార్టీకి పార్లమెంట్‌ లేదా అసెంబ్లీలో వున్న సంఖ్యాబలంలో మూడో వంతు గనుక చీలి కొత్త పార్టీ పెట్టినా లేదా వేరే పార్టీలో విలీనం అయినా అనర్హత వేటు పడదు. ఇలాంటి చర్యలను చట్టసభల స్పీకర్లు కాకుండా ఎంపీలైతే రాష్ట్రపతి, ఎంఎల్‌ఏలైతే గవర్నర్లు చర్యతీసుకోవాలని కొన్ని కమిటీలు సిఫార్సు చేశాయి గాని వాటిని ఇంతవరకు ఆమోదించి చట్టసవరణ చేయలేదు. అయితే ఒక సభ్యుడు స్వచ్చందంగా రాజీనామా చేయకుండా పార్టీలో తిరుగుబాటు చేసి బహిరంగంగా వేరే పార్టీకి మద్దతు ప్రకటిస్తే లేదా పార్టీని ధిక్కరించినా సభ్యత్వానికి అనర్హుడని, స్వచ్చందంగా రాజీనామా చేసినట్లే పరిగణించాలని సుప్రీం కోర్టు ఒక కేసులో పేర్కొన్నది. తొలుత చేసిన చట్టంలో స్పీకర్‌ నిర్ణయానికి తిరుగులేదు అని పేర్కొన్నారు, అంటే దానిని సమీక్షించే అధికారం కోర్టులకు లేదు. స్పీకర్‌ నిర్ణయం వెలువడే వరకు కోర్టులు జోక్యం చేసుకోవటానికి అవకాశం లేదు. 2015లో తెలంగాణాలో అదే జరిగింది. అయితే అనర్హత పిటీషన్‌పై ఎంత వ్యవధిలోగా నిర్ణయం తీసుకోవాలి అనేది స్పష్టంగా పేర్కొనకపోవటంతో స్పీకర్లు నిరవధికంగా నిర్ణయాన్ని వాయిదా వేసి విమర్శలపాలైన వుదంతాలు వున్నాయి. తెలంగాణాలో తెలుగుదేశం పార్టీ ఎంఎల్‌ఏగా వుంటూ ఫిరాయించిన ఒకరు తెరాస ప్రభుత్వంలో మంత్రిగా చేరినప్పటికీ సభ్యత్వం మీద స్పీకర్‌ నిర్ణయం తీసుకోకపోవటంతో ఎలాంటి అనర్హతకు గురి కాలేదు. 2004లో చేసిన చట్టసవరణకు 91వ రాజ్యాంగ సవరణ ప్రకారం మూడోవంతుకు బదులు మూడింట రెండువంతుల మంది చీలితేనే ఆ చీలికకు చట్టబద్దత వుంటుంది, అనర్హత వేటును తప్పించుకోగలరు. 2014లో తెలుగుదేశం పార్టీ పార్టీ తరఫున ఎన్నికైన 15 మందిలో 12 మంది తెరాసలో చేరేవరకు స్పీకర్‌ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అవసరమైన సంఖ్య చేరగానే 2016లో స్పీకర్‌ తెదే శాసనసభా పక్షం తెరాసలో విలీనమైనట్లు తన నిర్ణయాన్ని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లో వైసిపి నుంచి ఫిరాయించిన వారిపై 18నెలల పాటు స్పీకర్‌ చర్య తీసుకోనందుకు నిరసన వ్యక్తం చేస్తూ వైసిపి సమావేశాలను బహిష్కరించిన విషయం తెలిసిందే. తాజాగా తెలంగాణాలో అసెంబ్లీ సభ్యత్వానికి వుత్తమ కుమార్‌ రెడ్డి రాజీనామా చేయగానే అవసరమైన సంఖ్య కూడటంతో కాంగ్రెస్‌ శాసనభా పక్షాన్ని విలీనం చేయటం కూడా ఇదే పద్దతిలో జరిగింది.

ఈ పూర్వరంగంలో ఆంధ్రప్రదేశ్‌లో ఏమి జరగనుందో స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఇక్కడ కొన్ని చిక్కుముడులు వున్నాయి. వాటిని పార్టీలు ఎలా పరిష్కరిస్తాయన్నది ఆసక్తికరం. ప్రస్తుతం వున్న 23 మంది సభ్యులలో పదకొండు మంది మినహా 13 మంది తమతో సంబంధాలలో వున్నారని వైసిపి ఎంఎల్‌ఏలు చెబుతున్నారు. చట్ట ప్రకారం తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చే వారు అనర్హత వేటును తప్పించుకోవాలన్నా లేక రాజీనామాలతో నిమిత్తం లేకుండా వైసిపిలో చేరాలన్నా 16 మంది కావాల్సి వుంది. ఇక్కడ అస్పష్టమైన దృశ్యాలు కొన్ని కనిపిస్తున్నాయి. వైసిపి వారు చెబుతున్నట్లు 13 మంది టచ్‌లో వుంటే మరో ముగ్గురు ఎంఎల్‌ఏలను ఆకర్షించితే చట్టబద్దంగానే ఫిరాయింపులకు స్పీకర్‌ ఆమోద ముద్ర వేస్తారు. లేదా నాటకాన్ని రక్తి కట్టించేందుకు ముగ్గురిచేత తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయిస్తే తెలుగుదేశం బలం 20కి పరిమితమైతే 13 మంది అనర్హత వేటు తప్పించుకొని చట్టబద్దంగానే వైఎస్‌ఆర్‌సిపి లేదా మరొక పార్టీ దేనిలో అయినా చేరవచ్చు లేదా తమదే అసలైన తెలుగుదేశం అని ప్రకటించుకొని సభలో కూర్చోవచ్చు, అదే జరిగితే పార్టీ మారకుండానే, రాజీనామా చేయకుండానే అధికారపక్షంతో లేదా మరొక పక్షంతో సహజీవనం చేసే అవకాశం వస్తుంది.

దేశంలో లేదా రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాల్లో నైతిక విలువలకు ఏ పార్టీ కూడా కట్టుబడి వుండటం లేదు. గతంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి కాంగ్రెస్‌ చీలికపక్షమైన బ్రహ్మానందరెడ్డి నాయకత్వంలోని పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరటం ఫిరాయింపు కాదా అని తెలుగుదేశం ఎద్దేవా చేసింది. అయితే అప్పుడు పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం లేదని వైసిపి సమర్ధించుకుంది. చట్టం వున్నా లేకున్నా ఫిరాయింపు ఫిరాయింపే, నైతికంగా అక్రమమే. బెదిరించి లేదా ప్రలోభపెట్టి ఆకర్షించిన తెలుగుదేశం చర్య కూడా గర్హనీయమే. ముందే చెప్పుకున్నట్లు చట్టాన్ని పటిష్టపరచటం గాకుండా లోపాలను వుపయోగించుకొని తప్పుడు చర్యలను సమర్ధించుకొనేందుకు చూస్తున్నారు.

రెండు తెలుగు రాష్ట్రాలలో వున్న మూడు ప్రాంతీయ పార్టీలలో రెండు మిత్రపక్షాలుగా వున్నాయి. రెండూ అధికారంలో వున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్‌, బిజెపికి ప్రాతినిధ్యం లేకుండా పోయింది. కాంగ్రెస్‌కు కొత్తగా పోయిందేమీ లేదు కనుక దానికి ఎలాంటి బాధ లేదు. కేంద్రంలో అపరిమిత అధికారం కలిగివున్న తమకు ఏపిలో ప్రాతినిధ్యం లేకపోవటం బిజెపికి తలకొట్టేసినట్లుగా వుంది. అందుకోసం అది వైసిపికి వల వేసిందన్నది ఎప్పటి నుంచో వినిపిస్తున్నమాట. అది వలపు వలా లేక కేసులదా అన్నది వేరే అంశం. ప్రత్యేక హోదా లేదా ప్రత్యేక పాకేజీ రెండింటికీ సున్నా చుట్టిన బిజెపితో కలిస్తే మొదటికే మోసం వస్తుందేమో, తరువాత చూద్దాం ముందు మీరు కాస్త తగ్గండి అని వైసిపి చెప్పి వుండవచ్చు, విధిలేని స్ధితిలో బిజెపి సరే అని వుండవచ్చు. అనూహ్యంగా బిజెపి కేంద్రంలో రెండవసారి పెద్ద మెజారిటీతో అధికారానికి వచ్చింది గనుకనే ఎన్నికలకు ముందు మాదిరి అది వుంటుందా అంటే వుండదు. దాని లక్షణం అది కాదు. మహారాష్ట్రలో తోటి హిందూత్వ పార్టీనే తొక్కేసి ముందుకు వచ్చిన పార్టీ అది. పశ్చిమబెంగాల్లో మమతాబెనర్జీతో వ్యవహరిస్తున్న తీరు చూస్తున్నాము. వాటికీ ఆంధ్రప్రదేశ్‌కు తేడా ఏమిటంటే మిగతా చోట్ల సిబిఐ, ఇడిలను ప్రయోగించాల్సి వుండగా ఇక్కడ ఆ పని ఎప్పుడో చేశారు కనుక జగన్‌కు ముందు వాటి నుంచి బయటపడేందుకు ప్రాధాన్యత ఇస్తారు. కనుక బిజెపి ఆ కత్తిని ఎప్పుడూ చూపుతూనే వుంటుంది, జగన్‌కు అది తెలిసిందే కనుక వేటు పడకుండా చూసుకుంటారు. కొంతకాలం రేచుక్క పగటి చుక్క, చిక్కడు-దొరకడు వ్యవహారం నడుస్తుంది.

Image result for jagan chandrababu

రాజకీయం ఒక వ్యాపారం అనుకుంటే ప్రతి పార్టీ లాభం కోసం వెంపర్లాడుతుంటుంది. ఆ రీత్యానే ఎన్నికలైన వెంటనే బిజెపి రెండు తెలుగు రాష్ట్రాలలో ఆపరేషన్‌ ఆకర్ష పధకానికి తెరతీసినట్లు పరిణామాలు వెల్లడిస్తున్నాయి. తెలంగాణాలో తెరాసలోకి పోగా మిగిలిన కాంగ్రెస్‌ను తమలో విలీనం చేసుకొనేందుకు బిజెపి ప్రయత్నం చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కాంగ్రెస్‌ పార్టీ పనికిరాదు గానీ కాంగ్రెస్‌ నాయకులు బిజెపికి ముద్దు వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ నుంచి గతంలోనే కొందరు కాంగ్రెస్‌ పెద్దలు బిజెపిలో చేరారు. బిజెపి ఏకంగా తన అధ్యక్షుడినే కాంగ్రెస్‌ నుంచి తెచ్చుకుంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకత్వం మీద కన్నువేసినట్లు చెబుతున్నారు. నిజానికి బిజెపి గతంలోనే తెలుగదేశం పార్టీని మింగివేసేందుకు ప్రయత్నించిందనే వార్తలు వచ్చాయి. అది ప్రత్యేక హోదాకు మోడీ సర్కార్‌ తిరస్కారం వంటి వివిధ కారణాల వల్ల జరగలేదు. ఇప్పుడు అదే జరిగితే ఏమౌతుంది, జగన్‌ దాన్ని పడనిస్తారా అన్నది ప్రశ్న. తన మీద వున్న కేసుల పరిష్కారానికి జగన్‌ తొలి ప్రాధాన్యత ఇస్తారు. ఇంతకాలం ఆయనను వెంటాడిన తెలుగుదేశం నేతలు బిజెపిలో చేరితే వైసిపికి మింగా కక్కలేని స్ధితి వస్తుంది. ఒక వేళ అదే జరిగితే ముందుగా దెబ్బతినేది తెలుగుదేశమే కనుక ఇప్పటికైతే తమకెలాంటి ఢోకా వుండదనుకొని వైసిపి సర్దుకు పోతుందా ? తాను బలపడటానికి ఇతర పార్టీలనుంచి చేర్చుకొన్న నాయకులకు పని ఇవ్వకుండా బిజెపి మాత్రం ఎంతకాలం వుంటుంది? కొద్ది కాలం తరువాత అదే బిజెపి తాను బలపడేందుకు సిబిఐ, ఇడి సంస్ధలను ప్రయోగించి జగన్‌ అనుచరులను లక్ష్యంగా చేసుకొంటే అనివార్యంగా వైసిపి సలాం కొట్టాలి లేదా లడాయికి దిగాల్సి వుంటుంది. కర్నూలు వంటి చోట్ల కోట్ల, కెయి వర్గాలే కలసిపోగా లేనిది వైసిపి తన అవసరాల కోసం కనీసం జగన్‌ కేసుల నుంచి బయటపడేంతవరకు అయినా సర్దుబాటలోనే పయనించే అవకాశాలే ఎక్కువ. లేదూ చేతులారా తెలుగుదేశం నాయకత్వాన్ని బిజెపికి అప్పగించటమెందుకు, చంద్రబాబు నాయుడు మినహా మిగిలిన తెలుగుదేశాన్ని ఏదో విధంగా మనమే కలిపేసుకుంటే ఒక పనై పోలా అని అనుకుంటే వేరే చెప్పాల్సిన పనేముంది !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

వివాదాస్పద కార్టూన్‌పై తెలుగుదేశం వివేచనతో వ్యవహరిస్తుందా ?

22 Saturday Apr 2017

Posted by raomk in AP NEWS, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

cartoonist, cartoons, CHANDRABABU, derogatory jokes, Nara lokesh, social media, tdp

Image result for controversial cartoon, inturi ravikiran

ఎం కోటేశ్వరరావు

పెద్దలకు మాత్రమే అనే కాప్షన్‌తో ఒక ‘ముదురు’ సినిమా పోస్టర్‌, ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలి భవనపు ముందుభాగం ఫొటో, నాన్నారూ నేను పెద్దల సభకే వెళతా అనే కాష్షన్‌తో నారా లోకేష్‌, ఆయన తండ్రి, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడి ఫొటోలతో కూడిన ఒక చిత్రం సామాజిక మాధ్యమంలో పెద్ద ప్రాచుర్యం పొందింది. ఇదెలాంటి ప్రభావం చూపిందంటే వంద మంది వంది మాగధుల కొలువు మధ్య ఒక్క విమర్శకుడు నోరు విప్పితే రాజో, యువరాజో, యువరాణికో ఎలా వుంటుంది ? నూరు కాకుల కావ్‌ కావ్‌లే మధురగీతాలుగా తన్మయత్వంతో అప్పటికే వూగిపోతున్న వారి మధ్యలో ఒక్క కోయిల చేరి పాడితే ఎలా కర్ణకఠోరంగా వుంటుందో అలా !

కొన్ని మినహా అన్ని అగ్రశ్రేణి సాంప్రదాయక మాధ్యమాలన్నీ ఆహా ఓహో అంటూ పొగుడుతుంటే సామాజిక మాధ్యమంలో వచ్చిన పై చిత్రం కొంతమందికి అభ్యంతరగా కనిపించటంతో వివాదాస్పదమై, చట్టపరమైన చర్యలకు దారి తీసింది. ఇంటూరి రవికిరణ్‌ వేసిన కార్టూన్‌ ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలి భవనాన్ని కించపరిచేదిగా వుందంటూ వచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేసి, బెయిలుపై విడుదల చేయటం రెండు తెలుగు రాష్ట్రాలు, జాతీయ మీడియాలో కూడా ఒక సంచలన వార్తగా మారింది. మీడియాలో వచ్చిన ఏదైనా అంశంపై ఎవరికైనా అభ్యంతరం అనిపించినపుడు ఇప్పుడేం జరుగుతోంది. సంబంధిత చట్టపరమైన సంస్ధలకు ఫిర్యాదు చేయటం అవి తీసుకొనే చర్యల కోసం కాలయాపన చేయటం కంటే అసలు చట్టాన్నే తమ చేతుల్లోకి తీసుకుంటే పోలా అన్నట్లు అనేక సందర్భాలలో ప్రత్యక్షంగా తేల్చుకొనేందుకు సిద్ధపడుతున్నారు.

రవికిరణ్‌ తయారు చేసిన చిత్రం విషయంలో ముందుగా చేయాల్సింది. ఏ సామాజిక మాధ్యమంలో అయితే అది తిరుగాడుతోందో దాని యజమానులకు ఫిర్యాదు చేసి దానిని ముందుగా వుపసంహరింప చేయించాలి. అదేమీ జరిగినట్లు లేదు. ఎందుకంటే రవికిరణ్‌ అరెస్టు, విడుదల తరువాత కూడా ఆ చిత్రాన్ని చూపమ్మా అని గూగులమ్మ తల్లిని ప్రార్ధిస్తే అంతకంటేనా నీ కోరిక తీరుతుంది భక్తా అన్నట్లు శనివారం సాయంత్రం మూడు గంటల సమయంలో చూపింది. దానిని పాఠకుల సౌకర్యార్ధం  ఇస్తున్నాం.

మీడియాలో సంచలనాన్ని చూసిన తరువాత ఈ చిత్రం ఇంకా అనేక మందిలో ఆసక్తిని రేకెత్తించి సామాజిక మాధ్యమానికి దూరంగా వున్న వారిలో కూడా ఆసక్తిని రేపి మరింత ప్రాచుర్యం పొందింది. ఆ విధంగా నారా లోకేష్‌, నారా చంద్రబాబు నాయుడి ప్రచార గ్రాఫ్‌లు పెరిగాయంటే అతిశయోక్తి కాదు. పైసా ఖర్చు లేకుండా వచ్చిన ఈ ప్రచారానికి ముందుగా ఆ చిత్రం అభ్యంతరంగా వుందని అనిపించిన పెద్దలకు, , రవి కిరణ్‌ను హైదరాబాదులో అరెస్టు చేసి తుళ్లూరుకు తీసుకురావటంలో ఆలశ్యం చేసి ఆసక్తి పెంచిన పోలీసులకు, దీన్నొక సమస్యగా చేసి సామాజిక మాధ్యమంలో చినబాబు, పెదబాబులకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్న వారికి ఒక గుణపాఠం చెప్పాలన్న ఆలోచన ముందుగా వచ్చిన వారికి, మామ తిట్టినందుకు కాదు తోడల్లుడు తొంగి చూసి కిసుక్కున నవ్వినందుకు అన్నట్లుగా మా బాబులపై వ్యంగ్యాస్త్రం వేసినందుకు కాదు, శాసనమండలిని కించపరిచినందుకు అన్న ఒక తెలివైన పాయింటును ముందుకు తెచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయించిన, చేసిన వారికి, ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ వుదంతంతో ప్రమేయం వున్నవారందరికీ ఎవరెన్ని అభ్యంతరాలు పెట్టినా అభినందనలు చెప్పక తప్పదు.

ఇదే జరిగి వుండకపోతే ప్రపంచానికి అనేక విషయాలు మరుగునపడి తెలియకుండా వుండేవి.భావ ప్రకటనా స్వేచ్చ గురించి అన్ని రకాల మీడియాల్లో నలుగురి నోళ్లలో నాని వుండేది కాదు. కొంత మంది గురించి కొందరు చేసిన పప్పు, సుద్ద పప్పు అన్న వ్యాఖ్యలు వారికి తగవు, పప్పులాగా వున్నా వుప్పు, నిప్పుగా నిరూపించుకొనే సందర్భాలు వస్తాయి అని రుజువైంది. ఏ మీడియా అయినా తమ రేటింగ్‌ను పెంచాలి తప్ప మరొక విధంగా చేయకూడదని రాజకీయ నేతలు కోరుకుంటారు తప్ప విమర్శిస్తే వూరుకోరని గతంలోనే మమతా బెనర్జీతో అనేక మంది నిరూపించారు. తెలుగు దేశం పార్టీ కూడా అందుకు మినహాయింపు కాదని రుజువైంది. సరే ఒక పార్టీకి చెందిన మరుగుజ్జు సేన(ట్రోల్స్‌) తమ నేతలపై విమర్శలు చేసిన వారి పట్ల ఎంత ఘోరంగా ప్రవర్తిస్తుందో సామాజిక మీడియాలో విమర్శనాత్మకంగా పరిశీలించే వారందరికీ తెలిసిందే.

చట్టపరంగా రవి కిరణ్‌ రూపొందించిన చిత్రం శిక్షార్హమైనదా, కాదా, ఆ చిత్రాన్ని ఎవరు ఎవరికోసం వేయించారు, ఎందుకు వేశారు, జరిగిన నష్టం ఏమిటి, అందుకు శిక్ష వుంటుందా, తప్పేమీ లేదని కొట్టి వేస్తారా అన్న అంశాలలో కొన్ని వూహా జనితమైనవి. కేసు దాఖలు చేశారు గనుక చట్టం తనపని తాను చేసుకుపోతుంది. ఆయేషా మీరా హత్య కేసులో పోలీసులు ప్రవేశపెట్టిన సత్యం బాబు నేరం చేయలేదని స్వయంగా ఆయేషా తల్లితండ్రులు కేసు విచారణ రోజు నుంచి ఎంత మొత్తుకున్నప్పటికీ పట్టించుకోకుండా చట్టం తనపని తాను చేసి నిర్దోషి అయిన సత్యంబాబును అన్యాయంగా జైలుపాలు చేసిందని తాజా కోర్టు తీర్పుతో వెల్లడైన విషయం తెలిసిందే. అందువలన కొన్ని సందర్భాలలో చట్టం తనపనే గాక అధికారంలో వున్నవారికి చుట్టంగా కూడా పని చేస్తుందని స్పష్టమైంది. సరే తాజా చిత్రం కేసులో ఏమౌతుందో తెలియదు.

ఈ సందర్భంగా జరుగుతున్న చర్చలో ప్రస్తావనకు వస్తున్న అంశాలేమిటంటే పేరుకు శాసన మండలిని కించపరిచారనేది సాంకేతికంగా కేసు బనాయించటానికి తప్ప వాస్తవానికి ఇద్దరు బాబుల ప్రస్తావన వున్నందుకు ఇది ప్రతీకారం అని ప్రజాభిప్రాయంగా వుంది. అనేక మంది రాజకీయ నాయకులు ఈ రోజుల్లో దేవతా వస్త్రాలు ధరించి రాజకీయాలు చేస్తున్నారు. పుణ్యం చేసుకున్న వారికే దేవతా వస్త్రాలు కనిపిస్తాయి అన్నట్లుగా వారి తీరు అందరికీ కనిపించదు. కొన్ని సందర్భాలలో ప్రజాభిప్రాయం కూడా తప్పు కావచ్చు. హిట్లర్‌ మంచివాడే, అతగాడిని బలపరచాలన్న అభిప్రాయం ప్రజలలో కలిగిన అంశం చరిత్రలో తెలిసిందే. అలాగే మన దేశంలో బాబరీ మసీదు కూల్చివేత కూడా ప్రజాభిప్రాయం, అభిష్టం మేరకే బహిరంగంగానే జరిగింది తప్ప దానిలో కుట్రేమీ లేదని చెబుతున్న విషయం తెలిసిందే. తెనాలి రామకృష్ణ సినిమాలో తాను నియోగినని ఎలా కావాలంటే అలా వినియోగపడతానని రామకృష్ణ కవిచేత చెప్పించారు. చట్టపరంగా ఓటింగ్‌ జరిపి తేలింది తప్ప మిగిలిన ప్రజాభిప్రాయాలన్నీ ఎలా కావాలంటే అలా వినియోగపడేవే.

ఒక చట్ట సభను కించపరచవచ్చా అంటే ఎవరూ సమర్ధించరు. కానీ చట్ట సభలలో జరుగుతున్న విషయాలను చూస్తే నేడు వాటి పట్ల ఎందరిలో సానుకూల వైఖరి వుంది. అనేక అవాంఛనీయ విషయాలు ప్రస్తావనకు వస్తున్నాయి, వుదంతాలు జరుగుతున్నాయి. సభాధ్యక్షుల నిర్ణయం మేరకు అనేక అంశాలు రికార్డుల నుంచి తొలగిస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారాలు జరుగుతున్న కారణంగా అవన్నీ సమాజ రికార్డులలో నమోదు అవుతున్నాయి. వాటిని తొలగించే అవకాశం లేదు. అధికారాన్ని వుపయోగించలేరు. కర్ణాటక, గుజరాత్‌ అసెంబ్లీలలో ప్రజా ప్రతినిధులు, మంత్రులు సైతం తమ సెల్‌ఫోన్లలో బూతు చిత్రాలు చూస్తున్నారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. వారిని అరెస్టు చేసి శిక్షించినట్లు వార్తలు లేవు. ఒక వీధిలో ఎ ఇద్దరు కొట్లాడుకున్నా చట్టపరంగా వారిపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవచ్చు. మన దేశంతో సహా అనేక దేశాలలో చట్ట సభలలో కొట్టుకున్న ప్రజాప్రతినిధులపై ఎక్కడా కేసులు నమోదు చేసినట్లు మనకు తెలియదు. తాజాగా తమిళనాడు అసెంబ్లీలో జరిగిన విషయాలు తెలిసిందే. అందుకనే ఒక గూండా బొమ్మ గీసి నా అడ్డా అసెంబ్లీలో వేయాలని వుంది అంటే అది అసెంబ్లీని కించపరిచినట్లు అవుతుందా ? అవదు, అయితే రవి కిరణ్‌ చిత్రంలో ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలి అనే బోర్డుతో వున్న భవనపు బొమ్మ వుంది కనుకనే చట్టపరమైన సమస్యలు వచ్చాయి. ఐరోపాలోని ఐర్లండ్‌ పార్లమెంట్‌ భవనపు బొమ్మపై మార్ఫింగ్‌తో సర్కస్‌ టెంటు వేసి సర్కస్‌, ప్రవేశం అని రాశిన బొమ్మను ఎవరైనా చూడవచ్చు. పార్లమెంట్‌ను ఒక సర్కస్‌గా వర్ణించిన ఆ విమర్శకుడిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆ బొమ్మను దిగువ చూడండి.

Image result for derogatory jokes,cartoons on legislative buildings, ireland

ప్రముఖ దర్శకుడు విశ్వనాధ్‌ నిర్మించిన ఒక సినిమాలో ఒక పాత్రను మరో పాత్ర దద్దోజనం అని హేళన చేస్తుంది. అలాగే మరో సినిమాలో పండూ అని పిలిస్తే హీరోయిన్‌ ఎంతలా రెచ్చి పోతుందో తెలిసిందే. ఇండ్లలో వున్నంత వరకు కుటుంబ సభ్యులు, బాగా సన్నిహితులైన ఇరుగుపొరుగు పిల్లలకు చిన్నతనంలో పెట్టిన కొన్ని ముద్దు పేర్లు పెద్దయిన తరువాత కూడా వారిని వదలి పెట్టవు. ఎండ పెరిగే కొద్దీ దున్నలు రెచ్చిపోయి పొలందున్నుతుంటాయి, అదే ఎద్దులు ఎండ పెరిగే కొద్దీ నీడలోకి జారుకొనేందుకు లాగుతాయి. రాజకీయాలలోకి అంటే బహిరంగ జీవనంలోకి వచ్చిన తరువాత ప్రత్యర్ధులు కొన్ని పేర్లు పెడుతూ వుంటారు. అలాంటపుడు ఎంత ప్రతికూల వాతావరణం వున్నా పోలిక కాస్త ఇబ్బంది పెట్టినా దున్నపోతుల మాదిరి వాటన్నింటినీ భరించే విధంగా తయారు కావాలి తప్ప ఎద్దుల్లా సున్నితంగా వ్యవహరించకూడదు. లేదంటే రాజకీయాలకు దూరంగా వుండాలి. అనేక దేశాలలో ప్రత్యర్ధుల మీద ఎన్నో జోకులు వేస్తుంటారు. సందర్భం వచ్చినపుడు ప్రత్యర్ధులు కూడా అదే ప్రయోగం చేస్తుంటారు. వాటిని తేలికగా తీసుకోవాలి తప్ప అంతకు మించి పోకూడదు. కెనడా పార్లమెంట్‌ బొమ్మ వేసి ఎంపీలు, స్పీకర్‌పై వేసిన జోకును చూడండి.

Image result for derogatory jokes,cartoons on legislative buildings

క్షమించాలి స్పీకర్‌ గారూ పరస్పరం గౌరవించుకొనే మన యత్నాలలో భాగంగా దానిని మరో రూపంలో నన్ను చెప్పనివ్వండి !

గౌరవ నీయులైన ప్రతిపక్ష సభ్యుడు దయచేసి సున్నితమైన నోటిలో వున్న వాటిని బయటకు రాకుండా మూస్తారా !

చట్ట సభలలో వుపయోగించే భాషపై వేసిన జోక్‌ ఇది. అంటే దాని అర్ధం మొత్తం సభ్యులందరూ అలా వున్నారంటూ మా మనోభావాలను కించపరిచారని ఎవరూ ఆ కార్టూనిస్టు మీద చర్య తీసుకోలేదు. తొలి ప్రధాని నెహ్రూ ప్రభుత్వం, మంత్రుల వ్యవహారశైలి గురించి ప్రముఖ కార్టూనిస్టు శంకర్‌ తన చిత్రాల ద్వారా ఏకి వదలి పెట్టేవారు. ఒక సందర్భంలో నెహ్రూ నన్ను కూడా వదలి పెట్టవద్దని శంకర్‌తో అన్నారని అందరం చదువుకున్నాం.పూటకో పార్టీ మారుతున్న, అలాంటి వారిని నిస్సంకోచంగా పార్టీలలో చేర్చుకుంటున్న నేటి రాజకీయ నాయకులు కూడా చదువుకోవటం అవసరం.

గీతలతో తమ భావాలను స్వేచ్చగా వెలిబుచ్చే వారికి చట్టపరమైన అవగాహన కూడా అవసరం అని గతంలో కూడా అనేక అనుభవాలు రుజువు చేశాయి. ఐరోపాలోనో మరొకచోటో అలాంటి కార్టూన్లు వేస్తే సహించారు కదా ఇక్కడెందుకు చేయరు అని వాదిస్తే లాభం లేదు. అక్కడా చట్టాలున్నాయి.మనం బూతు అనుకొనే పదాలతో మరింత పచ్చిగా విమర్శలు, వ్యాఖ్యలు చేయటాన్ని మనం చూస్తున్నాం. ఇలాంటి చిన్న చిన్న విషయాలను పట్టించుకొనే దశను వారు దాటిపోయారు. పార్టీ మారిన వారు పూర్వపు పార్టీ పదవులకు రాజీనామా చేయాలన్నది ఒక నాటి నీతి. అలాంటిదేమీ లేదు ఏ పార్టీ గుర్తు మీద గెలిచినా చివరకు మంత్రి పదవులు కూడా పుచ్చుకోవచ్చన్నది నేటి ఆచరణ. అంటే సిగ్గుపడే దశను దాటి ముందుకు పోయాం. అలాంటి వారిపై గౌరవనీయ చట్ట సభలు, వాటి అధిపతులు ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదు. రక్షిస్తున్నారనే ఫిర్యాదులు, విమర్శలున్నాయి. రాజ్యాంగాన్ని అమలు జరిపే గవర్నర్లు సైతం అలాంటి వారి చేత ప్రమాణ స్వీకారాలు చేయిస్తున్నారు. మన రాజ్యాంగం, చట్టాలు, నిబంధనలలో వున్న లొసుగుల కారణంగానే ఇవన్నీ జరుగుతున్నాయి. గతంలో దిగంబర కవులుగా పేరు పెట్టుకున్న వారు పార్లమెంటు, అసెంబ్లీలను ఎలా తిట్టిపోశారో తెలిసిందే. ఇప్పుడు చట్ట సభలు, వాటిలో జరుగుతున్న వాటి గురించి నైతికంగా ఆలోచించే వారందరూ దిగంబరు కవులు కాకుండానే వాటిని ఏవగించుకుంటున్నారు. ఈ పూర్వరంగంలో సాంకేతికపరమైన, చట్టపర అంశాలకు అతీతంగా ఆలోచించి మందలింపుతోనో మరొక చర్యతోనో సరిపెట్టి కార్టూనిస్టు రవి కిరణ్‌పై క్రిమినల్‌ చర్యలను వుపసంహరిస్తే తెలుగు దేశం పార్టీకి సామాజిక మాధ్యమంలో జరిగిన నష్టం నివారించబడుతుంది. అటువంటి విశాల వైఖరిని వారు ప్రదర్శిస్తారా ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

కావాల్సింది వృధా చర్చా ! నమ్మక ద్రోహంపై రచ్చా !

04 Thursday Aug 2016

Posted by raomk in AP NEWS, BJP, Congress, CPI(M), Current Affairs, INDIA, NATIONAL NEWS, Others

≈ Leave a comment

Tags

ap special status, BJP, center's betrayal, CHANDRABABU, tdp

ఎం కోటేశ్వరరావు

     పుష్కర స్నానాల వలన పుణ్యం వస్తుందని బలంగా విశ్వసించటానికి కొంత మందికి ఎలా స్వేచ్ఛ వుందో అదొక మూఢనమ్మకం అని నమ్మేవారికి కూడా అంతే స్వేచ్చ మన దేశంలో వుంది. అందువలన సందర్భం వచ్చినపుడు దాని మంచి చెడ్డలను చర్చించటం తప్పుకాదు. వ్యతిరేక అభి ప్రాయాన్ని వ్యక్తీకరించటం ద్వారా మా మనోభావాన్ని దెబ్బతీశారని ఎవరైనా దెబ్బలాటకు వస్తేనే సమస్య. ప్రపంచంలో ప్రతి మతం, కులం, తెగ ఇలా ఎన్ని తరగతులుంటే అన్నింటికీ సారూప్యత గలిగిన మూఢనమ్మకాలు,ఆచారాలకు కొదవ లేదు. ఆధునిక ప్రవచన కారులు సరికొత్త మూఢనమ్మకాలను ఎక్కిస్తున్నారు. పుష్కరాలనేవి ఒక మతానికి చెందిన నమ్మకం తప్ప వేరు కాదు. కృష్ణా పుష్కరాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో పన్నెండు రోజుల పాటు పన్నెండు అంశాల మీద రోజుకొకదానిపై చర్చా గోష్టులు, సదస్సులు జరపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు. రాష్ట్ర ప్రజానీకంలో పెద్ద ఎత్తున ఆశలు రేకెత్తించటానికి, ఓట్లు దండుకోవటానికి, చివరకు నమ్మక ద్రోహానికి మారుపేరుగా మారిన రాష్ట్ర ప్రత్యేక హోదా రాకపోతే ఏం చేయాలో, ఇప్పటికే చేయాల్సిందానికంటే ఎక్కువే చేశాం లెక్కలు చెప్పటం లేదంటున్న బిజెపి నేతల ప్రచార వాస్తవ అవాస్తవాలేమిటో ఒక సమగ్ర శ్వేత పత్రం ప్రకటించి పన్నెండు కోణాలలో పన్నెండు రోజులు చర్చలు జరపమని చంద్రబాబు నాయుడు రచ్చ చేసి వుంటే చర్చ సమంజసంగా వుండేది. కనీసం జనానికి వాస్తవాలు ఏమిటో అన్నా తెలిసేవి. కేంద్రం ఇచ్చే ప్రత్యేక నిధులతో ఆర్ధిక లోటు తీర్చి, ప్రత్యేక హోదాతో వచ్చే ఆకర్షణీయ రాయితీలతో పెట్టుబడులను ఆకర్షించి రాష్ట్ర రూపు రేఖలు మార్చివేస్తామని చెప్పిన వారు అసలు ఆ ఆంశాలనే చర్చనీయాంశాల జాబితాలో లేకుండా చేశారు. పుష్కరాలలో పితృదేవతలకు పిండ ప్రదానం చేసినట్లుగా ప్రత్యేక హోదాకు కూడా అదే చేస్తారా ? చిత్రం ఏమంటే ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేని ఒక మూఢనమ్మకం, ఒక మతానికి చెందిన కార్యక్రమం సందర్భంగా ప్రభుత్వం జరప తలపెట్టిన చర్చలో సమాజ పురోగతికి అవసరమైన శాస్త్రీయ భావజాలాన్ని చర్చ నీయాంశంగా చేయకపోవటం. అసలు మత క్రతువుల సందర్భంగా ఇలాంటి కిరస్తానీ చర్చలేంటి అనే ‘గురజాడ అగ్నిహోత్ర అవధానులు’ ఎవరైనా వుంటే అది వేరే విషయం.

     చర్చ చేయండని చంద్రబాబు చెప్పిన పన్నెండు అంశాలు విజన్‌ 2050లో పేర్కొన్నవాటికి మించి సామాన్యజనానికి ఆసక్తి కలిగించేవి కొత్తగా ఏమన్నా వుంటే వాటి గురించి చర్చించవచ్చు. అన్నింటికీ మించి విచారకరమైన అంశం ఏమంటే రాష్ట్రాల హక్కులు, ఆత్మగౌరవ నినాదంతో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ముందుకు వచ్చిన తెలుగు దేశం పార్టీ ఇప్పుడు అంతకంటే మెరుగైన పరిస్థితేమీ లేకున్నా, నమ్మక ద్రోహం జరిగిందని యావత్‌ ప్రజానీకం భావిస్తున్న స్ధితిలో గతాన్ని గోతిలో పారవేసి ఏం చేసినా పొత్తు పెట్టుకున్నోళ్లతో సర్దుకు పోక తప్పదన్న వైఖరి తీసుకోవటం ఒక విషాదం. రాష్ట్ర ఆర్ధిక అభివృద్ధి విషయాలలో తాను రాజకీయాలు చేయనని, అందుకు ఇతర సందర్భాలుంటాయని చంద్రబాబు అనేకసార్లు చెప్పి పెద్ద రాజనీతిజ్ఞుడిగా అనేక మంది ప్రశంసలు పొందారు. ఇప్పుడు రాజ్యసభలో బిజెపి తప్ప అన్ని పార్టీలు ప్రత్యేక హోదా గురించి ఏకాభిప్రాయం వ్యక్తం చేసిన తరుణంలో పరిణితితో అన్ని పార్టీలను ఏకత్రాటిపై నడిపించి కేంద్రంపై వత్తిడి పెంచాల్సిన చంద్రబాబు అందుకు భిన్నంగా తాను, తన సైనికుల ద్వారా రాజకీయాలు మాట్లాడించి నిజమైన రాజనీతిజ్ఞుడు, రాష్ట్రంకోసం నిజాయితీగా పని చేస్తున్నారు అనే పేరు తెచ్చుకొనే అవకాశాన్ని జారవిడుచుకున్నారు.ప్రత్యేక హోదా విషయంలో మిగతా పార్టీలను కలుపుకుంటే దాని ద్వారా పొందే రాజకీయలబ్ది తగ్గుతుందనుకున్నారా ? తద్విరుద్ధంగా ప్రవర్తించి బిజెపిని ఒక్క మాట కూడా అనకుండా మొదటికే మోసం తెచ్చుకొనేందుకు పునాది వేసుకున్నారా ? గోదావరి పుష్కరాలలో మునిగి పుణ్యం పొంది ప్రత్యేక హోదా, కనీసం లోటు పూడ్చుకొనేందుకు నిధులు కూడా తెచ్చుకోలేకపోయారు. మరి ఆ పుణ్యం ఏమైనట్లు ?

     ఇక్కడ మరొక అంశాన్ని ప్రస్తావించటం సందర్భ సహితం అని భావిస్తున్నాను.ముస్లిం లేదా ఇస్లాం హాజ్‌ సబ్సిడీలను 2022 నాటికి రద్దు చేయాలని ఒకవైపు సుప్రీం కోర్టు తీర్పు ఇస్తే అదే సమయంలో హిందు క్రతువులకు ప్రజల సొమ్మును ఖర్చు చేయటం విపరీతంగా పెరిగిపోతోంది. అవి పుష్కరాలు, కుంభమేళాలు, మానస సరోవర, చార్‌ధామ్‌ వంటి యాత్రలు ఏవైనా కావచ్చు. వాటి సందర్భంగా పెడుతున్న ఖర్చు హాజ్‌ సబ్సిడీల కంటే ఎంతో ఎక్కువగా వుంటోందా లేదా ? హాజ్‌ మాదిరి నగదు సబ్సిడీ ఇవ్వకపోవచ్చు, అందుకోసం ఏర్పాట్ల పేరుతో చేసే ప్రజాధనం ఖర్చు సంగతేమిటి ? ప్రతి సేవకూ రుసుము చెల్లించాల్సిందే ఏదీ వుచితం కాదు అని చెబుతున్న ప్రభుత్వాలు ఇలాంటి కార్యక్రమాల సందర్బంగా చేసే ఖర్చులకు ఒక ఖాతాను తెరిచి అందుకయిన ఖర్చును, వాటిలో పాల్గొన్నవారి నుంచి రాబడితే అది విమర్శలకు తావుండదు. అలా చేయటం లేదే ! పుష్కర యాత్రీకులను ఘాట్ల వద్దకు చేర్చేందుకు వుచితంగా బస్సులు ఏర్పాటు చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ రవాణాశాఖ మంత్రి సిద్ధా రాఘవరావు ప్రకటించారు. అసలే ఆర్టీసి నష్టాల్లో వుందని చెబుతూ ఇలా చేయటాన్ని ఎవడబ్బ సొమ్మని రామచంద్రా అన్నట్లు ఎవరైనా ప్రశ్నిస్తే ఏం సమాధానం చెబుతారు ?

    బ్రిటీష్‌ వారి కాలంలో రాణీగారి ప్రభుత్వం ప్రవేశపెట్టిన హాజ్‌ సబ్సిడీ స్వాతంత్య్రం తరువాత కూడా కొనసాగించారు. స్వాతంత్య్రపోరాట కాలంలో ముస్లింలను పోరుబాట నుంచి వేరు చేయటానికి తెల్లవారు అనేక ఎత్తుగడలు వేశారు. వాటిలో ఇది కూడా ఒకటి. విమానాలు రాక ముందు ఓడలే ప్రయాణ సాధనాలు కనుక బ్రిటీష్‌ ప్రభుత్వం తమ దేశ ఓడల కంపెనీ ఓడ ఎక్కి సౌదీ వెళ్లిన వారికే సబ్సిడీ అని కూడా నిబంధన విధించినందున దానిలో కూడా షిప్పింగ్‌ కంపెనీ ప్రయోజనాలు దాగి వుంటాయనటంలో ఎలాంటి సందేహం లేదు.తెల్లవారిని తరిమేసి వారి స్ధానంలో అధికారానికి వచ్చిన నల్లవారు కూడా ఓటు బ్యాంకు రాజకీయాలలో భాగంగా దానిని కొనసాగించారని చేసే విమర్శలో వాస్తవం లేకపోలేదు. చేసిన మార్పేమిటంటే ఓడల రాయితీని విమానాలకు వర్తింప చేశారు. అది కూడా ప్రభుత్వ రంగ విమానాలకే వర్తిస్తుంది. ఇది లౌకిక వాదానికి విరుద్ధం అంటూ కొందరు కోర్టుకు వెళ్లారు. దానిని విచారించిన సుప్రీం కోర్టు 2012లో ఒక తీర్పు ఇస్తూ 2022 నాటికి సబ్సిడీని పూర్తిగా ఎత్తివేయాలని ఆదేశించింది. ఈ సబ్సిడీని హిందూత్వ శక్తులు మతకారణంతో వ్యతిరేకిస్తే, మాకు సబ్సిడీ ఇచ్చే పేరుతో ఎయిరిండియాను బతికించేందుకు ప్రభుత్వం దానికి మాత్రమే ఇచ్చిందని, ఇతర కంపెనీల రేట్ల కంటే ఎయిరిండియా రేట్లు ఎక్కువని విమర్శించే ముస్లింలు కూడా లేకపోలేదు.

    పుష్కరాలు ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వస్తుంటాయి.ఒక మత పుష్కరాలను రాష్ట్ర వేడుకగా నిర్ణయించటం లౌకిక వ్యవస్ధకు, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్దమా, అనుకూలమా ? గతేడాది గోదావరి, ఈ ఏడాది కృష్ణా పుష్కరాల సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలలోనూ పెడుతున్న ఖర్చు, చేస్తున్న హడావుడి గతంలో ఎన్నడూ లేదంటే అతిశయోక్తి కాదు.ఎన్నడూ లేని కొత్త కొత్త పద్దతులను ప్రవేశపెడుతున్నారు. నిజంగా పుష్కరుడు వుండి వుంటే గోదావరి పుష్కరాల సందర్భంగా జరిగిన దానికి నిరసనగా కృష్ణా పుష్కర బహిష్కరణ జరిగేదేమో? పుష్కరాల కంటే ముఖ్యమంత్రుల కీర్తి కండూతిని పెంచుకోవటం ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. దేశ విదేశాల్లో వున్న వారికి, రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నవారికి , షరా మామూలుగా గ్రామాలు, పట్టణాలలోని ప్రజా ప్రతినిధులు, ముఖ్యులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సంతకంతో కూడిన ఆహ్వానాలు పంపటం ప్రచార ఎత్తుగడ తప్ప మరొకటి కాదు. వాటి కాంట్రాక్టు పుచ్చుకున్న ముద్రణా సంస్ధలకు తప్ప వాటిని అందుకున్నవారికి, అందుకయ్యే అనవసర ఖర్చు భరించే జనానికి ఒక్క పైసా ప్రయోజనం వుంటుందా? హాజ్‌ సబ్సిడీని రద్దు చేస్తూ అందుకు చేసే ఖర్చును కావాలంటే మైనారిటీల సామాజిక, విద్యా అభివృద్ధికి ఖర్చు చేయవచ్చని సుప్రీం కోర్టు చెప్పిన సలహా ఇతర సందర్భాలకు వర్తించదా ?

   రెండు సంవత్సరాలు గడిచినా చేసిన ప్రధాన వాగ్దానాలలో ఒక్కటి కూడా అమలు జరపని స్ధితి.కొంతకాలం రాజధాని భూ సేకరణ, మరికొంత కాలం రాజధాని ఎలా వుండాలి, మరి కొంత కాలం తాత్కాలిక రాజధాని నిర్మాణం, మరి కొంత కాలం శాశ్వత రాజధాని ఎలా నిర్మించాలి, దానికి అప్పు ఎలా తేవాలి ఇలా ఆవు వ్యాసం రాసిన మాదిరి కాలక్షేపం చేయటం, ప్రతి సందర్భాన్ని అతిశయోక్తులతో పెద్ద ఎత్తున ప్రచారం చేసి ప్రజల దృష్టి మళ్లించటం తప్ప మరొకటి కనిపించటం లేదు. ఇలాంటి వాటికి బుట్టలో పడేంత ఆమాయకంగా ఆంధ్రులు వున్నారా ? ఎవరైనా అనుకుంటే పప్పులో కాలేసినట్లే. అతి సర్వత్ర వర్జయేత్‌ అన్నారు పెద్దలు. అతిగా ప్రచారంలో జనాన్ని ముంచితే తామూ దానిలోనే మునుగుతారని గ్రహించటం అవసరం.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

అంతరాష్ట్ర మండలిలో తెలుగు చంద్రులేం ప్రసరించారు ?

18 Monday Jul 2016

Posted by raomk in AP, BJP, CPI(M), Current Affairs, Economics, INDIA, NATIONAL NEWS, Others, Telangana

≈ Leave a comment

Tags

BJP, CHANDRABABU, inter state council meet, Inter-State Council, ISC, KCR, Modi

ఎం కోటేశ్వరరావు

     పది సంవత్సరాల తరువాత జూలై 17న న్యూఢిల్లీలో సాదాసీదాగా అంతరాష్ట్ర మండలి సమావేశం జరిగింది. కేంద్రం-రాష్ట్ర సంబంధాలు, ముఖ్యంగా నిధులు, విధుల బదలాయింపులు, రాష్ట్రాల హక్కుల గురించి చర్చ జరుగుతుందని ఎవరైనా భావిస్తారు. సమాఖ్య స్పూర్తికి విరుద్ధంగా కేంద్రం ఎలా వ్యవహరిస్తున్నదో దశాబ్దకాలం పాటు అసలు సమావేశం జరగపోవటమే తేటతెల్లం చేసింది. ఈ విషయంలో కాంగ్రెస్‌-బిజెపి దొందూ దొందే. కేంద్ర రాష్ట్ర సంబంధాలపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్‌ మదన్‌ మోహన్‌ పంఛి అధ్యక్షతన 2007 ఏప్రిల్‌ 27న బాధ్యతలు స్వీకరించిన కమిషన్‌ 2010 మార్చి 30 కేంద్ర ప్రభుత్వానికి తన నివేదికను సమర్పించింది. ఎలాంటి ప్రచార ఆర్బాటాలు లేకుండా తన పని తాను చేసిన కమిషన్‌గా ఇది పేరు తెచ్చుకుంది. అప్పటి నుంచి ఆ కమిషన్‌ నివేదికకు కాంగ్రెస్‌ హయాంలో నాలుగు సంవత్సరాలు, బిజెపి ఏలుబడిలో రెండు సంవత్సరాలు దుమ్ము పేరుకు పోయింది.దీనిలోని సిఫార్సులను ఏకాభిప్రాయంతోనే కేంద్రం అమలు జరుపుతుందని ముక్తాయింపుగా ప్రధాన మంత్రి నరేంద్ర అంతరాష్ట్ర మండలి సమావేశ ముగింపులో చెప్పారు. అంటే దీని సిఫార్సులు ఎప్పుడు ఆమోదం పొందుతాయో తెలియని స్ధితి.

    తెల్లవారే సరికి ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసి దాని స్ధానంలో నీతి ఆయోగ్‌ను ప్రవేశపెట్టగలిగిన బిజెపికి కేంద్ర రాష్ట్ర సంబంధాలపై ఆసక్తి, అన్నింటికీ మించి నిజాయితీ వుంటే ఈ నివేదికపై సమావేశం జరపటానికి రెండు సంవత్సరాల వ్యవధి తీసుకోవాల్సిన అవసరం లేదు. సమాఖ్య స్పూర్తిని, రాజ్యాంగ నిబంధనలను దెబ్బతీయటంలో కాంగ్రెస్‌ రికార్డును తిరగరాసేందుకు బిజెపి పూనుకుందని వుత్తరాఖండ్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌లో ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చివేసేందుకు చేసిన పనులను బట్టి స్పష్టమైంది. తమది భిన్నమైన పార్టీ అని స్వంత డబ్బా కొట్టుకొని ఇతరులను విమర్శించే నైతిక హక్కును అది కోల్పోయింది. పూంఛీ కమిషన్‌ సిఫార్సులకు వ్యతిరేకంగా అది వ్యవహరించింది.తమది పనిచేసే ప్రభుత్వమని, కనిష్ట ప్రభుత్వం గరిష్ట పాలన అని చెప్పుకున్న పార్టీ, ప్రభుత్వం ఈ సమావేశ ఏర్పాటుకు ముందే కమిషన్‌ చేసిన సిఫార్సులలో వేటిని కేంద్ర ప్రభుత్వం ఆమోదించిందో వేటిని తిరస్కరించిందో, వేటిపై చర్చ జరగాలని కోరుకుంటోందో ఒక వైఖరిని తీసుకొని రాష్ట్రాల ముందు వుంచితే వాటి మంచి చెడ్డలపై మధనం జరిగి, ఒక కొలిక్కి వచ్చేందుకు దారి చూపేది. అదేమీ లేకుండా మొక్కుబడిగా సాగదీసేందుకు పూనుకుంది.

    ఇప్పటికే కేంద్రం-రాష్ట్రాల మధ్య వున్న సంబంధాలు, సత్సంప్రదాయాలు, వివిధ సమస్యలపై కోర్టులు వెలువరించిన అభిప్రాయాలతో కమిషన్‌ తాను వుచితం అనుకున్న సమస్యలన్నింటిపైన అభిప్రాయాలు తెలిపే విధంగా ఈ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. సుదీర్ఘకాల కాంగ్రెస్‌, మధ్యలో అధికారంలోకి వచ్చి స్వల్పకాలమే వున్న జనతా, నేషనల్‌ ఫ్రంట్‌, బిజెపి నాయకత్వంలోని ఎన్‌డిఏ ప్రభుత్వాలుగానీ గతంలో వివిధ కమిషన్లు చేసిన సిఫార్సులను తుచ తప్ప కుండా లేదా వాటి స్ఫూర్తిని గానీ అమలు జరిపిన పాపాన పోలేదు. అందువలన కమిషన్లు అంటే సాగదీయటానికి, రిటైరైన న్యాయమూర్తులు, వున్నతాధికారులకు వుపాధి కల్పన అంశాలుగా మారాయంటే అతిశయోక్తి కాదు, దాంతో జనానికి వాటిమీద విశ్వాసం పోయింది.పూంఛీ కమిషన్‌ సిఫార్సులు కూడా గత కమిషన్ల జాబితాలో చేరతాయా ?

    పూంఛీ కమిషన్‌ చేసిన ప్రధాన సిఫార్సుల సారాంశం ఇలా వుంది.కల్లోలం సంభవించిన నిర్దిష్ట ప్రాంతాలను పరిమిత కాలం పాటు కేంద్రం తన పాలన కిందకు తెచ్చుకొనేందుకు ఆర్టికల్‌ 355,356ను సవరించాలి. ఒక జిల్లా లేదా జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో స్ధానిక అత్యవసర పరిస్ధితిని ప్రకటించేందుకు కేంద్రానికి అధికారం ఇచ్చే విధంగా 355,356 ఆర్టికల్స్‌ను సవరించాలి. అయితే అలాంటి అత్యవసర పరిస్థితి వ్యవధి మూడునెలలకు మించి వుండకూడదు. మత హింసాకాండ తలెత్తినపుడు రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో నిమిత్తం లేకుండా స్వల్పకాలం పాటు కేంద్ర దళాలను దించేందుకు కేంద్రానికి అనుమతిచ్చే విధంగా మత హింసాకాండ బిల్లుకు సవరణ చేయాలి. సాయుధ దళాలను దించేందుకు రాష్ట్రాల అనుమతి ఆటంకంగా మారకుండా సవరణ చేయాలి.అయితే బలగాల మోహరింపు ఒక వారానికి మాత్రమే పరిమితం చేయాలి. అంతకు మించి వుండేందుకు రాష్ట్రాల అనుమతి తీసుకోవాలి.ముఖ్యమంత్రుల నియామకానికి సంబంధించి ఎన్నికలకు ముందు వున్న ఎన్నికల కూటమిని ఒక రాజకీయ పక్షంగా పరిగణిస్తూ స్పష్టమైన మార్గదర్శక సూత్రాలను రూపొందించాలి. ఎవరికీ మెజారిటీ రాని పక్షంలో గవర్నర్లు ఏ పద్దతిని పాటించాలో కూడా స్పష్టం చేయాలి.ఎన్నికలకు ముందు వున్న కూటములలో ఎక్కువ సంఖ్య వున్నదానిని ఆహ్వానించాలి.ఎన్నికల అనంతరం ఏర్పడే కూటములలోని పార్టీలన్నీ ప్రభుత్వంలో చేరే విధంగా నిర్దేశించాలి. ఒక మంత్రిపై చర్య తీసుకోకూడదని మంత్రివర్గం చేసిన సిఫార్సును తోసిపుచ్చి చర్యకు అనుమతి మంజూరు చేసే అధికారం గవర్నర్లకు వుండాలి. గవర్నర్లను విశ్వవిద్యాలయాల చాన్సలర్లుగా చేసే సాంప్రదాయాన్ని రద్దు చేయాలి. గవర్నర్లుగా నియమితులయ్యే వారు స్ధానిక స్ధాయిలలో కూడా నియామకానికి ముందు కొన్ని సంవత్సరాల పాటు క్రియాశీల రాజకీయాలకు దూరంగా వుండాలి. గవర్నరు సంబంధిత రాష్ట్రానికి చెందకూడదు, ప్రముఖ వ్యక్తి అయివుండాలి. గవర్నర్లను నిరంకుశంగా తొలగించకూడదు, గవర్నర్లను రాజకీయ ఫుట్‌బాల్‌ మాదిరి పరిగణించటాన్ని నిలిపివేయాలి.గవర్నర్లను ఐదేళ్ల కాలానికి నియమించాలి, మధ్యలో వారిని తొలగించాలంటే అసెంబ్లీ అభిశంసన ద్వారా మాత్రమే జరగాలి. తొలగింపునకు కారణం బాధ్యతల నిర్వహణకు సంబంధించినదై వుండాలి. గవర్నర్‌ నియామకంలో ముఖ్యమంత్రి పాత్ర వుండాలి. గవర్నర్ల నియామకానికి ప్రధాని, హోంమంత్రి, లోక్‌సభ స్పీకర్‌, సంబంధిత రాష్ట్ర ముఖ్యమంత్రితో కూడిన కమిటీని ఏర్పాటు చేయాలి.ఈ క్రమంలో వుపరాష్ట్రపతికి కూడా ప్రమేయం కల్పించవచ్చు.ఈ సిఫార్సులపై కూలంకషంగా చర్చ జరగాలి. అంతరాష్ట్ర మండలి సమావేశాలు ఏడాదికి మూడు సార్లు జరపాలి. జాతీయ సమగ్రతా మండలిని కనీసం ఏడాదికి ఒకసారి సమావేశ పరచాలి. ఎక్కడైనా మతపరమైన సమస్య తలెత్తినపుడు వెంటనే మండలిలోని ఐదుగురు సభ్యులను అక్కడికి పంపి నివేదిక తెప్పించుకోవాలి. రాష్ట్రాలపై ఏకాభిప్రాయ బాధ్యతను పెట్టబోయే ముందు కేంద్రం తన వైఖరి ఏమిటో తెలపాలి. నరేంద్రమోడీ అధికారానికి రాకముందే ఈ సిఫార్సులను చేశారు. ఒక వేళ వాటిని బిజెపి లేదా ఎన్‌డిఏ ఆమోదిస్తున్నట్లయితే వాటి స్ఫూర్తితో నిర్ణయాలు చేసి వుండవచ్చు. ఆచరణలో గవర్నర్ల విషయంలో సిఫార్సులకు విరుద్ధంగా వ్యవహరించటాన్ని మనం చూశాము.

   నువ్వొకందుకు పోస్తే నేనొకందుకు తాగా అన్నట్లుగా కేంద్రం మొక్కుబడిగా నిర్వహించిన ఈ సమావేశం సందర్భంగా కొందరు ముఖ్యమంత్రులు, పార్టీలు కూడా అదే విధంగా వ్యవహరించాయి. అంతరాష్ట్ర మండలి సమావేశ ప్రారంభంలో ప్రధాని ప్రసంగిస్తూ పన్నుల వాటాను 32 నుంచి 42కు పెంచామని, 2014-15తో పోలిస్తే రాష్ట్రాలకు మరుసటి ఏడాది 21శాతం ఎక్కువ నిధులు ఇచ్చామని చెప్పారు. మరోవైపు వాస్తవాలు అంకెలు వేరే సందేశాన్ని ఇస్తున్నాయి. రాష్ట్రాలకు ఇస్తున్న గ్రాంట్లలో గణనీయమైన కోత పెడుతున్నది కేంద్రం. ఇది కేంద్ర, రాష్ట్ర సంబంధాలలో ఒక ముఖ్యమైన అంశం. కేంద్రం గొప్పగా చెబుతున్న 32 నుంచి 42 శాతం పన్నుల బదిలీ 14వ ఆర్ధిక సంఘం సిఫార్సుల ప్రకారం జరుగుతుంది. బదిలీ 2015 ఏప్రిల్‌ ఒకటి నుంచి ఐదు సంవత్సరాల వ్యవధిలో జరపాలి. అంటే ఐదేండ్ల వరకు క్రమంగా పెంచుకుంటూ పోయి ఐదవ ఏట నుంచి ప్రతి ఏటా పదిశాతం నిధుల బదిలీ జరుపుతారు.దీనికి అనుగుణంగా 2015-16లో రాష్ట్రాలకు జిడిపిలో 6.3శాతం నిధులను బదలాయించాలని ప్రతిపాదించారు.సవరించిన అంచనాల ప్రకారం అది 6.1శాతానికి తగ్గింది. వాస్తవ బదిలి తరువాత గానీ తెలియదు.కేంద్రం నుంచి రాష్ట్రాలకు రెండు రకాలుగా బదిలీ జరుగుతుంది. ఒకటి పన్నుల బదిలీ. దానికేమీ షరతులు వుండవు.రెండవది గ్రాంట్లు. వీటికి సవాలక్ష షరతులు విధిస్తారు. ఇది కూడా కేంద్ర-రాష్ట్ర సంబంధాలలో వివాదాస్పద అంశమే. గతేడాది జిడిపిలో 3.4శాతం పన్నులను రాష్ట్రాలకు బడ్జెట్‌లో చూపారు. అది సవరించిన అంచనాలలో 3.7శాతానికి పెరిగింది. చూశారా మేం ఎంత వుదారంగా వున్నామో కేంద్రం గొప్పలు చెప్పుకోవచ్చు. పన్నులలో వాటాను పెంచినప్పటికీ అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే గతేడాది సర్‌చార్జీలు, సెస్‌ల రూపంలో వసూలు చేసి కేంద్ర ఖజానాకు చేర్చిన మొత్తం పన్ను ఆదాయంలో 6.1 నుంచి 8.1 శాతానికి పెరిగింది.ఈ మొత్తంలో రాష్ట్రాలకు వాటా వుండదు. గ్రాంట్లుగా రాష్ట్రాలకు బడ్జెట్‌లో 2.9శాతం చూపి సవరించిన దానిలో 2.4కు తగ్గించారు.వర్తమాన సంవత్సరంలో ఈ కేటాయింపులు ఎలా అమలు జరుగుతాయో చూడాల్సి వుంది. అందువలన ఆర్ధిక మంత్రి, నరేంద్రమోడీ ఏం చెప్పినప్పటికీ ఆచరణ ఏమిటన్నదే గీటురాయి. సేవా, రైతుల పేరుతో వసూలు చేసే సెస్సులన్నీ కేంద్ర ఖాతాకే పోతాయి అంటే కేంద్రానికి చేరే నిధుల శాతం మరింతగా పెరుగుతుంది.

    కేంద్ర పధకాల పేరుతో రాష్ట్రాలపై మోపుతున్న భారాల గురించి తెలంగాణా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ వంటి వారు ప్రముఖంగా తమ వైఖరిలో వెల్లడించారు.కేంద్ర ప్రాయోజిత పధకాలన్నీంటికీ గ్రాంట్ల రూపంలో తొలుత కేంద్రం నిధులు కేటాయిస్తుంది. తరువాత అసలు కధ మొదలౌతుంది. నరేంద్రమోడీ చెప్పినట్లు పన్నుల వాటా ఖరారు గాక ముందు కేంద్రం నుంచి రాష్ట్రాలకు పెద్ద ఎత్తున నిధులు బదిలీ అయ్యాయి. పన్నుల వాటాను 42శాతానికి పెంచేందుకు అంగీకరించిన కేంద్రం,ఆ వెంటనే ఎలక్ట్రానిక్‌ పాలన, మోడల్‌ స్కూళ్ల వంటి ఎనిమిది పధకాలకు అంతకు ముందు వున్న 60:40 దామాషాలో వున్న నిధుల కేటాయింపులో కేంద్ర వాటాను తగ్గించింది. మిగతా పధకాలకు నిధుల విడుదలకు షరతులను కఠినతరం గావించింది. కేంద్రం నుంచి రాష్ట్రాలకు బదిలీ అయ్మే నిధుల మొత్తం పెరిగిన తరువాత రాష్ట్రాల రుణ భారం, ఆర్దిక వత్తిడి తగ్గాలి. అయితే బడ్జెట్లలో చూపిన దానికంటే 16 రాష్ట్రాలు ఎక్కువగా అప్పులు తీసుకున్నట్లు జపాన్‌ సంస్ధ నోమురా నివేదిక తెలిపింది. ప్రణాళికా సంఘాన్ని రద్దు చేయటాన్ని కేరళ ముఖ్యమంత్రి తప్పుపట్టారు. పూంఛీ కమిటీ సిఫార్సులపై చర్చకు ఒక స్టాండింగ్‌ కమిటీని ఏర్పాటు చేయాలని సూచించారు.

     తెలుగు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు ఈ సమావేశంలో చేసిన ప్రసంగ పూర్తి పాఠాలను మీడియాకు విడుదల చేశారు. చంద్రబాబు నాయుడు తన రీతికి తగినట్లుగా 13పేజీల ప్రసంగం చేస్తే చంద్రశేఖరరావు ఏడు పేజీలకే పరిమితం అయ్యారు. అందువలన వారిద్దరూ ఏం చెప్పారనే అంశాన్ని పరిశీలించుదాం. తెలంగాణా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రసంగ సారాంశం ఇలా వుంది. జాతీయ రహదారులకు కేంద్రం కేటాయింపులు పెంచటం మంచిదే అదే సమయంలో సాగునీరు, విద్య, ఆరోగ్య రంగానికి కూడా నిధులు పెంచాలి. సాగునీటి రంగంలో ప్రతి ఒక్క రాష్ట్రంలో ఒక భారీ పధకానికి కేంద్రం నిధులు ఇవ్వాలి.వుమ్మడి జాబితాలోని అంశాలకు సంబంధించి కేంద్రం ఏదైనా నూతన చట్టం లేదా వున్న వాటికి సవరణలు తీసుకురాదలిస్తే ప్రతి సందర్భంలోనూ రాష్ట్రాల ఆమోదం తీసుకోవాలి. ఒక వేళ ఆర్ధికంగా భారం మోపేదైతే కేంద్రమే పూర్తిగా చెల్లించాలి. వుదాహరణకు విద్యాహక్కు చట్టాన్ని అమలు జరపాలంటే ఏటా తెలంగాణా ఒక్కదానికే 300 కోట్ల రూపాయలు అవసరం. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన మోడల్‌ స్కూళ్ల వంటి వాటికి ఇప్పుడు నిధులు పూర్తిగా నిలిపివేశారు, వేతనాలు, ఇతర ఖర్చులు రాష్ట్రాలకు భారం అవుతున్నాయి. కేంద్రం ప్రకటించే ఏ పధకానికైనా మధ్యలో నిధులు నిలిపివేయటం గాక దాని నిర్వహణకు అయ్యే పూర్తి మొత్తాన్ని కేంద్రమే భరించాలి. వుమ్మడి జాబితాలోని అంశాలపై కేంద్ర ప్రభుత్వ సంస్ధల ఏకపక్ష అదుపును నివారించాలి. వుదాహరణకు విశ్వవిద్యాలయాలు నిరభ్యంతర సర్టిఫికెట్‌ ఇవ్వకుండా కాలేజీలకు ఏఐసిటిఇ అనుమతులు ఇవ్వరాదు. తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన సమాయానికి ఈ సంస్ధ అనుమతులు ఇచ్చిన ఇంజనీరింగ్‌ కాలేజీలు 356వరకు వున్నాయి.తగిన వసతులు లేని కారణంగా విశ్వవిద్యాలయాలు అనుబంధాలను రద్దు చేసిన కారణంగా వాటి సంఖ్య 172కు పడిపోయాయి. కొద్ది సంఖ్యలో వున్న కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు యుజిసి నిధులలో 65శాతం, మిగతావాటన్నింటికీ కలిపి 35శాతం నిధులు ఖర్చు చేయటం అన్యాయం.గవర్నర్ల ఎంపికలో రాష్ట్రాలను సంప్రదించాలి. ఏదైనా ఒక బిల్లును నిరవధికంగా నిలిపివుంచే విచక్షణాధికారం గవర్నర్లకు వుండకూడదు, ఒక కాలపరిమితి నిర్ణయించాలి. విశ్వవిద్యాలయాలకు గవర్నర్లను ఛాన్సలర్లుగా చేయరాదన్న పూంఛీ కమిషన్‌ సిఫార్సుకు మద్దతు ఇస్తున్నాం, దానిని ఇప్పటికే అమలు జరిపాము. అంతరాష్ట్ర నదీ జలవివాదాలపై ఏర్పాటు చేసిన ట్రిబ్యునల్స్‌ నిర్ణీత వ్యవధిలో ఇచ్చే విధంగా నిర్ధేశించాలి, కేంద్రం మరింత నిర్ణయాత్మక పాత్ర వహించాలి.

      ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ప్రసంగ సారాంశం ఇలా వుంది. సర్కారియా, ప్రస్తుత పుంఛీ కమిషన్‌ సిఫార్సులకు విరుద్దంగా ఏకపక్షంగా రాష్ట్ర విభజన చేశారు. అది అశాస్త్రీయంగా వుండటమే గాక మిగిలిన ఆంధ్రప్రదేశ్‌కు ఇబ్బందులను కలిగించింది.అందరికీ వర్తించేదిగా ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టానికి భిన్న ప్రమాణాలను పాటించారు. వుదాహరణకు జనాభాలో 58శాతం వున్న రాష్ట్రానికి వుమ్మడి రాష్ట్ర ఆదాయంలో 46శాతమే కేటాయించారు. అప్పులను జనాభా ప్రాతిపదికన, ఆస్థులను మాత్రం ఎక్కడివి అక్కడే అన్న పద్దతిలో పంచారు. విద్యుత్‌ రంగంలో వినియోగాన్ని ప్రాతిపదికగా తీసుకొని ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేశారు. రాష్ట్ర దుస్థితిని తగ్గించేందుకు ప్రధాన మంత్రి నాయకత్వంలోని ఎన్‌డిఏ ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకున్నది.పొరుగు రాష్ట్రాలతో పోటీ పడేందుకు కేంద్రం మౌలిక సదుపాయాల కల్పన, ఆర్ధికంగానూ ఎంతో సాయం చేయాల్సి వుంది.రాష్ట్ర విభజన సందర్భంగా రాజ్యసభలో ప్రధాన మంత్రి చేసిన హామీలన్నింటినీ అమలు జరిపేందుకు ప్రస్తుత ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. వాటిలో అత్యంత ముఖ్యమైన ప్రత్యేక రాష్ట్ర తరగతి హోదా, రాజధాని నిర్మాణానికి ప్రత్యేక నిధులు, పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా పరిగణించి పూర్తి చేయటం, విశాఖ రైల్వే జోన్‌ మంజూరు, పరిశ్రమలకు పన్నుల రాయితీలు కల్పిస్తూ వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక పధకం, వనరుల లోటు పూడ్చేందుకు అవసరమైన గ్రాంటు మంజూరు చేయాలి. చివరి రాష్ట్రంగా వున్నందున ఆంధ్రప్రదేశ్‌ తీవ్ర వత్తిడిని ఎదుర్కొంటున్నది, గోదావరి, కృష్ణ బోర్డులను ఈ రోజు వరకు వేయలేదు.

     గవర్నరన్లు ఐదేండ్ల వ్యవధికి నియమించాలన్న పూంఛీ సిఫార్సుల వంటికి కొన్ని ఆచరణ సాధ్యం కాదు, తగిన విధంగా లేవు.గవర్నర్ల అభిశంసనకు అనుసరించాల్సిన పద్దతిపై సిఫార్సు అంగీకారం కాదు. బిల్లుల ఆమోదం, సూచనలకు ఆరునెలల వ్యవధి అవసరం లేదు, ఒక నెల చాలు. స్ధానికంగా అత్యవసర పరిస్ధితి విధింపునకు 355,356 ఆర్టికల్‌ను సవరించకూడదు. అది రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని అతిక్రమించటమే. ఆర్ధిక మంత్రుల సాధికార కమిటీ పనితీరును చూసిన తరువాత ఇతర రంగాలకు అలాంటి సాధికార కమిటీలను వేయటం సరైంది కాదు. రాజ్యసభలో అన్ని రాష్ట్రాలకు సమాన ప్రాతినిధ్యం కల్పిస్తే పెద్ద రాష్ట్రాల ప్రయోజనాలకు నష్టం. కేంద్ర బలగాలను ఏకపక్షంగా నియమించటం ఫెడరలిజం సూత్రానికే విరుద్దం.జల వివాదాలపై ట్రిబ్యునళ్లు ఇచ్చిన తీర్పులపై అప్పీలుకు సుప్రీం కోర్టుకు వెళ్లాలనటం సరైంది కాదు, రాజ్యాంగ బద్దంగా అప్పిలేట్‌ ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేయాలి.

    ఇద్దరు ముఖ్య మంత్రులు చేసిన ప్రసంగ పాఠాలను చూసినపుడు చంద్రశేఖరరావు ఆర్ధికాంశాలపై ఎక్కువగా కేంద్రీకరించారు.చంద్రబాబు నాయుడు వాటిని దాదాపుగా విస్మరించారు. ఎవడబ్బ సొమ్మంటూ కేంద్రంపై ధ్వజమెత్తిన ఎన్‌టిరామారావు వారసులమని చెప్పుకొనే చంద్రబాబు నాయుడు ఏపీకి ఇస్తామన్న నిధుల గురించి అడిగారు తప్ప రాష్ట్రాలకు న్యాయంగా రావాల్సిన నిధులు, విధుల గురించి విస్మరించటం విస్మయం గొలుపుతోంది. మాకు మా తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేస్తే చాలు ఇంకేమీ లేదు, బంగారు తెలంగాణాగా మార్చుకుంటాం అని వేర్పాటు వాదాన్ని ముందుకు తెచ్చిన చంద్రశేఖరరావుకు కేంద్ర పధకాల భారపు సెగతగలటం, తెలంగాణాను బంగారంగా మార్చటం సాధ్యం కాదని అర్ధమైందేమో అనివార్యంగా నిధుల గురించి నిర్మొహమాటంగా చెప్పాల్సి వచ్చింది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...
← Older posts

Recent Posts

  • అక్రమం జరిగిందా లేదా విచారణకు ఆదేశిస్తారా లేదా : అదానీ కంపెనీలపై నోరు విప్పని ప్రధాని నరేంద్రమోడీ !
  • బికినీతో చేతులు కాల్చుకున్న కాషాయ దళం : రు.600 కోట్ల క్లబ్బులో బ్లాక్‌బస్టర్‌ ” పఠాన్‌ ” సినిమా, కంగన , అసోం సిఎం పైసా ఖర్చులేని ప్రచారం !
  • దేశమంతటా మోడీ డాక్యుమెంటరీ ప్రదర్శనలకు పిలుపు, ఏక్షణమైనా నిషేధం విధించే అవకాశం ?
  • జిన్‌, జియాన్‌, ఆజాదీ – నాడు షా, నేడు అలీ ఖమేనీ పట్ల వ్యతిరేకత, ఇరాన్‌లో చరిత్ర పునరావృతం కానుందా !
  • చివరకు మిగిలేది ఆయాసమే : నిషేధంతో మరింత కిక్కిస్తున్న బిబిసి డాక్యుమెంటరీ, రంగంలో మోడీ సేన !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • అక్రమం జరిగిందా లేదా విచారణకు ఆదేశిస్తారా లేదా : అదానీ కంపెనీలపై నోరు విప్పని ప్రధాని నరేంద్రమోడీ !
  • బికినీతో చేతులు కాల్చుకున్న కాషాయ దళం : రు.600 కోట్ల క్లబ్బులో బ్లాక్‌బస్టర్‌ ” పఠాన్‌ ” సినిమా, కంగన , అసోం సిఎం పైసా ఖర్చులేని ప్రచారం !
  • దేశమంతటా మోడీ డాక్యుమెంటరీ ప్రదర్శనలకు పిలుపు, ఏక్షణమైనా నిషేధం విధించే అవకాశం ?
  • జిన్‌, జియాన్‌, ఆజాదీ – నాడు షా, నేడు అలీ ఖమేనీ పట్ల వ్యతిరేకత, ఇరాన్‌లో చరిత్ర పునరావృతం కానుందా !
  • చివరకు మిగిలేది ఆయాసమే : నిషేధంతో మరింత కిక్కిస్తున్న బిబిసి డాక్యుమెంటరీ, రంగంలో మోడీ సేన !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • అక్రమం జరిగిందా లేదా విచారణకు ఆదేశిస్తారా లేదా : అదానీ కంపెనీలపై నోరు విప్పని ప్రధాని నరేంద్రమోడీ !
  • బికినీతో చేతులు కాల్చుకున్న కాషాయ దళం : రు.600 కోట్ల క్లబ్బులో బ్లాక్‌బస్టర్‌ ” పఠాన్‌ ” సినిమా, కంగన , అసోం సిఎం పైసా ఖర్చులేని ప్రచారం !
  • దేశమంతటా మోడీ డాక్యుమెంటరీ ప్రదర్శనలకు పిలుపు, ఏక్షణమైనా నిషేధం విధించే అవకాశం ?
  • జిన్‌, జియాన్‌, ఆజాదీ – నాడు షా, నేడు అలీ ఖమేనీ పట్ల వ్యతిరేకత, ఇరాన్‌లో చరిత్ర పునరావృతం కానుందా !
  • చివరకు మిగిలేది ఆయాసమే : నిషేధంతో మరింత కిక్కిస్తున్న బిబిసి డాక్యుమెంటరీ, రంగంలో మోడీ సేన !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Follow Following
    • vedika
    • Join 234 other followers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Customize
    • Follow Following
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d bloggers like this: