• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: China goods boycott

” దేశభక్త ” నరేంద్రమోడీ పాలనలో ” దేశ ద్రోహ ” చైనా దిగుమతులు !

03 Sunday Jan 2021

Posted by raomk in CHINA, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

Boycott of Chinese Products, Boycott of goods made in China, China goods boycott, India imports from China


ఎం కోటేశ్వరరావు


అమెరికా మీద ఎవరికైనా అంతగా మోజు ఉంటే తీర్చుకోవచ్చు. సరే దాని ఫలితాలు-పర్యవసానాలను కూడా అనుభవించేందుకు సిద్దపడాలి. ఎక్కడో పదమూడువేల కిలోమీటర్ల దూరంలో ఉన్న దాని కోసం మూడున్నరవేల కిలోమీటర్ల సరిహద్దు ఉన్న పొరుగు దేశం చైనాతో సఖ్యత లేకపోతే పో(పా)యే ! విరోధం లేకుండా అన్నా ఉండాలని చెప్పినవారిని దేశద్రోహులుగా చిత్రిస్తున్నారు. పోనీ దాన్ని కూడా భరించవచ్చు- తామే సిసలైన దేశభక్తులమని చెప్పుకుంటున్నవారి ఆచరణ ఏమిటి అన్నది అసలు సమస్య ! ఈ మధ్యనే వచ్చిన వార్తల ప్రకారం సూటిగా నిషేధించే దమ్మూ ధైర్యం లేక చైనా నుంచి వచ్చే వారిని చట్టపరంగా నిషేధించలేము గానీ విమాన టిక్కెట్లు ఇవ్వకుండా అడ్డుకోవాలని సదరు కంపెనీలను కోరినట్లు చదివాము. అంతకు ముందు అమెరికా ప్రభుత్వం చైనా జాతీయులందరినీ కమ్యూనిస్టులుగా పరిగణించి నిషేధం విధించింది. వారిని సంతుష్టీకరించేందుకు ఇంత డొంక తిరుగుడు అవసరమా ?


లడఖ్‌ సరిహద్దులోని గాల్వాన్‌ లోయలో గత ఏడాది జూన్‌లో జరిగిన ఉదంతం తరువాత చైనా పెట్టుబడులు, వస్తువులను అడ్డుకుంటామంటూ వీర,శూర ప్రతిజ్ఞలు చేశారు. అనేక యాప్‌లను నిషేధించారు. దేశభక్తి అని చెప్పారు గనుక ఎవరూ తప్పు పట్టలేదు. ఉల్లిపాయలు తినొద్దని ఊరందరికీ చెప్పాను గానీ నిన్ను కూరల్లో వేయవద్దని చెప్పానా అని ఒక కథకుడు ఇంట్లో భార్యమీద మండిపడ్డాడట. నరేంద్రమోడీ నాయకత్వం పరిహాసం పాలైందని ఎవరైనా అంటే కాషాయ మరుగుజ్జులు గుంజుకుంటారు.తలరాత లేదా విధి మీద నమ్మకం ఉండేవారి ఆలోచన ప్రకారమైతే గతేడాది ఏప్రిల్‌-నవంబరు మాసాల మధ్య మన దేశ దిగుమతులు మొత్తంగా 32.6శాతం పడిపోతే చైనా నుంచి 17.2శాతమే తగ్గటం విధి వైపరీత్యం, నరేంద్రమోడీకి తలవంపులు గాకపోతే మరేమిటి ?

చైనా వస్తువులను దిగుమతులు చేసుకొనే లేదా వాటిని నియంత్రించే అధికార వ్యవస్దలో సీతారామ్‌ ఏచూరీ, పినరయి విజయన్‌, బృందాకరత్‌ల కుటుంబ సభ్యులు, బంధువులు లేదా వారి పార్టీ వారు గానీ లేరు, ఉన్నదంతా ” అసలు సిసలు ” ” దేశభక్తులు, జాతీయవాదు ” లైన పారిశ్రామిక, వాణిజ్యవేత్తలే కదా ? మరి ఎందుకు చైనా ఉత్పత్తులు నిలిపివేయలేకపోయారు ? నరేంద్రమోడీ సర్కార్‌ ఎందుకు చూసీ చూడనట్లు ఉన్నట్లు ? జనాలను బకరాలను చేద్దామనా ?
దిగుమతులు తగ్గటంలో ప్రధానంగా చమురు, బంగారం ఉన్నాయని ఎవరైనా సమర్ధించుకోవచ్చు. అవి మినహాయిస్తే పైన చెప్పిన నెలల్లో దిగుమతులు 25.6శాతం తగ్గాయి, వాటితో పోల్చినా చైనా వాటా తక్కువే కదా ! చైనా నుంచి టీవీల దిగుమతి గణనీయంగా పడిపోయింది, అంతకంటే ఎక్కువశాతం వియత్నాం నుంచి పడిపోయిందని అంకెలు చెబుతున్నాయి. ఈ కాలంలో చైనా నుంచి కంప్యూటర్లు, లాప్‌టాప్‌లు, టాబ్లెట్ల వంటివి గణనీయంగా పెరిగినట్లు వెల్లడైంది. చైనా నుంచి నేరుగా తగ్గితే మరొక మార్గంలో వయా హాంకాంగ్‌ నుంచి భారత్‌కు చేరుతున్నాయి. చిల్లి కాదు తూటు అంటే ఇదే. చైనా నుంచి దిగుమతులు 80.8శాతం నుంచి 65.1శాతానికి పడిపోతే ఇదే సమయంలో హాంకాంగ్‌ నుంచి 9.8 నుంచి 23.4శాతానికి పెరిగాయి. రెండింటినీ కలిపి చూస్తే 90.6 నుంచి 88.5శాతానికి తగ్గాయి. సంఖ్యపరంగా తగ్గింది తక్కువే అయినా విలువ పరంగా 24.7శాతం పెరిగింది. అసలు కారణం ఇంటి నుంచి పని చేసే వారు, వారి అవసరాలు పెరగటమే. ఈ కాలంలో చైనా నుంచి మనం 38.82 బిలియన్‌ డాలర్ల విలువగలవి దిగుమతి చేసుకుంటే 13.64 బిలియన్‌ డాలర్ల మేరకు ఎగుమతులు చేశాము. చైనా వ్యతిరేకత, దేశభక్తి రేటింగ్స్‌ను పెంచుకొనే టీవీ ఛానల్స్‌, కాషాయ దళాల కబుర్లలో తప్ప ఆచరణలో పెద్దగా లేదని, యాప్‌లను నిషేధించినా వాటి ప్రభావం పెద్దగా లేదని అంకెలు చెబుతున్నాయి. విదేశీ కంపెనీలైన అమెజాన్‌, ఫ్లిప్‌కార్టులను అడ్డుకొనే ధైర్యం దేశభక్తులకు లేనట్టా ? ఉన్నట్లా ! ఆర్ధిక పరిస్ధితి కాస్త మెరుగుపడుతున్నది కనుక రాబోయే రోజుల్లో దిగుమతులు పూర్వ స్ధాయికి చేరుకుంటాయా ?


చైనా, మరొక దేశం దేనికైనా ఏ దేశమూ లొంగిపోనవసరం లేదు. ఎవరి ప్రయోజనాలను వారు కాపాడుకోవాల్సి ఉంది. ఇదే సమయంలో స్వంత విధానాలను కలిగి ఉండాలి తప్ప ఇతరుల పాటలకు మరొకరు నృత్యం చేయటం తగనిపని. మన కోసం పశ్చిమ దేశాలు చైనాతో పోరాడుతాయి లేదా చైనా మెడలు వంచుతాయి అనుకుంటే అంతకంటే భ్రమ, అత్యాశ మరొకటి ఉండదు. వాటి ప్రయోజనాల కోసం మనతో పాటు ఎవరినైనా వినియోగించుకుంటాయి.
ఉదాహరణకు అమెరికా గత కొద్ది దశాబ్దాలుగా చైనాలో మానవహక్కులు లేవంటూ ప్రచారం చేయటం తెలిసిందే. కానీ చైనాతో వాణిజ్యం పెంచుకున్నదే తప్ప తెంచుకోలేదు. దానిబాటలోనే ఐరోపా యూనియన్‌ కూడా నానా యాగీ చేసింది. అదంతా రాయితీలు పొందేందుకు ఆడిన నాటకం.తాజాగా చైనా-ఐరోపా యూనియన్‌ మధ్య కుదిరిన స్వేచ్చా వాణిజ్య ఒప్పందం అందుకు నిదర్శనం. ఒప్పంద చర్చల ప్రారంభం-అంగీకారం మధ్య కాలంలో చైనాలో మారిందేమీ లేదు. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో మనకు మద్దతు ఇస్తామన్నట్లుగా మాట్లాడిన ఐరోపా యూనియన్‌ మనకు కబుర్లు చెప్పి తీరా చైనాతో ఒప్పందం చేసుకుంది.


అమెరికాలో ఈనెల 20 అధ్యక్ష పదవీ బాధ్యతలు స్వీకరించనున్న జో బైడెన్‌ మంత్రివర్గంలో విదేశాంగ మంత్రిగా నియమితులౌతాడని భావిస్తున్న ఆంటోనీ బ్లింకెన్‌ చెప్పిన మాటలను కూడా గుర్తుకు తెచ్చుకోవాలి. చైనాతో పూర్తిగా తెగతెంపులు చేసుకోవటం మరియు అంతిమంగా ప్రతికూల ఫలితాలనిస్తుంది, అదొక తప్పిదమౌతుంది అన్నాడు. కొన్ని అంచనాల ప్రకారం 2028 నాటికి అమెరికాను పక్కకు నెట్టి చైనా పెద్ద ఆర్ధిక వ్యవస్ధగా మారనుంది, ఇప్పటికే 140 కోట్ల జనాభాతో పెద్ద మార్కెట్‌, వారి జీవితాలు మరింతగా పెరిగితే మార్కెట్‌ ఎంతో విస్తరిస్తుంది. ఈ విషయం ధనిక దేశాల కార్పొరేట్లన్నింటికీ తెలుసు గనుకనే చైనాతో తెగేదాకా లాగటం లేదు. మన భుజం మీద తుపాకి పెట్టి చైనా నుంచి రాయితీలు పొందాలన్నది అమెరికా లేదా చతుష్టయంలోని జపాన్‌, ఆస్ట్రేలియా ఎత్తుగడ. ట్రంప్‌ అయినా బైడెన్‌ అయినా అదే చేస్తారు. ఒప్పందం ప్రకారం 2049 నాటికి హాంకాంగ్‌ చైనాలో పూర్తిగా విలీనం కానుంది, అదే సమయానికి తైవాన్‌ కూడా చైనాలో అంతర్భాగమైనా ఆశ్చర్యం లేదు. వీటన్నింటినీ గమనంలో ఉంచుకొనే ఏ దేశానికి ఆ దేశం తన వ్యూహాలను నిర్ణయించుకుంటుంది.

కొందరు చెబుతున్నట్లుగా పశ్చిమ దేశాలు చైనాను కట్టడి చేయగలవని గానీ లేదా వాటితో కలసి మనం అదుపు చేయగలమనే పగటి కలలు కనటం మానుకుంటే మంచిది. మన కోసం అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియా వచ్చి యుద్దం చేస్తాయని ఎవరైనా భావిస్తే అంతకంటే అమాయకత్వం మరొకటి ఉండదు. ఇప్పటివరకు ఉన్నత సాంకేతిక పరిజ్ఞానం తమ గుత్త సొమ్ము అన్నట్లుగా ఉన్న ధనిక పశ్చిమ దేశాలు చైనా పురోగమనాన్ని చూసి విస్తుపోతున్నాయి, తేరుకొని సాధ్యమైన మేరకు అడ్డుకొనేందుకు చూస్తున్నాయి. అందుకు 5జి టెలికాం వ్యవస్ధ పెద్ద ఉదాహరణ. దాన్ని అడ్డుకుంటూనే మిగతా రంగాలలో చైనాతో సంబంధాలను వదులుకోరాదని నిర్ణయించుకుంటున్నాయి. మన మాదిరి వాటికవి దూరం కావటం లేదు. వాస్తవ పరిస్దితులకు అనుగుణ్యంగా వ్యవహరించటం రాజనీతి లక్షణం.


దిగజారుతున్న ఆర్ధిక పరిస్దితులు, తగులుతున్న ఎదురుదెబ్బల కారణంగా గత నాలుగు సంవత్సరాలలో ప్రపంచ నాయకత్వ పాత్ర నుంచి ట్రంప్‌ నాయకత్వంలో అమెరికా పదికిపైగా బహుళపక్ష ఒప్పందాల నుంచి తనకు తానే వైదొలిగింది. అవి ఇరాన్‌తో అణు ఒప్పందం నుంచి తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్ధ నుంచి వైదొలగటం వరకు ఉన్నాయి. ఇదే సమయంలో చైనాను బూచిగా చూపుతూ లబ్ది పొందేందుకు ప్రయత్నిస్తోంది. దాని వలలో పడిన దేశాలన్నీ తమ వనరులను సమర్పించుకోవటం తప్ప పొందేదేమీ ఉండదు. ఆఫ్ఘనిస్తాన్‌లో తాను సృష్టించిన తాలిబాన్లను అది వదిలించుకొని మనకు అంటగట్టింది. వారు పాక్‌ మిలిటరీ అదుపులో ఉంటారని తెలుసు. ఉగ్రవాదం, ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పోరాడతామని చెబుతున్న నరేంద్రమోడీ తాలిబాన్లలో రాజకీయ కోణాన్ని చూపుతూ వారితో వ్యవహరించేందుకు పూనుకున్నారు. ఆప్ఘనిస్తాన్‌ ఒకవైపు ఉన్న ఇరాన్‌, మరో వైపు ఉన్న పాకిస్ధాన్‌తో మనం కొత్త సమస్యలను తెచ్చుకోవటం తప్ప మరొకటి కాదు. మన అభివృద్ది మనం చూసుకుంటూ ఇరుగుపొరుగుదేశాలతో సఖ్యతగా ఉంటూ మిలిటరీ ఖర్చు తగ్గించుకొని దాన్ని అభివృద్ధి వైపు మళ్లించటం శ్రేయస్కరం !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

కాకమ్మ కథలు ఆపి నరేంద్రమోడీ ఇప్పటికైనా అభివృద్ధి చర్యలు తీసుకుంటారా ?

26 Thursday Nov 2020

Posted by raomk in CHINA, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, USA

≈ Leave a comment

Tags

China BRI, China goods boycott, narendra modi cock and bull stories, RCEP INDIA


ఎం కోటేశ్వరరావు


ప్రాంతీయ సమగ్ర ఆర్ధిక భాగస్వామ్య ఒప్పందం(ఆర్‌సిఇపి) నుంచి భారత్‌ వైదొలగటం సముచితమా కాదా అన్న చర్చ ఇప్పుడు ఇంటా బయటా ప్రారంభమైంది. జపాన్‌ తదితర దేశాలు కోరుతున్నట్లు దానిలో చేరితే ఒక సమస్య లేకపోతే మరొకటి కనుక ఆ గుంజాటనతో ఎంతకాలం గడుపుతారు ? అంతా నెహ్రూయే చేశారు అన్న సుప్రభాతం మాని నరేంద్రమోడీ సర్కార్‌ తాను చెప్పిన ముఖ్యంగా మేకిన్‌ ఇండియా లేదా ఆత్మనిర్భరత కార్యక్రమాలతో దేశాన్ని ఆర్ధికంగా ఎలా ముందుకు తీసుకుపోనుంది అన్నది కీలకం. మరో దేశ వ్యవహారాల్లో జోక్యం చేసుకో కూడదనే వ్రతం చెడి తాను మద్దతు ప్రకటించిన డోనాల్డ్‌ ట్రంప్‌ పరాజయం పాలయ్యాడు. అధికారానికి వచ్చిన జో బైడెన్‌ను సంతృప్తి పరచేందుకు లేదా ఆర్‌సిఇపి చర్చ నుంచి జనం దృష్టిని మళ్లించేందుకు గానీ కేంద్ర ప్రభుత్వం మరోసారి చైనా ఆప్‌ల మీద డాడి చేసిందని భావించవచ్చు. రాబోయే రోజుల్లో మరికొన్నింటి మీద కూడా నిషేధం విధించవచ్చు. చైనా మీద వత్తిడి పెంచి బేరమాడే ఎత్తుగడ కానట్లయితే ఆప్‌లన్నింటినీ ఒకేసారి ఎందుకు నిషేధించటం లేదు అన్న ప్రశ్న తలెత్తుతోంది. వాటి వలన చైనాకు తగిలిన దెబ్బ-మనకు కలిగిన ప్రయోజనం ఏమిటన్నది వేరే అంశం. ఆర్దిక వ్యవస్ధ లావాదేవీలను ఆప్‌లు సులభతరం చేస్తాయి తప్ప సంపదలను సృష్టించవు. అందువలన నిషేధాలను పట్టించుకోకుండా కరోనా కారణంగా తగిలిన దెబ్బలను మాన్చుకొని చైనా ముందుకు పోతుంటే తగిలిన దెబ్బలు ఎంత లోతుగా ఉన్నాయో ఇంకా తేల్చుకోలేని స్ధితిలో మనం ఉన్నామంటే అతిశయోక్తి కాదు.


ఆర్‌సిఇపిలో చేరాలా వద్దా ?
ఆర్‌సిఇపి నుంచి వైదొలగటం సరైన నిర్ణయమని కొందరు చెబుతుంటే కాదని మరికొందరు తమ వాదనలను వినిపిస్తున్నారు. దీనిలో చేరితే భాగస్వామ్య దేశాల నుంచి పారిశ్రామిక, వ్యవసాయ, పాడి ఉత్పత్తులు వెల్లువెత్తి నష్టం కలిగిస్తాయని మన పారిశ్రామికవేత్తలు, రైతాంగం తీవ్రంగా వ్యతిరేకించిన విషయం తెలిసిందే. ఈ రంగాలలో తలెత్తిన తీవ్ర సమస్యల నేపధ్యంలో 2019లో ఒప్పందం నుంచి వెనక్కు తగ్గుతున్నట్లు మన ప్రభుత్వం ప్రకటించింది. తిరిగి మనం ఏ క్షణంలో అయినా చేరేందుకు అవకాశం కల్పిస్తూ మిగిలిన దేశాలన్నీ 2020 నవంబరులో సంతకాలు చేశాయి. ఏ ఒప్పందం అయినా అందరికీ ఖేదం, మోదం కలిగించదు. ఇప్పుడు ఖేదం అనుకున్న లాబీ చేరకపోవటం సరైనదే అని చెబుతున్నది. మోదం పొందాలనుకున్న వారు వచ్చిన అవకాశం జారిపోయిందే అని ఎంత తప్పు చేశామో అని వాదిస్తున్నారు. నరేంద్రమోడీ సర్కార్‌ మీద ఎవరి వత్తిడి ఎక్కువగా ఉంటే రాబోయే రోజుల్లో అది అమలు జరుగుతుంది. అందువలన ఈ అంతర్గత పోరు ఎలా సాగుతుందో చూడాల్సి ఉంది.
ఒప్పందంలో చేరకపోవటం ద్వారా తక్షణ ప్రమాద నివారణ జరిగిందే తప్ప ముప్పు తొలగలేదని గ్రహించాలి. ఒక వైపు ప్రపంచీకరణ, మరింత సరళీకరణ, సంస్కరణలు అంటూ నరేంద్రమోడీ సర్కార్‌ కార్మికులు-కర్షకుల ప్రయోజనాలకు వ్యతిరేకమైన చర్యలను రుద్దుతున్నది. విదేశాల నుంచి వ్యవసాయ, పాడి ఉత్పత్తుల దిగుమతులను నివారించిందన్న సంతోషం రైతాంగంలో ఎక్కువ కాలం నిలిచేట్లు లేదు. సర్కార్‌ మరోవైపు అంతకంటే ఎక్కువ ప్రాధాన్యత కలిగిన కనీస మద్దతుధరలు, సేకరణ బాధ్యతల నుంచి క్రమంగా తప్పుకొనేందుకు రైతాంగాన్ని స్వదేశీ-విదేశీ కార్పొరేట్ల దయాదాక్షిణ్యాలకు వదలివేసే చర్యలకు సంస్కరణల ముసుగువేసి పార్లమెంట్‌లో చట్టసవరణలు చేసింది.


కబుర్లు కాదు, నిర్దిష్ట చర్యలేమిటి ?
చైనాతో సహా 15దేశాలు ఆర్‌సిఇపి ద్వారా ముందుకు పోతున్నాయి. లడఖ్‌ సరిహద్దు వివాదం జరగక ముందే ఆర్‌సిఇపి చైనాకు అనుకూలంగా ఉంటుంది, దాని వస్తువులన్నీ మరింతగా మన దేశానికి దిగుమతి అవుతాయి అన్న కారణంతో మనం దానిలో చేరలేదని ప్రభుత్వం చెబుతున్నది. దానితో ఎవరికీ పేచీ లేదు. అయితే ఎప్పుడూ ఆ కబుర్లే చెప్పుకుంటూ కూర్చోలేముగా ! చైనాతో పోటీ పడి మన దేశం ముందుకు పోయేందుకు నరేంద్రమోడీ సర్కార్‌ తీసుకుంటున్న చర్యలేమిటి అన్నది సమస్య. మనం తయారు చేసే వస్తువులను వినియోగించే శక్తిని మన జనానికి కలిగించే చర్యలేమిటి ? విదేశాలకు ఎగుమతి చేసేందుకు వ్యూహం ఏమిటి ?
చైనాకు సానుకూల హౌదా ఎందుకు రద్దు చేయటం లేదు ?

లడక్‌ ప్రాంతం గాల్వన్‌ లోయలో జరిగిన ఉదంతం తరువాత చైనాకు బుద్ధి చెప్పాలి, ఆర్ధికంగా దెబ్బతీయాలన్నట్లుగా ప్రభుత్వ చర్యలు, నేతల మాటలు ఉన్నాయి. పుల్వామా దాడి ఉదంతం తరువాత పాకిస్ధాన్‌కు అత్యంత సానుకూల హౌదా(ఎంఎఫ్‌ఎన్‌)ను మోడీ సర్కార్‌ రద్దు చేసింది. అంతకంటే ఎక్కువగా వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నా చైనాకు ఆ హౌదాను రద్దు చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని మోడీ సర్కార్‌ చెప్పింది. దీన్ని ఎలా అర్ధం చేసుకోవాలి. చైనాతో అంబానీ, అదానీ వంటి కార్పొరేట్ల ప్రయోజనాలకు దెబ్బ తగల కూడదు, అదే సమయంలో చైనా వ్యతిరేకతను రెచ్చ గొట్టి జనంలో మంచి పేరు కొట్టేయాలన్న యావ తప్ప మరేమిటి ?
ప్రాంతీయ అభివృద్ధి అవకాశాలకు దూరంగా గిరిగీసుకున్న భారత్‌ అనే శీర్షికతో ఈ నెల 23వ తేదీన, అంతకు ముందు చైనా పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ రెండు విశ్లేషణలను ప్రచురించింది. వాటితో ఏకీభవించటమా లేదా అనే అంశాన్ని పక్కన పెట్టి వాటి సారాంశాన్ని చూద్దాం. ఈ ఏడాది ఏప్రిల్‌-సెప్టెంబరు మాసాల మధ్య భారత్‌ చేసుకున్న మొత్తం దిగుమతులలో చైనా ఉత్పత్తుల వాటా 18.3శాతం ఉందని, గతేడాది ఇదే కాలంలో 14.6శాతమే అని భారత వాణిజ్యశాఖ వివరాలు వెల్లడించాయి. ఆత్మనిర్బర పేరుతో చైనా నుంచి దిగుమతులను తగ్గించాలన్న ప్రభుత్వ నిర్ణయం, ఇటీవలి కాలంలో రెండు దేశాల మధ్య నెలకొన్న వివాద నేపధ్యంలో ఇది జరిగింది.(చైనా వస్తుబహిష్కరణ వ్రతం ఏమైనట్లు ?) ఆర్‌సిఇపి నుంచి వైదొలిగిన భారత్‌ రక్షణాత్మక చర్యల నేపధ్యంలో అది సిపిటిపిపి లేదా అమెరికా, ఐరోపాలతో ఒప్పందాలు చేసుకోవటం ఇంకా కష్టతరం అవుతుంది. తనకు తాను గిరి గీసుకుంటున్న భారత్‌ భవిష్యత్‌లో అవకాశాలను జారవిడుచుకుంటుందని ఆ పత్రిక పేర్కొన్నది.


చైనా ఎఫ్‌డిఐ ఆంక్షల నుంచి మోడీ సర్కార్‌ వెనక్కు తగ్గుతోందా
ఇటీవల హౌం,వాణిజ్య, పరిశ్రమల శాఖల సంయుక్త బృందం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డిఐ) నిబంధనలను సడలించాలని ప్రధాని నరేంద్రమోడీకి ఒక ప్రతిపాదన చేసినట్లు వార్తలు వచ్చాయి. మన దేశంతో భూ సరిహద్దులున్న దేశాల నుంచి వచ్చే పెట్టుబడులను కొన్ని రంగాలలో 26శాతం వరకు ప్రభుత్వ తనిఖీతో నిమిత్తం లేకుండా అనుమతించాలన్నదే దాని సారాంశం. అంతిమంగా ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియదు. ఈ సడలింపు అమల్లోకి వస్తే చైనా నుంచి పెట్టుబడులను అడ్డుకొనేందుకు గతంలో కొండంత రాగం తీసి చేసిన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవటమే. ఈ ప్రతిపాదనను ఎందుకు చేసినట్లు ? ముందుచూపు లేదా పర్యవసానాల గురించి ఆలోచించకుండా జనాల్లో చైనా వ్యతిరేకతను రెచ్చగొట్టేందుకు పూనుకున్నవారికి ఇది ఎదురు దెబ్బ అవుతుంది. చైనాను వ్యతిరేకిస్తే అమెరికా, ఇతర దేశాల నుంచి పెద్దమొత్తంలో పెట్టుబడులు వస్తాయని కలలు కన్న, చైనా మీద వీరంగం వేసిన వారికి అవి కనుచూపు మేరలో కనిపించకపోవటమే అసలు కారణం. ఏటికి ఎదురీదాలని ఉత్సాహపడేే ఎవరైనా ముందు తమ సత్తా, పరిస్ధితులు ఏమిటో ఒకసారి పరిశీలించుకోవాల్సి ఉంటుంది.
నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత భారత-చైనా వాణిజ్యం బాగా పెరిగింది. చైనా నుంచి దిగుమతులతో పాటు పెట్టుబడులు కూడా గణనీయంగా పెరిగాయి. ఆకస్మికంగా చైనా దిగుమతులను ఆపివేయలేని విధంగా మన పరిశ్రమలు చైనా మీద ఆధారపడ్డాయంటే అతిశయోక్తికాదు. రాజకీయ కారణాలతో ప్రత్యామ్నాయం చూసుకోవాలంటే అమెరికా, ఐరోపా ఇతర ఆసియా దేశాల నుంచి అధిక ధరలకు వస్తువులను దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే మన వస్తువులు అంతర్జాతీయ మార్కెట్లో పోటీని తట్టుకోలేకపోతుండగా ఉత్పత్తి ఖర్చు మరింతగా పెరిగితే పరిస్ధితి ఇంకా దిగజారుతుంది. మన ఆర్ధిక పరిస్ధితి దిగజారుతున్న నేపధ్యంలో చైనాతో వివాదం ప్రారంభమైంది. దీన్ని మన వాణిజ్య, పారిశ్రామికవేత్తలు సహిస్తారా ?


ప్రపంచీకరణ జపం ఆచరణలో ఆంక్షలు !
చైనా మాదిరి మన దేశం ఎగుమతి కేంద్రంగా మారాలంటే రక్షణాత్మక చర్యలను విరమించి స్వేచ్చా వాణిజ్య పద్దతులను అనుసరించాలన్నది ఒక వాదన. దాని సారాంశం ఏమిటో చూద్దాం. గతంలో విఫలమైన విధానాలను తిరిగి అమలు జరిపితే లక్ష్యాలను చేరుకోలేము.2014 నుంచీ మోడీ సర్కార్‌ అనేక మార్లు దిగుమతి ఆంక్షలు, సుంకాలను, లైసన్సులు తీసుకోవాల్సిన చర్యలను పెంచింది. ఇది తిరిగి లైసన్సు రాజ్యం వైపు వెళ్లటమే. డిజిటల్‌ ఇండియా కార్యక్రమం గురించి ఒక వైపు చెబుతారు, మరోవైపు అది అమలుకు అడ్డుపడే చర్యలు తీసుకుంటారు. దీనికి అవసరమైన సెల్‌ఫోన్లు, కంప్యూటర్ల ధరలను పెంచారు.కొన్ని ఐఫోన్ల ధరలను చూస్తే విమానాల్లో దుబారు వంటి చోట్లకు వెళ్లి అక్కడ కొనుగోలు చేసి తెచ్చుకోవటం చౌక అని చెబుతున్నారు. అనేక వస్తువుల దిగుమతికి లైసన్సు తీసుకోవాలని నిర్ణయించారు. రక్షణాత్మక చర్యల వలన మన వస్తువుల నాణ్యత పెంచేందుకు, చౌకగా అందించేందుకు మన పారిశ్రామిక, వాణిజ్యవేత్తలు చర్యలు తీసుకోరు. పాత పద్దతులనే కొనసాగించి లాభాలు పొందేందుకు ప్రయత్నిస్తారు. గతంలో ఇదే జరిగింది, ఇప్పుడూ అదే జరగబోతోంది. రూపాయి విలువను పడిపోయేట్లు చేయటం ద్వారా మన వినియోగదారులు దిగుమతి చేసుకొనే వస్తువుల ధరల పెరుగుదలకు, మన వస్తువులను విదేశీయులు చౌకగా పొందేందుకు వీలు కలిగిస్తున్నారు.
స్వయం సమృద్ధి లేదా మన కాళ్ల మీద మనం నిలిచే విధానాలకు ఎవరూ వ్యతిరేకం కాదు. అందుకు అనువైన విధానాలను అనుసరించే చిత్త శుద్ది లేదనేదే విమర్శ. ప్రపంచానికి తన తలుపులు తెరిచే ఉంటాయని చైనా చెబుతోంది, అయితే అది తాను చెప్పినట్లు జరగాలని అది కోరుకుంటోంది అని తాజాగా అమెరికా పత్రిక న్యూయార్క్‌ టైమ్స్‌లో వచ్చిన ఒక వ్యాసశీర్షిక సారం. తన కాళ్ల మీద తాను నిలిచి ఇతరులు తమ మీద ఆధారపడేట్లు చేసుకొనే వ్యూహాన్ని చైనా అధినేత గ్జీ జింపింగ్‌ అనుసరిస్తున్నారని దానిలో పేర్కొన్నారు. అదే విధంగా ఇతర ఆర్ధిక వ్యవస్ధలతో సంబంధాలను తెంచుకోవటం లేదని గ్జీ చెబుతున్నారు గానీ చైనా అడుగులు చూస్తే అదే మార్గంలో పడుతున్నాయి అంటూ వ్యాసకర్తలు భాష్యంచెప్పారు. మన నరేంద్రమోడీ కూడా ఆ విధానాన్నే ఎందుకు అనుసరించరు ?


ఒక దేశాన్ని ఎవరైనా శత్రువుగా మారిస్తే అది శత్రువే అవుతుంది !
ప్రతి దేశం ప్రపంచ రాజకీయాల్లో తన పాత్ర పోషిస్తోంది. అమెరికా, జపాన్‌, మన దేశంతో కలసి క్వాడ్‌ పేరుతో చైనాకు వ్యతిరేకంగా ఆస్ట్రేలియా కూటమి కడుతోంది. మరోవైపు అదే చైనాతో కలసి ఆర్‌సిఇపిలో భాగస్వామిగా చేతులు కలిపింది. చైనాతో వాణిజ్య మిగులులో ఉన్న ఆస్ట్రేలియన్లు మరోవైపు దక్షిణ చైనా సముద్రంలో దానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపధ్యంలో చైనా తన ఆయుధాలను బయటకు తీస్తోంది. వరుసగా బొగ్గు, మద్యం,బార్లీ, పత్తి వంటి ఉత్పత్తుల దిగుమతులను ఆస్ట్రేలియా నుంచి క్రమంగా తగ్గిస్తోంది. ఇది వత్తిడి పెంచి అమెరికా నుంచి విడగొట్టే ఎత్తుగడలో భాగమే అన్నది స్పష్టం. దీనికి ప్రధాన కారణం దాని ఆర్ధికశక్తే. ఆస్ట్రేలియా ఎగుమతుల్లో 38శాతం చైనాకే జరుగుతున్నాయి, అమెరికా వాటా నాలుగుశాతమే. మన దేశం చైనా నుంచి ఒక శాతం వస్తువులను దిగుమతి చేసుకుంటుంటే మన ఎగుమతుల్లో మూడుశాతం చైనాకు ఉన్నాయి. అందువలన చైనాకు మన తలుపులు మూస్తే నష్టం ఎవరికో చెప్పనవసరం లేదు. ఒక దేశాన్ని ఎవరైనా శత్రువుగా మారిస్తే అది శత్రువే అవుతుంది.
రక్షణాత్మక చర్యల ద్వారా మన ప్రగతికి మనమే అడ్డుపడటమే గాక ప్రపంచ భాగస్వామ్యాలను కూడా దెబ్బతీసినట్లు అవుతోందన్నది కొందరి అభిప్రాయం. ఇది విదేశీ కంపెనీలకు అవకాశాలు కల్పించాలనే లాబీల నుంచి కూడా వచ్చే మాట అన్నది స్పష్టం. పన్నుల విధింపు, నిబంధనలు ఎక్కువగా ఉండటం వంటి చర్యల వలన ప్రపంచంలో భారత్‌ తన ఆర్ధిక వ్యవస్ధను తెరవటం లేదనే అభిప్రాయానికి తావిస్తుందన్నది సారాంశం. నిజానికి అమెరికా సంస్ధలైన అమెజాన్‌, వాల్‌మార్ట్‌ మన దేశంలోని ఆన్‌లైన్‌ షాపింగ్‌ మార్కెట్లో 70శాతం వాటాను చేజిక్కించుకున్నాయి.
ప్రతిష్ట, పలుకుబడి పెంచామన్నారు, ఫలితేమిటి ?
మేకిన్‌ ఇండియా పిలుపుతో ఆర్భాటం, ప్రపంచంలో దేశానికి ఎన్నడూ లేని ప్రతిష్టను, పలుకుబడిని పెంచానని చెప్పటం తప్ప వాటితో గత ఆరున్నర సంవత్సరాలలో మోడీ సర్కార్‌ సాధించిందేమిటో, చేసిందేమిటో తెలియదు.ఆచరణలో కనిపించకపోతే గప్పాలు కొట్టుకోవటం అంటారు. ఆర్‌సిఇపిలో చేరకూడదని ఏడాది క్రితమే నిర్ణయించిన కేంద్రం మన సరకులకు విదేశీ మార్కెట్ల కోసం చేసిందేమీ లేదు. మరోవైపున ఆ ఒప్పందంపై సంతకాలు చేసిన తరువాత 26దేశాలు, వాణిజ్య కూటములతో చైనా 19 స్వేచ్చా వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకొని తన వాణిజ్య విలువను 27 నుంచి 35శాతానికి పెంచుకుంది. దీన్ని విస్తరణవాదంగా చిత్రించి పబ్బంగడుపుతున్నారు. ఇలాంటి ఒప్పందాలు లేకుండా మన దేశంలో తయారు చేస్తామని చెబుతున్న సరకులను ఎక్కడికి ఎగుమతి చేస్తారు ? ఆర్‌సిఇపి ఒప్పందంలోని మిగిలిన 14భాగస్వామ్య దేశాలతో చైనా విదేశీ వాణిజ్యంలో 2019లో మూడోవంతు ఉంది, చైనాకు వస్తున్న మొత్తం విదేశీ పెట్టుబడుల్లో ఆ దేశాల వాటా పదిశాతం ఉంది. ఈ దిశగా నరేంద్రమోడీ ఇంతవరకు చేసిందేమిటి ? మన ఇరుగుపొరుగు దేశాలతో కూడా వాణిజ్య సంబంధాలను మెరుగుపరచుకోలేదు, అవి చైనాతో సంబంధాలను పెంచుకున్నాయి.


మనం ప్రత్యామ్నాయ బిఆర్‌ఐని ఎందుకు రూపొందించలేదు ?
చైనా వాణిజ్య విస్తరణలో మరొక ప్రధాన అంశం బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనీషియేటివ్‌(బిఆర్‌ఐ). 2049లో (అప్పటికి చైనాలో కమ్యూనిస్టులు అధికారానికి వచ్చి వంద సంవత్సరాలు అవుతాయి) పూర్తయ్యే ఈ పధకం ద్వారా ఆసియా, ఆఫ్రికా, ఐరోపా దేశాలలో పెట్టుబడులు, వాణిజ్య విస్తరణకు చైనా పూనుకుంది. దీనిలో రోడ్డు, సముద్ర మార్గాలు ఉన్నాయి. నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన సమయంలోనే ఇది రూపుదిద్దుకుంది. అదేమీ రహస్యం కాదు, అందరికీ తెలిసిందే, ముఖ్యమంత్రిగా ఎంతో అనుభవం ఉన్న మోడీ ఇలాంటి పధకాన్ని ఎందుకు రూపొందించలేకపోయారు ? చైనా గ్జీ జింపింగ్‌కు ఉన్న తెలివితేటలు మోడీకి లేవా ? నెహ్రూ అలా చేశారు, ఇలా చేశారు అని రోజూ అంతర్గతంగా ఆడిపోసుకోవటం, ఆర్‌సిఇపి, బిఆర్‌ఐ వంటి చర్యల ద్వారా చైనా విస్తరించటాన్ని అడ్డుకోవాలంటూ అమెరికా ఇతర దేశాలతో చేతులు కలిపేందుకు తాపత్రయం తప్ప మన దేశమే అలాంటి పధకాలను రూపొందించాలనే దూరదృష్టి ఎందుకు కొరవడింది?
చైనా లేదా మరొకటి మరొక దేశాన్ని ఆక్రమించుకుంటే దాన్ని వ్యతిరేకించాల్సిందే, అందరూ కలసి అడ్డుకోవాల్సిందే. గతంలో అలా ఆక్రమించుకున్న బ్రిటన్‌, ఫ్రాన్స్‌ వంటి దేశాలన్నీ వెనక్కు తగ్గి స్వాతంత్య్రం ఇవ్వకతప్పలేదు. రెండవ ప్రపంచ యుద్దం తరువాత వలసలు, ఆక్రమణలు లేవు. ఏదో ఒక సాకుతో అమెరికా, దానికి మద్దతు ఇస్తున్నదేశాలే ఇటీవలి కాలంలో ఇరాక్‌, లిబియా, ఆఫ్ఘనిస్తాన్‌లను ఆక్రమించుకుని తమ తొత్తు ప్రభుత్వాలను ఏర్పాటు చేసి పరోక్షంగా పెత్తనం చేస్తున్నాయి తప్ప చైనా అలాంటి చర్యలకు ఎక్కడా పాల్పడలేదు. వాణిజ్యం, పెట్టుబడుల విషయానికి వస్తే ప్రపంచ వాణిజ్య సంస్ధ(డబ్ల్యుటిఓ) 1995లో ఉనికిలోకి రాక ముందు 1948 నుంచి పన్నులు, వాణిజ్యంపై సాధారణ ఒప్పందం(గాట్‌) అమల్లో ఉంది. అమెరికా, ఐరోపా ధనిక దేశాలు దానిలోకి చైనాను ప్రవేశించనివ్వలేదు. దీన్ని మరో విధంగా చెప్పాలంటే తమ ప్రాబల్యంలో ఉన్న ప్రపంచ మార్కెట్‌లోకి చైనా ప్రవేశించకుండా అడ్డుకున్నాయి.(1971వరకు అసలు చైనాకు ఐక్యరాజ్యసమితిలో గుర్తింపే ఇవ్వలేదు.చైనా తిరుగబాటు రాష్ట్రమైన తైవాన్‌లో ఉన్న తొత్తు ప్రభుత్వమే అసలైన చైనా ప్రతినిధి అని దానికే ప్రాతినిధ్యం కల్పించాయి) 2001లో సభ్యత్వమిచ్చాయి.
మనం గమనించాల్సిన అంశం ఏమంటే చైనా ప్రారంభించిన సంస్కరణల్లో భాగంగా అది తన అపార మార్కెట్‌ను తెరిచింది.దానిలో ప్రవేశించాలన్నా, లబ్ది పొందాలన్నా చైనాను డబ్ల్యుటిఓలో భాగస్వామిని చేయకుండా సాధ్యం కాదు. అందుకే గతంలో అడ్డుకున్న అమెరికా వంటి దేశాలే ఐరాసలో, డబ్ల్యుటిఓలో చేరనిచ్చాయి. ఆ అవకాశాన్ని వినియోగించుకొని చైనా నేడు ఒక అగ్రశక్తిగా ఎదిగి ధనిక దేశాలను సవాలు చేస్తోంది. తమకు పోటీగా తయారైన చైనాను సహించలేని అమెరికా, ఇతర ఐరోపా ధనిక దేశాలు మన దేశం పోటీలో ఉండే విధంగా ప్రోత్సహిస్తాయా ? సహిస్తాయా ? చైనాను వ్యతిరేకిస్తే పశ్చిమ దేశాలు మనకేదో తవ్వితలకెత్తుతాయనే భ్రమల్లో ఉన్న మోడీ సర్కార్‌ అయినా ఎండమావుల వెంట పరుగెత్తినట్లుగా వాటిని నమ్ముకొని ఉంది తప్ప తాను చేయాల్సింది చేయటం లేదు, ఒక దీర్ఘకాలిక ప్రణాళిక అసలే లేదు.2025 నాటికి ఐదులక్షల కోట్ల డాలర్ల జిడిపిని సాధించటం లక్ష్యంగా చెప్పింది తప్ప దానికి అనువైన పరిస్దితుల కల్పనకు పూనుకోలేదు. కరోనాతో నిమిత్తం లేకుండానే ఆర్ధిక వ్యవస్ధ దిగజారింది.

గుజరాత్‌ తరహా పారిశ్రామిక వృద్ధి జాడెక్కడ ?
ప్రస్తుతం అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ధ (ఐఎంఎఫ్‌) ప్రధాన ఆర్దికవేత్తగా ఉన్న గీతా గోపీనాధ్‌ మరో ఆర్ధికవేత్త ఇక్బాల్‌ దహలీవాల్‌తో కలసి 2014 మేనెలలో దేశ ఆర్ధిక వ్యవస్ధ గురించి ఒక విశ్లేషణ చేశారు. ప్రస్తుతం భారత్‌ యవ్వనదశలో ఎదుగుతున్న మార్కెట్‌గా ఉంది. దీని అర్ధం రానున్న ఐదు సంవత్సరాలలో ఎలాంటి నాటకీయ పరిణామాలు లేకుండానే అభివృద్ధి చెందుతుంది అని పేర్కొన్నారు. అదే జరిగింది, దానికి తోడు చమురు ధరలు పడిపోవటం ఎంతో ప్రయోజనం చేకూర్చింది. నరేంద్రమోడీ సర్కార్‌ ప్రత్యేకంగా తీసుకున్న చర్యలేమీ లేకుండానే అభివృద్ధి జరిగింది. తదుపరి చర్యలు లేకపోవటంతో ఐదేండ్ల తరువాత దిగజారింది. జిడిపిలో పరిశ్రమల విలువ వాటా 25శాతం దగ్గర అప్పటికే ఆగిపోయింది. తనకు అధికారమిస్తే గుజరాత్‌ తరహా పారిశ్రామిక వృద్ది దేశమంతటా అమలు చేస్తానని నరేంద్రమోడీ నమ్మబలికారు. ఐదు సంవత్సరాల తరువాత చూస్తే ప్రపంచబ్యాంకు సమాచారం ప్రకారం పరిశ్రమల వాటా 24.88శాతానికి పడిపోయింది. ఈ కాలంలో మెజారిటీ రాష్ట్రాలలో బిజెపిదే పాలన అన్న విషయం తెలిసిందే. ప్రయివేటు పెట్టుబడుల మీద ఆశలు పెట్టుకున్న సర్కార్‌కు కార్పొరేట్‌ కంపెనీలు ప్రభుత్వం ఇచ్చిన రాయితీలతో మూటలు కట్టుకోవటం తప్ప వాటిని పెట్టుబడులుగా పెట్టి పరిశ్రమలను స్ధాపించటం లేదు. విదేశీ మదుపుదార్లు మన కార్పొరేట్ల వాటాలను కొనుగోలు చేయటం తప్ప కొత్త పరిశ్రమలు పెట్టటం లేదు. అభివృద్ధి లేకపోవటానికి ఇదొక ప్రధాన కారణం.
చైనాలో ఉత్పాదక ఖర్చులు పెరుగుతున్నాయని, అంతర్జాతీయ సంస్ధలు ప్రత్యామ్నాయ ఉత్పాదక దేశాల కోసం చూస్తున్నాయని ఈ అవకాశాన్ని భారత్‌ వినియోగించుకుంటే పారిశ్రామిక వృద్ధి సాధించవచ్చని గీతా గోపినాధ్‌ చెప్పారు. చిత్రం ఏమిటంటే ఆరు సంవత్సరాల తరువాత కూడా నరేంద్రమోడీ అండ్‌కో అదే కబుర్లు చెబుతూ చైనా నుంచి ఉత్పాదక కంపెనీలు మన దేశానికి వస్తున్నాయని చెబుతున్నది, భ్రమలు కల్పిస్తున్నది. 2013లో సులభతర వాణిజ్య సూచికలో మన దేశం 134వ స్ధానంలో ఉండగా 2020లో 63కు ఎదిగినా చైనా నుంచి, మరొక దేశం నుంచి కంపెనీలు వస్తున్న సూచనలేమీ లేవు. ఇప్పటికైనా చైనా గాకపోతే మరొక దేశాన్ని చూసి అయినా అభివృద్ధికి బాట వేస్తారా ? కాకమ్మ కబుర్లు చెబుతూ కాలం గడుపుతారా ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

టిబెట్‌, చైనా వస్తు బహిష్కరణపై కాషాయ సేన వంచన !

13 Thursday Jul 2017

Posted by raomk in BJP, CHINA, Communalism, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, RELIGION

≈ Leave a comment

Tags

China goods boycott, Indo-China standoff, Indo-China trade, RSS, RSS China goods, RSS Duplicity, RSS Hypocrisy, Tibet

ఎం కోటేశ్వరరావు

చైనా-భూటాన్‌ మధ్య వివాదంలో భారత్‌ జోక్యం చేసుకున్న కారణంగా చైనా-భారత్‌ మధ్య మరోసారి వివాదం చెలరేగింది. ఈ సందర్భంగా వుభయ దేశాలలో పరస్పరం రెచ్చగొట్టే వ్యాఖ్యలు, వార్తలు వెలువడటం అవాంఛనీయ పరిణామం. తన ఆధీనంలోని వివాదాస్పద ప్రాంతంలో చైనా ప్రారంభించిన రోడ్డు నిర్మాణాన్ని నిలిపివేయాలని భూటాన్‌ తరఫున మన దేశ మిలిటరీ అడ్డుకోవటంతో చైనా-మన మధ్య ఒక ప్రతిష్ఠంభన ఏర్పడింది. ఆ ప్రాంతంలో వుభయ దేశాల సైనికులు ఎదురెదురుగా గుడారాలు వేసుకొని మకాం వేశారు. సంప్రదింపుల ద్వారా ఆ సమస్యను పరిష్కరించుకోవటం అంత అసాధ్యమేమీ కాదు. వుద్రిక్తతలు తగ్గిన తరువాత ఏదో ఒక రూపంలో చర్యలు ప్రారంభమౌతాయి. ఈ లోగా ఎటు వైపు నుంచి రెచ్చగొట్టే చర్యలు వున్నప్పటికీ అది సమర్ధనీయం కాదు.

ఎదుటి వారిని వేలెత్తి చూపే ముందు మనం కూడా సంమయనం పాటించాల్సిన అవసరం లేదా ? నరేంద్రమోడీ సర్కారుకు నిత్యం మార్గదర&శనం చేసే సంఘపరివార్‌ సంస&ధల ప్రతినిధులు చేసే వ్యాఖ్యలుచ్చగొట్టేవిగా వున్నాయి. గత వారంలో ఇండో-టిబెట్టు సహకార వేదిక(బిటిఎస్సెమ్‌) ఆగ్రా సమావేశంలో మాట్లాడిన ఆరెసెస్సు నాయకుడు ఇంద్రేష్‌ కుమార్‌ చైనా నుంచి టిబెట్‌కు స్వాతంత్య్రం ఇవ్వాలని, చైనా ఆధీనంలోవున్న మానస సరోవర ప్రాంతాన్ని విముక్తి చేయాలని పిలుపునిచ్చారు. ధర్మశాల(హిమచల్‌ ప్రదేశ్‌)లో వున్న టిబెట్టు ప్రవాస ప్రభుత్వ వెబ్‌ సైట్‌లో ఇంద్రేష్‌ ప్రసంగాన్ని పెట్టారు. దాని ప్రకారం ప్రస్తుతం భారత్‌కు పాకిను కంటే చైనా ఎక్కువ ప్రమాదకారిగా మారింది. అందువలన టిబెట్‌ నాయకుడు దలైలామా అరుణాచల్‌ ప్రదేశ్‌లోని తవాంగ్‌ పర్యటనను గౌరవించటం ద్వారా ఇంకేమాత్రం చైనా గురించి భయపడటం లేదని స్పష్టం చేసిందని పేర్కొన్నారు. అంతటితో ఆగలేదు చైనా ఆక్రమణలోని టిబెట్‌ విముక్తికోసం పోరాడుతున్న టిబెటన్లకు సామాజికంగా, నైతికంగా, రాజకీయంగా మద్దతు ఇవ్వాలని కూడా చెప్పారు.ఆర్‌ఎస్‌ఎస్‌ విషయానికి వస్తే అది చేసే అనేక తప్పుడు ప్రచారాల్లో టిబెట్‌ అంశం ఒకటి. అసలు మన దేశం టిబెట్‌ను చైనాలో అంతర్భాగంగా గుర్తించలేదని గతేడాది కూడా అదే నాయకుడు చెప్పాడు.http://www.tibetanreview.net/india-has-never-recognized-tibet-as-historically-chinese/

మన ప్రభుత్వం అధికారయుతంగా ఐక్యరాజ్యసమితిలో ఒకే చైనాను గుర్తిస్తున్నది. (చాలా కాలంపాటు చైనాలోని తిరుగుబాటు రాష్ట్రమైన తైవాన్నే చైనా ప్రతినిధిగా సామ్రాజ్యవాదులు, వారి మద్దతుదారులు గుర్తించారు. తరువాత అనివార్యమై కమ్యూనిస్టు చైనాను గుర్తించకతప్పలేదు) ఈ విషయాన్ని ఈ ఏడాది ఏప్రిల్‌లో మన విదేశాంగశాఖ ప్రతినిధి ఒక వివరణ ఇస్తూ చైనాలో టిబెట్‌ అంతర్భాగం అన్న మన వైఖరిలో ఎలాంటి మార్పు లేదని చెప్పారు.http://timesofindia.indiatimes.com/india/no-change-in-indias-position-on-tibet-being-part-of-china-mea/articleshow/58182984.cms?TOI_browsernotification=true మన ప్రభుత్వం అధికారయుతంగా ఐక్యరాజ్యసమితిలో ఒకే చైనాను గుర్తిస్తున్నది. (చాలా కాలంపాటు చైనాలోని తిరుగుబాటు రాష్ట్రమైన తైవాన్నే చైనా ప్రతినిధిగా సామ్రాజ్యవాదులు, వారి మద్దతుదారులు గుర్తించారు. తరువాత అనివార్యమై కమ్యూనిస్టు చైనాను గుర్తించకతప్పలేదు) కాశ్మీరు వేర్పాటు వాదులు తమకు స్వాతంత్య్రం కావాలని కోరుతున్న విషయం తెలిసిందే. వారికి ఇప్పటి వరకు పాక్‌ పాలకులు మాత్రమే మద్దతు ఇస్తున్నారు. ఇప్పటి వరకు కాశ్మీరును మన అంతర్భాగంగానే చైనా గుర్తిస్తున్నది, దొంగ భక్తుడికి పంగనామాలెక్కువన్నట్లుగా దేశ భక్తి గురించి అతిగా చెప్పే ఆర్‌ఎస్‌ఎస్‌ నేతల మాటలు విన్న తరువాత అది పాలక పార్టీ పరోక్ష అభిప్రాయంగా చైనీయులు పరిగణించి కాశ్మీరు వేర్పాటు వాదులకు మద్దతు ఇస్తే పరిస్ధితి ఏమిటి ?

అందువలన సమస్యలను మరింత సంక్లిష్టం చేయటం ఎవరికీ మంచిది కాదు. అన్ని రంగాలలో విఫలమైన నరేంద్రమోడీ సర్కార్‌ వచ్చే ఎన్నికలలో జనం దృష్టి మళ్లించటానికి అవకాశాలను వెతుకుతున్నారన్నది ఇప్పటికే స్పష్టమైంది. దానిలో భాగంగా సరిహద్దులలో వుద్రిక్తతలను రెచ్చగొట్టి ఆపేరుతో గట్టెక్కుదామనుకుంటున్నారని అనుకోవాల్సి వస్తుంది.

మరోసారి దేశంలో చైనా వస్తువులను బహిష్కరించి గుణపాఠం చెప్పాలనే ఆర్‌ఎస్‌ఎస్‌ నేతల రెచ్చగొట్టుడు మాటలు వినిపిస్తున్నాయి. గత మూడు సంవత్సరాలుగా అధికారంలో వున్నది దాని నేతలే. ఒకవైపు వారే దిగుమతులను అనుమతిస్తారు, మరోవైపు బహిష్కరించమని పిలుపు ఇస్తారు. ఇంతకంటే మోసం, నాటకం మరొకటి ఏముంటుంది? ఎన్నికలలో నిధులు ఇచ్చే వ్యాపారుల కోసం దిగుమతులను అనుమతిస్తారు, చైనా వ్యతిరేక మనోభావాలకు రెచ్చిపోయే మధ్యతరగతి ఓట్ల కోసం చెవుల్లో పూలు పెడుతూ బహిష్కరణ పిలుపులు ఇస్తుంటారు. http://retail.economictimes.indiatimes.com/news/industry/boycott-of-chinese-goods-how-it-wont-help-india-but-can-harm-china/59543718 ఈ లింక్‌లోని విశ్లేషణను ప్రచురించిన ‘ఎకనమిక్‌ టైమ్స్‌’ పత్రికను కూడా దేశ ద్రోహిగా చిత్రించి ఆ పత్రికను కూడా బహిష్కరించమని పిలుపు ఇస్తారేమో తెలియదు. వస్తుబహిష్కరణ ద్వారా చైనాపై వత్తిడి తేగలమనేది పొరపాటు, దాని వలన భారత్‌కు ఒరిగేదేమీ లేదని, చైనా దిగుమతులపై ఆధారపడిన భారత్‌కు హానికరమని పేర్కొన్నది. అంతకు ముందు సంవత్సరంతో పోల్చితే 2016లో భారత్‌కు చైనా దిగుమతులు 0.2శాతం మాత్రమే పెరిగి 58.33 బిలియన్‌ డాలర్లకు చేరాయని ఇదే సమయంలో చైనాకు భారత ఎగుమతులు 12శాతం పడిపోయి 11.76 బిలియన్లకు తగ్గి వుభయ దేశాల మధ్య వాణిజ్య అంతరం 46.56 బిలియన్‌ డాలర్లకు పెరిగిందని ఆ విశ్లేషణలో తెలిపారు. చైనా ప్రపంచ దేశాలకు వంద వస్తువులను ఎగుమతి చేస్తే దానిలో కేవలం రెండు మాత్రమే భారత్‌కు వస్తున్నాయి. అందువలన ఆ రెండింటిని మన ఆర్‌ఎస్‌ఎస్‌ యోధులు, దేశీయ ‘బాణ సంచా జాతీయో యోధులు’ బహిష్కరింపచేస్తే చైనీయులు కాళ్ల బేరానికి వస్తారని భావిస్తే అంతకంటే పిచ్చి వూహ మరొకటి వుండదు. ఇదే సమయంలో ఆ విశ్లేషణలో పేర్కొన్నట్లు చైనా దిగుమతులపై ఆధారపడిన మన ఔషధ పరిశ్రమ ఇబ్బందుల్లో పడుతుంది. ఎవరు అవునన్నా కాదన్నా ఈ రోజు చైనా ఒక చెరువు మాదిరి వుంది. అగ్రరాజ్యమైన అమెరికాయే దానితో మరిన్ని రాయితీలు పొందేందుకు బేరసారాలు చేస్తోంది తప్ప అలగటం లేదని గ్రహించటం అవసరం.

అమెరికా గూఢచార సంస్ధ సిఐఏ సేకరించిన సమాచారం ప్రకారం 2016లో 2011 బిలియన్‌ డాలర్లతో చైనా ప్రపంచ ఎగుమతులలో అగ్రస్ధానంలో వుంది.దీనిలో హాంకాంగ్‌ 487 బిలియన్‌ డాలర్లను కలపలేదు. తరువాత అమెరికా, జర్మనీ, 1471, 1283 బిలియన్లతో రెండు, మూడు స్ధానాల్లో వున్నాయి. మన దేశం 271 బిలియన్లతో 17వ స్ధానంలో వుంది. అందువలన మన 58 బిలియన్‌ డాలర్ల దిగుమతులను ఆపేస్తే తెల్లవారేసరికి చైనా దిగివస్తుందని అనుకోవటం మరుగుజ్జు ఆలోచన మాత్రమే. రెండవది తన వుత్పత్తికి ఎలాంటి ఢోకా లేకుండా చైనా తన అంతర్గత వినియోగాన్ని పెంచేందుకు పూనుకుందని అందరూ చెబుతున్నారు. ఇంతకూ చెప్పవచ్చేదేమంటే వాస్తవాల ప్రాతిపదికన ఆలోచించటం అవసరం.

చైనాతో మన కంటే ఎక్కువగా అమెరికా,జపాన్‌లు వివాదపడుతున్నాయి. సైనిక సమీకరణలు సాగిస్తున్నాయి. వుత్తర, దక్షిణ కొరియాలు ఏకం కాకుండా అడ్డుపడుతూ వుత్తర కొరియా నుంచి రక్షణ పేరుతో దక్షిణ కొరియాలో 30వేలకు పైగా సైన్యాన్ని, ఆధునిక క్షిపణులు, ఆయుధాలతో అమెరికన్లు తిష్టవేశారు. జపాన్‌తో రక్షణ ఒప్పందం ముసుగులో అక్కడ కూడా సైనిక స్ధావరాలను ఏర్పాటు చేసి మిలిటరీ, దానిపై ఆధారపడే వారిని లక్ష మందిని జపాన్‌లో దశాబ్దాల తరబడి అమెరికన్లు మకాం వేశారు. ఇవన్నీ చైనాకు వ్యతిరేకంగానే అన్నది స్పష్టం. ఇవేగాదు, సాధ్యమైన మేరకు చైనా చుట్టూ తన సేనలను ఏర్పాటు చేసేందుకు పూనుకుంది. అయినా చైనా వస్తువులను బహిష్కరించాలని అమెరికాలోని వారెవరూ పిలుపునివ్వటం లేదు.జపాన్‌ తన సంబంధాలను మరింతగా మెరుగుపరుచుకొంటోంది. చైనాతో వివాదాలను పరిష్కరించుకొని మన ప్రయోజనాలను పరిరక్షించుకోవటం అవసరం. ఇవాళ వున్న పరిస్ధితుల్లో భారత్‌ – చైనా రెండూ యుద్ధాన్ని కోరుకోవటం లేదు.రెండు దేశాల వద్ద అణ్వాయుధాలు, వాటిని ప్రయోగించగల క్షిపణులు వున్నాయి, అందువలన విజేతలెవరూ వుండరు. మన నరేంద్రమోడీ మేకిన్‌ ఇండియా పేరుతో ఎన్ని పిలుపులు ఇచ్చినా సమీప భవిష్యత్‌లో వాణిజ్యంలోభారత దేశం చైనాకు పోటీ అవుతుందని ఎవరూ భావించటం లేదు. ఎవరైనా అలా చెబితే మనలను వుబ్బేసి తమ ప్రయోజనాలను నెరవేర్చుకోవటానికి తప్ప వేరు కాదు. నరేంద్రమోడీ ఇంతవరకు చైనా వస్తువుల దిగుమతి నిషేధం లేదా బహిష్కరణ గురించి తన మనసులోని మాటల్లో కూడా బయట పెట్టటం లేదు. అమాయకులను తప్పుదారి పట్టించి, మోసం చేసి ఫేసుబుక్‌ వంటి సామాజిక మాధ్యమాల్లో నగుబాట్ల పాలు చేయటానికి తప్ప రాజును మించిన రాజభక్తి మాదిరి అగ్రరాజ్యం అమెరికా వంటి వాటికే లేని దురద మన కాషాయ సేనకెందుకు ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

ఆర్‌ఎస్‌ఎస్‌ చైనా వస్తు బహిష్కరణ అంతా మోసం గురూ !

21 Friday Oct 2016

Posted by raomk in BJP, Communalism, Current Affairs, Economics, INDIA, NATIONAL NEWS

≈ Leave a comment

Tags

China goods, China goods boycott, DIWALI, RSS, RSS China goods, SJM

సత్య

  జాతీయ వాదం, జాతీయ వాదుల నిర్వచనాలు మారిపోతున్నాయి. వచ్చే దీపావళికి చైనాలో తయారైన బాణా సంచా కాల్చేవారు జాతి ద్రోహులు అన్న విధంగా కొందరు వుద్రేక పడుతున్నారు. చైనా సరకు సంగతి పక్కన పెట్టండి. మన దేశంలో తయారయ్యేదైనా కాల్చటం అవసరమా అని ఆలోచిస్తే మంచిది. దీపావళి సందర్భంగా కొన్నివేల కోట్ల రూపాయల బాణ సంచా కాల్చి డబ్బును వృధా చేయటంతో పాటు పర్యావరణానికి హాని కలిగించటం ఎందుకు?

   జనం ఎదుర్కొంటున్న సమస్యలను పక్కదారి పట్టించటంలో మన దేశంలోని కొందరు మేథావులకు వున్న తెలివితేటలను సమస్యలను పరిష్కరించటానికి వుపయోగిస్తే ఎంత బాగుండునో అన్నది ఎప్పటి నుంచో వున్న పగటి కల. చైనా నుంచి అక్రమంగా వస్తున్న దిగుమతుల కారణంగా మన దేశంలోని పరిశ్రమలు దెబ్బతింటున్నాయనటం ఒక తిరుగులేని వాస్తవం. ఇది ఆర్‌ఎస్‌ఎస్‌ సృష్టి అయిన స్వదేశీ జాగరణ మంచ్‌ పుట్టక ముందే మనకు తెలుసు. గ్లాస్గో, మాంచెస్టర్‌ నుంచి దిగుమతి అయిన జౌళి వుత్పత్తులు మన దేశంలోని చేనేత పరిశ్రమ నడుం విరగొట్టాయి. అందుకే స్వాతంత్య్ర వుద్యమంలో విదేశీ వస్త్ర, వస్తు బహిష్కరణ నినాదం ఒక పెద్ద వుద్యమ రూపాన్నే తీసుకుంది. ఇటీవలి కాలంలో సంస్కరణల పేరుతో మన దేశ మార్కెట్‌ను తెరిచిన తరువాత గత పాతిక సంవత్సరాలలో విదేశీ వస్తువు లేకుండా మనకు తెల్లవారటం లేదన్నది పచ్చి నిజం. మారుతీ కార్లను అనుమతించటంతో మన అంబాసిడర్‌ కారు మాయం లేదా సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయింది. శాంసంగ్‌, సోనీ తదితర కొరియా, జపాన్‌ టీవీల సునామీతో మన ఇసి, భారత్‌, డయనోరా వంటి స్వదేశీ టీవీలు కనపడకుండా పోయాయి. మనం కంప్యూటర్ల మీద పనిచేసే ఇంజనీర్ల తయారీకి ప్రాధాన్యత ఇచ్చాము గాని కంప్యూటర్ల తయారీ గురించి పట్టించుకోని కారణంగా విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ఇలా కడుపు చించుకుంటే కాళ్లమీద పడుతుంది. ఆ పరంపరలోనే చైనా బాణ సంచా మన దేశంలోని శివకాశి కార్మికుల పొట్టలు కొట్టిందన్నది వాస్తవం. దీనికి కారకులెవరు ? కాంగ్రెస్‌,బిజెపి, తెలుగుదేశం, దాని నుంచి పుట్టిన టిఆర్‌ఎస్‌ వంటివాటికి ఇలాంటి పరిస్థితి తలెత్తటంలో బాధ్యత లేదా ? ఎవరి బాధ్యతేమీ లేకుండానే విదేశీ వస్తువులు ఆకాశం నుంచి వూడిపడుతున్నాయా ?

   చైనా నుంచి వస్తున్న బాణ సంచాకారణంగా తమిళనాడులోని శివకాశిలో ఐదులక్షల కుటుంబాలకు వుపాధి పోయిందని, ఆరువేల కోట్ల రూపాయల మేరకు నష్టం జరిగిందని నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తొలి దీపావళి సందర్భంగానే మీడియాలో వార్తలు వచ్చాయి.http://www.ibtimes.co.in/chinese-exports-hit-sivakasi-firecracker-makers-5-lakh-families-suffer-losses-610963 రెండు సంవత్సరాల క్రితం చైనా నుంచి బాణ సంచా అడపాతడపా దిగుమతి అయింది. ఈ ఏడాది విపరీతంగా పెరిగిపోయి, తాము తయారు చేసిన సరకులో 35శాతం మిగిలిపోయిందని 2014 అక్టోబరులోనే బాణ సంచాతయారీదార్ల ప్రతినిధి వాపోయారా లేదా ? అక్రమంగా దిగుమతి అయిన వాటిని నాశనం చేయకుండా అపరాధ రుసుం విధించి దిగుమతి చేసుకున్నవారికి అప్పగిస్తున్నారా లేదా ? ఆ తరువాత ఆ దిగుమతులు ఇంకా విపరీతంగా పెరిగిపోయాయి. దీనికి బాధ్యత ఎవరిది ? అక్రమ దిగుమతులను సక్రమంగా మార్చిన ప్రభుత్వానిదా, చౌకగా వున్నందున కొనుగోలు చేస్తున్న జనానిదా ? నిబంధనలను అమలు జరపాల్సింది ప్రభుత్వమా, మరొకరా ? మన దేశం నుంచి బాణ సంచా ఎగుమతి చేసేందుకు గాను నిల్వ వుంచటానికి తగినంత అవకాశం లేదంటూ మన రేవుల ఆధికారులు అనుమతించటం లేదని, స్వదేశీ ఎగుమతులకు గేట్లు మూసి విదేశీ దిగుమతులకు గేట్లు బార్లా తెరిచారని శివకాశీ తయారీదార్లు వెలిబుచ్చిన ఆవేదనను ఎవరైనా పట్టించుకున్నారా ?

   నరేంద్రమోడీ ఏలుబడిలో గతేడాది రెండో దీపావళి జరుపుకున్నాము. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నిషేధాలు, నిరోధాలు ఎలాంటి ఫలితాలను ఇవ్వలేదని గత నవంబరులో వార్తలు వచ్చాయి.http://timesofindia.indiatimes.com/city/ahmedabad/Ban-on-Chinese-crackers-fails-to-cheer-fireworks-industrythis-Diwali-Survey/articleshow/49714653.cms గుజరాత్‌ రాజధాని అహమ్మదాబాద్‌, రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌, మహారాష్ట్ర రాజధాని ముంబై, ఢిల్లీ, లక్నో నగరాలు అక్రమంగా దిగుమతి చేసుకున్న బాణ సంచా పెద్ద ఎత్తున నిల్వకేంద్రాలుగా వున్నాయని అసోచెమ్‌ చేసిన సర్వేలో గతేడాది వెల్లడైంది. వీటిలో మొదటి మూడు కేంద్రాలు బిజెపి ఏలుబడిలో వున్న రాష్ట్రాల రాజధానులు. వుత్తర భారత్‌ నుంచి డిమాండ్‌ తగ్గిపోయిందని శివకాశీ తయారీదార్లు చెప్పారు. చైనా నుంచి అక్రమంగా దిగుమతి కావటంతో పాటు రూపాయి విలువ పతనమైన కారణంగా అల్యూమినియం పౌడర్‌, బేరియం నైట్రేట్‌ వంటి ఇతర ముడి సరకుల దిగుమతి ఖర్చు కూడా పెరిగి బాణ సంచా వుత్పత్తి ఖర్చు పెరిగిందని కూడా వారు చెప్పారు.

  శివకాశీ నుంచైనా, చైనా నుంచైనా బాణా సంచా కొనుగోళ్లు దీపావళికి కొన్ని నెలల ముందుగానే జరుగుతాయి. ఇప్పుడు చైనా వస్తువులను బహిష్కరించాలని చెప్పటమంటే బడా వ్యాపారుల నుంచి కొనుగోలు చేసిన చిన్న వ్యాపారులను ముంచటం తప్ప వేరు కాదు. బాణా సంచా విక్రయించటానికి చిరు వ్యాపారులకు లైసన్సు అవసరం తమిళనాడులో అధికారులు జారీ చేసిన లైసన్సులలో విదేశీ బాణ సంచా అమ్మరాదనే నిబంధన లేదట. విదేశీ బాణ సంచా అమ్మబడదు అని పెద్ద బోర్డులు ఏర్పాటు చేయాలని మౌఖికంగా చెబుతున్నారని వార్త.http://www.thehindu.com/news/national/tamil-nadu/chinese-crackers-may-sneak-in-this-deepavali/article9231948.ece చైనా వస్తు బహిష్కరణకు పిలుపునిచ్చి సామాజిక మాధ్యమాలలో పెద్ద ఎత్తున ప్రచారం చేయించిన ఆర్‌ఎస్‌ఎస్‌ సంస్ధ స్వదేశీ జాగరణ మంచ్‌ ఆకస్మికంగా ప్లేటు ఫిరాయించింది. చైనా నుంచి దిగుమతి చేసుకొనే భారీ యంత్రాల వంటి వాటిని బహిష్కరణ నుంచి మినహాయించినట్లు ప్రకటించింది.http://timesofindia.indiatimes.com/city/nagpur/Swadeshi-Jagran-Manch-excludes-capital-goods-from-anti-China-drive/articleshow/54965515.cms  ఎంత అవకాశవాదం? సామాన్య, మధ్యతరగతి కొనుగోలు చేసే బాణ సంచాపై పెద్ద రగడ సృష్టించింది. కానీ కార్పొరేట్లు దిగుమతి చేసుకొనే యంత్రాలను మాత్రం బహిష్కరణ నుంచి మినహాయించింది. అంటే ప్రచారం జనాల కోసం ! పని చేసేది కార్పొరేట్ల కోసమా !! చైనా వస్తుబహిష్కరణ తమ ప్రయోజనాలకు నష్టదాయకమని కార్పొరేట్లు చేసిన వత్తిడికి లొంగటం తప్ప దీనిలో ‘దేశభక్తి ‘ కనిపించటం లేదు. మన ఔషధ కంపెనీలు వుపయోగించే రసాయనాలలో 65 శాతం అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్నామని, బొగ్గుతో నడిచే విద్యుత్‌ కేంద్రాలన్నీ చైనా నుంచి దిగుమతి చేసుకున్న యంత్రాలతో పనిచేస్తున్నాయని అసలు విషయాన్ని స్వదేశీ జాగరణ్‌ మంచ్‌కు నాయకత్వం వహిస్తున్న కాశ్మీరీ లాల్‌ వెల్లడించారు. అందుకే ఆర్‌ఎస్‌ఎస్‌ చైనా వస్తు బహిష్కరణ పాతాళ భైరవిలో మాంత్రికుడి శిష్యుడు చెప్పినట్లు అంతా మోసం గురూ !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

Recent Posts

  • ఎరుపంటే భయం భయం….మరోసారి కమ్యూనిస్టు వ్యతిరేకత ఎందుకు ?
  • వ్యవసాయ చట్టాలు : మోడీ గారూ రైతులు కల్మషం లేని వారు తప్ప కుయుక్తులు కాదు !
  • డోనాల్డ్‌ ట్రంప్‌కు మద్దతు – బిజెపి నేతల ఆంతర్యం ఏమిటి ?
  • మీరు ఎటు వైపో తేల్చుకోండి
  • సిసిఐకి వచ్చే నష్టం- పత్తి రైతులకు ఇస్తున్న సబ్సిడీ అట !

Recent Comments

Rajamohan Kolla on రైతుల ఆందోళన : బి-జెపి-అండ్‌కో…
V VENKATA KRISHNA on మెజారిటీ-మైనారిటీ మతవాదుల అడ్డ…
CHIMME JOHN BARNABAS… on జస్టిస్‌ ఎన్‌వి రమణపై సిఎం జగన…
మహేంధర్ on చైనా సంగతి తరువాత, ముందు బంగ్ల…
Kameswara Rao Velpur… on జస్టిస్‌ ఎన్‌వి రమణపై సిఎం జగన…

Archives

  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • ఎరుపంటే భయం భయం….మరోసారి కమ్యూనిస్టు వ్యతిరేకత ఎందుకు ?
  • వ్యవసాయ చట్టాలు : మోడీ గారూ రైతులు కల్మషం లేని వారు తప్ప కుయుక్తులు కాదు !
  • డోనాల్డ్‌ ట్రంప్‌కు మద్దతు – బిజెపి నేతల ఆంతర్యం ఏమిటి ?
  • మీరు ఎటు వైపో తేల్చుకోండి
  • సిసిఐకి వచ్చే నష్టం- పత్తి రైతులకు ఇస్తున్న సబ్సిడీ అట !

Recent Comments

Rajamohan Kolla on రైతుల ఆందోళన : బి-జెపి-అండ్‌కో…
V VENKATA KRISHNA on మెజారిటీ-మైనారిటీ మతవాదుల అడ్డ…
CHIMME JOHN BARNABAS… on జస్టిస్‌ ఎన్‌వి రమణపై సిఎం జగన…
మహేంధర్ on చైనా సంగతి తరువాత, ముందు బంగ్ల…
Kameswara Rao Velpur… on జస్టిస్‌ ఎన్‌వి రమణపై సిఎం జగన…

Archives

  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • ఎరుపంటే భయం భయం….మరోసారి కమ్యూనిస్టు వ్యతిరేకత ఎందుకు ?
  • వ్యవసాయ చట్టాలు : మోడీ గారూ రైతులు కల్మషం లేని వారు తప్ప కుయుక్తులు కాదు !
  • డోనాల్డ్‌ ట్రంప్‌కు మద్దతు – బిజెపి నేతల ఆంతర్యం ఏమిటి ?
  • మీరు ఎటు వైపో తేల్చుకోండి
  • సిసిఐకి వచ్చే నష్టం- పత్తి రైతులకు ఇస్తున్న సబ్సిడీ అట !

Recent Comments

Rajamohan Kolla on రైతుల ఆందోళన : బి-జెపి-అండ్‌కో…
V VENKATA KRISHNA on మెజారిటీ-మైనారిటీ మతవాదుల అడ్డ…
CHIMME JOHN BARNABAS… on జస్టిస్‌ ఎన్‌వి రమణపై సిఎం జగన…
మహేంధర్ on చైనా సంగతి తరువాత, ముందు బంగ్ల…
Kameswara Rao Velpur… on జస్టిస్‌ ఎన్‌వి రమణపై సిఎం జగన…

Archives

  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
%d bloggers like this: