• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: Congress party

ఐదు రాష్ట్రాల ఎన్నికలు : బెట్టింగ్‌ బంగార్రాజులూ జాగ్రత్త !

30 Thursday Dec 2021

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Politics

≈ Leave a comment

Tags

2022 UP polls, AAP, Betting market, BJP, Congress party, five states 2022 elections, Samajwadi Party


ఎం కోటేశ్వరరావు


ఐదు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు జనవరి మొదటి వారంలో నోటిఫికేషన్‌ విడుదల కానుంది. మాయాబజార్‌ వాగ్దానాలతో పార్టీలు ఓటర్లను ఎలా ప్రలోభాలకు గురిచేస్తున్నాయో తెలిసిందే. ఎన్నికల ఫలితాలు, కొందరు ప్రముఖుల గెలుపు, మెజారిటీల మీద తిధి, వార, నక్షత్రాల పేరుతో జోశ్యాలు చెప్పేవారు, పందెం రాయుళ్లు రంగంలోకి దిగారు. ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే అంశంతో పాటు ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయనే సంఖ్యల మీద కూడా పందాలు ప్రారంభమయ్యాయి.ఒక అంచనా ప్రకారం 2021 మే నెలలో జరిగి ఎన్నికల్లో 25వేల కోట్ల రూపాయల వరకు ఉండగా 2022 ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో 50 వేల కోట్ల రూపాయల లావాదేవీలు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఉత్తర ప్రదేశ్‌లో పోటీ తీవ్రంగా ఉంటే ఇంకా పెరగవచ్చు కూడా. వచ్చే లోక్‌సభ ఎన్నికలు-2024లో రావాల్సినవి- ఎప్పుడు వస్తాయో తెలియదు. వాటిని ముందుకు నెట్టే లేదా గడువు నాటికి జరిగేట్లు ఉత్తర ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నిర్దేశిస్తాయని భావిస్తున్న తరుణమిది. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న పంజాబ్‌లో ఈ సారి ఎవరు పాగావేస్తారన్న ఆసక్తి పెరిగిన నేపధ్యంలో ఈ ఎన్నికలకు ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది. కాంగ్రెస్‌కు ఆప్‌ గట్టి సవాలు విసురుతోంది. అకాలీదళ్‌ ఒంటరిగా బరిలోకి దిగుతోంది. కాంగ్రెస్‌ నుంచి బయటకు వచ్చి సొంత దుకాణం పెట్టుకున్న కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ – బిజెపి జట్టుగా రంగంలోకి దిగటంతో చతుర్ముఖ పోటీ జరగనుంది. జూదగాండ్లు ఇప్పటి వరకు ఈ జట్టును లెక్కలోకి తీసుకోలేదు.


క్రికెట్‌ మీద పందాలు కాయటం తెలిసిందే. గడచిన రెండు దశాబ్దాల్లో ఎన్నికల ఫలితాల మీద పందాలు అదీ సంఘటిత ముఠాలు నిర్వహించటం పెరిగింది. ఇప్పుడు ఉత్తర ప్రదేశ్‌ ఎన్నికల మీద పందాలు మొదలయ్యాయి. వివిధ సర్వే సంస్ధలు వెల్లడించే జోశ్యాల ప్రాతిపదికన జరిగే పందాలు కొన్ని కాగా పందెం ముఠాల వెనుక ఉండే పెద్దలు స్వంతంగా చేయించుకొనే సర్వేల ప్రాతిపదికన కూడా మరికొన్ని జరుగుతున్నాయి. ఎన్నికల సర్వేలు ఎలా బోల్తాపడుతున్నాయో పందెం ముఠాలు కూడా అలాగే బొక్కబోర్లాపడుతున్నాయి. అయితే ఇవన్నీ చట్టవిరుద్దం, చీకట్లో జరిగేవి కావటంతో డబ్బు పొగొట్టుకున్నవారు లేదా గెలిచినవారు గానీ పైకి చెప్పుకోలేరు.పందెగాళ్ల అంచనా ప్రకారం పంజాబ్‌లో ఎవరికీ మెజారిటీ రాదు, ఉత్తర ప్రదేశ్‌లో తిరిగి బిజెపి గద్దెనెక్కనుంది.ఎన్నికల ప్రచారంలో పార్టీల జన సమీకరణ, మీడియా విశ్లేషణలను బట్టి కూడా పోలింగ్‌ తేదీ వరకు పందాల మొత్తాలు పెరగటం లేదా తగ్గటాన్ని గతంలో చూశాము. సాధారణ పరిస్ధితుల్లో ఎన్నికలు జరిగితే పందాలు ఒకరకం- అవి ధరల పెరుగుదల, దారిద్య్రం, నిరుద్యోగం వంటి అంశాల తీవ్రతను బట్టి ఉంటాయి.అదే పుల్వామా ఉగ్రదాడి, సర్జికల్‌ దాడుల వంటి ఉదంతాలు చోటు చేసుకుంటే మరోరకంగానూ మారతాయి.


ఈ ఎన్నికలకు ఒక ప్రత్యేకత ఉంది. ఏడాదికి పైగా మూడు సాగు చట్టాల రద్దు కోసం సాగిన మహత్తర ఉద్యమ ధాటికి దిగివచ్చిన నరేంద్రమోడీ వాటిని రద్దు చేయటమేగాక రైతులకు క్షమాపణలు చెప్పారు. కనీస మద్దతు ధర చట్టబద్దత పరిశీలనకు ఒక కమిటీని వేస్తామని ప్రకటించి వారాలు గడుస్తున్నా ఆ దిశగా ఎలాంటి కదలికా లేదు. సాగు చట్టాల రద్దుతో దూరమైన రైతులు తిరిగి తమవైపు చేరతారని ఆశించిన బిజెపికి అలాంటి సూచనలేమీ కనిపించటం లేదనే వార్తలు వస్తున్నాయి. రైతాంగం ఎటు మొగ్గుతుందన్నది ఆసక్తికరమైన అంశమే.2017 ఎన్నికల్లో బిజెపి ఉత్తర ప్రదేశ్‌ అసెంబ్లీలోని 403 స్ధానాలకు గాను 312 సాధించింది. వచ్చే ఎన్నికల్లో 250తో గట్టెక్కవచ్చని ఒకవైపు వార్తలు, రెండంకెలకు మించవనే అంచనాలు మరోవైపు ఉన్నాయి.


ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్‌లో రెండు పార్టీల గురించే పందాలు కాస్తున్నారు. బిజెపి 200 స్ధానాలు గెలిస్తే ప్రతి రూపాయికి అదనంగా 20పైసలు, 222 గెలిస్తే రూపాయికి రు.1.15, సమాజవాది110 తెచ్చుకుంటే 35పైసలు, 125 గెలిస్తే రు.1.40 ఇస్తామని ప్రకటిస్తున్నారు. కాంగ్రెస్‌, బిఎస్‌పికి ఐదు నుంచి పది స్ధానాలకు మించి రావని పందెంరాయుళ్లు చెబుతున్నారు. తరువాత ఈ అంచనాలు, పందాల మొత్తాలు మారిపోవచ్చు. పంజాబ్‌లోని 117 స్ధానాల్లో కాంగ్రెస్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీలకు కనీసంగా 25 గరిష్టంగా 40చొప్పున వస్తాయని, అకాలీదళ్‌, బిజెపిలకు ఐదు నుంచి పదిలోపు రావచ్చని, ఇక్కడ కూడా నామినేషన్ల తరువాత అంచనాలు మారవచ్చని అంటున్నారు. ఉత్తర ప్రదేశ్‌లో ప్రస్తుతం వివిధ పార్టీల సీట్ల అంచనా మేరకు వాటిని సాధిస్తే పందెం కాసిన వారికి రూపాయికి ఇచ్చే మొత్తాలు ఇలా ఉన్నాయి.


పార్టీ×××సీట్లు×××పైసలు×× పార్టీ×××సీట్లు×××పైసలు
బిజెపి×× 200×× 0.20 ××ఎస్‌పి×× 110×× 0.35
బిజెపి×× 210×× 0.35 ××ఎస్‌పి×× 115×× 0.60
బిజెపి×× 215×× 0.57 ××ఎస్‌పి×× 120×× 1.05
బిజెపి×× 222×× 1.15 ××ఎస్‌పి×× 125×× 1.40
బిఎస్‌పి×× 5 ×× 0.04 ××కాంగ్రెస్‌ ×× 5×× 0.55
బిఎస్‌పి××10 ×× 0.67 ××కాంగ్రెస్‌ ×× 6×× 0.70
బిఎస్‌పి××15 ×× 1.10 ××కాంగ్రెస్‌ ×× 8×× 1.00
బిఎస్‌పి×× 0 ×× 0.00 ××కాంగ్రెస్‌ ××10×× 2.50
పంజాబ్‌లోని 117కు గాను ప్రస్తుతం వివిధ పార్టీల సీట్ల అంచనా మేరకు వాటిని సాధిస్తే పందెం కాసిన వారికి రూపాయికి ఇచ్చే మొత్తాలు ఇలా ఉన్నాయి
పార్టీ×××సీట్లు×××పైసలు×× పార్టీ×××సీట్లు×××పైసలు
ఆప్‌×× 25 ×× 0.35 ××కాంగ్రెస్‌ ×× 25 ×× 0.45 ××అకాలీదళ్‌ ×× 5 ×× 0.35
ఆప్‌×× 30 ×× 0.40 ××కాంగ్రెస్‌ ×× 30 ×× 0.57 ××అకాలీదళ్‌ ×× 10 ×× 0.57
ఆప్‌×× 35 ×× 0.87 ××కాంగ్రెస్‌ ×× 35 ×× 0.90 ××అకాలీదళ్‌ ×× 15 ×× 0.87
ఆప్‌×× 40 ×× 1.15 ××కాంగ్రెస్‌ ×× 40 ×× 1.35 ××అకాలీదళ్‌ ×× 20 ×× 1.20

2021లో జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో తమిళనాడు అన్నాడిఎంకె గెలుస్తుందని, డిఎంకె ఓడిపోతుందని, స్టాలిన్‌కు సిఎం యోగం లేదని జోశ్యాలు చెప్పారు. పశ్చిమబెంగాల్లో మోడీ నాయకత్వంలో బిజెపి గెలుస్తుందన్నారు. బిజెపి పటాటోపం చూసి అక్కడ పెద్ద ఎత్తున లావాదేవీలు జరిపారు.బిజెపికి 145 స్దానాలు వస్తాయని, టిఎంసికి 115-120కి మించి రావని పందాలు కాశారు. రూపాయి 22 నుంచి 150పైసల వరకు అవి ఉన్నాయి. ఎవరి తల రాత ఏమిటో ముందే రాసి ఉంటుందని చెప్పేవీరు ఎన్నికల అంశాల్లో నామినేషన్ల నాటి నుంచి ప్రచారం వరకు భిన్నమైన జోశ్యాలు చెబుతున్నారు. వీరందరు చెప్పే గ్రహాలు ఒకటే, అవి అందరికీ ఒకే సందేశాలు ఇవ్వాలి, కానీ ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెప్పటాన్ని బట్టి ఊహాగానాలు తప్ప మరొకటి కాదన్నది స్పష్టం. అయినా ఏ పుట్టలో ఏ పాముందో అన్నట్లుగా ప్రతివారూ జోత్యిష్కులను ఆశ్రయిస్తుండటంతో వారి వ్యాపారం కూడా రెండు చేతులు ఆరు కాసులు అన్నట్లుగా పెరిగిపోతోంది.


2004 ఎన్నికల్లో అతల్‌ బిహారీ వాజ్‌పాయి నాయకత్వంలోని ఎన్‌డిఏకు మరోసారి అవకాశం వస్తుందన్న ఎన్నికల సర్వేలు వాస్తవం కాదని తేలింది. 2009లో హంగ్‌ పార్లమెంట్‌ అన్న అంచనాలు తప్పి యుపిఏ మరింత బలపడింది. 2014లో ఎన్‌డిఏకు స్వల్ప మెజారిటీ అన్న అంచనాలు తారుమారైన సంగతి తెలిసిందే, 2019లో కూడా అదే జరిగి ఎన్‌డిఏ బలం మరింత పెరిగింది.అనేక మంది ప్రముఖ జ్యోతిష్కులు మోడీ అధికారానికి వచ్చినా సీట్లు తగ్గుతాయని చెప్పి నాలుక కరుచుకున్నారు. ఉత్తర ప్రదేశ్‌లోని ఆగ్రా, మధుర, హత్రాస్‌ వంటివి పందెగాండ్లకు పెద్ద కేంద్రాలు.2019 ఎన్నికలలో మోడీ సర్కార్‌కు తగినంత మెజారిటీ రాకపోతే సమాజవాది పార్టీతో బంధాన్ని తెంచుకొని బిఎస్‌పి నేత మాయావతి ఎన్‌డిఏలో చేరతారని, రాహులు గాంధీ పోటీ చేసిన రెండు స్ధానాల్లో గెలుస్తారని, సమాజవాది పార్టీ స్ధితి మెరుగుపడుతుందని కూడా పందాలు కాశారు.


సర్వే సంస్ధలు, మీడియాను మేనేజ్‌ చేసి అనుకూల సర్వేలు చేయించుకోవటం జగమెరిగిన సత్యం. అందుకే వాటిని జనం పెద్దగా విశ్వసించటం లేదు. ఫలితాలు కూడా అలాగే ఎక్కువ సందర్భాల్లో తారుమారయ్యాయి. సర్వేలతో పాటు ఇప్పుడు రాజకీయ పార్టీలు ముఖ్యంగా బిజెపి పందెగాళ్ల ముఠాలను కూడా ప్రభావితం చేస్తున్నట్లు విమర్శలు వచ్చాయి. పందాల వార్తలు మీడియాలో ప్రముఖంగా చోటు చేసుకొంటున్నందున తద్వారా ఓటర్లను ప్రభావితం చేయవచ్చన్న ఎత్తుగడ దీనివెనుక ఉంది. ఫలానా పార్టీ గెలుపు గురించి ఎక్కువ మంది పందెంకాస్తున్నారంటే దానికి మద్దతు ఉండబట్టే కదా అని మొగ్గేవారు కొందరైనా ఉండవచ్చు. ఈ కారణంగానే 2014తో పోల్చితే 2019లో పందాల మార్కెట్‌ రెండు రెట్లు పెరిగిందని, ఇప్పుడు ఇంకా పెరిగిందని అంచనా. కనీస మొత్తాలతో ప్రారంభమై కోట్ల వరకు ఉంటాయి. అనేక మొత్తాలు విదేశాల్లోనే జమ అవుతాయి, దానికి హవాలాతో సహా అనేక మార్గాలను ఎంచుకుంటారు, ఎక్కడా రాతకోతలుండవు.బుకీలు తెలిసి ఉంటే ముందుగా డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. అంతా నమ్మకం, దందా మీదనే నడుస్తుంది.


ఎన్నికల ఫలితాలపై పందాలు మన దేశంలోనే కాదు ప్రపంచమంతటా ఉన్నాయి. మన దేశంలో గుర్రప్పందాలు మాత్రమే చట్టబద్దం. మిగిలినవన్నీ చాటు మాటు దొంగ వ్యవహారాలే. అనేక దేశాల్లో అన్ని రకాల జూదాలు చట్టబద్దంగానే జరుగుతాయి. 2020 అమెరికా ఎన్నికల్లో డోనాల్డ్‌ ట్రంప్‌, జోబైడెన్‌ మీద కూడా జూదం నిర్వహించారు. ప్రతి అధ్యక్షుడు రెండోసారి ఎన్నిక అవటం ఆనవాయితీగా వస్తోంది. ఆ మేరకు ట్రంప్‌ ఎన్ని పిచ్చిపనులు చేసినా రెండోసారి గెలుస్తాడంటూ పందెగాళ్లు ఎక్కువ మంది అటువైపే మొగ్గి చేతులు కాల్చుకున్నారు. లెక్కింపులో జో బైడెన్‌ ముందంజలో ఉన్నట్లు వార్తలు వచ్చిన తరువాత కూడా ట్రంప్‌ ఏదో ఒక మాజిక్‌ చేసి గెలుస్తాడని భంగపడినవారు లేకపోలేదు. ట్రంప్‌ గెలుపు గురించి న్యూజిలాండ్‌లో 62 నుంచి 37 , జోబైడెన్‌ మీద 61-44 సెంట్ల వరకు పందాలు నడిచాయి(ఒక డాలరుకు వంద సెంట్లు).స్టాక్‌ ఎక్సేంజ్‌ల మాదిరి బ్రిటన్‌లో బెట్టింగ్‌ ఎక్సేంజ్‌ బెట్‌ఫెయిర్‌ ఉంది. అమెరికా ఎన్నికలు ప్రారంభం కాగానే ట్రంప్‌ రెండోసారి విజయానికి అవకాశాలున్నాయని 39 నుంచి 75శాతానికి బెట్‌ఫెయిర్‌ సూచిక పెరగ్గా బైడెన్‌ అవకాశాలు 61 నుంచి 25శాతానికి తగ్గాయి. స్మార్‌కెట్స్‌ అనే మరో ఎక్సేంజ్‌లో కూడా ఇదే మాదిరి సూచనలు వెలువడినా చివరికి ట్రంప్‌ ఇంటిదారి పట్టాడు. అక్కడ కొన్ని రాష్ట్రాల తీరు తెన్నులను బట్టి పందాలు కాస్తారు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

రాహుల్‌ గాంధీ కనీస ఆదాయ పధకం వెనుక లాజిక్కేమిటి ?

29 Friday Mar 2019

Posted by raomk in BJP, Congress, Current Affairs, Economics, Farmers, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Telangana

≈ Leave a comment

Tags

Congress party, LOK SABHA Election 2019, Nyay scheme, populist schemes, Rahul Nyay scheme

Image result for rahul gandhi

ఎం కోటేశ్వరరావు

కాంగ్రెస్‌ అధికారానికి వస్తే తాము ప్రతి కుటుంబానికి నెలకు ఆరువేల రూపాయల చొప్పున పేద కుటుంబాలకు అందచేస్తామని రాహుల్‌ గాంధీ ప్రకటించారు. దీని మీద కొందరికి లోపల ఇది జరిగేదేనా అన్న గుంజాటన వుంటే అటు సమర్ధించలేక, ఇటు వ్యతిరేకించలేక కొన్ని రాజకీయ పార్టీలు డోలాయమానంలో వున్నాయి. ఈ పధకాన్ని రూపొందించింది, రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ అని, కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఆయనే ఆర్ధిక మంత్రి అవుతారన్న వార్తలు వచ్చాయి. దాని మంచి చెడ్డల గురించి చర్చించుకోబోయే ముందు ఆ పధకం ఆచరణ సాధ్యమేనా అని సందేహించే వారు ఎందుకు సాధ్యం కాదో ఆలోచించాలి.

ఏడాదికి 25కోట్ల మంది జనాభా వుండే ఐదు కోట్ల పేద కుటుంబాలకు ఏడాదికి 72వేల రూపాయల చొప్పున కనీస ఆదాయాన్ని అందచేస్తామని కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ చేసిన ఎన్నికల వాగ్దానం మోసం, జనాలూ జాగ్రత్త అంటూ కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీ గుండెలు బాదుకుంటున్నారు. అదే సమయంలో ఆ పెద్ద మనిషి మరో మాట కూడా చెప్పారు. తాము అమలు చేస్తున్న పధకాలన్నింటినీ కలిపి చూస్తే అంతకంటే ఎక్కువగానే వివిధ రూపాలలో పేదలకు చెల్లిస్తున్నామని అన్నారు. అంటే రాహుల్‌ గాంధీ ప్రకటించింది అసాధ్యమైన దేమీ కాదని జెట్లీ అంగీకరించినట్లే కదా !

ఇంతకీ రాహుల్‌ గాంధీ ఏమి చెప్పారు. ప్రతి పేద కుటుంబానికి నెలకు కనీసం పన్నెండువేలకు ఆదాయం తగ్గకూడదన్నది తమ ఆకాంక్ష అని దానిలో భాగంగా డెబ్బయి రెండు వేల రూపాయలను నేరుగా కుటుంబాల ఖాతాలో వేస్తామని అన్నారు. కాంగ్రెస్‌ హయాంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ వుపాధి హామీ పధకం కింద 14కోట్ల మందిని దారిద్య్రరేఖ దిగువ నుంచి ఎగువకు చేర్చామని, దాని కొనసాగింపుగా ఈ రెండవ పధకంలో 25కోట్ల మందిని దారిద్య్రరేఖనుంచి ఎగువకు తీసుకు వస్తే దేశంలో మొత్తం దారిద్య్ర నిర్మూలన జరుగుతుందని కాంగ్రెస్‌ నమ్మబలుకుతున్నది. ఇందుకు గాను 3.6లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని కాంగ్రెస్‌ చెబుతున్నది. తన నాన్నమ్మ ఇందిరా గాంధీ 1970దశకంలో గరీబీ హఠావో నినాదమిచ్చి ఓట్లను కొల్లగొట్టారు. దాదాపు ఐదు దశాబ్దాల తరువాత మనవడు పేదరికం నిర్మూలనకు బదులు పేద కుటుంబాలకు నగదు బదలాయింపు గురించి చెబుతున్నారు. అంటే పేదరిక నిర్మూలన చేయలేం, దానికి బదులు డబ్బు ఇస్తాం అనటమే. అంటే సమస్య తిరిగి మొదటికి వచ్చింది.

మన దౌర్భాగ్యం ఏమంటే మన పాలకులు వారు కాంగ్రెస్‌ అయినా బిజెపి అయినా మన దేశంలో దరిద్రం ఏ స్దాయిలో, ఎంత మంది వున్నారన్నది ఇంతవరకు నిజాయితీగా నిక్కచ్చి లెక్కలు చెప్పలేదు. దారిద్య్రం నిర్వచనం మీద ఏకాభిప్రాయం లేదు. మన పాలకులు జిడిపి విషయానికి వస్తే ప్రపంచ ధనిక దేశాలతో పోటీ పడుతున్నామని త్వరలో రెండవ స్ధానంలో వున్న చైనాను అధిగమిస్తామని చెబుతారు. కానీ దారిద్య్రరేఖ విషయానికి వస్తే మాత్రం అంతసీను లేదు. రోజుకు 1.9 డాలర్ల కంటే తక్కువ సంపాదించే వారు ( మార్చినెల 28 డాలరు మారకం రేటులో రు 131) దారిద్య్రరేఖకు దిగువన వున్నట్లు లెక్క. ఇది అంతర్జాతీయ దారిద్య్రరేఖ పాతలెక్క, ప్రపంచ బ్యాంకు తాజాగా వేసిన మదింపులో రెండు రేఖలను సూచించింది ఒకటి రోజుకు 3.2 డాలర్లు రెండవది 5.5 డాలర్లకంటే తక్కువ సంపాదించే వారు దారిద్య్రంలో వున్నట్లే. రెండవదాని ప్రకారం ప్రపంచంలో 58శాతం మంది దారిద్య్రంలో వున్నారు.

2012లో మన కేంద్ర ప్రభుత్వం చెప్పినదాని ప్రకారం 22శాతం దారిద్య్రరేఖకు దిగువన వున్నారు. ప్రపంచబ్యాంకు లెక్కల ప్రకారం 2005లో 23.6శాతం మంది వున్నారు. ఐక్యరాజ్యసమితి సహ్రస్రాబ్ది అభివృద్ధి లక్ష్యాల ప్రకారం రోజుకు 1.25 డాలర్ల కంటే తక్కువ ఆదాయం వున్నవారు 2012లో 21.9శాతం. సురేష్‌ టెండూల్కర్‌ కమిటీ నివేదిక ప్రకారం కూడా అంతే వుంది. తరువాత రంగరాజన్‌ కమిటీ 2014లో చెప్పిన లెక్క 29.5శాతం. 2015లొ రోజుకు 1.9 డాలర్ల ప్రకారం 12.5 శాతం వున్నారు. జిడిపిలో దూసుకుపోతున్న మనం ఇప్పుడు తాజాగా ప్రపంచ బ్యాంకు చెప్పిన 3.2 డాలర్లతో లేదా 5.5డాలర్లతో దేని ప్రాతిపదికన దారిద్య్రాన్ని, దరిద్రులను లెక్కించాలి. రెండవదాని ప్రకారం అయితే ప్రపంచ సగటు 58శాతం లేదా అటూ ఇటూగా మన జనం దరిద్రంలో వున్నట్లే .

రాజీవ్‌ గాంధీ లేదా ఆయనకు సలహాలు ఇస్తున్నవారు రెండవ దానిని పరిగణనలోకి తీసుకొని రోజుకు 5.5 డాలర్లు (రు 380) లేదా నెలకు 12000 వేల రూపాయలు కనీస ఆదాయం అవసరమని తెల్చారు. అందుకే దానిలో సగం సంపాదించుకుంటే సగం నెలకు ఆరు చొప్పున ఏడాదికి 72వేలను ప్రభుత్వం నేరుగా కుటుంబాలలోని మహిళల ఖాతాలలో వేస్తామని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు. ఇదంతా మోసం అని చెబుతున్న ఆర్దిక మంత్రి అరుణ్‌ జెట్లీ ఏమంటున్నారు. ప్రస్తుతం తాము అమలు జరుపుతున్న వివిధ పధకాలు వుపాధి హామీ పధకం, ఆయుష్మాన్‌ భవ, ఎరువుల సబ్సిడీ వంటి వాటికింద ఏటా 7.8లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని, దీనివలన లబ్ది పొందుతున్నది పేదవారే నని అయితే వివిధ పధకాల కింద వున్నందున మొత్తం ఎంత లభిస్తుందో లెక్కవేసుకోవచ్చు అంటున్నారు. ప్రతి పేద కుటుంబానికి నెలకు పన్నెండు వేల చొప్పున ఆదాయం వచ్చేట్లు చేయాలంటే జిడిపిలో 1.5శాతం అవుతుందని కాంగ్రెస్‌ లెక్కలు వేసింది. తాము వాగ్దానం చేసిన పధకాన్ని అటు కేంద్రం, ఇటు రాష్ట్రాలు రెండూ పంచుకోవాల్సి వుంటుందని కూడా చెబుతున్నది. తొలుత ప్రయోగాత్మకంగా కొన్ని చోట్ల మొదలు పెట్టి రెండు సంవత్సరాల వ్యవధిలో దేశ మంతటికీ విస్తరింప చేస్తామని కాంగ్రెస్‌ ప్రతినిధి చెప్పారు. ఏటా కేంద్ర ప్రభుత్వ ఎగుమతుల ప్రోత్సాహం, పరిశ్రమలకు ఇస్తున్న రాయితీలు, పన్నుల రాయితీలతో పోల్చుకుంటే 3.6లక్షల కోట్ల రూపాయలను పేదలకు ఇవ్వటం పెద్ద లెక్కలోనిది కాదు

రాహుల్‌ గాంధీ ప్రకటించిన ఈ పధకం కొత్తదేమీ కాదు. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న వివిధ సబ్సిడీలు, పధకాలకు అయ్యే ఖర్చు తగ్గించేందుకు గాను వాటిని అందుకు కేటాయిస్తున్న నిధులను నగదు బదిలీ రూపంలో అందచేయాలన్నది ప్రపంచబ్యాంకు,ఐఎంఎఫ్‌ చేసిన సూచనల సారం.వుదాహరణకు వరి పండించే రైతులకు నగదు బదిలీ పధకం కింద కొంత మొత్తం, పేదలకు సబ్సిడీ బియ్యం బదులు నగదు ఇస్తే భారత ఆహార సంస్ధను పూర్తిగా ఎత్తివేయవచ్చు. ఈ దిశగా కేంద్ర పాలిత ప్రాంతాలలో కొన్ని చోట్ల పేదలకు బియ్యం బదులు నగదు బదిలీని ప్రయోగాత్మకంగా అమలు జరుపుతున్నారు. రైతులకు రైతు బంధు మరొక పేరుతో నగదు అందచేసేందుకు నిర్ణయించారు. తెలంగాణాలో ఆ రైతు బంధు పధకం కింద సొమ్ము తీసుకున్న రైతులు తమ ఎర్రజొన్నలు, పసుపు పంటలకు గిట్టుబాటు ధర లేదని బంద్‌లు చేయటమే కాదు, అరెస్టులయ్యారు. చివరికి రాష్ట్ర ప్రభుత్వానికి నిరసనగా నిజామాబాద్‌ లోక్‌సభ బరిలో 178 మంది రైతులు అధికార పార్టీ అదిరింపులు, బెదిరింపులను లెక్కచేయకుండా పోటీకి నిలిచారు. ఎకరానికి ఎనిమిది వేలు ఇస్తే తాము చేయాల్సిందేమీ లేదని అధికార పార్టీ వూహించింది. పెరుగుతున్న వ్యవసాయ ఖర్చులతో పోల్చుకుంటే ఎకరానికి ఎనిమిది వేలు ఒక లెక్క కాదు. అందుకే రైతులు రోడ్డెక్కారు.

కాంగ్రెస్‌ చెబుతున్న నెలకు 12వేల కనీస ఆదాయం కూడా ఇప్పటి ధరల ప్రకారం నలుగురు లేక ఐదుగురు వున్న కుటుంబ సభ్యుల అవసరాలకు సరిపోయే మొత్తం కాదు. అంతకు రెట్టింపు అవసరమని గణాంకాలు తెలుపుతున్నాయి. పట్టణ ప్రాంతాలలో ఒక వ్యక్తికి రోజుకు 2100, గ్రామాలలో 2400 కాలరీల శక్తినిచ్చే ఆహారం కావాలని అందుకు 1973-74లో రు.56.64, 49.09ల చొప్పున అవసరమని లెక్కవేశారు. ఇప్పుడు అంత మొత్తాలు రోజూ తాగే టీ, టిఫిన్‌ ఖర్చులకే చాలవు. అందువలన ఏటేటా దిగజారుతున్న రూపాయి విలువ, పెరుగుతున్న ధరలకు అనుగుణ్యంగా ప్రతి కుటుంబానికి అవసరమైన ఆదాయం వచ్చే విధంగా వుపాధి చూపితే దయాదాక్షిణ్యాలతో ఇచ్చే సొమ్ముకు ఎవరూ ఆశపడరు.

పేదలకు కనీస ఆదాయ పధకం అన్నది కొత్త ఆలోచన కూడా కాదు. మహమ్మద్‌ ప్రవక్త మామ, ఇస్లామిక్‌ రాజ్య తొలి పాలకుడు అయిన అబూ బకర్‌ ఏటా ప్రతి స్త్రీ, పురుషుడు, పిల్లలకు పది దిర్హామ్‌లు కనీసంగా అందచేయాలనే పధకాన్ని ప్రవేశపెట్టాడు. తరువాత ఆ మొత్తాన్ని ఇరవైకి పెంచాడు. క్రైస్తవ రాజ్యాలకు వ్యతిరేకంగా తమ పాలనను సుస్ధిర పరచేందుకు జనాన్ని ఆకర్షించే పధకమే ఇది. అమెరికాలో 1795లో భూ యాజమాన్య వ్యవస్ధను ప్రవేశపెట్టిన సందర్భంగా సహజంగా వచ్చిన వారసత్వ ఆస్ధులు కోల్పోయినందున నాటి మానవతా వాది ధామస్‌ పెయిన అమెరికా పౌరులందరికీ పరిహారంగా పౌర లాభం పేరుతో కొంత మొత్తాన్ని చెల్లించాలని ప్రతిపాదించాడు. అమెరికా ఆర్ధికవేత్త హెన్రీ జార్జి భూమి విలువ పన్నుద్వారా వచ్చే ఆదాయంలో కొంత మొత్తాన్ని అమెరికన్లందరకూ డివిడెండ్‌గా చెల్లించాలని కోరాడు. 1966లో అమెరికాలో తలెత్తిన ఆర్ధిక సమస్యల పూర్వరంగంలో సంక్షేమ కార్యక్రమాల ఖర్చును తగ్గించేందుకు దారిద్య్ర నిర్మూలనకు కనీస వార్షిక ఆదాయం పేరుతో ఒక పధకాన్ని ప్రవేశపెట్టారు.1968లో 1200 మంది ఆర్దికవేత్తలు ఒక మెమో రాండంపై సంతకాలు చేసి ఆదాయ హామీ పధకాన్ని అమలు జరపాలని కోరారు. అయినా ఇప్పటికీ అమెరికాలో పేదరికం పోలేదు. ఫ్రెంచి పాలకుడు నెపోలియన్‌ బోనపార్టే కూడా పౌరుల మనుగడకు నిమిత్తం అవసరాలు తీర్చేందుకు కొంత మొత్తాన్ని తీసుకోవటం వారి జన్మహక్కని చెప్పాడు.

దీని వెనుక వున్న లాజిక్కును కూడా అర్ధం చేసుకోవాలి. మహమ్మద్‌ ప్రవక్త మామ అయినా మరొకరు అయినా వర్గ సమాజాలకు ప్రతినిధులు. అది బానిస సమాజం, ఫ్యూడలిజం, పెట్టుబడిదారీ విధానమైనా యజమానులకు పనిచేసేందుకు కార్మికులు కావాలి. వారు కావాలంటే కనీసం బతికి, పని చేసేందుకు అవసరమైన శక్తి అవసరం. ఆ కనీసఅవసరం వారికి తీరకపోతే పని చేసే వారు దొరకరు. అందుకే కనీస సంక్షేమ పధకాలను అమలు జరిపిన తీరు ప్రతి సమాజంలోనూ మనకు కనిపిస్తుంది. పశ్చిమ దేశాలలో కార్మికులు జబ్బుపడి పని మానితే వచ్చే నష్టం కంటే వారికి ఆరోగ్య సంరక్షణకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తే యజమానులకు వచ్చే లాభమే ఎక్కువగా వుంది కనుక పరిమితంగా అయినా ఆరోగ్య రక్షణ కల్పిస్తున్నారు. పెట్టుబడిదారీ వ్యవస్ధలో ఏదీ వుచితం కాదు, అలాంటపుడు అమలు జరిపే సంక్షేమ పధకాలను వుచితంగా అమలు జరుపుతారని ఎందుకు అనుకోవాలి.

ప్రస్తుతం అనేక దేశాలలో కనీస ఆదాయ హామీ పధకాలు అమలు జరుగుతున్నాయి, అయితే వాటికి షరతులు వర్తిస్తాయి. బ్రెజిల్‌లో పిల్లలను బడులకు పంపటం ఒక షరతు. మన దేశంలో 1934లో కాంగ్రెస్‌ నేత సుభాస్‌ చంద్రబోస్‌ తొలుత ఇలాంటి పధకం గురించి ప్రతిపాదించారు. తరువాత 1942లో జవహర్‌లాల్‌ నెహ్రూ ఆధ్వర్యంలో ఒక కమిటీని వేసి ప్రతిపాదనలు చేయాలని కోరినప్పటి అది జరగలేదు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

ఆదిత్యనాధ్‌ ఇలాకాలో బిజెపి తొలి ఓటమి !

24 Sunday Mar 2019

Posted by raomk in BJP, Communalism, Congress, Current Affairs, History, INDIA, Loksabha Elections, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, RELIGION

≈ Leave a comment

Tags

Bahujan Samaj Party, BJP, Congress party, Modi, Samajwadi Party, Shah, UP Loksabha elections 2019, UP's kairana, Yogi Adityanath

Image result for up lok sabha election 2019

ఎం కోటేశ్వరరావు

అవును ఎన్నికలు ఇంకా జరగముందే ఓడిపోవటం ఏమిటి అనుకుంటున్నారా ? అవును నిజంగానే ఏడాది క్రితం నిలిపిన అభ్యర్ధిని ఇప్పుడు మార్చటం అంటే నైతికంగా ఓటమిని అంగీకరించటం కాదా ? కైరానా నియోజకవర్గం ఏడాది క్రితం ఒక సంచలనం. మూడో వంతుకు పైగా ముస్లిం జనాభా వున్న ఈ నియోజకవర్గంలో వారు మెజారిటీగా వున్న చోట్ల నుంచి హిందువులను తరిమి వేస్తున్నారంటూ ఆ లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన బిజెపి నేత హుకుం సింగ్‌, తదితరులు పెద్ద ఎత్తున ప్రచారం చేసి వుద్రిక్తతలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించిన గతాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి. సదరు సింగ్‌ హఠాన్మరణంతో ఏడాది క్రితం వుప ఎన్నిక అవసరమైంది. అది ఒక్క వుత్తర ప్రదేశ్‌ రాజకీయాలనే కాదు, దేశ వ్యాపితంగా బిజెపి వ్యతిరేక శక్తులు ఒక్కతాటి మీదకు వస్తే కలిగే రాజకీయ ప్రయోజనం ఏమిటో వెల్లడించింది.

ఆ ఎన్నికలో బిజెపి అభ్యర్దిగా హుకుంసింగ్‌ కుమార్తె మృగాంకను నిలిపి సానుభూతి ఓట్లతో గెలవాలని చూసింది. అయితే సమాజవాదిపార్టీ, ఆర్‌ఎల్‌డి వుమ్మడి అభ్యర్ధిగా ఆర్‌ఎల్‌డికి చెందిన తబుసుమ్‌ హసన్‌ను రంగంలోకి దిగటమే కాదు గణనీయ మెజారిటీతో బిజెపిని ఓడించారు. ఈ ఎన్నికలో కాంగ్రెస్‌ పోటీ చేయలేదు.బిజెపిని ఓడించండి అని కార్యకర్తలకు పిలుపునివ్వటం తప్ప ఫలానా వారికి మద్దతు ఇస్తున్నట్లు బహుజన సమాజవాది పార్టీ నాయకురాలు మాయావతి సూచించలేదు. ఈ ఎన్నిక తరువాత అనూహ్యంగా దశాబ్దాలుగా వుప్పు నిప్పుగా వుండే ఎస్‌పి, బిఎస్‌పి పార్టీలు ఒక అవగాహనకు వచ్చాయి. ఒక ఫార్ములాను రూపొందించుకొని సీట్ల సర్దుబాటు చేసుకొని బిజెపి మీద బస్తీమే సవాల్‌ అంటూ బరిలోకి దిగాయి.

శనివారం నాడు బిజెపి ప్రకటించిన అభ్యర్ధుల జాబితాలో కైరానాలో మృగాంకకు మొండి చేయి చూపి పక్క జిల్లాకు చెందిన ఒక ఎంఎల్‌ఏను ఎంపిక చేశారు. వేరే కారణాలేమీ లేకుండా ఏడాదిలోనే అభ్యర్ధిని మార్చటం అంటే నైతికంగా బిజెపి ఓటమిని అంగీకరించటమే. వుప ఎన్నికల్లో ఆర్‌ఎల్‌డి అభ్యర్ధినిగా వున్న తబుసుమ్‌ ఈ సారి సమాజవాది పార్టీ అభ్యర్ధిగా రంగంలోకి దిగుతున్నారు. ఈ సారి కాంగ్రెస్‌ తమ అభ్యర్ధిని నిలిపే అవకాశం వుంది. ఏడుశాతంపైగా గత ఎన్నికల్లో ఓట్లు తెచ్చుకున్న కాంగ్రెస్‌కు ఏకపక్షంగా సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న స్దానాలలో మద్దతు ప్రకటించి మిగిలిన అన్ని చోట్ల ఎస్‌పి, బిఎస్‌పి,ఆర్‌ఎల్‌డి కూటమి అభ్యర్దులను రంగంలోకి దించుతున్నాయి. అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర బిజెపి సర్కార్‌పై ప్రజల్లో పెరిగిన వ్యతిరేకత ప్రధాన ప్రత్యర్ధులకే దోహదం చేస్తుంది తప్ప కాంగ్రెస్‌కు ప్రయోజనం చేకూర్చదు. అయినా అన్ని చోట్లా తమ అభ్యర్ధులను నిలుపుతామని ఆ పార్టీ ప్రకటించింది.ఓటర్లు ఎలా స్పందిస్తారో చూడాల్సివుంది.

Image result for up lok sabha election 2019

అయోధ్య ! రాముడిని వీధుల్లోకి, భారతీయ జనతాపార్టీతో పాటు దేశంలో అనేక మందిని మత రాజకీయాలవైపు నెట్టిన పేరు. పక్కా కాషాయంతో మతం, అయోధ్య రాముడిని వుపయోగించుకొని బిజెపి లాభపడిందన్నది నిస్సందేహం. దాని తీరు చూసి కాంగ్రెస్‌ కూడా పలుచబారిన కాషాయంతో ఓట్లు సంపాదించాలని చూస్తున్నదనే విమర్శలు ఎదుర్కొంటున్నది. అయోధ్యలోని బాబరీ మసీదు స్ధలంలో రామాలయ నిర్మాణం అన్నది గత ఎన్నికలలో బిజెపి వాగ్గానం. దానికి నరేంద్రమోడీ గుజరాత్‌ మోడల్‌ అభివృద్ధి, నల్లధనం వెలికితీత వంటి నినాదాలు తోడయ్యాయి. సమాజవాది పార్టీ, బిఎస్‌పి, కాంగ్రెస్‌, తదితర పార్టీలు విడివిడిగా పోటీపడటం బిజెపికి అనూహ్యంగా 80కిగాను 71, దాని మిత్రపక్షం అప్నాదళ్‌కు రెండు, సమాజవాది పార్టీకి ఐదు, కాంగ్రెస్‌కు రెండు వచ్చాయి.

Image result for ayodhya priest surendra das

ఈ సారి రామ మందిరం కాదు, పుల్వామాయే బిజెపిని రక్షిఈ సారి లోక్‌సభ ఎన్నికల్లో బిజెపిని పుల్వామా మాత్రమే రక్షించగలదు తప్ప రామ మందిరం కాదని అయోధ్యలోని వివాదాస్పద తాత్కాలిక రామాలయ ప్రధాన పూజారి ఆచార్య సురేంద్రదాస్‌ అన్నారు. సాధారణంగా రాజకీయాల గురించి నోరు విప్పని ఆ పెద్దమనిషి సాంప్రదాయాన్ని పక్కన పెట్టి ‘కాశ్మీర్‌పై దాడితో బిజెపి రామ మందిర సమస్యను పక్కన పెడుతుంది. రామ్‌ రామ్‌ అని నినాదాలు ఇచ్చేవారు ఇప్పుడా పని చేయరు. వారు గనుక రామ మందిరం సమస్యను ముందుకు తెస్తే ఓడిపోతారు, జనం వారిని నమ్మటం లేదు, ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారు’ అని వ్యాఖ్యానించారు.

గతంలో బాబరీ మసీదు వున్న చోట ఇప్పుడు తాత్కాలిక గుడారంలో భద్రతా సిబ్బంది రక్షణ మధ్య నాలుగు రాముడి విగ్రహాలు వున్నాయి. నాలుగంచలలో సందర్శకులను తనిఖీ చేసిన తరువాత 50 మీటర్ల దూరం నుంచి ఆ విగ్రహాలను చూడనిస్తారు. గతంలో సంస్కృత పండితుడిగా పని చేసిన సురేంద్రదాస్‌ కొన్ని విషయాలను నిర్మొహమాటంగా చెబుతారు. బాబరీ మసీదు కూల్చివేత ముస్లింల కంటే హిందువులనే ఎక్కువగా బాధించిందని, కూల్చాల్సిన అవసరం లేదని అంటారు.

పుల్వామా వుదంతం బిజెపిని తిరిగి అధికారంలోకి తెస్తుందనే అభిప్రాయంతో అనేక మంది ఏకీభవించటం లేదు. గతంలో కార్గిల్‌ యుద్ధాన్ని, యూరి సర్జికల్‌ దాడులను బిజెపి ఎన్నికలలో వుపయోగించుకొని జనం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను విస్మరించి ఓటర్లకు దూరమైన విషయాలను గుర్తు చేస్తున్నారు. పుల్వామా తాత్కాలికంగా భావోద్వేగాలను రగిలించగలదు తప్ప నిరుద్యోగం, వ్యవసాయ సంక్షోభాన్ని ఓటర్లు మరచిపోయే అవకాశం లేదంటున్నారు. పుల్వామా వుదంతాన్ని, అయోధ్య స్ధల వివాదం సుప్రీం కోర్టులో ఇంకా విచారణలో వుండగా దాన్ని ఏ రూపంలో ముందుకు తెచ్చినా బిజెపి విమర్శపాలయ్యే అవకాశం వుంది. రామాలయ నిర్మాణ వాగ్దానంతో అధికారానికి వచ్చిన యోగి ఆదిత్యనాధ్‌ భక్తులను తప్పుదారి పట్టించేందుకు లేదా సంతృప్తి పరచేందుకు ఆలయ నిర్మాణం బదులు ఫైజాబాద్‌ జిల్లా పేరును శ్రీ అయోధ్య అని మార్చటం, అయోధ్యలో అతి పెద్ద రాముడి విగ్రహం ఏర్పాటు చేస్తామని ప్రకటించిన విషయం తెలిసినదే. బాబరీ మసీదు స్ధలంలో రామాలయ నిర్మాణానికి ఆర్డినెన్స్‌ జారీ చేయాలని కోరిన ఆర్‌ఎస్‌ఎస్‌, విశ్వహిందూపరిషత్‌ వంటి సంస్ధలు ఎన్నికలు రాగానే మౌనం దాల్చాయి.

కాంగ్రెస్‌ స్వామిగా పేరున్న శంకరాచార్య స్వరూపానంద సరస్వతి ఫిబ్రవరి 21న అయోధ్యలో రామాలయానికి పునాది రాయి వేస్తానని ప్రకటించి తన అనుచరులందరూ రావాలని పిలుపునిచ్చారు. అయితే 14వ తేదీన పుల్వామా వుగ్రదాడితో ఆ కార్యక్రమం వెనక్కు పోయింది. బిజెపి ఎంతగానో వూపిరి పీల్చుకుంది. రామ మందిర నిర్మాణం జరుగుతుందని రామ ప్రభు సూచన ప్రాయంగా కూడా వెల్లడించలేదు, రామ మందిరం చుట్టూ నాటకం నడుస్తోంది, అదొక ప్రహసనంగా మారుతోంది, బిజెపి ఏమి చెప్పింది, ఏమి చేస్తుంది అన్నది సమస్య కాదు, చివరికి సుప్రీం కోర్టు నిర్ణయిస్తుంది, దాని పట్ల బిజెపి నిజాయితీతో వుండాలి అని పూజారి సురేద్రదాస్‌ వ్యాఖ్యానించారు.

లెక్కలు ఏమి చెబుతున్నాయి !

దేశంలో వుపాధి కల్పన మొదలు, అభివృద్ధి అంకెల వరకు ఎవరు చెప్పేది నిజమో దేన్ని నమ్మాలో నమ్మకూడదో నిర్ణయించుకోలేనంతగా జనాన్ని ఆయోమయంలో పడవేశారు. ఐదేండ్లలో ఎంత మందికి వుపాధి కల్పించారంటే వున్న లెక్కలు తప్పు, కొత్త లెక్కలు వేయాల్సి వుంది అంటారు. పకోడీలు అమ్ముకోవటం కూడా వుపాధి కల్పనకిందికే వస్తుందని స్వయంగా నరేంద్రమోడీయే చెప్పిన తరువాత పకోడీ బండ్లను కూడా తాను కల్పించిన వుపాధిలో భాగంగా పరిగణిస్తున్నారా ? వాటిని వదలి వేద్దాం. గత ఎన్నికలలో వచ్చిన ఓట్ల లెక్కలను తప్పు, కొత్త లెక్కలు వేయాల్సి వుంది అనటం కుదరదు. అందువలన వాటి ప్రాతిపదికగానే విశ్లేషణలు చేయటం మినహా మరొక మార్గం లేదు.

వుత్తర ప్రదేశ్‌లోని 80 నియోజక వర్గాలకు ఏడు దశల్లో ఎన్నికలు జరుగుతున్నాయి.జరుగుతున్నాయి.గత లోక్‌సభ ఎన్నికలలో చిన్న పార్టీలను కలుపుకొని బిజెపి ఎన్‌డిఏ కూటమి పేరుతో, కాంగ్రెస్‌, ఎస్‌పి,బిఎస్‌పి, ఇతర పార్టీలు విడివిడిగా పోటీ చేశాయి. బిజెపి పోటీచేసిన 78 స్ధానాల్లో 71, మిత్రపక్షం అప్నాదళ్‌ రెండు చోట్ల పోటీ చేసి రెండూ గెలిచింది. కాంగ్రెస్‌ 66కు రెండు, సమాజవాది పార్టీ 78కి ఐదు గెలవగా 80చోట్ల పోటీ చేసిన బిఎస్‌పి అన్నింటా ఓడిపోయింది. బిజెపికి 42.3శాతం ఓట్లు రాగా ఎస్‌పికి 22.2, బిఎస్‌పికి 19.6, కాంగ్రెస్‌కు 7.5శాతం వచ్చాయి. ఈ ఎన్నికల్లో బిఎస్‌పి 38, ఎస్‌పి 37 చోట్ల వుమ్మడిగా పోటీ చేస్తూ మిగిలిన చోట్ల కాంగ్రెస్‌, ఆర్‌ఎల్‌డిని బలపరుస్తున్నాయి. కాంగ్రెస్‌ అన్ని సీట్లకు పోటీ చేస్తున్నట్లు ప్రకటించింది. నామినేషన్ల ఘట్టం ముగిసిన తరువాత గానీ నిజంగా ఎన్నిసీట్లలో పోటీ చేసేది తెలుస్తుంది. బిఎస్‌పి, ఎస్‌పి కూటమి గతంలో వచ్చిన ఓట్లను కలిపితే 41.8శాతం ఓట్లున్నాయి.

2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్‌ను చూస్తే బిజెపికి 39.7, దాని మిత్రపక్షానికి ఒక శాతం ఓట్లు వచ్చాయి. అదే బిఎస్‌పి,ఎస్‌పిలకు 22.2, 22శాతం వంతున 44.2శాతం వచ్చాయి. ఈ కారణంగానే ఈ ఎన్నికల్లో బిజెపి సీట్లు సగానికి సగం అంతకంటే ఎక్కువగా పడిపోతాయని చెబుతున్నారు. ఇప్పటి వరకు జరిగిన పలు ఎన్నికల సర్వేలలో వెల్లడించిన అంకెల సగటును తీసుకుంటే బిజెపికి 29, కాంగ్రెస్‌కు 4, ఎస్‌పి-బిఎస్‌పి కూటమికి 47 వస్తాయని తేలింది.

వుత్తరాది రాష్ట్రాలలో, వుత్తర ప్రదేశ్‌లో బిజెపికి అయోధ్య అంశం ఓట్లు తెచ్చి పెట్టిందేమో కానీ అయోధ్య పట్టణం వున్న ఫైజాబాద్‌ నియోజకవర్గం ఎప్పుడూ దానితో లేదు. బిజెపి ఆయోధ్య ఆందోళన చేపట్టిన తరువాతే అక్కడ అది ఓట్లు తెచ్చుకోగలిగింది. బాబరీ మసీదు కూల్చివేత తరువాత జరిగిన ఎన్నికలలో దానికి ఎదురు దెబ్బలు కూడా తగిలాయి. 1957 నుంచి 2014వరకు జరిగిన 15 లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్‌ ఏడు సార్లు విజయం సాధించింది. 1991 తరువాత జరిగిన ఏడు ఎన్నికలలో బిజెపి నాలుగు సార్లు విజయం సాధించగా సమాజవాది పార్టీ, బిఎస్‌పి, కాంగ్రెస్‌ ఒక్కోసారి విజయం సాధించాయి. గత ఎన్నికలలో బిజెపి అభ్యర్ధి లాలూ సింగ్‌కు 48శాతం ఓట్లు రాగా సమాజవాది పార్టీ మిత్రసేన్‌ యాదవ్‌కు 20.43, బిఎస్‌పికి 13.87, కాంగ్రెస్‌కు 12.7శాతం వచ్చాయి.

Image result for up lok sabha election 2019

బాబరీ మసీదు కూల్చివేసిన రోజు సాయంత్రమే జిల్లా కలెక్టర్‌గా నియమితుడైన పరిస్ధితిని చక్కదిద్ది ప్రశంసలు పొందిన విజయ శంకర్‌ పాండే తాజా ఎన్నికల్లో లోక్‌ ఘటబంధన్‌ పార్టీ(ఎల్‌జిపి) అభ్యర్దిగా బరిలో దిగనున్నట్లు ప్రకటించారు. నిజాయితీ పరుడైన అధికారిగా పేరున్న విజయ శంకర్‌ బాబరీ మసీదు కూల్చివేత అనంతరం ఏర్పడిన పరిస్ధితిని చక్కదిద్దటంలో ఎంతో సమర్ధవంతంగా పని చేశారు. ముక్కుసూటిగా, అవినీతికి వ్యతిరేకంగా వ్యవహరించే పాండేను 52సార్లు బదిలీ చేశారంటే అవినీతి రాజకీయవేత్తలకు ఎంత దడపుట్టించారో అర్ధం అవుతుంది. అరవై రెండు సంవత్సరాల వయస్సున్న ఈ మాజీ అధికారి తాను ఇప్పుడు వునికిలో వున్న ఏ దైనా రాజకీయ పార్టీలో చేరితే ఇంతరకు తాను చేసిందంతా వృధా అయినట్లే అన్నారు.మార్పుకోసం సహకరించమని తాను సూటిగా ప్రజలను కోరుతున్నట్లు చెప్పారు. తాను కలెక్టర్‌గా నియమితమైన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఆ రోజు అయోధ్యలో మూకలు హింసాకాండకు పాల్పడ్డాయి. రోడ్లన్నింటినీ మూసివేశారు. ఫైజాబాద్‌ వెళ్లే రోడ్డును కూడా మూసివేయటంతో లక్నో నుంచి హెలికాప్టర్‌లో వచ్చి బాధ్యతలు తీసుకున్నట్లు చెప్పారు. వివాదాస్పద చంద్రస్వామి వివాదాస్పద స్దలం వద్ద హోమం చేయటానికి అనుమతించని కారణంగా కేవలం ఐదు నెలలకే తనను ఫైజాబాద్‌ నుంచి బదిలీ చేశారని చెప్పారు. మాయావతి, ములాయం సింగ్‌ యాదవ్‌, అఖిలేష్‌ యాదవ్‌ తనను వేధించారని చెప్పిన పాండే 2017లో వుద్యోగ విరమణ చేశారు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

కర్ణాటక అంకెల ఆటలో బిజెపికి భంగపాటెందుకు కలిగింది !

19 Saturday May 2018

Posted by raomk in BJP, Communalism, Congress, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties

≈ 1 Comment

Tags

BJP, Congress party, jds, karnataka votes 2018, karnataka votes facts, numbers game in karnataka, Yeddyurappa

Image result for Yeddyurappa

ఎం కోటేశ్వరరావు

కర్ణాటకలో అటు ప్రజా కోర్టులో ఇటు అసెంబ్లీ అంకెల ఆటలో బిజెపి భంగపడింది. కులం, ధన, పదవీ ప్రలోభాలు, బెదిరింపులు, బుజ్జగింపులతో తమకు లేని బలాన్ని తెచ్చుకొనేందుకు ప్రయత్నించటాన్ని యావత్‌ దేశం గమనించింది. దానిలో విఫలమై అవమానకరంగా రాజీనామా చేసిన తరువాత ఏ కోశానా లేని తమ నిజాయితీ గురించి తమకు తామే ఆ పార్టీ నేతలు కితాబునిచ్చుకుంటున్నారు. 117 సీట్లు, 56.8శాతం ఓట్లు తెచ్చుకున్న కూటమి కంటే ఓట్ల చీలిక కారణంగా 104 సీట్లు వచ్చినప్పటికీ వారికి వచ్చిన 36శాతం ఓట్లను దాచి పెద్ద పార్టీ అంటూ ఇంకా ఫోజు పెడుతున్నారు. వారెంతగా ఖంగుతిన్నారంటే బలనిరూపణకు సుప్రీం కోర్టు ఇచ్చిన అవకాశాన్ని వుపయోగించుకొని మరింత గబ్బుపట్టటం కంటే ముందే తప్పుకోవటం మంచిదని రాజీనామా చేయటం నష్ట నివారణ చర్యలో భాగం. తనకు అధికారం లేకపోయిన తరువాత ఇంకేంటి అన్నట్లుగా అసెంబ్లీలో ప్రసంగం ముగించి రాజీనామా ప్రకటించిన వెంటనే లేచి వెళ్లిపోయారు. జాతీయ గీతం గురించి పెద్ద సమస్య చేసిన ఆ పార్టీ ముఖ్యమంత్రి కూడా అసెంబ్లీలో జాతీయగీతాలాపన ముగియ కుండానే లేచిపోవటం వారి నిజస్వరూపాన్ని వెల్లడి చేసింది. ఈ వుదంతంలో కాంగ్రెస్‌-జెడిఎస్‌ కూటమి విజయం సాధించింది అనటం కటే బిజెపి ఘోరంగా ఓడిపోయింది అని చెప్పాల్సి వుంటుంది.

తమ పార్టీ కార్యకర్తగా మాదిరి వ్యవహరించే వ్యక్తి రాజభవన్‌లో గవర్నర్‌గా వున్నందున విచక్షణాధికారం పేరుతో ముందు అధికార పీఠాన్ని సంపాదిస్తే తరువాత గతంలో మాదిరి ఏదో విధంగా దాన్ని నిలబెట్టుకోవచ్చని బిజెపి వేసిన ఎత్తుగడలు అనూహ్యంగా చిత్తయ్యాయి. తమకున్న బలానికి మరికొందరు మద్దతిస్తారని లేఖ ఇవ్వటం తప్ప ఎవరు, ఎలా ఇస్తారో ఎడ్డియూరప్ప చెప్పలేదు. మరోవైపు తమకు 117 మంది మద్దతు వుందని సంతకాలతో సహా కాంగ్రెస్‌-జెడిఎస్‌ లేఖ అందచేసినప్పటికీ గవర్నర్‌కు నమ్మకం కుదరలేదని తిరస్కరించటంతోనే కుట్రకు తెరలేచింది. లేఖలో వారం రోజుల గడువు అడిగితే గవర్నరు పదిహేను రోజులు ఇవ్వటం కూడా బిజెపి వ్యూహంలో తరువాత వచ్చిన ఆలోచన పర్యవసానమే.

బిజెపి పధక రూపకర్తలు ఎక్కడ పప్పులో కాలేశారు. కాంగ్రెస్‌ కోర్టుకు వెళ్లనున్నదని తెలిసి కోర్డు సమయం ముగిసిన తరువాత గవర్నర్‌ కార్యాలయం నుంచి లేఖ తెప్పించుకోవటం, తిరిగి కోర్టు తెరిచే లోపల ప్రమాణ స్వీకార తతంగాన్ని ముగించి కోర్టు ఆటంకాన్ని తప్పించుకోవచ్చనేంత వరకు వారు తెలివిగానే వ్యవహరించారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్‌ మిశ్రా అర్ధరాత్రి తలుపు తట్టిన కాంగ్రెస్‌ నేతల వినతిని మన్నించి అప్పటి కప్పుడు విచారణ బెంచిని ఏర్పాటు చేసి తెల్లవార్లూ విచారణ జరపటాన్ని మాత్రం వారు వూహించలేదు. తమకు వున్న మెజారిటీ గురించి గవర్నర్‌కు ఇచ్చిన లేఖలో పేర్కొనకపోవటంతో ధర్మాసనం బలనిరూపణకు ఒక రోజు మాత్రమే ఇవ్వటంతో తీరికగా చేపలకు గాలాలు విసురుదామనుకున్న కమలనాధుల ఎత్తులు చిత్తయ్యాయి. బిజెపి నుంచి వెళ్లిపోయి కాంగ్రెస్‌ తరఫున గెలిచిన ఏడుగురిని ఎలాగైనా తమవైపు తిప్పుకోవచ్చని కమలనాధులు భావించారు. అందుకే మీడియాకు అనధికారికంగా ఆ ఏడుగురు తమవైపే అన్న ధీమాతో వుప్పందించారు.

ఎంతకైనా తెగించే బిజెపి తీరుతెన్నుల గురించి జాగ్రత్తపడిన కాంగ్రెస్‌ాజెడిఎస్‌లు తమ సభ్యులను కాపాడుకొనేందుకు గట్టి చర్యలు తీసుకోవటంతో ఎడ్డి మడ్డి వ్యవహారం బెడిసి కొట్టింది. కర్ణాటకలో బిజెపి గతంలో అధికారం వెలగబెట్టినప్పటికీ ఇప్పుడే మొదటిసారి దక్షిణాదిన తమ పాదం మోపుతున్నామనే భ్రమ కలిగే విధంగా ఆ పార్టీ నేతలు ప్రయత్నించారు. దానికి మీడియాకూడా ఎలాంటి వెనుక ముందులు చూడకుండా నిజమే అన్నట్లు ప్రచారం చేసింది. ఇక్కడ బిజెపికి ఎదురైన సమస్యలేమిటి? 2008లో కాంగ్రెస్‌తో సంకీర్ణం నుంచి బయటకు వచ్చిన జెడిఎస్‌ను బిజెపి దగ్గరకు తీసి తనకు అధిక సీట్లు వున్నప్పటికీ జెడిఎస్‌ నేత హెచ్‌డి కుమారస్వామిని ముఖ్యమంత్రిని చేసింది. అయితే బిజెపితో స్నేహం ధృతరాష్ట్ర కౌగిలి వంటిదని జెడిఎస్‌కు త్వరలోనే అర్ధమై బిజెపి నుంచి దూరం జరిగింది. ఈ ఎన్నికలలో కూడా అదే విధంగా బిజెపి పెద్ద పార్టీగా, కాంగ్రెస్‌, జెడిఎస్‌లు రెండు, మూడు స్ధానాలలో నిలిచాయి. దక్షిణాదిలో తమ పార్టీ విస్తరణలో భాగంగా ఎట్టి పరిస్ధితిలోనూ తమ పార్టీనేతనే ముఖ్యమంత్రిగా చేయాలని బిజెపి ఎప్పుడో నిర్ణయించుకుంది. అవసరమైతే జెడిఎస్‌ను తమ జూనియర్‌ భాగస్వామిగానే వుంచుకోవాలనుకుంది. అందుకే ప్రధాని నరేంద్రమోడీ ఎన్నికల ప్రచారంలో దేవెగౌడమీద ఎక్కడ లేని గౌరవం ఒలకపోశాడు. అవసరమైతే ఈ సారి కూడా ముఖ్యమంత్రిగా కుమారస్వామిని చేయాలని, ఒక రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా తమ వారు లేకపోయినా ఇబ్బంది లేదు అని బిజెపి అనుకొని వుంటే పరిస్ధితులు భిన్నంగా వుండేవి. గతంలో కలిగిన అనుభవం దృష్టిలో వున్నప్పటికీ కాంగ్రెస్‌ వివేకం ప్రదర్శించి బేషరతుగా జెడిఎస్‌కు మద్దతు ప్రకటిస్తుందని బిజెపి వూహించలేకపోయింది. దాంతో ప్రలోభాల బాట పట్టింది, భంగపడింది.

మూడు పార్టీలలో అవకాశవాదులు, పదవీ వ్యామోహపరులకు కొదవేమీ లేదు . అధికారం ఎక్కడ వుంటే అక్కడకు చేరే వాతావరణం వున్న ఈ రోజుల్లో బిజెపి ప్రలోభాలకు కాంగ్రెస్‌,జెడిఎస్‌ కూటమిలోని ఎంఎల్‌ఏలు ఎందుకు ప్రభావితం కాలేదు అన్నది పెద్ద ప్రశ్న. ఇదే పరిస్ధితి ఒక ఏడాది ముందు వచ్చి వుంటే ప్రలోభాలు పని చేసి వుండేవన్నది పరిశీలకుల అభిప్రాయం. ఇప్పుడెందుకు పని చేయలేదు. కేంద్రంలో బిజెపి అన్ని రంగాలలో విఫలమైందని జనం గుర్తించటం ప్రారంభమైంది.గత లోక్‌సభ ఎన్నికలలో 17 సీట్లు, 43శాతం ఓట్లు, 130 అసెంబ్లీ నియోజకవర్గాలలో మెజారిటీ తెచ్చుకున్న బిజెపి ఈ సారి 104సీట్లకు, 36శాతం ఓట్లకే పరిమితం అయింది. అంటే నరేంద్రమోడీని చూసి జనం ఓట్లెయ్యరు అన్నది స్పష్టం. దీర్ఘకాలం ముఖ్య మంత్రిగా వున్న గుజరాత్‌లో నరేంద్రమోడీ చెమటోడ్చితిరిగినా చావు తప్పి కన్నులట్టపోయినట్లుగా బిజెపి బతికి బయటపడింది. వుత్తరాదిన ఆ పార్టీ గతంలో మాదిరి ఓట్లను అకర్షించే స్ధితిలో లేదని అనేక రాష్ట్రాల వుప ఎన్నికలలో బిజెపి ఓడిపోవటం స్పష్టం చేసింది. 2014లో బిజెపి స్వంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటానికి అవసరమైన సీట్లు 282 తెచ్చుకున్నప్పటికీ దానికి వచ్చిన ఓట్లు 31.34 శాతమే, దాని మిత్రపక్షాలవి కలుపుకున్నా వచ్చినవి 38.5శాతమే. ప్రతిపక్ష పార్టీల ఓట్లు చీలిపోవటం కారణంగానే బిజెపి అన్ని సీట్లు తెచ్చుకుందన్నది స్పష్టం. ఈసారి బిజెపిని ఓడించేందుకు ప్రతిపక్ష పార్టీలన్నీ సర్దుబాటు చేసుకుంటాయన్న వాతావరణం రోజురోజుకూ బలపడుతోంది. పెద్ద రాష్ట్రమైన వుత్తర ప్రదేశ్‌లో వుప్పు-నిప్పుగా వుండే ఎస్‌పి, బిఎస్‌పి పార్టీలు రెండు లోక్‌సభ వుప ఎన్నికలలో ఐక్యంగా పోటీ ఇచ్చి బిజెపి అభ్యర్ధులను ఓడించాయి. గత నాలుగు సంవత్సరాల కాలంలో ఎన్‌డిఏ నుంచి బయటకపోయినవి తప్ప కొత్తగా ఒక్క పార్టీ కూడా చేరే పరిస్ధితి లేదన్నది స్పష్టం కావటం. ఆరు నెలల్లో రాజస్ధాన్‌,మధ్యప్రదేశ్‌, చత్తీస్‌ఘర్‌ల ఎన్నికలతో పాటు లోక్‌సభ ఎన్నికలకు నరేంద్రమోడీ సన్నద్దమౌతున్నారన్నది స్పష్టంగా కనిపించటం. మోడీ భవితవ్యమే ఎలావుంటుందో తెలియనపుడు బిజెపితో జట్టుకడితే ఆరునెలల్లో పరిస్ధితి తారుమారైతే తమ పరిస్ధితి ఏమిటన్న దూరాలోచన కూడా అవకాశ వాదులలో తలెత్తి వుండవచ్చు. అందువలన తాత్కాలికంగా ప్రలోభాలకు లంగకపోయినప్పటికీ అవకాశవాదులతో ఆ ముప్పు ఎప్పుడూ మెడమీద కత్తిలా వేలాడుతూనే వుంటుంది.

ఈ ఎన్నికలు బిజెపి అవకాశవాదం,అప్రజాస్వామిక చర్యలను ఎంతగానో బయట పెట్టాయి. అనేక మంది ఆ పార్టీ అభిమానులుగా వున్నవారు పరస్పర విరుద్దమైన వాదనలు చేయటాన్ని సమర్ధించుకోలేని స్ధితిలో పడ్డారు. మెజారిటీ కూటమిని కాదని, మెజారిటీ లేని పార్టీ పెద్దది అనే పేరుతో ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించిన గవర్నర్‌ చర్యను సుప్రీం కోర్టులో సవాలు చేశారు. దాని మీద పదివారాల తరువాత విచారణకు చేపట్టనుంది. గతంలో వివిధ సందర్భాలలో ఇచ్చిన తీర్పులు వున్నప్పటికీ వాటికి తమదైన భాష్యాలు చెబుతూ గవర్నర్‌ విచక్షణాధికారాల పేరుతో కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో వుంటే ఆ పార్టీ అవకాశవాదానికి పాల్పడుతున్నది. దీని మీద కూడా మరింత స్పష్టత వచ్చే విధంగా సుప్రీం తీర్పు వుండవచ్చని అనేక మంది ఆశిస్తున్నారు. ఎన్నికల ముందు దుమ్మెత్తి పోసుకొని వ్యతిరేకంగా పోటీ చేసిన పార్టీలు తరువాత కూటమి కట్టటం ఏమిటని బిజెపి ఒక వాదనను ముందుకు తెచ్చింది, దాని గురించి ఢిల్లీ నుంచి గల్లీ నేతల వరకు గుండెలు బాదుకుంటున్నారు.

గోవా, మేఘాలయ, మిజోరాం రాష్ట్రాలలో ఎన్నికలలో తలపడిన పార్టీలు, స్వతంత్రులతో జతకట్టిన బిజెపి, అదే కర్ణాటకలో జరిగితే తప్పుపట్టటం ఏమిటన్న చర్చ పెద్ద ఎత్తున జరిగింది. బీహార్‌లో నితీష్‌ కుమార్‌ నాయకత్వంలోని జెడియు, బిజెపి ఎంత హోరాహోరీగా పోటీ చేసింది, పరస్పరం ఎన్నిమాటల తూటాలను ప్రయోగించిందీ చూశాము. అలాంటి నితీష్‌ కుమార్‌కు మద్దతు ఇవ్వటానికి బిజెపికి, తీసుకోవటానికి నితీష్‌ కుమార్‌కు ఎలాంటి సమస్య ఎదురు కానపుడు కాంగ్రెస్‌-జెడిఎస్‌ను ఎందుకు తప్పుపడుతున్నట్లు ? ఇలాంటి విషయాలన్నీ అటు ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియాలోనూ, సామాజిక మాధ్యమంలోనూ పెద్ద చర్చనీయాంశమయ్యాయి. ఇంతకాలం కాంగ్రెస్‌ను విమర్శించిన బిజెపి ఆచరణలో అదేపని చేస్తున్నదనే అంశాన్ని ఈ సందర్భంగా అదనంగా మరికొంత మంది గ్రహించారు. ఇవన్నీ రాబోయే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలలో బిజెపి ఏతర పార్టీలు తగిన జాగ్రత్తలు తీసుకొనేందుకు దాని అధికార దుర్వినియోగాన్ని ఎదుర్కొనేందుకు జాగరూకతతో వుండేందుకు ఈ వుదంతం తోడ్పడింది.

కొన్ని ప్రాంతీయ పార్టీల తీరు తెన్నులను కూడా ఇది వెల్లడి చేసింది. పొరుగునే వున్న రాష్ట్రానికి వెళ్లి జెడిఎస్‌కు మద్దతు ప్రకటించి వచ్చిన తెలంగాణా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు లేదా టిఆర్‌ఎస్‌ అక్కడి పరిణామాలపై మౌనం దాల్చటం అనేక అనుమానాలను రేకెత్తిస్తున్నది. లోపాయకారీగా బిజెపితో అవగాహన నిజమే అనేందుకు ఆస్కారం కలిగించింది.తాము మద్దతు ఇచ్చిన జెడిఎస్‌ నాయకుడే ముఖ్యమంత్రి అవుతున్నా టిఆర్‌ఎస్‌కు అది ఇబ్బంది కలిగించే అంశమే. ఎందుకంటే తెలంగాణాలో తమను సవాలు చేస్తున్నది కాంగ్రెస్‌ కావటం, ఆ పార్టీ మద్దతుతోనే కుమారస్వామి కర్ణాటక ముఖ్య మంత్రి కావటం టిఆర్‌ఎస్‌ వూహించిన పరిణామం కాదు. మరొక ఫ్రంటు అంటూ కెసిఆర్‌ చేస్తున్న యత్నాలకు ఇది చెప్పులో రాయిలా ఇబ్బంది పెట్టే అంశమే.

తమతో కలసి అధికారంలో భాగస్వాములౌతూనే వైఎస్‌ఆర్‌సిపితో కధనడుపుతున్న బిజెపితో తెలుగుదేశం పార్టీ తెగతెంపులు చేసుకొనేందుకు ప్రత్యేక రాష్ట్రహోదా కల్పనలో వాగ్దాన భంగాన్ని తెరమీదకు తెచ్చింది. కర్ణాటకలో ఒక వేళ బిజెపి గెలిస్తే తదుపరి తమను వేధిస్తారనే అనుమానం కలగటం లేదా అలాంటి సూచనలు కనపడటం వలనగానీ తెలుగుదేశం నేతలు కర్ణాటకలో కాంగ్రెస్‌, జెడిఎస్‌ను గెలిపించమని చెప్పలేదు గానీ బిజెపిని ఓడించమని ప్రచారం చేశారు. అంటే బిజెపి మీద ఎవరు గెలిచే సత్తా వుంటే వారిని గెలిపించమన్నదే దాని అంతరార్ధం. ఇప్పుడు ఆ రెండు పార్టీల మధ్య అంతరం మరింత పెరిగింది. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీలో ఏదో ఒక చీలిక, సంక్షోభానికి తెరలేపనున్నదనే వార్తలు గుప్పుమంటున్నాయి. వుక్రోషంతో బిజెపి అందుకు పాల్పడినా ఆశ్చర్యం లేదు. అయితే అలాంటిదేదో జరగాలని తెలుగుదేశం కూడా అంతరంగంలో కోరుకుంటున్నదని పరిశీలకులు భావిస్తున్నారు. ఇప్పటికే ప్రత్యేక హోదాపై బిజెపి ద్రోహం చేసిందనే ప్రచారం చేస్తున్న ఆ పార్టీనేతలపై కొత్త కేసులు పెట్టినా పాత కేసులను తిరగదోడినా తమపై వేధింపులకు పూనుకుందంటూ బాధిత ఫోజు పెట్టి జనం ముందుకు వెళ్లే అవకాశాలున్నాయి. కర్ణాటకలో తమ గురించి గొప్పలు చెప్పుకుంటున్న బిజెపికి, ఇతర పార్టీలకు గత ఎన్నికలలో వచ్చిన ఓట్ల, సీట్ల వివరాలు ఇలా వున్నాయి.పార్టీల వారీ వచ్చిన ఓట్ల శాతం,బ్రాకెట్లలోని అంకెలు వచ్చిన సీట్ల సంఖ్య)

సంవత్సరం బిజెపి            కాంగ్రెస్‌          జెడి(ఎస్‌)    ఇతరులు

2004    28.33(79) 35.27(65)   20.77(58) 15.3(22)

2008    33.86(110) 35.13(80)  19.44(28) 11.57(6)

2013     19.90(40) 36.60(122)  20.20(40) 24.40(22)

2018      36.20(104) 38.00(78)  18.40(38) 7.40 (2)

లోక్‌సభ ఎన్నికలు కర్ణాటక ఓట్లు సీట్ల వివరాలు

2009 41.63(19) 37.5(6) 13.57(3) 5.20(0)

2014 43.00(17) 40.80(9) 11.00(2) 5.20(0)

నరేంద్రమోడీ, అమిత్‌ షా మాజిక్‌ లేనపుడు, అసలు వారెవరో కర్ణాటక ఓటర్లకు తెలియనపుడే 2009లోక్‌సభ ఎన్నికలలో గరిష్టంగా ఆ పార్టీకి 41.63శాతం ఓట్లు వచ్చాయి. 2014 ఎన్నికలలో 43శాతం ఓట్లు వచ్చాయి. అది ఇప్పుడు 36.2శాతానికి పడిపోయింది. నరేంద్రమోడీ, అమిత్‌ షాపర్యటన కారణంగా బిజెపి పెరిగిన ఓటింగ్‌ శాతమేమీ లేదు, అలాగని రాహుల్‌ గాంధీ ప్రచారం కారణంగా కాంగ్రెస్‌కు తగ్గిందేమీ లేదు. 2014 పార్లమెంట్‌ ఎన్నికలలోనే ఎడ్డియూరప్ప, గాలి సోదరులు అండ్‌కో కలిసిన కారణంగా బిజెపి ఓటింగ్‌ 43శాతానికి పెరిగి ఈ అసెంబ్లీ ఎన్నికలలో 36.2శాతానికి తగ్గింది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

లోక్‌సభ ముందస్తు ఎన్నికలను ముందుకు తెచ్చే గుజరాత్‌ విజయం ?

19 Tuesday Dec 2017

Posted by raomk in BJP, Congress, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

BJP, Congress party, gujarat election verdict, lok sabha midterm polls, Narendra Modi

ఎం కోటేశ్వరరావు

గుజరాత్‌ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఎలాగైతేనేం అక్కడ మా మోడీ విజయం సాధించాడా లేదా అని బుర్రలో గాక మరెక్కడో మెదళ్లున్నవారు చేసే వాదనలు పట్టించుకోనవసరం లేదు. ఎందుకంటే అలాంటి అలగా తరగతి ఎప్పుడూ అన్ని పాలకవర్గ పార్టీల వెనుకా వుంటుంది. ఇలాంటి వారు నిజంగా ప్రజాస్వామ్యానికి ముప్పు తెచ్చే శక్తులకు వుత్తేజమిస్తుంటారు. తాము అధికారంలోకి వస్తే, విదేశాల్లోని నల్లధనాన్ని తెచ్చి బ్యాంకు ఖాతాల్లో తలా పదిహేను లక్షల రూపాయలు వేస్తామన్నట్లుగా ఎన్నికల ప్రచారంలో జనాన్ని నమ్మించారు. ఇదేమిటయ్యా అమిత్‌ షా అని ఎన్నికల తరువాత అడిగితే ఎన్నికల జుమ్లా , ఓట్ల కోసం అనేకం చెబుతుంటాం అని చిరునవ్వు నవ్వేశాడు. గుజరాత్‌లో ఈసారి తమకు 150 సీట్లు వస్తాయని ఆ పెద్దమనిషే ప్రచారం చేశాడు. అవెక్కడ అంటే జుమ్లా అని మరోసారి నవ్వేస్తారు. సోమవారం నాడు ఓట్ల లెక్కింపు సందర్భంగా కొన్ని గంటల పాటు బిజెపి నేతలకు ముచ్చెమటలు పట్టాయి.

సంఘపరివార్‌ ప్రయోగశాల గుజరాత్‌. గత రెండు దశాబ్దాలుగా మైనారిటీల వ్యతిరేక, మెజారిటీ అనుకూల మతోన్మాదాన్ని రెచ్చగొట్టి ఓటు బ్యాంకును తయారు చేసేందుకు అది చేయని అవాంచనీయ చర్యలు లేవు.అలాంటి చోట కూడా బిజెపి చావుతప్పి కన్నులొట్టపోయినట్లుగా స్వల్పమెజారిటీతో అధికారాన్ని నిలుపుకుంది. సమగ్ర విశ్లేషణలకు సమాచారం ఇంకా అందుబాటులోకి రావాల్సి వుంది. పూర్తిగా పట్టణ లేదా లేదా అత్యధిక భాగం పట్టణ ఓటర్లున్న 53 నియోజకవర్గాలలో బిజెపి 45చోట్ల గెలిచింది. కాంగ్రెస్‌ విషయానికి వస్తే 129 గ్రామీణ నియోజకవర్గాలలో 72 చోట్ల గెలిచింది. మతోన్మాదం పట్టణాలలో ఎక్కినంతగా గ్రామీణంలో ఎక్కదని, ఎక్కినా వ్యవసాయ సంక్షోభంలో తమకు మతం వండి వార్చేదేమీ వుండదని గ్రామీణులు గ్రహిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఇదొక మంచి సంకేతం. పట్టణ ప్రాంతాలలో కూడా బిజెపి సీట్లు తెచ్చుకున్నప్పటికీ దాని ఓట్లు 2014తో పోల్చితే పదకొండు శాతం వరకు తగ్గాయి. ఈ పరిణామం కూడా బిజెపి ఆందోళన కలిగించేదే. మొత్తం మీద చూసినపుడు లోక్‌సభ ఎన్నికలతో పోల్చితే బిజెపి ఓట్లు 10.2 నుంచి 10.9 మధ్య తగ్గగా ఇదే సమయంలో కాంగ్రెస్‌ ఓట్లు 6.2 నుంచి 10.8శాతం వరకు పెరిగాయి. అంటే బిజెపికి తగ్గిన ఓట్లు పూర్తిగా కాంగ్రెస్‌కు పడలేదు.

ఒక నమూనా రాష్ట్రంగా అభివృద్ధి చేశానని చెప్పుకున్న చోటే నరేంద్రమోడీ ఆ విషయం మినహా మిగతా విషయాలన్నీ ముందుకు తెచ్చారు. కాంగ్రెస్‌ నేత నీచ్‌ కిసామ్‌కా ఆద్మీ( నీచపు పనులు చేసే వ్యక్తి) అని చేసిన వ్యాఖ్యకు కాళిదాసు కవిత్వానికి తన పైత్యాన్ని జోడించినట్లుగా గుజరాత్‌లో అత్యధికంగా చదివే గుజరాత్‌ సమాచార్‌ పత్రిక ‘మోడీ నీచ్‌ జాతినో మానాస్‌ ఛే (ఒక తక్కువ కులంలో పుట్టిన మోడీ) అన్నట్లుగా కులాన్ని, మోడీ పేరును జతచేసి మొదటి పేజీలో సంచలనాత్మకంగా ప్రకటించి చివరి క్షణంలో బిజెపికి మేలు చేసింది. కీలక సమయాల్లో మీడియా ఎలాంటి పాత్ర పోషించగలదో ఈ ఎన్నికలు నిరూపించాయి. బిజెపి, మోడీ మీద కోపంతో ఓటర్లు మరొక ప్రత్యామ్నాయం లేదు కనుక కాంగ్రెస్‌కు ఓట్లు వేశారు తప్ప నిజానికి కాంగ్రెస్‌ మీద అభిమానం కలగటానికి ఒక ప్రతిపక్షంగా గత రెండు దశాబ్దాలలో అక్కడ అది చేసిందేమీ లేదు. ఈ పూర్వరంగంలో గుజరాత్‌ ఎన్నికల ఫలితాల పర్యవసానాలు ఎలా వుంటాయి అన్నది చర్చనీయాంశంగా ముందుకు వస్తోంది.

బిజెపికి పోటీగా మరో పార్టీలేని చోట్ల తమవైపు తిరిగి ఓటర్లు మొగ్గుతారని కాంగ్రెస్‌లో ఆశలు రేగుతాయి. అనేక పార్టీలున్న చోట్ల ఎవరికి వారే తామే ప్రత్యామ్నాయంగా ఓటర్ల ముందుకు వచ్చేందుకు కాంగ్రెసేతర పార్టీలు పోటీ పడతాయి. కాంగ్రెస్‌ మాత్రమే ప్రధాన ప్రతిపక్షంగా వున్న చోట్ల ఆప్‌, బిఎస్‌పి వంటి పార్టీలు దెబ్బతింటాయి. ఓటర్లు తమకు ఇష్టం వున్నా లేకపోయినా బిజెపిపై తలెత్తిన అసంతృప్తితో నిఖరంగా ఆ పార్టీని ఓడించగల శక్తివైపే మొగ్గు చూపవచ్చు.ప్రాంతీయ పార్టీలు బలంగా వున్న చోట్ల కాంగ్రెస్‌ పరిస్ధితి ఇప్పుడున్న మాదిరే వుండవచ్చు లేదా దిగజారవచ్చు. అటు కాంగ్రెస్‌ లేదా బిజెపి బలంగా లేని తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ వంటి చోట్ల ఇప్పటి వరకు బిజెపితో అంటకాగిన లేదా బిజెపి పంచన చేరాలని చూస్తున్న పార్టీలలో పునరాలోచన మరింత తీవ్రంగా జరగవచ్చు. ప్రాంతీయ పార్టీలను మింగి తాను ఎదగాలని బిజెపి చూస్తున్న మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ వంటి చోట్ల గుజరాత్‌ ఫలితాలు బిజెపిని ఇరుకున పెడతాయి.శివసేన, తెలుగుదేశం వంటి పార్టీలు నష్ట నివారణ చర్యలకు దిగుతాయి, సమయం వచ్చినపుడు, వాటంగా వుంటే బిజెపిని వదలిపోయినా ఆశ్చర్యం లేదు.

ఆంధ్రప్రదేశ్‌లో బిజెపి తాను బలపడేందుకు అటు తెలుగుదేశం, ఇటు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఏది వాటంగా వుంటే దానితో వుండేందుకు గల అవకాశాలను చూస్తున్నది. రాష్ట్రానికి ప్రత్యేక హోదాను నిరాకరించిన బిజెపి దాని కంటే మెరుగైన ప్రత్యేక పాకేజీ ఇస్తామని చెప్పి దానికి కూడా మొండి చేయి చూపింది. పోలవరం ప్రాజెక్టు నిధుల గురించి అటు తెలుగుదేశం పార్టీ ఇటు బిజెపి ఎవరి నాటకాన్ని వారు బాగారక్తి కట్టిస్తున్నారు. ఒక వేళ బిజెపి తో తెగతెంపులు చేసుకొంటే రాష్ట్రానికి బిజెపి చేసిన ఈ ద్రోహాలను జనం ముందు పెట్టి తెలుగుదేశం ఒంటి కంటితో( ఎందుకంటే చంద్రబాబు రెండు కళ్ల సిద్దాంతం ప్రకారం మరో కన్ను తెలంగాణా కనుక ఆయనకు మిగిలింది మరొకటి మాత్రమే అనే అవగాహనతో) ఏకధారగా నీరు గార్చి ఓటర్ల ముందుకు వెళ్లేందుకు ఇప్పటికే రంగం సిద్ధం చేసుకొని ముందస్తు ఎన్నికలకు పోవాలని ఆలోచన చేస్తున్నారన్నది బలంగా వినిపిస్తున్న వార్తలు. ఇక వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ విషయానికి వస్తే గుజరాత్‌ ఫలితాలు జగన్‌లో ముఖ్యమంత్రి పీఠంపై మరింతగా ఆశలు పెంచవచ్చు. ఒక ప్రతిపక్షంగా విఫలమైనప్పటికీ గుజరాత్‌ ఓటర్లు బిజెపి మీద వ్యతిరేకతతో కాంగ్రెస్‌కు ఓటు వేసినట్లే ఆంధ్రప్రదేశ్‌లో వున్న ప్రధాన ప్రతిపక్షం తామే గనుక తమ మీద ఇష్టం వున్నా లేకపోయినా చంద్రబాబు మీద వ్యతిరేకతతో జనం ఓట్లు వేస్తారనే ఆశలు కలగవచ్చు.

ఇక బిజెపి విషయానికి వస్తే అన్ని పార్టీల కంటే గుజరాత్‌లో గెలిచిన సంతోషం కంటే దాని పర్యవసానాల గురించి ఆందోళన పెరగటం ఖాయం. పార్టీలో నరేంద్రమోడీ ఏకపక్ష వైఖరితో ఇప్పటికే తిరుగుబాటు బావుటా ఎగురవేస్తున్న శక్తులు మరింతగా దాడిని పెంచుతాయా లేక మొదటికే మోసం వస్తే ఎలా అని సర్దుబాటు చేసుకుంటాయా అన్నది ఒక అంశం. అధికారమే పరమావధిగా వుండే పాలకపార్టీలలో అత్యధిక సందర్భాలలో బాధితులు రాజీపడిన సందర్భాలు తక్కువ. గ్రామీణుల ఆదాయాలను రెట్టింపు చేసి అదనంగా అన్న వస్త్రాలను అంద చేస్తామని చెప్పిన నరేంద్రమోడీ విధానాలు వున్న వస్త్రాలను కూడా లాగివేస్తున్నాయి. లోకసభ ఎన్నికల నిర్దిష్ట గడువు వరకు పరిస్ధితి ఇలాగే వుంటే పట్టణ ప్రాంతాలతో పాటు అంతకంటే ఎక్కువగా గ్రామీణంలో బిజెపి వ్యతిరేకత పెరగటం అనివార్యం.

బిజెపి లేదా కాంగ్రెస్‌ గానీ ప్రజావ్యతిరేక, ద్రవ్యపెట్టుబడిదారీ అనుకూల, ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయద్రవ్యసంస్ధ ఆదేశిత విధానాల అమలులో తక్షణమే వెనక్కు తిరిగి రాలేనంతగా కూరుకుపోయాయి. వాటిని మరింత వేగంగా, ఎక్కువగా అమలు జరపాలనే వత్తిడి పెరుగుతోంది. అదే జరిగితే గ్రామీణ వ్యవస్ధ మరింత తీవ్ర సంక్షోభానికి గురి కావటం అనివార్యం. నరేంద్రమోడీ విషయానికి వస్తే తాను ప్రజలకు చేసిన వాగ్దానాలకంటే పైన చెప్పుకున్న శక్తుల విధానాల అమలుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రపంచ బ్యాంకు ప్రతి ఏటా రూపొందించే సులభతర వాణిజ్య ర్యాంకులో మోడీ సర్కార్‌ ఏకంగా 130 నుంచి వందవ స్ధానానికి ఎగబాకింది. ప్రపంచ ధనిక దేశాలలో ప్రారంభమైన తీవ్ర ఆర్ధిక సంక్షోభం 2018లో పదవ సంవత్సరంలో ప్రవేశించనుం ది. అది ఎప్పటికి పరిష్కారం అవుతుందో, కనీసం సంక్షోభ పూర్వపు స్ధాయికి అయినా ఎప్పుడు వస్తుందో తెలియని స్ధితి. దాని పర్యవసానాలు మన ఆర్ధిక వ్యవస్ధపై బలంగా పడే సమయంలో నరేంద్రమోడీ అధికారానికి వచ్చారు. గత మూడున్నర సంవత్సరాలలో వుత్పాదక, ఎగుమతి రంగాలలో దిగజారుడు ఆ సంక్షోభపర్యవసానాలే. అయితే చమురు ధరలు గణనీయంగా పడిపోవటంతో దిగుమతుల బిల్లు తగ్గిపోయి జనానికి పెద్దగా నొప్పి కలగలేదు. గత కొద్ది నెలలుగా చమురు ధరలు పెరుగుతున్నాయి, రానున్న రోజుల్లో మరింతగా పెరుగుతాయని జోశ్యం చెబుతున్నారు. ఇప్పటికే లీటరుకు పది రూపాయలకు పైగా ధరలు పెరిగాయి, కిరోసిన్‌, గ్యాస్‌ సబ్సిడీ క్రమంగా తగ్గిస్తున్నారు. ఇప్పటి మాదిరే వున్నప్పటికీ మన దిగుమతుల బిల్లు పెరిగిపోయి, దానిని సర్దుబాటు చేసేందుకు వ్యవసాయ రంగానికి, ఇతర సంక్షేమ చర్యలకు ఇస్తున్న సబ్సిడీలను మరింతగా కోత పెట్టటం, లేదా పన్ను భారాలను పెంచటం మినహా మరొక దగ్గరదారి లేదు. వీటన్నింటినీ చూసినపుడు ఏం చేసినా అది మోడీ ప్రతిష్టను మరింత దిగజార్చుతుంది. అందువలన గడువుకు ముందే ముందస్తున్న ఎన్నికలకు పోతారని గత కొంతకాలంగా వినవస్తున్నది. గుజరాత్‌లో భారీ మెజారిటీతో గెలిస్తే దాన్ని చూపి దేశమంతటా ప్రచారం చేసేందుకు ముందుస్తున్న ఎన్నికలకు పోతారని ముందుగానే పండితులు అంచనాలు వేశారు. ఇప్పుడు గెలిచినా దాన్ని పెద్దగా చెప్పుకొని సంబర పడే స్దితి లేదు.వచ్చే ఏడాది ఎన్నికలు జరగాల్సిన రాష్ట్రాలలో మధ్యప్రదేశ్‌, రాజస్ధాన్‌, చత్తీస్‌ఘర్‌ బిజెపి పాలితం కాగా కర్ణాటక కాంగ్రెస్‌, త్రిపుర సిపిఎం ఏలుబడిలో వున్నాయి. వాటి ఫలితాలు కూడా లోక్‌సభ ఎన్నికలను ప్రభావితం చేస్తాయి. బిజెపి పాలిత రాష్ట్రాలలో ప్రభుత్వ వ్యతిరేకత వ్యక్తమైతే అది రాజకీయంగా బిజెపికి నష్టం. ఇది కూడా ముందస్తు ఎన్నికలను ముందుకు తెస్తుందనే చెప్పవచ్చు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

నేరగాడు గుర్మీత్‌: కాంగ్రెస్‌ాబిజెపి బాధ్యత ఎంత ?

27 Sunday Aug 2017

Posted by raomk in BJP, Communalism, Congress, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, RELIGION

≈ Leave a comment

Tags

BJP, cbi, Congress party, Gurmeet Ram Rahim Singh, Narendra Modi, rape, rape case

ఎం కోటేశ్వరరావు

డేరా సచ్చా సౌదా ఆశ్రమాల అధిపతి గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌ ఇద్దరు భక్తురాండ్రపై జరిపిన అత్యాచారం కేసులలో నేరగాడని వినాయకచవితి రోజున పంచకుల సిబిఐ కోర్టు నిర్ధారించింది. శిక్ష ఎంత అనేది సోమవారం నాడు ప్రకటించనున్నారు. కోర్టు తీర్పు వెలువడగానే నిరసిస్తూ గుర్మీత్‌ అనుచరులు పంజాబ్‌, హర్యానా, ఢిల్లీ, వుత్తర ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలలో హత్య, హింసాకాండకు పాల్పడ్దారు. పంచకుల నగరం తీవ్రంగా ప్రభావితమైంది.కేంద్ర పాలిత ప్రాంతమైన చండీఘర్‌కు ఒక వైపున క్రికెట్‌ అభిమానులందరికీ తెలిసిన మొహాలీ లేదా ఎస్‌ఎఎస్‌ నగర్‌ మరోవైపు పంచకుల వుంది. వీటిని త్రినగరాలు అంటారు. చండీఘర్‌ కేంద్రపాలనలో మొహాలీ పంజాబ్‌, పంచకుల హర్యానాపాలనలో వుంటాయి. మూడూ ఆధునిక నగరాలే. గుర్మీత్‌ అత్యాచార నిర్ధారణ తీర్పు పర్యావసానం అనేక అంశాలను జనం ముందుంచింది.

ఢిల్లీలో ఒక నిర్భయపై జరిపిన అత్యాచార వుదంతానికి నిరసనగా నిందితుడిని శిక్షించాలని వేలాది మందిని వీధుల్లోకి రప్పించింది. తన ఆశ్రమంలో సేవ చేసేందుకు వచ్చిన ఇద్దరు నిర్భయలపై గుర్మీత్‌ జరిపిన అత్యాచార వుదంతంలో అతగాడిని శిక్షించకూడదంటూ లక్షలాది మంది వీధుల్లోకి రావటం, వున్మాదంతో హింసాకాండకు పాల్పడటం దేశాన్ని విస్మయపరుస్తోంది. ఢిల్లీ నిర్భయ వుదంతంపై దేశమంతా ఏకతాటిగా నిలిచింది. కానీ ఒక బాబా ముసుగులో గుర్మీత్‌ జరిపిన అత్యాచారంపై పరిమితంగా అయినా భిన్న స్వరాలు వినిపించటం ఆందోళన కలిగిస్తోంది. గతంలో గుజరాత్‌లో గోధ్రాపేరుతో జరిపిన మారణకాండతో పోలిస్తే ఇదెంత హ ! హ !! అనుకున్నారో ఏమో ప్రధాని నరేంద్రమోడీ షరా మామూలుగా ఇంతవరకు నోరు విప్పలేదు. ఈ వుదంతం సందర్భంగా మీడియాలో పరిమితంగానే అయినప్పటికీ వెలుగులోకి వచ్చిన అనేక అంశాలు మన రాజకీయ వ్యవస్ధ ముఖ్యంగా అధికారమే పరమావధిగా ఎంత గడ్డికరవటానికైనా కాంగ్రెస్‌, బిజెపి వంటి పార్టీలు(వామపక్షాలకు ఇటు వంటి మరక లేదు) పూనుకుంటాయో అనేక మంది కళ్లు తెరిపిస్తున్నాయి.

గుర్మీత్‌ వంటి శక్తులు తెరముందు ఎలా వున్నా తెరవెనుక నేర,దేశద్రోహ చరిత్రలుంటాయని అందరికీ తెలుసు. అయినప్పటికీ కొత్తగా పుట్టుకువచ్చే యోగులు, యోగినులు, బాబాల చుట్టూ నిరక్షరాస్యులతో పాటు వున్నత విద్యావంతులు కూడా అనేక కారణాలతో తిరగటం, వారికి విశ్వసనీయత కలిగించటం మన దౌర్భాగ్యం. ఎవరిపై అయినా ఒక ఆరోపణ వచ్చినపుడు దానిలో వాస్తవాలు తేలేంత వరకు వారికి కితాబు ఇవ్వకుండా వుండటం కనీస విధి. కానీ అనేక మంది బాబాల మాదిరి ఇతగాడి విషయంలో కూడా కాంగ్రెస్‌, బిజెపి వంటి పార్టీల నేతలు అతడిని ప్రసన్నం చేసుకొని వెనుక వున్న అనుచరుల ఓట్లను రాబట్టుకొనేందుకు కరవని గడ్డి లేదు. ఇప్పుడు ఆ పార్టీల వారు, ఇతరులు త్వశుంఠ, త్వశుంఠ అంటూ ఎవరెంత వెధవాయలో ఒకరి గురించి ఒకరు, స్వయంగా బయట పెట్టుకుంటున్నారు. అవాంఛనీయ సమర్ధనలకు పూనుకుంటున్నారు. ఈ వుదంతంలో కూడా రాజకీయ లబ్ది పొందేందుకు పూనుకున్నారు. ఇలాంటి వారిని అచ్చ తెలుగులో వుచ్చల గుంటలో చేపలు పట్టేరకం అంటారు. కొంత మంది ఈ వుదంతాన్ని దళిత బాబా- అగ్రకుల కుట్ర కోణంలో చూసేందుకు ప్రయత్నించటం గర్హనీయం. డేరా ఆశ్రమాల్లో చేరుతున్నది దళితులు, ఇతర బలహీనవర్గాలే అనుకుంటే అత్యాచారాలు, హత్యలకు గురైంది కూడా ఆ తరగతులకు చెందిన వారే కదా అనే సృహ కనిపించటం లేదు. ఎవరికి చెందిన వారి ఆశ్రమాల్లో ఏ నేరం, అత్యాచారం జరిగినా పట్టించుకోకూడదు అని చెప్నే ప్రమాదకరపోకడ ఇది. మరో విధంగా చెప్పాలంటే మా మనోభావాలను దెబ్బతీస్తే సహించం అ నే వున్మాద లక్షణం తప్ప మరొకటి కాదు.

తన ఓటు బ్యాంకుకు వ్యతిరేకంగా తొలుత ఆశారాంబాపు, తరువాత రాంపాల్‌, ఇప్పుడు గుర్మీత్‌ సింగ్‌ను కనీసం బిజెపి అరెస్టు చేసింది అని చెట్టుకింది ప్లీడరు పాయింట్‌ను బిజెపి అభిమానులు ముందుకు తెచ్చారు. కోర్టుల తీర్పులు లేదా ఇతర అనివార్య పరిస్ధితులలో అధికారంలో ఏ పార్టీ వున్నా ఆపని చేయటం విధి. ఇష్టం లేని పెళ్లికి తలంబ్రాలు పోసినట్లుగా ఇలాంటి బాబాలకు అంటకాగిన వారు వ్యవహరిస్తారు. ఎక్కడిదాకో ఎందుకు గుర్మీత్‌ విషయమే తీసుకుంటే కోర్టు నిర్ణయం వెలువడగానే ప్రముఖులు బసచేసే ఒక వసతి గృహానికి తీసుకు వెళ్లి, దాన్నే జైలుగా మార్చేందుకు హర్యానా బిజెపి పభుత్వ యంత్రాంగం ప్రయత్నించింది. అయితే దాని గురించి మీడియాలో వార్తలు గుప్పుమనటంతో సాధారణ ఖైదీ మాదిరే రోహతక్‌ జైలుకు తరలించాల్సి వచ్చింది. దాన్ని కూడా తమ ప్రభుత్వ ప్రత్యేకతగా చెప్పుకొనేందుకు బిజెపి సేనలు ప్రయత్నించాయి. గుర్మీత్‌కు జడ్‌ తరహా భద్రత కల్పించింది ఎవరు-కాంగ్రెస్‌, గుర్మీత్‌ సింగ్‌ కుమారుడు వివాహం చేసుకున్నది ఎవరిని-పంజాబ్‌ కాంగ్రెస్‌ నేత కూతురిని అంటూ మరొక ప్రచారం. ఇలాంటి సందర్భాలలో బిజెపి మేథావులు అద్భుత ప్రతిభాపాటవాలను ప్రదర్శిస్తారు. హర్యానా బిజెపి అధ్యక్షుడి కుమారుడు ఒక యువతిని వెంటాటి కిడ్నాపో, అత్యాచారమో ఏదో చేయటానికి ప్రయత్నించిన వుదంతం తెలిసిందే. ఆ సందర్భంగా ఆ యువతి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ప్రచారం ప్రారంభించిన విషయం తెలిసిందే. అసలు విషయాన్ని పక్కదారి పట్టించే చౌకబారు ఎత్తుగడలు కాకపోతే గుర్మీత్‌కు కాంగ్రెస్‌ ఇచ్చిన జడ్‌ భద్రతను బిజెపి ఎందుకు కొనసాగించినట్లు? కాంగ్రెస్‌ నేత కూతుర్ని కోడలుగా చేసుకున్న గుర్మీత్‌తో బిజెపి నేతలు ఆయన అనుగ్రహం కోసం ఎందుకు పడిగాపులు పడ్డారు, ఎందుకు రాసుకొని పూసుకొని తిరిగినట్లు ? ఒక కాంగ్రెస్‌ నేత కూతుర్ని తన కోడలుగా చేసుకున్నందుకు గుర్మీత్‌ను తప్పుపట్టనవసరం లేదు. తద్వారా కాంగ్రెస్‌ పాలకుల నుంచి పొందిన లబ్ది ఏదైనా వుంటే దాన్ని తప్పుపట్టాలి. ఇదే ప్రమాణాన్ని బిజెపికి వర్తింప చేస్తే …… సంజయగాందీ భార్య మేనకా గాంధీని,ó కుమారుడు ఫిరోజ్‌ గాంధీని, గబ్బుపట్టిన ఇంకా ఎందరో కాంగ్రెస్‌ నేతలను బిజెపిలో ఎందుకు చేర్చుకున్నట్లు ? స్వయంగా నరేంద్రమోడీ ప్రధాని హోదాలో గుర్మీత్‌కు ప్రణామం చేస్తున్నట్లు చేసిన ప్రకటన మాటేమిటి? ఇది గుర్మీత్‌పై కేసు విచారణలో వుండగానే కదా ! ఒక నిందితుడికి ప్రణామం చేస్తున్నానని ప్రధాని హోదాలో వున్న వ్యక్తి చెప్పటం దేనికి నిదర్శనం, దేశానికి ఎలాంటి సందేశం ఇచ్చినట్లు? ఇలాంటి బాబాలను వెనకేసుకు రావటంలో, వారి నుంచి లబ్ది రాజకీయంతో సహా అన్ని రకాల లబ్దులు పొందటంలో కాంగ్రెస్‌,బిజెపిలు, వాటికి అంటకాగే ఇతర ప్రాంతీయ పార్టీలు పోటీలు పడ్డాయి తప్ప వారికి దూరంగా వుండేందుకు ఎలాంటి ప్రయత్నం చేయలేదు.

ఇతరుల మీద బురద జల్లేందుకు పూనుకున్న బిజెపి పరివారం, వారి మరుగుజ్జుయోధులు(ట్రోల్స్‌) పాలు తాగుతున్న పిల్లి చందం మాదిరి ఎవరూ తమను గమనించటం లేదని అనుకుంటున్నాయి. సాక్షి మహరాజ్‌ అనే ఒక పేరుమోసిన బిజెపి ఎంపీ గుర్మీత్‌ నేరాన్ని కోర్టు తీర్మానించిన వెంటనే స్పందించిన తీరు దేశాన్ని విస్మయపరిచింది, దాంతో నష్టనివారణ చర్యగా అతని మాటలతో మాకు సంబంధం లేదని బిజెపి నక్కజిత్తు సంజాయిషీ ఇచ్చుకోవాల్సి వచ్చింది. అది కూడా కేంద్ర బిజెపి నుంచి రాలేదు. ఈ పెద్దమనిషి కూడా మత బాబాయే, ఆశ్రమాల వ్యాపారం చేస్తాడు, నోటి తుత్తర మనిషి. ఇతగాడేమన్నాడు ‘ దివ్యాత్మ గలిగిన రామ్‌ రహీమ్‌ వంటి వారి మీద ఆరోపణలు చేస్తున్నారు. ఎవరు చెబుతున్నది సరైనది? రామ్‌ రహీమ్‌ సింగ్‌లో దేవుడిని చూస్తున్న కోట్లాది మంది చెబుతున్నదా లేక ఫిర్యాదు చేసిన ఆ యువతిదా ? దీని మీద పెద్ద గొడవ జరుగుతున్నది, శాంతి భద్రతలు చిన్నాభిన్నమయ్యాయి, జనం చనిపోతున్నారు… దీన్ని గమనంలోకి తీసుకోవాల్సిన అవసరం లేదా? సుప్రీం కోర్టు లేదా హైకోర్టు జమా మసీదు అధిపతి షాహీ ఇమామ్‌ను ఈ విధంగా సంబోధించగలదా ? అతని మీద కూడా అనేక కేసులున్నాయి, అతనే మన్నా వారి బంధువా ? రామ్‌ రహీమ్‌ ఎంతో సాదాసీదాగా వుంటాడు కనుక అతన్ని వేధిస్తున్నారు.’ అని సాక్షి మహరాజ్‌ సెలవిచ్చారు. సాక్షి మహరాజ్‌ చెప్పిందాన్ని పార్టీ ఆమోదించటం లేదని దేశానికి అంతగా తెలియని కైలాష్‌ విజయవర్గీయ అనే నేత చేత బిజెపి చెప్పించింది.

మూడు రాష్ట్రాలలో హింస చెలరేగి అనేక మంది మరణించి ఎందరో గాయపడి ఎప్పుడేం జరుగుతుందో అన్నట్లుగా పరిస్ధితులు వుంటే ఇల్లు కాలుతుంటే బగ్గులేరుకొనే బాపతు మాదిరి బిజెపి ఎంపీ సుబ్రమణ్యస్వామి తన సహజ స్వరూపాన్ని బయట పెట్టుకున్నాడు.’ సాధువులకు కొత్త ముప్పు వచ్చింది. స్వామీజీలను జైళ్లకు పంపి రాజకీయ నేతలు, ఆశ్రమాలలో వున్నవారు ఆశ్ర మ ఆస్తులను ఆక్రమించుకోవాలనుకుంటున్నారు.’ అని ట్వీట్‌ చేశాడు. అత్యాచారం కేసులో నిందితుడైన ఆశారాంబాపును సమర్ధించిన ఈ స్వామి గారు అంతటితో ఆగలేదు. తాను సాధారణ పరిభాషలో చేసిన వ్యాఖ్యను రావణ రహీమ్‌కు తాను మద్దతు ఇస్తున్నట్లుగా కాంగ్రెస్‌ చిత్రించిందని ఆరోపిస్తూ ప్రతి విరాట్‌ హిందూ ప్రముఖుడిపైన తప్పుడు కేసులు పెట్టారంటూ కంచి శంకరాచార్య, రామ్‌దేవ్‌ బాబా, శ్రీశ్రీ రవిశంకర్‌ పేర్లను మరో ట్వీట్‌లో స్వామి వుటంకించారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఒక ట్వీట్‌లో మీడియాపైన, ఆస్తినష్టం జరగటాన్ని ఖండించారు తప్ప గుర్మీత్‌ అనుచరుల హత్యాకాండ, మరణించిన వారి ప్రస్తావన లేదు.

కోర్టు తీర్పుతో గుర్మీత్‌ను బహిరంగంగా సమర్ధించలేని స్ధితిలో పడింది తప్ప అతనితో బిజెపి సంబంధాలు దాస్తే దాగేవి కాదు. ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ పత్రిక వెల్లడించిన సమాచారం ప్రకారం 47 మంది హర్యానా బిజెపి సభ్యులలో 19తో ఆ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు సుభాష్‌ బరాలా 2014 ఎన్నికల తరువాత గుర్మీత్‌ను కలిశారు. వారిలో దాదాపు అందరూ మంత్రులయ్యారు.కోర్టు నిర్ణయం వెలువడగానే మొదలైన హింసాకాండను ప్రభుత్వ నివారించలేకపోవటం గురించి అడిగిన ప్రశ్నకు అసెంబ్లీ స్పీకర్‌ కన్వర్‌ పాల్‌ గుజ్జార్‌ సమాధానం ఇచ్చిన తీరు గమనించాల్సిన అంశం.’ మేము ఒక్కరిమే ఈ డేరాలకు వెళ్లలేదు, ఇతర రాజకీయ పార్టీలు కూడా వెళ్లాయి. రాజకీయవేత్తలుగా మేం అనేక మందిని కలుస్తుంటాం, వారిలో ఎవరైనా తరువాత కాలంలో తప్పుచేసిన వారిగా రుజువు అవుతారని ఎలా అనుకుంటాం, తాను చట్టాన్ని గౌరవిస్తానని గురూజీ చెప్పినట్లు ఇతరులు కూడా దాన్ని గౌరవించాలి. ఎగువ కోర్టులకు వెళ్లటానికి అవకాశాలున్నాయి, హింసాకాండ అన్నింటికీ సమాధానం కాదు,డేరా అనుచరులు శాంతిని పాటించాలి’ అన్నారు తప్ప ఖండన మాట ఒక్కటి కూడా లేదు.

 

డేరా ఆశ్రమాలను కాంగ్రెస్‌, ఇండియన్‌ లోక్‌దళ్‌ వంటి ఇతర పార్టీల నాయకులు కూడా సందర్శించారు. గతంలో కాంగ్రెస్‌కు గుర్మీత్‌ మద్దతు ప్రకటించాడు. అయితే 2014 ఎన్నికలలో డేరా సచ్చా సౌదా బహిరంగంగా బిజెపికి మద్దతు ప్రకటించింది. దాని పధకాలకు హర్యానా బిజెపి ప్రభుత్వం ఆర్ధిక తోడ్పాటును కూడా అందించింది. గుర్మీత్‌ సింగ్‌ ప్రధాన పాత్రధారిగా నిర్మించిన సినిమాలకు ఆరునెలల పాటు వినోదపన్ను కూడా మినహాయింపు ఇచ్చింది. డేరా సంస్ధ 2016లో నిర్వహించిన గ్రామీణ క్రీడలకు రాష్ట్రమంత్రి తన విచక్షణా కేటాయింపు నిధి నుంచి 50లక్షలు విరాళంగా ఇచ్చాడు. తాజాగా విద్యాశాఖ మంత్రి ఆశ్రమాన్ని సందర్శించి మరో 51లక్షలు ఇస్తానని ప్రకటించాడు. గుర్మీత్‌తో బిజెపి నేతలకు వున్న ఇన్ని సంబంధాలను వదలి పెట్టి కాంగ్రెస్‌ జడ్‌కేటగిరి భద్రత కేటాయించిందని, కొడుక్కి పిల్లనిచ్చిందని బిజెపి సామాజిక మీడియాలో ప్రచారం ప్రారంభించింది.

గుర్మీత్‌ సింగ్‌ వ్యవహారశైలి, అతని మీద వున్న కేసుల గురించి తెలియజూకుండానే బిజెపి నేతలు ఇవన్నీ చేశారా? బుర్రలో గుంజున్నవారెవరూ నమ్మరు. డేరా ఆశ్రమం నుంచి బయటకు వచ్చిన ఒక మేనేజర్‌ రంజిత్‌ సింగ్‌ 2002 జూలైలో హత్యకు గురయ్యాడు. ఈ కేసులో గుర్మీత్‌ నిందితుడు, విచారణ చివరి దశలో వుంది. భక్తురాండ్రపై గుర్మీత్‌ అత్యాచారాల వేధింపుల గురించి మేనేజర్‌ రంజింత్‌ సింగ్‌ ఆకాశరామన్న లేఖలను ప్రచారంలో పెట్టిన కారణంగానే హత్యకు గురయ్యాడని చెబుతారు.సిర్సాలోని డేరా ఆశ్రమ ప్రధాన కేంద్రంలో జరిగే చట్టవ్యతిరేక కార్యకలాపాల గురించి రాసినందుకు చట్టర్‌పతి అనే జర్నలిస్టు 2002 అక్టోబరు 23న హత్యకు గురయ్యాడు. ఆ హత్య కుట్రలో గుర్మీత్‌ భాగస్వామిగా కేసు నమోదైంది.సిబిఐ దర్యాప్తు చేసింది. పంచకుల కోర్టులోనే విచారణ చివరి దశలో వుంది.

గురువుగారి(గుర్మీత్‌) మార్గదర్శకత్వలో దేవుడిని చేరాలంటే పురుష భక్తులు తమ జననాంగాలను తొలగించుకోవాలని చెప్పి సిర్సా ఆశ్రమంలో దాదాపు నాలుగు వందల మందికి ఆపరేషన్లు చేశారనే ఆరోపణలు రావటంతో వాటిపై సిబిఐ దర్యాప్తు జరపాలని 2014 డిసెంబరు 23న హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆ కేసు దర్యాప్తులో వుంది. తాను దేవుడిని అని చెప్పుకొనే గుర్మీత్‌ సింగ్‌ 2007లో సిక్కుల గురు గోవింద్‌ సింగ్‌ మాదిరి వస్త్రాలను ధరించి కనిపించటంతో హర్యానా, పంజాబ్‌లో పెద్ద ఎత్తున హింసాకాండ చెలరేగింది. భటిండా పోలీసులు ఒక కేసు నమోదు చేశారు. ఆకేసును 2014లో పంజాబ్‌ అకాలీ-బిజెపి ప్రభుత్వం కేసును వుపసంహరించుకుంది. సిర్సాలోని డేరా ఆశ్రమంలో కార్యకర్తలకు ఆయుధ శిక్షణ ఇస్తున్నారని సైన్యం 2010 డిసెంబరులో తెలియచేసింది. అక్రమ ఆయుధాలు, శిక్షణ గురించి వివరాలు ఇవ్వాలని హైకోర్టు కోరగా అబ్బే అలాంటిదేమీ లేదంటూ హర్యానా ప్రభుత్వం పేర్కొన్నది. తాజా హింసాకాండలో ఆయుధాలు పట్టుబడినట్లు వార్తలు వచ్చాయి.

గుర్మీత్‌పై ఆత్యాచారం కేసుల విషయానికి వస్తే అత్యాచారాలు జరిగిన పది సంవత్సరాల తరువాత 2009,10 సంవత్సరాలలో నమోదయ్యాయి. ఇద్దరు భక్తురాండ్ర ప్రత్యక్ష వాంగ్మూలాలు గుర్మీత్‌ను దోషిగా నిలిపాయి. సిబిఐ న్యాయమూర్తుల ముందు వారుచెప్పిన అంశాలు బాబా భయంకర రూపాన్ని వెల్లడించాయి. సిర్సా ఆశ్రమంలోని భూగర్భంలో గుర్మీత్‌ వ్యక్తిగత నివాసం వుంది. దాని రక్షణకు ఎల్లవేళలా యువతులనే నియమిస్తారు. గుర్మీత్‌ను గుడ్డిగా నమ్మే విశ్వాసపరుల కుటుంబాలకు చెందిన యువతులను ఎంపిక చేసి వారు కూడా గుర్మీత్‌ను ఆధ్యాత్మిక గురువుగా నిజంగా నమ్ముతున్నారా లేదా అని నిర్ధారణ చేసుకున్న తరువాత నియామకాలు జరుపుతారట. అత్యాచారాలు చేసే సమయంలో గుర్మీత్‌ తానొక దేవుడినని ఫోజు పెట్టేవాడట. హర్యానాలోని యమునా నగర్‌కు చెందిన ఒక యువతి తనపై అత్యాచారం ఎలా జరిగిందో 2009 ఫిబ్రవరి 28న సిబిఐ న్యాయమూర్తి ఎకె వర్మ ముందు వివరించింది. తన సోదరుడి కారణంగా తాను 1999 జూలైలో డేరాలో భక్తురాలిగా చేరానని, పితాజీ నిన్ను క్షమించాడా అని అని  భక్తులు అడగుతుంటేే తొలుత తనకు అర్ధం కాలేదని, 1999 ఆగస్టు28/29 తేదీన తనను గుర్మీత్‌ నివాసంలోకి పిలిచించి అత్యాచారం చేసిన తరువాత ఆ మాటలకు అర్ధం స్పష్టమైందని వివరించింది. తన సోదరికి జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించినందుకు తరువాత ఆమె సోదరుడు హత్యకు గురయ్యాడు. సిర్సాకు చెందిన మరొక భక్తురాలు 2010 సెప్టెంబరు తొమ్మిదిన తన వాంగ్మూలమిచ్చింది. ఆమె తలిదండ్రులు డేరా గురించి చేసిన బోధల కారణంగా తాను భక్తురాలిగా మారానని, 1998 జూన్‌లో ఆశ్ర మంలో చేరిన తనకు నజం అని గుర్మీత్‌ నామకరణం చేశాడని, 1999 సెప్టెంబరులో గుర్మీత్‌ నివాసకాపలాదారుగా వుండగా లోపలికి పిలిచి తనపై అత్యాచారం చేసి ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించినట్లుగా పేర్కొన్నది.

గుర్మీత్‌ మద్దతుదారులు పంచకుల నగరాన్ని తగులబెడుతుంటే హర్యానా బిజెపి సర్కార్‌ నీరోలా వ్యవహరించింది. సాక్షాత్తూ పంజాబ్‌-హర్యానా హైకోర్టు ఆ రాష్ట్ర సర్కార్‌ను బహిరంగంగానే అభిశంచింది. హింసాకాండకు సంఘవ్యతిరేకశక్తులు కారణమని చెప్పటాన్ని ఎండగట్టింది.గుర్మీత్‌కు శిక్ష ఖరారు తేదీని ఎంతో ముందుగానే ప్రకటించారు. ఆ కేసులో అతగాడికి శిక్ష పడనుందని అనుచరులకు కూడా అనిపించిన కారణంగానే వారం రోజుల ముందు నుంచే పంచకుల, తదితర ప్రాంతాలకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. పెట్రోలు, పెట్రోలు బాంబులు, ఇతర మారణాయుధాలను సమీకరించారని వార్తలు ముందే వచ్చినా హర్యానా సర్కార్‌ తీసుకున్న ముందుస్తు చర్యలేమీ లేవు. గుర్మీత్‌ మద్దతుదారులు స్వేచ్చగా గుమికూడటానికి అన్ని అవకాశాలను ఇచ్చింది. ముఖ్యమంత్రి చెప్పినట్లు సంఘవ్యతిరేకశక్తులే హింసాకాండకు పాల్పడితే అది తెలిసి కూడా ఏడు రోజుల పాటు ఎలాంటి వారి ప్రవేశానికి ఎందుకు చర్యలు తీసుకోలేదని హైకోర్టు ప్రశ్నించింది.శాంతి భద్రతల అంశం రాష్ట్రాలదని అదనపు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి అదనపు సొలిసిటర్‌ జనరల్‌ సత్యపాల్‌ జైన్‌ చెప్పటాన్ని కోర్టు తప్పుపట్టింది.’ ప్రధాన మంత్రి దేశం మొత్తానికి ప్రధాని తప్ప ఒక పార్టీకి కాదు…హర్యానా, పంజాబ్‌ దే శంలో భాగం కాదా అని ప్రశ్నించింది. అంతే కాదు, హింసాకాండలో నష్టపడిన వారు అధికారయంత్రాంగానికి దరఖాస్తు చేసుకోవాలని, వాటిని తనిఖీ చేసి కోర్టుకు నివేదించాలని, ఈ నష్టాన్ని దానికి బాధ్యులైన వారి నుంచి రాబట్టాలని కూడా కోర్టు పేర్కొన్నది.

కేరళలోని తిరువనంతపురంలో వ్యక్తిగత వివాదంలో ఒక ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్త హత్యకు గురైతే న్యూఢిల్లీ నుంచి కేంద్రమంత్రి అరుణ్‌జెట్లీ పర్యటించటం, గవర్నర్‌ జోక్యం చేసుకోవటం వంటి చర్యలతో బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ వారు నానా యాగీచేశారు. గుర్మీత్‌ మద్దతుదార్ల చేతుల్లో 31 మంది హత్యకు గురికావటం, 250 మందికిపైగా గాయపడటం, పెద్ద సంఖ్యలో ఆస్తినష్టం. రైళ్లు, బస్సులు రద్దయి, కొన్ని చోట్ల కర్ఫ్యూవిధించటంతో లక్షలాది ప్రయాణీకులు, సామాన్య నానా ఇబ్బందులు పడితే, పడుతుంటే బిజెపి నేతలకు చీమైనా కుట్టకపోగా నెపాన్ని సంఘవ్యతిరేక శక్తుల మీదకు నెడతారా ? గుండెలు తీసిన బంట్లు వీరని అనిపించటం లేదా !

 

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

సీతయ్య ఎవరి మాటా వినడు !

06 Tuesday Jun 2017

Posted by raomk in AP, BJP, Congress, CPI(M), Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

ANDHRA PRADESH Politics, Andhrapradesh, ap special asistance, ap special status, chandrababu naidu, Congress party, Rahul gandhi

ఎంకెఆర్‌

ఆంధ్రప్రదేశ్‌లో విస్తారంగా పండే రొయ్య మీసాల పొడవు- విస్తృత ప్రచారం పొందిన చంద్రబాబు నాయుడి సీనియారిటీ గురించి ఎవరైనా విబేధిస్తే అంతకంటే అమాయకులు మరొకరు వుండరు. అయితే ఎవరూ వివాదం చేయకపోయినా ఈ మధ్యకాలంలో, తాజాగా తన సీనియారిటీ గురించి తానే చెప్పుకుంటున్న చంద్రబాబు గురించి ప్రస్తావన రాకుండా ఎలా వుంటుంది? అసలా అవసరం ఏమొచ్చిందన్నదే ప్రశ్న. తాను మారానని మూడో సారి పదవీ బాధ్యతలు స్వీకరించిన సందర్భంలో, అంతకు ముందు చంద్రబాబు చెప్పారు. చూస్తుంటే ఎప్పటి కెయ్యది అప్పటికా మాటలాడి తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సమతీ అన్న నీతి బాగా వంట పట్టించుకున్నట్లు తేలిపోయింది.

గుంటూరు సభలో రాహుల్‌ గాంధీ రాజకీయాల గురించి, రాష్ట్రం గురించి మాట్లాడారు. చంద్రబాబు నాయుడుకు మోడీ భయం పట్టుకుందని విమర్శించారు. ఆ మాటకు వస్తే నరేంద్రమోడీ, చంద్రబాబు కూడా సభలలో తాము చెప్పదలచుకున్నవి చెప్పారు, అతి వినయం ప్రదర్శించి చేయాల్సిన నటన చేయలేదా, ఎవరు తక్కువ ? అలాగే రాహుల్‌ చెప్పిన మాటలు వినటమా లేదా, చేసిన విమర్శలను పట్టించుకోవటమా లేదా సూచనలను పాటించటమా లేదా అన్నది వేరే విషయం. తాను ఎవరికీ భయపడటం లేదని, దేశంలోనే సీనియర్‌ రాజకీయవేత్తను కనుక ఇప్పుడే రాజకీయాలు నేర్చుకుంటున్న వారు చెబితే వినేది లేదని చంద్రబాబు చెప్పాల్సిన పనేముంది. నిజానికి అది నరేంద్రమోడీకి ఎక్కడో మండే మాట. మరో విధంగా అలా అనటం అంటే జ్ఞాన ద్వారాన్ని మూసుకోవటమే. ఆ మాట అన్న తరువాత ఈగలు, చీమలు, దోమల మాదిరి అధికారం చుట్టూ మూగే ఇతర పార్టీల వారూ, తెలుగుదేశం పార్టీలోని సహచరులు, జూనియర్లు చెప్పిందానిని కూడా చంద్రబాబు ఎలా వింటారు. ఇప్పటికే ‘సీతయ్య నివాస్‌’ మాదిరి తెలుగు దేశం పార్టీలో అసలు అలా చెప్పే వాతావరణం ఎక్కడుంది. గతంలో ఒక్క పెదబాబే అనుకుంటే తండ్రికి తగ్గ తనయుడు చినబాబు కూడా తోడయ్యారు. దీంతో చంద్రబాబు తప్ప తెలుగుదేశంలోని సీనియర్లందరూ నారావారి కుటుంబంలో పుట్టబోయే వారికి అన్నలుగానూ పుట్టిన వారికి తమ్ములుగానూ మారిపోయారు. గతంలో పది సంవత్సరాలు ముఖ్య మంత్రిగా, మరో పది సంవత్సరాలు ప్రతిపక్షనాయకుడిగా చంద్రబాబు శైలిని దగ్గరగా చూసిన వారికి ఆయనకు సీనియారిటీతో నిమిత్తం లేకుండానే ఇతరులు చెప్పేదానిని పరిగణనలోకి తీసుకొనే తత్వం లేదన్నది బాగా తెలిసిందే. ఈ సందర్భంగా ప్రచారంలో వున్న మహాకవి కాళిదాసు గర్వభంగం కథను గుర్తుకు తెచ్చుకోవటం అవసరం. సరస్వతి దేవి పెట్టిన పరీక్షలో సున్నా మార్కులు తెచ్చుకున్న కాళిదాసుకు కనువిప్పు కలగగానే విద్యతో వినయం వృద్ధి చెందాలి గాని అహంకారం కాదు నాయనా కీర్తి ప్రతిష్టల మాయలో పడిన నీ బుద్ధిని మార్చటానికే ఈ పరీక్ష అని దాహంతో వచ్చిన కాళిదాసుకు మంచినీరు ఇచ్చి అనుగ్రహిస్తుంది.

అటు పార్టీలోనూ, ఇటు ప్రభుత్వంలోనూ, బయట ప్రతిపక్షాలకు తాను చెప్పటం తప్ప ఇతరులు చెప్పింది వినే అలవాటు లేదనే విమర్శలు వున్న చంద్రబాబు ఎవరూ చూడకుండా అయినా వేమన, సుమతీ శతకాలు ఒక్కసారి తిరగేసుకుంటే మంచిది.

వినదగు నెవ్వరు చెప్పిన,

వినినంతనే వేగపడక వివరింపదగున్‌,

గని కల్లనిజము లెరిగిన,

మనుజుడే పో నీతిపరుడుడు మహిలో సుమతీ

అన్న ప్రబోధ పద్యాన్ని చంద్రబాబు మరిచి పోయి వుంటారు.

మూడు సంవత్సరాల పాలనలో సున్నా మార్కులు తెచ్చుకున్న చంద్రబాబు వైఫల్యాన్ని ఎవరైనా ప్రస్తావిస్తే మండిపడుతున్నారు. తానే చెప్పుకున్నట్లు ఒక సీనియర్‌గా గోబెల్స్‌ ప్రచారంలో కూడా ఆయనను మించిన వారు లేరు. ఒక అబద్దాన్ని వందసార్లు చెబితే నిజమై కూర్చుంటుందన్నది హిట్లర్‌ ప్రచార మంత్రి గోబెల్స్‌ సూత్రం. చంద్రబాబుకు గోబెల్స్‌ను మించిన బిజెపి తోడు కావటంతో ఇక చెప్పాల్సిందేముంది.

రాష్ట్ర విభజన సమయంలో వ్యతిరేకించింది ఒక్క సిపిఎం తప్ప మరొకపార్టీ లేదు.అందుకే ఆ పార్టీ దానికి ప్రత్యామ్నాయంగా ఫలాన వరం ఇవ్వాలని కోరలేదు. గతంలో అలా ఇచ్చిన దాఖలాలు కూడా లేవు. అలా అడగటం అంటే విభజనను అంగీకరించినట్లే. ఆసుపత్రులలో పెద్ద ఆపరేషన్లు చేయాల్సి వచ్చినపుడు సంభవించే పర్యవసానాలకు అంగీకారం తెలుపుతూ రోగి లేదా సమీప బంధువుల సంతకాలతో లేఖలు తీసుకుంటారు. రెండు కళ్ల సిద్ధాంతం చెప్పి ఆంధ్రప్రదేశ్‌ కన్ను పొడవటానికి ఆమోదం తెలిపి ఒకటికి రెండు లేఖలు ఇచ్చింది చంద్రబాబు. ఆపరేషన్‌ చేసే వైద్యుడు కోరిన కత్తులు, కటార్లు అందించి సహకరించే సిబ్బంది మాదిరి ఆంధ్రప్రదేశ్‌ కన్ను పొడిచే సమయంలో పెద్ద ఎత్తున హడావుడి చేసి కాంగ్రెస్‌కు అన్ని విధాలుగా సహాయపడింది బిజెపి. తిరుపతి సభలో ప్రత్యేక హోదా గురించి వెంకన్న సాక్షిగా వాగ్దానం చేసింది నరేంద్రమోడీ. తరువాత దానిని తిరస్కరించిందీ ఆ పెద్ద మనిషే. మూడు సంవత్సరాల కాలంలో ఇన్ని జరిగితే వాటన్నింటినీ వదలి పెట్టి చంద్రబాబు నాయుడు కేవలం కాంగ్రెస్‌ మీదే ఎదురుదాడులకు దిగారు. రాష్ట్రానికి హాని చేయటంలో కాంగ్రెస్‌ పాత్ర ఎంతో బిజెపిదీ అంతే. హోదా బదులు ప్రత్యేక పాకేజీ ఇచ్చారని, దాని కంటే హోదా వలన అదనంగా వచ్చే ప్రయోజనమేమిటో చెప్పాలని కూడా చంద్రబాబు సవాలు విసురుతున్నారు. ఇప్పుడు సమస్య పాకేజి వలన కలిగిన ప్రయోజనం ఏమిటన్నదే, ఆ ప్రశ్నకు ఇంతవరకు ఆ పెద్ద మనిషి లేదా బిజెపి నేతలు గానీ నోరు విప్పటం లేదు.

ఏ పార్టీలో ఎంతకాలం వుంటారో, ఎప్పుడు ఏ పార్టీ మారతారో తెలియని విశ్వసనీయతలేని నాయకులతో తెలుగుదేశం పడవ నడుస్తోంది. అలాంటి పార్టీ నేతగా దానిని నిరూపించుకోవాలంటే ఇప్పటికైనా ఆయన చెప్పే కాంగ్రెస్‌ అడ్డగోలు రాష్ట్ర విభజన కారణంగా ఆంధ్రప్రదేశ్‌ ఎలా నష్టపోయిందో, ఆ నష్టాన్ని పూడ్చేందుకు మిత్రపక్షం బిజెపి ఇచ్చిన ప్రత్యేక పాకేజి కారణంగా వచ్చే లాభాలు ఏమిటో, తెలుగుదేశం పార్టీ చెప్పే న్యాయబద్ద విభజన కోసం తాము చెప్పిందేమిటో, చేసిందేమిటో ప్రభుత్వం తరఫున ఒక శ్వేత పత్రం ప్రకటించి వాస్తవాలు చెప్పటం తప్ప మరొక మార్గం లేదు. అదేమీ లేకుండా అడ్డగోలు రాజకీయాలు, దాడులు చేస్తే రాష్ట్ర ప్రజలకు పూచికపుల్ల ప్రయోజనం కూడా వుండదు. క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్‌ను డిమాండ్‌ చేస్తున్నారు. కానీ ఆ కాంగ్రెస్‌లో చివరి వరకు వుండి తెలుగు దేశం పడవలోకి ఎక్కిన నేతలను మాత్రం ఎలాంటి క్షమాపణ అడగకుండానే పార్టీలో చేర్చుకొని పదవులు ఇచ్చి అందలమెక్కించారు. అదే కాంగ్రెస్‌ నేతలు బిజెపిలో కూడా చేరి దానిని కూడా పునీతం చేశారు. తెలుగుదేశం సరసన కూర్చొని వారిపుడు ధర్మపన్నాలు వల్లిస్తున్నారు.

రాష్ట్ర ప్రయోజనాల కోసమే బిజెపికి కేంద్రంలో, రాష్ట్రంలో మిత్రపక్షంగా వున్నామని చంద్రబాబు చెబుతున్నారు. ఆ విషయాన్ని నొక్కి వక్కాణిస్తే ఆయనకే నష్టం. ఒక రాజకీయపార్టీ పట్ల మరొక రాజకీయ పార్టీ ఎలా వ్యవహరించాలనేది అది వారిష్టం.కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆని చెబుతున్నారు కనుక సాధించిన అదనపు ప్రయోజనాలేమిటో కూడా చెప్పాలి.ప్రతి ఏటా నవనిర్మాణ దీక్షలంటూ ప్రత్యర్ధులపై ఎదురుదాడులు తప్ప జనానికి సానుకూల అంశాలను వివరించిన పాపాన పోలేదు. కులం, మతం, ప్రాంతీయ భావనలను తలకెక్కించుకున్న జనంలోని ఒక తరగతి అటు కేంద్రం, ఇటు రాష్ట్ర వైఫల్యాల గురించి పట్టించుకోకపోవచ్చు. ఎల్లకాలం ఇదే పరిస్ధితి వుండదు. అటు బిజెపి తెలుగుదేశం పార్టీని ముందుగదిలో కూర్చో పెట్టి దాని ప్రత్యర్ధి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌కు వెనుక ద్వారం తెరిచింది. శ్రీకృష్డుడి రాజకీయం మాదిరి ముందుగ వచ్చితీవు, మున్ముందుగ అర్జునుడిని చూచితి నేను అన్నట్లుగా బిజెపి తనకు ఏది వాటంగా వుంటే అది చేసేందుకు పావులు కదుపుతోంది. చంద్రబాబు అస్త్రాలు తుప్పు పట్టటం లేదా ఒక్కొక్కటిగా మొద్దుబారి పనికి రాకుండా పోతున్నాయి. అవ్వతో వసంతమాడినట్లు కాంగ్రెస్‌ క్షమాపణలతో కాలక్షేపం చేస్తే కుదురుతుందనుకుంటే పొరపాటు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

ప్రజాస్వామ్యం -మిలిటరీ- ప్రశ్నించే హక్కు ?

12 Wednesday Oct 2016

Posted by raomk in BJP, Communalism, Congress, Current Affairs, History, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, RELIGION

≈ Leave a comment

Tags

BJP, Congress party, dadri, dalali, democracy, Media, military, right to ask a question, surgical strike

ఎంకెఆర్‌

   సమాజంలో ఎప్పుడూ విరుద్ధ భావజాలాల మధ్య సంఘర్షణ జరుగుతూనే వుంటుంది. అయితే అన్ని వేళలా అన్నీ ఒకే విధంగా సంఘర్షించుకోవు. ఎప్పుడూ ఒకటి ప్రధాన మైన సంఘర్షణగా వుంటుంది. దీని అర్ధం మిగతావి సంఘర్షించుకోవు అని కాదు. ఏ రెండింటి మధ్య జరిగేది ప్రధాన సంఘర్షణ అన్నది గుర్తించటం ముఖ్యం. అయితే వెంటనే దానితో అందరూ ఏకీభవించకపోవచ్చు.అసలు దానిని ఒక వైరుధ్యంగా కొందరు గుర్తించకపోవచ్చు కూడా. ఇప్పుడు దేశంలో అదే పరిస్ధితి వుందన్నది అనేక మంది అభిప్రాయం. కొంత మంది విభేదించినప్పటికీ అనేక దేశాలతో పోలిస్తే మనం మెరుగైన ప్రజాస్వామ్య వ్యవస్ధలో వున్నాం. భావ ప్రకటనా స్వేచ్చ మీద జరుగుతున్న తీవ్ర దాడిని సాధారణంగా మేథావి వర్గంగా భావించే వారందరూ వ్యతిరేకించకపోయినా గట్టిగా వ్యతిరేకించే వారు కూడా వున్నారు. కలుబుర్గి హత్యను ఖండించటానికి కేంద్ర సాహిత్య అకాడమీ తిరస్కరించటం మొదలు, ఎవరు ఏమితినాలి, తినకూడదు అని నిర్ధేశించిన దానిలో భాగంగా గొడ్డు మాంసంపై తలెత్తిన వివాదం, విశ్వవిద్యాలయాలలో భావ ప్రకటనా స్వేచ్చను అడ్డుకొనే క్రమంలో భౌతిక దాడులకు పాల్పడిన వుదంతాలు, గో సంరక్షణ ముసుగులో ముస్లింలు, దళితులపై దాడులు, చివరికి తాజా సర్జికల్‌ దాడుల వరకు అనేక వుదంతాలలో తలెత్తిన ఘర్షణలను చూస్తే పూసల్లో దారంలో తిరోగామి భావజాలానికి ప్రాతినిధ్యం వహించే ఆర్‌ఎస్‌ఎస్‌, ఇతర మనువాద, మతశక్తులు అన్ని రంగాలలో, అంశాలలో తమ ఆధిపత్యాన్ని రుద్దేందుకు ప్రయత్నించటం చూస్తున్నాం. వారేమీ దాచుకోవటం లేదు, బాహాటంగానే తెగింపుతో ముందుకు వస్తున్నారు. చర్చను ప్రమాదకర పరిస్థితిల్లోకి నెడుతున్నారు. ఇది ఒక పధకం ప్రకారం జరుగుతున్నదా? యాదృచ్చికమా అన్న గుంజాటన వున్న వారు తీరికగా ఆలోచించి దానిని తేల్చుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఈ దాడులకు ప్రతిఘటన కూడా అలాగే వుంది. అనేక మంది ఇదేదో తేడాగా వుంది అని ఆలోచిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇంకా అలాంటి వారు పెరుగుతారు.అయితే ఈ శక్తుల ప్రయత్నాలన్నింటికీ తీవ్రమైన ఎదురు దెబ్బలు తగులుతుండటంతో ఒక ఎత్తుగడగా అయినా వెనక్కు తగ్గి కొత్త దారులు వెతుకుతున్నారు.

    కలుబుర్గి హత్యపై తలెత్తిన రచయితలు, కళాకారులు, మేథావుల నిరసనలతో ఖంగు తిన్న శక్తులు కేంద్ర సాహిత్య అకాడమీతో సంతాపం ప్రకటింపు చేయించి పరువు దక్కించుకొని బయట పడ్డాయి. ఆవు మాసం వివాదం చివరకు దళితులపై దాడులకు తెరతీయటంతో స్వయంగా ప్రధాని జోక్యం చేసుకొని లోపల ఎలా వున్నప్పటికీ దళితుల ఓట్ల కోసం గోసంరక్షకులపేరుతో దుకాణాలు తెరిచారని తీవ్ర విమర్శలు చేయాల్సి వచ్చింది. వురి శిక్షలకు వ్యతిరేకంగా మాట్లాడిన, యాకుబ్‌ మెమెన్‌ వురి తీత సరైంది కాదని అభిప్రాయపడిన వారిని జాతి వ్యతిరేకులుగా ముద్ర వేసి హైదరాబాదులో రోహిత్‌ వేముల ఆత్మ హత్యకు కారకులు కావటం, జెన్‌యు విద్యార్ధులపై తప్పుడు ప్రచారం, తప్పుడు వీడియోలు, కేసులతో వేధించేందుకు పూనుకున్నారు. ఆ రెండు చోట్లా జరిగిన విద్యార్ధి సంఘ ఎన్నికలలో ఘోరంగా ఓడిపోయారు. ఈ విషయంలోనూ తాత్కాలికంగా వెనక్కు తగ్గారు. తమకు రాజకీయంగా లాభం అనుకుంటే ఏ వివాదాన్ని అయినా రావణా కాష్టంలా రగిలిస్తూనే వుంటారు, తాత్కాలికంగా అయినా నష్టం అనుకుంటే వ్యూహాత్మకంగా వెనక్కు తగ్గుతారు.ఇప్పుడు సర్జికల్‌ దాడుల వివాద వుదంతాన్ని ఎలా ముగిస్తారో చూడాల్సి వుంది.

    ఒక్కొక్క అంశంపై తమ ఆధిపత్యాన్ని రుద్ధేందుకు ప్రయత్నిస్తున్న మత, తిరోగామి శక్తులు సమస్యలను సృష్టించేందుకు ప్రయత్నించటం ఒకటైతే , తలెత్తిన పరిస్థితిని తమకు అనుకూలంగా మలచుకోవటం మరొకటి. అసహనం, దేశభక్తి, ఆవు నుంచి తాజా మిలిటరీ చర్యల వరకు నడుస్తున్న చర్చలో రెండు ఈ ధోరణులను మనం చూడవచ్చు. పాక్‌ ప్రేరేపిత వుగ్రవాదుల అణచివేతలో భాగంగా మిలిటరీ చేపట్టిన సర్జికల్‌ దాడులను దాదాపు అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు సమర్ధించాయి. ఎవరూ వాటిని వివాదం చేయలేదు. అయితే ఆ దాడులనుంచి రాజకీయ ప్రయోజనాలను పిండుకోవటానికి బిజెపి తెరతీయటం, అది తగదన్న అంశంపై తీవ్రమైన రెచ్చగొట్టుడు చర్యలకు పాల్పడుతున్నారు. ఈ విషయంలో ముందు బోనులో నిలబెట్టాల్సింది మీడియాను అంటే అతిశయోక్తిగా కనిపించవచ్చు. సర్జికల్‌ దాడుల గురించి ప్రభుత్వం ప్రతిపక్షాలకు వివరించినపుడు వచ్చిన వార్తల తీరు తెన్నులను ఒక్కసారి నెమరు వేసుకోండి. దాడుల ఖ్యాతిని పూర్తిగా మిలిటరీకే ప్రతిపక్షాలు అప్పగిస్తున్నాయని, నరేంద్రమోడీకి దానిని పంచేందుకు నిరాకరించాయని రాయటాన్ని ఏమనాలి. మరణించింది సైనికులు, ప్రాణాలకు తెగించి ప్రతిదాడులు జరిపింది సైనికులు, దీనిలో రాజకీయ నాయకులు లేదా పార్టీలకు ఖ్యాతిని ఆపాదించటం ఏమిటి ? వుప్పు తిన్న విశ్వాసం లేదా కిరాయి రాతలని ఇలాంటి వాటినే అంటారు.

    మిలిటరీ చర్యలను, మిలిటరీని రాజకీయ ప్రయోజనాలకు వుపయోగించుకున్న దేశాలలో ఏం జరిగిందో ప్రత్యక్షంగా చూస్తున్నాం. మన దేశాన్ని కూడా ఆ స్ధితిలోకి నెట్టదలచుకున్నారా ? కొందరి వుత్సాహం అలాగే కనిపిస్తోంది. కార్గిల్‌ యుద్ధాన్ని బిజెపి తన ఎన్నికల ప్రయోజనానికి వుపయోగించుకోవటం జగమెరిగిన సత్యం. ప్రతిపక్షం ఎంత బలహీనంగా వున్నప్పటికీ ఇది 1999 కాదు 2016 అని గుర్తించకుండా సర్జికల్‌ దాడులను కూడా అందుకు వినియోగించుకొనే ప్రయత్నం చేస్తే సహించే పరిస్థితి వుంటుందా ? మిలిటరీ చర్యలనుంచి రాజకీయ లబ్ది పొందేందుకు ప్రయత్నించవద్దన్న అభిప్రాయాల వెల్లడి, ప్రకటనలు జాతీయ ఐక్యత ప్రదర్శించాల్సిన సమయంలో సైనికుల శౌర్య, పరాక్రమాలను అవమానించటమే అని చిత్రించటం అత్యంత ప్రమాదకర పోకడ. మొదటిది ప్రజాస్వామ్యంలోని భావ ప్రకటనా స్వేచ్చకు ప్రతిబింబం అయితే రెండవది అందుకు విరుద్ధమైన అణచివేత వ్యవస్ధ లక్షణం.

    మన దేశంలో స్వాతంత్య్రం తరువాత కాంగ్రెస్‌ పార్టీ చేయని తప్పిదం లేదు. అత్యవసర పరిస్థితి విధించి నిరంకుశత్వాన్ని రుద్ధేందుకు ప్రయత్నించింది. దివాళాకోరు ఆర్ధిక విధానాలు అనుసరించి సామాన్య జనజీవితాలను అతలాకుతలం చేసింది. మతోన్మాదులతో పోటీపడి ఓట్ల కక్కుర్తితో మతశక్తులతో రాజీపడి లౌకిక వ్యవస్ధకు హాని చేసింది. తన రాజకీయ ప్రయోజనాల కోసం వేర్పాటు, వుగ్రవాదులకు మద్దతు ఇచ్చింది. అందుకు తగిన మూల్యం కూడా చెల్లించి ఇప్పుడు ప్రతిపక్షంగా పార్లమెంట్‌లో గుర్తింపునకు తగిన సంఖ్యలో కూడా సీట్లను పొందలేకపోయింది. ఇంకా దాని తప్పిదాలు చాలా వున్నాయి.

    రెండవ ప్రపంచ యుద్ధంలో విజేతలు జర్మనీ మిలిటరీపై నిషేధం విధించారు. అదే యుద్ధంలో జపాన్‌ను ఓడించి 1945-52 మధ్య కాలంలో తమ ఆక్రమణలో వుంచుకున్న అమెరికా ఆ దేశ రక్షణ బాధ్యతను తాము తీసుకుంటున్నట్లు ఆ దేశంతో ఒక ఒప్పందం చేసుకొన్నది. రెగ్యులర్‌ మిలిటరీని నిషేధిస్తూ జపాన్‌ నూతన రాజ్యంగంలో ఒక అంశంగా చేర్పించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు జర్మనీ, జపాన్‌లకు సైన్యం లేదు. గత ఎన్నికలలో కాంగ్రెస్‌ను బిజెపి నాయకత్వంలోని ఎన్‌డిఏ చిత్తుగా ఓడించింది. అంతే తప్ప కాంగ్రెస్‌ పార్టీని లేదా దాని హక్కులను గానీ జపాన్‌,జర్మనీ మిలిటరీల మాదిరి నిషేధించలేదు. అందువలన ఆ పార్టీ అయినా మరొకదానికి అయినా ఒక అంశం మీద అభిప్రాయాలు వెల్లడించే స్వేచ్చను కలిగి వున్నాయి.

    ఆ విధంగా చూసినపుడు బిజెపి లేదా దాన్ని చూసి సమాజవాది పార్టీ గానీ రాజకీయ ప్రయోజనాల కోసం జరిపే ప్రచారంలో, పోస్టర్లలో సైన్యాన్ని వుపయోగించుకోకూడదని చెప్పేందుకు ఎవరికైనా హక్కుంది. ‘సర్జికల్‌ దాడులకు మా సంపూర్ణ మద్దతు వుందని నిర్ద్వంద్వంగా చెప్పాను. అయితే సైన్యాన్ని రాజకీయ పోస్టర్లు, ప్రచారానికి వినియోగించుకోవటాన్ని నేను సమర్ధించను ‘ అని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ట్వీట్‌ చేశాడు. అంతకు ముందు రోజు కాస్త ఘాటుగా సైనికుల త్యాగాలను సొమ్ము చేసుకొనే దళారులుగా వ్యవహరించవద్దని విమర్శించారు. ఆ విమర్శ తమను గాక మిలిటరీని అన్నట్లే అంటూ బిజెపి విరుచుకుపడింది. సైనికుని బొమ్మను, మోడీ, బిజెపి నేతల బొమ్మలతో కలిపి ముద్రించి వుత్తర ప్రదేశ్‌లో బిజెపి ప్రచారం ప్రారంభించిన విషయాన్ని పక్కదారి పట్టించేందుకు తమపై చేసిన విమర్శలను మిలిటరీకి వర్తింప చేస్తూ రెచ్చగొట్టేందుకు ప్రయత్నించింది.

  దళాలీ( తెలుగులో దళారీ ) అన్నది పార్లమెంటేతర భాష కాదు. భోఫోర్స్‌తో సహా అనేక కుంభకోణాలలో దళారుల పాత్ర ఏమిటో కాంగ్రెస్‌కు, బిజెపికి తెలిసినంతగా ఈ దేశంలో మరొక పార్టీకి తెలిసే అవకాశం లేదు. దానిలో భాగంగానే బిజెపి ‘ధరమ్‌ కీ దలాలీ(మతం), గాయ్‌ కీ దళాలీ( ఆవు ) గంగా కీ దళాలీ ( గంగా నది)ని వుపయోగించుకుంటున్నట్లుగానే సైనికుల త్యాగాలను కూడా వుపయోగించుకుంటున్నదని బిజెపి పోస్టర్లను వుటంకిస్తూ కాంగ్రెస్‌ ఎదురు దాడికి దిగింది. రాజకీయాలలో దళారీ పదం వాడటం వుచితమేనా అన్న ప్రశ్నకు రాజకీయాలకు తావు లేని చోట బిజెపి రాజకీయ ప్రయోజనం పొందేందుకు ప్రయత్నిస్తున్నది, మోడీని రాముడిగా చిత్రిస్తూ పోస్టర్లు వేశారు, సర్జికల్‌ దాడులతో ఆయన ఛాతీ 56 అంగుళాల నుంచి వందకు పెరిగిందని చెప్పారు, జాంబవంతుడు చెప్పిన తరువాతే హనుమంతుడికి తన బలం గురించి తెలిసి వచ్చి ఒక్క వూపులో సముద్రాన్ని దాటి లంకలో ప్రవేశించినట్లుగా సర్జికల్‌ దాడుల తరువాత మన సైన్యానికి తన బలం ఏమిటో తెలిసి వచ్చిందన్నారు రక్షణ మంత్రి పరికర్‌. ఆయనను సన్మానించేందుకు సభలు జరుపుతున్నారు. బిజెపి ప్రతినిధి జివిఎల్‌ నరసింహారావు కూడా అదే రీతిలో తొలిసారిగా మిలిటరీకి తానంటే ఏమిటో తెలిసిందని మాట్లాడారు. నిజానికి ఇవి మిలిటరీని అవమానించే మాటలు. గతంలో చేసిన సర్జికల్‌ దాడులను విస్మరించటం, త్యాగాలను కించపరచటం తప్ప మరొకటి కాదు. దాడుల ఖ్యాతి పూర్తిగా సైనికులకే దక్కాలి. ఈ పూర్వరంగంలో ఒక పదం ముఖ్యం కాదు దాని వెనుక వున్న భావాన్ని అర్ధం చేసుకోవాలని రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ నేత కపిల్‌ సిబాల్‌ వ్యాఖ్యానించారు. వుగ్రవాదులు పాకిస్తాన్‌ అనే వ్యాధి గ్రస్తు శరీరంలోని క్యాన్సర్‌ కణాల వంటి వారు, ప్రభుత్వం వాటిని అంతం చేయటానికి మద్దతు ఇస్తున్నాం, దానికి గుండెలు పొంగటం ఎందుకు, పోస్టర్ల ప్రచారం దేనికి, ఒక సర్జికల్‌ దాడితో వుగ్రవాదం అంతం కాదు, కానీ బిజెపి వుత్తర ప్రదేశ్‌లో ఆ పేరుతో ఓట్లు అడిగేందుకు ప్రచారం ప్రారంభించింది’ అని కూడా సిబాల్‌ చెప్పారు.

    ఆవు మాంసం కలిగివున్నారంటూ వుత్తర ప్రదేశ్‌లోని దాద్రిలో ఒక ముస్లిం కుటుంబంపై సామాహిక దాడి చేసి కుటుంబ పెద్దను హత్య చేసిన కేసులోని ఒక నిందితుడు రవి శిశోదియా జైలులో చికున్‌ గున్యా వ్యాధితో మరణించాడు. అతని మృత దేహంపై బిజెపి నేతలు జాతీయ జండా కప్పటాన్ని ఏమనాలి. హిందూత్వ వాది కనుక కావాలంటే తమ బిజెపి జెండాను కప్పుకోవచ్చు, జాతీయ జెండాను కప్పటమంటే దానిని అవమానించటం తప్ప మరొకటి కాదు. బిజెపి ప్రవచించే జాతీయవాద నిజ స్వరూపం ఇదా ? దేశం కోసం ప్రాణాలర్పించే సైనికుల మృత దేహాలపై జాతీయ జెండా కప్పుతారు. మరి శిశోదియా ఏ త్యాగం చేశాడని ఇలా చేశారు ?

Image result for dadri lynching,sisodia, national flag

చికున్‌ గున్యాతో మరణించిన దాద్రి హత్య నిందితుడికి జాతీయ జెండా కప్పిన బిజెపి జాతీయవాదం

    సర్జికల్‌ దాడుల గురించి చర్చించ కూడదని బిజెపి నేతలు మనకు చెబుతున్నారు. అడిగితే అది పాక్‌ ప్రచార వలలో పడినట్లే నట ! సైనిక చర్యకూ జాతీయ వాదానికి ముడి పెడుతున్నారు. గో వధ నిషేధానికీ అదే ముద్ర, చివరికి గో సంరక్షకుల ముసుగులో చచ్చిన ఆవుల చర్మం తీసే, చచ్చిన ఆవులను తొలగించటానికి నిరాకరించిన దళితులపైనా దాడులకు తెగబడిన విషయం తెలిసిందే. వారిని అలాగే వదలి వేస్తే చివరికి గో సంరక్షక్షుల దాడుల గురించి కూడా చర్చించటం కూడా దేశ ద్రోహమే అంటారేమో ? కొన్ని టీవీ ఛానల్స్‌, కొన్ని పత్రికలు, కాషాయ దళాల దృష్టిలో భిన్న, బేదాభి ప్రాయం వ్యక్తం చేసే వారందరూ ప్రమాదకారులు, దేశద్రోహుల కింద లెక్క. కనుక అంతిమంగా అలాంటి వారి నోరు మూయాలి లేకపోతే మూయించాలి, ఇదేగా ఇస్తున్న సందేశం ! ఇది ప్రారంభం మాత్రమే. మొగ్గలోనే ఇలాంటి ధోరణులను ఎదుర్కొనకపోతే చివరికి మానులై కూర్చుంటాయి.

   మిలిటరీని విమర్శించకూడదు ! న్యాయ వ్యవస్ధను విమర్శించకూడదు !! మిలిటరీ, న్యాయవ్యవస్ధలనేవి ఆకాశంలోంచి వూడి పడలేదు, కనుక విమర్శలకు అతీతం కాదు. ఏ దేశంలో అయినా మిలిటరీ చర్యలపై , న్యాయ వ్యవస్ధ తీర్పులపై విమర్శలు సహజం. వుద్రేకాలు, విద్వేషాలను అదుపులో వుంచుకొని ఆలోచించాల్సిన విషయాలు వున్నాయి. న్యాయమూర్తి స్ధానంలో కూర్చున్న వారు నిష్పక్షపాతంగా తీర్పు చెప్పాలన్నది ఒక విధి. తీర్పు రాకముందే లేదా తీర్పు వచ్చిన తరువాత వారికి దురుద్ధేశ్యాలను ఆపాదించకూడదు. ఎవరికైనా అభ్యంతరాలుంటే ముందుగానే మరొక కోర్టులో తన కేసును విచారించాలని కోరే హక్కు ఎవరికైనా వుంది. అంత మాత్రాన సదరు న్యాయమూర్తిని అవమానించినట్లు కాదు. కొన్ని కేసుల విచారణలో న్యాయమూర్తులు స్వచ్చందంగా తప్పుకొంటున్న విషయం విదితమే. అయితే ఒక తీర్పు వెలువడిన తరువాత దాని మంచి చెడ్డలపై వ్యాఖ్యలు చేసే హక్కు ఎవరికైనా వుంటుంది. అంతిమ తీర్పులో కూడా తమకు న్యాయం జరగలేదని ఎవరైనా తమ అభిప్రాయాన్ని వెల్లడించవచ్చు. మిలిటరీ వ్యవహారం కూడా అంతే . దానిలో పని చేసే వారి చిత్త శుద్ధిని శంకించటం వేరు, మిలిటరీలో జరిగే, మిలిటరీ చేసే తప్పులను ఎత్తి చూపటం వేరు అని గమనించాలి.మిలిటరీకి అవసరమైన కొనుగోళ్లలో జరిగే అక్రమాల గురించి ఎన్నో విన్నాం.సంబంధిత అధికారుల ప్రమేయం లేకుండా అవి జరగవు. మిలిటరీ గనుక అక్కడ ఏం జరిగినా విమర్శించకూడదు, మీడియాలో దాని గురించి చర్చించకూడదు అంటే ఎలా ? కార్గిల్‌ యుద్ధంలో వందల మంది సైనికులు ప్రాణాలర్పించారు. వారి భౌతిక కాయాలను తరలించేందుకు కొనుగోలులో అక్రమాలకు పాల్పడింది అపర దేశభక్తులుగా పేరుపొందిన బిజెపి నాయకత్వంలోని ఎన్‌డిఏ పాలనలో అన్నది తెలిసిందే. మిలిటరీ కొనుగోళ్లు కనుక విమర్శించకూడదంటే ఆ వివరాలు బయటకు వచ్చేవా ? అదే అయితే భోపోర్సు ఆయుధాల కమిషన్‌ ముడుపులూ అంతే కదా ?

    పది సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వం మిలిటరీలో వున్న మైనారిటీల సంఖ్య ఎంత అనే సమాచారాన్ని సేకరించేందుకు నిర్ణయించింది. ప్రతిపక్షంలో వున్న బిజెపి, మిలిటరీ అధికారులు, మరికొందరు దానిపై నానాయాగీ చేశారు. దాంతో ఆ ప్రయత్నాన్ని ప్రభుత్వం విరమించుకుంది. మిలిటరీ అంటే త్యాగం తప్ప రిజర్వేషన్లు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏ భాష మాట్లాడతారు, కుల మతాల లెక్క కాదు అన్నారు. వివరాలు సేకరించాలన్నవారి కారణాలు వారికి వుంటే వ్యతిరేకించే వారికారణాలు వారికి వున్నాయి. అయితే మిలిటరీలో కుల, మత లేదా తెగల ప్రస్తావన లేదా, ముస్లింల సంఖ్యా వివరాలు లేవా అంటే వున్నాయి. అలాంటపుడు ఎందుకు వ్యతిరేకించినట్లు ? మన రాజ్యాంగం ప్రకారం భారత రాష్ట్రపతి సర్వసైన్యాధ్యక్షుడు. అయితే అది గౌరవం తప్ప అధికారాలు లేవు. లెక్కలు తీయాలని కోరింది రక్షణ మంత్రిత్వశాఖ. అలా లెక్కలు తీయటం మిలిటరీలో మతతత్వ బీజాలు వేయటమే అవుతుంది కనుక ఆ ప్రక్రియను నిలిపివేయాలని మాజీ సైనికాధికారి ఆర్‌ఎస్‌ కడియన్‌ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సర్వసైన్యాధ్యక్ష హోదాలో ఇలాంటి లెక్కలు తీయటాన్ని నిలిపివేసేందుకు రాష్ట్రపతి చర్యలు తీసుకోవాలని బిజెపి డిమాండ్‌ చేసింది. మాజీ సైనికాధికారులు ధర్నాలు చేశారు. కార్గిల్‌ శవపేటికల కుంభకోణం ఫేం జార్జి ఫెర్నాండెజ్‌ సైన్యాన్ని మత పూరితం చేసే దేశ ద్రోహకర చర్య అని వర్ణించారు. 2004 జనవరి తొమ్మిదిన రక్షణ మంత్రిత్వ శాఖకు సైన్యం పంపిన ఒక నోట్‌లో పదకొండు లక్షల మంది సైనికులలో ముస్లింలు 29,093 మాత్రమే అని పేర్కొన్నారు. అంటే 13శాతం జనాభాకాగా సైనికులలో వారి శాతం 2.6 మాత్రమే. వారి శాతాన్ని పెంచమని కోరటం జాతి వ్యతిరేకం అవుతుందా ? గూర్ఖా, సిక్కు, రాజపుత్ర, డోగ్రా రెజిమెంట్లలలో ముస్లింలతో సహా ఆ తరగతులకు చెందని వారికి చాలా కాలం అసలు ప్రవేశం లేని విషయం తెలిసిందే. 1984లో అమృతసర్‌ స్వర్ణ దేవాలయంలో తిష్టవేసిన వుగ్రవాదులను బయటకు గెంటి వేసేందుకు చేపట్టిన ఆపరేషన్‌ బ్లూస్టార్‌ చర్య సందర్భంగా సిక్కు రెజిమెంట్‌లో కొందరు సైనికులు తిరుగుబాటు చేసిన తరువాతే రెజిమెంట్లలో ఇతరులకు కూడా చోటు కల్పించి అఖిల భారత స్వభావం తెచ్చేందుకు చర్యలు తీసుకున్నారు.

మన మిలిటరీ, న్యాయవ్యవస్ధ అయినా మన వైవిధ్య సమాజానికి ప్రతిబింబంగా వుండాలన్నదానితో ఎవరూ విబేధించనవసరం లేదు. అలా వుందా లేదా అన్నతి తెలియాలంటే వివరాలు వుండాలి, లోపం వుంటే అధిగమించేందుకు ప్రయత్నించాలి. మన దేశానికి వలస పాలన వారసత్వంగా అనేక అవలక్షణాలు వచ్చాయి. వాటిని వదలగొట్టుకోవాల్సి వుంది. వలస పాలకులు ఎందుకు అలా చేశారన్నది మరో సందర్భంలో చర్చించవచ్చు.మన సైన్యంలో సిక్కు, గూర్ఘా, జాట్‌, రాజపుత్ర, డోగ్రా,పంజాబ్‌, మద్రాస్‌, మరాఠా, బీహార్‌, ఇలా మరికొన్ని పేర్లతో రెజిమెంట్లు వున్నాయి. నిజానికి లౌకిక భారత్‌ లేదా స్వతంత్ర భారతంలో ఇలాంటివి ఇప్పటికీ కొనసాగటం ఆశ్చర్యకరమే. అంతే కాదు స్వాతంత్య్రం వచ్చిన తరువాత నాగా రెజిమెంట్‌ను ఏర్పాటు చేశారు. తమకు ప్రత్యేక రాష్ట్రం కావాలని, దేశ రక్షణలో మరింత చురుకుగా పాల్గొనేందుకు తమ పేరుతో ఒక రెజిమెంట్‌ను ఏర్పాటు చేయాలని నాగాల ప్రతినిధులు కోరిన మేరకు 1970లో ఆ రెజిమెంట్‌ను ఏర్పాటు చేశారు. మేమెంతో మాకంత వాటా మాదిరి నినాదాలతో అస్థిత్వ భావనలు తీవ్రంగా వ్యాపించిన వర్తమాన పరిస్థితులలో ప్రత్యేక రెజిమెంట్ల ఏర్పాటు డిమాండ్‌ను ముందుకు తెచ్చేందుకు అవకాశం వుందా లేదా ?

   దేశ విభజనకు ముందు పాకిస్థాన్లో ఎంత మంది హిందువులున్నారు, ఇప్పుడు ఎంత మంది వున్నారో చూడండంటూ ఆర్‌ఎస్‌ఎస్‌ వారు జనాన్ని తప్పుదారి పట్టించే లెక్కలు కొన్ని చెబుతుంటారు. మన రక్షణ శాఖ సహాయ శాఖ మంత్రిగా పని చేసిన మహావీర్‌ త్యాగి అధికారికంగా వెల్లడించిన వివరాల ప్రకారం దేశ విభజనకు ముందు భారత సైన్యంలో ముస్లింలు 32శాతంగా వుండగా విభజన తరువాత రెండు శాతానికి పడిపోయింది. ఇది ఒక్క ముస్లింలకే పరిమితం కాదు, ఇతరుల శాతం ఎంత అన్నది కూడా తెలుసుకోవాల్సిన అవసరం వుందా లేదా ? అయితే సచార్‌ కమిటీ సూచన ప్రకారం ముస్లింల సంఖ్య తెలుసుకోవాలనుకోవటంలో మైనారిటీల సంతుష్టీకరణ, దాన్ని వ్యతిరేకించటంలో మెజారిటీ సంతుష్టీకరణ కోణాలు కూడా లేకపోలేదు. అధికారంలో ఏ పార్టీ వున్నప్పటికీ రాజ్యాంగ బద్దంగా దళితులు, గిరిజనుల వుప ప్రణాళికలకు నిధులు కేటాయించాలన్నా, మత, భాషా మైనారిటీల సంక్షేమానికి చర్యలు, పధకాలను రూపొందించాలన్నా వారి సంఖ్యా, ఇతర పరిస్థితుల వివరాలు తెలియకుండా ఎలా సాధ్యం. వాటిని సేకరించటం ఆ తరగతుల సంతుష్టీకరణ అని ఇంతకాలం రాజకీయం చేసిన బిజెపి ఇప్పుడు కేంద్రంలో, అనేక రాష్ట్రాలలో అధికారంలో వుంది. అవేమీ లేకుండానే వారికి పధకాలు రూపొందిస్తుందా? వున్న పధకాలను ఎత్తివేస్తుందా ? అమెరికా అంటే బిజెపి, సంఘపరివార్‌ శక్తులకు వల్లమాలిన అభిమానం అక్కడ వర్షం కురిస్తే ఇక్కడ గొడుగులు పడతారు. అమెరికా పర్యటన జరపాలని నరేంద్రమోడీ ఎంతగా తపించి పోయారో తెలిసిందే. అలాంటి అమెరికా సైన్యంలో ముస్లింలు, నల్లవారు, తెల్లవారు, ఇతర జాతుల వారు ఎందరున్నారో ప్రతి ఏటా సంఖ్యా వివరాలను ప్రకటిస్తారని తెలియదా ? మరి అక్కడ రాని పొరపొచ్చాలు మన దేశంలో ఎందుకు వస్తాయని భావిస్తున్నారు?

    పాకిస్తాన్‌ పాలనలో మిలిటరీ ఆధిపత్యం, ప్రభావం గురించి బహిరంగ రహస్యమే. ఆ మిలిటరీ చర్యలను కూడా అక్కడి మీడియా తప్పు పట్టి ప్రశ్నించిందన్న విషయాన్ని అంగీకరిస్తారా లేక పాక్‌ మీడియా కథలను ప్రచారం చేయటంగా కొట్టి పారవేస్తారా ?http://indiatoday.intoday.in/story/pakistan-miliatry-is-no-holy-cow/1/143245.html ఈ వ్యాసాన్ని మన భారతీయ పత్రిక ఇండియా టుడే ఐదు సంవత్సరాల క్రితం ప్రచురించింది. అందరూ చూస్తుండగానే ఇస్లామాబాద్‌లో సలీమ్‌ షహజాద్‌ అనే ఒక జర్నలిస్టును గుర్తు తెలియని దుండగులు అపహరించి తరువాత చంపివేశారు.అది మిలిటరీ కనుసన్నలలో పని చేసే ఐఎస్‌ఐ పనే అని అక్కడి మీడియాలో వార్తలు వచ్చాయి. వాటిని ఖండిస్తూ మిలిటరీ ఒక ప్రకటన చేసింది. వార్తలు వాస్తవం కాదని తోసి పుచ్చితే ఒక రకం, అలా కాకుండా వివరాలను వెల్లడిస్తే అది జాతీయ భద్రతకు ముప్పు వస్తుందని, సైనిక బలగాల నైతిక స్ధైర్యం దెబ్బతింటుందని పేర్కొనటమే కాదు, కస్టడీలోకి తీసుకున్న పౌరులను మిలిటరీ చిత్రహింసలు పెట్టదు, చంపదు అని, సలీమ్‌ సహజాదీ హత్యలో ఐఎస్‌ఐ ప్రమేయమున్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని ప్రకటించింది. దీనిపై పాక్‌ పత్రిక ఫ్రైడే టైమ్స్‌ పత్రిక సంపాదకుడు నజమ్‌ సేథీ వ్యాఖ్యానిస్తూ ప్రజాస్వామ్యంలో విమర్శలకు అతీతమైవేవీ లేవు, మిలిటరీ కూడా అలాంటిదే అని రాశాడు. మరి మనది ప్రజాస్వామ్యం. కాశ్మీర్‌, ఈ శాన్య రాష్ట్రాలలో ప్రత్యేక అధికారాలు కలిగిన మిలిటరీపై అనేక విమర్శలు, ఆరోపణలు వచ్చాయి. మిలిటరీ సైతిక స్ధైర్యం దెబ్బతిన కుండా వుండాలంటే ఆ చర్యలను విమర్శించకూడదా ? మిలిటరీ చర్యలతో దెబ్బతింటున్న సామాన్య పౌరుల మనో స్ధైర్యం నంగతేమిటి ?

    పౌరపాలకుల పర్యవేక్షణలో పని చేస్తున్న మిలిటరీ వ్యవస్ధలలో మనది ఒకటిగా గర్వించాల్సిందే. నిత్యం సరిహద్దులను కాపాడుతున్న వారి సామర్ధ్యం, త్యాగాలకు హారతి పట్టాల్సిందే. వారి విశ్వసనీయతను ప్రశ్నించకూడదన్నది కూడా నిజమే. సర్జికల్‌ దాడులకు మన దగ్గర సాక్ష్యాలు వున్నాయని బల్లగుద్ది మరీ చెప్పినపుడు అబ్బే అసలు దాడులే జరగలేదని పాక్‌ ప్రభుత్వం ఎత్తుగడగానే చెప్పి వుండవచ్చు, ఎందుకంటే తన పౌరులకూ అది సంజాయిషీ ఇచ్చుకోవాలి గనుక.ఈ వుదంతంలో ప్రపంచ దృష్టిలో ఎవరిది పైచేయిగా కనిపిస్తుంది. పాకిస్తాన్‌ అసలు దాడులే జరగలేదనే వాదనకే కట్టుబడి వుంది. పరిస్థితులు సాధారణంగానే వున్నాయి చూడమంటూ అంతర్జాతీయ మీడియా ప్రతినిధులకు ఆ ప్రాంతాలను చూపింది. దాడులు జరిగి వుంటే సాక్ష్యాలు వెల్లడించాలని సవాలు చేస్తున్నది. ఇది కూడా ప్రచార ఎత్తుగడే అనుకుందాం .

  మన దేశంలో జరిగిందేమిటి ? తాజా వివాదానికి అధికార రాజకీయ నేతల, మిలిటరీ వున్నతాధికారుల బాధ్యతేమీ లేదా ? సర్జికల్‌ దాడుల వివరాలతో సహా అనేక అంశాలు గోప్యంగా వుంచాల్సినవే అయినపుడు దాడులను తాము చిత్రీకరించామని, ద్రోణులను కూడా వుపయోగించామని చెప్పాల్సిన అవసరం ఏముంది. దాడులు చేశాం అని మాత్రమే చెప్పి వుంటే సరిపోయేది కదా ? అతని కంటే ఘనుడు ఆచంట మల్లన మాదిరి కాళిదాసు కవిత్వానికి స్వంతపైత్యం జోడించి నట్లు మిలిటరీ వినియోగించిన రాత్రుళ్లు చూడగలిగే పరికరాలు మా మచిలీపట్నంలోని బెల్‌లో తయారు చేశారని, ఆ ఫ్యాక్టరీని మరింత విస్తరించేందుకు మా చంద్రబాబు నాయుడు నిమ్మలూరులో మరో ప్లాంట్‌ ఏర్పాటుకు చర్య తీసుకున్నారని తెలుగు తమ్ముళ్లు సర్జికల్‌ దాడుల నుంచి రాజకీయ ప్రయోజనం పొందేందుకు ప్రయత్నించలేదా ? సర్జికల్‌ దాడుల రీత్యా సరిహద్దులలో పాక్‌ మిలిటరీ చర్యకు పూనుకోవచ్చంటూ వందలాది గ్రామాల నుంచి పౌరులను ఖాళీ చేయించటానికి, తరువాత ఆ కార్యక్రమాన్ని వుపసంహరించుకోవటానికి బాధ్యత ఎవరిది? దాడుల గురించి గుండెలు వుప్పొంగించుకోనవసరం లేదని జబ్బలు చరుచుకోవనవసరం లేదని ప్రధాని నరేంద్రమోడీ హితవు చెప్పారంటూ వచ్చిన వార్తలు కూడా పాక్‌ సృష్టే అంటారా ? సర్జికల్‌ దాడుల ఖ్యాతి అంతా మోడీకే దక్కాలని రాసిన మీడియా పెద్దమనుషులే రొమ్ములు విరుచుకోవనసరం లేదని ప్రధాని చెప్పినట్లు కూడా రాయటం మోడీ వ్యక్తిత్వాన్ని పెంచటంలో భాగమని సంతోషించి వుండవచ్చు. కానీ అవి సర్జికల్‌ దాడుల తీవ్రతను తగ్గించే సందేశాన్ని కలిగి వున్నాయని గ్రహించారా ? ఎవరు ఎవరి వలలో పడ్డారు.ఈ మొత్తం వుదంతం ఎలాంటి సందేశం ఇస్తున్నది ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

విశ్వసనీయతను దిగజార్చుకుంటున్న చంద్రబాబు

02 Thursday Jun 2016

Posted by raomk in AP NEWS, BJP, Congress, Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion, Others

≈ Leave a comment

Tags

ANDHRA PRADESH, ANDHRA PRADESH Politics, BJP, CHANDRABABU, Congress party, special status to Andhra pradesh

ఎం కోటేశ్వరరావు

   ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్‌ జనాలను వెర్రివాళ్ల కింద జమకడుతున్నారా ? తన విశ్వసనీయతను తానే దెబ్బతీసుకుంటున్నారా ? ఇది ప్రతిపక్ష పార్టీల వారికి వస్తున్న ఆలోచన కాదు, స్వంత బుర్రలను వుపయోగించి తెలుగు దేశం పార్టీని పది కాలాలపాటు పరిరక్షించుకోవాలని కోరుకొనే కార్యకర్తలలో కూడా తలెత్తున్న ప్రశ్న. విజయవాడ బెంజి సర్కిల్‌లో జూన్‌ రెండవ తేదీన నవ నిర్మాణ దీక్ష పేరుతో చంద్రబాబు చేసిన ప్రసంగాన్ని చూసిన తరువాత కలుగుతున్న సందేహాలివి.

   ముఖ్యమంత్రి, అనుచర గణం రాష్ట్ర నవనిర్మాణం కోసం దీక్ష అనే ఒక పెద్ద బ్యానర్‌ కింద మౌనంగా కూర్చొని వుంటే ఎంతో హుందాగా వుండేది. లేదూ తస్మదీయ పత్రికలు, ఛానళ్ల వారిని,తెలుగుదేశం కార్యకర్తలను సంతోష పెట్టేందుకు అసలు ఆంధ్రప్రదేశ్‌లో గత రెండు సంవత్సరాలలో జరిగిందేమిటి? జరగాల్సిందేమిటి? విభజన సమయంలో కేంద్రం చేసిన చట్టం, వాగ్దానాలు ఏమిటి ? అవి ఎంతవరకు అమలు జరిగాయి? జరగకపోతే ఎదురైన సమస్యలేమిటి మొదలైన అంశాలతో రాష్ట్ర ప్రజల ముందు శ్వేత పత్రం పెట్టి ఏం చేయాలో చర్చించండని ఒక్క మాట చెప్పి వుంటే జనం అర్ధం చేసుకొని వుండేవారు. తమ నిర్ణయం తాము తీసుకొని వుండేవారు.

     అటువంటి సదవకాశాన్ని చంద్రబాబు చేతులారా పోగొట్టుకున్నారు. వుపాధి హామీ పధకం కింద జనానికి పని కల్పించినా లేకపోయినా, బాబొస్తే జాబొస్తుందని ఎదురు చూస్తున్న జనాలు గోళ్లు గిల్లు కుంటూ కూర్చున్నా, వున్న వుద్యోగాలు కూడా వూడగొడుతున్నారని అనేక మంది చిరుద్యోగులు నిస్సహాయులైన స్ధితిలో వున్నా, వెంకయ్య నాయుడు చెప్పినట్లు ఎవరికైనా దేవదూతేమో గాని తమకు మాత్రం మాత్రం సైతాన్‌గా పరిణమించారని నరేంద్రమోడీ గురించి ఆంధ్ర ప్రదేశ్‌ జనం భావిస్తున్న తరుణంలో చంద్రబాబు వుభయుల పక్షాన ప్రతిపక్షాలకు మాత్రం చేతి నిండా పని కల్పిస్తున్నారు. సమీప భవిష్యత్‌లో తనను సవాలు చేసే ప్రతిపక్ష పార్టీ ఏదీ లేదని, జనం విసుక్కున్నా, తిట్టుకున్నా తిరిగి తనకు తప్ప మరొకరికి పట్టం కట్టే అవకాశం లేదన్న ధీమాతో చంద్రబాబు ఇలా వ్యవహరిస్తున్నారా ? గతంలో కాంగ్రెస్‌ కూడా ఇలాంటి చులకన భావంతోనే ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరించి ఎంత ఘోరంగా దెబ్బతిన్నదో తెలియంది కాదు. గతం మాదిరి కాకపోయినా, పాత్రలు మారినా కొత్త రూపంతో చరిత్ర పునరావృతం కాక తప్పదు.

     గతంలో చంద్రబాబు ఎప్పుడూ ఒక మాట చెబుతుండేవారు, అదేమిటంటే ఎన్నికలపుడు మాత్రమే రాజకీయాలు చేస్తాను, మాట్లాడతానని మిగతా సమయాలలో రాష్ట్ర అభివృద్ధి తప్ప తనకు మరొకటి పట్టదని, ప్రతిపక్షాలు ప్రతిదానిని రాజకీయం చేస్తున్నాయని ఆరోపించేవారు. ఒకవైపు గత రెండు సంవత్సరాలుగా దేశ, విదేశాలలో పెట్టుబడులు కోసం తిరిగిన దారి ఖర్చులు తప్ప పర్యటనలు ఏ మేరకు ఫలించాయో కనిపించటం లేదు. తరుణం రాక ముందే కూసిన కోయిల మాదిరి కొత్త రాజధాని నిర్మాణానికి ఐదు లక్షల కోట్ల రూపాయలు కావాలని రాష్ట్రం విడిపోక ముందే కోరిన చంద్రబాబు కేంద్రం నుంచి ఐదువేల కోట్ల రూపాయలు కూడా తీసుకురాలేక, వచ్చిన డబ్బుతో తాత్కాలిక రాజధాని కడుతున్నారని జనం సానుభూతి చూపుతున్నారు. తొలి బిడ్డ పెళ్లికి అవసరమైన డబ్బు సంగతి తేల్చుకోకుండానే అన్నీ కుదుర్చుకొని, చివరకు ముహూర్తాలు కూడా పెట్టుకొని పనులు మొదలు పెట్టిన తరువాత అప్పు ఇస్తానన్న వారు సొమ్ము ఇవ్వకపోతే ఆ గృహస్థు పరిస్థితి ఎలా వుంటుందో ప్రత్యేక రాష్ట్ర హోదా గురించి జనానికి కలిగించిన ఆశలు కూడా అలాగే కల్లలయ్యాయి. అప్పు ఇస్తామన్న వారు కనీసం మధ్యవర్తితో అయినా కొద్ది రోజుల ముందు డబ్బు సర్దుబాటు కాలేదు ఇవ్వలేకపోతున్నాము వేరే చూసుకోండని కబురు చేస్తారు. అదేమి చిత్రమో ఐదు కోట్ల ఆంధ్రప్రజలు ఎంతో ముఖ్యమైనదిగా భావిస్తున్న ప్రత్యేక హోదా, లోటు నిధుల భర్తీ , పాకేజ్‌ల గురించి ప్రధాని నరేంద్రమోడీ వులకరు పలకరు, అవుననీ చెప్పరు కాదనీ చెప్పకపోగా ఇప్పటికే చాలా ఇచ్చామని పార్టీ వారి చేత చెప్పిస్తున్నారు, ఎవరైనా ప్రశ్నిస్తే ఇచ్చిన దానికి లెక్కలు చెప్పమంటున్నారు. ప్రత్యేక హోదా గురించి వూరించి చివరికి పొమ్మనకుండా పొగబెట్టినట్లు, ఇంక దాని గురించి అయితే న్యూఢిల్లీ రావద్దు అని జనానికి బాగా స్పష్టమయ్యే రీతిలో సందేశాలు పంపారు.

     ఇటువంటి స్ధితిలో చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారు, మాట్లాడుతున్నారు. దీనికంటే మౌనంగా దీక్ష చేసి వుంటే అన్యాయం చేసిన కాంగ్రెస్‌తో పాటు అధోగతి పాలు చేస్తున్న బిజెపి గురించి కూడా చంద్రబాబు ఆగ్రహంతో వున్నారని అయినా జనం అనుకొనే వారు. చంద్రబాబు చెబుతున్నట్లు అసాధారణ రీతిలో అప్రజాస్వామికంగా పార్లమెంట్‌లో ఎలా విభజన బిల్లును ఆమోదించిదీ పదే పదే చెప్పనవసరం లేదు. గత అసెంబ్లీ ఎన్నికలలో అదేగా చెప్పారు. ఇప్పుడు ఆ కాంగ్రెస్‌లేదు, అలాంటి పని చేసిన వారికి రాష్ట్ర శాసన సభలో కనీసం ప్రాతినిధ్యం కూడా లేకుండా జనం తగిన విధంగా తీర్పు నిచ్చారు. అంతటితో ఆ అధ్యాయం ముగిసింది. ఇంకా చంద్రబాబు దాని గురించి మాత్రమే మాట్లాడితే ఆయన విశ్వసనీయత సమస్య తలెత్తుతుంది. రెండు కళ్ల సిద్దాంతాలు చెప్పి విభజనకు అనుకూలంగా లేఖలు ఇచ్చిన తెలుగుదేశం పార్టీ చరిత్ర చెరిగిపోదు. పార్లమెంట్‌లో చట్టం చేస్తున్న సమయంలో కాంగ్రెస్‌ ఒక్కటే లేదు, అంతకంటే ఎక్కువ హడావుడి చేసిన బిజెపి ఏం చేసింది? పోనీ వారేమీ చిన్న పిల్లలు, తొలిసారిగా పార్లమెంట్‌లో అడుగుపెట్టిన వారు కాదే. అందువలన చంద్రబాబు చెప్పినట్లు సంబరాల బదులు విభజన కారణంగా జరిగిన అన్యాయానికి దీక్షలు చేయాల్సి రావటానికి కాంగ్రెస్‌ ఎంత కారకురాలో బిజెపి కూడా అంతే బాధ్యురాలు. కాంగ్రెస్‌ అధికారం నుంచి పోయింది. ఇంకా మూడు సంవత్సరాలు అధికారంలో కొనసాగాల్సిన బిజెపికి న్యాయం చేయాల్సిన బాధ్యత లేదా ? అలాంటి పార్టీతో స్నేహం కొనసాగించాలా లేదా అనేది తెలుగు దేశం పార్టీ ఇష్టం. తమ్ముడు తమ్ముడే న్యాయం న్యాయమే బిజెపి కూడా ఏపికి న్యాయం చేయలేదు అనే మాట చెప్పటానికి నోరు రావటం లేదే. అవ్వతో వసంత మాడినట్లు అన్నీ అయి పోయిన కాంగ్రెస్‌ను మాత్రమే విమర్శిస్తే అది జనాన్ని మభ్యపెట్టే రాజకీయం తప్ప మేలు చేసేది కాదు.

    విభజన చేసి అప్పులు మాత్రమే జనాభా దామాషాలో పంచారు, ఆస్థులు మాత్రం ఎక్కడివి అక్కడే అన్నారని చంద్రబాబు మాట్లాడుతున్నారు. సచివాలయం, ఇతర ప్రభుత్వ భవనాలను తరలించుకుపొమ్మని చెబితే చంద్రబాబు తీసుకు వస్తారా? అనేక రాష్ట్రాలను విడగొట్టారు. ఎక్కడైనా ఎక్కడి ఆస్థులు అక్కడే వుంచారు, అప్పులు పంచారు తప్ప మరొక పద్దతిని పాటించలేదు. పదేండ్ల పాటు ముఖ్యమంత్రిగా, మరో పదేండ్ల పాటు ప్రతిపక్ష నాయకుడిగా దేశంలో ఒక రికార్డు సృష్టించిన చంద్రబాబుకు నిజంగా ఈ మాత్రం తెలియదా ? తెలిసినా ఎందుకు ఇలాంటి అంశాలను జనం మెదళ్లకు ఎక్కిస్తున్నారు ? ఒక సీనియర్‌ రాజకీయవేత్తగా విశ్వసనీయత కోల్పోవటం, పోసుకోలు కబుర్లకు తప్ప దాని వలన ఆంధ్రప్రదేశ్‌కు ఏమైనా వుపయోగం వుంటుందా ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

CPI(M) On Two Years of BJP-Modi Government

31 Tuesday May 2016

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, INDIA, Left politics, NATIONAL NEWS, Others

≈ Leave a comment

Tags

BJP, Communal Polarisation, Congress party, CPI()M, electoral tactics, Kerala, LDF, Modi, Narendra Modi, RSS-BJP, Trinamool Congress, Two Years of BJP-Modi Government, West Bengal

The Polit Bureau of the Communist Party of India (Marxist) met at New Delhi
on May 29 & 30, 2016. It has issued the following statement:

The BJP government had conducted a gaudy celebration of the completion of
two years in office making many bombastic claims.

These two years have confirmed that a new `trimoorti? is being sculpted.
Its three faces represent the following: one, the relentless pursuit of
aggressive communal polarization in the effort to transform the secular
democratic character of the Indian Republic into the RSS version of a
rabidly intolerant fascistic `Hindu Rashtra?; two, the pursuit of the
neo-liberal trajectory of economic reforms, more aggressively than pursued
by the UPA government, imposing unprecedented burdens on the vast majority
of our people; and three, increasing recourse to authoritarian measures
undermining the institutions of parliamentary democracy and running
roughshod over democratic rights and civil liberties.

As far as the majority of the Indian people are concerned, there is an
economic disaster rather than any cause for celebrations.
*        Six year low for new jobs in eight labour-intensive industries. In
2015, official figures reveal that only few new jobs were created in the
country as against the promise of creating two crores of new jobs annually.
Every year, over 1.3 crore of Indian youth join the job market
*        Worst decline in exports in 63 years – decline for 17 months in a
row
*        Core inflation of 6.8 per cent, Dal prices rise by more than 30 per
cent
*        Annual core sector growth of only 2.7 per cent, a decade low
*        2,997 farmers committed suicide in 2015, 116 farmers in
January-March 2016
*        MGNREGA payments not made, arrears paid after Supreme Court orders
*        Rural wages decline in real terms in a decade
*        Savings bank deposits growth at a 53 year low
*        NPAs of banks more than Rs 13 lakh core and growing
*        27 per cent zero-balance Jan Dhan accounts, 33 per cent duplicate
accounts
*        New and more taxes, surcharges and cesses on items used by the
poor
On top of this, the agrarian distress is worsening.  The Modi government
promised ?minimum of 50 per cent profits over cost of production?.

Reality:
*        Profitability down to less than 10 per cent, and in some crops,
into losses
*        Agriculture and allied sector grew at -0.2 per cent  in FY15 & 1.1
per cent in FY16
*        Foodgrains production dropped by 5 per cent in FY15, to decline
further in FY16

Severe Drought Situation
*        12 states were declared drought-hit only after Supreme Court?s
orders. Overall,  54 crore people in 13 states are suffering in the grip of
drought
*        25 per cent of India?s rural inhabitations face drinking water
crisis.
The unprecedented drought situation has resulted in the death of thousands
of poor people and lakhs of livestock.  Immediate relief must be provided to
the suffering people.  Despite the Supreme Court intervention, nothing
tangible is being done by the Central government.
The Polit Bureau of the CPI(M) demands that the sufferings of the people
must be mitigated on a war footing.

Sharpening Communal Polarisation

The RSS-BJP are, once again, resorting to whipping up communal passions in
the run up to the forthcoming Assembly elections in Uttar Pradesh in 2017.
It is reported that the Bajrang Dal has been organizing arms training camps
in several parts of the state.  This is clearly an exercise  to provoke
communal conflicts and tensions and reap the consequent electoral gains from
such polarization.  Such efforts are an expression of the worst ?vote bank
politics? seeking the consolidation of the Hindutva communal vote bank at
the expense of  weakening the unity of India?s social fabric.  The Polit
Bureau of the CPI(M) strongly condemns such activities and demands that both
the Central government and the UP state government take strong action in
accordance with the law of the land.
Racial Attacks against the People of African Origin
The reports of increasing violence resulting in the death of people of
African origin living in India is a matter of grave concern.  That such
grievous attacks take place in the national capital of Delhi is, indeed,
shameful.  Such racist attacks undermine the centuries old relationship
between India and the African countries. This has already assumed the
dimension of affecting diplomatic ties between India and the African
countries.
The Central government must immediately intervene to ensure that stringent
action is taken against the culprits and those propagating racist hatred.
This is absolutely essential to prevent the further downslide in the
international image of India.

Elections to the State Assemblies

The CPI(M) state committees in West Bengal, Kerala, Tamilnadu and  Assam are
scheduled to meet to prepare a detailed review of the CPI(M)?s performance
in the elections and the post election political situation arising in these
states.  On the basis of these review reports prepared by the state
committees, the Central Committee will conduct its review at its forthcoming
meeting from June 18-20.
With regard to the electoral tactics pursued by the CPI(M) in various
states, the electoral tactics evolved in West Bengal was not in consonance
with the Central Committee decision based on the political-tactical line of
the Party which states that there shall be no alliance or understanding with
the Congress party.

Post-Declaration of Result Violence

The Trinamool Congress has unleashed widespread violence against the cadres
of the opposition parties.  Many CPI(M) cadres have been murdered and over
600 CPI(M) and mass organization offices have been ransacked and some set on
fire.  Apart from targeting the offices of all opposition parties and mass
organizations, the attacks specifically focus on constituencies and areas
where Trinamool Congress lost in these elections.  Widespread  bomb attacks,
arson and extortions of huge amounts of money as ransom are being reported.
Those who voted against the Trinamool Congress are reportedly coerced into
paying a hefty fine for having exercised their  democratic choice.
Under these circumstances, the CPI(M) calls upon the people of West Bengal
to unitedly resist this murder of democracy and civil liberties in the
state.  The strength of the people?s unity is the answer to meet this
unprecedented unleashing of violence.

Kerala

The Polit Bureau of the CPI(M) salutes the people of Kerala for reposing
faith in the LDF in a resounding manner in these Assembly elections.  The
LDF government has assumed office with a resolve to fulfill the commitments
that it made to the people of Kerala during the polls.
The physical attacks by the RSS against the CPI(M) and the LDF continue.
Forty one such attacks have already taken place since the results were
declared. Two comrades have lost their lives, with Sasikumar, who was
seriously injured in an attack at Engandiyoor in Thrissur on 22nd May
succumbing to his injuries on May 27.  82 comrades have been injured in
these brutal attacks including an elected MLA who has now been sworn in as a
Minister.
The CPI(M) calls upon the RSS/BJP to respect the verdict of the people and
desist from such murderous onslaughts.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

Recent Posts

  • నరేంద్రమోడీ పాలన : అంబానీకి ” మంచి యుద్ధం ” అదానీకి ”మంచి రోజులు ” !
  • కొలంబియాలో విరిసిన తొలి ఎర్రమందారం !
  • నరేంద్రమోడీకి వివరించేందుకు త్రివిధ దళాధిపతులు – ప్రధానికి తెలియకుండానే అగ్నిపథ్‌ను ప్రకటించారా ?
  • నాడు జైకిసాన్‌లపై దాడి నేడు అగ్నిపథ్‌ పేరుతో జై జవాన్లకు ఎసరు : నరేంద్రమోడీ తానాషాహీ నహీ చెలేగీ అంటున్న యువత !
  • అమెరికా దేశాల శిఖరాగ్ర సభ – జో బైడెన్‌కు భంగపాటు !

Recent Comments

మోడీ ఎనిమిదేండ్ల పాల… on మోడీ ఎనిమిదేండ్ల పాలన ( రెండవ…
మోడీ ఎనిమిదేండ్ల పాల… on మోడీ ఎనిమిదేండ్ల పాలన (మొదటి భ…
SHEIK ALI HUSSAIN on ప్రపంచాన్ని భయపెడుతున్న మంకీపా…
raomk on రంగనాయకమ్మ గారూ”కుహనా మి…
యూహెచ్ ప్రీతమ్ on రంగనాయకమ్మ గారూ”కుహనా మి…

Archives

  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • నరేంద్రమోడీ పాలన : అంబానీకి ” మంచి యుద్ధం ” అదానీకి ”మంచి రోజులు ” !
  • కొలంబియాలో విరిసిన తొలి ఎర్రమందారం !
  • నరేంద్రమోడీకి వివరించేందుకు త్రివిధ దళాధిపతులు – ప్రధానికి తెలియకుండానే అగ్నిపథ్‌ను ప్రకటించారా ?
  • నాడు జైకిసాన్‌లపై దాడి నేడు అగ్నిపథ్‌ పేరుతో జై జవాన్లకు ఎసరు : నరేంద్రమోడీ తానాషాహీ నహీ చెలేగీ అంటున్న యువత !
  • అమెరికా దేశాల శిఖరాగ్ర సభ – జో బైడెన్‌కు భంగపాటు !

Recent Comments

మోడీ ఎనిమిదేండ్ల పాల… on మోడీ ఎనిమిదేండ్ల పాలన ( రెండవ…
మోడీ ఎనిమిదేండ్ల పాల… on మోడీ ఎనిమిదేండ్ల పాలన (మొదటి భ…
SHEIK ALI HUSSAIN on ప్రపంచాన్ని భయపెడుతున్న మంకీపా…
raomk on రంగనాయకమ్మ గారూ”కుహనా మి…
యూహెచ్ ప్రీతమ్ on రంగనాయకమ్మ గారూ”కుహనా మి…

Archives

  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • నరేంద్రమోడీ పాలన : అంబానీకి ” మంచి యుద్ధం ” అదానీకి ”మంచి రోజులు ” !
  • కొలంబియాలో విరిసిన తొలి ఎర్రమందారం !
  • నరేంద్రమోడీకి వివరించేందుకు త్రివిధ దళాధిపతులు – ప్రధానికి తెలియకుండానే అగ్నిపథ్‌ను ప్రకటించారా ?
  • నాడు జైకిసాన్‌లపై దాడి నేడు అగ్నిపథ్‌ పేరుతో జై జవాన్లకు ఎసరు : నరేంద్రమోడీ తానాషాహీ నహీ చెలేగీ అంటున్న యువత !
  • అమెరికా దేశాల శిఖరాగ్ర సభ – జో బైడెన్‌కు భంగపాటు !

Recent Comments

మోడీ ఎనిమిదేండ్ల పాల… on మోడీ ఎనిమిదేండ్ల పాలన ( రెండవ…
మోడీ ఎనిమిదేండ్ల పాల… on మోడీ ఎనిమిదేండ్ల పాలన (మొదటి భ…
SHEIK ALI HUSSAIN on ప్రపంచాన్ని భయపెడుతున్న మంకీపా…
raomk on రంగనాయకమ్మ గారూ”కుహనా మి…
యూహెచ్ ప్రీతమ్ on రంగనాయకమ్మ గారూ”కుహనా మి…

Archives

  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Follow Following
    • vedika
    • Join 924 other followers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Customize
    • Follow Following
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d bloggers like this: