• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: communist manifesto

కమ్యూనిస్టు మానిఫెస్టో కంటే కార్మికులకు మరో ఆయుధమేముంది !

28 Wednesday Feb 2018

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Left politics, Opinion

≈ 1 Comment

Tags

communist, communist manifesto, karal marx, Karl Marx and Friedrich Engels, Raoul Peck, The Young Karl Marx

యంగ్‌ కారల్‌ మార్క్సు దృశ్యం

ఎం కోటేశ్వరరావు

తుపాకి చేతబట్టిన ఒక చెడ్డవాడిని ఆపాలంటే మరో మంచివాడు తుపాకి పట్టటమే ఏకైక మార్గం అని గతంలో సెలవిచ్చిన అమెరికా జాతీయ రైఫిల్‌ అసోసియేషన్‌ అధిపతి వేనె లాపిరే తాజాగా మరో మారు రెచ్చి పోయాడు.తుపాకులను అదుపు చేయాలనే వారందరూ కమ్యూనిస్టులని, ఆచర్య స్వేచ్చను అడ్డుకోవటమే అంటూ చిందులేశాడు. ఇటీవల ఫ్లోరిడాలోని ఒక స్కూల్లో 17 మంది విద్యార్దులు, టీచర్లు ఒక దుండగుడి తుపాకి కాల్పులకు బలైన విషయం తెలిసిందే. ఇలాంటి వుదంతాలు పునరావృతం కాకూడదంటే టీచర్లందరికీ తుపాకులు ఇవ్వటమే మార్గం అని డోనాల్డ్‌ ట్రంప్‌ చెప్పాడు. తుపాకులపై ఆంక్షలు విధించాలనే వారందరూ స్వేచ్చా, స్వాతంత్య్రాలను హరించాలని చూసే కమ్యూనిస్టులు తప్ప మరొకరు కాదని వేనె లాపిరే అన్నాడు. ట్రంప్‌-లాపిరే ఇద్దరూ లాభాల కోసం తుపాకులు తయారు చేసే కార్పొరేట్లకు వంత పాడుతున్నారు తప్ప వాటితో పోయే ప్రాణాల గురించి వారికి ఎలాంటి చింత లేదని నిరూపించుకున్నారు.

‘అమెరికా కాలేజీలలోె ఎక్కువగా ఇచ్చే నియోజిత పఠనం, అధ్యయనాలలో కమ్యూనిస్టు మానిఫెస్టో, ఆర్ధికవేత్తలలో కారల్‌ మార్క్స్‌ వుంటున్నారు. అనేక విశ్వవిద్యాలయాలలో ఇప్పుడు వందకు పైగా అమెరికా యువ ప్రజాస్వామ్య సోషలిస్టు శాఖలున్నాయి. సోషలిస్టు భావజాలాన్ని పెంపొందించుతున్నందుకు విద్యార్ధులు పాండిత్య ప్రదర్శక అభినందనలు కూడా పొందుతున్నారు.మీ పిల్లల్ని పాఠశాలలకు పంపే నిర్ణయం తీసుకోబోయే ముందు దీన్ని గురించి ఆలోచిస్తారని నాకు తెలుసు. అమెరికా రాజ్యాంగాన్ని పట్టించుకోవటం లేదు, దానికి వక్రభాష్యం చెబుతున్నారు. రెండవ సవరణ ద్వారా ఈ దేశంలో ప్రసాదించిన స్వేచ్చ విస్మరించబడుతోంది. వారు గనుక అధికారాన్ని స్వాధీనం చేసుకున్నారంటే అమెరికా స్వేచ్చలు పోతాయి, మన దేశం శాశ్వతంగా మారిపోతుంది.సోషలిజం రక్తాన్ని ఇష్టపడుతుంది’. ఇలా సాగింది వెనె లాపిరే వాచాలత్వం.

చిత్ర దర్శకుడు రావుల్‌ పీక్‌

పెట్టుబడిదారీ వ్యవస్ధలో వెల్లడవుతున్న అవాంఛనీయ పోకడలను ఎలా సమర్ధించుకోవాలో తెలియని శక్తులు స్వేచ్చా, స్వాతంత్య్రాలపదజాలంతో సోషలిస్టు, పురోగామి శక్తులే కాదు, వాటితో సంబంధం లేని వారి అభిప్రాయాలపై కూడా దాడి చేస్తున్నారు. తుపాకి సంస్కృతికి గోరీ కట్టాలనేందుకు కమ్యూనిస్టులే కానవసరం లేదు. ప్రముఖ చిత్ర దర్శకుడు రావుల్‌ పీక్‌ తాజా చిత్రం ”ద యంగ్‌ కారల్‌ మార్క్స్‌ ‘ (యువ కారల్‌ మార్క్స్‌) ఫిబ్రవరి 23న అమెరికాలో విడుదల అయింది. ఆ సందర్భంగా డెమోక్రసీ నౌ టీవీ ఛానల్‌ ఇంటర్వ్యూలో వెనె లాపిరే వాచాలత్వం గురించి రావుల్‌ పీక్‌ స్పందించారు. గతంలో ఆయన ‘ అయామ్‌ నాట్‌ యువర్‌ నీగ్రో, లుముంబా, డెత్‌ ఆఫ్‌ ఏ ఫ్రాఫెట్‌, హైతీ, ద సైలెన్స్‌ ఆఫ్‌ ద డాగ్స్‌, సమ్‌ టైమ్స్‌ ఇన్‌ ఏప్రిల్‌ ‘ వంటి చిత్రాలను నిర్మించాడు. ‘ నేను స్పందించాల్సి వుంటుందని అనుకోలేదు, ఒక విషయం చెబుతాను. అనేక మంది టీచర్లు, అనేక సంస్ధలు ఆయన చెబుతున్నట్లుగా కారల్‌ మార్క్స్‌ను బోధన ప్రణాళికలో చేర్చుతున్నట్లయితే వారు కొంతమేరకు మంచి చేస్తున్నట్లే భావించాలి. కారల్‌ మార్క్స్‌ అంటే ఎవరు, ఒక గొప్ప తత్వవేత్త, ఆర్ధికవేత్త, ఒక విధంగా చరిత్రగతినే మొత్తంగా మార్చటం గురించి, వర్గం, కార్మికవర్గం, బూర్జువాలు, పెట్టుబడిదారీ విధాన అభివృద్ధి వంటి ఆయన చుట్టూ వున్న విషయాలు చర్చించటానికి వుపయోగపడుతుంది.

ఆయన ప్రస్తావిస్తున్న పుస్తకం కమ్యూనిస్టు మానిఫెస్టో మొదటి అధ్యాయాన్ని చదివితే ఇప్పుడు జరుగుతున్నదానిని ఎక్కువ తక్కువ లేకుండా వర్ణించటం కనిపిస్తుంది. లాభమే ధ్యేయం గల ఒక వ్యవస్ధగా ఆయన సంస్ద(ఎన్‌ఆర్‌ఏ) జాబితా మొదట్లో వుంటుంది. మీ జీవితంలో ఎప్పుడైతే లాభానిది పైచేయి అయిందంటే దాని అర్ధం తరుణ వయస్కుల్ని చంపటం, దానిని ఇంకా సమర్ధించుకోవటం వంటి అనంగీకృతమైన వాటిని అంగీకరించే స్ధితిలో మీరు వున్నట్లే. ఆ కమ్యూనిస్టు మానిఫెస్టోలో వున్నది అదే. యువతరం దానిని చదవటం ప్రారంభించి, దాని మీద చక్కటి చర్చ చేస్తే అది చాలా మంచిది.’ రావుల్‌ పీక్‌ చెప్పిన ఈ అంశం ఒక్క అమెరికా రైఫిల్‌ అసోసియేషన్‌కే కాదు, యావత్‌ ప్రపంచంలో లాభాలవేటలో వున్న ప్రతి వ్యవస్ధకూ,అన్ని జీవన రంగాలకూ ఇది వర్తిస్తుంది. యంగ్‌ కారల్‌ మార్క్సు అనే పీక్‌ సినిమాలో మార్క్స్‌ ఒక ఫౌండరీ యజమానితో చేసిన సంభాషణ దృశ్యం ఇలా సాగుతుంది.

కారల్‌ మార్క్స్‌ : ఎలా సాగుతోంది మీ పని ?

యజమాని: మిమ్మల్ని కలుసుకోవటం సంతోషంగా వుంది.

నేపధ్య వ్యాఖ్యాత :జునేలాకు ఫ్యాక్టరీలున్నాయి, పిల్లలతో సహా అనేక మందిని కార్మికులుగా నియమించాడు.

మార్క్స్‌ : మీ ఫ్యాక్టరీల్లో బాలకార్మికులున్నట్లున్నారు ?

యజమాని: మాకు వేరే గత్యంతరం లేదు, బాల కార్మికులు లేకపోతే మేం మార్కెట్లో అమ్ముకోలేము.

మార్క్స్‌ : మీ వంటి వారు లేకుండా దోపిడీ లేని ఒక సమాజం ఎక్కడ వుంటుంది, మీరు కూడా పని చేస్తున్నారు, ఇది దుర్భరంగా అనిపించటం లేదా ?

వ్యాఖ్యాత : వ్యవస్ధతో మనం పోరాడాలి, త్వరలో పాత వ్యవస్ధ కూలిపోతుంది.

మార్క్స్‌: రెండు రకాల మనుషులున్నారు. ఒకరు కష్టించి పని చేసే వారు, మరొకరు ఆ కష్టార్జిత ఫలం నుంచి లబ్ది పొందేవారు.

యజమాని : దీన్ని ఆపాల్సిందే, సహించకూడదు, మీరెంత అదృష్టవంతులో చూడండి, నేను మిమ్మల్ని తొలగించలేను.

మార్క్స్‌ : నేను పెద్ద మనుషులను ద్వేషిస్తాను, తృణీకరిస్తాను, కార్మికుల స్వేదంతో బజ్జలు పెంచే పందులు వారు.

యజమాని : మేము చెత్తబుట్టలోకి నెట్టదగిన వారమనేగా మీరు చెబుతోంది.

వ్యాఖ్యాత : ఆయన చెప్పింది విన్నారుగా దయచేయండి. వారు మనల్ని ఆపేందుకు ప్రయత్నిస్తారు. కానీ వారు మన బుర్రలను నిరోధించలేరు.

వ్యాఖ్యాత : కారల్‌ , ఫెడరిక్‌ ఎంగెల్స్‌ను పరిచయం చేసేందుకు నన్ను అనుమతించండి.

ఎంగెల్స్‌ : మీ రచనలను నేను చదివాను, నా వాటిని మీరు చదివారా ? మనకాలపు గొప్ప మేధావులలో మీరు ఒకరు !

వ్యాఖ్యాత : తిరుగుబాటుకు సంతోషం అవసరం !

మార్క్స్‌ : ప్రతిదీ మారుతుంది, ఏదీ శాశ్వతంగా వుండదు, పాత వ్యవస్ధను మనం తోసివేయాలి.

ఎంగెల్స్‌ : మేలుకోవాల్సిన సమయమిది !

మార్క్స్‌ : ఇప్పటి వరకు తత్వవేత్తలు ప్రపంచానికి భాష్యం చెప్పారు. కానీ దాన్ని మార్చాల్సి వుంది.

వ్యాఖ్యాత : బూర్జువాలు, కార్మికులు సోదరులా ?

కార్మికులు : కాదు !

ఎంగెల్స్‌ : కాదు, వారు సోదరులు కాదు, శత్రువులు !

Image result for the young karl marx

తన సినిమా బాక్సాఫీసు వద్ద ఆర్ధికంగా విజయం సాధించటం కంటే ప్రపంచంలో నేడు పెరిగిపోతున్న మితవాద, పెట్టుబడిదారీ శక్తులకు వ్యతిరేకంగా వున్న రకరకాల వామపక్ష, పురోగామిశక్తుల సమీకరణ కేంద్రంగా తన సినిమా పనిచేస్తే అది పెద్ద విజయమని పీక్‌ భావిస్తున్నారు. ప్రముఖ పత్రిక న్యూస్‌వీక్‌తో మాట్లాడుతూ తన చిత్రం పట్ల ఫ్రాన్స్‌లో వెల్లడైన స్పందనను వివరిస్తూ రాజకీయ విబేదాలతో ఏకీభావం లేని పార్టీల వారందరినీ తన చిత్రం ఒక దగ్గరకు చేర్చిందని, ఇతివృత్తం గురించి చర్చలకు దోహదం చేసిందన్నారు. మార్క్స్‌ పిడివాది కాదు, మీవర్తమాన, చారిత్రక పరిస్ధితులను పున:సమీక్షించుకోవాలని మార్క్స్‌ ఎల్లవేళలా చెప్పేవారని అన్నారు. ‘ నా జీవిత పాఠం, రాజకీయాల అనుభవం కారణంగా ఒక వ్యక్తి ఏ ఒక్కరినీ రక్షించలేరని నేను నమ్ముతాను. అలాంటివి ఎన్నికలలో ప్రజాకర్షణకు బాగుంటాయని మనం చూడవచ్చు, దీని నుంచి బయటపడి నూతన వుమ్మడి సమూహాలను నిర్మించాలి. మీకు ఓటు వేయాలని కొంత మందిని మీరు బలవంతం చేయలేరు. వారిని ఒప్పించాలి. అది చర్చల ద్వారా మీరు చెబుతున్నదానిని రుజువు చేసుకోవాలి. కనుక అది దీర్ఘమైన బాట, దీనిలో రహస్యమేమీ లేదు. ఈ రోజు మనకు అపురూప వ్యక్తి మన ముందు ప్రత్యక్షమైన మనలను వెలుగులోకి తీసుకుపోవాలని వూహించుకోవచ్చు, కానీ అలాంటిదెన్నడూ జరగలేదు, అదొక క్రమం. నేడు సమాజాన్ని అవగాహన చేసుకోవాలనుకొనే వారందరికీ మార్క్స్‌, ఎంగెల్స్‌ వారి సమయంలో అందించిన పరికరాలు – దీర్ఘకాల చరిత్ర అందించిన సూచనలు- ఇప్పటికీ లభ్య మౌతున్నాయి. సినిమా ఒక హీరో కేంద్రంగా నడిచేది కాదు. భావవిప్లవం, సామాజికమార్పు కోసం నూతన రాజకీయ సంఘటనల నిర్మాణం, సుదీర్ఘచర్చలు, ఒక యంత్రాంగ నిర్మాణం, అంతర్గత విభేదాలు, పిలుపులతో కూడిన ఒక వాస్తవం ఆధారంగా సాగింది ‘ అన్నారు.

‘ మెరిసిన జుట్టు పెరిగిన గడ్డం వుండే వృద్ధుడైన రాజకీయవేత్తగా కాదు, ఒక అసాధారణ తత్వవేత్తగా చూపించినప్పటికీ ఒక యువకుడిగా, అప్పులతో ఇబ్బందులు పడిన మార్క్స్‌ను, వుద్యమం నుంచి వుద్భవించిన కమ్యూనిస్టు మానిఫెస్టో ఎలా వచ్చిందో ఈ చిత్రంలో చూస్తారు. కేటుంబం, ముఖ్యంగా భార్యజెన్నీ, స్నేహితుల మధ్య మార్క్స్‌ ఎలా పెరిగారో చూపటం దీనిలో నా తొలి అంశం. మేం ధనికులం, మేం మధ్యతరగతి లేదా పారిశ్రామిక కుటుంబాలకు చెందినవారం అయినప్పటికీ మా చుట్టూ జరుగుతున్నదానిని మేం అంగీకరించం అని చెప్పిన ముగ్గురు యువకుల జీవితాలను యువతరం చూడాలని కోరుకున్నాను. మానవులుగా వారికి నేనెంతో సన్నిహితం, వారు కేవలం పోరాటం మాత్రమే చేయలేదు, వాటితోనే జీవించారు. తమకు ప్రమాదకరమైన నిర్ణయాలను వారు తీసుకున్నారు, సర్వం కోల్పోయారు. వారు పేదలయ్యారు అయినప్పటికీ వారిది పెద్ద జీవితం, మేథావులుగా తయారయ్యారు.యువకులుగా స్పందించారు, ప్రతిదీ మార్చదగినదిగానే వారికి కనిపించింది. పశ్చిమ దేశాలలో మార్క్సు గురించి మరో చిత్రం లేకపోవటం ఈ చిత్ర నిర్మాణానికి ఒక కారణం.’ అన్నారు పీక్‌.

మార్క్స్‌పై చిత్ర నిర్మాణానికి పీక్‌ పది సంవత్సరాలు పని చేశారు. డబ్బు సమస్యలెదురయ్యాయి.ౖ ‘ నేను మూలాల దగ్గరకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాను.కమ్యూనిస్టు మానిఫెస్టో వంటి ఒక ముఖ్యమైన పుస్తకం మీరు చదివినపుడు అది సులభమార్గంలో వారి పోరాటాలు, జీవితాలను అర్ధం చేసుకొనేందుకు కార్మికుల కోసం రాసిన ఒక పుస్తకం అని అర్ధం అవుతుంది. దానిలో తొలి అధ్యాయం చదివితే గత మూడుదశాబ్దాలలో జరిగినదానిని కళ్లకు కట్టినట్లు వర్ణిస్తుంది. పెట్టుబడిదారీవిధాన విస్తరణ, వూహాకల్పన(స్పెక్యులేషన్‌) మీద సంపూర్ణ వెర్రి, మొత్తం భూగోళంపై దాని దాడి. సరిగ్గా అదే జరిగింది, కనుక మన చరిత్రను తెలుసుకోవటం ఎంతో ముఖ్యమైంది. లేనట్లయితే మీకు స్వర్గాన్ని చూపించే తదుపరి ప్రజాకర్షకకులను అనుసరించే ఒక కీలుబమ్మ అవుతావు.’ అని రావుల్‌ పీక్‌ చెప్పారు.

ఈ చిత్రం న్యూయార్క్‌, లాస్‌ ఏంజల్స్‌ నగరాలలో ఫిబ్రవరి 23న విడుదల అయింది. రెండు గంటల నిడివి వున్న ఈ చిత్రాన్ని జర్మనీ, ఫ్రాన్స్‌, బెల్జియంలలో చిత్రీకరించారు. కారల్‌ మార్క్స్‌గా అగస్ట్‌ డిహెల్‌, ఎంగెల్స్‌గా స్టెఫాన్‌ కోనార్సకె, జెన్నీగా వికీ క్రిప్స్‌ నటించారు. మార్క్స్‌-ఎంగెల్స్‌ తమ కాలంలో ప్రబలంగా వున్న పలు రాజకీయ, తాత్విక ఆలోచనా ధోరణుల నుంచి శాస్త్రీయ సోషలిజాన్ని ఎలా వేరు పరచారన్నదే ప్రధానాంశంగా ఈ చిత్రంలో వున్నదని కొన్ని సమీక్షలలో పేర్కొన్నారు. చిత్ర దర్శక నిర్మాత రావుల్‌ పీక్‌ బెర్లిన్‌ విశ్వవిద్యాలయంలో నాలుగు సంవత్సరాల అధ్యయనంలో దాస్‌ కాపిటల్‌ ఒక భాగంగా అభ్యసించారు.

ప్రపంచ గతినే మలుపు తిప్పిన కమ్యూనిస్టు మానిఫెస్టో తొలి ప్రచురణకు 170 ఏండ్లు. ఈగ్రంధ ముద్రణ 1848 ఫిబ్రవరి చివరి వారంలో లండన్‌లోని ఒక అజ్ఞాత ప్రాంతంలో జరిగింది. వర్కర్స్‌ ఎడ్యుకేషన్‌ అసోసియేషన్‌ పేరుతో దానిని ప్రచురించారు. తొలుత దానికి కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక అని పేరు పెట్టారు. 2008 ఆర్ధిక సంక్షోభం తరువాత ఈ గ్రంధ అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. బ్రిటన్‌లో వాటర్‌ స్టోన్స్‌ అనే విక్రేత 2015 ఫిబ్రవరిలో వారం రోజుల్లోనే 30వేల కాపీలు విక్రయించారు. ప్రత్యేకించి పెట్టుబడిదారీ సంక్షోభం నెలకొని వున్న ప్రస్తుత సమయంలో మార్క్సిజం పట్ల ఆసక్తి తిరిగి రేకెత్తించటానికి, పెట్టుబడిదారీ విధానాన్ని విశ్లేషించేందుకు ప్రత్యేకించి యువకులకు అది తోడ్పడుతుందని 2012లో బ్రిటన్‌ పత్రిక గార్డియన్‌ పేర్కొన్నది.’మనకు తెలిసిన పెట్టుబడిదారీ వ్యవస్ధ జవాబుదారీతనం లేని పెద్ద ప్రపంచవ్యాపిత బ్యాంకులు, కార్పొరేషన్ల ఆధిపత్యంలో వుంది. అది నాలుగు రోడ్ల కూడలిలో వుంది, దాన్ని సంస్కరించి, నవీకరించాల్సి వుంది’ అని కూడా ఆ పత్రిక పేర్కొన్నది. బ్రిటన్‌లో పెట్టుబడిదారీ విధానం చితికిపోయింది, దానిని తక్షణమే సంస్కరించటం అవసరం, ఎందుకంటే తలిదండ్రుల కంటే వారి పిల్లలను దుర్భరస్ధితిలో వదలి వేస్తున్నదని టెలిగ్రాఫ్‌ పత్రిక గతేడాది సెప్టెంబరు 5న పేర్కొన్నది.

అమెరికా, బ్రిటన్‌ వంటి దేశాలలో జనం సోషలిజానికి అనుకూలంగా మాట్లాడేందుకు వీలుగా అక్కడి పరిస్ధితి వుంది. 2016లో యు గవ్‌ అనే సంస్ధ జరిపిన సర్వేలో 32శాతం బ్రిటీషర్లు సోషలిజాన్ని వ్యతిరేకించగా 36శాతం మంది అనుకూలం అని తేలింది. నూతన సహస్రాబ్దిలో పుట్టిన వారిలో 40శాతం అమెరికన్లు సోషలిజానికి అనుకూలంగా వున్నట్లు గతేడాది నవంబరులో జరిగిన సర్వేలో వెల్లడైంది. ఈ నేపధ్యంలోనే 83శాతం మంది బ్రిటీషర్లు నీటి సరఫరా సంస్దల ప్రయివేటీకరణ బదులు ప్రభుత్వ ఆధీనంలోనే వుండాలని, విద్యుత్‌, గ్యాస్‌ కంపెనీలను తిరిగి జాతీయం చేయాలని 77శాతం, రైల్వేలను తిరిగి ప్రభుత్వఆధీనంలోకి తీసుకోవాలని 76శాతం కోరుతున్నారు. 170 ఏండ్ల నాటి కమ్యూనిస్టు మానిఫెస్టో తొలి చిత్తు ప్రతితో పాటు, మార్క్స్‌, ఎంగెల్స్‌ల చేతిరాత ప్రతులు అనేక నెదర్లాండ్స్‌లోని ఇంటర్నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ హిస్టరీ(ఐఐఎస్‌హెచ్‌)లో వున్నాయి.’ 1990 దశకంలో మార్క్స్‌ ఇంకేమాత్రం పనికిరాడు అని కొంత మంది చెప్పారు. అమెరికా, ఐరోపాలలో తరువాత సంభవించిన అంతర్జాతీయ ద్రవ్య సంక్షోభం,స్పెక్యులేషన్‌, బుడగలు పేలిపోయిన తరువాత జనాలు ఆకస్మికంగా ఇది గతంలో ఒకసారి జరిగింది, దాన్ని పరిశోధించారు, మరోసారి మార్క్సును చదివితే ఏమౌతుంది, అది ఇప్పటికీ పనికొస్తుందా, అవును ఇది పనికొచ్చేట్లే కనిపిస్తోంది అనే ఆలోచనలో పడ్డారని’ సంస్ద అధిపతి మారియన్‌ వాన్‌డెర్‌ హెజ్డన్‌ వ్యాఖ్యానించారు.

సోషలిస్టు, కమ్యూనిస్టు వ్యతిరేకులు ఎన్ని విధాలుగా కుత్సిత వ్యాఖ్యానాలు చేసినా వాస్తవాన్ని కాదనలేరు. కమ్యూనిస్టు మానిఫెస్టోను రాసిన నాటికీ నేటికీ ప్రపంచంలో ఎన్నో మార్పులు వచ్చిన మాట వాస్తవం. దోపిడీ తీవ్రత, ఆర్ధిక అసమానతల్లో ఎలాంటి మార్పు లేదు. దోపిడీ కొనసాగుతూనే వుంది. అందువలన దానిని అంతం చేయాలని కోరిన కమ్యూనిస్టు మానిఫెస్టో కంటే మరొక మెరుగైన సిద్ధాంతం, కార్మికవర్గ అస్త్రం మరొకటి కనిపించటం లేదు. లేదు ఎవరైనా అంతకంటే త్వరగా దోపిడీని అంతం చేసే భావజాలం,అస్త్రాలను కార్మికవర్గానికి అందచేస్తే అంతకంటే కావాల్సింది లేదు. అవి లేకుండా అందుబాటులో వున్న ఆయుధాలు పనికి రావు అని చెప్పటం అంటే కార్మికవర్గాన్ని నిరాయుధం చేసే మోసపు ఎత్తుగడతప్ప మరొకటి కాదు !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

లెనిన్‌ దేవదూత, బైబిల్‌ నుంచే కమ్యూనిజం :పుతిన్‌

17 Wednesday Jan 2018

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Left politics, Opinion, Political Parties, RUSSIA, USA

≈ Leave a comment

Tags

'Socialist' Bernie Sanders, Bible, communist manifesto, Democratic party, Lenin a saint, Pavel Grudinin, russian elections, Soviet communist ideas, v.i.lenin, Vladimir Putin

ఎం కోటేశ్వరరావు

గత వారంలో కమ్యూనిస్టులకు, ఇతరులకు ఆసక్తి కలిగించే రెండు వుదంతాలు జరిగాయి. ఒకటి మార్చి18న జరిగే ఎన్నికలలో మరోసారి పీఠం ఎక్కేందుకు పోటీ పడుతున్న రష్యన్‌ అధ్యక్షుడు వ్లదిమిర్‌ పుతిన్‌ కమ్యూనిస్టు భావజాలం బైబిల్‌ నుంచే వచ్చిందని, లెనిన్‌ దేవదూత వంటి వ్యక్తి అని చెప్పాడు. అమెరికాలోని అమీ హరోవిట్జ్‌ అనే ఒక మితవాద వీడియో గ్రాఫర్‌ న్యూయార్క్‌ విశ్వవిద్యాలయ విద్యార్ధులకు చదివి వినిపించిన నాలుగు ప్రకటనలు ఎవరివి అంటే కమ్యూనిస్టులవి అనే దిమ్మతిరిగే సమాధానం రావటం రెండో వుదంతం.

న్యూయార్క్‌ విశ్వవిద్యాలయం వుదారవాద భావాల నిలయంగా ప్రసిద్ధి. హారోవిట్జ్‌ తాను నాలుగు వాక్యాలను చదివి వినిపిస్తానని అవి కమ్యూనిస్టులవో డెమోక్రటిక్‌ పార్టీవో చెప్పాలని విద్యార్ధులను కోరాడు. మొదటిది ‘మేము సామాజిక మార్పునే పురికొల్పుతాము’. సమాధానం చెప్పిన నలుగురూ అది కమ్యూనిస్టు మానిఫెస్టోలో భాగం అని ఏక కంఠంతో చెప్పారు. ఒకరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ అది ఎక్కువగా కమ్యూనిస్టు ప్రకటనగానే కనిపిస్తోంది అని చెప్పగా ఒక్కరు మాత్రమే డెమోక్రటిక్‌ పార్టీ ప్రకటన అని సరిగా చెప్పారు.

‘మేము నూతన వర్గాలను, అణచివేత నూతన పరిస్దితులను, పాతవాటిని తొలగించేందుకు నూతన పోరాట పద్దతులను పాదుకొల్పాము’ అనే ప్రకటన డెమోక్రటిక్‌ పార్టీదే అని అందరూ సమాధానం చెబుతారని నేను అనుకొంటున్నాను అని ఒక యువతి చెప్పగా ఇద్దరిలో ఒకరు అది కమ్యూనిస్టుమానిఫెస్టోలో భాగం అని చెప్పారు.

‘ ప్రజలపట్ల వివక్షను చూపే విధానాల ఫలితమే జాతి, సంపద, ఆదాయ అసమానతలు ‘ అన్న ప్రకటన డెమోక్రటిక్‌ పార్టీది అని ముగ్గురిలో ఇద్దరు సరిగానే చెప్పారు. అయితే కొందరు ఇది నిజంగా కమ్యూనిస్టు పార్టీ ప్రకటన కాదా అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

‘స్వేచ్చామార్కెట్‌ పద్దతుల ద్వారా సంపద అసమానతలను పరిష్కరించలేము’ ఈ ప్రకటనపై నలుగురూ అది కమ్యూనిస్టు మానిఫెస్టో చెప్పిన అంశ మే అన్నారు. ఇది డెమోక్రటిక్‌ పార్టీ ప్రకటనలో భాగం. చిత్రంగా వుందే అది కమ్యూనిస్టు మానిఫెస్టో అంశం మాదిరి ధ్వనిస్తోందే అని ఆశ్చర్యపోయారు ఒకరు.

‘ఈ వ్యవస్ధ పని చేయటం లేదు, ఆర్ధికానికి బంధనాలు వేశాము’ అన్న వ్యాక్యం డెమోక్రటిక్‌ పార్టీది అని ఇద్దరిలో ఒకరు చెప్పారు. అమెరికన్‌ విద్యార్ధులు కమ్యూనిస్టు ప్రణాళిక-డెమొక్రటిక్‌ పార్టీ 2016 ఎన్నికలలో చెప్పినదానికి తేడాను గుర్తించటంలో ఎందుకు గందరగోళపడుతున్నారు అన్నది ఒక ప్రశ్న. అమెరికా పరిణామాలను గమనిస్తున్న వారికి ఇది సహజంగా కనిపిస్తోంది. రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు, తరువాత కాలంలో అమెరికాలో పెద్ద ఎత్తున కమ్యూనిస్టు వ్యతిరేకతను రెచ్చగొట్టిన విషయం తెలిసిందే. కమ్యూనిస్టు ప్రణాళిక-డెమోక్రటిక్‌ పార్టీ చెబుతున్న అంశాలకు తేడాను జనం గుర్తించలేని కారణంగా, డెమోక్రటిక్‌ పార్టీని ఒక తీవ్రవాద వామపక్ష సంస్ధగా పరిగణించినందున 2010 నుంచి ఇప్పటి వఅసరకు రాష్ట్రాలు, కేంద్రంలోని అసెంబ్లీ, పార్లమెంటు సీట్లు వెయ్యింటిలో, మెజారిటీ రాష్ట్రాల గవర్నర్‌ ఎన్నికలలో ఆ పార్టీ ఓడిపోయిందని ఒక విశ్లేషణ తెలిపింది. బరాక్‌ ఒబామా పదవిలో వున్న ఎనిమిది సంవత్సరాల పాటూ అతనొక కమ్యూనిస్టు అనే ప్రచారం సాగుతూనే వుంది. డెమోక్రటిక్‌ పార్టీని కొందరు కమ్యూనిస్టు లేదా తీవ్రవాద వామపక్ష సంస్ధగా చిత్రించటాన్నీ చూశాము. 2008లో ప్రారంభమైన ఆర్ధిక సంక్షోభం తరువాత అమెరికా కార్మికవర్గం తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్న స్ధితి, అమెరికాను, యావత్‌ పెట్టుబడిదారీ వ్యవస్ధను కుదిపిన 2011 సెప్టెంబరు వాల్‌స్ట్రీట్‌ ఆక్రమణ వుద్యమం వంటి పరిణామాల పూర్వరంగంలో డెమోక్రటిక్‌ పార్టీ నినాదాలు, నాయకుల ప్రసంగాలలో పెద్ద మార్పు వచ్చింది. దానికి పరాకాష్టంగా అవును నేను సోషలిస్టును అంటూ డెమోక్రటిక్‌ పార్టీకి చెందిన పార్లమెంట్‌ సభ్యుడు బెర్నీ శాండర్స్‌ ఆర్ధిక అసమానతల గురించి ఎండగట్టిన తీరు, సోషలిస్టును నన్ను బలపరచండి అంటూ డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్ధిత్వంకోసం హిల్లరీ క్లింటన్‌తో పోటీపడి పెద్ద ఎత్తున ప్రచారం చేసిన తీరును చూశాము. లక్షలాది మంది యువత శాండర్స్‌తో గొంతు కలుపుతూ అవును మేమూ సోషలిస్టులటే అంటూ ప్రచారం చేసిందీ విదితమే. అందుకే నేడు అమెరికాలో సోషలిజం అంటే తిట్టుపదం కాదు. డెమోక్రటిక్‌ పార్టీ అస్ధిత్వరాజకీయాలు ఆ పార్టీని రాడికల్‌ నినాదాలు చేయిస్తున్నాయి. అయితే దాని స్వభావం అది కాదని సదా గుర్తుంచుకోవాలి. రెండు ప్రధాన పార్టీలలో ఏది ఎక్కువ హానికరమైనది అని ఎంచుకోవాల్సి వచ్చినపుడు డెమోక్రటిక్‌ పార్టీ కూడా కార్పొరేట్లకే అనుకూలం అయినప్పటికీ ఇంతవరకూ కార్మికవర్గం, నల్లజాతీయుల మొగ్గు ఆ పార్టీవైపే వుంది. అలాంటి వారంతా రోజువారీ, ఆందోళనల సందర్భంగా కమ్యూనిస్టులు మాట్లాడినట్లే దోపిడీ,జాతి వివక్షకు వ్యతిరేకంగా గట్టిగా మాట్లాడుతుంటారు. అందువలన యువత డెమోక్రటిక్‌ పార్టీ – కమ్యూనిస్టు ప్రణాళిక చెప్పిన అంశాల గురించి గందరగోళపడుతున్నారు. ఇది ఒక విధంగా మంచిదే. కమ్యూనిస్టు వ్యతిరేకత నరనరానికి ఎక్కి వున్న స్ధితిలో దోపిడీ, వివక్షకు వ్యతిరేకంగా ఎంతవరకు కలసి అంత మేరకు వామపక్ష భావజాలం వ్యాప్తి చెందినట్లే, సోషలిజం, కమ్యూనిజాలకు ఆమేరకు వ్యతిరేకత తగ్గుతుంది.

అమెరికాలో డెమోక్రటిక్‌ పార్టీ రాడికల్‌ నినాదాల కారణంగా సోషలిస్టు, కమ్యూనిస్టు పదజాలం యువతకు పరిచయం కావటం అక్కడి పాలకవర్గానికి ఆందోళన కలిగించే అంశం. రష్యాలో పాతిక సంవత్సరాల క్రితం కూల్చివేసిన సోషలిస్టు వ్యవస్ధ గురించి 56శాతం మందిలో బెంగ తలెత్తిందని ఒక సర్వే పేర్కొన్న విషయం తెలిసిందే. దానికి అనుగుణంగానే స్టాలిన్‌, లెనిన్‌ పట్ల జనంలో క్రమంగా సానుకూల అభిప్రాయాలూ పెరుగుతున్నాయని కూడా సర్వేలు తెలుపుతున్నాయి. మార్చినెలలో జరగబోయే ఎన్నికలలో అధ్యక్ష పదవికి కమ్యూనిస్టు పార్టీ నిలబెట్టిన పార్టీ సభ్యుడు కాని లెనిన్‌ వ్యవసాయ క్షేత్ర అధిపతి పావెల్‌ గ్రడినిన్‌ దేశవ్యాపితంగా ఓటర్ల దృష్టిని ఆకర్షిస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. పుతిన్‌ మినహా మరొకరెవరూ గెలిచే అవకాశం లేదని ఎన్నికల పట్ల నిరాసక్తతతో వున్న వారిలో కూడా వుత్సాహం నింపుతున్నట్లు, నెల రోజుల క్రితంతో పోల్చితే మద్దతు ఇచ్చేవారు రెట్టింపు అయినట్లు మీడియా పేర్కొన్నది. ప్రజల సొమ్ము తస్కరించటాన్ని ఆపండి, జనం మంచిజీవితాలను గడుపుతున్నారనే అబద్దాలకు సమాధికట్టండి, విద్య, వైద్యం వుచితంగా అందచేయాలని, పెన్షనర్లు గౌరవ ప్రద జీవితం గడపాలని కోరుతున్న రష్యన్‌ రాజ్యాంగాన్ని అమలు చేయటం ప్రారంభించండి అని వుపన్యాసాలలో అడుగుతున్న గ్రడినిన్‌ పట్ల సానుకూలత వ్యక్తం అవుతోంది.ఆయన వుపన్యాసం తరువాత తన ఆధ్వర్యంలోని లెనిన్‌ వ్యవసాయ క్షేత్రంలో పనిచేసే వారి జీవన పరిస్ధితులపై రూపొందించిన వీడియోను ప్రదర్శి ంచి రష్యన్లందరికీ అలాంటి పరిస్థితులు వుండాలని, తనకు అవకాశం ఇస్తే అమలు చేస్తానని చేస్తున్న ప్రచారతీరు కొత్తగా వుంది. గతంలో సహకార వ్యవసాయ క్షేత్రంగా వున్నదానిని ప్ర యివేటీకరించిన సమయంలో దానిలో పనిచేస్తున్న గ్రడినిన్‌ 1995లో దాదాపు సగం వాటాలను కొనుగోలు చేశారు. గతేడాది నాలుగువందల కోట్ల రూబుళ్ల మేర స్ట్రాబెర్రీ ఇతర తాజా పండ్లను మాస్కో మార్కెట్లో విక్రయించారు. వచ్చిన లాభాలలో ఎక్కువ భాగం తిరిగిదానిలోనే పెట్టుబడి పెట్టటం, కార్మికుల సంక్షేమ చర్యలకు వినియోగిస్తూ ఎడారిలో ఒయాసిస్‌ మాదిరి సోషలిజాన్ని కాలదన్నుకున్న రష్యాలో సోషలిస్టు పద్దతులలో క్షేత్రాన్ని నిర్వహిస్తున్నారు. ఆధునిక నివాస గృహాలతో పాటు వుచిత పాఠశాలలు, ఆరోగ్య, ప్రసూతి కేంద్రాల నిర్వహణ, పెన్షన్‌ సదుపాయాలను కలిగిస్తున్నారు. సోషలిస్టు వ్యవస్ధ లేకపోయినా కార్మికులకు సంక్షేమ చర్యలు అమలు జరపటం సాధ్యమే అని నిరూపించారు. ప్రభుత్వం అందచేస్తున్న సంక్షేమపధకాల కంటే ఎక్కువ లబ్ది చేకూరుతోంది. వ్యవసాయక్షేత్రంలో పని చేసే కార్మికులకు రష్యన్‌ సగటు కంటే రెట్టింపుగా 78వేల రూబుళ్ల మేరకు నెలవారీ వేతనం ఇస్తున్నారు. అక్కడ పనిచేసే డ్రైవర్లు నివశించే భవనంలోనే గ్రడినిన్‌ కూడా వుంటున్నారు. మీరు ఇలా ఎందుకు నిర్వహిస్తున్నారు అని తరచూ అనేక మంది నన్ను అడుగుతూ వుంటారు. రష్యాలో అందరూ ఇలానే వుండాలని నేను కోరుకుంటున్నాను, అది సాధ్యమే అని చెబుతాను అని గ్రడినిన్‌ చెప్పారు. ఆయన మీసాలు, జుట్టు, రూపు రేఖలు స్టాలిన్‌ను పోలివుండటంతో కొంత మంది ఆయనలో స్టాలిన్‌ను చూస్తున్నారని ఫైనాన్సియల్‌ టైమ్స్‌ పత్రిక వ్యాఖ్యా నించింది. యజమానిగా ఆయన వేతనం లెనిన్‌ క్షేత్రంలో పనిచేసే ట్రాక్టర్‌ డ్రైవర్ల కంటే 26రెట్లు ఎక్కువ అని ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన వివరాలు వెల్లడించినట్లు ఆ పత్రిక తెలిపింది.

గ్రడినిన్‌ పట్ల ఓటర్లలో ఆసక్తి జనించిన పూర్వరంగంలో లెనిన్‌ ఒక దేవదూత అని, బైబిల్‌ నుంచే సోవియట్‌ కమ్యూనిస్టు భావన వచ్చిందని పుతిన్‌ చెప్పటం దానిని ప్రభుత్వరంగంలోని టీవీ ప్రసారం చేయటం ఎన్నికల ప్రచారంలో భాగమే అని చెప్పవచ్చు. ఫిన్లండ్‌ సరిహద్దులోని వాలమ్‌ మొనాస్టరీ పునరుద్దరణ సందర్భంగా తీసిన డాక్యుమెంటరీ కోసం పుతిన్‌ మాట్లాడుతూ ఈ మాటలు చెప్పారు. గతంలో పుతిన్‌ అనేక సందర్భాలలో చర్చిని సమర్దించారు. ‘కమ్యూనిజం-క్రైస్తవం భావనలు ఒకదానికి ఒకటి పొసగదు అని నేను నమ్మటం లేదు. నేను చెబుతున్నది కొంతమందికి ఇష్టం లేకపోవచ్చు కానీ నేను అనుకుంటున్నది నేను చెబుతాను’ అన్నారు. ‘ముందుగా ఒకటి చెప్పాలి, ఎల్లవేళలా విశ్వాసం మనతోనే వుంటోంది. మన దేశ ప్రజలకు కష్టాలు వచ్చినపుడు అది బలపడింది.ఆ చర్యలు ఎంతో కఠినంగా వున్నాయి. దేవునితో యుద్ధం చేసిన సంవత్సరాలలో చర్చ్‌లను నాశనం అయ్యాయి, పూజారులను లేకుండా చేశారు. అయితే అదే సమయంలో సోవియట్‌లు ఒక నూతన మతాన్ని సృష్టించాయి.నిజంగానే కమ్యూనిస్టు భావజాలం క్రైస్తవానికి చాలా దగ్గర పోలిక వుంది. క్రైస్తవం, కమ్యూనిజం రెండూ కూడా స్వేచ్చ, సోదరత్వం, సమానత్వాన్ని ప్రబోధించాయి. లెనిన్‌ భౌతిక కాయ్యాన్ని మసోలియంలో వుంచారు. ఆర్ధడాక్స్‌ లేదా క్రైస్తవుల దేవదూతల అవశేషాలకూ దానికి తేడా ఏముంది’ అని పుతిన్‌ డాక్యుమెంటరీ నిర్వాహకులతో ప్రశ్నించారు.

రష్యాలో లెనిన్‌, స్టాలిన్‌, సోషలిజం, కమ్యూనిజాల పట్ల ఇప్పటికీ అక్కడి జనంలో వున్న అభిమానాల పూర్వరంగంలో వాటిపై మొరటుగా దాడిచేస్తే ఫలితం లేదని గ్రహించిన వ్యక్తిగా ఓటర్లలో గందరగోళం కలిగించేందుకు, తాను లెనిన్‌, కమ్యూనిజాలను వ్యతిరేకించినప్పటికీ వాటిపట్ల గౌరవం వుందని చెప్పుకొనేందుకు చేసిన ఒక ప్రయత్నంగా చెప్పవచ్చు. తాను అధికారంలో వున్నంత వరకు లెనిన్‌ భౌతిక కాయాన్ని మసోలియంలోనే వుంచుతానని గతంలో చెప్పాడు. ఎన్నికల సమయం గనుక లెనిన్‌ గురించి సానుకూలంగా మాట్లాడి దానిని ప్రచారంలోకి పెట్టారు. గతంలో అనేక సందర్భాలలో కమ్యూనిస్టు వ్యతిరేకతను వ్యక్తం చేసిన పుతిన్‌ ఒక బూర్జువారాజకీయవేత్త. అవసరం కొద్ది అలాంటి వారు ఏమైనా చెబుతారు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

మార్క్సిజానికి క్రైస్తవం వ్యతిరేకమా, అనుకూలమా ?

16 Thursday Nov 2017

Posted by raomk in CHINA, Current Affairs, History, INTERNATIONAL NEWS, Latin America, Left politics, Opinion, RELIGION, RUSSIA, USA

≈ Leave a comment

Tags

Anti communist, bible teachings, Bolshevik Revolution, communism, communist manifesto, Pope Francis

వందేండ్ల మహత్తర అక్టోబరు విప్లవం-వర్తమానం-5

ఎం కోటేశ్వరరావు

మతాలన్నీ ఏదో ఒక తత్వశాస్త్ర ప్రాతిపదికన ఏర్పడినవే. చరిత్రలో ప్రతి మతం అంతకు ముందున్నది సామాన్య జనం నుంచి దూరమైనపుడు దాని మీద తిరుగుబాటుగా వుద్భవించిందే. అందువల్లనే ప్రతిదీ ప్రారంభంలో ప్రజల పక్షమే,పురోగామి వైఖరినే కలిగి వుంటుంది. కాల క్రమంలో దోపిడీ వర్గం ప్రతిమతాన్ని తనకు అనుకూలంగా మలచుకోవటం కనిపిస్తుంది. అందువల్లనే ప్రతి మతం ఆయా సమాజాలలో వున్న దోపిడీ వర్గానికే మద్దతుపలికిందన్నది చరిత్ర సారం. ఆ దోపిడీ సమాజాన్ని అంతం చేసేందుకు శాస్త్రీయ అవగాహనతో ముందుకు వచ్చిందే మార్క్సిస్టు తత్వశాస్త్రం. మతాలకు దీనికి వున్న ప్రధాన తేడా ఏమంటే ప్రతికొత్త మతం అంతకు ముందున్న ఏదో ఒక మతంపై తిరుగుబాటుగా వస్తే మార్క్సిస్టు తత్వశాస్త్రం అన్ని మతాలను ఒకేగాటన కట్టి ప్రతిదాన్నీ వ్యతిరేకించింది. మతం జనం పాలిట మత్తు మందు అని సాధారణ సూత్రీకరణ చేసింది. సహజంగానే దోపిడీ శక్తులకు కొమ్ముగాసే మతం, మతాలకు వెన్నుదన్నుగా నిలిచే దోపిడీశక్తులు పరస్పరం ఆధారపడటం, సహకరించుకోవటం జగమెరిగిన సత్యం. ఆందువల్లనే రెండు వందల సంవత్సరాల క్రితం పుట్టిన మార్క్స్‌,170 సంవత్సరాల నాడు వెలువడిన కమ్యూనిస్టు ప్రణాళిక, 150 సంవత్సరాల నాడు జనానికి అందుబాటులోకి వచ్చిన కాపిటల్‌ గ్రంధం మొదటి భాగాలపై దోపిడీవర్గం, అన్ని రకాల మతశక్తులు దాడులు చేస్తూనే వున్నాయి.

కమ్యూనిస్టు ప్రణాళిక 1848 ఫిబ్రవరి చివరిలో 23పేజీల పుస్తకంగా జర్మన్‌ భాషలో లండన్‌లోని బిషప్స్‌ గేట్‌లో వెలువడింది. దానిని రహస్యంగా వర్కర్స్‌ ఎడ్యుకేషన్‌ అసోసియేషన్‌ ప్రచురించింది. బ్రిటన్‌లోని జర్మన్‌ల కోసం ప్రచురితమయ్యే డచ్‌ లండనర్‌ జీటుంగ్‌ పత్రిక సీరియల్‌గా ప్రచురణలో తొలి భాగాన్ని మార్చినెల మూడవ తేదీన అచ్చువేసింది. మరుసటి రోజే బెల్జియంలో వున్న మార్క్స్‌ను దేశం నుంచి బహిష్కరిస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. మార్చి 20నాటికి దానిని మూడుసార్లు అచ్చువేశారు. వాటిలో వెయ్యి కాపీలు ఏప్రిల్‌ మొదటి వారానికి పారిస్‌ చేరాయి, అక్కడి నుంచి జర్మనీ చేర్చారు. ఏప్రిల్‌- మే మాసాలలో ఆ పుస్తకంలోని అచ్చుతప్పులను సరిదిద్దారు. తరువాత అది 30పేజీలకు పెరిగింది. సంచలనం కలిగించించిన ఈ పరిణామంతో చర్చ్‌ వులిక్కి పడింది. మరుసటి ఏడాది 1849 డిసెంబరు ఎనిమిదిన నాటి పోప్‌ తొమ్మిదవ పయస్‌ ఇటాలియన్‌ ద్వీపకల్పంలోని తన పాలిత దేశాలైన ఇటలీ, వాటికన్‌ సిటీ, ఇటలీ ఆధీనంలోని శాన్‌మారినోలో వున్న ఆర్చిబిషప్‌లు, బిషప్‌లకు పంపిన సర్క్యులర్‌లో సోషలిజం, కమ్యూనిజాల గురించి తొలి హెచ్చరిక చేశారు. సోషలిజం, కమ్యూనిజాలనే నూతన సిద్ధాంతాల పేరుతో మత విశ్వాసులను గందరగోళపరిచేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు.కాథలిక్‌ చర్చ్‌ ఐహిక అధికారాన్ని కూలదోసేందుకు విప్లవకారులు, హేతువాదులు పన్నుతున్న కుట్రలు,కూహకాలను గమనించాలని కోరారు. మత వ్యవహారాలలో నిరాసక్తతగా వుండటం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ ఇటాలియన్లు తమ న్యాయబద్దమైన రాజకీయ అధికారులకు బద్దులై వుండాలని నిజమైన స్వేచ్చ, సమానత్వాన్ని క్రైస్తవం మాత్రమే రక్షించగలదని, అందువలన విప్లవాలు పనికిమాలినవని పోప్‌ పయస్‌ పేర్కొన్నారు. అదే సమయంలో ఆస్ట్రియా సామ్రాజ్యం నుంచి ఇటలీ స్వాతంత్య్రం కోరుతూ ఆందోళనలు జరుగుతున్నాయి. తరువాత వెయ్యి సంవత్సరాల పోప్‌ ఆధిపత్యాన్ని అంతం చేస్తూ 1861 రెండవ విక్టర్‌ ఇమ్మాన్యుయేల్‌ ఇటలీ రాజుగా ప్రకటించుకున్నాడు. అందువలన పోప్‌ అధికారాన్ని తొలిసారిగా సవాలు చేసింది రాజరికం తప్ప కమ్యూనిస్టులు కాదని గుర్తించటం అవసరం.

1917లో బోల్షివిక్‌ విప్లవం జయప్రదమైన తరువాత రష్యన్‌ ఆర్ధడాక్స్‌ చర్చి అధికారులు పైకి కొన్ని సందర్భాలలో తటస్ధంగా వుంటున్నట్లు ప్రకటించినా 1922 వరకు విప్లవ వ్యతిరేకులు జరిపిన తిరుగుబాటులో అభ్యుదయగాములుగా వున్న కొద్ది మంది చర్చ్‌ అధికారులు మినహా అత్యధికులు బోల్షివిక్‌ వ్యతిరేక శక్తులతో చేతులు కలిపారు. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత జరిగిన ఇటలీ ఎన్నికలలో కమ్యూనిస్టులు 31శాతం ఓట్లు సాధించారు. అనేక దేశాలలో విప్లవ, జాతీయోద్యమాలు వూపందుకొని విజయాలు సాధించాయి. ప్రపంచంలోనే అతిపెద్ద చైనాలో కమ్యూనిస్టుపార్టీ అధికారానికి వచ్చింది. ఈ పూర్వరంగంలో కమ్యూనిజం వ్యాప్తిని అరికట్టే కుట్రలో భాగంగా అమెరికన్‌ సామ్రాజ్యవాదులు కాథలిక్‌ చర్చిని కూడా భాగస్వామిగా చేసుకున్నారు. దానిలో భాగంగా పోప్‌ పన్నెండవ పయస్‌ 1949లో ఒక ప్రకటన చేస్తూ కమ్యూనిజాన్ని బోధించిన వారిని మత వ్యతిరేక తిరుగుబాటుదారులుగా పరిగణించి మతం నుంచి వెలివేయాలని ఆదేశించి కమ్యూనిజంపై ప్రత్యక్ష దాడికి నాంది పలికారు.

ప్రచ్చన్న యుద్ధం పేరుతో అమెరికా సాగించిన సోషలిస్టు, కమ్యూనిస్టు వ్యతిరేక చర్యలలో ఎక్కడ ఏమతం పెద్దదిగా వుందో అక్కడదానిని కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా వినియోగించారు. ఇండోనేషియాలో ముస్లింలు మెజారిటీ వున్నారు కనుక అక్కడ ఇస్లామిక్‌ మతోన్మాదులను రంగంలోకి దించి మిలిటరీతో జతకట్టించి పదిలక్షల మంది కమ్యూనిస్టులను వూచకోత కోయించిన విషయం తెలిసిందే. తూర్పు ఐరోపాలో రోనాల్డ్‌ రీగన్‌ పాలనా కాలంలో సోషలిస్టు దేశాలలో తిరుగుబాట్లు, కూల్చివేతలకు తెరతీసిన కుట్రలో సిఐఏ, పోప్‌ రెండవ జాన్‌పాల్‌ పాత్ర గురించి తెలిసిందే. సాలిడారిటీ పేరుతో జరిపిన సమీకరణల వెనుక సిఐఏ నిధులు, వాటికన్‌ బ్యాంకు నిధులు, చర్చి అధికారుల మద్దతు బహిరంగ రహస్యం.

తూర్పు ఐరోపా, సోవియట్‌లో అమలు జరిపిన కుట్రకంటే ముందు చర్చిద్వారా కమ్యూనిజం, కమ్యూనిస్టులపై ప్రపంచవ్యాపితంగా దాడి చేసేందుకు జరిపిన ఒక ప్రయత్న వివరాలను గతనెల(అక్టోబరు) 25న లైఫ్‌ సైట్‌ న్యూస్‌ తొలిసారిగా ఆంగ్ల తర్జుమాను ప్రచురించింది. రెండవ ప్రపంచ యుద్దం తరువాత మారిన పరిస్ధితులలో చర్చి పాత్ర, సంస్కరణల గురించి, గడచిన వంద సంవత్సరాలలో తలెత్తిన మత సంబంధ సిద్ధాంతాల పరిష్కారానికి రెండవ వాటికన్‌ కౌన్సిల్‌ అవసరమని 1959లో భావించారు. ఆమేరకు అది 1962 నుంచి 1965వరకు కొనసాగింది.

లైఫ్‌ సైట్‌ న్యూస్‌ కధనంలోని అంశాలు ఇలా వున్నాయి. రెండవ వాటికన్‌ కౌన్సిల్‌లో ఇతర విషయాలతో పాటు కమ్యూనిస్టులు, కమ్యూనిజానికి దండనా విధి నిర్ణయానికి ఒక ముసాయిదా పత్రాన్ని తయారు చేసేందుకు కొందరు నిర్ణయించారు. తరువాత దానిని పక్కన పెట్టారు. మార్క్సిజం, కమ్యూనిజం ప్రభావానికి ప్రతిగా, వాటి తెంపరితనాన్ని బహిర్గతపరిచేందుకు, ఓడించేందుకు ప్రపంచవ్యాపితంగా ఎలా సమన్వయంతో వ్యవహరించాలో పెద్ద ప్రణాళికను రూపొందించారు. అయితే కౌన్సిల్‌ కమిషన్లను రైన్‌ గ్రూప్‌ (రైన్‌ నదీ పరివాహక దేశాల)బిషప్పులు ఆక్రమించటంతో కమ్యూనిజం, మార్క్సిజాలను నేరుగా ఖండించాలనే ప్రయత్నాలన్నింటినీ వారు తిరస్కరించి పక్కన పెట్టారు. రెండవ వాటికన్‌ కౌన్సిల్‌ ముగిసిన తరువాత ఆ పత్రాలన్నీ అధికారిక తయారీ పత్రాల రికార్డు రూముకు చేరాయి. లాటిన్‌(స్పానిష్‌)భాషలో రాసిన ఆపత్రాలకు గత కొన్ని దశాబ్దాలుగా దుమ్ముపట్టింది.

వాటిలో మూడు రకాల ప్రకటనలను రూపొందించారు.మార్క్సిజం తీవ్రమైన, ప్రపంచవ్యాపిత ప్రమాదం, కమ్యూనిజం దేవుడితో నిమిత్తం లేని ఒక మతం వంటిది, క్రైస్తవ నాగరికతల పునాదుల కూల్చివేతను కోరుకొంటుంది. ఇలాంటి కమ్యూనిజం నుంచి మానవాళిని రక్షించేందుకు వున్నత స్ధాయిలో ప్రపంచవ్యాపితంగా పెద్ద ఎత్తున ప్రచారం చేయాల్సి వుంది.ఈ అంశాలతో కూడిన పత్రాలను వుదారవాదులైన రైన్‌ గ్రూప్‌ బిషప్పులు కౌన్సిల్‌ తొలి నెలల్లోనే తిరస్కరించి పక్కన పెట్టారని లైఫ్‌ సైట్‌ న్యూస్‌ కధనం పేర్కొన్నది.

క్రైస్తవ మతంలో కొందరు మార్క్సిజం, కమ్యూనిజాలను వ్యతిరేకించేందుకు అమెరికా సిఐఏ, ఇతర గూఢచార, వాటి ముసుగు సంస్ధలతో చేతులు కలిపారు. అదే సమయంలో లాటిన్‌ అమెరికాలో కొందరు క్రైస్తవ మతాధికారులు దారిద్య్రం, సామాజిక సమస్యలను మతవ్యవహారాలతో సమన్వయంచేసి విముక్తి వాదం లేదా సిద్ధాంతాన్ని ముందుకు తెచ్చారు. అలాంటి వారు కమ్యూనిజాన్ని వ్యతిరేకించలేదు. కమ్యూనిజాన్ని వ్యతిరేకించాలంటూ ప్రభావితం చేసేందుకు ప్రయత్నించేవారిని ప్రతిఘటించారు కూడా. అలాంటి వారిలో ఒకరే కమ్యూనిస్టు పోప్‌గా కొందరు చిత్రించిన పోప్‌ ఫ్రాన్సిస్‌.అర్జెంటీనాకు చెందిన ఆయన 2013 నుంచి వాటికన్‌ అధిపతిగా కొనసాగుతున్నారు. ఒక ఇంటర్వ్యూలో ఒక జర్నలిస్టు ఆయనను ఇలా అడిగారు.’ కాబట్టి మీరు సమానత్వానికి పెద్ద పీటవేసే సమాజం కావాలని కాంక్షిస్తున్నారు. అది మీకు తెలిసినదే మార్క్సిస్టు సోషలిజం తరువాత కమ్యూనిజపు కార్యక్రమం. కాబట్టి మీరు మార్క్సిస్టు తరహా సమాజం గురించి ఆలోచిస్తున్నారా? అని ప్రశ్నించారు.

దానికి పోప్‌ ఇలా సమాధానం చెప్పారు.’ దీని గురించి అనేకసార్లు చెప్పాను, నా స్పందన ఎల్లవేళలా అదే, ఏదైనా వుంటే కమ్యూనిస్టులు కూడా క్రైస్తవుల మాదిరే ఆలోచిస్తారు’ అని చెప్పారు.మార్క్సిజాన్ని ప్రోత్సహిస్తున్నారంటూ వచ్చిన విమర్శలను తోసిపుచ్చుతూ మార్క్సిస్టు సిద్దాంతం తప్పు, అయితే నా జీవితంలో అనేక మంది ఎంతో మంచివారైన మార్క్సిస్టులను ఎరుగుదును, కనుక నేను తప్పుచేసినట్లుగా భావించటం లేదు’ అని పోప్‌గా ఎన్నికైన కొత్తలోనే చెప్పారు. మార్క్సిజానికి తాను వ్యతిరేకం కాదని పరోక్షంగా చెప్పేందుకు గాను బలీవియాలో వామపక్ష అధ్యక్షుడు ఇవో మొరేల్స్‌ నుంచి సుత్తీ,కొడవలి చిహ్నంగా వున్న శిలువను బహుమతిగా స్వీకరించటం తెలిసిందే. ఆయన జారీచేసిన లాడాటో సి సర్క్యులర్‌ తయారీకి మార్క్సిజంతో స్ఫూర్తి పొందిన విముక్త మత సిద్ధాంత వాదిగా పేరుబడిన లియోనార్డో బోఫ్‌ వంటి వారితోడ్పాటును స్వీకరించారని వార్తలు వచ్చాయి. ఇటీవల కొత్త సుపీరియర్‌ జనరల్‌గా ఎన్నికైన వెనెజులాకు చెందిన ఆర్ధరో సోసా అబాస్కల్‌ మార్క్సిజంతో క్రైస్తవం సమాధానపడాలని బహిరంగంగా చెప్పారు.

మన దగ్గర దేవాలయాల కింద వేలాది ఎకరాల భూములు వున్నట్లుగానే పశ్చిమ దేశాలలో చర్చ్‌లకు అంతకంటే ఎక్కువ ఆస్ధులున్నాయి. దేవాదాయ భూములు అన్యాక్రాంతం అయిన కారణంగా వాటిని స్వాధీనం చేసుకొనేందుకు చర్యలు తీసుకున్న ఎన్‌టి రామారావు పెద్ద దైవభక్తుడు, కమ్యూనిస్టు కాదు. రష్యా, ఐరోపాలో కమ్యూనిస్టులు అధికారానికి వచ్చిన తరువాత పెద్ద మొత్తాలలో వున్న చర్చి ఆస్ధులను ప్రజల పరం చేశారు. అంతే తప్ప చారిత్రక ప్రాధాన్యత వున్న ఏ ఒక్క చర్చిని కూల్చివేయలేదు. కమ్యూనిస్టులు అధికారంలో వున్నంత కాలం వాటిని కూల్చివేశారంటూ తప్పుడు ప్రచారం చేశారు. సోవియట్‌, తూర్పు ఐరోపా సోషలిస్టు వ్యవస్ధలను కూల్చివేసిన తరువాత ఆయా దేశాలలోని చర్చ్‌లకు ఎలాంటి హాని జరగలేదని తేలిపోయిన తరువాత వారంతా తేలు కుట్టిన దొంగల మాదిరి మిన్నకుండిపోయారు.ఇప్పుడు చైనాలో బైబిల్‌ పఠించిన కారణంగా శిక్షలు వేస్తున్నట్లు కొందరు క్రైస్తవులతో పాటు నిత్యం క్రైస్తవులను ద్వేషించే మనువాదులు కూడా కడవల కొద్దీ కన్నీరు కారుస్తున్నారు.చైనా చట్టాల ప్రకారం దేవుడిని ఇంటికే పరిమితం చేయాలి తప్ప వీధులకు ఎక్కించకూడదు. వీధులలో బైబిలే కాదు, ఏ మత గ్రంధ పఠనాన్ని ప్రోత్సహించినా, పఠించినా, అనుమతి లేకుండా ప్రార్ధనా మందిరాలను నిర్మించినా అది నేరమే.దానికి అనుగుణంగానే శిక్షలు వేస్తున్నారు తప్ప మరొకటి కాదు.దీనిలో మనోభావాల సమస్య వుత్పన్నం కాదు. మన దేశంలో తెల్లవారే సరికి నడిరోడ్లమీద, వివాదాస్పద స్ధలాల్లో దేవుళ్లు, దేవతలు వెలుస్తుంటారు. చైనా వంటి చోట్ల అది కుదరదు. మెజారిటీ, మైనారిటీ ఎవరైనా అలాంటి పనులు చేస్తే కటకటాల వెనక్కు పోవాల్సిందే.

కమ్యూనిస్టు ప్రణాళిక వెలువడిన ప్రారంభంలో వెల్లడైన వ్యతిరేకతకు, నేటికి వచ్చిన మార్పులను చూస్తే క్రైస్తవ మతాన్ని కూడా సోషలిజం, కమ్యూనిజాలకు వ్యతిరేకంగా పాలకవర్గాలు ఎలా వుపయోగించుకోచూశాయో చూశాము. తొలుత ఒక సిద్ధాంతంగా పనికిరాదని విమర్శ చేశారు. తరువాత బోల్షివిక్‌ విప్లవ సమయంలో రష్యాలో ప్రత్యక్షంగా కమ్యూనిస్టు వ్యతిరేక తిరుగుబాటులో భాగస్వాములయ్యారు. తరువాత ప్రచ్చన్న యుద్ధంలో తమ వంతు పాత్రను మరింతగా పోషించేందుకు కమ్యూనిజం మతానికి వ్యతిరేకమని ప్రకటించటమే కాదు, సోవియట్‌, తూర్పు ఐరోపాలో జరిగిన కుట్రలో భాగస్వాములయ్యారు. ఇప్పటికీ అనేక చోట్ల అటువంటి ప్రయత్నాలు చేస్తూనే వున్నారు.

ఇదే సమయంలో క్రైస్తవమతంలో సామ్రాజ్యవాదులతో చేతులు కలిపేందుకు నిరాకరించేశక్తులు కూడా వున్నాయని స్పష్టమైంది. కమ్యూనిజాన్ని వ్యతిరేకించే మతాధిపతులు చెప్పిన భాష్యాలకు ఏ బైబిల్‌ అంశాలు ఆధారమయ్యాయో అదే గ్రంధంలోని అంశాలను మార్క్సిజంతో మతాన్ని సఖ్యత పరిచేందుకు కమ్యూనిజపు సానుభూతిపరులైన మతాధిపతులు కూడా తమ భాష్యాలకు వుపయోగించారు. మొదటి వారు మారణకాండను ప్రోత్సహించిన వారి తరఫున వుంటే రెండో తరగతివారు మానవ కల్యాణాన్ని కోరుకున్న వారి పక్షాన నిలిచారు. మరి మనం ఎటు వుండాలి?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

ప్రపంచాన్ని వదలని కమ్యూనిస్టు బూచి !

23 Saturday Sep 2017

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Left politics, Opinion, Uncategorized

≈ Leave a comment

Tags

Anti communist, communist, communist manifesto, Indonesian Communist Party (PKI)., specter of communism, Suharto’s Purge

ఎంకెఆర్‌

‘ఒక భూతం ఐరోపాను తరుముతోంది, అదే కమ్యూనిస్టు భూతం’ అంటూ కారల్‌ మార్క్స్‌-ఫెడరిక్‌ ఎంగెల్స్‌లు 1848 ఫిబ్రవరిలో వెలువరించిన కమ్యూనిస్టు ప్రణాళిక ప్రారంభం అవుతుంది. అంటే కమ్యూనిస్టు ప్రణాళికకు ముందే కమ్యూనిజం గురించి ఐరోపా పాలకవర్గం భయపడటం ప్రారంభమైతే ఇప్పుడు అది ప్రపంచం వ్యాపితంగా పాలకవర్గాలను వణికిస్తోంది. కమ్యూనిజాన్ని భూస్తాపితం చేశాం, అదింక పైకి లేవదు అని పాతికేండ్ల క్రితం ప్రగల్బాలు పలికిన వారే తమ నీడను చూసి తామే భయపడుతున్నారు. సోషలిజం, కమ్యూనిజాల వ్యాప్తి నుంచి ప్రపంచాన్ని రక్షించేందుకు కంకణం కట్టుకొని బరిలోకి దిగామని జబ్బలు చరుచుకుంటున్న అమెరికాలోనే మూల మూలల నుంచి అవును నేను సోషలిస్టును అని సగర్వంగా రొమ్ము విరుచుకుంటూ ముందుకు వస్తున్న వారిని చూసి ఏం చేయాలో దిక్కుతోచటం లేదు. సోషలిజం, కమ్యూనిజం మంచిదే కానీ వాటిని అమలు జరిపే కమ్యూనిస్టులు ఈ రోజుల్లో లేరు అనే వారు ఎందరో అయితే అమెరికన్ల ప్రచార ప్రభావంతో ప్రపంచానికి కమ్యూనిజం పనికిరాదు అని చెప్పేవారు కూడా వున్నారు.

సెప్టెంబరు 18వ తేదీన జకర్తాలోని ఒక భవనంలో నిషేధిత కమ్యూనిస్టు పార్టీని పునరుద్ధరించేందుకు సభ జరుపుతున్నారంటూ వందలాది మంది కమ్యూనిస్టు వ్యతిరేకులు గుమికూడి దాడి చేసేందుకు ప్రయత్నించారు. అడ్డుకున్న పోలీసులపై దాడి చేశారు. ఇంతకూ ఏమిటా సమావేశం ? ఐదు దశాబ్దాల క్రితం ఇండోనేషియా మిలిటరీ లక్షలాది మంది కమ్యూనిస్టులను, సానుభూతిపరులను, అనుమానం వచ్చిన వారిని హత్య చేసింది. వారి కుటుంబవారసులు, మానవ హక్కుల కార్యకర్తలు నాటి హత్యాకాండ గురించి విచారణ జరిపి వాస్తవాలను బయటపెట్టాలని, నేరస్థులను శిక్షించాలని చాలా కాలంగా డిమాండ్‌ చేస్తున్నారు. అలాంటి బాధిత కుటుంబాలకు న్యాయ సలహాలను అందచేసేందుకు జరుగుతున్న సమావేశమది. దాన్ని పాలకపార్టీ, మిలిటరీ కనుసన్నలలో పనిచేసే ఇస్లామిక్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ పేరుతో వున్న శక్తులు కమ్యూనిస్టు పార్టీ పునరుద్ధరణ సభగా చిత్రించి దాడికి ప్రయత్నించాయి. వారిని పోలీసులు అరెస్టు చేసినప్పటికీ వుత్తుత్తి కేసులతో జరిపే ఒక తతంగం తప్ప వేరు కాదు.

కమ్యూనిస్టులను వూచకోత కోసి, పార్టీని సిషేధించి నామ రూపాలు లేకుండా చేసి ఐదు దశాబ్దాలు గడిచినా ఇండోనేషియా పాలకవర్గాన్ని కమ్యూనిస్టు బూచి వదలటం లేదు. ఎప్పుడు ఏ వైపు నుంచి కమ్యూనిస్టులు తిరిగి రంగంలోకి వస్తారో అన్న భయం వారిని నిదురపోనివ్వటం లేదు. అక్కడ పేరుకు పౌర పాలన అయినప్పటికీ పెత్తనమంతా వుక్కు పాదాలదే. అడుగడుగునా వారి పాద ముద్రలు కనిపిస్తుంటాయి. వీధుల్లో ఎవరైనా ఎర్రరంగు చొక్కా ధరించి కనిపిస్తే మ్యూనిస్టుకిందే లెక్క. మిలిటరీ పోలీసులు నిర్ధారించుకొని కానీ వదలరు. ‘కమ్యూనిస్టుల విద్రోహం’ పేరుతో నిర్మించిన ప్రచార సినిమా ప్రదర్శనలు ఈనెల 30న దేశమంతటా జరిగేట్లు చూడాలని మిలిటరీ ఆదేశాలిచ్చిందంటే అక్కడ వున్నది ఏ తరహా పాలనో అర్ధం చేసుకోవచ్చు. భారీ ఖర్చుతో కమ్యూనిస్టు వ్యతిరేకతను రెచ్చగొట్టేందుకు చాలా కాలం క్రితం నిర్మించిన ఆ సినిమాను ప్రతి ఏటా 30వ తేదీన టీవీలో ప్రసారం చేస్తారు. కమ్యూనిస్టులను హతమార్చేందుకు అమెరికా సిఐఏ భాగస్వామ్యంతో ఇండోనేషియా మిలిటరీ జరిపిన కుట్రలో భాగంగా 1965 సెప్టెంబరు 30న కొంతమంది మిలిటరీ అధికారులను హత్య చేసి వారిని తిరుగుబాటు చేసిన కమ్యూనిస్టులు చంపివేశారని ప్రచారం చేశారు. దాన్ని సాకుగా చూపి లక్షలాది మంది కమ్యూనిస్టులు, అభిమానులు, కమ్యూనిస్టులనే పేరుతో అనేక మంది చైనా జాతీయులను వూచకోత కోశారు.

వర్తమాన తరాలకు సరైన చరిత్రను తెలిపేందుకు ఆ సినిమాను విధిగా ప్రదర్శించేట్లు చూడాలని కోరిన మాట నిజమే అని సైనికాధికారులు నిర్ధారించారు. దానిలో కమ్యూనిస్టులు దేవుడిపై విశ్వాసం లేని దుష్టులని, అందుకే వారు సైనికాధికారులను చంపివేశారని, కనుక వారి మీద నిషేధం విధించటం సరైనదేనని చెప్పేందుకు ఆ చిత్రాన్ని నిర్మించారు.

నాటి హత్యా కాండ గురించి బహిరంగంగా చర్చించటాన్ని అధికారికంగా నిషేధించారు. సోమవారం నాటి సమావేశంలో బాధిత కుటుంబాలకు న్యాయ సహాయం అందచేసే అంశం గురించి చర్చించారు. అక్కడి నిబంధనంల ప్రకారం మూడు వందలు అంతకు మించి ఎక్కువ మంది గుమి కూడా సమావేశాలకు మాత్రమే అనుమతి తీసుకోవాలి. ఈ సమావేశానికి 50 మంది వరకు మాత్రమే హాజరయ్యారు. అయినపప్పటికీ పోలీసులు అడ్డుకున్నారు. అదే సమయంలో కమ్యూనిస్టు వ్యతిరేకులు కూడా దాడికి పాల్పడ్డారు. బాధిత కుటుంబాలకు నష్టపరిహారం డిమాండ్‌ చేస్తూ జరపతలపెట్టిన ఒక సమావేశాన్ని కూడా అంతకు ముందు జరగనివ్వలేదు. ప్రభత్వం ఎంతగా అణచివేతలకు పాల్పడుతున్నప్పటికీ అక్కడ వున్నది పౌర ప్రభుత్వం కనుక విధిలేని పరిస్ధితులలో పరిమితంగా అయినా కొంత చర్చకు అవకాశం కల్పించక తప్పటం లేదు. 2012,14 సంవత్సరాలలో హత్యాకాండపై రెండు డాక్యుమెంటరీ చిత్రాలను నిర్మించారు, 2016లో ప్రభుత్వమే బాధితులు, వారి కుటుంబాల అభిప్రాయాలను వినేందుకు రెండు రోజుల పాటు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చింది. సామూహికంగా ఖననం చేసినట్లు పేర్కొన్న ప్రాంతాలలో నిజానిజాలు తేల్చాలని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ అది కంటితుడుపు చర్యగానే మిగిలి పోయింది. తాజా పరిణాలను చూసినపుడు దేశంలో భావ ప్రకటనా స్వేచ్చకు అవకాశం లేదని, నియంత సుహార్తో రోజులను గుర్తుకు తెస్తున్నారని ఇండోనేషియన్‌ ఇండిపెండెంట్‌ జర్నలిస్టుల అసోసియేషన్‌ ప్రతినిధి అరిఫ్‌ బంబానీ వ్యాఖ్యానించారు. గతేడాది కాలంలో జర్నలిస్టులపై దాడులు రెట్టింపయ్యాయని చెప్పారు.

మలేషియా ప్రచురణ సంస్ధ తకుల్‌ సెటాక్‌ జకర్తాలో గతేడాది అక్టోబరులో నిర్వహించిన ఒక పుస్తక ప్రదర్శనలో కమ్యూనిస్టు ప్రణాళిక పుస్తకం వుండటంపై మిలిటరీ, పోలీసు అధికారులు ఏడు గంటల పాటు నిర్వాహకులను ప్రశ్నించారు. మ్యూనిస్టు సాహిత్యం విక్రయించటాన్ని ఇండోనేషియాలో కమ్యూనిజాన్ని ప్రచారం చేయటంగా పరిగణించి శిక్షలు విధిస్తారు.

తూర్పు ఐరోపాలో సోషలిస్టు వ్యవస్ధలను కూల్చివేసిన తరువాత సోషలిస్టు, కమ్యూనిస్టు చిహ్నాలను కూడా జన జీవితం నుంచి తొలగించేందుకు నిరంతరం ప్రయత్నిస్తున్నారు. సోషలిస్టు వ్యవస్ధకు ప్రత్యామ్నాయంగా తిరిగి పునరుద్ధరించిన పెట్టుబడిదారీ వ్యవస్ధ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నకొద్దీ దాని నుంచి దృష్టి మళ్లించేందుకు సైద్ధాంతిక దాడితో పాటు, గత చిహ్నాలను కూడా అంతర్ధానం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇది వూహించని పరిణామం కాదు. రెండవ ప్రపంచ యుద్ధ సందర్భంగా తూర్పు ఐరోపాలోని అల్బేనియాను తొలుత ఇటాలియన్‌ ఫాసిస్టులు, తరువాత నాజీలు అక్రమించేందుకు ప్రయత్నించారు. ఈ దాడిని ఎదుర్కొనేందుకు నడుం కట్టిన కమ్యూనిస్టుపార్టీ ఇతర జాతీయవాదులను కూడా ప్రతిఘటనలో భాగస్వాములను చేసేందుకు 1942 సెప్టెంబరు 16న ఒక సమావేశాన్ని పెజా అనే గ్రామంలోని మైస్లిం పెజా అనే వ్యక్తి ఇంట్లో జరిగింది. చరిత్రలో దానిని పెజా సమావేశం అని పిలిచారు.అల్బేనియా విముక్తిలో అదొక చారిత్రాత్మక ఘట్టం. దీనిని పురస్కరించుకొని ఈ ఏడాది ఆరోజున జరిగిన ఒక కార్యక్రమంలో పిల్లలు ఆ సమావేశంలో కీలక పాత్ర పోషించిన కమ్యూనిస్టు నేత ఎన్వెర్‌ హోక్సా చిత్రపటాన్ని ప్రదర్శిస్తూ ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమం గురించి విన్న ప్రతిపక్ష డెమోక్రటిక్‌ పార్టీ నేత లుజిమ్‌ భాషా గత కమ్యూనిస్టు ప్రభుత్వ చిహ్నాలన్నింటినీ నిషేధించాలని అందుకు గాను జర్మనీ, ఇతర దేశాలలో మాదిరి ఒక చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్‌ చేశాడు. దేశంలో కొంత మంది ఇప్పటికీ ఎన్వెర్‌ హోక్సా, కమ్యూనిస్టు పాలన గురించి బెంగతో వున్నారని, ఈ జబ్బు నయం చేయటానికి పైపూతలు చాలవని పేర్కొన్నాడు. ప్రభుత్వ నిధులతో కమ్యూనిస్టుల హయాంలో జరిగిన నేరాల పరిశోధన పేరుతో ఏర్పాటు చేసిన సంస్ధ కమ్యూనిస్టుల పాలనలో నిర్మించిన సినిమాల ప్రదర్శన నిషేధం గురించి ఒక ముసాయిదా బిల్లు తయారు చేసే పనిలో వుంది. ఒక్కసారిగా అన్నింటిపై నిషేధం అంటే ఎదురుతన్నే అవకాశం వుందని అందువలన సినిమాకు ముందు దాని గురించి చెబుతూ పెద్ద ఆర్భాటాలు లేకుండా చూడాలని సంస్ధ నిర్వాహకుడు చెప్పాడు. అయితే ఈ ప్రతిపాదనలు బహిర్గతం కాగానే కమ్యూనిజంతో విబేధించే వారు కూడా గత చరిత్రను తుడిచి వేయటాన్ని అంగీకరించబోమని కొందరు పేర్కొన్నారు. గతేడాది జరిపిన ఒక సర్వేలో 42శాతం మంది కమ్యూనిస్టు నేత ఎన్వెర్‌ హోక్సా గురించి సానుకూలంగా స్పందించారు.

పూర్వపు సోషలిస్టు దేశాలలో కమ్యూనిస్టుచిహ్నాలను పూర్తిగా చెరిపివేయాలన్నది ఒక వివాదాస్పద అంశంగా మారింది. ఆ పని చేస్తే ప్రస్తుతం అధికారంలో వున్న పాలకుల ప్రజాస్వామ్య వ్యతిరేకలక్షణాన్ని స్వయంగా బయట పెట్టుకున్నట్లు అవుతుందని తీవ్ర వ్యతిరేక ప్రచారం చేస్తే యువతరంలో కమ్యూనిజం గురించి ఆసక్తి పెరిగే ప్రమాదం వుందన్న కోణం నుంచి పూర్తిగా చెరిపి వేయాలనటాన్ని వ్యతిరేకిస్తున్నారు కొందరు. తూర్పు ఐరోపా దేశాలన్నీ ఫాసిజానికి వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర కలిగినవే. కమ్యూనిస్టుపార్టీ చిహ్నాలను లేకుండా చేయటం అంటే ఆ ఘనచరిత్రను తుడిచి వేయటమే. వుక్రెయిన్‌లో 2015లో చేసిన రెండు చట్టాల ప్రకారం కమ్యూనిస్టు చిహ్నాలను నిషేధించటమే గాక, ఎవరైనా కమ్యూనిస్టు పాలకులు చేసిన పనులను నేరాలుగా ఎలా చెబుతారని ప్రశ్నించటాన్ని కూడా నేరంగా ఆ చట్టంలో పొందుపరిచారు. హంగరీలో 2000 సంవత్సరంలో కమ్యూనిస్టు, ఫాసిస్టు చిహ్నాలను నిషేధించటంపై కోర్టులలో అనేక సార్లు సవాలు చేసిన వుదంతాలున్నాయి.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

విస్మరించజాలని కమ్యూనిస్టు ప్రణాళిక, కమ్యూనిస్టు పార్టీల ప్రాధాన్యత

09 Thursday Mar 2017

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, Left politics, Opinion, Political Parties, RUSSIA, USA

≈ 1 Comment

Tags

China, china communist party, communist manifesto, Engels, Marx, Marx and Engels, Narendra Modi, Xi Jinping

Image result for one cannot deny the importance of the communist manifesto

ఎం కోటేశ్వరరావు

ఏ తర్కానికైనా దానికి ఒక న్యాయబద్దమైన ముగింపు వుంటుంది. తర్కంలో పాల్గొనేవారు తమకు అనుకూలమైనంత వరకే స్వీకరించి ఎదుటి వారికి సరైన సమాధానం చెప్పకపోతే చివరకు ఆ తర్కం అసంబద్దంగా ముగుస్తుంది. వుదాహరణకు కమ్యూనిజానికి కాలం చెల్లింది, అది పనికిరాదు అంటారు. అదే నిజమైతే ప్రపంచవ్యాపితంగా కమ్యూనిజం గురించి అనుకూలంగానో వ్యతిరేకంగానో ఎందుకు చర్చ జరుగుతోంది?

కారల్‌ మార్క్స్‌-ఫెడరిక్‌ ఎంగెల్స్‌ రచించిన కమ్యూనిస్టు ప్రణాళిక తొలి ముద్రణ జరిగి ఫిబ్రవరి 21 నాటికి 170 సంవత్సరాలు పూర్తి అయింది.అమెరికాలో ట్రంప్‌ అధికారానికి వచ్చిన తరువాత పుస్తక దుకాణాలలో ఆఫ్రో-అమెరికన్ల గురించి రాసిన న్యూ జిమ్‌ క్రో గ్రంధం తరువాత కమ్యూనిస్టు మానిఫెస్టో గురించి పాఠకులు అడుగుతున్నారని అమెరికాలోని సింపోజియం బుక్స్‌ యజమాని చెప్పారు. జనం కమ్యూనిస్టుమానిఫెస్టో గురించి ఎందుకు అడుగుతున్నట్లు ? అంటే కమ్యూనిస్టు సిద్దాంతం పనికిరాదని చెబుతున్నమాటలను జనం పూర్తిగా విశ్వసించటం లేదన్నమాట. 2008లో ధనిక దేశాలలో సంక్షోభం ప్రారంభమైన తరువాత అనేక మంది కమ్యూనిస్టు మానిఫెస్టో దుమ్ముదులుపుతున్నారు. ప్రఖ్యాత అమెరికన్‌ ఆర్ధికవేత్త రాబర్ట్‌ ఎల్‌ హెయిల్‌బ్రోనర్‌ ఒక సందర్భంలో ‘మనం మార్క్స్‌వైపు చూస్తున్నామంటే ఆయన సర్వజ్ఞుడని కాదు, ఎందుకంటే ఆయన్నుంచి మనం తప్పించుకోలేం’ అన్నారు. పాలకవర్గాలు తమ అస్ధిత్వానికి ముప్పు ఏర్పడినపుడు అంతకు ముందు ఏం చెప్పినప్పటికీ దాన్నుంచి తప్పించుకొనేందుకు ఒక మహా సంఘటనగా ఏర్పడతాయి. సోవియట్‌ యూనియన్‌, తూర్పు ఐరోపా సోషలిస్టు రాజ్యాల కూల్చివేతకు ఐరోపా, అమెరికాలోని కమ్యూనిస్టు వ్యతిరేకశక్తులు, పోప్‌ ఒక కూటమిగా ఏర్పడటం ప్రపంచ చరిత్రలో ఒక ప్రధాన ఘటన కాదా? అంటే ఈ రెండు ఖండాలలోని అధికార శక్తులు కమ్యూనిజం తమను సవాలు చేసే ఒక శక్తి అని గుర్తించినట్లే కదా ? చైనా కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు జరిగిన కుట్రలో బౌద్ద దలైలామా ఒక పావుగా వుపయోగపడ్డారా లేదా ? అందుకే ఎవరెన్ని చెప్పినా కమ్యూనిస్టు మానిఫెస్టో, కాపిటల్‌ గ్రంధాలు ఇప్పటికీ కొత్త తరాలకు ఆసక్తి కలిగిస్తూనే వున్నాయి. ఇక్కడొక ప్రశ్న తలెత్త వచ్చు. తమకు ముప్పు తెచ్చే పుస్తకాలను అమెజాన్‌ వంటి బహుళజాతి కార్పొరేషన్లు ఎందుకు విక్రయిస్తున్నాయి, గూగుల్‌ వంటి కంపెనీలు ఆ సాహిత్యాన్ని ఆన్‌లైన్‌లో ఎందుకు అనుమతిస్తున్నాయని ఎవరైనా అడగవచ్చు. మార్క్సు రైనిష్‌ జీటుంగ్‌ పత్రికలో నాటి రష్యన్‌ జారు ఒకటవ నికోలస్‌ను విమర్శిస్తూ వ్యాసం రాయటంతో ఆ పత్రికపై నిషేధం విధించాలని ప్రష్యన్‌ ప్రభుత్వాన్ని కోరగా ఆ పని చేశారు. కమ్యూనిస్టు మానిఫెస్టో, కాపిటల్‌ తొలి ముద్రణలు పొందినపుడు వాటి వల్ల ముప్పు వస్తుందని నాటి పాలకవర్గాలు భావించలేదు కనుకనే ముద్రణ, విక్రయాలకు అనుమతిచ్చాయి, ఇప్పుడు ముప్పులేదని పైకి చెబుతున్న కారణంగా, దాని కంటే ఆ పుస్తకాలకు గిరాకీ వున్నందున వాటిపై కూడా లాభం సంపాదించేందుకు ఇప్పుడు అనుమతిస్తున్నారు. ఎంతకాలం అనుమతిస్తారో చూడాల్సిందే.

Image result for marx engels

చైనా కంటే భారత్‌ ఎందుకు వెనుకబడింది అంటే అది నిరంకుశ దేశం, మనది ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామిక దేశం అని టక్కున సమాధానం చెబుతారు.అమెరికాతో పోలిస్తే 1917కు ముందు రష్యా కూడా నిరంకుశ జార్‌ పాలనలోనే మగ్గింది. మరి అదెందుకు వెనుకబడిపోయింది. ప్రపంచానికి ప్రజాస్వామ్యాన్ని నేర్పినట్లు చెప్పుకొనే రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు రవి అస్తమించని సామ్రాజ్యాన్ని కలిగి వున్న బ్రిటన్‌ ఈ రోజు అమెరికా అనుచర దేశంగా ఎందుకు మారిపోయింది? నిరంకుశ దేశాలన్నీ చైనా మాదిరి అంతగాకపోయినా వాటి స్ధాయిలో అయినా ఎందుకు పురోగమించటం లేదు అంటే సరైన సమాధానం వుండదు. మన దేశం త్వరలో చైనాను అధిగమించనుంది అని చెబుతున్నారు. అంతకంటే కావాల్సిందేముంది? మన వారందరూ అమెరికా వెళ్లి ఆ దేశాన్ని ప్రధమ స్ధానంలో వుంచుతున్నారని మన చంద్రబాబు వంటి వారు చెబుతున్నారు. అందువలన అభివృద్దిలో చైనాతోయేం ఖర్మ అమెరికాతోనే పోటీ పడాలి. కానీ మనం ఎక్కడున్నాం, సర్దార్‌ పటేల్‌ విగ్రహాన్ని కూడా తయారు చేసుకోలేక చైనాకు ఆర్డర్‌ ఇచ్చాము. అదే నోటితో మేకిన్‌ ఇండియా అని పిలుపులు ఇస్తాము. మన ముందు ఏం మాట్లాడినా మన వెనుక ప్రపంచం నవ్వదా ?

Image result for xi jinping

చైనా విజయానికి కమ్యూనిస్టు పార్టీ ఎలా మార్గదర్శకత్వం వహించింది అనే పేరుతో అమెరికాకు చెందిన న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక ఒక వ్యాసాన్ని ప్రచురించింది. అదేమీ మ్యూనిస్టు అనుకూల పత్రిక కాదు. సెబాస్టియన్‌ హెయిల్‌మాన్‌(51) అనే ఒక జర్మన్‌ బెర్లిన్‌లోని మెర్కాటర్‌ ఇసిస్టిట్యూట్‌ ఆఫ్‌ చైనీస్‌ స్టడీస్‌ సంస్ధ స్ధాపక అధ్యక్షుడు. ట్రయర్‌ విశ్వవిద్యాలయంలో ప్రభుత్వ ప్రొఫెసర్‌.ఆయనతో ఇంటర్వూ చేసి న్యూయార్క్‌ టైమ్స్‌ ప్రచురించింది. హెయిల్‌ మన్‌ రాసిన చైనా రాజకీయ వ్యవస్ధ అనే అంగ్ల అనువాదాన్ని ప్రతి రెండు మూడు నెలలకు ఒకసారి నవీకరిస్తున్నారు. ఎప్పటికప్పుడు చైనాలో జరుగుతున్న మార్పులను పాఠకులకు అందించేందుకు దానిని ఆన్‌లైన్‌లో పెట్టారు. చైనా పురోభివృద్ధిలో చైనా కమ్యూనిస్టు పార్టీ పాత్ర గురించి ఆయనెంతో లోతుగా పరిశోధించారు. ఇది కమ్యూనిజం విజయం కాదా? మనమెంతో తెలివిగలవారమని, చైనీయులు నల్లమందు భాయీలని ఎద్దేవా చేసిన రోజులను మనం మరిచిపోయామా ? అలాంటి వారిని ఎంతో తెలివిగలవారిగా మార్చిందెవరు ? కమ్యూనిస్టులు కాదా ? ప్రజాస్వామ్య వ్యవస్ధ మనలను అలా ఎందుకు మార్చలేకపోయింది ?

     మన దేశంలో అధికారంలో ఏ పార్టీ వున్నా తన కాడర్‌పై ఆధారపడటం అన్నది ఆత్మవంచన చేసుకొనేవారు తప్ప మిగిలిన వారందరూ అంగీకరిస్తున్న సత్యం. పార్టీ కార్యకర్తలకు నామినేటెడ్‌ పదవులను ఇచ్చి రాజకీయ నిరుద్యోగం పోగొట్టి వుపాధి కల్పించటం, ఆ పదవులను స్ధాయిని బట్టి పెద్ద ఎత్తున అక్రమంగా పోగేసుకోవటానికి వినియోగించటం తెలిసిందే. అది చైనాలో లేదా అంటే అక్కడా వుందని కమ్యూనిస్టుపార్టీయే స్వయంగా చెప్పి అవినీతి వ్యతిరేక పోరాటం చేస్తున్నది. ఎన్నో వేల మందిపై వేటు వేశారు. మన దేశంలో ఏ పార్టీ అయినా అవినీతికి పాల్పడిన వారిని ఒక్కరినంటే ఒక్కరిని తొలగించి, శిక్షించిన వుదంతం వుందా ? ఎందుకు లేదు? ప్రజాస్వామ్యం నుకనా ?

     మన వంటి దేశాలలో విధాన నిర్ణయాలు, చట్టాలు చేసేది చట్టసభలు. వాటిని అమలు జరిపేది వుద్యోగ యంత్రాంగం. చైనాలో చట్టసభలు తమపని తాము చేస్తే వాటిని అమలు చేసే బాధ్యత పార్టీ కార్యకర్తలపై పెట్టటమే అక్కడి విజయ రహస్యం అన్నది హెయిల్‌మన్‌ అధ్యయన సారంశాలలో ఒకటి. వుదాహరణకు మన ప్రధాని నరేంద్రమోడీ సర్వరోగ నివారిణి జిందాతిలిస్మాత్‌ అన్నట్లుగా నల్లధనం నుంచి అవినీతి, వుగ్రవాదం, పన్నుల ఎగవేత, నగదు రహిత లావాదేవీల వంటి అనేక చర్యలకు గాను ఒకే మాత్ర అన్నట్లుగా పెద్ద నోట్ల రద్దును ప్రకటించి అమలు చేశారు. ఆ సందర్భంగా బిజెపి ప్రజాప్రతినిధులు, నాయకులందరూ తమ బ్యాంకు ఖాతాల లావాదేవీల వివరాలను పార్టీ నాయకత్వానికి అందచేయాలని ఆదేశించినట్లు మన ప్రజాస్వామిక మీడియాలో వార్తలు చదివాము. ఆ లెక్కల్లో ఎలాంటి అక్రమాలు లేవని అయినా ప్రకటించాలి కదా ? అసలు దాని గురించి ఎందుకు మాట్లాడరు ? అన్నింటికీ మించి రిజర్వుబ్యాంకు దగ్గరకు వచ్చిన రద్దయిన నోట్లెన్ని? ఎంత నల్లధనం బయటపడిందీ ఎందుకు ప్రకటించలేదు. ప్రజాస్వామిక వ్యవస్ధలలో ఇలాంటి వన్నీ రహస్యమా ?

చైనాలో కూడా బయటి నుంచి వచ్చిన పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞానంతో పాటు అవినీతి కూడా దిగుమతి అయి కొందరు అవినీతిపరులుగా మారారు. వారిపై అక్కడి అధ్యక్షుడు గ్జీ జింగ్‌ పింగ్‌ కూడా చర్యలు తీసుకున్నారు. రోజూ ఏదో ఒక మూల నుంచి అవినీతి పరులపై చర్యలు తీసుకుంటున్నట్లు వార్తలు చదువుతూనే వున్నాము కదా? మన దేశంలో అలాంటి వార్తలు ఎందుకు రావటం లేదు. చెన్నయ్‌లో కోట్ల కొలది కొత్త నోట్లు పోగేసిన బడా కాంట్రాక్టర్‌ వుదంతంలో ఎందరు బ్యాంకు వున్నతాధికారులపై చర్యతీసుకున్నారో ఎవరైనా ప్రకటించారా ?

చైనా కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం ఎంతో పట్టువిడుపులతో చట్టాలు చేయబోయే ముందు అనేక అంశాలపై ప్రయోగాలు చేసిన తరువాతే చట్టాలు చేయటం కూడా విజయ రహస్యమని జర్మన్‌ ప్రొఫెసర్‌ అంటున్నారు. సోషలిస్టు వ్యవస్ధ నిర్మాణం అన్నది 1917కు ముందు తెలియదు. సోవియట్‌ ఒక ప్రయోగం. అక్కడ వచ్చిన ఫలితాలను అధ్యయనం చేసిన తరువాత చైనా తనదైన పంధాను ఎంచుకున్నది. భూ సంస్కరణల విషయంలో అది కనిపిస్తుంది. సోషలిస్టు వ్యవస్ధ నిర్మాణానికి ఒక మూస అనేది వుండదని గ్రహించిన తరువాత చైనాలో సంస్కరణలకు ఆద్యుడైన డెంగ్‌సియావో పింగ్‌, తరువాత నేతలుగా వున్న వారు అనేక ప్రయోగాలకు తెరతీశారు. మంచి గాలికోసం కిటికీలు తెరిస్తే దాంతో పాటు ఈగలు, దోమలు కూడా ప్రవేశించవచ్చు, అయితే వాటిని ఎలా అరికట్టాలో మాకు తెలుసు అని డెంగ్‌ అన్నారంటే ఒక ప్రయోగానికి శ్రీకారం చుట్టటమే. దానికి తోడు సత్వర ఫలితాలు రావాలంటే ప్రయోగాలను కూడా వికేంద్రీకరించాలని భావించారు, అది అవినీతికి తెరతీసిందని గ్రహించిన తరువాత ప్రస్తుత అధ్యక్షుడు గ్జీ జింగ్‌ పింగ్‌ దిద్దుబాటు చర్యలు చేపట్టారు. కేంద్ర స్ధానం నుంచి పధకాలకు రూపకల్పన చేస్తున్నారు. దీని ఫలితాలను చూసిన తరువాత మార్పులు చేర్పులు చేయటం అనివార్యం. చైనా విజయ రహస్యం ఇదే. సోషలిజం, కమ్యూనిజం వాటిని అమలు చేసే వ్యవస్ధల నిర్మాణానికి శ్రీకారం చుట్టి ఎదురుదెబ్బలు తిన్న పూర్వపు సోవియట్‌ యూనియన్‌, తూర్పు ఐరోపా దేశాల గురించిగానీ లేదా ప్రస్తుతం సోషలిస్టు వ్యవస్ధల నిర్మాణంలో నిమగ్నమైన చైనా, వియత్నాం, క్యూబా, లావోస్‌, కంపూచియా ప్రయోగాల గురించి తమ తమ దృక్కోణాల నుంచి అనేక మంది విశ్లేషణలు చేస్తున్నారు. వాటిని యథాతధంగా స్వీకరించటం లేదా తిరస్కరించటం గాకుండా అధ్యయనం చేయటం అవసరం. మావో మరణం తరువాత ఇంక చైనా పని అయిపోయినట్లే అని అనేక మంది వ్యాఖ్యానాలు చేశారు. తరువాత డెంగ్‌ను గురించి కూడా అదే విధంగా మాట్లాడారు. కానీ చైనా, వియత్నాం, క్యూబా వంటి దేశాలలో వున్న కమ్యూనిస్టు పార్టీలకు ఒక ప్రత్యేక చరిత్ర, అంకిత భావం గల కార్యకర్తల గురించి వారు విస్మరించారు. నాయకులు మరణించిన తరువాత కమ్యూనిజానికి భవిష్యత్‌ లేదని చెప్పటం వ్యతిరేకుల ప్రచారదాడిలో అస్త్రాలు తప్ప మరొకటి కాదని అనేక దేశాల అనుభవాలు నిరూపించాయి. రామాయణం గురించి చెప్పేవారు రాక్షసుడిగా చిత్రించినప్పటికీ రావణుడిని , మహాభారతంలో ధుర్యోధనుడిని, హిట్లర్‌ను పొగిడేవారు వాడి పీచమణిన స్టాలిన్‌ గురించి, గాడ్సేసు దేవుడిగా కొలిచే ‘జాతీయవాదులు’ మహాత్మాగాంధీని పక్కన పెట్టి ముందుకు పోలేరు. అలాగే ప్రఖ్యాత అమెరికన్‌ ఆర్ధికవేత్త రాబర్ట్‌ ఎల్‌ హెయిల్‌బ్రోనర్‌ ‘మార్క్స్‌ నుంచి మనం తప్పించుకోలేం’ అని చెప్పినట్లుగానే వర్తమానంలో అపూర్వ విజయాలు సాధించిన, సాధిస్తున్న చైనా గురించి అధ్యయనం చేయకుండా కమ్యూనిస్టు వ్యతిరేకులతో సహా ఎవరూ తప్పించుకోలేరు.

భూమి పొరలలో వుండి నిరంతరం తొలిచే లక్షణం గల చుంచెలుక మనం వూహించని చోట బయటకు వచ్చి కనిపిస్తుంది. అలాగే దోపిడీ శక్తులను వ్యతిరేకించే శక్తులు కూడా నిరంతరం పని చేస్తూనే వుంటాయి. అవి ఎక్కడ, ఎలా కనిపిస్తాయనేది ఎవరూ చెప్పజాలరు. రూపం మారవచ్చు తప్ప మౌలిక లక్షణం మారదు. కమ్యూనిస్టు మానిఫెస్టో కూడా అలాంటిదే. రెండు రెళ్లు నాలుగు అన్నది మారనట్లే దోపిడీ వున్నంత కాలం దానిని కొనసాగించేందుకు ఎవరెంతగా ప్రయత్నించినా, దానిని నాశనం చేసేందుకు పిలుపు ఇచ్చిన కమ్యూనిస్టు మానిఫెస్టో ఏదో రూపంలో ప్రపంచాన్ని ప్రభావితం చేస్తూనే వుంటుంది. ఇదే కమ్యూనిస్టుల తర్కానికి మూలం, ముగింపు కూడా.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

అమెరికా కాలేజీల్లో అగ్రస్థానంలో ‘కమ్యూనిస్టు ప్రణాళిక ‘

03 Saturday Sep 2016

Posted by raomk in CHINA, Current Affairs, History, INTERNATIONAL NEWS, Latin America, Left politics, USA

≈ Leave a comment

Tags

Anti communist, Che Guevara, communist manifesto, HONG KONG ELECTIONS, Kapernick, Karl Marx, lavish banquets, National Anthem Controversy, Norman Bethune

Image result for Original Communist Manifesto

ఎంకెఆర్‌

   అమెరికా పాలకవర్గం కమ్యూనిజాన్ని అంతం చేయాలని చూస్తున్నది. కానీ ప్రస్తుతం అక్కడి కళాశాలలోని ఆర్ధిక శాస్త్ర విద్యార్ధులు అధ్యయనం చేయాల్సిన పుస్తకాలంటూ సిఫార్సు చేసిన వాటిలో కమ్యూనిస్టు ప్రణాళిక గ్రంధం అగ్రస్థానంలో వుంది. ఆ గ్రంధాన్ని మార్క్స్‌-ఎంగెల్స్‌ 1848లో రాసిన విషయం తెలిసిందే. ఓపెన్‌ సిలబస్‌ ప్రాజెక్టు(ఒపిఎస్‌) కింద నూతన సిలబస్‌ సమాచారాన్ని సేకరించగా ఈ విషయం వెల్లడైందని మార్కెట్‌ వాచ్‌ డాట్‌ కాంలో ప్రచురించిన విశ్లేషణలో పేర్కొన్నారు. వివిధ వెబ్‌సైట్లు, సమాచారాన్నుంచి సేకరించిన వివరాల ప్రకారం ప్రతి ప్రచురణకు పాయింట్లను కేటాయించారు. ఒక పుస్తకం పేరు ఎన్నిసార్లు ప్రస్తావనకు వచ్చింది, దానిని ఎన్నిసార్లు బోధించారు అనే లెక్కలను తీశారు. వాటి ప్రకారం కమ్యూనిస్టు ప్రణాళిక సంఖ్య 3,189 కాగా బోధనా పాయింట్లు 99.7 వచ్చాయి.మిగతా పుస్తకాలకంటే ఇవి రెండు, నాలుగు రెట్లు ఎక్కువ. కమ్యూనిస్టు ఆర్ధిక, సామాజిక బోధనల తరువాత కీనిసియన్‌ సిద్ధాంతాల ప్రచురణలు ఎక్కువగా వున్నాయి.ఆర్ధిక, ద్రవ్య విషయాలకు సంబంధించి అగ్రస్ధానంలో వున్న పది హేను పుస్తకాలలో పది కీనిసియన్‌ లేదా కమ్యూనిస్టు సిద్ధాంతానికి చెందినవే వున్నాయి. స్వేచ్చా మార్కెట్‌ వ్యవస్థకు సంబంధించిన పుస్తకాలు అగ్రస్థానంలో రెండు మాత్రమే వున్నాయి. వాటిలో ఒక వెల్త్‌ ఆఫ్‌ నేషన్స్‌ అనే ఆడమ్‌ స్మిత్‌ రచన రెండవ స్ధానంలో, పెట్టుబడిదారీ విధానం మరియు స్వేచ్ఛ అనే మిల్టన్‌ ఫ్రైడ్‌ మాన్‌ గ్రంధం ఐదవ స్ధానంలో వుంది.http://www.marketwatch.com/story/communist-manifesto-among-top-three-books-assigned-in-college-2016-01-27

imrs.php

విలాస విందులు-చైనా కమ్యూనిస్టు పార్టీ ఆంక్షలు

   అవినీతి, అక్రమాలపై దృష్టి సారించిన చైనా కమ్యూనిస్టు పార్టీ ఇప్పుడు విలాసవంతమైన విందులకు సభ్యులు దూరంగా వుండాలని ఆంక్షలు విధించింది. కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు విందు ఆహ్వానాలను అందుకున్నపుడు వాటికి ఎవరు సొమ్ము ఖర్చు చేస్తున్నారు? ఇంకా ఎవరెవరు హాజరవుతున్నారో,ఎక్కడ జరుగుతోందో ముందుగా తెలుసుకోవాలని సూచించింది. పార్టీ సభ్యులు, అధికారులు ఎలాంటి విందులకు హాజరు కాకూడదో తెలిపింది.అధికారులు ప్రయివేటు క్లబ్బులలో జరిగే విందులకు వెళ్లటాన్ని, ఇతరులను ఆహ్వానించటంపై నిషేధం విధించింది. అలాంటి 20 రకాల విందులకు పార్టీ కార్యకర్తలు హాజరు కాకూడదని తెలిపింది.వివాహాలు, దినాలను విలాసవంతంగా నిర్వహించకూడదని సూచించింది. గ్జీ జింగ్‌ పింగ్‌ అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుంచి గత మూడు సంవత్సరాలుగా అవినీతిపై కేంద్రీకరించారు. ఇప్పుడు విలాసాలపై దృష్టి సారించారు. పార్టీ కార్యకర్తలు, అధికారులు దిగువ సూచనలు పాటించాలని ఆదేశించారు.

     భారీ ఎత్తున జరిపే విందులకు పార్టీ కార్యకర్తలు హాజరు కాకూడదు. అధికార విధులతో సంబంధం లేని విందులు ఏర్పాటు చేయరాదు. అదే నగరం లేదా దేశంలోని ఇతర శాఖల వారిని ఆహ్వానించినపుడు ప్రజల సొమ్మును విందులకు ఖర్చు చేయరాదు.దిగువ స్ధాయి డిపార్ట్‌మెంట్లను విందులు ఏర్పాటు చేయమని అడగ కూడదు.అధికారిక విధులతో సంబంధం లేని విందులకు ఇతర నగరాలలో వెళ్లకూడదు. గ్రామశాఖలు ఏర్పాటు చేసే విందులను స్వీకరించరాదు. ప్రయివేటు కంపెనీలు ఏర్పాటు చేసే విందులకు వెళ్ల కూడదు, ఒక వేళ వెళ్లాల్సి వస్తే అందుకయ్యే ఖర్చును చెల్లించాలి. తమ భోజన ఖర్చు చెల్లించాలని ప్రయివేటు కంపెనీలను అడగ కూడదు. వాణిజ్య పర్యటనలలో ఇతర అధికారుల భోజనాలకు చెల్లించకూడదు. పొద్దు పోయిన తరువాత చేసే భోజనాలకు ప్రజాధనాన్ని ఖర్చు చేయకూడదు. స్వప్రయోజనాలు ఇమిడి వున్న వ్యక్తుల నుంచి వచ్చే విందు ఆహ్వానాన్ని తిరస్కరించాలి. అలాంటి వాటి పట్ల ఎల్ల వేళలా అప్రమత్తంగా వుండాలి. అధికారిక విధులకు అంతరాయం కలిగించే విందులకు వెళ్ల కూడదు. అధికారిక విధులతో నిమిత్తం లేని ఫంక్షన్లకు వచ్చిన అతిధులకు ప్రజల సొమ్మును వెచ్చించకూడదు. ప్రభుత్వ సంస్ధలు ఇచ్చే విందులకు ప్రయివేటు వ్యక్తులను పిలవ కూడదు, అలాంటి విందులలో విందు ఆడంబరంగా వుండకూడదు. ప్రయివేటు క్లబ్బులు, ఇతర ఖరీదైన ప్రాంతాలకు వెళ్లకూడదు. చిన్న బృందాలు, గ్యాంగులను ఏర్పాటు చేసేందుకు వుద్ధేశించిన విందులకు దూరంగా వుండాలి. నగదు బహుమతులు అందచేసే, అధికారులకు చెడ్డపేరు తెచ్చేందుకు అవకాశం వున్న విందులకు వెళ్లకూడదు.

Image result for Dr. Norman Bethune

నార్మన్‌ బెతూన్‌పై కెనడా కమ్యూనిస్టు వ్యతిరేకుల కడుపు మంట

   ఒకవైపు ప్రపంచంలో కమ్యూనిజం అంతిరించి పోయిందంటూనే ఆదర్శ కమ్యూనిస్టుల గురించి కమ్యూనిస్టు వ్యతిరేకులు అంతగా భయపడుతున్నారు. ఎందుకంటే ఆదర్శవాదులు ధృవతారలుగా వెలుగుతూనే వుంటారు. చైనా విముక్తి, జపాన్‌ దురాక్రమణ వ్యతిరేకపోరాటంలో నిమగ్నమైన కమ్యూనిస్టులకు సాయపడేందుకు కెనడా నుంచి నార్మన్‌ బెతూన్‌, భారత్‌ నుంచి ద్వారకా నాధ్‌ శాంతారామ్‌ కొట్నీస్‌(డిఎన్‌ కొట్నిస్‌) వంటి ఎందరో ప్రాణాలకు తెగించి చైనా వెళ్లి సేవలు అందించారు.

   ఆగస్టు 31 నుంచి సెప్టెంబరు ఆరు వరకు కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రుడెవ్‌ చైనా పర్యటన జరుపుతున్నారు.ఆయన రాక సందర్భంగా చైనా ప్రభుత్వం ఆయనకు ప్రతిష్టాత్మక నార్మన్‌ బెతూన్‌ మెడల్‌ను బహుకరించింది. ఇలాంటిదే 1973లో తన తండ్రికి బహుకరించారని జస్టిన్‌ తన ఇస్‌స్టాగ్రామ్‌ పేజీలో వ్యాఖ్యానించారు. ఇంకేముంది కెనడా కమ్యూనిస్టు వ్యతిరేకులకు అవకాశం దొరికినట్లయింది. మాజీ ప్రధాని పిరే ఇలియట్‌ ట్రుడెవ్‌ అడుగుజాడల్లో ఆయన కుమారుడు జస్టిన్‌ కూడా చైనా తో సంబంధాల విషయంలో వ్యవహరిస్తున్నాడని చైనాలో మానవ హక్కుల హరణం గురించి తెలుసుకోవాలంటూ కాగితాలు, ఇంటర్నెట్‌ను ఖరాబు చేస్తున్నారు. నార్మన్‌ బెతూన్‌ అంటే కెనడాలో అత్యధికులకు అసలు తెలియదు, చైనాలో మాత్రం జాతీయ వీరుడు, ప్రతి స్కూలు పిల్లవాడికీ బెతూన్‌ పేరు తెలుసు. వైద్యుడిగా జీవితం ప్రారంభించిన బెతూన్‌ కమ్యూనిస్టు కూడా. కెనడాలో వైద్యం వలన తన జీవితం ధన్యం కాదని గ్రహించిన ఆయన తొలుత స్పెయిన్‌ వెళ్లి అక్కడ నియంతకు వ్యతిరేకంగా కమ్యూనిస్టుల నాయకత్వాన సాగిన అంతరుద్ధ్యంలో పాల్గొన్నాడు. తరువాత 1938లో చైనా వెళ్లి కమ్యూనిస్టు గెరిల్లా దళాలలో చేరి వారికి వైద్య చికిత్స అందించారు. ఆ సమయంలోనే మావోతో పరిచయం ఏర్పడింది. అయితే 1939లో జరిగిన ఒక ప్రమాదంలో బెతూన్‌ మరణించారు. చైనాలో కమ్యూనిస్టులు అధికారానికి వచ్చిన తరువాత అంతర్జాతీయ కమ్యూనిస్టు సౌహార్ధ్రతకు ఒక ఆదర్శంగా బెతూన్‌ సేవలను పరిగణించి ఆయన గురించి స్కూలు పాఠ్యాంశాలలో చేర్చటంతో ఆయన పేరు ప్రతి చైనీయుడికీ సుపరిచితం అవుతోంది.

   1970 దశకం వరకు కమ్యూనిస్టు చైనాను గుర్తించేందుకు అమెరికా నాయకత్వంలోని సామ్రాజ్యవాద కూటమి తిరస్కరించింది. ఒక తిరుగుబాటు రాష్ట్రమైన తైవాన్‌ ప్రభుత్వాన్నే అసలైన చైనాగా పరిగణించి ఐక్యరాజ్యసమితిలో ప్రాతినిధ్యం కలిగించింది. అయితే అలా కొనసాగటం సాధ్యం కాని స్ధితిలో అమెరికా దిగి వచ్చి కమ్యూనిస్టు చైనాను గుర్తించక తప్పలేదు. దాంతో అప్పటి వరకు అమెరికాను అనుసరించిన కెనడా కూడా చైనాతో దౌత్య సంబంధాలు పెట్టుకొంది. 1973లో కెనడా ప్రధాని పిరే చైనా పర్యటన జరిపి మావోతో భేటీ అయ్యారు. ఆ పర్యటన సందర్భంగా నార్మన్‌ బెతూన్‌కు చైనాలో వున్న ఆదరణ, వున్నత స్ధానాన్ని గమనించారు.బెతూన్‌ది కెనడా, మాదీ కెనడా అన్నట్లుగా సంబంధాలను కలుపుకున్నారు.అప్పటి నుంచి కెనడాలో ఎవరు అధికారంలో వున్నప్పటికీ, కమ్యూనిస్టు వ్యతిరేకులైనా చైనాతో సంబంధాల విషయంలో నార్మన్‌ బెతూన్‌ పేరును వుపయోగించుకుంటూనే వున్నారు.

   జపాన్‌ సేనలకు వ్యతిరేకంగా పోరాడేందుకు చైనాకు వెళ్లిన బెతూన్‌ కెనడా విలువలకు ద్రోహం చేశాడని అతడే మాత్రం ఆదర్శం కాదంటూ కెనడా కమ్యూనిస్టు వ్యతిరేకులు విషం చిమ్ముతున్నారు. నాలుగు సంవత్సరాల క్రితం టొరోంటో సన్‌ అనే పత్రిక అధిపతి పీటర్‌ వర్తింగ్టన్‌ ఒక వ్యాఖ్యానం రాస్తూ ‘ మానవత్వానికి సాయం చేసేందుకు బెతూన్‌ చైనా వెళ్లలేదు, అక్కడ మావో కమ్యూనిస్టు పార్టీ సైన్యానికి తోడ్పడేందుకు మాత్రమే వెళ్లారు, సాధారణ రోగులకు బదులు గాయపడిన కమ్యూనిస్టు గెరిల్లాలకు చికిత్స చేసేందుకు మాత్రమే వెళ్లారు అని రాసిన విషయాన్ని ఇప్పుడు వుటంకిస్తూ ఆ విషయాన్ని ప్రధాని జస్టిన్‌ మరిచిపోకూడదని కమ్యూనిస్టు వ్యతిరేక రచయితలు వుద్బోధించారు. మానవ హక్కుల వుల్లంఘనలకు పాల్పడుతున్న చైనాను ప్రధాని ఎలాగూ నిలదీయలేరు, కనీసం బెతూన్‌ను పొగిడుతూ నటించటం అయినా మానుకోవాలని కొందరు వ్యాఖ్యాతలు రాశారు.

కమ్యూనిస్టులు ఎన్నికల్లో పోటీ చేయకపోయినా తప్పేనా ?

    హాంకాంగ్‌ ఎన్నికలలో కమ్యూనిస్టు పార్టీ ఎందుకు పోటీ చేయటం లేదంటూ అక్కడి కమ్యూనిస్టు వ్యతిరేకులు దానినొక సమస్యగా ఓటర్ల ముందుంచేందుకు పూనుకున్నారు. హాంకాంగ్‌ విషయానికి వస్తే దానిదొక ప్రత్యేక పరిస్థితి. బ్రిటీష్‌ వారి కౌలు 99 సంవత్సరాల కౌలు గడువు ముగిసిన తరువాత మాతృదేశం చైనాలో ప్రాంతమది. అంతర్జాతీయ నౌకాశ్రయంగా, పెట్టుబడులు, వాణిజ్య కేంద్రంగా బ్రిటీష్‌ వారి ఏలుబడిలో రూపొందింది. దానిని విలీనం చేసే సందర్భంగా 1997వ సంవత్సరంలో చైనా ఒక ఒప్పందం చేసుకుంది. అదే మంటే చైనాలో అంతర్భాగమైనప్పటికీ యాభై సంవత్సరాల పాటు అక్కడ పెట్టుబడిదారీ వ్యవస్థను కొనసాగించేందుకు అంగీకరించింది. ఒకే దేశం రెండు వ్యవస్థలు అన్న విధానంగా దీనిని వర్ణించారు. ప్రధాన భూభాగంలో సోషలిస్టు వ్యవస్ధ, హాంకాంగ్‌లో పెట్టుబడిదారీ వ్యవస్ధ.దానికి అనుగుణ్యంగానే హాంకాంగ్‌ పాలక మండలి నిర్ణీత గడువులో ఎన్నికలు నిర్వహిస్తూ స్వయం పాలనా మండలికి అప్పగించింది.అయితే హాంకాంగ్‌ను ఎలాగైనా చైనా నుంచి విడదీయాలన్న దుర్బుద్ధితో సామ్రాజ్యవాదులు అనేక రకాలుగా అక్కడి పౌరులను రెచ్చగొడుతున్నారు. చైనా కమ్యూనిస్టు పార్టీతో విబేధించే శక్తులు పాలకులుగా ఎన్నికైనప్పటికీ చైనా ప్రభుత్వం వారికి ఎలాంటి ఆటంకాలు కలిగించటం లేదు. ఆదివారం నాడు ఎన్నికలు జరిగే హాంకాంగ్‌లో 72లక్షల మంది జనాభా వున్నారు. దానికి ఎన్నికయ్యే పాలక మండలితో పాటు చైనా ప్రభుత్వం తరఫున పర్యవేక్షణ మండలి ప్రత్యేకంగా వుంటుంది. హాంకాంగ్‌ తరఫున చైనాలో అధికారిక ప్రతినిధిగా అదే వుంటుంది. రోజువారీ పాలనా వ్యవహారాలలో జోక్యం చేసుకోదు. కమ్యూనిస్టు పార్టీ వ్యతిరేకులు దానిలోని సభ్యులందరూ కమ్యూనిస్టులే అని అయితే బయటికి అలా చెప్పుకోరు అని తప్పుడు ప్రచారం చేస్తారు. ఒప్పందానికి అనుగుణంగా హాంకాంగ్‌లోని సంస్ధలకు విశ్వాసం కలిగించేందుకు కమ్యూనిస్టు పార్టీ ఎన్నికలలో పోటీ చేయటం లేదు.

కాస్ట్రోతో చేయి కలుపుతారు, ఆయన బొమ్మపై రాద్ధాంతం చేస్తారు

    అమెరికా పాలకులు క్యూబాను నాశనం చేయాలని, దాని అధినేత ఫిడెల్‌ కాస్ట్రోను అంతం చేయాలని ఎన్నో యత్నాలు చేసి సాధ్యంగాక చివరికి దిగి వచ్చి దౌత్య సంబంధాలు పెట్టుకున్న విషయం తెలిసిందే.అయితే మరోవైపు కాస్ట్రో బొమ్మతో వున్న టీ షర్టులను ధరించిన వారిపై మాత్రం రాద్ధాంతం చేసి ఆగ్రహం వ్యక్తం చేస్తారు. తాజాగా ఫుట్‌బాల్‌ ఆటగాడు కోలిన్‌ కయోపెర్నిక్‌ తెలిపిన నిరసన తీరుతెన్నులపై పెద్ద రగడ చేస్తున్నారు. నల్లజాతీయులపై జరుగుతున్న దాడులు, వివక్షకు నిరసనగా ఒక ఫుట్‌బాల్‌ పోటీ సందర్భంగా జాతీయ గీతం ఆలపిస్తున్నపుడు లేచి నిలబడలేదు.దానిపై నెల రోజుల తరువాత చెలరేగిన వివాదం గురించి మాట్లాడేందుకు గత వారంలో విలేకర్లతో మాట్లాడాడు.ఆ సందర్భంగా ఫిడెల్‌ కాస్ట్రో, అమెరికాలో నల్లజాతీయుల హక్కుల కోసం పోరాడిన ప్రముఖులతో కూడి వున్న టీ షర్టును వేసుకన్నాడు. దానిపై ‘భావ సారూప్యం వున్నవారు ఒకే విధంగా ఆలోచిస్తారు ‘ అనే నినాదం రాసి వుంది.”Like Minds Think Alike.”)నల్ల, రంగు జాతీయులను అణచివేస్తున్నందుకు నిరసనగా తాను జాతీయ గీతాలాపన సందర్భంగా నిలబడకుండా నిరసన తెలిపానని స్పష్టం చేశాడు. తనకు ఫుట్‌ బాల్‌ కంటే నిరసన ముఖ్యమని వేరే విధంగా ఆలోచిస్తే స్వార్ధం అవుతుందని అన్నాడు. విలేకర్ల సమావేశం సందర్భంగా వేసుకున్న టీషర్టుపై ఫిడెల్‌ కాస్ట్రో బొమ్మ వుందంటే కయో పెర్నిక్‌ ఒక కమ్యూనిస్టు నియంతను సమర్ధించినట్లేనని ఒక పత్రికలో రాశారు. క్యూబా నుంచి ప్రవాసం వచ్చిన క్యూబన్‌-అమెరికన్లు కయో పెర్నిక్‌పై మండి పడుతున్నారుె. ఎందుకలా చేశాడంటూ మీడియాలో నిరసన ఒక పెద్ద చర్చనీయాంశమైంది. కయో పెర్నిక్‌ తల్లి పేద కుటుంబానికి చెందిన శ్వేత జాతి యువతి కాగా తండ్రి నల్లజాతీయుడైన ఆఫ్రో-అమెరికన్‌.

   అమెరికా జాతీయ గీతం జాతి వివక్షా పూరితమైనదనే విమర్శ ఎప్పటి నుంచో వుంది. దానిని రాసింది ఒక బానిస యజమాని. నల్లజాతి వారిని బానిసలుగా చేసి అమెరికా ఖండంలో వ్యాపారం చేసిన విషయం తెలిసినదే. ఆ గీతంపై గతంలో ఎందరో నిరసన తెలిపారు. అనేక మంది నల్లజాతి క్రీడాకారులు ఆ గీతాలాపన సందర్భంగా మాట్లాడుతూ వుండటమో, కాలో చేయో కదిలించటం, టోపీ తీయటం,పెట్టుకోవటం వంటి రూపాలలో నిరసన తెలపటం జరుగుతున్నది. తాను అమెరికా వ్యతిరేకిని కాదని, అమెరికా మరింత మెరుగ్గా తయారు కావటానికే ఈ నిరసన తెలిపినట్లు కయో పెర్నిక్‌ చెప్పాడు.తొలుత కూర్చుని నిరసన తెలిపిన అతను ఇప్పుడు మోకాళ్ల మీద నిలబడుతున్నాడు.1972లో జాకీ రాబిన్సన్‌ అనే బేస్‌బాల్‌ ఆటగాడు నిరసన తెలిపుతూ ‘నేను నిలబడను, జాతీయ గీతం పాడను, పతాకానికి వందనం చేయను, శ్వేతజాతి లోకంలో నేనొక నల్లజాతీయుడనని నాకు తెలుసు ‘ అని వ్యాఖ్యానించాడు.అంతకు ముందు ఇద్దరు నల్లజాతి ఒలింపిక్‌ రన్నర్లు జాతీయ గీతాలాపన సందర్భంగా నల్లజాతీయుల శక్తి చిహ్నంగా బిగించిన పిడికిలి చూపి నిరసన తెలిపారు.

చే గువేరాపై నోరు పారవేసుకున్న టర్కిష్‌ స్పీకర్‌

    ప్రముఖ విప్లవ కారుడు చే గువేరా ఒక హంతకుడు కనుక అతనినెవరూ అభిమానించకూడదని వ్యాఖ్యానించిన టర్కీ పార్లమెంట్‌ స్పీకర్‌ ఇస్మాయిల్‌ కర్మాన్‌ చర్యను ప్రపంచంలో అనేక మంది ఖండించారు.తమ ఆరాధ్యనేత అయిన చేగువేరాను అవమానించినందుకు క్షమాపణ చెప్పాలని క్యూబా డిమాండ్‌ చేసింది. ఒక యువజన బృందాన్ని వుద్ధేశించి ఆయన మాట్లాడుతుండగా వారిలో కొందరు చేగువేరా బొమ్మలున్న టీ షర్టులు ధరించి కనిపించటంతో స్పీకర్‌కు పట్టరాని ఆగ్రహం వచ్చింది. అతనొక గెరిల్లా, బందిపోటు ,39 సంవత్సరాల వయస్సులోనే వురి తీసి చంపాడు, అతను అదర్శం కాకూడదు అని మాట్లాడాడు. క్యూబా నిరసన తెలపటంతో టర్కీ ప్రభుత్వం సర్ది చెప్పేందుకు ప్రయత్నించింది. తమ స్పీకర్‌ మార్క్సిస్టు వ్యతిరేకి కాదని, ఒక జాతీయ వాదిగా తమ దేశంలో వున్న వేలాది మందిని ఆదర్శంగా తీసుకోవాలి తప్ప క్యూబా సోషలిస్టు విప్లవంలో భాగస్వామి అయిన వారిని కాదని చెప్పేందుకు ప్రయత్నించారని వివరణ ఇచ్చింది. స్పీకర్‌ వ్యాఖ్యలు చేగువేరా చరిత్రను వక్రీకరించాయని క్షమాపణ చెప్పాల్సిందేనని టర్కీలో క్యూబా రాయబారి డిమాండ్‌ చేశారు. టర్కీలోని వామపక్ష పార్టీల కార్యకర్తలు చే గువేరా టీషర్టులు ధరించి దేశమంతటా స్పీకర్‌ వ్యాఖ్యలకు నిరసన తెలుపుతూ ప్రదర్శనలు చేశారు. పార్లమెంట్‌ ఎదుట చేసిన ప్రదర్శనను పోలీసులు అడ్డుకున్నారు. టర్కీ పాలకపార్టీ ఏకెపి కమ్యూనిస్టు వ్యతిరేక, మతవాద పార్టీ అన్న విషయం తెలిసిందే. క్యూబాలో ఒక మసీదు నిర్మాణానికి అనుమతి ఇవ్వాలన్న టర్కీ అధ్యక్షుడు రిసెప్‌ తయ్యిప్‌ ఎర్డోగన్‌ అభ్యర్ధనను క్యూబా సర్కార్‌ గతంలో అంగీకరించలేదు. అమెరికాను 1492లో కొలంబస్‌ కనుగొనక ముందే ముస్లింలు కనుగొన్నారని ఎర్డోగన్‌ వాదిస్తారు. కొలంబస్‌ డైరీలలో ఒక కొండ పక్కన గుమ్మటాలతో కూడిన ఒక భవనం గురించి వర్ణణ వుందని అది అక్కడి మసీదు గురించే అని టర్కీలోని కొందరు చెబుతారు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

జై నీల్‌- జై లాల్‌ నినాదం అర్థం ఏమిటి ?

12 Thursday May 2016

Posted by raomk in AP NEWS, Current Affairs, INDIA, Left politics, NATIONAL NEWS, Others, Social Inclusion

≈ 1 Comment

Tags

Ambedkarists, Buddha, caste discrimination, caste system, communist manifesto, Communists, jai lal, jai neel, jyothiba phule, karal marx, sc, scheduled castes, st's

ఎం కోటేశ్వరరావు

   సామాజిక మాధ్యమం అయిన ఫేస్‌బుక్‌, వివిధ గ్రూపులలో సభ్యులు ఒక సమాజం అనుకుంటే దానిలోని మంచి చెడులన్నీ ప్రతిబింబిస్తున్నాయి.బుర్ర తక్కువ పోస్టులు పెట్టే వారి గురించి వదలి వేద్దాం. కొంత మంది సమాజంలో వున్న యథాతథ స్థితిని, వాస్తవాలను ప్రస్తావిస్తున్నారు. తమ అనుభవంలోకి వచ్చిన వాటిని ఆవేదనో, కసి, బాధ, మార్పు రావాలనో ఏదో ఒక భావంతో పెడుతున్నారు. మంచిదే. దేన్నీ దాచుకోవాల్సిన అవసరం లేదు. కారల్‌ మార్క్సు ఒక సందర్భంలో ఇలా చెప్పారు. ‘ హేతువు ఎప్పుడూ వునికిలోనే వుంది, కానీ ఎల్లవేళలా యుక్తమైన రీతిలో లేదు( Reason has always existed, but not always in a reasonable form ) బాధితులు చెప్పే దానిలో ఎప్పుడూ హేతువు వుంటుంది, అయితే అది ఎల్లవేళలా సరైన రీతిలో వ్యక్తం కావటం లేదని చర్చలను జాగ్రత్తగా పరిశీలిస్తే అర్ధం అవుతుంది. ఇది కొందరిని వుద్ధేశించి ప్రతికూలంగా వ్యాఖ్యానిస్తున్నది కాదు, సవరించుకోవాల్సిన అవసరం గురించి సూచించేందుకు మాత్రమే. పెద్దదిగా వున్నప్పటికీ చదవండి, చర్చించండి. సూక్ష్మంలో మోక్షాలు, దగ్గరి దారులు, గోసాయి చిట్కాలు మౌలిక సమస్యలను పరిష్కరించలేవన్నది ఏడుపదుల స్వాతంత్య్ర అనుభవం చెబుతోంది. వాటి గురించి పైపైన కాకుండా లోతుగా చర్చిస్తేనే ప్రయోజనం. కావాల్సింది పాలపొంగు కాదు, మరగటం, మధించటం.

  చరిత్రలో కార్మికులు ఒక దశలో యంత్ర విధ్వంసకులుగా వ్యవహరించినట్లు మనం చదువుకున్నాం. దేశాలను ఆక్రమించుకొనే క్రమంలో ఐరోపాలో నెపోలియన్‌ యుద్ధాలతో సహా అనేక యుద్ధాలు జరిగాయి. పర్యవసానంగా అనేక దేశాలలో ఆర్ధిక పరిస్థితులు దిగజారాయి. అదే సమయంలో పారిశ్రామిక విప్లవంలో భాగంగా పారిశ్రామికవేత్తలు తమ లాభాలను కాపాడుకొనేందుకు నూతన యంత్రాలను ప్రవేశపెట్టారు. వాటిలో బ్రిటన్‌ పవర్‌లూమ్స్‌ పెద్ద మార్పునే తెచ్చాయి. అప్పటి వరకు అక్కడి సాంప్రదాయ నేత కార్మికుల జీవితాలు వీటితో అతలాకుతలమయ్యాయి. యుద్ధాలతో మొత్తంగా కార్మికుల బతుకులూ ఛిద్రమయ్యాయి.ఇటు సంప్రదాయ నేత పని కరువై, అటు ఫ్యాక్టరీలలో సరైన పనిలేక మొత్తం మీద ఏం చేయాలో తెలియని స్థితిలో తమకు కష్టాలు రావటానికి పవర్‌లూమ్స్‌ కారణమని భావించి వాటిని నాశనం చేస్తే పరిష్కారం దొరుకుతుందని భావించి అదే పని చేశారు. వారి ఆవేదనలో హేతువు లేదా వుంది, కానీ యంత్రాల ధ్వంసం పరిష్కారం కాదు. దీంతో 1788లోనే బ్రిటీష్‌ పార్లమెంట్‌ పవర్‌లూమ్స్‌ తదితర యంత్రాల పరిరక్షణకు ఒక చట్టాన్ని తీసుకు వచ్చింది. దాని ప్రకారం ఎవరైనా వాటిని కావాలని ధ్వంసం చేసినట్లు లేదా ధ్వంసం చేసేందుకు అక్రమంగా ప్రాంగణాలలో ప్రవేశించినా, ప్రోత్సహించినా ఏడు నుంచి 14 సంవత్సరాల పాటు ఖైదీల సెటిల్మెంట్లకు ప్రవాసం పంపేవారు. తరువాత యంత్రాలు పనిచేయకుండా కొన్ని భాగాలు లేకుండా చేస్తున్నట్లు గ్రహించి దానిని కూడా శిక్షార్హమైన నేరంగా పరిగణించారు. దాని పర్యవసానమే ఇప్పటికీ కార్మికులు డ్యూటీ దిగి వెళుతుంటే భద్రతా సిబ్బంది తనిఖీ చేయటం. ఆ తరువాత 1788 చట్టాన్ని రద్దు చేసి మరణశిక్షను కూడా చేర్చి 1823లో మరో చట్టం చేశారు. ఈ యంత్ర విధ్వంస కార్మిక తిరుగుబాటును బ్రిటీష్‌ పాలకులు ఎంత తీవ్రంగా అణచివేశారో తెలుసా ? నెపోలియన్‌తో జరిపిన యుద్ధాలలో ఒకటైన లెబెరియన్‌ ద్వీపకల్పాన్ని నిలబెట్టుకొనేందుకు నియోగించిన సైన్యం కంటే ఎక్కువ మందిని దించారు.

  ఆధునిక చరిత్రలో వుగ్రవాద దారి పట్టిన నక్సల్స్‌ ఏ గ్రూపు అన్నది అప్రస్తుతం, అటవీ ప్రాంతాలలో రోడ్లు వేస్తుంటే కాంట్రాక్టర్ల, లేదా ప్రభుత్వ యంత్రాలను విధ్వంసం చేయటం, రోడ్లను, స్కూలు భవనాలను కట్టకుండా చేశారని మీడియాలో అనేక వార్తలను చదివాము. అన్నింటి కంటే ఆధునిక రూపంలో సంఘటిత కార్మికవర్గం కొన్ని సంవత్సరాల క్రిందట కంప్యూటర్ల వినియోగాన్ని అడ్డుకున్నపుడు వారి మీద కూడా అదే విమర్శ వచ్చింది. ఇదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే కుల వివక్ష రాక్షసికి బలౌతున్న వారు దానికి వ్యతిరేకంగా జరుపుతున్న పోరాటం ఎలా కొనసాగించాలన్నదే సమస్య. దీనిపై తీవ్రమైన పోరాటాన్ని కొనసాగించాలనటంలో ఎలాంటి రాజీ లేదు. ఎలా సాగించాలన్నదే చర్చ. ఈ మధ్య జైనీల్‌-జైలాల్‌ అనే నినాదం వినిపిస్తోంది. ఇదొక శుభపరిణామం.

     కార్మికవర్గం సమాజంలో 99 శాతం మెజారిటీ. మన దేశానికి వస్తే దళితులా, గిరిజనులా, ముస్లింలా, హిందువులా, మరో మతం వారా, బ్రాహ్మలా, కమ్మా, రెడ్డి, కాపు, కుమ్మరి, కమ్మరి ఇలా అన్ని రకాల కులాల వారు కార్మికులలో వున్నారు, ఒక శాతంగా వుండే దోపిడీ వర్గంలోనూ వీరందరూ వున్నారు. వర్గరీత్యా ఏ వర్గంలో వుంటే వారు తమ ఆర్ధిక సమస్యల మీద ఐక్యం అవుతున్నారు, కార్మికులతో పోల్చితే పెట్టుబడిదారులలో అది ఎక్కువగా వుంది. నిజానికి కార్మికులకు సమాజంలోని పేద రైతులు, వ్యవసాయ కార్మికులు, చిన్న వ్యాపారుల వంటి ఇతర తరగతుల మద్దతు అవసరమే.వీరికీ వారి మద్దతు అవసరమే.

       మన దేశంలో కొంత మంది దృష్టిలో వర్గం కంటే కుల సమస్య పెద్దది. దానితో మరికొంత మంది ఏకీభవించ వచ్చు, విబేధించవచ్చు. అంత మాత్రాన అది పరిష్కరించాల్సింది కాదు అని అర్ధం కాదు. ఏ సమస్య పరిష్కారానికి అయినా అందుకు కలసి వచ్చే స్నేహితులను ఎంచుకోవాలి. వర్గ సమస్యలో పెట్టుబడిదారుడు- కార్మికులు ముఖాముఖీ తేల్చుకుంటారు. సమస్య ఎక్కడంటే కుల వివక్ష, కులాంతర, మతాంతర వివాహాల వంటి సామాజిక అంశాల దగ్గర వస్తోంది. పెట్టుబడి దారీ విధాన వయస్సు ఐదు వందల సంవత్సరాలు అనుకుంటే ఏ రీత్యా చూసినా రెండు వేల సంవత్సరాలకు పైబడే వుంది. ఇది గిజిగాడి గూడు కంటే సంక్లిష్టమైనది. ఇక్కడ కూడా మార్క్సు మహనీయుడు చెప్పినది, అంబేద్కర్‌ చెప్పిన అంశాలు ఎన్నో వున్నాయి. ‘ తత్వవేత్తలు వివిధ పద్దతులలో ప్రపంచానికి భాష్యం మాత్రమే చెప్పారు, సమస్య ఏమంటే దానిని మార్చటం ఎలాగన్నదే’ దీనిని మనం మన దేశంలో దళిత సమస్యకు ఎందుకు వర్తింప చేసుకోకూడదు. వర్తమానంలో జ్యోతిబాపూలే, అంబేద్కర్‌ మాదిరి కాకపోయినప్పటికీ అనేక మంది ప్రముఖులు మనువాదాన్ని వ్యతిరేకించారు. పూలే,అంబేద్కర్‌ తాము నమ్మినపద్దతులలో పరిష్కారాన్ని చెప్పారు. వారితో ఎవరూ విబేధించనవసరం లేదు. కమ్యూనిస్టు మానిఫెస్టో వెలువడిన 1848లోనే జ్యోతిబాపూలే జీవితాన్ని మలుపు తిప్పిన సంఘటన జరగటం, వెంటనే ఆయన తన సంస్కరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తరువాత అంబేద్కర్‌ కొనసాగించారు. అంటే మన దేశంలో ఒక విధంగా చెప్పాలంటే కుల వివక్ష వ్యతిరేక పోరాట బీజం కమ్యూనిజానికంటే ముందే పడింది. వేదాలను విమర్శిస్తూ పూలే కుల వివక్ష సమస్యను జనం ముందు పెట్టారు. దళిత్‌ అనే మరాఠీ పదాన్ని ఆయనే ముందు వుపయోగించారని చెబుతున్న విషయం తెలిసిందే.

    ‘విద్య లేకపోవటం తెలివి తేటల లేమికి దారి తీస్తుంది, అది నైతిక విలువల లేమికి కారణం అవుతుంది, నైతిక విలువలు లేకపోతే ప్రగతి వుండదు, ప్రగతి లేకపోతే జనం దగ్గర డబ్బు వుండదు, డబ్బలేకపోతే దిగువ కులాలపై అణచివేతకు దారితీస్తుంది, చూడండి విద్యలేకపోవటం ఎన్ని అనర్ధాలకు కారణం అవుతుందో ‘ అన్న పూలే అందుకుగాను విద్యాసంస్ధలను స్థాపించటానికి ప్రాధాన్యత ఇచ్చారు. తరువాత అంబేద్కర్‌ కూడా పూలే బాటలోనే విద్యతో దళితుల అభ్యున్నతి సాధించవచ్చని భావించి ఆమేరకు ‘బహిష్కృత్‌ హితకారిణీ సభ ‘ సంస్ధను స్ధాపించారు.అయితే వెంటనే తన పంధా మార్చుకొని అస్పృస్యతకు వ్యతిరేకంగా పోరుబాట పట్టారు. సమీకరించు, పోరాడు, సాధించు అన్నది అంబేద్కర్‌ నినాద సారాంశం. ఇదంతా భారత్‌లో కమ్యూనిస్టు పార్టీ పూర్తిగా వేళ్లూనుకోక ముందే ప్రారంభమైంది.

    మన దేశంలో కుల వివక్ష, కుల నిర్మూలన సంస్కరణలు, పోరాటానికి పూలేతో అంటే 1848లో నాంది పలికారంటే ఇప్పటికి 168 సంవత్సరాలు, మధ్యలో అంబేద్కర్‌ కలిసి 90 సంవత్సరాలు . ఈ మొత్తం కాలంలో దళిత వుద్యమం సాధించిన విజయాలేమిటి? వైఫల్యాలేమిటి అన్నది బేరీజు వేసుకోవాల్సిన అవసరం లేదా? విజయాలను మరింత పటిష్ట పరుచుకోవటం, వైఫల్యాలను అధిగమించటానికి కొత్తదారులు వెతకాల్సిన అవసరం లేదా ? మన దేశంలో కమ్యూనిస్టు వుద్యమం 1920లో ప్రారంభమైంది. పురాణాల ప్రకారం పుట్టుతోనే శ్రీకృష్ణుడు చెరసాల పాలై తరువాత అజ్ఞాతంలో పెరిగినట్లుగా భారత కమ్యూనిస్టుపార్టీ కూడా నిర్బంధాలు, నాయకుల అరెస్టులు,జైలు జీవితంతోనే ప్రారంభమైంది. పుట్టిన పదిహేను సంవత్సరాల తరువాతే బహిరంగంగా పనిచేయటం సాధ్యమైంది. తరువాత మరోసారి నిర్బంధం, నిషేధం. అంటే దాని వయస్సు కూడా తొమ్మిది పదులు. మ్యూనిస్టులు కూడా పూలే-అంబేద్కరిస్టుల మాదిరి తమ విజయాలు,పరాజయాలను సింహావలోకనం చేసుకొని జనసామాన్యాన్ని ఆకర్షించటంలో ఎదురౌతున్న సమస్య లేమిటో అందుకు అనుసరించాల్సిన మార్గాలేమిటో రూపొందించుకోవాల్సి వుంది. రెండు వుద్యమాలు ఒకదానితో ఒకటి విబేధించే అంశాలు వున్నాయి,అంగీకరించేవి వున్నాయి. ఏవి ఎక్కువ ఏవి తక్కువ అన్న వాటిని చర్చించుకోవచ్చు. అనుమానాలను నివృత్తి చేసుకోవచ్చు. అది ఎప్పుడు సాధ్య పడుతుందంటే అంగీకృత అంశాలపై కలసి పనిచేసినపుడే.రెండు వుద్యమాల మధ్య వున్నవి మిత్ర వైరుధ్యాలే తప్ప శతృపూరితమైనవి కాదు.ఒక వేళ ఎవరైనా అలా చిత్రించేందుకు ప్రయత్నిస్తే తెలుసుకోలేనంత అమాయకంగా జనం లేరు. అంబేద్కరిస్టులు చెబుతున్న దళిత సమస్యల పరిష్కారానికి కమ్యూనిస్టులు వ్యతిరేకం కాదు, లేదా కమ్యూనిస్టులు చెబుతున్న ఆర్ధిక దోపిడీ అంతం కావాలనటాన్ని పూలే-అంబేద్కరిస్టులు వ్యతిరేకించటం లేదు. అయితే సమస్య ఎక్కడ. కమ్యూనిస్టులలో విలీనం కమ్మని పూలే-అంబేద్కరిస్టులను గానీ లేదా తమ రాజకీయ వేదికను రద్దుచేసుకొని సామాజిక వుద్యమాలలో విలీనం కమ్మని కమ్యూనిస్టులను గానీ ఎవరూ కోరటం లేదు. కమ్యూనిస్టు, వామపక్ష శక్తుల మధ్య సైద్ధాంతిక విబేధాలు వున్నాయి కనుకనే ఆ పార్టీలు విడివిడిగా వుంటూ ఐక్యంగా పోరాడుతున్నాయి.కలసి వచ్చిన చోట లౌకిక శక్తులను తోడు చేసుకుంటున్నాయి.దీనికి కూడా దాన్నే ఎందుకు వర్తింప చేయకూడదు. మనకు స్వాతంత్య్ర వుద్యమం అనేక పాఠాలు నేర్పింది. కాంగ్రెస్‌ సంస్థలోనే ఎన్ని భావజాలాలు వున్నవారు కలసి పని చేయలేదు. వారిలో ఎన్ని విబేధాలు లేవు? అయినా వారిని కలిపి వుంచింది తెల్లవాడిని దేశం నుంచి తరిమివేయాలి అన్న ఏకైక లక్ష్యం ఒక్కటే.

   ముందుగా పరిష్కారం కావాల్సింది దళిత సమస్య అన్నది మొత్తంగా ఇప్పటి వరకు పూలే-అంబేద్కరిస్టులు ముందుకు తెచ్చిన వైరుధ్యం. అర్ధిక దోపిడీ అంతమైతే సామాజిక సమస్యలు పరిష్కారం కావటం సులభం కనుక దానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నది కమ్యూనిస్టుల వైఖరిగా వుంది. ఇవి ఇలా వుంటే ఇప్పుడు ఈ రెండు శక్తులను దెబ్బతీసి అటు ఆర్ధిక దోపిడీని పెంచే నయా వుదారవాదాన్ని కాంగ్రెస్‌ ప్రారంభిస్తే దానిని మరింత వేగంగా ముందుకు తీసుకుపోయేందుకు బిజెపి, దానితో చేతులు కలిపిన శక్తులు చూస్తున్నాయి. దీనికి తోడు సామాజిక వివక్షను పెంచి పోషించే మనువాదాన్ని మరింత పటిష్ట పరిచేందుకు కూడా మత శక్తులు మరింత వూపుతో పనిచేస్తున్నాయి. కుల శక్తులు దానికి అనుబంధంగా వుంటాయని వేరే చెప్పనవసరం లేదు. అందువలన నయావుదారవాదం, మతోన్మాదం అనే జంట ప్రమాదాలను ఎదుర్కోవటం ఎలా అన్నది సమస్య.

     నయా వుదారవాదం ఇంకా వేగంగా, విస్తృతంగా అమలులోకి వస్తే అమలులో వున్న విద్యా, వుద్యోగ రిజర్వేషన్లు మరింతగా తగ్గిపోతాయి. ఇప్పటికే సామాజిక రంగంలో ఎవరు ఎలా వుండాలో, వుండకూడదో నిర్ణయించేందుకు మతశక్తులు ఎలా ముందుకు వస్తున్నాయో మనం చూస్తున్నాం. ఈ జంట ముప్పును తప్పించకుండా ఈ వుద్యమాలు ముందుకు సాగవు. ఇటీవలి కాలంలో కమ్యూనిస్టు పార్టీల వైఖరిలో ముఖ్యంగా సిపిఎం వైఖరిలో వచ్చిన మార్పును గత పది హేను సంవత్సరాలుగా వుమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ, ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలోనూ చూస్తున్నారు. కులవివక్ష వ్యతిరేక పోరాటానికి ప్రాధాన్యత ఇస్తూ పని చేస్తున్నారు. ఇప్పుడు అఖిలభారత స్థాయిలో కూడా అలాంటి సంస్ధ ఏర్పడి రాష్ట్రాల వుద్యమాలను మరింత ముందుకు తీసుకుపోతున్నది. ఇంకా అనేక సంస్ధలు కమ్యూనిస్టులతో సంబంధం లేకుండానే అలాంటి కృషే చేస్తున్నాయి.అయితే అన్ని వుద్యమాలు,వుద్యమ రూపాలు ఒకే విధంగా వుండటం లేదు. అందుకే ముందే చెప్పినట్లు సామాజిక వుద్యమ సంస్ధలైనా, రాజకీయ పార్టీలైనా అంగీకృత అంశాల మేరకు కలసి పనిచేయాలి. ఈ విషయంలో ఇటీవలి కాలంలో అంబేద్కరిస్టుల వైఖరిలో కూడా మార్పును గమనిస్తున్నాం, రిజర్వేషన్లు అమలు జరగాలంటే అసలు ప్రభుత్వ వుద్యోగాలు, ప్రభుత్వ రంగంలో పరిశమ్రలు వుండాలి. వుద్యోగాలను క్రమంగా రద్దు చేస్తున్నారు, పరిశ్రమలను మూసివేస్తున్నారు, లేదా పొరుగు సేవల పేరుతో పర్మనెంటు వుద్యోగాలను రద్దు చేస్తున్నారు. వీటిని రక్షించుకోవటంతో పాటు ప్రయివేటు రంగంలో రిజర్వేషన్ల సాధన కోసం ప్రారంభమైన వుద్యమంలో కూడా వారు భాగస్వాములు కావటం ప్రారంభమైంది.

   ఇక్కడ ఒక విషయంపై స్పష్టత కలిగి వుండటం అవసరం. మహిళల సమస్యలు మహిళలకే తెలుస్తాయి, బీసిల సమస్యలు వారికే తెలుస్తాయి, ఎస్సీ,ఎస్టీల సమస్యలు వారికే తెలుస్తాయి. ఈ అభిప్రాయాలతో ఎవరూ విబేధించాల్సిన అవసరం లేదు. వాస్తవం వుంది. పేచీ ఎక్కడ వస్తుందంటే ఈ తరగతులకు చెందని వారికి ఆ సమస్యలు తెలియవు, అందువలన వారు మాట్లాడకూడదు, వుద్యమాలకు సారధ్యం వహించకూడదు అన్న పెడ ధోరణులకు గురైన స్థితి వుంది. దీనికి గురైన వారు రెండు రకాలు. ఇది నయా వుదారవాద భావజాలం ముందుకు తెచ్చిన విభజించి పాలించు అన్న పాత ఎత్తుగడలకు కొత్తరూపం. తమకు తెలియకుండానే ఇది నిజమే కదా అనుకున్నవారు కొందరు. వీరితో పేచీ లేదు. మంచి చెడులను వివరిస్తే అర్ధం చేసుకుంటారు. రెండో రకం వారు వున్నారు. అన్నీ తెలిసి కూడా ఈ వాదాన్ని ముందుకు తెచ్చేవారు. వీరు కలిగించే హాని అంతా ఇంతా కాదు. అగ్రవర్ణాలుగా పిలవబడుతున్న కులాలలో పుట్టిన వారు మాట్లాడ కూడదు అంటే రాజ కుటుంబంలో పుట్టిన బుద్దుడు ఎవరు? ఆయన కులతత్వాన్ని వ్యతిరేకించిన వారిలో ఆద్యుడిగా పరిగణించబడుతున్నారా లేదా ? అందువలన ఎవరు ఏ కులంలో పుట్టారు లేదా పేదవాడా, ధనికుడా అని కాదు, ఏం చెబుతున్నారు అన్నది ముఖ్యం. ఒక అగ్రకులంలో పుట్టిన వ్యక్తి కుల తత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అంటే అగ్రకులతత్వం వున్న వారి నుంచి దూరమైనట్లే. ఒక కులంలో పుట్టటం అనేది ఒక యాదృచ్చిక ఘటన మాత్రమే.

    మతశక్తులు తమ అజెండాను అమలు జరిపే క్రమంలో తమకు తెలియకుండానే హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయం, జెఎన్‌యు విశ్వవిద్యాలయాలలో వ్యవరించిన తీరుతో కమ్యూనిస్టులు, వామపక్షాలు,అంబేద్కరిస్టులు, సామాజిక న్యాయం కోరుకొనే ఇతర అనేక శక్తులను దగ్గరకు తెచ్చాయి. దాని నుంచి వచ్చిందే జైనీల్‌ -జై లాల్‌ నినాదం.ఎవరి ఎజండాలు వారు కలిగి వుండండి, ఎవరి జండాలను వారు మోసుకోండి. సమస్యలపై కలసి పనిచేయండి, జనానికి మేలు చేయండి.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

విశ్వవిద్యాలయాల సిలబస్‌లో మూడో స్ధానంలో కమ్యూనిస్టు మానిఫెస్టో

29 Friday Jan 2016

Posted by raomk in Current Affairs, INTERNATIONAL NEWS, Left politics, USA

≈ Leave a comment

Tags

communist manifesto, Karl Marx and Friedrich Engels, Open Syllabus Project., US Left

ఎంకెఆర్‌

అదేమి చిత్రమో గానీ అమెరికాలో కమ్యూనిస్టు వ్యతిరేకులు ఎంత గట్టిగా కళ్లు మూసుకున్నా కారల్‌ మార్క్స్‌-ఫెడరిక్‌ ఎంగెల్స్‌లు పదేపదే దర్శనమిస్తున్నారు. వద్దనుకున్నవారు ఇలా కనపడటమేమిటని వారికి మనోవ్యాధి పట్టుకుంది. ఓపెన్‌ సిలబస్‌ ప్రాజెక్టు అనే సంస్ధ ఈ వారంలో ఒక నివేదిక విడుదల చేసింది. విశ్వవిద్యాలయాల వెబ్‌సైట్లలో ప్రచురించిన పదిలక్షలకు పైగా సిలబస్‌ పుస్తకాల జాబితాలో ఏది ఎక్కువగా వుందని విశ్లేషిస్తే కారల్‌ మార్క్స్‌-ఫెడరిక్‌ ఎంగెల్స్‌లు ప్రపంచం ముందుంచిన ‘కమ్యూనిస్టు మానిఫెస్టో’ పుస్తకం మూడవ స్ధానంలో వుందని తేలింది.’విఫలమైన సిద్ధాంతం విశ్వవిద్యాలయాల సిలబస్‌లో ఇప్పటికీ బహుళంగా వుంది’ అనే శీర్షికతో కెయిరెన్‌ అండర్‌ వుడ్‌ అనే కమ్యూనిస్టు వ్యతిరేకి కడుపు మంటతో ఒక వ్యాసం రాశాడు.

ప్లాటో రచన ‘రిపబ్లిక్‌ ‘ రెండవ స్ధానంలో ఇబి వైట్‌ మరియు విలియం స్ట్రంక్‌ జూనియర్‌ వుమ్మడి రచన ‘ఎలిమెంట్స్‌ ఆఫ్‌ స్టైల్‌ ‘ ప్రధమ స్ధానంలో వుంది. కమ్యూనిస్టు మానిఫెస్టోకు ఇంత ఆదరణ ఎందుకు వుందంటే దానిలో చరిత్ర, రాజకీయాలు, సామాజిక శాస్త్రాలతో సహా అనేక అంశాలున్నాయి గనుక విశ్వవిద్యాలయ అధ్యాపకులు దానిని తరచూ సిలబస్‌లో పెడుతున్నారు. పెట్టుబడిదారీ విధానానికి మౌలిక పాఠాలు చెప్పే ఆర్ధికాంశాలతో కూడిన ఆడమ్‌ స్మిత్‌ రచన ‘ వెల్త్‌ ఆఫ్‌ నేషన్స్‌ ‘ 37 వ స్ధానంలో వుందట. ప్రచ్చన్న యుద్ధంలో తామే విజయం సాధించామని పాతికేళ్ల క్రితం పెట్టుబడిదారులు ప్రకటించుకున్న తరువాత కూడా వారి వ్యవస్ధను కూల్చివేయాలని పిలుపు నిచ్చిన కమ్యూనిస్టు మానిఫెస్టో ప్రాధాన్యత ప్రపంచంలో తగ్గలేదన్నది సుస్పష్టం. అమెరికా రాజ్యంగానికి ఆమోద ముద్ర వేయించేందుకు ఫెడరలిస్టు అనే పత్రికలో 1787 ఆక్టోబరు 1788 ఆగస్టు మధ్య రాసిన అనేక వ్యాసాలను తరువాత ఫెడరలిస్టు పేపర్స్‌గా పిలిచారు. ఆ పుస్తకం విశ్వవిద్యాలయాల సిలబస్‌ పుస్తకాల జాబితాలో 294వ స్ధానంలో వున్నట్లు తేలింది.

తనను సోషలిస్టుగా అభివర్ణించుకొని ఈ ఏడాది జరగనున్న అధ్యక్ష ఎన్నికలలో డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్ధిగా తనను బలపరచమని కోరుతూ ప్రచారం జరుపుతున్న బెర్నీ శాండర్స్‌ తన ప్రత్యర్ధి హిల్లరీ క్లింటన్‌కు చెమటలు పట్టిస్తున్నాడు.ఆయన అసలు సోషలిస్టు కాదు, నకిలీ అని మన దేశంలో నగ్జల్స్‌ వంటి గ్రూపులు అమెరికాలో వ్యతిరేకిస్తున్నాయి. అనేక మంది వామపక్ష వాదులు ఆయనను బలపరుస్తున్నారు. శత్రువులు ఆయన కరడు గట్టిన కమ్యూనిస్టు అని ముద్రవేసి మరీ ప్రచారం చేస్తున్నారు. యువతరం ఆయనకు జేజేలు పలుకుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అసలు శాండర్స్‌ ఏమిటి అనే విషయం పక్కన పెడితే ఆయన నిజమైనా, నకిలీ అయినా సోషలిస్టు పేరుతో మద్దతు పెంచుకుంటే ఒకసారి వామపక్ష భావజాలం తలకెక్కితే యువతరంలో దిగటం అందునా సోషలిజం,కమ్యూనిజానికి మారుపేరుగా వున్న సోవియట్‌ యూనియన్‌, తూర్పుఐరోపా దేశాల సోషలిస్టు వ్యవస్ధలు కూలిపోయిన పాతిక సంవత్సరాల తరువాత , అమెరికాకు అనేక ఎదురు దెబ్బలు తగులుతున్న స్ధితిలో, అమెరికాతో సహా ధనిక దేశాలన్నీ సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న తరుణంలో ఒకసారి సోషలిస్టు భావజాలంవైపు మొగ్గితే వెనక్కు తిరగటం కష్టం, నకిలీ అయితే ఆచరణలో అసలు వారిని ఎంచుకుంటారని కమ్యూనిస్టు వ్యతిరేకులు భయపడుతున్నారు.ఈ నేపధ్యంలోనే ‘ప్రమాదకరమైన వామపక్షం వైపునకు అమెరికా మొగ్గుకు మూలాలు’ అనే పేరుతో ఈనెల ట్రంపెట్‌ అనే పత్రికలో గెరాల్డ్‌ ప్లరీ ఒక పెద్ద చాంతాండంత వ్యాసం రాశాడు.

‘ తీవ్రవాద వామపక్షం అమెరికాను స్వాధీనం చేసుకుంటున్న తీరును అవగాహన చేసుకోవాలంటే మీరు ముందుగా దాని భావజాలాన్ని అర్ధం చేసుకోవాలి.దీని గురించి గత యాభై సంవత్సరాలుగా మేము హెచ్చరిస్తూనే వున్నాం’ అంటూ ఆ వ్యాసాన్ని ప్రారంభించాడు. ‘అమెరికా తీవ్రమైన తిరోగమనంలో వుంది. అనేక మంది అమెరికన్లు తీవ్రంగా ఆందోళన పడుతున్నారు. వామపక్ష తీవ్రవాదులు దేశంపై అదుపు సాధించారు.నేటి డెమోక్రటిక్‌ పార్టీని చూడండి. దేశాన్ని ఆర్ధికంగా, సామాజికంగా, నైతికంగా, మిలిటరీ పరంగా, భౌగోళిక రాజనీతి పరంగా బలహీన పరిచే విధానాలను ఆ పార్టీ నాయకత్వం ప్రోత్సహిస్తున్నది. వారి అదుపులోకి దేశం ఎలా వచ్చింది? దేశం ఈ స్దితికి దిగజారటానికి కారణాలేమిటి ?

ఈ దేశంలో అంతర్గతంగా ఏం జరిగిందో ఎందుకు జరిగిందో మీరు అర్ధం చేసుకోవాల్సి వుంది.ప్రచ్చన్న యుద్ధ సమయంలో అమెరికాలో అంతర్గతంగా కమ్యూనిజం వ్యాప్తి గురించి ఎంతో భయం వుండేది. ఈ రోజు దానితో ముప్పుందని ఏమాత్రం భయపడనవసరం లేదని ఎక్కువ మంది అమెరికన్లు భావిస్తున్నారు. కానీ ఇది తీవ్ర ఆందోళనకరమైనది. కొద్ది మంది దీన్ని గుర్తించారు. కానీ తిరిగి వెనక్కు చూసుకుంటే అమెరికాలోని ప్రధాన స్రవంతి రాజకీయ అభిప్రాయాలలో అనేక మంది వెనక్కు తిరిగి నేరుగా కమ్యూనిజంపై విశ్వాసం, భావజాలంతో వున్నట్లు కనిపిస్తోంది.

అందరికీ బాగా తెలిసిన ఒక అభ్యర్ధి సోషలిస్టుగా చెప్పుకొని డెమోక్రటిక్‌ పార్టీ అధ్యక్ష పదవి అభ్యర్ధిత్వం కోరుతున్నాడు. అనేక మంది కమ్యూనిస్టులు తాము సోషలిస్టులమని చెప్పుకుంటారు.ఆయన ఎంతో మద్దతు పొందటాన్ని బట్టి అమెరికా జనం ఎంతటి ప్రమాదకర అమాయక స్ధితిలో వున్నారో తెలుస్తోంది.మీకు కమ్యూనిజం గురించి ఏమి తెలుసు? ఆరోగ్య సంరక్షణ,జాతీయ ఆర్ధిక వ్యవస్థలోని ఇతర ప్రధాన విభాగాలను ప్రభుత్వం తీసుకోవాలనే మద్ధతుదారుల సంఖ్య పెరుగుతోంది. దానితో పాటు కమ్యూనిస్టు వ్యవస్ధ వస్తుందనే ప్రమాదాన్ని అర్ధం చేసుకోవటంలో వారు విఫలమయ్యారు.’ ఇలా సాగి కమ్యూనిజాన్ని వ్యతిరేకించాల్సిన అవసరాన్ని పాఠకుల ముందుంచారు. చివరకు మతాన్ని జోడించి వర్తమాన అమెరికా సమస్యలన్నింటికీ అమెరికా చేసిన పాపాల ప్రత్యక్ష ఫలితం. ఏ రాజకీయ అభ్యర్ధి మరోసారి అమెరికాను గొప్పగా రూపొందించబోవటం లేదు.దేవుడే మరోసారి అమెరికాను గొప్పదానిగా చేస్తాడు.మనం ఎంత తిరుగుబాటు చేసినా ఆయనే మన సమస్యలను పరిష్కరించబోతున్నాడు అని ముగించారు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

Recent Posts

  • అక్రమం జరిగిందా లేదా విచారణకు ఆదేశిస్తారా లేదా : అదానీ కంపెనీలపై నోరు విప్పని ప్రధాని నరేంద్రమోడీ !
  • బికినీతో చేతులు కాల్చుకున్న కాషాయ దళం : రు.600 కోట్ల క్లబ్బులో బ్లాక్‌బస్టర్‌ ” పఠాన్‌ ” సినిమా, కంగన , అసోం సిఎం పైసా ఖర్చులేని ప్రచారం !
  • దేశమంతటా మోడీ డాక్యుమెంటరీ ప్రదర్శనలకు పిలుపు, ఏక్షణమైనా నిషేధం విధించే అవకాశం ?
  • జిన్‌, జియాన్‌, ఆజాదీ – నాడు షా, నేడు అలీ ఖమేనీ పట్ల వ్యతిరేకత, ఇరాన్‌లో చరిత్ర పునరావృతం కానుందా !
  • చివరకు మిగిలేది ఆయాసమే : నిషేధంతో మరింత కిక్కిస్తున్న బిబిసి డాక్యుమెంటరీ, రంగంలో మోడీ సేన !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • అక్రమం జరిగిందా లేదా విచారణకు ఆదేశిస్తారా లేదా : అదానీ కంపెనీలపై నోరు విప్పని ప్రధాని నరేంద్రమోడీ !
  • బికినీతో చేతులు కాల్చుకున్న కాషాయ దళం : రు.600 కోట్ల క్లబ్బులో బ్లాక్‌బస్టర్‌ ” పఠాన్‌ ” సినిమా, కంగన , అసోం సిఎం పైసా ఖర్చులేని ప్రచారం !
  • దేశమంతటా మోడీ డాక్యుమెంటరీ ప్రదర్శనలకు పిలుపు, ఏక్షణమైనా నిషేధం విధించే అవకాశం ?
  • జిన్‌, జియాన్‌, ఆజాదీ – నాడు షా, నేడు అలీ ఖమేనీ పట్ల వ్యతిరేకత, ఇరాన్‌లో చరిత్ర పునరావృతం కానుందా !
  • చివరకు మిగిలేది ఆయాసమే : నిషేధంతో మరింత కిక్కిస్తున్న బిబిసి డాక్యుమెంటరీ, రంగంలో మోడీ సేన !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • అక్రమం జరిగిందా లేదా విచారణకు ఆదేశిస్తారా లేదా : అదానీ కంపెనీలపై నోరు విప్పని ప్రధాని నరేంద్రమోడీ !
  • బికినీతో చేతులు కాల్చుకున్న కాషాయ దళం : రు.600 కోట్ల క్లబ్బులో బ్లాక్‌బస్టర్‌ ” పఠాన్‌ ” సినిమా, కంగన , అసోం సిఎం పైసా ఖర్చులేని ప్రచారం !
  • దేశమంతటా మోడీ డాక్యుమెంటరీ ప్రదర్శనలకు పిలుపు, ఏక్షణమైనా నిషేధం విధించే అవకాశం ?
  • జిన్‌, జియాన్‌, ఆజాదీ – నాడు షా, నేడు అలీ ఖమేనీ పట్ల వ్యతిరేకత, ఇరాన్‌లో చరిత్ర పునరావృతం కానుందా !
  • చివరకు మిగిలేది ఆయాసమే : నిషేధంతో మరింత కిక్కిస్తున్న బిబిసి డాక్యుమెంటరీ, రంగంలో మోడీ సేన !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Follow Following
    • vedika
    • Join 234 other followers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Customize
    • Follow Following
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d bloggers like this: